Thursday, December 6, 2018

గోదాదేవి మధురభక్తి, ఆమె రచించిన తిరుప్పావై పాశురాల్లోని ఆధ్యాత్మిక విశేషాలు వివరిస్తూ ఈనాడు దినపత్రికలో రాసిన వ్యాసం


గోదాదేవి మధురభక్తి, ఆమె రచించిన తిరుప్పావై పాశురాల్లోని 

ఆధ్యాత్మిక విశేషాలు వివరిస్తూ ఈనాడు దినపత్రికలో

డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr Kappagantu Ramakrishna) రాసిన వ్యాసం


మధురభక్తి మూర్తి ... గోదాదేవి

--------------------

            శ్రీకృష్ణా! నాకు తల్లి, తండ్రి, స్నేహితులు, బంధువులు.. ఒకటేమిటి, అన్నీ నీవే. బంధుత్వాలన్నీ నీతోనే. ఈ ఒక్క జన్మలోనే కాదు... అన్ని జన్మల్లోనూ నీ చెలిమే కావాలి. నీ నామం గానం చేస్తూ, నీ మాటలే పలుకుతూ, నీ సుందరాకృతినే చూస్తూ, తనువు, మాట, మనసు... అన్నిట్లోనూ నీవే నిండిపోవాలి. అంతిమంగా నీలోనే ఐక్యం చెందాలి. ఇంతకన్నా నాకు మరే కోరికా లేదు స్వామీ! అంటూ పరిపూర్ణమైన ఆర్ద్రత నిండిన మనసుతో శ్రీకృష్ణపరమాత్మను అర్చించిన మధురభక్తి మూర్తి గోదాదేవి.

    శ్రీరంగనాథుడిని వలచి, ఆయన్ను చేరటానికి నవవిధ భక్తిమార్గాల్లో గానమార్గాన్ని ఎంచుకుని, తాను తరించటంతో పాటు మనల్నందరినీ తరింపజేస్తున్న చరితార్థురాలు ఆమె. 'మాసానాం మార్గశీర్షోహం' అని చెప్పిన కృష్ణ పరమాత్మ వాక్యాన్ని అనుసరించి, పవిత్ర మార్గశిరమాసంలో 'తిరుప్పావై' పాశురాలను రచించి, గానం చేసి శ్రీకైవల్యపదాన్ని చేరుకుంది.

            గోదాదేవి రాసిన పాశురాలు కేవలం గీతాలు కాదు. దైవచింతన కోసం, కర్తవ్య నిర్వహణ కోసం మనల్ని నిద్రలేపే చైతన్యదీపాలవి. ఒక్కో పాశురం ఒక్కో అమృత గుళిక. కణుపు కణుపుకీ చెఱకుగడ తీపి పెరిగుతుందన్నట్లు మొదటి పాశురం నుంచి ప్రారంభించి, ఒక్కో పాశురం చదువుతుంటే, మనకు తెలియకుండానే మనసు పరమాత్మ పాదాల మీద వాలుతుంది. అంతటి, మధురభక్తి పూరితాలుగా పాశురాలను తీర్చిదిద్దింది గోదాదేవి.

            ఆమె రాసిన పాశురాలు మొత్తం ముప్ఫై. కాగా, మొదటి ఐదు ఉపోద్ఘాతం లాంటివి. తిరుప్పావై ప్రాధాన్యతను ఇవి తెలియజేస్తాయి. భగవంతునికి చేసే అర్చన, నివేదనతో సహా అన్ని ఉపచారాల్లో ఆడంబరాలు అవసరం లేదని, చిత్త శుద్ధి ఉంటే భగవంతుడు సంతోషిస్తాడని ఈ పాశురాల్లో చెబుతుంది. భగవదారాధన వల్ల వానలు సమృద్ధిగా కురుస్తాయని, పంటలు నిండుగా పండుతాయని, దేశం సుభిక్షంగా ఉంటుందని ఈ పాశురాల్లో చెబుతుంది.

            తర్వాతి పది పాశురాల్లో చెలులతో కలసి, శ్రీరంగనాథుడిని సేవించటానికి గోదాదేవి వెళ్తున్న సన్నివేశాల వివరాలు వర్ణితమై ఉన్నాయి. పక్షుల కిలకిలారావాలు, అప్పుడే వికసిస్తున్న పూబాలలు, దేవాలయంలో వినిపించే చిరుగంటల ధ్వని, లేగదూడలు 'అంబా' అంటూ చేసే అరుపులు, వాటి మెడలోని గంటల సవ్వడి మొదలైన మనోహర ప్రకృతి దృశ్యాల వైభవం వీటిలో కనిపిస్తుంది.

            పదిహేను నుంచి ఇరవయ్యో పాశురం వరకు గోదాదేవి, చెలులతో కలసి చేసిన దేవాలయన సందర్శన విశేషాలతో నిండి ఉంటాయి. కపట నిద్ర విడిచి, లోకాల్ని కాపాడటానికి మేలుకోవయ్యా అంటూ రంగనాథుడికి సుప్రభాతం వినిపిస్తుంది ఈ పాశురాల్లోనే. కృష్ణుడి అష్టమహిషుల్లో ఒకరైన నీలాదేవి ప్రార్థన కూడా వీటిలోనే ఉంటుంది.

            చివరి తొమ్మిది పాశురాలు పూర్తిగా భగవద్విలాసాన్ని ప్రకటిస్తాయి. నిష్కల్మష హృదయంతో తన హృదయాన్ని రంగనాథుడికి అర్పించుకుంటుంది గోదాదేవి. చివరి పాశురంలో ఫలశృతి చెబుతూ, ఎవరైతే ఈ పాశురాలు గానం  చేస్తారో, వారికి భగవత్కృప తప్పక కలుగుతుందని చెబుతుంది.

            కేవలం భక్తితోనే పాశురాలు నిండిపోలేదు. అసమాన సాహితీ పాండిత్యాన్ని కూడా గోదాదేవి తన పాశురాల్లో ప్రకటించింది. అంతకుముందు ఏ కవీ ఉపయోగించని అపురూప ఉపమానాలు ఆమె పాండిత్య ప్రౌఢిని ప్రకటిస్తాయి. సందర్భానికి తగిన శబ్దసౌందరం, అలంకార శోభ పాశురాల్ని కలకండ ముద్దల్లా అమృతమయం చేసాయి.

            'ఓంగి యులగళన్ద ఉత్తమన్‌ పేర్పాడి / నాంగళ్‌ నమ్బావైక్కుచ్చాట్రి నీరాడినాల్‌ ...' అనే పాశురంలో సాహిత్యం యొక్క పరమార్థాన్ని గోదాదేవి ప్రకటించింది. ఏడాదికి మూడు పంటలు పండాలి. గోవులు పాలను సమృద్ధిగా ఇవ్వాలి. సరిపడినంత వాన కురవాలి. అసలు ఎక్కడా, ఎందులోను 'లేదు' అనే పదం వినిపించకూడదు. స్వామీ! ఈ లోకాన్ని చల్లగా చూడు అంటూ ప్రార్థిస్తుంది ఈ పాశురంలో. 'సహితస్య భావం సాహిత్యం' - సమాజానికి హితాన్ని చేకూర్చేదే సాహిత్యం అని అలంకార శాస్త్రవేత్తలు చెప్పినట్లు, తన సాహిత్యం ద్వారా సమాజహితాన్ని కాంక్షించి, ఉత్తమ సాహితీమూర్తిగా గోదాదేవి సాక్షాత్కరిస్తుంది.

            ఒకసారి మత్స్యమూర్తిగా, మరొకసారి కూర్మరూపంలో, ఇంకోమారు ఆదివరాహమూర్తిగా, నరసింహుడిగా, చిరవగా పరిపూర్ణ మానవుడిగా అవతరించిన స్వామి అవతారాల పరమార్థం కూడా ఈ పాశురంలో కనిపిస్తుంది. భగవంతుడి సర్వవ్యాపకత్వం ఇందులో ద్యోతకమవుతుంది. సకల జంతుజాలమంతా పరమాత్మ అవతార విశేషమే అనే భావన గోదాదేవి ఈ పాశురంలో విస్పష్టంగా ప్రకటిస్తుంది.

            'నోట్రుచ్చువర్కమ్‌   పుహిగిన్రవమ్మనాయ్‌ / మాట్రముమ్‌ తారారో వాశల్‌ తిరవాదార్‌...' అనే పాశురంలో గోదాదేవి నీలాదేవిని నిద్రలేపుతుంది. కాదు.. కాదు.. నీలాదేవి పేరుతో అజ్ఞానమనే మాయకు లోబడిన మన మనసుల్ని నిద్రలేపుతుంది. 'నిద్ర పోవటంలో కుంభకర్ణుడు నీతో ఓడిపోయి, అందుకు ప్రతిగా తన సొత్తయైన నిద్రను నీకు శుల్కంగా ఇచ్చాడా ఏమి? ఇక నిద్రలేవమ్మా నీలాదేవీ!' అంటూ ఇంద్రియాలేవీ పనిచేయక, మనసు భగవదధీనమై, ఏకేంద్రియావస్థలో ఉన్న గోపికను నిద్రలేవమ్మా అంటూ పరాచికాలాడుతుంది. ఇది బాహ్యంగా కనిపించే అర్థం. కానీ, తరచిచూస్తే... మనసుల్ని కమ్మిన మాయను తొలగించుకుంటేనే కానీ, భగవంతుని చేరుకోలేమన్న అంతరార్థం బోధపడుతుంది.

