Wednesday, November 18, 2020

రుద్రాభిషేకం గురించిన విశేషాలతో డాక్టర్ ‌కప్పగంతు రామకృష్ణ (Dr Kappagantu Rama Krishna) రాసిన వ్యాసం

 



రుద్రాభిషేకం గురించిన విశేషాలతో 

డాక్టర్ ‌కప్పగంతు రామకృష్ణ (Dr Kappagantu Rama Krishna) 

రాసిన వ్యాసం 

రుద్రాభిషేక వైభవం

      శివునికి అభిషేకం చేయటానికి సర్వసాధారణంగా వినియోగించే మంత్రాలు నమక, చమకాలు. శ్రీకృష్ణ యజుర్వేదంలో అంతర్భాగంగా ఉండే నమక, చమకాలను కలిపి సాధారణ పరిభాషలో 'రుద్రాధ్యాయం' అనీ, 'రుద్రం' అనీ వ్యవహరిస్తుంటారు. ఈ మంత్రాలతో శివునికి చేసే అభిషేకం అనంతమైన పుణ్యఫలితాన్ని అందిస్తుంది.

 యం యం కామయతే మర్త్యో లింగార్చన పరాయణః |

తం తమాప్నోతి విప్రేంద్ర మత్ప్రసాదాన్నసంశయః ||

   లింగార్చన చేసే భక్తుడు తన మనసులో ఏయే కోరికలు తీరాలని భావిస్తున్నాడో, అవన్నీ నా అనుగ్రహం వల్ల తప్పక నెరవేరుతాయని సాక్షాత్తు పరమేశ్వరుడు చెప్పినట్లు శైవాగమాలు ప్రకటిస్తున్నాయి.

    లింగార్చన లేదా రుద్రాభిషేకం వల్ల కలిగే ఫలితం అనంతం అనీ, ఎప్పటికీ నశించదనీ శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. యజ్ఞ, యాగ, దాన, తపస్సుల వల్ల కలిగే ఫలితం కేవలం రుద్రాభిషేకం వల్ల కలుగుతుంది. అయితే, కోరికను అనుసరించి, కొన్ని ఆచారవిధానాలను శాస్త్రాలు నిర్దేశిస్తున్నాయి. వీటితోపాటు రుద్రాభిషేకం ఏయే సమయాల్లో చేయాలి? ఎలా చేయాలి? ఎటువంటి లింగాన్ని అర్చించాలి? ఇందుకు అనుసరించాల్సిన విధానాలేమిటి? మొదలైన విషయాలను కూడా ఆగమాలు విస్పష్టంగా పేర్కొంటున్నాయి.

 శివాభిషేక నియమాలు

      రుద్రాభిషేకాన్ని తప్పనిసరిగా శైవాగమాన్ని అనుసరించే చేయాలని సాక్షాత్తు ఆదిశంకరులు చెప్పారు. 'సిద్ధాంత సారావళి' కూడా ఇదే విషయాన్ని ప్రకటిస్తుంది.

 అష్టాదశాసు విద్యాసు మీమాంసాపి గరీయసి

తతోపి తర్కశాస్త్రాణి పురాణం తేభ్య ఏవ చ

తతోపి ధర్మశాస్త్రాణి తేభ్యో గుర్వీశ్రుతిర్ద్విజా

తతోప్యుషనిషచ్ఛ్రేష్ఠస్తత శ్శైవాగమోధికః ||

           అష్టాదశ విద్యల్లో మీమాంస, మీమాంస కంటే తర్కం, తర్కం కంటే పురాణాలు, పురాణాల కంటే ధర్మశాస్త్రం, ధర్మశాస్త్రాల కంటే వేదాలు, వేదాల కంటే ఉపనిషత్తులూ, ఉపనిషత్తుల కంటే శైవాగమాలు గొప్పవి. వీటినే వేదాగమాలని కూడా అంటారు. ఈశ్వరప్రోక్తం కావటం వల్ల కారణాగమం, కామికాగమం వంటి శైవాగమాలు చాలా గొప్పవి. కాబట్టి, శైవాగమాలు చెప్పిన పద్ధతుల్లో రుద్రాభిషేకం చేయాలి.

     ·   తడివస్త్రాలు ధరించి అభిషేకం చేయకూడదు. భుజం మీద కూడా తడివ్రస్తం ధరించకూడదు.

· అభిషేక సమయంలో పూర్తిగా మౌనాన్ని పాటించి, చిత్తాన్ని పరమేశ్వరుని మీదనే లగ్నం చేయాలి.

·   కాళ్ళు చాపుకుని కూర్చొనటం, ఇతరులతో సంభాషించటం, స్త్రీలతో సరస సంభాషణ, తర్కించటం, అసత్య సంభాషణ పనికిరాదు.

·      పరనింద, పరస్తుతి చేయకూడదు.

·     గట్టిగా మాట్లాడకూడదు. విచారవదనంతో ఉండకూడదు.

· అభిషేక సమయంలో యజమాని దీర్ఘరోగుల్ని, కుక్కల వంటి జంతువులను చూడకూడదు. స్పృశించకూడదు. ప్రమాదవశాత్తు చూసినట్లయితే 108 సార్లు ఓంకారాన్ని జపించి, కుడిచేతితో కుడిచెవిని స్పృశించాలి.

·   భస్మధారణ చేయకుండా అభిషేకం చేయకూడదు.

·  అభిషేకానికి ముహూర్త నిర్ణయం అవసరం లేదు. వర్జ్యదోషాలు ఉండవు.

· శివలింగ పీఠం మీద పూజాద్రవ్యాలు, గంధపాత్రలు, బెల్లం ముక్క, కొబ్బరిచెక్క మొదలైన పదార్థాలు ఉంచకూడదు.

· అభిషేక సమయంలో తుమ్మటం, దగ్గటం, ఉమ్మివేయటం, అసత్యం పలకటం చేయకూడదు. నియమభంగం జరిగితే  యజయాని ఆచమనం చేసి, కుడిచేతితో కుడిచెవిని స్పృశించాలి.

·   సంకల్పం చేయటానికి ముందు, అభిషేక సమయంలో, ఆ ధూప, దీప, నీరాజన సమయాల్లో తప్పనిసరిగా గంట మోగించాలి. ఘంటానాదం చేయకుండా చేసే అభిషేకరం ఫలితాన్ని ఇవ్వదు.

 రుద్రాభిషేక విధి

          రుద్రాభిషేకం చేయటానికి మొత్తం ఎనిమిది విధానాలు, వాటివల్ల కలిగే ఫలితాలు 'రుద్రకల్పం'లోని విష్ణ్వీశ్వర సంవాద విభాగంలో వర్ణితమై ఉన్నాయి. అవేమిటంటే... 

