అన్నీ ఆమె... అంతటా ఆమె
(సనాతన సాహిత్యంలో స్త్రీ ఔన్నత్యం)
ప్రపంచంలోని మరే ఇతర దేశం స్త్రీకి ఇవ్వని సమ్నుతస్థానాన్ని మనదేశమే ఇచ్చింది. భారతమాత అంటూ జన్మనిచ్చిన భూమికి నమస్కరించే సంస్కారం కేవలం మనదేశంలోనే ఉంది. స్వాతంత్య్ర సంగ్రామంలో కూడా ‘మాతృభూమి’, ‘వందేమాతరం’ వంటి నినాదాలు ప్రజల్లో స్వేచ్ఛాప్రియత్వాన్ని కలిగించి, స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిల్చాయి. కేవం మనదేశంలోనే మహిళను ‘అమ్మా’ అని పిలిచే సంస్కారం ఉంది. పరిచయం లేని మహిళ ఎదురైతే, ఆమెతో మాట్లాడాల్సిన సందర్భం వస్తే ‘ఏమ్మా’ అంటూ సంబోధించే ఉత్తమగుణం ఈ మట్టిలో పుట్టిన ప్రతి మనిషికీ సహజంగా వస్తుంది.
వేదాలకు అధిష్ఠానదేవతగా గాయత్రీమాతను ఎంచుకున్న ఘనత కూడా మనకే దక్కుతుంది. అదొక్కటే కాదు.. ఈ దేశంలోని ప్రతి అణువులో మహిళాశక్తి ప్రకటితమవుతుంది. గంగ, గోదావరి, నర్మద, సరస్వతి, యమున...ఇలా ప్రతి నదికీ స్త్రీ పేరు ఉంటుంది. కారణం... మనిషికి అత్యంత ప్రాణాధారమైన వాటిల్లో నీరు ఒకటి. నీరు లేకపోతే ప్రాణం నిలవదు. స్త్రీమూర్తి లేనిదే జీవితం లేదు. అందుకే నీటికి, స్త్రీకి సమాన ప్రాధాన్యత ఇచ్చారు మన పూర్వికులు. ఈ రెండూ లేనిదే మనిషి జీవనం సాగించలేడు. ఆ జీవితం పరిపూర్ణత్వాన్ని పొందలేదు. అందుకే, నదులన్నిటినీ స్త్రీమూర్తుల పేరుతో పిలవటం మనదేశంలో ఆచారంగా ఉంది.
గంగమ్మ తల్లి, కృష్ణమ్మ తల్లి అంటూ నదుల్ని తల్లిగా భావించి, నోరారా పిలిచే దృశ్యం కేవం మనదేశంలోనే కనిపిస్తుంది. చివరకు పశు సంతతికి చెందిన ఆవును కూడా ఆవు అని పిలవకుండా గోమాత అని గౌరవంగా పిలిచి, తల్లిగా పూజించటం, వేపచెట్టును గౌరీదేవిగా అర్చించటం కూడా మనదేశంలోనే ఉంది. నీరు, నిప్పు... అన్నిట్లోనూ అమ్మను దర్శించగలిగిన సమున్నతజాతి మన భారతజాతి మాత్రమే.
వేదాల్లో స్త్రీ ప్రశంస
భారతీయ సంస్కృతికి పట్టుగొమ్మలుగా నిలుస్తున్న వేదాలు స్త్రీకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చాయి. ఋగ్వేదం యజుర్వేదం, అధర్వణ వేదాల్లోని అనేక మంత్రాలు స్త్రీ ఔన్నత్యాన్ని విశేషంగా ప్రశంసించటంతో పాటు మహిళల్ని ఎంతో గౌరవంగా చూడాలనే బాధ్యతను పురుషులకు నిర్దేశించాయి. భర్తకు భార్యగా ఉంటూ, దాసి తరహాలో అతనికి సేవ చెయ్యటం స్త్రీధర్మం అనే భావనను వేదాలు నిరసించాయి. ఇంటికి యజమానురాలిగా, బిడ్డకు తొలి గురువుగా, అవసరమైన సందర్భాల్లో పురుషులతో సమానంగా విద్య అందాని, విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత మాత్రమే వివాహానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాని అధర్వణవేదం చెబుతోంది. ఇందుకు ఆయా వేదాల్లో అనేక ఉదాహరణలు ఉన్నాయి.
