Thursday, April 18, 2024

తెలుగింటి రాముడు


 
 
 శ్రీరామ

తెలుగింటి రాముడు

రామనామం ఓ తారకమంత్రం. రాముడి వంటి కుమారుడు, సోదరుడు, భర్త, నాయకుడు, మిత్రుడు, పరిపాలకుడు, ధర్మమూర్తి... మరొకరు లేరు అనేది నిర్వివాదం. ప్రతి మనిషికీ రాముడితో ఓదో ఒక అనుబంధం ఉంటుంది. ఆ పేరు చెబితేనే ఆత్మీయత ప్రకటితమవుతుంది.  ప్రత్యేకించి తెలుగు ప్రజలకు రాముడు దేముడు మాత్రమే కాదు. తెలుగు జీవితాల్లో రాముడొక భాగం. రాములోరి పెళ్ళి, లక్ష్మణదేవర నవ్వు, సీతాదేవి నిద్ర అంటూ తెలుగు జానపదులు కూడా రాముడితో చుట్టరికం కలుపుకున్నారు. అదీ రామయ్య ఘనత. రామకథ మహిమ. 


తెలుగులో వచ్చిన తొలి రామాయణం గోన బుద్ధారెడ్డి రాసిన రంగనాథ రామాయణం. ద్విపద ఛందస్సులో వచ్చిన ఈ రామాయణాన్ని పాటలుగా పాడుకుని మురిసిపోయిన తెలుగు లోగిళ్ళు లక్షల్లో ఉన్నాయి. సీతారాముల దాంపత్యంలోని ఔన్నత్యాన్ని తేలికైన మాటలతో చెబుతూనే బరువైన భావాన్ని పలికించాడు బుద్ధారెడ్డి.


రాముడి ధనుర్విద్యాకౌశలం ఎంత గొప్పదంటే “నల్లవో  రఘురామ! నయనాభిరామ! విలువిద్య గురువ  వీరావతార --------- బాపురే రామా భూపాల! లోకముల నే పాటి విలుకాడు నేర్చునే కలుగ” అంటూ పగవాడైన రావణాసురుడు కూడా రామయ్య కోదండకళకు అబ్బురపడి భళీ అని ప్రశంసించాడు.


రావణుడు అపహరించిన విషయం తెలియక రాముడు సీతమ్మ గురించి వెతుకుతూ... ‘‘ఇది మహారణ్యమై యిప్పుడు తోచె / ఇది పర్ణశాలయై యిప్పుడు తోచె / ఇది నాకు దపమని యిప్పుడు తోచె / చల్లని ముఖదీప్తి చంద్రునికిచ్చి / తెల్లని నగవు చంద్రికలకు నిచ్చి / చెలువంపు పలుకులు చిలుకల కిచ్చి / నిన్ను దైవము మ్రింగెనే నేడు సీత’’ - చంద్రుడిలోనూ, వెన్నెలలోనూ, చిలుకల పలుకుల్లోనూ రాముడికి సీత కనిపిస్తోంది. అందుకే సీతమ్మ ఏ అడవి జంతువు వల్ల మృత్యువాత పడిందో అనుకుంటూ ఆవేదన చెందుతాడు.  


ప్రతి అడుగులోనూ, ప్రతి అణువులోనూ భార్యాభర్తలు ఒకరికొకరు కనిపించాలి. అప్పుడే ఆ దాంపత్యానికి సార్థకత ఏర్పడుతుందని రంగనాథ రామాయణం ప్రకటించింది. ఇలా ఎన్నో భావాలు ప్రకటిస్తూ, సీతను తెలుగు జానపదుల ఆడపడుచుగా, రాముడిని జానపదుల దేవుడిగా తీర్చిదిద్ది, వారి హృదయాల్లో శాశ్వతస్థానం కల్పించాడు బుద్ధారెడ్డి. తెలుగు పల్లెల్లో పేటపేటకూ కనిపించే రామాలయాలు, ఇంటింటా వినిపించే సీతారాముల పేర్లూ  ఈ రామాయణ ప్రభావమే.


కవయిత్రి ఆతుకూరి మొల్ల ‘చెప్పుమని రామచంద్రుఁడు / సెప్పించిన పలుకుమీదఁ జెప్పెద’ అంటూ రామాయాణం రచించింది. రాముడికే కాదు రామపాద ధూళికి కూడా ఎంతో మహత్తు ఉందంటూ మొల్ల రామ వనవాస సందర్భంలో చెబుతుంది. అరణ్య వాసానికి బయల్దేరిన రాముడు సీతాలక్ష్మణ సమేతంగా గంగానది దాటాలని ఓడ నడిపే గుహుడిని కోరతాడు. దానికి గుహుడు రాముని పాదధూళి సోకి రాయి కాంతగా మారింది కదా, తన ఓడ కూడా ఏమౌతుందోనని భయం వేస్తోంది. అందుకే నీ పాదాలు కడుగుతాను అంటూ రాముని పాదాలు కడుగుతాడు. 

చ. సుడిగొని రాము పాదములు సోఁకిన ధూళి వహించి రాయి యే
ర్పడ నొక కాంత యయ్యె నఁట, పన్నుగ నీతని పాద రేణు వి
య్యెడ వడి నోడసోఁక నిది యేమగునో” యని సంశయాత్ముఁడై
కడిగె గుహుండు రామపద కంజయుగంబు భయమ్ము పెంపునన్‌. 


వాల్మీకి రామాయణంలో లేని ఈ మొల్ల వర్ణన తరువాత ఎందరో తెలుగు కవుల భావనల్లో ప్రతిధ్వనించింది.

అలా అడవిలో నడుచుకుంటూ వెళ్తున్న సీతారామ లక్ష్మణులను అక్కడి చెంచు స్త్రీలు చూసారు. రతీ మన్మథులను మించిన అందంతో ప్రకాశిస్తున్న సీతారాముల్ని చూస్తూ, తమలో తాము...

చ. ఇతనికిఁ బాదచారితన మేటికి వచ్చెనో? పట్టభద్రుఁ డీ
సతి నవ రూప రేఖలను జక్కని దయ్యును నిట్టి దుర్దశల్‌
ప్రతివసియించు టెట్లో? రతిరాజ సమానుల వీరి నేల యీ
గతిఁ బడఁద్రోచె బ్రహ్మ?” యని కాంతురు చెంచెత లమ్మహాత్ములన్‌. 

ఇంతటి అందగాళ్ళను బ్రహ్మ ఈ అడవుల్లో ఎలా పడేయగలిగాడో అంటూ బ్రహ్మను కూడా నిందించారు. రామయ్య సౌందర్యం అంత గొప్పది. అది కేవలం భౌతిక అందం కాదు. మాటలకందని పారమార్థిక భావనాత్మక సౌందర్యం.


లంకను నుంచి తిరిగి వచ్చిన హనుమంతుడు రాముడిని చూస్తూనే...

“కంటిన్ జానకి బూర్ణచంద్ర వదనన్ గల్యాణి నా లంకలో
గంటిన్ మీ పదపంకజంబులను నే గౌతూహలం బొప్పగా
గంటిన్ మీ కరుణావలోకనము విఖ్యాతంబుగా గీర్తులం
గంటిన్ మా కపి వీర బృందములలో గాంభీర్యవారాన్నిధీ”

- చూసితి సీతను అంటూ రాముడి మనసుకు గొప్ప సాంత్వన కలిగిస్తాడు. అంతేకాదు, సీతలో రామయ్య ఎలా కనిపిస్తున్నాడో కూడా చెబుతాడు. సీత, రాముడు – ఇద్దరు కాదు ఒక్కరే అనే భావాన్ని మొల్ల ఎంతో రమ్యంగా చెప్పింది.

