Thursday, March 23, 2023

భజే రుద్రరూపం... భజే బ్రహ్మతేజం (హనుమజ్జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం)



భజే రుద్రరూపం... భజే బ్రహ్మతేజం

 

          హనుమంతుడంటేనే ఓ శక్తి. ఆ పేరు పలికితేనే కొండంత ధైర్యం మనల్ని ఆవహిస్తుంది. హనుమలో ఎంతటి గంభీరమైన ఉగ్రతేజం కనిపిస్తుందో, అంతేస్థాయిలో మృదుమధురమైన వాక్‌, చిత్త సంస్కారం కూడా కనిపిస్తుంది. ఎంతటి అనుపమానమైన దేహదారుఢ్యం కనిపిస్తుందో, అంతటి సమున్నతమైన బుద్ధిబలం కూడా వ్యక్తమవుతుంది. ఎంతటి అపారమైన శాస్త్రపాండిత్యం ప్రకటితమవుతుందో, అంతే తీక్షణమైన బహ్మ్రచర్య తేజం భాసిస్తుంది. ఎంతటి ప్రతాపరౌద్రం కనిపిస్తుందో, అంతటి పరమశాంత చిత్తం కూడా దర్శనమిస్తుంది. వాక్యకోవిదుడు, రాజనీతిజ్ఞుడు, ప్రియసఖుడు, వినయమూర్తి, రామభక్తాగ్రేసరుడు... ఇలా అనేక శక్తుల మేలుకలయికగా హనుమ రామాయణంలో అనేకచోట్ల దర్శనమిస్తాడు.

 

దుష్టశిక్షణ, శిష్ట రక్షణ చేయటానికి సాక్షాత్తు పరమశివుడే రామకార్యాన్ని సాధించాలనే సంకల్పంతో హనుమంతుడిగా అవతరించాడని పరాశర సంహిత చెబుతోంది.

 

దుష్టానాం శిక్షణార్థాయ శిష్టానాం రక్షణాయ చ । రామకార్యార్థ సిద్ధ్యర్థం జాతః శ్రీహనుమాన్‌ శివః ॥ - వైశాఖమాసం, కృష్ణ పక్ష దశమి, శనివారం, పూర్వాభాద్ర నక్షత్రం, కుంభరాశి, మధ్యాహ్నవేళలో, కర్కాటకలగ్నంలో ఆంజనేయుడు జన్మించినట్లు అందులో ఉంది. శివుని అష్టమూర్తుల్లో ఒకడైన వాయుదేవుని అనుగ్రహం ద్వారా కేసరి అనే వానరవీరుని భార్య అంజనాదేవికి రుద్రతేజంతో హనుమ జన్మించాడు.

 

ఓంకార హనుమ

    హనుమాన్‌ అనే శబ్దానికి ‘జ్ఞానవాన్‌’ అనే అర్థం ఉంది. ‘హను’ అంటే ‘జ్ఞానం’ అనే అర్థం ఉంది. ‘హనువు’ అంటే ‘దవడలు’ అనే అర్థం కూడా వాడుకలో ఉంది. శబ్దార్థపరంగా చూస్తే, ‘హనుమ’ అనే పదంలోని అచ్చులు ‘అ, , మ’ - ఈ మూడు కలిస్తే ‘ఓం’కారం ఆవిర్భవిస్తుంది. దీని ద్వారా హనుమంతుడు ఓంకార స్వరూపుడనే విషయం అత్యంత స్పష్టంగా తెలుస్తుంది.

 