· స్త్రీలు ధైర్యవంతులుగా ఉండాలి - యజుర్వేదం (10:23)
· స్త్రీలు మంచి కీర్తి గడించాలి - అధర్వణ వేదం (14:1:20)
· స్త్రీలు ఉత్తమ పాండిత్యం సంపాదించాలి - అధర్వణ వేదం (11:5:8)
· స్త్రీలు అందరినీ జ్ఞానవంతుల్ని చెయ్యాలి - అధర్వణ వేదం (14:2:74)
· స్త్రీలు ఎల్లప్పుడూ సంపదలతో సుఖంగా ఉండాలి - అధర్వణవేదం (7:4:72)
· స్త్రీలు ఎల్లప్పుడూ జ్ఞానవంతులుగా, తెలివిగలవారుగా ఉండాలి - అధర్వణవేదం (7:47:1)
· పరిపాలనకు సంబంధించిన సభలు, సమావేశాల్లో స్త్రీలు కూడా పాల్గొనాలి - అధర్వణవేదం (7:38:4)
· దేశపరిపాలన, సామాజిక సంస్కరణలు, ప్రభుత్వ కార్యకలాపాలను స్త్రీలు నాయకత్వం వహించి నడపాలి- ఋగ్వేదం (10:85:46)
· స్త్రీలు సభను ఉద్దేశించి ప్రసంగించాలి - ఋగ్వేదం (10:85:26)
· పిత్రార్జితంలో కుమారుడితో పాటు కుమార్తెకు కూడా సమానహక్కు ఉంది - ఋగ్వేదం (3:31:1)
· స్త్రీ సమాజానికి, కుటుంబానికి రక్షకురాలిగా వ్యవహరించాలి. అధర్వణవేదం (14:1:20)
· స్త్రీ సంపదను, ఆహారాన్ని అందించాలి. శ్రేయస్సును కలిగించేదిగా ఉండాలి- అధర్వణవేదం (11:1:17)
· స్త్రీలు యుద్ధంలో పాల్గొనాలి- యజుర్వేదం (16:44)
· పురుషులతో సమానంగా మేము మీకు మంత్రాలను ప్రసాదిస్తున్నాము. మంత్రాలను అర్థం చేసుకునే శక్తిని మీకు ప్రసాదిస్తున్నాము - ఋగ్వేదం (10:19:13) (మంత్రభాగంలో పేర్కొన్న అనేక మంత్రాలకు గార్గి, లోపాముద్ర వంటి స్త్రీమూర్తులే ద్రష్టలుగా ఉన్నారు. అలాగే గాయత్రి, చండి, దుర్గ, కాళి, సరస్వతి వంటి స్త్రీమూర్తులకు సంబంధించిన మంత్రాలే అధికంగా ఉన్నాయి)
· ఓ వధూ! నీకు అన్నివిధాలైన విజ్ఞానం కలుగుగాక. వేదజ్ఞానం పొందిన తర్వాత మాత్రమే నువ్వు జీవితానికి సంబంధించిన నిర్ణయం తీసుకో. నీవు మంచి కీర్తిని గడించి, నీ భర్తకు శుభాలు కలుగజెయ్యాలి. నీ విజ్ఞానంతో కుటుంబాన్ని అభివృద్ధి పథంలో నడిపించు- అధర్వణవేదం (14:1:64) (ప్రతి స్త్రీ తప్పనిసరిగా విద్యాభ్యాసం చెయ్యాలని, ఆ తర్వాతనే వివాహం చేసుకోవాలని ఈ మంత్రం స్పష్టంగా చెబుతోంది.)
