Showing posts with label Kappagantu Ramakrishna. Show all posts
Showing posts with label Kappagantu Ramakrishna. Show all posts

Thursday, April 18, 2024

తెలుగింటి రాముడు


 
 
 శ్రీరామ

తెలుగింటి రాముడు

రామనామం ఓ తారకమంత్రం. రాముడి వంటి కుమారుడు, సోదరుడు, భర్త, నాయకుడు, మిత్రుడు, పరిపాలకుడు, ధర్మమూర్తి... మరొకరు లేరు అనేది నిర్వివాదం. ప్రతి మనిషికీ రాముడితో ఓదో ఒక అనుబంధం ఉంటుంది. ఆ పేరు చెబితేనే ఆత్మీయత ప్రకటితమవుతుంది.  ప్రత్యేకించి తెలుగు ప్రజలకు రాముడు దేముడు మాత్రమే కాదు. తెలుగు జీవితాల్లో రాముడొక భాగం. రాములోరి పెళ్ళి, లక్ష్మణదేవర నవ్వు, సీతాదేవి నిద్ర అంటూ తెలుగు జానపదులు కూడా రాముడితో చుట్టరికం కలుపుకున్నారు. అదీ రామయ్య ఘనత. రామకథ మహిమ. 


తెలుగులో వచ్చిన తొలి రామాయణం గోన బుద్ధారెడ్డి రాసిన రంగనాథ రామాయణం. ద్విపద ఛందస్సులో వచ్చిన ఈ రామాయణాన్ని పాటలుగా పాడుకుని మురిసిపోయిన తెలుగు లోగిళ్ళు లక్షల్లో ఉన్నాయి. సీతారాముల దాంపత్యంలోని ఔన్నత్యాన్ని తేలికైన మాటలతో చెబుతూనే బరువైన భావాన్ని పలికించాడు బుద్ధారెడ్డి.


రాముడి ధనుర్విద్యాకౌశలం ఎంత గొప్పదంటే “నల్లవో  రఘురామ! నయనాభిరామ! విలువిద్య గురువ  వీరావతార --------- బాపురే రామా భూపాల! లోకముల నే పాటి విలుకాడు నేర్చునే కలుగ” అంటూ పగవాడైన రావణాసురుడు కూడా రామయ్య కోదండకళకు అబ్బురపడి భళీ అని ప్రశంసించాడు.


రావణుడు అపహరించిన విషయం తెలియక రాముడు సీతమ్మ గురించి వెతుకుతూ... ‘‘ఇది మహారణ్యమై యిప్పుడు తోచె / ఇది పర్ణశాలయై యిప్పుడు తోచె / ఇది నాకు దపమని యిప్పుడు తోచె / చల్లని ముఖదీప్తి చంద్రునికిచ్చి / తెల్లని నగవు చంద్రికలకు నిచ్చి / చెలువంపు పలుకులు చిలుకల కిచ్చి / నిన్ను దైవము మ్రింగెనే నేడు సీత’’ - చంద్రుడిలోనూ, వెన్నెలలోనూ, చిలుకల పలుకుల్లోనూ రాముడికి సీత కనిపిస్తోంది. అందుకే సీతమ్మ ఏ అడవి జంతువు వల్ల మృత్యువాత పడిందో అనుకుంటూ ఆవేదన చెందుతాడు.  


ప్రతి అడుగులోనూ, ప్రతి అణువులోనూ భార్యాభర్తలు ఒకరికొకరు కనిపించాలి. అప్పుడే ఆ దాంపత్యానికి సార్థకత ఏర్పడుతుందని రంగనాథ రామాయణం ప్రకటించింది. ఇలా ఎన్నో భావాలు ప్రకటిస్తూ, సీతను తెలుగు జానపదుల ఆడపడుచుగా, రాముడిని జానపదుల దేవుడిగా తీర్చిదిద్ది, వారి హృదయాల్లో శాశ్వతస్థానం కల్పించాడు బుద్ధారెడ్డి. తెలుగు పల్లెల్లో పేటపేటకూ కనిపించే రామాలయాలు, ఇంటింటా వినిపించే సీతారాముల పేర్లూ  ఈ రామాయణ ప్రభావమే.


కవయిత్రి ఆతుకూరి మొల్ల ‘చెప్పుమని రామచంద్రుఁడు / సెప్పించిన పలుకుమీదఁ జెప్పెద’ అంటూ రామాయాణం రచించింది. రాముడికే కాదు రామపాద ధూళికి కూడా ఎంతో మహత్తు ఉందంటూ మొల్ల రామ వనవాస సందర్భంలో చెబుతుంది. అరణ్య వాసానికి బయల్దేరిన రాముడు సీతాలక్ష్మణ సమేతంగా గంగానది దాటాలని ఓడ నడిపే గుహుడిని కోరతాడు. దానికి గుహుడు రాముని పాదధూళి సోకి రాయి కాంతగా మారింది కదా, తన ఓడ కూడా ఏమౌతుందోనని భయం వేస్తోంది. అందుకే నీ పాదాలు కడుగుతాను అంటూ రాముని పాదాలు కడుగుతాడు. 

చ. సుడిగొని రాము పాదములు సోఁకిన ధూళి వహించి రాయి యే
ర్పడ నొక కాంత యయ్యె నఁట, పన్నుగ నీతని పాద రేణు వి
య్యెడ వడి నోడసోఁక నిది యేమగునో” యని సంశయాత్ముఁడై
కడిగె గుహుండు రామపద కంజయుగంబు భయమ్ము పెంపునన్‌. 


వాల్మీకి రామాయణంలో లేని ఈ మొల్ల వర్ణన తరువాత ఎందరో తెలుగు కవుల భావనల్లో ప్రతిధ్వనించింది.

అలా అడవిలో నడుచుకుంటూ వెళ్తున్న సీతారామ లక్ష్మణులను అక్కడి చెంచు స్త్రీలు చూసారు. రతీ మన్మథులను మించిన అందంతో ప్రకాశిస్తున్న సీతారాముల్ని చూస్తూ, తమలో తాము...

చ. ఇతనికిఁ బాదచారితన మేటికి వచ్చెనో? పట్టభద్రుఁ డీ
సతి నవ రూప రేఖలను జక్కని దయ్యును నిట్టి దుర్దశల్‌
ప్రతివసియించు టెట్లో? రతిరాజ సమానుల వీరి నేల యీ
గతిఁ బడఁద్రోచె బ్రహ్మ?” యని కాంతురు చెంచెత లమ్మహాత్ములన్‌. 

ఇంతటి అందగాళ్ళను బ్రహ్మ ఈ అడవుల్లో ఎలా పడేయగలిగాడో అంటూ బ్రహ్మను కూడా నిందించారు. రామయ్య సౌందర్యం అంత గొప్పది. అది కేవలం భౌతిక అందం కాదు. మాటలకందని పారమార్థిక భావనాత్మక సౌందర్యం.


లంకను నుంచి తిరిగి వచ్చిన హనుమంతుడు రాముడిని చూస్తూనే...

“కంటిన్ జానకి బూర్ణచంద్ర వదనన్ గల్యాణి నా లంకలో
గంటిన్ మీ పదపంకజంబులను నే గౌతూహలం బొప్పగా
గంటిన్ మీ కరుణావలోకనము విఖ్యాతంబుగా గీర్తులం
గంటిన్ మా కపి వీర బృందములలో గాంభీర్యవారాన్నిధీ”

- చూసితి సీతను అంటూ రాముడి మనసుకు గొప్ప సాంత్వన కలిగిస్తాడు. అంతేకాదు, సీతలో రామయ్య ఎలా కనిపిస్తున్నాడో కూడా చెబుతాడు. సీత, రాముడు – ఇద్దరు కాదు ఒక్కరే అనే భావాన్ని మొల్ల ఎంతో రమ్యంగా చెప్పింది.

