Showing posts with label చదువు. Show all posts
Showing posts with label చదువు. Show all posts

Tuesday, July 2, 2019

చదువుకు వేళాయే.... (డాక్టర్ కప్పగంతు రామకృష్ణ రచన)

చదువుకు వేళాయే...

మీ పిల్లలకు చెప్పండి!
 
  


    చదువు అంటే కేవలం అక్షరాల జ్ఞానం మాత్రమే కాదని... అదో అంతులేని విజ్ఞానసాగర మథనమని... దానికోసం  కష్టాలు పడాలి.. కన్నీళ్లకు ఎదురీదాలి... పరీక్షలకు నిగ్గుతేలాలి... అవాంతరాలను అధిగమించాలి... అయినా ఇష్టంతో సాధన చేస్తే సిసలైన సంపద మీ సొంతమవుతుందని... మీ పిల్లలకు చెప్పండి... జ్ఞానార్జన కోసం తపించిన ఈ విద్యార్థుల గురించి వివరించండి!

శివుడూ చదువుకున్నాడు!

ఎవరైనా, ఎంతటివారైనా నేర్చుకునే సమయంలో  విద్యార్థిగా ఉండాల్సిందే. ఈ విషయంలో అభ్యంతరాలు పనికిరావు.
కైలాస పర్వతంపై తన శిలాపీఠం మీద పరమేశ్వరుడు పార్వతీదేవితో సహా కొలువై ఉన్నాడు. అంతా తానై, అన్నీ తానే అయిన శివుడికి సైతం ఆ రోజు పెద్ద సందేహం వచ్చింది. ప్రణవం అంటే ఏమిటి? ప్రణవతత్త్వం ఏమిటి? ఎంతగా ఆలోచించినా తనకు బోధపడటం లేదు. బ్రహ్మ, విష్ణువులను అడిగినా తమకు సాధ్యం కాదన్నారు. నీ బిడ్డ షణ్ముఖుడే ఇందుకు సమర్థుడని చెప్పారు. దాంతో శివుడు నేరుగా కుమారస్వామినే తన సందేహం తీర్చమని అడిగాడు. ‘చెప్పేది నేను. వినేది నువ్వు. నీ సందేహం తీర్చే నాది గురుస్థానం. వినే నీది శిష్యస్థానం. కాబట్టి, నువ్వు కింద కూర్చుంటే నేను పీఠం మీద కూర్చుని బోధ చేస్తానన్నాడు కుమారుడు. సరేనన్నాడు శివుడు. బిడ్డే స్వయంగా తండ్రికి ప్రణవ తత్త్వాన్ని ఉపదేశించాడు. పరమేశ్వరుడు విద్యార్థిగా మారి మానవ జాతికి మహోపకారం చేశాడు. ప్రణవ తత్త్వం లోకానికి అందింది. ఇక్కడ  స్కందుడు గొప్ప గురువు. పరమేశ్వరుడు ఉత్తమ విద్యార్థి.

తలకెక్కితే తిప్పలే!

ఎంత నేర్చుకున్నా విద్యార్థికి గర్వం ఉండకూడదు ఈ ఒక్క దుర్లక్షణం వల్ల నేర్చుకున్నదంతా నిరుపయోగమైపోతుంది.
యాజ్ఞవల్క్యుడు బాష్కలమహర్షి దగ్గర రుగ్వేదం, జైమిని వద్ద సామవేదం, అరుణి మహర్షి వద్ద అధర్వణవేదం అధ్యయనం చేశాడు. ఆ తర్వాత వైశంపాయనుడి వద్దకు యజుర్వేదం నేర్చుకోడానికి వెళ్లాడు. ఆ రుషి వద్ద వేదంతో పాటు మరెన్నో విషయాలు నేర్చుకున్నాడు. తనను మించిన విద్యావంతుడు లేడనే అహంకారం అతడిలో ఏర్పడింది. ఓసారి వైశంపాయనుడికి బ్రాహ్మణుని కాలితో తన్నిన దోషం తగిలింది. అతడి పాపాన్ని పోగొట్టే శక్తి తనవద్ద మాత్రమే ఉందంటూ గురువుతో గర్వంగా పలికాడు యాజ్ఞవల్క్యుడు. దీంతో ఆగ్రహించిన గురువు తాను నేర్పిన విద్యను పూర్తిగా వదలి వెళ్లిపొమ్మని అతడిని శపించాడు. దీంతో నేర్చుకున్న విద్యను రక్తపు ముద్దల రూపంలో అక్కడే వదలివెళ్లాడు. వాటిని స్వీకరించిన తిత్తిరి పక్షులు వేదాల్ని పలికాయి. అవే కృష్ణ యజుర్వేదంగా ఆవిర్భవించాయి. ఆ తర్వాత యాజ్ఞవల్క్యుడు సూర్యుడిని ఉపాసన చేసి, ఆయన ద్వారా శుక్ల యజుర్వేదం నేర్చుకోవాల్సి వచ్చింది.

దేవతలే దిగిరారా!

