Tuesday, October 23, 2018

వాల్మీకి మహర్షి గురించి డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr Kappagantu Ramakrishna) రాసిన వ్యాసం

వాల్మీకి హృదయం




రామకథ... ఏనాటి యుగాల నాటి కథ. ఇప్పటిదా? అవును... ఇప్పటిదే. నాటికీ, నేటికీ, మరి ఏనాటికీ రామకథ నిత్యనూతనంగానే ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా లిపి ఉన్న ప్రతి భాషలో రామాయణం అక్షరాకృతి పొందింది. కేవలం వాగ్రూపంలో ఉన్న భాషల్లో కూడా రామకథ జానపద సాహిత్యంగా ప్రకాశిస్తోంది. గత వెయ్యి సంవత్సరాల కాలంలో మనదేశంలో కొన్ని వందల రామాయణాలు వచ్చాయి. రామాయణం వెలువడని భారతీయ భాష లేదు. 

ఉత్తర భారతంలో తులసీ రామాయణం, తమిళదేశంలో కంబ రామాయణం నిత్యపారాయణ గ్రంథాలు. తెలుగులో వచ్చిన రామాయణాలకు లెక్కలేదు. రంగనాథ రామాయణం, మొల్ల రామాయణం, భాస్కర రామాయణం, గోపీనాథ రామాయణం... ఈ వరుసకి అంతులేదు. ఆధునిక కాలంలో కూడా శ్రీనివాస శిరోమణి, యామిజాల పద్మనాభస్వామి, ఉషశ్రీ, జనమంచి శేషాద్రిశర్మ మొదలైన వారెందరో రామకథ రాసి మురిసిపోయారు. ఇక, 'కవిసమాట్ర్‌' విశ్వనాథ సత్యనారాయణ సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 'కవితా రూప తపస్సు' చేసి మరీ రామాయణ కల్పవృక్షం రాసానని చెప్పుకున్నారాయన. అన్నమయ్య, త్యాగయ్య, కంచర్ల గోపన్న మొదలైన వాగ్గేయకారులూ తనివితీరా రామభక్తి సామ్రాజ్యంలో మునిగితేలారు. 

జానపదులైతే రాములోరు, సీతమ్మ తల్లి, లక్ష్మణదేవర అంటూ తమలో ఒకరిగా రామయ్య కుటుంబంతో చుట్టరికాలు కలిపేసుకున్నారు. ఊర్మిళాదేవి నిద్ర, లక్ష్మణదేవర నవ్వు వంటి ఎన్నో ప్రసిద్ధ జానపద గేయాలతో రామకథ జానపదుల గుండెల్లో నిరంతరం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. 

రామకథకు ఎల్లలు లేవు. భాష, ప్రాంతీయ, కుల, మత, వర్గ, లింగ, స్థాయీ భేదాలు లేవు. ఏమిటీ రామకథ మహత్తు? అసలు రామాయణానికి ఎందుకింత ప్రాచుర్యం వచ్చింది? రామాయణ కథ రాసిన కవి అంత గొప్పవాడా? ఆయన ప్రత్యేకత ఏమిటి? యజ్ఞయాగాదులు చేసాడా? పురాణాలు ఔపోసన పట్టాడా? అసలు ఈ కథ రాయాలని ఆయనకు ఆలోచన ఎందుకు వచ్చింది? 

ఈ ప్రశ్నలన్నిటికీ ఒకటే సమాధానం. సమాజంలో అడుగంటిపోతున్న సనాతన ధర్మాన్ని సముద్ధరించటానికి ఓ జీవుడు పడిన ఆవేదనకు అక్షర రూపంగా, ధర్మం పునాదిగా రామకథ రూపుదిద్దుకుంది. ఎవరా జీవుడు? అతడే వాల్మీకి. ఈయన ఎక్కడివాడు? జీవిత చరిత్ర ఏమిటి? పూర్వ జన్మ ఏమిటి? ఇటువంటి విషయాల మీద అనేక చర్చలు సమాజంలో ఉన్నాయి. ఇప్పటికీ ఈ విషయాల గురించి పరిశోధకుల మధ్య ఏకాభిప్రాయం రాలేదు. ఈ చర్చ వదిలేద్దాం. 