విద్యాహనుమ

 హనుమంతుడు అనగానే అద్భుతమైన బలపరాక్రమాలు గుర్తుకువస్తాయి. అపరిమితమైన భుజశక్తికి తోడు హనుమంతుడు గొప్ప విద్యావేత్త కూడా. కర్మసాక్షి, ప్రత్యక్షదైవం అయిన సూర్యభగవానుడి దగ్గర అన్ని విద్యలు నేర్చుకున్నాడు. ఉపనయనం పూర్తయ్యాక ఓ రోజు హనుమ సూర్యుడి దగ్గరకు వెళ్ళి తనను శిష్యుడిగా స్వీకరించమని అభ్యర్థిస్తాడు. నేను క్షణం కూడా స్థిరంగా ఉండననే విషయం లోకమంతా తెలిసిందే కదా. అలాంటి నేను నీకెలా విద్య నేర్పించగలను. మరెవ్వరైనా గురువును చూసుకోమంటాడు సూర్యుడు. తన శరీరాన్ని అమాంతంగా పెంచి, తూర్పు పశ్చిమ పర్వతాల మీద చెరొక కాలు పెట్టాడు. సూర్య గమనానికి అభిముఖంగా తన ముఖాన్ని తిప్పుతూ సూర్యుడిని విద్య నేర్పించమని ప్రార్థించాడు. తన శిష్యుడి శక్తి సామర్థ్యాలకు, బలపరాక్రమాలకు సూర్యుడు ముచ్చటపడి, హనుమను శిష్యుడిగా స్వీకరించాడు. వేదాలు, వేదాంగాలు, వ్యాకరణంతో సహా అన్ని శాస్త్రాలు నేర్చుకుని గొప్ప పండితుడవుతాడు హనుమ. అంతటి పండితుడు కాబట్టే హనుమ మంత్రిగా ఉంటే ముల్లోకాల్లోనూ సాధించలేదని ఏదీ ఉండదంటాడు రాముడు. ఎవరో నిరాశ పరిచారనో, ఏవో అడ్డంకులు వచ్చాయనో ఎంపిక చేసుకున్న విద్య నేర్చుకోవటాన్ని మానుకునే నేటితరం విద్యార్థులకు హనుమ ఓ చక్కటి ఆదర్శంగా నిలుస్తాడు. విద్య నేర్పించాల్సిన గురువే వద్దని వారించినా హనుమ నిరుత్సాహ పడలేదు. గురువును మెప్పించి విద్య నేర్చుకున్నాడు. నేటితరానికి హనుమ ఓ పాఠం. 

 

సుందర హనుమ

 

హనుమకు తల్లి అంజనాదేవి పెట్టిన పేరు సుందరుడు. అద్భుతమైన సౌందర్యమూర్తి హనుమంతుడు. సూర్యుడిని మింగాలని ఆకాశానికి ఎగిరిన బాలాంజనేయుడిని చూసిన ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని విసురుతాడు. అది దవడల మీద బలంగా తాకటంతో చెక్కుకున్నట్లు అవుతాయి. అలా చెక్కబడిన దవడలు కలిగిన వాడు కావటంతో సుందరుడు హనుమంతుడిగా ప్రసిద్ధి పొందాడు.  మరొక విశేషం ఏమిటంటే...రామాయణంలోని అన్ని సర్గలకు అందులోని కథాంశాన్ని బట్టి పేరు పెట్టాడు వాల్మీకి. కానీ సీతాన్వేషణ జరిగిన సర్గకు మాత్రం సుందరకాండ అని పేరు పెట్టాడు. నిజానికి హనుమత్కాండ అని పేరు పెట్టాలని అందరూ అంటారు. కానీ హనుమ అసలు పేరు సుందరుడు కదా. అందుకని వాల్మీకి ఈ సర్గకు సుందరకాండ అని పేరు పెట్టారని ప్రతీతి.

 

హనుమంతుడి మంత్రాల్లో ‘సుందర హనుమన్ మహామంత్రం’ ఒకటి. వాల్మీకి తన శ్లోకాల్లో అంతర్గతంగా ఈ సుందర మంత్రాన్ని నిక్షిప్తం చేశాడు కాబట్టి సుందరకాండ అయిందని మరొక వివరణ. నిజానికి భౌతిక సౌందర్యాన్ని మించినది హృదయ సౌందర్యం. మొత్తం రామాయణంలో ఎక్కడా తన గురించి చెప్పుకోలేదు. రాముడు విడిచిన బాణాన్ని అంటూ తన ఘనత అంతా రాముడికే కట్టబెట్టాడు. సీతమ్మను రామయ్య చెంత చేర్చటం తప్ప మరోధ్యాస లేదు హనుమకు. అందుకే ఆ హృదయాన్ని మించిన సుందర హృదయం మరొకటి లేదు. కాబట్టే ఈ కాండ సుందరకాండ అయింది. 

