Showing posts with label ఆరాధన. Show all posts
Showing posts with label ఆరాధన. Show all posts

Wednesday, May 1, 2024

వాక్యకోవిదుడు హనుమంతుడు


 

వాక్యకోవిదుడు, వ్యాకరణ పండితుడు

 

 

మాట మనిషిని మహనీయుడిని చేస్తుంది. అదే మాట మనిషి పతనావస్థకు దారితీస్తుంది. వాక్కుకు అంతటి అమోఘమైన శక్తి ఉంది. అవతలి వ్యక్తితో స్నేహం చెయ్యాలన్నా, మిత్రుడు శత్రువుగా మారాలన్నా ఒక్క మాట సరిపోతుంది. అందుకే శాస్త్రాలు వాక్కును దైవంగా ప్రకటిస్తాయి. మంత్రభాగంలో కూడా వాక్కుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. మాట్లాడే మాటలో ఒక శబ్దం ఎక్కువ లేదా తక్కువ అయినా అందుకు విపరీత ఫలితాలు ఏర్పడతాయి. అందుకే ఎల్లప్పుడూ మంచి మాటలనే మాట్లాడాలి. వాక్కుకు ఇంతటి ప్రభావాన్ని పూర్తిగా తెలుసుకున్నవాడు, ఎవరితో ఎప్పుడు ఎంతవరకు ఎలా మాట్లాడాలో ఆ పరిధికి లోబడి మాట్లాడి ‘వాక్య కోవిదుడు’గా, ‘నవ వ్యాకరణ పండితుడు’గా జేజేలు అందుకుంటున్నవాడు రామదూత హనుమ మాత్రమే.

 

హనుమ నవ వ్యాకరణ పండితుడు. సూర్యుడి దగ్గర శిష్యరికం చేసినవాడు.  తపస్వి. సుగ్రీవుడి మంత్రి. భక్తుడు. సేవకుడు. రాయబారి. కార్యసాధకుడు. యోధుడు. పరాక్రమశాలి. అన్నిటికీ మించి వినయ సంపన్నుడు. గొప్ప వాక్కు అలంకారంగా కలిగినవాడు – ’వాగ్విదాం వరం‘ – అని వాల్మీకి పొంగిపోయి చెప్పాడు.

 

హనుమంతుడు అనగానే సాధారణంగా అందరికీ ఆ స్వామి భుజ బలం మాత్రమే గుర్తుకువస్తుంది. నిజానికి హనుమ గొప్ప బుద్ధి బలశాలి కూడా. అందుకే ‘బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతా / అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్స్మరణాద్భవేత్’ -  హనుమను ధ్యానిస్తే బుద్ధిబలం వస్తుంది అని చెబుతున్నాయి ఇతిహాస, పురాణ గ్రంథాలు.

 

సీతాదేవిని రావణుడు అపహరించిన తర్వాత ఆమెను వెదుకుతూ రామలక్ష్మణులు రుష్యమూక పర్వత ప్రాంతానికి చేరుకుంటారు. సుగ్రీవుడి నివాస ప్రాంతం అది. తనను చంపడానికి తన అన్న వాలి వీరిని పంపించారా అని అనుమానించి, విషయం తెలుసుకునేందుకు తన మంత్రి అయిన హనుమంతుడిని పంపుతాడు. మారుతి మారు వేషంలో రామలక్ష్మణుల దగ్గరకు వచ్చి అనేక విధాలుగా ప్రశ్నిస్తాడు.

 

రాజర్షి దేవ ప్రతిమౌ తాపసౌ సంశితవ్రతౌ ! దేశం కథమిమం ప్రాప్తౌ భవంతౌ వరవర్ణినౌ!!

 

మీరిద్దరూ మంచి తేజోవంతుల్లా, తీవ్రమైన తపోదీక్ష పట్టిన వారిలా ఉన్నారు. మీ రూపం తాపసుల్లా ఉన్నా మీ తేజం క్షత్రియత్వాన్ని సూచిస్తోంది. గొప్ప పని ఉంటే తప్ప మీవంటి యోధులు క్రూరమగాలు సంచరించే ఇలాంటి చోటుకురారు అని రామలక్ష్మణులను ప్రశ్నిస్తాడు హనుమ.

 

మాట అంటే ఇలా ఉండాలి. ఒక్క అక్షరం ఎక్కువ తక్కువ కాకుండా ప్రశ్నలు వేశాడు హనుమ. ఇంత కాలం తాను ఎవరి గురించి ఎదురు చూస్తున్నాడో ఆ దైవం ఎదుట నిలబడినప్పుడు హనుమ తొందరపడలేదు. వచ్చింది ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఎంత గొప్పగా ప్రశ్నించాడంటే రాముడే ముచ్చటపడ్డాడు. వ్యాకరణ పండితుడు తప్ప మరొకరు ఇలా మాట్లాడలేడన్నాడు. హనుమ ప్రశ్న స్వీకరించిన వ్యక్తి కూడా ఆనందపడేలా అడిగాడు. హనుమంతుడి మాటల ఔచిత్యానికి ముచ్చటపడతాడు రాముడు.

 

నా నృగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణ: ! నా సామవేద విదుష: శక్యమేవ విభాషితుం !!

 

రుక్‌, యజు, సామవేదాల్లో పండితుడైనవాడు తప్ప మరొకరు ఇలా మాట్లాడలేరంటూ లక్ష్మణుడితో హనుమంతుడి మాటలతీరులోని గొప్పతనాన్ని వివరిస్తాడు రాముడు. ఒక్క మాట ఎక్కువ తక్కువ కాకుండా కొత్తవారితో కూడా ఎంతో నేర్పుగా మాట్లాడటమే కాకుండా రామసుగ్రీవుల మైత్రికి బీజం వేసింది హనుమ వాక్చాతుర్యం. హనుమలోని వ్యాకరణ పాండితీ వైభవానికి, ఔచిత్యవంతమైన సంభాషణ చేసే నేర్పుకీ ప్రతీక ఈ ఘట్టం.

