శ్రీ రుద్రవైభవమ్
(వేదోపనిషత్తుల వెలుగులో రుద్రతత్త్వ దర్శనం)
నమస్తే నమస్తే విభో విశ్వమూర్తే నమస్తే నమస్తే చిదానంద మూర్తే ।
నమస్తే నమస్తే తపోయోగగమ్య నమస్తే నమస్తే శ్రుతి జ్ఞానగమ్య ॥
శివుడు, పరమేశ్వరుడు, రుద్రుడు, మహాదేవుడు, శంకరుడు, హరుడు, ఈశానుడు... ఇలా అనంతమైన నామాలతో మనం పిలుచుకుని ఆరాధించే దేవుడెవరు? ఈ పేర్లన్నీ ఒకే తత్త్వాన్ని సూచిస్తున్నాయా, లేక వేర్వేరు దేవతలు ఉన్నారా? ఒకవేళ ఒకే దేవుడికి ఇన్ని పేర్లు ఉంటే, అవి ఎందుకు, ఎలా ఏర్పడ్డాయి? ఇలాంటి ప్రశ్నలు యుగయుగాలుగా భక్తుల హృదయాలను తొలచివేస్తూనే ఉన్నాయి. వీటికి సమాధానం వెతికితే... లింగ, శివ పురాణాలతో పాటు, స్వయంగా వేదాలు, వాటి సారమైన ఉపనిషత్తులు మనకు లోతైన వివరణలను అందిస్తాయి. రుద్రుడు కేవలం పురాణ కల్పితమైన దేవతామూర్తి కాదని, వేదకాలం నాటికే విశ్వచైతన్యంగా, పరబ్రహ్మ స్వరూపంగా అందరిచేతా పూజలు అందుకున్నాడని శ్రుతివాక్యాలు నిరూపిస్తాయి.
కృష్ణ యజుర్వేదంలో రుద్రుడు
కృష్ణ యజుర్వేద తైత్తిరీయ సంహిత చతుర్థకాండంలోని పంచమ, సప్తమ ప్రపాఠకాలను వరుసగా ‘నమకము’, ‘చమకము’ అంటారు. నమకంలో విశ్వంలోని ప్రతి అణువూ, ప్రతి రూపమూ రుద్రుడే అనే భావనతో, ఆయా రూపాల్లో వ్యక్తమయ్యే రుద్రునికి నమస్కరించటం ప్రధానాంశం. కొండలలో, అడవులలో, నదులలో, ఆయుధాలలో, వైద్యులలో, దొంగలలో, దొరలలో- సమస్త సృష్టిలోనూ రుద్రుడు వ్యాపించి ఉన్నాడని నమకం చాటుతుంది. ఇది ఏకేశ్వర భావననే కాక, సర్వాంతర్యామిత్వాన్ని కూడా చాటే అపూర్వమైన దర్శనం. చమకంలో ఇందుకు భిన్నంగా, భక్తుడు తన కోరికల చిట్టాను - అన్నం, ఆయువు, సంతానం, పశుసంపద మొదలైనవి భగవంతుని ముందు సమర్పించి, ‘శివా! వీటన్నిటినీ నాకు అనుగ్రహించు’ అని ప్రార్థిస్తాడు. ఈ నమక చమకాలు కలిపి ‘శ్రీరుద్రం’గా ప్రసిద్ధి చెంది, నేటికీ అభిషేకాలలో పారాయణ చేయబడుతున్నాయి.
ఋగ్వేదంలో రుద్రుని రూపం
ఋగ్వేదంలో రుద్రుడు భయంకరుడైన, అదే సమయంలో కరుణామయుడైన దేవతగా కనిపిస్తాడు. ధనుర్బాణాలు ధరించిన వాడు, జడలు కలవాడు, నీలకంఠుడు అయిన రుద్రుడు రోగాలను కలిగించే శక్తిగానూ, వాటిని నయం చేసే ‘భిషక్తముడు’ (శ్రేష్ఠ వైద్యుడు) గానూ స్తుతింపబడ్డాడు. గృత్సమదుడు మొదలైన ఋషులు రుద్రుని శాంతింపజేస్తూ సూక్తాలను రచించారు. ఋగ్వేదంలోని ప్రసిద్ధ మృత్యుంజయ మంత్రం — ‘త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమ్ । ఉర్వారుకమివ బంధనాన్మృత్యోర్ముక్షీయ మామృతాత్ ॥’ ఈ మంత్రం మొదట ఋగ్వేదంలో కనిపించి, తరువాత యజుర్వేద తైత్తిరీయ సంహితలోనూ, శ్రీరుద్రంలోనూ చేర్చబడింది. ‘త్రినేత్రుడైన రుద్రుని ఆరాధిస్తున్నాము, ఆయన సుగంధభరితుడు, పుష్టిని ప్రసాదించువాడు. దోసపండు తీగ నుండి విడివడినట్లుగా, మమ్మల్ని మృత్యుబంధం నుండి విడిపించి అమృతత్వం వైపు నడిపించు’ అనే భావం ఇందులో ఇమిడి ఉంది. మృత్యువును జయించి, అమృతత్వాన్ని ప్రసాదించే శక్తిగా రుద్రుడు ఇక్కడ కీర్తింపబడటం గమనార్హం.
