వేదాల్లో వ్యవసాయం
కన్నతల్లి గోరుముద్ద అందించే అమృత మధురిమల వెనక
కర్షకుడు పడే కష్టం ఎంతో ఉంటుంది. రక్తాన్ని చెమటగా మార్చి అతడు పడే కష్టమే మనకు
పట్టెడన్నాన్ని ఇస్తుంది. జానెడు పొట్టకి గుప్పెడు మెతుకులు దొరక్కపోతే...ఆ
దృశ్యాన్ని కనీసం ఊహించటం కూడా కష్టమే. కానీ ఆ గుప్పెడు మెతుకులు పండిరచటం కోసం
రైతు ఎంత కష్టపడుతున్నాడో అర్థం చేసుకోగలిగితే ప్రతి మెతుకులోనూ పరమాత్మ
సాక్షాత్కరిస్తాడు.
అనంతమైన పోషకాల్ని తనలో నింపుకున్న భూమి నుంచి
మనకు కావలసిన విధంగా వివిధ రకాలైన ధాన్యాల్ని పండిరచి అందించే రైతు చేసేది కేవలం
వ్యవసాయం మాత్రమే కాదు. అదొక యజ్ఞం. ఇతర యజ్ఞాలకన్నా రైతు చేసే వ్యవసాయ యజ్ఞం
ఎన్నో రెట్లు గొప్పది. అందుకే వేదాలు సైతం వ్యవసాయానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చాయి.
వందలాది మంత్రాలతో వ్యవసాయ యజ్ఞ విధానాన్ని అందించాయి. తమ అవతారాల సమయంలో దేవతలు
సైతం హలాలు పట్టి పొలాలు దున్నారు. రైతన్న కష్టం ఏమిటో తామూ అనుభవించారు. అందుకే
రాజు చేతిలో ఉండే దండం కన్నా రైతు చేతిలో ఉండే నాగలే గొప్పదంటాడు ఓ కవి.
పంచభూతాల్లో మొదటిది భూమి. మానవ జీవితానికి
అవసరమైన వస్తువులన్నీ భూమి నుంచే అందుతాయి. అందుకే భూమిని తల్లిగా భావించి భూమాతగా
అర్చించే సంప్రదాయం మనకు ఉంది. వ్యవసాయం ప్రారంభించటానికి ముందుగా భూమి పూజ
తప్పనిసరిగా చేసే ఆచారం కూడా వ్యాప్తిలో ఉంది. ఇలా పొలాల్లో దుక్కిదున్ని వ్యవసాయ
యజ్ఞాన్ని ప్రారంభించే పర్వదినమే ఏరువాక పూర్ణిమ. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం
సస్యానికి (పంటలు) అధిపతి చంద్రుడు. ఇతడు జ్యేష్ట నక్షత్రానికి చేరువలో ఉన్న
సమయంలో పొలం పనులు ప్రారంభిస్తే మంచి దిగుబడులు వస్తాయి. ఈవిధంగా జ్యేష్ఠ పూర్ణిమ
రోజున వ్యవసాయ పనులు ప్రారంభించి ఏరువాక పూర్ణిమ జరుపుకోవటం వ్యాప్తిలోకి
వచ్చింది.
· యజర్వేదం మరికొంత వివరణ ఇస్తూ పంటల్ని వ్యవసాయాధార పంటలు, వర్షాధార పంటలుగా విభజించింది. తైత్తిరీయ సంహిత చమకాధ్యాయం (4.7.5)లోని ‘ఓషధయశ్చ మే కృష్ణపచ్యం చ మే అకృష్ణపచ్చం చ మే...’ `నాకు దున్నిన పొలాల పండిన ఓషధులు, దున్నకపోయినా వర్షాధారంగా పండిన ఓషధులు లభించుగాక` మంత్రం ద్వారా వ్యవసాయ పంటల విభాగం వేదకాలం నాటికే ఉన్నట్లు స్పష్టమవుతోంది. వివిధరకాల పంటలు, ధాన్యాల పేర్లు కూడా చమకాధ్యాయంలో ఉన్నాయి. ‘వ్రీహయశ్చ మే యవాశ్చ మే మాషాశ్చ మే తిలాశ్చ మే ముద్గాశ్చ మే ఖల్వాశ్చ మే గోధూమాశ్చ మే మసురాశ్చ మే ప్రియంగవశ్చ మే...’ అంటూ సాగే మంత్రం వరి, యవలు, మినుములు, నువ్వులు, పెసలు, గోధుమలు, శెనగలు మొదలైన ధాన్యాల గురించిన ప్రస్తావన చేస్తుంది.
