Showing posts with label devotional. Show all posts
Showing posts with label devotional. Show all posts

Thursday, April 18, 2024

తెలుగింటి రాముడు


 
 
 శ్రీరామ

తెలుగింటి రాముడు

రామనామం ఓ తారకమంత్రం. రాముడి వంటి కుమారుడు, సోదరుడు, భర్త, నాయకుడు, మిత్రుడు, పరిపాలకుడు, ధర్మమూర్తి... మరొకరు లేరు అనేది నిర్వివాదం. ప్రతి మనిషికీ రాముడితో ఓదో ఒక అనుబంధం ఉంటుంది. ఆ పేరు చెబితేనే ఆత్మీయత ప్రకటితమవుతుంది.  ప్రత్యేకించి తెలుగు ప్రజలకు రాముడు దేముడు మాత్రమే కాదు. తెలుగు జీవితాల్లో రాముడొక భాగం. రాములోరి పెళ్ళి, లక్ష్మణదేవర నవ్వు, సీతాదేవి నిద్ర అంటూ తెలుగు జానపదులు కూడా రాముడితో చుట్టరికం కలుపుకున్నారు. అదీ రామయ్య ఘనత. రామకథ మహిమ. 


తెలుగులో వచ్చిన తొలి రామాయణం గోన బుద్ధారెడ్డి రాసిన రంగనాథ రామాయణం. ద్విపద ఛందస్సులో వచ్చిన ఈ రామాయణాన్ని పాటలుగా పాడుకుని మురిసిపోయిన తెలుగు లోగిళ్ళు లక్షల్లో ఉన్నాయి. సీతారాముల దాంపత్యంలోని ఔన్నత్యాన్ని తేలికైన మాటలతో చెబుతూనే బరువైన భావాన్ని పలికించాడు బుద్ధారెడ్డి.


రాముడి ధనుర్విద్యాకౌశలం ఎంత గొప్పదంటే “నల్లవో  రఘురామ! నయనాభిరామ! విలువిద్య గురువ  వీరావతార --------- బాపురే రామా భూపాల! లోకముల నే పాటి విలుకాడు నేర్చునే కలుగ” అంటూ పగవాడైన రావణాసురుడు కూడా రామయ్య కోదండకళకు అబ్బురపడి భళీ అని ప్రశంసించాడు.


రావణుడు అపహరించిన విషయం తెలియక రాముడు సీతమ్మ గురించి వెతుకుతూ... ‘‘ఇది మహారణ్యమై యిప్పుడు తోచె / ఇది పర్ణశాలయై యిప్పుడు తోచె / ఇది నాకు దపమని యిప్పుడు తోచె / చల్లని ముఖదీప్తి చంద్రునికిచ్చి / తెల్లని నగవు చంద్రికలకు నిచ్చి / చెలువంపు పలుకులు చిలుకల కిచ్చి / నిన్ను దైవము మ్రింగెనే నేడు సీత’’ - చంద్రుడిలోనూ, వెన్నెలలోనూ, చిలుకల పలుకుల్లోనూ రాముడికి సీత కనిపిస్తోంది. అందుకే సీతమ్మ ఏ అడవి జంతువు వల్ల మృత్యువాత పడిందో అనుకుంటూ ఆవేదన చెందుతాడు.  


ప్రతి అడుగులోనూ, ప్రతి అణువులోనూ భార్యాభర్తలు ఒకరికొకరు కనిపించాలి. అప్పుడే ఆ దాంపత్యానికి సార్థకత ఏర్పడుతుందని రంగనాథ రామాయణం ప్రకటించింది. ఇలా ఎన్నో భావాలు ప్రకటిస్తూ, సీతను తెలుగు జానపదుల ఆడపడుచుగా, రాముడిని జానపదుల దేవుడిగా తీర్చిదిద్ది, వారి హృదయాల్లో శాశ్వతస్థానం కల్పించాడు బుద్ధారెడ్డి. తెలుగు పల్లెల్లో పేటపేటకూ కనిపించే రామాలయాలు, ఇంటింటా వినిపించే సీతారాముల పేర్లూ  ఈ రామాయణ ప్రభావమే.


