Sunday, April 25, 2021

అన్నీ ఆమె... అంతటా ఆమె (సనాతన సాహిత్యంలో స్త్రీ ఔన్నత్యం)





తిరుమల తిరుపతి దేవస్థానం వారు 
ప్రచురించే సప్తగిరి మాస పత్రిక మార్చి 2021 సంచికలో 

ప్రచురితమైన వ్యాసం

అన్నీ ఆమె... అంతటా ఆమె

(సనాతన సాహిత్యంలో స్త్రీ ఔన్నత్యం)

ప్రపంచంలోని మరే ఇతర దేశం స్త్రీకి ఇవ్వని సమ్నుతస్థానాన్ని మనదేశమే ఇచ్చింది. భారతమాత అంటూ జన్మనిచ్చిన భూమికి నమస్కరించే సంస్కారం కేవలం మనదేశంలోనే ఉంది. స్వాతంత్య్ర సంగ్రామంలో కూడా మాతృభూమి’, ‘వందేమాతరంవంటి నినాదాలు ప్రజల్లో స్వేచ్ఛాప్రియత్వాన్ని కలిగించి, స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిల్చాయి. కేవం మనదేశంలోనే మహిళను అమ్మాఅని పిలిచే సంస్కారం ఉంది. పరిచయం లేని మహిళ ఎదురైతే, ఆమెతో మాట్లాడాల్సిన సందర్భం వస్తే ఏమ్మాఅంటూ సంబోధించే ఉత్తమగుణం ఈ మట్టిలో పుట్టిన ప్రతి మనిషికీ సహజంగా వస్తుంది.


వేదాలకు అధిష్ఠానదేవతగా గాయత్రీమాతను ఎంచుకున్న ఘనత కూడా మనకే దక్కుతుంది. అదొక్కటే కాదు.. ఈ దేశంలోని ప్రతి అణువులో మహిళాశక్తి ప్రకటితమవుతుంది. గంగ, గోదావరి, నర్మద, సరస్వతి, యమున...ఇలా ప్రతి నదికీ స్త్రీ పేరు ఉంటుంది. కారణం... మనిషికి అత్యంత ప్రాణాధారమైన వాటిల్లో నీరు ఒకటి. నీరు లేకపోతే ప్రాణం నిలవదు. స్త్రీమూర్తి లేనిదే జీవితం లేదు. అందుకే నీటికి, స్త్రీకి సమాన ప్రాధాన్యత ఇచ్చారు మన పూర్వికులు. ఈ రెండూ లేనిదే మనిషి జీవనం సాగించలేడు. ఆ జీవితం పరిపూర్ణత్వాన్ని పొందలేదు. అందుకే, నదులన్నిటినీ స్త్రీమూర్తుల పేరుతో పిలవటం మనదేశంలో ఆచారంగా ఉంది.


గంగమ్మ తల్లి, కృష్ణమ్మ తల్లి అంటూ నదుల్ని తల్లిగా భావించి, నోరారా పిలిచే దృశ్యం కేవం మనదేశంలోనే కనిపిస్తుంది. చివరకు పశు సంతతికి చెందిన ఆవును కూడా ఆవు అని పిలవకుండా గోమాత అని గౌరవంగా పిలిచి, తల్లిగా పూజించటం, వేపచెట్టును గౌరీదేవిగా అర్చించటం కూడా మనదేశంలోనే ఉంది. నీరు, నిప్పు... అన్నిట్లోనూ అమ్మను దర్శించగలిగిన సమున్నతజాతి మన భారతజాతి మాత్రమే.

వేదాల్లో స్త్రీ ప్రశంస

                భారతీయ సంస్కృతికి పట్టుగొమ్మలుగా నిలుస్తున్న వేదాలు స్త్రీకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చాయి. ఋగ్వేదం యజుర్వేదం, అధర్వణ వేదాల్లోని అనేక మంత్రాలు స్త్రీ ఔన్నత్యాన్ని విశేషంగా ప్రశంసించటంతో పాటు మహిళల్ని ఎంతో గౌరవంగా చూడాలనే బాధ్యతను పురుషులకు నిర్దేశించాయి. భర్తకు భార్యగా ఉంటూ, దాసి తరహాలో అతనికి సేవ చెయ్యటం  స్త్రీధర్మం అనే భావనను వేదాలు నిరసించాయి. ఇంటికి యజమానురాలిగా, బిడ్డకు తొలి గురువుగా, అవసరమైన సందర్భాల్లో పురుషులతో సమానంగా విద్య అందాని, విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత మాత్రమే వివాహానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాని అధర్వణవేదం చెబుతోంది. ఇందుకు ఆయా వేదాల్లో అనేక ఉదాహరణలు ఉన్నాయి.

·          స్త్రీలు ధైర్యవంతులుగా ఉండాలి  - యజుర్వేదం (10:23)

·          స్త్రీలు మంచి కీర్తి గడించాలి - అధర్వణ వేదం (14:1:20)

·          స్త్రీలు ఉత్తమ పాండిత్యం సంపాదించాలి - అధర్వణ వేదం (11:5:8)

·          స్త్రీలు అందరినీ జ్ఞానవంతుల్ని చెయ్యాలి - అధర్వణ వేదం (14:2:74)

·          స్త్రీలు ఎల్లప్పుడూ సంపదలతో సుఖంగా ఉండాలి - అధర్వణవేదం (7:4:72)

·          స్త్రీలు ఎల్లప్పుడూ జ్ఞానవంతులుగా, తెలివిగలవారుగా ఉండాలి - అధర్వణవేదం (7:47:1)

·          పరిపాలనకు సంబంధించిన సభలు, సమావేశాల్లో స్త్రీలు కూడా పాల్గొనాలి - అధర్వణవేదం (7:38:4)

·          దేశపరిపాలన, సామాజిక సంస్కరణలు, ప్రభుత్వ కార్యకలాపాలను స్త్రీలు నాయకత్వం వహించి నడపాలి-  ఋగ్వేదం (10:85:46)

·          స్త్రీలు సభను ఉద్దేశించి ప్రసంగించాలి - ఋగ్వేదం (10:85:26)

·          పిత్రార్జితంలో కుమారుడితో పాటు కుమార్తెకు కూడా సమానహక్కు ఉంది -  ఋగ్వేదం (3:31:1)

·          స్త్రీ సమాజానికి, కుటుంబానికి రక్షకురాలిగా వ్యవహరించాలి. అధర్వణవేదం (14:1:20)

·          స్త్రీ సంపదను, ఆహారాన్ని అందించాలి. శ్రేయస్సును కలిగించేదిగా ఉండాలి- అధర్వణవేదం (11:1:17)

·          స్త్రీలు యుద్ధంలో పాల్గొనాలి- యజుర్వేదం (16:44)

·         పురుషులతో సమానంగా మేము మీకు మంత్రాలను ప్రసాదిస్తున్నాము. మంత్రాలను అర్థం చేసుకునే శక్తిని మీకు ప్రసాదిస్తున్నాము - ఋగ్వేదం (10:19:13) (మంత్రభాగంలో పేర్కొన్న అనేక మంత్రాలకు గార్గి, లోపాముద్ర వంటి స్త్రీమూర్తులే  ద్రష్టలుగా ఉన్నారు. అలాగే గాయత్రి, చండి, దుర్గ, కాళి, సరస్వతి వంటి స్త్రీమూర్తులకు సంబంధించిన మంత్రాలే అధికంగా ఉన్నాయి)

·         ఓ వధూ! నీకు అన్నివిధాలైన విజ్ఞానం కలుగుగాక. వేదజ్ఞానం పొందిన తర్వాత మాత్రమే నువ్వు జీవితానికి సంబంధించిన నిర్ణయం తీసుకో. నీవు మంచి కీర్తిని గడించి, నీ భర్తకు శుభాలు కలుగజెయ్యాలి. నీ విజ్ఞానంతో కుటుంబాన్ని అభివృద్ధి పథంలో నడిపించు- అధర్వణవేదం (14:1:64) (ప్రతి స్త్రీ తప్పనిసరిగా విద్యాభ్యాసం చెయ్యాలని, ఆ తర్వాతనే వివాహం చేసుకోవాలని ఈ మంత్రం స్పష్టంగా చెబుతోంది.)

                యజ్ఞయాగాది క్రతువుల్లో కూడా భార్యకు అగ్రస్థానాన్ని వేదాలు కల్పించాయి. ఏయాగం చెయ్యాలన్నా, అందుకు సంబంధించిన అగ్ని ప్రతిష్ఠాపన భార్య చేస్తుంది. ఆ తర్వాతనే భర్త హోమాన్ని కొనసాగిస్తాడు. పతుర్యో యజ్ఞసంయోగే- యజ్ఞయోగ్యతను కలిగించునది పత్ని అని పాణిని సూత్రం. అయజ్ఞోవా ఏష: యో అపత్నీక:- అపత్నీకుడు అంటే భార్య లేని వ్యక్తికి యాగాలు చేసే అధికారం లేదు. చివరకు సంకల్పం చేసే అధికారం లేదని వేదాలు స్పష్టంగా చెబుతున్నాయి.