 

రాజు పూజలందుకున్న బంటు

హనుమంతుడు రాముడు బంటు. అందరికీ తెలిసిన విషయమే. కానీ రామయ్యే స్వయంగా హనుమంతుడిని పూజించిన వివరణ పరాశర సంహితలో ఉంది. దీనిప్రకారం సూర్యుడిని మింగటానికి ఆకాశానికి ఎగిరిన హనుమంతుడి మీద వజ్రాయుధం ప్రయోగిస్తాడు ఇంద్రుడు. హనుమ ఓ పర్వతం మీద పడి, మూర్ఛపోతాడు. బిడ్డకు కలిగిన కష్టం చూసి వాయుదేవుడు కోపంతో అన్నిలోకాల్లో ఉన్న వాయువుని స్తంభింపజేస్తాడు. దీంతో లోకాలన్నీ అల్లకల్లోలం అవుతాయి.

 

విషయం తెలుసుకున్న బ్రహ్మదేవుడు దేవతలందరినీ వెంట పెట్టుకుని హనుమంతుడున్న చోటుకి వస్తాడు. అతడిని పునర్జీవితుడిని చేసి అనేక వరాలిస్తాడు. మిగిలిన దేవతలందరూ కూడా తమ శక్తిని హనుమంతుడికి ఇచ్చి, తమకు సంబంధించిన అస్త్ర, శస్త్రాలేవీ అతడి మీద పనిచెయ్యవంటూ వరాలిస్తారు. హనుమంతుడి పేరుతో హనుమద్ర్వతం వ్యాప్తిలోకి వస్తుందని, ఈ వ్రతం చేసిన వారి పనులన్నీ హనుమ చేసిపెడతాడని బ్రహ్మదేవుడు ఈ సందర్భంలో చెబుతాడు. ఈ కథంతా రాముడికి హనుమే స్వయంగా చెబుతాడు.

 

సీతాన్వేషణలో ఉన్న రాముడు పంపానదీ తీరంలో హనుమంతుడు వేదిక మీద కూర్చోపెట్టి

లక్ష్మణుడితో సహా ఈ వ్రతం చేస్తాడు. వ్రతం ఫలితంగా సీతాన్వేషణ మొదలు సీతారామ పట్టాభిషేకం

వరకు మొత్తం కార్యాన్ని తన భుజాల మీద వేసుకుని నడిపిస్తాడు హనుమ. తన యజమాని చేత

పూజలందుకున్న ఏకైక బంటు హనుమ మాత్రమే. 

 

వేద హనుమ

 

హనుమ అనే పదానికి ఉపనిషత్తులు చెబుతున్నఅర్థం ‘వేదం’. రాముడు శ్రీ మహావిష్ణువు అవతారం. వేదాలు ఘోషిస్తున్నది విష్ణు స్వరూపాన్నే. అటువంటి వేదస్వరూపుడైన విష్ణువు రామావతారంలో సీతను అన్వేషిస్తూ కొండలు, కోనలు తిరుగుతాడు. అలాంటి రాముడు ఓ సందర్భంలో హనుమంతుడి భుజాల్ని అధిరోహిస్తాడు. నిజానికి రాముడు నడవలేక కాదు. వేదం మాత్రమే వేదస్వరూపుడిని భరించగలదు. ఇతరులకు అది సాధ్యం కాదు. భగవంతుడి తత్త్వం మాత్రమే భగవంతుడిని ప్రకటించగలదు. భరించగలదు. కాబట్టి హనుమ రామయ్యను భుజాల మీద కూర్చోపెట్టుకున్నాడంటే హనుమ వేదస్వరూపుడని చెప్పకనే చెప్పినట్లయింది. 

 

శ్రీరాముడు తన పట్టాభిషేక సమయంలో అందరికీ కానుకలతో కృతజ్ఞతను తెలియజేస్తూ, హనుమను కూడా ఏంకావాలో కోరుకోమన్నాడు. అప్పుడు హనుమ ‘నాకు నీయందు సదా పరమమైన ప్రేమను ప్రసాదించ’మన్నాడు. ఆ మాటకు రాముని హృదయం పరవశించి, సింహాసనం నుంచి దిగి హనుమను బిగియారా కౌగలించుకుని ఆశీర్వదించాడు. అంతేకాదు నీవు చేసిన ఒక్కొక్క ఉపకారానికి నా ప్రాణాలు ఇస్తాను. కాని ఉపకారాలు మిగిలిపోతాయి. ఆ విషయంగా నేను ఋణగ్రస్తుణ్ణి. నీ ఉపకారాలు నా దేహంలో జీర్ణమై పోనీ.  నీవల్ల నా కష్టాలు  తొలిగాయి. నీకు ఉపకారం చేయాలంటే నాకు వచ్చిన కష్టాలు నీకు రావాలి. నీకు కష్టం కలిగిందన్న ఊహ వచ్చినా నా మనస్సు బాధపడుతుంది. అది చెడు భావన. అటువంటి భావన రాకుండా నీ ఉపకారాలన్నీ నాలో జీర్ణమైపోవుగాక’ అని కోరుకుంటాను అంటాడు. ఇది హనుమపై శ్రీరాముని భావన మాత్రమే కాదు. తరచి చూసేత ఆత్మ-పరమాత్మల కలయికకు ప్రతీక.

