శ్రీరామ
రుద్రాభిషేక వైభవం
ఈశ్వరా! అని భక్తితో గొంతెత్తి పిలిచినంతలోనే
భక్తులను కటాక్షించే పరమ కారుణ్యమూర్తి పరమేశ్వరుడు. కేవలం చెంబుడు గంగతో అభిషేకం
చేసినంతనే అక్షయ పుణ్యాన్ని ప్రసాదించే బోళామూర్తి ఈశ్వరుడు. అనంతమైన
కాలస్వరూపుడైనా చేరవచ్చిన అందరినీ ఆదరించే పరమ దయాళువు రుద్రుడు. ఇంతటి సర్వోన్నత
దైవాన్ని పూజించి, తరించటానికి సకల శాస్త్రాలు, ఆగమాలు నిర్దేశిస్తున్న అర్చనావిధానం ‘రుద్రాభిషేకం’.
శివునికి అభిషేకం చేయటానికి సర్వసాధారణంగా
వినియోగించే మంత్రాలు నమక, చమకాలు. శ్రీకృష్ణ యజుర్వేదంలో అంతర్భాగంగా ఉండే
నమక, చమకాలను కలిపి సాధారణ పరిభాషలో ‘రుద్రాధ్యాయం’ అనీ, ‘రుద్రం’ అనీ వ్యవహరిస్తుంటారు. ఈ మంత్రాలతో శివునికి
చేసే అభిషేకం అనంతమైన పుణ్యఫలితాన్ని అందిస్తుంది.
యం యం కామయతే మర్త్యో లింగార్చన పరాయణః ।
తం తమాప్నోతి విప్రేంద్ర మత్ప్రసాదాన్నసంశయః ॥
లింగార్చన చేసే భక్తుడు తన మనసులో ఏయే కోరికలు
తీరాలని భావిస్తున్నాడో, అవన్నీ నా అనుగ్రహం వల్ల తప్పక నెరవేరుతాయని
సాక్షాత్తు పరమేశ్వరుడే చెప్పినట్లు శైవాగమాలు ప్రకటిస్తున్నాయి.
లింగార్చన లేదా రుద్రాభిషేకం వల్ల కలిగే ఫలితం
అనంతం అనీ, ఎప్పటికీ నశించదనీ శాస్త్రాలు ఘోషిస్తున్నాయి.
యజ్ఞ, యాగ, దాన, తపస్సుల వల్ల కలిగే ఫలితం కేవలం రుద్రాభిషేకం
వల్ల కలుగుతుంది. అయితే, కోరికను అనుసరించి, కొన్ని ఆచారవిధానాలను శాస్త్రాలు నిర్దేశిస్తున్నాయి. వీటితోపాటు రుద్రాభిషేకం
ఏయే సమయాల్లో చేయాలి? ఎలా చేయాలి?
ఎటువంటి లింగాన్ని
అర్చించాలి? ఇందుకు అనుసరించాల్సిన విధానాలేమిటి? మొదలైన విషయాలను కూడా ఆగమాలు విస్పష్టంగా పేర్కొంటున్నాయి.
శివాభిషేక నియమాలు
రుద్రాభిషేకాన్ని తప్పనిసరిగా శైవాగమాన్ని
అనుసరించే చేయాలని సాక్షాత్తు ఆదిశంకరులు చెప్పారు. ‘సిద్ధాంత సారావళి’ కూడా ఇదే విషయాన్ని ప్రకటిస్తోంది.
అష్టాదశాసు విద్యాసు మీమాంసాపి గరీయసి
తతోపి తర్కశాస్త్రాణి పురాణం తేభ్య ఏవ చ
తతోపి ధర్మశాస్త్రాణి తేభ్యో
గుర్వీశ్రుతిర్ద్విజా
తతోప్యుషనిషచ్ఛ్రేష్ఠస్తత శ్శైవాగమోధికః ॥
అష్టాదశ విద్యల్లో మీమాంస, మీమాంస కంటే తర్కం, తర్కం కంటే పురాణాలు, పురాణాల కంటే ధర్మశాస్త్రం, ధర్మశాస్త్రాల కంటే వేదాలు, వేదాల కంటే ఉపనిషత్తులూ, ఉపనిషత్తుల కంటే శైవాగమాలు గొప్పవి. వీటినే
వేదాగమాలని కూడా అంటారు. ఈశ్వరప్రోక్తం కావటం వల్ల కారణాగమం, కామికాగమం వంటి శైవాగమాలు చాలా గొప్పవి. కాబట్టి, శైవాగమాలు చెప్పిన పద్ధతుల్లో రుద్రాభిషేకం చేయాలి.
