Saturday, November 6, 2021
దసరా ఆయుధ పూజ రహస్యాలు, అంతరార్థాలు
Thursday, November 4, 2021
రుద్రాభిషేక వైభవం (రుద్రాభిషేక నియమాలు, విధానాలు, ఫలితాలు)
శ్రీరామ
రుద్రాభిషేక వైభవం
ఈశ్వరా! అని భక్తితో గొంతెత్తి పిలిచినంతలోనే
భక్తులను కటాక్షించే పరమ కారుణ్యమూర్తి పరమేశ్వరుడు. కేవలం చెంబుడు గంగతో అభిషేకం
చేసినంతనే అక్షయ పుణ్యాన్ని ప్రసాదించే బోళామూర్తి ఈశ్వరుడు. అనంతమైన
కాలస్వరూపుడైనా చేరవచ్చిన అందరినీ ఆదరించే పరమ దయాళువు రుద్రుడు. ఇంతటి సర్వోన్నత
దైవాన్ని పూజించి, తరించటానికి సకల శాస్త్రాలు, ఆగమాలు నిర్దేశిస్తున్న అర్చనావిధానం ‘రుద్రాభిషేకం’.
శివునికి అభిషేకం చేయటానికి సర్వసాధారణంగా
వినియోగించే మంత్రాలు నమక, చమకాలు. శ్రీకృష్ణ యజుర్వేదంలో అంతర్భాగంగా ఉండే
నమక, చమకాలను కలిపి సాధారణ పరిభాషలో ‘రుద్రాధ్యాయం’ అనీ, ‘రుద్రం’ అనీ వ్యవహరిస్తుంటారు. ఈ మంత్రాలతో శివునికి
చేసే అభిషేకం అనంతమైన పుణ్యఫలితాన్ని అందిస్తుంది.
యం యం కామయతే మర్త్యో లింగార్చన పరాయణః ।
తం తమాప్నోతి విప్రేంద్ర మత్ప్రసాదాన్నసంశయః ॥
లింగార్చన చేసే భక్తుడు తన మనసులో ఏయే కోరికలు
తీరాలని భావిస్తున్నాడో, అవన్నీ నా అనుగ్రహం వల్ల తప్పక నెరవేరుతాయని
సాక్షాత్తు పరమేశ్వరుడే చెప్పినట్లు శైవాగమాలు ప్రకటిస్తున్నాయి.
లింగార్చన లేదా రుద్రాభిషేకం వల్ల కలిగే ఫలితం
అనంతం అనీ, ఎప్పటికీ నశించదనీ శాస్త్రాలు ఘోషిస్తున్నాయి.
యజ్ఞ, యాగ, దాన, తపస్సుల వల్ల కలిగే ఫలితం కేవలం రుద్రాభిషేకం
వల్ల కలుగుతుంది. అయితే, కోరికను అనుసరించి, కొన్ని ఆచారవిధానాలను శాస్త్రాలు నిర్దేశిస్తున్నాయి. వీటితోపాటు రుద్రాభిషేకం
ఏయే సమయాల్లో చేయాలి? ఎలా చేయాలి?
ఎటువంటి లింగాన్ని
అర్చించాలి? ఇందుకు అనుసరించాల్సిన విధానాలేమిటి? మొదలైన విషయాలను కూడా ఆగమాలు విస్పష్టంగా పేర్కొంటున్నాయి.
శివాభిషేక నియమాలు
రుద్రాభిషేకాన్ని తప్పనిసరిగా శైవాగమాన్ని
అనుసరించే చేయాలని సాక్షాత్తు ఆదిశంకరులు చెప్పారు. ‘సిద్ధాంత సారావళి’ కూడా ఇదే విషయాన్ని ప్రకటిస్తోంది.
