Showing posts with label తెలుగు. Show all posts
Showing posts with label తెలుగు. Show all posts

Saturday, January 11, 2025

కోనసీమలో సంక్రాంతి సంబరాలు

 

 

 

సంక్రాంతి జిలుగులు... ప్రభల తీర్థాలు

 

తెలుగువారికి అతి పెద్ద పండుగ, అతి ముఖ్యమైన పండుగ సంక్రాంతి. మూడురోజుల పాటు జరిగే ఈ పండుగలో ప్రతి రోజుకూ ఓ ప్రత్యేకత ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూడు రోజుల పండుగను ఎంతో వైవిధ్యంగా జరుపుకుంటారు. స్థానిక ఆచారాలు, సంప్రదాయాలు కలగలిసిన ఈ వేడుకలు చూడముచ్చటగా ఉంటాయి. అంతేకాదు... తరతరాల తెలుగు వారి చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమ ప్రాంతంలో జరిగే సంక్రాంతి పండుగకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో ప్రభల తీర్థం ఒకటి. ఎటు చూసినా పచ్చదనం పరుచుకున్న కోనసీమకు సంక్రాంతి తెచ్చే సందడే వేరు. సంక్రాంతికి కోనసీమ పచ్చ పట్టుపరికిణీ కట్టుకున్న పల్లెపడుచులా ముస్తాబవుతుంది. ముత్యాల ముగ్గుల నడుమ సంబరంగా నర్తిస్తుంది. ప్రతి ఇంటా సంతోషం మంచులా కురుస్తుంది. అదొక అక్షరానికందని వర్ణనాతీత అనుభూతి.

కోనసీమలో సంక్రాంతి నాడు కొన్ని చోట్ల, కనుమ నాడు మరికొన్ని చోట్ల ఈ తీర్థాలు నిర్వహిస్తారు. వీటన్నింటిలోనూ ప్రఖ్యాతి పొందింది జగ్గన్నతోటలో జరిగే ప్రభల తీర్థం. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని అంబాజీపేట మండలం, మొసలపల్లి శివారు జగ్గన్నతోట కొబ్బరితోటలో మకర సంక్రమణ ఉత్తరాయణ పుణ్యకాలంలో కనుమనాడు ఈ ప్రభల తీర్థం నిర్వహిస్తారు.అత్యంత ప్రాచీనమైనది. కోనసీమ చుట్టుపక్కనున్న గ్రామాల ప్రభలు ఈ తీర్థంలో పాలుపంచుకుంటారు. ఈ తోటని జగ్గన్న తోటగా పిలుస్తారు. జగ్గన్నతోటలో గుడి గానీ, గోపురం గానీ ఉండదు. దేవునికి సంబంధించిన చిహ్నాలూ కనిపించవు. కేవలం దుక్కి దున్నిన కొబ్బరితోట. రైతులు నమ్మే భూ మండపంలో జరిగే ప్రకృతి వేడుక ఈ ప్రభల తీర్థం. నాటి స్థానిక సంస్థానదీశులైన రాజావత్సవాయి జగన్నాధ మహారాజుకు చెందిన ఈ తోట, కాలక్రమంలో ‘జగ్గన్న తోట’ అనే పేరుతో స్థిరపడింది.

లోక కల్యాణార్థం ప్రతీ సంవత్సరం కనుమ రోజున ఏకాదశ రుద్రులు జగ్గన్న తోటలో సమావేశం అవుతారని ప్రతీతి. సుమారు 400 సంవత్సరాల క్రితం 17వ శతాబ్దంలో కనుమ రోజున ఏకాదశ రుద్రులు లోక కల్యాణం కోసం జగ్గన్నతోటలో సమావేశమై లోక పరిస్థితుల గురించి చర్చించారనీ, అప్పటినుండి కనుమ రోజున జగ్గన్నతోటలో ప్రభల తీర్థం నిర్వహించబడుతున్నదని చారిత్రాత్మక కథనం.

ప్రభల తయారీ

తాటి దూలాలకు టేకు చెక్కలు అమర్చి, వెదురు బొంగుల్ని ఒక క్రమపద్ధతిలో గోపురం ఆకారంలో వంచి కడతారు. ఆ మధ్య ఖాళీలను రంగురంగుల నూతన వస్త్రాలతో అల్లికలా తీర్చిదిద్దుతారు. ఎర్రని గుడ్డను వెనక వైపు తెరలా కట్టి ఉంచుతారు. ముందు, వెనక భాగాల్ని జీవాత్మ పరమాత్మల ప్రతీకలుగా పరిగణిస్తారు. పైభాగంలో ఆలయాల్లోని ఇత్తడి కలశాలను బోర్లించి కట్టి ఆ పైన వరి కంకులు, నెమలి పింఛాలు, పూల దండలు, ఇతర సామగ్రితో అలంకరిస్తారు. వాటి మధ్యలో ఉత్సవ విగ్రహాలు ఉంచడానికి వీలుగా గద్దెలు ఏర్పాటు చేస్తారు. వాటి మీద ఆయా గ్రామాల్లోని శివుడి ఉత్సవ విగ్రహాలు ఉంచడం ఒక సంప్రదాయం.

అనంతరం మేళతాళాలు, మంగళ వాద్యాలు, వేదమంత్రాల మధ్య వూరేగింపుగా బయలుదేరతారు. ప్రభలను మామూలు రహదారుల వెంటగాని, వాహనాల మీదగాని తీసుకు వెళ్లరు. ఎంత దూరమైనా భక్తులు భుజాల మీద మోస్తూ, పంట చేలు, కాలువల మధ్య నుంచి ఊరేగింపుగా వెళతారు. కొన్ని చోట్ల ఆరడుగుల నీటిలో నుంచి గోదావరి కాలువల్లోకి దిగి ప్రభల్ని నేర్పుగా ఒడ్డుకు చేరుస్తారు.