·
తడివస్త్రాలు ధరించి అభిషేకం చేయకూడదు. భుజం మీద కూడా తడివ్రస్తం ధరించకూడదు.
·
అభిషేక సమయంలో పూర్తిగా మౌనాన్ని పాటించి,
చిత్తాన్ని పరమేశ్వరుని
మీదనే లగ్నం చేయాలి.
·
కాళ్ళు చాపుకుని కూర్చొనటం, ఇతరులతో సంభాషించటం, స్త్రీలతో సరస సంభాషణ, తర్కించటం,
అసత్య సంభాషణ పనికిరాదు.
·
పరనింద, పరస్తుతి చేయకూడదు.
·
గట్టిగా మాట్లాడకూడదు. విచారవదనంతో ఉండకూడదు.
·
అభిషేక సమయంలో యజమాని దీర్ఘరోగుల్ని, కుక్కల వంటి జంతువులను చూడకూడదు. స్పృశించకూడదు.
ప్రమాదవశాత్తు చూసినట్లయితే 108 సార్లు ఓంకారాన్ని జపించి, కుడిచేతితో కుడిచెవిని స్పృశించాలి.
·
భస్మధారణ చేయకుండా అభిషేకం చేయకూడదు.
·
అభిషేకానికి ముహూర్త నిర్ణయం అవసరం లేదు. వర్జ్యదోషాలు ఉండవు.
·
శివలింగ పీఠం మీద పూజాద్రవ్యాలు, గంధపాత్రలు,
బెల్లం ముక్క, కొబ్బరిచెక్క మొదలైన పదార్థాలు ఉంచకూడదు.
·
అభిషేక సమయంలో తుమ్మటం, దగ్గటం, ఉమ్మివేయటం,
అసత్యం పలకటం చేయకూడదు.
నియమభంగం జరిగితే యజయాని ఆచమనం చేసి, కుడిచేతితో కుడిచెవిని స్పృశించాలి.
·
సంకల్పం చేయటానికి ముందు, అభిషేక సమయంలో, ఆ ధూప, దీప, నీరాజన సమయాల్లో తప్పనిసరిగా గంట మోగించాలి.
ఘంటానాదం చేయకుండా చేసే అభిషేకం ఫలితాన్ని ఇవ్వదు.
రుద్రాభిషేక విధి
1.
వారం: నమకంలో మొత్తం 11 అనువాకాలు ఉంటాయి. ఒకసారి నమకంలోని 11 అనువాకాలు చెప్పి, చమకంలో ఒక అనువాకం (చమకంలో కూడా 11 అనువాకాలు ఉంటాయి) చొప్పున వరుసగా చెప్పాలి.
ఈవిధంగా 11 సార్లు నమకం చెబితే, చమకంలోని 11 అనువాకాలు చెప్పటం పూర్తవుతుంది. ఇలా చేసిన
అభిషేకానికి ‘వారం’ అని పేరు.
2.
ఆవృత్తి: నమకం 121 సార్లు, చమకం 11 సార్లు. పృథివీ రూపధారి అయిన రుద్రప్రీతి
కలుగుతుంది. సర్వపాపాలు తొలగుతాయి. జలరూపధారి అయిన శివప్రీతి కలుగుతుంది. ఫలితంగా
సకల సుఖాలు లభిస్తాయి.
3.
రుద్రం: నమకం 1,331 సార్లు, చమకం 121 సార్లు. తేజోరూపధారి అయిన శంకరుని ప్రీతి
కలుగుతుంది. ఫలితంగా సర్వ సంపదలు కలుగుతాయి.
4.