 

నవ వ్యాకరణాలు ఎలా చదివాడంటే...

 

‘హనుమంతుడు మాటతీరు తెలిసినవాడు’అని శ్రీరామచంద్రుడు అంతటివాడు ప్రశంసించాడు. నవ వ్యాకరణ పండితుడు కావటమే హనుమంతుడి ఉత్తమమైన మాటతీరుకు కారణం.

హనుమ సూర్యభగవానుడి దగ్గరకు వెళ్లి తనకు వ్యాకరణాన్ని నేర్పమన్నాడు. చిన్నప్పుడు తనను తిన దగిన ఫలమని భావించి ఎగిరి వచ్చిన హనుమను చూస్తే ముచ్చటేసింది సూర్యుడికి. ‘నేర్పుతాను. కానీ, నేను ఒకచోట స్థిరంగా ఉండటానికి కుదరదు కదా! గగన మార్గంలో నా వెంట ఎలా తిరుగ గలవు?’ అనడిగాడు భానుడు.

 

‘ఓ.. దానిదేముంది!’ అంటూ తన కాయాన్ని పెంచిన ఆంజనేయుడు ఉదయాద్రిన ఒక కాలు, అస్తాద్రిన ఒక కాలు మోపి, సూర్యగమనానికి అనువుగా నడుమును వంచుతూ, చెవి ఒగ్గి ఆదిత్యుడి దగ్గర వ్యాకరణ శాస్ర్తాన్ని కూలంకషంగా అధ్యయనం చేశాడు.

 

మనకు మొత్తం తొమ్మిది రకాల వ్యాకరణాలు ఉన్నాయి. అవి... 1.శాక్త వ్యాకరణము 2. శంభు వ్యాకరణము 3. కుమార వ్యాకరణము 4. ఇంద్ర వ్యాకరణము 5. సూర్య వ్యాకరణము 6. చంద్ర వ్యాకరణము 7. స్మర వ్యాకరణము 8. వాత్స్యాయన వ్యాకరణము 9. అగస్త్య వ్యాకరణము. – ఈ తొమ్మిది రకాల వ్యాకరణాలను హనుమంతుడు సూర్యుడి వద్ద అధ్యయనం చేసాడు.  అందుకే హనుమకు ‘నవ వ్యాకరణ పండితుడు’ అనే పేరు ఏర్పడింది.

 

హనుమ మాట్లాడిన తీరుకు ముచ్చటపడిన రామచంద్రమూర్తి స్వయంగా... నూనం వ్యాకరణం కృత్స్నమనేన బహుధా శ్రుతమ్ బహు వ్యాహరతానేన న కిఞ్చిదపశబ్దితమ్’ – ఆంజనేయుడు మాట్లాడిన మాటల్లో ఒక్క అపశబద్దం కానీ, ఒక్క మాట ఎక్కువ కానీ, తక్కువ కానీ లేదు. వ్యాకరణం మీద తిరుగులేని పట్టు ఉన్న వ్యక్తికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది అంటాడు. రామయ్యను హనుమ మెప్పించింది తన భుజబలం చూపించో, మరొక శక్తి ప్రదర్శించో కాదు... కేవలం తన భాషా పాండిత్యంతో మెప్పించాడు. అదీ హనుమ వ్యాకరణ పాండిత్యానికి ఉన్న ఔన్నత్యం.

 

దృష్టా సీతా...

 

వానర రాజు సుగ్రీవుని ఆజ్ఞ ప్రకారం భూమి నాలుగు చెరగుల నుంచి కపి సైన్యం వచ్చి చేరింది. ఓక్కొక్కరిని ఒక్కొక భాగానికి నాయకుడిని చేసి వారు ఏదిక్కుగా వెళ్ళాలో, ఎక్కడెక్కడ వెతకాలో వివరంగా ఆజ్ఞ ఇచ్చాడు సుగ్రీవుడు. చివరగా, అంగదుడిని నాయకునిగా చేసి , హనుమదాదిగా వీరులను దక్షణ దిక్కుకు వెళ్ళి వెతకమని చెబుతాడు. ఎక్కడి దాకా వెళ్ళి వెతకాలో చెబుతాడు. అందరికీ, ఎక్కడెక్కడ వెతకాలో కూడా చెబుతాడు.. సమయం ఒక నెల అని చాలా వివరంగా ఆజ్ఞ ఇచ్చాడు. అతిక్రమించిన వారికి శిరః ఛేదం శిక్ష అని ప్రకటించాడు. అందుకే దానిని సుగ్రీవాజ్ఞ అన్నారు.

 

అప్పుడు రాముడు హనుమకు అంగుళీయం తన గుర్తుగా ఇస్తాడు, సీతకు ఇవ్వడానికి. ఎవ్వరికీ ఇవ్వని ఈ గుర్తు హనుమకే ఇవ్వడం లో విశేషం, హనుమ మాత్రమే ఈ పని పూర్తి చేయగలడన్న నమ్మకం.  సీతమ్మను వెదకడానికి అందరూ అన్ని దిక్కులకూ బయలుదేరుతారు. దక్షణ దిక్కుగా వెళ్ళినవారు చాలా చిక్కులు పడి సముద్ర తీరం చేరుతారు.

 

అప్పటికే ఇచ్చిన గడువు పూర్తి అయిపోయింది. అందరూ ప్రాణభయంతో ఉన్నారు సుగ్రీవాజ్ఞ మూలంగా. ఆ సమయంలో లంకకి వెళ్ళగలవారెవరనే ప్రశ్న ఏర్పడింది. చివరికి హనుమకి శక్తి గుర్తు చేసి ఆయనను పంపుతారు. హనుమ లంకకు చేరుకుని, సీతను చూసి ఆమెతో మాటాడి ఆమెను ఆత్మహత్య నుంచి కాపాడి, అంగుళీయమిచ్చి, సీతమ్మ ఇచ్చిన చూడామణి ని తీసుకుని, అశోకవనం నాశనం చేసి, రావణుని పరివారం కొంత, అతని సుతుని పరిమార్చి, రావణుని చూచి, లంక కాల్చి, విజయంతో తిరిగి బయల్దేరతాడు.

