జీవచైతన్య సుప్రభాతం
కౌసల్యా సుప్రజా రామా... పూర్వా సంధ్యా
ప్రవర్తతే....
అది
ఉషోదయానికి పూర్వవేళ. బాలభానుడు తన తొలి కిరణాలను వికసింపజేయటానికి
ఉద్యుక్తుడవుతున్నాడు. జగన్మోహనాకారుడైన రామచంద్రమూర్తి, సోదరుడైన లక్ష్మణస్వామితో కలిసి
కటిక నేల మీద ఆదమరచి పడుకున్నాడు.
'పుంసాం మోహన రూపాయ’ అన్నట్లున్న స్వామి సౌందర్యాన్ని తనివి తీరా
చూసుకున్నాడు మహర్షి. కానీ, అంతలోనే కర్తవ్యం స్ఫురణకు వచ్చింది. 'ఉత్తిష్ఠ నరశార్దూల! కర్తవ్యం దైవమాహ్నికం' - రామచంద్రా! నీ
కర్తవ్యాన్ని నిర్వహించాల్సిన సమయం సన్నద్ధమైంది. పడుకున్నది చాలు... ఇక
నిద్రలేవాలంటూ విశ్వామిత్రుడు రామలక్ష్మణులను నిద్ర నుంచి మేల్కొలిపాడు.
ఇది
రాముడికి మహర్షి పలికిన సుప్రభాతం మాత్రమే కాదు. రామచంద్రుడి పేరుతో యావజ్జాతిని
ఉద్దేశించి మహర్షి పలికిన చైతన్యగీతం అది. సుప్రభాత గీతికగా ఆలయాల్లో నిత్యం
వినిపించే ఆధ్యాత్మిక గానలహరి అది.
దేవాలయాల్లో
వినిపించే సుప్రభాతం విని స్వామి నిద్రలేస్తాడని, భక్తుల కోర్కెలు సావధానంగా విని, వాటిని తీరుస్తాడని
నమ్మకం. సుప్రభాతం కేవలం దైవానికి మాత్రమే, మనిషి మాత్రం నిద్ర లేవాల్సిన పని లేదు
అంటే నిజానికి నిద్ర, మెలకుల లేని దైవం మేల్కొనాల్సిన అవసరం లేదు. దైవానికి నిద్ర ఉండదు.
అదొక నిర్నిద్రమైన శక్తి. దైవానికి పాడే సుప్రభాతం పేరుతో మనలోని దైవత్వాన్ని మేల్కొలపటమే
సుప్రభాతం వెనుక దాగున్న ఆధ్యాత్మిక సందేశం. గుడిలోని దేవుడి పేరుతో గుండె గదుల్లో
దాగున్న దైవీకమైన శక్తిని జాగృతం చేసే ప్రక్రియకు పలికే నాందీ వాచకమే సుప్రభాతం.
సాధారణ
పరిభాషలో రాత్రి వేళ నిద్రించి, ఆ నిద్ర ముగిసిన తర్వాత కళ్ళు తెరచి లోకాన్ని చూడటాన్ని నిద్రలేవటం
అంటాం. నిజానికి ఇలా నిద్ర పోవటం, మేల్కోవటం అనేది ఒక క్రియ మాత్రమే. పుట్టుకతో ఈ లోకాన్ని చూడటానికి
చేసే ప్రయత్నమే కన్ను తెరవటం. లోకాల వెనుక జ్యోతి స్వరూపంతో వెలిగే పరమాత్మ
చేరుకోవటం చేసే ప్రయత్నమే కన్నుముయ్యటం. ఇలా కన్ను తెరచి కన్నుమూసే కాలవ్యవధిలో
ఎప్పటికప్పుడు మనల్ని మనం జాగృతం చేసేందుకు చేసే స్వీయ ప్రబోధం సుప్రభాతం. అదే
నిద్రలేవడం.
కర్తవ్యం
దైవమాహ్నికం - అంటే తెల్లవారిన తర్వాత నువ్వు చెయ్యాల్సిన పని అంతా నీది కాదు...