            మనిషి మాయాబద్ధుడిని చేసి, మదమాత్సర్యాలని పెంచే శత్రువు 'సంపద'. మితిమీరిన సంపద మనిషిని భగవంతుడి నుంచి దూరం చేస్తుంది. కాబట్టి, ఎంత సంపద ఉన్నా భగవంతుడి సేవకు దూరం కాకూడదు. ఇందుకు స్వీయజాగృతే మార్గం అంటూ సంపన్నురాలైన ఓ గోపాలుడి సోదరిని నిద్రలేపుతున్న మిషతో మనందరికీ జ్ఞానబోధ చేస్తుంది గోదాదేవి. 'కనెత్తిళం కట్రెరుమై కన్రుక్కిరంగి / నినైత్తుములై వళియే నిన్రుపాల్‌ శోర...' అనే పాశురం ఇందుకు నిదర్శనం. కంచెర్ల గోపన్న కూడా తన దాశరథీ శతకంలో 'సిరి గలనాడు మైమరచి, చిక్కిన నాడు తలంచి, పుణ్యముల్‌ పొరిపొరి చేయనైతినని పొక్కిన గల్గునే..' అంటూ సంపద మాయలో మునిగి, భగవదారాధన మర్చిపోవద్దని హెచ్చరిస్తాడు. గోదాదేవిలోనూ ఇదే దార్శనికత కనిపిస్తుంది.

            మొత్తంగా తన పాశురాల్లో గోదాదేవి ఎక్కడా మెట్టవేదాంతాన్ని వల్లించలేదు. ఏది మంచో? ఏది చెడో? వివేచన చేసుకోమని హెచ్చరించింది. మహర్షులైన వారి మార్గదర్శనం తీసుకోమని సూచించింది. 'కీళ్‌ వానమ్‌ వెళ్ళెన్రు ఎరుమై శిరువీడు / మేయ్‌ వాన్‌ పరన్దనకాణ్‌ మిక్కుళ్ళ పిళ్ళైగళుమ్‌... ' అనే పాశురంలో ఈ సందేశం కనిపిస్తుంది. భగవత్స్వేకు తొందరపడాలి. క్షణం వృథా చేసినా, మన సాధన తగ్గిపోతుంది. మనకు మనంగా భగవంతుని పాదాల మీద వాలితే, ఆయనే స్వయంగా మనల్ని ఆదరిస్తాడు. కరుణిస్తాడు. అంతిమంగా తనలో చేర్చుకుంటాడని ఈ పాశురం బోధిస్తుంది.

            'కీశు కీశున్రెజ్ఞుమానై చాత్తకలన్దు / పేశిన పేచ్చరవమ్‌ కేట్టిలైయో! పేయ్‌ ప్పెణ్ణే!...' అనే పాశురంలో ప్రకృతి శోభ ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. భరద్వాజ పక్షులు చేసే కీచు శబ్దాలు, గొల్లభామ చేతి కంకణాల ధ్వనులు, మంగళసూత్రాల మంగళధ్వనులు, మంచు దుప్పుటి కప్పుకున్నట్లున్న పంటభూములు... అమోఘం. ఇలాంటి గ్రామంలో నివసించే గోపికను పరమాత్మ సేవకు మేల్కొలుపుతుంది గోదాదేవి ఈ పాశురంలో.

            పల్లెల్లో నివసించినా, పట్టు పరుపుల మీద పడుకున్నా... పరమాత్మ సేవలో తరిస్తేనే జన్మకు సార్థకత అంటూ 'మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి యొకటే / చండాలుడుండేటి సరి భూమి యొకటే' అనే అన్నమయ్య తత్త్వాన్ని కూడా గోదాదేవి ఈ పాశురంలో ప్రకటిస్తుంది.

            మొత్తంగా తిరుప్పావై పాశురాలు ఆత్మను పరమాత్మ సన్నిధికి చేర్చే వాహకాలు. సగుణోపాసన ద్వారా నిర్గుణోపాసనకు మార్గం చూపే దారి దీపాలు. అంతిమంగా 'శ్రీకైవల్య పదానికి' చేరుకునే పరమపద సోపానాలు.
---------------------------




డాక్టర్‌ కప్పగంతు రామకృష్ణ,
ఆంధ్రోపన్యాసకులు
ఎస్‌.ఆర్‌.ఎస్‌.వి.కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, 
గాంధీనగర్‌
విజయవాడ -520 003. 
సెల్‌: 90320 44115 / 8897 547 548

 

 

 

           

 

            


Tuesday, October 23, 2018

వాల్మీకి మహర్షి గురించి డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr Kappagantu Ramakrishna) రాసిన వ్యాసం

వాల్మీకి హృదయం




రామకథ... ఏనాటి యుగాల నాటి కథ. ఇప్పటిదా? అవును... ఇప్పటిదే. నాటికీ, నేటికీ, మరి ఏనాటికీ రామకథ నిత్యనూతనంగానే ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా లిపి ఉన్న ప్రతి భాషలో రామాయణం అక్షరాకృతి పొందింది. కేవలం వాగ్రూపంలో ఉన్న భాషల్లో కూడా రామకథ జానపద సాహిత్యంగా ప్రకాశిస్తోంది. గత వెయ్యి సంవత్సరాల కాలంలో మనదేశంలో కొన్ని వందల రామాయణాలు వచ్చాయి. రామాయణం వెలువడని భారతీయ భాష లేదు. 

ఉత్తర భారతంలో తులసీ రామాయణం, తమిళదేశంలో కంబ రామాయణం నిత్యపారాయణ గ్రంథాలు. తెలుగులో వచ్చిన రామాయణాలకు లెక్కలేదు. రంగనాథ రామాయణం, మొల్ల రామాయణం, భాస్కర రామాయణం, గోపీనాథ రామాయణం... ఈ వరుసకి అంతులేదు. ఆధునిక కాలంలో కూడా శ్రీనివాస శిరోమణి, యామిజాల పద్మనాభస్వామి, ఉషశ్రీ, జనమంచి శేషాద్రిశర్మ మొదలైన వారెందరో రామకథ రాసి మురిసిపోయారు. ఇక, 'కవిసమాట్ర్‌' విశ్వనాథ సత్యనారాయణ సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 'కవితా రూప తపస్సు' చేసి మరీ రామాయణ కల్పవృక్షం రాసానని చెప్పుకున్నారాయన. అన్నమయ్య, త్యాగయ్య, కంచర్ల గోపన్న మొదలైన వాగ్గేయకారులూ తనివితీరా రామభక్తి సామ్రాజ్యంలో మునిగితేలారు. 

జానపదులైతే రాములోరు, సీతమ్మ తల్లి, లక్ష్మణదేవర అంటూ తమలో ఒకరిగా రామయ్య కుటుంబంతో చుట్టరికాలు కలిపేసుకున్నారు. ఊర్మిళాదేవి నిద్ర, లక్ష్మణదేవర నవ్వు వంటి ఎన్నో ప్రసిద్ధ జానపద గేయాలతో రామకథ జానపదుల గుండెల్లో నిరంతరం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. 

రామకథకు ఎల్లలు లేవు. భాష, ప్రాంతీయ, కుల, మత, వర్గ, లింగ, స్థాయీ భేదాలు లేవు. ఏమిటీ రామకథ మహత్తు? అసలు రామాయణానికి ఎందుకింత ప్రాచుర్యం వచ్చింది? రామాయణ కథ రాసిన కవి అంత గొప్పవాడా? ఆయన ప్రత్యేకత ఏమిటి? యజ్ఞయాగాదులు చేసాడా? పురాణాలు ఔపోసన పట్టాడా? అసలు ఈ కథ రాయాలని ఆయనకు ఆలోచన ఎందుకు వచ్చింది? 

ఈ ప్రశ్నలన్నిటికీ ఒకటే సమాధానం. సమాజంలో అడుగంటిపోతున్న సనాతన ధర్మాన్ని సముద్ధరించటానికి ఓ జీవుడు పడిన ఆవేదనకు అక్షర రూపంగా, ధర్మం పునాదిగా రామకథ రూపుదిద్దుకుంది. ఎవరా జీవుడు? అతడే వాల్మీకి. ఈయన ఎక్కడివాడు? జీవిత చరిత్ర ఏమిటి? పూర్వ జన్మ ఏమిటి? ఇటువంటి విషయాల మీద అనేక చర్చలు సమాజంలో ఉన్నాయి. ఇప్పటికీ ఈ విషయాల గురించి పరిశోధకుల మధ్య ఏకాభిప్రాయం రాలేదు. ఈ చర్చ వదిలేద్దాం. 

ఎక్కడి వాడైనా, ఏ చరిత్ర కలవాడైనా, యావత్ప్రపంచ చరిత్రలో నూతన శకాన్ని సృష్టించిన ప్రతిభా సంపన్నుడు వాల్మీకి. మూగదైన పక్షి పడిన ఆవేదన తనదిగా భావించాడు. ధర్మమార్గం విడిచిన యావజ్జాతి ఆవేదనగా భావించాడు. అందుకే తిరిగి ధర్మాన్ని ఈ సమాజంలో సముద్ధరించాలని సంకల్పించాడు. 

