సాహితీ కౌముది
సాహిత్యం, సంస్కృతి, విద్య, ఆధ్యాత్మిక విషయాల సమాహారం
Wednesday, June 3, 2026
Thursday, May 28, 2026
అదే... తపస్సు (ఋషిపీఠం మాసపత్రిక 2026, మే సంచికలో డాక్టర్ కప్పగంతు రామకృష్ణ రాసిన వ్యాసం)
అదే... తపస్సు
(ఋషిపీఠం మాసపత్రిక 2026, మే సంచికలో
డాక్టర్ కప్పగంతు రామకృష్ణ రాసిన వ్యాసం)
తపస్సంటే ఏంటి? తపస్సు చేసేందుకు
ఇల్లు, బంధాలు విడిచిపెట్టాలా? కాషాయ వస్త్రాలు, దండ కమండలాలు ధరించాలా? అడవుల్లోకి వెళ్ళి, కందమూలాలు
తింటూ, ఏదో చెట్టుకింద కూర్చుని ధ్యానం చేసుకుంటేనే తపస్సు
అవుతుందా? కచ్చితంగా ఇలా చేస్తేనే భగవదనుగ్రహం కలుగుతుందా?
ఇంకా ఎన్నో సందేహాలు...
నిజానికి తపస్సు అనేది ఒక జీవన
విధానం. అదొక క్రమశిక్షణ. మనిషి నియమబద్ధంగా జీవితాన్ని గడపటానికి పెద్దలు
సూచించిన సర్వోన్నతమైన సాధన మార్గం అది.
సాధారణ అర్థంలో మనం అనుకునే తపస్సు
కూడా తపస్సే. కానీ, అదొక్కటే కాదు. దైనందిన జీవితంలో ఉంటూ, తన ధర్మాన్ని
ఏమాత్రం విడిచిపెట్టకుండా, నూరుశాతం ఆచారాన్ని పాటించడమే
తపస్సు అని శాస్త్రాలు చెబుతున్నాయి.
అన్నీ విడిచి ఎక్కడికో వెళ్లాలనుకోవడం పలాయన వాదమే కానీ, ఆధ్యాత్మికమార్గం కాదు. బాధ్యతల్ని విస్మరించిన వారికి ముక్తిద్వారాలు
తెరుచుకోవు. కాబట్టి, స్వధర్మ కర్మాచరణే అసలైన తపస్సవుతుంది.
సాధారణంగా తపస్సు అంటే శరీరం, మనస్సు, ఇంద్రియాలను నియంత్రించి, పరమ సత్యాన్ని
తెలుసుకునేందుకు చేసే కఠోర సాధన అని చెప్పవచ్చు. ఇది కేవలం అడవుల్లో కూర్చుని
కష్టపడడం, ముక్కు మూసుకుని తపస్సు చేయటం మాత్రమే కాదు... జీవితం మొత్తం ఆత్మశుద్ధి
కోసం చేసే నియమబద్ధమైన సాధన కూడా తపస్సే అవుతుంది.
సృష్టికి మూలం తపస్సే
వేదాలు తపస్సుకు ఎంతో ప్రాముఖ్యత
ఇస్తాయి. రుగ్వేదం, యజుర్వేదం తపస్సును సృష్టికి మూలమైన శక్తిగా పేర్కొంటాయి. తైత్తిరీయోపనిషత్తులోని భృగువల్లి ‘‘తపసా
బ్రహ్మ విజిజ్ఞాసస్వ’’ – తపస్సు ద్వారా బ్రహ్మమును తెలుసుకో అంటుంది. అంటే...
బ్రహ్మాన్ని తెలుసుకోవటానికి ఉత్తమమైన మార్గం తపస్సు అని అర్థం. తపస్సుకు ఉన్న
శక్తి అంతటి గొప్పది. అలాగే, సృష్టి
ప్రారంభంలో బ్రహ్మ తపస్సు చేసి జగత్తును సృష్టించాడని వేదాలు పేర్కొంటాయి.