1. వారం : నమకంలో మొత్తం 11 అనువాకాలు ఉంటాయి. ఒకసారి నమకంలోని 11 అనువాకాలు చెప్పి, చమకంలో ఒక అనువాకం (చమకంలో కూడా 11 అనువాకాలు ఉంటాయి) చొప్పున వరుసగా చెప్పాలి. ఈవిధంగా 11 సార్లు నమకం చెబితే, చమకంలోని 11 అనువాకాలు చెప్పటం పూర్తవుతుంది. ఇలా చేసిన అభిషేకానికి 'వారం' అని పేరు.

 2. ఆవృత్తి : నమకం 121 సార్లు, చమకం 11 సార్లు. పృథివీ రూపధారి అయిన రుద్రప్రీతి కలుగుతుంది. సర్వపాపాలు తొలగుతాయి. జలరూపధారి అయిన శివప్రీతి కలుగుతుంది. ఫలితంగా సకల సుఖాలు లభిస్తాయి.

 3. రుద్రం : నమకం 1,331 సార్లు, చమకం 121 సార్లు. తేజోరూపధారి అయిన శంకరుని ప్రీతి కలుగుతుంది. ఫలితంగా సర్వ సంపదలు కలుగుతాయి. 

4. ఏకాదశ రుద్రం : నమకం 14,641 సార్లు, చమకం 1,331 సార్లు. వాయురూపధారి అయిన పరమేశ్వరునికి ప్రీతి కలిగి, తద్వారా లక్ష్మీకటాక్షం కలుగుతుంది.

 5. శతరుద్రం : నమకం 1,61,051 సార్లు, చమకం 14,641 సార్లు. ఆకాశరూపధారి అయిన మహేశ్వరునికి ప్రీతి కలుగుతుంది. ఫలితంగా పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుంది. 

6. లఘురుద్రం : నమకం 17,71,561 సార్లు, చమకం 1,61,051 సార్లు. సూర్యరూపధారి అయిన ఈశ్వరప్రీతి కలుగుతుంది. పునర్జన్మ నివృత్తి అవుతుంది. 

7. మహారుద్రం : నమకం 194,87,171 సార్లు, చమకం 17,71,561 సార్లు. చంద్రరూపధారి అయిన రుద్రునికి ప్రీతి కలుగుతుంది. జ్ఞానవృద్ధి కలుగుతుంది.

 8. అతిరుద్రం : నమకం 21,43,58,881 సార్లు, చమకం 194,87,171 సార్లు. సర్వరూపి అయిన పరమేశ్వరునికి ప్రీతి కలుగుతుంది. ఫలితంగా చెప్పటానికి అలవికాని మహాఫలితాన్ని యజమాని పరమేశ్వర వరప్రసాదంగా అందుకుంటాడు.

  శ్రావణ, కార్తిక మాసాల్లో, విశేషంగా మాఘమాసంలో ఏదైనా పవిత్ర పుణ్యక్షేత్రంలో, నదీతీరంలోగాని, పర్వత ఉపరిభాగంలో కానీ, పశ్చిమాభిముఖ ద్వారం ఉన్న శివాలయంలోని గానీ యజమాని 11 మంది బ్రాహ్మణులను ఏర్పాటుచేసుకుని రుద్రాభిషేకం చేస్తే తప్పకుండా ముక్తి కలుగుతుంది.  యజమాని తన అభీష్టాన్ని, శక్తిని అనుసరించి వీటిల్లో ఏదో ఒక విధానాన్ని ఎంచుకుని, రుద్రాభిషేకం చేయాలి.

 శివాభిషేక ఫలితాలు

      ·  భస్మాన్ని ధరించి, భస్మశయ్యపై పడుకుని, నిశ్చలబుద్ధితో రుద్రాన్ని పారాయణ చేస్తే పంచమహాపాతకాలు కూడా పటాపంచలు అవుతాయని పరాశరస్మృతి చెబుతోంది.

· సురాపానం, బ్రహ్మహత్య వంటి పాపాలు కూడా రుద్రాభిషేకం వల్ల తొలగటంతో పాటు సంసారబంధాల నుంచి విముక్తి కలుగుతుంది.

· రుద్రాధ్యాయాన్ని పారాయణ చేయటం వల్ల రహస్యంగా చేసిన పాపాల నుంచి కూడా విముక్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.

· ఎటువంటి మమకారం లేకుండా, ఫలాపేక్ష రహితంగా రుద్రాధ్యాయాన్ని పారాయణ చేస్తే సశరీరంగా కైలాసగమన సిద్ధి కలుగుతుందని వాయుపురాణం చెబుతోంది.

·   దుస్స్వప్నం వల్ల కలిగే దోషం, గ్రహదోషాల నివారణకు రుద్రాధ్యాయాన్ని పారాయణ చేయాలని లింగపురాణంలో ఉంది.

·   రుద్రాభిషేకంతో పాటు రుద్రపారాయణ చేయటం వల్ల సంతానహీనులకు సత్సంతానం కలుగుతుందని ఆపస్తంబ సూత్రం చెబుతోంది.

· శ్రేష్ఠమైన మృత్తిక (మట్టి), కస్తూరి రెండిటి మిశ్రమంతో నిర్మించిన లింగాన్ని అభిషేకించి, పూజించినట్లయితే సంపదలు కలుగుతాయి.

·  మృత్తికతో శ్రీగంధం కలిపి తయారుచేసిన లింగాన్ని సశాస్త్రీయంగా 20 రోజులు పూజించి, అభిషేకం చేస్తే తాపజ్వరం నుంచి ఉపశమనం కలుగుతుంది.

· కస్తూరీ మిశ్రమంతో తయారుచేసిన మృణ్మయలింగాన్ని పదిరోజుల పాటు భక్తియుక్తంగా పూజించి, అభిషేకాదులు నిర్వహిస్తే ఆత్మదోష జనితమైన సర్వరోగాలు నశిస్తాయి.

·   చక్కెర కలిపి తయారుచేసిన మృణ్మయ లింగాన్ని మూడు నెలలపాటు సశాస్త్రీయంగా పూజిస్తే, సభల్లో నేర్పుగా మాట్లాడే శక్తి, కవిత్వసిద్ధి కలుగుతాయి.

·  మృత్తికలో బియ్యపుపిండి కలిపి తయారుచేసిన లింగాన్ని మూడు నెలల పాటు శాస్త్రవిధిగా అర్చించి, అభిషేకం చేస్తే పుత్రసంతానం కలుగుతుంది.

·   మృత్తికలో పసుపు కలిగి, 108 రోజుల పాటు శాస్త్రవిధిగా అభిషేకం చేస్తే సర్వజనాకర్షకమైన రూపం, ఐశ్వర్యం కలుగుతాయి.

·  మృత్తికలో ఆవునెయ్యి కలిపి, లింగాన్ని తయారుచేసి, 50 రోజుల పాటు అభిషేకం చేస్తే పైత్యరోగం నివారణ అవుతుంది.