రామకథను ప్రబంధంగా తీర్చిదిద్దిన కవి అయ్యలరాజు రామభద్రుడు. శివధనస్సును రాముడు ఎక్కుపెట్టగానే అది ఫెళ్ళుమని పెద్దశబ్దం చేస్తూ విరిగిపోతుంది.

‘ఆ రమణీయ ధనుష్ఠం / కారము సీతాకుమారికా కల్యాణ / ప్రారంభవాద్య నిరవ / ద్వారమై యొసగె సకల హర్ష ప్రదమై’’  - సీతారాముల కల్యాణ వేడుక కోసం మొదటిగా మోగిన మంగళవాద్యం శివధనుర్భంగం సందర్భంగా వచ్చిన శబ్దమే అంటూ కవి చమత్కరించాడు. అంతేకాదు...

ఆ కరియాన వేనలి అనంత విలాసము మాధవోదయం
బా కమలాయతాక్షి మధురాధర సీమ, హరి ప్రకారమా
కోకిల వాణి మధ్యమున కూడిన దింతియ కాదు, తాను రా
మాకృతి దాల్చె ఈ చెలువమంతయు ఆ యమయందు జొప్పుడున్

సీత పూర్తిగా రాముడిగా మారిపోయిందంటాడు కవి. సీతమ్మను చూస్తే రామయ్యే కనిపిస్తున్నాడట. అంటే, సీతారాములకు అభేదం. శివపార్వతులే కాదు సీతారాములూ అర్ధనారీశ్వరులే. దాంపత్యానికి అర్థం, పరమార్థం ఇదే అంటూ గొప్పగా ప్రకటించింది రామాభ్యుదయ ప్రబంధం.

వానర సేనతో సహా సముద్రాన్ని దాటిన రాముడు, యుద్ధ ప్రారంభానికి ముందు అక్కడి సువేల పర్వతాన్ని ఎక్కి లంకను తేరిపార చూస్తాడు.

తనదు ప్రాణేశ్వరి, మహీతనయ కేడ
యావహిల్లునొ దురవస్థ యనుచు గాక
చుఱుకు జూపుల రఘుపతి జూచినపుడ
లంక యాహుతి గొనదె నిశ్శంక మహిమ

లంకలో ఉన్న తన ప్రాణేశ్వరికి ఏమైనా ఆపద కలుగుతుందేమో అని ఊరకున్నాడు కానీ, మూడోకన్ను తెరచిన శివుడి  మాదిరిగా తన చూపులతోనే లంకను రాముడు కాల్చివేసేవాడట. రాముడు సాక్షాత్తు శివ స్వరూపమే అని చెప్పటంతో పాటు, శివ కేశవ అభేదం కూడా ఈ పద్యంలో ప్రకటించాడు రామభద్ర కవి.

యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోయిన సందర్బంలో రాముడికి వచ్చిన కోపం ఎంతటి ఉత్కృష్టమైనదో వర్ణించడం ఎవరికీ సాధ్యం కాదు.

అభ్రంకష రధ కపి చి / త్ర భ్రమణంబుల వెలింగె ప్రళయాంతక ఫా / ల భ్రాజిష్టు భ్రుకుటీ / విభ్రమ ధౌరేయమైన విల్లుందానున్ - మూర్ఛపోయిన తమ్ముడి వంక మాటిమాటికీ చూస్తూ, రాముడు తన కోదండాన్ని పట్టుకున్న విధానాన్ని చూస్తేనే, ఇక రావణుడికి మృత్యుఘడియ దగ్గరపడిందనే సందేశం ఆ సన్నివేశం చూస్తున్నవారికి అందిందట.


అసలు రాయడం అంటూ జరిగితే రామాయణమే రాయాలి. తనలోని జీవుడి వేదన తీరాలన్నా, తన తండ్రి ఇచ్చిన ఆదేశాన్ని పాటించాలన్నా రామాయణమే రాయాలి. ఇంకే కథ రాసినా అది కట్టుకథే అవుతుందంటూ నిర్మొహమాటంగా చెప్పిన ‘కవిసమ్రాట్’ విశ్వనాథ సత్యనారాయణ. తన రామాయణ కల్పవృక్షంలో రాముడి వైభవాన్ని ప్రపంచం పట్టలేనంతగా విస్తరించి రాసారు. 


జనకుడి సభలో రాముడు ఎక్కుపెట్టిన శివధనుస్సు విరిగిన శబ్దం 

నిష్ఠావర్ష దమోఘ మేఘపటలీ నిర్గచ్ఛదుద్యోతిత
స్పేష్ఠేరమ్మదమాలికా యుగప దుజ్జృంభన్మహా ఘోరబం
హిష్ఠ స్ఫూర్జధుషండమండిత రవాహీన క్రియా ప్రౌఢి ద్రా
ఘ్రిష్ఠంబై యొకరావ మంతట నెసంగెన్ ఛిన్న చాపంబునన్.

ఉరుముల గుంపు నుండి వచ్చే ధ్వనిలాగా శివధనుస్సు విరిచినప్పుడు శబ్దం వచ్చిందట. అక్కడితో ఆగలేదు విశ్వనాథ కవితావేశం. భూమి నుంచి వరుసగా ఐదు ఊర్ధ్వ లోకాల్లో ఆ శబ్దం ఎలా వినబడిందో వివరిస్తూ వరుసగా ఐదు పద్యాలు రాసారు. అదీ రామయ్య బాహు విక్రమం. 

ఇరువదినాలు గేండ్లుగ నిదెప్పు డిదెప్పు డటంచుఁ గన్నులం
దెఱచి ప్రతీక్ష చేయుదుగదే, జగదేకధనుష్కలానిధీ !
విఱచిన వెండికొండదొర వింటిని వింటినిగాని చూడలే
దఱుత వహింప ధాత్రిఁ గనులారగఁ జూతునురా కుమారకా !


శివధనుస్సును విరిచి, సీతమ్మను వివాహం చేసుకున్న సందర్భంలో కౌసల్య మనోభావం ఇది. ఇరవై నాలుగేళ్ళుగా ఈ కల్యాణ ఘడియ కోసమే నిరీక్షిస్తున్నాను కుమారా... అంటూ ఆ తల్లి రాల్చిన ఆనందాశ్రువులు సీతారాముల కల్యాణానికి అక్షతలుగా మారాయి.

అశోకవనంలో రాక్షస స్త్రీల సమూహం మధ్య కూర్చున్న తేజోవతి అయిన ఓ స్త్రీని హనుమంతుడు చూసాడు. ఆమె ఎవరో తెలియదు. కానీ, ఆమెను చూస్తుంటే...

*ఆకృతి రామచంద్ర విరహాకృతి కన్బొమ తీరు స్వామి చా*
*పాకృతి కన్నులన్ ప్రభు కృపాకృతి కైశిక మందు స్వామి దే*
*హాకృతి సర్వదేహమున యందును రాఘవ వంశమౌళి ధ*
*ర్మాకృతి కూరుచున్న విధమంతయు రామ ప్రతిజ్ఞ మూర్తియై* *

అప్పటివరకూ తాను చూసిన రామచంద్రమూర్తి విరహమంతా మనిషి రూపం ధరిస్తే ఎలా ఉంటుందో ఆ స్త్రీ మూర్తి అలా కనిపించింది. రాముడి కోదండాన్ని ఆమె కనుబొమల్లో స్పష్టంగా చూడవచ్చు. ఆమె కళ్ళల్లో రాముడి దయాగుణం, కేశాల్లో రాముని మేనిఛాయ, ఆమె శరీరంలోని అణువణులో రఘువంశ ధర్మం బొమ్మకట్టినట్లు కనిపిస్తోంది. అంతేకాదు... తన ధర్మపత్నిని అపహరించిన వాడిని సంహరిస్తానని రాముడు చేసిన ప్రతిజ్ఞ ఆకారం ధరించిందా అన్నట్లు ఆమె కూర్చున్నదట. 