రామకథను ప్రబంధంగా తీర్చిదిద్దిన కవి అయ్యలరాజు రామభద్రుడు. శివధనస్సును రాముడు ఎక్కుపెట్టగానే అది ఫెళ్ళుమని పెద్దశబ్దం చేస్తూ విరిగిపోతుంది.

‘ఆ రమణీయ ధనుష్ఠం / కారము సీతాకుమారికా కల్యాణ / ప్రారంభవాద్య నిరవ / ద్వారమై యొసగె సకల హర్ష ప్రదమై’’  - సీతారాముల కల్యాణ వేడుక కోసం మొదటిగా మోగిన మంగళవాద్యం శివధనుర్భంగం సందర్భంగా వచ్చిన శబ్దమే అంటూ కవి చమత్కరించాడు. అంతేకాదు...

ఆ కరియాన వేనలి అనంత విలాసము మాధవోదయం
బా కమలాయతాక్షి మధురాధర సీమ, హరి ప్రకారమా
కోకిల వాణి మధ్యమున కూడిన దింతియ కాదు, తాను రా
మాకృతి దాల్చె ఈ చెలువమంతయు ఆ యమయందు జొప్పుడున్

సీత పూర్తిగా రాముడిగా మారిపోయిందంటాడు కవి. సీతమ్మను చూస్తే రామయ్యే కనిపిస్తున్నాడట. అంటే, సీతారాములకు అభేదం. శివపార్వతులే కాదు సీతారాములూ అర్ధనారీశ్వరులే. దాంపత్యానికి అర్థం, పరమార్థం ఇదే అంటూ గొప్పగా ప్రకటించింది రామాభ్యుదయ ప్రబంధం.

వానర సేనతో సహా సముద్రాన్ని దాటిన రాముడు, యుద్ధ ప్రారంభానికి ముందు అక్కడి సువేల పర్వతాన్ని ఎక్కి లంకను తేరిపార చూస్తాడు.

తనదు ప్రాణేశ్వరి, మహీతనయ కేడ
యావహిల్లునొ దురవస్థ యనుచు గాక
చుఱుకు జూపుల రఘుపతి జూచినపుడ
లంక యాహుతి గొనదె నిశ్శంక మహిమ

లంకలో ఉన్న తన ప్రాణేశ్వరికి ఏమైనా ఆపద కలుగుతుందేమో అని ఊరకున్నాడు కానీ, మూడోకన్ను తెరచిన శివుడి  మాదిరిగా తన చూపులతోనే లంకను రాముడు కాల్చివేసేవాడట. రాముడు సాక్షాత్తు శివ స్వరూపమే అని చెప్పటంతో పాటు, శివ కేశవ అభేదం కూడా ఈ పద్యంలో ప్రకటించాడు రామభద్ర కవి.

యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోయిన సందర్బంలో రాముడికి వచ్చిన కోపం ఎంతటి ఉత్కృష్టమైనదో వర్ణించడం ఎవరికీ సాధ్యం కాదు.

అభ్రంకష రధ కపి చి / త్ర భ్రమణంబుల వెలింగె ప్రళయాంతక ఫా / ల భ్రాజిష్టు భ్రుకుటీ / విభ్రమ ధౌరేయమైన విల్లుందానున్ - మూర్ఛపోయిన తమ్ముడి వంక మాటిమాటికీ చూస్తూ, రాముడు తన కోదండాన్ని పట్టుకున్న విధానాన్ని చూస్తేనే, ఇక రావణుడికి మృత్యుఘడియ దగ్గరపడిందనే సందేశం ఆ సన్నివేశం చూస్తున్నవారికి అందిందట.


అసలు రాయడం అంటూ జరిగితే రామాయణమే రాయాలి. తనలోని జీవుడి వేదన తీరాలన్నా, తన తండ్రి ఇచ్చిన ఆదేశాన్ని పాటించాలన్నా రామాయణమే రాయాలి. ఇంకే కథ రాసినా అది కట్టుకథే అవుతుందంటూ నిర్మొహమాటంగా చెప్పిన ‘కవిసమ్రాట్’ విశ్వనాథ సత్యనారాయణ. తన రామాయణ కల్పవృక్షంలో రాముడి వైభవాన్ని ప్రపంచం పట్టలేనంతగా విస్తరించి రాసారు. 


జనకుడి సభలో రాముడు ఎక్కుపెట్టిన శివధనుస్సు విరిగిన శబ్దం 

నిష్ఠావర్ష దమోఘ మేఘపటలీ నిర్గచ్ఛదుద్యోతిత
స్పేష్ఠేరమ్మదమాలికా యుగప దుజ్జృంభన్మహా ఘోరబం
హిష్ఠ స్ఫూర్జధుషండమండిత రవాహీన క్రియా ప్రౌఢి ద్రా
ఘ్రిష్ఠంబై యొకరావ మంతట నెసంగెన్ ఛిన్న చాపంబునన్.

ఉరుముల గుంపు నుండి వచ్చే ధ్వనిలాగా శివధనుస్సు విరిచినప్పుడు శబ్దం వచ్చిందట. అక్కడితో ఆగలేదు విశ్వనాథ కవితావేశం. భూమి నుంచి వరుసగా ఐదు ఊర్ధ్వ లోకాల్లో ఆ శబ్దం ఎలా వినబడిందో వివరిస్తూ వరుసగా ఐదు పద్యాలు రాసారు. అదీ రామయ్య బాహు విక్రమం. 

ఇరువదినాలు గేండ్లుగ నిదెప్పు డిదెప్పు డటంచుఁ గన్నులం
దెఱచి ప్రతీక్ష చేయుదుగదే, జగదేకధనుష్కలానిధీ !
విఱచిన వెండికొండదొర వింటిని వింటినిగాని చూడలే
దఱుత వహింప ధాత్రిఁ గనులారగఁ జూతునురా కుమారకా !


శివధనుస్సును విరిచి, సీతమ్మను వివాహం చేసుకున్న సందర్భంలో కౌసల్య మనోభావం ఇది. ఇరవై నాలుగేళ్ళుగా ఈ కల్యాణ ఘడియ కోసమే నిరీక్షిస్తున్నాను కుమారా... అంటూ ఆ తల్లి రాల్చిన ఆనందాశ్రువులు సీతారాముల కల్యాణానికి అక్షతలుగా మారాయి.

అశోకవనంలో రాక్షస స్త్రీల సమూహం మధ్య కూర్చున్న తేజోవతి అయిన ఓ స్త్రీని హనుమంతుడు చూసాడు. ఆమె ఎవరో తెలియదు. కానీ, ఆమెను చూస్తుంటే...

*ఆకృతి రామచంద్ర విరహాకృతి కన్బొమ తీరు స్వామి చా*
*పాకృతి కన్నులన్ ప్రభు కృపాకృతి కైశిక మందు స్వామి దే*
*హాకృతి సర్వదేహమున యందును రాఘవ వంశమౌళి ధ*
*ర్మాకృతి కూరుచున్న విధమంతయు రామ ప్రతిజ్ఞ మూర్తియై* *

అప్పటివరకూ తాను చూసిన రామచంద్రమూర్తి విరహమంతా మనిషి రూపం ధరిస్తే ఎలా ఉంటుందో ఆ స్త్రీ మూర్తి అలా కనిపించింది. రాముడి కోదండాన్ని ఆమె కనుబొమల్లో స్పష్టంగా చూడవచ్చు. ఆమె కళ్ళల్లో రాముడి దయాగుణం, కేశాల్లో రాముని మేనిఛాయ, ఆమె శరీరంలోని అణువణులో రఘువంశ ధర్మం బొమ్మకట్టినట్లు కనిపిస్తోంది. అంతేకాదు... తన ధర్మపత్నిని అపహరించిన వాడిని సంహరిస్తానని రాముడు చేసిన ప్రతిజ్ఞ ఆకారం ధరించిందా అన్నట్లు ఆమె కూర్చున్నదట. 