ఆమె ఒప్పుకుంటేనే వివాహం

 వివాహ మంత్రాల్లో కూడా వధువుకే అగ్రస్థానం ఉంది. గృహాన్గచ్ఛ గృహపత్నీ చథా సో వశినీత్వం విధథమాదాసి- వివాహంలో చేసే హోమా సందర్భంలో వరుడు వధువును నువ్వు మా ఇంటికి అధిపతిగా రావాలి. కేవలం రావటమే కాదు... మా ఇంటికి అధిపతిగా ఉండి, మమ్మల్ని నడిపించాలి. మా ఇంట్లో పుణ్యకార్యాలు జరిగేలా నువ్వు ప్రోత్సహించాలిఅని అభ్యర్థించి తీసుకువస్తాడు. కన్యాదానం చేసే సందర్భంలో కూడా తండ్రి తన కుమార్తెను లక్ష్మీస్వరూపంగా భావించి, కన్యాదానం చేస్తాడు. తన ఇంటి లక్ష్మి కనుకనే వధువును వివాహవేదిక వద్దకు నడిపించి తీసుకురాకుండా, ధాన్యం పోసిన వెదురుబుట్టలో కూర్చోపెట్టి తీసుకువస్తారు పుట్టినింటివారు.

 వివాహం పూర్తయిన తర్వాత కూడా లక్ష్మీ స్వరూపురాలైన భార్యను నడిపించకుండా ఉత్తరారధస్యోత్తంభనీ, వాహావుత్తరాభ్యాం యన్నక్తి:’, ‘ఆరోహయన్తీముత్తరాభిరభిమన్త్రయతే- రథం మొదలైన వాహనాల మీద కూర్చోబెట్టి వధువును వరుడి ఇంటికి తీసుకువెళ్ళాని మంత్రాలు చెబుతున్నాయి. మొత్తం వివాహ ప్రక్రియలో వరుడే వధువును తనకు భార్యగా ఉండాలని అభ్యర్థించి, తన ఇంటికి రావసిందిగా ఆహ్వానించి తీసుకువెళ్తాడే కానీ ఏ మంత్రంలోనూ పురుషాధిక్యత కనిపించదు.

తొలివరుసలో ఆమే...

                ప్రాచీనకాలం నుంచి మన ఆచార, సంప్రదాయాల్లో మహిళకే తొలిస్థానం కల్పించింది భారతీయ సంస్కృతి. భార్యాభర్త పేర్లు పిలవాల్సి వచ్చినప్పుడు ముందుగా భార్యపేరు పిలవటం ఆనవాయితీగా వస్తోంది. దేవతలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. లక్ష్మీనారాయణు, జానకీరాముడు, పార్వతీ పరమేశ్వరులు, సీతారాములు, గౌరీశంకరులు, ఛాయా ఉషా సమేత సూర్యనారాయణస్వామి, వల్లీదేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడు, అరుంధతి వశిష్ఠుడు... ఇలా భార్యపేరు వచ్చిన తర్వాతనే భర్తపేరు వస్తుంది.

 వేదాలతో సహా పురాణాలన్నీ స్త్రీని శక్తిస్వరూపంగా వర్ణించాయి. త్రిమూర్తుల కన్నా ఉత్తమస్థానంలో జగజ్జననిగా, పరాదేవతగా మహిళనే నిలిపాయి.

 వేదాలు కూడా యజ్ఞాల్లో స్త్రీకి అగ్రతాంబూలం ఇచ్చాయి. యజ్ఞాల్లో యజమాని భార్య మాత్రమే అగ్నిప్రతిష్ఠాపన చెయ్యాలి. ఆమె అగ్ని వెలిగించిన తర్వాతనే మిగిలిన కార్యక్రమం కొనసాగుతుంది. ఇతరులెవ్వరికీ ఆ అధికారం లేదు. అలాగే, పూర్ణాహుతిలో కూడా యజమానురాలు తప్పనిసరిగా ఉండాలి. భార్యావిహీనుడికి యజ్ఞయాగాది క్రతువులు చేసే అధికారాన్ని వేదాలు ఇవ్వలేదు.

                అలాగే, కొత్త ఏడాది వచ్చాక జరిగే తొలి కల్యాణం సీతారామ కల్యాణం. ఇక్కడ కూడా సీతారామ కల్యాణం అన్నారే కానీ రామ కల్యాణం అనలేదు. పార్వతీకల్యాణం, పద్మావతీ పరిణయోత్సవం... ఇలా అన్ని దేవతాకల్యాణాల్లోనూ ఆమెకే తొలిస్థానాన్ని కల్పించాయి వైదిక శాస్త్రనియమాలు. ఇప్పటికీ, దంపతులకు నూతన వస్త్రాలు ఇచ్చే సందర్భంలో ముందుగా భార్యకు పసుపు కుంకుమలు ఇచ్చిన తర్వాతనే భర్తకు వస్త్రాలు ఇస్తారు.

మనువు కూడా అర్ధస్య సంగ్రహేచైనాం వ్యయేచైవ నియోజనేత్‌’ ` అంటూ ధనాన్ని జాగ్రత్త చెయ్యటం, ఖర్చుచెయ్యటంలో ఇంటి యజమానురాలికే మొదటి అధికారం ఇచ్చాడు.

  పల్లెల్లో గ్రామదేవత ఆచారం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. పోలేరమ్మ, నాంచారామ్మ, తలుపులమ్మ, తిరుపతమ్మ, బతుకమ్మ...ఇలా వందలాదిగా గ్రామదేవతలు ఉన్నారు. వీరందరూ స్త్రీమూర్తులే. చాలా కుటుంబాల్లో ఏ శుభ కార్యం జరిగినా తొలిపూజ గ్రామదేవతకే చేస్తారు. వాన పడకపోయినా గ్రామదేవతకే మొక్కు చెల్లిస్తారు. అంటే, ఏ కష్టమొచ్చినా మనిషిని ఆదుకునేది మహిళలే అన్న విషయం స్పష్టమవుతోంది.

 

మనుస్మృతిలోనూ పెద్దపీట

                ఉపాధ్యాయాన్‌ దశాచార్య ఆచార్యానాం శతం పితా

                సహస్రం తు పితన్‌ మాతా గౌరవేణాతిరిచ్యతే ॥ (మను, 2:145)

  పదిమంది ఉపాధ్యాయుల కంటే ఒక ఆచార్యుడు, వందమంది ఆచార్యుల కంటే తండ్రి, వెయ్యిమంది తండ్రుల కంటే తల్లి పూజనీయురాలని మనుధర్మశాస్త్రం చెబుతుంది. మహిళకు ఇంతకన్నా గొప్పస్థానాన్ని మరే సంస్కృతీ ఇవ్వలేదనేంతగా మనుస్మృతి స్త్రీ ప్రాధ్యాన్యాన్ని వివరించింది. మాతృదేవోభవఅంటూ తల్లికి తొలి నమస్కారం చేసిన తర్వాతనే పితృదేవోభవఅంటూ తండ్రికి తర్వాతి నమస్కారం చెయ్యాని ఉపనిషత్తులు చెప్పిన వాక్యాలు కూడా మనుధర్మశాస్త్రాన్ని సమర్థించాయి.

సమాజంలో అత్యున్నత స్థానం స్త్రీకి ఉంది. అది ఆమె హక్కు. పురుషుడు ఆమెను ప్రాథేయపడాలి. ఆమెను మహారాణిలా చూసుకోవాలి. దైవం కన్నా గొప్ప స్థానం ఇవ్వాలి. ఆమె సదా వందనీయురాలు. ఇంటా బయటా, చదువైనా, వివాహమైనా, ఆస్తిపంపకాలైనా, అధికారమైనా... అన్నింటా అగ్రతాంబూలం ఇవ్వాల్సిందే అంటుంది మనుస్మృతి.

   ‘ఆమెపై అధికారం చెలాయించే హక్కు పురుషుడికి ఎప్పటికీ లేదని, ‘ఆమెతో పురుషుడు ఏవిషయంలోనూ సాటిరాలేడని మనువు స్పష్టంగా చెప్పాడు. మనిషికి అర్థం, పరమార్థం స్త్రీవల్లే కలుగుతాయి. భార్యను మించిన స్నేహితుడు భర్తకు మరొకరు లేరు. పురుషుడు స్త్రీ లేకుండా పరిపూర్ణత్వాన్ని పొందలేడు. అతడిని స్వీకరించటానికి సమ్మతించి స్త్రీ అతని ఇంటికి భార్యగా వచ్చినప్పుడే పురుషుడికి పూర్ణత్వం సిద్ధిస్తుందంటాడు మనువు.  శ్రీ’ (సంపద), ‘స్త్రీ’ (భార్య) లేని ఇల్లు కాంతిహీనంగా ఉంటుంది (9:26, 3:60). ఇది మనువు ఇచ్చిన సూచన రూపంలోని ఆదేశం. మార్గదర్శనం కూడా.