ఎక్కడి వాడైనా, ఏ చరిత్ర కలవాడైనా, యావత్ప్రపంచ చరిత్రలో నూతన శకాన్ని సృష్టించిన ప్రతిభా సంపన్నుడు వాల్మీకి. మూగదైన పక్షి పడిన ఆవేదన తనదిగా భావించాడు. ధర్మమార్గం విడిచిన యావజ్జాతి ఆవేదనగా భావించాడు. అందుకే తిరిగి ధర్మాన్ని ఈ సమాజంలో సముద్ధరించాలని సంకల్పించాడు. 

'విగ్రహవాన్‌ ధర్మ:' అని ప్రశసంలు అందుకున్న 'రామ' పాత్రని సృష్టించాడు. జాగ్రత్స్వప్న సుషుప్తుల్లో కూడా అణుమాత్రమైనా విడిచిపెట్టకుండా ధర్మాన్ని ఆచరించిన వ్యక్తి ఎవరంటే, ప్రపంచమంతా ముక్తకంఠంతో 'రాముడు' అని సమాధానం చెప్పేలా రామ పాత్రని తీర్చిదిద్దాడు. 

రామాయణ ప్రారంభంలోనే తన రాముడు ఎలాంటి వాడో వాల్మీకి చెప్పాడు.

కోన్వస్మిన్‌ సాంప్రతం లోకో గుణవాన్‌ కశ్చ వీర్యవాన్‌
ధర్మజ్ఞశ్చ, కృతజ్ఞశ్చ, సత్యవాక్యో ధృఢవ్రత:
చారిత్రేణ చ కో యుక్త: సర్వభూతేషు కో హిత:
విద్వాన్‌ క:, క: సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శన:
ఆత్మవాన్‌ జితక్రోధో ద్యుతిమాన్‌ కోనసూయక:
కస్య బిభ్యతి దేశాశ్చ జాత రోషస్య సంయుగే

గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మవర్తనుడు, కృతజ్ఞత కలిగిన వాడు, సత్యవాక్సంపన్నుడు, నిశ్చల బుద్ధి కలవాడు, సత్ప్రవర్తన కలిగినవాడు, అన్ని ప్రాణుల యందు దయ కలిగినవాడు, విద్వత్తు కలిగినవాడు, సకల కార్య నిర్వహణ సమర్థుడు, చూపులతోనే సంతోషాన్ని కలిగించేవాడు, ఆత్మవంతుడు, క్రోధం లేనివాడు, ప్రకాశవంతమైన వర్చస్సు కలిగినవాడు, అసూయలేనివాడు, దేవతలకు కూడా గౌరవప్రదమైనవాడు, పౌరుష పరాక్రమాలు కలిగినవాడు - ఇన్ని సుగుణాల రాశి కనుకనే రామయ్య లోకారాధ్యుడయ్యాడు. 
తన కథానాయకుడిని మేలిమి గుణాల కలయికగా తీర్చిదిద్దాడు వాల్మీకి. ఇక్కడే వాల్మీకి హృదయ ఔన్నత్యం స్పష్టమవుతుంది. 
'స హితస్య భావం సాహిత్యం' - సమాజానికి మేలు చేకూర్చేదే సాహిత్యం అని ఆర్యోక్తి. ఊహాజగత్తులో విహారం చేయకుండా, సమాజ సముద్ధరణకు ఎలాంటి సాహిత్యం కావాలో, అచ్చంగా అలాంటి సాహిత్యాన్ని, ఉత్తమమైన కథనాయకుడి పాత్ర ద్వారా సృష్టించాడు వాల్మీకి. అందుకే వాల్మీకిది సామాజిక హృదయం.  మాటలతో కాకుండా చేతలతో తన కథానాయకుడిగా ధర్మాచరణ చేయించాడు వాల్మీకి. 