ఈ ప్రభల్ని పరమశివుడి వెంట ఉండే వీరభద్రుడి ప్రతీకలుగా భావించి ‘వీరభద్ర ప్రభలు’గా పిలుస్తారు. పగలంతా పూజలు చేసి మొక్కుబడులు తీర్చుకుంటారు. రాత్రి సంప్రదాయ నృత్యాలు, కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. కోనసీమలో జరిగే ఈ ప్రభల తీర్థాన్ని తిలకించడానికి, ఇందులో పాలుపంచుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. భక్తి భావాన్ని చాటుకుంటూ, ఆనందాన్ని మూటకట్టుకుని తిరిగి వెళతారు. కనుమ రోజున ప్రభల తీర్థంతో ఆధ్మాత్మిక క్షేత్రంగా భాసిల్లే జగ్గన్నతోట ప్రాంతం మిగిలిన రోజుల్లో నిర్మానుష్యంగా ఉంటుంది.

జగ్గన్నతోటకి వచ్చే ప్రభలు

    గంగలకుర్రు అగ్రహారం - వీరేశ్వర స్వామి

    గంగలకుర్రు – చెన్నమల్లేశ్వర స్వామి

    వ్యాఘ్రేశ్వరం – వ్యాఘ్రేశ్వర స్వామి

    ఇరుసుమండ - ఆనంద రామేశ్వరస్వామి

    వక్కలంక – కాశీ విశ్వేశ్వరస్వామి

    పెదపూడి – మేనకేశ్వరస్వామి

    ముక్కామల – రాఘవేశ్వర స్వామి

    మొసలపల్లి – మధుమానంత భోగేశ్వరస్వామి

    నేదునూరు – చెన్నమల్లేశ్వరస్వామి

    పాలగుమ్మి – చెన్నమల్లేశ్వరస్వామి

    పుల్లేటికుర్రు – అభినవ వ్యాఘ్రేశ్వరస్వామి

ప్రభల తీర్థం

ప్రభల తీర్థానికి వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. మొసలపల్లి గ్రామ సమీపంలో విఠల జగ్గన్న అనే ఏక సంథాగ్రాహి ఉండేవాడు. అతడు కౌశికీ నది ఒడ్డున ఉన్న మర్రిచెట్టుకిందే ఎప్పుడూ ఉండేవాడు. ఆ చెట్టుకింద గ్రామదేవత నెలకొని ఉండేది. విఠల జగ్గన్నపై ఈర్ష్యకలిగినవారు కొందరు నిజాం నవాబు ప్రతినిధులకి ఫిర్యాదు చేశారు. ఆ సందర్భంలో నిజాం నవాబుని కలిసినప్పుడు జగ్గన్న ప్రతిభ బయటపడింది. అతని పాండిత్యాన్ని చూసి మెచ్చుకున్న నవాబు, ఆ మర్రిచెట్టుతో పాటు చుట్టుపక్కల ఉన్న నాలుగువందల ఎకరాలు బహుమానంగా రాసిచ్చాడు. ఫిర్యాదు చేసిన ప్రజల ఆనందం కోసం జగ్గన్న మొదటిసారి ప్రభల తీర్థం జరిపాడు. దేవుడికి గుళ్లు గోపురాలు అవసరం లేదని, దైవానికి మైల అంటదని చెప్పేందుకే ప్రభల తీర్థం ప్రారంభమైంది.

ఈ ప్రభలు భక్తులు వచ్చే దారంట రావు. కౌశిక నది దాటుకుంటూ, పొలాల మధ్య నుండి ఈ ప్రభలు ఊరేగింపుగా వస్తాయి.ఈ ప్రభలను ఒక్కసారి ఎత్తేకా క్రిందకి దింపకూడదు. కౌశిక నది దాటేటప్పుడు ప్రభ ఏ మాత్రం తడవకుండా తీసుకోస్తారు.ఈ ప్రభలను మోయడానికి ఇరవై మంది వ్యక్తులు ఉంటారు. కౌశిక నది దాటించడానికి మాత్రం యాభై మంది పైగా శిక్షణ పొందిన వారు ఉంటారు. కౌశిక నది దాటించి జగ్గన తోట తీర్థ ప్రదేశానికి తీసుకోస్తారు. తీర్థ పూర్తి అయిన తరువాత వచ్చిన దారినే తిరిగి ప్రభలని ఆయా గ్రామాలకి తీసుకెళతారు. ఈ ప్రభలను చూడటానికి వేలాది మంది తరలి వస్తారు.

ఈ ప్రభలని మోయడానికి కుల మత  విచక్షణ లేదు. వైభవోపేతంగా మేళతాళాలతో, అద్భుతమనే రీతిగా అలంకరించిన ప్రభలని భోగేశ్వర స్వామి ఆహ్వానం అందుకున్న గ్రామాల నుండీ ప్రజలు మోసుకువస్తారు. దారంతా ప్రభలని మోస్తూ నడుచుకొంటూ సభక్తికంగా వారు తీసుకొచ్చే ప్రభల రూపంలోకి ఆ భక్తి శ్రద్ధలకి లోబడి పరమేశ్వరుడు ఆవహించి వస్తారని నమ్మకం. నిజంగానే అటువంటి ఉదాహరణలు కూడా ఉన్నాయని స్థానికులు చెబుతారు.

ఆలస్యంగా వచ్చే వీరేశ్వరుడు

ఈ ఉత్సవం జరిగేది మొసలపల్లిలో ఉన్న తోటలో కాబట్టి ఆ ఊరి రుద్రుడైన భోగేశ్వరుడు మిగతా ఉళ్ళ నుంచి వచ్చే రుద్రులకు ఆతిథ్యం ఇస్తాడు. ఈ సమావేశానికి వ్యాఘ్రేశ్వరుడు అధ్యక్షత వహిస్తాడు, అంచేత వ్యాఘ్రేశ్వరుడి ప్రభ తోటలోకి ప్రవేశించగానే మిగతా రుద్రులందరూ గౌరవ సూచకంగా లేచి నిలబడతారట, అందుకని భక్తులు ప్రభలన్నిటినీ "హర హర" "శరభ శరభ" అంటూ ఒకేసారి పైకిలేపుతారు.

అందరికంటే ఆలస్యంగా గంగలకుర్రు అగ్రహారపు వీరేశ్వరుడు సమావేశానికి వస్తాడు. ఈయన ప్రభ వచ్చే దారిలో కౌశికీ నదిని దాటుతూ రావాల్సి ఉంటుంది, ఆ నదిని దాటించే దృశ్యం నయనానందకరంగా ఉంటుందని చెప్తారు. ఈ వీరేశ్వర రుద్రుడు వచ్చే సరికి సాయంత్రం అవుతుంది, ఈ రుద్రుడి ప్రభ తోటకు చేరిన కొద్దిసేపటి ఉత్సవం ముగుస్తుంది.