 

         

కర్తృత్వ, భోక్తృత్వ జ్ఞాతృత్వాల పట్ల అహంకార, మమకారాలు లేని వాడు హనుమ. తాను భగవంతుని ప్రేరణతోనే బయలుదేరానని, రామబాణం వలే (యథా రాఘవ నిర్ముక్త శ్శరస్వశన విక్రమః -  వాల్మీకి రామాయణం) లంకలో ప్రవేశించగలనని చెప్పాడే కాని తన శక్తి సామర్థ్యాలను ప్రకటించలేదు. ఇది హనుమ స్వరూపాన్ని చక్కగా చిత్రించే సంఘటన. రామరావణ యుద్ధంలో మూర్ఛితుడైన లక్ష్మణుని

పునరుజ్జీవింపజేయటానికి సంజీవని పర్వతాన్ని తెచ్చినప్పుడు, నన్ను నా వంశాన్ని నిలిపావంటూ హనుమను చిరంజీవిగా ఆశీర్వదించాడు రాముడు. హనుమంతుని ప్రజ్ఞాపాటవాలను కిష్కింధాకాండ నుంచి చూసి ప్రశంసించకుండా ఉండలేం. మంత్రిగా, సేనానాయకునిగా, సలహాదారునిగా విభీషణ శరణాగతి సందర్భంలో దౌత్యవేత్తగా, కార్య కుశలుడుగా, సత్యశీలిగా, కర్తవ్యనిష్టునిగా, మహాబలవంతునిగా ఇలా ఎన్నో రూపాల్లో చూస్తాం. అందుకే హనుమ రామాయణం అనే మణిహారంలో రత్నమై వెలిగొందాడు. 

 

మనుస్మృతిలో చెప్పినట్లు ప్రభువు పట్ల అనురాగం, కపటమెరుగని స్థితి, సమర్థత, జ్ఞానం దేశకాలతత్త్వం తెలిసి ఉండటం, మంచి దేహదారుఢ్యం, భయమన్నది లేకపోవడం, వాక్పటుత్వం దూతకు ఉండాలి. ఈ లక్షణాన్నీ హనుమలో పుష్కలంగా ఉన్నాయి. అందుకే శ్రీరాముని ప్రేమకు పాత్రుడయ్యాడు. అటువంటి హనుమను మనసారా స్మరిస్తే బుద్ధి, కీర్తి, బలం, ధైర్యం, నిర్భయత్వం, రోగాలు లేకుండా ఉండడం, వాక్పటుత్వం మొదలైన మంచి లక్షణాన్నీ  ప్రాప్తిస్తాయి.

--------------------------------------

రచన

డాక్టర్ కప్పగంతు రామకృష్ణ, లెక్చరర్, కె.బి.ఎన్.కాలేజీ, కొత్తపేట, విజయవాడ-1

సెల్: 9032044115

 


Tuesday, March 7, 2023

దీపారాధన ఎందుకు చెయ్యాలి? దీపారాధన ప్రాముఖ్యత ఏమిటి? దీపం వెలిగించడంలో అంతరార్థం ఏమిటి?

 

దీపారాధన


దీపారాధన ఎందుకు చెయ్యాలి? 


దీపారాధన ప్రాముఖ్యత ఏమిటి? 


దీపం వెలిగించడంలో అంతరార్థం ఏమిటి?