· ఇదే రుద్రాధ్యాయంలోని ‘నమస్తక్షభ్యో రథకారేభ్య:...’ ` అనే మంత్రంలో వడ్రంగులు, రథాలు, బళ్ళు తయారుచేసే కార్మికులకు నమస్కారం అంటూ వ్యవసాయదారులు, వ్యవసాయ సంబంధిత పనులు చేసే కార్మికుల ప్రస్తావన కనిపిస్తుంది. కేవలం ఆయా వృత్తిదారుల ప్రస్తావన మాత్రమే కాకుండా వారికి నమస్కరిస్తూ కార్మికులను సమున్నతంగా గౌరవించే సంప్రదాయాన్ని కూడా వేదం వ్యాప్తిలోకి తీసుకువచ్చింది.
· యజుర్వేదంలోని మైత్రాయణీ సంహితలో నెయ్యి, తేనెలను నాగేటిచాలు (నాగలి మొదలు)లో కుమ్మరించే ప్రక్రియ వివరంగా ఉంది. నాగలి కట్టాల్సిన ఎద్దుల సంఖ్య, వాటి నిర్వహణ కూడా ఇందులో ఉంది. తైత్తిరీయ సంహితలో ‘పరశు’ (గంపలాటి వస్తువు) అనే కొలపాత్ర ప్రస్తావన ఉంది.
· ఆపస్తంబ శ్రౌతసూత్రం, స్వాధ్యాయ బ్రాహ్మణం, తైత్తిరీయ సంహితల్లో వ్యవసాయానికి సంబంధించి భూమిని ఎన్నుకోవటం మొదలు, భూమిని ఎలా దున్నాలి (దర్శపూర్ణమాస ప్రకరణం), దున్నేందుకు ఎన్ని జతల ఎడ్లు ఉపయోగించాలి, ఎంత లోతు దున్నాలి మొదలైన విషయాలు అత్యంత వివరంగా వర్ణితమై ఉన్నాయి.
· శుక్ల యజుర్వేదంలో ఎత్తు పల్లాలు లేకుండా భూమిని చదును చెయ్యటం (12:69), బంజరు భూములను సాగులోకి తీసుకురావటం (16:33) మొదలైన విషయాల వివరణ ఉంది.
· అధర్వణవేదంలో (3.4.3) నాగలి కర్ర, చెర్నాకోల వంటి వ్యవసాయ పనిముట్ల తయారీ, వాటి నిర్వహణ విధానం కూడా వివరంగా ఉంది. ఇదే వేదంలోని 12.1.1 సూక్తాల్లో సుమారు 63 మంత్రాలు ఉన్నాయి. వివిధ రంగుల నేలలు, దున్నిన నేలలు, నివాసయోగ్యమైన నేలలు మొదలైన వ్యవసాయ అనుబంధ విషయాల ప్రస్తావ ఉంది. ఈ మంత్రాలు భూమిని ఓషధులకు తల్లిగా, ఆహారాన్నిచ్చేదిగా, ప్రాణులందరికీ శక్తినిచ్చేదిగా వర్ణించాయి.
· అధర్వణవేదంలో నేలదున్నటం, విత్తనాలు నాటడం, పంటలు కోయటం తదితర వ్యవసాయ సంబంధిత పనుల గురించిన ప్రస్తావన విస్తారంగా ఉంది. ‘యునక్త సీరా వియుగా తనోతకృతే / యోనౌ వపతేహ బీజం విరాజః సృష్టిః సభరా / ఆసన్నో నేదీయ ఇత్ స్మణ్యః పక్వయా యవన్...’ (అధర్వసంహిత, 3.17.2) ` నాగళ్ళు కట్టండి. విత్తనాలు వెదజల్లండి. కంకులు బరువెక్కుగాక. కొడవళ్ళు పండిన యవలను కోసి మా సమీపానికి తీసుకువచ్చు గాక అంటూ నాగలి కట్టే సమయం నుంచి పంటను ఇంటి తీసుకువచ్చే వరకు జరిగే మొత్తం వ్యవసాయ ప్రక్రియను ఈ మంత్రం వర్ణిస్తుంది.