''సర్వే జ్ఞానోప సంపన్నా: సర్వే సముదితా గుణై:
తేషా మపి మహారాజా రామ: సత్యపరాక్రమ:''
''ధనుర్వేదేచ నిరత: పితు: శుశ్రూషణే రత:''


తన కథానాయకుడు సత్య పరాక్రమం కలిగిన వాడు కావాలని వాల్మీకి కోరుకున్నాడు. ప్రపంచంలోని మరే ఇతర కవి ఈ భావాన్ని ప్రకటించలేదు. మనిషికి ఎంతటి పరాక్రమం ఉన్నా, అతడు సత్య, ధర్మాలకు అనుగుణంగానే తన పరాక్రమాన్ని ప్రదర్శించాలి. ఎంతటి యోధుడైనా, తల్లిదండ్రుల సేవ విడిచిపెట్టకూడదు - ఇదీ వాల్మీకి సత్య హృదయం.

జయించటానికి దేవతలకు సైతం వీలుపడని గొప్ప రాజ్యం 'అయోధ్య'కు రాజైనా, సాక్షాత్తు శ్రీమహావిష్ణు స్వరూపం అని తోటివారు, ప్రజలంతా తనను కొలుస్తున్నా, ధర్మసంరక్షణలో కేవలం సాధారణ మానవుడిగా రాముడు ప్రవర్తించాడు. 'ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం' - నేను సామాన్య మానవుడిని. దశరథ మహారాజు కుమారుడిని మాత్రమే అని దేవతలకే రాముడు విస్పష్టంగా చెప్పాడు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్త్వం వాల్మీకిది. తన రాముడిని అలాగే తీర్చిదిద్దాడాయన. సమాజ సభ్యుడిగా సాటి మానవులతో ఎలా మెలగాలో ఆచరించి చూపించాడు. అందుకే వాల్మీకిది మానవ హృదయం.

ప్రియాతి ప్రియమైన భార్యా వియోగ దు:ఖంలో ఉన్నా శరణు వేడిన సుగ్రీవుడికి అభయం ఇచ్చాడు. యుద్ధ ప్రణాళికా రచనలో తలమునకలై ఉన్నా, ఆశ్రయం కోరి వచ్చిన విభీషణుడికి శరణాగతి ప్రసాదించాడు. వారు, వీరనే భేదం లేదు... 'అభయం సర్వ భూతేభ్యో దదామి, ఏతత్‌ వ్రతం మమ' స్వయంగా రావణుడే వచ్చి శరణు కోరితే, అతడికి సైతం అభయ ప్రదానం చేస్తాను. ఇది నా నియమం అని విస్పష్టంగా ప్రకటిస్తాడు రాముడు. వాల్మీకి హృదయం భూతదయకు నిలయం. లేకపోతే క్రౌంచపక్షుల దు:ఖాన్ని తానెందుకు అనుభవిస్తాడు? ఇదే తీరు రాముని పాత్రలో ప్రతిఫలించింది.

వనవాసానికి బయలుదేరిన కుమారుడికి కౌసల్య చేసిన హితబోధ - 'స వై రాఘవ శార్దూల ధర్మస్త్వామభి రక్షంతు' - రామా! ధర్మాన్ని కాపాడమని చెప్పిందే కానీ అరణ్యంలో తన బిడ్డ ఎన్ని కష్టాలు పడతాడో అని కౌసల్య బాధ పడలేదు. ఎందుకంటే తన బిడ్డని శార్దూల అని సంబోధిస్తూనే అతడి పరాక్రమం ఏమిటో గుర్తుచేసింది. ఎంతటి కష్టమైనా ధర్మమార్గం విడిచిపెట్టకూడదు. 

జనస్థానంలో జరిగిన విధ్వంసానికి రావణుడు అగ్ర¬దగ్రుడై, సీతాపహరణ విషయంలో తనకు తోడు రమ్మని మారీచుడిని అడుగుతాడు. రాముడి శక్తి, సామర్థ్యాలు ఎంతటివో రుచి చూసినవాడు మారీచుడు. అందుకే 'రామో విగ్రహవాన్‌ ధర్మ:, సాధు: సత్య పరాక్రమ:, రాజా సర్వలోకస్య దేవానామివ వాసవ:' - రావణా! రాముడు మూర్తీభవించిన ధర్మ స్వరూపుడు. సత్య పరాక్రమం కలిగినవాడని మారీచుడు హితోపదేశం చేస్తాడు. సత్య,ధర్మాలు కలిసిన పరాక్రమానికి శక్తి అపరిమితం. అజేయమనే విషయాన్ని మారీచుడి పాత్ర ద్వారా వాల్మీకి చెప్పించాడు. 