· ఎర్రని గంధం కలిపి తయారుచేసిన మృత్తికాలింగానికి 32 రోజులు అభిషేకం చేస్తే దగ్గు, దమ్ము రోగాలు నివారణ అవుతాయి.

· ఇనుపచూర్ణం, మృత్తిక కలిపి లింగాన్ని తయారుచేసి, 22 రాత్రులు శాస్త్రవిధిగా అభిషేకార్చన చేస్తే, శత్రునాశనం కలుగుతుంది.

· నువ్వులు కలిపి తయారుచేసిన మృత్తికాలింగానికి ఏడురోజుల పాటు నిర్మలభక్తితో అభిషేకం చేస్తే యమబాధలు నశిస్తాయి.

·  నిత్యం రుద్రాభిషేకం చేయటం వల్ల భూత, ప్రేత, పిశాచ, బ్రహ్మరాక్షస బాధలు నశిస్తాయి.

గృహేత్వేక గుణం ప్రోక్తం నదీతీరే సహస్రకం |

దేవతాయతనేలక్షం శతలక్షం హరేర్గృహే |

శివాలయే కోటి గుణం శివే స్వాయంభువే పునః |

అనంతం పూజనం శంభోః ఋతం వచ్మిద్విజోత్తమ ||

          రుద్రాభిషేకం చేసే స్థలాన్ని బట్టి కూడా ఫలితం ఉంటుంది. ఇంట్లో చేసే లింగార్చన వల్ల ఒకభాగం ఫలితం కలుగుతుంది. నదీతీరంలో చేస్తే అందుకు వేయి రెట్లు ఎక్కువ ఫలితం వస్తుంది. దేవతానివాసాల్లో చేసే అభిషేకానికి లక్ష రెట్లు ఎక్కువ ఫలితం, విష్ణ్వాలయంలో చేసే అభిషేకానికి నూరు లక్షల రెట్లు ఎక్కువ ఫలితం, శివాలయాల్లో చేసే అభిషేకానికి కోటిరెట్లు, పర్వతగుహల్లో చేసే అభిషేకానికి పదికోట్ల రెట్లు, ఆ గుహ ఋష్యాశ్రమం కూడా అయితే కోటికోట్ల రెట్లు ఎక్కువ ఫలితం కలుగుతుంది. బ్రహ్మక్షేత్రంలో (కాశీక్షేత్రం) శివాభిషేకం చేస్తే అమితమైన ఫలితం లభిస్తుందని ఆగమాలు ప్రకటిస్తున్నాయి.

 -----------------------------

రచన

డాక్టర్ ‌కప్పగంతు రామకృష్ణ, 

ఆంధ్రోపన్యాసకులు,  

ఎస్‌.ఆర్‌.ఎస్‌.వి.కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, గాంధీనగర్‌, విజయవాడ-3 

సెల్‌ : 90320 44115 / 88975 47548

 


Sunday, November 15, 2020

శివుడికి ఏ పూలతో పూజలు చెయ్యాలి? శివుడికి ఏ పూలు ఇష్టం?



శివుడికి ఏయే పూలతో పూజలు చెయ్యాలి? 

శివుడికి ఇష్టమైన పువ్వులేవి?

 శివపూజకు చిగురించిన...

శివా! అని ఆర్తిగా పిలిస్తే చాలు... కైలాసం దిగి వచ్చే కారుణ్యమూర్తి, హరోం హర! అంటూ కడివెడు గంగమ్మను శిరస్సున అభిషేకం చేస్తే చాలు... కోరిన వరాలనిచ్చే అభయప్రదాత, ఎంగిలి మాంసాన్ని నివేదన చేసినా పరమప్రీతితో స్వీకరించి తిన్నడికి కైవల్యాన్నిచ్చిన బోళాశంకరుడు... పరమేశ్వరుడు ఒక్కడే. అందుకే...

శివుని శిరమున కాసిన్ని నీళ్ళుజల్లి

పత్తిరిసుమంత నెవ్వాడు పారవైచు

కామధేను వతడింట గాడిపసర

మల్ల సురశాఖి వానింట మల్లెచెట్టు

అంటూ ఎంతోమంది కవులు కాలకంఠుని వేనోళ్ళా కొనియాడారు. నిర్హేతుకమైన కృపను వర్షించటంలో పరమేశ్వరుడికి సాటి రాగల దైవం పురాణేతిహాసాల్లో మరెవ్వరూ కనిపించరు. ఇంతటి దయామయుడైన శివునికి అభిషేకంతో పాటు ఎలాంటి పుష్పాలతో పూజచేయాలి? ఏయే పుష్పాలతో పూజిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? అనే ప్రశ్నలకు శాస్త్రగ్రంథాల్లో అనేక ప్రమాణాలు ఉన్నాయి. శివధర్మ సంగ్రహం, లింగపురాణం, కార్తికమాహాత్మ్యం, శివరహస్య ఖండం తదితర గ్రంథాలు కూడా అనేక పుష్పార్చన ఫలితాలు, పుష్పార్చన చెయ్యటానికి పాటించవలసిన నియమాలు చెబుతున్నాయి. ఆ విశేషాలేమిటంటే...

శివపూజకు అరణ్యంలో పూచిన పువ్వులకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. గన్నేరు, పొగడ, జిల్లేడు,  ఉమ్మెత్త, కలిగొట్టు, పెద్దములక, తెల్లదింటెన, కట్లతీగ పువ్వులు, అశోకపువ్వు, మందారం, విష్ణుక్రాంత, జమ్మి, గులాబి, నెమ్మిపూలు, ఉత్తరేణి, తామర, జాజి, చెంగలువ, సంపెంగ, వట్టివేరు పూలు, నందివర్థనం, నాగకేసరం, పొన్న, పచ్చగోరింట, తుమ్మి, మేడి, జయంతి, మల్లె, మోదుగ, మారేడు దళాలు, కుసుమపూవు, కుంకుమపూవు, ఎర్రకలువలు, నీలిపూలు శివపూజకు ప్రశస్తమైనవి. 

వాడిపోయిన పూలు, కీటకాల వల్ల పాడైన పూలు, ఇతరుల తోట నుంచి దొంగతనంగా తీసుకువచ్చిన పూలు శివార్చనకు అనర్హమైనవిగా శాస్త్రాలు చెబుతున్నాయి. ఏ రకం పుష్పాలతో అర్చించినప్పటికీ, శివునికి చేసే పుష్పార్చన వల్ల అశ్వమేథ యాగం చేసిన ఫలితం కలుగుతుంది. కనీసం ఎనిమిది రకాలు పుష్పాలతో శివార్చన చేసిన భక్తుడికి కైలాసవాసం ప్రాప్తిస్తుంది.

