Wednesday, November 4, 2020

మనిషి మాట తీరు ఎలా ఉండాలనే అంశాన్ని వివరిస్తూ రాసిన వ్యాసం

మనిషి మాట తీరు ఎలా ఉండాలి? 
అవతలి వ్యక్తి నొచ్చుకోకుండా మాట్లాడటం ఎలా? 
మన మాటలతో అవతలి వ్యక్తి అభిమానాన్ని పొందటం ఎలా?  


మాట మంచిదైతే...


మాట మనిషిని మహనీయుడిని చేస్తుంది. అదే మాట మనిషి పతనావస్థకు దారితీస్తుంది. వాక్కుకు అంతటి అమోఘమైన శక్తి ఉంది. అవతలి వ్యక్తితో స్నేహం చెయ్యాలన్నా, మిత్రుడు శత్రువుగా మారాలన్నా ఒక్క మాట సరిపోతుంది. అందుకే శాస్త్రాలు వాక్కును దైవంగా ప్రకటిస్తాయి. మంత్రభాగంలో కూడా వాక్కుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. మాట్లాడే మాటలో ఒక శబ్దం ఎక్కువ  లేదా తక్కువ అయినా అందుకు విపరీత ఫలితాలు ఏర్పడతాయి. అందుకే ఎల్లప్పుడూ మంచి మాటలనే మాట్లాడాలి. 

సీతాదేవిని రావణుడు అపహరించిన తర్వాత ఆమెను వెదుకుతూ రామలక్ష్మణులు రుష్యమూక పర్వత ప్రాంతానికి చేరుకుంటారు. సుగ్రీవుడి నివాస ప్రాంతం అది. తనను చంపడానికి తన అన్న వాలి వీరిని పంపించారా అని అనుమానించి, విషయం తెలుసుకునేందుకు తన మంత్రి అయిన హనుమంతుడిని పంపుతాడు. మారుతి మారు వేషంలో రామలక్ష్మణుల దగ్గరకు వచ్చి అనేక విధాలుగా ప్రశ్నిస్తాడు. 'రాజర్షి దేవ ప్రతిమౌ తాపసౌ సంశితవ్రతౌ! దేశం కథమిమం ప్రాప్తౌ భవంతౌ వరవర్ణినౌ!!' మీరిద్దరూ మంచి తేజోవంతుల్లా, తీవ్రమైన తపోదీక్ష పట్టిన వారిలా ఉన్నారు. మీ రూపం తాపసుల్లా ఉన్నా మీ తేజం క్షత్రియత్వాన్ని సూచిస్తోంది. గొప్ప పని ఉంటే తప్ప మీవంటి యోధులు క్రూరమగాలు సంచరించే ఇలాంటి చోటుకు రారు' అని ప్రశ్నిస్తాడు హనుమ.

మాట అంటే ఇలా ఉండాలి. ఒక్క అక్షరం  ఎక్కువ తక్కువ కాకుండా ప్రశ్నలు వేశాడు హనుమ. ఇంత కాలం తాను ఎవరి గురించి ఎదురు చూస్తున్నాడో ఆ దైవం ఎదుట నిలబడినప్పుడు హనుమ తొందరపడలేదు. వచ్చింది ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఎంత గొప్పగా ప్రశ్నించాడంటే రాముడే ముచ్చటపడ్డాడు. వ్యాకరణ పండితుడు తప్ప మరొకరు ఇలా మాట్లాడలేడన్నాడు. హనుమ ప్రశ్న స్వీకరించిన వ్యక్తి కూడా ఆనందపడేలా అడిగాడు. హనుమంతుడి మాటల ఔచిత్యానికి ముచ్చటపడతాడు రాముడు.

నా నృగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణ: 

నా సామవేద విదుష: శక్యమేవ విభాషితుం ||

రుక్‌, యజు, సామవేదాల్లో పండితుడైనవాడు తప్ప మరొకరు ఇలా మాట్లాడలేరంటూ లక్ష్మణుడితో హనుమంతుడి మాటలతీరులోని గొప్పతనాన్ని వివరిస్తాడు రాముడు. ఒక్క మాట ఎక్కువ తక్కువ కాకుండా కొత్తవారితో కూడా ఎంతో నేర్పుగా మాట్లాడటమే కాకుండా రామసుగ్రీవుల మైత్రికి బీజం వేసింది హనుమ వాక్చాతుర్యం. మంచి మాటకు ఉండే శక్తి అంతటి గొప్పది. 

బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేస్తుంటాడు కుంభకర్ణుడు. అసలే అతడు చెప్పలేనంత బలశాలి. ఆ బలానికి వరబలం కూడా తోడైతే ఇక అతడిని ఆపటం ఎవరితరం కాదని ఆలోచించిన దేవతలు సరస్వతీ దేవిని ప్రార్థిస్తారు. దేవతల కోరిక మన్నించిన సరస్వతి కుంభకర్ణుడి నోటి నుంచి అపశబ్దం పలికేలా చేస్తుంది. 'నిర్దయ' అని వరం కోరుకోవాలనుకున్న 'నిద్రయ' అడిగాడు. తథాస్తు అన్నాడు బ్రహ్మ. అంతే... నిద్రకు ప్రతిరూపంగా మారిపోయాడు కుంభకర్ణుడు. తనకున్న దయాగుణం కారణంగా ఎవరినీ చంపలేకపోతున్నానననే బాధతో నిర్దయ కావాలని అనుకున్నాడు. కానీ అక్షరం మారే సరికి అర్థం మారి, ఫలితం తలకిందులైంది. అందుకే మాట మాట్లాడేటప్పుడు వెనకాముందూ ఆలోచించమంటారు పెద్దలు. 