విశ్వనాథ కల్పవృక్షంలోనూ సీతారాములు ఇద్దరు మనుషులు కారు. రెండు భౌతిక రూపాల్లో ప్రకటితమయ్యే  ఒకే ఆత్మ.

ఇంకా... రఘునాథ రాయలు (రఘునాథ రామాయణం), ఘనగిరి రామకవి (యథావాల్మీకి రామాయణం), చెన్న కృష్ణయ్య (సాంఖ్య రామాయణం), గంగయ్య (తారకబ్రహ్మ రామాయణం).... ఇలా తెలుగులో సుమారు 130 వరకు రామాయణాలు వచ్చాయి. 
 
అన్నిటా ఒకటే సందేశం... రాముడు భారతజాతి ఆత్మ.
--------------------------------------------------------------
భక్తి పత్రిక ఏప్రిల్, 2024 సంచికలో ప్రచురితమైన వ్యాసం
----------------------------------------------------------------
రచన : డాక్టర్ కప్పగంతు రామకృష్ణ, అసోసియేట్ ప్రొఫెసర్, కెబిఎన్ కళాశాల (అటానమస్), విజయవాడ-1
 


 

Thursday, March 23, 2023

భజే రుద్రరూపం... భజే బ్రహ్మతేజం (హనుమజ్జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం)



భజే రుద్రరూపం... భజే బ్రహ్మతేజం

 

          హనుమంతుడంటేనే ఓ శక్తి. ఆ పేరు పలికితేనే కొండంత ధైర్యం మనల్ని ఆవహిస్తుంది. హనుమలో ఎంతటి గంభీరమైన ఉగ్రతేజం కనిపిస్తుందో, అంతేస్థాయిలో మృదుమధురమైన వాక్‌, చిత్త సంస్కారం కూడా కనిపిస్తుంది. ఎంతటి అనుపమానమైన దేహదారుఢ్యం కనిపిస్తుందో, అంతటి సమున్నతమైన బుద్ధిబలం కూడా వ్యక్తమవుతుంది. ఎంతటి అపారమైన శాస్త్రపాండిత్యం ప్రకటితమవుతుందో, అంతే తీక్షణమైన బహ్మ్రచర్య తేజం భాసిస్తుంది. ఎంతటి ప్రతాపరౌద్రం కనిపిస్తుందో, అంతటి పరమశాంత చిత్తం కూడా దర్శనమిస్తుంది. వాక్యకోవిదుడు, రాజనీతిజ్ఞుడు, ప్రియసఖుడు, వినయమూర్తి, రామభక్తాగ్రేసరుడు... ఇలా అనేక శక్తుల మేలుకలయికగా హనుమ రామాయణంలో అనేకచోట్ల దర్శనమిస్తాడు.

 

దుష్టశిక్షణ, శిష్ట రక్షణ చేయటానికి సాక్షాత్తు పరమశివుడే రామకార్యాన్ని సాధించాలనే సంకల్పంతో హనుమంతుడిగా అవతరించాడని పరాశర సంహిత చెబుతోంది.

 

దుష్టానాం శిక్షణార్థాయ శిష్టానాం రక్షణాయ చ । రామకార్యార్థ సిద్ధ్యర్థం జాతః శ్రీహనుమాన్‌ శివః ॥ - వైశాఖమాసం, కృష్ణ పక్ష దశమి, శనివారం, పూర్వాభాద్ర నక్షత్రం, కుంభరాశి, మధ్యాహ్నవేళలో, కర్కాటకలగ్నంలో ఆంజనేయుడు జన్మించినట్లు అందులో ఉంది. శివుని అష్టమూర్తుల్లో ఒకడైన వాయుదేవుని అనుగ్రహం ద్వారా కేసరి అనే వానరవీరుని భార్య అంజనాదేవికి రుద్రతేజంతో హనుమ జన్మించాడు.

 

ఓంకార హనుమ

    హనుమాన్‌ అనే శబ్దానికి ‘జ్ఞానవాన్‌’ అనే అర్థం ఉంది. ‘హను’ అంటే ‘జ్ఞానం’ అనే అర్థం ఉంది. ‘హనువు’ అంటే ‘దవడలు’ అనే అర్థం కూడా వాడుకలో ఉంది. శబ్దార్థపరంగా చూస్తే, ‘హనుమ’ అనే పదంలోని అచ్చులు ‘అ, , మ’ - ఈ మూడు కలిస్తే ‘ఓం’కారం ఆవిర్భవిస్తుంది. దీని ద్వారా హనుమంతుడు ఓంకార స్వరూపుడనే విషయం అత్యంత స్పష్టంగా తెలుస్తుంది.

 

విద్యాహనుమ

 హనుమంతుడు అనగానే అద్భుతమైన బలపరాక్రమాలు గుర్తుకువస్తాయి. అపరిమితమైన భుజశక్తికి తోడు హనుమంతుడు గొప్ప విద్యావేత్త కూడా. కర్మసాక్షి, ప్రత్యక్షదైవం అయిన సూర్యభగవానుడి దగ్గర అన్ని విద్యలు నేర్చుకున్నాడు. ఉపనయనం పూర్తయ్యాక ఓ రోజు హనుమ సూర్యుడి దగ్గరకు వెళ్ళి తనను శిష్యుడిగా స్వీకరించమని అభ్యర్థిస్తాడు. నేను క్షణం కూడా స్థిరంగా ఉండననే విషయం లోకమంతా తెలిసిందే కదా. అలాంటి నేను నీకెలా విద్య నేర్పించగలను. మరెవ్వరైనా గురువును చూసుకోమంటాడు సూర్యుడు. తన శరీరాన్ని అమాంతంగా పెంచి, తూర్పు పశ్చిమ పర్వతాల మీద చెరొక కాలు పెట్టాడు. సూర్య గమనానికి అభిముఖంగా తన ముఖాన్ని తిప్పుతూ సూర్యుడిని విద్య నేర్పించమని ప్రార్థించాడు. తన శిష్యుడి శక్తి సామర్థ్యాలకు, బలపరాక్రమాలకు సూర్యుడు ముచ్చటపడి, హనుమను శిష్యుడిగా స్వీకరించాడు. వేదాలు, వేదాంగాలు, వ్యాకరణంతో సహా అన్ని శాస్త్రాలు నేర్చుకుని గొప్ప పండితుడవుతాడు హనుమ. అంతటి పండితుడు కాబట్టే హనుమ మంత్రిగా ఉంటే ముల్లోకాల్లోనూ సాధించలేదని ఏదీ ఉండదంటాడు రాముడు. ఎవరో నిరాశ పరిచారనో, ఏవో అడ్డంకులు వచ్చాయనో ఎంపిక చేసుకున్న విద్య నేర్చుకోవటాన్ని మానుకునే నేటితరం విద్యార్థులకు హనుమ ఓ చక్కటి ఆదర్శంగా నిలుస్తాడు. విద్య నేర్పించాల్సిన గురువే వద్దని వారించినా హనుమ నిరుత్సాహ పడలేదు. గురువును మెప్పించి విద్య నేర్చుకున్నాడు. నేటితరానికి హనుమ ఓ పాఠం. 

 

సుందర హనుమ

 

హనుమకు తల్లి అంజనాదేవి పెట్టిన పేరు సుందరుడు. అద్భుతమైన సౌందర్యమూర్తి హనుమంతుడు. సూర్యుడిని మింగాలని ఆకాశానికి ఎగిరిన బాలాంజనేయుడిని చూసిన ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని విసురుతాడు. అది దవడల మీద బలంగా తాకటంతో చెక్కుకున్నట్లు అవుతాయి. అలా చెక్కబడిన దవడలు కలిగిన వాడు కావటంతో సుందరుడు హనుమంతుడిగా ప్రసిద్ధి పొందాడు.  మరొక విశేషం ఏమిటంటే...రామాయణంలోని అన్ని సర్గలకు అందులోని కథాంశాన్ని బట్టి పేరు పెట్టాడు వాల్మీకి. కానీ సీతాన్వేషణ జరిగిన సర్గకు మాత్రం సుందరకాండ అని పేరు పెట్టాడు. నిజానికి హనుమత్కాండ అని పేరు పెట్టాలని అందరూ అంటారు. కానీ హనుమ అసలు పేరు సుందరుడు కదా. అందుకని వాల్మీకి ఈ సర్గకు సుందరకాండ అని పేరు పెట్టారని ప్రతీతి.