అష్టాదశాసు విద్యాసు మీమాంసాపి గరీయసి
తతోపి తర్కశాస్త్రాణి పురాణం తేభ్య ఏవ చ
తతోపి ధర్మశాస్త్రాణి తేభ్యో
గుర్వీశ్రుతిర్ద్విజా
తతోప్యుషనిషచ్ఛ్రేష్ఠస్తత శ్శైవాగమోధికః ॥
అష్టాదశ విద్యల్లో మీమాంస, మీమాంస కంటే తర్కం, తర్కం కంటే పురాణాలు, పురాణాల కంటే ధర్మశాస్త్రం, ధర్మశాస్త్రాల కంటే వేదాలు, వేదాల కంటే ఉపనిషత్తులూ, ఉపనిషత్తుల కంటే శైవాగమాలు గొప్పవి. వీటినే
వేదాగమాలని కూడా అంటారు. ఈశ్వరప్రోక్తం కావటం వల్ల కారణాగమం, కామికాగమం వంటి శైవాగమాలు చాలా గొప్పవి. కాబట్టి, శైవాగమాలు చెప్పిన పద్ధతుల్లో రుద్రాభిషేకం చేయాలి.
·
తడివస్త్రాలు ధరించి అభిషేకం చేయకూడదు. భుజం మీద కూడా తడివ్రస్తం ధరించకూడదు.
·
అభిషేక సమయంలో పూర్తిగా మౌనాన్ని పాటించి,
చిత్తాన్ని పరమేశ్వరుని
మీదనే లగ్నం చేయాలి.
·
కాళ్ళు చాపుకుని కూర్చొనటం, ఇతరులతో సంభాషించటం, స్త్రీలతో సరస సంభాషణ, తర్కించటం,
అసత్య సంభాషణ పనికిరాదు.
·
పరనింద, పరస్తుతి చేయకూడదు.
·
గట్టిగా మాట్లాడకూడదు. విచారవదనంతో ఉండకూడదు.
·
అభిషేక సమయంలో యజమాని దీర్ఘరోగుల్ని, కుక్కల వంటి జంతువులను చూడకూడదు. స్పృశించకూడదు.
ప్రమాదవశాత్తు చూసినట్లయితే 108 సార్లు ఓంకారాన్ని జపించి, కుడిచేతితో కుడిచెవిని స్పృశించాలి.
·
భస్మధారణ చేయకుండా అభిషేకం చేయకూడదు.
·
అభిషేకానికి ముహూర్త నిర్ణయం అవసరం లేదు. వర్జ్యదోషాలు ఉండవు.
·
శివలింగ పీఠం మీద పూజాద్రవ్యాలు, గంధపాత్రలు,
బెల్లం ముక్క, కొబ్బరిచెక్క మొదలైన పదార్థాలు ఉంచకూడదు.
·
అభిషేక సమయంలో తుమ్మటం, దగ్గటం, ఉమ్మివేయటం,
అసత్యం పలకటం చేయకూడదు.
నియమభంగం జరిగితే యజయాని ఆచమనం చేసి, కుడిచేతితో కుడిచెవిని స్పృశించాలి.
·
సంకల్పం చేయటానికి ముందు, అభిషేక సమయంలో, ఆ ధూప, దీప, నీరాజన సమయాల్లో తప్పనిసరిగా గంట మోగించాలి.
ఘంటానాదం చేయకుండా చేసే అభిషేకం ఫలితాన్ని ఇవ్వదు.
రుద్రాభిషేక విధి
1.
వారం: నమకంలో మొత్తం 11 అనువాకాలు ఉంటాయి. ఒకసారి నమకంలోని 11 అనువాకాలు చెప్పి, చమకంలో ఒక అనువాకం (చమకంలో కూడా 11 అనువాకాలు ఉంటాయి) చొప్పున వరుసగా చెప్పాలి.
ఈవిధంగా 11 సార్లు నమకం చెబితే, చమకంలోని 11 అనువాకాలు చెప్పటం పూర్తవుతుంది. ఇలా చేసిన
అభిషేకానికి ‘వారం’ అని పేరు.
2.