కవయిత్రి ఆతుకూరి మొల్ల ‘చెప్పుమని రామచంద్రుఁడు / సెప్పించిన పలుకుమీదఁ జెప్పెద’ అంటూ రామాయాణం రచించింది. రాముడికే కాదు రామపాద ధూళికి కూడా ఎంతో మహత్తు ఉందంటూ మొల్ల రామ వనవాస సందర్భంలో చెబుతుంది. అరణ్య వాసానికి బయల్దేరిన రాముడు సీతాలక్ష్మణ సమేతంగా గంగానది దాటాలని ఓడ నడిపే గుహుడిని కోరతాడు. దానికి గుహుడు రాముని పాదధూళి సోకి రాయి కాంతగా మారింది కదా, తన ఓడ కూడా ఏమౌతుందోనని భయం వేస్తోంది. అందుకే నీ పాదాలు కడుగుతాను అంటూ రాముని పాదాలు కడుగుతాడు. 

చ. సుడిగొని రాము పాదములు సోఁకిన ధూళి వహించి రాయి యే
ర్పడ నొక కాంత యయ్యె నఁట, పన్నుగ నీతని పాద రేణు వి
య్యెడ వడి నోడసోఁక నిది యేమగునో” యని సంశయాత్ముఁడై
కడిగె గుహుండు రామపద కంజయుగంబు భయమ్ము పెంపునన్‌. 


వాల్మీకి రామాయణంలో లేని ఈ మొల్ల వర్ణన తరువాత ఎందరో తెలుగు కవుల భావనల్లో ప్రతిధ్వనించింది.

అలా అడవిలో నడుచుకుంటూ వెళ్తున్న సీతారామ లక్ష్మణులను అక్కడి చెంచు స్త్రీలు చూసారు. రతీ మన్మథులను మించిన అందంతో ప్రకాశిస్తున్న సీతారాముల్ని చూస్తూ, తమలో తాము...

చ. ఇతనికిఁ బాదచారితన మేటికి వచ్చెనో? పట్టభద్రుఁ డీ
సతి నవ రూప రేఖలను జక్కని దయ్యును నిట్టి దుర్దశల్‌
ప్రతివసియించు టెట్లో? రతిరాజ సమానుల వీరి నేల యీ
గతిఁ బడఁద్రోచె బ్రహ్మ?” యని కాంతురు చెంచెత లమ్మహాత్ములన్‌. 

ఇంతటి అందగాళ్ళను బ్రహ్మ ఈ అడవుల్లో ఎలా పడేయగలిగాడో అంటూ బ్రహ్మను కూడా నిందించారు. రామయ్య సౌందర్యం అంత గొప్పది. అది కేవలం భౌతిక అందం కాదు. మాటలకందని పారమార్థిక భావనాత్మక సౌందర్యం.


లంకను నుంచి తిరిగి వచ్చిన హనుమంతుడు రాముడిని చూస్తూనే...

“కంటిన్ జానకి బూర్ణచంద్ర వదనన్ గల్యాణి నా లంకలో
గంటిన్ మీ పదపంకజంబులను నే గౌతూహలం బొప్పగా
గంటిన్ మీ కరుణావలోకనము విఖ్యాతంబుగా గీర్తులం
గంటిన్ మా కపి వీర బృందములలో గాంభీర్యవారాన్నిధీ”

- చూసితి సీతను అంటూ రాముడి మనసుకు గొప్ప సాంత్వన కలిగిస్తాడు. అంతేకాదు, సీతలో రామయ్య ఎలా కనిపిస్తున్నాడో కూడా చెబుతాడు. సీత, రాముడు – ఇద్దరు కాదు ఒక్కరే అనే భావాన్ని మొల్ల ఎంతో రమ్యంగా చెప్పింది.

