Tuesday, April 1, 2025

పున్నమి కాంతుల కల్యాణం (ఒంటిమిట్టలో జరిగే శ్రీ సీతారామ కల్యాణం నేపథ్యంగా శ్రీకనకదుర్గ ప్రభ పత్రికలో రాసిన వ్యాసం)



 

పున్నమి కాంతుల కల్యాణం

               లోకంలో పెళ్ళి ముచ్చట అంటే సీతారాములదే. అందులోనూ ఒంటిమిట్ట ఆలయంలో జరిగే సీతారాముల కల్యాణం మరింత శోభాయమానంగా ఉంటుంది. ఇతర క్షేత్రాలకు భిన్నంగా శుక్ల చతుర్దశి రోజు రాత్రివేళ ఆరుబయట పండువెన్నెల వెలుగుల్లో రామయ్య పెళ్ళివేడుక ఇక్కడ ఎంతో వైభవంగా, భక్తజన హృదయోల్లాసంగా జరుగుతుంది. ఆ ముచ్చట చూసిన భక్తులదే భాగ్యం. ఆ కన్నులు చేసుకున్న పుణ్యం అనంతం.

               బాల్యం నుంచి రామయ్యకు చంద్రుడంటే ఎంతో ఇష్టం. చిన్నతనంలో చందమామ కావాలని రామయ్య ఎంతో మారాం చేసేవాడు కూడా. ఆ కథ అందరికీ తెలిసినదే. అటువంటి అనుబంధం రాముడికి, చంద్రుడికి మధ్య ఉంది. కానీ, మిట్టమధ్యాహ్నం అభిజిత్‌ లగ్నంలో జరగటం వల్ల తన ఆత్మీయుడు రామయ్య కల్యాణాన్ని చూడలేకపోయానని చంద్రుడు ఎంతో బాధ పడతాడు. ఈ విషయం రాముడు తెలుసుకుని, చంద్రుడిని ఓదార్చి, అతడికి మూడు వరాలు ఇస్తాడు. అందులో మొదటిది ` రాముడు ‘రామచంద్రుడు’ గా ప్రసిద్ధి పొందడం. రెండవది తర్వాతి అవతారంలో శ్రీకృష్ణుడుగా రాత్రి వేళ జన్మించడం. మూడవది ` కలియుగంలో రాత్రివేళ పున్నమి వెలుగులో కల్యాణోత్సవం జరగడం. ఈవిధంగా చంద్రుడికి ఇచ్చిన మాట ప్రకారం, చంద్రుడు పరిపూర్ణంగా వెన్నెలు వెలుగులు ప్రసరిస్తున్న శుభవేళ, ఒంటిమిట్ట క్షేత్రంలో శ్రీసీతారామ కల్యాణం కమనీయంగా జరుగుతుంది.

అద్భుతం... అపురూపం

               ఒంటిమిట్ట శ్రీరామ క్షేత్రం ఓ అద్భుతమైన దివ్యధామం. పాల కొండలు, శేషాచల కొండల మధ్య ఉండే ఈ ఆలయం, పచ్చని ప్రకృతి శోభతో అలరారుతుంది. చూపులు తిప్పుకోలేనంతటి శిల్పసౌందర్యం ఈ ఆలయానికి ప్రత్యేకత తీసుకువచ్చింది. ఒంటిమిట్టలో ప్రధాన రహదారికి సమీపంలోనే కోదండ రామాలయం ఉంటుంది. ఆలయానికి నాలుగు దిక్కుల్లోనూ ద్వారాలు గోపురాలతో సహా నిర్మితమయ్యాయి. ప్రత్యేకించి, తూర్పు గోపురం ఐదు అంతస్తులుగా, 160 అడుగుల ఎత్తులో ఉండి, భారతీయ శిల్పకళా వైభవాన్ని చాటుతూ, చూపరులను ఎంతో ఆకట్టుకుంటుంది. క్రీ.శ. 1652 ప్రాంతంలో ఈ ఆలయానికి వచ్చిన ఫ్రెంచ్‌ యాత్రికుడు టవర్నిర్‌ ఈ గోపుర నిర్మాణం చూసి, ఎంతో ఆశ్చర్యపడ్డాడు. తన యాత్రా చరిత్రలో ఈ గోపురం గురించి ప్రత్యేకంగా రాసాడు.