 

ఇక్కడ సముద్రపు ఒడ్డున ఉన్న వారు ఉత్కంఠ తో ఉన్నారు. ఏమైందో తెలియదు. హనుమ సీతను చూసి వస్తే అందరి ప్రాణాలు నిలబడతాయి. లేకపోతే, సుగ్రీవాజ్ఞ ప్రకారం శిరచ్ఛేదం తప్పదు. ఇటువంటి సమయంలో హనుమ తిరిగివస్తూ సముద్రపు ఒడ్డున ఉన్న తన వారికి విజయ సందేశం క్లుప్తంగా తెలియజేయడానికి సింహనాదం చేస్తాడు. ఆ సింహనాదం విని, అక్కడ వున్న జాంబవంతుడు మొదలైన వారు హనుమ కార్య సాధనతో తిరిగి వస్తున్నాడని భాష్యం చెబుతారు.

 

ఆయినా ఉత్కంఠం పోదు. హనుమ నేల మీద కాలుమోపుతూ... “దృష్టా సీతా” అన్నాడు. సాధారణంగా క్రియాపదంతో వాక్య నిర్మాణం ఉండదు. సంస్కృత భాషలో ఉన్న గొప్పతనం కూడ తోడు కలవడం, వ్యాకరణ పండితుడవటం వల్ల, అక్కడ ఉన్నవారి ఉత్కంఠను వెంటనే చల్లార్చే ఉద్దేశంతో హనుమ ‘దృష్టా సీతా’ అన్నాడు. ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో, ఎలా, ఎందుకు, ఏం మాట్లాడాలో తెలిసినవాడు కావటం వల్లనే ఒక్కమాటతో వేలాది ప్రాణాలు నిలబెట్టాడు హనుమ. అదీ ఆ స్వామిలోని వాక్యకోవిదత్వం.

 

సీతమ్మ ప్రాణం కాచిన మాట

 

పదినెలల అశోకవనవాసం సీతమ్మను ఎంత కుంగదీసిందంటే – హనుమ రావడం రెండు నిముషాలు ఆలస్యమయితే ఆత్మహత్య చేసుకునేది.  అలాంటి సంక్షుభిత ఉద్విగ్న సమయాల్లో హనుమ మాట్లాడిన తీరు అనన్యసామాన్యం. బహుశా అలా మాట్లాడాలంటే దేవుడే దిగి రావాలి.

 

అంతకుముందు... తెల్లవారక ముందే రావణుడు వచ్చి నానా మాటలు అని వెళ్ళాడు. నరమాంస భక్షకులైన ఆడ రాక్షసుల గుండెలు గుచ్చుకునే మాటలు మరో వైపు. ఇక ఇన్ని కష్టాలు తట్టుకునే ఓపిక నశించింది సీతమ్మకు. తన కేశాలతో పాశం తయారుచేసుకుని, ఉరి వేసుకుని, ప్రాణాలు తీసుకోవాలని నిశ్చయించుకుని, అందుకు సన్నద్ధమవుతోంది. ఇదంతా గమనిస్తున్నాడు పక్కనే చెట్టుమీద ఉన్న మారుతి.

 

సీతమ్మతో మాట్లాడటానికి ఇదే సరైన సమయం. కానీ, ఏం మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? ఏ భాషలో మాట్లాడాలి...? ఆలోచించాడు హనుమ.

 

ఇంతదాకా సంస్కృతంలో రావణుడు అఘోరించి వెళ్ళాడు – కాబట్టి సంస్కృతంలో మాట్లాడితే మళ్ళీ రావణుడి మాయలే అనుకుంటుంది. అనేక భాషలు తెలిసినవాడే భాష ఎంపిక గురించి ఆలోచించగలడు. సీతమ్మ సొంత ఊరు మిథిలా నగరం. అయోధ్యలో మాట్లాడేది ప్రాకృత అవధి భాష.  కాబట్టి, అయోధ్యలో మాట్లాడే యాసతోనే మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు హనుమ. అంటే సీతమ్మ మెట్టినింటి భాష అన్నమాట. పూర్తిగా మన ఊరివారెవరో మాట్లాడుతున్నారని మొదటి మాటకే ఆమె ఉపశమనం పొందాలి. ఆ తరువాత....? ఏం చెబితే ఆమె ఇంకా నమ్ముతుంది? శాంతిస్తుంది? ఆలోచించాడు... రామకథనే ఎంచుకున్నాడు . అంతే మైథిలీ ప్రాకృత భాషలో రామగానం ప్రారంభించాడు. తన మాండలికంలో రామకథను వినగానే సీతమ్మకు పోయిన ప్రాణం తిరిగివచ్చినంత పనైంది.

 

క్షేమంగా ఉన్న రాముడు నీ క్షేమం అడగమన్నాడు – అన్నాడు హనుమ. అంటే ఆమె అడగకుండానే రాముడు క్షేమంగా ఉన్నాడని, ఆయనే తనను పంపాడని విన్నవించాడు. నువ్వెక్కడున్నావో తెలిసింది ఇక వెంటనే రాముడు వస్తాడు – అని అభయమిచ్చాడు.

 

మాటల్లో చెప్పలేనంత ఆపదలో ఉండి, ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ మనిషిని ఎలా కాపాడాలో హనుమకు తెలిసినంత ఇంకెవ్వరీ తెలియదు అని ఘంటాపథంగా చెప్పడానికి ఈ ఘట్టమే ఉదాహరణ. నవ వ్యాకరణ పండితుడు, అనేక భాషలు తెలిసినవాడు కాబట్టే, సీతమ్మకు భాష ద్వారా దగ్గరయ్యాడు, రామదూతను అనే నమ్మకం కలిగించగలిగాడు.