విశ్వనాథ కల్పవృక్షంలోనూ సీతారాములు ఇద్దరు మనుషులు కారు. రెండు భౌతిక రూపాల్లో ప్రకటితమయ్యే  ఒకే ఆత్మ.

ఇంకా... రఘునాథ రాయలు (రఘునాథ రామాయణం), ఘనగిరి రామకవి (యథావాల్మీకి రామాయణం), చెన్న కృష్ణయ్య (సాంఖ్య రామాయణం), గంగయ్య (తారకబ్రహ్మ రామాయణం).... ఇలా తెలుగులో సుమారు 130 వరకు రామాయణాలు వచ్చాయి. 
 
అన్నిటా ఒకటే సందేశం... రాముడు భారతజాతి ఆత్మ.
--------------------------------------------------------------
భక్తి పత్రిక ఏప్రిల్, 2024 సంచికలో ప్రచురితమైన వ్యాసం
----------------------------------------------------------------
రచన : డాక్టర్ కప్పగంతు రామకృష్ణ, అసోసియేట్ ప్రొఫెసర్, కెబిఎన్ కళాశాల (అటానమస్), విజయవాడ-1
 


 

Tuesday, March 7, 2023

దీపారాధన ఎందుకు చెయ్యాలి? దీపారాధన ప్రాముఖ్యత ఏమిటి? దీపం వెలిగించడంలో అంతరార్థం ఏమిటి?

 

దీపారాధన


దీపారాధన ఎందుకు చెయ్యాలి? 


దీపారాధన ప్రాముఖ్యత ఏమిటి? 


దీపం వెలిగించడంలో అంతరార్థం ఏమిటి?


           పంచభూతాత్మకమైన సృష్టికి ప్రతీక దీపం. మట్టి ప్రమిద భూతత్వానికీ, తైలం జలతత్వానికీ, వత్తి ఆకాశతత్వానికీ, వెలగడానికి తోడ్పడే గాలి వాయుతత్వానికీ, జ్యోతి అగ్ని తత్వానికీ ప్రతీకలు. మనిషి శరీరమూ పంచభూతాల సమాహారమే కాబట్టి దీపాన్ని వెలిగించడమంటే మనల్ని మనం వెలిగించుకోవడమే. మనలోని అజ్ఞానపు అంధకారాల్ని నశింపజేసే ఆ పరమాత్మకు సమీపంగా వెళ్లడమే. దీపం దానంతట అది ఎలా వెలగలేదో మనిషీ పుట్టుకతో జ్ఞాని కాలేడు. అందుకే దేవుడి ముందు దీపాన్ని వెలిగించి ఆ వెలుగులో మన ఆత్మదీపాన్ని వెలిగించుకుంటాం. లోలోపలి చీకట్లను వదిలించుకుంటాం. దీపానికి ఉండే మరో ప్రత్యేకత... అది ఎప్పుడూ ఊర్ధ్వదృష్టినే కలిగి ఉండటం. దీపం నుంచి అజ్ఞానమనే చీకట్లను పారదోలడం నేర్చుకున్నట్లే మనస్సును అల్పవిషయాలవైపు మళ్లించకుండా ఊర్ధ్వదృష్టిని కలిగి ఉండటమూ నేర్చుకోవాల్సిన పాఠమే.

          సృష్టి, స్థితి, లయలకు దీపంతో సన్నిహితమైన సంబంధం ఉంది. దీపం ప్రజ్వలించినప్పుడు వచ్చే ఆ కాంతిని త్రిమూర్తులకు ప్రతీకగా పూర్వ ఋషులు పేర్కొన్నారు. ఆ కాంతిలో అంతర్లీనంగా కనిపించే నీల వర్ణం స్థితికారుడైన విష్ణువుకు, తెల్ల రంగు లయకారుడైన శివునకు, ఎర్ర రంగు సృష్టికర్త బ్రహ్మకు సంకేతాలుగా అభివర్ణించారు. విద్య, శక్తి, సంపదలను ప్రసాదించే ముగ్గురమ్మలు సరస్వతి, దుర్గ, లక్ష్మి- ఆ కాంతిలో కొలువై ఉంటారని పెద్దలు అంటారు.

          ‘‘వైరాగ్య తైల సంపూర్ణే, భక్తి వర్తి సమన్వితే / ప్రబోధ పూర్ణపాత్రేతు జ్ఞానదీపం విలోక్యత్‌’’ అన్నారు ఋషులు. అంటే ప్రబోధంఅనే ప్రమిదలో, ‘వైరాగ్యంఅనే తైలం పోసి, ‘భక్తిఅనే వత్తిని వెలిగించి, జ్ఞానజ్యోతిని ప్రకాశింపజేయాలని అర్థం. ఆ జ్యోతి ప్రసరించే ప్రకాశాన్ని దర్శించి, వారు ముక్తి పొందారు.

          ముక్తిని ప్రసాదించేవాడు పరమాత్మ. ఆ పరమాత్మకు సంకేతం జ్యోతి. పరమాత్మే పరంజ్యోతిఅని వేదం అంటోంది. పరమాత్మ యజ్ఞ స్వరూపుడు. యజ్ఞ చిహ్నాన్ని దీపంగా భావిస్తారు. జ్యోతి లేదా దీప ప్రజ్వలన అంటే యజ్ఞం చేయడమే! దీపావళి రోజున దీపాలను ప్రజ్వలింపజేసి, జగన్మాతకు ధారపోసి, భక్తి ప్రపత్తులను సమర్పించుకోవడమే దీపయజ్ఞం. ఆ దీపాలను ఇంటి ముంగిట, దైవీ వృక్షాల చెంత, ఇంటిలోని ద్వారాల దగ్గర వరుసలుగా పేర్చడం దీపయజ్ఞంలో భాగమే. దీప దర్శనం పాపాలను హరిస్తుంది. దీపకాంతి దేవతలకు అత్యంత ప్రీతికరం. అందుకనే ప్రతి పూజారంభానికీ, శుభకార్యాలకూ దీప ప్రజ్వలనం ముఖ్యం. లౌకికంగా చెప్పాలంటే, మన హృదయాన్ని ప్రమిదగా భావించి, అందులో భకి్త అనే తైలం పోసి, ‘ప్రేమఅనే వత్తి నిలిపి వెలిగించేదే దీపం.

          దీపావళి పర్వాన్ని గురించి పురాణేతిహాసాలు విస్తృతంగా ప్రస్తావించాయి. రామాయణంలో రఘుకులాన్వయదీపునిగా రాముణ్ణి కీర్తిస్తూ, వనవాసానంతరం సీతారాముల పట్టాభిషేక సమయంలో అయోధ్యలో ప్రజలు దీపోత్సవం జరుపుకొన్నారట. కురుక్షేత్ర సంగ్రామానంతరం ధర్మరాజు విజయుడై పట్టాభిషేకం చేసుకున్న సందర్భంలో హస్తినాపుర ప్రజలు ఆనందోత్సాహాలతో దీపాలను వెలిగించి పండగ చేసుకున్నారని మహాభారతం చెబుతోంది. నచికేతుడు తన మేధస్సుతో యముడిని సంతృప్తిపరచి, ఆత్మను గురించి తెలుసుకున్నాడు. యముడి నుంచి స్వేచ్ఛ పొంది, నచికేతుడు తిరిగి భూలోకానికి వచ్చిన సందర్భంలో జరిగిన దీపోత్సవమే దీపావళి అని కఠోపనిషత్తుకథనం. క్షీరసాగర మథన సమయంలో అవతరించిన శ్రీమహాలక్ష్మికి దీపాలను వెలిగించి దేవతలు స్వాగతం పలికారని పద్మపురాణంపేర్కొంటోంది. దుష్ట దనుజులను దునుమాడిన మహాకాళిని జ్యోతిగా, లక్ష్మీస్వరూపంగా ఆరాధించినట్టు కాళికాపురాణం చెబుతోంది.

