Wednesday, August 14, 2024
వరాలనిచ్చే వరలక్ష్మి
వరాల రూపంలో సౌభాగ్యాన్ని భక్తులకు అనుగ్రహించే మాత ‘వరలక్ష్మీదేవి’. ‘వర’ అంటే ‘కోరుకున్నది’, ‘శ్రేష్ఠమైనది’ అనే అర్థాలు ఉన్నాయి. ఈ అర్థాలను అన్వయం చేస్తే కోరిన కోర్కెలు లేదా శ్రేష్టమైన కోర్కెలు ఇచ్చే తల్లిగా వరలక్ష్మీదేవిని భావించవచ్చు. ఈదేవిని సమంత్రకంగా, భక్తిభావనతో కొలిచే వ్రతమే ‘వరలక్ష్మీవ్రతం’.
వరలక్ష్మీ వైభవం
వ్రతాచరణకు నియమాలు
విశ్వమంతా లక్ష్మీ స్వరూపమే
వరలక్ష్మీ సందేశం
Saturday, August 3, 2024
తులసీదాసు
పరిపూర్ణ భక్తిమూర్తి
- డాక్టర్ కప్పగంతు రామకృష్ణ
అసోసియేట్ ప్రొఫెసర్, కె.బి.ఎన్ కళాశాల
కొత్తపేట, విజయవాడ-1
అనుక్షణం రామనామ గానంతో తనువును, మనసునూ కూడా పవిత్రం చేసుకున్న పుణ్యమూర్తి సంత్ తులసీదాసు. తన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు రామనామంగా జీవించిన మహనీయుడాయన. కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా సమస్త మానవాళినీ తన భక్తితత్త్వం ద్వారా ప్రభావితం చేసిన పరిపూర్ణ భక్తిమూర్తి తులసీదాసు. ఆయన కేవలం భక్తుడు మాత్రమే కాదు... గొప్ప కవి, భావుకుడు, యోగి కూడా.
యమునా తీరంలోని రాజాపూర్ అనే గ్రామంలో జన్మించిన తులసీదాసు జీవితపు తొలి రోజుల్లో అందరిలాంటి జీవితం గడిపాడు. యుక్తవయస్సులో రత్నావళితో వివాహం అయ్యాక ఆయన జీవితంలో ఓ అద్భుత ఘట్టం జరిగింది. పుట్టింట్లో ఉన్న భార్యను ఎట్టి పరిస్థితుల్లో చూడాలనే పట్టుదలతో విపరీతమైన తుఫాను అని కూడా చూడకుండా, అత్తగారి ఇంటికి వెళ్ళాడు తులసీదాసు. అంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ తన కోసం వచ్చిన భర్తను చూసి ఆ ఇల్లాలు ఎంతో ఆనందపడింది. అదే సమయంలో, భర్త తన కోసం చూపించిన ఈ పట్టుదల భగవంతుడి మీద కేంద్రీకరిస్తే మంచిది కదా అనిపించింది. భర్తతో ఆ మాటే అన్నది.
అంతే... తులసీదాసు మనసులో ఓ గాఢమైన భావన కలిగింది. తన జీవనలక్ష్యం ఏమిటో తోచింది. చిన్ననాటి నుంచి తాను చేస్తున్న రామనామమే ఇప్పుడు తనకు మార్గం అని నిశ్చయించుకున్నాడు. ఇక, చివరి శ్వాస వరకు రామోపాసన తప్ప మరొక ఆలోచనకు కూడా తన మనసులో చోటివ్వనని నిశ్చయించుకున్నాడు. మరుక్షణమే, భార్యను విడిచి తీర్థయాత్రకు బయల్దేరాడు.
ఎంత వరకు ఐహిక విషయ లాలస ఉంటుందో అంత వరకూ మనిషి భగవంతుడికి దూరంగానే ఉంటాడు. భగవంతుడి వైపు జీవనమార్గం మారాలంటే ఓ తెగింపు ఉండాలి. ఆ తెగింపు తులసీదాసులో వచ్చింది. అవిశ్రాంతంగా 14 సంవత్సరాల పాటు తీర్థయాత్రలు చేసాడు. అనేక క్షేత్రాలు సందర్శించాడు. పరిపూర్ణ సాధువుగా మారాడు.
తీర్థయాత్రలు చేస్తూ దేవభూములు, తపోభూముల్లో సంచరించడం వల్ల చేసిన పాపాలు నశిస్తాయి. మనసు నిర్మలంగా ఉంటుంది. ఆయా క్షేత్రాల్లోని మహనీయుల అనుగ్రహం కలుగుతుంది. ఫలితంగా చిత్తం దేవుడికి చేరువ అవుతుంది. ఇటువంటి భక్తుడినే భగవంతుడు కూడా అనుగ్రహిస్తాడు. అవసరమైతే తానే స్వయంగా అటువంటి భక్తుడిని వెతుక్కుంటూ వస్తాడు.
తులసీదాసు జీవితంలోనూ సరిగ్గా ఇలాంటి సంఘటనే జరిగింది. తీర్థయాత్రల్లో ఉండగా, నరహరగిరి ఆనందుడనే యోగిని తులసీదాసు దర్శించుకున్నాడు. ఆ మహనీయుడి సందర్శనతో తులసీదాసులో గొప్ప మార్పు వచ్చింది. ఆయన కూడా తులసీదాసును చూడగానే ఇన్నాళ్ళ తన నిరీక్షణ ఫలించినందుకు ఆనందపడ్డాడు. తులసీదాసును శిష్యుడిగా స్వీకరించి, రామతారక మంత్రాన్ని ఉపదేశించాడు.
మనసంతా రామమయం
సంవత్సరాలు గడుస్తున్నాయి. ఎటువంటి అవాంతరానికీ తులసీదాసు చలించడం లేదు. రాగద్వేషాలకు దూరమయ్యాడు. అకుంఠితమైన తపస్సు కారణంగా ఆయన ముఖం దివ్యతేజస్సుతో ప్రకాశిస్తోంది. కళ్ళు మూసినా, తెరచినా; ఆహారం తీసుకుంటున్నా, నిద్రపోతున్నా... అంతటా రామభావన తప్ప మరొక ఆలోచనకు కూడా ఆయన మస్తిష్కంలో స్థానం లేకుండా పోయింది. లోకమంతా భక్తుడంటే తులసీదాసు మాత్రమే అన్నంతగా ఆ మహనీయుడు రామదాసుడిగా మారిపోయాడు.
తులసీదాసు తపస్సు ఫలించింది. రామభక్త శిఖామణి ఆంజనేయస్వామి దర్శనమైంది. హనుమ ఆశీర్వాద ఫలితంగా రామచంద్రమూర్తి దర్శనమూ పొందాడు. చర్మచక్షువులతో చిదానంద స్వరూపుడిని దర్శించిన పుణ్యశీలిగా చరిత్రలో నిలిచిపోయాడు తులసీదాసు. జీవితపు చివరి క్షణం వరకూ రామనామస్మరణలో, రామనామగానంలో మునిగి, బ్రహ్మానందం పొందేవాడు.