 

హనుమ అంటే శబ్దబ్రహ్మ. ఆ స్వామి మాటకు మహోన్నతమైన శక్తి ఉంది. హనుమను మించిన పండితుడు లేడు. భుజబలంతో పాటు బుద్ధిబలమూ ఆ స్వామి అనుగ్రహం వల్ల లభిస్తుంది.

 

రచన : డాక్టర్ కప్పగంతు రామకృష్ణ, సెల్ : 9032044115 / 8897 547 548

 

Wednesday, September 26, 2018

శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి అలంకారాలు


దసరా అలంకారాలు

ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాల్లో 

అమ్మవారికి చేసే అలంకారాలు ... వాటి విశేషాలు


 



1.గాయత్రీదేవి అలంకారం

ముక్తావిద్రుమ హేమనీల ధవఉరళచ్ఛాయై: ముఖైస్త్రీక్షణై:

యుక్తామిందు నిబద్ధరత్నమకుటాం తత్త్వార్థ వర్ణాత్మికాం

గాయత్రీం వరదాభయాంకుశకశాశ్శుభ్రం కపాలం గదాం

శంఖం చక్రమధారవింద యుగళం హసైర్వహంతీం భజే ||

                        'నగాయత్య్రా: పరం మత్రం మాతు: పరదైవతమ్‌' - గాయత్రిని మించిన మంత్రం లేదు. తల్లిని మించిన దైవం లేదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. 'యా గాయంతం త్రాయతే సా గాయత్రీ' - గానం చేసిన వారిని కాపాడుతుంది కనుక మంత్రానికి గాయత్రి అని పేరు. తల్లి వేదమాత. అన్ని మంత్రాలకు మూలశక్తి. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలతో ప్రకాశించే ఐదు ముఖాలతో; శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి ఉంటుంది. గాయత్రీ ఉపాసన ద్వారా బుద్ధి వికసిస్తుంది. ప్రాతస్సంధ్యలో గాయత్రిగా, మధ్యాహ్న సంధ్యలో సావిత్రి, సాయం సంధ్యలో సరస్వతిగా ఉపాసకులు ఈమెను ధ్యానిస్తారు తల్లి ఉపాసన ద్వారా అనంతమైన మంత్రశక్తి కలుగుతుంది. సకల దురిత ఉపద్రవాలూ తొలగుతాయి. బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. గాయత్రీమంత్ర పారాయణ వేదపారాయణ చేసిన ఫలితాన్ని ఇస్తుంది. అవతారంలో అమ్మవారు దర్శనమిచ్చిన గాయత్రీ మంత్రాన్ని వీలైనన్నిసార్లు జపించి, అమ్మకు అల్లపు గారె నివేదన చేయాలి. గాయత్రీమాత స్వరూపంగా వేదపండితులను అర్చించాలి. బ్రాహ్మణ పూజ చేయాలి. గాయత్రీ స్తోత్రాలు పఠించాలి.


---------------------------------------------------------------------------------------------

2.అన్నపూర్ణాదేవి అలంకారం

ఉర్వీ సర్వజయేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ

నారీ నీల సమాన కుతంలధరీ నిత్యాన్న దానేశ్వరీ

సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ ||

            'అన్నం పరబ్రహ్మేతి వ్యజానాత్‌' - అన్నం పరబ్రహ్మ స్వరూపమని ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఒక చేతిలో మధురసాలతో కూడి ఉన్న మాణిక్యపాత్ర, మరొక చేతిలో అన్నాన్ని అనుగ్రహించే రతనాల గరిటె ధరించిన రూపంలో అమ్మ అన్నపూర్ణాదేవి అవతారంలో దర్శనమిస్తుంది. అవతారంలో అమ్మ ఎర్రని శరీరం, మెడలో తారహారాలు ధరించి, నిండు చంద్రుని వలే అందమైన ముఖంతో, విశాలమైన త్రినేత్రాలతో భాసిల్లుతుంది. షడ్రుచులతో కూడిన భక్ష్యభోజ్యాదులు తల్లి అనుగ్రహం ద్వారా మానవాళికి అందుతాయి.

            ఆహారం లేకుండా సృష్టిలో ప్రాణీ జీవించలేదు. అలాగే, తన బిడ్డ ఆకలి తీర్చటానికి ఆలోచించని తల్లీ సృష్టిలో ఉండదు. అందుకనే, అన్నపూర్ణాదేవి రూపంలో దుర్గాదేవి సకల ప్రాణికోటికీ అన్నాన్ని అందించి, జగన్మాతగా పూజలు అందుకుంటుంది. సకల జీవుల్లోని జీవాన్ని తల్లి ఉద్దీపింపజేస్తుంది. అందుకనే ఆదిశంకరులు కూడా 'భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ'! అంటూ జగదంబను అన్నపూర్ణేశ్వరిగా ధ్యానం చేసారు. తల్లిని ఉపాసన చేసినవారు పుత్రపౌత్రాభివృద్ధి, బ్రహ్మతేజస్సు పొందుతారు. బృహదారణ్యకోపనిషత్‌, యజుర్వేద తైత్తిరీయ సంహిత, ప్రశ్నోపనిషత్ విషయాన్ని రూఢి చేస్తున్నాయి. ఈమెను ధ్యానించిన వారికి బ్రహ్మతేజస్సు, వాక్సిద్ధి, తుష్టి, పుష్టి కలుగుతాయి. అంతేకాదు... తనను కొలిచినవారి సకల కార్యభారాన్నీ తల్లే వహిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. భుక్తి, ముక్తి ఆకాంక్షించేవారు - విధేహి దేవి కల్యాణం విధేహి పరమాం శ్రియంరూపం దేహి జయం దేహి యశోదేహి ద్విషో జహి || అనే శ్లోకాన్ని శక్తికొద్దీ పారాయణ చేసి, తల్లికి దధ్యన్నం, కట్టెపొంగలి నివేదన చేయాలి. లేత ఎర్రని లేదా తెల్లని పూలతో అమ్మను పూజించాలి. శక్తిసాధన కోరుకునే వారు - సృష్టి స్థితి వినాశానం శక్తి భూతే సనాతని / గుణాశ్రయే గుణమయే నారాయణి నమోస్తుతే || అనే శ్లోకాన్ని పారాయణ చేయాలి. 'ఓం శ్రీం హ్రీం క్లీం నమో భగవత్యన్నపూర్ణేశ్వరి మమాభిలషిత మహిదేవ్యన్నం స్వాహా' అనే మంత్రాన్ని ఉపాసన చేయాలి. భోజనశాలలో అన్నపూర్ణాదేవి చిత్రపటం ఉంచి, పూజలు చేయాలి. అన్నపూర్ణాదేవి స్తోత్రాలు పారాయణ చేయాలి. శక్తికొద్దీ అన్నదానం చేయాలి.