ఉత్సవం ముగిశాక, రుద్రలందరూ తిరిగి తమ ప్రభల మీద తమతమ గ్రామాలకు చేరుకుంటారు. ఈ ఉత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహిస్తారు, దీన్ని చూడటానికి వేలల్లో జనం దేశ విదేశాల నుండీ  ప్రతి ఏటా ఈ ప్రాంతానికి వస్తారు. మన ప్రధాని నరేంద్రమోదీ 2020లో ఈ ఉత్సవానికి గానూ శుభాకాకంక్షలు తెలపడంతో దేశవిదేశాల్లో సైతం ఈ జాతర మరింత ప్రాచుర్యాన్ని పొందింది. ఒక గ్రామీణ ఉత్సవం ఇంత గొప్ప ప్రాధాన్యతని పొందడం చాలా గొప్ప విషయం.

------------------------

రచన: డాక్టర్ కప్పగంతు రామకృష్ణ, కెబిఎన్ కళాశాల, విజయవాడ-1

 

 

 

 

Thursday, April 18, 2024

తెలుగింటి రాముడు


 
 
 శ్రీరామ

తెలుగింటి రాముడు

రామనామం ఓ తారకమంత్రం. రాముడి వంటి కుమారుడు, సోదరుడు, భర్త, నాయకుడు, మిత్రుడు, పరిపాలకుడు, ధర్మమూర్తి... మరొకరు లేరు అనేది నిర్వివాదం. ప్రతి మనిషికీ రాముడితో ఓదో ఒక అనుబంధం ఉంటుంది. ఆ పేరు చెబితేనే ఆత్మీయత ప్రకటితమవుతుంది.  ప్రత్యేకించి తెలుగు ప్రజలకు రాముడు దేముడు మాత్రమే కాదు. తెలుగు జీవితాల్లో రాముడొక భాగం. రాములోరి పెళ్ళి, లక్ష్మణదేవర నవ్వు, సీతాదేవి నిద్ర అంటూ తెలుగు జానపదులు కూడా రాముడితో చుట్టరికం కలుపుకున్నారు. అదీ రామయ్య ఘనత. రామకథ మహిమ. 


తెలుగులో వచ్చిన తొలి రామాయణం గోన బుద్ధారెడ్డి రాసిన రంగనాథ రామాయణం. ద్విపద ఛందస్సులో వచ్చిన ఈ రామాయణాన్ని పాటలుగా పాడుకుని మురిసిపోయిన తెలుగు లోగిళ్ళు లక్షల్లో ఉన్నాయి. సీతారాముల దాంపత్యంలోని ఔన్నత్యాన్ని తేలికైన మాటలతో చెబుతూనే బరువైన భావాన్ని పలికించాడు బుద్ధారెడ్డి.


రాముడి ధనుర్విద్యాకౌశలం ఎంత గొప్పదంటే “నల్లవో  రఘురామ! నయనాభిరామ! విలువిద్య గురువ  వీరావతార --------- బాపురే రామా భూపాల! లోకముల నే పాటి విలుకాడు నేర్చునే కలుగ” అంటూ పగవాడైన రావణాసురుడు కూడా రామయ్య కోదండకళకు అబ్బురపడి భళీ అని ప్రశంసించాడు.


రావణుడు అపహరించిన విషయం తెలియక రాముడు సీతమ్మ గురించి వెతుకుతూ... ‘‘ఇది మహారణ్యమై యిప్పుడు తోచె / ఇది పర్ణశాలయై యిప్పుడు తోచె / ఇది నాకు దపమని యిప్పుడు తోచె / చల్లని ముఖదీప్తి చంద్రునికిచ్చి / తెల్లని నగవు చంద్రికలకు నిచ్చి / చెలువంపు పలుకులు చిలుకల కిచ్చి / నిన్ను దైవము మ్రింగెనే నేడు సీత’’ - చంద్రుడిలోనూ, వెన్నెలలోనూ, చిలుకల పలుకుల్లోనూ రాముడికి సీత కనిపిస్తోంది. అందుకే సీతమ్మ ఏ అడవి జంతువు వల్ల మృత్యువాత పడిందో అనుకుంటూ ఆవేదన చెందుతాడు.  


ప్రతి అడుగులోనూ, ప్రతి అణువులోనూ భార్యాభర్తలు ఒకరికొకరు కనిపించాలి. అప్పుడే ఆ దాంపత్యానికి సార్థకత ఏర్పడుతుందని రంగనాథ రామాయణం ప్రకటించింది. ఇలా ఎన్నో భావాలు ప్రకటిస్తూ, సీతను తెలుగు జానపదుల ఆడపడుచుగా, రాముడిని జానపదుల దేవుడిగా తీర్చిదిద్ది, వారి హృదయాల్లో శాశ్వతస్థానం కల్పించాడు బుద్ధారెడ్డి. తెలుగు పల్లెల్లో పేటపేటకూ కనిపించే రామాలయాలు, ఇంటింటా వినిపించే సీతారాముల పేర్లూ  ఈ రామాయణ ప్రభావమే.


కవయిత్రి ఆతుకూరి మొల్ల ‘చెప్పుమని రామచంద్రుఁడు / సెప్పించిన పలుకుమీదఁ జెప్పెద’ అంటూ రామాయాణం రచించింది. రాముడికే కాదు రామపాద ధూళికి కూడా ఎంతో మహత్తు ఉందంటూ మొల్ల రామ వనవాస సందర్భంలో చెబుతుంది. అరణ్య వాసానికి బయల్దేరిన రాముడు సీతాలక్ష్మణ సమేతంగా గంగానది దాటాలని ఓడ నడిపే గుహుడిని కోరతాడు. దానికి గుహుడు రాముని పాదధూళి సోకి రాయి కాంతగా మారింది కదా, తన ఓడ కూడా ఏమౌతుందోనని భయం వేస్తోంది. అందుకే నీ పాదాలు కడుగుతాను అంటూ రాముని పాదాలు కడుగుతాడు. 

