Tuesday, July 31, 2018
Saturday, July 28, 2018
Thursday, July 26, 2018
మహాశివరాత్రి ప్రత్యేకం.... ఉపవాసం, జాగరణ అంటే ఏమిటి? ఎందుకు చెయ్యాలి?
మహాశివరాత్రి ప్రత్యేకం...
ఉపవాసం, జాగరణ అంటే ఏమిటి? ఎందుకు చెయ్యాలి?
-----------------------------------------------------------------
పరమేశ్వరా! నీ సంకల్ప
ఫలితంగా ఏర్పడ్డ ఈ తనువు, ప్రాణం అన్నీ నీకే
అర్పిస్తున్నాను. నా విధాతవు నీవు. నాలోని అజ్ఞానాన్ని తొలగించి, ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించే దక్షిణామూర్తివి నీవు. తనువులోని
ప్రతి అణువూ నీ దర్శనభాగ్యాన్ని కోరుకుంటోంది. నిన్ను చూడాలని, నిన్ను చూసిన ఆనందంలో నీలో లయం కావాలని మనసు ఆరాటపడుతోంది.
స్వామీ! నీ దర్శనభాగ్యం కోసం తనువెల్లా కనులు చేసుకుని నిరీక్షిస్తున్నాను. పగలు,
రాత్రి భేదం లేకుండా జాగరణ చేస్తున్నాను. శివా!
ఒక్కసారి కనిపించవయ్యా... అంటూ పరమేశ్వరుడి దర్శనం కోసం పరితపిస్తూ, ఆస్వామి ఆజ్ఞ కోసం ఎదురుచూస్తూ, సూర్యోదయ సూర్యాస్తమయాలను ఏకభావంతో అనుభవిస్తూ చేసే
శివధ్యానమే శివరాత్రి జాగరణ.
'ఉపే సమీపే వాసం ఉపవాసం నతు కాయస్య శోషణం' - భగవంతుని తత్త్వానికి దగ్గరగా ఉండటమే ఉపవాసం. అంతేకానీ, శరీరాన్ని శుష్కింపజేసుకోవటం ఉపవాసం ఎప్పటికీ కాదు. అనుక్షణం దైవనామస్మరణతో పరమేశ్వరుడికి దగ్గరగా ఉండటమే ఉపవాసం. ఇలా నిరంతరం పరమేశ్వరుడికి దగ్గరగా ఉండాలంటే, భౌతికపరమైన ఆహారక్రియలకు దూరంగా ఉండాలి. తెల్లవారు లేచింది మొదలు వండుకోవటం, తినటం, వాటి ద్వారా వచ్చే విసర్జన క్రియలతో సమయాన్ని వృధా చేసుకోవటం, కేవలం శరీరధారణకు అవసమైన సాత్వికాహారాన్ని మాత్రమే తీసుకుంటూ, వీలైనంత ఎక్కువ సేపు పరమేశ్వరుడి సన్నిధిలో గడపటమే ఉపవాసం అనే పదానికి అర్థం.
జాగరణ అంటే ఏమిటి?
బుద్ధి జీవుడైన మానవుడు నిరంతరం చైతన్యంగా ఉండటమే జాగరణ అవుతుంది. లయకారకుడైన పరమేశ్వరుడు లింగోద్భవం చెందిన పరమపవిత్ర దినం మహాశివరాత్రి. ఈ పర్వదినాన ఉపవాసంతో పాటు జాగరణ చేయడం ముక్తి ప్రదాయకమని పురాణాలు పేర్కొంటున్నాయి. ఉపవాస దీక్షతో శివనామస్మరణ చేస్తూ రాత్రంతా జాగరణ చేయడం ఎందుకంటే - మానవ జీవితంపై రాజస, తామస గుణాలు ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి. రాజసం అంటే భావోద్వేగం. తామసమంటే అంధకారం. పగటివేళ రాజసం, రాత్రి వేళ తామస గుణాలు కలుగుతాయి. వీటిపై నియంత్రణకు ప్రణవ నాదాన్ని పూరించిన మహాశివుని భక్తిలో నిమగ్నం కావాలి. తామస వేళ కామం, ఆగ్రహం, అసూయ తదితర విక త గుణాలు మనిషిలో ప్రవేశిస్తాయి. అయితే వీటిని అధిగమించేందుకు పరమేశ్వరుడు చూపిన మార్గదర్శనమే శివరాత్రి ఉపవాసం, జాగరణ. పగలు,రాత్రి భేదం లేకుండా అనుక్షణం మహేశ్వరుని ధ్యానంలో ఉంటే జీవితంపై నియంత్రణ కలిగివుంటామని దీని భావన.
