శ్రీమంతులవ్వండి. ...
ఆమె ఐశ్వర్యానికి ప్రతీక.
లక్ష్మి అంటే మనం రోజువారీ వ్యవహారంలో ఉపయోగించే డబ్బు మాత్రమే కాదు. ఆనందం, ఆత్మసంతృప్తి, చక్కటి సంతానం, సంస్కారం, చదువు... ఇవన్నీ లక్ష్మీరూపాలే. ఆ తల్లి అనుక్షణం కొలువుండే ప్రాంతాలే. మనిషి జీవితం సాఫీగా గడవాలన్నా, జీవించామన్న సంతృప్తి కలగాలన్నా, తలపెట్టిన పని విజయవంతం కావాలన్నా అందుకు లక్ష్మీ అనుగ్రహం తప్పనిసరి. అందుకే చెట్టు పుట్టా, రాయి రప్పా అన్నిటిలోనూ లక్ష్మీదేవిని చూశారు మన పూర్వికులు. అపారమైన ప్రకృతి అంతా లక్ష్మీ స్వరూపమే.
కేవలం డబ్బు మాత్రమే అన్ని సుఖాలు ఇవ్వలేదు. అన్ని పనులూ సాధించలేదు. ధనం లేకపోయినా నిండు నూరేళ్లు తృప్తిగా జీవించే వ్యక్తులు ఎందరో ఉన్నారు. నిజమైన ఆనంద లక్ష్మి వారి దగ్గర ఉంది. కోట్లు గడించిన బిక్కు బిక్కుమంటూ ప్రతి క్షణాన్ని భయంభయంగా గడిపేవారూ ఉన్నారు. ధైర్యలక్ష్మి వారి దగ్గర లేదు. అందుకే లక్ష్మిని ఆరాధించాలి. ఆ తల్లి అనుగ్రహం కోసం తపించాలి. ఆమెను ఆహ్వానించాలి.
తనను కావాలని కోరుకునే వ్యక్తుల దగ్గర, శుచి శుభ్రత ఉన్నచోట మాత్రమే తాను ఉంటానని స్వయంగా లక్ష్మీదేవి చెప్పినట్లు శాస్త్రాలు ప్రకటిస్తున్నాయి. మర్యాద, మన్నన, ఆచారం, సంప్రదాయం... ఇవంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అందుకే మనవైన ఆచార సంప్రదాయాల్ని, శాస్త్రం చెప్పిన ధర్మాల్ని తప్పక పాటించాలి. అటువంటి చోట లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది.
మన ఇళ్లలో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే ఏం చెయ్యాలో శాస్త్రాలు కొన్ని విషయాలు వివరించాయి. అవేమిటంటే...
• సింహ ద్వారం గడప దగ్గర చెప్పులు చిందర వందరగా పదేయకూడదు. గడప లక్ష్మి స్వరూపం కనుక గడప తొక్కి ఇంట్లోకి రావడం, గడప మీద కాలు వేయడం, గడపకు అటు ఇటు చెరో కాలు వేసి నుంచోవడం వంటి పనులు చేయరాదు. పసుపు, కుంకుమ ఉన్న గడపలు లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతాయి. అందువల్ల నిత్యం గడపలను పసుపు, కుంకుమతో అలంకరించాలి.
• ముగ్గు వేసిన వాకిలి గుండా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అందుకే తెల్లవారు జామునే వాకిలి ఊడ్చి ముగ్గులు పెట్టాలి. అందమైన ముగ్గు, శుభ్రమైన వాకిలి లక్ష్మికి స్వాగతం పలుకుతాయి.
• ఇంటి ఇల్లాలు గట్టిగ గొంతు పెట్టి మాట్లాడడం, నట్టింట్లో చెడు మాటలు, చెడు తిట్లు తిట్టడం వంటివి చేయకూడదు. ఎక్కడైతే భార్య భర్తలు నిరంతరం తగవులాడుకుంటారో, ఏ ఇంట్లో ఇల్లాలు ఎప్పుడూ అసంతృప్తి గా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మి దేవి ప్రవెశించదు.
• అబద్ధాలు చెప్పేవాళ్ళు, ఇరు సంధ్యలలో భుజించేవారు, నిద్రించే వారు, బద్ధకస్తులు ఎక్కడ ఉంటారో అక్కడ లక్ష్మి దేవి ఉండదు.
• ఉదయం, సాయంత్రం సంధ్యల్లో తప్పనిసరిగా దీపం వెలిగించాలి. ఇంట్లోని దేవతామందిరంలో, ప్రధాన ద్వారం వద్ద తప్పనిసరిగా సంధ్యదీపం పెట్టాలి. ఇలాంటి ఇళ్లలో లక్ష్మి శాశ్వతంగా నివాసం ఉంటుంది.
• అతిగా మాట్లాడే వారు, గురువులను, పెద్దలను అగౌరవ పరిచేవారు, జూదరులు, అతి నిద్రాలోలురు, అపరిశుభ్రంగా ఉండే వారు ఉన్న చోట లక్ష్మిదేవి ఉండదు.