'విగ్రహవాన్‌ ధర్మ:' అని ప్రశసంలు అందుకున్న 'రామ' పాత్రని సృష్టించాడు. జాగ్రత్స్వప్న సుషుప్తుల్లో కూడా అణుమాత్రమైనా విడిచిపెట్టకుండా ధర్మాన్ని ఆచరించిన వ్యక్తి ఎవరంటే, ప్రపంచమంతా ముక్తకంఠంతో 'రాముడు' అని సమాధానం చెప్పేలా రామ పాత్రని తీర్చిదిద్దాడు. 

రామాయణ ప్రారంభంలోనే తన రాముడు ఎలాంటి వాడో వాల్మీకి చెప్పాడు.

కోన్వస్మిన్‌ సాంప్రతం లోకో గుణవాన్‌ కశ్చ వీర్యవాన్‌
ధర్మజ్ఞశ్చ, కృతజ్ఞశ్చ, సత్యవాక్యో ధృఢవ్రత:
చారిత్రేణ చ కో యుక్త: సర్వభూతేషు కో హిత:
విద్వాన్‌ క:, క: సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శన:
ఆత్మవాన్‌ జితక్రోధో ద్యుతిమాన్‌ కోనసూయక:
కస్య బిభ్యతి దేశాశ్చ జాత రోషస్య సంయుగే

గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మవర్తనుడు, కృతజ్ఞత కలిగిన వాడు, సత్యవాక్సంపన్నుడు, నిశ్చల బుద్ధి కలవాడు, సత్ప్రవర్తన కలిగినవాడు, అన్ని ప్రాణుల యందు దయ కలిగినవాడు, విద్వత్తు కలిగినవాడు, సకల కార్య నిర్వహణ సమర్థుడు, చూపులతోనే సంతోషాన్ని కలిగించేవాడు, ఆత్మవంతుడు, క్రోధం లేనివాడు, ప్రకాశవంతమైన వర్చస్సు కలిగినవాడు, అసూయలేనివాడు, దేవతలకు కూడా గౌరవప్రదమైనవాడు, పౌరుష పరాక్రమాలు కలిగినవాడు - ఇన్ని సుగుణాల రాశి కనుకనే రామయ్య లోకారాధ్యుడయ్యాడు. 
తన కథానాయకుడిని మేలిమి గుణాల కలయికగా తీర్చిదిద్దాడు వాల్మీకి. ఇక్కడే వాల్మీకి హృదయ ఔన్నత్యం స్పష్టమవుతుంది. 
'స హితస్య భావం సాహిత్యం' - సమాజానికి మేలు చేకూర్చేదే సాహిత్యం అని ఆర్యోక్తి. ఊహాజగత్తులో విహారం చేయకుండా, సమాజ సముద్ధరణకు ఎలాంటి సాహిత్యం కావాలో, అచ్చంగా అలాంటి సాహిత్యాన్ని, ఉత్తమమైన కథనాయకుడి పాత్ర ద్వారా సృష్టించాడు వాల్మీకి. అందుకే వాల్మీకిది సామాజిక హృదయం.  మాటలతో కాకుండా చేతలతో తన కథానాయకుడిగా ధర్మాచరణ చేయించాడు వాల్మీకి. 

''సర్వే జ్ఞానోప సంపన్నా: సర్వే సముదితా గుణై:
తేషా మపి మహారాజా రామ: సత్యపరాక్రమ:''
''ధనుర్వేదేచ నిరత: పితు: శుశ్రూషణే రత:''


తన కథానాయకుడు సత్య పరాక్రమం కలిగిన వాడు కావాలని వాల్మీకి కోరుకున్నాడు. ప్రపంచంలోని మరే ఇతర కవి ఈ భావాన్ని ప్రకటించలేదు. మనిషికి ఎంతటి పరాక్రమం ఉన్నా, అతడు సత్య, ధర్మాలకు అనుగుణంగానే తన పరాక్రమాన్ని ప్రదర్శించాలి. ఎంతటి యోధుడైనా, తల్లిదండ్రుల సేవ విడిచిపెట్టకూడదు - ఇదీ వాల్మీకి సత్య హృదయం.

జయించటానికి దేవతలకు సైతం వీలుపడని గొప్ప రాజ్యం 'అయోధ్య'కు రాజైనా, సాక్షాత్తు శ్రీమహావిష్ణు స్వరూపం అని తోటివారు, ప్రజలంతా తనను కొలుస్తున్నా, ధర్మసంరక్షణలో కేవలం సాధారణ మానవుడిగా రాముడు ప్రవర్తించాడు. 'ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం' - నేను సామాన్య మానవుడిని. దశరథ మహారాజు కుమారుడిని మాత్రమే అని దేవతలకే రాముడు విస్పష్టంగా చెప్పాడు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్త్వం వాల్మీకిది. తన రాముడిని అలాగే తీర్చిదిద్దాడాయన. సమాజ సభ్యుడిగా సాటి మానవులతో ఎలా మెలగాలో ఆచరించి చూపించాడు. అందుకే వాల్మీకిది మానవ హృదయం.

ప్రియాతి ప్రియమైన భార్యా వియోగ దు:ఖంలో ఉన్నా శరణు వేడిన సుగ్రీవుడికి అభయం ఇచ్చాడు. యుద్ధ ప్రణాళికా రచనలో తలమునకలై ఉన్నా, ఆశ్రయం కోరి వచ్చిన విభీషణుడికి శరణాగతి ప్రసాదించాడు. వారు, వీరనే భేదం లేదు... 'అభయం సర్వ భూతేభ్యో దదామి, ఏతత్‌ వ్రతం మమ' స్వయంగా రావణుడే వచ్చి శరణు కోరితే, అతడికి సైతం అభయ ప్రదానం చేస్తాను. ఇది నా నియమం అని విస్పష్టంగా ప్రకటిస్తాడు రాముడు. వాల్మీకి హృదయం భూతదయకు నిలయం. లేకపోతే క్రౌంచపక్షుల దు:ఖాన్ని తానెందుకు అనుభవిస్తాడు? ఇదే తీరు రాముని పాత్రలో ప్రతిఫలించింది.

వనవాసానికి బయలుదేరిన కుమారుడికి కౌసల్య చేసిన హితబోధ - 'స వై రాఘవ శార్దూల ధర్మస్త్వామభి రక్షంతు' - రామా! ధర్మాన్ని కాపాడమని చెప్పిందే కానీ అరణ్యంలో తన బిడ్డ ఎన్ని కష్టాలు పడతాడో అని కౌసల్య బాధ పడలేదు. ఎందుకంటే తన బిడ్డని శార్దూల అని సంబోధిస్తూనే అతడి పరాక్రమం ఏమిటో గుర్తుచేసింది. ఎంతటి కష్టమైనా ధర్మమార్గం విడిచిపెట్టకూడదు. 

జనస్థానంలో జరిగిన విధ్వంసానికి రావణుడు అగ్ర¬దగ్రుడై, సీతాపహరణ విషయంలో తనకు తోడు రమ్మని మారీచుడిని అడుగుతాడు. రాముడి శక్తి, సామర్థ్యాలు ఎంతటివో రుచి చూసినవాడు మారీచుడు. అందుకే 'రామో విగ్రహవాన్‌ ధర్మ:, సాధు: సత్య పరాక్రమ:, రాజా సర్వలోకస్య దేవానామివ వాసవ:' - రావణా! రాముడు మూర్తీభవించిన ధర్మ స్వరూపుడు. సత్య పరాక్రమం కలిగినవాడని మారీచుడు హితోపదేశం చేస్తాడు. సత్య,ధర్మాలు కలిసిన పరాక్రమానికి శక్తి అపరిమితం. అజేయమనే విషయాన్ని మారీచుడి పాత్ర ద్వారా వాల్మీకి చెప్పించాడు. 

మాయా యుద్ధంతో లక్ష్మణుడిని ఇంద్రజిత్తు ముప్పతిప్పలు పెడుతున్నాడు. చివరగా లక్ష్మణుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. 'ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది, పౌరుషేచాప్రతిద్వంద్వ: శరైరం జహి రావణం' - నా అన్నగారైన శ్రీరామచంద్రమూర్తి సత్య, ధర్మాలకు నిలయమైన వాడైతే, ఈ అస్త్రం ఇంద్రజిత్తును సంహరించుగాక అంటూ బాణ ప్రయోగం చేసాడు. మరుక్షణంలో ఇంద్రజిత్తు నేలకూలాడు. సత్య, ధర్మాలు కలిస్తేనే అస్త్రాలకైనా శక్తి వస్తుందనే విషయం ఈ సందర్భంలో సుస్పష్టంగా ప్రకటితమవుతుంది. 

ఒకటా, రెండా..? మొత్తం రామాయణంలో పదుల సంఖ్యలో వాల్మీకి రాముడి సత్య, ధర్మ పరాక్రమాల గురించి ప్రస్తావిస్తాడు. కారణం - వాల్మీకి హృదయం సత్య, ధర్మాలకు నిలయం. 

రామ రావణ యుద్ధం ముగిసింది. విభీషణుడు లంకాధిపతి అయ్యాడు. తనకు ఇంతటి ఘనత తెచ్చిన రామచంద్రమూర్తికి సాగిలపడి, కొన్నాళ్ళు లంకలో ఉండి, తన ఆతిథ్యం తీసుకొమ్మని ప్రాథేయపడ్డాడు. 