దైవానిది. అటువంటి దైవకార్యాన్ని నిర్వహించటానికి మేల్కొనాలని అర్థం. మానవత్వమనే
పొర వెనుక ప్రతి ప్రాణీ దైవమే. ఆ దివ్యత్వాన్ని మేల్కొలపటమే సుప్రభాతం.
మనకు
ఇష్టమైన దైవానికి మేల్కొలుపు పాడుతున్నామంటే అర్థం ఆ దైవాన్ని త్రికరణ శుద్ధిగా
మనం నమ్ముతున్నామని అర్థం. ఆ స్వామి బాటలో నడవటానికి అంగీకరించామని అర్థం. ఇలా మనం
నమ్ముకున్న దైవం మేల్కొన్నాడంటే... మనలో ఆ దైవానికి సంబంధించిన ఉత్తమ భావనలు
మేల్కొన్నాయని అర్థం. ఎప్పుడైతే మనలో దైవికమైన భావనలు వృద్ధి చెందుతాయో అప్పుడు
ధర్మమార్గాన్ని విడిచిపెట్టే సందర్భం ఎదురుకాదు. ఇలా ప్రతి వ్యక్తీ, అంతిమంగా
సమాజం ధర్మనిలయంగా మారేందుకు పలికే నాందీవాక్యమే సుప్రభాతం.
బ్రాహ్మీముహూర్తం
పూర్వం
కాలాన్ని ఘడియల్లో లెక్కించేవారు. ఒక ఘడియ ప్రస్తుత కాలమానం ప్రకారం 24 నిమిషాలకు సమానం. ఒక ముహూర్తం అంటే
రెండు ఘడియల కాలం - అంటే 48 నిమిషాల కాలవ్యవధి ఒక ముహూర్తం అవుతుంది. ఒక పగలు, ఒక రాత్రి కలిపిన
కాలవ్యవధిని అహోరాత్రం అంటారు. ఒక అహోరాత్రంలో 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే ఒక రోజులో 30 ముహూర్తాలు ఉంటాయి.
సూర్యోదయ
సమయానికి కచ్చితంగా జరుగుతూ ఉండే ముహూర్త కాలాన్ని ఆసురీ ముహూర్తం అంటారు. ఈ ఆసురీ
ముహూర్తానికి ముందు సమయం బ్రాహ్మీ ముహూర్తం అవుతుంది. అంటే సూర్యోదయానికి ముందు
వచ్చే ముహూర్తాల్లో మొదటి ముహూర్తాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు. దీని ప్రకారం
రోజు మొత్తంలో వచ్చే 29వ ముహూర్తం బ్రాహ్మీముహూర్తం అవుతుంది.
ఉదాహరణకు
సూర్యోదయం ఉదయం గం. 5.28 అయితే అంతకుముందు జరిగే ముహూర్తం (48 నిమిషాల కాల వ్యవధి) గం. 4.40 నుంచి గం. 5.28 వరకు ఉండే సమయం
ఆసురీ ముహూర్తం అవుతుంది. ఈ ఆసురీ ముహూర్తానికి ముందు అంటే గం. 4.40కు ముందు ఉండే
ముహూర్తం అంటే గం. 3.58 నుంచి గం. 4.40 వరకు ఉండే 48 నిమిషాల కాలం బ్రాహ్మీ ముహూర్తం అవుతుంది.
బ్రాహ్మీ
అనే పదానికి సరస్వతీ అని అర్థం. మనలోని బుద్ధి ప్రచోదనం చెంది సరస్వతీదేవి
అనుగ్రహం జ్ఞానరూపంలో కలిగే ఉత్తమ సమయం కాబట్టి ఈ సమయానికి బ్రాహ్మీ ముహూర్తం అని
పేరు వచ్చింది. బ్రాహ్మీముహూర్తంలో బ్రహ్మ,
సరస్వతి ఇద్దరూ హంస వాహనంపై ఆకాశ సంచారం
చేస్తుంటారని, కాబట్టి ఆ సమయంలో సరస్వతీ ఉపాసన (విద్యార్థులు చదువుకోవటం కూడా
ఉపాసనే) చేసేవారిని సరస్వతీదేవి అనుగ్రహిస్తుందని పురాణ కథనం. విద్యార్థులు
తెల్లవారు జామున లేచి చదువుకోవాలని పెద్దలు చెప్పటం వెనుక ఉన్న ఆంతర్యం ఇదే.
