Thursday, July 30, 2020

వరలక్ష్మీవ్రత విశేషాలతో ఈనాడు దినపత్రిక మకరందం పేజీ (30.07.2020)లో నేను రాసిన వ్యాసం




శ్రీమంతులవ్వండి. ...

ఆమె ఐశ్వర్యానికి ప్రతీక.


లక్ష్మి అంటే మనం రోజువారీ వ్యవహారంలో ఉపయోగించే డబ్బు మాత్రమే కాదు. ఆనందం, ఆత్మసంతృప్తి, చక్కటి సంతానం, సంస్కారం,  చదువు... ఇవన్నీ లక్ష్మీరూపాలే. ఆ తల్లి అనుక్షణం కొలువుండే ప్రాంతాలే. మనిషి జీవితం సాఫీగా గడవాలన్నా, జీవించామన్న సంతృప్తి కలగాలన్నా, తలపెట్టిన పని విజయవంతం కావాలన్నా అందుకు లక్ష్మీ అనుగ్రహం తప్పనిసరి. అందుకే చెట్టు పుట్టా, రాయి రప్పా అన్నిటిలోనూ లక్ష్మీదేవిని చూశారు మన పూర్వికులు. అపారమైన ప్రకృతి అంతా లక్ష్మీ స్వరూపమే. 
కేవలం డబ్బు మాత్రమే అన్ని సుఖాలు ఇవ్వలేదు. అన్ని పనులూ సాధించలేదు. ధనం లేకపోయినా నిండు నూరేళ్లు తృప్తిగా జీవించే వ్యక్తులు ఎందరో ఉన్నారు. నిజమైన ఆనంద లక్ష్మి వారి దగ్గర ఉంది. కోట్లు గడించిన బిక్కు బిక్కుమంటూ ప్రతి క్షణాన్ని భయంభయంగా గడిపేవారూ ఉన్నారు. ధైర్యలక్ష్మి వారి దగ్గర లేదు. అందుకే లక్ష్మిని ఆరాధించాలి. ఆ తల్లి అనుగ్రహం కోసం తపించాలి. ఆమెను ఆహ్వానించాలి. 
తనను కావాలని కోరుకునే వ్యక్తుల దగ్గర, శుచి శుభ్రత ఉన్నచోట మాత్రమే తాను ఉంటానని స్వయంగా లక్ష్మీదేవి చెప్పినట్లు శాస్త్రాలు ప్రకటిస్తున్నాయి. మర్యాద, మన్నన, ఆచారం, సంప్రదాయం... ఇవంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అందుకే మనవైన ఆచార సంప్రదాయాల్ని, శాస్త్రం చెప్పిన ధర్మాల్ని తప్పక పాటించాలి. అటువంటి చోట లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. 
మన ఇళ్లలో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే ఏం చెయ్యాలో శాస్త్రాలు కొన్ని విషయాలు వివరించాయి. అవేమిటంటే... 
సింహ ద్వారం గడప దగ్గర చెప్పులు చిందర వందరగా పదేయకూడదు. గడప లక్ష్మి స్వరూపం కనుక గడప తొక్కి ఇంట్లోకి రావడం, గడప మీద కాలు వేయడం, గడపకు అటు ఇటు చెరో కాలు వేసి నుంచోవడం వంటి పనులు చేయరాదు. పసుపు, కుంకుమ ఉన్న గడపలు లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతాయి. అందువల్ల నిత్యం గడపలను పసుపు, కుంకుమతో అలంకరించాలి.
ముగ్గు వేసిన వాకిలి గుండా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అందుకే తెల్లవారు జామునే వాకిలి ఊడ్చి ముగ్గులు పెట్టాలి. అందమైన ముగ్గు, శుభ్రమైన వాకిలి లక్ష్మికి స్వాగతం పలుకుతాయి.
ఇంటి ఇల్లాలు గట్టిగ గొంతు పెట్టి మాట్లాడడం, నట్టింట్లో చెడు మాటలు, చెడు తిట్లు తిట్టడం వంటివి చేయకూడదు. ఎక్కడైతే భార్య భర్తలు నిరంతరం తగవులాడుకుంటారో, ఏ ఇంట్లో ఇల్లాలు ఎప్పుడూ అసంతృప్తి గా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మి దేవి ప్రవెశించదు. 
అబద్ధాలు చెప్పేవాళ్ళు, ఇరు సంధ్యలలో భుజించేవారు, నిద్రించే వారు, బద్ధకస్తులు ఎక్కడ ఉంటారో అక్కడ లక్ష్మి దేవి ఉండదు.
ఉదయం, సాయంత్రం సంధ్యల్లో తప్పనిసరిగా దీపం వెలిగించాలి. ఇంట్లోని దేవతామందిరంలో, ప్రధాన ద్వారం వద్ద తప్పనిసరిగా సంధ్యదీపం పెట్టాలి. ఇలాంటి ఇళ్లలో లక్ష్మి శాశ్వతంగా నివాసం ఉంటుంది.
అతిగా మాట్లాడే వారు, గురువులను, పెద్దలను అగౌరవ పరిచేవారు, జూదరులు, అతి నిద్రాలోలురు, అపరిశుభ్రంగా ఉండే వారు ఉన్న చోట లక్ష్మిదేవి ఉండదు. 
చిల్లర పైసలు, అన్నం, పువ్వులను నిర్లక్ష్యంగా పడేసేవారి దగ్గర లక్ష్మి చేరదు.
శంఖధ్వని వినిపించని చోట,  తులసిని పూజించని చోట,  దేవతలను అర్చించని చోట,  బ్రహ్మవేత్తలు , అతిథులకు భోజన సత్కారాలు జరగని చోట లక్ష్మీదేవి నివసించదు.  
భక్తులను హింసించేవారు, నిందించేవారు ఉన్నచోట కూడా లక్ష్మీదేవి నివాసం ఉండదు. 

లక్ష్మీ నివాస స్థానాలు


మహాలక్ష్మి నివసించే స్థానాలు మొత్తం 96 అని శాస్త్రాలు చెబుతున్నాయి. వీటిలో ముఖ్యమైనవి... పసుపు, కుంకుమ, బంగారం, రత్నాలు, ఆభరణాలు, ముత్యాలు, శుభ్రమైన తెల్లని వస్త్రాలు, వెండి, రాగి, ఇత్తడి కళశాలు, ఆవు పేడ, ఆవు పృష్ట స్థానం, ఆవు కొమ్ముల మధ్యన, పూజా మందిరం, పవిత్రమైన మనస్సు, దర్భలు, మహానుభావులు, యోగులు, మునులు, ఋషులు, ఉత్తమమైన రాజు, సదాచార బ్రాహ్మణుడు .

శ్రీసూక్తంలో లక్ష్మీదేవి నివాస స్థానాలేమిటో వివరించే మంత్రాలు ఉన్నాయి. వీటిలోని 16వ మంత్రం... ‘యః శుచిః ప్రయతో భూత్వా జుహుయాదాజ్యమన్వహం శ్రియః పంచదశశ్చంచ శ్రీకామస్సతతం జపేత్‌...’ లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే శుభ్రత పాటిస్తూ, ఆ దేవి 15 మంత్రాలను నిత్యం పారాయణం చెయ్యాలని ఈ మంత్రానికి  భావం. ఎక్కడ శుచిత్వం ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని ఈ మంత్రం ద్వారా తెలుస్తోంది. లక్ష్మి అంటే లౌకిక వ్యవహారాల్లో ఉపయోగించే ధనం మాత్రమే కాదు. ఆరోగ్యం కూడా ధనమే. అందుకే మన పెద్దలు ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నారు.   