యజ్ఞయాగాది క్రతువుల్లో కూడా భార్యకు అగ్రస్థానాన్ని వేదాలు కల్పించాయి. ఏయాగం చెయ్యాలన్నా, అందుకు సంబంధించిన అగ్ని ప్రతిష్ఠాపన భార్య చేస్తుంది. ఆ తర్వాతనే భర్త హోమాన్ని కొనసాగిస్తాడు. ‘పతుర్యో యజ్ఞసంయోగే’ - యజ్ఞయోగ్యతను కలిగించునది పత్ని అని పాణిని సూత్రం. ‘అయజ్ఞోవా ఏష: యో అపత్నీక:’ - అపత్నీకుడు అంటే భార్య లేని వ్యక్తికి యాగాలు చేసే అధికారం లేదు. చివరకు సంకల్పం చేసే అధికారం లేదని వేదాలు స్పష్టంగా చెబుతున్నాయి.
ఆమె ఒప్పుకుంటేనే వివాహం
వివాహ మంత్రాల్లో కూడా వధువుకే అగ్రస్థానం ఉంది. ‘గృహాన్గచ్ఛ గృహపత్నీ చథా సో వశినీత్వం విధథమాదాసి’ - వివాహంలో చేసే హోమా సందర్భంలో వరుడు వధువును ‘నువ్వు మా ఇంటికి అధిపతిగా రావాలి. కేవలం రావటమే కాదు... మా ఇంటికి అధిపతిగా ఉండి, మమ్మల్ని నడిపించాలి. మా ఇంట్లో పుణ్యకార్యాలు జరిగేలా నువ్వు ప్రోత్సహించాలి’ అని అభ్యర్థించి తీసుకువస్తాడు. కన్యాదానం చేసే సందర్భంలో కూడా తండ్రి తన కుమార్తెను లక్ష్మీస్వరూపంగా భావించి, కన్యాదానం చేస్తాడు. తన ఇంటి లక్ష్మి కనుకనే వధువును వివాహవేదిక వద్దకు నడిపించి తీసుకురాకుండా, ధాన్యం పోసిన వెదురుబుట్టలో కూర్చోపెట్టి తీసుకువస్తారు పుట్టినింటివారు.
వివాహం పూర్తయిన తర్వాత కూడా లక్ష్మీ స్వరూపురాలైన భార్యను నడిపించకుండా ‘ఉత్తరారధస్యోత్తంభనీ, వాహావుత్తరాభ్యాం యన్నక్తి:’, ‘ఆరోహయన్తీముత్తరాభిరభిమన్త్రయతే’ - రథం మొదలైన వాహనాల మీద కూర్చోబెట్టి వధువును వరుడి ఇంటికి తీసుకువెళ్ళాని మంత్రాలు చెబుతున్నాయి. మొత్తం వివాహ ప్రక్రియలో వరుడే వధువును తనకు భార్యగా ఉండాలని అభ్యర్థించి, తన ఇంటికి రావసిందిగా ఆహ్వానించి తీసుకువెళ్తాడే కానీ ఏ మంత్రంలోనూ పురుషాధిక్యత కనిపించదు.
తొలివరుసలో ఆమే...
ప్రాచీనకాలం నుంచి మన ఆచార, సంప్రదాయాల్లో మహిళకే తొలిస్థానం కల్పించింది భారతీయ సంస్కృతి. భార్యాభర్త పేర్లు పిలవాల్సి వచ్చినప్పుడు ముందుగా భార్యపేరు పిలవటం ఆనవాయితీగా వస్తోంది. దేవతలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. లక్ష్మీనారాయణు, జానకీరాముడు, పార్వతీ పరమేశ్వరులు, సీతారాములు, గౌరీశంకరులు, ఛాయా ఉషా సమేత సూర్యనారాయణస్వామి, వల్లీదేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడు, అరుంధతి వశిష్ఠుడు... ఇలా భార్యపేరు వచ్చిన తర్వాతనే భర్తపేరు వస్తుంది.