రామకథను ప్రబంధంగా తీర్చిదిద్దిన కవి అయ్యలరాజు రామభద్రుడు. శివధనస్సును రాముడు ఎక్కుపెట్టగానే అది ఫెళ్ళుమని పెద్దశబ్దం చేస్తూ విరిగిపోతుంది.

‘ఆ రమణీయ ధనుష్ఠం / కారము సీతాకుమారికా కల్యాణ / ప్రారంభవాద్య నిరవ / ద్వారమై యొసగె సకల హర్ష ప్రదమై’’  - సీతారాముల కల్యాణ వేడుక కోసం మొదటిగా మోగిన మంగళవాద్యం శివధనుర్భంగం సందర్భంగా వచ్చిన శబ్దమే అంటూ కవి చమత్కరించాడు. అంతేకాదు...

ఆ కరియాన వేనలి అనంత విలాసము మాధవోదయం
బా కమలాయతాక్షి మధురాధర సీమ, హరి ప్రకారమా
కోకిల వాణి మధ్యమున కూడిన దింతియ కాదు, తాను రా
మాకృతి దాల్చె ఈ చెలువమంతయు ఆ యమయందు జొప్పుడున్

సీత పూర్తిగా రాముడిగా మారిపోయిందంటాడు కవి. సీతమ్మను చూస్తే రామయ్యే కనిపిస్తున్నాడట. అంటే, సీతారాములకు అభేదం. శివపార్వతులే కాదు సీతారాములూ అర్ధనారీశ్వరులే. దాంపత్యానికి అర్థం, పరమార్థం ఇదే అంటూ గొప్పగా ప్రకటించింది రామాభ్యుదయ ప్రబంధం.

వానర సేనతో సహా సముద్రాన్ని దాటిన రాముడు, యుద్ధ ప్రారంభానికి ముందు అక్కడి సువేల పర్వతాన్ని ఎక్కి లంకను తేరిపార చూస్తాడు.

తనదు ప్రాణేశ్వరి, మహీతనయ కేడ
యావహిల్లునొ దురవస్థ యనుచు గాక
చుఱుకు జూపుల రఘుపతి జూచినపుడ
లంక యాహుతి గొనదె నిశ్శంక మహిమ

లంకలో ఉన్న తన ప్రాణేశ్వరికి ఏమైనా ఆపద కలుగుతుందేమో అని ఊరకున్నాడు కానీ, మూడోకన్ను తెరచిన శివుడి  మాదిరిగా తన చూపులతోనే లంకను రాముడు కాల్చివేసేవాడట. రాముడు సాక్షాత్తు శివ స్వరూపమే అని చెప్పటంతో పాటు, శివ కేశవ అభేదం కూడా ఈ పద్యంలో ప్రకటించాడు రామభద్ర కవి.

యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోయిన సందర్బంలో రాముడికి వచ్చిన కోపం ఎంతటి ఉత్కృష్టమైనదో వర్ణించడం ఎవరికీ సాధ్యం కాదు.

అభ్రంకష రధ కపి చి / త్ర భ్రమణంబుల వెలింగె ప్రళయాంతక ఫా / ల భ్రాజిష్టు భ్రుకుటీ / విభ్రమ ధౌరేయమైన విల్లుందానున్ - మూర్ఛపోయిన తమ్ముడి వంక మాటిమాటికీ చూస్తూ, రాముడు తన కోదండాన్ని పట్టుకున్న విధానాన్ని చూస్తేనే, ఇక రావణుడికి మృత్యుఘడియ దగ్గరపడిందనే సందేశం ఆ సన్నివేశం చూస్తున్నవారికి అందిందట.