రుద్ర శబ్దార్థాలు
రుద్ర శబ్దానికి ప్రాచీనులు అనేక నిర్వచనాలను ఇచ్చారు. అవి...
· ‘రుతం సంసార దుఃఖం ద్రావయతీతి రుద్రః’ — సంసార దుఃఖమును నాశనము చేయువాడు.
· ‘రోదయతి సర్వమంతకాల ఇతి రుద్రః’ — ప్రళయకాలమున అందరినీ దుఃఖింపజేయువాడు.
· ‘రుతౌ నాదాంతే ద్రవతి ద్రావయతీతి రుద్రః’ — నాదం యొక్క చివర ద్రవింపజేయువాడు.
· ‘రుత్యా వేదరూపయా ధర్మాదీనవలోకయతి ప్రాపయతీతి రుద్రః’ — వేదరూపంలో ధర్మాన్ని పొందింపజేయువాడు.
· ‘రుత్యా వాగ్రూపయా వాక్యం ప్రాపయతీతి రుద్రః’ — వాగ్రూపముచే అర్థప్రతీతిని పొందించువాడు.
· ‘రుత్యా ప్రణవరూపయా స్వాత్మానం ప్రాపయతీతి రుద్రః’ — ప్రణవరూపమున తనను పొందింపజేయువాడు.
· ‘రుద్రో రౌతీతి సత్యే రోరూపమాణో ద్రవతి ప్రవిశతి మర్త్యానితి రుద్రః’ — సత్యరూపమున మనుష్యులను ప్రవేశించువాడు.
· ‘రుతిం శబ్దం వేదాత్మానం బ్రహ్మణే దదాతి కల్పాదావితి రుద్రః’ — కల్పాది యందు బ్రహ్మకు వేదములనిచ్చినవాడు.
ఈ నిర్వచనాలన్నీ నాశనం చేయువాడు, ఏడిపించువాడు, జ్ఞానం ప్రసాదించువాడు అనే భిన్న అర్థాలతో పాటు రుద్రుడు సంహారకుడు మాత్రమే కాక, జ్ఞానప్రదాత, వేదప్రదాత, సృష్టిస్థితిలయకారకుడు అని స్పష్టం చేస్తున్నాయి.
బృహదారణ్యకోపనిషత్తు — ఏకాదశ రుద్రుల నిర్వచనం
బృహదారణ్యకోపనిషత్తులో (3.9.4) యాజ్ఞవల్క్య మహర్షి రుద్రుల సంఖ్యను, స్వరూపాన్ని అత్యంత తాత్త్వికంగా వివరిస్తాడు. పురుషునిలో ఉండే ప్రాణాలు, మనస్సు, జీవాత్మ — ఇవన్నీ కలిసి ఒకటి; పంచకర్మేంద్రియాలు, పంచజ్ఞానేంద్రియాలు కలిపి పది — మొత్తం ఈ పదకొండూ రుద్రులు. ఈ శరీరాన్ని విడిచి పెట్టేటప్పుడు, ‘ఇది శరీరాన్ని విడిచింది’ అని మనిషిని దుఃఖపెట్టేవి కాబట్టే — ‘రోదయంతి ఇతి రుద్రాః’ అని వీటికి సార్థక నామం ఏర్పడింది. ఇక్కడ రుద్రతత్త్వం బాహ్యదేవతగా మాత్రమే కాక, మన లోపలి ప్రాణశక్తులుగా, ఇంద్రియశక్తులుగా అన్వయించబడటం విశేషం. ఈ ఏకాదశ రుద్రుల పేర్లు— రుద్రుడు, త్ర్యంబకుడు, మహేశ్వరుడు, అహిర్బుధ్న్యుడు, హరుడు, ఏకపాదుడు, అజుడు, పినాకి (త్రిభువనుడు అని కొన్నిచోట్ల), శంభుడు, అపరాజితుడు, ఈశానుడు.