''అపి స్వర్ణమయీ లంకా న మే లక్ష్మణ రోచతే
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ'' 


ఒళ్ళు పులకరించే మాట చెప్పాడు రామచంద్రమూర్తి. లక్ష్మణా! లంక మొత్తం స్వర్ణమయం కావచ్చు. అనేక సుఖభోగాలు ఇక్కడ దొరకవచ్చు. కానీ, నా మనసు అయోధ్యను చూడాలని ఆరాటపడుతోంది. మాతృమూర్తి, మాతృభూమి స్వర్గం కన్నా ఉన్నతమైనవి కదా - అంటాడు రామయ్య. 

ఎన్నో యుగాల నాడు వాల్మీకి రాసిన మాట ''జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ'' - ఇప్పటికీ మనకు మార్గదర్శనం చేస్తోంది. దేశభక్తి గురించి ఎవరు ఉపన్యాసం చెప్పినా ఈ వాక్యం ఉటంకించాల్సిందే. ఒక తారకమంత్రంగా యావజ్జాతినీ ఈ వాక్యం దేశభక్తి దిశగా ప్రేరేపిస్తోంది. ఒక్క మాటకే ఇంతటి ఘనత తెచ్చాడంటే వాల్మీకి హృదయం దేశభక్తికి నిలయం కాకపోతే సాధ్యమవుతుందా? 

మొత్తంగా వాల్మీకి హృదయం రామాయణంలోని అనేక సందర్భాల్లో, అనేక కోణాల్లో ప్రకటితమవుతుంది. కాగడా పెట్టి వెతికినా మచ్చుకైనా కనిపించకుండా ధర్మం అంతరించిపోతున్న నేటి తరుణంలో, మనం చూడాల్సింది ధర్మ సంస్థాపనకు మార్గమే తప్ప వాల్మీకి కులం కాదు. మా కులం వాడని, మా జాతి వాడని, మా మతం వాడని వాల్మీకిని కులమతాల కుమ్ములాటలోకి దింపటం మన అమానుష ఆలోచనాధోరణికి నిదర్శనం. విశాలమైన భావాలతో, సత్య, ధర్మాలకు ప్రతీకగా రామాయణాన్ని అందించిన మహానుభావుడి పట్ల మనం చేస్తున్న అపచారం ఇది. ఇకనైనా, ఈ ధోరణి విడిచిపెట్టి, వాల్మీకి హృదయాన్ని అర్థం చేసుకుందాం. రామరాజ్యాన్ని స్థాపించుకుందాం. 
=============================

రచన

డాక్టర్‌ కప్పగంతు రామకృష్ణ, ఆంధ్రోపన్యాసకులు, ఎస్‌.ఆర్‌.ఎస్‌.వి.కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, గాంధీనగర్‌, విజయవాడ -3, సెల్‌: 90320 44115





Monday, October 1, 2018

విజయదశమి ... విజయాల దశమి - శ్రీశైలప్రభ పత్రిక అక్టోబర్ 2018 సంచికలో డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr Kappagantu Ramakrishna) రాసిన వ్యాసం

విజయాల దశమి


లోకాలనేలే చల్లనితల్లి జగన్మాత చేసిన రాక్షస సంహారానికి, చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా జరుపుకునే పండుగ దసరా. ప్రత్యేకించి, నవరాత్రి ఉత్సవాల చివరిరోజున నిర్వహించుకునే విజయదశమి పండుగ కేవలం విందు వినోదాలతోనో, పూజాపునస్కారాలతో మాత్రమే ముగిసే పండుగ మాత్రమే కాదు. విజయదశమి అనే పేరు తలచుకోగానే ఒక ధైర్యం మనల్ని ఆవహిస్తుంది. ఇక విజయం మనదే అనే భావన కలుగుతుంది. మనలోని శక్తులన్నీ ఒక్కసారిగా చైతన్యవంతం అవుతాయి. అందుకే, విజయదశమి రోజున ఏ పని ప్రారంభించినా విజయమే కలుగుతుందంటారు మన పెద్దలు.

మానవుడిలో స్ఫూర్తిని రగిలించి, వారి హృదయాల్లో నిద్రించిన కర్తవ్యదీక్షను తట్టిలేపి, విజయతీరానికి నడిపించటమే విజయదశమి పండుగలోని పరమార్థం. సరస్వతి, లక్ష్మి, దుర్గ, కాళి, లలిత, మహిషాసురమర్దిని...ఇలా ఏ పేరుతో పిలిచినా జగన్మాత మనకు విజయాన్ని అనుగ్రహిస్తుంది. మనిషిని మనీషిగా, పోరాటయోధుడిగా, కర్తవ్యదీక్షాపరుడిగా తీర్చిదిద్దుతుంది. ఆ తల్లి అనుగ్రహంతో మనం సాధించలేని విజయమంటూ ఏదీ ఉండదు. అందుకే, విజయదశమి ఏ ఒక్క విజయానికో పరిమితమైన దశమి కాదు. అదొక అనంత విజయాల దశమి.  

తొలి విజయం 'శక్తిచైతన్యం'

సృష్టిలో ఉన్న అన్ని జీవరాశుల్లో మనిషికి సర్వోన్నతమైన స్థానం ఉంది. తనలో ఉన్న శక్తిని గుర్తించి, తనకు ఏవిధంగా ఆ శక్తి ఉపయోగిస్తుందో విచక్షణ ద్వారా తెలుసుకుని, తన లక్ష్యాన్ని సాధించటానికి ఆ శక్తిని వినియోగించటం మనిషి తప్ప మరో ప్రాణి ఏదీ చెయ్యలేదు.  ఇంతటి సర్వోన్నతమైన శక్తి కేవలం ఆ జగన్మాత అనుగ్రహం ద్వారానే మనకి కలుగుతుంది.

ఇదంతా జరగటానికి మనిషిలో ఆత్మ స్వరూపంలో ఉండే శక్తిచైతన్యం ఉద్దీపితం కావాలి. జగన్మాత ఆరాధన మనలో నిద్రాణమైన చైతన్యాన్ని మేల్కొలుపుతుంది. గాయత్రి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, లలిత, దుర్గ, సరస్వతి.. ఇలా ఏ పేరుతో ఆరాధించినా, ఆ తల్లి శక్తిరూపంలోనే వ్యక్తమవుతుంది. శక్తి రూపంలోనే మనిషికి తన అనుగ్రహాన్ని అందిస్తుంది. 

ఏ పేరుతో పిలిచినా, ఆరాధించినా ఆయా రూపాల్లోని మూలశక్తి ఒకటే. అదే చిచ్ఛక్తి. ఈ సకల విశ్వమంతా చిచ్ఛక్తి విలాసంతో ఏర్పడిందే. అమ్మవారి అన్ని నామాల్లో అంతర్గతంగా ఉండేది శక్తి ఉపాసనే. అగ్నికి వేడి శక్తి, సూర్యునికి వెలుగునిచ్చే శక్తి, చంద్రునికి వెన్నెలనిచ్చే శక్తి... ఇలా ప్రతి ప్రాణిలో ఉండే శక్తి అంతా ఆ చిచ్ఛక్తి రూపాంతరాలే. అందుకే 'చిచ్ఛక్తిశ్చేతనా రూపా...' - అంటూ అమ్మవారిని శక్తిచైతన్య స్వరూపంగా ఆరాధించటం జరగుతోంది. అనంతవిశ్వంలోని అన్ని ప్రాణుల్లో నిక్షిప్తమై ఉండే శక్తి సందర్భానుగుణంగా ఒక్కో రీతిలో వ్యక్తమవుతుంటుంది. ప్రాణశక్తి, ఆత్మశక్తి, చైతన్యశక్తి, విద్యాశక్తి, జ్ఞానశక్తి... ఇలా విభిన్న రూపాల్లో శక్తి ఆయా ప్రాణుల్లో ఆవహించి ఉండి, సమయానుగుణంగా బహిర్గతమై కాలగతిని నడిపిస్తుంది. ఈ శక్తిని ప్రసన్నం చేసుకుని, జీవన పరమార్థాన్ని పొందటానికి చేసే ఉత్సవాలే దసరా లేక నవరాత్రి ఉత్సవాలు. జగన్మాత ఆరాధన ఫలితంగా మనలోని శక్తిచైతన్యం ఉద్దీపితం కావటమే దసరా ఉత్సవాల నుంచి మనకు అందే తొలి విజయం.

విద్యావిజయం

మనిషికి నీరు, ఆహారం వంటి ప్రాథమిక అవసరాలతో పాటు మరొక ఆవశ్యకమైన అంశం 'విద్య'. విద్య మనిషిని మనీషిగా చేస్తుంది. మంచి, చెడుల విచక్షణా జ్ఞానాన్ని అందిస్తుంది. తన కర్తవ్యం ఏమిటో, అందుకు తాను అనుసరించాల్సిన మార్గం ఏమిటో విద్య ద్వారా మనిషికి అవగాహనకు వస్తుంది. ఈ విద్య మనిషికి అందాలంటే సరస్వతీ మాత అనుగ్రహం కావాలి. అన్ని విద్యలూ సరస్వతీ స్వరూపాలే. నవరాత్రి ఉత్సవాల్లో మూలా నక్షత్రం రోజున జగన్మాతను సరస్వతీ రూపంలో ఆరాధించటం వెనుక ఉన్న అంతరార్థం ఇదే. పుట్టుకతో మాత్రమే మనిషిగా ఉన్న వ్యక్తికి విద్యద్వారా పునర్జన్మ ఇచ్చే తల్లి సరస్వతీదేవి. ఈమె విద్యాధిదేవత. వేదమాత. జ్ఞానదాత్రి. ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులు ఈమె అనుగ్రహం ద్వారా లభిస్తాయి. అజ్ఞానం వల్ల ఏర్పడే చీకటిని, సత్యమైన జ్ఞాన ప్రకాశం వల్ల తొలగించేలాగా ఈ తల్లి వరమిస్తుంది. అందుకనే 'సత్యానంద రూపా...'; 'సత్యానంద స్వరూపిణీ...' అని నామావళిలో ఈ తల్లిని ఆరాధించటం జరుగుతుంది. నవరాత్రి ఉత్సవాల ద్వారా మనకు కలిగే రెండో విజయం ఇది. 