అందువల్ల తపస్సు కేవలం వ్యక్తిగత సాధన మాత్రమే కాదు; అది సృష్టి శక్తికి మూలాధారం అని
గ్రహించాలి.
అలాగే ఛాందోగ్యోపనిషత్తులో తపస్సును
జ్ఞానం, ధ్యానం, నియమం, సత్యాచరణతో
కూడిన సాధనగా వివరించారు. ఉపనిషత్తుల దృష్టిలో తపస్సు అనేది అంతరంగాన్ని పరిశుభ్రం
చేసి ఆత్మసాక్షాత్కారానికి దారి తీసే మార్గం.
మహాభారతం అరణ్యపర్వంలో ‘యక్ష ప్రశ్నలు’గా ప్రసిద్ధి పొందిన ఘట్టంలో ధర్మరాజును యక్షుడు అడిగిన 72 ప్రశ్నల్లో ‘తపస్సు అంటే ఏమిటి?’ అనే ప్రశ్న కూడా ఉంది. ఇందుకు ధర్మరాజు - ‘తన వృత్తి,
కుల ధర్మాన్ని ఆచరించటమే తపస్సు’ అని
చెబుతాడు.
పురాణాలలో తపస్సు చేసిన మహర్షులు, దేవతలు గురించి
అనేక కథలు ఉన్నాయి. విశ్వామిత్ర మహర్షి ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మర్షి స్థాయిని
పొందాడు. ధ్రువుడు కఠిన తపస్సు చేసి మహావిష్ణువు అనుగ్రహాన్ని పొందాడు.
రావణాసురుడు కూడా గొప్పతపస్సు చేసి
అపారమైన శక్తిని సంపాదించాడు. ఇంకా ఎన్నో ఉదాహరణలు పురాణ, ఇతిహాసాల్లో ఉన్నాయి.
వీటన్నిటి సారాంశం ఒక్కటే... తపస్సు ధర్మబద్ధంగా ఉండాలి. స్వార్థం కోసం చేసిన
తపస్సు చివరకు వినాశనానికే దారి తీస్తుంది.
మనసు లగ్నం అయితే తపస్సే
తపస్సు అంటే తపించడం. ఒక పని
సాధించటం కోసం మనం పడే ఆరాటం, ఆ పని తప్ప లోకంలో మరొకటి లేదన్నంతగా లక్ష్యాన్ని
సాధించడం కోసం చేసే శ్రమ. భగీరథుడు సరిగ్గా ఇదే చేశాడు. దేవలోకంలో ఉండే గంగానదిని
భూమి మీదకు తీసుకురావాలని ఎన్నో యుగాల నాడు
ఆయన చేసిన ప్రయత్నరూప తపస్సు అందించిన పుణ్య ఫలితాన్ని ఇప్పటికీ మనం
అనుభవిస్తున్నాం కదా. ఒక్కమాటలో చెప్పాలంటే... మనిషి బాహ్యశుద్ధి, అంతశ్శుద్ధి కలిగి ఉండి, నమ్మిన లక్ష్యం మీద మనస్సు నిలిపి ధ్యానం చేయడమే
తపస్సు అవుతుంది.
ఇదే విషయాన్ని సనత్కుమారుడు
వ్యాసుడికి చెప్పాడు. సనత్కుమారుడు చెప్పిన తపో మార్గాల్లో సామాజిక శ్రేయస్సుకు
పనికి వచ్చే అనేక విషయాలున్నాయి. చెరువులను తవ్వించడం, బావులను నిర్మించడం
వంటి పనులను లోక కల్యాణం కోసం సద్బుద్ధితో, నిస్వార్ధభావనతో
చేసే వ్యక్తి కూడా ఉత్తమ తపస్సు చేస్తున్న వాడికిందే లెక్క. ధ్యానం చేసుకుంటూ
భగవంతుడిని గురించి తపస్సు చేసే వ్యక్తి పొందే ఫలితాలను సామాజిక శ్రేయస్సు కోసం
పాటుపడే వ్యక్తులు కూడా పొందగలరని సనత్కుమారుడు వ్యాసుడికి వివరించాడు. కేవలం
తనకోసం కాక పదిమంది మేలు కోసం చేసే ఏ పనైనా ఉత్తమమైన తపస్సు అవుతుందని శివ పురాణం
విస్పష్టంగా చెప్పింది.