· ఆధునిక వృక్షశాస్త్రం విజ్ఞానం వృక్షాలను రెండు రకాలుగా వర్గీకరిస్తే ప్రాచీనకాలం నాటి సుశ్రుత సంహిత వేల సంవత్సరాల క్రితమే మరింత లోతైన అధ్యయనం చేసి వృక్షాలను వనస్పతి, వృక్షం, వీరుంధం, ఓషధి అనే నాలుగు రకాలుగా వర్గీకరించింది. పూలు పూయకుండా ఫలాలు ఇచ్చేది వనస్పతి. పూలతో పాటు ఫలాలను ఇచ్చేది వృక్షం. గుబురుగా అల్లుకుంటూ పెరిగేది వీరుంధం. పళ్ళు పండగానే ఎండిపోయేది వృక్షం.
· మహాభారతం శాంతిపర్వంలోని భృగు, భరద్వాజ సంవాదం పూర్తిగా వృక్షాలకు సంబంధించిన వివరణలతోనే సాగుతుంది. వృక్షాలకు ప్రాణం ఉందని, వాటిలో కూడా పంచేంద్రియాలు పనిచేస్తాయని ఇందులో ఉంది. ఈ సంవాదంలోని ప్రతి శ్లోకంలో వృక్షవిజ్ఞానానికి సంబంధించిన అద్భుతమైన విషయాలు ఉన్నాయి. అందులోని ప్రధానాంశాలు... ఆకులు, బెరళ్ళు, పూలు, పళ్ళు కూడా వేడికి వాడిపోతున్నాయి. క్రమంగా రాలిపోతున్నాయి. కనుక చెట్లకు స్పర్శజ్ఞానం ఉంది. గాలి, నిప్పు, పిడుగు మొదలైనవాటి ధ్వనివల్ల పళ్లు, పూలు రాలిపోతున్నాయి. శబ్దాన్ని చెవి మాత్రమే గ్రహించగలదు. కనుక చెట్లకు వినే శక్తి ఉంది. తీగ చెట్టును పెనవేసుకుంటుంది. అన్ని వైపులకూ పాకుతుంది. చూపులేని వారికి గమనం ఎలా కుదురుతుంది. కనుక చెట్లకు చూసేశక్తి ఉంది. మంచి సువాసనలు మంచి ధూపాలూ ఉంటే చెట్లు రోగాలు లేకుండా ఏపుగా పూత పూస్తున్నాయి. దుర్వాసనలు, చెడు ధూపాలూ వుంటే అవి రోగగ్రస్తాలై పూత తగ్గుతుంది. కనుక చెట్లకు వాసన చూసే శక్తి ఉంది. చెట్లు వేళ్ళతో నీళ్ళు తాగటం కనిపిస్తోంది. వాటికి తెగుళ్ళు రావడం, మందులు వేస్తే తగ్గిపోవడం కనిపిస్తోంది. కనుక చెట్లకు రుచి చూసే శక్తి ఉంది. చెట్లలో సుఖమూ దుఃఖమూ కనిపిస్తున్నాయి. విరిచేస్తే మళ్ళీ మొలుస్తున్నాయి. కనుక చెట్లలో జీవాన్ని నేను చూస్తున్నాను. వాటికి చైతన్యం లేదనే మాటే లేదు. అందుకనే ఆ చెట్లు పీల్చిన జలాన్ని అగ్నివాయువులు జీర్ణింపచేస్తున్నారు. ఆహార పరిణామం వుంది గనుక చెట్లలో స్నేహ గుణమూ (చమురు గుణమూ) అభివృద్ధి కలుగుతున్నాయి. తామరతూడు వంటి గొట్టంతో మనం నీటిని పైకి ఎలా పీలుస్తామో అలాగే చెట్టు కూడా వాయు సహాయంతో తన వేళ్ళతో నీటిని పైకి పీలుస్తుంది. ఇలా భారత రచనాకాలం నాటికే వృక్షాలకు ప్రాణం ఉంటుందనీ, అన్ని జీవుల్లాగానే అవి కూడా స్పర్శ జ్ఞానం, శబ్ద జ్ఞానం,వాసన, రుచి వంటి అనుభవాలను గ్రహించగలవని తెలుస్తోంది.
