Showing posts with label Vratam. Show all posts
Showing posts with label Vratam. Show all posts

Wednesday, August 14, 2024

వరాలనిచ్చే వరలక్ష్మి


 

వరాలనిచ్చే వరలక్ష్మి


    ప్రతి వ్యక్తికీ అనేక కోరికలు ఉంటాయి. ఇవన్నీ తీరాలన్నా లేదా కనీసం ఒక్క కోరిక తీరాలన్నా భగవంతుడి అనుగ్రహం తప్పనిసరి. అయితే కోరిక ఏదైనప్పటికీ, ఇచ్చే దైవం ఎవరైనప్పటికీ అంతిమంగా ఆ కోరికల్లో ఉండేది లేదా ఆ కోరికల ద్వారా అందుకునేది ఆనందం, తృప్తి మాత్రమే. ఈవిధమైన సంతృప్తి పొందిన వ్యక్తి మాత్రమే నిజమైన భాగ్యవంతుడు. అటువంటి భాగ్యాన్ని (లక్ష్మిని) అందించేది వరలక్ష్మీదేవి మాత్రమే.

     వరాల రూపంలో సౌభాగ్యాన్ని భక్తులకు అనుగ్రహించే మాత ‘వరలక్ష్మీదేవి’. ‘వర’ అంటే ‘కోరుకున్నది’, ‘శ్రేష్ఠమైనది’ అనే అర్థాలు ఉన్నాయి. ఈ అర్థాలను అన్వయం చేస్తే కోరిన కోర్కెలు లేదా శ్రేష్టమైన కోర్కెలు ఇచ్చే తల్లిగా వరలక్ష్మీదేవిని భావించవచ్చు. ఈదేవిని సమంత్రకంగా, భక్తిభావనతో కొలిచే వ్రతమే ‘వరలక్ష్మీవ్రతం’.

    స్కాంద పురాణంలో వరలక్ష్మీవ్రతం గురించిన వివరణ ఉంది. స్వయంగా పరమేశ్వరుడే పార్వతికి ఈ వ్రతం గురించి చెబుతాడు. అదే సందర్భంలో మహాభక్తురాలైన చారుమతీదేవి వృత్తాంతాన్ని కూడా పరమేశ్వరుడు పార్వతికి వివరిస్తాడు. భర్త పట్ల ఆదరాన్నీ, అత్తమామల పట్ల గౌరవాన్నీ ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉండేది. మహాలక్మ్షీదేవి పట్ల ఎంతో భక్తిశ్రద్ధలు కలిగిన చారుమతి అమ్మవారిని త్రికరణ శుద్ధిగా పూజిస్తుండేది. ఆ మహాపతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి, స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరిస్తుంది. శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజున తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని ఆమెకు అభయమిస్తుంది. అమ్మ ఆదేశానుసారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించిన చారుమతి సమస్త సిరి సంపదల్ని వరలక్ష్మీ వ్రతప్రసాదంగా అందుకుంటుంది.

వరలక్ష్మీ వైభవం


    అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి, ఈ వ్రతానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ వ్రతాన్ని శ్రావణమాసంలో చేస్తారు. శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రం రోజున పూర్ణిమ వస్తుంది. శ్రవణం శ్రీనివాసుడి జన్మ నక్షత్రం. పూర్ణిమ రోజున అమ్మవారు షోడశకళలతో వెలుగొందుతుంది. శుక్రవారం అమ్మకు ప్రీతిపాత్రమైన వారం. ఈవిధంగా చూస్తే లక్ష్మీశ్రీనివాసుల వైభవం అనంతంగా ప్రకాశించే పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం చెయ్యటం లక్ష్మీశ్రీనివాసుల అనుగ్రహానికి తొలిసోపానంగా చెప్పుకోవచ్చు. సకల సౌభాగ్యాలు కలగాలని, నిత్య సుమంగళిగా తాము జీవితకాలం ఉండాలని కోరుకుంటా దేశవ్యాప్తంగా మహిళలు ఈ వ్రతాన్ని చేస్తారు. దేశ, కాల, ప్రాంత, ఆచారభేదాలు ఉన్నప్పటికీ అందరి అంతరంగంలో కొలువై ఉన్న మాత ఒక్కరే. ఆమె అందరినీ అనుగ్రహించే తీరు ఒక్కటే.

