అనుబంధాలకు శ్రీకారం
కార్తికమాసం అనగానే చన్నీటి స్నానాలు, శివాలయాల్లో అభిషేకాలు, ఉపవాసాలు కనిపిస్తాయి. ఏ నోట విన్నా, ఏ గుండె సవ్వడి విన్నా పంచాక్షరీ మంత్రమే వినిపిస్తుంది. భక్తుల హృదయాల్లో కార్తికమాసం అంతగా పెనవేసుకుపోయింది. అందుకే కార్తికమాసాన్ని మించిన మాసం మరొకటి లేదని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఇంతగా ఆధ్యాత్మికత నిండిన కార్తికమాసంలో అనుబంధాలను కూడా పరిపుష్టం చేసేందుకు మన శాస్త్రాలు కొన్ని నియమాలను విధించాయి. ఒకే కడుపున పుట్టిన బిడ్డల మధ్య ఉండే సహజ జన్మబంధాన్ని జన్మజన్మల బంధంగా తీర్చిదిద్దేందుకు పునాదిగా అవసరమైన హృదయబంధాల్ని కూడా ఈ మాసం బలపరుస్తుంది. ఈ క్రమంలో ఏర్పడిన ఆచారమే 'భగినీ హస్త భోజనం'.
కార్తిక మాసం శుక్ల విదియ రోజున భగినీ హస్త భోజనం చెయ్యాలని నియమం. భగిని' అంటే చెల్లెలైనా కావచ్చు. అక్క అయినా కావచ్చు. 'హస్తభోజనం' అంటే... చేతి భోజనము అని అర్ధం. అంటే... సోదరి చేతివంట సోదరుడు తినడం అన్నమాట. సాధారణంగా వివాహమైన చెల్లెలు లేదా అక్క ఇంటిలో తల్లిదండ్రులుగానీ, అన్నదమ్ములుగానీ భోజనం చేయడానికి అంతగా ఇష్టపడరు. కారణం తినకూడదని కాదు. ఆడపిల్ల ఋణం ఉంచుకోవడం పుట్టింటివారికి ఇష్టం ఉండదు. శుభసందర్భాలలో, శుభకార్యాలలో భాగంగా ఆడపిల్ల ఇంటికి వచ్చి భుజించినా తప్పులేదు కానీ., ఊరికే వచ్చి తినడం మర్యాద కాదని మనవాళ్ళు భావిస్తారు. కానీ, కార్తిక శుద్ధ విదియనాడు మాత్రం వివాహం అయిన సోదరి ఇంటిలో సోదరుడు భుజించి తీరాలని శాస్త్రం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఓ పురాణగాథ వ్యాప్తిలో ఉంది.
సూర్యభగవానుడికి సంధ్యాదేవి వలన కలిగిన సంతానం యముడు, యమున. 'యమునకు' అన్నయ్య 'యముడు' అంటే ఎంతో ఇష్టం. యముడికి కూడా అంతే. యముడు తన చెల్లెల్ని ప్రేమగా 'యమీ' అని పిలిచేవాడు. యమునకు వివాహం జరిగింది. అత్తవారింటికి కాపురానికి వెళ్ళింది. ఒకరోజు యమునకు తన అన్నను చూడాలని కోరిక కలిగింది. తన ఇంటికి విందుకు రమ్మని యమధర్మరాజుకు వర్తమానం పంపింది. విందుకు వస్తానని యమధర్మరాజు యమునకు మాట ఇచ్చాడు. అ రోజు అన్నయ్యకు ఇష్టమైన పదార్థాలన్నీ చేసి అన్నయ్య రాకకోసం ఎదురుచూస్తూ కూర్చుంది యమున. ఎంతసేపయినా అన్నయ్య రాలేదు. ఈ రోజు పనివత్తిడి వల్ల రాలేకపోతున్నానని, 'కార్తిక శుద్ధ విదియ' నాడు తప్పకుండా విందుకు వస్తానని చెల్లెలికి వర్తమానం పంపాడు యమధర్మరాజు. కొద్దిగా బాధ అనిపించినప్పటికీ అన్నయ్య తనను గుర్తుపెట్టుకున్నందుకు సంతోషించింది యమున.