శ్వేతాశ్వతరోపనిషత్తు — రుద్రుడే పరబ్రహ్మము
ఉపనిషత్తులలో రుద్రతత్త్వాన్ని అత్యంత విస్పష్టంగా, పరబ్రహ్మ స్థాయిలో ప్రతిపాదించినది శ్వేతాశ్వతరోపనిషత్తు. ఇది రుద్రుడిని సాంఖ్య, యోగ దర్శనాలతో సమన్వయం చేస్తూ, జగత్కారణంగా, ఏకైక సత్యంగా చాటుతుంది. ఈ ఉపనిషత్తులోని ప్రసిద్ధ వాక్యం — ‘ఏకో హి రుద్రో న ద్వితీయాయ తస్థుః’. రుద్రుడు ఒక్కడే, ఆయనకు రెండవవాడు లేడు అని ఈ వాక్యం నిర్ద్వంద్వంగా ప్రకటిస్తుంది. అనగా అనేక దేవతల వెనుక ఉన్న ఏకైక చైతన్యతత్త్వమే రుద్రుడు. అదే ఉపనిషత్తులో మరొకచోట, ఆయనను తెలుసుకున్నవాడు మృత్యువును దాటిపోతాడని, అంతకుమించిన మార్గం మరొకటి లేదని చెప్పబడింది. ‘సర్వవ్యాపి సః భగవాన్ తస్మాత్ సర్వగతః శివః’ - ఆ భగవానుడు సర్వవ్యాపి కావున ఆయననే శివుడు (సర్వగతుడు) అంటారని ఈ ఉపనిషత్తు వివరిస్తుంది. ఇక్కడ ‘శివ’ శబ్దానికి తాత్త్విక భూమిక ఏర్పడటం గమనించదగినది. శివుడు కేవలం ఒక దేవత పేరు కాదు, సర్వాంతర్యామిత్వానికి పర్యాయపదం.
కఠ, ముండక, శ్వేతాశ్వతర ఉపనిషత్తులలో...
కఠోపనిషత్తు, ముండకోపనిషత్తు, శ్వేతాశ్వతరోపనిషత్తులలో దాదాపు ఒకే మాదిరి కనిపించే ఒక అపూర్వ శ్లోకం ఉంది. ‘న తత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోఽయమగ్నిః । తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి ॥’ - అక్కడ సూర్యుడు ప్రకాశించడు, చంద్రతారకలు కూడా ప్రకాశించవు, మెరుపులు గానీ, అగ్ని గానీ ప్రకాశించలేవు. ఆ పరతత్త్వం ప్రకాశిస్తేనే మిగతావన్నీ ప్రకాశిస్తాయి; ఆయన కాంతి వలననే ఈ జగత్తు అంతా విభాసిల్లుతోంది. శ్వేతాశ్వతరోపనిషత్తులో ఈ శ్లోకం నేరుగా ‘దేవుడు’ (రుద్రుడు) గురించి చెప్పబడటం విశేషం. అంటే సూర్యచంద్రాగ్నులు కూడా ఎవని కాంతిచే ప్రకాశిస్తున్నాయో, ఆ మూలచైతన్యమే రుద్రుడు అని ఈ మూడు ఉపనిషత్తులు ఏకకంఠంతో ప్రకటిస్తున్నాయి.
మాండూక్యోపనిషత్తులో...
మాండూక్యోపనిషత్తు జాగ్రత్, స్వప్న, సుషుప్తి అనే మూడు అవస్థలను దాటిన నాలుగవ స్థితిని ‘తురీయం’ అని పేర్కొంటుంది. ఈ తురీయ స్థితిని గౌడపాదాచార్యుల కారికలు ‘శాంతం శివమద్వైతం’ అని అభివర్ణిస్తాయి. శాంతమైనది, శివమైనది (మంగళకరమైనది), అద్వైతమైనది. ఇక్కడ ‘శివ’ అనే పదం ఒక దేవత నామంగా కాక, పరమ శాంతస్థితికి, పరబ్రహ్మతత్త్వానికి విశేషణంగా ప్రయోగించబడటం గమనార్హం. అంటే యోగసాధనలో అంతిమంగా చేరవలసిన తురీయావస్థే శివతత్త్వం అని ఈ ఉపనిషత్తు పరోక్షంగా బోధిస్తోంది.