 

హనుమంతుడి మంత్రాల్లో ‘సుందర హనుమన్ మహామంత్రం’ ఒకటి. వాల్మీకి తన శ్లోకాల్లో అంతర్గతంగా ఈ సుందర మంత్రాన్ని నిక్షిప్తం చేశాడు కాబట్టి సుందరకాండ అయిందని మరొక వివరణ. నిజానికి భౌతిక సౌందర్యాన్ని మించినది హృదయ సౌందర్యం. మొత్తం రామాయణంలో ఎక్కడా తన గురించి చెప్పుకోలేదు. రాముడు విడిచిన బాణాన్ని అంటూ తన ఘనత అంతా రాముడికే కట్టబెట్టాడు. సీతమ్మను రామయ్య చెంత చేర్చటం తప్ప మరోధ్యాస లేదు హనుమకు. అందుకే ఆ హృదయాన్ని మించిన సుందర హృదయం మరొకటి లేదు. కాబట్టే ఈ కాండ సుందరకాండ అయింది. 

 

రాజు పూజలందుకున్న బంటు

హనుమంతుడు రాముడు బంటు. అందరికీ తెలిసిన విషయమే. కానీ రామయ్యే స్వయంగా హనుమంతుడిని పూజించిన వివరణ పరాశర సంహితలో ఉంది. దీనిప్రకారం సూర్యుడిని మింగటానికి ఆకాశానికి ఎగిరిన హనుమంతుడి మీద వజ్రాయుధం ప్రయోగిస్తాడు ఇంద్రుడు. హనుమ ఓ పర్వతం మీద పడి, మూర్ఛపోతాడు. బిడ్డకు కలిగిన కష్టం చూసి వాయుదేవుడు కోపంతో అన్నిలోకాల్లో ఉన్న వాయువుని స్తంభింపజేస్తాడు. దీంతో లోకాలన్నీ అల్లకల్లోలం అవుతాయి.

 

విషయం తెలుసుకున్న బ్రహ్మదేవుడు దేవతలందరినీ వెంట పెట్టుకుని హనుమంతుడున్న చోటుకి వస్తాడు. అతడిని పునర్జీవితుడిని చేసి అనేక వరాలిస్తాడు. మిగిలిన దేవతలందరూ కూడా తమ శక్తిని హనుమంతుడికి ఇచ్చి, తమకు సంబంధించిన అస్త్ర, శస్త్రాలేవీ అతడి మీద పనిచెయ్యవంటూ వరాలిస్తారు. హనుమంతుడి పేరుతో హనుమద్ర్వతం వ్యాప్తిలోకి వస్తుందని, ఈ వ్రతం చేసిన వారి పనులన్నీ హనుమ చేసిపెడతాడని బ్రహ్మదేవుడు ఈ సందర్భంలో చెబుతాడు. ఈ కథంతా రాముడికి హనుమే స్వయంగా చెబుతాడు.

 

సీతాన్వేషణలో ఉన్న రాముడు పంపానదీ తీరంలో హనుమంతుడు వేదిక మీద కూర్చోపెట్టి

లక్ష్మణుడితో సహా ఈ వ్రతం చేస్తాడు. వ్రతం ఫలితంగా సీతాన్వేషణ మొదలు సీతారామ పట్టాభిషేకం

వరకు మొత్తం కార్యాన్ని తన భుజాల మీద వేసుకుని నడిపిస్తాడు హనుమ. తన యజమాని చేత

పూజలందుకున్న ఏకైక బంటు హనుమ మాత్రమే. 

 

వేద హనుమ

 

హనుమ అనే పదానికి ఉపనిషత్తులు చెబుతున్నఅర్థం ‘వేదం’. రాముడు శ్రీ మహావిష్ణువు అవతారం. వేదాలు ఘోషిస్తున్నది విష్ణు స్వరూపాన్నే. అటువంటి వేదస్వరూపుడైన విష్ణువు రామావతారంలో సీతను అన్వేషిస్తూ కొండలు, కోనలు తిరుగుతాడు. అలాంటి రాముడు ఓ సందర్భంలో హనుమంతుడి భుజాల్ని అధిరోహిస్తాడు. నిజానికి రాముడు నడవలేక కాదు. వేదం మాత్రమే వేదస్వరూపుడిని భరించగలదు. ఇతరులకు అది సాధ్యం కాదు. భగవంతుడి తత్త్వం మాత్రమే భగవంతుడిని ప్రకటించగలదు. భరించగలదు. కాబట్టి హనుమ రామయ్యను భుజాల మీద కూర్చోపెట్టుకున్నాడంటే హనుమ వేదస్వరూపుడని చెప్పకనే చెప్పినట్లయింది. 

 

శ్రీరాముడు తన పట్టాభిషేక సమయంలో అందరికీ కానుకలతో కృతజ్ఞతను తెలియజేస్తూ, హనుమను కూడా ఏంకావాలో కోరుకోమన్నాడు. అప్పుడు హనుమ ‘నాకు నీయందు సదా పరమమైన ప్రేమను ప్రసాదించ’మన్నాడు. ఆ మాటకు రాముని హృదయం పరవశించి, సింహాసనం నుంచి దిగి హనుమను బిగియారా కౌగలించుకుని ఆశీర్వదించాడు. అంతేకాదు నీవు చేసిన ఒక్కొక్క ఉపకారానికి నా ప్రాణాలు ఇస్తాను. కాని ఉపకారాలు మిగిలిపోతాయి. ఆ విషయంగా నేను ఋణగ్రస్తుణ్ణి. నీ ఉపకారాలు నా దేహంలో జీర్ణమై పోనీ.  నీవల్ల నా కష్టాలు  తొలిగాయి. నీకు ఉపకారం చేయాలంటే నాకు వచ్చిన కష్టాలు నీకు రావాలి. నీకు కష్టం కలిగిందన్న ఊహ వచ్చినా నా మనస్సు బాధపడుతుంది. అది చెడు భావన. అటువంటి భావన రాకుండా నీ ఉపకారాలన్నీ నాలో జీర్ణమైపోవుగాక’ అని కోరుకుంటాను అంటాడు. ఇది హనుమపై శ్రీరాముని భావన మాత్రమే కాదు. తరచి చూసేత ఆత్మ-పరమాత్మల కలయికకు ప్రతీక.

 

         

కర్తృత్వ, భోక్తృత్వ జ్ఞాతృత్వాల పట్ల అహంకార, మమకారాలు లేని వాడు హనుమ. తాను భగవంతుని ప్రేరణతోనే బయలుదేరానని, రామబాణం వలే (యథా రాఘవ నిర్ముక్త శ్శరస్వశన విక్రమః -  వాల్మీకి రామాయణం) లంకలో ప్రవేశించగలనని చెప్పాడే కాని తన శక్తి సామర్థ్యాలను ప్రకటించలేదు. ఇది హనుమ స్వరూపాన్ని చక్కగా చిత్రించే సంఘటన. రామరావణ యుద్ధంలో మూర్ఛితుడైన లక్ష్మణుని

పునరుజ్జీవింపజేయటానికి సంజీవని పర్వతాన్ని తెచ్చినప్పుడు, నన్ను నా వంశాన్ని నిలిపావంటూ హనుమను చిరంజీవిగా ఆశీర్వదించాడు రాముడు. హనుమంతుని ప్రజ్ఞాపాటవాలను కిష్కింధాకాండ నుంచి చూసి ప్రశంసించకుండా ఉండలేం. మంత్రిగా, సేనానాయకునిగా, సలహాదారునిగా విభీషణ శరణాగతి సందర్భంలో దౌత్యవేత్తగా, కార్య కుశలుడుగా, సత్యశీలిగా, కర్తవ్యనిష్టునిగా, మహాబలవంతునిగా ఇలా ఎన్నో రూపాల్లో చూస్తాం. అందుకే హనుమ రామాయణం అనే మణిహారంలో రత్నమై వెలిగొందాడు. 