ఏకాదశ రుద్రం: నమకం 14,641 సార్లు, చమకం 1,331 సార్లు. వాయురూపధారి అయిన పరమేశ్వరునికి ప్రీతి
కలిగి, తద్వారా లక్ష్మీకటాక్షం కలుగుతుంది.
5.
శతరుద్రం: నమకం 1,61,051 సార్లు, చమకం 14,641 సార్లు. ఆకాశరూపధారి అయిన మహేశ్వరునికి ప్రీతి
కలుగుతుంది. ఫలితంగా పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుంది.
6.
లఘురుద్రం: నమకం 17,71,561 సార్లు, చమకం 1,61,051 సార్లు. సూర్యరూపధారి అయిన ఈశ్వరప్రీతి
కలుగుతుంది. పునర్జన్మ నివృత్తి అవుతుంది.
7.
మహారుద్రం: నమకం 194,87,171 సార్లు, చమకం 17,71,561 సార్లు. చంద్రరూపధారి అయిన రుద్రునికి ప్రీతి
కలుగుతుంది. జ్ఞానవృద్ధి కలుగుతుంది.
8.
అతిరుద్రం: నమకం 21,43,58,881 సార్లు, చమకం 194,87,171 సార్లు. సర్వరూపి అయిన పరమేశ్వరునికి ప్రీతి
కలుగుతుంది. ఫలితంగా చెప్పటానికి అలవికాని మహాఫలితాన్ని యజమాని పరమేశ్వర
వరప్రసాదంగా అందుకుంటాడు.
శ్రావణ కార్తిక మాసాల్లో, విశేషంగా మాఘమాసంలో ఏదైనా పవిత్ర పుణ్యక్షేత్రంలో, నదీతీరంలోగాని, పర్వత ఉపరిభాగంలో కానీ, పశ్చిమాభిముఖ ద్వారం ఉన్న శివాలయంలోని గానీ యజమాని 11 మంది బ్రాహ్మణులను ఏర్పాటుచేసుకుని రుద్రాభిషేకం చేస్తే తప్పకుండా ముక్తి
కలుగుతుంది.
యజమాని తన అభీష్టాన్ని, శక్తిని అనుసరించి వీటిల్లో ఏదో ఒక విధానాన్ని ఎంచుకుని, రుద్రాభిషేకం చేయాలి.
శివాభిషేక ఫలితాలు
·
భస్మాన్ని ధరించి, భస్మశయ్యపై పడుకుని, నిశ్చలబుద్ధితో రుద్రాన్ని పారాయణ చేస్తే పంచమహాపాతకాలు కూడా పటాపంచలు
అవుతాయని పరాశరస్మృతి చెబుతోంది.
·
సురాపానం, బ్రహ్మహత్య వంటి పాపాలు కూడా రుద్రాభిషేకం వల్ల
తొలగటంతో పాటు సంసారబంధాల నుంచి విముక్తి కలుగుతుంది.
·
రుద్రాధ్యాయాన్ని పారాయణ చేయటం వల్ల రహస్యంగా చేసిన పాపాల నుంచి కూడా విముక్తి
కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.
·
ఎటువంటి మమకారం లేకుండా, ఫలాపేక్ష రహితంగా రుద్రాధ్యాయాన్ని పారాయణ
చేస్తే సశరీరంగా కైలాసగమన సిద్ధి కలుగుతుందని వాయుపురాణం చెబుతోంది.
·
దుస్స్వప్నం వల్ల కలిగే దోషం, గ్రహదోషాల నివారణకు రుద్రాధ్యాయాన్ని పారాయణ
చేయాలని లింగపురాణంలో ఉంది.
·
రుద్రాభిషేకంతో పాటు రుద్రపారాయణ చేయటం వల్ల సంతానహీనులకు సత్సంతానం
కలుగుతుందని ఆపస్తంబ సూత్రం చెబుతోంది.
·
శ్రేష్ఠమైన మృత్తిక (మట్టి), కస్తూరి రెండిటి మిశ్రమంతో నిర్మించిన లింగాన్ని
అభిషేకించి, పూజించినట్లయితే సంపదలు కలుగుతాయి.