చ. సుడిగొని రాము పాదములు సోఁకిన ధూళి వహించి రాయి యే
ర్పడ నొక కాంత యయ్యె నఁట, పన్నుగ నీతని పాద రేణు వి
య్యెడ వడి నోడసోఁక నిది యేమగునో” యని సంశయాత్ముఁడై
కడిగె గుహుండు రామపద కంజయుగంబు భయమ్ము పెంపునన్‌. 


వాల్మీకి రామాయణంలో లేని ఈ మొల్ల వర్ణన తరువాత ఎందరో తెలుగు కవుల భావనల్లో ప్రతిధ్వనించింది.

అలా అడవిలో నడుచుకుంటూ వెళ్తున్న సీతారామ లక్ష్మణులను అక్కడి చెంచు స్త్రీలు చూసారు. రతీ మన్మథులను మించిన అందంతో ప్రకాశిస్తున్న సీతారాముల్ని చూస్తూ, తమలో తాము...

చ. ఇతనికిఁ బాదచారితన మేటికి వచ్చెనో? పట్టభద్రుఁ డీ
సతి నవ రూప రేఖలను జక్కని దయ్యును నిట్టి దుర్దశల్‌
ప్రతివసియించు టెట్లో? రతిరాజ సమానుల వీరి నేల యీ
గతిఁ బడఁద్రోచె బ్రహ్మ?” యని కాంతురు చెంచెత లమ్మహాత్ములన్‌. 

ఇంతటి అందగాళ్ళను బ్రహ్మ ఈ అడవుల్లో ఎలా పడేయగలిగాడో అంటూ బ్రహ్మను కూడా నిందించారు. రామయ్య సౌందర్యం అంత గొప్పది. అది కేవలం భౌతిక అందం కాదు. మాటలకందని పారమార్థిక భావనాత్మక సౌందర్యం.


లంకను నుంచి తిరిగి వచ్చిన హనుమంతుడు రాముడిని చూస్తూనే...

“కంటిన్ జానకి బూర్ణచంద్ర వదనన్ గల్యాణి నా లంకలో
గంటిన్ మీ పదపంకజంబులను నే గౌతూహలం బొప్పగా
గంటిన్ మీ కరుణావలోకనము విఖ్యాతంబుగా గీర్తులం
గంటిన్ మా కపి వీర బృందములలో గాంభీర్యవారాన్నిధీ”

- చూసితి సీతను అంటూ రాముడి మనసుకు గొప్ప సాంత్వన కలిగిస్తాడు. అంతేకాదు, సీతలో రామయ్య ఎలా కనిపిస్తున్నాడో కూడా చెబుతాడు. సీత, రాముడు – ఇద్దరు కాదు ఒక్కరే అనే భావాన్ని మొల్ల ఎంతో రమ్యంగా చెప్పింది.

రామకథను ప్రబంధంగా తీర్చిదిద్దిన కవి అయ్యలరాజు రామభద్రుడు. శివధనస్సును రాముడు ఎక్కుపెట్టగానే అది ఫెళ్ళుమని పెద్దశబ్దం చేస్తూ విరిగిపోతుంది.

‘ఆ రమణీయ ధనుష్ఠం / కారము సీతాకుమారికా కల్యాణ / ప్రారంభవాద్య నిరవ / ద్వారమై యొసగె సకల హర్ష ప్రదమై’’  - సీతారాముల కల్యాణ వేడుక కోసం మొదటిగా మోగిన మంగళవాద్యం శివధనుర్భంగం సందర్భంగా వచ్చిన శబ్దమే అంటూ కవి చమత్కరించాడు. అంతేకాదు...

ఆ కరియాన వేనలి అనంత విలాసము మాధవోదయం
బా కమలాయతాక్షి మధురాధర సీమ, హరి ప్రకారమా
కోకిల వాణి మధ్యమున కూడిన దింతియ కాదు, తాను రా
మాకృతి దాల్చె ఈ చెలువమంతయు ఆ యమయందు జొప్పుడున్

సీత పూర్తిగా రాముడిగా మారిపోయిందంటాడు కవి. సీతమ్మను చూస్తే రామయ్యే కనిపిస్తున్నాడట. అంటే, సీతారాములకు అభేదం. శివపార్వతులే కాదు సీతారాములూ అర్ధనారీశ్వరులే. దాంపత్యానికి అర్థం, పరమార్థం ఇదే అంటూ గొప్పగా ప్రకటించింది రామాభ్యుదయ ప్రబంధం.

వానర సేనతో సహా సముద్రాన్ని దాటిన రాముడు, యుద్ధ ప్రారంభానికి ముందు అక్కడి సువేల పర్వతాన్ని ఎక్కి లంకను తేరిపార చూస్తాడు.

తనదు ప్రాణేశ్వరి, మహీతనయ కేడ
యావహిల్లునొ దురవస్థ యనుచు గాక
చుఱుకు జూపుల రఘుపతి జూచినపుడ
లంక యాహుతి గొనదె నిశ్శంక మహిమ

లంకలో ఉన్న తన ప్రాణేశ్వరికి ఏమైనా ఆపద కలుగుతుందేమో అని ఊరకున్నాడు కానీ, మూడోకన్ను తెరచిన శివుడి  మాదిరిగా తన చూపులతోనే లంకను రాముడు కాల్చివేసేవాడట. రాముడు సాక్షాత్తు శివ స్వరూపమే అని చెప్పటంతో పాటు, శివ కేశవ అభేదం కూడా ఈ పద్యంలో ప్రకటించాడు రామభద్ర కవి.

యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోయిన సందర్బంలో రాముడికి వచ్చిన కోపం ఎంతటి ఉత్కృష్టమైనదో వర్ణించడం ఎవరికీ సాధ్యం కాదు.

అభ్రంకష రధ కపి చి / త్ర భ్రమణంబుల వెలింగె ప్రళయాంతక ఫా / ల భ్రాజిష్టు భ్రుకుటీ / విభ్రమ ధౌరేయమైన విల్లుందానున్ - మూర్ఛపోయిన తమ్ముడి వంక మాటిమాటికీ చూస్తూ, రాముడు తన కోదండాన్ని పట్టుకున్న విధానాన్ని చూస్తేనే, ఇక రావణుడికి మృత్యుఘడియ దగ్గరపడిందనే సందేశం ఆ సన్నివేశం చూస్తున్నవారికి అందిందట.