ఆవృత్తి: నమకం 121 సార్లు, చమకం 11 సార్లు. పృథివీ రూపధారి అయిన రుద్రప్రీతి
కలుగుతుంది. సర్వపాపాలు తొలగుతాయి. జలరూపధారి అయిన శివప్రీతి కలుగుతుంది. ఫలితంగా
సకల సుఖాలు లభిస్తాయి.
3.
రుద్రం: నమకం 1,331 సార్లు, చమకం 121 సార్లు. తేజోరూపధారి అయిన శంకరుని ప్రీతి
కలుగుతుంది. ఫలితంగా సర్వ సంపదలు కలుగుతాయి.
4.
ఏకాదశ రుద్రం: నమకం 14,641 సార్లు, చమకం 1,331 సార్లు. వాయురూపధారి అయిన పరమేశ్వరునికి ప్రీతి
కలిగి, తద్వారా లక్ష్మీకటాక్షం కలుగుతుంది.
5.
శతరుద్రం: నమకం 1,61,051 సార్లు, చమకం 14,641 సార్లు. ఆకాశరూపధారి అయిన మహేశ్వరునికి ప్రీతి
కలుగుతుంది. ఫలితంగా పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుంది.
6.
లఘురుద్రం: నమకం 17,71,561 సార్లు, చమకం 1,61,051 సార్లు. సూర్యరూపధారి అయిన ఈశ్వరప్రీతి
కలుగుతుంది. పునర్జన్మ నివృత్తి అవుతుంది.
7.
మహారుద్రం: నమకం 194,87,171 సార్లు, చమకం 17,71,561 సార్లు. చంద్రరూపధారి అయిన రుద్రునికి ప్రీతి
కలుగుతుంది. జ్ఞానవృద్ధి కలుగుతుంది.
8.
అతిరుద్రం: నమకం 21,43,58,881 సార్లు, చమకం 194,87,171 సార్లు. సర్వరూపి అయిన పరమేశ్వరునికి ప్రీతి
కలుగుతుంది. ఫలితంగా చెప్పటానికి అలవికాని మహాఫలితాన్ని యజమాని పరమేశ్వర
వరప్రసాదంగా అందుకుంటాడు.
శ్రావణ కార్తిక మాసాల్లో, విశేషంగా మాఘమాసంలో ఏదైనా పవిత్ర పుణ్యక్షేత్రంలో, నదీతీరంలోగాని, పర్వత ఉపరిభాగంలో కానీ, పశ్చిమాభిముఖ ద్వారం ఉన్న శివాలయంలోని గానీ యజమాని 11 మంది బ్రాహ్మణులను ఏర్పాటుచేసుకుని రుద్రాభిషేకం చేస్తే తప్పకుండా ముక్తి
కలుగుతుంది.
యజమాని తన అభీష్టాన్ని, శక్తిని అనుసరించి వీటిల్లో ఏదో ఒక విధానాన్ని ఎంచుకుని, రుద్రాభిషేకం చేయాలి.
శివాభిషేక ఫలితాలు
·
భస్మాన్ని ధరించి, భస్మశయ్యపై పడుకుని, నిశ్చలబుద్ధితో రుద్రాన్ని పారాయణ చేస్తే పంచమహాపాతకాలు కూడా పటాపంచలు
అవుతాయని పరాశరస్మృతి చెబుతోంది.
·
సురాపానం, బ్రహ్మహత్య వంటి పాపాలు కూడా రుద్రాభిషేకం వల్ల
తొలగటంతో పాటు సంసారబంధాల నుంచి విముక్తి కలుగుతుంది.
·
రుద్రాధ్యాయాన్ని పారాయణ చేయటం వల్ల రహస్యంగా చేసిన పాపాల నుంచి కూడా విముక్తి
కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.
·
ఎటువంటి మమకారం లేకుండా, ఫలాపేక్ష రహితంగా రుద్రాధ్యాయాన్ని పారాయణ
చేస్తే సశరీరంగా కైలాసగమన సిద్ధి కలుగుతుందని వాయుపురాణం చెబుతోంది.