---------------------------------------------------------------------------------------

3.మహాలక్ష్మీదేవి అలంకారం

సరసిజ నయనే సరోజహస్తే ధవళతరాంశుక గంధమాల్య శోభే

భగవతి హరి వల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యమ్‌ ||

            సిరిసంపదలు, సంతానం, సౌభాగ్యం, ధైర్యసాహసాలు, విజయాలకు తల్లి అధిష్టాన దేవత శ్రీమన్మహాలక్ష్మి. సకల లోకాలకు ఈమె ఐశ్వర్య ప్రదాత. ఇరువైపులా గజరాజు సేవిస్తుండగా, రెండు చేతులతో కమలాలు ధరించి, అభయ, వరద ముద్రలతో, క్షీరాబ్ధి పుత్రికయైన తల్లి భక్తులకు దర్శనమిస్తుంది. డోలాసురుడు అనే రాక్షసుడిని ఈమె సంహారం చేసి, లోకాలకు శాంతి చేకూర్చింది. త్రిపురాత్రయంలో ఈమె మధ్యశక్తి. 'యా దేవీ సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థితా' - సకల లోకాల్లో ఉండే సకల జీవుల్లో తల్లి లక్ష్మీరూపంలో తల్లి నివాసం ఉంటుందని చండీ సప్తశతి చెబుతోంది. ఋగ్వేదం పదో మండలంలోని శ్రీసూక్తం తల్లి వైభవాన్ని ఎంతగానో ప్రకటిస్తుంది. అగ్ని, మత్స్యపురాణాలు ఈమె ఆకృతి, శిల్ప నిర్మాణ నియమాలను వివరంగా చెబుతున్నాయి.

అష్టలక్ష్ములకు ఈమె అధిష్ఠాన దేవత. తల్లి ఉపాసన ద్వారా లౌకిక సంపాదనతో పాటు అలౌకికమైన మోక్షసంపద కూడా లభిస్తుంది. ఈమె శీఘ్రఫలదాయిని. శ్రీసూక్తవిధానంగా తల్లిని ఎర్రని పుష్పాలతో, లక్ష్మీ అష్టోత్తర నామాలతోఅర్చించి, పూర్ణాలు నివేదన చేయాలి. అమ్మకు ప్రీతిగా సువాసినీ పూజ చేయాలి. లక్ష్మీదేవి స్తోత్రాలు పఠించాలి. 'ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మై స్వాహా' అనే మంత్రాన్ని ఉపాసన చేయాలి. పూజామందిరంలో లక్ష్మీదేవి రూపును ఉంచి, పూజలు చేయాలి.

-------------------------------------------------------------------------------------------

4.మహాసరస్వతీ దేవి అలంకారం

ఘంటాశూల హలాని శంఖ ముసలే చక్రం ధనుస్సాయకం

హస్తాబ్జైర్దధతి ఘనాంశ విలసచ్ఛీతాంశు తుల్యప్రభాం

గౌరీ దేహ సముద్భవాం త్రిజగతాం ఆధారభూతాం మహా

పూర్వామత్ర సరస్వతీ మనుభజే శుంభాది దైతార్దినీమ్‌ ||

                        దుర్గాదేవి అలంకారాలన్నిటిలో మూలానక్షత్రం నాటి సరస్వతీదేవి అలంకారానికి ఎనలేని ప్రాముఖ్యత ఉంది. నరుణ్ణి నరోత్తముడిగా చేసి, నారాయణ తత్త్వాన్ని ప్రసాదించే చదువుల తల్లి సరస్వతీదేవిగా భక్తులు ఈమెను ఆరాధన చేస్తారు. వాక్కు, బుద్ధి, విజ్ఞానం, కళలు... అన్నిటికీ ఈమే అధిష్ఠాన దేవత. ఋగ్వేదం, దేవీభాగవతం, బ్రహ్మవైవర్త పురాణాల్లో సర్వసతీదేవి గురించిన అనేక గాథలు విస్తారంగా వర్ణితమై ఉన్నాయి. కచ్ఛపి అనే వీణ; పుస్తకం, అక్షమాల, ధవళ వస్త్రాలు ధరించి, నెమలిని అధిరోహించిన రూపంలో తల్లి దర్శనమిస్తుంది. 'సరాంసి జలాని సంతి ఆస్వా: సా సరస్వతి' - అని మేదినీకోశం చెబుతోంది. అనంత స్వరూపిణి, సర్వశక్తి స్వరూపిణి, సర్వాంతర్యామిని, విజ్ఞానదేవత, వివేకదాత్రిగా శాస్త్రాలు, పురాణ, ఇతిహాసాలు సరస్వతీదేవిని వర్ణిస్తున్నాయి. సరస్వతీ ఉపాసనతో లౌకిక విద్యలతో పాటు అలౌకికమైన మోక్షవిద్య కూడా అవగతమవుతుంది. సకల చరాచరకోటిలో వాగ్రూపంలో ఉంటూ, వారిని చైతన్యవంతులుగా చేసే శక్తి ఈమెది. 