ఏయే మాసాల్లో... ఏయే పుష్పాలు

👉👉 చైత్రమాసంలో నృత్యగీతాలతో సేవిస్తూ, దర్భపూలతో పూజిస్తే సువర్ణలాభం కలుగుతుంది.

👉👉 వైశాఖమాసంలో నేతితో అభిషేకిస్తూ, తెల్లమందార పూలతో పూజ చేస్తే, అశ్వమేథయాగం చేసిన ఫలితం కలుగుతుంది.

👉👉 జ్యేష్ఠమాసంలో పెరుగుతో అభిషేకం చేసి, తామరపూలతో పూజచేస్తే పరమపదసోపానాన్ని చేరుకుంటారు.

👉👉 ఆషాఢ కృష్ణ చతుర్దశి రోజున గుగ్గిలంతో ధూపం వేసి, తొడిమలు కలిగిన పూలతో అర్చన చేస్తే బ్రహ్మలోక నివాస యోగ్యత కలుగుతుంది.

👉👉 శ్రావణమాసంలో ఒంటిపూట భోజనం చేసి, గన్నేరు పూలతో నియమాల ప్రకారం అర్చన చేసినవారికి వెయ్యి గోదానాలు చేసిన ఫలితం లభిస్తుంది.

👉👉 భాద్రపదమాసంలో ఉత్తరేణి పూలతో పూజించిన వారు హంసధ్వజంతో కూడిన విమానంలో పుణ్యపదానికి చేరుకుంటారు.

👉👉 ఆశ్వయుజమాసంలో జిల్లేడుపూలతో పూజించినవారు మయూర ధ్వజంతో కూడిన విమానంలో దివ్యపదాన్ని చేరుకుంటారు.

👉👉 కార్తికమాసంలో ఆవుపాలతో అభిషేకించి, జాజిపూలతో పూజించినవారు శివపదాన్ని దర్శించుకుంటారు.

👉👉 మార్గశిరమాసంలో పొగడపూలతో పూజించినవారు, ముల్లోకాలను దాటి తామున్నచోటికే తిరిగిరాగలిగిన సామర్థ్యాన్ని పొందుతారు. 

👉👉 పుష్యమాసంలో ఉమ్మెత్తపూలతో పూజించినవారు పరమపదాన్ని పొందగలరు. 

👉👉 మాఘమాసంలో బిల్వదళాలతో అర్చించినవారు సూర్యచంద్రులున్న విమానంలో పరమపదాన్ని చేరుకునే యోగ్యత పొందుతారు.

👉👉 ఫాల్గుణమాసంలో సుగంధజలంతో అభిషేకించి తుమ్మిపూలతో పూజించినవారికి ఇంద్రుని సింహాసనంలో అర్ధభాగం దక్కుతుంది.

ఏ పుష్పాలతో పూజిస్తే ఎలాంటి ఫలితం

శివుని రోజూ జిల్లేడు పువ్వులతో అర్చించేవారు బంగారాన్ని దానం చేసిననంత ఫలితాన్ని పొందుతారు. శివపూజకు సంబంధించినంత వరకు 

👉👉 వేయి జిల్లేడు పువ్వుల కంటే ఒక గన్నేరు పువ్వు ఉత్తమం.

👉👉  వేయి గన్నేరు పూల కంటే ఒక మారేడు దళం ఉత్తమం.

👉👉 వేయి మారేడు దళాలకంటే ఒక తామరపువ్వు ఉత్తమం.

👉👉 వేయి తామరపువ్వుల కంటే ఒక పొగడపువ్వు ఉత్తమం.

👉👉 వేయి పొగడపువ్వుల కంటే ఒక ఉమ్మెత్తుపువ్వు ఉత్తమం.

👉👉 వేయి ఉమ్మెత్త పువ్వుల కంటే ఒక ములక పువ్వు ఉత్తమం.

👉👉 వేయి ములక పూవుల కంటే ఒక తుమ్మిపూవు ఉత్తమం.

👉👉 వేయి తుమ్మిపూవులకంటే ఒక ఉత్తరేణు పువ్వు ఉత్తమం.

👉👉 వేయి ఉత్తరేణు పువ్వుల కంటే ఒక దర్భపువ్వు ఉత్తమం.

👉👉 వేయి దర్భపూల కంటే ఒక జమ్మిపువ్వు శ్రేష్ఠం.

👉👉 వేయి జమ్మి పువ్వుల కంటే ఒక నల్లకలువ ఉత్తమం. 

శివునికి 1000 కలువలతో కట్టిన మాలను సమర్పించినవారు కొన్ని వందల సంవత్సరాల పాటు కైలాసంలో నివసించే అపూర్వమైన వరాన్ని పొందుతారు. ఇతర పుష్పాలతో పూజించే భక్తులు కూడా ఆయా పుష్పాలకు సంబంధించిన ఫలితాలను పొందుతారు.

పరమశివునికి పొగడపూలంటే అమితమైన ఇష్టం. ఆ స్వామిని ప్రతిదినం ఒక పొగడపువ్వుతో అర్చించే భక్తుడు వేయిగోవులను దానం చేసిన ఫలితాన్ని పొందుతాడు. ఒక నెలపాటు పొగడపూలతో పూజించినవారు స్వర్గ సుఖాలను పొందుతారు. రెండునెలలపాటు పూజించిన వారు యజ్ఞం చేసినంత ఫలితాన్ని పొందుతారు. మూడు నెలల పాటు పొగడపూలతో అర్చించినవారికి బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. నాలుగు నెలలు పూజించినవారికి కార్య సిద్ధి కలుగుతుంది. ఐదు నెలలు పూజించినవారికి యోగసిద్ధి. ఆరు నెలలు పూజించినవారికి రుద్రలోక ప్రాప్తి కలుగుతుంది. పది సుగంధపుష్పాలతో (ఒకవేళ పరిమళం లేకపోయినవైనప్పటికీ) శివలింగాన్ని పూజిస్తే, శతసహస్ర మాలలతో పూజించిన అనంత పుణ్యఫలం లభిస్తుందని శివధర్మ సంగ్రహం చెబుతోంది.

శివునికి బిల్వ (మారేడు) పత్రాలంటే మహాఇష్టం.ఇది అందరికీ తెలిసిన విషయమే. వీటితో పాటు మరికొన్ని పత్రాలు కూడా పరమేశ్వర పూజకు తగినవి. ఆయనకు ఎంతో ప్రీతికరమైనవి. అవేమిటంటే... జమ్మి, గుంట గలగర, అశోక, తమాలము, చీకటి చెట్టు, ఉలిమిడి, కానుగు, నేల ఉసిరి, మాచి, నల్ల ఉమ్మెత్త, తామర, నీతికలువ, మెట్టకలువ, సంపెంగ, తుమ్మి, ఉత్తరేణి పత్రాలు. ఉమ్మెత్త, కడిమిపువ్వులను శివునికి రాత్రివేళ సమర్పించాలి. మిగిలిన పూలతో పగిటిపూట. మల్లెలతో రాత్రివేళ, జాజి పూలతో మూడవజామున, గన్నేరుతో అన్నివేళలా పూజించవచ్చు.