 మనుస్మృతిలో స్త్రీ గురించి చర్చ అంటే... న స్త్రీ స్వాతంత్య్ర మర్హతి’ (9:3) అనే వాక్యాన్ని ప్రస్తావిస్తారు. ఆమెను మనుస్మృతి స్వాతంత్య్రానికి నోచుకోనివ్వలేదు అంటారు. నిజానికి ఆ శ్లోకంలోని అంతరార్థం తరచిచూస్తే

                పితా రక్షతి కౌమారే భర్తా రక్షతి యౌవనే

                రక్షన్తిస్థావిరే పుత్రా నస్త్రీ స్వాతంత్య్రమర్హతి ॥ (9:3)

 తన రక్షణ కోసం మహిళ ఏనాడూ చింతించాల్సిన అవసరం లేకుండా మనువు చేసిన కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఇందులో కనిపిస్తాయి. బాలికగా ఉన్నప్పుడు తండ్రి, యువతిగా ఉన్నప్పుడు భర్త, వార్థక్యంలో ఉన్నప్పుడు కుమారుడు బాధ్యత తీసుకుని స్త్రీని సంరక్షించాలనే అర్థం బోధపడుతుంది.  మహిళ పూర్తి బాధ్యత పురుషుడికి అప్పగించాడు. ఇక్కడ మహిళపై బాధ్యతను పురుషుడు గుర్తించాలి తప్ప వారిపై ఉన్న అధికారాన్ని కాదు.

  స్త్రీలు ఏవిధంగానూ దుఃఖానికి గురికాకూడదని మనువు చెప్పాడు. స్త్రీలు దుఃఖిస్తే అందుకు ప్రతిఫలంగా దుఃఖానికి కారణమైన వారి వంశమంతా నశిస్తుంది. స్త్రీలు సంతోషంతో ఉంటే ఆ ఇల్లు, వారి వంశం ఎప్పుడూ కళకళలాడుతుంటుంది’ (3:57). ఇక్కడ స్త్రీపురుషులిద్దరిపై బాధ్యత పెట్టాడు మనువు. స్త్రీకి దుఃఖాన్ని కలగనివ్వకుండా చూడాల్సిన బాధ్యత పురుషుడిదైతే, తాను సంతోషంగా ఉంటూ తన వారందరినీ అలాగే ఉంచాల్సిన బాధ్యత ఆమెకుంది.

                స్వేభ్యోంశేభ్యస్తు కన్యాభ్యః ప్రదద్యుర్భ్రాతరః పృథక్‌

                స్వాత్స్వా దంశాచ్చతుర్భాగం పతితౌః స్యురదిత్సవః ॥

 అన్నదమ్ములు ఆస్తులు పంచుకుంటే ఒక్కొక్కరు తమ భాగాల్లోంచి నాలుగో వంతుని తోబుట్టువుకు ఇవ్వాలని మనువు నిర్దేశించాడు. మహిళకు ఆస్తిహక్కు  గురించి ఇవాళ మనం చేసుకుంటున్న చట్టాల్ని ఏనాడో వివరించి వారికి వెన్నుదన్నుగా నిలిచాడు మనువు.

 స్త్రీలను అపహరించడం, హత్య చేయడం, అత్యాచారం చేయడం వంటి విషయాల్లో మనువు చాలా నిష్కర్షగా వ్యవహరించాడు. ఇటువంటి దుర్మార్గాలు చేసిన వ్యక్తుల్ని అత్యంత కఠినంగా శిక్షించాని నిర్దేశించాడు. ఇలాంటి నేరాల్లో దోషులకు దేశబహిష్కరణ శిక్ష (మను, 8:352) విధించాలని రాజుకు సూచించాడు. స్త్రీలను అపహరించేవారికి, వారి ఆస్తుల్ని దొంగిలించేవారికి మరణదండన (8:323) విధించాలన్నాడు.  వినటానికే ఎంతో కఠినంగా అనిపించే ఈ శిక్షల్ని ఎన్నో వేల సంవత్సరా క్రితమే మనువు మహిళ రక్షణ కోసం నిర్దేశించాడు.

ఇవన్నీ ఆమెకు వెన్నుదన్నుగా నిలిచేందుకు చేసిన సూచనలే. బలమైన రాజ్యాంగం, గొప్ప సాంకేతిక ప్రగతి ఉన్నా నేటికీ మహిళలపై అనేక అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కఠినమైన శిక్షలు విధిస్తే తప్ప తప్పు చెయ్యటానికి మనిషి భయపడే పరిస్థితి రాదంటూ మనువు తన స్మృతిరూపంలో స్త్రీకి అండగా నిబడ్డాడు.

 యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః’ (3:56) - ఎక్కడ స్త్రీలు పూజలందుకుంటారో అక్కడ దేవతలు ఉంటారంటూ దేవత కన్నా స్త్రీకే ఎక్కువ గౌరవాన్నిచ్చాడు. స్త్రీ పక్షపాతిగా నిలిచాడు.

 

సాహిత్యాకాశంలో సగం

జనకమహారాజు కొలువులో గార్గి, మైత్రేయి వంటి మహిళలు ఆస్థానపండితులుగా ఎన్నో సత్కారాలు అందుకున్నారు. వీరు పురుషులతో సమానంగా వేద, శాస్త్ర చర్చల్లో పాల్గొనేవారు. తర్వాతికాలంలోనూ పురుషులతో సమానంగా... మరికొన్ని సందర్భాల్లో పురుషుల కన్నా మిన్నగా సాహితీసృష్టి చేసిన మహిళలెందరో ఉన్నారు. ఖడ్గ తిక్కన భార్య చానమ్మ, అతని తల్లి పోలమ్మ చాటువులు చెప్పారు. తొలి తెలుగు కవయిత్రి తాళ్ళపాక తిమ్మక్క, మోహనాంగి, తిరుమలాంబ, తుక్కాదేవి, నాచి, లీలావతి, శారద, త్రివేణి, కృష్ణాజమ్మ, రంగాజమ్మ, ముద్దుపళని, కుప్పమ్మ, బాల పాపాంబ, తరిగొండ వెంగమాంబ, అమ్మాజీ, బండారు అచ్చమాంబ, గోపిశెట్టి లక్ష్మీనరసమ్మ, మామిడన్న సుభద్రమ్మ, చిల్లరిగె రమణమ్మ... ఇంకా మరెందరో మాతృమూర్తులు తమ అసాధారణ రచనా విన్యాసాలతో తెలుగు సాహితీలోకాన్ని సుసంపన్నం చేశారు.

ఆడవాళ్ళను వంటింటి కుందేలుగా మార్చారని నేటి ఆధునికు విమర్శిస్తున్న కాలం, అంతకన్నా పూర్వకాలానికి చెందిన మహిళలే వీరంతా. అంటే, ఎన్నోవేల సంవత్సరాలకు పూర్వమే మన భారతజాతి మహిళలకు అగ్రస్థానం కల్పించిందన్న విషయాన్ని గమనించాలి.

  రఘునాథ నాయకుడి ఆస్థాన కవయిత్రి మధురవాణి ప్రాకృత, ఆంధ్ర భాషల్లో రచనలు చేసి రఘునాథ నాయకుడి చేత కనకాభిషేకం అందుకుంది. ఆమెతో పాటు రఘునాథుడి మన్నన అందుకున్న మరో కవయిత్రి రామభద్రాంబ. ఆశుకవిత్వంలో అసాధారణ ప్రజ్ఞ ఈమె సొంతం. విజయరాఘవ నాయకుడి ఆస్థానంలో చంద్రరేఖ, కృష్ణాజీ, రంగాజమ్మ అత్యంత ప్రసిద్ధి పొందారు. రంగాజమ్మ రాసిన మన్నారుదాస విలాసంప్రబంధాల్లో అత్యంత ప్రసిద్ధి పొందింది. దక్షిణాంధ్ర కవయిత్రుల్లో ముద్దు పళనిది ప్రత్యేకస్థానం. ఈమె రాసిన రాధికా సాంత్వనంరసావిష్కరణ విషయంలో అగ్రస్థానంలో ఉంది. ఇప్పటికీ ఈమెకు సాటిరాగల శృంగార రచయిత్రి తెలుగుసాహిత్యంలో లేదని విమర్శకులు సైతం ప్రశంసించారు. తెలుగు సాహిత్యంలో ఇప్పటికి వందలాది రామాయణాలు వచ్చినా, ఆతుకూరి మొల్ల రాసిన రామాయణానికి ప్రత్యేకస్థానం ఉంది. ఈమె రామాయణంలోని అనేక ఘట్టాలు అత్యంత ప్రజాదరణ పొందాయి.