విశ్వమంతా లక్ష్మీ స్వరూపం

ప్రతి స్త్రీలోనూ లక్ష్మీకళ ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకనే స్త్రీలను లక్ష్మీస్వరూపంగా ఆరాధించటం, అర్చించటం మన సంప్రదాయంలో ఒక భాగంగా ఉంటుంది. ఏ పనికైనా మహిళే ఆదిశక్తి. ఆమెదే ఉన్నతస్థానం. అందరి మాటలు ఓర్పుగా వింటుంది. ఇతరులతో పనులు చేయిస్తుంది. తాను స్వయంగా చేస్తుంది. గుణాల చేత వ్యాపిస్తుంది. దోషాలు తొలగిస్తుంది. అందుకే స్త్రీ రూపంలో లక్ష్మికి మన సంస్కృతి సమున్నత స్థానాన్ని ఇచ్చింది. అనంతవిశ్వాన్ని 'లక్షించేది' లక్ష్మి. అందరూ లక్షించేది లక్ష్మిని. 'లక్షించటం' అంటే చూడటమని అర్థం అందరినీ తన కరుణామృతపూర్ణమైన చల్లని చూపులతో 'కనిపెట్టుకుని', గమనించి, పాలించే శక్తిని లక్ష్మిగా చెప్పుకోవచ్చు. సర్వసాక్షియైన ఈ భగవద్దర్శన శక్తిని లక్ష్మిగా ఉపాసించటం లక్ష్మీ ఆరాధనలోని ప్రత్యేకత. అందరూ ఆనందాన్నీ, ఐశ్వర్యాన్నీ, జ్ఞానాన్ని, 'లక్ష్యం'గా పెట్టుకొనే జీవిస్తారు. ఇలా అందరికీ లక్ష్యమైన జ్ఞాన ఆనంద, ఐశ్వర్యాల సాకార రూపమే 'లక్ష్మి’.  

కోర్కెలు తీర్చే వరలక్ష్మి

ప్రతి వ్యక్తికీ అనేక కోరికలు ఉంటాయి. ఇవన్నీ తీరాలన్నా లేదా కనీసం ఒక్క కోరిక తీరాలన్నా దైవానుగ్రహం తప్పనిసరి. అయితే కోరిక ఏదైనప్పటికీ, ఇచ్చే దైవం ఎవరైనప్పటికీ అంతిమంగా ఆ కోరికల్లో ఉండేది లేదా ఆ కోరికల ద్వారా అందుకునేది ఆనందం, తృప్తి మాత్రమే. ఈ విధమైన సంతృప్తి పొందిన వ్యక్తి మాత్రమే నిజమైన భాగ్యవంతుడు. అటువంటి భాగ్యాన్ని (లక్ష్మిని) అందించేది వరలక్ష్మీదేవి. వరాల రూపంలో సౌభాగ్యాన్ని భక్తులకు అనుగ్రహించే మాత 'వరలక్ష్మీదేవి. 'వర' అంటే 'కోరుకున్నది’, ‘శ్రేష్టమైన' అనే అర్థాలు ఉన్నాయి. ఈ అర్థాలను అన్వయం చేస్తే కోరిన కోర్కెలు లేదా శ్రేష్టమైన కోర్కెలు ఇచ్చే తల్లిగా వరలక్ష్మీదేవిని భావించవచ్చు. ఈ దేవిని సమంత్రకంగా, భక్తి భావనతో కొలిచే వ్రతమే 'వరలక్ష్మీవ్రతం

స్కాంద పురాణంలో వరలక్ష్మీ వ్రతం గురించిన వివరణ ఉంది. స్వయంగా పరమేశ్వరుడే పార్వతికి ఈ వ్రతం గురించి చెబుతాడు. అదే సందర్భంలో మహాభక్తురాలైన చారుమతీదేవి వృత్తాంతాన్ని కూడా పరమేశ్వరుడు పార్వతికి వివరిస్తాడు. భర్త పట్ల ఆదరాన్నీ, అత్తమామల పట్ల గౌరవాన్ని ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉండేది. మహాలక్ష్మీదేవి పట్ల ఎంతో భక్తిశ్రద్ధలతో కలిగిన చారుమతి అమ్మవారిని త్రికరణ శుద్ధిగా పూజిస్తుండేది. ఆ మహాపతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి, స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరిస్తుంది. శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజున తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని ఆమెకు అభయమిస్తుంది. అమ్మ ఆదేశానుసారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించిన చారుమతి సమస్త సిరి సంపదల్ని వరలక్ష్మీ వ్రత ప్రసాదంగా అందుకుంటుంది. 

అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి, ఈ వ్రతానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ ప్రాంతాన్ని శ్రావణమాసంలో ఆచరిస్తారు. శ్రావణమాసంలో శ్రవణ నక్షత్రం రోజున పూర్ణిమ వస్తుంది. శ్రవణం శ్రీనివాసుడి జన్మ నక్షత్రం. పూర్ణిమ రోజున అమ్మవారు షోడశకళలతో వెలుగొందుతుంది. శుక్రవారం అమ్మకు ప్రీతిపాత్రమైన వారం. వీటన్నిటినీ సమన్వయం చేస్తే పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం చెయ్యటం లక్ష్మీ శ్రీనివాసుల అనుగ్రహం పొందటానికి తొలిసోపానంగా చెప్పుకోవచ్చు. సకల సౌభాగ్యాలు కలగాలని, నిత్య సుమంగళిగా తాము జీవితకాలం ఉండాలని కోరుకుంటా దేశవ్యాప్తంగా మహిళలు ఈ వ్రతాన్ని చేస్తారు దేశ, కాల, ప్రాంత, ఆచారభేదాలు ఉన్నప్పటికీ అందరి అంతరంగంలో కొలువై ఉన్న మాత ఒక్కరే. ఆమె అందరినీ అనుగ్రహించే తీరు ఒక్కటే.

పంచభూతాలకు ప్రతీక


వరలక్ష్మీ వ్రతంలో భాగంగా కలశాన్ని స్థాపించి పూజించాలి. కలశం అమ్మవారికి ప్రతిరూపం. మట్టిపాత్ర లేదా శక్తిని బట్టి వెండి, బంగారు, రాగి, పంచలోహపాత్రలను కలశం కోసం ఉపయోగించవవచ్చు. కలశం కోసం ఉపయోగించేది ఏ లోహమైనా అది పృథ్వీ తత్త్వానికి సంకేతం అందులో పోసే నీరు జల తత్త్వానికి సంకేతం. కలశాన్ని సగం మాత్రమే నీటితో నింపుతారు. మిగిలిన శూన్యస్థితి ఆకాశతత్త్వానికి సంకేతం. మనం చదివే మంత్రం వాయుజనితం. కనుక అది వాయుతత్త్వానికి సంకేతంగా ఉంటుంది. కలశం ముందు ఉంచే దీపం అగ్ని తత్త్వానికి సంకేతం. ఈవిధంగా పంచభూతాలకు ప్రతీకగా ఆయా వస్తువులను ఉంచి పంచభూతాల్లోనూ వ్యాపించి ఉండే పరతత్త్వం, శక్తి స్వరూపమైన అమ్మను ఆరాధించటం కలశారాధనలోని అంతరార్థం.








Thursday, July 23, 2020

నాగుల గురించిన విశేషాలతో డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr Kappagantu Ramakrishna) ఈనాడు దినపత్రిక మకరందం పేజీలో (23.07.2020) రాసిన వ్యాసం



భజేహం... భుజంగం 

శ్రీమహావిష్ణువును శేషశయనుడిని చేసింది సర్పాలే. 
గరళకంఠుడిగా శివయ్యకు పేరుతెచ్చిందీ సర్పాలే. 
సూర్యభగవానుడి రథానికి సర్పాలే పగ్గాలు.
బొజ్జ గణపయ్యకు యజ్ఞోపవీతంగా మారిన ఘనత సర్పాలదే. 
కుజగ్రహానికి సర్పాలే కుదురులు. 
శనిదేవుడికి సర్పమే ఆయుధం. 
క్షీరసాగర మథనంలో మందరపర్వతాన్ని చిలికే తాడుగా మారి అమృతావిర్భావానికి కారణమైందీ సర్పాలే. 
మొత్తంగా సర్పాలు భారతీయ సంస్కృతిలో ఒక భాగం. చాలా కుటుంబాల్లో సర్పాలను కులదేవతలుగా ఆరాధించే ఆచారం ఉంటుంది. పురాణాలు, ఇతిహాసాల్లో కూడా నాగుల వైశిష్ట్యం విస్తారంగా వర్ణితమై ఉంది. భారత, భాగవతాలు సర్పాలకు సంబంధించిన విషయాలతోనే ప్రారంభమవుతాయి. ఎన్నో పండుగలు, మరెన్నో ఆచారాలు, సంప్రదాయాలు కూడా సర్పాలకు సంబంధించిన విషయాలతోనే ఏర్పడ్డాయి.
    వేదసంహితల్లో అనేకచోట్ల నాగులకు సంబంధించిన ప్రస్తావన ఉంది. 'నమో అస్తు సర్పేభ్య: యేకేచ పృథివీ మను | యే అంతరిక్షే యే దివితేభ్యః సర్పేభ్యః నమ:' (కృష్ణయజుర్వేదం, 42) - భూమి నుంచి ఆకాశం వరకు గల అన్ని లోకాల్లో వ్యాపించి ఉన్న నాగులన్నిటికీ నమస్కారం అంటుంది వేదం. మనం సాధారణంగా భూమి మీద పాకే పాముల్ని మాత్రమే చూస్తాం. కానీ ఆకాశంలో, గాలిలో సంచరించే సర్పాలు కూడా ఉన్నాయంటూ, వాటి గురించి వేదాలు ప్రస్తావన చేస్తాయి. ప్రత్యేకించి, యజుర్వేదంలో అనేక మంత్రాలు, 'సర్పసూక్తం' పేరుతో ప్రత్యేకంగా నాగులకు సంబంధించిన మంత్రాలు కూడా ఉన్నాయి. వేదాలతో పాటు పురాణ ఇతిహాసాల్లో నాగులకు సంబంధించిన కథలు విస్తారంగా ఉన్నాయి. వీటిలో కశ్యప ప్రజాపతి భార్యలైన వినత, కద్రువలకు సంబంధించిన కథ బాగా ప్రసిద్ధి పొందింది.