అసలు రాయడం అంటూ జరిగితే రామాయణమే రాయాలి. తనలోని జీవుడి వేదన తీరాలన్నా, తన తండ్రి ఇచ్చిన ఆదేశాన్ని పాటించాలన్నా రామాయణమే రాయాలి. ఇంకే కథ రాసినా అది కట్టుకథే అవుతుందంటూ నిర్మొహమాటంగా చెప్పిన ‘కవిసమ్రాట్’ విశ్వనాథ సత్యనారాయణ. తన రామాయణ కల్పవృక్షంలో రాముడి వైభవాన్ని ప్రపంచం పట్టలేనంతగా విస్తరించి రాసారు. 


జనకుడి సభలో రాముడు ఎక్కుపెట్టిన శివధనుస్సు విరిగిన శబ్దం 

నిష్ఠావర్ష దమోఘ మేఘపటలీ నిర్గచ్ఛదుద్యోతిత
స్పేష్ఠేరమ్మదమాలికా యుగప దుజ్జృంభన్మహా ఘోరబం
హిష్ఠ స్ఫూర్జధుషండమండిత రవాహీన క్రియా ప్రౌఢి ద్రా
ఘ్రిష్ఠంబై యొకరావ మంతట నెసంగెన్ ఛిన్న చాపంబునన్.

ఉరుముల గుంపు నుండి వచ్చే ధ్వనిలాగా శివధనుస్సు విరిచినప్పుడు శబ్దం వచ్చిందట. అక్కడితో ఆగలేదు విశ్వనాథ కవితావేశం. భూమి నుంచి వరుసగా ఐదు ఊర్ధ్వ లోకాల్లో ఆ శబ్దం ఎలా వినబడిందో వివరిస్తూ వరుసగా ఐదు పద్యాలు రాసారు. అదీ రామయ్య బాహు విక్రమం. 

ఇరువదినాలు గేండ్లుగ నిదెప్పు డిదెప్పు డటంచుఁ గన్నులం
దెఱచి ప్రతీక్ష చేయుదుగదే, జగదేకధనుష్కలానిధీ !
విఱచిన వెండికొండదొర వింటిని వింటినిగాని చూడలే
దఱుత వహింప ధాత్రిఁ గనులారగఁ జూతునురా కుమారకా !


శివధనుస్సును విరిచి, సీతమ్మను వివాహం చేసుకున్న సందర్భంలో కౌసల్య మనోభావం ఇది. ఇరవై నాలుగేళ్ళుగా ఈ కల్యాణ ఘడియ కోసమే నిరీక్షిస్తున్నాను కుమారా... అంటూ ఆ తల్లి రాల్చిన ఆనందాశ్రువులు సీతారాముల కల్యాణానికి అక్షతలుగా మారాయి.

అశోకవనంలో రాక్షస స్త్రీల సమూహం మధ్య కూర్చున్న తేజోవతి అయిన ఓ స్త్రీని హనుమంతుడు చూసాడు. ఆమె ఎవరో తెలియదు. కానీ, ఆమెను చూస్తుంటే...

*ఆకృతి రామచంద్ర విరహాకృతి కన్బొమ తీరు స్వామి చా*
*పాకృతి కన్నులన్ ప్రభు కృపాకృతి కైశిక మందు స్వామి దే*
*హాకృతి సర్వదేహమున యందును రాఘవ వంశమౌళి ధ*
*ర్మాకృతి కూరుచున్న విధమంతయు రామ ప్రతిజ్ఞ మూర్తియై* *

అప్పటివరకూ తాను చూసిన రామచంద్రమూర్తి విరహమంతా మనిషి రూపం ధరిస్తే ఎలా ఉంటుందో ఆ స్త్రీ మూర్తి అలా కనిపించింది. రాముడి కోదండాన్ని ఆమె కనుబొమల్లో స్పష్టంగా చూడవచ్చు. ఆమె కళ్ళల్లో రాముడి దయాగుణం, కేశాల్లో రాముని మేనిఛాయ, ఆమె శరీరంలోని అణువణులో రఘువంశ ధర్మం బొమ్మకట్టినట్లు కనిపిస్తోంది. అంతేకాదు... తన ధర్మపత్నిని అపహరించిన వాడిని సంహరిస్తానని రాముడు చేసిన ప్రతిజ్ఞ ఆకారం ధరించిందా అన్నట్లు ఆమె కూర్చున్నదట. 