                        'వాజేభిర్వాజినీవతీ...' అని మంత్రం. - సరస్వతీదేవి మమ్ములను పవిత్రులుగా చేసి, మాకు అన్నపూర్ణగా అన్నం పెడుతుంది. జ్ఞానాన్ని అందించి, భవసాగరాన్ని దాటిస్తుంది. సకల బుద్ధులను ప్రకాశింపజేస్తుంది అని ఋగ్వేదం సరస్వతీదేవిని స్తోత్రం చేస్తోంది. '' నుంచి 'క్ష' వరకు ఉన్న అన్ని అక్షరాలతో ఏర్పడే సకల వాజ్ఞ్మయము, సంగీతాది సకల కళలూ తల్లి వరప్రసాదమే. అందుకనే సరస్వతీ ఉపాసన ద్వారా సకల విద్యలూ కరతలామలకం అవుతాయని పెద్దలు చెబుతారు. వ్యాసుడు, వాల్మీకి, యాజ్ఞవల్క్యుడు మొదలైన ఋషులందరికీ తల్లి అనుగ్రహం ద్వారానే లోకోత్తరచరితులయ్యారు. తెల్లని వస్త్రాలు ధరించి, తెల్లని పూలతో అమ్మను పూజించాలి. దద్ధోజనం, చక్కెర పొంగలి నివేదన చేయాలి. 'ఓం శ్రీం హ్రీం క్లీం మహా సరస్వత్యై నమ:' అనే మంత్రాన్ని ఉపాసన చేయాలి. సరస్వతీదేవి ప్రీతిగా రోజున పుస్తకదానం చేయాలి. సరస్వతీ ద్వాదశ నామాలు, స్తోత్రాలు పారాయణ చేయాలి.

===========================================================


5.లలితా త్రిపురసుందరీ దేవి అలంకారం

ప్రాత: స్మరామి లలితా వదనారవిందం

బింబాధరం పృథుల మౌక్తిక శోభినాశం

ఆకర్ణ దీర్ఘనయనం మణికుండలాఢ్యం

మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశం ||

            త్రిపురాత్రయంలో ఈమె రెండో దేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపంలో, సకల లోకాతీత కోమలత్వంతో ప్రకాశిస్తుంది. తల్లి మణిద్వీప నివాసిని. సకల సృష్టి, స్థితి, సంహార కారిణి. శ్రీవిద్యా స్వరూపిణి. ఉపాసకులకు ముఖ్య ఆరాధ్య దేవత. 'చిదగ్నికుండ సంభూతా' అని లలితా సహస్రనామం చెబుతోంది. 'చిత్‌' అంటే చైతన్యం. చైతన్యం అనే అగ్నికుండం నుంచి అమ్మ ఆవిర్భవించింది. సకల విశ్వచైతన్య శక్తిస్వరూపం శ్రీచక్రం. శ్రీచక్రానికి అధిష్ఠాన దేవత లలితా త్రిపురసుందరి. నిర్వాణతంత్రం ప్రకారం లలితాదేవి సత్యలోకంలో బీజకోశంలో చింతామణి గృహంలో రత్నసింహాసనంపై ఆశీనురాలై ఉంటుంది. ఈమె శ్రీవిద్యా స్వరూపం. కోటి సూర్యుల ప్రకాశంతో సమానమైన కాంతిస్వరూపంతో, చేతిలో పాశం, అంకుశం, చెరకు విల్లు, పూలబాణాలు ధరించి ఉంటుంది. ఈమెకు లక్ష్మీసరస్వతులు ఇరువైపులా వింజామరలతో వీస్తూ, సేవలు చేస్తుంటారు. దేవేంద్రాది దేవతలు తల్లికి మంచపుకోళ్ళుగా ఉంటారు. నిత్యం తన భక్తులను అనుగ్రహిస్తూ, సర్వ వ్యాపకమైన తోజోమూర్తిగా లలితామాత విరాజిల్లుతుంది. ఈమెను ఉపాసించటం ద్వారా సకల ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది. దారిద్య్ర దు:ఖం నశిస్తుంది.

నమోదేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమ:

నమ: ప్రకృత్యై భద్రాయై నియతా: ప్రణతాస్మతాం ||

అనే శ్లోకాన్ని పునశ్చరణ చేయాలి. మోక్షసాధన కోరుకునేవారు 

త్వం వైష్ణవీ శక్తిరనంతవీర్యా విశ్వస్యబీజం పరమాసి మాయా

సమ్మోహితం దేవి సమస్తమేతత్త్వం వై ప్రసన్నా భువి ముక్తిహేతు || 

అనే శ్లోకాన్ని పునశ్చరణ చేసి, అమ్మకు పాయసం నివేదన చేయాలి.

=================================================

6.దుర్గాదేవి అలంకారం 

విద్యుద్దామ సమప్రభాం మృగపతి స్కందస్థితాం భీషణాం

కన్యాభి: కరవాలఖేట విలసద్దస్తాభిరాసేవితాం

హస్తైశ్చక్ర గదాసిఖేట విసిఖాంశ్చాపం గుణం తర్జనీం

బిభ్రాణాం అనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే ||

దుర్గముడు అనే రాక్షసుడిని సంహారం చేసిన శక్తి స్వరూపం దుర్గాదేవి. కోటిసూర్య ప్రభలతో వెలిగే దేవి భక్తులను సర్వ దుర్గతుల నుంచి కాపాడుతుంది. ఈమె మహాప్రకృతి స్వరూపిణి. సమస్త దేవీదేవతా శక్తులు, తేజస్సులు మూర్తీభవించిన తేజోరూపం తల్లి స్వరూపంగా ఉంటుంది. ఈమె సకల శత్రు సంహారిణి. సర్వ దు:ఖాలను నశింపజేస్తుంది. ఉగ్రరూపంతో దుష్టులను ఏవిధంగా సంహరిస్తుందో, అదే సమయంలో పరమశాంతమూర్తిగా తనను కొలిచిన భక్తులను కాపాడుతుంది. పంచ ప్రకృతి స్వరూపాల్లో తొలి మూర్తి ఈమే. 