శత్రువిజయం

శత్రువులంటే బాహ్యంగా మనకు కనిపించి, మనతో శత్రుభావాన్ని ప్రకటించే వ్యక్తులు కొందరైతే, మనలోనే ఉంటూ మనకి దుర్భిద్ధి కలిగించి, మన కర్తవ్యాన్ని దారి మళ్ళించే శత్రువులు కొందరు ఉంటారు. వీరినే అంతశ్శత్రువులు అంటారు. జగదంబ ఆరాధన బాహ్యశత్రువులతో పాటు అంతశ్శత్రువుల బాధను కూడా తొలగిస్తుంది. ఎలాగంటే... నవరాత్రుల్లో చేసే అర్చనాది విధానాల్లో శమీపూజ ఒకటి. ఇది విజయప్రదాయిని. శమీ వృక్షపూజ పాపాలనునశింపజేసి, విజయాలను కటాక్షిస్తుంది. అర్జునుని గాండీవాన్ని ధరించి అతనికి విజయుడు అనే నామాన్ని సుస్థిరం చేసింది. జానకితో జగదభిరాముడిని కలిపి లోకానికి మేలు కూర్చింది. అలాగే, అమ్మకు చేసే అర్చన, ఆరాధనల ఫలితంగా మనలోని దుర్గుణాలు నశిస్తాయి. 

జ్ఞాన విజయం

నవరాత్రి ఉత్సవాలు శరత్కాలంలో వస్తాయి. అందుకే ఇవి శరన్నవరాత్రులు అయ్యాయి. శరత్కాలానికి మన వాజ్ఞ్మయంలో విశేష ప్రాధాన్యం ఉంది. అమ్మకు శారద అనే నామం ఉంది. 'శరదిదిభవా శారదా'... శరత్కాలంలో ఉద్భవించిన తల్లి శారద అయ్యింది. ఈ శారద జ్ఞానప్రదాయిని. ప్రకృతిని పరిశీలిస్తే శరత్కాలం రాగానే నదుల్లోని మాలిన్యాలన్నీ తొలగిపోతాయి. తద్వారా నదీజలాలు సేవించటానికి అనువుగా మారతాయి. అలాగే, శక్తి ఉపాసన ద్వారా మనసులోని మాలిన్యాలు తొలగి జ్ఞానోదయం కావటమే శరన్నవరాత్రుల పరమార్థం. మనకు కలిగే విజయం కూడా. 

ప్రాణ విజయం

నవరాత్రులనే పదానికి విశేషమైన అర్థాలు ఉన్నాయి. రాత్రి అంటే తిథి అనే అర్థం ఉంది. అశ్వయుజ  శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు జరిగే ఉత్సవాలే నవరాత్రి ఉత్సవాలు. మరొక అర్థంలో రాత్రి శబ్దం ప్రాణవాచకం. నవరాత్రులంటే తొమ్మిది ప్రాణాలు. ఈ తొమ్మిది ప్రాణాల్లో ప్రతిష్ఠితమై ఉండి, వాటిని కాపాడే ప్రాణదేవతయే పదో ప్రాణం. ఆమే పరాదేవత. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనుంజయ అనేవి తొమ్మిది ప్రాణాలు. ముఖ్య ప్రాణదేవత పరాదేవి. మిగిలిన తొమ్మిది ప్రాణాలు ఈ ముఖ్య ప్రాణదేవత యొక్క అవతారాలు. నవరాత్రి వ్రతం ద్వారా ప్రాణశక్తి స్వరూపంగా అమ్మను ఉపాసన చేసినట్లయితే మనలో ఉన్న ప్రాణశక్తి చైతన్యవంతం అవుతుంది. నారద పాంచరాత్రం అనే గ్రంథం ప్రకారం రాత్రి అనే పదానికి జ్ఞానాన్నిచ్చే దైవం అనే అర్థం ఉంది. మరికొన్ని ప్రాచీన గ్రంథాల్లో రాత్రి అనే శబ్దానికి పరమేశ్వరి అనే అర్థం ఉంది. ఈ అర్థాలన్నిటినీ సమన్వయం చేస్తే, వ్యక్తిలోని ప్రాణశక్తిని చైతన్యవంతం చెయ్యటం నవరాత్రి ఉత్సవాల లక్ష్యంగా కనిపిస్తుంది. ఏ భక్తుడైతే ఈ లక్ష్యాన్ని చేరుకుంటాడో, అతడు ప్రాణశక్తిని విజయఫలితంగా అందుకున్నట్లవుతుంది. 

సిద్ధ విజయం

అమ్మను ఆరాధిస్తూ చేసే నవరాత్రి వ్రతం అనేక సిద్ధుల్ని కలిగిస్తుంది. సిద్ధులు అంటే మంత్ర, తంత్రాలనే భావన కాదు. మనోనిశ్చలత, లక్ష్యసాధన కూడా సిద్ధులే. కోరికలు తీరటమే సిద్ధత్వం. జగన్మాత ఆరాధన మనకు అన్ని కోరికలు తీరుస్తుంది. తనను నమ్ముకున్న భక్తుల సకల అభీష్టాలు నెరవేర్చటమే జగజ్జనని నిర్వహించే ప్రధాన క్రియ. దేవీభాగవతం ప్రకారం శైలపుత్రి, బ్రహ్మచారిణి, స్కందమాత, చంద్రఘంట, కూష్మాండ, కాత్యాయని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిద అనేవి నవదుర్గా రూపాలు. వీటిల్లో సిద్ధిద రూపంలో అమ్మను ఉపాసన చేస్తే అష్టసిద్ధులతో పాటు మోక్షసిద్ధి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. సకల లౌకిక, అలౌకిక సిద్ధులకు ఈ తల్లి అధిష్టాన దేవత. నవరాత్రి వ్రతం ద్వారా అమ్మను సిద్ధిద రూపంలో అర్చించినట్లయితే సకల సిద్ధులూ వరంగా లభిస్తాయి. ఇదే సిద్ధ విజయం.

ఆరోగ్య విజయం

ప్రకృతి నియమాలను అనుసరించి శరత్కాలం సంధికాలం. ఈ కాలం ప్రజలకు అనారోగ్యాన్ని కలిగించి వారి ప్రాణాలను సంహరించే శక్తి కలిగి ఉంటుంది. ఈ బాధలకు లోను కాకుండా ఉండటానికి జగన్మాతను వేడుకుంటూ చేసే అర్చనా విధానమే నవరాత్రి వ్రతం. సర్వవ్యాధి ప్రశమనీ..., సర్వమృత్యు ప్రశమనీ.. అనే నామాలతో అమ్మను అర్చించటంలోని అంతరార్థం ఇదే. ఎప్పుడైతే శారీరక శక్తి విశేషంగా ఉంటుందో అప్పుడు మానసిక శక్తి జాగృతమవుతుంది. ఇలా జాగృతమైన మానసిక శక్తి అర్చనాది ఉపాసనల ద్వారా మరింత ఉన్నత స్థితిని పొంది, అధ్యాత్మికశక్తిగా మారుతుంది. అంతిమంగా సాధకుడు శక్తిమంతుడవుతాడు. 'ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనస్సు' ఉంటుందని స్వామి వివేకానంద చెప్పినట్లు శారీరక ఆరోగ్యం, దాని ఫలితంగా మానసిక ఆరోగ్యం జగన్మాత ఆరాధన వల్ల కలుగుతాయి. ఇవే ఆరోగ్యవిజయాలు.

ఇలా మరెన్నో విజయాలు అమ్మ ఆరాధన ద్వారా కలుగుతాయి. జగన్మాతను సేవించటానికి ఉత్తమమైన కాలం నవరాత్రి ఉత్సవాలు. ఈ ఉత్సవాల్లో చేసే ప్రతి అర్చన, ఆరాధనకు అంతులేని విజయాల్ని అందిస్తాయి. అందుకే నవరాత్రి ఉత్సవాలు విజయోత్సవాలుగా అందరినీ కర్తవ్య దీక్షాబద్ధుల్ని చేస్తున్నాయి. 