ఆదిశంకరాచార్యులు కూడా ఈవిషయాన్నే
చెబుతూ. ‘యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్’ అంటారు.
చిత్తశుద్ధితో చేసే ప్రతి పనీ పరమేశ్వర ఆరాధనే అవుతుందన్నారు శంకరులు. మనస్సు,
వాక్కు, ఆచరణ - ఈ మూడింటిలో ఏకత్వభావన
(త్రికరణశుద్ధి) సాధించాలి. అదే తపస్సు అవుతుంది. నిజానికి, శ్రద్ధతో చేసే ప్రతి
పనీ తపస్సే. దేన్నైనా సరే అంతఃకరణ శుద్ధితో, దీక్షతో
చేస్తున్నప్పుడు నాణ్యమైన ఫలితాలు
వస్తాయి. అలా చేసే ప్రతి పనీ తపస్సే. అందుకే తపస్సు ఇచ్చే ముఖ్యమైన ఫలితాల్లో
నాణ్యతను ముఖ్యమైందిగా చెప్పొచ్చు.
సమాజమే తపోభూమి
తపస్సు చేసుకోవటానికి ఇల్లు విడిచి,
అరణ్యాలు పట్టాల్సిన అవసరం లేదు. ఇంటినే తపోభూమిగా మార్చుకోవాలి. ఇందుకోసం మొదటగా
మనిషి తాను మారాలి. తన కర్తవ్యం ఏమిటో స్పష్టంగా తెలుసుకోవాలి. మానవ జన్మను
సార్థకం చేసుకునే పనులు చెయ్యాలి. స్వామి వివేకానంద ఈ విషయంలో ఆదర్శంగా
నిలుస్తారు. వివేకానందుడు రామకృష్ణ పరమహంస శిష్యరికం చేశాడే కానీ అడవులకు వెళ్లి,
ముక్కుమూసుకుని, తపస్సు చెయ్యలేదు. జాతి సముద్ధరణే జీవిత సర్వస్వం అనుకున్నారు. కొన్ని
వందల సంవత్సరాల తర్వాత కూడా తన పేరు చెబితేనే ధైర్యం కలిగేంతగా జాతిని
చైతన్యపరిచారు. యుగాల పాటు తపస్సు చేస్తే వచ్చే ఫలితాన్ని ప్రజాజీవితంలో ఉంటూనే
పొందారు. ఇంకా ఎందరెందరో... వీరి మార్గం అనుసరణీయం.
భగవద్గీత శ్రద్ధాత్రయ విభాగయోగంలో
శ్రీకృష్ణపరమాత్మ తపస్సు మూడురకాలుగా ఉంటుందని చెప్పాడు. అవి...
శారీరక తపస్సు: దేవతలను, గురువులను, జ్ఞానులను, మహాత్ములను పూజించటం, త్రికరణశుద్ధిగా ఉండడం,
ఇతర ప్రాణులను హింసించకుండా ఉండడం.
వాచక తపస్సు: ఉద్వేగపూరితంగా మాట్లాడకుండా ఉండడం, సత్యం మాట్లాడడం,
ఇతరులకు ప్రియం కలిగించేలా మాట్లాడడం, తన
ధర్మాన్ని అనుసరిస్తూ స్తోత్రాలు, మంత్రాలు పఠించడం.
మానసిక తపస్సు: మనస్సును నిర్మలంగా ఉంచుకోవడం, ప్రసన్నమైన వదనం,
ఆత్మనిగ్రహం, పరిశుద్ధమైన భావాలు కలిగిఉండడం.