మన శరీరంలో జీవగడియారం ఉంటుంది. దీన్ని అనుసరించే మన జీవక్రియలు జరుగుతాయి. ఉషోదయ వేళ మనలో కార్టిసోల్ హార్మోన్ ఎక్కువ మోతాదులో విడుదల అవుతుంది. ఈ హార్మోన్ మనలోని ఒత్తిడిని తగ్గిస్తుంది. జ్ఞాపకశక్తి పై ప్రభావం చూపుతుంది. అందుకే పిల్లలు బ్రాహ్మీ ముహూర్తంలో చదువుకుంటే చక్కగా గుర్తుంటుందని పెద్దలు చెబుతారు.
సాధనకు మేలిమికాలం
ఆధ్యాత్మిక
సాధన పరంగా బ్రాహ్మీముహూర్తం చాలా విలువైన సమయం. ఈ సమయాన్ని వృథా చేసుకుంటే రోజులు
కాదు... మొత్తం జీవితంలోనే అద్భుతమైన కాలాన్ని కోల్పోయినట్లవుతుంది. శుశ్రుత
మహర్షి బ్రాహ్మీ ముహూర్తాన్ని అమృత ముహూర్తంగా పేర్కొన్నాడు. ఈ సమయంలో చేసే
ఆధ్యాత్మిక సాధన ద్వారా మనలో సత్త్వగుణాలు పెరుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
సూర్యోదయం తర్వాత కూడా నిద్రిస్తే తమోగుణం (బద్దకం, ఆలస్యం, అజాగ్రత్త) పెరుగుతుంది.
అర్ధరాత్రి దాటే వరకూ మెలకువగా ఉండడం వల్ల రజోగుణం
(క్రోధం, దంభం, దర్శనం, విపరీత ప్రతిస్పందన) పెరుగుతుంది. అందుకే తెల్లవారు
జామున ఆలోచించు, పగలు కార్యోన్ముఖుడివై పని చెయ్యి. రాత్రి సమయంలో నిద్రోన్ముఖుడివి
కావాలని పెద్దలు చెబుతుంటారు.
బ్రాహ్మీ
ముహుర్తంలో చేసిన ఓంకార ధ్వని వలన సుషుమ్న నాడి తెరుచుకుంటుంది. అందుకే ఋషులు, యోగులు ఈ సమయంలో
ఓంకారం జపిస్తారు. ఎప్పుడైతే మన నాసికా రంధ్రాల్లోకి శ్వాస ప్రవహిస్తూ ఉంటుందో
వెంటనే సుషుమ్న నాడి పనిచెయ్యటం మొదలవుతుంది. అప్పుడే ధ్యానం బాగా కుదురుతుంది.
తద్వారా ఆధ్యాత్మిక సాధన మరింత ఉన్నత స్థితికి చేరుకుని, అంతిమంగా మన అంతర్యామిగా
ఉన్న ఆత్మ స్వరూపమైన పరమాత్మ చేరుకునే సిద్ధి కలుగుతుంది. తెల్లవారు జామున
అంతర్ముఖలమై మేధోమథనం చేస్తే మనలోనే మనకు ఎన్నో విషయాలు అవగతమవుతాయి. తెల్లవారు జామున
లేచే వారికి సూర్య చంద్రులు, నక్షత్రాలు నుంచి కాంతి పూర్తిగా అంది, తద్వారా వారిలో నిద్రిస్తున్న జీవశక్తి
చైతన్యవంతమవుతుంది.