ఆయనే కాదు, ఆ గానామృతానికి పరవశించిపోయిన అనేకమంది, తులసీదాస్ దగ్గరకు వచ్చి రామనామ దీక్ష తీసుకుని, నిరంతరం శ్రీరాముని స్మరిస్తూ ఆనందంలో ఓలలాడేవారు. హిందువులతో పాటు ఇతర మతాలవారు కూడా తులసీదాస్ వద్ద రామనామ దీక్ష తీసుకుని, రామ భజన చేయడం ప్రారంభించారు. ఆ రోజుల్లో ఇదొక సంచలనంగా మారింది.
ప్రాణం పోసిన రామభక్తి
ఒకరికొకరుగా జీవించే చిలకాగోరింకల్లాంటి జంట ఒకటి ఉంది. ఒక రోజున భరంత హఠాత్తుగా కన్నుమూశాడు. అతని భార్య దుఃఖం వర్ణనాతీతంగా ఉంది. శోకమూర్తిలా ఉన్న ఆమెను చూసి అందరికీ మనసు అర్ద్రమైంది. కానీ ఎవరు మాత్రం ఏం చేయగలరు. పోయిన ప్రాణం తెప్పించే శక్తి ఎవరికి ఉంది.
అంత్యక్రియలకు సన్నాహాలు చేశారు. భర్తశవాన్ని తీసుకుపోనీయకుండా అడ్డుకుంటున్న ఆ అమ్మాయిని బంధుమిత్రులు కలిసి బలవంతంగా ఆపగా, శవయాత్ర ముందుకు నడిచింది. కానీ, కొద్దిసేపటికే ఆ అమ్మాయి పట్టుకున్న వారిని వదిలించుకొని పరుగుపరుగున శవయాత్రసాగే ప్రదేశానికి చేరుకుంది. అప్పటికి ఆ శవయాత్ర తులసీదాస్ ఆశ్రమం ముందునుంచి వెళుతోంది. ఆ ఆశ్రమం చూడగానే, ఆమెకు ఏమనిపించిందో! తన భర్తని బ్రతికించగల మహానుభావుడు అక్కడ ఉన్నాడనుకుంది. హఠాత్తుగా ఆ ఆశ్రమములోనికి వెళ్ళి, తులసీదాస్ పాదాలమీద వాలి శోకించింది.
నుదుటబొట్టు, చేతులకు గాజులు మొదలైన సౌభాగ్య చిహ్నాలతో ఉన్న ఆమెను చూసిన తులసిదాస్, దీర్ఘసుమంగళీభవ అని దీవించాడు. ఆ దీవెనకి ఆమె మరింతగా శోకించింది. "సౌభాగ్యవతీ! ఎందుకు నువ్వు ఇంతగా బాధపడుతున్నావు. కారణం చెప్పమ్మా!" అని అనునయంగా పలికాడు తులసిదాస్. "నాబోటి నిర్భాగ్యురాలిని - దీర్ఘసుమంగళీభవ అని దీవించారు స్వామీ! మీబోటి మహానుభావుల దీవెన నిష్పలమైంది కదా!" అంటూ కుమిలి పోయింది ఆ ఇల్లాలు. "శ్రీరామచంద్రుడు నానోట అసత్యం పలికించడమ్మా! ఏం జరిగిందో చెప్పు" అని అడిగాడు తులసీదాస్.
"మా ఆయన చనిపోయారు. ఆ వెళుతున్న శవయాత్ర ఆయనదే. ఇక నా సౌభాగ్యమునకు అర్థమేముంది" అంటూ భోరుమంది ఆ అమ్మాయి. తులసిదాసు హృదయం జాలితో నిండిపోయింది. ఆయన వెంటనే ఆ శవయాత్ర దగ్గరకు వెళ్ళి, శవవాహకులను ఆగమన్నాడు. ఆ శవం కట్లు విప్పి, రామనామాన్ని జపించి, తన కమండలంలోని జలాన్ని శవం మీద జల్లాడు. అంతే! అద్భుతం జరిగింది. శవంలో జీవం వచ్చింది. అటూ ఇటూ కదిలి కళ్ళు తెరిచాడు ఆ యువకుడు. పునర్జీవితుడైన భర్తను చూసిన భార్య ఆనందబాష్పాలు రాలుస్తూ, తులసీదాసు పాదాలపై వాలిపోయింది. బంధుమిత్రులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.
దిల్లీ పాదుషా గర్వభంగం
ఈ సంఘటన తర్వాత రామనామదీక్ష తీసుకునేవారి సంఖ్య అమితంగా పెరిగిపోయింది. దీంతో ఇతర మతగురువులు ఢిల్లీ పాదుషా దగ్గరికి వెళ్ళి, తులసీదాసు మతమార్పిడికి ప్రోత్సహిస్తున్నాడని అభియోగం మోపారు. విచారించడానికై తులసీదాసుని పిలిపించాడు పాదుషా.
మరణించినవారిని బ్రతికించగలదా మీ రామనామం అని అడిగాడు పాదుషా. తప్పకుండా అని జవాబిచ్చాడు తులసీదాసు. మేము ఇప్పుడే ఒక శవాన్ని తెప్పిస్తాము. మీ రామనామ మహిమతో బ్రతికించగలరా అని సవాలు చేశాడు పాదుషా. రామనామం చాలా మహిమ కలది. చనిపోయిన వ్యక్తిని బతికించగలదు. కానీ జననమరణాలు వ్యక్తి కర్మలమీద, దైవనిర్ణయం మీద ఆధారపడి ఉంటాయు. వాటి విషయం మానవమాత్రులమైన మనం కలిగించుకోవడం తప్పు కదా అన్నాడు తులసీదాసు. ఇన్ని మాటలు వద్దు. రామనామానికి మహిమ లేదని చెప్పు. లేదా శవాన్ని బతికించు...అని కఠినంగా ఆజ్ఞాపించాడు పాదుషా.
రామచంద్రా! ఇదేమి పరీక్ష. రాజు కన్నెర్ర చేస్తున్నాడు. అంత మాత్రాన ఇతను చెప్పిన పని చేయలేను కదా. రామా! ఈ విపత్తు నుండి నీవే నన్ను రక్షించాలి... అని మనసులోనే వేడుకుంటూ కళ్ళు మూసుకుని ధ్యానమగ్నుడైయ్యాడు తులసీదాసు. అతడిని బంధించమని ఆజ్ఞాపించాడు పాదుషా.
తులసీదాసు వైపు సైనికులు కదిలారు. మనసా, వాచా, కర్మణా - త్రికరణశుద్ధిగా తననే నమ్మే ఆ భక్తునికి, ప్రతిక్షణం రామనామస్మరణ చేసే తన సేవకునికి, ప్రాణపాయసమయంలో కూడా తన మీదే భారం వేసిన ఆ మహానుభావునికి అపాయం చుట్టుముడుతుంటే రామభద్రుడు ఊరుకుంటాడా. తక్షణమే తన సైన్యాన్ని పంపించాడు.
