పున్నమి కాంతుల కల్యాణం
లోకంలో పెళ్ళి ముచ్చట అంటే సీతారాములదే. అందులోనూ ఒంటిమిట్ట ఆలయంలో జరిగే సీతారాముల కల్యాణం మరింత శోభాయమానంగా ఉంటుంది. ఇతర క్షేత్రాలకు భిన్నంగా శుక్ల చతుర్దశి రోజు రాత్రివేళ ఆరుబయట పండువెన్నెల వెలుగుల్లో రామయ్య పెళ్ళివేడుక ఇక్కడ ఎంతో వైభవంగా, భక్తజన హృదయోల్లాసంగా జరుగుతుంది. ఆ ముచ్చట చూసిన భక్తులదే భాగ్యం. ఆ కన్నులు చేసుకున్న పుణ్యం అనంతం.
బాల్యం నుంచి రామయ్యకు చంద్రుడంటే ఎంతో ఇష్టం. చిన్నతనంలో చందమామ కావాలని రామయ్య ఎంతో మారాం చేసేవాడు కూడా. ఆ కథ అందరికీ తెలిసినదే. అటువంటి అనుబంధం రాముడికి, చంద్రుడికి మధ్య ఉంది. కానీ, మిట్టమధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో జరగటం వల్ల తన ఆత్మీయుడు రామయ్య కల్యాణాన్ని చూడలేకపోయానని చంద్రుడు ఎంతో బాధ పడతాడు. ఈ విషయం రాముడు తెలుసుకుని, చంద్రుడిని ఓదార్చి, అతడికి మూడు వరాలు ఇస్తాడు. అందులో మొదటిది ` రాముడు ‘రామచంద్రుడు’ గా ప్రసిద్ధి పొందడం. రెండవది తర్వాతి అవతారంలో శ్రీకృష్ణుడుగా రాత్రి వేళ జన్మించడం. మూడవది ` కలియుగంలో రాత్రివేళ పున్నమి వెలుగులో కల్యాణోత్సవం జరగడం. ఈవిధంగా చంద్రుడికి ఇచ్చిన మాట ప్రకారం, చంద్రుడు పరిపూర్ణంగా వెన్నెలు వెలుగులు ప్రసరిస్తున్న శుభవేళ, ఒంటిమిట్ట క్షేత్రంలో శ్రీసీతారామ కల్యాణం కమనీయంగా జరుగుతుంది.
అద్భుతం... అపురూపం
ఒంటిమిట్ట శ్రీరామ క్షేత్రం ఓ అద్భుతమైన దివ్యధామం. పాల కొండలు, శేషాచల కొండల మధ్య ఉండే ఈ ఆలయం, పచ్చని ప్రకృతి శోభతో అలరారుతుంది. చూపులు తిప్పుకోలేనంతటి శిల్పసౌందర్యం ఈ ఆలయానికి ప్రత్యేకత తీసుకువచ్చింది. ఒంటిమిట్టలో ప్రధాన రహదారికి సమీపంలోనే కోదండ రామాలయం ఉంటుంది. ఆలయానికి నాలుగు దిక్కుల్లోనూ ద్వారాలు గోపురాలతో సహా నిర్మితమయ్యాయి. ప్రత్యేకించి, తూర్పు గోపురం ఐదు అంతస్తులుగా, 160 అడుగుల ఎత్తులో ఉండి, భారతీయ శిల్పకళా వైభవాన్ని చాటుతూ, చూపరులను ఎంతో ఆకట్టుకుంటుంది. క్రీ.శ. 1652 ప్రాంతంలో ఈ ఆలయానికి వచ్చిన ఫ్రెంచ్ యాత్రికుడు టవర్నిర్ ఈ గోపుర నిర్మాణం చూసి, ఎంతో ఆశ్చర్యపడ్డాడు. తన యాత్రా చరిత్రలో ఈ గోపురం గురించి ప్రత్యేకంగా రాసాడు.
