సీతారామ కల్యాణ వైభవం
రామయ్యా...ఇదిగోనయ్యా సీతమ్మ!
బంధం కలిస్తే బంధుత్వం...పెనవేసుకున్న అనుబంధం అంతులేని సంతోషానికి
కారణమవుతుంది.మనుషుల మధ్య ఈ అనురాగ ముడులను వేసే ఓ ప్రక్రియ పెళ్లి...వివాహం
ఇద్దరు మనుషులనే కాదు, రెండు కుటుంబాలను కూడా కలుపుతుంది. అంతుకుమునుపు
పరిచయం లేని మనుషుల మధ్య ఆత్మీయతకు కారణమవుతుంది. ఎప్పుడో త్రేతా యుగంలో
జరిగినట్లు భావించే సీతారామకల్యాణమూ
అంతే... భార్యభర్తల బాధ్యతలు, అత్తమామల దీవెనలు, వియ్యంకుల మర్యాదలు..అప్పగింతలు, పలకరింపులు...ఇలా ఎన్నో
ఆత్మీయానురాగాలు అందులో అందంగా ప్రతిబింబిస్తాయి...అందుకే ఆ కల్యాణం లోకానికి ఓ సంప్రదాయమైంది...మార్గదర్శనమైంది..వాల్మీకి
రామాయణంలోని ఈ ఘట్టాలు ఎప్పటికీ
అపురూపాలే...
ఆ శుభ తరుణంలో...
పెళ్లి తర్వాత ప్రేమ...
నిజానికి శివధనుస్సును రామయ్య కావాలనో, సీతమ్మను వివాహం చేసుకోవాలనో
ఎక్కుపెట్టలేదు. తన గురువైన విశ్వామిత్రుని ఆదేశం మేరకే శివధనుస్సుని
ఎక్కుపెట్టాడు. ఆ తర్వాత కూడా నేరుగా సీతమ్మను స్వీకరించలేదు. తన తండ్రి దశరథుడు
వచ్చి, జనకమహారాజుతో మాట్లాడి,
ఇద్దరూ
అంగీకరించిన తర్వాతనే సీతమ్మను వివాహం చేసుకోవటానికి ఇష్టపడ్డాడు. అలాగని, బలవంతపు వివాహం కూడా కాదు. సీతారాములిద్దరికీ ఒకరంటే ఒకరికి
వర్ణించలేనంత ప్రేమ.
ప్రియాతు సీతా రామస్య దారాః పితృకృతా ఇతి ।
గుణాద్రూప గుణాచ్ఛాపి ప్రీతిః భూయోభివర్థత ।। (వాల్మీకి రామాయణం)
పెద్దలు కుదిర్చిన పెళ్లి కదా అని రామయ్య సీతమ్మను మరింతగా
ఇష్టపడ్డాడట. సీతమ్మ కూడా తన గుణగణాలతో రామయ్యకు తనపై ప్రేమ కలిగేలా చేసుకుందట. తన
వెంట నడచివచ్చిన మహిళను ప్రేమగా చూసుకోవాల్సిన సందేశాన్ని రామయ్య, భర్తను అనురాగంతో, ప్రేమతో మాత్రమే తనవాడిని చేసుకోవాలనే
సందేశాన్ని సీతమ్మ తమ వివాహం ద్వారా అందించారు. అందుకనే, సీతారాములు ఆదర్శ దంపతులయ్యారు.
మరి కల్యాణం ఆ రోజెందుకు?
నిజానికి సీతారామ కల్యాణం ఉత్తర ఫల్గుణి నక్షత్ర యుక్త వైశాఖ శుద్ధ
దశమి నాడు జరిగింది. కానీ ‘మహతాం జన్మనక్షత్రే వివాహం’ అంటుంది ఆగమ శాస్త్రం. మహాత్ములు, అవతారమూర్తుల జన్మతిథి నాడు ఆ
నక్షత్రంలో భక్తులు కల్యాణం చేయాలని శాస్త్ర నియమం. చైత్ర శుద్ధ నవమి నాడు
పునర్వసు నక్షత్రంలో జన్మించాడు శ్రీరాముడు. ఆ పర్వదినాన్ని శ్రీరామనవమిగా ఘనంగా
చేసుకుంటారు. ఈ సందర్భంగా ఊరూవాడా సీతారాముల కల్యాణం జరుపుతారు. ఇలాగే
మహాశివరాత్రి సందర్భంగా కూడా శివపార్వతులకు కల్యాణోత్సవం నిర్వహిస్తుంటారు.