    దేవి, మార్కండేయ పురాణాలు, ఉపనిషత్తులు, ఋగ్వేదాల్లో దుర్గాదేవిని ఉపాసన చేయటానికి వీలైన ఎన్నో విధానాలు ఉన్నాయి. మరెన్నో అవతార విశేషాలు కూడా గ్రంథాల్లో ఉన్నాయి. ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తుల సమష్టి ఆరాధనే దుర్గాదేవి ఉపాసన. ఎర్రని వస్త్రాన్ని ధరించి, మణులు పొదిగిన కిరీటం ధరించి, సింహ వాహనాన్ని అధిరోహించి, ఎనిమిది చేతులతో కత్తి, డాలు, గద, శంఖం, కలశం, త్రిశూలం, చక్రం, ధనుర్బాణాలు ధరించి ఉంటుంది. ఇది సర్వశత్రు సంహారక రూపం తల్లిని ధ్యానించినట్లయితే సర్వరోగాలు నశిస్తాయి. చామంతి, పొగడ, సంపెంగ, మల్లెపూలు, దానిమ్మపండు, ఎర్రని అక్షతలు, పొంగలి, పులి¬, పులగము తల్లికి ఇష్టమైన ద్రవ్యాలు. సర్వ రోగాల నుంచి ఉపశమనం పొందటానికి

రోగానశేషానపహంసి తుష్టా / రుష్టాతు కామాన్సకలానభీష్టాన్

త్వామాశ్రితానాం విపన్నరాణాం / త్వామాశ్రితా హ్యాశ్రయతాం ప్రయాంతి

అనే శ్లోకాన్ని పఠిస్తే రోగాల నుంచి ఉపశమనం కలుగుతుంది. రోజున వేదపండితులను సత్కరిస్తే అమ్మకు ఎంతో ప్రీతి కలుగుతుంది. ఓం దుం దుర్గాయై నమ: అనే మంత్రాన్ని ఉపాసన చేయాలి. దుర్గాసూక్తం, లలితా అష్టోత్తరం, దుర్గాస్తోత్రాలు పారాయణ చేయాలి.

=====================================================

7. మహిషాసుర మర్దినీ దేవి అలంకారం

మహిష మస్తక నృత్త వినోదినీ స్ఫుటరణ్మణినూపుర మేఖలా

జనన రక్షణ మోక్ష విధాయినీ జయతి శుంభనిశుంభ నిషూదినీ ||

లోకకంటకుడైన మషిషాసురిడిని సంహారం చేసిన ¬గ్రరూపం ఇది. సకల దేవీదేవతల శక్తులన్నీ ఈమెలో మూర్తీభవించి ఉంటాయి. మానవనేత్రంతో చూడటానికి సాధ్యంకాని దివ్య తేజస్సుతో, అనేక ఆయుధాలతో, సింహవాహినియై తల్లికి దర్శనభాగ్యం కలిగిస్తుంది. ఈమె అనుగ్రహ భాగ్యం కలిగితే సాధించలేనిది ఏదీ లేదు. మహిషాసుర సంహారం జరిగిన నవమి రోజునే 'మహర్నవమి'గా జరుపుకోవటం ఆచారంగా వస్తోంది. రోజున చండీ సప్తశతీ ¬మం చేసిన వారికి శత్రుభయం ఉండదు. అన్నిటా విజయం కలుగుతుంది. ఓం ఐం హ్రీం శ్రీం సర్వసమ్మోహిన్యై స్వాహా అనే మంత్రాన్ని జపించాలి. పానకం, వడపప్పు, గారెలు, పులి¬, పాయసాన్నం నివేదన చేయాలి. అమ్మవారి స్వరూపంగా సువానినులకు పూజ చేసి, మంగళద్రవ్యాలు, పసుపు కుంకుమలు, శక్తికొద్దీ నూతన వస్త్రాలు ఇవ్వాలి.

======================================================

8.శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకారం

కల్యాణాయుత పూర్ణచంద్రవదనాం ప్రాణేశ్వరానందినీం

పూర్ణాం పూర్ణతరాం పరేశమహిషీం పూర్ణామృతాస్వాదినీం

సంపూర్ణాం పరమోత్తమామృతకళాం విద్యావతీం భారతీం

శ్రీచక్రప్రియ బిందు తర్పణ పరాం శ్రీరాజరాజేశ్వరీం ||

స్వప్రకాశ జ్యోతి స్వరూపంతో, పరమేశ్వరుడి అంకాన్ని ఆసనంగా చేసుకుని, సకల భువన బ్రహ్మాండాలకు ఆరాధ్యదేవతగా పూజలందుకునే అమ్మ అవతారం శ్రీరాజరాజేశ్వరీదేవి. మహాత్రిపురసుందరిగా ఈమె శ్రీచక్ర నివాసినియై ఉంటుంది. నిశ్చల చిత్తంతో తనను ఆరాధించిన వారికి ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులను వరంగా అనుగ్రహిస్తుంది. మాయా మోహితమైన మానవ మనోచైతన్యం తల్లి ఉపాసన ద్వారా ఉద్దీపితమవుతుందిఅపరాజితాదేవిగా కూడా తల్లి పూజలందుకుంటుంది. ఈమె యోగమూర్తి. పసుపుపచ్చని వస్త్రాలు ధరించి, 'ఓం ఐం ఈల హ్రీం హసకహల హ్రీం సౌ: సకల హ్రీం' అనే మంత్రాన్ని జపించాలి. పసుపు పచ్చని పూలతో అమ్మను పూజించాలి. లలితా సహస్రనామ పారాయణ చేయాలి. శ్రీచక్రార్చన, కుంకుమార్చన, సప్తశతీ పారాయణ, చండీ¬మం చేసిన వారికి ఇష్టకామ్యాలను అనుగ్రహిస్తుంది. సువాసినీ పూజ చేసి, భక్ష్య, భోజ్యాలతో మహానివేదన, ప్రత్యేకంగా లడ్డూలు నివేదన చేయాలి.