మహాభారత గాథ

    పాములకు ప్రాణదానం చేసిన ఆస్తికుడి కథ భారతంలో ప్రసిద్ధి పొందిన ఉపాఖ్యానాల్లో ఒకటి. ఇతడు జరత్కారి అనే నాగజాతి స్త్రీకి జన్మించాడు. జనకుడి పేరు జరత్కారుడు. చిన్నతనంలోనే సకల విద్యలూ నేర్చుకున్న ఆస్తీకుడు గొప్ప జ్ఞాని అవుతాడు. శాపం కారణంగా పరీక్షిన్మహారాజు పాముకాటుతో మరణిస్తాడు. ఇందుకు ఆగ్రహించిన అతడి పుత్రుడు జనమేజేయుడు సర్పజాతి మొత్తం నాశనం కావాలనే సంకల్పంతో సర్పయాగం ప్రారంభిస్తాడు. మంత్రబలం వల్ల ఎక్కడెక్కడో ఉన్న పాములన్నీ యాగాగ్నిలో పడి దగ్ధం అవుతుంటాయి. తన ప్రాణాలు కాపాడమంటూ సర్పరాజైన తక్షకుడు ఇంద్రుడిని ఆశ్రయిస్తాడు. విషయాన్ని గ్రహించిన జనమేజయుడు 'స మహేంద్ర తక్షకాయ స్వాహా' అంటూ మంత్రం పఠించే సరికి దేవేంద్రుడి పీఠమే కదలి యాగస్థలికి వస్తుంది. దీంతో దేవేంద్రుడు కూడా భీతి చెందుతాడు. మరోపక్క నాగజాతి నాశనం కావటాన్ని తట్టుకోలేని మిగిలిన నాగజాతి ప్రముఖులు జనమేజయుడు యాగాన్ని ఆపించటానికి ఆస్తికుడు మాత్రమే సమర్థుడని, అతడిని పంపించవలసిందిగా తండ్రి జరత్కారుడిని కోరతారు. తండ్రి అజ్ఞ ప్రకారం ఆస్తీకుడు జనమేజేయుడి యాగస్థలికి వెళ్లి, తన నేర్పరితనం, విద్యతో జనమేజయుడు మెప్పించి, యాగాన్ని నిలుపుదల చేయిస్తాడు. ఆస్తీకుడు వైదుష్యానికి మెచ్చిన జనమేజేయుడు అతడిని సత్కరించటానికి సిద్ధపడతాడు. 'సర్పహింస మంచిది కాదు. నీవు ఈ యాగం మాని, వాటిని రక్షిస్తే చాలు. అదే నాకు పెద్ద సత్కారం' అంటాడు ఆస్తీకుడు. జనమేజేయుడు అందుకు అంగీకరించి, సర్పయాగాన్ని విరమిస్తాడు.

    శ్రావణమాసంలో వచ్చే శుక్ల పంచమిని నాగపంచమిగా జరుపుకోవటం ఆనవాయితీ.  నాగపంచమి పూజావిధానంలో పంచమికి ముందురోజు నుంచే అంటే చవితి నుంచే పంచమి పూజకు సంబంధించిన  పూజా విధానాలు ప్రారంభించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. స్కంద పురాణంలో ఇందుకు సంబంధించిన విషయాలు విస్తారంగా ఉన్నాయి. పార్వతీదేవికి సాక్షాత్తు పరమేశ్వరుడు నాగపంచమి వైశిష్ట్యాన్ని వివరించినట్లు ఇందులో ఉంది. ఆదిశేషుడు తనకు చేసిన సేవకు మెచ్చిన శ్రీమహావిష్ణువు అతడిని ఏదైనా వరం కోరుకొమ్మని అడిగితే, తాము (సర్పజాతి) ఆవిర్భవించిన రోజున సృష్టిలోని మానవులంతా తమకు పూజ చేసేలా అనుగ్రహించమని అడిగాడు. విష్ణుమూర్తి అనుగ్రహించాడు. ఈ వరం కారణంగా శ్రావణ శుద్ధ పంచమిని నాగపంచమిగా జరుపుకునే ఆచారం వ్యాప్తిలోకి వచ్చింది.
    వర్షాకాలంలో పాములు పుట్టల్లోంచి బయటకు వచ్చి, సంచరిస్తాయి. ఈ సమయంలో పాములు పంటల్ని నాశనం చేసే క్రిమికీటకాల్ని తింటూ రైతుకు పంటనష్టం కలగకుండా పరోక్షంగా సహాయం చేస్తాయి. పుట్టవల్ల భూమిలో తేమ పెరుగుతుంది. పంటలకు ఇది ఎంతో అవసరం. పంట పొలాలకు శత్రువులు ఎలుకలు. వాటిని నిర్మూలించేవి పాములు. ఏదైనా కారణం వల్ల క్రమంగా పాముల మనుగడ కనుమరుగైతే, మానవాళి మనుగడకే ప్రమాదం. ఈవిధంగా పంటలకు మూలం పాములు కాబట్టి రైతులు వాటిని దేవతలుగా భావిస్తారు. పంటలు బాగా పండే శ్రావణమాసంలో నాగులను పూజించే ఆచారం ఏర్పడటానికి ఇదొక కారణం కావచ్చు.
నాగపంచమి రోజున గరుడ పంచమి జరుపుకునే ఆచారం కూడా వ్యాప్తిలో ఉంది. తన తల్లిని (వినత) దాస్యం నుంచి విముక్తిరాలిని చెయ్యటం కోసం గరుత్మంతుడు స్వర్గంలో ఉన్న అమృతాన్ని తెచ్చి పినతల్లి కద్రువ కుమారులైన సర్పాలకు ఇస్తాడు. అమృతాన్ని సాధించటం కోసం గరుత్మంతుడు చేసిన భీకరమైన పోరాటానికి, అతని మాతృభక్తికి చిహ్నంగా అతడు అమృతాన్ని తెచ్చిన శ్రావణ శుద్ధ పంచమి గరుడ పంచమి జరుపుకునే ఆచారం ఏర్పడింది

నాగులకు పాలెందుకు?

పాలు స్వచ్ఛతకు ప్రతీక. పాలను వేడిచేసి, చల్లబరిచి, దానికి కొద్దిగా మజ్జిగ చేరిస్తే పెరుగు అవుతుంది. పెరుగును చిలకగా వచ్చిన మజ్జిగ నుంచి వచ్చే వెన్నను కాస్తే నెయ్యి తయారవుతుంది. ఇలా వచ్చిన నేతిని మనం యజ్ఞంలో హవిస్సుగా ఉపయోగిస్తాం. అదేవిధంగా, మన బతుకనే పాలను, జ్ఞానం అనే వేడితో కాచి, వివేకం అనే మజ్జిగ కలిపితే, సుఖం అనే పెరుగు తయారవుతుంది. ఈ పెరును ఔదార్యం అనే కవ్వంతో చిలికితే శాంతి అనే మజ్జిగ లభిస్తుంది ఈ మజ్జిగను సత్యం, శివం, సుందరం - అనే మూడు వేళ్లతో కాస్త మంచి తీస్తే సమాజ సహకారం అనే వెన్న బయటకు వస్తుంది. ఆ వెన్నకు భగవంతుని ఆరాధన అనే జ్ఞానాన్ని జోడిస్తే త్యాగం, యోగం, భోగం అనే మూడు రకాల నెయ్యి ఆవిర్భవిస్తుంది. ఇదే సకల వేదాల సారం. సకల జీవన సారమైన పాలను జీవనానికి ప్రతీక అయిన నాగులకు అర్పించటంలోని అంతరార్థం.