    వరలక్ష్మీ వ్రతంలో భాగంగా కలశాన్ని స్థాపించి పూజించటం జరుగుతుంది. కలశం అమ్మవారికి ప్రతిరూపం. కలశపాత్రగా మట్టిపాత్రనుగాని, చేసుకునే యజమాని శక్తిని బట్టి వెండి, బంగారు, రాగి, పంచలోహపాత్రలను గాని వినియోగిస్తారు. లోహమైనా, మట్టి అయినా అది ప ృథ్వీతత్త్వానికి సంకేతం. అందులో పోసే నీరు జలతత్త్వానికి సంకేతం. అందులో కలశాన్ని పూర్తిగా నీరుతో నింపం కనుక శూన్యస్థితి ఆకాశతత్త్వానికి సంకేతం. మనం చదివే మంత్రం వాయుజనితం. కనుక అది వాయుతత్త్వానికి సంకేతంగా ఉంటుంది. కలశం ముందు ఉంచే దీపం అగ్నితత్త్వానికి సంకేతం. ఇలా పంచభూతాలను ఒకచోటికి చేర్చి పూజిస్తాం. ఈవిధంగా పంచభూతాలకు ప్రతీకగా ఆయా వస్తువులను ఉంచి పంచభూతాల్లోనూ వ్యాప్తించి ఉండే పరతత్త్వం, శక్తి స్వరూపమైన అమ్మను ఆరాధించటం కలశారాధనలోని అంతరార్థం.

వ్రతాచరణకు నియమాలు


    కలశం కోసం తెచ్చుకున్న పాత్రను శుభ్రంగా కడిగి, పసుపు, కుంకుమలతో అలంకరించాలి. వ్రతానికి ఎంపిక చేసుకున్న స్థలాన్ని శుభ్రం చేసుకుని, పీటవేసి, దానిమీద నూతన వ్రస్తం వేసి, దానిపై బియ్యంపోసి వేదికను సిద్ధం చేయాలి. వేదికను పూలు, చందనం, పరిమళ ద్రవ్యాలు చల్లి శోభాయమానంగా చేసుకోవాలి. ఆ తర్వాత కలశాన్ని దానిపై అమర్చాలి. దానికి తాంబూలం సమర్పించి ఆరాధించాలి. కలశంలో నీరుపోసి మామిడాకులు లేదా తమలపాకులు కాని అందులో వేయాలి. ఆకులు ఏవైనా అవి నిటారుగా నిలిచేటట్టు చూసుకోవాలి. దాని మీద కొబ్బరికాయ నుంచి దానికి రవికెల గుడ్డను వస్త్రంగా చుట్టాలి. కొబ్బరికి ముఖస్వరూపం వచ్చేలా కళ్ళు ముక్కు, పెదవులు, కనుబొమలు అమరేలా దిద్దవచ్చు లేదా అమ్మవారి రూపును దానికి తగిలించి ఆకారం ఏర్పరచవచ్చు. దానికి తమకు తోచిన నగలు వగైరాలు అలంకరించవచ్చు.

    వ్రత తోరాన్ని ఐదు పొరలుగా తీసుకుని దానికి పసుపురాయాలి. దానికి మధ్యలో మామిడి ఆకునుకాని, తమలపాకును కాని పెట్టి ముడివేయాలి. దీన్ని అమ్మవారి సమక్షంలో ఉంచి పూజించాక చేతికి మణికట్టు దగ్గర ధరించాలి. దీన్ని మొదటి శుక్రవారం కట్టుకుంటే నెలంతా ఉంచుకుని అమ్మవారి పూజ నెలరోజులూ జరుపుకోవాలి లేదా వరలక్ష్మి వ్రతం నాడు కట్టుకుని కలశానికి ఉద్వాసన పలికిన తర్వాత తీసేయొచ్చు. ఇంటి ఆచారాలను బట్టి పూజావిధానంలో మార్పులు ఉండొచ్చు.