శాసనాల ప్రకారం ఈ ఆలయ నిర్మాణం మూడు అంచెలుగా జరిగింది. దేవస్థాన ముఖమండపంలో 11వ శతాబ్దం నాటి చోళ శిల్పాలు కనిపిస్తాయి. ఈ ముఖమండపానికి 32 స్తంభాలు ఉంటాయి. ఇవన్నీ వేటికవే ప్రత్యేకమైన శిల్పాలతో కనువిందుచేస్తాయి. వీటిమీద రామాయాణ, భాగవత కథాచిత్రాలు చెక్కి ఉండటం విశేషం.
ఆలయప్రాంగణ మధ్యభాగంలో ప్రధాన ఆలయం ఎత్తుగా ఉండే వేదికమీద నిర్మితమైంది. మహా మండపం, గర్భాలయం, ముఖమండపం ఇందులో ఉన్నాయి. ముఖమండపంలో ఆళ్వారులు, శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీమహావిష్ణువు కొలువుదీరి ఉంటారు. ప్రధాన ఆలయంలో సీతాలక్ష్మణ సమేతుడై శ్రీరామచంద్రమూర్తి కొలువుదీరి ఉంటాడు. అమ్ముల పొది, కోదండం ధరించి ఉండటం ఈ విగ్రహం ప్రత్యేకత. మరోవిశేషం ఏమిటంటే... ఈ ఆలయంలో ఆంజనేయస్వామి విగ్రహం ఉండదు. గర్భాలయయంలో హనుమ లేని ఏకైక రామక్షేత్రం కూడా ఒంటిమిట్ట రామాలయమే. కాలక్రమంలో ప్రధాన ఆలయానికి సమీపంలో ‘సంజీవ రాయడు’ అనే పేరుతో హనుమంతుడి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసారు.
యుగయుగాల చరిత్ర
ఒంటిమిట్ట క్షేత్రానికి యుగాల చరిత్ర ఉంది. ఇందుకు సాక్ష్యాలు ఇప్పటికీ ఆ క్షేత్రంలో కనిపిస్తాయి. పూర్వం ఈ ప్రాంతాన్ని ఏకశిలా నగరం అని పిలిచేవారు. శృంగమహర్షి, మృకండు మహర్షి కోరిక మీదట రాముడు యాగసంరక్షణ కోసం ఈ ప్రాంతానికి తన తమ్ముడు లక్ష్మణుడితో కలిసి వస్తాడు. అందుకు ప్రతిగా మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలపై మలచి, ప్రతిష్ఠించారని స్థలపురాణం చెబుతోంది.
త్రేతాయుగం తర్వాత ద్వాపరయుగంలో జాంబవంతుడు ఈ విగ్రహాలను పున:ప్రతిష్ఠ చేసాడని కూడా చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఈ ప్రాంతంలో సీతారామ లక్ష్మణులు కొంతకాలం నివాసం ఉన్నారు. ఆ సమయంలో ఒక రోజున సీతమ్మ బాగా దాహం వేయడంతో రామలక్ష్మణులు తమ బాణాలతో పాతాళగంగను పైకి తీసుకు వస్తారు. ఆ నీటి ప్రవాహాలే ఇప్పటికీ రామతీర్థం, లక్ష్మణతీర్థం పేరుతో తర్వాతి కాలంలో ప్రసిద్ధి పొందాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఏర్పడినా, ఈ రెండు తీర్థాల్లో మాత్రం నీరు పుష్కలంగా ఉండటం నేటికీ అంతుచిక్కని రహస్యంగా ఉంది. దైవశక్తికి ఇదొక నిదర్శనం.