యోగశాస్త్రంలో సర్పారాధన

యోగశాస్త్రంలో మనిషి శరీరాన్ని పాముపుట్టతో పోలుస్తారు. ఈ పుట్టకు తొమ్మిది కలుగులు (రంధ్రాలు) ఉంటాయి. వీటినే నవరధ్రాలు అంటారు. ఈ నవరంధ్రాల శరీరం అనే పుట్టలో కామ, క్రోధ, లోభ, మోహ మద, మాత్సర్యాలనే సర్పాలు బుసలు కొడుతూ ఉంటాయి. అరిషడ్వర్గాలనే ఈ సర్పాల కారణంగా మనిషిలో విపరీత ప్రవర్తనలు ఏర్పడతాయి. వీటిని అణచటానికి యోగ సాధన చెయ్యాలి. ఈ సాధన మనిషిలో ఉండే షట్చక్రాల్లో మొదటిదైన మూలాధార చక్రం నుంచి ప్రారంభమవుతుంది. మూలాధార చక్రం వెన్నుపూస ప్రారంభంలో ఉంటుంది. ఈ చక్రం వద్ద కుండలినీ శక్తి సర్పాకారంలో ఉంటుంది. అందువల్లనే వెన్నుపూసను వెన్నుపాము అంటారు. యోగపరిభాషలో వెన్నుపూసను సుషుమ్న నాడి అంటారు. ఈ నాడిని అనుసరించి ఇడ, పింగళ అనే నాడులు ఉంటాయి. మూలాధారం నుంచి భ్రూమధ్యం వరకు ఇవి వ్యాపించి ఉంటాయి. మూలాధారం వద్ద సుషుమ్న నాడి మూడు చుట్టలు చుట్టుకుని, పైన పడగ కప్పుకుని ఉన్న పాము వలే ఉంటుంది. ఇదే కుండలినీ శక్తికి స్థానం. యోగసాధన ద్వారా కుండలినీశక్తిని జాగృతం చెయ్యటం ద్వారా ఉపాసన ప్రారంభమవుతుంది. కుండలినీశక్తి చైతన్యవంతం అయితే మిగిలిన చక్రాలు కూడా ఉత్తేజితమయ్యేందుకు మార్గం సుగమం అవుతుంది. తద్వారా మనిషి యోగసాధనలో పూర్ణత్వాన్ని సాధించటం సాధ్యమవుతుంది. ఇదంతా జరగాలంటే యోగసాధన ద్వారా సర్పరూపంలో ఉన్న కుండలినీ శక్తిని జాగృతం చెయ్యాలి. నాగపంచమి ద్వారా సర్పారాధన చెయ్యడం ఈ శక్తిని జాగృతం చెయ్యటం కోసమే.
    ఆశ్లేష, అర్ద్ర, మూల, పూర్వాభాద్ర, పూర్వాషాఢ నక్షత్రాలను సర్పనక్షత్రాలు అంటారు. సర్పం అనగా కదిలేది, పాకేది అనే అర్థాలు ఉన్నాయి. నాగము - 'న', 'ఆగ’ - అంటే ఎప్పుడూ కదులుతూ ఉండేది అని అర్థం. క్షణం కూడా ఆగకుండా అతివేగంగా వెళ్లేదాన్ని నాగము అంటారు. అన్నింటికంటే వేగంగా వెళ్లేది కాలం కాబట్టి నాగమునకు మరో అర్థం కాలం. అందుకే కాలాన్ని నాగులతో పోలుస్తూ కాలనాగము లేదా కాలనాగు అంటారు.
    సర్పం హృదయభాగంతో పాకుతుంది. ఈ భాగాన్ని ఉర అంటారు. 'ఉరతో ఎప్పుడూ కదులుతుంది కాబట్టి సర్పానికి ఉరగము అనే పేరు ఏర్పడింది. మనిషి కూడా ఎప్పుడూ చలిస్తూ ఉంటాడు. మానవ జీవితరం నిరంతర ప్రక్రియ. కాబట్టి, మనిషి కూడా 'నాగము' అవుతాడు. అలాగే  మనిషి నడవడికకు నడకకు హృదయస్థానం ప్రధానం. తన మనస్సు చెప్పినట్లే మనిషి నడుస్తాడు. అంటే, మనిషి కూడా ఉరము (హృదయం)తో సంచరించే సర్పంతో సమానం. 

నాగులు, సర్పాలు వేర్వేరు

భగవద్గీతలో (10వ అధ్యాయం, విభూతి యోగం) శ్రీకృష్ణపరమాత్మ ‘నేను ఆయుధాల్లో వజ్రాన్ని, గోవుల్లో కామధేనువుని, సర్పాల్లో వాసుకిని, నాగుల్లో అనంతుడిని అంటాడు. దీనిప్రకారం సర్పాలు, నాగులు వేర్వేరని తెలుసుకోవాలి. 
    వాసుకి శివుడిని ఆశ్రయించి ఆయనకు అలంకారంగా ఉంటుంది. ఈ వాసుకినే తాడు గా చేసుకుని సాగర మధనం చేశారు దేవదానవులు. అనంతుడు అంటే ఆదిశేషుడు. కద్రువకు పెద్ద కొడుకు. బ్రహ్మ అనంతుడి బలాన్ని చూసి భూభారాన్ని మోయమని చెబుతాడు. పురాణాల ప్రకారం అనంతుడు అదృశ్యంగా ఈ భూతలాన్ని మోస్తూ ఉంటాడు. వాసుకి, అనంతుడు ఇద్దరూ కశ్యప ప్రజాపతి భార్య అయిన కద్రువ కుమారులు. పురాణాల ప్రకారం సర్పాలు, నాగులు సోదర సమానులైనా రెండింటికీ చాలా తేడా ఉంది. నాగులకు కేవలం గాలిని మాత్రమే ఆహారంగా స్వీకరించి బతికే శక్తి ఉంది. వీటికి కామరూపశక్తి ఉంది. ఏ రూపం కావాలనుకుంటే ఆ రూపాన్ని ధరించగలవు. వీటినే దేవతా సర్పాలు అంటారు. నాగుల్లో అనంతుడు, వాసుకి, తక్షకుడు, కర్కోటకుడు, పద్ముడు, మహాపద్ముడు, శంఖపాలుడు, కులికుడు అనే జాతులు ఉన్నాయి. దేవతాసర్పాలు ఎక్కడ ఉంటే అక్కడ మల్లెపూలవాసన వస్తుంది. కానీ ఇవి మనుషులు తిరిగే ప్రాంతాల్లో సంచరించవు. మానవజాడలకు దూరంగా ఉంటాయి. సర్పాలు నాగులకు భిన్నంగా ఉంటాయి. ఇవి భూమ్మీదే తిరుగుతాయి. కప్పలు మొదలైన జీవాల్ని ఆహారంగా స్వీకరిస్తాయి. వీటిలో తొమ్మిది ఉపజాతులు ఉన్నాయి.