 

మనుస్మృతిలో చెప్పినట్లు ప్రభువు పట్ల అనురాగం, కపటమెరుగని స్థితి, సమర్థత, జ్ఞానం దేశకాలతత్త్వం తెలిసి ఉండటం, మంచి దేహదారుఢ్యం, భయమన్నది లేకపోవడం, వాక్పటుత్వం దూతకు ఉండాలి. ఈ లక్షణాన్నీ హనుమలో పుష్కలంగా ఉన్నాయి. అందుకే శ్రీరాముని ప్రేమకు పాత్రుడయ్యాడు. అటువంటి హనుమను మనసారా స్మరిస్తే బుద్ధి, కీర్తి, బలం, ధైర్యం, నిర్భయత్వం, రోగాలు లేకుండా ఉండడం, వాక్పటుత్వం మొదలైన మంచి లక్షణాన్నీ  ప్రాప్తిస్తాయి.

--------------------------------------

రచన

డాక్టర్ కప్పగంతు రామకృష్ణ, లెక్చరర్, కె.బి.ఎన్.కాలేజీ, కొత్తపేట, విజయవాడ-1

సెల్: 9032044115

 


Tuesday, March 7, 2023

దీపారాధన ఎందుకు చెయ్యాలి? దీపారాధన ప్రాముఖ్యత ఏమిటి? దీపం వెలిగించడంలో అంతరార్థం ఏమిటి?

 

దీపారాధన


దీపారాధన ఎందుకు చెయ్యాలి? 


దీపారాధన ప్రాముఖ్యత ఏమిటి? 


దీపం వెలిగించడంలో అంతరార్థం ఏమిటి?


           పంచభూతాత్మకమైన సృష్టికి ప్రతీక దీపం. మట్టి ప్రమిద భూతత్వానికీ, తైలం జలతత్వానికీ, వత్తి ఆకాశతత్వానికీ, వెలగడానికి తోడ్పడే గాలి వాయుతత్వానికీ, జ్యోతి అగ్ని తత్వానికీ ప్రతీకలు. మనిషి శరీరమూ పంచభూతాల సమాహారమే కాబట్టి దీపాన్ని వెలిగించడమంటే మనల్ని మనం వెలిగించుకోవడమే. మనలోని అజ్ఞానపు అంధకారాల్ని నశింపజేసే ఆ పరమాత్మకు సమీపంగా వెళ్లడమే. దీపం దానంతట అది ఎలా వెలగలేదో మనిషీ పుట్టుకతో జ్ఞాని కాలేడు. అందుకే దేవుడి ముందు దీపాన్ని వెలిగించి ఆ వెలుగులో మన ఆత్మదీపాన్ని వెలిగించుకుంటాం. లోలోపలి చీకట్లను వదిలించుకుంటాం. దీపానికి ఉండే మరో ప్రత్యేకత... అది ఎప్పుడూ ఊర్ధ్వదృష్టినే కలిగి ఉండటం. దీపం నుంచి అజ్ఞానమనే చీకట్లను పారదోలడం నేర్చుకున్నట్లే మనస్సును అల్పవిషయాలవైపు మళ్లించకుండా ఊర్ధ్వదృష్టిని కలిగి ఉండటమూ నేర్చుకోవాల్సిన పాఠమే.

          సృష్టి, స్థితి, లయలకు దీపంతో సన్నిహితమైన సంబంధం ఉంది. దీపం ప్రజ్వలించినప్పుడు వచ్చే ఆ కాంతిని త్రిమూర్తులకు ప్రతీకగా పూర్వ ఋషులు పేర్కొన్నారు. ఆ కాంతిలో అంతర్లీనంగా కనిపించే నీల వర్ణం స్థితికారుడైన విష్ణువుకు, తెల్ల రంగు లయకారుడైన శివునకు, ఎర్ర రంగు సృష్టికర్త బ్రహ్మకు సంకేతాలుగా అభివర్ణించారు. విద్య, శక్తి, సంపదలను ప్రసాదించే ముగ్గురమ్మలు సరస్వతి, దుర్గ, లక్ష్మి- ఆ కాంతిలో కొలువై ఉంటారని పెద్దలు అంటారు.

          ‘‘వైరాగ్య తైల సంపూర్ణే, భక్తి వర్తి సమన్వితే / ప్రబోధ పూర్ణపాత్రేతు జ్ఞానదీపం విలోక్యత్‌’’ అన్నారు ఋషులు. అంటే ప్రబోధంఅనే ప్రమిదలో, ‘వైరాగ్యంఅనే తైలం పోసి, ‘భక్తిఅనే వత్తిని వెలిగించి, జ్ఞానజ్యోతిని ప్రకాశింపజేయాలని అర్థం. ఆ జ్యోతి ప్రసరించే ప్రకాశాన్ని దర్శించి, వారు ముక్తి పొందారు.

          ముక్తిని ప్రసాదించేవాడు పరమాత్మ. ఆ పరమాత్మకు సంకేతం జ్యోతి. పరమాత్మే పరంజ్యోతిఅని వేదం అంటోంది. పరమాత్మ యజ్ఞ స్వరూపుడు. యజ్ఞ చిహ్నాన్ని దీపంగా భావిస్తారు. జ్యోతి లేదా దీప ప్రజ్వలన అంటే యజ్ఞం చేయడమే! దీపావళి రోజున దీపాలను ప్రజ్వలింపజేసి, జగన్మాతకు ధారపోసి, భక్తి ప్రపత్తులను సమర్పించుకోవడమే దీపయజ్ఞం. ఆ దీపాలను ఇంటి ముంగిట, దైవీ వృక్షాల చెంత, ఇంటిలోని ద్వారాల దగ్గర వరుసలుగా పేర్చడం దీపయజ్ఞంలో భాగమే. దీప దర్శనం పాపాలను హరిస్తుంది. దీపకాంతి దేవతలకు అత్యంత ప్రీతికరం. అందుకనే ప్రతి పూజారంభానికీ, శుభకార్యాలకూ దీప ప్రజ్వలనం ముఖ్యం. లౌకికంగా చెప్పాలంటే, మన హృదయాన్ని ప్రమిదగా భావించి, అందులో భకి్త అనే తైలం పోసి, ‘ప్రేమఅనే వత్తి నిలిపి వెలిగించేదే దీపం.

          దీపావళి పర్వాన్ని గురించి పురాణేతిహాసాలు విస్తృతంగా ప్రస్తావించాయి. రామాయణంలో రఘుకులాన్వయదీపునిగా రాముణ్ణి కీర్తిస్తూ, వనవాసానంతరం సీతారాముల పట్టాభిషేక సమయంలో అయోధ్యలో ప్రజలు దీపోత్సవం జరుపుకొన్నారట. కురుక్షేత్ర సంగ్రామానంతరం ధర్మరాజు విజయుడై పట్టాభిషేకం చేసుకున్న సందర్భంలో హస్తినాపుర ప్రజలు ఆనందోత్సాహాలతో దీపాలను వెలిగించి పండగ చేసుకున్నారని మహాభారతం చెబుతోంది. నచికేతుడు తన మేధస్సుతో యముడిని సంతృప్తిపరచి, ఆత్మను గురించి తెలుసుకున్నాడు. యముడి నుంచి స్వేచ్ఛ పొంది, నచికేతుడు తిరిగి భూలోకానికి వచ్చిన సందర్భంలో జరిగిన దీపోత్సవమే దీపావళి అని కఠోపనిషత్తుకథనం. క్షీరసాగర మథన సమయంలో అవతరించిన శ్రీమహాలక్ష్మికి దీపాలను వెలిగించి దేవతలు స్వాగతం పలికారని పద్మపురాణంపేర్కొంటోంది. దుష్ట దనుజులను దునుమాడిన మహాకాళిని జ్యోతిగా, లక్ష్మీస్వరూపంగా ఆరాధించినట్టు కాళికాపురాణం చెబుతోంది.