================================================

9.స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి

నమస్తే శరణ్యే శివేసానుకమ్పే / నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే

నమస్తే జగద్వంద్య పాదారవిందే / నమస్తే జగత్తారిణి త్రాహిదుర్గే

నవరాత్రి ఉత్సవాల్లో తొలిరోజున దుర్గాదేవిని స్వర్ణకవచంతో అలంకరిస్తారు. ఇంద్రకీలాద్రిపై అమ్మ స్వర్ణకవచంతో అవతరించటం వల్ల, దసరా ఉత్సవాల తొలిరోజున అమ్మను స్వర్ణకవచంతో అలంకరించటం ఆచారంగా వస్తోంది. రూపంలో దుర్గాదేవి అష్టభుజాలతో, నక్షత్రాల కంటే అధికమైన కాంతి కలిగిన ముక్కుపుడక ధరించి, పసిడి ఛాయ కలిగిన మోముతో దర్శనమిస్తుంది. సింహవాహనాన్ని అధిష్ఠించిన ఈమె శంఖం, చక్రం, గద, శూలం, పాశం, మహాఖడ్గం, పరిఘ అనే ఆయుధాలు ధరించి ఉంటుంది. సకల శత్రుబాధలు నివారిస్తుంది. ఆకర్షణశక్తి, ఆరోగ్య ప్రదాన లక్షణం కలిగిన స్వర్ణ కవచాన్ని ధరించిన అమ్మను ఆరాధిస్తే సకల విజయాలు లభిస్తాయి. స్వర్ణకవచం మంత్ర బీజాక్షర సమన్వితంగా ఉంటుంది. కారణం వల్ల స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిని ఆరాధిస్తే మంత్రశక్తి లభిస్తుంది. రోజున అమ్మవారిని పసుపు అక్షతలు, పసుపు పూలతో పూజించాలి. దుర్గా అష్టోత్తరం, దుర్గాకవచం పారాయణ చేయాలి. ఓం ఐం హ్రీం శ్రీం దుర దుర్గాయైనమ: అనే మంత్రాన్ని ఉపాసించాలి. అమ్మవారికి పులి¬ నివేదన చేయాలి.

======================================================

10. బాలాత్రిపుర సుందరీ దేవి అవతారం

హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌ:క్లీం కళాంబిభ్రతీం

సౌవర్ణాంబర ధారిణీం వరసుధాదౌతాం త్రినేత్రోజ్జ్వలాం

వందే పుస్తక పాశమంకుశ ధరాం సగ్భ్రూషితముజ్జ్వలాం

త్వాం గౌరీం త్రిపురాం పరాత్పర కళాం శ్రీచక్ర సంచారిణీం ||

  త్రిపురుని భార్య త్రిపురసుందరీ దేవి. అంటే పరమేశ్వరుని భార్య అయిన గౌరీదేవి అని అర్థం. త్రిపురాత్రయంలో బాలాత్రిపురసుందరీ దేవి తొలి దేవత. అందుకనే నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని రెండోరోజున బాలాత్రిపురసుందరీ దేవిగా అలంకరణ చేస్తారు. మనస్సు, బుద్ధి, అహంకారం తల్లి అధీనంలో ఉంటాయి. తల్లి అభయహస్తం, వరదముద్ర ప్రదర్శిస్తూ అక్షమాల ధరించి ఉంటుంది. ఈమెను ఆరాధించటం వల్ల నిత్య సంతోషం కలుగుతుంది. శ్రీచక్ర సంప్రదాయంలో షోడశీవిద్యకు ఈమె అధిదేవత. రెండు నుంచి పదేళ్ళ వయసులోపు బాలికలను బాలాత్రిపురసుందరీ దేవి స్వరూపంగా అర్చించి, సకల సుమంగళ ద్రవ్యాలు,నూతన వస్త్రాలు ఇవ్వాలి. ఇందువల్ల తల్లి అనుగ్రహం కలుగుతుంది. ఈమె అనుగ్రహం వల్ల సత్సంతానం కలుగుతుంది. 'ఓం ఐం హ్రీం శ్రీం బాలాత్రిపురసుందర్యై నమ:' అనే మంత్రాన్ని ఉపాసన చేయాలి. పాయసం నివేదన చేయాలి. లలితా త్రిశతీ స్తోత్రం పారాయణ చేయాలి.

=========================================

రచన

డాక్టర్ కప్పగంతు రామకృష్ణ

కాకరపర్తి భావనారాయణ కళాశాల (కె.బి.ఎన్.కాలేజీ)

కొత్తపేట, విజయవాడ-1  సెల్‌ : 90320 44115 / 88975 47548








పున్నమి కాంతుల కల్యాణం (ఒంటిమిట్టలో జరిగే శ్రీ సీతారామ కల్యాణం నేపథ్యంగా శ్రీకనకదుర్గ ప్రభ పత్రికలో రాసిన వ్యాసం)

  పున్నమి కాంతుల కల్యాణం                లోకంలో పెళ్ళి ముచ్చట అంటే సీతారాములదే. అందులోనూ ఒంటిమిట్ట ఆలయంలో జరిగే సీతారాముల కల్యాణం మరింత శ...