అష్టనాగులు

కశ్యప ప్రజాపతి భార్య అయిన కద్రువకు జన్మించిన వారే నాగులు. వీరు మొత్తం వెయ్యిమంది కాగా అందులో గొప్పవీరులైన ఎనిమిది మంది అష్టనాగులుగా ప్రసిద్ధి పొందారు. వారు... వాసుకి, అనంతుడు, తక్షకుడు, శంఖపాలుడు, కుశికుడు, పద్ముడు, మహాపద్ముడు, కర్కోటకుడు . 
నాగ వీరులు
వాసుకి: నాగలోకానికి రాజు. ఇతని శిరస్సు మీద నాగమణి ప్రకాశిస్తుంటుంది. బెంగాలీయులు పూజించే మానసాదేవి ఇతని సోదరి. పరమశివుడికి కంఠానికి అలంకారంగా ప్రకాశిస్తుంటాడు.  నాగులలో తాను వాసుకిని అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. ప్రతి ఋతువులో సూర్యునికి తోడుగా అతని రథములో ఇద్దరు ఆదిత్యులు, ఇద్దరు ఋషులు, ఇద్దరు గంధర్వులు, ఇద్దరు అప్సరసలు, ఇద్దరు రాక్షసులు, ఇద్దరు నాగులు ప్రయాణం చేస్తారు. చైత్రమాసంలో ఈ రథంలో వాసుకి ఉంటాడు. 

కాళియుడు: ద్వాపర యుగంలో బృందావనంలోని యమునా నదిలో నివసించిన విష నాగరాజు ఇతడు. అతని చుట్టూ ఉన్న యమునా నది నీరు వేడిగా, విషంతో బుడగలుగా ఉండేది. ఏ పక్షిగాని, జంతువుగాని దాని దగ్గరకు వెళ్ళలేకపోయేది. నది ఒడ్డున ఒకే ఒక కదంబ చెట్టు మాత్రమే పెరిగింది. గరుత్మంతుడికి భయపడిన కాళియుడు యమునా నదిలో తలదాచుకుంటాడు. విష్ణమూర్తి కృష్ణావతారంలో ఇతడి శిరస్సు మీద ఎక్కి నాట్యం చేసి అతడి గర్వాన్ని అణచివేస్తాడు. 

తక్షకుడు: ఇతడు అష్టనాగుల్లో ఒకడిగా ప్రసిద్ధి పొందాడు. పైలుడనే మహర్షి శిష్యుడు ఉదంకుడు. అతడు గురుపత్ని కోరిక మీదట మహిమాన్విత కుండలాలు తీసుకొని వెళుతుండగా వాటిని తక్షకుడు అపహరించాడు. దీంతో ఉదంకుడు తక్షకుడితో సహా మొత్తం నాగజాతి మీద పగ పెంచుకుంటాడు.  జనమేజయుని వద్దకు వెళ్ళి సర్పయాగం చేయమని ప్రోత్సహిస్తాడు. జనమేజయుని తండ్రి పరీక్షిత్తు తక్షకుని విషాగ్నికి బలి అయిన సంగతి గుర్తు చేస్తాడు. . జరిగిన వృత్తాంతం సాక్ష్యాలతో సహా తెలుసుకొన్న జనమేజయుడు సర్పయాగం ప్రారంభిస్తాడు. ప్రాణభయంతో తక్షకుడు ఇంద్రుడిని ఆశ్రయిస్తాడు. వేదపండితుల మంత్రశక్తికి ఇంద్రుడు సింహాసనంతో సహా కదలివస్తాడు. చివరకు అస్తీకుడి జోక్యంతో సర్పయాగాన్ని విరమిస్తాడు జనమేజేయుడు. దీంతో తక్షకుడు ప్రాణాలతో బయటపడతాడు.

Thursday, June 25, 2020

వారాహీ దేవి ఎవరు? వారాహీ నవరాత్రులు ఎప్పుడు చెయ్యాలి? వారాహీ దేవి ఆలయాలు ఎక్కడ ఉన్నాయి? వారాహీదేవి అందించే సందేశం ఏమిటి?

వారాహీ దేవి ఎవరు? వారాహీ నవరాత్రులు ఎప్పుడు చెయ్యాలి? 

వారాహీ దేవి ఆలయాలు ఎక్కడ ఉన్నాయి? వారాహీదేవి అందించే సందేశం ఏమిటి?

వారాహీ దేవి

 పర్వపంచక విభ్రాజత్కిరిచక్ర రథస్థితాం
లలితా వామపార్శ్వస్థాం వారాహీం దణ్ణనాయికామ్
హలాయుధ ధరాం దేవీం కోలాస్యాం శత్రుమర్దినీం
నమామి దేవీం వార్తాళీం భక్తరక్షణ తత్పరామ్  

    చరాచర సృష్టి అంతా శక్తి ప్రధానంగా సాగుతుంది. కోటానుకోట్ల జీవరాశుల్లో ఉండే జీవరూప శక్తి చైతన్యమే  సృష్టి నిరాటంకంగా సాగటానికి ఆధారంగా నిలుస్తోంది. అనంత తేజోవ్యాపకమైన  శక్తి యొక్క భౌతికరూపాన్ని ఆదిపరాశక్తిగా ప్రాచీన రుషులు దర్శించారు.  ఈ పరాశక్తే దుర్గ, కాళి, భవాని... ఇలా అనేక రూపాల్లో వ్యక్తమవుతూ ఉంటుంది. త్రిమూర్తులను కూడా చైతన్యవంతులను చేసేందుకు  ఈ పరాశక్తి వారిని ఆవహించి ఉంటుంది.  విష్ణువు శక్తి వైష్ణవిగా, బ్రహ్మ శక్తి బ్రహ్మాణిగా, శివ శక్తి శివానిగా వ్యక్తమవుతుంటుంది. ఈక్రమంలో వరాహరూపంలో శ్రీమహావిష్ణువు అవతరించినప్పుడు  ఆ స్వామి నుంచి వ్యక్తమైన లేదా  ఆవహించి ఉన్న శక్తి రూపమే వారాహీ దేవి.

      సృష్టిలోని అన్ని శక్తుల సమష్టి స్వరూపం పరాశక్తి. ఈ పరాశక్తి లోని సౌమ్య తత్త్వం శ్యామలాదేవి అయితే, ఉగ్రస్వరూపం వారాహి దేవి. దేవీ కవచంలో 'ఆయూ రక్షతు వారాహి' అన్నట్టు వారాహీ దేవి ప్రాణ సంరక్షిణి. ఆజ్ఞాచక్రం ఆమె నివాసం. ఆమె లలితా పరాభట్టారిక యొక్క ముఖ్య సేనాని. లలితాదేవి యొక్క రథ, గజ, తురగ, సైన్య బలాలన్నీ వారాహి యొక్క ఆధీనంలో ఉంటాయి. అందుకే ఆమెను దండనాథ అంటారు. ప్రతి మనిషిలోనూ వారాహి శక్తి నాభి ప్రాంతంలో ఉండి మణిపూర, స్వాధిష్టాన , మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది.

పురాణ గాథలు

          హిరణ్యాక్షుడనే రాక్షసుడుని సంహరించి, భూలోకాన్ని ఉద్ధరించిన మహావిష్ణు అవతారం వరాహమూర్తి. ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి. దేవీ భాగవతం, మార్కండేయ పురాణం, వరాహ పురాణం తదితర పురాణాల్లో ఈ తల్లి లీలావైభవ వర్ణన విస్తారంగా ఉంది. ఆయా పురాణాల్లో అంధకాసురుడు, రక్తబీజుడు, శుంభనిశుంభులు వంటి రాక్షసులను సంహరించడంలో ఆమె పాత్ర సుస్పష్టంగా కనిపిస్తుంది.

          మార్కండేయ పురాణంలోని దేవీమాహాత్మ్యంలో శుంభనిశుంభ వధ కథ ప్రకారం వివిధ దేవతల శరీరాల నుండి వారి స్త్రీరూప భక్తులు ఉద్భవిస్తాయి. శివుడి నుండి శివాని, విష్ణువు నుండి వైష్ణవి, బ్రహ్మ నుండి బ్రహ్మాణి.... ఈ క్రమంలో వరాహస్వామి నుండి వారాహిదేవి ఉద్భవిస్తుంది. తర్వాత జరిగిన కథ ప్రకారం రక్తబీజుడనే రాక్షసుల సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టిస్తుంది. అలా పుట్టుకొచ్చిన మాతృకలతో రాక్షసుడిని, అతని సేనను సంహరిస్తుంది. శవాన్ని వాహనంగా చేసుకుని, వరాహరూపంలో తన దంతాలతో రాక్షసులను సంహారం చేస్తుంది. శుంభుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే, ఆమె తిరిగి మాతృకలను తనలో ఇముడ్చుకుని రాక్షసుడిని సంహరిస్తుంది. ఈ పురాణం ప్రకారం వారాహిదేవిని వరాలనిచ్చే తల్లిగా కొలుస్తారు. దిక్కులను కాపాడే మాతృకలను (దైవీశక్తి) ప్రసన్నం చేసుకునే స్తోత్రం పురాణంలో ఉంది. దీని ప్రకారం వారాహీదేవి ఉత్తరదిక్కును కాపాడుతుంది. ఈమె వాహనం గేదె.