కైవల్యోపనిషత్తు — శతరుద్రీయ మహిమ
కైవల్యోపనిషత్తు రుద్రుని హృదయకమలంలో ధ్యానించే విధానాన్ని, ఆయననే ఆత్మగా, బ్రహ్మగా గుర్తించే విధానాన్ని బోధిస్తుంది. జాబాలోపనిషత్తులో బ్రహ్మచారులు ‘కిం జప్యేన అమృతత్వమశ్నుతే?’ - దేనిని జపించుటచే అమృతత్వము కలుగుతుంది అని ప్రశ్నించగా, యాజ్ఞవల్క్య మహర్షి ‘శతరుద్రీయేన’ - శతరుద్రీయము జపించుటచే అమృతత్వము కలుగుతుందని సమాధానమిస్తాడు. ‘ఏతైర్హ వా అమృతో భవతి’ - శతరుద్రీయ మంత్రాలతో ఉపాసన చేసినవాడు అమృతుడగునని చెబుతాడు. కైవల్యోపనిషత్తులోనే ‘యః శతరుద్రీయమధీతే, సోఽగ్నిపూతో భవతి’ - శతరుద్రీయాన్ని అధ్యయనం చేసినవాడు అగ్నిపూతుడగునని ఉంది.
రుద్రాధ్యాయాన్ని శతరుద్రీయం అని ఎందుకు పిలుస్తారో ప్రాచీన ఆధ్యాత్మికవేత్తలు అనేక వివరణలు ఇచ్చారు. ‘శతం రుద్రో దేవతా అస్య ఇతి శతరుద్రీయం’ - వందమంది, అంటే అనంత రుద్రులు దేవతలగుట చేత ఈ పేరు ఏర్పడింది అని కొంతమంది పండితులు నిర్వచించారు. ‘ఏకశతం యజుశ్శాఖాస్తాసు రుద్రోపనిషదామ్నాయతి’ - నూరు యజుర్వేద శాఖలలో రుద్రోపనిషత్తు పఠింపబడుతుంది కనుక ఈ నామం ఏర్పడిందని కొంతమంది చెప్పారు. ‘శతమనంతాని రుద్రనామధేయాని యస్మిన్ తత్ శతరుద్రీయం’ -శతము అంటే అనంతమైన రుద్రనామధేయాల ప్రశంస ఇందులో ఉన్నందున ఈ పేరు వచ్చిందని కొంతమంది పండితులు చెప్పారు.. ‘సహస్రాణి సహస్రశో యే రుద్రా అధిభూమ్యామ్’ - వేలాది రుద్రులు భూమి యందు అన్ని దిక్కులనూ ఆశ్రయించుకొని ఉన్నారని, అట్టి శతరుద్రుల ప్రశంస కలది కావున రుద్రాధ్యాయము శతరుద్రీయమని అనబడుతోందని మరికొంతమంది వివరణ ఇచ్చారు. నిర్వచనం, వివరణలో భేదాలు ఉన్నప్పటికీ ఈ నిర్వచనాలన్నీ రుద్రుడి అనంతవ్యాపకత్వాన్ని విస్పష్టంగా ప్రకటిస్తున్నాయి.
రుద్రాధ్యాయ పారాయణ ఫలితాలు
శ్రుతిస్మృతిపురాణేతిహాసాలలో రుద్రాధ్యాయం అత్యంత ఉత్తమమైనదిగా కీర్తింపబడింది. ‘సర్వోపనిషదాం సారో రుద్రాధ్యాయః’ - అన్ని ఉపనిషత్తుల సారమే రుద్రాధ్యాయమని పేర్కొనబడింది. ఉపనిషత్తులే మోక్షసాధనములని నిశ్చయింపబడగా, వాటిలో శతరుద్రీయమే సర్వోత్తమమని నిర్ణయించబడింది. పంచమవేదమైన శ్రీమహాభారతంలోని ద్రోణ, అనుశాసనిక పర్వాలలో కూడా శతరుద్రీయ ఉత్తమత్వం ప్రశంసింపబడింది. నీటిలో నిలిచి నమకచమక, పురుషసూక్తాలను జపించినవాడు సర్వపాపవిముక్తుడగునని, ప్రాతఃకాలమున సూర్యునికెదురుగా ప్రాంజలి చేసి శతరుద్రీయం జపించువానికి దుర్లభమైనది ఏదీ లేదని శాస్త్రవచనం. శ్రీకృష్ణుడు ఒక సంవత్సరకాలం పాశుపతదీక్ష చేసి, విభూతిని ఒంటినిండా అలదుకొని రుద్రాధ్యాయాన్ని పారాయణ చేశాడని కూర్మపురాణం చెబుతోంది. ‘సతతం రుద్రజాప్యోఽసౌ పరాం ముక్తిమవాప్స్యతి’ అని స్మృతివచనం; ‘భోగార్థినో ముముక్షో వా ప్రాయశ్చిత్తార్థినోఽపి వా, రుద్రోపనిషదం ముక్త్వా గతిరన్యో న విద్యతే’ అని శివపురాణం ప్రకటిస్తోంది — ఐహిక భోగాలు, మోక్షం, పాపప్రాయశ్చిత్తం కోరుకునేవారికి రుద్రోపనిషత్తు కంటే వేరే శరణ్యం లేదు.