మిథిలా నగరం...
ఎప్పుడూ ధీరగంభీరంగా ఉండే జనకమహారాజు భవనం దేదీప్యమానంగా
వెలిగిపోతోంది...
శివధనుస్సును శ్రీరాముడు విరిచేశాడంట.
మన జనక మహారాజు గారాల పట్టి సీతను ఆయనే చేపట్టబోతున్నాడు...
మా జానకేమో చందనపు తునక... మరి రాముడో...
ఆయనేమీ తక్కువ కాదు... నీలమేఘశ్యాముడంట, దశరథ మహారాజు చాలా గారాబంగా
పెంచాడంట... అందంలో చంద్రుడితో పోటీ అంట...
అందుకే ఆయనను రామచంద్రుడని పిలుస్తారంట...
అంతఃపురమంతా ఇదే ముచ్చట... ఎప్పుడెప్పుడు కన్నులకు పండువ అవుతుందా
అని ఎదురుచూపులు...
మహాత్మా! నేను దశరథనందనుడి యశస్సు, వీరత్వాన్ని కళ్లారా తిలకించాను. నాకుమార్తె
సీత, దశరథా¯త్మజుడైన శ్రీరాముణ్ణి వివాహమాడి మా
జనక వంశానికి కీర్తి తెస్తుంది. మీరు అనుమతిస్తే నా మంత్రులు రథాలపై వాయువేగంతో
అయోధ్యానగరానికి వెళతారు. ఇక్కడ జరిగింది దశరథ మహారాజుకు వివరించి, వారిని సకుటుంబ సపరివార సమేతంగా మిథిలకు తీసుకొస్తారు. అని విశ్వామిత్రుడికి
విన్నవించాడు జనకుడు. విశ్వామిత్రుడు అనుమతించాడు.
అయోధ్యలో విషయం తెలుసుకున్న కౌసల్య, సుమిత్ర, కైకేయిల సంతోషానికి పట్టపగ్గాలు లేవు. నిన్నటి దాకా మన చేతుల్లో ఆడుతున్నట్లే ఉన్నాడు ముద్దుల రాముడు... మన
మురిపాల కొండ... అప్పుడే పెళ్లికొడుకవుతున్నాడు. దశరథుడు తన పరివారంతో పాటు వశిస్ఠుడు, వామదేవుడు, జాబాలి, కశ్యపుడు, మార్కండేయుడు,
కాత్యాయనుడు
వంటి మహనీయులతో, చతురంగ బలాలలో విదేహ దేశం చేరుకున్నాడు.
వియ్యాలవారిని అల్లంతదూరంలోనే చూసిన జనకుడు వారికి ఎదుర్కోలు పలికి, ఇతర స్వాగత సత్కారాలు చేశాడు. జరిగిన
విషయమంతా చెప్పి, తన కుమార్తెను కోడలిగా స్వీకరించమని దశరథుడిని
కోరతాడు.
ప్రతిగృహో దాతృవశః శ్రుతం ఏతత్ మయా పురా।
యథా వక్ష్యసి ధర్మజఞ తత్ కరిష్యామహే వయం ।।
అందుకు దశరథుడు అయ్యయ్యో! జనకా.. అలా అంటావేంటి. అసలు ఇచ్చేవాడంటూ
ఉంటే కదా పుచ్చుకునేవాడు ఉండేది. నీ కుమార్తెను నా కోడలిగా చేస్తానంటున్నావు.
నువ్వు దాతవు. నేను పుచ్చుకునేవాడిని... అంటూ ఎంతో ఆప్యాయంగా జనకుడి ఆహ్వానాన్ని
స్వీకరిస్తాడు. తన బంధుత్వం మరింతగా దృఢపడాలంటూ వారు ఎంతో ఆప్యాయంగా పరస్పర సంభాషణ
చేసుకుంటారు.
అదిగదిగో... ఆ రోజు రానేవచ్చింది...
వైశాఖ శుద్ధ దశమి ఉత్తర ఫల్గుణి నక్షత్ర శుభముహూర్తాన్ని సీతారాముల
కల్యాణానికి వేదమూర్తులు నిర్ణయించారు.
కల్యాణవేదికను సర్వాంగ సుందరంగా అలంకరించారు. నానావిధ పరిమళ పత్ర
పుష్పాలతో కల్యాణమంటపం ముస్తాబైంది. మిథిలా నగరమంతా మహా సందడిగా మారింది.