విశ్వనాథ కల్పవృక్షంలోనూ సీతారాములు ఇద్దరు మనుషులు కారు. రెండు భౌతిక రూపాల్లో ప్రకటితమయ్యే  ఒకే ఆత్మ.

ఇంకా... రఘునాథ రాయలు (రఘునాథ రామాయణం), ఘనగిరి రామకవి (యథావాల్మీకి రామాయణం), చెన్న కృష్ణయ్య (సాంఖ్య రామాయణం), గంగయ్య (తారకబ్రహ్మ రామాయణం).... ఇలా తెలుగులో సుమారు 130 వరకు రామాయణాలు వచ్చాయి. 
 
అన్నిటా ఒకటే సందేశం... రాముడు భారతజాతి ఆత్మ.
--------------------------------------------------------------
భక్తి పత్రిక ఏప్రిల్, 2024 సంచికలో ప్రచురితమైన వ్యాసం
----------------------------------------------------------------
రచన : డాక్టర్ కప్పగంతు రామకృష్ణ, అసోసియేట్ ప్రొఫెసర్, కెబిఎన్ కళాశాల (అటానమస్), విజయవాడ-1
 


 

Tuesday, March 7, 2023

దీపారాధన ఎందుకు చెయ్యాలి? దీపారాధన ప్రాముఖ్యత ఏమిటి? దీపం వెలిగించడంలో అంతరార్థం ఏమిటి?

 

దీపారాధన


దీపారాధన ఎందుకు చెయ్యాలి? 


దీపారాధన ప్రాముఖ్యత ఏమిటి? 


దీపం వెలిగించడంలో అంతరార్థం ఏమిటి?


           పంచభూతాత్మకమైన సృష్టికి ప్రతీక దీపం. మట్టి ప్రమిద భూతత్వానికీ, తైలం జలతత్వానికీ, వత్తి ఆకాశతత్వానికీ, వెలగడానికి తోడ్పడే గాలి వాయుతత్వానికీ, జ్యోతి అగ్ని తత్వానికీ ప్రతీకలు. మనిషి శరీరమూ పంచభూతాల సమాహారమే కాబట్టి దీపాన్ని వెలిగించడమంటే మనల్ని మనం వెలిగించుకోవడమే. మనలోని అజ్ఞానపు అంధకారాల్ని నశింపజేసే ఆ పరమాత్మకు సమీపంగా వెళ్లడమే. దీపం దానంతట అది ఎలా వెలగలేదో మనిషీ పుట్టుకతో జ్ఞాని కాలేడు. అందుకే దేవుడి ముందు దీపాన్ని వెలిగించి ఆ వెలుగులో మన ఆత్మదీపాన్ని వెలిగించుకుంటాం. లోలోపలి చీకట్లను వదిలించుకుంటాం. దీపానికి ఉండే మరో ప్రత్యేకత... అది ఎప్పుడూ ఊర్ధ్వదృష్టినే కలిగి ఉండటం. దీపం నుంచి అజ్ఞానమనే చీకట్లను పారదోలడం నేర్చుకున్నట్లే మనస్సును అల్పవిషయాలవైపు మళ్లించకుండా ఊర్ధ్వదృష్టిని కలిగి ఉండటమూ నేర్చుకోవాల్సిన పాఠమే.