          వామన పురాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండీ నుండి ఉద్భవిస్తారు. వీపు భాగం నుండి వారాహి పుడుతుంది. వరాహ పురాణంలో రక్తబీజుడి కథ తిరిగి ప్రస్తావనకు వస్తుంది. కానీ ఈ కథలో ఒక మాతృక మరో మాతృక నుండి ఉద్భవిస్తుంది. ఈ క్రమంలో వారాహిదేవి శేషనాగుపై కూర్చొని వైష్ణవి తరువాత ఉద్భవిస్తుంది. ఈ పురాణం ప్రకారం వారాహి దేవి అసూయ అనే వికారానికి అధిదేవత. మత్స్యపురాణం ప్రకారం వారాహిదేవి అంధకాసురుడనే రాక్షసుడు సంహరించేందుకు సహాయం కోసం శివుడి ద్వారా సృష్టించబడింది.

 లలితా సహస్రనామాలు...

          వారాహీదేవి లలితా త్రిపురసుందరీదేవి సర్వ సైన్యాధ్యక్షురాలు. లలితా సహస్రనామంలోని మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషితా | విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందితా |' అనే నామాల ప్రకారం వారాహీదేవికి ప్రత్యేక రథం ఉంది. దాని పేరు కిరి చక్రం. ఆ రథాన్ని 1000 వరాహాలు లాగుతాయి. రథసారథి పేరు స్తంభిని దేవి. ఈ రథంలో దేవతా గణమంతా కొలువై ఉంటుంది. ముఖ్యంగా ఆయుర్వేద మూలపురుషుడైన ధన్వంతరి, దేవ వైద్యులు అశ్విని దేవతలు ఈ రథంలో ఉంటారు. విశుక్రుడనే రాక్షసుడిని ఈ తల్లి సంహరించింది

రూప వర్ణన

          వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది. ఈమె శరీరఛాయ నల్లని మేఘవర్ణం తీరులో ఉంటుంది. సాధారణంగా ఈ తల్లి వరాహ ముఖం, ఎనిమిది చేతులతో కనిపిస్తుంది. అభయ, వరద హస్తాలు, శంఖం, పాశం, హలం వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది. గుర్రం, సింహం, పాము, దున్నపోతు తదితర వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది.

          అమ్మ స్వరూపాన్ని గమనిస్తే వరాహ ముఖం, అష్ట భుజాలు, శంఖం, చక్రం, హలం (నాగలి), ముసలం, అంకుశం, వరద, అభయ హస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనం ఇస్తుంది. ఇది మహావారాహి స్వరూపం. ఇంకా లఘు వారాహి, స్వప్న వారాహి, ధూమ్ర వారాహి, కిరాత వారాహి రూపాల్లోనూ అమ్మ ఉపాసకుల పూజలు అందుకుంటుంది.

          వారాహిదేవిని భూదేవి, ధాన్యలక్ష్మి స్వరూపంగా భావన చెయ్యాలి. ఈ తల్లి తన చేతుల్లో నాగలి, రోకలి ధరించి ఉంటుంది. రోకలిని ధాన్యం నించి పొట్టు వేరు చేయడానికి ఉపయోగిస్తారు. పూర్వజన్మల్లో చేసిన కర్మలు, వాటి ఫలితాల నుంచి వారాహీ దేవి తన భక్తులను వేరుచేసి, వారికి కర్మక్షయం కలిగిస్తుందని భావం. భూమిలో విత్తనం వెయ్యటానికి వీలుగా భూమిని తగినవిధంగా సిద్ధం చెయ్యటానికి నాగలిని ఉపయోగిస్తారు. అలాగే, భూమి వంటి మన బుద్ధిని నిష్కామకర్మ బీజాలు నాటటానికి సిద్ధంగా తయారుచేస్తుంది వారాహీ దేవి.

          అమ్మవారిని చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే, హలం (నాగలి), ముస్లిం (రోకలి) ఆయుధాలను ధరించిప అమ్మరూపం కనిపిస్తుంది. నాగలిని భూమిని దున్నడానికి ఉపయోగిస్తే, రోకలిని ధాన్యం దంచడానికి వాడతారు. దీనిబట్టి అమ్మవారు సస్యదేవత అని గ్రహించాలి. పాడిపంటలను సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లిగా వారాహీదేవిని భావన చెయ్యాలి. ఈ రహస్యం కారణంగానే వారాహీ అమ్మవారిని ఆషాఢమాసంలో పూజించాలని శాస్త్రాలు నిర్దేశిస్తున్నాయి. రైతులు గోఆధారితం వ్యవసాయం ద్వారా భూమిని శుద్ధి చేసి సాగు చేస్తే అది కూడా ఒక రకమైన వారాహీ ఉపాసనే అవుతుంది. వారాహీ దేవి సాక్షాత్తు భూదేవి స్వరూపం (అంశ) కాబట్టి రైతులు చేసేదంతా వారాహీ ఉపాస చేసిన ఫలితాన్నిస్తుంది.

          వారాహీ అమ్మవారి రూపాన్ని చూసిన కొంతమంది ఈమెను ఉగ్రదేవతగా భ్రమపడతారు. కానీ వారాహీదేవి చాలా శాంతస్వరూపిణి. వెంటనే అనుగ్రహిస్తుంది. ఈ తల్లి కరుణారసమూర్తి అని గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. వారాహీ అమ్మవారిని స్మరిస్తే శత్రునాశనం జరుగుతుంది. అంటే వ్యక్తి ఉన్న అంత శత్రువులైన కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, అహంకారం, అజ్ఞానం నశిస్తాయి. అంతశ్శత్రువులను జయించిన వ్యక్తికి బయట శత్రువులు ఉండరు లేదా శత్రువులు కనిపించంత విశాలమైన దృష్టి కలుగుతుంది. అలాంటి దివ్యస్థాయిని ప్రసాదిస్తుంది వారాహీ మాత

వారాహీ నవరాత్రులు

     వారాహీ నవరాత్రి ఉత్సవాల నిర్వహించే విధానాన్ని వివరిస్తూ ప్రత్యేకంగా వారాహీ నవరాత్రికల్పం అనే గ్రంథం కూడా ఉంది. ఇందులో నవరాత్రి ఉత్సవ నిర్వహణతో పాటు వారాహీదేవికి సంబంధించిన అనేక స్తోత్రాలు కూడా ఉన్నాయి. వీటిని అందరూ పఠించవచ్చు. మూలమంత్రాలను మాత్రం గురూపదేశం లేకుండా సాధన చెయ్యవద్దని శాస్ర్తాలు కఠిన నియమాన్ని విధించాయి.     

    శ్రీవిద్యా సంప్రదాయంలో ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు గల తిథుల రాత్రి సమయంలో వారాహీ అమ్మవారిని పూజిస్తారు. వీటిని వారాహీ నవరాత్రులు లేదా గుప్త నవరాత్రులు అంటారు. వారాహీ పూజ సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయానికి తరువాత చేయాలి. శాస్త్రాల ప్రకారం దేవి పూజకు రాత్రి సమయం ప్రశస్తమైనది. ఇది సాంప్రదాయికంగా శ్రీవిద్యాదీక్షాపరులు మాత్రమే చేయదగిన విధానం. అమ్మవారు సంప్రదాయిని. సంప్రదాయేశ్వరి. సదాచార ప్రవర్తిక. అందువల్ల నిర్మలమైన మనస్సుతో ధ్యానం చెయ్యటం, సదాచారాలను పాటించటం ద్వారా వారాహీ దేవి అనుగ్రహాన్ని వెంటనే పొందవచ్చు.

          తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహి మాత. ఈమెను వామాచారం పాటించే భక్తులు రాత్రివేళ తాంత్రిక పద్ధతుల్లో పూజిస్తారు. వారాహిమాత ముఖ్య దేవతగా ప్రతిష్టించిన కొన్ని ఆలయాల్లో దర్శనం సైతం రాత్రివేళల్లోనో, తెల్లవారుజామునో మాత్రమే ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి (ఒడిషా), వారణాసి, మైలాపూర్ (చెన్నై)లో ఉన్న ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువ.