               శాసనాల ప్రకారం ఈ ఆలయ నిర్మాణం మూడు అంచెలుగా జరిగింది. దేవస్థాన ముఖమండపంలో 11వ శతాబ్దం నాటి చోళ శిల్పాలు కనిపిస్తాయి. ఈ ముఖమండపానికి 32 స్తంభాలు ఉంటాయి. ఇవన్నీ వేటికవే ప్రత్యేకమైన శిల్పాలతో కనువిందుచేస్తాయి. వీటిమీద రామాయాణ, భాగవత కథాచిత్రాలు చెక్కి ఉండటం విశేషం.

               ఆలయప్రాంగణ మధ్యభాగంలో ప్రధాన ఆలయం ఎత్తుగా ఉండే వేదికమీద నిర్మితమైంది. మహా మండపం, గర్భాలయం, ముఖమండపం ఇందులో ఉన్నాయి. ముఖమండపంలో ఆళ్వారులు, శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీమహావిష్ణువు కొలువుదీరి ఉంటారు. ప్రధాన ఆలయంలో సీతాలక్ష్మణ సమేతుడై శ్రీరామచంద్రమూర్తి కొలువుదీరి ఉంటాడు. అమ్ముల పొది, కోదండం ధరించి ఉండటం ఈ విగ్రహం ప్రత్యేకత. మరోవిశేషం ఏమిటంటే... ఈ ఆలయంలో ఆంజనేయస్వామి విగ్రహం ఉండదు. గర్భాలయయంలో హనుమ లేని ఏకైక రామక్షేత్రం కూడా ఒంటిమిట్ట రామాలయమే. కాలక్రమంలో ప్రధాన ఆలయానికి సమీపంలో ‘సంజీవ రాయడు’ అనే పేరుతో హనుమంతుడి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసారు.

యుగయుగాల చరిత్ర

               ఒంటిమిట్ట క్షేత్రానికి యుగాల చరిత్ర ఉంది. ఇందుకు సాక్ష్యాలు ఇప్పటికీ ఆ క్షేత్రంలో కనిపిస్తాయి. పూర్వం ఈ ప్రాంతాన్ని ఏకశిలా నగరం అని పిలిచేవారు. శృంగమహర్షి, మృకండు మహర్షి కోరిక మీదట రాముడు యాగసంరక్షణ కోసం ఈ ప్రాంతానికి తన తమ్ముడు లక్ష్మణుడితో కలిసి వస్తాడు. అందుకు ప్రతిగా మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలపై మలచి, ప్రతిష్ఠించారని స్థలపురాణం చెబుతోంది.

               త్రేతాయుగం తర్వాత ద్వాపరయుగంలో జాంబవంతుడు ఈ విగ్రహాలను పున:ప్రతిష్ఠ చేసాడని కూడా చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఈ ప్రాంతంలో సీతారామ లక్ష్మణులు కొంతకాలం నివాసం ఉన్నారు. ఆ సమయంలో ఒక రోజున సీతమ్మ బాగా దాహం వేయడంతో రామలక్ష్మణులు తమ బాణాలతో పాతాళగంగను పైకి తీసుకు వస్తారు. ఆ నీటి ప్రవాహాలే ఇప్పటికీ రామతీర్థం, లక్ష్మణతీర్థం పేరుతో తర్వాతి కాలంలో ప్రసిద్ధి పొందాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఏర్పడినా, ఈ రెండు తీర్థాల్లో మాత్రం నీరు పుష్కలంగా ఉండటం నేటికీ అంతుచిక్కని రహస్యంగా ఉంది. దైవశక్తికి ఇదొక నిదర్శనం.