 

          దుర్వాస ముని శాపంతో ఇంద్ర పదవిని దేవరాజు కోల్పోయి, శ్రీ మహావిష్ణువును శరణు వేడాడనీ, ‘లక్ష్మీ జపధ్యానాలు చేస్తే, తిరిగి నీ పదవి నీకు దక్కుతుందని విష్ణుమూర్తి చెప్పాడనీ, ఆ ప్రకారం లక్ష్మీదేవి కోసం అతను తపస్సు చేసి, ఇంద్రపదవిని తిరిగి పొందాడనీ ఒక కథ ఉంది. దీపావళిని దీపాన్వికగా భవిష్య, నారద పురాణాలు పేర్కొన్నాయి. స్కాంద పురాణంలో దీపావళి గురించిన వివరణ విస్తారంగా ఉంది. నారద పురాణం దీన్ని దీప దాన మహోత్సవంఅని చెప్పింది. ముద్రారాక్షస గ్రంథం శారదోత్సవంగా, నాగానందం గ్రంథంలో దీప ప్రతిపాదనోత్సవంగా దీపావళిని పేర్కొన్నారు.

          'దీపేన సాధ్యతే సర్వం' అని శాస్త్రవచనం. 'దీపంతో దేనినైనా సాధించవచ్చు' అని భావం. నిత్యం దీపారాధన భారతీయుల సంప్రదాయం. ఉభయసంధ్యల్లో ఇంట్లో వెలిగించిన దీపం ఐశ్వర్యకారకం- అని ధార్మిక గ్రంథాలు బోధిస్తున్నాయి. 'ఏదైనా కోరిక తీరాలంటే, ఒక దీపాన్ని వెలిగించి- ఖర్జూరమో, ఎండుద్రాక్షో లేదో ఏదైనా ఫలమో నైవేద్యం పెట్టి నమస్కరించితే చాలు' అని ఆనవాయితీగా దీపారాధన కొనసాగుతోంది. ఇలా దీపారాధన చేయడంవల్ల ఏ ప్రయోజనమైనా పొందవచ్చు- అన్నది శాస్త్రోక్తి.

 

          దేవతలు ప్రకాశస్వరూపులనీ, కాంతి-శుభానికీ, జ్ఞానానికీ, శాంతికీ సంకేతమనీ చాటిచెప్పే ఆర్షభావన దీప ప్రజ్వలనలో కనిపిస్తోంది. జ్యోతిని వెలిగించడం శుభారంభం. తేజోమయులైన దేవతలు దీపంద్వారా సంతోషిస్తారనీ, దీపప్రకాశంలో సన్నిహతులవుతారనీ పురాణ ఋషుల దర్శనం. దీపకాంతి దివ్యత్వ ప్రతీక కనుక, ఆ దివ్యత్వాన్ని కావాలని ఆశిస్తూ దీపంద్వారా వ్యక్తీకరించుకుంటున్నాం. 'దీపమున్న చోట దేవతలుంటారు'- అనడం ఈ కారణం వల్లనే.

 

          కేవలం దీపాన్ని మాత్రమే వెలిగించి, ఆ జ్యోతిని ఆలంబనగా పరంజ్యోతి అయిన పరమాత్మను ధ్యానించడం ఒక యోగ ప్రక్రియ. భర్తృహరి తన శతక సాహిత్యంలో పరమేశ్వరుని 'జ్ఞానదీపం'గా అభివర్ణించాడు. ఈ దీపం యోగుల హృదయగృహంలో సుస్థిరంగా దీపిస్తోందని సంభావించాడు.


          భారత పురాణ ఇతిహాసాల్లోనూ, వేద వేదాంగాల్లోనూ దీపానికి ఉత్కృష్టమైన స్థానం ఉంది. దీపంలో మనం మొట్టమొదటిగా చూసే సుగుణం కాంతే కానీ అంతకు మించిన ఒక స్ఫూర్తిని దీపం మనకు అందిస్తుంది. దీపం చివరి వరకు తన కాంతిని పరులకి పంచుతుంది. తన నుండి మరొక దీపాన్ని వెలిగించేందుకు తపిస్తుంది. దీపం మనోవికాసానికీ, ఆనందానికీ, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. వెలుగు సంతోషకారకం. చీకటి కష్టకారకం. జీవితం చీకటి వెలుగుల కలయిక. జ్ఞాన వెలుగుల్ని ప్రసాదించేది దీపం. అజ్ఞానానికి చిహ్నమైన తమస్సును నశింపచేసి జీవులకు వెలుగు మార్గాన్ని చూపించేదే దీపం. అందుకే దీపం పరబ్రహ్మ స్వరూపంఅని భావిస్తూ ఆరాధిస్తారు. వెలిగించడంసనాతన భారతీయ సంస్కృతి.

          మంత్రశాస్త్ర ప్రకారం సాక్షాత్ దీపం దర్శయామిఅనే మంత్రం చదువుతూ గృహాన్ని శుభ్రం చేసి, నీటిని చల్లి, ముగ్గులు పెట్టి ధూపం వెలిగించి దీపం పెట్టడంవల్ల సకల దుష్ట గ్రహ శక్తులు నశించి వాతావరణం పరిశుభ్రం అవుతుంది. అప్పుడే ఆ గృహం పూజార్హతకు అవకాశం కలుగుతుంది. దీపం వెలిగించగానే ఇంటికి లక్ష్మీకళ వచ్చేస్తుంది. లక్ష్మీదేవి దీపవాసిని. దీపకాంతి నుంచే కళ పుడుతుంది. దీపం అమంగళాన్నీ, దారిద్య్రాన్నీ, అరిష్టాల్ని పారద్రోలే శక్తి స్వరూపం. దీపం వెలగని ఇంట్లో అలక్ష్మి తాండవిస్తుందంటారు పెద్దలు. పూర్వకాలంలో ప్రతి ఇంటా నిత్యం అగ్నిహోత్రం నిర్వహించేవారు. కానీ నేటి పరిస్థితుల దృష్ట్యా రోజూ అగ్నిహోత్రం వెలిగించడం సాధ్యం కాదు. కానీ ఇంట్లో రోజూ ఉదయం, సాయంకాలం దీపారాధన చేయడం శుభప్రదం. మరణించిన వ్యక్తులకు ఉత్తమ గతులు సిద్ధించాలన్నా దీపాలు వెలిగించాలని శాస్త్రాలు చెబుతున్నాయి.

==============

 డాక్టర్ కప్పగంతు రామకృష్ణ

సెల్: 90320 44 115 / 8897 547 548

 

 


Tuesday, April 5, 2022

శ్రీసీతారామ కల్యాణ వైభవం

 

 

 

శ్రీ సీతారామ కల్యాణ వైభవం

 

 శ్రీ సీతారాములు - ఆదర్శదంపతులకు అసలైన అర్థం. సీతారామ కల్యాణం - యావత్ప్రపంచానికి శాంతిసౌభాగ్యాలను అందించిన మహోన్నత ఘట్టం. ఎన్నో వేల సంవత్సరాల క్రితం జరిగిన ఈ కల్యాణం నేటికీ నిత్యనూతనంగా వెలుగులు విరజిమ్ముతూ, సనాతన భారతీయ దాంపత్య ధర్మ వైభవానికి కీర్తిపతాకంగా అఖండంగా, అనంతంగా విశ్వవిహారం చేస్తూనే ఉంది.