ఎక్కడినుండి వచ్చాయో తెలియదు గానీ, వందలు, వేలుగా కోతులు అక్కడికి వచ్చాయి. సైనికులమీద పడి, వారి దగ్గర ఆయుధాలను లాక్కుని వారి మీదకే గురిపెట్టాయి. సైనికులు, పాదుషాతో సహా ఎవ్వరూ అంగుళం కూడా కదల్లేదు. ఏ కోతి మీదపడి కరుస్తుందో అనే భయంతో అక్కడివారంతా భయాందోళనలకు గురయ్యారు. సభలో కలకలం రేగింది. ఆ సవ్వడికి కనులు తెరచిన తులసీదాసుకి సైనికులకి ఆయుధాలు గురిపెట్టిన వానరాలు కనిపించాయి.
అవి కోతులు కాదు, రామదండు. తులసీదాసు ఆశ్చర్యంతో, ఆనందంతో చుట్టూ పరికించాడు. ఎదురుగా సింహద్వారం మీద కూర్చుని అభయహస్తాన్ని చూపుతున్న ఆంజనేయుడు దర్శనమిచ్చాడు. తులసీదాసు భక్తిభావంతో తన్మయత్వంతో, స్వామికి చేతులు జోడించి స్తుతించాడు. ఆయన నోటినుండి అప్రయత్నంగా, ఆశువుగా జయహనుమాన జ్ఞానగుణసాగర.. అంటూ హనుమాన్ స్తుతి ప్రవహించింది. అదే హనుమాన్ చాలీసా.
తులసీదాసు స్తుతికి హనుమంతుడు ప్రసన్నుడయి, ఆ భక్తుని అనుగ్రహించాడు. "నాయనా! నీస్తుతితో మరింత ప్రసన్నం చేసుకున్నావు. బిడ్డా! ఈ మూకని సంహరించాలా? తరిమికొట్టాలా? నీ కోరిక ఏమిటో చెప్పు తీరుస్తా''ను అని అన్నాడు స్వామి. చేతులు జోడించి భక్తిగా తలవాల్చాడు తులసీదాసు. "స్వామీ! ఇప్పటికే ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న వీరిగురించి నేనేమీ అడగను. ఇప్పటికే వీరికి అజ్ఞానం తొలగిపోయింది. కానీ, ఒక్క ప్రార్థన. ప్రభూ! ఈ స్తోత్రంతో నిన్ను ఎవరు స్తుతించినా వారికి ప్రసన్నుడవవు కావాలి. స్వామీ! నాకు ఈ వరాన్ని అనుగ్రహించు'' అని వేడుకున్నాడు. ఆ మాటలకు స్వామి మరింత ప్రసన్నుడయ్యాడు. తథాస్తు అని అనుగ్రహించాడు. నాటి నుంచి హనుమాన్ చాలీసా చదివిన వారికి స్వామి ప్రసన్నుడయి అనుగ్రహిస్తున్నాడు.
భక్తులుగా మారిన దొంగలు
రామభక్తుడైన తులసీదాసు ఓ రాత్రివేళ వాహ్యాళిగా నడచివెళ్తున్నాడు. కొందరు దొంగలు ఆయనను అడ్డగించి 'ఎవరు నువ్వు'' అనడిగారు. ప్రజలంతా ఆ రాముని వారే అన్న మానసిక భావనతో ‘నేను మీ వాడినే' అని జవాబిచ్చాడు తులసీదాసు. అది విన్న ఆ చోరులు అతనూ తమ లాగే దొంగే అని భ్రమపడ్డారు. దొంగతనంలో సాయపడతాడని తమతో పాటు తీసుకువెళ్లారు.
ఒక ఇంట్లో దొంగతనం చేయటానికి లోపలికి వెళ్తూ తులసీదాసుతో 'నువ్వు బయట నిలబడు! ఎవరైనా వస్తే వెంటనే శంఖం ఊదు. మేము బయటకు వచ్చేస్తాం' అని ఆయన చేతికి ఓ శంఖం ఇచ్చారు. దొంగలు లోపలికి వెళ్లిన కొన్ని క్షణాలకే తులసీదాసు శంఖం పూరించాడు. ఎవరో వస్తున్నారు కాబోలు అనుకుని ఆదుర్దాతో దొంగలు బయటకు పరుగెత్తుకొచ్చారు. కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు.
దొంగలు తులసీదాసును దూషిస్తూ 'ఇక్కడ ఎవరూ లేరు కదా! ఎందుకు శంఖం ఊదావు? అని గద్దించారు. అప్పుడు తులసీదాసు 'అయ్యా' ఇక్కడ, అక్కడ అని లేదు. అంతటా నా ప్రభువు శ్రీరామచంద్రుడే కనిపిస్తున్నాడు. ఆయన దురాగతాలు చేసేవారిని ఎంతమాత్రం ఇష్టపడడు. దొంగతనం చెడ్డపని. మీరెవరూ ఆయన ఆగ్రహానికి గురికాకూడదనే నేను శంఖం ఊదాను' అన్నాడు. ఆ మాటలు విన్న దొంగల్లో పశ్చాత్తాపం కలిగింది. తర్వాతెన్నడూ చౌర్యం చేయకపోవడమే కాదు వారి ప్రవర్తనలో గొప్ప మార్పు వచ్చింది.
ఇంకా మరెన్నో సంఘటనలు తులసీదాసు జీవితంలో ముడిపడి ఉన్నాయి. వాటన్నిటి సారాశం ఒక్కటే. భవ సాగరాన్ని దాటించే నావ రామనామం మాత్రమే. పునరావృత్తి రహితమైన కైవల్యసాధనకు రామనామాన్ని మించిన మార్గం లేదు.
Thursday, May 2, 2024
ధర్మమూర్తి... సమదర్శి.... జగద్గురు కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి
ధర్మమూర్తి... సమదర్శి
ఆయన పేరు పలికితేనే చాలు... వ్యక్తం చేయటానికి మాటలు చాలని అనుభూతి కలుగుతుంది. ఆ కళ్ళలోని వెలుగు ఏదో తెలియని కారుణ్యాన్ని ప్రసరిస్తుంటుంది. సనాతన ధర్మానికి, భారతీయ ఆధ్మాత్మిక చింతనకు ఆ మహనీయుడు ప్రతిరూపం. అధునాతన దేశంలో భౌతికరూపంలో నడయాడిన దైవం. ధర్మం అంటే ఇదీ... అని నూరుశాతం ఆచరించి చూపించిన ధర్మమూర్తి. కుల, మత, ప్రాంత, లింగ, భాషా భేదాలు లేకుండా ప్రతి ఒక్కరినీ అక్కున చేర్చుకున్న దర్శి. ఆయనే... జగద్గురు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి.
కంచి కామకోటి పీఠం 68వ పీఠాధిపతిగా సుమారు 83 సంవత్సరాల పాటు పీఠాధిపత్యం వహించి, కోట్లాది ప్రజల హృదయాల్లో ఆధ్యాత్మిక వెలుగులు నింపిన మహనీయు మూర్తి ఆయన. ఎంతమంది పీఠాధిపతులు ఉన్నా ‘మహాస్వామి’ మాత్రం శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మాత్రమే.
చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి కర్ణాటకలోని హోయసల బ్రాహ్మణ వంశానికి చెందినవారు. క్రీ.శ.13వ శతాబ్దిలో చోళ రాజులకు సహాయార్థం హోయసల రాజులు తమిళ దేశానికి వలస వచ్చారు. వీరితో బాటు వచ్చిన హోయసల బ్రాహ్మణ కుటుంబాలు అనంతర కాలంలో తమిళ దేశంలోనే స్థిరపడ్డాయి.
విజయనగర రాజులచే సామంతునిగా ప్రతిష్ఠింపబడిన చెవ్వప్ప నాయకుని కాలంలో (క్రీ.శ.1535 ప్రాంతంలో) హోయసల కర్ణాటక కుటుంబాలు తమిళ దేశానికి రెండవసారి వలస వచ్చాయి.
ఈవిధంగా వలస వచ్చిన హోయసల కన్నడ బ్రాహ్మణ వంశీకుడైన గణపతి శాస్త్రి కంచి కామకోటి పీఠానికి చెందిన 64వ పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి – 5 కాలంలో ముఖ్య పరిపాలనాధికారిగా ఉండేవారు.
గణపతి శాస్త్రి పెద్ద కుమారుడైన సుబ్రహ్మణ్య శాస్త్రి కుంభకోణం ప్రాంతంలో ఉపాధ్యాయునిగా పనిచేస్తుండే వారు. చెవ్వప్ప నాయకుని వద్ద మంత్రిగా ఉన్న గోవింద దీక్షితుల వంశీకుడైన నాగేశ్వర శాస్త్రి కుమార్తె మహాలక్ష్మితో సుబ్రహ్మణ్య శాస్త్రికి వివాహం జరిగింది. ఈ పుణ్యదంపతుల రెండవ కుమారుడే పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి.
సుబ్రహ్మణ్య శాస్త్రి విల్లుపురంలో ఉపాధ్యాయునిగా పనిచేస్తుండగా 1894సంవత్సరం మే 20వ తేదీన చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి జన్మించారు. వీరి పూర్వాశ్రమ నామధేయం స్వామినాథన్. చిన్నతనం నుండే స్వామినాథన్ అనన్య ప్రతిభా సామర్థ్యాలను చూపుతుండేవారు. తండ్రి సుబ్రహ్మణ్య శాస్త్రి కుమారునికి అయిదు సంవత్సరాల వరకు తనవద్దనే చదువు చెప్పారు కానీ స్కూలుకి పంపలేదు.
తన ఎనిమిదవ ఏట స్వామినాథన్ ప్రాథమిక పాఠశాలలో చేరారు. సుబ్రహ్మణ్య శాస్త్రి దిండివనంలో పనిచేస్తుండగా అక్కడ ఉన్న ఆర్కాట్ అమెరికన్ మిషన్ స్కూలులో 7వ తరగతిలో చేర్పించారు. 1905వ సంవత్సరంలో స్వామినాథన్ కు తండ్రి ఉపనయన సంస్కారం చేశారు. స్వామినాథన్ పాఠశాలలో ప్రథముడిగా నిలుస్తూ అందరి మన్ననలు పొందుతుండేవాడు.
ఈ సమయంలోనే కామకోటి పీఠ 66వ ఆచార్యులైన చంద్రశేఖరేంద్ర సరస్వతి తమిళనాడులో దక్షిణ ఆర్కాటు జిల్లాలో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్య శాస్త్రి కుమారుని వెంటబెట్టుకుని స్వామివారి దర్శనానికి వెళ్ళారు. చిన్నవాడైన స్వామినాథన్ యొక్క అపార ప్రజ్ఞాపాటవాలను చూసిన ఆచార్యుల వారు ఈ బాలుడు అనంతర కాలంలో కామకోటి పీఠాన్ని అధిష్ఠించి అభివృద్ధి చేయగలడని భావించి ఆయనను ఎంపిక చేయాలని మనస్సులో సంకల్పించుకున్నారు.
తర్వాతి పరిణామల నేపథ్యంలో స్వామినాథన్ కంచికి తీసుకొని వచ్చి, సన్యాసాశ్రమ దీక్షనిచ్చి చంద్రశేఖరేంద్ర సరస్వతిగా తీర్చిదిద్దారు. తన 13వ ఏట స్వామినాథన్ చంద్రశేఖరేంద్ర సరస్వతిగా కామకోటి పీఠాన్ని అధిష్ఠించారు.
సన్యాసాశ్రమం స్వీకరించేనాటికి స్వామివారు వేదాధ్యయనం చెయ్యలేదు కాబట్టి, అందుకోసం మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ కృష్ణశాస్త్రి గారిని మఠం అధికారులు స్వామి వారికి వేదం బోధించడం కోసం నియమించారు. కొంతకాలం తర్వాత కృష్ణశాస్త్రి గారు స్వామితో ఇలా అన్నారు. "స్వామీ! నిమిత్త మాత్రంగా మేము మిమ్ము శిష్యులుగా పాటించినా, యదార్ధంగా మీరే మా గురువులు, మేము మీకు శిష్యులం". ఇదీ మహాస్వామి ప్రతిభ. దైవీకమైన శక్తి.
1907లో స్వామి పీఠాధిపత్యం వహించిన పిమ్మట కావేరీనది ఉత్తర తీరాన మహేంద్రమంగళంలో ప్రత్యేకంగా ఒక పర్ణశాల నిర్మించుకుని. 1911 మొదలు 1914 వరకు నాలుగు సంవత్సరాలు తదేక దీక్షతో విద్యాభ్యాసం చేశారు. ఆయా శాస్త్రాలలో నిష్ణాతులైన పండితుల వద్ద తర్క, వ్యాకరణ, మీమాంస, వేదాంతాలను నేర్చుకున్నారు.
బాల్యంలో ఆంగ్ల పాఠశాలలో చదివిన ఇంగ్లీషుతో పాటు ఫ్రెంచికూడా అభ్యాసం చేశారు. మరాఠీ చదివారు. తమిళ వ్యాకరణం, తేవారం, తిరువాచికం, పెరియ పురాణం, తిరుక్కురళ్ మొదలైన గ్రంధాలు పఠించారు. తమిళ భాషలోని కావ్య ప్రబంధాలను పరిశోధనాత్మకంగా అధ్యయంన చేసారు.
గానకళకు సంబంధించిన శాస్త్రాకోశాలను తెలుసుకున్నారు. ఛాయాగ్రహణ (ఫొటోగ్రఫి) రహస్యాలను గ్రహించారు. గణితం, జ్యోతిషం, ఖగోళశాస్త్రాదుల మర్మాలను అవగాహన చేసుకున్నారు. ప్రాచీనశాసన పరిశోధనలో, స్థల పురాణ సమస్యల పరిష్కరణలో ప్రావీణ్యం గడించారు.