· వేదాలకు అనుబంధంగా సాగే జ్యోతిషశాస్త్రంలో కూడా వ్యవసాయానికి సంబంధించిన వందలాది ప్రస్తావనలు కనిపిస్తాయి. కొత్త నాగలి కట్టడానికి, కోడెను కాడి కలపటానికి, బావి తవ్వటానికి, విత్తనాలు చల్లటానికి, పైరు కొయ్యటానికి... ఇలా వ్యవసాయ సంబంధమైన ప్రతి పనికీ నక్షత్ర, తిథి, వార, సమయాలను నిర్దేశిస్తుంది జ్యోతిష్యం. అలాగే, ఏడాది కాలంలో వర్షం ఎంత కురుస్తుంది, వాతావరణం ఏయే పంటలకు అనుగుణంగా ఉంటుంది, ఏయే ధాన్యాలకు ధరలు ఎలా పలికే అవకాశం ఉందనే విషయాల్ని పంచాంగం వివరిస్తుంది.
· కౌటిల్యుడి ‘అర్ధశాస్త్రం’, వరాహమిహిరుడి ‘బృహత్సంహిత’, శతపథ బ్రాహ్మణం (1.6.1.3), కాశ్యపీయ కృషిసూక్తి, సురపాలుడు రాసిన ‘వృక్షాయుర్వేదం’, చక్రపాణి రచించిన ‘విశ్వవల్లభం’ గ్రంథాల్లోనూ వ్యవసాయానికి సంబంధించిన వందలాది ప్రస్తావనలు ఉన్నాయి. కేవలం వ్యవసాయం మాత్రమే కాకుండా అందుకు అనుబంధమైన వివిధ వృత్తులు, ఆ వృత్తుల ద్వారా వ్యవసాయాన్ని నేర్పుగా ఎలా నిర్వహించాలో కూడా ఈ గ్రంథాల్లో ఉంది.
ఇవన్నీ ఒక ఎత్తయితే పరాశర మహర్షి రాసిన ‘కృషి పరాశరం’ ఒక్కటీ ఒక ఎత్తు. వ్యవసాయానికి సంబంధించినంత
వరకు ఇదే తొలి పూర్తిస్థాయి గ్రంథమని పరిశోధకులు అంగీకరిస్తున్నారు. క్రీ.పూ.4వ శతాబ్దం నాటి ఈ గ్రంథంలో చెప్పని వ్యవసాయ విధానం లేదు. ప్రత్యేకంగా గంగ, కావేరీ నదుల మధ్య ప్రాంతంలోని భూముల స్వభావాన్ని బట్టి ఎలా సాగు చెయ్యాలో ఈ
గ్రంథం వివరించినంతగా మరెక్కడా లేదు. ఈ గ్రంథం వెలుగు చూడటం వెనుక ఆసక్తి కరమైన
కథనం ఉంది.