-------------------------------

రచన

డాక్టర్‌ కె.రామకృష్ణ, ఆంధ్రోపన్యాసకులు, ఎస్‌.ఆర్‌.ఎస్‌.వి.కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, 

గాంధీనగర్‌, విజయవాడ -3, సెల్‌: 90320 44115 / 8897 547 548 


Wednesday, September 26, 2018

విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారికి చేసే అలంకారాలు ... వాటి విశేషాల గురించి డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr Kappagantu Ramakrishna) రాసిన వ్యాసం


దసరా అలంకారాలు 


విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాల్లో 

అమ్మవారికి చేసే అలంకారాలు ... వాటి విశేషాలు


 



1.గాయత్రీదేవి అలంకారం

ముక్తావిద్రుమ హేమనీల ధవఉరళచ్ఛాయై: ముఖైస్త్రీక్షణై:
యుక్తామిందు నిబద్ధరత్నమకుటాం తత్త్వార్థ వర్ణాత్మికాం
గాయత్రీం వరదాభయాంకుశకశాశ్శుభ్రం కపాలం గదాం
శంఖం చక్రమధారవింద యుగళం హసైర్వహంతీం భజే ||

                        'నగాయత్య్రా: పరం మత్రం మాతు: పరదైవతమ్‌' - గాయత్రిని మించిన మంత్రం లేదు. తల్లిని మించిన దైవం లేదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. 'యా గాయంతం త్రాయతే సా గాయత్రీ' - గానం చేసిన వారిని కాపాడుతుంది కనుక మంత్రానికి గాయత్రి అని పేరు. తల్లి వేదమాత. అన్ని మంత్రాలకు మూలశక్తి. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలతో ప్రకాశించే ఐదు ముఖాలతో; శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి ఉంటుంది. గాయత్రీ ఉపాసన ద్వారా బుద్ధి వికసిస్తుంది. ప్రాతస్సంధ్యలో గాయత్రిగా, మధ్యాహ్న సంధ్యలో సావిత్రి, సాయం సంధ్యలో సరస్వతిగా ఉపాసకులు ఈమెను ధ్యానిస్తారు తల్లి ఉపాసన ద్వారా అనంతమైన మంత్రశక్తి కలుగుతుంది. సకల దురిత ఉపద్రవాలూ తొలగుతాయి. బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. గాయత్రీమంత్ర పారాయణ వేదపారాయణ చేసిన ఫలితాన్ని ఇస్తుంది. అవతారంలో అమ్మవారు దర్శనమిచ్చిన గాయత్రీ మంత్రాన్ని వీలైనన్నిసార్లు జపించి, అమ్మకు అల్లపు గారె నివేదన చేయాలి. గాయత్రీమాత స్వరూపంగా వేదపండితులను అర్చించాలి. బ్రాహ్మణ పూజ చేయాలి. గాయత్రీ స్తోత్రాలు పఠించాలి.

---------------------------------------------------------------------------------------------

2.అన్నపూర్ణాదేవి అలంకారం

ఉర్వీ సర్వజయేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ
నారీ నీల సమాన కుతంలధరీ నిత్యాన్న దానేశ్వరీ
సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ ||


            'అన్నం పరబ్రహ్మేతి వ్యజానాత్‌' - అన్నం పరబ్రహ్మ స్వరూపమని ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఒక చేతిలో మధురసాలతో కూడి ఉన్న మాణిక్యపాత్ర, మరొక చేతిలో అన్నాన్ని అనుగ్రహించే రతనాల గరిటె ధరించిన రూపంలో అమ్మ అన్నపూర్ణాదేవి అవతారంలో దర్శనమిస్తుంది. అవతారంలో అమ్మ ఎర్రని శరీరం, మెడలో తారహారాలు ధరించి, నిండు చంద్రుని వలే అందమైన ముఖంతో, విశాలమైన త్రినేత్రాలతో భాసిల్లుతుంది. షడ్రుచులతో కూడిన భక్ష్యభోజ్యాదులు తల్లి అనుగ్రహం ద్వారా మానవాళికి అందుతాయి.
            ఆహారం లేకుండా సృష్టిలో ప్రాణీ జీవించలేదు. అలాగే, తన బిడ్డ ఆకలి తీర్చటానికి ఆలోచించని తల్లీ సృష్టిలో ఉండదు. అందుకనే, అన్నపూర్ణాదేవి రూపంలో దుర్గాదేవి సకల ప్రాణికోటికీ అన్నాన్ని అందించి, జగన్మాతగా పూజలు అందుకుంటుంది. సకల జీవుల్లోని జీవాన్ని తల్లి ఉద్దీపింపజేస్తుంది. అందుకనే ఆదిశంకరులు కూడా 'భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ'! అంటూ జగదంబను అన్నపూర్ణేశ్వరిగా ధ్యానం చేసారు. తల్లిని ఉపాసన చేసినవారు పుత్రపౌత్రాభివృద్ధి, బ్రహ్మతేజస్సు పొందుతారు. బృహదారణ్యకోపనిషత్‌, యజుర్వేద తైత్తిరీయ సంహిత, ప్రశ్నోపనిషత్ విషయాన్ని రూఢి చేస్తున్నాయి. ఈమెను ధ్యానించిన వారికి బ్రహ్మతేజస్సు, వాక్సిద్ధి, తుష్టి, పుష్టి కలుగుతాయి. అంతేకాదు... తనను కొలిచినవారి సకల కార్యభారాన్నీ తల్లే వహిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. భుక్తి, ముక్తి ఆకాంక్షించేవారు - విధేహి దేవి కల్యాణం విధేహి పరమాం శ్రియంరూపం దేహి జయం దేహి యశోదేహి ద్విషో జహి || అనే శ్లోకాన్ని శక్తికొద్దీ పారాయణ చేసి, తల్లికి దధ్యన్నం, కట్టెపొంగలి నివేదన చేయాలి. లేత ఎర్రని లేదా తెల్లని పూలతో అమ్మను పూజించాలి. శక్తిసాధన కోరుకునే వారు - సృష్టి స్థితి వినాశానం శక్తి భూతే సనాతని / గుణాశ్రయే గుణమయే నారాయణి నమోస్తుతే || అనే శ్లోకాన్ని పారాయణ చేయాలి. 'ఓం శ్రీం హ్రీం క్లీం నమో భగవత్యన్నపూర్ణేశ్వరి మమాభిలషిత మహిదేవ్యన్నం స్వాహా' అనే మంత్రాన్ని ఉపాసన చేయాలి. భోజనశాలలో అన్నపూర్ణాదేవి చిత్రపటం ఉంచి, పూజలు చేయాలి. అన్నపూర్ణాదేవి స్తోత్రాలు పారాయణ చేయాలి. శక్తికొద్దీ అన్నదానం చేయాలి.
---------------------------------------------------------------------------------------

3.మహాలక్ష్మీదేవి అలంకారం


సరసిజ నయనే సరోజహస్తే ధవళతరాంశుక గంధమాల్య శోభే
భగవతి హరి వల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యమ్‌ ||

            సిరిసంపదలు, సంతానం, సౌభాగ్యం, ధైర్యసాహసాలు, విజయాలకు తల్లి అధిష్టాన దేవత శ్రీమన్మహాలక్ష్మి. సకల లోకాలకు ఈమె ఐశ్వర్య ప్రదాత. ఇరువైపులా గజరాజు సేవిస్తుండగా, రెండు చేతులతో కమలాలు ధరించి, అభయ, వరద ముద్రలతో, క్షీరాబ్ధి పుత్రికయైన తల్లి భక్తులకు దర్శనమిస్తుంది. డోలాసురుడు అనే రాక్షసుడిని ఈమె సంహారం చేసి, లోకాలకు శాంతి చేకూర్చింది. త్రిపురాత్రయంలో ఈమె మధ్యశక్తి. 'యా దేవీ సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థితా' - సకల లోకాల్లో ఉండే సకల జీవుల్లో తల్లి లక్ష్మీరూపంలో తల్లి నివాసం ఉంటుందని చండీ సప్తశతి చెబుతోంది. ఋగ్వేదం పదో మండలంలోని శ్రీసూక్తం తల్లి వైభవాన్ని ఎంతగానో ప్రకటిస్తుంది. అగ్ని, మత్స్యపురాణాలు ఈమె ఆకృతి, శిల్ప నిర్మాణ నియమాలను వివరంగా చెబుతున్నాయి.
అష్టలక్ష్ములకు ఈమె అధిష్ఠాన దేవత. తల్లి ఉపాసన ద్వారా లౌకిక సంపాదనతో పాటు అలౌకికమైన మోక్షసంపద కూడా లభిస్తుంది. ఈమె శీఘ్రఫలదాయిని. శ్రీసూక్తవిధానంగా తల్లిని ఎర్రని పుష్పాలతో, లక్ష్మీ అష్టోత్తర నామాలతోఅర్చించి, పూర్ణాలు నివేదన చేయాలి. అమ్మకు ప్రీతిగా సువాసినీ పూజ చేయాలి. లక్ష్మీదేవి స్తోత్రాలు పఠించాలి. 'ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మై స్వాహా' అనే మంత్రాన్ని ఉపాసన చేయాలి. పూజామందిరంలో లక్ష్మీదేవి రూపును ఉంచి, పూజలు చేయాలి.