 ముప్ఫైమూడు కోట్ల మంది దేవతలు ఉన్న హైందవ ధర్మంలో మరే ఇతర దేవతల కల్యాణానికి దక్కని వైభవం, మహత్తు కేవలం సీతారామ కల్యాణానికే మాత్రమే దక్కాయి. ఒక్క సీతారాముల కల్యాణాన్ని మాత్రమే సీతారామ శాంతి కల్యాణం అని పిలుస్తారు. వైదిక క్రతువుల్లో కూడా 'శ్రీసీతారామ శాంతి కల్యాణ మ¬త్సవాంగత్వే...' అని సంకల్పం మొదలు మాంగల్యధారణ, ఆర్ద్రాక్షతారోపణ వరకు చెబుతారు. దీని ద్వారా సీతారామ కల్యాణం లోకకల్యాణ హేతువని అర్థమవుతోంది.

ఆలూమగలంటే సీతారాముల వలే ఒకరికొకరుగా ఉండాలనటం, నవదంపతుల్ని సీతారాముల్లాగా ఉండమని ఆశీర్వదించటం, ఉత్తమ సాధ్విని సీతమ్మ తల్లిగా పిలవటం, గౌరవ మర్యాదలు తెలిసిన వ్యక్తిని మా మంచి రామయ్య అనటం, శ్రీరామనవమి రోజున సీతాకల్యాణం జరిగిన తర్వాతనే తమ బిడ్డల వివాహ సుముహూర్తాలు నిశ్చయించుకునే ఆచారం పాటించటం, సీతారామకల్యాణ అక్షతలను తమ బిడ్డల వివాహ తలంబ్రాలలో కలిపితే నవదంపతులు చల్లగా ఉంటారనే విశ్వాసం కలిగి ఉండటం, ఇంకా మరెన్నో సంప్రదాయాలు, ఆచారాలు, విశ్వాసాలు - కేవలం సీతారామ కల్యాణానికి మాత్రమే చెందిన ప్రత్యేకతలు. యావత్ప్రపంచ వాజ్ఞ్మయంలో మరే ఇతర కల్యాణం సాధించని అరుదైన ఘనతకు ప్రతిరూపాలు.

సీతారామ కల్యాణానికే ఎందుకీ ఘనత? అంటే - సీతారాములిద్దరూ సాధారణ స్త్రీపురుషులు కాదు. వారిద్దరూ యజ్ఞఫలితంగా ఆవిర్భవించిన పుణ్యమూర్తులు. తమ వంశం తరించటానికి పుత్రసంతానం కోసం దశరథ మహారాజు చేసిన యాగఫలితంగా శ్రీరామచంద్రమూర్తి జన్మిస్తే, యజ్ఞ నిర్వహణలో భాగంగా యాగశాల కోసం భూమిని దున్నుతున్న జనక మహారాజుకు నాగేటి చాలు ద్వారా లభించిన యజ్ఞప్రసాదం సీతాదేవి. 'యజ్ఞాః లోక కల్యాణ హేతవః' - యజ్ఞాలు లోక కల్యాణానికి కారకాలుగా నిలుస్తాయి. అటువంటి యజ్ఞ ఫలితంగా జన్మించిన సీతారాముల కల్యాణం లోకకల్యాణ యజ్ఞానికి హేతువుగా నిలిచింది.

 ఆత్మప్రబోధం... శివధనుర్భంగం

 విశ్వామిత్రుని యాగసంరక్షణ కోసం బయలుదేరిన రామలక్ష్మణులు, యాగం పూర్తికాగానే విశ్వామిత్రుని వెంట మిథిలా నగరానికి వెళ్ళి, జనక మహారాజు ఆస్థానానికి చేరుకుంటారు. విశ్వామిత్రుడు చెప్పిన మీదట జనక మహారాజు శివధనుస్సును రామలక్ష్మణులు చూపించటానికి సిద్ధపడి, ఆ ధనస్సును తీసుకురావల్సిందిగా తన మంత్రులను ఆదేశిస్తాడు.

 నృణాం శతాని పంచాశత్‌ వ్యాయతానాం మహాత్మనామ్‌

మంజూషామ్‌ అష్టచక్రానాం తాం సమూహస్తే కథంచన ||

 బలిష్ఠులు, దీర్ఘకాయులు అయిన ఐదువేల మంది పురుషులు, ఎనిమిది చక్రాలున్న శకటం మీద అమర్చి ఉన్న శివధనుస్సును అతి కష్టంతో తోసుకుంటూ తీసుకువస్తారు. నాగ, కిన్నెర, కింపుర, యక్ష, రాక్షసులతో సహా సమస్త దేవతా గణాలకు ఈ ధనస్సును ఎక్కుపెట్టటం సాధ్యం కాలేదని జనకుడు విశ్వామిత్రునితో చెబుతాడు. వెంటనే విశ్వామిత్రుడు 'వత్స రామ ధను: పశ్య' - నాయనా రామా! ఈ ధనుస్సును చూడు అంటాడు. వ్యవహారభాషలో చెప్పాలంటే ఈ ధనుస్సు సంగతి చూడు అని అర్థం.

 మహర్షి వాక్యంలోని అంతరార్థం గ్రహించిన రాముడు 'లీలయా స ధనుర్మధ్యే జగ్రాహ వచనాన్మునేః' - ఆ ధనుస్సు మధ్యభాగాన్ని చేతితో పట్టుకుని, ఎంతో అలవోకగా ఎక్కుపెడతాడు. కేవలం రాముని కరస్పర్శతోనే ధనుస్సు వంగుతుంది. ఎడమ చేతితో ధనుస్సును పట్టుకుని, కుడి చేతితో ఆ వింటి నారిని పైకొనకు బంధించి, ఆకర్ణాంతం ఆల్లెత్రాటిని లాగుతాడు. మరుక్షణంలో ఫెళఫెళమంటూ లోకభీకరమైన శబ్దం చేస్తూ, శివ ధనుస్సు రెండుగా విరుగుతుంది. సీతారామ కల్యాణానికి ఇదే శ్రీకారం.

 హోజ్జ్వలమైన ఈ ఘట్టాన్ని ఆధ్యాత్మికంగా పరికించి చూస్తే, సమున్నతమైన ఆత్మబోధ మనకు అందుతుంది. శాస్త్ర పరిభాషలో ధనుస్సు అంటే ఓంకారం లేక ప్రణవం అని అర్థం. 'ప్రణవో ధనుః శిరోహ్యాత్మా బ్రహ్మతల్లక్ష్యముచ్చతే' - అని ఉపనిషద్వాక్యం. ప్రణవం అంటే వంగేది అని అర్థం. ప్రణవం ఎవరికైతే వంగుతుందో, అటువంటి వ్యక్తికి మన ఆత్మను అర్పించాలి. ఇక్కడ ధనుస్సు రూపంలో ప్రణవం రామచంద్రునికి వంగింది. అంటే, మన ఆత్మను అర్పించటానికి తగిన దైవం రామచంద్రమూర్తి. శివధనుస్సును ఎక్కుపెట్టటానికి ఎందరో దేవతలు కూడా ప్రయత్నించారు. వారెవరికీ అది సాధ్యం కాలేదు. అంటే ప్రణవం ఎవరికీ వంగలేదు. రామునికి మాత్రమే వంగింది. అంటే, మన ఆత్మార్పణకు అసలైన మార్గం శ్రీరాముని చరణాలే అని స్పష్టమవుతోంది.