మాయా యుద్ధంతో లక్ష్మణుడిని ఇంద్రజిత్తు ముప్పతిప్పలు పెడుతున్నాడు. చివరగా లక్ష్మణుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. 'ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది, పౌరుషేచాప్రతిద్వంద్వ: శరైరం జహి రావణం' - నా అన్నగారైన శ్రీరామచంద్రమూర్తి సత్య, ధర్మాలకు నిలయమైన వాడైతే, ఈ అస్త్రం ఇంద్రజిత్తును సంహరించుగాక అంటూ బాణ ప్రయోగం చేసాడు. మరుక్షణంలో ఇంద్రజిత్తు నేలకూలాడు. సత్య, ధర్మాలు కలిస్తేనే అస్త్రాలకైనా శక్తి వస్తుందనే విషయం ఈ సందర్భంలో సుస్పష్టంగా ప్రకటితమవుతుంది. 

ఒకటా, రెండా..? మొత్తం రామాయణంలో పదుల సంఖ్యలో వాల్మీకి రాముడి సత్య, ధర్మ పరాక్రమాల గురించి ప్రస్తావిస్తాడు. కారణం - వాల్మీకి హృదయం సత్య, ధర్మాలకు నిలయం. 

రామ రావణ యుద్ధం ముగిసింది. విభీషణుడు లంకాధిపతి అయ్యాడు. తనకు ఇంతటి ఘనత తెచ్చిన రామచంద్రమూర్తికి సాగిలపడి, కొన్నాళ్ళు లంకలో ఉండి, తన ఆతిథ్యం తీసుకొమ్మని ప్రాథేయపడ్డాడు. 

''అపి స్వర్ణమయీ లంకా న మే లక్ష్మణ రోచతే
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ'' 


ఒళ్ళు పులకరించే మాట చెప్పాడు రామచంద్రమూర్తి. లక్ష్మణా! లంక మొత్తం స్వర్ణమయం కావచ్చు. అనేక సుఖభోగాలు ఇక్కడ దొరకవచ్చు. కానీ, నా మనసు అయోధ్యను చూడాలని ఆరాటపడుతోంది. మాతృమూర్తి, మాతృభూమి స్వర్గం కన్నా ఉన్నతమైనవి కదా - అంటాడు రామయ్య. 

ఎన్నో యుగాల నాడు వాల్మీకి రాసిన మాట ''జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ'' - ఇప్పటికీ మనకు మార్గదర్శనం చేస్తోంది. దేశభక్తి గురించి ఎవరు ఉపన్యాసం చెప్పినా ఈ వాక్యం ఉటంకించాల్సిందే. ఒక తారకమంత్రంగా యావజ్జాతినీ ఈ వాక్యం దేశభక్తి దిశగా ప్రేరేపిస్తోంది. ఒక్క మాటకే ఇంతటి ఘనత తెచ్చాడంటే వాల్మీకి హృదయం దేశభక్తికి నిలయం కాకపోతే సాధ్యమవుతుందా? 

మొత్తంగా వాల్మీకి హృదయం రామాయణంలోని అనేక సందర్భాల్లో, అనేక కోణాల్లో ప్రకటితమవుతుంది. కాగడా పెట్టి వెతికినా మచ్చుకైనా కనిపించకుండా ధర్మం అంతరించిపోతున్న నేటి తరుణంలో, మనం చూడాల్సింది ధర్మ సంస్థాపనకు మార్గమే తప్ప వాల్మీకి కులం కాదు. మా కులం వాడని, మా జాతి వాడని, మా మతం వాడని వాల్మీకిని కులమతాల కుమ్ములాటలోకి దింపటం మన అమానుష ఆలోచనాధోరణికి నిదర్శనం. విశాలమైన భావాలతో, సత్య, ధర్మాలకు ప్రతీకగా రామాయణాన్ని అందించిన మహానుభావుడి పట్ల మనం చేస్తున్న అపచారం ఇది. ఇకనైనా, ఈ ధోరణి విడిచిపెట్టి, వాల్మీకి హృదయాన్ని అర్థం చేసుకుందాం. రామరాజ్యాన్ని స్థాపించుకుందాం. 
=============================