·
దుస్స్వప్నం వల్ల కలిగే దోషం, గ్రహదోషాల నివారణకు రుద్రాధ్యాయాన్ని పారాయణ
చేయాలని లింగపురాణంలో ఉంది.
·
రుద్రాభిషేకంతో పాటు రుద్రపారాయణ చేయటం వల్ల సంతానహీనులకు సత్సంతానం
కలుగుతుందని ఆపస్తంబ సూత్రం చెబుతోంది.
·
శ్రేష్ఠమైన మృత్తిక (మట్టి), కస్తూరి రెండిటి మిశ్రమంతో నిర్మించిన లింగాన్ని
అభిషేకించి, పూజించినట్లయితే సంపదలు కలుగుతాయి.
·
మృత్తికతో శ్రీగంధం కలిపి తయారుచేసిన లింగాన్ని సశాస్త్రీయంగా 20 రోజులు పూజించి, అభిషేకం చేస్తే తాపజ్వరం నుంచి ఉపశమనం
కలుగుతుంది.
·
కస్తూరీ మిశ్రమంతో తయారుచేసిన మృణ్మయలింగాన్ని పదిరోజుల పాటు భక్తియుక్తంగా
పూజించి, అభిషేకాదులు నిర్వహిస్తే ఆత్మదోష జనితమైన
సర్వరోగాలు నశిస్తాయి.
·
చక్కెర కలిపి తయారుచేసిన మృణ్మయ లింగాన్ని మూడు నెలలపాటు సశాస్త్రీయంగా
పూజిస్తే, సభల్లో నేర్పుగా మాట్లాడే శక్తి, కవిత్వసిద్ధి కలుగుతాయి.
·
మృత్తికలో బియ్యపుపిండి కలిపి తయారుచేసిన లింగాన్ని మూడు నెలల పాటు
శాస్త్రవిధిగా అర్చించి, అభిషేకం చేస్తే పుత్రసంతానం కలుగుతుంది.
·
మృత్తికలో పసుపు కలిగి, 108 రోజుల పాటు శాస్త్రవిధిగా అభిషేకం చేస్తే
సర్వజనాకర్షకమైన రూపం, ఐశ్వర్యం కలుగుతాయి.
·
మృత్తికలో ఆవునెయ్యి కలిపి, లింగాన్ని తయారుచేసి, 50 రోజుల పాటు అభిషేకం చేస్తే పైత్యరోగం నివారణ అవుతుంది.
·
ఎర్రని గంధం కలిపి తయారుచేసిన మృత్తికాలింగానికి 32 రోజులు అభిషేకం చేస్తే దగ్గు, దమ్ము రోగాలు నివారణ అవుతాయి.
·
ఇనుపచూర్ణం, మృత్తిక కలిపి లింగాన్ని తయారుచేసి, 22 రాత్రులు శాస్త్రవిధిగా అభిషేకార్చన చేస్తే, శత్రునాశనం కలుగుతుంది.
·
నువ్వులు కలిపి తయారుచేసిన మృత్తికాలింగానికి ఏడురోజుల పాటు నిర్మలభక్తితో
అభిషేకం చేస్తే యమబాధలు నశిస్తాయి.
·
నిత్యం రుద్రాభిషేకం చేయటం వల్ల భూత, ప్రేత, పిశాచ, బ్రహ్మరాక్షస బాధలు నశిస్తాయి.