"చరిత్రకు సంబంధించిన శాసన పరిశోధనలో మా కేవైనా సందేహాలు కలిగిప్పుడు కామకోటి స్వామి వారి సహాయంతో మేము మా సందేహ నివారణ చేసుకుంటాము” అని అప్పటి ఆర్కియలాజికల్ డిపార్టుమెంటు ఉన్నతాధికారి టి.యన్. రామచంద్రన్ ఒక సభలో ప్రకటించారు.
అమేయమూ, విశ్వతోముఖమూ ఆయన ఈ విజ్ఞానభాండారమంతా ఒక్క వ్యక్తిలో ఇలా కేంద్రీకృతం కావడం అనితర సాధ్యం. అలౌకికమైన వర ప్రసాదమే తప్ప, ఎంతటి వారికైనా కేవలం స్వయంకృషితో ఇటువంటి అసాధారణ ప్రతిభ సాధ్యం కాదు.
సనాతన ధర్మాన్ని రక్షించడానికి మహాస్వామి వారు తమ నూరేండ్ల జీవితాన్ని ధారపోశారు. శతాబ్దిలో వారు ఉండటం కాదు, ఒక శతాబ్దమే వారిలో ఉన్నది. నీతి, నిజాయతీ, నిర్వహణకు ఆయన పెట్టింది పేరు. ఆడంబరం లేని మహనీయుడు. ఆయన సమదర్శి, వాత్సల్య మూర్తి.
వారికి అద్భుతమైన జ్ఞాపకశక్తి ఉండేది. ఒక సంఘటన జరిగి దశాబ్దాలు జరిగినా దానిని గుర్తుపెట్టుకునేవారు. ఒకసారి కలిసిన వ్యక్తి మళ్ళీ ఎప్పుడు కలిసినా గుర్తించేవారు. స్వామి కార్యంలో భారీ సేవ చేసినవారినీ, ఉడతాభక్తిగా సేవించిన వారినీ అందరినీ ఒకేతీరున గుర్తుపెట్టుకునేవారు. అందుకే ఆయన సమదర్శి అనిపించుకున్నారు.
సాధారణ భక్తులు వచ్చి వారికొచ్చే చిన్నచిన్న సందేహాలు అడిగినా, పండితులు తర్కమీమాంస శాస్ర్తాలకు సంబంధించిన ప్రశ్నలు వేసినా... అన్నిటికీ సావకాశంగా బదులిచ్చి, సందేహ నివృత్తి చేసేవారు. ఆయన ఆచారం ప్రధానంగా పెట్టుకున్నారే కానీ, ప్రచారం గురించి ఎన్నడూ ఆలోచించలేదు. ఆయన కారుణ్యమూర్తి. వారి వ్యక్తిత్వం దోష రహితం, దైవ సహితం. ఆయన చూపుల్లో దివ్య తేజస్సుతోపాటు అంతులేని వాత్సల్యం ప్రతిఫలించేది.
చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు వేద రక్షకుడు. సద్గురువు. శాస్త్ర పరిశోధకుడు. దేశకాల పరిస్థితులను బట్టి, ఆధ్యాత్మిక సంపదను రక్షించిన రాజనీతిజ్ఞుడు. అంతకుమించి బహుభాషా కోవిదుడు.
ధర్మాచరణకు శ్రద్ధ అవసరమని, సంకల్ప బలం, విశ్వాసం ఉండా లని, మనసును నియంత్రిస్తేనే కార్య సిద్ధి కలుగుతుందని చెప్పేవారు.
దేశమంతటా వేద పాఠశాలలు నెలకొల్పి వేదాధ్యయనాన్ని ప్రోత్సహించారు. ఎన్నో ఆలయాలకు మంటపాలు నిర్మించారు.
ధర్మ సంవర్ధనమే లక్ష్యంగా ఇరవై సంవత్సరాలు పాదచారం చేస్తూ యావద్భారతం పర్యటించారు. హిందూమత సంరక్షణకు, వివిధ శాఖలకు చెందిన హిందూ మతావలంబుల సమైక్యతకు అద్వితీయమైన కృషిచేశారు. వందల సంఖ్యలో ధర్మ సంస్థలు స్థాపితమయ్యేలా ప్రోత్సహించి, ధర్మప్రచారానికి బలమైన పునాదులు వేసారు.
భక్తులపై స్వామికిగల వాత్సల్యం అంతా ఇంతా కాదు. భక్తులను సంతృప్తి పరచడానికి, వారిని సంతోషపెట్టడానికి స్వామి వహించే శ్రద్ధ ఇంత అని మాటల్లో చెప్పటానికి సాధ్యం కాదు.
ఆధ్యాత్మిక విషయాలను చర్చించే వారి సంగతి అలా ఉంచి, అనేకమంది భక్తులు జీవితంలో తమ కష్టసుఖాలను గురించి, సంసారంలోని చిక్కులను గురించి స్వామితో తమ సమస్యలు చెప్పబోయే సరికి-భక్తి చేతనో, భయం చేతనో, మాటలు తడబడతాయి. ఒకటి చెప్పబోయి వేరొకటి చెబుతారు. అసలు తాము చెప్పదలచింది మరిచిపోతారు. సగం చెప్పి ఊరుకుంటారు. అలాంటి సందర్భాల్లో స్వామి అసహనం చూపేవారు కాదు. తమ సమయాన్నంతా వృధా చేస్తున్నారని ఏమాత్రం అనుకునేవారు కాదు. వారి బాధ ఏమిటో తెలుసుకోడానికి ప్రయత్నించేవారు. వారి మనస్సులోని మాట రాబట్టడానికి తామే అనేక ప్రశ్నలడిగి, తగిన ఉపాయాలను సూచించి వారి బాధలను ఉపశమింప జేసేవారు.
చూడ వచ్చినవారి పెద్దలను గురించీ, వారి బంధువర్గాన్ని గురించీ పేరు పేరునా అడిగి, వాళ్ల యోగక్షేమా లన్నిటినీ తెలుసుకునేవారు. తమ దూరపు బంధువులను, ఒకవేళ భక్తులెవరైనా మరిచిపోతారేమో కాని, స్వామికి మాత్రం జ్ఞాపకం ఉండేది. ఎన్ని సంవత్సరాలు దాటినా ఒక్కొక్క భక్తుని వంశచరిత్ర స్వామి జ్ఞాపకశక్తి అనే బీరువా అరలో ఎలా భద్రపరిచి ఉండేదో ఊహకు అందని విషయంగా ఇప్పటికీ మిగిలిపోయింది.
"శంభోర్మూర్తిః చరతి భువనే శంకరాచార్య రూపా” - సాక్షాత్తు పరమశివుని అవతారమైన ఆదిశంకరులు అనేక శతాబ్దుల కిందట కంచికామకోటి పీఠాన్ని స్వయంగా అధిష్టించి సర్వజ్ఞపీఠంగా కంచి పీఠాన్ని తీర్చిదిద్దారు. ఆ తర్వాత శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి ఆదిశంకరుల అవతారంగా తిరిగి సర్వజ్ఞ పీఠాన్ని అధిష్టించి, ఆదిశంకరుల పరంపరా వైభవాన్ని మరోసారి ప్రకటించారు.