రచన

డాక్టర్‌ కప్పగంతు రామకృష్ణ, ఆంధ్రోపన్యాసకులు, ఎస్‌.ఆర్‌.ఎస్‌.వి.కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, గాంధీనగర్‌, విజయవాడ -3, సెల్‌: 90320 44115





Monday, October 1, 2018

విజయదశమి ... విజయాల దశమి - శ్రీశైలప్రభ పత్రిక అక్టోబర్ 2018 సంచికలో డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr Kappagantu Ramakrishna) రాసిన వ్యాసం

విజయాల దశమి


లోకాలనేలే చల్లనితల్లి జగన్మాత చేసిన రాక్షస సంహారానికి, చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా జరుపుకునే పండుగ దసరా. ప్రత్యేకించి, నవరాత్రి ఉత్సవాల చివరిరోజున నిర్వహించుకునే విజయదశమి పండుగ కేవలం విందు వినోదాలతోనో, పూజాపునస్కారాలతో మాత్రమే ముగిసే పండుగ మాత్రమే కాదు. విజయదశమి అనే పేరు తలచుకోగానే ఒక ధైర్యం మనల్ని ఆవహిస్తుంది. ఇక విజయం మనదే అనే భావన కలుగుతుంది. మనలోని శక్తులన్నీ ఒక్కసారిగా చైతన్యవంతం అవుతాయి. అందుకే, విజయదశమి రోజున ఏ పని ప్రారంభించినా విజయమే కలుగుతుందంటారు మన పెద్దలు.

మానవుడిలో స్ఫూర్తిని రగిలించి, వారి హృదయాల్లో నిద్రించిన కర్తవ్యదీక్షను తట్టిలేపి, విజయతీరానికి నడిపించటమే విజయదశమి పండుగలోని పరమార్థం. సరస్వతి, లక్ష్మి, దుర్గ, కాళి, లలిత, మహిషాసురమర్దిని...ఇలా ఏ పేరుతో పిలిచినా జగన్మాత మనకు విజయాన్ని అనుగ్రహిస్తుంది. మనిషిని మనీషిగా, పోరాటయోధుడిగా, కర్తవ్యదీక్షాపరుడిగా తీర్చిదిద్దుతుంది. ఆ తల్లి అనుగ్రహంతో మనం సాధించలేని విజయమంటూ ఏదీ ఉండదు. అందుకే, విజయదశమి ఏ ఒక్క విజయానికో పరిమితమైన దశమి కాదు. అదొక అనంత విజయాల దశమి.  

తొలి విజయం 'శక్తిచైతన్యం'

సృష్టిలో ఉన్న అన్ని జీవరాశుల్లో మనిషికి సర్వోన్నతమైన స్థానం ఉంది. తనలో ఉన్న శక్తిని గుర్తించి, తనకు ఏవిధంగా ఆ శక్తి ఉపయోగిస్తుందో విచక్షణ ద్వారా తెలుసుకుని, తన లక్ష్యాన్ని సాధించటానికి ఆ శక్తిని వినియోగించటం మనిషి తప్ప మరో ప్రాణి ఏదీ చెయ్యలేదు.  ఇంతటి సర్వోన్నతమైన శక్తి కేవలం ఆ జగన్మాత అనుగ్రహం ద్వారానే మనకి కలుగుతుంది.

ఇదంతా జరగటానికి మనిషిలో ఆత్మ స్వరూపంలో ఉండే శక్తిచైతన్యం ఉద్దీపితం కావాలి. జగన్మాత ఆరాధన మనలో నిద్రాణమైన చైతన్యాన్ని మేల్కొలుపుతుంది. గాయత్రి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, లలిత, దుర్గ, సరస్వతి.. ఇలా ఏ పేరుతో ఆరాధించినా, ఆ తల్లి శక్తిరూపంలోనే వ్యక్తమవుతుంది. శక్తి రూపంలోనే మనిషికి తన అనుగ్రహాన్ని అందిస్తుంది. 