వేదాలతో సహా పురాణాలన్నీ స్త్రీని శక్తిస్వరూపంగా వర్ణించాయి. త్రిమూర్తుల కన్నా ఉత్తమస్థానంలో జగజ్జననిగా, పరాదేవతగా మహిళనే నిలిపాయి.
వేదాలు కూడా యజ్ఞాల్లో స్త్రీకి అగ్రతాంబూలం ఇచ్చాయి. యజ్ఞాల్లో యజమాని భార్య మాత్రమే అగ్నిప్రతిష్ఠాపన చెయ్యాలి. ఆమె అగ్ని వెలిగించిన తర్వాతనే మిగిలిన కార్యక్రమం కొనసాగుతుంది. ఇతరులెవ్వరికీ ఆ అధికారం లేదు. అలాగే, పూర్ణాహుతిలో కూడా యజమానురాలు తప్పనిసరిగా ఉండాలి. భార్యావిహీనుడికి యజ్ఞయాగాది క్రతువులు చేసే అధికారాన్ని వేదాలు ఇవ్వలేదు.
అలాగే, కొత్త ఏడాది వచ్చాక జరిగే తొలి కల్యాణం సీతారామ కల్యాణం. ఇక్కడ కూడా సీతారామ కల్యాణం అన్నారే కానీ రామ కల్యాణం అనలేదు. పార్వతీకల్యాణం, పద్మావతీ పరిణయోత్సవం... ఇలా అన్ని దేవతాకల్యాణాల్లోనూ ‘ఆమె’కే తొలిస్థానాన్ని కల్పించాయి వైదిక శాస్త్రనియమాలు. ఇప్పటికీ, దంపతులకు నూతన వస్త్రాలు ఇచ్చే సందర్భంలో ముందుగా భార్యకు పసుపు కుంకుమలు ఇచ్చిన తర్వాతనే భర్తకు వస్త్రాలు ఇస్తారు.
మనువు కూడా ‘అర్ధస్య సంగ్రహేచైనాం వ్యయేచైవ నియోజనేత్’ ` అంటూ ధనాన్ని జాగ్రత్త చెయ్యటం, ఖర్చుచెయ్యటంలో ఇంటి యజమానురాలికే మొదటి అధికారం ఇచ్చాడు.
పల్లెల్లో గ్రామదేవత ఆచారం
ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. పోలేరమ్మ, నాంచారామ్మ,
తలుపులమ్మ, తిరుపతమ్మ, బతుకమ్మ...ఇలా వందలాదిగా
గ్రామదేవతలు ఉన్నారు. వీరందరూ స్త్రీమూర్తులే. చాలా కుటుంబాల్లో ఏ శుభ కార్యం
జరిగినా తొలిపూజ గ్రామదేవతకే చేస్తారు. వాన పడకపోయినా గ్రామదేవతకే మొక్కు
చెల్లిస్తారు. అంటే, ఏ కష్టమొచ్చినా మనిషిని
ఆదుకునేది మహిళలే అన్న విషయం స్పష్టమవుతోంది.
మనుస్మృతిలోనూ పెద్దపీట
ఉపాధ్యాయాన్ దశాచార్య ఆచార్యానాం శతం పితా
సహస్రం తు పితన్ మాతా గౌరవేణాతిరిచ్యతే ॥ (మను, 2:145)
పదిమంది ఉపాధ్యాయుల కంటే ఒక ఆచార్యుడు, వందమంది ఆచార్యుల కంటే తండ్రి, వెయ్యిమంది తండ్రుల కంటే తల్లి పూజనీయురాలని మనుధర్మశాస్త్రం చెబుతుంది. మహిళకు ఇంతకన్నా గొప్పస్థానాన్ని మరే సంస్కృతీ ఇవ్వలేదనేంతగా మనుస్మృతి స్త్రీ ప్రాధ్యాన్యాన్ని వివరించింది. ‘మాతృదేవోభవ’ అంటూ తల్లికి తొలి నమస్కారం చేసిన తర్వాతనే ‘పితృదేవోభవ’ అంటూ తండ్రికి తర్వాతి నమస్కారం చెయ్యాని ఉపనిషత్తులు చెప్పిన వాక్యాలు కూడా మనుధర్మశాస్త్రాన్ని సమర్థించాయి.