           పంచభూతాత్మకమైన సృష్టికి ప్రతీక దీపం. మట్టి ప్రమిద భూతత్వానికీ, తైలం జలతత్వానికీ, వత్తి ఆకాశతత్వానికీ, వెలగడానికి తోడ్పడే గాలి వాయుతత్వానికీ, జ్యోతి అగ్ని తత్వానికీ ప్రతీకలు. మనిషి శరీరమూ పంచభూతాల సమాహారమే కాబట్టి దీపాన్ని వెలిగించడమంటే మనల్ని మనం వెలిగించుకోవడమే. మనలోని అజ్ఞానపు అంధకారాల్ని నశింపజేసే ఆ పరమాత్మకు సమీపంగా వెళ్లడమే. దీపం దానంతట అది ఎలా వెలగలేదో మనిషీ పుట్టుకతో జ్ఞాని కాలేడు. అందుకే దేవుడి ముందు దీపాన్ని వెలిగించి ఆ వెలుగులో మన ఆత్మదీపాన్ని వెలిగించుకుంటాం. లోలోపలి చీకట్లను వదిలించుకుంటాం. దీపానికి ఉండే మరో ప్రత్యేకత... అది ఎప్పుడూ ఊర్ధ్వదృష్టినే కలిగి ఉండటం. దీపం నుంచి అజ్ఞానమనే చీకట్లను పారదోలడం నేర్చుకున్నట్లే మనస్సును అల్పవిషయాలవైపు మళ్లించకుండా ఊర్ధ్వదృష్టిని కలిగి ఉండటమూ నేర్చుకోవాల్సిన పాఠమే.

          సృష్టి, స్థితి, లయలకు దీపంతో సన్నిహితమైన సంబంధం ఉంది. దీపం ప్రజ్వలించినప్పుడు వచ్చే ఆ కాంతిని త్రిమూర్తులకు ప్రతీకగా పూర్వ ఋషులు పేర్కొన్నారు. ఆ కాంతిలో అంతర్లీనంగా కనిపించే నీల వర్ణం స్థితికారుడైన విష్ణువుకు, తెల్ల రంగు లయకారుడైన శివునకు, ఎర్ర రంగు సృష్టికర్త బ్రహ్మకు సంకేతాలుగా అభివర్ణించారు. విద్య, శక్తి, సంపదలను ప్రసాదించే ముగ్గురమ్మలు సరస్వతి, దుర్గ, లక్ష్మి- ఆ కాంతిలో కొలువై ఉంటారని పెద్దలు అంటారు.

          ‘‘వైరాగ్య తైల సంపూర్ణే, భక్తి వర్తి సమన్వితే / ప్రబోధ పూర్ణపాత్రేతు జ్ఞానదీపం విలోక్యత్‌’’ అన్నారు ఋషులు. అంటే ప్రబోధంఅనే ప్రమిదలో, ‘వైరాగ్యంఅనే తైలం పోసి, ‘భక్తిఅనే వత్తిని వెలిగించి, జ్ఞానజ్యోతిని ప్రకాశింపజేయాలని అర్థం. ఆ జ్యోతి ప్రసరించే ప్రకాశాన్ని దర్శించి, వారు ముక్తి పొందారు.

          ముక్తిని ప్రసాదించేవాడు పరమాత్మ. ఆ పరమాత్మకు సంకేతం జ్యోతి. పరమాత్మే పరంజ్యోతిఅని వేదం అంటోంది. పరమాత్మ యజ్ఞ స్వరూపుడు. యజ్ఞ చిహ్నాన్ని దీపంగా భావిస్తారు. జ్యోతి లేదా దీప ప్రజ్వలన అంటే యజ్ఞం చేయడమే! దీపావళి రోజున దీపాలను ప్రజ్వలింపజేసి, జగన్మాతకు ధారపోసి, భక్తి ప్రపత్తులను సమర్పించుకోవడమే దీపయజ్ఞం. ఆ దీపాలను ఇంటి ముంగిట, దైవీ వృక్షాల చెంత, ఇంటిలోని ద్వారాల దగ్గర వరుసలుగా పేర్చడం దీపయజ్ఞంలో భాగమే. దీప దర్శనం పాపాలను హరిస్తుంది. దీపకాంతి దేవతలకు అత్యంత ప్రీతికరం. అందుకనే ప్రతి పూజారంభానికీ, శుభకార్యాలకూ దీప ప్రజ్వలనం ముఖ్యం. లౌకికంగా చెప్పాలంటే, మన హృదయాన్ని ప్రమిదగా భావించి, అందులో భకి్త అనే తైలం పోసి, ‘ప్రేమఅనే వత్తి నిలిపి వెలిగించేదే దీపం.