• చిల్లర పైసలు, అన్నం, పువ్వులను నిర్లక్ష్యంగా పడేసేవారి దగ్గర లక్ష్మి చేరదు.
• శంఖధ్వని వినిపించని చోట, తులసిని పూజించని చోట, దేవతలను అర్చించని చోట, బ్రహ్మవేత్తలు , అతిథులకు భోజన సత్కారాలు జరగని చోట లక్ష్మీదేవి నివసించదు.
• భక్తులను హింసించేవారు, నిందించేవారు ఉన్నచోట కూడా లక్ష్మీదేవి నివాసం ఉండదు.
లక్ష్మీ నివాస స్థానాలు
మహాలక్ష్మి నివసించే స్థానాలు మొత్తం 96 అని శాస్త్రాలు చెబుతున్నాయి. వీటిలో ముఖ్యమైనవి... పసుపు, కుంకుమ, బంగారం, రత్నాలు, ఆభరణాలు, ముత్యాలు, శుభ్రమైన తెల్లని వస్త్రాలు, వెండి, రాగి, ఇత్తడి కళశాలు, ఆవు పేడ, ఆవు పృష్ట స్థానం, ఆవు కొమ్ముల మధ్యన, పూజా మందిరం, పవిత్రమైన మనస్సు, దర్భలు, మహానుభావులు, యోగులు, మునులు, ఋషులు, ఉత్తమమైన రాజు, సదాచార బ్రాహ్మణుడు .
శ్రీసూక్తంలో లక్ష్మీదేవి నివాస స్థానాలేమిటో వివరించే మంత్రాలు ఉన్నాయి. వీటిలోని 16వ మంత్రం... ‘యః శుచిః ప్రయతో భూత్వా జుహుయాదాజ్యమన్వహం శ్రియః పంచదశశ్చంచ శ్రీకామస్సతతం జపేత్...’ లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే శుభ్రత పాటిస్తూ, ఆ దేవి 15 మంత్రాలను నిత్యం పారాయణం చెయ్యాలని ఈ మంత్రానికి భావం. ఎక్కడ శుచిత్వం ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని ఈ మంత్రం ద్వారా తెలుస్తోంది. లక్ష్మి అంటే లౌకిక వ్యవహారాల్లో ఉపయోగించే ధనం మాత్రమే కాదు. ఆరోగ్యం కూడా ధనమే. అందుకే మన పెద్దలు ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నారు.
విశ్వమంతా లక్ష్మీ స్వరూపం
ప్రతి స్త్రీలోనూ లక్ష్మీకళ ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకనే స్త్రీలను లక్ష్మీస్వరూపంగా ఆరాధించటం, అర్చించటం మన సంప్రదాయంలో ఒక భాగంగా ఉంటుంది. ఏ పనికైనా మహిళే ఆదిశక్తి. ఆమెదే ఉన్నతస్థానం. అందరి మాటలు ఓర్పుగా వింటుంది. ఇతరులతో పనులు చేయిస్తుంది. తాను స్వయంగా చేస్తుంది. గుణాల చేత వ్యాపిస్తుంది. దోషాలు తొలగిస్తుంది. అందుకే స్త్రీ రూపంలో లక్ష్మికి మన సంస్కృతి సమున్నత స్థానాన్ని ఇచ్చింది. అనంతవిశ్వాన్ని 'లక్షించేది' లక్ష్మి. అందరూ లక్షించేది లక్ష్మిని. 'లక్షించటం' అంటే చూడటమని అర్థం అందరినీ తన కరుణామృతపూర్ణమైన చల్లని చూపులతో 'కనిపెట్టుకుని', గమనించి, పాలించే శక్తిని లక్ష్మిగా చెప్పుకోవచ్చు. సర్వసాక్షియైన ఈ భగవద్దర్శన శక్తిని లక్ష్మిగా ఉపాసించటం లక్ష్మీ ఆరాధనలోని ప్రత్యేకత. అందరూ ఆనందాన్నీ, ఐశ్వర్యాన్నీ, జ్ఞానాన్ని, 'లక్ష్యం'గా పెట్టుకొనే జీవిస్తారు. ఇలా అందరికీ లక్ష్యమైన జ్ఞాన ఆనంద, ఐశ్వర్యాల సాకార రూపమే 'లక్ష్మి’.