 

          దుర్వాస ముని శాపంతో ఇంద్ర పదవిని దేవరాజు కోల్పోయి, శ్రీ మహావిష్ణువును శరణు వేడాడనీ, ‘లక్ష్మీ జపధ్యానాలు చేస్తే, తిరిగి నీ పదవి నీకు దక్కుతుందని విష్ణుమూర్తి చెప్పాడనీ, ఆ ప్రకారం లక్ష్మీదేవి కోసం అతను తపస్సు చేసి, ఇంద్రపదవిని తిరిగి పొందాడనీ ఒక కథ ఉంది. దీపావళిని దీపాన్వికగా భవిష్య, నారద పురాణాలు పేర్కొన్నాయి. స్కాంద పురాణంలో దీపావళి గురించిన వివరణ విస్తారంగా ఉంది. నారద పురాణం దీన్ని దీప దాన మహోత్సవంఅని చెప్పింది. ముద్రారాక్షస గ్రంథం శారదోత్సవంగా, నాగానందం గ్రంథంలో దీప ప్రతిపాదనోత్సవంగా దీపావళిని పేర్కొన్నారు.

          'దీపేన సాధ్యతే సర్వం' అని శాస్త్రవచనం. 'దీపంతో దేనినైనా సాధించవచ్చు' అని భావం. నిత్యం దీపారాధన భారతీయుల సంప్రదాయం. ఉభయసంధ్యల్లో ఇంట్లో వెలిగించిన దీపం ఐశ్వర్యకారకం- అని ధార్మిక గ్రంథాలు బోధిస్తున్నాయి. 'ఏదైనా కోరిక తీరాలంటే, ఒక దీపాన్ని వెలిగించి- ఖర్జూరమో, ఎండుద్రాక్షో లేదో ఏదైనా ఫలమో నైవేద్యం పెట్టి నమస్కరించితే చాలు' అని ఆనవాయితీగా దీపారాధన కొనసాగుతోంది. ఇలా దీపారాధన చేయడంవల్ల ఏ ప్రయోజనమైనా పొందవచ్చు- అన్నది శాస్త్రోక్తి.

 

          దేవతలు ప్రకాశస్వరూపులనీ, కాంతి-శుభానికీ, జ్ఞానానికీ, శాంతికీ సంకేతమనీ చాటిచెప్పే ఆర్షభావన దీప ప్రజ్వలనలో కనిపిస్తోంది. జ్యోతిని వెలిగించడం శుభారంభం. తేజోమయులైన దేవతలు దీపంద్వారా సంతోషిస్తారనీ, దీపప్రకాశంలో సన్నిహతులవుతారనీ పురాణ ఋషుల దర్శనం. దీపకాంతి దివ్యత్వ ప్రతీక కనుక, ఆ దివ్యత్వాన్ని కావాలని ఆశిస్తూ దీపంద్వారా వ్యక్తీకరించుకుంటున్నాం. 'దీపమున్న చోట దేవతలుంటారు'- అనడం ఈ కారణం వల్లనే.

 

          కేవలం దీపాన్ని మాత్రమే వెలిగించి, ఆ జ్యోతిని ఆలంబనగా పరంజ్యోతి అయిన పరమాత్మను ధ్యానించడం ఒక యోగ ప్రక్రియ. భర్తృహరి తన శతక సాహిత్యంలో పరమేశ్వరుని 'జ్ఞానదీపం'గా అభివర్ణించాడు. ఈ దీపం యోగుల హృదయగృహంలో సుస్థిరంగా దీపిస్తోందని సంభావించాడు.


          భారత పురాణ ఇతిహాసాల్లోనూ, వేద వేదాంగాల్లోనూ దీపానికి ఉత్కృష్టమైన స్థానం ఉంది. దీపంలో మనం మొట్టమొదటిగా చూసే సుగుణం కాంతే కానీ అంతకు మించిన ఒక స్ఫూర్తిని దీపం మనకు అందిస్తుంది. దీపం చివరి వరకు తన కాంతిని పరులకి పంచుతుంది. తన నుండి మరొక దీపాన్ని వెలిగించేందుకు తపిస్తుంది. దీపం మనోవికాసానికీ, ఆనందానికీ, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. వెలుగు సంతోషకారకం. చీకటి కష్టకారకం. జీవితం చీకటి వెలుగుల కలయిక. జ్ఞాన వెలుగుల్ని ప్రసాదించేది దీపం. అజ్ఞానానికి చిహ్నమైన తమస్సును నశింపచేసి జీవులకు వెలుగు మార్గాన్ని చూపించేదే దీపం. అందుకే దీపం పరబ్రహ్మ స్వరూపంఅని భావిస్తూ ఆరాధిస్తారు. వెలిగించడంసనాతన భారతీయ సంస్కృతి.

          మంత్రశాస్త్ర ప్రకారం సాక్షాత్ దీపం దర్శయామిఅనే మంత్రం చదువుతూ గృహాన్ని శుభ్రం చేసి, నీటిని చల్లి, ముగ్గులు పెట్టి ధూపం వెలిగించి దీపం పెట్టడంవల్ల సకల దుష్ట గ్రహ శక్తులు నశించి వాతావరణం పరిశుభ్రం అవుతుంది. అప్పుడే ఆ గృహం పూజార్హతకు అవకాశం కలుగుతుంది. దీపం వెలిగించగానే ఇంటికి లక్ష్మీకళ వచ్చేస్తుంది. లక్ష్మీదేవి దీపవాసిని. దీపకాంతి నుంచే కళ పుడుతుంది. దీపం అమంగళాన్నీ, దారిద్య్రాన్నీ, అరిష్టాల్ని పారద్రోలే శక్తి స్వరూపం. దీపం వెలగని ఇంట్లో అలక్ష్మి తాండవిస్తుందంటారు పెద్దలు. పూర్వకాలంలో ప్రతి ఇంటా నిత్యం అగ్నిహోత్రం నిర్వహించేవారు. కానీ నేటి పరిస్థితుల దృష్ట్యా రోజూ అగ్నిహోత్రం వెలిగించడం సాధ్యం కాదు. కానీ ఇంట్లో రోజూ ఉదయం, సాయంకాలం దీపారాధన చేయడం శుభప్రదం. మరణించిన వ్యక్తులకు ఉత్తమ గతులు సిద్ధించాలన్నా దీపాలు వెలిగించాలని శాస్త్రాలు చెబుతున్నాయి.

==============

 డాక్టర్ కప్పగంతు రామకృష్ణ

సెల్: 90320 44 115 / 8897 547 548

 

 


Tuesday, April 5, 2022

శ్రీసీతారామ కల్యాణ వైభవం

 

 

 

శ్రీ సీతారామ కల్యాణ వైభవం

 

 శ్రీ సీతారాములు - ఆదర్శదంపతులకు అసలైన అర్థం. సీతారామ కల్యాణం - యావత్ప్రపంచానికి శాంతిసౌభాగ్యాలను అందించిన మహోన్నత ఘట్టం. ఎన్నో వేల సంవత్సరాల క్రితం జరిగిన ఈ కల్యాణం నేటికీ నిత్యనూతనంగా వెలుగులు విరజిమ్ముతూ, సనాతన భారతీయ దాంపత్య ధర్మ వైభవానికి కీర్తిపతాకంగా అఖండంగా, అనంతంగా విశ్వవిహారం చేస్తూనే ఉంది.

