Tuesday, July 2, 2019

శ్రీకృష్ణుడి వేణుగానం, ఆ స్వామి ధరించే నెమలిపింఛం విశేషాలతో డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr Kappagantu Ramakrishna) ఈనాడు దినపత్రిక మకరందం పేజిలో రాసిన వ్యాసం

నెమలి నుంచి భావాలు వెదురు నుంచి రాగాలు
ఇది పరమాత్మతత్త్వం 
నెమలి నుంచి భావాలు వెదురు నుంచి రాగాలు 
సెప్టెంబరు 2 శ్రీకృష్ణ జన్మాష్టమి
గోకులంలో నందకిశోరుడుగా... నవనీత చోరుడుగా ఉన్నా... కురుక్షేత్రంలో అర్జున రథసారథిగా మారి... కర్తవ్యాన్ని బోధించి మహాభారతాన్ని నడిపినా పరమాత్మది భిన్నమైన శైలి... ఆయన అడుగుజాడలే కాదు ఆహార్యం కూడా అద్భుతమే... ఆయన రూపవిలాసంలో ప్రస్ఫుటంగా కనిపించేవి... అందంగా ఇమిడిపోయినవి  నెమలి పింఛం... పిల్లన గ్రోవి... ఓ పక్షి శరీరంపై ఉన్న ఈకలు భగవానుడి అలంకారమయ్యాయన్నా, వనంలోని వెదురు ఆయన చేతిలో రాగాలు పలికించిందన్నా వాటికి ఉన్న ప్రత్యేకమైన లక్షణాలే కారణం...
నల్లనయ్య సిగలో నిగనిగలాడుతూ, ఠీవిగా నిలబడే నెమలిపింఛాన్ని చూడగానే మనసులో ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. కృష్ణుడు అనగానే నెమలిపింఛం గుర్తుకు వస్తుంది. కన్నయ్యకు అత్యంత ప్రీతిపాత్రమైన అలంకారం కూడా పింఛమే. నెమలి ఎంత పుణ్యం చేసుకుందో కదా అనిపిస్తుంది.
నెమలి పింఛంలో ఏడు రంగులు ఉంటాయి. ప్రకృతిలో కనిపించే రంగులన్నీ ఈ ఏడు వర్ణాల సమాహారమే. అంతేకాదు... లోకమంతా విస్తరించి ఉన్న ఆకాశం పగటి వేళ నీలవర్ణంతో, రాత్రివేళల్లో నల్లనివర్ణంతో ప్రకాశిస్తుంది. ఇన్ని రంగుల సమాహారమే ఆకాశం. సూర్యోదయంలో ఒక రంగు, సూర్యాస్తమయంలో మరొక రంగు కనిపిస్తుంది. ఈ రంగులన్నీ కాలానికి సంకేతం. కృష్ణపక్షం, శుక్ల పక్షం అనే విభాగాలుగా చూసినా, కాలమంతా రంగులమయంగా కనిపిస్తుంది. ఇవన్నీ నెమలి పింఛంలో కనిపిస్తాయి.
నెమలి తన జీవితకాలమంతా అందరినీ ఆకర్షిస్తుంది. అందరూ నెమలిని చూసి ఎంతో ఆనందిస్తారు. జీవితం ముగిసిన తర్వాత కూడా నెమలి వదిలిన పింఛం కూడా నెమలి తీరులోనే అందరినీ ఆకర్షిస్తుంది.కొద్దికాలం జీవించిన నెమలి కన్నా జీవం లేకపోయినా నెమలి పింఛం మాత్రం తరతరాలపాటు అందరి మనసుల్నీ మురిపిస్తూనే ఉంటుంది. మానవ జీవన సత్యం ఇందులో దాగి ఉంది. బతికినన్నాళ్లూ అందరూ ఏదో ఒకరకంగా మనల్ని అంటిపెట్టుకుని ఉంటారు.  కానీ, మనం భౌతికంగా లేని రోజున కూడా ఆ జ్ఞాపకాలను అట్టిపెట్టుకునే ఆప్యాయత మనం సంపాదించుకోవాలి.