ఏ కోరికకు ఏయే పూలు

మన కోరికలను అనుసరించి పరమేశ్వరుని సంకల్పం చెప్పుకుని పూజ చేస్తే, ఆ కోరికలు వెంటనే సిద్ధిస్తాయని శాస్త్ర ప్రమాణం. అయితే, సద్గురువును ఆశ్రయించి, విధివిధానంగా, సమంత్రకంగా మాత్రమే ఈ విధానంలో అర్చనలు చేయాలి. 

ధన లాభం కోసం - గన్నేరు పూలు

మోక్ష ప్రాప్తికి - ఉమ్మెత్త పూలు

సుఖశాంతుల కోసం - నల్ల కలువ పూలు

చక్రవర్తిత్వం కోసం - తెల్ల తామర పూలు

రాజ్యప్రాప్తి కోసం - ఎర్ర తామర పూలు, నాగకేసర పుష్పాలు

మంత్రసిద్ధి కోసం - గన్నేరు, అశోక, తెల్లజిల్లేడు పూలు

కోరుకున్న కన్యతో వివాహం  - సన్నజాజి పూలు

సంతానప్రాప్తి కోసం - మొల్ల పూలు

ఆరోగ్యం కోసం - దర్భ పూలు

వశీకరణం కోసం - తుమ్మి పూలు

శత్రువిజయం కోసం - కడిమి పూలు

దారిద్య్ర వినాశనం కోసం - బిల్వ దళాలు

సుఖం కోసం - మరువక పత్రాలు

గోసంపద వృద్ధి కోసం - లొద్దుగ పూలు

ఆయుష్సు కోసం - మోదుగ, బూరుగ పూలు

పరమాద్భుతం... శివలింగపుష్పం

పరమేశ్వరుడి లీలావిలాసమైన అనంత సృష్టిలో మరొక విచిత్రం... పూర్తిగా శివలింగాన్ని పోలి ఉండే పుష్పం. దీన్నే నాగలింగ పుష్పం అని కూడా అంటారు. కొన్నిచోట్ల నాగమల్లి పుష్పాలని, మల్లికార్జున పుష్పాలని కూడా పిలుస్తారు. శివుని జటాజూట ఆకృతిలో, వెంట్రుకలు విప్పారి ఉన్నట్లు  ఈ వృక్షం ఉంటుంది. శివలింగ పుష్పాలు ఇతర పుష్పాలకు భిన్నంగా కొమ్మలకు పూయకుండా వెంట్రుకలాంటి జడలకు పూస్తాయి. పుష్పం పైభాగంలో నాగుపాము పడగవిప్పి ఆచ్ఛాదనగా ఉన్నట్లు చక్కటి ఆకృతి ఉంటుంది. ఆ పడగ లోపల పుష్పం ఉంటుంది. ఈ పూలతో శివునికి పూజచేస్తే జన్మరాహిత్యం కలుగుతుంది. శివునితో పాటు ఇతర దేవతలకు కూడా ఈ పుష్పాలను అర్పించవచ్చు. అయితే శిరసు నుంచి భుజాల వరకు మాత్రమే పడేట్లు (ఉండేట్లు) ఈ పుష్పాలతో అర్చన చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోను పాదాల మీద శివలింగ పుష్పాలను ఉంచకూడదు. పార్వతీదేవికి మంగళసూత్రంలో ఈ పుష్పాన్ని అలంకరించాలి. 

అష్టపుష్ప మానస పూజ

శివపురాణంలోని వాయవ్యఖండంలో అష్టపుష్ప మానసపూజ గురించి చక్కగా వర్ణితమై ఉంది. 

అహింసా ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహః

సర్వభూతదయా పుష్పం క్షమా పుష్పం విశేషతః

శాంతి పుష్పం తపః పుష్పం ధ్యానపుష్పం తథైవచ

సత్యమష్టవిధం పుష్పం శివప్రీతికరం భవేత్‌ ||

అహింస, ఇంద్రియనిగ్రహం పాటించటం, అన్ని ప్రాణుల యందు దయ కలిగిఉండటం, క్షమాగుణాన్ని కలిగిఉండటం, శాంతి కాముకులై ఉండటం, తపస్సు చేయటం, నిరంతరం ధ్యానం చేయటం, సత్య వాక్పాలన గుణాన్ని కలిగిఉండటం - ఈ ఎనిమిది మనస్సుకు సంబంధించిన పుష్పాలు. ఇతర పుష్పాల మాదిరిగా ఇవి కంటికి కనిపించవు. ఇవి మనోపుష్పాలు. అంటే, ఈ ఎనిమిది గుణాలను కలిగి ఉండి (లేదా నిత్యం వీటిని ఆచరిస్తూ, కలలో కూడా వీటి నిర్వహణను మరచిపోకుండా ఉండాలి) పరమేశ్వరుని అర్చించినట్లయితే కలిగే ఫలితాన్ని మాటల్లో వర్ణించటం ఎవరికీ సాధ్యం కాదని మహర్షులు చెప్పారు.

ఇంతటి మహోన్నతమైన ఫలితాలను కలిగించే పరమేశ్వరారాధనతో మన జీవితాలను సార్థకం చేసుకుందాం. ఇందుకు పరమేశ్వరుడు అందరినీ అనుగ్రహించుగాక. 

------------🔔🔔🔔🔔🔔🔔---------

రచన

డాక్టర్‌ కప్పగంతు రామకృష్ణ, ఆంధ్రోపన్యాసకులు,  

ఎస్‌.ఆర్‌.ఎస్‌.వి.కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, గాంధీనగర్‌, విజయవాడ-3

సెల్‌ : 90320 44115 / 88975 47548

Friday, November 13, 2020

భగినీ హస్తభోజనం గురించి శ్రీ కనకదుర్గప్రభ పత్రికలో రాసిన వ్యాసం

అనుబంధాలకు శ్రీకారం

    కార్తికమాసం అనగానే చన్నీటి స్నానాలు, శివాలయాల్లో అభిషేకాలు, ఉపవాసాలు కనిపిస్తాయి. ఏ నోట విన్నా, ఏ గుండె సవ్వడి విన్నా పంచాక్షరీ మంత్రమే వినిపిస్తుంది. భక్తుల హృదయాల్లో కార్తికమాసం అంతగా పెనవేసుకుపోయింది. అందుకే కార్తికమాసాన్ని మించిన మాసం మరొకటి లేదని శాస్త్రాలు చెబుతున్నాయి. 