 ముప్ఫైమూడు కోట్ల మంది దేవతలు ఉన్న హైందవ ధర్మంలో మరే ఇతర దేవతల కల్యాణానికి దక్కని వైభవం, మహత్తు కేవలం సీతారామ కల్యాణానికే మాత్రమే దక్కాయి. ఒక్క సీతారాముల కల్యాణాన్ని మాత్రమే సీతారామ శాంతి కల్యాణం అని పిలుస్తారు. వైదిక క్రతువుల్లో కూడా 'శ్రీసీతారామ శాంతి కల్యాణ మ¬త్సవాంగత్వే...' అని సంకల్పం మొదలు మాంగల్యధారణ, ఆర్ద్రాక్షతారోపణ వరకు చెబుతారు. దీని ద్వారా సీతారామ కల్యాణం లోకకల్యాణ హేతువని అర్థమవుతోంది.

ఆలూమగలంటే సీతారాముల వలే ఒకరికొకరుగా ఉండాలనటం, నవదంపతుల్ని సీతారాముల్లాగా ఉండమని ఆశీర్వదించటం, ఉత్తమ సాధ్విని సీతమ్మ తల్లిగా పిలవటం, గౌరవ మర్యాదలు తెలిసిన వ్యక్తిని మా మంచి రామయ్య అనటం, శ్రీరామనవమి రోజున సీతాకల్యాణం జరిగిన తర్వాతనే తమ బిడ్డల వివాహ సుముహూర్తాలు నిశ్చయించుకునే ఆచారం పాటించటం, సీతారామకల్యాణ అక్షతలను తమ బిడ్డల వివాహ తలంబ్రాలలో కలిపితే నవదంపతులు చల్లగా ఉంటారనే విశ్వాసం కలిగి ఉండటం, ఇంకా మరెన్నో సంప్రదాయాలు, ఆచారాలు, విశ్వాసాలు - కేవలం సీతారామ కల్యాణానికి మాత్రమే చెందిన ప్రత్యేకతలు. యావత్ప్రపంచ వాజ్ఞ్మయంలో మరే ఇతర కల్యాణం సాధించని అరుదైన ఘనతకు ప్రతిరూపాలు.

సీతారామ కల్యాణానికే ఎందుకీ ఘనత? అంటే - సీతారాములిద్దరూ సాధారణ స్త్రీపురుషులు కాదు. వారిద్దరూ యజ్ఞఫలితంగా ఆవిర్భవించిన పుణ్యమూర్తులు. తమ వంశం తరించటానికి పుత్రసంతానం కోసం దశరథ మహారాజు చేసిన యాగఫలితంగా శ్రీరామచంద్రమూర్తి జన్మిస్తే, యజ్ఞ నిర్వహణలో భాగంగా యాగశాల కోసం భూమిని దున్నుతున్న జనక మహారాజుకు నాగేటి చాలు ద్వారా లభించిన యజ్ఞప్రసాదం సీతాదేవి. 'యజ్ఞాః లోక కల్యాణ హేతవః' - యజ్ఞాలు లోక కల్యాణానికి కారకాలుగా నిలుస్తాయి. అటువంటి యజ్ఞ ఫలితంగా జన్మించిన సీతారాముల కల్యాణం లోకకల్యాణ యజ్ఞానికి హేతువుగా నిలిచింది.

 ఆత్మప్రబోధం... శివధనుర్భంగం

 విశ్వామిత్రుని యాగసంరక్షణ కోసం బయలుదేరిన రామలక్ష్మణులు, యాగం పూర్తికాగానే విశ్వామిత్రుని వెంట మిథిలా నగరానికి వెళ్ళి, జనక మహారాజు ఆస్థానానికి చేరుకుంటారు. విశ్వామిత్రుడు చెప్పిన మీదట జనక మహారాజు శివధనుస్సును రామలక్ష్మణులు చూపించటానికి సిద్ధపడి, ఆ ధనస్సును తీసుకురావల్సిందిగా తన మంత్రులను ఆదేశిస్తాడు.

 నృణాం శతాని పంచాశత్‌ వ్యాయతానాం మహాత్మనామ్‌

మంజూషామ్‌ అష్టచక్రానాం తాం సమూహస్తే కథంచన ||

 బలిష్ఠులు, దీర్ఘకాయులు అయిన ఐదువేల మంది పురుషులు, ఎనిమిది చక్రాలున్న శకటం మీద అమర్చి ఉన్న శివధనుస్సును అతి కష్టంతో తోసుకుంటూ తీసుకువస్తారు. నాగ, కిన్నెర, కింపుర, యక్ష, రాక్షసులతో సహా సమస్త దేవతా గణాలకు ఈ ధనస్సును ఎక్కుపెట్టటం సాధ్యం కాలేదని జనకుడు విశ్వామిత్రునితో చెబుతాడు. వెంటనే విశ్వామిత్రుడు 'వత్స రామ ధను: పశ్య' - నాయనా రామా! ఈ ధనుస్సును చూడు అంటాడు. వ్యవహారభాషలో చెప్పాలంటే ఈ ధనుస్సు సంగతి చూడు అని అర్థం.

 మహర్షి వాక్యంలోని అంతరార్థం గ్రహించిన రాముడు 'లీలయా స ధనుర్మధ్యే జగ్రాహ వచనాన్మునేః' - ఆ ధనుస్సు మధ్యభాగాన్ని చేతితో పట్టుకుని, ఎంతో అలవోకగా ఎక్కుపెడతాడు. కేవలం రాముని కరస్పర్శతోనే ధనుస్సు వంగుతుంది. ఎడమ చేతితో ధనుస్సును పట్టుకుని, కుడి చేతితో ఆ వింటి నారిని పైకొనకు బంధించి, ఆకర్ణాంతం ఆల్లెత్రాటిని లాగుతాడు. మరుక్షణంలో ఫెళఫెళమంటూ లోకభీకరమైన శబ్దం చేస్తూ, శివ ధనుస్సు రెండుగా విరుగుతుంది. సీతారామ కల్యాణానికి ఇదే శ్రీకారం.

 హోజ్జ్వలమైన ఈ ఘట్టాన్ని ఆధ్యాత్మికంగా పరికించి చూస్తే, సమున్నతమైన ఆత్మబోధ మనకు అందుతుంది. శాస్త్ర పరిభాషలో ధనుస్సు అంటే ఓంకారం లేక ప్రణవం అని అర్థం. 'ప్రణవో ధనుః శిరోహ్యాత్మా బ్రహ్మతల్లక్ష్యముచ్చతే' - అని ఉపనిషద్వాక్యం. ప్రణవం అంటే వంగేది అని అర్థం. ప్రణవం ఎవరికైతే వంగుతుందో, అటువంటి వ్యక్తికి మన ఆత్మను అర్పించాలి. ఇక్కడ ధనుస్సు రూపంలో ప్రణవం రామచంద్రునికి వంగింది. అంటే, మన ఆత్మను అర్పించటానికి తగిన దైవం రామచంద్రమూర్తి. శివధనుస్సును ఎక్కుపెట్టటానికి ఎందరో దేవతలు కూడా ప్రయత్నించారు. వారెవరికీ అది సాధ్యం కాలేదు. అంటే ప్రణవం ఎవరికీ వంగలేదు. రామునికి మాత్రమే వంగింది. అంటే, మన ఆత్మార్పణకు అసలైన మార్గం శ్రీరాముని చరణాలే అని స్పష్టమవుతోంది.