          దీపావళి పర్వాన్ని గురించి పురాణేతిహాసాలు విస్తృతంగా ప్రస్తావించాయి. రామాయణంలో రఘుకులాన్వయదీపునిగా రాముణ్ణి కీర్తిస్తూ, వనవాసానంతరం సీతారాముల పట్టాభిషేక సమయంలో అయోధ్యలో ప్రజలు దీపోత్సవం జరుపుకొన్నారట. కురుక్షేత్ర సంగ్రామానంతరం ధర్మరాజు విజయుడై పట్టాభిషేకం చేసుకున్న సందర్భంలో హస్తినాపుర ప్రజలు ఆనందోత్సాహాలతో దీపాలను వెలిగించి పండగ చేసుకున్నారని మహాభారతం చెబుతోంది. నచికేతుడు తన మేధస్సుతో యముడిని సంతృప్తిపరచి, ఆత్మను గురించి తెలుసుకున్నాడు. యముడి నుంచి స్వేచ్ఛ పొంది, నచికేతుడు తిరిగి భూలోకానికి వచ్చిన సందర్భంలో జరిగిన దీపోత్సవమే దీపావళి అని కఠోపనిషత్తుకథనం. క్షీరసాగర మథన సమయంలో అవతరించిన శ్రీమహాలక్ష్మికి దీపాలను వెలిగించి దేవతలు స్వాగతం పలికారని పద్మపురాణంపేర్కొంటోంది. దుష్ట దనుజులను దునుమాడిన మహాకాళిని జ్యోతిగా, లక్ష్మీస్వరూపంగా ఆరాధించినట్టు కాళికాపురాణం చెబుతోంది.

 

          దుర్వాస ముని శాపంతో ఇంద్ర పదవిని దేవరాజు కోల్పోయి, శ్రీ మహావిష్ణువును శరణు వేడాడనీ, ‘లక్ష్మీ జపధ్యానాలు చేస్తే, తిరిగి నీ పదవి నీకు దక్కుతుందని విష్ణుమూర్తి చెప్పాడనీ, ఆ ప్రకారం లక్ష్మీదేవి కోసం అతను తపస్సు చేసి, ఇంద్రపదవిని తిరిగి పొందాడనీ ఒక కథ ఉంది. దీపావళిని దీపాన్వికగా భవిష్య, నారద పురాణాలు పేర్కొన్నాయి. స్కాంద పురాణంలో దీపావళి గురించిన వివరణ విస్తారంగా ఉంది. నారద పురాణం దీన్ని దీప దాన మహోత్సవంఅని చెప్పింది. ముద్రారాక్షస గ్రంథం శారదోత్సవంగా, నాగానందం గ్రంథంలో దీప ప్రతిపాదనోత్సవంగా దీపావళిని పేర్కొన్నారు.

          'దీపేన సాధ్యతే సర్వం' అని శాస్త్రవచనం. 'దీపంతో దేనినైనా సాధించవచ్చు' అని భావం. నిత్యం దీపారాధన భారతీయుల సంప్రదాయం. ఉభయసంధ్యల్లో ఇంట్లో వెలిగించిన దీపం ఐశ్వర్యకారకం- అని ధార్మిక గ్రంథాలు బోధిస్తున్నాయి. 'ఏదైనా కోరిక తీరాలంటే, ఒక దీపాన్ని వెలిగించి- ఖర్జూరమో, ఎండుద్రాక్షో లేదో ఏదైనా ఫలమో నైవేద్యం పెట్టి నమస్కరించితే చాలు' అని ఆనవాయితీగా దీపారాధన కొనసాగుతోంది. ఇలా దీపారాధన చేయడంవల్ల ఏ ప్రయోజనమైనా పొందవచ్చు- అన్నది శాస్త్రోక్తి.

 

          దేవతలు ప్రకాశస్వరూపులనీ, కాంతి-శుభానికీ, జ్ఞానానికీ, శాంతికీ సంకేతమనీ చాటిచెప్పే ఆర్షభావన దీప ప్రజ్వలనలో కనిపిస్తోంది. జ్యోతిని వెలిగించడం శుభారంభం. తేజోమయులైన దేవతలు దీపంద్వారా సంతోషిస్తారనీ, దీపప్రకాశంలో సన్నిహతులవుతారనీ పురాణ ఋషుల దర్శనం. దీపకాంతి దివ్యత్వ ప్రతీక కనుక, ఆ దివ్యత్వాన్ని కావాలని ఆశిస్తూ దీపంద్వారా వ్యక్తీకరించుకుంటున్నాం. 'దీపమున్న చోట దేవతలుంటారు'- అనడం ఈ కారణం వల్లనే.