కార్తిక శుద్ధ విదియ రోజున కూడా తన అన్నయ్యకు ఇష్టమైన పదార్థాలన్నీ తయారుచేసింది.అన్నమాట ప్రకారం యమధర్మరాజు చెల్లెలు ఇంటికి విందుకు వచ్చాడు. యమున తన అన్నయ్య నుదుట పవిత్ర తిలకం దిద్ది, పూలమాల వేసి తాను వండిన పదార్థాలన్నీ అన్నకు కొసరి కొసరి వడ్డించి ప్రేమగా తినిపించింది. చెల్లెలు అనురాగానికి ముగ్థుడైన యమధర్మరాజు ఏ వరం కావాలో కోరుకో' అని అడిగాడు. 'ఏటా ఇదే రోజు... అంటే కార్తిక శుద్ధ విదియ నాడు తన ఇంటికి విందుకు రావాలనీ, అలాగే ప్రతి సోదరుడు ఈ రోజున తన సోదరి చేతి వంటతో భోజనం చెయ్యాలనీ' వరం కోరుకుంది యమున. యమధర్మరాజు ఆ వరాన్ని అనుగ్రహించాడు. దీంతోపాటుగా ఎవరైతే కార్తిక శుద్ధ విదియ రోజున సోదరి ఇంట్లో భోజనం చేస్తారో వారికి నరలోక ప్రాప్తి కాని, అపమత్యు భయం కానీ ఉండదని కూడా వరం ప్రసాదించాడు. నాటి నుంచి కార్తిక శుద్ధ విదియ రోజున ప్రతి సోదరుడు వివాహం అయిన తన సోదరి చేతి భోజనం చేయాలని శాస్త్ర ంనియమం విధించింది. క్రమంగా ఇదే 'భగినీ హస్త భోజనం' పేరుతో ఆచారంగా స్థిరపడింది.
ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలతో పాటు ఈ ఆచారం ఇప్పటికీ చాలా చోట్ల కొనసాగుతోంది. మహారాష్ట్రలో ఈ పండుగను 'భయ్యా-దుజ్' అని పిలుస్తారు. నేపాల్ ప్రాంతంలో ఈ పండుగను 'భాయి-టికా' అని పిలుస్తారు. పంజాబ్ ప్రాతంలో ఈ పండుగను 'టిక్కా' అని పిలుస్తారు.
భగినీ హస్త భోజనం తర్వాతి రోజున... అంటే కార్తిక శుద్ధ తదియ రోజున అన్న తన ఇంటికి చెల్లెలిని భోజనానికి పిలవాలి. దీనిని 'సోదరి తృతీయ' అంటారు. ఈ రోజున త్రిలోచన గౌరీవ్రతం ఆచరించాలి. చెల్లెలి కుటుంబ సభ్యులకు చక్కని భోజనం పెట్టి, సోదరికి నూతన వస్త్రద్వయం, పసుపు కుంకుమలు, సుమంగళ ద్రవ్యాలు పెట్టాలి. అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి. వైష్ణవ కృచ్ఛ / విష్ణుగౌరీ వ్రతం చేయాలని మరికొన్ని గ్రంథాలు చెబుతున్నాయి. వీటన్నిటికన్నా విశేషం... ఈ రోజున సోదరుడు సోదరిని ఆదరిస్తాడు. అంటే విదియ రోజున సోదరి ఇంటికి వెళ్ళిన సోదరుడు ఆమెను తన ఇంటికి కుటుంబ సమేతంగా రమ్మని ఆహ్వానించాలి. తదియ రోజు సోదరి సోదరుని ఇంటికి సకుటుంబంగా వెళ్తుంది. ఆమెకు భోజనం పెట్టి, సుమంగళ ద్రవ్యాలు, నూతన వస్త్రాలు ఇచ్చి సోదరుడు సత్కరిస్తాడు.
ఇదీ భారతీయ ఆచారాల సమున్నత సామాజిక కోణానికి నిదర్శనం. భారతీయ ఆచారాలు మూఢ నమ్మకాలు కావు... అత్యున్నత వైజ్ఞానిక, సామాజిక దార్శనికతతో నేటి వైజ్ఞానికులకు కాలం కొలత తెలియని నాడే ద్రష్టలైన మన భారతీయ ఋషులు సమాజ నడవడిక ఉన్నతంగా ఉండేందుకు ఏర్పరచిన ఉత్తమ విధానాలని ఈ రెండు రోజుల ఆచారం నిరూపిస్తుంది. కార్తిక విదియ, తదియ రెండు రోజుల్లో పైన చెప్పుకున్న విధానాలు పాటిస్తే కుటుంబసభ్యుల మధ్య కలహాలు రూపుమాసిపోతాయి. అనురాగం, ఆప్యాయత పరిఢవిల్లుతాయి. ఇప్పటికీ ఉత్తరాదిన ఈ ఆచారం కొద్దిగా వ్యాప్తిలో ఉండగా దక్షిణాదిలో దాదాపుగా క్షీణదశకు చేరుకుంది. పెద్దలు ఈ రెండు రోజుల ఆచారాన్ని పునరుద్ధరిస్తే అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ బిడ్డలు ఆజన్మాంతం కలసి ఉండాలనే ముచ్చట కూడా తీరుతుంది. అనుబంధాల పునాదుల మీద సమాజమనే కుటుంబం కలకాలం ఆనందోత్సాహాలతో జీవిస్తుంది.
----------------------
No comments:
Post a Comment