 ఇంకా ఎందరో...ఎందరో స్త్రీమూర్తులు తమ ప్రతిభతో మనదేశానికి అఖండమైన కీర్తిప్రతిష్ఠలు తీసుకువచ్చారు. వేదాలతో సహా సనాతన భారతీయ సాహిత్యమంతా స్త్రీకి సమున్నతస్థానాన్ని ఇచ్చింది. అందుకే యత్రనార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దవతాః- ఎక్కడ స్త్రీలు పూజలందుకుంటారో అక్కడ దేవతలు కూడా కొలువై ఉంటారని పెద్దలు చెబుతారు.

ఎన్నో యుగాల నాడే మహిళకు సర్వోన్నత గౌరవం ఇచ్చిన మన సంస్కృతిని మన వారసత్వ సంపదగా కాపాడుకుందాం.

---------








రచన
డాక్టర్ కప్పగంతు రామకృష్ణ
ఆంధ్రోపన్యాసకులు
ఎస్.ఆర్.ఎస్.వి.కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్
గాంధీనగర్, విజయవాడ - 520003. 
సెల్ : 90320 44115 / 8897 547 548

 

Wednesday, April 21, 2021

తెలుగు అక్షరాల రూపంలో కమ్మని వంటలు

 తెలుగు అక్షరాల రూపంలో కమ్మని పిండివంటలు

సరదా సరదాగా అక్షరాలు నేర్పించే సరికొత్త వంటక విధానం


https://youtu.be/gpp048dsx9g

Tuesday, April 20, 2021

రామయ్యా...ఇదిగోనయ్యా సీతమ్మ! (సీతారామ కల్యాణ వైభవం)

 



సీతారామ కల్యాణ వైభవం

రామయ్యా...ఇదిగోనయ్యా సీతమ్మ!

 బంధం కలిస్తే బంధుత్వం...పెనవేసుకున్న అనుబంధం అంతులేని సంతోషానికి కారణమవుతుంది.మనుషుల మధ్య ఈ అనురాగ ముడులను వేసే ఓ ప్రక్రియ పెళ్లి...వివాహం ఇద్దరు మనుషులనే కాదు, రెండు కుటుంబాలను కూడా కలుపుతుంది. అంతుకుమునుపు పరిచయం లేని మనుషుల మధ్య ఆత్మీయతకు కారణమవుతుంది. ఎప్పుడో త్రేతా యుగంలో జరిగినట్లు  భావించే సీతారామకల్యాణమూ అంతే... భార్యభర్తల బాధ్యతలు, అత్తమామల దీవెనలు, వియ్యంకుల మర్యాదలు..అప్పగింతలు, పలకరింపులు...ఇలా ఎన్నో ఆత్మీయానురాగాలు అందులో అందంగా ప్రతిబింబిస్తాయి...అందుకే ఆ కల్యాణం లోకానికి  ఓ సంప్రదాయమైంది...మార్గదర్శనమైంది..వాల్మీకి రామాయణంలోని ఈ ఘట్టాలు  ఎప్పటికీ అపురూపాలే...

 ఆ శుభ తరుణంలో...

పెళ్లి తర్వాత ప్రేమ...

 నిజానికి శివధనుస్సును రామయ్య కావాలనో, సీతమ్మను వివాహం చేసుకోవాలనో ఎక్కుపెట్టలేదు. తన గురువైన విశ్వామిత్రుని ఆదేశం మేరకే శివధనుస్సుని ఎక్కుపెట్టాడు. ఆ తర్వాత కూడా నేరుగా సీతమ్మను స్వీకరించలేదు. తన తండ్రి దశరథుడు వచ్చి, జనకమహారాజుతో మాట్లాడి, ఇద్దరూ అంగీకరించిన తర్వాతనే సీతమ్మను వివాహం చేసుకోవటానికి ఇష్టపడ్డాడు. అలాగని, బలవంతపు వివాహం కూడా కాదు. సీతారాములిద్దరికీ ఒకరంటే ఒకరికి వర్ణించలేనంత ప్రేమ.

 ప్రియాతు సీతా రామస్య దారాః పితృకృతా ఇతి ।

గుణాద్రూప గుణాచ్ఛాపి ప్రీతిః భూయోభివర్థత ।। (వాల్మీకి రామాయణం)

 

పెద్దలు కుదిర్చిన పెళ్లి కదా అని రామయ్య సీతమ్మను మరింతగా ఇష్టపడ్డాడట. సీతమ్మ కూడా తన గుణగణాలతో రామయ్యకు తనపై ప్రేమ కలిగేలా చేసుకుందట. తన వెంట నడచివచ్చిన మహిళను ప్రేమగా చూసుకోవాల్సిన సందేశాన్ని రామయ్య, భర్తను అనురాగంతో, ప్రేమతో మాత్రమే తనవాడిని చేసుకోవాలనే సందేశాన్ని సీతమ్మ తమ వివాహం ద్వారా అందించారు. అందుకనే, సీతారాములు ఆదర్శ దంపతులయ్యారు. 

మరి కల్యాణం ఆ రోజెందుకు?

నిజానికి సీతారామ కల్యాణం ఉత్తర ఫల్గుణి నక్షత్ర యుక్త వైశాఖ శుద్ధ దశమి నాడు జరిగింది. కానీ మహతాం జన్మనక్షత్రే వివాహంఅంటుంది ఆగమ శాస్త్రం. మహాత్ములు, అవతారమూర్తుల జన్మతిథి నాడు ఆ నక్షత్రంలో భక్తులు కల్యాణం చేయాలని శాస్త్ర నియమం. చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో జన్మించాడు శ్రీరాముడు. ఆ పర్వదినాన్ని శ్రీరామనవమిగా ఘనంగా చేసుకుంటారు. ఈ సందర్భంగా ఊరూవాడా సీతారాముల కల్యాణం జరుపుతారు. ఇలాగే మహాశివరాత్రి సందర్భంగా కూడా శివపార్వతులకు కల్యాణోత్సవం నిర్వహిస్తుంటారు.

 మిథిలా నగరం...

 ఎప్పుడూ ధీరగంభీరంగా ఉండే జనకమహారాజు భవనం దేదీప్యమానంగా వెలిగిపోతోంది...

శివధనుస్సును శ్రీరాముడు విరిచేశాడంట.

మన జనక మహారాజు గారాల పట్టి సీతను ఆయనే చేపట్టబోతున్నాడు...

మా జానకేమో చందనపు తునక... మరి రాముడో...

ఆయనేమీ తక్కువ కాదు... నీలమేఘశ్యాముడంట, దశరథ మహారాజు చాలా గారాబంగా పెంచాడంట... అందంలో చంద్రుడితో పోటీ అంట...

అందుకే ఆయనను రామచంద్రుడని పిలుస్తారంట...

అంతఃపురమంతా ఇదే ముచ్చట... ఎప్పుడెప్పుడు కన్నులకు పండువ అవుతుందా అని ఎదురుచూపులు...

 మహాత్మా! నేను దశరథనందనుడి యశస్సు, వీరత్వాన్ని కళ్లారా తిలకించాను. నాకుమార్తె సీత, దశరథా¯త్మజుడైన శ్రీరాముణ్ణి వివాహమాడి మా జనక వంశానికి కీర్తి తెస్తుంది. మీరు అనుమతిస్తే నా మంత్రులు రథాలపై వాయువేగంతో అయోధ్యానగరానికి వెళతారు. ఇక్కడ జరిగింది దశరథ మహారాజుకు వివరించి, వారిని సకుటుంబ సపరివార సమేతంగా మిథిలకు తీసుకొస్తారు. అని విశ్వామిత్రుడికి విన్నవించాడు జనకుడు. విశ్వామిత్రుడు అనుమతించాడు.

 అయోధ్యలో విషయం తెలుసుకున్న కౌసల్య, సుమిత్ర, కైకేయిల సంతోషానికి పట్టపగ్గాలు లేవు. నిన్నటి దాకా మన చేతుల్లో ఆడుతున్నట్లే ఉన్నాడు ముద్దుల రాముడు... మన మురిపాల కొండ... అప్పుడే పెళ్లికొడుకవుతున్నాడు. దశరథుడు తన పరివారంతో పాటు వశిస్ఠుడు, వామదేవుడు, జాబాలి, కశ్యపుడు, మార్కండేయుడు, కాత్యాయనుడు వంటి మహనీయులతో, చతురంగ బలాలలో విదేహ దేశం చేరుకున్నాడు.