అసలు రాయడం అంటూ జరిగితే రామాయణమే రాయాలి. తనలోని జీవుడి వేదన తీరాలన్నా, తన తండ్రి ఇచ్చిన ఆదేశాన్ని పాటించాలన్నా రామాయణమే రాయాలి. ఇంకే కథ రాసినా అది కట్టుకథే అవుతుందంటూ నిర్మొహమాటంగా చెప్పిన ‘కవిసమ్రాట్’ విశ్వనాథ సత్యనారాయణ. తన రామాయణ కల్పవృక్షంలో రాముడి వైభవాన్ని ప్రపంచం పట్టలేనంతగా విస్తరించి రాసారు. 


జనకుడి సభలో రాముడు ఎక్కుపెట్టిన శివధనుస్సు విరిగిన శబ్దం 

నిష్ఠావర్ష దమోఘ మేఘపటలీ నిర్గచ్ఛదుద్యోతిత
స్పేష్ఠేరమ్మదమాలికా యుగప దుజ్జృంభన్మహా ఘోరబం
హిష్ఠ స్ఫూర్జధుషండమండిత రవాహీన క్రియా ప్రౌఢి ద్రా
ఘ్రిష్ఠంబై యొకరావ మంతట నెసంగెన్ ఛిన్న చాపంబునన్.

ఉరుముల గుంపు నుండి వచ్చే ధ్వనిలాగా శివధనుస్సు విరిచినప్పుడు శబ్దం వచ్చిందట. అక్కడితో ఆగలేదు విశ్వనాథ కవితావేశం. భూమి నుంచి వరుసగా ఐదు ఊర్ధ్వ లోకాల్లో ఆ శబ్దం ఎలా వినబడిందో వివరిస్తూ వరుసగా ఐదు పద్యాలు రాసారు. అదీ రామయ్య బాహు విక్రమం. 

ఇరువదినాలు గేండ్లుగ నిదెప్పు డిదెప్పు డటంచుఁ గన్నులం
దెఱచి ప్రతీక్ష చేయుదుగదే, జగదేకధనుష్కలానిధీ !
విఱచిన వెండికొండదొర వింటిని వింటినిగాని చూడలే
దఱుత వహింప ధాత్రిఁ గనులారగఁ జూతునురా కుమారకా !


శివధనుస్సును విరిచి, సీతమ్మను వివాహం చేసుకున్న సందర్భంలో కౌసల్య మనోభావం ఇది. ఇరవై నాలుగేళ్ళుగా ఈ కల్యాణ ఘడియ కోసమే నిరీక్షిస్తున్నాను కుమారా... అంటూ ఆ తల్లి రాల్చిన ఆనందాశ్రువులు సీతారాముల కల్యాణానికి అక్షతలుగా మారాయి.

అశోకవనంలో రాక్షస స్త్రీల సమూహం మధ్య కూర్చున్న తేజోవతి అయిన ఓ స్త్రీని హనుమంతుడు చూసాడు. ఆమె ఎవరో తెలియదు. కానీ, ఆమెను చూస్తుంటే...

*ఆకృతి రామచంద్ర విరహాకృతి కన్బొమ తీరు స్వామి చా*
*పాకృతి కన్నులన్ ప్రభు కృపాకృతి కైశిక మందు స్వామి దే*
*హాకృతి సర్వదేహమున యందును రాఘవ వంశమౌళి ధ*
*ర్మాకృతి కూరుచున్న విధమంతయు రామ ప్రతిజ్ఞ మూర్తియై* *

అప్పటివరకూ తాను చూసిన రామచంద్రమూర్తి విరహమంతా మనిషి రూపం ధరిస్తే ఎలా ఉంటుందో ఆ స్త్రీ మూర్తి అలా కనిపించింది. రాముడి కోదండాన్ని ఆమె కనుబొమల్లో స్పష్టంగా చూడవచ్చు. ఆమె కళ్ళల్లో రాముడి దయాగుణం, కేశాల్లో రాముని మేనిఛాయ, ఆమె శరీరంలోని అణువణులో రఘువంశ ధర్మం బొమ్మకట్టినట్లు కనిపిస్తోంది. అంతేకాదు... తన ధర్మపత్నిని అపహరించిన వాడిని సంహరిస్తానని రాముడు చేసిన ప్రతిజ్ఞ ఆకారం ధరించిందా అన్నట్లు ఆమె కూర్చున్నదట. 

విశ్వనాథ కల్పవృక్షంలోనూ సీతారాములు ఇద్దరు మనుషులు కారు. రెండు భౌతిక రూపాల్లో ప్రకటితమయ్యే  ఒకే ఆత్మ.

ఇంకా... రఘునాథ రాయలు (రఘునాథ రామాయణం), ఘనగిరి రామకవి (యథావాల్మీకి రామాయణం), చెన్న కృష్ణయ్య (సాంఖ్య రామాయణం), గంగయ్య (తారకబ్రహ్మ రామాయణం).... ఇలా తెలుగులో సుమారు 130 వరకు రామాయణాలు వచ్చాయి. 
 
అన్నిటా ఒకటే సందేశం... రాముడు భారతజాతి ఆత్మ.
--------------------------------------------------------------
భక్తి పత్రిక ఏప్రిల్, 2024 సంచికలో ప్రచురితమైన వ్యాసం
----------------------------------------------------------------
రచన : డాక్టర్ కప్పగంతు రామకృష్ణ, అసోసియేట్ ప్రొఫెసర్, కెబిఎన్ కళాశాల (అటానమస్), విజయవాడ-1
 


 

Thursday, March 31, 2022

కాలదైవం ఉగాది

 

కాలదైవం ఉగాది

            వసుధపై వసంతం వికసించిన తొలిరోజు ఉగాది. మిగిలిన పండుగల కన్నా ఉగాది ఎంతో ప్రత్యేకమైంది. సాధారణంగా పండుగలన్నీ ఏదో ఒక దేవత / దేవుడికి సంబంధించి ఉంటాయి. ఉగాది ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఏ దేవుడి పేరూ ఈ రోజు వినిపించదు.