చంద్రశేఖరేంద్ర స్వామి కేవలం పీఠాధిపతి మాత్రమే కాదు. ఆయనలో ఒక రాజకీయవేత్త, చారిత్రక పరిశోధకుడు, శాస్త్రపరిశోధకుడు, జ్యోతిశ్శాస్త్రవేత్త, ఆధ్యాత్మికవేత్త... ఇంకా ఎందరో దాగున్నారు. ఇన్ని విషయాల్లో విస్తృతమైన ప్రతిభా సామర్థ్యాలు కలిగిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి జీవితం అద్భుతం, అనితర సాధ్యం. నిండు నూరేళ్ళు విలక్షణమైన జీవితాన్ని గడిపి, పాదచారియై దేశమంతా సంచరిస్తూ ధర్మప్రభోదం చేసిన మహాపురుషులు స్వామి.
రెండువేల సంవత్సరాల కిందట దక్షిణ భారతంలో జన్మించి, అవైదిక మతాలను ఖండించి, అనేక దివ్యశక్తులను ప్రదర్శించిన ఆదిశంకరులే తిరిగి నేడు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతులుగా అవతరించారు. ఇది అతిశయోక్తి కాదు.
------xxxxx------
రచన: డాక్టర్ కప్పగంతు రామకృష్ణ, అసోసియేట్ ప్రొఫెసర్, కె.బి.ఎన్. కళాశాల (అటానమస్), కొత్తపేట, విజయవాడ-1.
సెల్: 90320 44115 / 8897 547 548
Wednesday, May 1, 2024
వాక్యకోవిదుడు హనుమంతుడు
వాక్యకోవిదుడు, వ్యాకరణ పండితుడు
మాట మనిషిని మహనీయుడిని చేస్తుంది. అదే మాట మనిషి పతనావస్థకు దారితీస్తుంది. వాక్కుకు అంతటి అమోఘమైన శక్తి ఉంది. అవతలి వ్యక్తితో స్నేహం చెయ్యాలన్నా, మిత్రుడు శత్రువుగా మారాలన్నా ఒక్క మాట సరిపోతుంది. అందుకే శాస్త్రాలు వాక్కును దైవంగా ప్రకటిస్తాయి. మంత్రభాగంలో కూడా వాక్కుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. మాట్లాడే మాటలో ఒక శబ్దం ఎక్కువ లేదా తక్కువ అయినా అందుకు విపరీత ఫలితాలు ఏర్పడతాయి. అందుకే ఎల్లప్పుడూ మంచి మాటలనే మాట్లాడాలి. వాక్కుకు ఇంతటి ప్రభావాన్ని పూర్తిగా తెలుసుకున్నవాడు, ఎవరితో ఎప్పుడు ఎంతవరకు ఎలా మాట్లాడాలో ఆ పరిధికి లోబడి మాట్లాడి ‘వాక్య కోవిదుడు’గా, ‘నవ వ్యాకరణ పండితుడు’గా జేజేలు అందుకుంటున్నవాడు రామదూత హనుమ మాత్రమే.
హనుమ నవ వ్యాకరణ పండితుడు. సూర్యుడి దగ్గర శిష్యరికం చేసినవాడు. తపస్వి. సుగ్రీవుడి మంత్రి. భక్తుడు. సేవకుడు. రాయబారి. కార్యసాధకుడు. యోధుడు. పరాక్రమశాలి. అన్నిటికీ మించి వినయ సంపన్నుడు. గొప్ప వాక్కు అలంకారంగా కలిగినవాడు – ’వాగ్విదాం వరం‘ – అని వాల్మీకి పొంగిపోయి చెప్పాడు.
హనుమంతుడు అనగానే సాధారణంగా అందరికీ ఆ స్వామి భుజ బలం మాత్రమే గుర్తుకువస్తుంది. నిజానికి హనుమ గొప్ప బుద్ధి బలశాలి కూడా. అందుకే ‘బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతా / అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్స్మరణాద్భవేత్’ - హనుమను ధ్యానిస్తే బుద్ధిబలం వస్తుంది అని చెబుతున్నాయి ఇతిహాస, పురాణ గ్రంథాలు.
సీతాదేవిని రావణుడు అపహరించిన తర్వాత ఆమెను వెదుకుతూ రామలక్ష్మణులు రుష్యమూక పర్వత ప్రాంతానికి చేరుకుంటారు. సుగ్రీవుడి నివాస ప్రాంతం అది. తనను చంపడానికి తన అన్న వాలి వీరిని పంపించారా అని అనుమానించి, విషయం తెలుసుకునేందుకు తన మంత్రి అయిన హనుమంతుడిని పంపుతాడు. మారుతి మారు వేషంలో రామలక్ష్మణుల దగ్గరకు వచ్చి అనేక విధాలుగా ప్రశ్నిస్తాడు.
రాజర్షి దేవ ప్రతిమౌ తాపసౌ సంశితవ్రతౌ ! దేశం కథమిమం ప్రాప్తౌ భవంతౌ వరవర్ణినౌ!!
మీరిద్దరూ మంచి తేజోవంతుల్లా, తీవ్రమైన తపోదీక్ష పట్టిన వారిలా ఉన్నారు. మీ రూపం తాపసుల్లా ఉన్నా మీ తేజం క్షత్రియత్వాన్ని సూచిస్తోంది. గొప్ప పని ఉంటే తప్ప మీవంటి యోధులు క్రూరమగాలు సంచరించే ఇలాంటి చోటుకురారు అని రామలక్ష్మణులను ప్రశ్నిస్తాడు హనుమ.
మాట అంటే ఇలా ఉండాలి. ఒక్క అక్షరం ఎక్కువ తక్కువ కాకుండా ప్రశ్నలు వేశాడు హనుమ. ఇంత కాలం తాను ఎవరి గురించి ఎదురు చూస్తున్నాడో ఆ దైవం ఎదుట నిలబడినప్పుడు హనుమ తొందరపడలేదు. వచ్చింది ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఎంత గొప్పగా ప్రశ్నించాడంటే రాముడే ముచ్చటపడ్డాడు. వ్యాకరణ పండితుడు తప్ప మరొకరు ఇలా మాట్లాడలేడన్నాడు. హనుమ ప్రశ్న స్వీకరించిన వ్యక్తి కూడా ఆనందపడేలా అడిగాడు. హనుమంతుడి మాటల ఔచిత్యానికి ముచ్చటపడతాడు రాముడు.
నా నృగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణ: ! నా సామవేద విదుష: శక్యమేవ విభాషితుం !!