ఆటంకాలకు లొంగితే జ్ఞానశూన్యుడిగానే మిగిలిపోవాల్సి వస్తుంది. కష్టాన్ని తట్టుకుంటేనే విజ్ఞానపు లోకానికి దారి తెలుస్తుంది. జాబాలికి తండ్రి ఎవరో తెలియదు. తల్లి జాబాల అతడికి ఉపనయన సంస్కారం చేసి, గురువు హరిద్రుమతుడి వద్దకు విద్యాభ్యాసానికి పంపింది. తండ్రి ఎవరో తెలియకపోవడంతో అవమానాల పాలయ్యాడు. విద్య నేర్చుకునే సమయం వచ్చే వరకు గోవుల్ని మేపుతూ అడవిలోనే ఉండమని ఆదేశించాడు గురువు. మరోమాట మాట్లాడకుండా అడవికి చేరుకున్నాడు జాబాలి. కానీ, మనస్సు మాత్రం నిత్యం జ్ఞానాన్వేషణ కోసం పరితపిస్తూనే ఉంది. అతడి సత్యనిష్ఠకు మెచ్చుకున్న దేవతలే స్వయంగా అతడు మేపుతున్న గోవుల్లో చేరి, బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశం చేస్తారు. ఆశ్రమానికి చేరుకున్న జాబాలి ముఖంలోని దివ్యతేజస్సు చూసి గురువు ఆశ్చర్యపోతాడు. అప్పటినుంచి సత్యకామ జాబాలిగా జాబాలి లోక ప్రసిద్ధి పొందాడు. విద్యార్థికి నేర్చుకోవాలన్న తపన, స్థిరచిత్తం ఉంటే దైవమే దిగి వస్తుందనటానికి ఇతని కథ చక్కటి ఉదాహరణ.

ప్రలోభాలకు లొంగకుండా...

తాను నేర్చుకోదలచిన విషయం మీద విద్యార్థికి పట్టుసడలని శ్రద్ధ ఉండాలి. ఎన్ని ఆకర్షణలు వచ్చినా వాటికి బందీ కాకూడదు. తండ్రి వాజశ్రవుడు కోపంతో ‘నిన్ను యముడికి దానం చేస్తా’నని అనటంతో అతని మాట నిలబెట్టడం కోసం నచికేతుడు నేరుగా యమలోకానికి వెళ్లాడు. యమదర్శనం కోసం ద్వారం వద్ద మూడురోజులు నిరీక్షించాల్సి వచ్చింది. దివ్యతేజస్సుతో ఉన్న బాలుడు తన కోసం నిరీక్షించిన విషయం తెలుసుక్ను యమధర్మరాజు దర్శనమిచ్చి, ముచ్చటపడి వరాలు కోరుకోమన్నాడు అప్పుడు నచికేతుడు వరాలుగా తన ప్రశ్నలకు సమాధానం ఇమ్మని అడిగాడు. మరణం తర్వాత మనిషి ఏమవుతాడు? జనన మరణ చక్రాల సంచారం ఎందుకు?... అనేవి ఆ ప్రశ్నలు. అప్పుడు యముడు ఇదంతా బ్రహ్మజ్ఞానం. నీ వయస్సు చిన్నది. నీకు అర్థం కాదు. నీకు మణులు, బంగారం, ఇంకా చాలా ఇస్తానని ప్రలోభపెట్డాడు. నాకివేమీ వద్దు. ఆత్మజ్ఞానమే ముద్దు అంటూ పట్టుబట్టాడు నచికేతుడు. బాలుడి శ్రద్ధకు అబ్బురపడిన యముడు అతడికి ఆత్మజ్ఞానాన్ని బోధిస్తాడు. ఇదే కఠోపనిషత్‌గా అవతరించింది.

హనుమ కథ వినుమా!


చదువు సుఖంగా అందదు. ఇందుకోసం తపించాలి. వేగం, పట్టుదల, ధారణ, కష్టానికి తట్టుకునే శక్తి విద్యార్థికి చాలా అవసరం. ఇవన్నీ ఉంటేనే నేర్చుకోవటం సాధ్యమవుతుంది. తల్లి ఆదేశంతో సూర్యభగవానుడి వద్ద విద్య నేర్చుకునేందుకు వెళ్లాడు హనుమ. నేను ప్రతిక్షణం సంచరిస్తూ ఉంటాను. నా దగ్గర చదువుకోవటం సాధ్యం కాదన్నాడు  సూర్యుడు. అయినా పట్టువదలకుండా తూర్పు, పశ్చిమ పర్వతాల మీద చెరో కాలు ఉంచి, సూర్యగమనానికి అనుగుణంగా ముఖం వరకు తన శరీరాన్ని తిప్పుతూ విద్యాభ్యాసం చేశాడు ఆంజనేయుడు. ఇంతటి సాధన చేశాడు కాబట్టే నవ వ్యాకరణ పండితుడయ్యాడు. ఎవరెన్ని విధాలుగా నిరుత్సాహపరిచినా, చివరకు ఎంచుకున్న గురువే వద్దని వారించినా నిరుత్సాహ పడకూడదు. విద్య నేర్చుకునే విషయంలో ఏర్పడే విఘ్నాలే ఇవన్నీ అనే స్పృహ కలిగి ఉండాలి. వాటిని తీర్చుకునేందుకు ప్రత్యామ్నాయాలు ఆలోచించాలి. అప్పుడే ఆశించిన లక్ష్యాన్ని చేరుకోవచ్చని హనుమ నిరూపించాడు.

- కప్పగంతు రామకృష్ణ

భజన, నామసంకీర్తనల ఔన్నత్యం గురించి వివరిస్తూ నమస్తే తెలంగాణ పత్రిక (15.06.2026) సంచికలో డాక్టర్ కప్పగంతు రామకృష్ణ రాసిన వ్యాసం

నామ స్మరణ   భజన, నామసంకీర్తనల ఔన్నత్యం గురించి వివరిస్తూ  నమస్తే తెలంగాణ పత్రిక (15.06.2026) సంచికలో డాక్టర్ కప్పగంతు రామకృష్ణ రాసిన వ్యాసం...