కోర్కెలు తీర్చే వరలక్ష్మి
ప్రతి వ్యక్తికీ అనేక కోరికలు ఉంటాయి. ఇవన్నీ తీరాలన్నా లేదా కనీసం ఒక్క కోరిక తీరాలన్నా దైవానుగ్రహం తప్పనిసరి. అయితే కోరిక ఏదైనప్పటికీ, ఇచ్చే దైవం ఎవరైనప్పటికీ అంతిమంగా ఆ కోరికల్లో ఉండేది లేదా ఆ కోరికల ద్వారా అందుకునేది ఆనందం, తృప్తి మాత్రమే. ఈ విధమైన సంతృప్తి పొందిన వ్యక్తి మాత్రమే నిజమైన భాగ్యవంతుడు. అటువంటి భాగ్యాన్ని (లక్ష్మిని) అందించేది వరలక్ష్మీదేవి. వరాల రూపంలో సౌభాగ్యాన్ని భక్తులకు అనుగ్రహించే మాత 'వరలక్ష్మీదేవి. 'వర' అంటే 'కోరుకున్నది’, ‘శ్రేష్టమైన' అనే అర్థాలు ఉన్నాయి. ఈ అర్థాలను అన్వయం చేస్తే కోరిన కోర్కెలు లేదా శ్రేష్టమైన కోర్కెలు ఇచ్చే తల్లిగా వరలక్ష్మీదేవిని భావించవచ్చు. ఈ దేవిని సమంత్రకంగా, భక్తి భావనతో కొలిచే వ్రతమే 'వరలక్ష్మీవ్రతం
స్కాంద పురాణంలో వరలక్ష్మీ వ్రతం గురించిన వివరణ ఉంది. స్వయంగా పరమేశ్వరుడే పార్వతికి ఈ వ్రతం గురించి చెబుతాడు. అదే సందర్భంలో మహాభక్తురాలైన చారుమతీదేవి వృత్తాంతాన్ని కూడా పరమేశ్వరుడు పార్వతికి వివరిస్తాడు. భర్త పట్ల ఆదరాన్నీ, అత్తమామల పట్ల గౌరవాన్ని ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉండేది. మహాలక్ష్మీదేవి పట్ల ఎంతో భక్తిశ్రద్ధలతో కలిగిన చారుమతి అమ్మవారిని త్రికరణ శుద్ధిగా పూజిస్తుండేది. ఆ మహాపతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి, స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరిస్తుంది. శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజున తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని ఆమెకు అభయమిస్తుంది. అమ్మ ఆదేశానుసారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించిన చారుమతి సమస్త సిరి సంపదల్ని వరలక్ష్మీ వ్రత ప్రసాదంగా అందుకుంటుంది.
అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి, ఈ వ్రతానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ ప్రాంతాన్ని శ్రావణమాసంలో ఆచరిస్తారు. శ్రావణమాసంలో శ్రవణ నక్షత్రం రోజున పూర్ణిమ వస్తుంది. శ్రవణం శ్రీనివాసుడి జన్మ నక్షత్రం. పూర్ణిమ రోజున అమ్మవారు షోడశకళలతో వెలుగొందుతుంది. శుక్రవారం అమ్మకు ప్రీతిపాత్రమైన వారం. వీటన్నిటినీ సమన్వయం చేస్తే పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం చెయ్యటం లక్ష్మీ శ్రీనివాసుల అనుగ్రహం పొందటానికి తొలిసోపానంగా చెప్పుకోవచ్చు. సకల సౌభాగ్యాలు కలగాలని, నిత్య సుమంగళిగా తాము జీవితకాలం ఉండాలని కోరుకుంటా దేశవ్యాప్తంగా మహిళలు ఈ వ్రతాన్ని చేస్తారు దేశ, కాల, ప్రాంత, ఆచారభేదాలు ఉన్నప్పటికీ అందరి అంతరంగంలో కొలువై ఉన్న మాత ఒక్కరే. ఆమె అందరినీ అనుగ్రహించే తీరు ఒక్కటే.
పంచభూతాలకు ప్రతీక
వరలక్ష్మీ వ్రతంలో భాగంగా కలశాన్ని స్థాపించి పూజించాలి. కలశం అమ్మవారికి ప్రతిరూపం. మట్టిపాత్ర లేదా శక్తిని బట్టి వెండి, బంగారు, రాగి, పంచలోహపాత్రలను కలశం కోసం ఉపయోగించవవచ్చు. కలశం కోసం ఉపయోగించేది ఏ లోహమైనా అది పృథ్వీ తత్త్వానికి సంకేతం అందులో పోసే నీరు జల తత్త్వానికి సంకేతం. కలశాన్ని సగం మాత్రమే నీటితో నింపుతారు. మిగిలిన శూన్యస్థితి ఆకాశతత్త్వానికి సంకేతం. మనం చదివే మంత్రం వాయుజనితం. కనుక అది వాయుతత్త్వానికి సంకేతంగా ఉంటుంది. కలశం ముందు ఉంచే దీపం అగ్ని తత్త్వానికి సంకేతం. ఈవిధంగా పంచభూతాలకు ప్రతీకగా ఆయా వస్తువులను ఉంచి పంచభూతాల్లోనూ వ్యాపించి ఉండే పరతత్త్వం, శక్తి స్వరూపమైన అమ్మను ఆరాధించటం కలశారాధనలోని అంతరార్థం.