 

          కేవలం దీపాన్ని మాత్రమే వెలిగించి, ఆ జ్యోతిని ఆలంబనగా పరంజ్యోతి అయిన పరమాత్మను ధ్యానించడం ఒక యోగ ప్రక్రియ. భర్తృహరి తన శతక సాహిత్యంలో పరమేశ్వరుని 'జ్ఞానదీపం'గా అభివర్ణించాడు. ఈ దీపం యోగుల హృదయగృహంలో సుస్థిరంగా దీపిస్తోందని సంభావించాడు.


          భారత పురాణ ఇతిహాసాల్లోనూ, వేద వేదాంగాల్లోనూ దీపానికి ఉత్కృష్టమైన స్థానం ఉంది. దీపంలో మనం మొట్టమొదటిగా చూసే సుగుణం కాంతే కానీ అంతకు మించిన ఒక స్ఫూర్తిని దీపం మనకు అందిస్తుంది. దీపం చివరి వరకు తన కాంతిని పరులకి పంచుతుంది. తన నుండి మరొక దీపాన్ని వెలిగించేందుకు తపిస్తుంది. దీపం మనోవికాసానికీ, ఆనందానికీ, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. వెలుగు సంతోషకారకం. చీకటి కష్టకారకం. జీవితం చీకటి వెలుగుల కలయిక. జ్ఞాన వెలుగుల్ని ప్రసాదించేది దీపం. అజ్ఞానానికి చిహ్నమైన తమస్సును నశింపచేసి జీవులకు వెలుగు మార్గాన్ని చూపించేదే దీపం. అందుకే దీపం పరబ్రహ్మ స్వరూపంఅని భావిస్తూ ఆరాధిస్తారు. వెలిగించడంసనాతన భారతీయ సంస్కృతి.

          మంత్రశాస్త్ర ప్రకారం సాక్షాత్ దీపం దర్శయామిఅనే మంత్రం చదువుతూ గృహాన్ని శుభ్రం చేసి, నీటిని చల్లి, ముగ్గులు పెట్టి ధూపం వెలిగించి దీపం పెట్టడంవల్ల సకల దుష్ట గ్రహ శక్తులు నశించి వాతావరణం పరిశుభ్రం అవుతుంది. అప్పుడే ఆ గృహం పూజార్హతకు అవకాశం కలుగుతుంది. దీపం వెలిగించగానే ఇంటికి లక్ష్మీకళ వచ్చేస్తుంది. లక్ష్మీదేవి దీపవాసిని. దీపకాంతి నుంచే కళ పుడుతుంది. దీపం అమంగళాన్నీ, దారిద్య్రాన్నీ, అరిష్టాల్ని పారద్రోలే శక్తి స్వరూపం. దీపం వెలగని ఇంట్లో అలక్ష్మి తాండవిస్తుందంటారు పెద్దలు. పూర్వకాలంలో ప్రతి ఇంటా నిత్యం అగ్నిహోత్రం నిర్వహించేవారు. కానీ నేటి పరిస్థితుల దృష్ట్యా రోజూ అగ్నిహోత్రం వెలిగించడం సాధ్యం కాదు. కానీ ఇంట్లో రోజూ ఉదయం, సాయంకాలం దీపారాధన చేయడం శుభప్రదం. మరణించిన వ్యక్తులకు ఉత్తమ గతులు సిద్ధించాలన్నా దీపాలు వెలిగించాలని శాస్త్రాలు చెబుతున్నాయి.

==============

 డాక్టర్ కప్పగంతు రామకృష్ణ

సెల్: 90320 44 115 / 8897 547 548

 

 


ధర్మమూర్తి... సమదర్శి.... జగద్గురు కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి

  ధర్మమూర్తి... సమదర్శి ఆయన పేరు పలికితేనే చాలు... వ్యక్తం చేయటానికి మాటలు చాలని అనుభూతి కలుగుతుంది. ఆ కళ్ళలోని వెలుగు ఏదో తెలియని కారుణ్యాన...