నీ పని మానొద్దు!
స్వధర్మాన్ని పాటించడం, చిత్తశుద్ధితో
ఆచరించడం తపస్సు అవుతుంది. మహాభారతంలోని ‘ధర్మవ్యాధుడి’
వృత్తాంతం ఇందుకు ఉదాహరణ. మార్కండేయ మహర్షి ధర్మరాజుకు ఈ కథ
చెబుతాడు.
కౌశికుడనే బ్రహ్మచారి అరణ్యంలో
తీవ్రమైన తపస్సు చేస్తుంటాడు. ఒక రోజున చెట్టు మీద ఉన్న పిట్ట వేసిన రెట్ట అతడి
మీద పడుతుంది. ఆగ్రహంతో తలెత్తి పైకి చూస్తాడు కౌశికుడు. తపశ్శక్తితో కూడిన అతడి
నేత్రదృష్టికి ఆ పక్షి ప్రాణాలు కోల్పోతుంది. ఆ తర్వాత, భిక్షాటన చేస్తూ ఓ గృహిణి
ఇంటి ముందు ఆగి ‘భవతీ భిక్షాందేహి’ అంటూ భిక్ష అడుగుతాడు. భర్తకు
పరిచర్యలు చేస్తున్న కారణంగా భిక్ష వెయ్యటానికి ఆలస్యంగా వచ్చిన ఆ ఇల్లాలిని
కౌశికుడు కోపంగా చూస్తాడు. ‘నీ కోపానికి మాడిపోవటానికి నేను
పిట్టను కాదు’ అంటుందామె. అడవిలో జరిగిన సంఘటన ఆమెకు ఎలా
తెలిసిందని, సాధారణ ఇల్లాలికి అంత శక్తి ఎలా వచ్చిందని
ఆశ్చర్యపోతాడు. అందుకామె ‘ఇల్లాలిగా నా ధర్మ నిర్వహణ తప్ప
నాకు మరొకటి తెలియదు. మిథిలానగరంలో ధర్మవ్యాధుడనే వ్యక్తి దగ్గరకు వెళ్లు. అతడు
నీకు బోధ చేస్తా’డని చెబుతుంది. మిథిలకు వెళ్లిన కౌశికుడు
మాంసం విక్రయిస్తూ జీవించే ధర్మవ్యాధుడిని చూసి ‘నీకు ఇంత
శక్తి ఎలా వచ్చింది? ఏ తపస్సు చేశావని’ ప్రశ్నించాడు.
‘నాయనా! నాకు ఏ తపస్సూ తెలియదు. నా కర్తవ్యం
నేను నిర్వహిస్తాను. నా తల్లిదండ్రులను ఏమాత్రం కష్టపెట్టను. వారికి సేవ చేస్తాను.
ఎవరినీ బాధ పెట్టను. పెద్దలను, జ్ఞానులను, గురువులను గౌరవిస్తాను. అసత్యం పలకను. భార్యను తప్ప పరస్త్రీల వైపు
కన్నెత్తి చూడను. ఆశ, అసూయలను మనసులోకి రానివ్వను. నిందలను,
పొగడ్తలను సమంగా స్వీకరిస్తాను. ఇదే నేను చేసే తపస్సు’ అని చెబుతాడు కౌశికుడు. మహాసాధ్వి అయిన ఇల్లాలు పంపించిన కారణంగా నీతో
మాట్లాడాను తప్ప, నాతో మాట్లాడే అర్హత కూడా నీకు లేదంటాడు.
‘ఒకే ఒక్క బిడ్డవు కదా! తల్లిదండ్రుల్ని
వదిలేసి, అడవులకు వెళ్లి ముక్కుమూసుకోవటం వల్ల మోక్షం
రాదయ్యా. నీ తల్లిదండ్రులకు సేవ చెయ్యాల్సిన కర్తవ్యం విడిచిపెట్టావు. ఇలాగైతే,
నీ తపస్సు ఫలించదు. కన్నవారిని సేవించుకో. నీ ధర్మాన్ని పాటించు.