గృహేత్వేక గుణం ప్రోక్తం నదీతీరే సహస్రకం ।
దేవతాయతనేలక్షం శతలక్షం హరేర్గృహే ।
శివాలయే కోటి గుణం శివే స్వాయంభువే పునః ।
అనంతం పూజనం శంభోః ఋతం వచ్మిద్విజోత్తమ ॥
రుద్రాభిషేకం చేసే స్థలాన్ని బట్టి కూడా ఫలితం
ఉంటుంది. ఇంట్లో చేసే లింగార్చన వల్ల ఒకభాగం ఫలితం కలుగుతుంది. నదీతీరంలో చేస్తే
అందుకు వేయి రెట్లు ఎక్కువ ఫలితం వస్తుంది. దేవతానివాసాల్లో చేసే అభిషేకానికి లక్ష
రెట్లు ఎక్కువ ఫలితం, విష్ణ్వాలయంలో చేసే అభిషేకానికి నూరు లక్షల
రెట్లు ఎక్కువ ఫలితం, శివాలయాల్లో చేసే అభిషేకానికి కోటిరెట్లు, పర్వతగుహల్లో చేసే అభిషేకానికి పదికోట్ల రెట్లు, ఆ గుహ ఋష్యాశ్రమం కూడా
అయితే కోటికోట్ల రెట్లు ఎక్కువ ఫలితం కలుగుతుంది. బ్రహ్మక్షేత్రంలో (కాశీక్షేత్రం)
శివాభిషేకం చేస్తే అమితమైన ఫలితం లభిస్తుందని ఆగమాలు ప్రకటిస్తున్నాయి.
----------------------------
Tuesday, November 2, 2021
అర్థనారీశ్వర తత్త్వం
రచన : డాక్టర్ కప్పగంతు రామకృష్ణ
సెల్ : 90320 44115 / 8897 547 548
Monday, November 1, 2021
ఆ వెలుగులు... జీవితానికి జిలుగులు (దీపావళి దీపాల అంతరార్థం)
ఆ వెలుగులు... జీవితానికి జిలుగులు
పంచభూతాత్మకమైన సృష్టికి ప్రతీక దీపం. మట్టి ప్రమిద భూతత్వానికీ, తైలం జలతత్వానికీ, వత్తి ఆకాశతత్వానికీ, వెలగడానికి తోడ్పడే గాలి వాయుతత్వానికీ, జ్యోతి అగ్ని తత్వానికీ ప్రతీకలు. మనిషి శరీరమూ పంచభూతాల సమాహారమే కాబట్టి దీపాన్ని వెలిగించడమంటే మనల్ని మనం వెలిగించుకోవడమే. మనలోని అజ్ఞానపు అంధకారాల్ని నశింపజేసే ఆ పరమాత్మకు సమీపంగా వెళ్లడమే. దీపం దానంతట అది ఎలా వెలగలేదో మనిషీ పుట్టుకతో జ్ఞాని కాలేడు. అందుకే దేవుడి ముందు దీపాన్ని వెలిగించి ఆ వెలుగులో మన ఆత్మదీపాన్ని వెలిగించుకుంటాం. లోలోపలి చీకట్లను వదిలించుకుంటాం. దీపానికి ఉండే మరో ప్రత్యేకత... అది ఎప్పుడూ ఊర్ధ్వదృష్టినే కలిగి ఉండటం. దీపం నుంచి అజ్ఞానమనే చీకట్లను పారదోలడం నేర్చుకున్నట్లే మనస్సును అల్పవిషయాలవైపు మళ్లించకుండా ఊర్ధ్వదృష్టిని కలిగి ఉండటమూ నేర్చుకోవాల్సిన పాఠమే.
సృష్టి, స్థితి, లయలకు దీపంతో సన్నిహితమైన సంబంధం ఉంది. దీపం ప్రజ్వలించినప్పుడు వచ్చే ఆ కాంతిని త్రిమూర్తులకు ప్రతీకగా పూర్వ ఋషులు పేర్కొన్నారు. ఆ కాంతిలో అంతర్లీనంగా కనిపించే నీల వర్ణం స్థితికారుడైన విష్ణువుకు, తెల్ల రంగు లయకారుడైన శివునకు, ఎర్ర రంగు సృష్టికర్త బ్రహ్మకు సంకేతాలుగా అభివర్ణించారు. విద్య, శక్తి, సంపదలను ప్రసాదించే ముగ్గురమ్మలు సరస్వతి, దుర్గ, లక్ష్మి- ఆ కాంతిలో కొలువై ఉంటారని పెద్దలు అంటారు.