            ఉగాది కాలానికి సంకేతం. మానవ జీవనానికి, కాలానికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకునే ఆనందవేళ ఉగాది. కాలాన్ని గుణిస్తూ మారుతున్న కాలానికి అనుగుణంగా జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలనే సందేశాన్ని ఉగాది అందిస్తుంది. సహనానికి, వ్యక్తిత్వ వికాసానికి, మనోవికాసానికి ఆలవాలంగా నిలుస్తుంది.


            కంటికి కనిపించని బలమైన శక్తి కాలం. కాలాన్ని కాదని ఎవ్వరూ ఏ పనీ చెయ్యలేరు. కాలానికి అనుగుణంగానే ప్రతి వ్యక్తీ తన దినచర్యను తీర్చిదిద్దుకుంటాడు. కాలాన్ని కంటితో దర్శించి ఇదీ కాలం యొక్క పూర్తి స్వరూపంఅని నిర్ధారించిన వాళ్లూ లేరు. కాలం తనకు తానుగా సాగిపోతుంది. కాలాన్ని అనుసరించి నడుచుకోవటమే మనిషి చేసే పని. తనంతట తానుగా ఆవిర్భవించి తనతో పాటు మనిషిని నడిపిస్తున్న శక్తి కాలం. ఇంతవరకూ కాలాన్ని జయించిన వ్యక్తి ఎవ్వరూ లేరు.


            కాలం అనంతమైంది. ఎప్పుడు పుట్టిందో, ఎలా మారుతుందో ఎవ్వరూ ఊహించలేరు. అదొక స్వయంభూమూర్తి. గ్రహగతుల ఆధారంగా ఖగోళంలో ఏర్పడుతున్న మార్పుతున్న మార్పులను గమనించి మనం కాలాన్ని విభజన చేస్తున్నాం. అంతేకానీ, కాలానికి ఇదీ నిర్దుష్టమైన విభజనఅంటూ ఏదీ లేదు.


వేదాల్లో కాలమానం


            అతి ప్రాచీనమైన ఋగ్వేదంలో కాలం, కాలవిభజన గురించిన ప్రస్తావనలు చాలా చోట్ల ఉన్నాయి. ఆయా కాలాల్లో నిర్వహించాల్సిన యజ్ఞ, యాగాది క్రతువులను వివరించే సందర్భాల్లో కాల ప్రస్తావన కనిపిస్తుంది. ఋగ్వేదం ఏడో మండలం 103వ సూక్తంలో ఋతువుల ప్రస్తావన ఉంది. సోమ, అతిరాత్ర యజ్ఞాల గురించి వివరిస్తూ ఋత్విక్కులు ఆయా ఋతువుల్లో ఈ యాగాలు చెయ్యాలని అందులో ఉంది.


            యజుర్వేదంలో కూడా అహోరాత్రం, అర్ధమాసం, మాసం, ఋతువులు, సంవత్సరాల వివరాలు తెలిపే మంత్రాలు ఉన్నాయి. అర్ధమాసాస్తే కల్పంతాం.. మాసాస్తే కల్పంతాం । ఋతవస్తే కల్పతాం సంవత్సరస్తే కల్పతాం’ (యజుర్వేదం, 27:45) మంత్రాలు ఇందుకు ఉదాహరణగా నిలుస్తాయి. యజుర్వేదం నాలుగు, ఏడు కాండల్లో ఋతువుల ప్రస్తావన వస్తుంది. శతపథ బ్రాహ్మణంలో కూడా ఋతువుల ప్రస్తావన ఉంది. అయితే, ఇందులో ఏడు ఋతువుల్ని ప్రస్తావించారు.


            కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో పంచవత్సరో యుగమితి‘ ` ఐదు సంవత్సరాలు ఒక యుగం అంటూ యుగం అనే భావనకు నిర్వచనం ఇచ్చాడు. జ్యోతిశ్శాస్త్రం కూడా ఇదే భావనను సమర్థించింది.


  యుగాలు, యుగవిభజన ప్రస్తావన మొదటిసారిగా మహాభారతంలో కనిపిస్తుంది. కృత, త్రేత, ద్వార, కలియుగాలతో పాటు కల్ప,మహాకల్ప విభజన కూడా వ్యాసమహర్షి ఇందులో ప్రస్తావించారు. మహాభారతంలో అంతర్భాగమైన భగవద్గీతలో కల్పక్షయే పునస్తాని....’ ‘కాలః కలయతామహంమొదలైన శ్లోకాల ద్వారా మహాభారత కాలంలో అనుసరించిన స్పష్టమైన కాలవిభజన గమనించవచ్చు.


 కాలవిభజన

            మనం ఉపయోగించే కాలవిభజనలో అత్యంత సూక్ష్మమైన విభాగం నిమేషం’. దీన్నే వాడుకలో నిమిషంఅంటున్నాం. నిమేషము అంటే రెప్పపాటు కాలం. ఋగ్వేదంలో నిమేషం అనే పదాన్ని కాలానికి సంకేతంగా కాకుండా రెప్పపాటు లేనివారు’ (దేవతలు) అనే అర్థంలో ఉపయోగించారు. ఉపనిషత్తుల కాలానికి వచ్చేసరికి కాలాన్ని స్పష్టంగా విభజించిన ఉదాహరణలు కనిపిస్తాయి. కలా ముహూర్తా: కాష్ఠాశ్చ అహోరాత్రాశ్చ సర్వశ: । అర్ధమాసా మాసా రుతవస్సవంత్సరశ్చ కల్పంతాం॥అంటూ మాండ్యూక్యోపనిషత్తు కాలవిభజన గురించి వివరిస్తుంది.

 ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న కాలవిభజనకు దాదాపుగా సమానంగా ఉండే కాలవిభజన మహాభారతం శాంతిపర్వంలోని కాష్ఠా నిమేషా దశ పంచ చైవ...అనే శ్లోకంలో కనిపిస్తుంది. దీని ప్రకారం

1 నిమేషం - రెప్పపాటు కాలం

15 నిమేషాలు - 1 కాష్ఠం

30 కాష్ఠాలు - 1 కళ

30 కళలు - 1 ముహూర్తం

30 ముహూర్తాలు - 1 దివారాత్రి (ఒక రోజు)

30 దివారాత్రులు - 1 మాసం

12 మాసాలు -  1 సంవత్సరం


మనుధర్మశాస్త్రం, అర్థశాస్త్రంలో కూడా ఇదే రకమైన విభజన ఉంది. భాగవత, విష్ణుపురాణాల్లోనూ కాలవిభజన గురించిన శ్లోకాలు ఉన్నాయి.