ఇంతగా ఆధ్యాత్మికత నిండిన కార్తికమాసంలో అనుబంధాలను కూడా పరిపుష్టం చేసేందుకు మన శాస్త్రాలు కొన్ని నియమాలను విధించాయి. ఒకే కడుపున పుట్టిన బిడ్డల మధ్య ఉండే సహజ జన్మబంధాన్ని జన్మజన్మల బంధంగా తీర్చిదిద్దేందుకు పునాదిగా అవసరమైన హృదయబంధాల్ని కూడా ఈ మాసం బలపరుస్తుంది. ఈ క్రమంలో ఏర్పడిన ఆచారమే 'భగినీ హస్త భోజనం'. 


కార్తిక మాసం శుక్ల విదియ రోజున భగినీ హస్త భోజనం చెయ్యాలని నియమం. భగిని' అంటే చెల్లెలైనా కావచ్చు. అక్క అయినా కావచ్చు. 'హస్తభోజనం' అంటే... చేతి భోజనము అని అర్ధం. అంటే... సోదరి చేతివంట సోదరుడు తినడం అన్నమాట. సాధారణంగా వివాహమైన చెల్లెలు లేదా అక్క ఇంటిలో తల్లిదండ్రులుగానీ, అన్నదమ్ములుగానీ భోజనం చేయడానికి అంతగా ఇష్టపడరు. కారణం తినకూడదని కాదు. ఆడపిల్ల ఋణం ఉంచుకోవడం పుట్టింటివారికి ఇష్టం ఉండదు. శుభసందర్భాలలో, శుభకార్యాలలో భాగంగా ఆడపిల్ల ఇంటికి వచ్చి భుజించినా తప్పులేదు కానీ., ఊరికే వచ్చి తినడం మర్యాద కాదని మనవాళ్ళు భావిస్తారు. కానీ, కార్తిక శుద్ధ విదియనాడు మాత్రం వివాహం అయిన సోదరి ఇంటిలో సోదరుడు భుజించి తీరాలని శాస్త్రం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఓ పురాణగాథ వ్యాప్తిలో ఉంది. 


సూర్యభగవానుడికి సంధ్యాదేవి వలన కలిగిన సంతానం యముడు, యమున. 'యమునకు' అన్నయ్య 'యముడు' అంటే ఎంతో ఇష్టం. యముడికి కూడా అంతే. యముడు తన చెల్లెల్ని ప్రేమగా 'యమీ' అని పిలిచేవాడు. యమునకు వివాహం జరిగింది. అత్తవారింటికి కాపురానికి వెళ్ళింది. ఒకరోజు యమునకు తన అన్నను చూడాలని కోరిక కలిగింది. తన ఇంటికి విందుకు రమ్మని యమధర్మరాజుకు వర్తమానం పంపింది. విందుకు వస్తానని యమధర్మరాజు యమునకు మాట ఇచ్చాడు. అ రోజు అన్నయ్యకు ఇష్టమైన పదార్థాలన్నీ చేసి అన్నయ్య రాకకోసం ఎదురుచూస్తూ కూర్చుంది యమున. ఎంతసేపయినా అన్నయ్య రాలేదు. ఈ రోజు పనివత్తిడి వల్ల రాలేకపోతున్నానని, 'కార్తిక శుద్ధ విదియ' నాడు తప్పకుండా విందుకు వస్తానని చెల్లెలికి వర్తమానం పంపాడు యమధర్మరాజు. కొద్దిగా బాధ అనిపించినప్పటికీ అన్నయ్య తనను గుర్తుపెట్టుకున్నందుకు సంతోషించింది యమున. 


కార్తిక శుద్ధ విదియ రోజున కూడా తన అన్నయ్యకు ఇష్టమైన పదార్థాలన్నీ తయారుచేసింది.అన్నమాట ప్రకారం యమధర్మరాజు చెల్లెలు ఇంటికి విందుకు వచ్చాడు. యమున తన అన్నయ్య నుదుట పవిత్ర తిలకం దిద్ది, పూలమాల వేసి తాను వండిన పదార్థాలన్నీ అన్నకు కొసరి కొసరి వడ్డించి ప్రేమగా తినిపించింది. చెల్లెలు అనురాగానికి ముగ్థుడైన యమధర్మరాజు ఏ వరం కావాలో కోరుకో' అని అడిగాడు. 'ఏటా ఇదే రోజు... అంటే కార్తిక శుద్ధ విదియ నాడు తన ఇంటికి విందుకు రావాలనీ, అలాగే ప్రతి సోదరుడు ఈ రోజున తన సోదరి చేతి వంటతో భోజనం చెయ్యాలనీ' వరం కోరుకుంది యమున. యమధర్మరాజు ఆ వరాన్ని  అనుగ్రహించాడు. దీంతోపాటుగా ఎవరైతే కార్తిక శుద్ధ విదియ రోజున సోదరి ఇంట్లో భోజనం చేస్తారో వారికి నరలోక ప్రాప్తి కాని, అపమత్యు భయం కానీ ఉండదని కూడా వరం ప్రసాదించాడు. నాటి నుంచి కార్తిక శుద్ధ విదియ రోజున ప్రతి సోదరుడు వివాహం అయిన తన సోదరి చేతి భోజనం చేయాలని శాస్త్ర ంనియమం విధించింది. క్రమంగా ఇదే 'భగినీ హస్త భోజనం' పేరుతో ఆచారంగా స్థిరపడింది.


ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలతో పాటు ఈ ఆచారం ఇప్పటికీ చాలా చోట్ల కొనసాగుతోంది. మహారాష్ట్రలో ఈ పండుగను 'భయ్యా-దుజ్‌' అని పిలుస్తారు. నేపాల్‌ ప్రాంతంలో ఈ పండుగను 'భాయి-టికా' అని పిలుస్తారు. పంజాబ్‌ ప్రాతంలో ఈ పండుగను 'టిక్కా' అని పిలుస్తారు. 
భగినీ హస్త భోజనం తర్వాతి రోజున... అంటే కార్తిక శుద్ధ తదియ రోజున అన్న తన ఇంటికి చెల్లెలిని భోజనానికి పిలవాలి. దీనిని 'సోదరి తృతీయ' అంటారు. ఈ రోజున త్రిలోచన గౌరీవ్రతం ఆచరించాలి. చెల్లెలి కుటుంబ సభ్యులకు చక్కని భోజనం పెట్టి, సోదరికి నూతన వస్త్రద్వయం, పసుపు కుంకుమలు, సుమంగళ ద్రవ్యాలు పెట్టాలి. అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి. వైష్ణవ కృచ్ఛ / విష్ణుగౌరీ వ్రతం చేయాలని మరికొన్ని గ్రంథాలు చెబుతున్నాయి. వీటన్నిటికన్నా విశేషం... ఈ రోజున సోదరుడు సోదరిని ఆదరిస్తాడు. అంటే విదియ రోజున సోదరి ఇంటికి వెళ్ళిన సోదరుడు ఆమెను తన ఇంటికి కుటుంబ సమేతంగా రమ్మని ఆహ్వానించాలి. తదియ రోజు సోదరి సోదరుని ఇంటికి సకుటుంబంగా వెళ్తుంది. ఆమెకు భోజనం పెట్టి, సుమంగళ ద్రవ్యాలు, నూతన వస్త్రాలు ఇచ్చి సోదరుడు సత్కరిస్తాడు. 