-------------------------------------------------------------------------------------------

4.మహాసరస్వతీ దేవి అలంకారం


ఘంటాశూల హలాని శంఖ ముసలే చక్రం ధనుస్సాయకం
హస్తాబ్జైర్దధతి ఘనాంశ విలసచ్ఛీతాంశు తుల్యప్రభాం
గౌరీ దేహ సముద్భవాం త్రిజగతాం ఆధారభూతాం మహా
పూర్వామత్ర సరస్వతీ మనుభజే శుంభాది దైతార్దినీమ్‌ ||

                        దుర్గాదేవి అలంకారాలన్నిటిలో మూలానక్షత్రం నాటి సరస్వతీదేవి అలంకారానికి ఎనలేని ప్రాముఖ్యత ఉంది. నరుణ్ణి నరోత్తముడిగా చేసి, నారాయణ తత్త్వాన్ని ప్రసాదించే చదువుల తల్లి సరస్వతీదేవిగా భక్తులు ఈమెను ఆరాధన చేస్తారు. వాక్కు, బుద్ధి, విజ్ఞానం, కళలు... అన్నిటికీ ఈమే అధిష్ఠాన దేవత. ఋగ్వేదం, దేవీభాగవతం, బ్రహ్మవైవర్త పురాణాల్లో సర్వసతీదేవి గురించిన అనేక గాథలు విస్తారంగా వర్ణితమై ఉన్నాయి. కచ్ఛపి అనే వీణ; పుస్తకం, అక్షమాల, ధవళ వస్త్రాలు ధరించి, నెమలిని అధిరోహించిన రూపంలో తల్లి దర్శనమిస్తుంది. 'సరాంసి జలాని సంతి ఆస్వా: సా సరస్వతి' - అని మేదినీకోశం చెబుతోంది. అనంత స్వరూపిణి, సర్వశక్తి స్వరూపిణి, సర్వాంతర్యామిని, విజ్ఞానదేవత, వివేకదాత్రిగా శాస్త్రాలు, పురాణ, ఇతిహాసాలు సరస్వతీదేవిని వర్ణిస్తున్నాయి. సరస్వతీ ఉపాసనతో లౌకిక విద్యలతో పాటు అలౌకికమైన మోక్షవిద్య కూడా అవగతమవుతుంది. సకల చరాచరకోటిలో వాగ్రూపంలో ఉంటూ, వారిని చైతన్యవంతులుగా చేసే శక్తి ఈమెది. 
                        'వాజేభిర్వాజినీవతీ...' అని మంత్రం. - సరస్వతీదేవి మమ్ములను పవిత్రులుగా చేసి, మాకు అన్నపూర్ణగా అన్నం పెడుతుంది. జ్ఞానాన్ని అందించి, భవసాగరాన్ని దాటిస్తుంది. సకల బుద్ధులను ప్రకాశింపజేస్తుంది అని ఋగ్వేదం సరస్వతీదేవిని స్తోత్రం చేస్తోంది. '' నుంచి 'క్ష' వరకు ఉన్న అన్ని అక్షరాలతో ఏర్పడే సకల వాజ్ఞ్మయము, సంగీతాది సకల కళలూ తల్లి వరప్రసాదమే. అందుకనే సరస్వతీ ఉపాసన ద్వారా సకల విద్యలూ కరతలామలకం అవుతాయని పెద్దలు చెబుతారు. వ్యాసుడు, వాల్మీకి, యాజ్ఞవల్క్యుడు మొదలైన ఋషులందరికీ తల్లి అనుగ్రహం ద్వారానే లోకోత్తరచరితులయ్యారు. తెల్లని వస్త్రాలు ధరించి, తెల్లని పూలతో అమ్మను పూజించాలి. దద్ధోజనం, చక్కెర పొంగలి నివేదన చేయాలి. 'ఓం శ్రీం హ్రీం క్లీం మహా సరస్వత్యై నమ:' అనే మంత్రాన్ని ఉపాసన చేయాలి. సరస్వతీదేవి ప్రీతిగా రోజున పుస్తకదానం చేయాలి. సరస్వతీ ద్వాదశ నామాలు, స్తోత్రాలు పారాయణ చేయాలి.
===========================================================

5.లలితా త్రిపురసుందరీ దేవి అలంకారం

ప్రాత: స్మరామి లలితా వదనారవిందం
బింబాధరం పృథుల మౌక్తిక శోభినాశం
ఆకర్ణ దీర్ఘనయనం మణికుండలాఢ్యం
మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశం ||

            త్రిపురాత్రయంలో ఈమె రెండో దేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపంలో, సకల లోకాతీత కోమలత్వంతో ప్రకాశిస్తుంది. తల్లి మణిద్వీప నివాసిని. సకల సృష్టి, స్థితి, సంహార కారిణి. శ్రీవిద్యా స్వరూపిణి. ఉపాసకులకు ముఖ్య ఆరాధ్య దేవత. 'చిదగ్నికుండ సంభూతా' అని లలితా సహస్రనామం చెబుతోంది. 'చిత్‌' అంటే చైతన్యం. చైతన్యం అనే అగ్నికుండం నుంచి అమ్మ ఆవిర్భవించింది. సకల విశ్వచైతన్య శక్తిస్వరూపం శ్రీచక్రం. శ్రీచక్రానికి అధిష్ఠాన దేవత లలితా త్రిపురసుందరి. నిర్వాణతంత్రం ప్రకారం లలితాదేవి సత్యలోకంలో బీజకోశంలో చింతామణి గృహంలో రత్నసింహాసనంపై ఆశీనురాలై ఉంటుంది. ఈమె శ్రీవిద్యా స్వరూపం. కోటి సూర్యుల ప్రకాశంతో సమానమైన కాంతిస్వరూపంతో, చేతిలో పాశం, అంకుశం, చెరకు విల్లు, పూలబాణాలు ధరించి ఉంటుంది. ఈమెకు లక్ష్మీసరస్వతులు ఇరువైపులా వింజామరలతో వీస్తూ, సేవలు చేస్తుంటారు. దేవేంద్రాది దేవతలు తల్లికి మంచపుకోళ్ళుగా ఉంటారు. నిత్యం తన భక్తులను అనుగ్రహిస్తూ, సర్వ వ్యాపకమైన తోజోమూర్తిగా లలితామాత విరాజిల్లుతుంది. ఈమెను ఉపాసించటం ద్వారా సకల ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది. దారిద్య్ర దు:ఖం నశిస్తుంది.

నమోదేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమ:
నమ: ప్రకృత్యై భద్రాయై నియతా: ప్రణతాస్మతాం ||
అనే శ్లోకాన్ని పునశ్చరణ చేయాలి. మోక్షసాధన కోరుకునేవారు 
త్వం వైష్ణవీ శక్తిరనంతవీర్యా విశ్వస్యబీజం పరమాసి మాయా
సమ్మోహితం దేవి సమస్తమేతత్త్వం వై ప్రసన్నా భువి ముక్తిహేతు || 
అనే శ్లోకాన్ని పునశ్చరణ చేసి, అమ్మకు పాయసం నివేదన చేయాలి.

=================================================

6.దుర్గాదేవి అలంకారం 

విద్యుద్దామ సమప్రభాం మృగపతి స్కందస్థితాం భీషణాం
కన్యాభి: కరవాలఖేట విలసద్దస్తాభిరాసేవితాం
హస్తైశ్చక్ర గదాసిఖేట విసిఖాంశ్చాపం గుణం తర్జనీం
బిభ్రాణాం అనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే ||
దుర్గముడు అనే రాక్షసుడిని సంహారం చేసిన శక్తి స్వరూపం దుర్గాదేవి. కోటిసూర్య ప్రభలతో వెలిగే దేవి భక్తులను సర్వ దుర్గతుల నుంచి కాపాడుతుంది. ఈమె మహాప్రకృతి స్వరూపిణి. సమస్త దేవీదేవతా శక్తులు, తేజస్సులు మూర్తీభవించిన తేజోరూపం తల్లి స్వరూపంగా ఉంటుంది. ఈమె సకల శత్రు సంహారిణి. సర్వ దు:ఖాలను నశింపజేస్తుంది. ఉగ్రరూపంతో దుష్టులను ఏవిధంగా సంహరిస్తుందో, అదే సమయంలో పరమశాంతమూర్తిగా తనను కొలిచిన భక్తులను కాపాడుతుంది. పంచ ప్రకృతి స్వరూపాల్లో తొలి మూర్తి ఈమే. 
                        దేవి, మార్కండేయ పురాణాలు, ఉపనిషత్తులు, ఋగ్వేదాల్లో దుర్గాదేవిని ఉపాసన చేయటానికి వీలైన ఎన్నో విధానాలు ఉన్నాయి. మరెన్నో అవతార విశేషాలు కూడా గ్రంథాల్లో ఉన్నాయి. ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తుల సమష్టి ఆరాధనే దుర్గాదేవి ఉపాసన. ఎర్రని వస్త్రాన్ని ధరించి, మణులు పొదిగిన కిరీటం ధరించి, సింహ వాహనాన్ని అధిరోహించి, ఎనిమిది చేతులతో కత్తి, డాలు, గద, శంఖం, కలశం, త్రిశూలం, చక్రం, ధనుర్బాణాలు ధరించి ఉంటుంది. ఇది సర్వశత్రు సంహారక రూపం తల్లిని ధ్యానించినట్లయితే సర్వరోగాలు నశిస్తాయి. చామంతి, పొగడ, సంపెంగ, మల్లెపూలు, దానిమ్మపండు, ఎర్రని అక్షతలు, పొంగలి, పులి¬, పులగము తల్లికి ఇష్టమైన ద్రవ్యాలు. సర్వ రోగాల నుంచి ఉపశమనం పొందటానికి

రోగానశేషానపహంసి తుష్టా / రుష్టాతు కామాన్సకలానభీష్టాన్
త్వామాశ్రితానాం విపన్నరాణాం / త్వామాశ్రితా హ్యాశ్రయతాం ప్రయాంతి