           కాలవిభజన గురించిన గ్రంథాల్లో సూర్యసిద్ధాంతం చాలా ప్రాచుర్యం పొందింది. మూర్త’, ‘అమూర్తఅనే రెండు రకాల కాలమానాలు  ఇందులో ఉన్నాయి. మూర్తకాలమానంలో ప్రాణఅతిచిన్నదైన కాలప్రమాణం. దీన్ని అనుసరించి ఇతర విభజన జరిగాయి. అవి

6 ప్రాణ కాలాలు - 1 విఘడియ

60 విఘడియలు - 1 ఘడియ

60 ఘడియలు - 1 అహోరాత్రం (ఒక రోజు)


            అమూర్తకాలంలో త్రుటిఅనేది అతిచిన్న కాలప్రమాణం. సూర్యసిద్ధాంతంలో త్రుటిగురించి ఇంతకన్నా ఎక్కువ వివరాల్లేవు. అయితే, 12వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ ఖగోళశాస్త్రవేత్త భాస్కరాచార్యుడు తాను రాసిన సిద్ధాంత శిరోమణిగ్రంథంలో అమూర్తకాలానికి అనేక వివరణలు ఇస్తూ కాలవిభజన చేశాడు. దీనిప్రకారం రోజులో 2916000000 వంతు త్రుటి అవుతుంది. ఆధునిక లెక్కల ప్రకారం సెకనులో 33750 వంతు త్రుటి అవుతుంది. రెండు విలువలూ దాదాపు సమానం. ఎన్నో వందల సంవత్సరాల క్రితమే భారతీయ ఖగోళశాస్త్రవేత్తలు ఎటువంటి ఆధునిక పరికరాలు లేకుండానే చేసిన కాలవిభజన ఇప్పటికీ ప్రామాణికంగా ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.


ఋతువులు, కార్తెలు, మాసాల విభజన


            వసంత, గ్రీష్మ, వర్ష, శరత్‌, హేమంత, శిశిర ఋతువులు ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి. ఒక్కో ఋతువు రెండు నెలలు ఉంటుంది. దీనిప్రకారం సంవత్సరానికకి ఉండే 12 నెలల్లో ఆరు ఋతువులు వస్తాయి. వాస్తవానికి భారతీయ వేదవాజ్ఞ్మయంలో అత్యంత ప్రాచీనమైనదైన ఋగ్వేదంలో వసంతం, గ్రీష్మం, శరత్‌ అనే మూడు ఋతువుల ప్రస్తావన మాత్రమే ఉంది. వర్షాన్ని ప్రత్యేక ఋతువుగా కాకుండా ప్రత్యేక కాలంగా పరిగణిస్తున్నట్లు (ఋగ్వేదం ఏడో మండలం) ఉంది. కృష్ణయజుర్వేదంలో ఐదు ఋతువుల ప్రస్తావన ఉంది. ఆ తర్వాత తైత్తిరీయ సంహితలో మొదటిసారిగా ఆరు ఋతువుల ప్రస్తావన కనిపిస్తుంది. అయితే, ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం... అనే 12 పేర్లు కాకుండా మధు, మాధవ, శుక్ర, శుచి, నభ, నభస్య, ఇష, ఊర్జ, సహ, సహస్య, తప, తపస్య అనే పేర్లను ఇందులో ఉపయోగించారు.


            ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న చైత్ర, వైశాఖాలనే మాసాల పేర్లు చంద్రగ్రహ సంచారం ఆధారంగా ఏర్పడ్డాయి. నక్షత్రాల ఆధారంగా చంద్రుడి గమనాన్ని పరిశీలిస్తే చంద్రుడు ఒక నక్షత్ర కూటమి నుంచి బయల్దేరి మళ్ళీ అదే నక్షత్రకూటమికి చేరుకోవటానికి దాదాపు 27 రోజులు పడుతుంది. దీన్నే నక్షత్రమాసం అంటాం. ఈ 27 రోజుల్లో చంద్రుడు దాటే ఒక్కో నక్షత్రం ఆధారంగా అశ్వని, భరణి, కృత్తిక మొదలైన 27 నక్షత్రాల పేర్లు ఏర్పడ్డాయి. ఆ తర్వాత ప్రతి నెలలో నిండు పూర్ణమి రోజున చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరు మీద ఆ నెలకు పేరు ఏర్పాటుచేశారు. దీనిప్రకారం చంద్రుడు పౌర్ణమి రోజున చిత్త నక్షత్రంలో ఉంటే చైత్రమాసం అవుతుంది. ఇదేతీరులో విశాఖ నక్షత్రంలో పౌర్ణమి వచ్చే నెల వైశాఖమాసం... ఇలా అన్ని నెలల పేర్లు ఏర్పడ్డాయి.


            చంద్రగమనం మాదిరిగానే సూర్యుడికి సంబంధించిన సంవత్సర కాలాన్ని 27 భాగాలుగా చేసి వాటికి కార్తెఅనే పేరు నిర్ణయించారు. ఒక్కో నక్షత్ర కూటమిలో సూర్యుడు దాదాపు రెండు వారాల పాటు ఉంటాడు. దీనిప్రకారం ఒక్కో కార్తె సుమారుగా 13 లేదా 14 రోజులు ఉంటుంది. అశ్వని నుంచి రేవతి వరకు ఇలా నక్షత్రాల పేర్ల మీద కార్తెలు ఏర్పడ్డాయి.


            ఆదివారం నుంచి శనివారం వరకు మనం ఉపయోగించే వార విభజన గ్రహకక్ష్యలను ఆధారంగా చేసుకుని నిర్ణయించారు. ఈ వివరాలు సూర్యసిద్ధాంత గ్రంథంలో ఉన్నాయి. దీనిప్రకారం గ్రహకక్ష్యల్లో నాల్గవది సూర్యకక్ష్య. దీనిప్రకారం మొదటివారం ఆదివారంగా ఏర్పడిరది. సూర్యుడి నుంచి నాలుగో కక్ష్యలో చంద్రుడు ఉంటాడు కాబట్టి ఆదివారం తర్వాత సోమవారం’ (సోముడంటే చంద్రుడు) ఏర్పడిరది. చంద్రుడి నుంచి నాలుగో కక్ష్యలో బుధుడు ఉంటాడు కాబట్టి బుధవారం... ఇలా మిగిలిన వారాలన్నీ ఏర్పడ్డాయి.