 వియ్యాలవారిని అల్లంతదూరంలోనే చూసిన జనకుడు వారికి ఎదుర్కోలు పలికి, ఇతర స్వాగత సత్కారాలు చేశాడు. జరిగిన విషయమంతా చెప్పి, తన కుమార్తెను కోడలిగా స్వీకరించమని దశరథుడిని కోరతాడు.

 ప్రతిగృహో దాతృవశః శ్రుతం ఏతత్‌ మయా పురా।

యథా వక్ష్యసి ధర్మజఞ తత్‌ కరిష్యామహే వయం ।।

 అందుకు దశరథుడు అయ్యయ్యో! జనకా.. అలా అంటావేంటి. అసలు ఇచ్చేవాడంటూ ఉంటే కదా పుచ్చుకునేవాడు ఉండేది. నీ కుమార్తెను నా కోడలిగా చేస్తానంటున్నావు. నువ్వు దాతవు. నేను పుచ్చుకునేవాడిని... అంటూ ఎంతో ఆప్యాయంగా జనకుడి ఆహ్వానాన్ని స్వీకరిస్తాడు. తన బంధుత్వం మరింతగా దృఢపడాలంటూ వారు ఎంతో ఆప్యాయంగా పరస్పర సంభాషణ చేసుకుంటారు.

అదిగదిగో... ఆ రోజు రానేవచ్చింది...

వైశాఖ శుద్ధ దశమి ఉత్తర ఫల్గుణి నక్షత్ర శుభముహూర్తాన్ని సీతారాముల కల్యాణానికి వేదమూర్తులు నిర్ణయించారు.

 కల్యాణవేదికను సర్వాంగ సుందరంగా అలంకరించారు. నానావిధ పరిమళ పత్ర పుష్పాలతో కల్యాణమంటపం ముస్తాబైంది. మిథిలా నగరమంతా మహా సందడిగా మారింది. శ్రీరాముడికి సీతతో పాటు లక్ష్మణుడికి సీత సోదరి ఊర్మిళను, భరతుడికి జనకుడి సోదరుడైన కుశధ్వజుని పెద్దకూతురు మాండవి, శతృఘ్నుడికి కుశధ్వజుని మరోకుమార్తె శ్రుతికీర్తిని ఇచ్చి వివాహం జరిపించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 

అటు జనకమహారాజు కన్యాదానం చెయ్యటానికి, ఇటు దశరథుడు కన్యాదానం తీసుకోవటానికి అవసరమైన అన్ని వైదిక కార్యక్రమాలు సశాస్త్రీయంగా నిర్వహించారు. దశరథ మహారాజు కన్యాదానం పుచ్చుకోవటానికి బయల్దేరి జనకుడి సభ బయట ఉండి, తన రాక గురించి మహారాజుకు కబురుచేస్తాడు. అందుకు ప్రతిగా జనకుడు దశరథుడితో మహారాజా! ఇకపై జనకుడి ఇంటికి, దశరథుడి ఇంటికి తేడా లేదు. మిమ్మల్ని అక్కడ ఎవరైనా ద్వారపాలకులు ఆపుతున్నారా? మీరు నేరుగా భవనంలోకి రండి. ఇది మీ ఇల్లే అంటూ ఆప్యాయంగా స్వాగతం పలుకుతాడు. ఎంతో ప్రేమ, ఆప్యాయత నిండిన మనస్సుతో జనకుడు చేసిన ఆహ్వానం, పలికిన పలుకులతో దశరథుడు మరింతగా పొంగిపోయాడు.

 ఆకాశమంత పందిరి కింద, భూదేవి అంత వేదిక సిద్ధంచేశారు. మంగళవాయిద్యాలు మారుమోగుతున్నాయి. వేదమంత్రాలు శ్రావ్యంగా వినిపిస్తున్నాయి. సుగంధద్రవ్యాలు గుభాళిస్తున్నాయి. పన్నీటి చిలకరింపులు హాయిగొలుపుతున్నాయి.. మగపెళ్లివాళ్లంతా ఠీవీగా కూర్చున్నారు. వారికి జనక మహారాజు పరివారం వారికి నమ్రతగా, వినయ విధేయతలతో సపర్యలు చేస్తున్నారు. నలుగురు పెళ్లికుమారులు, నలుగురు పెళ్లికుమార్తెలు సిరికల్యాణ తిలకంతో, మణిమయ బాసికాలతో, సీతారాములు శోభిల్లుతున్నారు.

 బంగారుమంటపంలో సీతారాములు వధూవరులుగా కూర్చున్నారు. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు వంటి మహర్షుల ఆధ్వర్యంలో పురోహితులు పెళ్లిమంత్రాలు చదువుతున్నారు. ముహూర్త ఘడియలు సమీపించగానే జనకమహారాజు వేదికపైకి వచ్చి, సీతమ్మ చేతిని తన చేతితో పట్టుకుని....

 ఇయం సీతా మమసుతా సహ ధర్మచరీ తవ ।

ప్రతీచ్ఛ చ ఏనాం భద్రం తే పాణి గృహ్ణీష్వ పాణినా ।

పతివ్రతా మహాభాగా ఛాయా ఇవ అనుగతా సదా ।।

 రామయ్యా! ఇదిగో... నా కుమార్తె అయిన సీత. నీకు సహధర్మచారిణిగా స్వీకరించు. నీకు శుభాలు కలుగుతాయి. ఈమె పతివ్రతగా ఉండి, నిత్యం నిన్ను నీడలా అనుసరిస్తుంది అంటూ సీతమ్మ చేతిని రామయ్య చేతికి అందిస్తాడు. అత్తవారింట ఎలా నడుచుకోవాలో అన్ని బోధనలూ ఒక్క శ్లోకంలో చెప్పేశాడు జనకమహారాజు.

 పుట్టింటి నుంచి ఓ తండ్రి కుమార్తెగా అత్తింట అడుగుపెట్టే స్త్రీ, తన భర్తకు సహధర్మచారిణిగా ఉండాలి. అత్తింటివారికి అన్ని శుభాలు కలిగేలా ప్రవర్తించాలి. పతివ్రతగా ఉండాలి. భర్తను నీడలా అనుసరించాలి. ఇలాంటి మహోన్నతమైన జాగ్రత్తలు, సూచనలు చెబుతూ బిడ్డను అత్తవారింటికి సాగనంపాడు.

 ఆయన ఆకాశం... ఆమె పుడమి!

 రాముడు నీలమేఘశ్యాముడు. నీలవర్ణం ఆకాశ లక్షణం. అంటే రాముడు పంచభూతాల్లో ఒకటైన ఆకాశానికి ప్రతీక. సీతమ్మ నాగేటి చాలు ద్వారా భూమి నుంచి జన్మించింది. భూమి పంచభూతాల్లో ఒకటి. ఇలా, పంచభూతాల్లో మొదటిదైన భూమికి సీతమ్మ, చివరిదైన ఆకాశానికి రామయ్య సంకేతాలుగా నిలుస్తున్నారు. ఎప్పుడైతే ఆకాశం భూమిని చేరుతుందో (వాన చినుకుగా మారి) అప్పుడు పుడమి (భూమి) పులకరిస్తుంది. సస్యాన్ని (పంటను) అందిస్తుంది. ఆ సస్యం జీవులకు ఆహారంగా మారి, వారికి శక్తిని ఇస్తుంది. అంటే, ఎప్పుడైతే రామయ్య సీతమ్మకు చేరుకుంటాడో అప్పుడు లోకానికి శక్తి  వస్తుంది. ఈవిధంగా సీతారామకల్యాణం లోకకల్యాణానికి కారకంగా, ప్రకృతి పులకరింతకు ప్రతీకగా నిలుస్తుంది.

 ఇద్దరి పుట్టుక ఒకేలా...

 సీతారాములిద్దరి జన్మవృత్తాంతం విచిత్రమైందే. వీరిలో ఏ ఒక్కరూ నేరుగా తల్లి కడుపునుంచి జన్మించలేదు. సంతానం కోసం దశరథ మహారాజు చేసిన పుత్రకామేష్ఠి ఫలితంగా లభించిన యజ్ఞపాయస ప్రసాద ఫలితంగా రాముడు కౌసల్య గర్భాన జన్మించాడు. యజ్ఞం చెయ్యటం కోసం భూమిని దున్నే ప్రయత్నంలో నాగలి చాలుకు తగిలి, భూమిని నుంచి తనకు తానుగా అయోనిజగా ఆవిర్భవించింది సీతమ్మ. ఇద్దరూ యజ్ఞప్రసాదాలే. అందుకే వారిద్దరి కల్యాణం కూడా లోక కల్యాణయజ్ఞానికి పునాదిగా నిలిచింది.

 పెళ్లి బాజాలు అలా మోగాయి...