          సృష్టి, స్థితి, లయలకు దీపంతో సన్నిహితమైన సంబంధం ఉంది. దీపం ప్రజ్వలించినప్పుడు వచ్చే ఆ కాంతిని త్రిమూర్తులకు ప్రతీకగా పూర్వ ఋషులు పేర్కొన్నారు. ఆ కాంతిలో అంతర్లీనంగా కనిపించే నీల వర్ణం స్థితికారుడైన విష్ణువుకు, తెల్ల రంగు లయకారుడైన శివునకు, ఎర్ర రంగు సృష్టికర్త బ్రహ్మకు సంకేతాలుగా అభివర్ణించారు. విద్య, శక్తి, సంపదలను ప్రసాదించే ముగ్గురమ్మలు సరస్వతి, దుర్గ, లక్ష్మి- ఆ కాంతిలో కొలువై ఉంటారని పెద్దలు అంటారు.

          ‘‘వైరాగ్య తైల సంపూర్ణే, భక్తి వర్తి సమన్వితే / ప్రబోధ పూర్ణపాత్రేతు జ్ఞానదీపం విలోక్యత్‌’’ అన్నారు ఋషులు. అంటే ప్రబోధంఅనే ప్రమిదలో, ‘వైరాగ్యంఅనే తైలం పోసి, ‘భక్తిఅనే వత్తిని వెలిగించి, జ్ఞానజ్యోతిని ప్రకాశింపజేయాలని అర్థం. ఆ జ్యోతి ప్రసరించే ప్రకాశాన్ని దర్శించి, వారు ముక్తి పొందారు.

          ముక్తిని ప్రసాదించేవాడు పరమాత్మ. ఆ పరమాత్మకు సంకేతం జ్యోతి. పరమాత్మే పరంజ్యోతిఅని వేదం అంటోంది. పరమాత్మ యజ్ఞ స్వరూపుడు. యజ్ఞ చిహ్నాన్ని దీపంగా భావిస్తారు. జ్యోతి లేదా దీప ప్రజ్వలన అంటే యజ్ఞం చేయడమే! దీపావళి రోజున దీపాలను ప్రజ్వలింపజేసి, జగన్మాతకు ధారపోసి, భక్తి ప్రపత్తులను సమర్పించుకోవడమే దీపయజ్ఞం. ఆ దీపాలను ఇంటి ముంగిట, దైవీ వృక్షాల చెంత, ఇంటిలోని ద్వారాల దగ్గర వరుసలుగా పేర్చడం దీపయజ్ఞంలో భాగమే. దీప దర్శనం పాపాలను హరిస్తుంది. దీపకాంతి దేవతలకు అత్యంత ప్రీతికరం. అందుకనే ప్రతి పూజారంభానికీ, శుభకార్యాలకూ దీప ప్రజ్వలనం ముఖ్యం. లౌకికంగా చెప్పాలంటే, మన హృదయాన్ని ప్రమిదగా భావించి, అందులో భకి్త అనే తైలం పోసి, ‘ప్రేమఅనే వత్తి నిలిపి వెలిగించేదే దీపం.

          దీపావళి పర్వాన్ని గురించి పురాణేతిహాసాలు విస్తృతంగా ప్రస్తావించాయి. రామాయణంలో రఘుకులాన్వయదీపునిగా రాముణ్ణి కీర్తిస్తూ, వనవాసానంతరం సీతారాముల పట్టాభిషేక సమయంలో అయోధ్యలో ప్రజలు దీపోత్సవం జరుపుకొన్నారట. కురుక్షేత్ర సంగ్రామానంతరం ధర్మరాజు విజయుడై పట్టాభిషేకం చేసుకున్న సందర్భంలో హస్తినాపుర ప్రజలు ఆనందోత్సాహాలతో దీపాలను వెలిగించి పండగ చేసుకున్నారని మహాభారతం చెబుతోంది. నచికేతుడు తన మేధస్సుతో యముడిని సంతృప్తిపరచి, ఆత్మను గురించి తెలుసుకున్నాడు. యముడి నుంచి స్వేచ్ఛ పొంది, నచికేతుడు తిరిగి భూలోకానికి వచ్చిన సందర్భంలో జరిగిన దీపోత్సవమే దీపావళి అని కఠోపనిషత్తుకథనం. క్షీరసాగర మథన సమయంలో అవతరించిన శ్రీమహాలక్ష్మికి దీపాలను వెలిగించి దేవతలు స్వాగతం పలికారని పద్మపురాణంపేర్కొంటోంది. దుష్ట దనుజులను దునుమాడిన మహాకాళిని జ్యోతిగా, లక్ష్మీస్వరూపంగా ఆరాధించినట్టు కాళికాపురాణం చెబుతోంది.