సంవత్సరాల పేర్ల కథ


  ఆజన్మ బ్రహ్మచారి అయిన నారదమహర్షికి ఒక రోజు విచిత్రమైన కోరిక కలిగింది. సంసారం మాయ అంటారు. దాన్నే సంసార బంధం అంటారు. ఇదంతా ఏమిటో తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది. వెంటనే తన కోరికను విష్ణుమూర్తికి విన్నవించాడు. భూలోకంలోని ఓ కొలను చూపించి అందులో స్నానం చేసి రమ్మంటాడు విష్ణుమూర్తి. సరేనంటూ స్నానానికి వెళ్తాడు నారదుడు. స్నానం పూర్తిచేసి సరస్సు నుంచి బయటకు వచ్చేసరికి నారదుడు స్త్రీగా మారిపోతాడు. పూర్వజ్ఞానం కూడా కోల్పోతాడు. ఇంతలో అటుగా వచ్చిన ఆ దేశపు రాజు స్త్రీరూపంలో ఉన్న నారదుడిని చూసి మోహించి ఆమెను వివాహం చేసుకుంటాడు. వీరికి 60 మంది సంతానం కలుగుతారు. కొన్నేళ్ళ తర్వాత శత్రువులతో జరిగిన యుద్ధంలో రాజు తన 60 మంది సంతానంతో సహా మరణిస్తాడు. స్త్రీరూపంలో ఉన్న నారదుడికి అంతులేని దు:ఖం కలుగుతుంది. మరణించిన వారందరి ఉత్తరక్రియలు పూర్తయిన తర్వాత తాను పూర్వం స్నానం చేసిన కొలనులోనే స్నానం చేస్తాడు. వెంటనే పూర్వపు నారదుడి రూపు పొందుతాడు. అయినప్పటికీ తన పుత్రుల మరణదు:ఖం నుంచి తేరుకోలేకపోతాడు. అనేకవిధాలుగా విష్ణుమూర్తిని ప్రార్థిస్తాడు. అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై నారదుడు అడిగిన సందేహాన్ని తీర్చేక్రమంలో తానే ఈ మాయా నాటకాన్ని నడిపించానని చెబుతాడు. నారదుడి సంతానం పేర్లు శాశ్వతంగా ఉండటం కోసం వారి పేర్లనే సంత్సరాల పేర్లుగా మార్చి, కాలంతో పాటు వారి పేర్లు శాశ్వతంగా ఉండేలా వరమిస్తాడు. అలా నారదుడి సంతానమైన ప్రభవ, విభవ, శుక్ల... తదితర 60 పేర్లు ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న సంవత్సరాల పేర్లుగా చెలామణిలోకి వచ్చాయి.


పంచాంగాలు, సిద్ధాంతాలు


            ఉగాది అనగానే గుర్తుకువచ్చే అంశాల్లో ఉగాది పచ్చడి తర్వాతిస్థానం పంచాంగానిదే. రాబోయే సంవత్సరకాలంలో తమ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఇందుకోసం ప్రతి ఒక్కరూ ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేస్తారు. పంచాంగ రచనకు సూర్య, దృక్‌ అనే రెండు సిద్ధాంతాలు మనదేశంలో అత్యంత ప్రాచుర్యంలో ఉన్నాయి. వీటిల్లో సూర్యసిద్ధాంతం అత్యంత ప్రాచీనమైనమైంది. సుమారుగా 1800 సంవత్సరాలుగా ఇది ప్రాచుర్యంలో ఉంది. భట్టోత్పల, దివాకర, కేశవ, విజయనంది, చిత్రభాను, శ్రీరంగనాథ, మకరంద, నరసింహ, భాస్కరాచార్య, ఆర్యభట్ట, వరాహమిహిర తదితర ఖగోళ గణిత (ఆస్ట్రోమ్యాథమెటిక్స్‌) శాస్త్రవేత్తలు ఖగోళ పరిజ్ఞానం ఆధారంగా కాలవిభజన చేసి, స్పష్టమైన వివరణ ఇచ్చారు. వీరిలో క్రీ.శ.1178 కాలానికి చెందిన మల్లికార్జున సూరి రాసిన సూర్య సిద్ధాంత భాష్యంతెలుగు, సంస్కృత భాషల్లో ముద్రితమై ఇప్పటికీ వాడుకలో ఉంది. పంచాంగ రచనలకు ఇదే అత్యంత ప్రామాణికమైన గ్రంథం. సూర్యసిద్ధాంతం, ఆర్యభట్టీయం, బ్రహ్మస్ఫుట సిద్ధాంతం ` ఈ మూడు గ్రంథాల ఆధారంగా ప్రపంచంలోని అనేకదేశాలు ఇప్పటికీ తమ కాలమానిని (క్యాలెండర్‌) తయారుచేసుకుంటున్నాయి. దృక్‌సిద్ధాంతాన్ని కేరళ రాష్ట్రానికి చెందిన ఖగోళ శాస్త్రజ్ఞుడు పరమేశ్వర’ (క్రీ.శ.1431) వ్యాప్తిలోకి తీసుకువచ్చారు. సూర్య, దృక్‌ సిద్ధాంతాల ఆధారంగానే ఇప్పటికీ పంచాంగాలు తయారవుతున్నాయి.

==============

రచన : డాక్టర్ కప్పగంతు రామకృష్ణ

సెల్ : 9032044115 / 8897547548

 


పున్నమి కాంతుల కల్యాణం (ఒంటిమిట్టలో జరిగే శ్రీ సీతారామ కల్యాణం నేపథ్యంగా శ్రీకనకదుర్గ ప్రభ పత్రికలో రాసిన వ్యాసం)

  పున్నమి కాంతుల కల్యాణం                లోకంలో పెళ్ళి ముచ్చట అంటే సీతారాములదే. అందులోనూ ఒంటిమిట్ట ఆలయంలో జరిగే సీతారాముల కల్యాణం మరింత శ...