రుక్, యజు, సామవేదాల్లో పండితుడైనవాడు తప్ప మరొకరు ఇలా మాట్లాడలేరంటూ లక్ష్మణుడితో హనుమంతుడి మాటలతీరులోని గొప్పతనాన్ని వివరిస్తాడు రాముడు. ఒక్క మాట ఎక్కువ తక్కువ కాకుండా కొత్తవారితో కూడా ఎంతో నేర్పుగా మాట్లాడటమే కాకుండా రామసుగ్రీవుల మైత్రికి బీజం వేసింది హనుమ వాక్చాతుర్యం. హనుమలోని వ్యాకరణ పాండితీ వైభవానికి, ఔచిత్యవంతమైన సంభాషణ చేసే నేర్పుకీ ప్రతీక ఈ ఘట్టం.
నవ వ్యాకరణాలు ఎలా చదివాడంటే...
‘హనుమంతుడు మాటతీరు తెలిసినవాడు’అని శ్రీరామచంద్రుడు అంతటివాడు ప్రశంసించాడు. నవ వ్యాకరణ పండితుడు కావటమే హనుమంతుడి ఉత్తమమైన మాటతీరుకు కారణం.
హనుమ సూర్యభగవానుడి దగ్గరకు వెళ్లి తనకు వ్యాకరణాన్ని నేర్పమన్నాడు. చిన్నప్పుడు తనను తిన దగిన ఫలమని భావించి ఎగిరి వచ్చిన హనుమను చూస్తే ముచ్చటేసింది సూర్యుడికి. ‘నేర్పుతాను. కానీ, నేను ఒకచోట స్థిరంగా ఉండటానికి కుదరదు కదా! గగన మార్గంలో నా వెంట ఎలా తిరుగ గలవు?’ అనడిగాడు భానుడు.
‘ఓ.. దానిదేముంది!’ అంటూ తన కాయాన్ని పెంచిన ఆంజనేయుడు ఉదయాద్రిన ఒక కాలు, అస్తాద్రిన ఒక కాలు మోపి, సూర్యగమనానికి అనువుగా నడుమును వంచుతూ, చెవి ఒగ్గి ఆదిత్యుడి దగ్గర వ్యాకరణ శాస్ర్తాన్ని కూలంకషంగా అధ్యయనం చేశాడు.
మనకు మొత్తం తొమ్మిది రకాల వ్యాకరణాలు ఉన్నాయి. అవి... 1.శాక్త వ్యాకరణము 2. శంభు వ్యాకరణము 3. కుమార వ్యాకరణము 4. ఇంద్ర వ్యాకరణము 5. సూర్య వ్యాకరణము 6. చంద్ర వ్యాకరణము 7. స్మర వ్యాకరణము 8. వాత్స్యాయన వ్యాకరణము 9. అగస్త్య వ్యాకరణము. – ఈ తొమ్మిది రకాల వ్యాకరణాలను హనుమంతుడు సూర్యుడి వద్ద అధ్యయనం చేసాడు. అందుకే హనుమకు ‘నవ వ్యాకరణ పండితుడు’ అనే పేరు ఏర్పడింది.
హనుమ మాట్లాడిన తీరుకు ముచ్చటపడిన రామచంద్రమూర్తి స్వయంగా... ‘నూనం వ్యాకరణం కృత్స్నమనేన బహుధా శ్రుతమ్ ৷ బహు వ్యాహరతానేన న కిఞ్చిదపశబ్దితమ్’ – ఆంజనేయుడు మాట్లాడిన మాటల్లో ఒక్క అపశబద్దం కానీ, ఒక్క మాట ఎక్కువ కానీ, తక్కువ కానీ లేదు. వ్యాకరణం మీద తిరుగులేని పట్టు ఉన్న వ్యక్తికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది అంటాడు. రామయ్యను హనుమ మెప్పించింది తన భుజబలం చూపించో, మరొక శక్తి ప్రదర్శించో కాదు... కేవలం తన భాషా పాండిత్యంతో మెప్పించాడు. అదీ హనుమ వ్యాకరణ పాండిత్యానికి ఉన్న ఔన్నత్యం.
దృష్టా సీతా...
వానర రాజు సుగ్రీవుని ఆజ్ఞ ప్రకారం భూమి నాలుగు చెరగుల నుంచి కపి సైన్యం వచ్చి చేరింది. ఓక్కొక్కరిని ఒక్కొక భాగానికి నాయకుడిని చేసి వారు ఏదిక్కుగా వెళ్ళాలో, ఎక్కడెక్కడ వెతకాలో వివరంగా ఆజ్ఞ ఇచ్చాడు సుగ్రీవుడు. చివరగా, అంగదుడిని నాయకునిగా చేసి , హనుమదాదిగా వీరులను దక్షణ దిక్కుకు వెళ్ళి వెతకమని చెబుతాడు. ఎక్కడి దాకా వెళ్ళి వెతకాలో చెబుతాడు. అందరికీ, ఎక్కడెక్కడ వెతకాలో కూడా చెబుతాడు.. సమయం ఒక నెల అని చాలా వివరంగా ఆజ్ఞ ఇచ్చాడు. అతిక్రమించిన వారికి శిరః ఛేదం శిక్ష అని ప్రకటించాడు. అందుకే దానిని సుగ్రీవాజ్ఞ అన్నారు.
అప్పుడు రాముడు హనుమకు అంగుళీయం తన గుర్తుగా ఇస్తాడు, సీతకు ఇవ్వడానికి. ఎవ్వరికీ ఇవ్వని ఈ గుర్తు హనుమకే ఇవ్వడం లో విశేషం, హనుమ మాత్రమే ఈ పని పూర్తి చేయగలడన్న నమ్మకం. సీతమ్మను వెదకడానికి అందరూ అన్ని దిక్కులకూ బయలుదేరుతారు. దక్షణ దిక్కుగా వెళ్ళినవారు చాలా చిక్కులు పడి సముద్ర తీరం చేరుతారు.
అప్పటికే ఇచ్చిన గడువు పూర్తి అయిపోయింది. అందరూ ప్రాణభయంతో ఉన్నారు సుగ్రీవాజ్ఞ మూలంగా. ఆ సమయంలో లంకకి వెళ్ళగలవారెవరనే ప్రశ్న ఏర్పడింది. చివరికి హనుమకి శక్తి గుర్తు చేసి ఆయనను పంపుతారు. హనుమ లంకకు చేరుకుని, సీతను చూసి ఆమెతో మాటాడి ఆమెను ఆత్మహత్య నుంచి కాపాడి, అంగుళీయమిచ్చి, సీతమ్మ ఇచ్చిన చూడామణి ని తీసుకుని, అశోకవనం నాశనం చేసి, రావణుని పరివారం కొంత, అతని సుతుని పరిమార్చి, రావణుని చూచి, లంక కాల్చి, విజయంతో తిరిగి బయల్దేరతాడు.
ఇక్కడ సముద్రపు ఒడ్డున ఉన్న వారు ఉత్కంఠ తో ఉన్నారు. ఏమైందో తెలియదు. హనుమ సీతను చూసి వస్తే అందరి ప్రాణాలు నిలబడతాయి. లేకపోతే, సుగ్రీవాజ్ఞ ప్రకారం శిరచ్ఛేదం తప్పదు. ఇటువంటి సమయంలో హనుమ తిరిగివస్తూ సముద్రపు ఒడ్డున ఉన్న తన వారికి విజయ సందేశం క్లుప్తంగా తెలియజేయడానికి సింహనాదం చేస్తాడు. ఆ సింహనాదం విని, అక్కడ వున్న జాంబవంతుడు మొదలైన వారు హనుమ కార్య సాధనతో తిరిగి వస్తున్నాడని భాష్యం చెబుతారు.