చంటి బిడ్డ భరతుడిని వెంట తీసుకుని దుష్యంతుడి సభకు చేరుకుంటుంది శకుంతల. నీవెవరో నాకు తెలియదు. నీ బిడ్దకు తండ్రిని నేను కాదంటాడు దుష్యంతుడు. అకస్మాత్తుగా తన భర్త ఇలా మాట్లాడేసరికి ఖిన్నురాలవుతుంది శకుంతల. భర్తను ఎన్నో విధాలుగా ప్రాథేయపడుతుంది. నా గురించి కాకపోయినా నీ బిడ్డను చూసైనా సరే నిజం ఒప్పుకోమంటుంది.

నుతజల పూరితంబులగు నూతులు నూఱిటికంటె సూనృత

వ్రత యొక బావి మేలు మఱి బావులు నూఱిటికంటె నొక్క స

 త్క్రతు వది మేలు తత్క్రతుశతంబునకంటె సుతుండు మేలు త

త్సుత శతకంబుకంటె నొక సూనతవాక్యము మేలు సూడగన్‌

తియ్యటి నీటితో నిండివున్న వంద నూతులకంటె ఒక దిగుడుబావి మేలు. అలాంటి వంద బావుల కన్నా ఒక మంచి క్రతువు మేలు. అలాంటి వంద క్రతువుల కన్నా ఒక కుమారుడు మేలు. అలాంటి వంద మంది కుమారుల కన్నా ఒక మంచిమాట మేలు. కాబట్టి రాజా! ఒక సత్యమైన మాట పలకవయ్యా అంటుంది శకుంతల. మంచి మాటకు ఎంత విలువ ఉంటుందో చెప్పటానికి ఈ ఒక్క ఉదాహరణ సరిపోతుంది. 

వాక్కు అనేది అగ్ని. ఆ వాగ్బాణాలు మన నోటి నుండి వెలువడినప్పుడు అవి ఎదుటివారికి వెచ్చదనాన్ని ఇవ్వాలి గానీ..! ఎదుటివారి మనసును నొప్పించకూడదు. ఆ వెచ్చదనాన్ని అందించే శక్తి మన వాక్కుకు లేనప్పుడు దానిని ఎదుటివారిపై ప్రయోగించకపోవడమే ఉత్తమం. ''తనకోపమె తన శత్రువు తనశాంతమె తనకు రక్ష'' అన్నట్టు మనకి కోపం అనిపిస్తే మనము మౌనంగా ఉండటమే మంచిది. వాక్కు పరా, పశ్యన్తి, మధ్యమ, వైఖరి అని నాలుగు విధాలుగా ఉంటుంది. ఈ వాక్కు ఎలా పుడుతుందో వ్యాకరణం చెబుతుంది. ఈ వాక్కు వెలువడిన తర్వాత అది 'శబ్దం'గా మారుతుంది. ప్రతి శబ్దానికి నిర్దుష్టంగా ఒక అర్థం ఉంటుంది. అలా నిర్దుష్టమైన అర్థం కలిగిన శబ్దాన్ని 'వాచకం'లేదా 'అభిద' అంటారు. ఆ శబ్దం తాలూకు అర్థాన్ని 'వాచ్యం' అంటారు.

సత్యం బ్రూయాత్‌ ప్రియం బ్రూయాత్‌

        న బ్రూయాత్‌ సత్య మప్రియం

        ప్రియం చ నానతం బ్రూయాత్‌

        ఏష ధర్మ స్సనాతన: || (మనుస్మృతి )

సత్యాన్నే పలుకు. ప్రియాన్నే మాట్లాడు. సత్యమైనా అప్రియాన్ని పలకవద్దు. ఇదే సనాతన ధర్మం అంటుంది మనుస్మ ృతి. సత్యాన్నే విను. ప్రియమైన దాన్నే విను.సత్యమైనా అప్రియంగా ఉంటే వినకు. అలాగే ప్రియంగా ఉందని అసత్యాన్ని వినకు.అలాంటి లక్షణాలతో చెప్పేవాడు, వినేవాడూ ఉన్నప్పుడు ఆ చెప్పిన విషయం హదయానికి హత్తుకుని ఎల్ల కాలం గుర్తుంటుంది. అంటే ఇతరులకు ప్రియం కానిది అది సత్యమైనా మనం చెప్పకూడదు. అందులో కాఠిన్యం ఉండటమే ఇందుకు కారణం. అలాగే జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడకపోతే అది సత్యమైనా తగవులాటకు కారణమవుతుంది. అందుకే నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నారు.
----------------------------------------------------------------------------
మనిషి మాట తీరు ఎలా ఉండాలనే విషయాన్ని వివరిస్తూ 
ఈనాడు దినపత్రిక మకరందం పేజీలో 05.11.2020 తేదీన రాసిన వ్యాసం ఇది.


No comments:

Essay on Goddess Varahi - Published in Sapthagiri Magazine July 2026 Editon

    Varahi Upasana: The Mystical Path of Divine Power (or) Goddess Varahi — The Embodiment of Divine Shakti             In the India...