అదే తపస్సు చేసిన ఫలితాన్నిస్తుంద’ని బోధ చేస్తాడు.
తపస్సు... అర్థం, పరమార్థం
తపస్సు పరమార్థం ఆత్మశుద్ధి, పరమాత్మసాక్షాత్కారం.
తపస్సు ద్వారా మనిషి తనలోని కామ, క్రోధ, లోభ,
మోహ,
మద,
మాత్సర్యాలను
జయించగలడు. తపస్సు ద్వారా ఇంద్రియాలను నియంత్రించడం సాధ్యమవుతుంది. తద్వారా ధ్యానం,
జ్ఞానం,
సేవ,
భక్తి వంటి
మార్గాల ద్వారా జీవితం ఉన్నత స్థాయికి చేరుకునేందుకు మార్గం ఏర్పడుతుంది. తపస్సు
వల్ల వ్యక్తిలో ఆత్మబలం పెరుగుతుంది, చిత్తశుద్ధి ఏర్పడుతుంది,
దివ్యజ్ఞానం
వికసిస్తుంది.
అందువల్ల, తపస్సు అనేది కేవలం
శరీరాన్ని కష్టపెట్టడం కాదు... ఆత్మను శుద్ధి చేసి పరమసత్యాన్ని
తెలుసుకునే సమగ్ర సాధన తపస్సు అవుతుంది. నియమబద్ధమైన జీవనం,
ధ్యానం,
భక్తి,
సత్యాచరణ,
సేవాభావం
కలిసినప్పుడు అది నిజమైన తపస్సుగా మారుతుంది. భారతీయ సంస్కృతిలో మహర్షులు చూపిన తపోమార్గం
మనిషిని దైవత్వానికి దగ్గర చేసే పవిత్ర సాధనగా ఎప్పటికీ నిలిచిపోతుంది.
-----xxxxx-----
Wednesday, May 27, 2026
నా గురించి... స్వగతం... (డాక్టర్ కప్పగంతు రామకృష్ణ గురించి పరిచయం)
![]() |
డాక్టర్ కప్పగంతు రామకృష్ణ |
విద్యా రంగంలో డాక్టర్ రామకృష్ణ సేవలు విశేషమైనవి. 2008 నుండి 2023 వరకు విజయవాడలోని ఎస్.ఆర్.ఎస్.వి. కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఉపన్యాసకుడిగా పనిచేసి అనేక మంది విద్యార్థులకు మార్గదర్శకులయ్యారు. అనంతరం కేబీఎన్ కళాశాలలో తెలుగు విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ మరియు వైస్ ప్రిన్సిపల్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గణిత బోధనలో సహపాఠ్య కార్యక్రమాల నిర్వహణ, గణిత సమస్యల సృజనాత్మకత, కృష్ణా జిల్లా ముద్రిత మాధ్యమాలపై పరిశోధనలు చేయడం ద్వారా ఆయన విద్యా రంగానికి వినూత్న దృక్పథాన్ని అందించారు.
రచయితగా డాక్టర్ రామకృష్ణ తెలుగు భాష, సాహిత్యం, గణితం, భక్తి, చరిత్ర, సామాజిక చైతన్యం వంటి విభిన్న అంశాలపై అనేక గ్రంథాలు రచించారు. “భాషా ప్రసార నైపుణ్యాలు”, “తెలుగు భాషా సాహిత్య మౌళికాంశాలు”, “మనసు మాట గెలుపు బాట”, “కృష్ణా జిల్లా పత్రికా రంగం”, “అందమైన ఆంధ్రప్రదేశ్”, “ఓ వయోలిన్ కథ”, “భక్తి మకరందం” వంటి గ్రంథాలు ఆయన సృజనాత్మకతకు నిదర్శనం. అలాగే “హైందవ సంస్కృతి – వైజ్ఞానికత”, “ఇండియా వరల్డ్ లీడర్”, “శ్రీ భారతి” వంటి రచనలు ఆయనలోని జాతీయ భావన, సాంస్కృతిక అవగాహనను ప్రతిబింబిస్తాయి.