ఆయినా ఉత్కంఠం పోదు. హనుమ నేల మీద కాలుమోపుతూ... “దృష్టా సీతా” అన్నాడు. సాధారణంగా క్రియాపదంతో వాక్య నిర్మాణం ఉండదు. సంస్కృత భాషలో ఉన్న గొప్పతనం కూడ తోడు కలవడం, వ్యాకరణ పండితుడవటం వల్ల, అక్కడ ఉన్నవారి ఉత్కంఠను వెంటనే చల్లార్చే ఉద్దేశంతో హనుమ ‘దృష్టా సీతా’ అన్నాడు. ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో, ఎలా, ఎందుకు, ఏం మాట్లాడాలో తెలిసినవాడు కావటం వల్లనే ఒక్కమాటతో వేలాది ప్రాణాలు నిలబెట్టాడు హనుమ. అదీ ఆ స్వామిలోని వాక్యకోవిదత్వం.
సీతమ్మ ప్రాణం కాచిన మాట
పదినెలల అశోకవనవాసం సీతమ్మను ఎంత కుంగదీసిందంటే – హనుమ రావడం రెండు నిముషాలు ఆలస్యమయితే ఆత్మహత్య చేసుకునేది. అలాంటి సంక్షుభిత ఉద్విగ్న సమయాల్లో హనుమ మాట్లాడిన తీరు అనన్యసామాన్యం. బహుశా అలా మాట్లాడాలంటే దేవుడే దిగి రావాలి.
అంతకుముందు... తెల్లవారక ముందే రావణుడు వచ్చి నానా మాటలు అని వెళ్ళాడు. నరమాంస భక్షకులైన ఆడ రాక్షసుల గుండెలు గుచ్చుకునే మాటలు మరో వైపు. ఇక ఇన్ని కష్టాలు తట్టుకునే ఓపిక నశించింది సీతమ్మకు. తన కేశాలతో పాశం తయారుచేసుకుని, ఉరి వేసుకుని, ప్రాణాలు తీసుకోవాలని నిశ్చయించుకుని, అందుకు సన్నద్ధమవుతోంది. ఇదంతా గమనిస్తున్నాడు పక్కనే చెట్టుమీద ఉన్న మారుతి.
సీతమ్మతో మాట్లాడటానికి ఇదే సరైన సమయం. కానీ, ఏం మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? ఏ భాషలో మాట్లాడాలి...? ఆలోచించాడు హనుమ.
ఇంతదాకా సంస్కృతంలో రావణుడు అఘోరించి వెళ్ళాడు – కాబట్టి సంస్కృతంలో మాట్లాడితే మళ్ళీ రావణుడి మాయలే అనుకుంటుంది. అనేక భాషలు తెలిసినవాడే భాష ఎంపిక గురించి ఆలోచించగలడు. సీతమ్మ సొంత ఊరు మిథిలా నగరం. అయోధ్యలో మాట్లాడేది ప్రాకృత అవధి భాష. కాబట్టి, అయోధ్యలో మాట్లాడే యాసతోనే మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు హనుమ. అంటే సీతమ్మ మెట్టినింటి భాష అన్నమాట. పూర్తిగా మన ఊరివారెవరో మాట్లాడుతున్నారని మొదటి మాటకే ఆమె ఉపశమనం పొందాలి. ఆ తరువాత....? ఏం చెబితే ఆమె ఇంకా నమ్ముతుంది? శాంతిస్తుంది? ఆలోచించాడు... రామకథనే ఎంచుకున్నాడు . అంతే మైథిలీ ప్రాకృత భాషలో రామగానం ప్రారంభించాడు. తన మాండలికంలో రామకథను వినగానే సీతమ్మకు పోయిన ప్రాణం తిరిగివచ్చినంత పనైంది.
క్షేమంగా ఉన్న రాముడు నీ క్షేమం అడగమన్నాడు – అన్నాడు హనుమ. అంటే ఆమె అడగకుండానే రాముడు క్షేమంగా ఉన్నాడని, ఆయనే తనను పంపాడని విన్నవించాడు. నువ్వెక్కడున్నావో తెలిసింది ఇక వెంటనే రాముడు వస్తాడు – అని అభయమిచ్చాడు.
మాటల్లో చెప్పలేనంత ఆపదలో ఉండి, ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ మనిషిని ఎలా కాపాడాలో హనుమకు తెలిసినంత ఇంకెవ్వరీ తెలియదు అని ఘంటాపథంగా చెప్పడానికి ఈ ఘట్టమే ఉదాహరణ. నవ వ్యాకరణ పండితుడు, అనేక భాషలు తెలిసినవాడు కాబట్టే, సీతమ్మకు భాష ద్వారా దగ్గరయ్యాడు, రామదూతను అనే నమ్మకం కలిగించగలిగాడు.
హనుమ అంటే శబ్దబ్రహ్మ. ఆ స్వామి మాటకు మహోన్నతమైన శక్తి ఉంది. హనుమను మించిన పండితుడు లేడు. భుజబలంతో పాటు బుద్ధిబలమూ ఆ స్వామి అనుగ్రహం వల్ల లభిస్తుంది.
రచన : డాక్టర్ కప్పగంతు రామకృష్ణ, సెల్ : 9032044115 / 8897 547 548
Thursday, April 18, 2024
తెలుగింటి రాముడు
పున్నమి కాంతుల కల్యాణం (ఒంటిమిట్టలో జరిగే శ్రీ సీతారామ కల్యాణం నేపథ్యంగా శ్రీకనకదుర్గ ప్రభ పత్రికలో రాసిన వ్యాసం)
పున్నమి కాంతుల కల్యాణం లోకంలో పెళ్ళి ముచ్చట అంటే సీతారాములదే. అందులోనూ ఒంటిమిట్ట ఆలయంలో జరిగే సీతారాముల కల్యాణం మరింత శ...

-
శరత్ చంద్రికలు మనసే మందిరం చందమామ వెన్నెలనే కాదు శుభాలనూ వర్షిస్తాడు కలువలనే కాదు మనసునూ వికసింపజేస్తాడు చీకటి రాత్రులనే కాదు తమస...
-
శ్రీరామ రుద్రాభిషేక వైభవం ఈశ్వరా! అని భక్తితో గొంతెత్తి పిలిచినంతలోనే భక్తులను కటాక్షించే పరమ కారుణ్యమూర్తి పరమేశ్వరుడు....
-
సూర్యుడిని ఎలా ఉపాసించాలి? వేదాల్లో సూర్యుడి గురించి ఏం చెప్పారు? సూర్యోపాసనకు పాటించాల్సిన నియమాలేమిటి? శ్రీ సూర్యనారాయణ వైభవం ...