ఏ పేరుతో పిలిచినా, ఆరాధించినా ఆయా రూపాల్లోని మూలశక్తి ఒకటే. అదే చిచ్ఛక్తి. ఈ సకల విశ్వమంతా చిచ్ఛక్తి విలాసంతో ఏర్పడిందే. అమ్మవారి అన్ని నామాల్లో అంతర్గతంగా ఉండేది శక్తి ఉపాసనే. అగ్నికి వేడి శక్తి, సూర్యునికి వెలుగునిచ్చే శక్తి, చంద్రునికి వెన్నెలనిచ్చే శక్తి... ఇలా ప్రతి ప్రాణిలో ఉండే శక్తి అంతా ఆ చిచ్ఛక్తి రూపాంతరాలే. అందుకే 'చిచ్ఛక్తిశ్చేతనా రూపా...' - అంటూ అమ్మవారిని శక్తిచైతన్య స్వరూపంగా ఆరాధించటం జరగుతోంది. అనంతవిశ్వంలోని అన్ని ప్రాణుల్లో నిక్షిప్తమై ఉండే శక్తి సందర్భానుగుణంగా ఒక్కో రీతిలో వ్యక్తమవుతుంటుంది. ప్రాణశక్తి, ఆత్మశక్తి, చైతన్యశక్తి, విద్యాశక్తి, జ్ఞానశక్తి... ఇలా విభిన్న రూపాల్లో శక్తి ఆయా ప్రాణుల్లో ఆవహించి ఉండి, సమయానుగుణంగా బహిర్గతమై కాలగతిని నడిపిస్తుంది. ఈ శక్తిని ప్రసన్నం చేసుకుని, జీవన పరమార్థాన్ని పొందటానికి చేసే ఉత్సవాలే దసరా లేక నవరాత్రి ఉత్సవాలు. జగన్మాత ఆరాధన ఫలితంగా మనలోని శక్తిచైతన్యం ఉద్దీపితం కావటమే దసరా ఉత్సవాల నుంచి మనకు అందే తొలి విజయం.

విద్యావిజయం

మనిషికి నీరు, ఆహారం వంటి ప్రాథమిక అవసరాలతో పాటు మరొక ఆవశ్యకమైన అంశం 'విద్య'. విద్య మనిషిని మనీషిగా చేస్తుంది. మంచి, చెడుల విచక్షణా జ్ఞానాన్ని అందిస్తుంది. తన కర్తవ్యం ఏమిటో, అందుకు తాను అనుసరించాల్సిన మార్గం ఏమిటో విద్య ద్వారా మనిషికి అవగాహనకు వస్తుంది. ఈ విద్య మనిషికి అందాలంటే సరస్వతీ మాత అనుగ్రహం కావాలి. అన్ని విద్యలూ సరస్వతీ స్వరూపాలే. నవరాత్రి ఉత్సవాల్లో మూలా నక్షత్రం రోజున జగన్మాతను సరస్వతీ రూపంలో ఆరాధించటం వెనుక ఉన్న అంతరార్థం ఇదే. పుట్టుకతో మాత్రమే మనిషిగా ఉన్న వ్యక్తికి విద్యద్వారా పునర్జన్మ ఇచ్చే తల్లి సరస్వతీదేవి. ఈమె విద్యాధిదేవత. వేదమాత. జ్ఞానదాత్రి. ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులు ఈమె అనుగ్రహం ద్వారా లభిస్తాయి. అజ్ఞానం వల్ల ఏర్పడే చీకటిని, సత్యమైన జ్ఞాన ప్రకాశం వల్ల తొలగించేలాగా ఈ తల్లి వరమిస్తుంది. అందుకనే 'సత్యానంద రూపా...'; 'సత్యానంద స్వరూపిణీ...' అని నామావళిలో ఈ తల్లిని ఆరాధించటం జరుగుతుంది. నవరాత్రి ఉత్సవాల ద్వారా మనకు కలిగే రెండో విజయం ఇది. 