 ఓంకారం కారణదశలో అకారంగా మారుతుంది. 'అదితి భగవతో నారాయణస్య ప్రథమ విధానం' అనే వాక్యం ప్రకారం అకారం శ్రీమన్నారాయణుడి యొక్క మొదటి పేరు. 'ఏతస్మిన్‌ అంతరే విష్ణురుపయాత మహాద్యుతిః' - దశరథునికి పుత్రుడిగా జన్మించింది సాక్షాత్తు శ్రీమహావిష్ణువు. అంటే, ప్రణవ స్వరూపుడైన శ్రీమహావిష్ణువే దశరథుని కుమారుడైన శ్రీరామచంద్రునిగా మానవావతారంలో జన్మించాడు. అందుకనే జనకుడు లక్ష్మీస్వరూపిణి అయిన సీతమ్మను నారాయణ స్వరూపుడైన రామచంద్రునికి అర్పించాడు.

 మరొక అర్థంలో చూస్తే - శ్రీరామచంద్రుడు ఒక్కసారిగా శివధనుస్సును ఎక్కుపెట్టాడు. దాన్ని సంధించటానికి ఉన్న నారిని కట్టగానే, ఒక్కసారిగా ధనుస్సు రెండు ముక్కలెలంది. ధనస్సు యొక్క ఒక భాగం శ్రీరాముని చేతిలో ఉంది. రెండో భాగం నారి ద్వారా వేలాడుతోంది. ఇది శివధనుర్భంగ దృశ్యం. ', , ' అనే అక్షరాల కలయికే ఓం కారం. అక్షరానాం అకారోస్మి అనే వాక్యం ప్రకారం రామచంద్రమూర్తి అకార స్వరూపం. ఇది (నారాయణ స్వరూపం) నేను చెప్పటానికి రాముడు ధనుస్సు యొక్క ఒక భాగాన్ని తన చేతితో పట్టుకున్నాడు. రెండో భాగం ''తో కలిసి ఉండే '' అంటే మనిషి (జీవుడు). '' కి '' కి మధ్య ఉన్న ధనుస్సు యొక్క నారి '' కార స్వరూపం. ''కారాన్ని ''కారాన్ని ''కారం కలిపి ఉంచుతుంది. ఆంటే, జీవాత్మ, పరమాత్మల సంబంధం ఎప్పటికీ వేరు పడేది కాదు అనే సత్యం మనకు బోధ పడుతుంది.

 రెండుగా విడిపడిన ధనుస్సు యొక్క ఒక ఖండాన్ని చేతితో పట్టుకుని 'ఓంకార ప్రతిపాద్యమైన దైవాన్ని నేనే సుమా! జీవుడు నాకు సంబంధించిన వాడే కానీ స్వతంత్రుడు కాడు' అనే విషయాన్ని రామచంద్రమూర్తి స్పష్టంగా ప్రకటించాడు. ఇదీ శివధనుర్భంగ ఘట్టం ద్వారా మనకు అందే అద్వైత వేదాంత బోధ.

 పంచభూతాత్మక పరతత్త్వం

 రాముడు నీలమేఘ శ్యాముడు. నీలవర్ణం ఆకాశ లక్షణం. అంటే రాముడు పంచభూతాల్లో ఒకటైన ఆకాశ తత్త్వానికి ప్రతీక. సీతమ్మ నాగేటి చాలు ద్వారా అయోనిజగా లభించింది. అంటే, సీతమ్మ పంచభూతాల్లో మొదటిదైన భూతత్త్వానికి ఆలంబన. పంచభూతాల్లో మొదటిదైన భూతత్త్వం సీతమ్మ కాగా, చివరిదైన ఆకాశ తత్త్వం రామయ్య. ఈ రెండిటి మధ్యలోనే మిగిలిన మూడు తత్త్వాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఆకాశం భూమిని చేరుతుందో (వాన చినుకుగా మారి) అప్పుడు పుడమి (భూమి) పులకరిస్తుంది. సస్యాన్ని అందిస్తుంది. ఆ సస్యం జీవులకు ఆహారంగా మారి, శక్తిని ఇస్తుంది. అంటే, ఎప్పుడు రామయ్య సీతమ్మకు చేరుకుంటాడో (సీతారామ కల్యాణం జరుగుతుందో) అప్పుడే లోకానికి శక్తి (రావణాది రాక్షస బాధ నుంచి విముక్తి పొందే శక్తి) అందుతుంది. ఈవిధంగా సీతారామ కల్యాణం లోక కల్యాణ కారకంగా, శాంతి దాయకంగా నిలుస్తుంది.

 లౌకిక వ్యవహారంలో చూసినా, సీతారామ కల్యాణం సంవత్సరంలో మొదటి (వసంత) ఋతువు, మొదటి (చైత్రం) నెలలో జరుగుతుంది. అంటే, కొత్త సంవత్సరంలో జరిగే తొలి కల్యాణం సీతారాముల కల్యాణమే. శిశిరంలో ఆకులు రాలి మోడుగా తయారైన చెట్లు, వసంతం రాగానే చిగురించి, నూతన శోభను సంతరించుకుంటాయి. ఎప్పుడు సీతారామ కల్యాణం జరుగుతుందో అప్పుడు నవ వసంతం మొదలవుతుంది. ఎవరు సీతారామ కల్యాణం జరుపుతారో, వారి జీవితాల్లో నవ వసంతం నిత్యవసంతంగా మారుతుంది. ఇదీ సీతారామ కల్యాణవైభవం.

 కల్యాణగానం 

 రాములోరి పెళ్ళిగా జానపదులు సీతారామ కల్యాణ వైభవాన్ని జానపదాలుగా పాడుకుని, తనివితీరా రామభక్తి సామ్రాజ్యంలో మునిగి తేలుతుంటారు. పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమయ్య కూడా తన కీర్తనల్లో అనేక చోట్ల సీతారాముల కల్యాణోత్సవాన్ని, నవదంపతులుగా సీతారాములను మనసారా కీర్తించాడు. 'రామం ఇందీవర శ్యామం పరాత్పర ధామం - సుర సార్వభౌమం భజే - సీతా వనితా సమేతం'; 'అట్టె హరువిల్లు విరిచిన రాఘవా - సిరులతో జనకుని యింటను జానకి జెలగి పెండ్లాడిన రాఘవా', 'రాముడు రాఘవుడు రవికులుడితడు - భూమిజకు పతియైన పురుష నిధానము' వంటి కీర్తనలు ఇందుకు ఉదాహరణ. 'సీతమ్మ మాయమ్మ..' వంటి వాగ్గేయకార కృతులు, 'వామే భూమిసుతా పురశ్చ హనుమాన్‌...' వంటి ధ్యానశ్లోకాలు సీతారాముల అన్యోన్య దాంపత్యాన్ని నిరంతరం మననం చేస్తాయి. 

మొత్తంగా సీతారామ కల్యాణం లోక కల్యాణ కారకంగా, ఆత్మచైతన్య ప్రబోధకంగా, ధార్మిక జీవన మార్గదర్శకంగా నిలుస్తుంది. అన్నిటినీ మించి, యావత్ప్రపంచం శిరసు వంచి నమస్కరిస్తున్న సనాత హైందవ వైవాహిక జీవన ధర్మానికి ఆలంబనగా నిలుస్తుంది.

 --------------------------------------

డాక్టర్‌ కప్పగంతు రామకృష్ణ,  

సెల్‌: 90320 44115

Saturday, May 16, 2020

Thursday, November 14, 2019

అయోధ్యా నగర విశేషాలతో డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr Kappagantu Rama Krishna) రాసిన వ్యాసం



రామయ్య నడయాడిన నేల







అయోధ్య..

కేవలం నగరం మాత్రమే కాదు. తరగని ఆధ్యాత్మిక చింతనకు ఆయువుపట్టు. యుగయుగాల చరిత్రకు నిలువెత్తు దర్పణం. ఊహకందని ప్రాకృతిక సౌందర్యానికి ఆలవాలం. రాజనీతికి, ధర్మవర్తనకు, ప్రజారంజకమైన పాలనకు మారుపేరు. సనాతన భారతీయ సాంస్కృతిక హర్మ్యానికి హృదయ పీఠి.