 సీతారామకల్యాణ ఘట్టాన్ని జానపదులు రాములోరి పెళ్లిగా పిలుచుకుంటారు. కేవలం పిలుపే కాదు... వారితో చుట్టరికం కలుపుకుంటారు. సీతమ్మ మాయమ్మ.. .శ్రీరాముడు మా తండ్రివంటి గీతాలు ఇందుకు ఉదాహరణ. తొలి తెలుగు వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్యులు కూడా తన సంకీర్తనల్లో అనేకసార్లు సీతారామ కల్యాణఘట్టాన్ని మనసారా కీర్తించారు. రామం ఇందీవర శ్యామం పరాత్పర ధామం... సుర సార్వభౌమం భజే’; ‘అట్టె హరువిల్లు విరిచిన రాఘవా.. సిరులతో జనకుని ఇంటను జానకి జెలగి పెండ్లాడిన రాఘవా’; ‘రాముడు రాఘవుడు రవికులుడితడు... భూమిజకు పతియైన పురుష నిధానమువంటి కీర్తనలెన్నో అన్నమయ్య కలం నుంచి జాలువారి సీతారామకల్యాణ వైభోగాన్ని నేటికీ మనకు వీనులవిందుగా అందిస్తున్నాయి.

-------------------------------------

రచన: డాక్టర్ కప్పగంతు రామకృష్ణ, సెల్: 9032044115


Sunday, April 4, 2021

దేవుడిని చూద్దాం... రండి (మొదటి భాగం)




ఆలయానికి ఎందుకు వెళ్ళాలి?
దేవుడిని ఎలా దర్శించుకోవాలి?
దైవ దర్శనం కోసం పాటించాల్సిన నియమాలేమిటి?

శ్రీ కనకదుర్గ ప్రభ మాస పత్రికలో
ఏప్రిల్ 2021 సంచిక నుంచి
ప్రారంభమైన ధారావాహిక
రచన : డాక్టర్ కప్పగంతు రామకృష్ణ, సెల్ : 90320 44115 / 8897 547 548








 

Wednesday, March 3, 2021

మహాశివరాత్రి ప్రత్యేకం... పరమేశ్వర అవతార వైభవం

 

మహాశివరాత్రి ప్రత్యేక రచన
పరమేశ్వర అవతార వైభవం
పరమేశ్వరుడి రూపం అందించే సందేశం ఏమిటి? 
ఆయన ధరించిన ఆయుధాల పరమార్థం ఏమిటి?


అపురూపం... శివ రూపం

 ఆ నామమే కాదు ఆ రూపమూ అపురూపమే.

ఆ వేషంలో ఎంతో వైరుధ్యం. అంతలోనే వైవిధ్యం.

ఆయన ఆయుధాలు, ఆభరణాలన్నీ వేటికవే విభిన్నం.

ప్రతి అంశంలో ఓ సందేశం. మరెంతో పరమార్థం.

అందుకే ఆ రూపమే కాదు... ఆ భావమూ అపురూపమే.

సాకారుడైనా, నిరాకారుడైనా అంతా ఆ స్వామి చిద్విలాసమే.

     పరమేశ్వరుడు పరమ దయాళువు. ప్రకృతిలోనూ ప్రతి అణువూ ఆయన స్వరూపమే. ఆయనకు అధీనమే. కానీ ఆ స్వామి దేనికీ కట్టుబడలేదు. కనీసం కట్టుబట్టలు కూడా విలాసవంతమైనవి స్వీకరించడు. విభూది ధరిస్తాడు. గజచర్మం చుట్టుకుంటాడు. విష సర్పాలు ఆయనకు హారాలు. సగం మిగిలిన నెలవంక ఆయన తలపైన అలంకారం. ఉవ్వెత్తున ఎగసిపడే కెరటాలతో దూకే గంగను నెత్తినపెట్టుకున్నాడు. వయసుడిగిన వృషభం వాహనం. మెడలో కపాలమాల. చేతిలో త్రిశూలం.

ఏమిటీ చిత్రవిచిత్రమైన ఆహార్యం. ఇంతకన్నా సొగసైన వస్తువులేవీ స్వామికి దొరకలేదా అంటే సమస్తమైన విశ్వమే ఆయన కనుసన్నల్లో నడుస్తుంది. ఇక ఆయనకు కానిదేది.

ఆ... ఆలోచిస్తే ఇప్పుడు అర్థమవుతోంది. పైపైకి... మామూలు కళ్ళతో చూస్తే శివయ్య లీల ఓ పిచ్చి జంగమదేవర తీరు. అదే కళ్ళుమూసుకుని మనసు తెరచి చూస్తే అనంతమైన శివ వైభవం సాక్షాత్కరిస్తుంది. ఆ స్వామి ఆకారం, ఆహార్యం అన్నిటా అంతులేని ఆధ్యాత్మిక భావనలు వెల్లివిరుస్తాయి.

 జ్ఞానానికి స్థానం... త్రిశూలం

          శివయ్యను చూడగానే ఆయన చేతిలో త్రిశూలం తళుక్కుమని మెరుస్తూ మన కళ్ళకు కనిపిస్తుంది. ఎంతోమంది రాక్షసుల ప్రాణాలు తీసి భక్తుల ప్రాణాలు కాపాడిన మహాశక్తిమంతమైన ఆయుధం అది. శివయ్య చేతికది అలంకారం. 

          త్రిశూలం అంటే మూడు కొనలు కలిగినదని అర్థం. సాధారణ ఆయుధానికి ఉండే కొనలు కావవి. ఆ మూడు కొనలు సత్త్వ రజ స్తమో గుణాలకు ప్రతీకలు. ఆ మూడుకొనలు పిడి వద్ద కలుసుకుంటాయి. త్రిగుణాల ఏకత్వానికిది సంకేతం.

          యోగపరంగా చూస్తే త్రిశూలంలోని మూడు కోణాలు మానవశరీరంలోని ఇడ, పింగళ, సుషుమ్న నాడులకు సంకేతాలు. ఈ మూడు నాడులు శిరస్సులో ఉండే జ్ఞానకేంద్రం వద్ద కలుస్తాయి. ఇదే త్రివేణీ సంగమం. త్రిశూలం లోని మూడు కొనలు మూడు నాడులకు సంకేతాలైతే జ్ఞానకేంద్రం శూలహస్తాన్ని సూచిస్తుంది.  వాటి ఏకత్వాన్ని, త్రిగుణ సంగమాన్ని ప్రకటిస్తుంది.

          త్రిశూలంలోని మూడుకొనలు త్రిగుణాలకు ప్రతీకలైతే వాటి ఏకత్వాన్ని ప్రకటించే చోటును పట్టుకున్న పరమేశ్వరుడు నేనీ త్రిగుణాలకు అతీతుడను అనే సత్యాన్ని ప్రకటిస్తాడు. అంతేకాదు.. భూత భవిష్యత్ వర్తమానాలనే త్రికాలాలకు, జాగృత్ స్వప్న సుషుప్తులనే త్రిస్థితులకు తానే అధిదేవతను అనే సత్యాన్ని కూడా త్రిశూలం తెలియజేస్తుంది. ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక తాపాలను త్రిశూలం పోగొడుతుంది. మరొక అర్థంలో త్రిశూలంలోని మూడు కోణాలు కోరిక, చర్య , జ్ఞానం అనే మూడు శక్తులను సూచిస్తాయి. ఇవే ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తులు.

          త్రిశూలానికి సంబంధించి ఆసక్తికరమైన పురాణగాథలూ ఎన్నో ఉన్నాయి. ఒకానొక సందర్భంలో శివుడు కాశీ పట్టణాన్ని తన త్రిశూలంతో ఎత్తి పట్టుకుంటాడు. మొత్తం ప్రపంచం నాశనమైనా, ప్రళయం వచ్చినా కాశీకి ఎటువంటి ఆపదా కలగదని వరమిచ్చాడు.

          అంధకాసురుడిని సంహరించే సమయంలోనూ త్రిశూలానిదే ప్రధాన పాత్ర. శివుడు రాక్షసుడిని సంహరించకుండా త్రిశూలానికి గుచ్చి ఉంచాడు.  త్రిశూలానికి వేలాడుతున్న అంధకుడికి జ్ఞానోదయమైంది. శివయ్య అతడిని క్షమించి తన ప్రమథగణాల్లో చేర్చుకున్నాడు.

హస్తసాముద్రికంలోనూ త్రిశూలానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అరచేతిలో త్రిశూలం గుర్తు ఉన్న వ్యక్తులు పరమేశ్వరుడి అనుగ్రహం తప్పకుండా పొందుతారు. శుక్రస్థానంలో త్రిశూలం గుర్తున్న వ్యక్తులు సానుకూల దృక్పథంతో ఉంటారు. అంగారక స్థానంలో ఉంటే వ్యక్తులు విజయాలు సాధిస్తారు. చంద్రస్థానంలో త్రిశూలం గుర్తున్న వ్యక్తులు శక్తివంతమైన ఊహలు, సృజనాత్మక ఆలోచనలు కలిగిఉంటారు. ఇలా మరెన్నో స్థానఫలితాలను హస్తసాముద్రిక శాస్త్రం చెబుతుంది.