‘‘వైరాగ్య తైల సంపూర్ణే, భక్తి వర్తి సమన్వితే / ప్రబోధ పూర్ణపాత్రేతు జ్ఞానదీపం విలోక్యత్’’ అన్నారు ఋషులు. అంటే ‘ప్రబోధం’ అనే ప్రమిదలో, ‘వైరాగ్యం’ అనే తైలం పోసి, ‘భక్తి’ అనే వత్తిని వెలిగించి, జ్ఞానజ్యోతిని ప్రకాశింపజేయాలని అర్థం. ఆ జ్యోతి ప్రసరించే ప్రకాశాన్ని దర్శించి, వారు ముక్తి పొందారు.
ముక్తిని ప్రసాదించేవాడు పరమాత్మ. ఆ పరమాత్మకు సంకేతం జ్యోతి. ‘పరమాత్మే పరంజ్యోతి’ అని వేదం అంటోంది. పరమాత్మ యజ్ఞ స్వరూపుడు. యజ్ఞ చిహ్నాన్ని దీపంగా భావిస్తారు. జ్యోతి లేదా దీప ప్రజ్వలన అంటే యజ్ఞం చేయడమే! దీపావళి రోజున దీపాలను ప్రజ్వలింపజేసి, జగన్మాతకు ధారపోసి, భక్తి ప్రపత్తులను సమర్పించుకోవడమే దీపయజ్ఞం. ఆ దీపాలను ఇంటి ముంగిట, దైవీ వృక్షాల చెంత, ఇంటిలోని ద్వారాల దగ్గర వరుసలుగా పేర్చడం దీపయజ్ఞంలో భాగమే. దీప దర్శనం పాపాలను హరిస్తుంది. దీపకాంతి దేవతలకు అత్యంత ప్రీతికరం. అందుకనే ప్రతి పూజారంభానికీ, శుభకార్యాలకూ దీప ప్రజ్వలనం ముఖ్యం. లౌకికంగా చెప్పాలంటే, మన ‘హృదయా’న్ని ప్రమిదగా భావించి, అందులో ‘భకి’్త అనే తైలం పోసి, ‘ప్రేమ’ అనే వత్తి నిలిపి వెలిగించేదే దీపం.
దీపావళి పర్వాన్ని గురించి పురాణేతిహాసాలు విస్తృతంగా ప్రస్తావించాయి. రామాయణంలో రఘుకులాన్వయదీపునిగా రాముణ్ణి కీర్తిస్తూ, వనవాసానంతరం సీతారాముల పట్టాభిషేక సమయంలో అయోధ్యలో ప్రజలు దీపోత్సవం జరుపుకొన్నారట. కురుక్షేత్ర సంగ్రామానంతరం ధర్మరాజు విజయుడై పట్టాభిషేకం చేసుకున్న సందర్భంలో హస్తినాపుర ప్రజలు ఆనందోత్సాహాలతో దీపాలను వెలిగించి పండగ చేసుకున్నారని మహాభారతం చెబుతోంది. నచికేతుడు తన మేధస్సుతో యముడిని సంతృప్తిపరచి, ఆత్మను గురించి తెలుసుకున్నాడు. యముడి నుంచి స్వేచ్ఛ పొంది, నచికేతుడు తిరిగి భూలోకానికి వచ్చిన సందర్భంలో జరిగిన దీపోత్సవమే దీపావళి అని ‘కఠోపనిషత్తు’ కథనం. క్షీరసాగర మథన సమయంలో అవతరించిన శ్రీమహాలక్ష్మికి దీపాలను వెలిగించి దేవతలు స్వాగతం పలికారని ‘పద్మపురాణం’ పేర్కొంటోంది. దుష్ట దనుజులను దునుమాడిన మహాకాళిని జ్యోతిగా, లక్ష్మీస్వరూపంగా ఆరాధించినట్టు కాళికాపురాణం చెబుతోంది.