 

ఇతర నగరాల మాదిరిగా అయోధ్య కేవలం భౌగోళిక ప్రాంతంగా మిగిలిపోలేదు. యుగాలు మారినా, తరాలు గడిచినా ఇప్పటికీ తనకుమాత్రమే సొంతమైన ప్రాభవంతో కోట్లాది హృదయాల్లో ప్రత్యేకస్థానంతో అలరారుతోంది. అయోధ్య అనే పేరు చెబితేనే వర్ణించటానికి మాటలు చాలని ఓ అనుభూతి మనసు తలుపులు తడుతుంది. మనందరి దైవం నదయాడింది ఈ నేల మీదే అనే భావన మనసుల్ని పులకింపజేస్తుంది. ఒక్కసారి ఈ మట్టిని ముట్టుకుంటే చాలు జీవితం ధన్యమవుతుందని కోట్లాది హృదయాలు ఆరాటపడతాయి. కేవలం ఈ నగరానికి మాత్రమే ఎందుకీ ప్రత్యేకత? ఈ మట్టి కోసమే ఇంత ఆరాటమా? అంటే యుగాలనాటి చరిత్రను తరచి చూడాల్సిందే.

 

ఆదికవి వాల్మీకి రామాయణానికి పునాది అయోధ్య. మహర్షి తపస్సు చేసి మరీ వెతికిన సుగుణాల రాశి రామయ్య పుట్టిన నేల అయోధ్య. అందుకే వాల్మీకికి అయోధ్య అంటే వల్లమాలిన ప్రేమ. తన రామాయణం బాలకాండలోని ఐదు, ఆరు సర్గల్ని పూర్తిగా అయోధ్యానగర వర్ణనకే కేటాయించాడు వాల్మీకి.

 

అయోధ్య నామ నగరీ తత్రాసీల్లోక విశ్రుతా

మనునా మానవేంద్రేణ యా పురీ నిర్మితాస్వయమ్ (బాలకాండ, 5-6)

 

కోసలదేశంలో ఉన్న అయోధ్య నగరాన్ని మానవేంద్రుడైన మనువు స్వయంగా నిర్మించాడు. అందువల్ల ఆ నగరం మరింతగా లోకప్రసిద్ధి పొందింది... అంటూ బాలకాండలో అయోధ్యా నగర వర్ణన ప్రారంభమవుతుంది.

 

అయోధ్య పొడవు 12 యోజనాలు. వెడల్పు మూడు యోజనాలు. ఇప్పటి లెక్కలో ఇది సుమారుగా 168 కి.మీ  పొడవు, 42 కి.మీ వెడల్పునకు సమానం. దీనిప్రకారం అయోధ్య నగరం వైశాల్యం 7.056 చ.కిమీ.

 

 అయోధ్య ఏదో అనుకోకుండా ఏర్పడిన నగరం కాదు. ఎంతో ప్రతిభ కలిగిన శిల్పులు, వాస్తు నిపుణులు ఈ నగరాన్ని శాస్త్ర ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దారు. నగరం మధ్యభాగంలో అంగడులు ఉండేవి. అక్కడ వివిధ యంత్రాలు, ఆయుధాలు ఉండేవి. ఎత్తైన కోట బురుజులు, ధ్వజాలు, వందలకొద్దీ శతఘ్నులు ఉండేవి. కోటకు రక్షణగా వందల కొద్దీ మేలుజాతి గుర్రాలు, వేగంగా నడిచే ఏనుగులు, ఎద్దులు, ఒంటెలు లు ఉండేవి. మొత్తంగా శత్రుదుర్భేద్యంగా అయోధ్యను తీర్చిదిద్దారు నిపుణులు. అయోధ్యలోని ప్రాకారాలు, కోటను కాపాడటానికి వేలాదిమంది సుశిక్షితులైన యోధులు కోట బురుజుల మీద, కోట లోపల నిరంతరం కాపలాగా ఉండేవారు. వీరందరూ శస్త్రాస్త్రవిద్యల్లో నిపుణులు. ప్రత్యేకించి శబ్దభేది విద్య (కంటితో చూడకుండా కేవలం శబ్దం విని లక్ష్యాన్ని చేదిస్తూ బాణాలు వేసే విద్య)లో అరితేరినవారు.

 

చిత్రామ్ అష్టాపదాకారాం వరనారీగజైర్యుతామ్

సర్వరత్నసమాకీర్ణాం విమానగృహశోభితామ్ (బాలకాండ, 5:16)

 

చదరంగంలో ఉండే పలకల వంటి నిర్మాణాలు కలిగిన భవనాలు ఇక్కడ ఉండేవని వాల్మీకి ఎంతో స్పష్టంగా చెప్పాడు. అందంతో పాటు శత్రువుల ఊహకు అందనివిధంగా ప్రజల్ని కాపాడేందుకు అప్పటి నగరశిల్పులు తీసుకున్న శ్రద్ధ ఇందులో కనిపిస్తుంది.

 

'యోద్ధుం ఆశక్యా ఇతి అయోధ్య' - జయించటానికి వీలుకానిది అయోధ్య అని అర్థం. కేవలం పేరులోనే కాదు... వాస్తవంలోనూ ఆచరణాత్మకమైన శత్రురక్షణ వ్యవస్థ కలిగిన నగరంగా అయోధ్య చరిత్రలో నిలిచిపోయింది ఎన్ని యుగాలు గడిచినా ఈ నగరం పరరాజుల వశం కాలేదు. ఆయోధ్య చరిత్రకు ఇదొక కీర్తిపతాకం.

 

రాజ్యానికి ఆయువుపట్లైన వాణిజ్యంలో అయోధ్యకు సాటిరాగల నగరం అప్పట్లో లేదు. క్రయవిక్రయాల కోసం వచ్చే వ్యక్తులతో ప్రధానవీధులన్నీ కిక్కిరిసి ఉండేవి. కప్పం చెల్లించటానికి వచ్చే సామంతరాజులు బారులు తీరేవారంటే అతిశయోక్తికాదు. సంగీత, సాహిత్య, నృత్య, నాటక, గీతాది కళారంగాల్లో ప్రముఖులకు అయోధ్యవేదికగా ఉండేవారు.

 

ఇటువంటి ఆయోధ్యను రాముడు పరిపాలించిన కాలంలో సంపన్నుడు కాని వ్యక్తి ఆ నగరంలో లేడు. గో, ధన. ధాన్య, వాహన సమృద్ధి లేని ఇల్లు ఉండేది కాదు. ఈ సందపనంతా యజమానులు కేవలం ధర్మబద్ధంగా సంపాదించి. ధర్మబద్ధంగానే ఖర్చు చేసేవారు. ఈ నగర ప్రజలంతా మహర్షులతో సమానమైన ఇంద్రియ నిగ్రహం, తేజస్సు కలిగిఉండేవారు. అయోధ్యలో ఆకలితో అలమటించే వ్యక్తి ఒక్కడూ లేడు. దానం కోసం అర్రులు చాచే వ్యక్తి లేడు. నుదుట తిలకం ధరించని మనిషి కనిపించడు. దీనుడు కాని, దానం చెయ్యనివాడు కాని, రోగపీడితుడు కాని, సౌందర్యవిహీనులు కానీ కనిపించేవారు కాదు.