భగవంతుడిచ్చిన
శక్తి అందరిలోనూ ఉంది. కానీ దాన్ని జాగృతం చేయాల్సిన బాధ్యత మనదే. శరీరాన్ని, మనసును లీనం చేసి
మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తిస్తుంటే శరీరానికి ఆరోగ్యం, మనసుకు ఆహ్లాదం
మనవెంటే ఉంటాయి. ప్రకృతిలో ఇందుకు బ్రాహ్మీ ముహూర్తం ఎంతో అనువుగా ఉంటుంది.
ఆయుర్దాయాన్ని, ఆయుర్వృద్ధిని కోరుకునే వారు తప్పనిసరిగా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర
లేవాలి దేవీ భాగవతం కూడా చెబుతోంది.
ఆయుర్వేద శాస్త్రం ప్రకారం అపాన వాయువు (కాలకృత్యాల నిర్వహణలో
తోడ్పడే వాయువు) సూర్యోదయం ముందు మరింత ప్రభావవంతంగా పని చేస్తుంది. వ్యర్థ
పదార్థాలను శరీరాన్నుంచి వదిలించి వేస్తుంది. అలాగే తెల్లవారు జామున శరీరంలోకి
ప్రాణవాయువు కూడా ఎక్కువ తీసుకోగలం. సాధారణంగా తెల్లవారు జామున మాత్రమే రెండు
నాసికా రంధ్రాల నుంచీ వంద శాతం గాలి పీల్చగలం. మిగతా సమయాల్లో ఒకటి 50
శాతం, ఒకటి 100 శాతం పని చేస్తాయి.
ధర్మశాస్త్రం ఏం చెబుతోందంటే...
మనిషి ఏ సమయంలో నిద్రలేవాలి, నిద్రలేచిన వెంటనే ఏం చెయ్యాలనే
విషయాన్ని శాస్త్రం ఎంతో స్పష్టంగా చెప్పింది. శరీరానికి నిద్రమత్తును దూరం చేస్తూ, కళ్ళు
తెరచి ఈ లోకాన్ని చూసేందుకు ముందుగా పాటించాల్సిన ఆచార క్రమం ఏమిటనే విషయాన్ని
ధర్మశాస్త్ర గ్రంథాలు విస్పష్టంగా ప్రకటిస్తున్నాయి. వాటి ప్రకారం
బ్రాహ్మీ ముహూర్తం ఉత్థాయ చింతయే దాత్మ హితం |
స్మరణం వాసుదేవస్య కుర్యాత్ కలిమలాపహమ్ ||
సూర్యుడు ఉదయించడానికి రెండు ముహూర్తాలు ముందుగా నిద్రలేవాలి. అంటే
బ్రాహ్మీ ముహూర్తంలో తప్పనిసరిగా నిద్ర నుంచి మేల్కొనాలి. నిద్ర లేచిన తర్వాత
వాసుదేవుడిని లేదా తనకు ఇష్టమైన దేవుడిని తలచుకోవాలి.
హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
విశ్వేశం కేశవం డుండి దండపాణించ భైరవం | వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికా ||
ఇలా ఇష్టమైన దైవానికి సంబంధించిన ప్రార్థన చేసుకోవాలి . దైవస్మరణం తరువాత మెల్లగా కళ్ళు తెరిచి కుడి అరచేయిని కింది నుంచి పైకి చూస్తూ
కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతీ | కరమూలే తు గౌరీ చ ప్రభాతే కరదర్శనమ్ ||
అరచేయి కిందివైపు చివర లక్ష్మిని, మధ్యలో సరస్వతిని, మొదట్లో గౌరిని స్మరించాలి. తర్వాత శుభాశుభాలు ఏవి చూసినా ఇబ్బంది ఉండదు. ఆ తర్వాత
సముద్ర వసనే దేవీ పర్వత స్తన మండలే | విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే ||
అంటూ భూదేవి ప్రార్ధన పూర్వక నమస్కారం చేసి, ఆ
తర్వాతనే కాలు నేలపై మోపాలి.
==================
రచన :
డాక్టర్ కప్పగంతు రామకృష్ణ,