నెమలి పింఛాన్ని ఒకసారి చేతితో గట్టిగా రుద్దితే ప్రాణం ఉన్నదానిలా మరింత విశాలంగా విచ్చుకుంటుంది. భౌతికశాస్త్రపరంగా చూస్తే, ఈ ప్రక్రియ స్థిరవిద్యుత్‌ ప్రవాహానికి సంకేతం. మనిషి మనసుది కూడా ఇదే తీరు. తనకు నచ్చిన, తాను మెచ్చిన అంశంతో ఎక్కువసేపు రమిస్తే అతడి మనస్సు  అమితమైన ఆనందం పొందుతుంది.
నెమలిపింఛంలోని రంగులు, వాటిలోని వైవిధ్యం గురించి శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేశారు. ఆశ్చర్యకరమైన ఫలితాలు వెల్లడించారు. ద్విజ్యామితీయ స్ఫటిక అమరిక వల్ల పింఛంలో విభిన్నమైన రంగులు ఏర్పడుతున్నాయని కనుగొన్నారు. ఈ అమరికలో వచ్చే తేడాల వల్ల రంగులు పరావర్తనం చెంది, మెరుపుల మాదిరిగా కనిపిస్తాయి.చూడటానికి పింఛాలన్నీ ఒకేతీరులో కనిపించినా, సూక్ష్మంగా పరిశీలిస్తే ఆ అందాల వన్నెల్లో ఎన్నో వైవిధ్యాలు కనిపిస్తాయి. ఇవన్నీ సృష్టిలోని మనుషుల లక్షణాలకు సంకేతంగా నిలుస్తాయి.  ఎవరి కర్మలు భగవంతుడికి ప్రీతి కలిగిస్తాయో, అతడు నెమలిపింఛం మాదిరిగా పరమాత్మ ఆదరణకు పాత్రుడవుతాడు.
పింఛం ఎటుచూసినా ఒకేలా కనిపిస్తుంది.  మనిషి మనసు కూడా లోపల, బయటా ఒకేవిధంగా ఉండాలని పింఛం అందిస్తున్న సందేశం ఇది. చీకటిలో ఉన్నా, వెలుగులో ఉన్నా పింఛం ఏవిధమైన మార్పునకు లోనుకాదు. బాధలో ఉన్నా, సంతోషంలో ఉన్నా తన వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదనే సత్యాన్ని పింఛం మనిషికి బోధిస్తుంది.
కన్నయ్య వేణువును విడిచిపెట్టి క్షణం కూడా ఉండలేడు. వేణువు, మాధవుల అనుబంధం ఎంత గొప్పదంటే...చివరకు గోపికలు కూడా వేణువును చూసి అసూయపొందారు. కన్నయ్య తమ కన్నా వేణువునే ఎక్కువగా ఆదరిస్తున్నాడని అలిగారు. ఉండబట్టలేక, నేరుగా వేణువు దగ్గరకే వెళ్లి అడిగారు. ఏమమ్మా! ఏమిటీ నువ్వు చేసుకున్న పుణ్యం. గోపయ్యను కట్టేసుకున్నావు. ఏం మాయ చేశావు? నీకు ఇంతటి శక్తి ఎలా వచ్చిందని నేరుగా అడిగేశారు. వేణువు అందికదా... ‘నేను చేసింది ఏమీ లేదమ్మా! నన్ను నేను గోపయ్యకు అర్పించుకున్నాను. నాలో ఏమీ లేదు. అంతా డొల్ల’ అంది. తత్త్వం బోధపడింది గోపికలకు. నిజమే! వేణువు అంతా శూన్యం. అంటే, పరిపూర్ణతకు చిహ్నం. తనకంటూ ఏమీ లేదు మనసులో ఏ మాలిన్యమూ, ఏ భావమూ, వికారమూ లేదు. తన సర్వస్వాన్నీ పరమాత్మకు అర్పించుకుంది. నేను, నాది అనే భావాలు వేణువుకు లేవు. ఏది తనదో అదే పరమాత్మకు ఇచ్చేసింది. ఇప్పుడిక వేణువు, మాధవుడు ఇద్దరు కాదు... వేణుమాధవుడు మాత్రమే. మానవుడు అందుకోవాల్సిన మహత్తరమైన ఆధ్యాత్మిక సందేశాన్ని వేణువు అందిస్తుంది. నేను, నాది అనే వికారాలకు మనిషి దూరం కావాలి. తాను తానుగా మిగలాలి. తన స్వచ్ఛమైన మనస్సును మాధవుడికి అర్పించాలి. అలాంటి మనసున్న మనుషుల్ని పరమాత్మ అక్కున చేర్చుకుంటాడు.