దుర్వాస ముని శాపంతో ఇంద్ర పదవిని దేవరాజు కోల్పోయి, శ్రీ మహావిష్ణువును శరణు వేడాడనీ, ‘లక్ష్మీ జపధ్యానాలు చేస్తే, తిరిగి నీ పదవి నీకు దక్కుతుంద’ని విష్ణుమూర్తి చెప్పాడనీ, ఆ ప్రకారం లక్ష్మీదేవి కోసం అతను తపస్సు చేసి, ఇంద్రపదవిని తిరిగి పొందాడనీ ఒక కథ ఉంది. దీపావళిని ‘దీపాన్విక’గా భవిష్య, నారద పురాణాలు పేర్కొన్నాయి. స్కాంద పురాణంలో దీపావళి గురించిన వివరణ విస్తారంగా ఉంది. నారద పురాణం దీన్ని ‘దీప దాన మహోత్సవం’ అని చెప్పింది. ముద్రారాక్షస గ్రంథం ‘శారదోత్సవం’గా, నాగానందం గ్రంథంలో ‘దీప ప్రతిపాదనోత్సవం’గా దీపావళిని పేర్కొన్నారు.
'దీపేన సాధ్యతే సర్వం' అని శాస్త్రవచనం. 'దీపంతో దేనినైనా సాధించవచ్చు' అని భావం. నిత్యం దీపారాధన భారతీయుల సంప్రదాయం. ఉభయసంధ్యల్లో ఇంట్లో వెలిగించిన దీపం ఐశ్వర్యకారకం- అని ధార్మిక గ్రంథాలు బోధిస్తున్నాయి. 'ఏదైనా కోరిక తీరాలంటే, ఒక దీపాన్ని వెలిగించి- ఖర్జూరమో, ఎండుద్రాక్షో లేదో ఏదైనా ఫలమో నైవేద్యం పెట్టి నమస్కరించితే చాలు' అని ఆనవాయితీగా దీపారాధన కొనసాగుతోంది. ఇలా దీపారాధన చేయడంవల్ల ఏ ప్రయోజనమైనా పొందవచ్చు- అన్నది శాస్త్రోక్తి.
దేవతలు ప్రకాశస్వరూపులనీ, కాంతి-శుభానికీ, జ్ఞానానికీ, శాంతికీ సంకేతమనీ చాటిచెప్పే ఆర్షభావన దీప ప్రజ్వలనలో కనిపిస్తోంది. జ్యోతిని వెలిగించడం శుభారంభం. తేజోమయులైన దేవతలు దీపంద్వారా సంతోషిస్తారనీ, దీపప్రకాశంలో సన్నిహతులవుతారనీ పురాణ ఋషుల దర్శనం. దీపకాంతి దివ్యత్వ ప్రతీక కనుక, ఆ దివ్యత్వాన్ని కావాలని ఆశిస్తూ దీపంద్వారా వ్యక్తీకరించుకుంటున్నాం. 'దీపమున్న చోట దేవతలుంటారు'- అనడం ఈ కారణం వల్లనే.
కేవలం దీపాన్ని మాత్రమే వెలిగించి, ఆ జ్యోతిని ఆలంబనగా పరంజ్యోతి అయిన పరమాత్మను ధ్యానించడం ఒక యోగ ప్రక్రియ. భర్తృహరి తన శతక సాహిత్యంలో పరమేశ్వరుని 'జ్ఞానదీపం'గా అభివర్ణించాడు. ఈ దీపం యోగుల హృదయగృహంలో సుస్థిరంగా దీపిస్తోందని సంభావించాడు.