సమాజంలో అత్యున్నత స్థానం స్త్రీకి ఉంది. అది ఆమె హక్కు. పురుషుడు ఆమెను ప్రాథేయపడాలి. ఆమెను మహారాణిలా చూసుకోవాలి. దైవం కన్నా గొప్ప స్థానం ఇవ్వాలి. ఆమె సదా వందనీయురాలు. ఇంటా బయటా, చదువైనా, వివాహమైనా, ఆస్తిపంపకాలైనా, అధికారమైనా... అన్నింటా అగ్రతాంబూలం ఇవ్వాల్సిందే అంటుంది మనుస్మృతి.
‘ఆమె’పై అధికారం చెలాయించే హక్కు పురుషుడికి ఎప్పటికీ లేదని, ‘ఆమె’తో పురుషుడు ఏవిషయంలోనూ సాటిరాలేడని మనువు స్పష్టంగా చెప్పాడు. మనిషికి అర్థం, పరమార్థం స్త్రీవల్లే కలుగుతాయి. భార్యను మించిన స్నేహితుడు భర్తకు మరొకరు లేరు. పురుషుడు స్త్రీ లేకుండా పరిపూర్ణత్వాన్ని పొందలేడు. అతడిని స్వీకరించటానికి సమ్మతించి స్త్రీ అతని ఇంటికి భార్యగా వచ్చినప్పుడే పురుషుడికి పూర్ణత్వం సిద్ధిస్తుందంటాడు మనువు. ‘శ్రీ’ (సంపద), ‘స్త్రీ’ (భార్య) లేని ఇల్లు కాంతిహీనంగా ఉంటుంది (9:26, 3:60). ఇది మనువు ఇచ్చిన సూచన రూపంలోని ఆదేశం. మార్గదర్శనం కూడా.
మనుస్మృతిలో స్త్రీ గురించి చర్చ అంటే... ‘న స్త్రీ స్వాతంత్య్ర మర్హతి’ (9:3) అనే వాక్యాన్ని ప్రస్తావిస్తారు. ఆమెను మనుస్మృతి స్వాతంత్య్రానికి నోచుకోనివ్వలేదు అంటారు. నిజానికి ఆ శ్లోకంలోని అంతరార్థం తరచిచూస్తే
పితా రక్షతి కౌమారే భర్తా రక్షతి యౌవనే
రక్షన్తిస్థావిరే పుత్రా నస్త్రీ స్వాతంత్య్రమర్హతి ॥ (9:3)
తన రక్షణ కోసం మహిళ ఏనాడూ చింతించాల్సిన అవసరం లేకుండా మనువు చేసిన కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఇందులో కనిపిస్తాయి. ‘బాలికగా ఉన్నప్పుడు తండ్రి, యువతిగా ఉన్నప్పుడు భర్త, వార్థక్యంలో ఉన్నప్పుడు కుమారుడు బాధ్యత తీసుకుని స్త్రీని సంరక్షించాల’నే అర్థం బోధపడుతుంది. మహిళ పూర్తి బాధ్యత పురుషుడికి అప్పగించాడు. ఇక్కడ మహిళపై బాధ్యతను పురుషుడు గుర్తించాలి తప్ప వారిపై ఉన్న అధికారాన్ని కాదు.