          వారాహి అమ్మవారు వారణాసి గ్రామదేవత. ఈమెకు వారణాసిలో ఒక విచిత్రమైన దేవాలయం ఉంది. ఆ దేవాలయంలోకి మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి వీలు పడదు. ఈ ఆలయం ఓ భూగృహంలో ఉంటుంది. ఉదయం తెల్లవారుజాము 4.30 నుంచి 8 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. ఆలయం తెరిచిన యంలో వెళ్లిన తర్వాత నేల పై రెండు రంధ్రాలు కనిపిస్తాయి. వాటి నుంచి మాత్రమే అమ్మవారిని దర్శించుకోవడానికి వీలవుతుంది . ఒక రంధ్రంలో నుంచి చూసినప్పుడు అమ్మవారి ముఖం మాత్రమే కనిపిస్తుంది. మరో రంధ్రం నుంచి చూసినప్పుడు అమ్మవారి పాద ముద్రలు కనిపిస్తాయి. అమ్మవారు ఉగ్రస్వరూపం వారు కాబట్టే ఇలా రంధ్రాల నుంచి భక్తులు ఇలా చూసే ఏర్పాటును పురాణకాలం నుంచి ఏర్పాటు చేశారని అక్కడివారు చెబుతారు. అర్చకులు కూడా 4.30 గంటలకు భూగృహంలోకి వెళ్లి పదినిమిషాల్లో హారతి ఇచ్చి వెనక్కి వచ్చేస్తారు. వారణాసిలోని దశాశ్వమేధ ఘాట్ కు వెళ్లడానికి ముందు ఎడమవైపు వారాహి అమ్మవారి దేవాలయం ఉంది. పడవలో వెళ్లేవారు మన్ మందిర్ ఘాట్ వద్ద దిగి మెట్లమార్గం ద్వారి పైకి వెళ్తే కుడివైపునకు అమ్మవారి దేవాలయం ఉంటుంది. ఈమెను ఆరాధిస్తే జ్ఞానం సిద్ధిస్తుంది. కుండలినీ శక్తి జాగృతమవుతుంది.

హయగ్రీవ స్వామి అగస్త్య మహర్షి చెప్పిన వారాహి నామాలు

 -  పంచమి

- దండనాథుడు

- సంకేతా

-  సమయేశ్వరి

- సమయ సంకేతా

- వారాహి

- పోత్రిణి

- వార్తాలి

- శివా

- ఆజ్ఞా చక్రేశ్వరి

- అరిఘ్ని           

వారాహి మంత్రాలు

 లఘు వారాహీ మంత్రం : లూం వారాహి లూం  ఉన్మత్త భైరవీ పాదుకాభ్యాం నమ:

స్వప్న వారాహీ మంత్రం : ఓం హ్రీం నమో వారాహి ఘోరే ప్వప్నం ఠ: ఠ: స్వాహా

ధూమ్ర వారాహీ మంత్రం: ఓం ధూం ధూం మృత్యుధూమే ధూం ధూం కాలధూమే ధూం ధూం ధూం వారాహీ హుం ఫట్ స్వాహా

కిరాత వారాహి మంత్రం : ఓం ఖేం ఖేం ఖం ఘ్రసీం అఘోర మృత్యురూపే ఖేం ఖేం ఖం ఘ్రసూమ్ కాల మృత్యురూపే ఖేం ఖేం ఖం  ఘ్రసౌ: రం రం కిరాత వారాహీ హుం ఫట్ స్వాహా

 
శ్రీ వారాహ్యనుగ్రహాష్టకం

ఈశ్వర ఉవాచ:

మాతర్జగద్రచన నాటకసూత్రధార-స్త్వద్రూపమాకలయితుం పరమార్థ తోఽయం

ఈశోఽప్యమీశ్వరపదం సముపైతి తాదృక్- కోఽన్యః స్తవం కిమివ తావకమాదధాతు !!

నామాని కింతు గృణతస్తవ లోకతుండే నాడంబరం స్పృశతి దండధరస్య దండః !

యల్లేశలంబితభవాంబునిధిర్యతో యత్- త్వన్నామసంసృతిరియం నను నః స్తుతిస్తే !!

త్వచ్చింతనాదరసముల్లసదప్రమేయా- ఽఽనందోదయాత్సముదితః స్ఫుటరోమహర్షః !

మాతర్నమామి సుదినాని సదేత్యముం త్వా- మభ్యర్థయేఽర్థమితి పూరయతాద్దయాలో !!

ఇంద్రేందుమౌలివిధికేశవమౌలిరత్న- రోచిశ్చయోజ్జ్వలితపాదసరోజయుగ్మే !

చేతో మతౌ మమ సదా ప్రతిబింబితా త్వం భూయా భవాని విదధాతు సదోరుహారే !!

లీలోద్ధృతక్షితితలస్య వరాహమూర్తే- ర్వారాహమూర్తిరఖిలార్థకరీ త్వమేవ !

ప్రాలేయరశ్మిసుకలోల్లసితావతంసా త్వం దేవి వామతనుభాగహరా రహస్య !!

త్వామంబ తప్తకనకోజ్జ్వలకాంతిమంత- ర్యే చింతయంతి యువతీతనుమాగలాంతాం!

చక్రాయుధత్రినయనాంబరపోతృవక్త్రాం తేషాం పదాంబుజయుగం ప్రణమంతి దేవాః !!

త్వత్సేవనస్ఖలిత పాపచయస్య మాత- ర్మోక్షోఽపి యత్ర న సతాం గణనాముపైతి !

దేవాసురోరగనృపాలనమస్య పాద- స్తత్ర శ్రియః పటుగిరః కియదేవమస్తు !!

కిం దుష్కరం త్వయి మనోవిషయం గతాయాం కిం దుర్లభం త్వయి విధానవదర్చితాయాం !

కిం దుష్కరం త్వయి సకృత్స్మృతిమాగతాయాం కిం దుర్జయం త్వయి కృతస్తుతివాదపుంసాం !!

 

 

వారాహి అమ్మవారి వైభవ విశేషాలతో డాక్టర్ కప్పగంతు రామకృష్ణ
ఈనాడు దినపత్రిక మకరందం పేజీ (25.06.2020)లో రాసిన వ్యాసం 



Friday, June 12, 2020

అద్భుత ఆధ్యాత్మిక నగరం శంబల



అద్భుత ఆధ్యాత్మిక నగరం శంబల గురించి

ఈనాడు దినపత్రిక మకరందం పేజీ (11.06.2020)లో రాసిన వ్యాసం

    అదొక యోగ భూమి. వేలాది సంవత్సరాలు ఆధ్యాత్మిక సాధనతో మునిగితేలిన మహోన్నత యోగులు మాత్రమే చేరుకోగలిగిన పుణ్యభూమి. అనంతమైన పుణ్యం చేసుకుంటే కానీ ఆ ఛాయలకు సైతం చేరుకోలేని దివ్యభూమి. అక్కడ దుఃఖానికి తావు లేదు. కష్టనష్టాలు, కన్నీళ్ల ఆనవాలు ఏమాత్రం కనిపించదు. అంతా బ్రహ్మానందం. హిమాలయ సానువుల్లో వేలాది మైళ్ళ దూరంలో భూలోక స్వర్గంగా పేరు పొందిన ఆ నగరం...శంబల.