సాధారణంగా మనం చేసుకునే పండుగలన్నీ విందులతో, వినోదాలతో నిండి ఉంటాయి. కానీ, ఇందుకు భిన్నంగా శివరాత్రి జరుగుతుంది. ఈ పర్వదినాన్ని పూర్తిగా ఉపవాసంతో జరుపుకుంటాం. లౌకికమైన ఆహార, విషయవాంఛల నుంచి మనిషిని దూరంగా జరిపి, పరమేశ్వరుడికి చేరువ చేసే అంతరార్థం శివరాత్రి పర్వదినంలో కనిపిస్తుంది.
శివలింగం శివతత్త్వానికి ప్రతీక. కంటికి కనిపించే ఆకాశమే శివలింగ స్వరూపం. ఉపనిషత్తులు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
సాధారణంగా మనుషులకు ఒక ప్రవృత్తి ఉంటుంది. కంటికి కనిపించేదే నిజమనే భ్రమ వారిలో ఉంటుంది. బంగారం నుంచి తయారైన ఆభరాణలకు ప్రాధాన్యత ఇస్తారు. వాటిని గుర్తిస్తారే కానీ ఆభరణాల తయారీకి మూలకారణమైన బంగారాన్ని ఎవరూ గుర్తించరు. అలాగే, ఈ ప్రపంచంలోని సకల ప్రాణి ఆవిర్భావానికి మూలకారణం ఆకాశం. ఈ ఆకాశాన్ని ఎవరూ గుర్తించరు. కంటికి కనిపిస్తూ, మనకు పైభాగంలో కనిపించేదే ఆకాశం అనుకుంటాం. కానీ, అనంతమైన ఆకాశతత్త్వాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చెయ్యటం జరగదు. అందుకనే ఆకాశతత్త్వానికి ప్రతీక అయిన లింగం భౌతికరూపంలో మానవలోకంలో ఉద్భవించింది. ఈ లింగాన్ని దర్శించి, అర్చించటమంటే అనంతమైన ఆకాశతత్త్వాన్ని అర్థం చేసుకోవటమే అవుతుంది. ఎప్పుడైతే ఆకాశ తత్త్వం అవగాహనకు వస్తుందో అప్పుడు శాశ్వతమైన ఆత్మతత్త్వం బోధ పడుతుంది. ఇదంతా జరగటానికి ఇంద్రియాలతో కూడిన మనసు నిత్యచైతన్యంగా ఉండాలి.
జాగరణ పరమార్థం ఇదీ...
మనిషిలో ఉండే అజ్ఞానానికి సంకేతం రాత్రి. జ్ఞానానికి పగలు ప్రతిరూపం. పరమేశ్వర తత్త్వాన్ని తెలుసుకోలేకపోవటమే అజ్ఞానం. ఈ మూడింటిని సమన్వయం చేస్తే శివతత్త్వాన్ని తెలుసుకోలేకపోవటమనే అజ్ఞానం నుంచి మనిషిని దూరం చేసి, ఆత్మజ్ఞానం వైపు మనిషిని నడిపించేందుకు చేసే ప్రయత్నమే జాగరణ అవుతుంది.
రాత్రి తర్వాత వచ్చే పగలు ఆనందాన్నిస్తుంది. అలాగే, అజ్ఞానం తొలగిన తర్వాత వచ్చే విజ్ఞానం మనిషికి శాశ్వత ఆనందాన్నిస్తుంది. జ్ఞానమనే పగటి కోసం చూసే ఎదురుచూపే జాగరణ.
మరొక కోణంలో ప్రాపంచికమైన ఆలోచనలకు రాత్రి అని అర్థం చెప్పుకోవచ్చు. ప్రాపంచికమైన ఆలోచనలకు దూరంగా జరిగి, అలౌకికమైన ఆనందాన్ని అందుకోవటమే జాగరణ. ప్రాపంచికమైన చీకట్లు విడిపోవాలంటే పరమేశ్వరానుగ్రహం కావాలి. ఇందుకోసం మనిషి తపించాలి. నిరంతరం మెలకువగా (జాగరణ) ఉండాలి. అప్పుడు జీవితమంతా శివరాత్రి జాగరణే అవుతుంది.