ఓసారి విశ్వామిత్ర మహర్షి తన శిష్యులు, ఇతర మందీమార్బలంతో వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వస్తాడు. ముందస్తు సమాచారం లేకపోయినా అందరికీ క్షణకాలంలోనే కమ్మటి పిండివంటలతో భోజనం ఏర్పాటుచేస్తాడు వశిష్ఠుడు. ఇదెలా సాధ్యమైందంటూ విస్తుపోతాడు విశ్వామిత్రుడు. కామధేనువు వల్లే ఈ శక్తి వశిష్ఠుడికి వచ్చిందని తెలుసుకుని ఆ ధేనువును తనకు ఇవ్వాలని వశిష్ఠుడిని అడుగుతాడు. అతడు ఒప్పుకోడు. కొంతకాలం తర్వాత వశిష్ఠుడు ఇంట్లో లేని సమయం కనిపెట్టి అతని ఆశ్రమం మీద దాడి చేసి, వశిష్ఠుడి 100 మంది పుత్రుల్ని చంపేస్తాడు విశ్వామిత్రుడు. ఆ సమయంలో వశిష్ఠుడి కుమారుల్లో ఒకరి భార్య అయిన శక్తి గర్భవతిగా ఉంటుంది. కొంతకాలానికి ఆమెకు పరాశరుడు జన్మిస్తాడు. తన వంశాంకురమైన పరాశరుడికి వశిష్ఠుడు సకల విద్యలతో పాటు వ్యవసాయ విజ్ఞానాన్ని కూడా బోధిస్తాడు. ఈ విజ్ఞానాన్ని అందరికీ చేరువ చెయ్యాలనే సంకల్పంతో పరాశరుడు దీన్ని గ్రంథస్తం చేస్తాడు. ఇదే కృషి పరాశర గ్రంథంగా ప్రపంచ ప్రసిద్ధి పొందింది.
· సీతాదేవి ఆవిర్భావం కూడా వ్యవసాయంతో ముడిపడి ఉంది. యజ్ఞం కోసం అవసరమైన భూమిని తవ్వుతున్న సమయంలో నాగేటి చాలుకు తగిలిన పేటికలో సీతాదేవి జనక మహారాజుకు లభించింది. ఆవిధంగా సీతాదేవి అయోనిజ, భూమిజ అయ్యింది.
·
బలరాముడి ఆయుధం నాగలి. తన భుజాల మీద ఎప్పుడూ నాగలి మోసేవాడు. కేవలం వ్యవసాయ
పరికరంగా కాకుండా దైవీకమైన వస్తువుగా నాగలి ఔచిత్యాన్ని బలరాముడు గుర్తించాడు.
కృషి పరాశరంలో చెప్పిన వ్యవసాయ సూత్రాలు /
విధానాలు
·
పొలం దున్నటానికి నలుపు, ఎరుపు రంగులో ఉండే ఎడ్లు శ్రేష్ఠమైనవి. కొమ్ము
విరిగిన ఎడ్లను వ్యవసాయానికి వినియోగించకూడదు.
·
పొలం దున్నే సమయంలో కాడికి ఆరు నుంచి ఎనిమిది ఎడ్లు వినియోగించాలి. పొలం
విస్తీర్ణం పెరిగే కొద్దీ ఎడ్ల జతల సంఖ్యను పెంచాలి.
·
నాగలి కర్రకు తేనె, నెయ్యి పూయాలి. కాడి కట్టే సమయంలో ఎడ్ల
మెడభాగంలో నెయ్యి పూయాలి.
·
మొదట భూమిని పాము ఆకారంలో దున్నాలి. భూమి యజమాని మొదట దున్నిన తర్వాతనే ఇతరులు
దున్నాలి.
·
సోమ, బుధ, గురు, శుక్రవారాల్లో దున్నితే పంట మంచి దిగుబడి
ఇస్తుంది. నెలలో 2, 3, 5, 7, 10, 11, 13 రోజులు పొలం దున్నటానికి మంచి రోజులు. ఎనిమిదో
రోజు దున్నితే ఎడ్లకు ప్రమాదం. తొమ్మిదో రోజు దున్నితే పంటకు నష్టం. నాలుగో రోజు
దున్నితే పురుగుపడుతుంది. 14వ రోజు దున్నితే యజమానికి ప్రమాదం.
·
దున్నే సమయంలో ఎడ్లు మూత్రం విసర్జించినా,
పేడ వేసినా చాలా మంచిది.
·
వర్షం కురిసే సమయాన్ని అంచనా వేసుకుంటూ అందుకు తగినవిధంగా ఏయే పంటలు వెయ్యాలో
నిర్ణయించుకోవాలి.
·
చెట్లు బాగా పెరగానికి ‘పాలు పొయ్యాలి’. మనుషుల తీరులోనే మొక్కలకు
కూడా వాత, పిత్త, కఫాలకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. వీటిని
ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి.