ద్వాపరయుగం తర్వాత, కాలక్రమంలో విజయనగర సామ్రాజ్య సమయానికి ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. ఆ రోజుల్లో ఈ ప్రాంతంలో ఒంటడు, మిట్టడు అనే ఇద్దరు దొంగలు ఉండేవారు. తాము దొంగతనం చేసిన సొమ్ముని కొండగుహల్లో దాచుకునేవారు. ఓసారి రామచంద్రమూర్తి వీరికి కలలో కనిపించి, ఇక మీదట దొంగతనం మాని బుద్ధిగా ఉండమని చెబుతాడు. అప్పటినుంచి తమ జీవితాన్ని మార్చుకుంటారు ఒంటడు, మిట్టడు. అక్కడి బంజరు భూమిని సాగుచేసుకుని, జీవితం గడిపేవారు. తమకున్న కొద్దిపాటి సొమ్ముతో ఓ రామాలయాన్ని కట్టించి, నిత్య పూజలు జరిపించేవారు. ఆ ఆలయమే కాలానికి గొప్ప ప్రసిద్ధి, ఆ అన్నదమ్ముల పేరుతో ఒంటిమిట్ట దేవాలయంగా ప్రసిద్ధి పొందింది.
భక్తుల వెల్లువ... కవుల వేదిక
ఒంటడు, మిట్టడుతో ప్రారంభమైన ఈ ఆలయంలో కాలక్రమేణా ఎంతో ప్రసిద్ధి పొందింది. ఎందరో మహారాజులు ఆలయాన్ని దర్శించుకుని విలువైన కానుకలు సమర్పించారు. అయ్యలరాజు రామభద్రుడు, అయ్యలరాజు తిప్పరాజు, బమ్మెర పోతన, తాళ్ళపాక అన్నమాచార్యులు, మందరకవి వావిలి కొలను సుబ్బారావు, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, ఉప్పుగుండూరు వేంకట కవి, వర కవి తదితర ప్రముఖ కవులు ఒంటిమిట్ట రాముడుని తమ కావ్యాలు, పాటల్లో తనివితీరా కొనియాడారు. జీర్ణదశకు చేరుకున్న ఒంటిమిట్ట ఆలయాన్ని మహాభక్తుడైన వావిలికొలను సుబ్బారావు బిచ్చం ఎత్తి మరీ నిధులు సేకరించి, ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసారు. తన ఆస్తిని కూడా ఆలయానికి రాసిచ్చారు.
కల్యాణ వైభోగమే...
ఒంటిమిట్టలో జరిగే సీతారామకల్యాణ వైభవం చూసి తీరాల్సిందే కానీ మాటల్లో వర్ణించడం సాధ్యం కాదు. అంతటి వైభవంగా జరుగుతుందీ కల్యాణం. ఒంటిమిట్ట బ్రహోత్సవాల్లో ప్రధానమైంది సీతారామ కల్యాణమే. ఈ కల్యాణోత్సవ వేదికను ఆరుబయట పున్నమి వెలుగు ప్రసరించేలా ఏర్పాట్లు చేస్తారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన కల్యాణమూర్తులను అర్చకస్వాములు వేదికమీదకు తీసుకువస్తారు. పండితులు ఆ సందర్భంలో ఎదుర్కోలు నిర్వహిస్తారు. ఈ ముచ్చట చూసి తీరవలసిందే. మరోపక్క వేదపండితులు మంత్రోచ్చారణ చేస్తుండగా, అర్చకస్వాములు ఆగమశాస్త్ర పద్ధతిని అనుసరించి, వివాహ క్రతువు ప్రారంభిస్తారు. విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, సంకల్పం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, ప్రవరలు పూర్తిచేసి, కన్యాదానం జరిపిస్తారు. రాత్రివేళ పున్నమి వెలుగు సాక్షిగా జరిగే ఈ వివాహ వేడుకను ప్రత్యక్షంగా తిలకించే భక్తులు మైమరచిపోతారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ కల్యాణోత్సవ సందర్భంలో సీతారాములకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కూడా సీతారాములకు పట్టువస్త్రాలు తీసుకువస్తారు. నయనమనోహరంగా జరిగే ఒంటిమిట్టస్వామి కల్యాణోత్సవం చూపరులకు ఓ చిరస్మరణీయ ఘట్టం. భక్తులకు ఆనంద నిలయం.
---------------------------------
రచన: డాక్టర్ కప్పగంతు రామకృష్ణ, కెబిఎన్ కళాశాల, విజయవాడ -1