 

కాంభోజ, బాహ్లిక, వనాయు, సింధు దేశాలకు చెందిన ఉత్తము గుర్రాలు ఇక్కడ ఉండేవి. వింధ్య పర్వతాల్లో సంచరించే మదపుటేనుగుల్ని ప్రత్యేకంగా ఈ నగరానికి తెప్పించారు.  ఇలాంటి ఉత్తమ జాతి పశుగణం అయోధ్యలో ఉండేది. అంతేకాదు... రెండు, మూడేసి జాతుల సాంకర్యంతో పశుగణాల్ని ఉత్పత్తిచేసే విధానం ఇక్కడ ఉండేది. భద్రమంద్ర, భద్రమృగ, మృగకు చెందిన ఏనుగులు ఇలా పుట్టినవే. (బాల, 6:25). మొత్తంగా బలిష్టమైన రాజ్యవ్యవస్థ అయోధ్యలో ఉండేది. అందుకే అయోధ్య అంటే అక్కడి ప్రజలకు మాత్రమే కాదు విదేశీయులకూ ఎంతో ప్రీతిగా ఉండేది.

 

 స్కాందపురాణం దేశంలోని ఏడు మోక్షపురాల్లో ఒకటిగా అయోధ్యను పేర్కొంది. ఈ నగరం చేప ఆకారంలో ఉంటుందని కూడా ఈ పురాణం చెబుతుంది. అగ్ని, బ్రహ్మపురాణాలు అయోధ్యను పాపాలను నాశనం చేసే నగరంగా కీర్తించాయి. యోగినీతంత్రంలో కూడా అయోధ్య ప్రస్తావన ఉంది. అధర్వణ వేదం అయోధ్యను దేవనిర్మిత నగరంగా ప్రకటించింది. తులసీదాసు కూడా తన రామచరితమానస్ లో అయోధ్య వైభవాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాడు. భాగవతంలో కూడా శుకమహర్షి రఘవంశాన్ని ప్రస్తావించిన సందర్భంలో ప్రత్యేకంగా అయోధ్య గురించి వివరిస్తాడు.

 

కవయిత్రి మొల్ల కూడా తన రామాయణంలో అయోధ్య వైభవాన్ని ఎంతో గొప్పగా వర్ణిస్తుంది.

'భానుకులదీప రాజన్యపట్టభద్ర

భాసి నవరత్న ఖచిత సింహాసనమ్ము

నాగనుతికెక్కు మహిమ ననారతమ్ము

ధర్మ నిలయమ్ము, మహినయోధ్యాపురమ్ము'

 

అయోధ్య అంటే కేవలం రాజ్యం మాత్రమే కాదు. ధర్మానికి అది నిలయం అంటుంది మొల్లమాంబ.

 

భారతయుద్ధం తర్వాత అయోధ్యానగరం కనుమరుగవుతుంది.  విక్రమాదిత్యుడు ఓ యోగి సూచన మేరకు ఒక ఆవును, దూడను వదలిపెట్టి, అవి ధారగా పాలు విడుస్తున్న ప్రాంతాన్ని అయోధ్యగా గుర్తించి, ఆ నగరాన్ని పునరుద్ధరించాడని ఓ కథనం వ్యాప్తిలో ఉంది. ఇదే ఇప్పటి అయోధ్య అని భక్తుల విశ్వాసం. ఉజ్జయినీ పరిపాలకుడైన విక్రమాదిత్యుడు అయోధ్యలోని సుమారు 300 దేవాలయాల్ని పునర్నిర్మించిన చారిత్రకగాథ ఈ వాదనను బలపరుస్తోంది.

 

శ్రీరామచంద్రుడు, అతని తండ్రి దశరథుడికి పూర్వమే అయోధ్య పరిపాలించిన రాజులెందరో ఉన్నారు. ఇక్ష్వాకు, మాంధాత, హరిశ్చంద్రుడు, సగరుడు, భగీరధుడు, రఘు మహారాజు, అజ మహారాజు మొదలైన చక్రవర్తులెందరో ఈ నగరాన్ని రాజధానిగా చేసుకుని ధర్మబద్ధమైన పాలన చేసి చరిత్రలో చిరయశస్సు పొందారు. వీరందరి కీర్తికి కారణమైన అంశాల్లో అయోధ్య కూడా ఒకటి.

 

అయోధ్య మధురా మాయా కాశీ కాంచీ అవంతికా

పురీ ద్వారావతీ చైవ సప్తైతే మోక్షదాయికా

 

దేశంలోని ఏడు ప్రధాన పుణ్యక్షేత్రాలను సప్తమోక్షపురాలుగా పురాణాలు పేర్కొంటున్నాయి. వీటిలో మొదటిది అయోధ్య. యోగశాస్త్ర ప్రకారం అయోధ్యను మానవశరీరంలో ఉండే సహస్రారచక్రంతో పోలుస్తారు. సహస్రార చక్రం శిరస్సు మధ్యభాగంలో ఉంటుంది. ఇది పరిపూర్ణమైన జ్ఞానానికి ప్రతీక. ఈ చక్రంలో విశ్వచైతన్యం వ్యక్తిచైతన్యంగా ప్రకాశిస్తుంది. ఆత్మజ్ఞానాన్ని సాధించిన పరమయోగులకు మాత్రమే సహస్రార చక్రం గురించిన అనుభూతి పూర్వక జ్ఞానం లభిస్తుంది. ఈ స్థానాన్ని తెలుసుకున్నవారికి పునర్జన్మ ఉండదని యోగశాస్త్రం చెబుతోంది. దీనిప్రకారం అయోధ్యను చేరుకోవటమంటే సహస్రారకమలాన్ని చేరుకోవటం, అంతిమంగా మోక్షాన్ని సాదించటమే అవుతుంది.

 

అందరూ అనుకుంటున్నట్లు అయోధ్య కేవలం నగరం మాత్రమే కాదని, మానవ జీవచైతన్యానికి ఇదొక ప్రతీక అని అధర్వణవేదం చెబుతోంది. 'అష్టాచక్రా నవద్వారా దేవానాం పూరయోధ్యా తస్యాం హిరణ్మయః స్వర్గలోకో జ్యోతిషావృత్త:...' ఎనిమిది చక్రాలు, తొమ్మిది ద్వారాలు ఉండే మానవ శరీరం అయోధ్యకు ప్రతీక. జనన, మరణ చక్రంలో శరీరం తిరుగుతూ ఉంటుంది. వీటితో మోక్షం కోసం యుద్ధం చెయ్యటం సాధ్యం కాదు. ఫలితం ఉండదు. శరీరం అనే పట్టణంలోని జ్యోతిర్మయకోశానికి స్వర్గం అనే పేరుంది. అది జీవచైతన్యస్వరూపమైన తేజస్సుతో నిండి ఉంటుంది. ఈ పట్టణాన్ని ఏ వ్యక్తి బ్రహ్మసంబంధమైనదిగా తెలుసుకుంటాడో అతడికి బ్రహ్మదేవుడు ఆయువు, కీర్తి మొదలైన వాటిని అనుగ్రహిస్తాడని అధర్వణ వేదమంత్రాలు చెబుతున్నాయి.

 

వాక్యపరంగా అయోధ్య పదానికి ఉన్న అర్థాన్ని శరీరానికి అన్వయిస్తే జయించటానికి సాధ్యం కాని లక్షణం ఉన్న శరీరమే అయోధ్యకు లౌకిక ప్రతీకగా నిలుస్తుంది. మొత్తంగా మనలో ఉన్న ఆత్మచైతన్యాన్ని గుర్తించాల్సిన ఆవశ్యకతను అయోధ్య నిరంతరం గుర్తుచేస్తుందని అర్ధం చేసుకోవాలి.

 







ధర్మమూర్తి... సమదర్శి.... జగద్గురు కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి

  ధర్మమూర్తి... సమదర్శి ఆయన పేరు పలికితేనే చాలు... వ్యక్తం చేయటానికి మాటలు చాలని అనుభూతి కలుగుతుంది. ఆ కళ్ళలోని వెలుగు ఏదో తెలియని కారుణ్యాన...