భారత పురాణ ఇతిహాసాల్లోనూ, వేద వేదాంగాల్లోనూ దీపానికి ఉత్కృష్టమైన స్థానం ఉంది. దీపంలో మనం మొట్టమొదటిగా చూసే సుగుణం కాంతే కానీ అంతకు మించిన ఒక స్ఫూర్తిని దీపం మనకు అందిస్తుంది. దీపం చివరి వరకు తన కాంతిని పరులకి పంచుతుంది. తన నుండి మరొక దీపాన్ని వెలిగించేందుకు తపిస్తుంది. దీపం మనోవికాసానికీ, ఆనందానికీ, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. వెలుగు సంతోషకారకం. చీకటి కష్టకారకం. జీవితం చీకటి వెలుగుల కలయిక. జ్ఞాన వెలుగుల్ని ప్రసాదించేది దీపం. అజ్ఞానానికి చిహ్నమైన తమస్సును నశింపచేసి జీవులకు వెలుగు మార్గాన్ని చూపించేదే దీపం. అందుకే ‘దీపం పరబ్రహ్మ స్వరూపం’ అని భావిస్తూ ఆరాధిస్తారు. ‘వెలిగించడం’ సనాతన భారతీయ సంస్కృతి.
మంత్రశాస్త్ర ప్రకారం ‘సాక్షాత్ దీపం దర్శయామి’ అనే మంత్రం చదువుతూ గృహాన్ని శుభ్రం చేసి, నీటిని చల్లి, ముగ్గులు పెట్టి ధూపం వెలిగించి దీపం పెట్టడంవల్ల సకల దుష్ట గ్రహ శక్తులు నశించి వాతావరణం పరిశుభ్రం అవుతుంది. అప్పుడే ఆ గృహం పూజార్హతకు అవకాశం కలుగుతుంది. దీపం వెలిగించగానే ఇంటికి లక్ష్మీకళ వచ్చేస్తుంది. లక్ష్మీదేవి దీపవాసిని. దీపకాంతి నుంచే కళ పుడుతుంది. దీపం అమంగళాన్నీ, దారిద్య్రాన్నీ, అరిష్టాల్ని పారద్రోలే శక్తి స్వరూపం. దీపం వెలగని ఇంట్లో అలక్ష్మి తాండవిస్తుందంటారు పెద్దలు. పూర్వకాలంలో ప్రతి ఇంటా నిత్యం అగ్నిహోత్రం నిర్వహించేవారు. కానీ నేటి పరిస్థితుల దృష్ట్యా రోజూ అగ్నిహోత్రం వెలిగించడం సాధ్యం కాదు. కానీ ఇంట్లో రోజూ ఉదయం, సాయంకాలం దీపారాధన చేయడం శుభప్రదం. మరణించిన వ్యక్తులకు ఉత్తమ గతులు సిద్ధించాలన్నా దీపాలు వెలిగించాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
==============
రచన: డాక్టర్ కప్పగంతు రామకృష్ణ. సెల్: 9032044115 /8897547548
ధర్మమూర్తి... సమదర్శి.... జగద్గురు కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి
ధర్మమూర్తి... సమదర్శి ఆయన పేరు పలికితేనే చాలు... వ్యక్తం చేయటానికి మాటలు చాలని అనుభూతి కలుగుతుంది. ఆ కళ్ళలోని వెలుగు ఏదో తెలియని కారుణ్యాన...
-
దీపారాధన దీపారాధన ఎందుకు చెయ్యాలి? దీపారాధన ప్రాముఖ్యత ఏమిటి? దీపం వెలిగించడంలో అంతరార్థం ఏమిటి? పంచభూతాత్మకమైన సృష్టికి ప...
-
ధర్మమూర్తి... సమదర్శి ఆయన పేరు పలికితేనే చాలు... వ్యక్తం చేయటానికి మాటలు చాలని అనుభూతి కలుగుతుంది. ఆ కళ్ళలోని వెలుగు ఏదో తెలియని కారుణ్యాన...
-
భజేహం... భుజంగం శ్రీమహావిష్ణువును శేషశయనుడిని చేసింది సర్పాలే. గరళకంఠుడిగా శివయ్యకు పేరుతెచ్చిందీ సర్పాలే. సూర్యభగవానుడి రథానికి సర్పాలే ...