శత్రువిజయం

శత్రువులంటే బాహ్యంగా మనకు కనిపించి, మనతో శత్రుభావాన్ని ప్రకటించే వ్యక్తులు కొందరైతే, మనలోనే ఉంటూ మనకి దుర్భిద్ధి కలిగించి, మన కర్తవ్యాన్ని దారి మళ్ళించే శత్రువులు కొందరు ఉంటారు. వీరినే అంతశ్శత్రువులు అంటారు. జగదంబ ఆరాధన బాహ్యశత్రువులతో పాటు అంతశ్శత్రువుల బాధను కూడా తొలగిస్తుంది. ఎలాగంటే... నవరాత్రుల్లో చేసే అర్చనాది విధానాల్లో శమీపూజ ఒకటి. ఇది విజయప్రదాయిని. శమీ వృక్షపూజ పాపాలనునశింపజేసి, విజయాలను కటాక్షిస్తుంది. అర్జునుని గాండీవాన్ని ధరించి అతనికి విజయుడు అనే నామాన్ని సుస్థిరం చేసింది. జానకితో జగదభిరాముడిని కలిపి లోకానికి మేలు కూర్చింది. అలాగే, అమ్మకు చేసే అర్చన, ఆరాధనల ఫలితంగా మనలోని దుర్గుణాలు నశిస్తాయి. 

జ్ఞాన విజయం

నవరాత్రి ఉత్సవాలు శరత్కాలంలో వస్తాయి. అందుకే ఇవి శరన్నవరాత్రులు అయ్యాయి. శరత్కాలానికి మన వాజ్ఞ్మయంలో విశేష ప్రాధాన్యం ఉంది. అమ్మకు శారద అనే నామం ఉంది. 'శరదిదిభవా శారదా'... శరత్కాలంలో ఉద్భవించిన తల్లి శారద అయ్యింది. ఈ శారద జ్ఞానప్రదాయిని. ప్రకృతిని పరిశీలిస్తే శరత్కాలం రాగానే నదుల్లోని మాలిన్యాలన్నీ తొలగిపోతాయి. తద్వారా నదీజలాలు సేవించటానికి అనువుగా మారతాయి. అలాగే, శక్తి ఉపాసన ద్వారా మనసులోని మాలిన్యాలు తొలగి జ్ఞానోదయం కావటమే శరన్నవరాత్రుల పరమార్థం. మనకు కలిగే విజయం కూడా. 

ప్రాణ విజయం

నవరాత్రులనే పదానికి విశేషమైన అర్థాలు ఉన్నాయి. రాత్రి అంటే తిథి అనే అర్థం ఉంది. అశ్వయుజ  శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు జరిగే ఉత్సవాలే నవరాత్రి ఉత్సవాలు. మరొక అర్థంలో రాత్రి శబ్దం ప్రాణవాచకం. నవరాత్రులంటే తొమ్మిది ప్రాణాలు. ఈ తొమ్మిది ప్రాణాల్లో ప్రతిష్ఠితమై ఉండి, వాటిని కాపాడే ప్రాణదేవతయే పదో ప్రాణం. ఆమే పరాదేవత. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనుంజయ అనేవి తొమ్మిది ప్రాణాలు. ముఖ్య ప్రాణదేవత పరాదేవి. మిగిలిన తొమ్మిది ప్రాణాలు ఈ ముఖ్య ప్రాణదేవత యొక్క అవతారాలు. నవరాత్రి వ్రతం ద్వారా ప్రాణశక్తి స్వరూపంగా అమ్మను ఉపాసన చేసినట్లయితే మనలో ఉన్న ప్రాణశక్తి చైతన్యవంతం అవుతుంది. నారద పాంచరాత్రం అనే గ్రంథం ప్రకారం రాత్రి అనే పదానికి జ్ఞానాన్నిచ్చే దైవం అనే అర్థం ఉంది. మరికొన్ని ప్రాచీన గ్రంథాల్లో రాత్రి అనే శబ్దానికి పరమేశ్వరి అనే అర్థం ఉంది. ఈ అర్థాలన్నిటినీ సమన్వయం చేస్తే, వ్యక్తిలోని ప్రాణశక్తిని చైతన్యవంతం చెయ్యటం నవరాత్రి ఉత్సవాల లక్ష్యంగా కనిపిస్తుంది. ఏ భక్తుడైతే ఈ లక్ష్యాన్ని చేరుకుంటాడో, అతడు ప్రాణశక్తిని విజయఫలితంగా అందుకున్నట్లవుతుంది. 

