Saturday, August 3, 2019

స్నేహితుల దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr Kappagantu Ramakrishna) ఈనాడులో రాసిన వ్యాసం

నేస్తామంటే .. సమస్తం!
ఇవాళ ఫ్రెండ్‌షిప్‌ డే కదా... మన నేస్తాల్ని కలిసి శుభాకాంక్షలు చెప్పేస్తాం... ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్‌ కట్టేస్తాం... రోజంతా సరదాగా గడిపేస్తాం... ఇది సరే... అసలు ఫ్రెండంటే ఎలా ఉండాలి? నిజమైన స్నేహితుడు ఎవరు? స్నేహం గొప్పదనం ఏంటి? ఆ మంచి మైత్రిని చూపిన కొన్ని స్నేహాలు మన పురాణాలు, ఇతిహాసాల్లో ఉన్నాయ్‌...  మరి వాటి గురించి తెలుసుకుందామా!
అంతస్తుల తేడాల్లేవ్‌!
నిజమైన స్నేహితుల మధ్య ధనవంతుడు, పేదవాడు అన్న తేడా ఉండదు. చదువు పూర్తయి జీవితంలో ఉన్నతస్థానాలకు చేరుకున్నా చిన్ననాటి మిత్రుల్ని జ్ఞాపకం పెట్టుకుని, వారిని ఆదరించాలి.
శ్రీకృష్ణుడు, కుచేలుడు స్నేహితులని తెలుసుగా. వీరిద్దరూ సాందీప మహర్షి దగ్గర చదువుకుంటున్నప్పుడు ఓ రోజు హోమం చెయ్యటానికి అవసరమైన సమిధలు తేెవడానికి అడవికి వెళ్లారు. ఉన్నట్టుండి పెద్ద గాలీవానా. ఇద్దరూ అడవిలో చిక్కుకుపోయారు. అక్కడే ఉన్న ఓ చెట్టు కొమ్మల మీద ఇద్దరూ కూర్చున్నారు. కుచేలుడు తన కండువాలో మూట కట్టుకువచ్చిన అటుకులు తింటాడు. ‘కుచేలా! ఏం తింటున్నావు’ అంటూ కృష్ణుడు అడుగుతాడు. ‘ఏమీ లేదు చలికి నా దవడలు వణుకుతున్నాయి’ అని అబద్ధం చెబుతాడు కుచేలుడు. అంతలోనే తప్పు తెలుసుకుని తన దగ్గర ఉన్న కొన్ని అటుకుల్ని కృష్ణుడికి ఇస్తాడు. పేదవాడైన కుచేలుడు ఇచ్చిన అటుకుల్ని యువరాజైన కృష్ణుడు ఆప్యాయంగా తీసుకుంటాడు. గాలీవానా తగ్గాక మర్నాడు గురుకులానికి చేరుకుంటారు. తర్వాతికాలంలో కృష్ణుడు ద్వారకా నగరానికి రాజు అవుతాడు. చాలా సంవత్సరాల తర్వాత పేదరికంతో ఇబ్బందిపడుతూ తనను చూడటానికి వచ్చిన బాల్యస్నేహితుడు కుచేలుడిని ప్రేమగా పలకరించి, ఎన్నో మర్యాదలు చేస్తాడు. కుచేలుడికి సంపదలిచ్చి సాయపడతాడు. స్నేహానికి పేద, గొప్ప తేడాలేమీ ఉండవని నిరూపిస్తాడు.
త్యాగానికి చిరునామా!
స్నేహం ఒక రోజుతోనో, కొన్ని సంవత్సరాలతోనో తీరిపోయేది కాదు. మన నేస్తంతోపాటు అతడి కుటుంబానికి సైతం మిత్రులుగా ఉండాలి. అదే అసలైన స్నేహం అవుతుంది. మిత్రుడిని ఎంతగా ప్రేమిస్తామో అతడి కుటుంబ సభ్యులనూ అంతే ప్రేమగా ఆదరించాలి.
శ్రీరాముడి తండ్రి అయిన దశరథమహారాజు, జటాయువు ప్రాణ స్నేహితులు. యుద్ధాల్లో ఒకరికొకరు తోడుగా నిలిచారు. దశరథుడు మరణించిన తర్వాత అతడి కుమారుడైన రాముడినీ జటాయువు స్నేహితుడిగానే చూశాడు. వనవాసానికి వచ్చిన వెంటనే రాముడికి తనను తాను పరిచయం చేసుకున్నాడు జటాయువు. నా మిత్రుడిలాగే నిన్నూ కాపాడతానని మాట ఇచ్చాడు. రావణుడు సీతమ్మను అపహరిస్తున్నప్పుడు అతడితో ప్రాణాలకు తెగించి పోరాటం చేశాడు. రెక్కలు తెగిపడిపోయినా రాముడు వచ్చేవరకు ప్రాణాలు బిగపట్టి నిలుపుకొన్నాడు. సీతమ్మ వివరాలు చెప్పి కన్నుమూశాడు. స్నేహమంటే త్యాగం. స్నేహమంటే ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి మిత్రుడిని ఆదుకోవటం అనటానికి జటాయువు ఉదాహరణగా నిలిచాడు.