రాత్రంతా ఎలా మేల్కొని ఉండాలి? శరీర అవయవాలను ఉగ్గబట్టి, బలవంతానా కళ్ళు తెరచి ఉండటం జాగరణ అనిపించుకోదు. మనసును, దృష్టిని ఒకటిగా చేసి, అనుక్షణం శివనామస్మరణ చేస్తూ మెలకువగా ఉండాలి. అదే జాగరణకు అసలైన అర్థం. జాగరణ చేయాల్సిన విధానం కూడా.
మనస్సు ఇంద్రియాల పట్ల కాకుండా ఆత్మపట్ల మేల్కొని ఉండటమే జాగరణ. ఇంద్రియ వ్యామోహంలోకి జారిపోకుండా పరమాత్మ తత్త్వం పట్ల మేల్కొని ఉండటమే జాగరణ అవుతుంది. ఇందుకు ప్రతీకగా రాత్రి మేల్కొని ఉండటం జరుగుతుంది. శరీరం మెలకువగా ఉంటేనే మనస్సు తన చుట్టూ ఏం జరుగుతోందో గమనించగలదు. అందుని, మనసును మెలకువగా, చైతన్యంగా ఉంచేందుకు ఏర్పడిన విధానమే జాగరణ.
అజ్ఞానులకు రాత్రిగా కనిపించే తత్త్వాన్ని పోగొట్టటమే జాగరణ ఉద్దేశం. జ్ఞానులకు అంతా పగలే. వారికి రాత్రి ఉండదు. రాత్రి అంటే భౌతికమైన రాత్రి కాదు. అజ్ఞానమనే రాత్రి. అజ్ఞానమనే రాత్రిని పారద్రోలి విజ్ఞానమనే అఖండమైన వెలుగును పొందటం కోసం చేసే ఆధ్యాత్మిక సాధనే శివరాత్రి జాగరణ. జ్ఞానులకు నిత్యం శివరాత్రి జాగరణే అవుతుంది. ఎందుకంటే, వారు నిత్యం పరమేశ్వర తత్త్వాన్వేషణలో ఉంటారు కాబట్టి.
'యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం' అని శంకరాచార్యులు చెప్పినట్లు చేసే ప్రతి పనిలోనూ, వేసే ప్రతి అడుగులోనూ పరమేశ్వర తత్త్వాన్ని భావించి, ఆధ్యాత్మిక జాగరణ కలిగి ఉంటే, శివానుగ్రహం తప్పక సిద్ధిస్తుంది.
గాంధీనగర్, విజయవాడ – 520003. సెల్ : 90320 44115 / 8897 547 548
-----------------------
శ్రీశైలప్రభ పత్రికలో రాసిన వ్యాసం
------------------------
Sunday, July 15, 2018
ధర్మమూర్తి... సమదర్శి.... జగద్గురు కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి
ధర్మమూర్తి... సమదర్శి ఆయన పేరు పలికితేనే చాలు... వ్యక్తం చేయటానికి మాటలు చాలని అనుభూతి కలుగుతుంది. ఆ కళ్ళలోని వెలుగు ఏదో తెలియని కారుణ్యాన...
-
దీపారాధన దీపారాధన ఎందుకు చెయ్యాలి? దీపారాధన ప్రాముఖ్యత ఏమిటి? దీపం వెలిగించడంలో అంతరార్థం ఏమిటి? పంచభూతాత్మకమైన సృష్టికి ప...
-
ధర్మమూర్తి... సమదర్శి ఆయన పేరు పలికితేనే చాలు... వ్యక్తం చేయటానికి మాటలు చాలని అనుభూతి కలుగుతుంది. ఆ కళ్ళలోని వెలుగు ఏదో తెలియని కారుణ్యాన...
-
భజేహం... భుజంగం శ్రీమహావిష్ణువును శేషశయనుడిని చేసింది సర్పాలే. గరళకంఠుడిగా శివయ్యకు పేరుతెచ్చిందీ సర్పాలే. సూర్యభగవానుడి రథానికి సర్పాలే ...