స్త్రీలు ఏవిధంగానూ దుఃఖానికి గురికాకూడదని మనువు చెప్పాడు. ‘స్త్రీలు దుఃఖిస్తే అందుకు ప్రతిఫలంగా దుఃఖానికి కారణమైన వారి వంశమంతా నశిస్తుంది. స్త్రీలు సంతోషంతో ఉంటే ఆ ఇల్లు, వారి వంశం ఎప్పుడూ కళకళలాడుతుంటుంది’ (3:57). ఇక్కడ స్త్రీపురుషులిద్దరిపై బాధ్యత పెట్టాడు మనువు. స్త్రీకి దుఃఖాన్ని కలగనివ్వకుండా చూడాల్సిన బాధ్యత పురుషుడిదైతే, తాను సంతోషంగా ఉంటూ తన వారందరినీ అలాగే ఉంచాల్సిన బాధ్యత ఆమెకుంది.
స్వేభ్యోంశేభ్యస్తు కన్యాభ్యః ప్రదద్యుర్భ్రాతరః పృథక్
స్వాత్స్వా దంశాచ్చతుర్భాగం పతితౌః స్యురదిత్సవః ॥
అన్నదమ్ములు ఆస్తులు పంచుకుంటే ఒక్కొక్కరు తమ భాగాల్లోంచి నాలుగో వంతుని తోబుట్టువుకు ఇవ్వాలని మనువు నిర్దేశించాడు. మహిళకు ఆస్తిహక్కు గురించి ఇవాళ మనం చేసుకుంటున్న చట్టాల్ని ఏనాడో వివరించి వారికి వెన్నుదన్నుగా నిలిచాడు మనువు.
స్త్రీలను అపహరించడం, హత్య చేయడం, అత్యాచారం చేయడం వంటి విషయాల్లో మనువు చాలా నిష్కర్షగా వ్యవహరించాడు. ఇటువంటి దుర్మార్గాలు చేసిన వ్యక్తుల్ని అత్యంత కఠినంగా శిక్షించాని నిర్దేశించాడు. ఇలాంటి నేరాల్లో దోషులకు దేశబహిష్కరణ శిక్ష (మను, 8:352) విధించాలని రాజుకు సూచించాడు. స్త్రీలను అపహరించేవారికి, వారి ఆస్తుల్ని దొంగిలించేవారికి మరణదండన (8:323) విధించాలన్నాడు. వినటానికే ఎంతో కఠినంగా అనిపించే ఈ శిక్షల్ని ఎన్నో వేల సంవత్సరా క్రితమే మనువు మహిళ రక్షణ కోసం నిర్దేశించాడు.
ఇవన్నీ ‘ఆమె’కు వెన్నుదన్నుగా నిలిచేందుకు చేసిన సూచనలే. బలమైన రాజ్యాంగం, గొప్ప సాంకేతిక ప్రగతి ఉన్నా నేటికీ మహిళలపై అనేక అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కఠినమైన శిక్షలు విధిస్తే తప్ప తప్పు చెయ్యటానికి మనిషి భయపడే పరిస్థితి రాదంటూ మనువు తన ‘స్మృతి’ రూపంలో స్త్రీకి అండగా నిబడ్డాడు.