 

          దుర్వాస ముని శాపంతో ఇంద్ర పదవిని దేవరాజు కోల్పోయి, శ్రీ మహావిష్ణువును శరణు వేడాడనీ, ‘లక్ష్మీ జపధ్యానాలు చేస్తే, తిరిగి నీ పదవి నీకు దక్కుతుందని విష్ణుమూర్తి చెప్పాడనీ, ఆ ప్రకారం లక్ష్మీదేవి కోసం అతను తపస్సు చేసి, ఇంద్రపదవిని తిరిగి పొందాడనీ ఒక కథ ఉంది. దీపావళిని దీపాన్వికగా భవిష్య, నారద పురాణాలు పేర్కొన్నాయి. స్కాంద పురాణంలో దీపావళి గురించిన వివరణ విస్తారంగా ఉంది. నారద పురాణం దీన్ని దీప దాన మహోత్సవంఅని చెప్పింది. ముద్రారాక్షస గ్రంథం శారదోత్సవంగా, నాగానందం గ్రంథంలో దీప ప్రతిపాదనోత్సవంగా దీపావళిని పేర్కొన్నారు.

          'దీపేన సాధ్యతే సర్వం' అని శాస్త్రవచనం. 'దీపంతో దేనినైనా సాధించవచ్చు' అని భావం. నిత్యం దీపారాధన భారతీయుల సంప్రదాయం. ఉభయసంధ్యల్లో ఇంట్లో వెలిగించిన దీపం ఐశ్వర్యకారకం- అని ధార్మిక గ్రంథాలు బోధిస్తున్నాయి. 'ఏదైనా కోరిక తీరాలంటే, ఒక దీపాన్ని వెలిగించి- ఖర్జూరమో, ఎండుద్రాక్షో లేదో ఏదైనా ఫలమో నైవేద్యం పెట్టి నమస్కరించితే చాలు' అని ఆనవాయితీగా దీపారాధన కొనసాగుతోంది. ఇలా దీపారాధన చేయడంవల్ల ఏ ప్రయోజనమైనా పొందవచ్చు- అన్నది శాస్త్రోక్తి.

 

          దేవతలు ప్రకాశస్వరూపులనీ, కాంతి-శుభానికీ, జ్ఞానానికీ, శాంతికీ సంకేతమనీ చాటిచెప్పే ఆర్షభావన దీప ప్రజ్వలనలో కనిపిస్తోంది. జ్యోతిని వెలిగించడం శుభారంభం. తేజోమయులైన దేవతలు దీపంద్వారా సంతోషిస్తారనీ, దీపప్రకాశంలో సన్నిహతులవుతారనీ పురాణ ఋషుల దర్శనం. దీపకాంతి దివ్యత్వ ప్రతీక కనుక, ఆ దివ్యత్వాన్ని కావాలని ఆశిస్తూ దీపంద్వారా వ్యక్తీకరించుకుంటున్నాం. 'దీపమున్న చోట దేవతలుంటారు'- అనడం ఈ కారణం వల్లనే.