    శంబల... ఈ పేరు తలుచుకుంటేనే ఓ పులకింత కలుగుతుంది. బాహ్యప్రపంచానికి కచ్చితంగా ఇలా ఉంటుందని తెలియని నగరం ఇది. ఎందుకంటే ఇది అన్ని ఇతర ప్రాంతాల తీరులో సాధారణమైన నగరం కాదు. ఇక్కడ ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది. దేవతలు సంచారం చేసే దైవభూమి ఇది. ఈ ప్రాంతాన్ని చేరుకోవాలంటే శారీరక, మానసిక ధైర్యం పాటు యోగం కూడా ఉండాలని హిందూ, బౌద్ధ గ్రంథాలు స్పష్టంగా చెబుతున్నాయి. సత్యం, అహింస, ధర్మం పాటించే పుణ్యమూర్తులకు మాత్రమే ఇందులోకి ప్రవేశం ఉంటుంది. యోగ సాధన ద్వారా సుషుమ్న నాడిని వశపరుచుకున్న సాధకులకు మాత్రమే ఇందులోకి ప్రవేశం ఉంటుంది. ఈ గ్రంథాలు చెప్పినట్లుగానే ఇప్పటికీ ఈ నగర రూపురేఖలు ఆధునిక మానవుల ఊహలకు సైతం చిక్కలేదు. ఇంతవరకూ ఈ నగరాన్ని స్పష్టంగా చూసిన వారు లేరు. చూడటానికి ప్రయాణం ప్రారంభించి తిరిగి వెనక్కి వచ్చినవారు కూడా లేరు. మొత్తంగా ఇది బాహ్య ప్రపంచానికి తెలియని లోకం. 

పురాణాల ప్రకారం శంబల ప్రాంతమంతా అద్భుతమైన ప్రాకృతిక సంపద పరుచుకుని ఉంటుంది. ఇక్కడి వృక్షాలు నిరంతరం సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి. ఇక్కడి ప్రజల ఆయువు సాధారణ ప్రజల ఆయువు కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటుంది. ఈ నగరం వయస్సు 60 లక్షల సంవత్సరాలు. ఇక్కడి ప్రజల పొడవు నగటున 12 అడుగులు. యోగ సాధన ద్వారా శంబలలో ఉండే ప్రజలు లోకంలో ఎక్కడ ఉండే వారితో అయినా సంభాషించే సామర్థ్యం కలిగి ఉంటారు. ప్రపచంలో ఎక్కడ జరిగే అభివృద్ధి అయినా, విధ్వంసమైనా ఇక్కడి వారికి క్షణాల్లో తెలిసిపోతుంది. లోకంలో అధర్మం పెచ్చుమీరి, కలి ప్రభావం కట్టడిచెయ్యలేనంతగా పెరిగినప్పుడు శంబలలో ఉండే పుణ్యపురుషులు, యోగులు లోక పరిపాలన తమ చేతుల్లోకి తీసుకుంటారని కొన్ని గ్రంథంలో ఉంది

కల్కి అవతారం ఇక్కడే

వేదమార్గాన్ని విడిచిన ప్రజలు ధర్మానికి దూరమవుతున్న తరుణంలో కలియుగం అంతరించే దశకు చేరుకుంటుంది. అప్పుడు శ్రీమహావిష్ణువు శంబల నగరంలో విష్ణు శయనుడు పండితుడి ఇంట కల్కి రూపంలో అవతరిస్తాడని విష్ణు పురాణం (4-24) చెబుతోంది. తెల్లటి గుర్రాన్ని ఎక్కి, ఖడ్గాన్ని ధరించి తన పరాక్రమంతో దుష్టుల్ని సంహరించి లోకంలో తిరిగి ధర్మాన్ని ప్రతిష్ఠిస్తాడని, అప్పటి నుంచి సత్యయుగం ప్రారంభమవుతుందని ఇందులో ఉంది. అగ్ని పురాణం, పద్మపురాణాలతో పాటు భాగవతంలో కూడా కల్కి అవతార ప్రస్తావన ఉంది. వీటన్నిటి ప్రకారం కల్కి అవతరించే ప్రాంతమే శంబల. బౌద్ధ కాలచక్ర గాథా సంప్రదాయంలో 'శంబల' రాజ్యాన్ని పాలించినట్లు చెప్పే 25 మంది పురాణపురుషులకు కల్కి కులిక, కల్కి రాజు వంటి సంబోధనలు ఉన్నాయి.

అంతుచిక్కని అద్భుత నిర్మాణం

శంబల నిర్మాణం అత్యద్భుతంగా ఉంటుంది. బౌద్ధ, హిందూ పురాణాల్లో ఈ నగర నిర్మాణానికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. వీటి ప్రకారం శంబల నగరం చుట్టూ ఎనిమిది రేకుల కమలం ఆకారంలో పర్వతాలు గొలుసుకట్టుగా ఉంటాయి. మధ్యలో స్ఫటిక శ్రీచక్రం ఉంటుంది. శ్రీచక్ర ఆకృతిలో ఉన్న భవనం మధ్యలో భూగ్రహాన్ని పోలిన నమూనా ఉంటుంది. అది తిరగబడిన పిరమిడ్ తరహాలో ఉంటుంది. అందులకి వెళ్ళేందుకు సొరంగాలు ఉంటాయి. కోటి సూర్యుల కాంతితో వెలిగే చింతామణి అనే దివ్యమైన మణి అక్కడ ఉంటుంది. పాదరసం గడ్డకట్టినట్లు పసనకాయంత పరిమాణంలో ఇది ఉంటుంది. సప్తరస ధాతువులతో ఏర్పడిన ఈ మణికి అర్ధచంద్రాకారంలో ముఖం ఉంటుంది. పెదవులు తెరచినట్లుండే ఒక ద్వారం ఉంటుంది. సిద్ధులైన యోగులు నిత్యం ఈ మణికి పూజలు చేస్తుంటారు. ఈ మణి కోరిన వరాలు ఇస్తుందని ప్రతీతి. కల్కి అవతారంలో వచ్చినప్పుడు విష్ణుమూర్తి ఈ మణిని ధరిస్తాడని చెబుతారు. సృష్టి ఆరంభం నుంచి మహర్షులు రాసిన గ్రంథాలన్నీ ఇక్కడ ఉంటాయి. మొత్తం 18 సంపుటాలుగా వీటిని విభజించి ఉంచారు. బౌద్ధ సన్యాసులు కూడా ఈ నగరాన్ని గురించి చెబుతారు. వారి సంప్రదాయం ప్రకారం చింతామణి మంత్రాన్ని ఉపాసన చేస్తారు. ఆధునిక వైజ్ఞానిక శాస్త్రవేత్తలు కూడా భేదించలేకపోయారు. ఈ నగర నిర్మాణం గురించిన రహస్యాన్ని ఇప్పటికీ శంబల ప్రాంతంలో ఉండే కాల ప్రమాణాలు సాధారణ కాల ప్రమాణానికి భిన్నంగా ఉంటాయి. ఈ ప్రాంతంలో 12 గంటలు గడిపితే బయటి ప్రపంచంలో రెండు వారాలు గడిపితే పెరిగినంత ప్రమాణంలో గోళ్ళు, వెంట్రుకలు పెరిగాయి. ఈ నగరం కోసం ప్రయత్నించిన ఓ బృందం మరీ విచిత్రమైన అనుభవాన్ని ఎదుర్కొంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈ బృంద సభ్యులకు ఆకస్మాత్తుగా వయస్సు పెరగటం ప్రారంభమైంది.కొన్ని దశాబ్దాల వయస్సు పెరగటంతో పాటు వెనక్కి వచ్చిన తర్వాత కూడా 100 సంవత్సరాల వృద్ధులకు వచ్చే వ్యాధులకు గురై వారంతా మరణించారు.

పాశ్చాత్యులు శంబలని 'ఫర్ బిడెన్ ల్యాండ్', 'హిడెన్ సిటీ', 'ది ల్యాండ్ ఆఫ్ వైట్ వాటర్స్' తదితర పేర్లతో పిలుస్తారు. అలెగ్జాండ్రా డేవిడ్ నీల్, హెన్రిచ్ హిమ్లర్ వంటి ఎంతోమంది పాశ్చాత్యులు ఈ నగరాన్ని చేరుకోవాలని, ఇక్కడి విశేషాలు తెలుసుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేశారు కానీ సాధ్యపడలేదు.

రచన : డాక్టర్ కప్పగంతు రామకృష్ణ. సెల్ : 9032044115 / 8897547548





పున్నమి కాంతుల కల్యాణం (ఒంటిమిట్టలో జరిగే శ్రీ సీతారామ కల్యాణం నేపథ్యంగా శ్రీకనకదుర్గ ప్రభ పత్రికలో రాసిన వ్యాసం)

  పున్నమి కాంతుల కల్యాణం                లోకంలో పెళ్ళి ముచ్చట అంటే సీతారాములదే. అందులోనూ ఒంటిమిట్ట ఆలయంలో జరిగే సీతారాముల కల్యాణం మరింత శ...