శ్రీరాముడికి సీతతో పాటు లక్ష్మణుడికి సీత సోదరి ఊర్మిళను,
భరతుడికి
జనకుడి సోదరుడైన కుశధ్వజుని పెద్దకూతురు మాండవి, శతృఘ్నుడికి కుశధ్వజుని మరోకుమార్తె
శ్రుతికీర్తిని ఇచ్చి వివాహం జరిపించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
అటు జనకమహారాజు కన్యాదానం చెయ్యటానికి, ఇటు దశరథుడు కన్యాదానం తీసుకోవటానికి
అవసరమైన అన్ని వైదిక కార్యక్రమాలు సశాస్త్రీయంగా నిర్వహించారు. దశరథ మహారాజు
కన్యాదానం పుచ్చుకోవటానికి బయల్దేరి జనకుడి సభ బయట ఉండి, తన రాక గురించి మహారాజుకు
కబురుచేస్తాడు. అందుకు ప్రతిగా జనకుడు దశరథుడితో మహారాజా! ఇకపై జనకుడి ఇంటికి, దశరథుడి ఇంటికి తేడా లేదు. మిమ్మల్ని అక్కడ ఎవరైనా ద్వారపాలకులు
ఆపుతున్నారా? మీరు నేరుగా భవనంలోకి రండి. ఇది మీ ఇల్లే అంటూ
ఆప్యాయంగా స్వాగతం పలుకుతాడు. ఎంతో ప్రేమ, ఆప్యాయత నిండిన మనస్సుతో జనకుడు చేసిన
ఆహ్వానం, పలికిన పలుకులతో దశరథుడు మరింతగా పొంగిపోయాడు.
ఆకాశమంత పందిరి కింద, భూదేవి అంత వేదిక సిద్ధంచేశారు.
మంగళవాయిద్యాలు మారుమోగుతున్నాయి. వేదమంత్రాలు శ్రావ్యంగా వినిపిస్తున్నాయి.
సుగంధద్రవ్యాలు గుభాళిస్తున్నాయి. పన్నీటి చిలకరింపులు హాయిగొలుపుతున్నాయి..
మగపెళ్లివాళ్లంతా ఠీవీగా కూర్చున్నారు. వారికి జనక మహారాజు పరివారం వారికి నమ్రతగా,
వినయ
విధేయతలతో సపర్యలు చేస్తున్నారు. నలుగురు పెళ్లికుమారులు, నలుగురు పెళ్లికుమార్తెలు సిరికల్యాణ
తిలకంతో, మణిమయ బాసికాలతో, సీతారాములు శోభిల్లుతున్నారు.
బంగారుమంటపంలో సీతారాములు వధూవరులుగా కూర్చున్నారు. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు వంటి మహర్షుల ఆధ్వర్యంలో పురోహితులు పెళ్లిమంత్రాలు
చదువుతున్నారు. ముహూర్త ఘడియలు సమీపించగానే జనకమహారాజు వేదికపైకి వచ్చి, సీతమ్మ చేతిని తన చేతితో పట్టుకుని....
ఇయం సీతా మమసుతా సహ ధర్మచరీ తవ ।
ప్రతీచ్ఛ చ ఏనాం భద్రం తే పాణి గృహ్ణీష్వ పాణినా ।
పతివ్రతా మహాభాగా ఛాయా ఇవ అనుగతా సదా ।।
రామయ్యా! ఇదిగో... నా కుమార్తె అయిన సీత. నీకు సహధర్మచారిణిగా
స్వీకరించు. నీకు శుభాలు కలుగుతాయి. ఈమె పతివ్రతగా ఉండి, నిత్యం నిన్ను నీడలా అనుసరిస్తుంది
అంటూ సీతమ్మ చేతిని రామయ్య చేతికి అందిస్తాడు. అత్తవారింట ఎలా నడుచుకోవాలో అన్ని
బోధనలూ ఒక్క శ్లోకంలో చెప్పేశాడు జనకమహారాజు.
పుట్టింటి నుంచి ఓ తండ్రి కుమార్తెగా అత్తింట అడుగుపెట్టే స్త్రీ, తన భర్తకు సహధర్మచారిణిగా ఉండాలి. అత్తింటివారికి అన్ని శుభాలు
కలిగేలా ప్రవర్తించాలి. పతివ్రతగా ఉండాలి. భర్తను నీడలా అనుసరించాలి. ఇలాంటి
మహోన్నతమైన జాగ్రత్తలు, సూచనలు చెబుతూ బిడ్డను అత్తవారింటికి
సాగనంపాడు.