 

          కేవలం దీపాన్ని మాత్రమే వెలిగించి, ఆ జ్యోతిని ఆలంబనగా పరంజ్యోతి అయిన పరమాత్మను ధ్యానించడం ఒక యోగ ప్రక్రియ. భర్తృహరి తన శతక సాహిత్యంలో పరమేశ్వరుని 'జ్ఞానదీపం'గా అభివర్ణించాడు. ఈ దీపం యోగుల హృదయగృహంలో సుస్థిరంగా దీపిస్తోందని సంభావించాడు.


          భారత పురాణ ఇతిహాసాల్లోనూ, వేద వేదాంగాల్లోనూ దీపానికి ఉత్కృష్టమైన స్థానం ఉంది. దీపంలో మనం మొట్టమొదటిగా చూసే సుగుణం కాంతే కానీ అంతకు మించిన ఒక స్ఫూర్తిని దీపం మనకు అందిస్తుంది. దీపం చివరి వరకు తన కాంతిని పరులకి పంచుతుంది. తన నుండి మరొక దీపాన్ని వెలిగించేందుకు తపిస్తుంది. దీపం మనోవికాసానికీ, ఆనందానికీ, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. వెలుగు సంతోషకారకం. చీకటి కష్టకారకం. జీవితం చీకటి వెలుగుల కలయిక. జ్ఞాన వెలుగుల్ని ప్రసాదించేది దీపం. అజ్ఞానానికి చిహ్నమైన తమస్సును నశింపచేసి జీవులకు వెలుగు మార్గాన్ని చూపించేదే దీపం. అందుకే దీపం పరబ్రహ్మ స్వరూపంఅని భావిస్తూ ఆరాధిస్తారు. వెలిగించడంసనాతన భారతీయ సంస్కృతి.

          మంత్రశాస్త్ర ప్రకారం సాక్షాత్ దీపం దర్శయామిఅనే మంత్రం చదువుతూ గృహాన్ని శుభ్రం చేసి, నీటిని చల్లి, ముగ్గులు పెట్టి ధూపం వెలిగించి దీపం పెట్టడంవల్ల సకల దుష్ట గ్రహ శక్తులు నశించి వాతావరణం పరిశుభ్రం అవుతుంది. అప్పుడే ఆ గృహం పూజార్హతకు అవకాశం కలుగుతుంది. దీపం వెలిగించగానే ఇంటికి లక్ష్మీకళ వచ్చేస్తుంది. లక్ష్మీదేవి దీపవాసిని. దీపకాంతి నుంచే కళ పుడుతుంది. దీపం అమంగళాన్నీ, దారిద్య్రాన్నీ, అరిష్టాల్ని పారద్రోలే శక్తి స్వరూపం. దీపం వెలగని ఇంట్లో అలక్ష్మి తాండవిస్తుందంటారు పెద్దలు. పూర్వకాలంలో ప్రతి ఇంటా నిత్యం అగ్నిహోత్రం నిర్వహించేవారు. కానీ నేటి పరిస్థితుల దృష్ట్యా రోజూ అగ్నిహోత్రం వెలిగించడం సాధ్యం కాదు. కానీ ఇంట్లో రోజూ ఉదయం, సాయంకాలం దీపారాధన చేయడం శుభప్రదం. మరణించిన వ్యక్తులకు ఉత్తమ గతులు సిద్ధించాలన్నా దీపాలు వెలిగించాలని శాస్త్రాలు చెబుతున్నాయి.

==============

 డాక్టర్ కప్పగంతు రామకృష్ణ

సెల్: 90320 44 115 / 8897 547 548

 

 


Saturday, May 16, 2020

ధర్మమూర్తి... సమదర్శి.... జగద్గురు కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి

  ధర్మమూర్తి... సమదర్శి ఆయన పేరు పలికితేనే చాలు... వ్యక్తం చేయటానికి మాటలు చాలని అనుభూతి కలుగుతుంది. ఆ కళ్ళలోని వెలుగు ఏదో తెలియని కారుణ్యాన...