సిద్ధ విజయం

అమ్మను ఆరాధిస్తూ చేసే నవరాత్రి వ్రతం అనేక సిద్ధుల్ని కలిగిస్తుంది. సిద్ధులు అంటే మంత్ర, తంత్రాలనే భావన కాదు. మనోనిశ్చలత, లక్ష్యసాధన కూడా సిద్ధులే. కోరికలు తీరటమే సిద్ధత్వం. జగన్మాత ఆరాధన మనకు అన్ని కోరికలు తీరుస్తుంది. తనను నమ్ముకున్న భక్తుల సకల అభీష్టాలు నెరవేర్చటమే జగజ్జనని నిర్వహించే ప్రధాన క్రియ. దేవీభాగవతం ప్రకారం శైలపుత్రి, బ్రహ్మచారిణి, స్కందమాత, చంద్రఘంట, కూష్మాండ, కాత్యాయని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిద అనేవి నవదుర్గా రూపాలు. వీటిల్లో సిద్ధిద రూపంలో అమ్మను ఉపాసన చేస్తే అష్టసిద్ధులతో పాటు మోక్షసిద్ధి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. సకల లౌకిక, అలౌకిక సిద్ధులకు ఈ తల్లి అధిష్టాన దేవత. నవరాత్రి వ్రతం ద్వారా అమ్మను సిద్ధిద రూపంలో అర్చించినట్లయితే సకల సిద్ధులూ వరంగా లభిస్తాయి. ఇదే సిద్ధ విజయం.

ఆరోగ్య విజయం

ప్రకృతి నియమాలను అనుసరించి శరత్కాలం సంధికాలం. ఈ కాలం ప్రజలకు అనారోగ్యాన్ని కలిగించి వారి ప్రాణాలను సంహరించే శక్తి కలిగి ఉంటుంది. ఈ బాధలకు లోను కాకుండా ఉండటానికి జగన్మాతను వేడుకుంటూ చేసే అర్చనా విధానమే నవరాత్రి వ్రతం. సర్వవ్యాధి ప్రశమనీ..., సర్వమృత్యు ప్రశమనీ.. అనే నామాలతో అమ్మను అర్చించటంలోని అంతరార్థం ఇదే. ఎప్పుడైతే శారీరక శక్తి విశేషంగా ఉంటుందో అప్పుడు మానసిక శక్తి జాగృతమవుతుంది. ఇలా జాగృతమైన మానసిక శక్తి అర్చనాది ఉపాసనల ద్వారా మరింత ఉన్నత స్థితిని పొంది, అధ్యాత్మికశక్తిగా మారుతుంది. అంతిమంగా సాధకుడు శక్తిమంతుడవుతాడు. 'ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనస్సు' ఉంటుందని స్వామి వివేకానంద చెప్పినట్లు శారీరక ఆరోగ్యం, దాని ఫలితంగా మానసిక ఆరోగ్యం జగన్మాత ఆరాధన వల్ల కలుగుతాయి. ఇవే ఆరోగ్యవిజయాలు.

ఇలా మరెన్నో విజయాలు అమ్మ ఆరాధన ద్వారా కలుగుతాయి. జగన్మాతను సేవించటానికి ఉత్తమమైన కాలం నవరాత్రి ఉత్సవాలు. ఈ ఉత్సవాల్లో చేసే ప్రతి అర్చన, ఆరాధనకు అంతులేని విజయాల్ని అందిస్తాయి. అందుకే నవరాత్రి ఉత్సవాలు విజయోత్సవాలుగా అందరినీ కర్తవ్య దీక్షాబద్ధుల్ని చేస్తున్నాయి. 

-------------------------------

రచన

డాక్టర్‌ కె.రామకృష్ణ, ఆంధ్రోపన్యాసకులు, ఎస్‌.ఆర్‌.ఎస్‌.వి.కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, 

గాంధీనగర్‌, విజయవాడ -3, సెల్‌: 90320 44115 / 8897 547 548 


ధర్మమూర్తి... సమదర్శి.... జగద్గురు కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి

  ధర్మమూర్తి... సమదర్శి ఆయన పేరు పలికితేనే చాలు... వ్యక్తం చేయటానికి మాటలు చాలని అనుభూతి కలుగుతుంది. ఆ కళ్ళలోని వెలుగు ఏదో తెలియని కారుణ్యాన...