               ద్వాపరయుగం తర్వాత, కాలక్రమంలో విజయనగర సామ్రాజ్య సమయానికి ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. ఆ రోజుల్లో ఈ ప్రాంతంలో ఒంటడు, మిట్టడు అనే ఇద్దరు దొంగలు ఉండేవారు. తాము దొంగతనం చేసిన సొమ్ముని కొండగుహల్లో దాచుకునేవారు. ఓసారి రామచంద్రమూర్తి వీరికి కలలో కనిపించి, ఇక మీదట దొంగతనం మాని బుద్ధిగా ఉండమని చెబుతాడు. అప్పటినుంచి తమ జీవితాన్ని మార్చుకుంటారు ఒంటడు, మిట్టడు. అక్కడి బంజరు భూమిని సాగుచేసుకుని, జీవితం గడిపేవారు. తమకున్న కొద్దిపాటి సొమ్ముతో ఓ రామాలయాన్ని కట్టించి, నిత్య పూజలు జరిపించేవారు. ఆ ఆలయమే కాలానికి గొప్ప ప్రసిద్ధి, ఆ అన్నదమ్ముల పేరుతో ఒంటిమిట్ట దేవాలయంగా ప్రసిద్ధి పొందింది.

భక్తుల వెల్లువ... కవుల వేదిక

               ఒంటడు, మిట్టడుతో ప్రారంభమైన ఈ ఆలయంలో కాలక్రమేణా ఎంతో ప్రసిద్ధి పొందింది. ఎందరో మహారాజులు ఆలయాన్ని దర్శించుకుని విలువైన కానుకలు సమర్పించారు. అయ్యలరాజు రామభద్రుడు, అయ్యలరాజు తిప్పరాజు, బమ్మెర పోతన, తాళ్ళపాక అన్నమాచార్యులు, మందరకవి వావిలి కొలను సుబ్బారావు,  పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, ఉప్పుగుండూరు వేంకట కవి, వర కవి తదితర ప్రముఖ కవులు ఒంటిమిట్ట రాముడుని తమ కావ్యాలు, పాటల్లో తనివితీరా కొనియాడారు. జీర్ణదశకు చేరుకున్న ఒంటిమిట్ట ఆలయాన్ని మహాభక్తుడైన వావిలికొలను సుబ్బారావు బిచ్చం ఎత్తి మరీ నిధులు సేకరించి, ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసారు. తన ఆస్తిని కూడా ఆలయానికి రాసిచ్చారు.

కల్యాణ వైభోగమే...

               ఒంటిమిట్టలో జరిగే సీతారామకల్యాణ వైభవం చూసి తీరాల్సిందే కానీ మాటల్లో వర్ణించడం సాధ్యం కాదు. అంతటి వైభవంగా జరుగుతుందీ కల్యాణం. ఒంటిమిట్ట బ్రహోత్సవాల్లో ప్రధానమైంది సీతారామ కల్యాణమే. ఈ కల్యాణోత్సవ వేదికను ఆరుబయట పున్నమి వెలుగు ప్రసరించేలా ఏర్పాట్లు చేస్తారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన కల్యాణమూర్తులను అర్చకస్వాములు వేదికమీదకు తీసుకువస్తారు. పండితులు ఆ సందర్భంలో ఎదుర్కోలు నిర్వహిస్తారు. ఈ ముచ్చట చూసి తీరవలసిందే. మరోపక్క వేదపండితులు మంత్రోచ్చారణ చేస్తుండగా, అర్చకస్వాములు ఆగమశాస్త్ర పద్ధతిని అనుసరించి, వివాహ క్రతువు ప్రారంభిస్తారు. విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, సంకల్పం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, ప్రవరలు పూర్తిచేసి, కన్యాదానం జరిపిస్తారు. రాత్రివేళ పున్నమి వెలుగు సాక్షిగా జరిగే ఈ వివాహ వేడుకను ప్రత్యక్షంగా తిలకించే భక్తులు మైమరచిపోతారు.

               ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ కల్యాణోత్సవ సందర్భంలో సీతారాములకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కూడా సీతారాములకు పట్టువస్త్రాలు తీసుకువస్తారు. నయనమనోహరంగా జరిగే ఒంటిమిట్టస్వామి కల్యాణోత్సవం చూపరులకు ఓ చిరస్మరణీయ ఘట్టం. భక్తులకు ఆనంద నిలయం.

---------------------------------

రచన: డాక్టర్‌ కప్పగంతు రామకృష్ణ, కెబిఎన్‌ కళాశాల, విజయవాడ -1        

 

Friday, February 7, 2025

మాఘ పూర్ణిమ విశేషాలు.... సముద్ర స్నానం ఎందుకు చెయ్యాలి?

 


వేయి పుణ్యాల పూర్ణిమ

                వెండి వెలుగుల పందిరి మాఘపౌర్ణమి. చిమ్మ చీకటికి చంద్రుడు వెన్నెల వెలుతురుల తోరణాలు కడతాడు. అందుకే పౌర్ణమి నాటి రేయి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మన మనసులను ఆనందపరవశులను చేస్తుంది. మాఘమాసంలో వచ్చే పున్నమినాడు చంద్రుడు పదహారు కళలతో వెలుగులీనుతాడు. మాఘమాసంలో వచ్చే పౌర్ణమినే మహామాఘం అనే పేరుతో పండుగలా పాటిస్తారు.

                చంద్రుడు మఘ నక్షత్రాన ఉండే మాసం మాఘం. మఘంఅంటే యజ్ఞం. యజ్ఞయాగాది క్రతువులకు మాఘమాసాన్ని శ్రేష్ఠమైనదిగా శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ మఘాధిపత్యాన క్రతువులు జరిగే మాసం గనుక ఈ మాసానికి మాఘమాసం అనే పేరు వచ్చింది.

 

పవిత్రం... మాఘస్నానం

 

                న సమం భవితా కించిత్తేజః సౌరేణ తేజసా ।

                తద్వత్‌ స్నానేన మాఘస్య నా సమాః క్రతుజాః క్రియాః ॥

 

                సూర్యుని తేజస్సుకు సాటి వచ్చే కాంతి మరొకటి లేనట్టే, మాఘ స్నానానికి సాటి వచ్చే క్రతువు గాని, క్రియ గాని మరొకటి లేదు.

                పాపరాహిత్యం కోసం నదీస్నానాలు చేయడం మాఘమాస సంప్రదాయం. మాఘస్నానాలు సకల కలుషాలను హరిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. మాఘస్నాన మహాత్మ్యాన్ని బ్రహ్మాండ పురాణం పేర్కొంటోంది. మఘంఅంటే యజ్ఞం. కల్యాణ కారకమైన ఈ మాసంలో చేసే స్నానం పరమ పవిత్రంగా భావిస్తారు.మాఘమాసంలో ప్రత్యూషకాలంలో చేసే స్నానానికి ఎంతో విశిష్టత ఉంది. బ్రహ్మాండ, నారదాది పురాణాలు మాఘస్నాన విశేషాలను వివరిస్తున్నాయి. మాఘస్నానం వల్ల అందం, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆయుర్దాయంతో పాటు మంచితనం, ఉత్తమశీలం లభిస్తాయని పద్మపురాణంలో ఉంది. మృకండు, మనస్విల మాఘస్నాన ఫలమే వారి కుమారుడైన మార్కండేయుని అపమృత్యువుని తొలగించిందని పురాణ కథనం.

                ఏదైనా కారణం వల్ల మాఘస్నానం చేయలేకపోతే కనీసం స్నానం చేసిన వారిని దర్శించి, వారిని దక్షిణతాంబూలాదులు ఇచ్చి సత్కరించి, నమస్కరించినా పుణ్యం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. సమత్రకంగా, సంకల్పం చెప్పుకుని చేసేదే మాఘస్నానం. నిత్యవిధిగా చేసే స్నానం మాఘస్నానం కాదు. సంకల్పం చెప్పుకుని శాస్త్రవిధానం పాటిస్తూ చేసే స్నానమే మాఘస్నానం అవుతుంది.

                మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వం సంకల్ప ప్రకారం చేసే నదీ స్నానం అనంతకోటి ఫలితాన్నిస్తుంది. కనీసం గృహస్నానం చేసినా ఆరు సంవత్సరాలు అఘమర్షణస్నానం చేసిన ఫలితం వస్తుంది. బావినీటి స్నానం 12 సంవత్సరాల ఫలాన్ని, తటాకస్నానం ద్విగుణం, నదీస్నానం చతుర్గుణం, మహానదీ స్నానం శతగుణం, గంగాస్నానం సహస్రగుణం, త్రివేణీ సంగమస్నానం నదీశతగుణ ఫలితాలను ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి.

                దు:ఖ దారిద్య్ర నాశాయ శ్రీ విష్ణోస్తోషణాయచ

                ప్రాత: స్నానం కరోమ్యద్య మాఘే పాపవినాశనం

                మకరస్థే రవౌ మాఘ గోవిందాచ్యుత మాధవ

                స్నాననేనానే నమోదేవ యధోక్త ఫలదోభవ ॥ 

                అనే శ్లోకం పఠిస్తూ, ప్రయాగను స్మరించుకుంటూ మాఘస్నానం చేయాలి. అనంతరం సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి. ఆ తర్వాత ఏదైనా ఆలయానికి వెళ్ళి, దీపారాధన చేయాలి. ఈమాసంలో శివాలయంలో నువ్వులనూనెతో దీపారాధన చేస్తే ఎంతో మంచిది.

                నీటికి ఉన్న శక్తి అమేయమైంది. స్నాన, ఆచమన మార్గాల్లో జలశక్తి మానవునికి అందుతుందని వేదవాక్కు. స్నానం దేహాన్ని శుద్ధి చేయడంతో పాటు మనలోని ప్రకోపాలను తగ్గించి, స్థిరత్వాన్ని కలిగిస్తుంది. అందుకే స్నానాన్ని నిత్యవిధిగా పెద్దలు ప్రకటించారు. స్నానం ` ‘నిత్య స్నానం, నైమిత్తిక స్నానం, కామ్యస్నానం, క్రియాంశస్నానం, అభ్యంజనస్నానం, క్రియాస్నానంఅని ఆరువిధాలు. వీటిల్లో వైశాఖ, కార్తిక, మాఘ మాసాల్లో చేసే స్నానాలు, యజ్ఞయాగాదుల్లో చేసే స్నానాలు కామ్యస్నానాలు.

                సూర్యుడు చరించే రాశిని బట్టి ప్రత్యూషకాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుతాయి. ఆ సమయంలో సూర్యకిరణాల్లో ఉండే లోహిత, అతినీల లోహిత, పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులు వస్తాయి. ఆధునిక వైజ్ఞానికులు కూడా జనవరి 20 నుంచి మార్చి 30 వరకు సూర్యోదయానికి  పూర్వం చేసే స్నానం శ్రేష్ఠమైనదని, ఎంతో ఆరోగ్యకరమైందని చెబుతున్నారు. ఈ కోణంలో చూసినా మాఘస్నానం ఎంతో ఆరోగ్యకారకం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా పెద్దలు.

సముద్రస్నానం ఎందుకు చేయాలి?

                ‘‘నదీనాం సాగరో గతి:’’ - సకల నదీ నదాలు తమ ప్రవాహం పూర్తి చేసుకుని చివరకు సముద్రంతోనే సంగమిస్తాయి. కనుక, సముద్రస్నానం చేస్తే సకల నదులలోనూ స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుంది. ముఖ్యంగా సముద్రుడి ప్రత్యేకత ఏమిటంటే ... నిత్యం సూర్యకిరణాల వల్ల ఎంతో నీరు ఆవిరి అవుతున్నా సముద్ర పరిమాణం తగ్గదు. అలాగే, ఎన్నో జీవనదులు తనలో కలుస్తున్నా సాగరుని పరిమాణం పెరగదు. స్థిరత్వం ఆయన ధర్మం. అలాగే, ఎన్ని ఆటుపోటులు ఎదురైనప్పటికీ మనిషి స్థిరత్వాన్ని కోల్పోకూడదు. సాగర స్నానం అందించే సందేశం ఇదే.