సహరచయితగా కూడా ఆయన ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన అనేక పాఠ్యగ్రంథాల రూపకల్పనలో భాగస్వాములయ్యారు. బి.ఎడ్, డి.ఎల్.ఎడ్ విద్యార్థుల కోసం తెలుగు బోధనా పద్ధతులు, విద్యా తాత్విక అంశాలు, అభ్యాస మదింపు, ఉపాధ్యాయ శిక్షణ, సైకాలజీ వంటి అంశాలపై గ్రంథాలను రూపొందించారు. తెలుగు మరియు సంస్కృత అకాడమీ ద్వారా ప్రచురితమైన ఉపాధ్యాయ విద్యా సిరీస్కు సిరీస్ ఎడిటర్గా వ్యవహరించడం ఆయన విద్యా నైపుణ్యానికి నిదర్శనం.
పరిశోధకుడిగా కూడా ఆయన విశేష కృషి చేశారు. గణిత బోధన, భాషాభివృద్ధి, సామాజిక మాధ్యమాల ప్రభావం, కౌమార విద్యార్థుల వైఖరులు, డిజిటల్ టెక్నాలజీ, కృత్రిమ మేధస్సు వంటి ఆధునిక అంశాలపై ఆయన పరిశోధనా వ్యాసాలు దేశీయ, అంతర్జాతీయ జర్నల్స్లో ప్రచురితమయ్యాయి. “పద్య గణితం”, “మ్యాజిక్ స్క్వేర్స్ ద్వారా లీనియర్ ఆల్జిబ్రా”, “టీచర్ ఎడ్యుకేషన్లో AI పాత్ర” వంటి అంశాలపై ఆయన చేసిన అధ్యయనాలు సృజనాత్మక ఆలోచనలకు మార్గదర్శకంగా నిలిచాయి.
డాక్టర్ రామకృష్ణ గణిత బోధనలో వినూత్న పద్ధతులను అభివృద్ధి చేస్తూ పేటెంట్లు కూడా పొందారు. “మ్యాజిక్ స్క్వేర్ గేమ్”, “అల్జిబ్రా లెర్నింగ్ టూల్”, “ఇంటరాక్టివ్ జియోమెట్రిక్ టూల్”, “డిజిటల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ డివైస్” వంటి విద్యా పరికరాల రూపకల్పన ద్వారా బోధనను సులభతరం చేయాలనే ఆయన సంకల్పం స్పష్టమవుతుంది.
రేడియో, దూరదర్శన్ వంటి మాధ్యమాల ద్వారా కూడా ఆయన ప్రజల్లో చైతన్యం కలిగించారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ద్వారా తెలుగు భాష, గణితం, జాతీయోద్యమం, సంస్కృతి, సాహిత్యం, సామాజిక అంశాలపై అనేక ప్రసంగాలు, సమీక్షలు అందించారు. దూరదర్శన్లో “సాహిత్యంలో గణితం”, “ఉగాది కవి సమ్మేళనం”, “కెరీర్ గైడెన్స్” వంటి కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలకు విజ్ఞానాన్ని చేరవేశారు.
అనేక జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పరిశోధనా పత్రాలు సమర్పించిన డాక్టర్ రామకృష్ణ తెలుగు భాషా పరిరక్షణ, గణిత విద్య, సాహిత్య పరిశోధన, సాంకేతిక విద్య వంటి అంశాలపై విలువైన చర్చలకు దోహదపడ్డారు. ఉపన్యాసకుడిగా, వనరుల వ్యక్తిగా, ఎడిటోరియల్ బోర్డు సభ్యుడిగా, పరిశోధన మార్గదర్శిగా, అకాడమిక్ కౌన్సిలర్గా ఆయన నిర్వహించిన బాధ్యతలు విశేషమైనవి.