సాహిత్యాకాశంలో సగం
జనకమహారాజు కొలువులో గార్గి, మైత్రేయి వంటి మహిళలు ఆస్థానపండితులుగా ఎన్నో సత్కారాలు అందుకున్నారు. వీరు పురుషులతో సమానంగా వేద, శాస్త్ర చర్చల్లో పాల్గొనేవారు. తర్వాతికాలంలోనూ పురుషులతో సమానంగా... మరికొన్ని సందర్భాల్లో పురుషుల కన్నా మిన్నగా సాహితీసృష్టి చేసిన మహిళలెందరో ఉన్నారు. ఖడ్గ తిక్కన భార్య చానమ్మ, అతని తల్లి పోలమ్మ చాటువులు చెప్పారు. తొలి తెలుగు కవయిత్రి తాళ్ళపాక తిమ్మక్క, మోహనాంగి, తిరుమలాంబ, తుక్కాదేవి, నాచి, లీలావతి, శారద, త్రివేణి, కృష్ణాజమ్మ, రంగాజమ్మ, ముద్దుపళని, కుప్పమ్మ, బాల పాపాంబ, తరిగొండ వెంగమాంబ, అమ్మాజీ, బండారు అచ్చమాంబ, గోపిశెట్టి లక్ష్మీనరసమ్మ, మామిడన్న సుభద్రమ్మ, చిల్లరిగె రమణమ్మ... ఇంకా మరెందరో మాతృమూర్తులు తమ అసాధారణ రచనా విన్యాసాలతో తెలుగు సాహితీలోకాన్ని సుసంపన్నం చేశారు.
ఆడవాళ్ళను వంటింటి కుందేలుగా మార్చారని నేటి ఆధునికు విమర్శిస్తున్న కాలం, అంతకన్నా పూర్వకాలానికి చెందిన మహిళలే వీరంతా. అంటే, ఎన్నోవేల సంవత్సరాలకు పూర్వమే మన భారతజాతి మహిళలకు అగ్రస్థానం కల్పించిందన్న విషయాన్ని గమనించాలి.
రఘునాథ నాయకుడి ఆస్థాన కవయిత్రి మధురవాణి ప్రాకృత, ఆంధ్ర భాషల్లో రచనలు చేసి రఘునాథ నాయకుడి చేత కనకాభిషేకం అందుకుంది. ఆమెతో పాటు రఘునాథుడి మన్నన అందుకున్న మరో కవయిత్రి రామభద్రాంబ. ఆశుకవిత్వంలో అసాధారణ ప్రజ్ఞ ఈమె సొంతం. విజయరాఘవ నాయకుడి ఆస్థానంలో చంద్రరేఖ, కృష్ణాజీ, రంగాజమ్మ అత్యంత ప్రసిద్ధి పొందారు. రంగాజమ్మ రాసిన ‘మన్నారుదాస విలాసం’ ప్రబంధాల్లో అత్యంత ప్రసిద్ధి పొందింది. దక్షిణాంధ్ర కవయిత్రుల్లో ముద్దు పళనిది ప్రత్యేకస్థానం. ఈమె రాసిన ‘రాధికా సాంత్వనం’ రసావిష్కరణ విషయంలో అగ్రస్థానంలో ఉంది. ఇప్పటికీ ఈమెకు సాటిరాగల శృంగార రచయిత్రి తెలుగుసాహిత్యంలో లేదని విమర్శకులు సైతం ప్రశంసించారు. తెలుగు సాహిత్యంలో ఇప్పటికి వందలాది రామాయణాలు వచ్చినా, ఆతుకూరి మొల్ల రాసిన రామాయణానికి ప్రత్యేకస్థానం ఉంది. ఈమె రామాయణంలోని అనేక ఘట్టాలు అత్యంత ప్రజాదరణ పొందాయి.
ఇంకా ఎందరో...ఎందరో స్త్రీమూర్తులు తమ ప్రతిభతో మనదేశానికి అఖండమైన కీర్తిప్రతిష్ఠలు తీసుకువచ్చారు. వేదాలతో సహా సనాతన భారతీయ సాహిత్యమంతా స్త్రీకి సమున్నతస్థానాన్ని ఇచ్చింది. అందుకే ‘యత్రనార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దవతాః’ - ఎక్కడ స్త్రీలు పూజలందుకుంటారో అక్కడ దేవతలు కూడా కొలువై ఉంటారని పెద్దలు చెబుతారు.
ఎన్నో యుగాల నాడే మహిళకు సర్వోన్నత గౌరవం ఇచ్చిన మన సంస్కృతిని మన వారసత్వ సంపదగా కాపాడుకుందాం.
---------