సాహస గుణం!
నేస్తానికిచ్చిన మాట నిలబెట్టుకోవటం కోసం ప్రాణత్యాగం చెయ్యటానికైనా సిద్ధపడటం స్వచ్ఛమైన స్నేహం.
రామాయణం వినే ఉంటారుగా. అందులో రావణాసురుడు అపహరించిన సీతమ్మ జాడ తెలుసుకునేందుకు తన వానర సైన్యాన్ని పంపిస్తానని రాముడికి మాట ఇస్తాడు సుగ్రీవుడు. అప్పటిదాకా తన రాజ్యంలోనే ఉండమంటాడు. కొంతకాలానికి సీతమ్మ లంకలో ఉన్నట్లు సమాచారం వస్తుంది. ఒకరోజున రాముడికి చెప్పకుండా సుగ్రీవుడు ఆకాశమార్గాన లంకకు చేరి రావణుడితో కయ్యానికి సిద్ధపడతాడు. రావణుడి పరాక్రమానికి తట్టుకోలేక తిరిగి కిష్కింధకు చేరుకుంటాడు. విషయం తెలుసుకున్న రాముడు మిత్రుడైన సుగ్రీవుడు చేసిన సాహసానికి ఎంతో ముచ్చటపడతాడు. అయితే, ప్రాణాల మీదకు తెచ్చుకునే ఇలాంటి దుస్సాహసం ఇకమీదట ఎప్పుడూ చెయ్యవద్దంటాడు. అవసరమైతే అయోధ్యను వదులుకుంటానని, స్నేహితుడి కన్నా తనకు లోకంలో మరెవ్వరూ ఎక్కువ కాదంటాడు. ఇకమీదట ఇలాంటి పనులు చెయ్యనని సుగ్రీవుడి దగ్గర మాట తీసుకుంటాడు.
తోడూనీడా!
స్నేహం అంటే కలిసి తిరగటం, కబుర్లు చెప్పుకోవటం  కాదు. మిత్రుడికి వచ్చిన కష్టాన్ని తన కష్టంగా భావించి, దాన్నుంచి బయటపడటానికి సాయం చెయ్యాలి. నిరాశలో కూరుకుపోతే ధైర్యం చెప్పాలి. కర్తవ్యం వైపు ప్రోత్సహించాలి.
మహాభారతంలో కౌరవ పాండవుల మధ్య యుద్ధానికి అంతా సిద్ధంగా ఉంది. రెండు వైపులా వీరులంతా యుద్ధరంగానికి చేరుకున్నారు. అర్జునుడి సారథిగా ఉన్న అతడి ప్రాణమిత్రుడు కృష్ణుడు రథాన్ని నేరుగా యుద్ధరంగంలోకి తీసుకువస్తాడు. యుద్ధరంగంలో కౌరవుల పక్షంలో ఉన్న తన బంధువులు, మిత్రుల్ని చూసి అర్జునుడు కలత చెందుతాడు. యుద్ధం చెయ్యలేనంటూ రథం దిగిపోతాడు. గొప్ప పరాక్రమవంతుడైన తన మిత్రుడు అర్జునుడు పిరికివాడిలాగా యుద్ధరంగం నుంచి పారిపోవటం కృష్ణుడికి ఏమాత్రం నచ్చదు. యుద్ధం ఎందుకు చెయ్యాలో, చెయ్యకపోవటం వల్ల కలిగే ఫలితాలు ఏమిటో అన్నీ చక్కగా వివరిస్తాడు. నిరాశ వదిలిపెట్టాలని, సరైన సమయంలో ధైర్యం కోల్పోతే లక్ష్యాన్ని సాధించలేమంటూ బోధిస్తాడు. అర్జునుడిలో ఉన్న విచారం, నిరాశ అన్నీ కృష్ణుడి మాటలతో తొలగిపోతాయి. కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధిస్తాడు.
- కప్పగంతు రామకృష్ణ
04.09.2019


No comments:

పున్నమి కాంతుల కల్యాణం (ఒంటిమిట్టలో జరిగే శ్రీ సీతారామ కల్యాణం నేపథ్యంగా శ్రీకనకదుర్గ ప్రభ పత్రికలో రాసిన వ్యాసం)

  పున్నమి కాంతుల కల్యాణం                లోకంలో పెళ్ళి ముచ్చట అంటే సీతారాములదే. అందులోనూ ఒంటిమిట్ట ఆలయంలో జరిగే సీతారాముల కల్యాణం మరింత శ...