    అమ్మవారికి పూజలో ప్రసాదంగా చక్కరపొంగలి కానీ పాయసం కాని నివేదన చెయ్యాలి. పాయసం దేనితో తయారుచేసినా దోషం కాదు. పూజలో వినియోగించిన బియ్యాన్ని మర్నాడు అన్నం వండి దేవతా మందిరంలో ఇలవేలుపుకు ప్రసాదంగా సమర్పించి స్వీకరించాలి. కలశంలో ఉంచిన కొబ్బరికాయను మరుసటి రోజున మనం రోజూ పూజించే దేవుడికి నివేదన చేసి కొట్టి ప్రసాదంగా చేసుకుని అందరూ తీసుకోవాలి. కలశంలో ఉన్న జలాన్ని కుటుంబసభ్యులందరూ తీర్థంగా తీసుకోవాలి. శిరస్సు మీద చల్లుకోవచ్చు. ఏదైనా అవాంతరం వల్ల శ్రావణ శుక్రవారం రోజున వ్రతం చేసుకోవటం సాధ్యపడకపోతే తర్వాతి వారం చేసుకోవచ్చు. ఇందులో ఎటువంటి సందేహం అవసరం లేదు.

విశ్వమంతా లక్ష్మీ స్వరూపమే


    ప్రతి స్త్రీలోనూ లక్ష్మీ కళ ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకనే స్త్రీలను లక్ష్మీస్వరూపంగా ఆరాధించటం, అర్చించటం మన సంప్రదాయంలో ఒక భాగంగా ఉంటుంది. ఏ పనికైనా మహిళే ఆదిశక్తి. ఆమెదే ఉన్నత స్థానం. అందరి మాటలు ఓర్పుగా వింటుంది. ఇతరులతో పనులు చేయిస్తుంది. తాను ్వయంగా చేస్తుంది. గుణాల చేత వ్యాపిస్తుంది. దోషాలు తొలగిస్తుంది. అందుకే స్త్రీరూపంలోని లక్ష్మికి మన సంస్కృతి సమున్నతస్థానాన్ని ఇచ్చింది.

    అనంతవిశ్వాన్ని ‘లక్షించేది’ లక్ష్మి. అందరూ లక్షించేది లక్ష్మిని. ‘లక్షించటం’ అంటే చూడటమని అర్థం. అందరినీ తన కరుణామృతపూర్ణమైన చల్లనిచూపులతో ‘కనిపెట్టుకుని’, గమనించి, పాలించే శక్తిని లక్ష్మిని చెప్పుకోవచ్చు. సర్వసాక్షిjైున ఈ భగవద్దర్శన శక్తిని లక్ష్మిగా ఉపాసించటం లక్ష్మీ ఆరాధనలోని ప్రత్యేకత. అందరూ ఆనందాన్నీ, ఐశ్వర్యాన్నీ, జ్ఞానాన్నీ, ‘లక్ష్యం’గా పెట్టుకొనే జీవిస్తారు. ఇలా అందరికీ లక్ష్యమైన జ్ఞాన, ఆనంద, ఐశ్వర్యాల సాకార రూపమే ‘లక్ష్మి’. ఈ దివ్యభావాన్ని సగుణంగా, లీలారూపంగా పురాణాలు వ్యక్తీకరించాయి.

వరలక్ష్మీ సందేశం

 

   సంప్రదాయకంగా తరతరాల నుంచి వస్తున్న ఈ వ్రతం పైకి మామూలు పురాణ కథలానే కనిపించినా ఇందులో ఒక సామాజిక చైతన్య సూత్రం ఇమిడి ఉంది. చారుమతికి వరలక్ష్మీదేవి కలలో కనిపించి తనను పూజించమని, సకల ఐశ్వర్యాలనూ ఇస్తానని చెప్పింది. చారుమతి ఆ వ్రతాన్ని స్వార్థబుద్ధితో తానొక్కతే చెయ్యలేదు. తనతోపాటు తనవారు, తన చుట్టుపక్కల ఉన్న కుటుంబాల స్త్రీలంతా వరలక్ష్మీదేవి కటాక్షానికి పాత్రులు కావాలని అందరినీ కలుపుకొని వ్రతం చేసింది. స్త్రీలు ఇలా అందరినీ కలుపుకొని సామరస్య ధోరణిలో, నిస్వార్థ బుద్ధితో మెలగాలనే ఓ సామాజిక సందేశం ఈ వ్రత కథ వెనుక ఉంది.

Essay on Goddess Varahi - Published in Sapthagiri Magazine July 2026 Editon

    Varahi Upasana: The Mystical Path of Divine Power (or) Goddess Varahi — The Embodiment of Divine Shakti             In the Ind...