ఆయన ఆకాశం... ఆమె పుడమి!
రాముడు నీలమేఘశ్యాముడు. నీలవర్ణం ఆకాశ లక్షణం. అంటే రాముడు
పంచభూతాల్లో ఒకటైన ఆకాశానికి ప్రతీక. సీతమ్మ నాగేటి చాలు ద్వారా భూమి నుంచి
జన్మించింది. భూమి పంచభూతాల్లో ఒకటి. ఇలా, పంచభూతాల్లో మొదటిదైన భూమికి సీతమ్మ, చివరిదైన ఆకాశానికి రామయ్య సంకేతాలుగా నిలుస్తున్నారు. ఎప్పుడైతే
ఆకాశం భూమిని చేరుతుందో (వాన చినుకుగా మారి) అప్పుడు పుడమి (భూమి) పులకరిస్తుంది.
సస్యాన్ని (పంటను) అందిస్తుంది. ఆ సస్యం జీవులకు ఆహారంగా మారి, వారికి శక్తిని ఇస్తుంది. అంటే, ఎప్పుడైతే రామయ్య సీతమ్మకు చేరుకుంటాడో
అప్పుడు లోకానికి శక్తి వస్తుంది. ఈవిధంగా
సీతారామకల్యాణం లోకకల్యాణానికి కారకంగా, ప్రకృతి పులకరింతకు ప్రతీకగా
నిలుస్తుంది.
ఇద్దరి పుట్టుక ఒకేలా...
సీతారాములిద్దరి జన్మవృత్తాంతం విచిత్రమైందే. వీరిలో ఏ ఒక్కరూ నేరుగా
తల్లి కడుపునుంచి జన్మించలేదు. సంతానం కోసం దశరథ మహారాజు చేసిన పుత్రకామేష్ఠి
ఫలితంగా లభించిన యజ్ఞపాయస ప్రసాద ఫలితంగా రాముడు కౌసల్య గర్భాన జన్మించాడు. యజ్ఞం
చెయ్యటం కోసం భూమిని దున్నే ప్రయత్నంలో నాగలి చాలుకు తగిలి, భూమిని నుంచి తనకు తానుగా అయోనిజగా ఆవిర్భవించింది సీతమ్మ. ఇద్దరూ
యజ్ఞప్రసాదాలే. అందుకే వారిద్దరి కల్యాణం కూడా లోక కల్యాణయజ్ఞానికి పునాదిగా
నిలిచింది.
పెళ్లి బాజాలు అలా మోగాయి...
సీతారామకల్యాణ ఘట్టాన్ని జానపదులు రాములోరి పెళ్లిగా పిలుచుకుంటారు.
కేవలం పిలుపే కాదు... వారితో చుట్టరికం కలుపుకుంటారు. ‘సీతమ్మ మాయమ్మ.. .శ్రీరాముడు మా తండ్రి’ వంటి గీతాలు ఇందుకు ఉదాహరణ. తొలి తెలుగు వాగ్గేయకారుడు తాళ్లపాక
అన్నమాచార్యులు కూడా తన సంకీర్తనల్లో అనేకసార్లు సీతారామ కల్యాణఘట్టాన్ని మనసారా
కీర్తించారు. ‘రామం ఇందీవర శ్యామం పరాత్పర ధామం... సుర
సార్వభౌమం భజే’; ‘అట్టె హరువిల్లు విరిచిన రాఘవా.. సిరులతో
జనకుని ఇంటను జానకి జెలగి పెండ్లాడిన రాఘవా’; ‘రాముడు రాఘవుడు రవికులుడితడు...
భూమిజకు పతియైన పురుష నిధానము’ వంటి కీర్తనలెన్నో అన్నమయ్య కలం నుంచి
జాలువారి సీతారామకల్యాణ వైభోగాన్ని నేటికీ మనకు వీనులవిందుగా అందిస్తున్నాయి.
-------------------------------------
రచన: డాక్టర్ కప్పగంతు రామకృష్ణ, సెల్: 9032044115
4 comments:
Chaduvutune kalla mundu kalyanam avishkrutamaindi .mee rachana Silpam adbhutam.sita pudami ramayya aakasam .raamovigrahavaan dharmaha
Excellent
Great writer n hatsoff for ur works, Ramakrishna 🙏
అందరికీ ధన్యవాదాలండి
Post a Comment