 ఓంకారం కారణదశలో అకారంగా మారుతుంది. 'అదితి భగవతో నారాయణస్య ప్రథమ విధానం' అనే వాక్యం ప్రకారం అకారం శ్రీమన్నారాయణుడి యొక్క మొదటి పేరు. 'ఏతస్మిన్‌ అంతరే విష్ణురుపయాత మహాద్యుతిః' - దశరథునికి పుత్రుడిగా జన్మించింది సాక్షాత్తు శ్రీమహావిష్ణువు. అంటే, ప్రణవ స్వరూపుడైన శ్రీమహావిష్ణువే దశరథుని కుమారుడైన శ్రీరామచంద్రునిగా మానవావతారంలో జన్మించాడు. అందుకనే జనకుడు లక్ష్మీస్వరూపిణి అయిన సీతమ్మను నారాయణ స్వరూపుడైన రామచంద్రునికి అర్పించాడు.

 మరొక అర్థంలో చూస్తే - శ్రీరామచంద్రుడు ఒక్కసారిగా శివధనుస్సును ఎక్కుపెట్టాడు. దాన్ని సంధించటానికి ఉన్న నారిని కట్టగానే, ఒక్కసారిగా ధనుస్సు రెండు ముక్కలెలంది. ధనస్సు యొక్క ఒక భాగం శ్రీరాముని చేతిలో ఉంది. రెండో భాగం నారి ద్వారా వేలాడుతోంది. ఇది శివధనుర్భంగ దృశ్యం. ', , ' అనే అక్షరాల కలయికే ఓం కారం. అక్షరానాం అకారోస్మి అనే వాక్యం ప్రకారం రామచంద్రమూర్తి అకార స్వరూపం. ఇది (నారాయణ స్వరూపం) నేను చెప్పటానికి రాముడు ధనుస్సు యొక్క ఒక భాగాన్ని తన చేతితో పట్టుకున్నాడు. రెండో భాగం ''తో కలిసి ఉండే '' అంటే మనిషి (జీవుడు). '' కి '' కి మధ్య ఉన్న ధనుస్సు యొక్క నారి '' కార స్వరూపం. ''కారాన్ని ''కారాన్ని ''కారం కలిపి ఉంచుతుంది. ఆంటే, జీవాత్మ, పరమాత్మల సంబంధం ఎప్పటికీ వేరు పడేది కాదు అనే సత్యం మనకు బోధ పడుతుంది.

 రెండుగా విడిపడిన ధనుస్సు యొక్క ఒక ఖండాన్ని చేతితో పట్టుకుని 'ఓంకార ప్రతిపాద్యమైన దైవాన్ని నేనే సుమా! జీవుడు నాకు సంబంధించిన వాడే కానీ స్వతంత్రుడు కాడు' అనే విషయాన్ని రామచంద్రమూర్తి స్పష్టంగా ప్రకటించాడు. ఇదీ శివధనుర్భంగ ఘట్టం ద్వారా మనకు అందే అద్వైత వేదాంత బోధ.

 పంచభూతాత్మక పరతత్త్వం

 రాముడు నీలమేఘ శ్యాముడు. నీలవర్ణం ఆకాశ లక్షణం. అంటే రాముడు పంచభూతాల్లో ఒకటైన ఆకాశ తత్త్వానికి ప్రతీక. సీతమ్మ నాగేటి చాలు ద్వారా అయోనిజగా లభించింది. అంటే, సీతమ్మ పంచభూతాల్లో మొదటిదైన భూతత్త్వానికి ఆలంబన. పంచభూతాల్లో మొదటిదైన భూతత్త్వం సీతమ్మ కాగా, చివరిదైన ఆకాశ తత్త్వం రామయ్య. ఈ రెండిటి మధ్యలోనే మిగిలిన మూడు తత్త్వాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఆకాశం భూమిని చేరుతుందో (వాన చినుకుగా మారి) అప్పుడు పుడమి (భూమి) పులకరిస్తుంది. సస్యాన్ని అందిస్తుంది. ఆ సస్యం జీవులకు ఆహారంగా మారి, శక్తిని ఇస్తుంది. అంటే, ఎప్పుడు రామయ్య సీతమ్మకు చేరుకుంటాడో (సీతారామ కల్యాణం జరుగుతుందో) అప్పుడే లోకానికి శక్తి (రావణాది రాక్షస బాధ నుంచి విముక్తి పొందే శక్తి) అందుతుంది. ఈవిధంగా సీతారామ కల్యాణం లోక కల్యాణ కారకంగా, శాంతి దాయకంగా నిలుస్తుంది.

 లౌకిక వ్యవహారంలో చూసినా, సీతారామ కల్యాణం సంవత్సరంలో మొదటి (వసంత) ఋతువు, మొదటి (చైత్రం) నెలలో జరుగుతుంది. అంటే, కొత్త సంవత్సరంలో జరిగే తొలి కల్యాణం సీతారాముల కల్యాణమే. శిశిరంలో ఆకులు రాలి మోడుగా తయారైన చెట్లు, వసంతం రాగానే చిగురించి, నూతన శోభను సంతరించుకుంటాయి. ఎప్పుడు సీతారామ కల్యాణం జరుగుతుందో అప్పుడు నవ వసంతం మొదలవుతుంది. ఎవరు సీతారామ కల్యాణం జరుపుతారో, వారి జీవితాల్లో నవ వసంతం నిత్యవసంతంగా మారుతుంది. ఇదీ సీతారామ కల్యాణవైభవం.

 కల్యాణగానం 

 రాములోరి పెళ్ళిగా జానపదులు సీతారామ కల్యాణ వైభవాన్ని జానపదాలుగా పాడుకుని, తనివితీరా రామభక్తి సామ్రాజ్యంలో మునిగి తేలుతుంటారు. పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమయ్య కూడా తన కీర్తనల్లో అనేక చోట్ల సీతారాముల కల్యాణోత్సవాన్ని, నవదంపతులుగా సీతారాములను మనసారా కీర్తించాడు. 'రామం ఇందీవర శ్యామం పరాత్పర ధామం - సుర సార్వభౌమం భజే - సీతా వనితా సమేతం'; 'అట్టె హరువిల్లు విరిచిన రాఘవా - సిరులతో జనకుని యింటను జానకి జెలగి పెండ్లాడిన రాఘవా', 'రాముడు రాఘవుడు రవికులుడితడు - భూమిజకు పతియైన పురుష నిధానము' వంటి కీర్తనలు ఇందుకు ఉదాహరణ. 'సీతమ్మ మాయమ్మ..' వంటి వాగ్గేయకార కృతులు, 'వామే భూమిసుతా పురశ్చ హనుమాన్‌...' వంటి ధ్యానశ్లోకాలు సీతారాముల అన్యోన్య దాంపత్యాన్ని నిరంతరం మననం చేస్తాయి. 

మొత్తంగా సీతారామ కల్యాణం లోక కల్యాణ కారకంగా, ఆత్మచైతన్య ప్రబోధకంగా, ధార్మిక జీవన మార్గదర్శకంగా నిలుస్తుంది. అన్నిటినీ మించి, యావత్ప్రపంచం శిరసు వంచి నమస్కరిస్తున్న సనాత హైందవ వైవాహిక జీవన ధర్మానికి ఆలంబనగా నిలుస్తుంది.

 --------------------------------------

డాక్టర్‌ కప్పగంతు రామకృష్ణ,  

సెల్‌: 90320 44115

పున్నమి కాంతుల కల్యాణం (ఒంటిమిట్టలో జరిగే శ్రీ సీతారామ కల్యాణం నేపథ్యంగా శ్రీకనకదుర్గ ప్రభ పత్రికలో రాసిన వ్యాసం)

  పున్నమి కాంతుల కల్యాణం                లోకంలో పెళ్ళి ముచ్చట అంటే సీతారాములదే. అందులోనూ ఒంటిమిట్ట ఆలయంలో జరిగే సీతారాముల కల్యాణం మరింత శ...