ఆయన సేవలకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి “ఉగాది పురస్కారం”, “మాతృభాషా సేవా శిరోమణి పురస్కారం”, “గిడుగు రామమూర్తి భాషా పురస్కారం” వంటి గౌరవాలు లభించాయి. విద్యా రంగంలో వినూత్న ఆచరణలకు జాతీయ స్థాయి పురస్కారం, “విద్యా రత్న” వంటి బిరుదులు కూడా ఆయన ప్రతిభను ప్రతిబింబిస్తున్నాయి.
సాహిత్యం, విద్య, గణితం, సంస్కృతి, మీడియా, పరిశోధన – ఈ అన్ని రంగాలలో సమాన ప్రతిభ కనబరిచిన డాక్టర్ కప్పగంతు రామకృష్ణ నిజమైన విద్యావేత్తగా, పరిశోధకుడిగా, రచయితగా, సమాజ చైతన్యవేత్తగా నిలిచారు. తెలుగు భాషాభివృద్ధికి, ఉపాధ్యాయ విద్యా ప్రగతికి, సృజనాత్మక విద్యా విధానాల రూపకల్పనకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమైనవి.
Friday, May 8, 2026
‘సాహిత్యంలో గణితం’ అనే అంశంపై డాక్టర్ కప్పగంతు రామకృష్ణ ఇంటర్వ్యూ దూరదర్శన్ సప్తగిరి కేంద్రం నుంచి ప్రసారం
‘సాహిత్యంలో గణితం’ అనే అంశంపై
డాక్టర్ కప్పగంతు రామకృష్ణ ఇంటర్వ్యూ
దూరదర్శన్ సప్తగిరి కేంద్రం నుంచి ప్రసారం
(యూ ట్యూబ్ లింక్ ఫొటో కింద ఉన్నది)
https://www.youtube.com/watch?v=O3jN_Gjd1xw
Monday, April 20, 2026
శంకర జయంతి సందర్భగా నమస్తే తెలంగాణ దినపత్రిక 20.04.2026 సంచికలో డాక్టర్ కప్పగంతు రామకృష్ణ రాసిన వ్యాసం
శంకర జయంతి సందర్భగా నమస్తే తెలంగాణ దినపత్రిక
20.04.2026 సంచికలో
డాక్టర్ కప్పగంతు రామకృష్ణ రాసిన వ్యాసం
గాయత్రీ మాత వైభవం గురించి ‘శ్రీ కనకదుర్గ ప్రభ’ మాస పత్రిక 2026, జూన్ సంచికలో డాక్టర్ కప్పగంతు రామకృష్ణ రాసిన వ్యాసం
గాయత్రీ మాత వైభవం గురించి ‘శ్రీ కనకదుర్గ ప్రభ’ మాసపత్రిక 2026, జూన్ సంచికలో డాక్టర్ కప్పగంతు రామకృష్ణ రాసిన వ్యాసం
-
దీక్ష అంటే ఏమిటి? దీక్షలో రకాలెన్ని? దీక్ష ఎందుకు చెయ్యాలి? దీక్షలో పాటించాల్సిన నియమాలేమిటి? సర్వకాల రక్ష... దీక్ష పుట్టుకతోనే ఏ మనిషీ ...
-
శివుడికి ఏయే పూలతో పూజలు చెయ్యాలి? శివుడికి ఇష్టమైన పువ్వులేవి? శివపూజకు చిగురించిన... శివా! అని ఆర్తిగా పిలిస్తే చాలు... కైలాసం దిగి వచ...
-
శ్రీరామ రుద్రాభిషేక వైభవం ఈశ్వరా! అని భక్తితో గొంతెత్తి పిలిచినంతలోనే భక్తులను కటాక్షించే పరమ కారుణ్యమూర్తి పరమేశ్వరుడు....