అష్టమూర్తి తత్త్వం
ఈశ్వరుడు అష్టవిధమూర్తి. కాళిదాస మహాకవి ఈశ్వరుని అష్టమూర్తి తత్త్వాన్ని ఇలా స్తుతించాడు - ‘యా సృష్టిః స్రష్టురాద్యా వహతి విధిహుతం యా హవిర్యా చ హోత్రీ యే ద్వే కాలం విధత్తః శ్రుతివిషయగుణా యా స్థితా వ్యాప్య విశ్వమ్ । యామాహుః సర్వభూతప్రకృతిరితి యయా ప్రాణినః ప్రాణవంతః ప్రత్యక్షాభిః ప్రపన్నస్తనుభిరవతు వస్తాభిరష్టాభిరీశః ॥’ పృథివి, జలం, తేజస్సు, వాయువు, ఆకాశం అనే పంచభూతాలు, సూర్యచంద్రులు, ‘నేను’ అనబడే యజమాని - ఈ ఎనిమిది రూపాలతో ఈశ్వరుడు విరాజిల్లుతున్నాడు. ఇంతటి విశ్వరూపుడు, మహత్తరశక్తి కలిగిన పరమాత్మయైన రుద్రుడిని ఏకాదశ రుద్రాభిషేకములతో ప్రసన్నుని చేయటం వలన ప్రకృతి మొత్తం ప్రశాంతత పొందుతుంది.
అభిషేకప్రియుడు
సద్యోజాత, వామదేవ, తత్పురుష, అఘోర, ఈశాన అనే పంచముఖాలతో నాలుగు దిక్కులను, ఊర్ధ్వదిశను చూస్తూ జగత్తును రక్షిస్తున్న సాంబసదాశివునికి, లింగస్వరూపుడైన పరబ్రహ్మకు ఆత్మార్పణం చేస్తున్నామనే భావంతో రుద్రాధ్యాయాన్ని పారాయణ చేయాలి. ‘అభిషేకప్రియో హ్యీశ్వరః’ — ఈశ్వరుడు అభిషేకప్రియుడు. ఈశ్వరుడు విశ్వరూపుడు కాబట్టి, ఈశ్వరుని అభిషేకిస్తే విశ్వం చల్లబడుతుంది. పంచామృతాలతో, గంగాజలంతో రుద్రుని అభిషేకించి, తుమ్మిపూలతో, మారేడు దళాలతో పూజించి, గోక్షీరాన్ని, కదళీఫలాన్ని నివేదించాలి. చతుష్షష్టి ఉపచారాలతో అర్చించలేని పక్షంలో షోడశోపచారాలతోనైనా, అదీ కుదరకపోతే కనీసం పంచోపచారాలతోనైనా ఆ పరమేశ్వరునికి కృతజ్ఞత తెలుపుతూ పూజించాలి. ఏకాదశ రుద్రాభిషేక ఫలాన్ని వర్ణించటం ఎవరికీ సాధ్యం కాదు. వేదాలు, ఉపనిషత్తులు ఏకకంఠంతో చాటుతున్నట్లు, రుద్రుడు అనేకనామాలలో వ్యక్తమయ్యే ఏకైక చైతన్యతత్త్వం, సర్వవ్యాపి పరబ్రహ్మం. ముందు భౌతికపూజ, తరువాత మానసికపూజ! చివరకు సర్వం శివమయమని గుర్తించి, మనం కూడా శివస్వరూపులం కావటమే ఈ ఉపాసన పరమార్థం.
---------------------------
శ్రీ కనకదుర్గప్రభ మాసపత్రిక ఆగష్టు 2026 సంచికలో
డాక్టర్ కప్పగంతు రామకృష్ణ రాసిన వ్యాసం
రచన:
డాక్టర్ కప్పగంతు రామకృష్ణ
కొత్తూరు తాడేపల్లి (పోస్ట్),
విజయవాడ రూరల్ మండలం,
ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్
సెల్: 9032044115 / 8897547548