ఇదీ భారతీయ ఆచారాల సమున్నత సామాజిక కోణానికి నిదర్శనం. భారతీయ ఆచారాలు మూఢ నమ్మకాలు కావు... అత్యున్నత వైజ్ఞానిక, సామాజిక దార్శనికతతో నేటి వైజ్ఞానికులకు కాలం కొలత తెలియని నాడే ద్రష్టలైన మన భారతీయ ఋషులు సమాజ నడవడిక ఉన్నతంగా ఉండేందుకు ఏర్పరచిన ఉత్తమ విధానాలని ఈ రెండు రోజుల ఆచారం నిరూపిస్తుంది. కార్తిక విదియ, తదియ రెండు రోజుల్లో పైన చెప్పుకున్న విధానాలు పాటిస్తే కుటుంబసభ్యుల మధ్య కలహాలు రూపుమాసిపోతాయి. అనురాగం, ఆప్యాయత పరిఢవిల్లుతాయి. ఇప్పటికీ ఉత్తరాదిన ఈ ఆచారం కొద్దిగా వ్యాప్తిలో ఉండగా దక్షిణాదిలో దాదాపుగా క్షీణదశకు చేరుకుంది. పెద్దలు ఈ రెండు రోజుల ఆచారాన్ని పునరుద్ధరిస్తే అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ బిడ్డలు ఆజన్మాంతం కలసి ఉండాలనే ముచ్చట కూడా తీరుతుంది. అనుబంధాల పునాదుల మీద  సమాజమనే కుటుంబం కలకాలం ఆనందోత్సాహాలతో జీవిస్తుంది.

----------------------

భగినీ హస్త భోజనం గురించి శ్రీ కనకదుర్గ ప్రభ పత్రికలో 
డాక్టర్ కప్పగంతు రామకృష్ణ 

(Dr Kappagantu Rama Krishna) 

రాసిన వ్యాసం






Wednesday, November 4, 2020

మనిషి మాట తీరు ఎలా ఉండాలనే అంశాన్ని వివరిస్తూ రాసిన వ్యాసం

మనిషి మాట తీరు ఎలా ఉండాలి? 
అవతలి వ్యక్తి నొచ్చుకోకుండా మాట్లాడటం ఎలా? 
మన మాటలతో అవతలి వ్యక్తి అభిమానాన్ని పొందటం ఎలా?  


మాట మంచిదైతే...


మాట మనిషిని మహనీయుడిని చేస్తుంది. అదే మాట మనిషి పతనావస్థకు దారితీస్తుంది. వాక్కుకు అంతటి అమోఘమైన శక్తి ఉంది. అవతలి వ్యక్తితో స్నేహం చెయ్యాలన్నా, మిత్రుడు శత్రువుగా మారాలన్నా ఒక్క మాట సరిపోతుంది. అందుకే శాస్త్రాలు వాక్కును దైవంగా ప్రకటిస్తాయి. మంత్రభాగంలో కూడా వాక్కుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. మాట్లాడే మాటలో ఒక శబ్దం ఎక్కువ  లేదా తక్కువ అయినా అందుకు విపరీత ఫలితాలు ఏర్పడతాయి. అందుకే ఎల్లప్పుడూ మంచి మాటలనే మాట్లాడాలి. 

సీతాదేవిని రావణుడు అపహరించిన తర్వాత ఆమెను వెదుకుతూ రామలక్ష్మణులు రుష్యమూక పర్వత ప్రాంతానికి చేరుకుంటారు. సుగ్రీవుడి నివాస ప్రాంతం అది. తనను చంపడానికి తన అన్న వాలి వీరిని పంపించారా అని అనుమానించి, విషయం తెలుసుకునేందుకు తన మంత్రి అయిన హనుమంతుడిని పంపుతాడు. మారుతి మారు వేషంలో రామలక్ష్మణుల దగ్గరకు వచ్చి అనేక విధాలుగా ప్రశ్నిస్తాడు. 'రాజర్షి దేవ ప్రతిమౌ తాపసౌ సంశితవ్రతౌ! దేశం కథమిమం ప్రాప్తౌ భవంతౌ వరవర్ణినౌ!!' మీరిద్దరూ మంచి తేజోవంతుల్లా, తీవ్రమైన తపోదీక్ష పట్టిన వారిలా ఉన్నారు. మీ రూపం తాపసుల్లా ఉన్నా మీ తేజం క్షత్రియత్వాన్ని సూచిస్తోంది. గొప్ప పని ఉంటే తప్ప మీవంటి యోధులు క్రూరమగాలు సంచరించే ఇలాంటి చోటుకు రారు' అని ప్రశ్నిస్తాడు హనుమ.

మాట అంటే ఇలా ఉండాలి. ఒక్క అక్షరం  ఎక్కువ తక్కువ కాకుండా ప్రశ్నలు వేశాడు హనుమ. ఇంత కాలం తాను ఎవరి గురించి ఎదురు చూస్తున్నాడో ఆ దైవం ఎదుట నిలబడినప్పుడు హనుమ తొందరపడలేదు. వచ్చింది ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఎంత గొప్పగా ప్రశ్నించాడంటే రాముడే ముచ్చటపడ్డాడు. వ్యాకరణ పండితుడు తప్ప మరొకరు ఇలా మాట్లాడలేడన్నాడు. హనుమ ప్రశ్న స్వీకరించిన వ్యక్తి కూడా ఆనందపడేలా అడిగాడు. హనుమంతుడి మాటల ఔచిత్యానికి ముచ్చటపడతాడు రాముడు.

నా నృగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణ: 

నా సామవేద విదుష: శక్యమేవ విభాషితుం ||

రుక్‌, యజు, సామవేదాల్లో పండితుడైనవాడు తప్ప మరొకరు ఇలా మాట్లాడలేరంటూ లక్ష్మణుడితో హనుమంతుడి మాటలతీరులోని గొప్పతనాన్ని వివరిస్తాడు రాముడు. ఒక్క మాట ఎక్కువ తక్కువ కాకుండా కొత్తవారితో కూడా ఎంతో నేర్పుగా మాట్లాడటమే కాకుండా రామసుగ్రీవుల మైత్రికి బీజం వేసింది హనుమ వాక్చాతుర్యం. మంచి మాటకు ఉండే శక్తి అంతటి గొప్పది. 

బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేస్తుంటాడు కుంభకర్ణుడు. అసలే అతడు చెప్పలేనంత బలశాలి. ఆ బలానికి వరబలం కూడా తోడైతే ఇక అతడిని ఆపటం ఎవరితరం కాదని ఆలోచించిన దేవతలు సరస్వతీ దేవిని ప్రార్థిస్తారు. దేవతల కోరిక మన్నించిన సరస్వతి కుంభకర్ణుడి నోటి నుంచి అపశబ్దం పలికేలా చేస్తుంది. 'నిర్దయ' అని వరం కోరుకోవాలనుకున్న 'నిద్రయ' అడిగాడు. తథాస్తు అన్నాడు బ్రహ్మ. అంతే... నిద్రకు ప్రతిరూపంగా మారిపోయాడు కుంభకర్ణుడు. తనకున్న దయాగుణం కారణంగా ఎవరినీ చంపలేకపోతున్నానననే బాధతో నిర్దయ కావాలని అనుకున్నాడు. కానీ అక్షరం మారే సరికి అర్థం మారి, ఫలితం తలకిందులైంది. అందుకే మాట మాట్లాడేటప్పుడు వెనకాముందూ ఆలోచించమంటారు పెద్దలు. 

చంటి బిడ్డ భరతుడిని వెంట తీసుకుని దుష్యంతుడి సభకు చేరుకుంటుంది శకుంతల. నీవెవరో నాకు తెలియదు. నీ బిడ్దకు తండ్రిని నేను కాదంటాడు దుష్యంతుడు. అకస్మాత్తుగా తన భర్త ఇలా మాట్లాడేసరికి ఖిన్నురాలవుతుంది శకుంతల. భర్తను ఎన్నో విధాలుగా ప్రాథేయపడుతుంది. నా గురించి కాకపోయినా నీ బిడ్డను చూసైనా సరే నిజం ఒప్పుకోమంటుంది.

నుతజల పూరితంబులగు నూతులు నూఱిటికంటె సూనృత

వ్రత యొక బావి మేలు మఱి బావులు నూఱిటికంటె నొక్క స

 త్క్రతు వది మేలు తత్క్రతుశతంబునకంటె సుతుండు మేలు త

త్సుత శతకంబుకంటె నొక సూనతవాక్యము మేలు సూడగన్‌

తియ్యటి నీటితో నిండివున్న వంద నూతులకంటె ఒక దిగుడుబావి మేలు. అలాంటి వంద బావుల కన్నా ఒక మంచి క్రతువు మేలు. అలాంటి వంద క్రతువుల కన్నా ఒక కుమారుడు మేలు. అలాంటి వంద మంది కుమారుల కన్నా ఒక మంచిమాట మేలు. కాబట్టి రాజా! ఒక సత్యమైన మాట పలకవయ్యా అంటుంది శకుంతల. మంచి మాటకు ఎంత విలువ ఉంటుందో చెప్పటానికి ఈ ఒక్క ఉదాహరణ సరిపోతుంది. 

వాక్కు అనేది అగ్ని. ఆ వాగ్బాణాలు మన నోటి నుండి వెలువడినప్పుడు అవి ఎదుటివారికి వెచ్చదనాన్ని ఇవ్వాలి గానీ..! ఎదుటివారి మనసును నొప్పించకూడదు. ఆ వెచ్చదనాన్ని అందించే శక్తి మన వాక్కుకు లేనప్పుడు దానిని ఎదుటివారిపై ప్రయోగించకపోవడమే ఉత్తమం. ''తనకోపమె తన శత్రువు తనశాంతమె తనకు రక్ష'' అన్నట్టు మనకి కోపం అనిపిస్తే మనము మౌనంగా ఉండటమే మంచిది. వాక్కు పరా, పశ్యన్తి, మధ్యమ, వైఖరి అని నాలుగు విధాలుగా ఉంటుంది. ఈ వాక్కు ఎలా పుడుతుందో వ్యాకరణం చెబుతుంది. ఈ వాక్కు వెలువడిన తర్వాత అది 'శబ్దం'గా మారుతుంది. ప్రతి శబ్దానికి నిర్దుష్టంగా ఒక అర్థం ఉంటుంది. అలా నిర్దుష్టమైన అర్థం కలిగిన శబ్దాన్ని 'వాచకం'లేదా 'అభిద' అంటారు. ఆ శబ్దం తాలూకు అర్థాన్ని 'వాచ్యం' అంటారు.

సత్యం బ్రూయాత్‌ ప్రియం బ్రూయాత్‌

        న బ్రూయాత్‌ సత్య మప్రియం

        ప్రియం చ నానతం బ్రూయాత్‌

        ఏష ధర్మ స్సనాతన: || (మనుస్మృతి )

సత్యాన్నే పలుకు. ప్రియాన్నే మాట్లాడు. సత్యమైనా అప్రియాన్ని పలకవద్దు. ఇదే సనాతన ధర్మం అంటుంది మనుస్మ ృతి. సత్యాన్నే విను. ప్రియమైన దాన్నే విను.సత్యమైనా అప్రియంగా ఉంటే వినకు. అలాగే ప్రియంగా ఉందని అసత్యాన్ని వినకు.అలాంటి లక్షణాలతో చెప్పేవాడు, వినేవాడూ ఉన్నప్పుడు ఆ చెప్పిన విషయం హదయానికి హత్తుకుని ఎల్ల కాలం గుర్తుంటుంది. అంటే ఇతరులకు ప్రియం కానిది అది సత్యమైనా మనం చెప్పకూడదు. అందులో కాఠిన్యం ఉండటమే ఇందుకు కారణం. అలాగే జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడకపోతే అది సత్యమైనా తగవులాటకు కారణమవుతుంది. అందుకే నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నారు.
----------------------------------------------------------------------------
మనిషి మాట తీరు ఎలా ఉండాలనే విషయాన్ని వివరిస్తూ 
ఈనాడు దినపత్రిక మకరందం పేజీలో 05.11.2020 తేదీన రాసిన వ్యాసం ఇది.


Dr Kappagantu Ramakrishna - డాక్టర్ కప్పగంతు రామకృష్ణ

 

Dr Kappagantu Ramakrishna
డాక్టర్ కప్పగంతు రామకృష్ణ 


Dr Kappagantu Ramakrishna - డాక్టర్ కప్పగంతు రామకృష్ణ 


ధర్మమూర్తి... సమదర్శి.... జగద్గురు కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి

  ధర్మమూర్తి... సమదర్శి ఆయన పేరు పలికితేనే చాలు... వ్యక్తం చేయటానికి మాటలు చాలని అనుభూతి కలుగుతుంది. ఆ కళ్ళలోని వెలుగు ఏదో తెలియని కారుణ్యాన...