                సాగరుడు సంతోషప్రదుడు. సంవత్సరంలో నాలుగుసార్లు సాగరస్నానం చేయాలనీ, అవి కూడా ‘‘ఆషాఢ పూర్ణిమ, కార్తిక పూర్ణిమ, మాఘపూర్ణిమ, వైశాఖ పూర్ణిమ’’లలో చేయాలని, ఆలా సాగరస్నానాలు చేసినవారికి సముద్రుడు సంపూర్ణ ఆరోగ్యం కలుగజేస్తాడని పురాణాలు చెబుతున్నాయి. నదీప్రవాహ వేగానికి ఎదురుగా నడుము మునిగే వరకూ నిలబడి, కనీసం 48 నిమిషాల పాటు స్నానం చేయాలని విధి. అది కూడా సూర్యోదయానికి గంటన్నర ముందు కాలంలోనే చేయాలి.

                నీటిలో విద్యుచ్ఛక్తి ఉందని సైన్సు చెబుతుంది. కానీ, ఈ సైన్సు పుట్టుక ముందే ఈ సత్యాన్ని గుర్తించిన మన మహర్షులు బ్రాహ్మీ ముహూర్తాన్ని నదీ / సాగర స్నానానికి అనుకూల సమయంగా నిర్ణయించారు. సూర్యోదయకాలం నుంచి, సూర్యాస్తమయం వరకూ ప్రసరించే సూర్యకిరణాలలోని విద్యుచ్ఛక్తిని నదీజలాలు, సాగర జలాలు తమలో నిక్షిప్తం చేసుకుంటాయి. చంద్రుడు తన కిరణాలలోని అమృతత్త్వాన్ని, ఔషధీ విలువలను నదీజలాలకు అనుగ్రహిస్తాడు. నీటిలో ఉండే ఈ అద్భుతశక్తులు తిరిగి సూర్యకిరణాలకు పరావర్తనం చెంది అంతరించి పోతాయి. అందుకే సూర్యోదయానికి పూర్వమే స్నానం పూర్తి చేయాలనే నియమాన్ని విధించారు పెద్దలు.

                మరి ‘‘నడుము మునిగే వరకూ ఎందుకు నదీ ప్రవాహ వేగానికి ఎదురుగా ఎందుకు నిలబడాలి’’ అన్న సందేహం రావచ్చు. గర్భస్థ శిశువుగా ఉన్న పిండానికి నాభినాళం ద్వారానే జీవశక్తులు అందుతాయన్నది ఎవరూ కాదనలేని సత్యం. సాగర, నదీజలాలలో నిక్షిప్తమైన సౌరశక్తి, సోమశక్తులు, ఈ నాబి óనుంచి శరీరం గ్రహిస్తుంది. అందుకే నాభి మునిగే వరకూ నదిలో నిలబడి స్నానం చేయాలి. సముద్రానికి ప్రవాహం లేకపోయినా, ఉత్తుంగ తరంగాలు తమ తాకిడితో ఆ శక్తులను శరీరానికి అందజేస్తాయి. కనుకనే సముద్రుణ్ణి పూజిస్తూ చేసే నాలుగు స్నానాలలో ‘‘మాఘ పూర్ణిమ’’ స్నానం ముఖ్యమైనది.

                మాఘమాసంలో దేవతలు తమ సర్వ శక్తులు, తేజస్సులను జలాల్లో ఉంచుతారు. అందువల్ల మాఘ స్నానం చాలా గొప్పది. సముద్రం, నదులు అందుబాటులో లేని పరిస్థితిలో బావుల దగ్గరగానీ, చెరువుల వద్దగానీ ‘‘గంగ, సింధు, కావేరి, కృష్ణ, గౌతమి’’ నదుల పేర్లు స్మరిస్తూ స్నానం చేస్తే ఆయా నదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది. దేనికైనా భక్తి ప్రధానం. అది లేనప్పుడు ఎన్నిసార్లు కాకిలా మునిగి, కర్రలా తేలినా ఫలితం శూన్యం.

                మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వం గృహస్నానం చేసినా ఆరు సంవత్సరాల పాటు అఘమర్షణ స్నాన ఫలం లభిస్తుందని శాస్త్ర వచనం. బావినీటి స్నానం పన్నెండేళ్ళ పుణ్యఫలాన్ని, తటాక స్నానం ద్విగుణం, నదీస్నానం చతుర్గుణం, మహానదీ స్నానం శతగుణం, గంగాస్నానం సహస్ర గుణం, త్రివేణీ సంగమ స్నానం నదీశతగుణఫలాన్ని ఇస్తాయి. మాఘస్నానంలో దివ్య తీర్థాలను స్మరించి పాపవినాశనం కోరుతూ స్నానం చేయడం సంప్రదాయం. స్నాన సమయంలో ప్రయాగను స్మరిస్తే ఉత్తమ ఫలం లభిస్తుంది.

                స్నానాంతరం సమస్త జీవరాశికి ఆధారమైన సూర్యభగవానుడికి ఆర్ఘ్యం సమర్పించాలి. వైష్ణవ, శివాలయానికి గానీ వెళ్ళి దర్శనం చేసుకోవాలి. అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించడమే కాకుండా శక్తిమేరకు దానధర్మాలు చేయాలి. ఈ రోజున గొడుగు, నువ్వులు దానం చేస్తే విశేష ఫలం లభిస్తుంది. దీని వల్ల జన్మజన్మలుగా వెంటాడుతున్న పాపాలు, దోషాలు నశిస్తాయి.

                మహామాఘి పర్వం సందర్భంగా శ్రీకాకుళంజిల్లా నుంచి నెల్లూరుజిల్లా వరకు ఉన్న సముద్రతీరాలన్నింటా మాఘస్నానాలు చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో నదీస్నానాలు అనేక పుణ్యక్షేత్రాలలో జరుగుతాయి. మీదు మిక్కిలి దేవాలయాలు, తీర్థాలుగా పేర్గాంచిన సముద్రతీరాలలో మరింత వైభవంగా ఉంటుంది. విశాఖ, గుంటూరు జిల్లా బాపట్ల, సూర్యలంక, నిజాంపట్నం, కృష్ణాజిల్లా మచిలీపట్నం బీచ్‌లలో పెద్దసంఖ్యలో ప్రజలు మాఘస్నానాలు ఆచరిస్తారు. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది గోదావరినదీపాయ సముద్రంలో సంగమించే స్థలం. కృష్ణాజిల్లా హంసలదీవి వద్ద కృష్ణానదీ సాగర సంగమస్థలి. ఇటువంటి నదీసాగర సంగమ స్థలిలో చేసే మాఘస్నానాలను సింధూస్నానాలని కూడా అంటారు. తెలంగాణ పవిత్ర నదీ తీర ఆలయాలలో వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో, గోదావరీ నదీతీర బాసర జ్ఞానసరస్వతి ఆలయంలో, కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో మాఘస్నానాలు విశేషంగా జరుగుతాయి.

-----------------------------------------------


రచన: డాక్టర్‌ కప్పగంతు రామకృష్ణ,అసోసియేట్‌ ప్రొఫెసర్‌, కె.బి.ఎన్‌ కళాశాల,కొత్తపేట, విజయవాడ-1

 

 


పున్నమి కాంతుల కల్యాణం (ఒంటిమిట్టలో జరిగే శ్రీ సీతారామ కల్యాణం నేపథ్యంగా శ్రీకనకదుర్గ ప్రభ పత్రికలో రాసిన వ్యాసం)

  పున్నమి కాంతుల కల్యాణం                లోకంలో పెళ్ళి ముచ్చట అంటే సీతారాములదే. అందులోనూ ఒంటిమిట్ట ఆలయంలో జరిగే సీతారాముల కల్యాణం మరింత శ...