·
మృత్తికతో శ్రీగంధం కలిపి తయారుచేసిన లింగాన్ని సశాస్త్రీయంగా 20 రోజులు పూజించి, అభిషేకం చేస్తే తాపజ్వరం నుంచి ఉపశమనం
కలుగుతుంది.
·
కస్తూరీ మిశ్రమంతో తయారుచేసిన మృణ్మయలింగాన్ని పదిరోజుల పాటు భక్తియుక్తంగా
పూజించి, అభిషేకాదులు నిర్వహిస్తే ఆత్మదోష జనితమైన
సర్వరోగాలు నశిస్తాయి.
·
చక్కెర కలిపి తయారుచేసిన మృణ్మయ లింగాన్ని మూడు నెలలపాటు సశాస్త్రీయంగా
పూజిస్తే, సభల్లో నేర్పుగా మాట్లాడే శక్తి, కవిత్వసిద్ధి కలుగుతాయి.
·
మృత్తికలో బియ్యపుపిండి కలిపి తయారుచేసిన లింగాన్ని మూడు నెలల పాటు
శాస్త్రవిధిగా అర్చించి, అభిషేకం చేస్తే పుత్రసంతానం కలుగుతుంది.
·
మృత్తికలో పసుపు కలిగి, 108 రోజుల పాటు శాస్త్రవిధిగా అభిషేకం చేస్తే
సర్వజనాకర్షకమైన రూపం, ఐశ్వర్యం కలుగుతాయి.
·
మృత్తికలో ఆవునెయ్యి కలిపి, లింగాన్ని తయారుచేసి, 50 రోజుల పాటు అభిషేకం చేస్తే పైత్యరోగం నివారణ అవుతుంది.
·
ఎర్రని గంధం కలిపి తయారుచేసిన మృత్తికాలింగానికి 32 రోజులు అభిషేకం చేస్తే దగ్గు, దమ్ము రోగాలు నివారణ అవుతాయి.
·
ఇనుపచూర్ణం, మృత్తిక కలిపి లింగాన్ని తయారుచేసి, 22 రాత్రులు శాస్త్రవిధిగా అభిషేకార్చన చేస్తే, శత్రునాశనం కలుగుతుంది.
·
నువ్వులు కలిపి తయారుచేసిన మృత్తికాలింగానికి ఏడురోజుల పాటు నిర్మలభక్తితో
అభిషేకం చేస్తే యమబాధలు నశిస్తాయి.
·
నిత్యం రుద్రాభిషేకం చేయటం వల్ల భూత, ప్రేత, పిశాచ, బ్రహ్మరాక్షస బాధలు నశిస్తాయి.
గృహేత్వేక గుణం ప్రోక్తం నదీతీరే సహస్రకం ।
దేవతాయతనేలక్షం శతలక్షం హరేర్గృహే ।
శివాలయే కోటి గుణం శివే స్వాయంభువే పునః ।
అనంతం పూజనం శంభోః ఋతం వచ్మిద్విజోత్తమ ॥
రుద్రాభిషేకం చేసే స్థలాన్ని బట్టి కూడా ఫలితం
ఉంటుంది. ఇంట్లో చేసే లింగార్చన వల్ల ఒకభాగం ఫలితం కలుగుతుంది. నదీతీరంలో చేస్తే
అందుకు వేయి రెట్లు ఎక్కువ ఫలితం వస్తుంది. దేవతానివాసాల్లో చేసే అభిషేకానికి లక్ష
రెట్లు ఎక్కువ ఫలితం, విష్ణ్వాలయంలో చేసే అభిషేకానికి నూరు లక్షల
రెట్లు ఎక్కువ ఫలితం, శివాలయాల్లో చేసే అభిషేకానికి కోటిరెట్లు, పర్వతగుహల్లో చేసే అభిషేకానికి పదికోట్ల రెట్లు, ఆ గుహ ఋష్యాశ్రమం కూడా
అయితే కోటికోట్ల రెట్లు ఎక్కువ ఫలితం కలుగుతుంది. బ్రహ్మక్షేత్రంలో (కాశీక్షేత్రం)
శివాభిషేకం చేస్తే అమితమైన ఫలితం లభిస్తుందని ఆగమాలు ప్రకటిస్తున్నాయి.
----------------------------
No comments:
Post a Comment