అనే శ్లోకాన్ని పఠిస్తే రోగాల నుంచి ఉపశమనం కలుగుతుంది. రోజున వేదపండితులను సత్కరిస్తే అమ్మకు ఎంతో ప్రీతి కలుగుతుంది. ఓం దుం దుర్గాయై నమ: అనే మంత్రాన్ని ఉపాసన చేయాలి. దుర్గాసూక్తం, లలితా అష్టోత్తరం, దుర్గాస్తోత్రాలు పారాయణ చేయాలి.
=====================================================

7. మహిషాసుర మర్దినీ దేవి అలంకారం


మహిష మస్తక నృత్త వినోదినీ
స్ఫుటరణ్మణినూపుర మేఖలా
జనన రక్షణ మోక్ష విధాయినీ
జయతి శుంభనిశుంభ నిషూదినీ ||
           
            లోకకంటకుడైన మషిషాసురిడిని సంహారం చేసిన ¬గ్రరూపం ఇది. సకల దేవీదేవతల శక్తులన్నీ ఈమెలో మూర్తీభవించి ఉంటాయి. మానవనేత్రంతో చూడటానికి సాధ్యంకాని దివ్య తేజస్సుతో, అనేక ఆయుధాలతో, సింహవాహినియై తల్లికి దర్శనభాగ్యం కలిగిస్తుంది. ఈమె అనుగ్రహ భాగ్యం కలిగితే సాధించలేనిది ఏదీ లేదు. మహిషాసుర సంహారం జరిగిన నవమి రోజునే 'మహర్నవమి'గా జరుపుకోవటం ఆచారంగా వస్తోంది. రోజున చండీ సప్తశతీ ¬మం చేసిన వారికి శత్రుభయం ఉండదు. అన్నిటా విజయం కలుగుతుంది. ఓం ఐం హ్రీం శ్రీం సర్వసమ్మోహిన్యై స్వాహా అనే మంత్రాన్ని జపించాలి. పానకం, వడపప్పు, గారెలు, పులి¬, పాయసాన్నం నివేదన చేయాలి. అమ్మవారి స్వరూపంగా సువానినులకు పూజ చేసి, మంగళద్రవ్యాలు, పసుపు కుంకుమలు, శక్తికొద్దీ నూతన వస్త్రాలు ఇవ్వాలి.
======================================================

8.శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకారం


కల్యాణాయుత పూర్ణచంద్రవదనాం ప్రాణేశ్వరానందినీం
పూర్ణాం పూర్ణతరాం పరేశమహిషీం పూర్ణామృతాస్వాదినీం
సంపూర్ణాం పరమోత్తమామృతకళాం విద్యావతీం భారతీం
శ్రీచక్రప్రియ బిందు తర్పణ పరాం శ్రీరాజరాజేశ్వరీం ||

                        స్వప్రకాశ జ్యోతి స్వరూపంతో, పరమేశ్వరుడి అంకాన్ని ఆసనంగా చేసుకుని, సకల భువన బ్రహ్మాండాలకు ఆరాధ్యదేవతగా పూజలందుకునే అమ్మ అవతారం శ్రీరాజరాజేశ్వరీదేవి. మహాత్రిపురసుందరిగా ఈమె శ్రీచక్ర నివాసినియై ఉంటుంది. నిశ్చల చిత్తంతో తనను ఆరాధించిన వారికి ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులను వరంగా అనుగ్రహిస్తుంది. మాయా మోహితమైన మానవ మనోచైతన్యం తల్లి ఉపాసన ద్వారా ఉద్దీపితమవుతుందిఅపరాజితాదేవిగా కూడా తల్లి పూజలందుకుంటుంది. ఈమె యోగమూర్తి. పసుపుపచ్చని వస్త్రాలు ధరించి, 'ఓం ఐం ఈల హ్రీం హసకహల హ్రీం సౌ: సకల హ్రీం' అనే మంత్రాన్ని జపించాలి. పసుపు పచ్చని పూలతో అమ్మను పూజించాలి. లలితా సహస్రనామ పారాయణ చేయాలి. శ్రీచక్రార్చన, కుంకుమార్చన, సప్తశతీ పారాయణ, చండీ¬మం చేసిన వారికి ఇష్టకామ్యాలను అనుగ్రహిస్తుంది. సువాసినీ పూజ చేసి, భక్ష్య, భోజ్యాలతో మహానివేదన, ప్రత్యేకంగా లడ్డూలు నివేదన చేయాలి.

================================================

9.స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి


నమస్తే శరణ్యే శివేసానుకమ్పే / నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే
నమస్తే జగద్వంద్య పాదారవిందే / నమస్తే జగత్తారిణి త్రాహిదుర్గే

నవరాత్రి ఉత్సవాల్లో తొలిరోజున దుర్గాదేవిని స్వర్ణకవచంతో అలంకరిస్తారు. ఇంద్రకీలాద్రిపై అమ్మ స్వర్ణకవచంతో అవతరించటం వల్ల, దసరా ఉత్సవాల తొలిరోజున అమ్మను స్వర్ణకవచంతో అలంకరించటం ఆచారంగా వస్తోంది. రూపంలో దుర్గాదేవి అష్టభుజాలతో, నక్షత్రాల కంటే అధికమైన కాంతి కలిగిన ముక్కుపుడక ధరించి, పసిడి ఛాయ కలిగిన మోముతో దర్శనమిస్తుంది. సింహవాహనాన్ని అధిష్ఠించిన ఈమె శంఖం, చక్రం, గద, శూలం, పాశం, మహాఖడ్గం, పరిఘ అనే ఆయుధాలు ధరించి ఉంటుంది. సకల శత్రుబాధలు నివారిస్తుంది. ఆకర్షణశక్తి, ఆరోగ్య ప్రదాన లక్షణం కలిగిన స్వర్ణ కవచాన్ని ధరించిన అమ్మను ఆరాధిస్తే సకల విజయాలు లభిస్తాయి. స్వర్ణకవచం మంత్ర బీజాక్షర సమన్వితంగా ఉంటుంది. కారణం వల్ల స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిని ఆరాధిస్తే మంత్రశక్తి లభిస్తుంది. రోజున అమ్మవారిని పసుపు అక్షతలు, పసుపు పూలతో పూజించాలి. దుర్గా అష్టోత్తరం, దుర్గాకవచం పారాయణ చేయాలి. ఓం ఐం హ్రీం శ్రీం దుర దుర్గాయైనమ: అనే మంత్రాన్ని ఉపాసించాలి. అమ్మవారికి పులి¬ నివేదన చేయాలి.
======================================================

10. బాలాత్రిపుర సుందరీ దేవి అవతారం

హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌ:క్లీం కళాంబిభ్రతీం
సౌవర్ణాంబర ధారిణీం వరసుధాదౌతాం త్రినేత్రోజ్జ్వలాం
వందే పుస్తక పాశమంకుశ ధరాం సగ్భ్రూషితముజ్జ్వలాం
త్వాం గౌరీం త్రిపురాం పరాత్పర కళాం శ్రీచక్ర సంచారిణీం ||



                        త్రిపురుని భార్య త్రిపురసుందరీ దేవి. అంటే పరమేశ్వరుని భార్య అయిన గౌరీదేవి అని అర్థం. త్రిపురాత్రయంలో బాలాత్రిపురసుందరీ దేవి తొలి దేవత. అందుకనే నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని రెండోరోజున బాలాత్రిపురసుందరీ దేవిగా అలంకరణ చేస్తారు. మనస్సు, బుద్ధి, అహంకారం తల్లి అధీనంలో ఉంటాయి. తల్లి అభయహస్తం, వరదముద్ర ప్రదర్శిస్తూ అక్షమాల ధరించి ఉంటుంది. ఈమెను ఆరాధించటం వల్ల నిత్య సంతోషం కలుగుతుంది. శ్రీచక్ర సంప్రదాయంలో షోడశీవిద్యకు ఈమె అధిదేవత. రెండు నుంచి పదేళ్ళ వయసులోపు బాలికలను బాలాత్రిపురసుందరీ దేవి స్వరూపంగా అర్చించి, సకల సుమంగళ ద్రవ్యాలు,నూతన వస్త్రాలు ఇవ్వాలి. ఇందువల్ల తల్లి అనుగ్రహం కలుగుతుంది. ఈమె అనుగ్రహం వల్ల సత్సంతానం కలుగుతుంది. 'ఓం ఐం హ్రీం శ్రీం బాలాత్రిపురసుందర్యై నమ:' అనే మంత్రాన్ని ఉపాసన చేయాలి. పాయసం నివేదన చేయాలి. లలితా త్రిశతీ స్తోత్రం పారాయణ చేయాలి.
=========================================

రచన

డాక్టర్కె.రామకృష్ణ, ఆంధ్రోపన్యాసకులుఎస్‌.ఆర్‌.ఎస్‌.వి.కాలేజ్ఆఫ్ఎడ్యుకేషన్‌, 

గాంధీనగర్‌, విజయవాడ-3. సెల్‌ : 90320 44115 / 88975 47548







ధర్మమూర్తి... సమదర్శి.... జగద్గురు కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి

  ధర్మమూర్తి... సమదర్శి ఆయన పేరు పలికితేనే చాలు... వ్యక్తం చేయటానికి మాటలు చాలని అనుభూతి కలుగుతుంది. ఆ కళ్ళలోని వెలుగు ఏదో తెలియని కారుణ్యాన...