 అక్షరాలకు ఊపిరిపోసిన డమరుకం

          శివయ్య చేతిలోని డమరుకం కేవలం వాద్యమే కాదు. తత్త్వచింతనకు అదొక వేదిక. అంతేకాదు... మనం రాసుకుంటున్న అక్షరాలకు శివయ్య చేతిలోని డమరుకమే ఉత్పత్తి స్థానం. ఇందుకు సంబంధించిన ఆసక్తికరమైన ఘటన ఒకటుంది.

          ఒకప్పుడు పరమేశ్వరుడు ఎంతో ఆనందంతో తాండవం చేస్తున్నాడు.

నృత్తావసానే నటరాజరాజో ననాద ఢక్కాం నవపంచవారం

ఉద్ధర్తు కామః సనకాది సిద్ధాన్‌ ఏతత్‌ విమర్శే శివసూత్ర జాలం

          తాను చేస్తున్న తాండవ నృత్యం చివరలో శివుడు తన డమరుకాన్ని మోగించాడు. ఆ సమయంలో 14 రకాలైన ధ్వనులు వెలువడ్డాయి.  సనకాది మహర్షులు వీటిని గ్రహించారు. ఈవిధంగానే భాషాశాస్త్రం ఆవిర్భవించిందని ఈ శ్లోకానికి భావం.

నర్తనం చివరిలో చేసిన డమరుకపు పధ్నాలుగు దరువుల సహాయంతో పరమ శివుడు వ్యాకరణ సూత్రాలకూ బీజం నాటాడు. ఆ పధ్నాలుగు సూత్రాలను పాణిని కంఠస్తం చేసికొని ‘అష్టాధ్యాయి’ అనే ప్రాథమిక వ్యాకరణ గ్రంథాన్ని రచించాడు. ఇందులో ఎనిమిది అధ్యాయాలు ఉండటం వల్ల ఈ గ్రంథం ‘అష్టాధ్యాయి’గా ప్రసిద్ధి పొందింది. ఈ 14 సూత్రాలనే మాహేశ్వర సూత్రాలు అంటారు. నటరాజు డమరుక దరువుల నుండి ఉద్భవించిన మహేశ్వరసూత్రాలు వ్యాకరణానికి మూలం. శివునికీ, వ్యాకరణానికీ సంబంధం ఇదే. అందుచేతనే శివాలయాలలో వ్యాకరణమంటపాలుంటాయి.

విఖ్యాత శైవకవి పాల్కురికి సోమనాథుడు రాసిన అక్షరాకం పద్యాల్లోనూ శివ డమరుక వైభవం ఎంతగానో ప్రకటితమవుతుంది. కొన్ని పద్యాలైతే పూర్తిగా డమరుక నాద విశేషాలతో నిండి ఉంటాయి.

 

డమరుగజాత డండడమృడండమృడండ మృడండ మృండమృం

డమృణ మృడండడండ మృణడండడడండ మృడం డమృం డమృం

డమృణ మృడండడంకృతివిడంబిత ఘూర్ణిత విస్ఫురజ్జగ

త్ర్పమథన తాండవాటన "డ"కారనుతా బసవేశ పాహిమాం !

 

ఓ బసవేశ్వరుడా ! నువ్వు తాండవ నృత్యము చేసే సమయంలో నీ డమరుకం నుండి డండడ మృడండమృడండ మృడండమృండమృండమృణ మృడండడండ మృణడండడడండ మృడండమృం డమృం మొదలగు ధ్వనులు పుడుతున్నాయి. ఆ ధ్వనులతో పుట్టిన డమరుక కాంతులలో లోకాలు వెలుగుతున్నాయి. అటువంటి అద్భుతమైన డమరుక ధ్వనులు కలిగిన లోకాలను చిలుకు తాండవ నాట్యమునందు సంచరించువాడా ! (తిరుగువాడా!)ఓ పరమశివా !డ అను అక్షరముతో పలుమార్లు ఈ పద్యంలో పొగడబడినవాడా ! ఓ శివా !నన్నురక్షించు అని ఈ పద్యానికి భావం.

డమరుకం వాయించటానికి ముందుగా డమరుకం మధ్యలో ఒక కొయ్యముక్క కడతారు. దానిని మణి అంటారు. డమరుకాన్ని కదలించినపుడు మణి డమరుకానికి అటు ఇటు తగలటం ద్వారా డమరుక శబ్దం ఉత్పత్తి అవుతుంది.  ఆ శబ్దం అంతులేని ఆనందాన్న కలిగిస్తుంది.

ఆకాశంలో శబ్ద గుణకాలు ప్రయాణిస్తాయి. మనం ఏదైనా మంత్రాన్ని జపం చేస్తున్నట్లయితే లేదా స్తోత్రాన్ని పారాయణ చేస్తున్నా వాటి నుంచి ఏర్పడే శబ్ద ప్రకంపనలు తరంగాలు మారి ఆకాశానికి చేరుకుంటాయి. అనంతాకాశంలో సంచారం చేసే శివ డమరుక ధ్వనులతో అవి సంయోగం చెందుతాయి. ఆవిధంగా సాధకుడికి పరమేశ్వరానుగ్రహం కలుగుతుంది. 

కాలరేఖ చంద్రరేఖ

శివయ్య సిగ మీద నెలవంక వెన్నెల వెలుగులీనుతూ కనిపిస్తుంది. అలా అర్థచంద్రుడిని ధరించటమే శివయ్య ఔదార్యాన్ని ప్రకటిస్తుంది.  దక్షప్రజాపతి అల్లుడైన చంద్రుడు తన 27 మంది భార్యల్లోనూ రోహిణి అంటేనే ఎంతో ప్రేమగా ఉండేవాడు. ఇది సహించలేని ఇతర భార్యలు తండ్రి అయిన దక్షుడికి ఫిర్యాదు చేయటంతో ఆయన కోపంతో అల్లుడైన చంద్రుడిని శపిస్తాడు. ఆ శాపం పోగొట్టుకునే క్రమంలో శివుడి అనుగ్రహం పొందిన చంద్రుడు శివుడి సిగ మీద అలంకారంగా నిలిచాడు. అప్పటి నుంచి శివుడు చంద్రశేఖరుడయ్యాడు.

పరమేశ్వరుడి జటాజూటంలో చంద్రరేఖ ఉండటం శివుడు కాలస్వరూపుడనే విషయాన్ని స్పష్టం చేస్తుంది. కాలాన్ని గణించే పద్ధతుల్లో చాంద్రమానానికి ప్రాశస్త్యం ఎక్కువ. అటువంటి కాలగణనకు ప్రధానమైన చంద్రుడు శివుడి అధీనంలో ఉన్నాడు. అంటే శివుడు కాలాధిష్ఠాన దైవం అని గ్రహించాలి.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం చంద్రుడు మన: కారకుడు. మనిషి సుఖ సంతోషాలన్నీ జాతకచక్రంలో చంద్రుడి సంచారం మీద ఆధారపడి ఉంటుంది. అటువంటి చంద్రుడు శివుడి అధీనంలో ఉన్నాడు. కాబట్టి శివారాధకులకు అయాచితంగా చంద్రుడి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఫలితంగా చక్కని మనోస్థైర్యం కలుగుతుంది. చక్కటి మనస్సు ధర్మకార్యాల మీద నిమగ్నమవుతుంది. అంతిమంగా దైవపదం చేరుకునేందుకు ఇదే పునాదిగా నిలుస్తుంది. 

నాగేంద్ర హారాయ...

          శివయ్యను చూడగానే ఆయన మెడలో ఆభరణంగా వెలుగుతున్న పాము కనిపిస్తుంది. నిజానికది పాము కాదు. పాముల్లో శ్రేష్ఠమైన జాతికి చెందిన సర్పం.  వాసుకి అనే సర్పరాజు తపస్సు చేసి శివుడిని మెప్పించి ఆయనకు కంఠహారంగా మారతాడు.

          పరమేశ్వరుని మెడలో నాగాభరణమై వున్న మహాసర్పం వాసుకి. అన్ని వేళలా స్వామి సేవలో ఆ నాగరాజు తరిస్తాడు.కశ్యప ప్రజాపతికి గల 14 పత్నుల్లో   వినత, కద్రువలు ఇద్దరు. వినతకు గరుత్మంతుడు, అనూరుడు ఇద్దరు కుమారులు. వీరిలో అనూరుడు సూర్యుని రథసారథిగా బాధ్యతలు నిర్వహిస్తుంటాడు. కద్రువకు వెయ్యిమంది సర్పాలు సంతానం. వీరిలో పెద్దవాడు ఆదిశేషువు. పాలసముద్రం సమీపంలోని ఉచ్చైశ్రవాన్ని(గుర్రం) దూరం నుంచి చూసిన కద్రువ తన సోదరి వినతతో దాని తోక నల్లగా వుందని చెబుతుంది. అయితే వినత అంగీకరించకుండా తోక కూడా తెల్లగానే వుంటుందని పేర్కొంటుంది. తోక నల్లగా వుంటే అక్క తన దగ్గర వేయి సంవత్సరాలు పరిచారికగా వుండాలని ఒక వేళ తోక తెల్లగానే వుంటే తానే వినత దగ్గర వేయి సంవత్సరాలు బానిసగా వుంటానని కద్రువ పందెం కాస్తుంది.