·
విత్తనాలు చల్లటం మొదలు పంటను ఇంటికి తీసుకువెళ్లే వరకు ముహూర్తాల ఆధారంగా
మంచి రోజులు చూసుకుని పనులు ప్రారంభించాలి.
·
సమాన ఆకారంలో ఉన్న విత్తనాలు మంచి దిగుబడిని ఇస్తాయి. కాబట్టి, ఈ తరహా విత్తనాలను ఎప్పుడూ నిల్వచేసుకోవాలి.
·
విత్తనాల సంచులను పుట్టలు, చీమల బొరియల మీద ఉంచకూడదు.
·
మాఘ ఫాల్గుణ మాసాల్లో విత్తనాలు ఎండబెట్టాలి. విత్తనాలను ఎండబెట్టేటప్పుడు
నేరుగా నేలమీద ఉంచకూడదు. ఏదైనా వస్త్రం మీద విత్తనాలు వేసి ఎండబెట్టాలి.
·
పొలంలో నిత్యం ఉదయం గం.9 లోపుగా మఋత్యుంజయ హోమం నిర్వహించాలి.
·
కార్తికమాసం తొలి రోజున ఎడ్లను అలంకరించి,
వాటిని ఊరంతా తిప్పాలి.
దీనివల్ల వాటిలో ఉండే విపరీత శక్తి పోతుంది.
·
విత్తనములు వృక్షరూపములో పెద్దవైన తరువాత వాటిని తీసివేయరాదు. ఫలితాన్ని
ఇవ్వవు.
·
శ్రావణములో హస్త ప్రమాణ దూరంలో భాద్రపదంలో హస్తానికి ప్రమాణానికి సగం దూరంలో , కన్యలో నాలుగంగుళాల దూరంలో పంటలను నాటవలెను.
·
భాద్రపదమాసం వచ్చేసరికి పొలంలోని నీటిని బయటకు వదలాలి. కేవలం వరి మొక్క
మొదలులో మాత్రమే నీరు ఉండేట్టు చెయ్యాలి.
·
మార్గశిర మాసంలో ఏదైనా శుభ ముహూర్తం చూసుకుని పంట కొయ్యటం ప్రారంభించాలి.
మొదటగా కోసిన పంటకు దేవతా స్వరూపంగా అర్చనలు చెయ్యాలి. ఆ తర్వాత ఈశాన్య భాగం నుంచి
పంట కొయ్యటం ప్రారంభించాలి.
·
కోసిన ధాన్యపు కట్టను శిరస్సుపైన ఉంచి దారిలో ఎవరిని ముట్టుకోకుండా రైతు
మౌనంగా ఇంటికి రావాలి. ఇంట్లో ఉన్న గదిలో ఏడడుగులు నడిచి తూర్పుదిశలో ధాన్యపు
కట్టను ఉంచాలి.
·
ధాన్యాన్ని కొలిచే ‘అడక’ను మామిడి లేదా పున్నాగ కర్రతో తయారుచెయ్యాలి. ధాన్యము
కొలిచే ఆడకము ఆకారములో పన్నెండు అంగుళములు ఉండవలెను . ఆడకముతో ధాన్యపు రాశిని
ఎడమవైపు నుండి కొలవవలెను. దక్షిణము నుండి ధాన్యమును కొలిచిన వ్యయకారకం అగును.
ఎడమవైపు నుండి కొలిచిన ధాన్యము వృద్ధిని పొందును.
·
హస్త, శ్రవణ, ధనిష్ట, మృగశిర, శతబిషం ,
పుష్యమి, రేవతి , రోహిణి ,
భరణి, మూల, ఉత్తరాత్రయం , మఘ , పునర్వసు నక్షత్రములలో గురు, శుక్ర, సోమవారాలలో సూర్యుడు మీనలగ్నములలో ఉన్నప్పుడు ధాన్యస్థాపనం
చెయ్యాలి. నిధన సమయములు అనగా ఆది, మంగళ, శని, బుధవారములలో ధాన్యస్థాపనం చేయకూడదు.
ధాన్యస్థాపనం అనగా పండిన ధాన్యాన్ని నిలువచేయడం .
===========================================
రచన :
డాక్టర్ కప్పగంతు రామకృష్ణ,