ఇంతలో రాత్రి కావడంతో పొద్దున వచ్చి పరీక్షిస్తామని వెళ్లిపోతారు. గుర్రం తోక తెల్లగానే వుంది ఈ పందెంలో ఎలా నెగ్గాలా అన్న సంశయంలో కద్రువ వుంటుంది. హఠాత్తుగా ఆమెకో ఆలోచన వస్తుంది. తన కుమారులను పిలిచి నల్లగా వున్న వారు వెళ్లి గుర్రం తోకను చుట్టుకోవాలని కోరుతుంది. దీన్ని వారు అంగీకరించరు. ఇది ధర్మసమ్మతం కాదని వాదిస్తారు. వారి వాదనతో ఆగ్రహం చెందిన కద్రువ తల్లి మాటనే పట్టించుకోరు కాబట్టి భవిష్యత్తులో జరిగే సర్పయాగంలో పడి నశించిపోతారు అని  శపిస్తుంది.

శాపంతో భీతిల్లిన కొన్ని సర్పాలు తల్లి మాట ప్రకారం గుర్రం తోకను పట్టుకోవడంతో నిజమేనని భ్రమించిన వినత అన్న మాట ప్రకారం కద్రువ దగ్గర దాసిగా పనిచేస్తుంది. అనంతరం ఆమెకు ఆమె రెండో కుమారుడు గరుత్మంతుడు బానిస బంధనాల నుంచి విముక్తి కలగజేస్తాడు. తల్లి మాట అంగీకరించని ఆదిశేషువు శ్రీమహావిష్ణువు కోసం ఘోరతపస్సు చేస్తాడు. స్వామి ప్రత్యక్షమై ఆదిశేషువును తన శేషతల్పంగా చేసుకుంటాడు. దీంతో ఆదిశేషువుకు ఎలాంటి మృత్యుభయం లేకుండా పోయింది. రెండో వాడైన వాసుకి మహాశివుని కోసం తపస్సు చేస్తాడు. శంభునాథుడు ప్రత్యక్షమై వాసుకికి మృత్యుభయం లేకుండా చూసేందుకు తన మెడలో నాగాభరణంగా చేసుకుంటాడు. శివుడు మృత్యుంజయుడు. దీంతో వాసుకికి కూడా ఎలాంటి మృత్యువు దరిలోకి రాకుండా పోయింది. ఆ నాటి నుంచి వాసుకి మహాశివుని మెడలో దర్శనమిస్తుంటాడు. సర్పాన్ని మెడ యందు ఆభరణంగా ధరించినవాడు కనుకనే ఆ పరమేశ్వరుడిని నాగాభరణుడు, నాగభూషణడు అని కూడా పిలుస్తాము.

          శివయ్య సర్పాల్ని ధరించటం వెనుక ఎంతో సందేశం దాగి ఉంది. పాములు నిరంతర జాగరూకతకు ప్రతీకలు. శివారాధకులు కూడా అంత జాగరూకతతో ఉండాలనే సందేశం ఇందులో దాగుంది. అత్యంత భయంకరమైన సర్పాలు కూడా శివయ్య స్పర్శ తగలగానే సునమస్కులుగా మారిపోతాయి. భయంకరమైన విష సర్పాల వల్ల కలిగే భయం శివారాధన వల్ల తొలగిపోతుంది. సర్పాల్ని ధరించటం ద్వారా తన భక్తులకు సర్పభయం లేకుండా చేస్తానన్నది శివుడు ఇచ్చే అభయం.

          శివయ్య మెడలో మూడుచుట్టలు తిరిగి ఉండే సర్పం కాలచక్రానికి సంకేతం. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలే ఈ మూడు చుట్టలు. ఈ మూడు కాలాలతోటే సమస్తమైన ప్రపంచ చర్య జరుగుతుంటుంది.  పాము ఆకారం కుండలిని శక్తిని పోలి ఉంటుంది. పాము గర్వానికి సూచిక. తన గర్వాన్ని ఎవరైతే గెలుస్తారో వారికి తాను ఆభరణంగా నిలుస్తానని చెప్పటం శివయ్య సర్పాభరణాలు ధరించటం వెనుక ఉండే సందేశాల్లో ఒకటిగా గుర్తించాలి.

 త్రిలోచనాయ...

          శివయ్యను చూడగానే అందరినీ ఆకర్షించేది ఆయన నుదిటిన ఉన్న నేత్రం.  నుదుటి భాగంలో నేత్రాన్ని ఉంచుకున్న కారణంగా శివయ్య త్రినేత్రుడయ్యాడు. సాధారణ భాషలో మూడో కన్ను అంటారు.

          ఈ త్రినేత్రం సాధారణ నేత్రం మాదిరిగా కనిపిస్తున్నప్పటికీ ఇతర కళ్ళ మాదిరిగా చూడటానికి ఉపయోగించే నేత్రం కాదు. ఇది జ్ఞాన నేత్రం.  సకల ద్వంద్వాలకు అతీతమైన స్థితిని ఈ నేత్రం ప్రకటిస్తుంది.  ఇది ఆజ్ఞాచక్రానికి స్థానం.

          శివుడు మూడోకన్ను తెరిస్తే అంతా భస్మమే అంటారు.  పార్వతీ కల్యాణం విషయంలో మన్మథుడు చేసిన పనికి కోపించిన శివుడు మూడోకన్ను తెరుస్తాడు. క్షణంలో బూడిద కుప్పగా మారిపోతాడు మన్మథుడు. ఇంతటి శక్తి మూడోనేత్రానికి ఉంది. ఇక్కడ కాలిపోయింది మన్మథుడనే వ్యక్తి కాదు తీవ్రమైన కామం అనే అరిషడ్వర్గంలోని ఓ శత్రువు. ఎప్పుడైతే మనలోని అజ్ఞానం దహనమవుతుందో అప్పుడు మిగిలేది జ్ఞానమే. అటువంటి జ్ఞాననేత్రాలకు మాత్రమే పరమేశ్వరుడి దర్శనం పొందే యోగ్యత కలుగుతుంది.

 నందివాహనం

          శివయ్య వాహనం నంది. కేవలం వాహనం మాత్రమే కాదు... భక్తులకు శివయ్యకు మధ్య వారిధి కూడా బసవయ్యే. ఆలయానికి వచ్చిన భక్తులు నంది కొమ్ముల ద్వారా శివలింగ దర్శనం చేసుకుంటారు.

          నంది ధర్మానికి ప్రతీక. శివుడు ఎక్కడ కొలువుంటాడే అక్కడ నంది ఉంటాడు. నంది లేని శివాలయం ఉండదు. అంటే శివుడు ఎక్కడ ఉంటాడో అక్కడ ధర్మం కొలువై ఉంటుందని అర్థం.

          నంది పశుజాతికి చెందింది. పశువు అంటే పాశంతో కట్టబడిందని అర్థం. మనమందరూ పశువులమే. వివిధ రకాలైన పాశాలతో కట్టబడి ఉంటాం. ఈ పాశాలన్నీ తొలగిపోతేనే పరమేశ్వర సాక్షాత్కారం కలుగుతుంది. ఇది జరగాలంటే నంది మాదిరిగా నిరంతరం శివసాన్నిధ్యంలో గడపాలి. అంటే తనువు, మనసు శివమయం కావాలి. నంది అందించే సందేశం ఇదే.

(శ్రీశైలప్రభ మాసపత్రిక మార్చి 2021 సంచికలో ప్రచురితమైన వ్యాసం)

--------------------------

రచన : డాక్టర్ కప్పగంతు రామకృష్ణ, సెల్ నంబరు : 90320 44115 / 8897 547 548

--------------------------











పున్నమి కాంతుల కల్యాణం (ఒంటిమిట్టలో జరిగే శ్రీ సీతారామ కల్యాణం నేపథ్యంగా శ్రీకనకదుర్గ ప్రభ పత్రికలో రాసిన వ్యాసం)

  పున్నమి కాంతుల కల్యాణం                లోకంలో పెళ్ళి ముచ్చట అంటే సీతారాములదే. అందులోనూ ఒంటిమిట్ట ఆలయంలో జరిగే సీతారాముల కల్యాణం మరింత శ...