ఇతర వాద్యాలకు భిన్నమైన సంగీత వాద్యం వేణువు. ప్రకృతిలో అత్యంత సహజంగా లభించే వెదురు పదార్థం నుంచి తయారైంది. ఏవిధమైన ఆడంబరాలు, అలంకారాలు, బిగింపులు లేవు. మనిషి కూడా వేణువు కావాలి. అత్యంత సహజమైన భక్తి భావంతో ఉండాలి. వేణువు అందిస్తున్న సందేశం ఇదే.
వేణువులో ఉండే రంధ్రాలు మానవశరీరంలో ఉండే షట్చక్రాలకు సంకేతం. వేణువులోని ప్రధానరంధ్రం ద్వారా గాలి ఊదుతూ, ఇతర రంధ్రాల మీద వేళ్లు ఉంచి, ఆ వాయువును నియంత్రిస్తే, కమ్మనైన నాదం ఆవిర్భవిస్తుంది. ఆ నాదం పరమాత్మకు పూజా పుష్పంగా మారుతుంది.  యోగశాస్త్రం ప్రకారం మానవశరీరంలో మూలాధారం నుంచి సహస్రారం వరకు ప్రాణవాయువు సంచారం చేస్తుంటుంది. దీన్నే యోగపరిభాషలో ‘హంస’ అంటారు. షట్చక్రాల్లో సాగే వాయుసంచారాన్ని నియంత్రించటమే యోగసాధన. ఎప్పుడైతే ప్రాణవాయువు మీద నియంత్రణ సాధ్యమవుతుందో, ఆ సాధకుడు యోగిగా మారుతాడు.  వేణునాదం మన జీవన నాదానికి ప్రతిరూపం.
- డాక్టర్‌ కప్పగంతు రామకృష్ణ, విజయవాడ

భగవాన్ సత్యసాయి బాబా బోధనల విశేషాలతో డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr Kappagantu Ramakrishna) ఈనాడు దినపత్రిక మకరందం పేజిలో రాసిన వ్యాసం

బంగారూ! ఇదే పంచశీల 
సత్యం... శివం... సుందరం
23న సత్యసాయి జయంతి
బంగారూ! ఇదే పంచశీల 
ఆయన వద్ద మంత్రాలన్నీ మామూలు మాటలయ్యాయి. ఆయన మాటలు మంత్రాలుగా మారి సమ్మోహితులను చేశాయి. అలతి అలతి పదాలతో వేదోపనిషత్తుల సారాన్ని ప్రజలకు పంచిన  ఆయన మానవాళికి ప్రేమ, సేవలను తారక మంత్రాలుగా అందించారు. అందుకే ఆయన నడిచే దేవుడయ్యారు... కదిలే బ్రహ్మమయ్యారు. ఆదర్శ పురుషులుగా ప్రపంచ ప్రఖ్యాతిపొందారు...
నేేను దేవుడిని. నీవు కూడా దేవుడివే. తేడా ఏమిటంటే ఈ సంగతి నాకు తెలుసు. నీకు తెలియదు. మీ హృదయాల్లో ప్రేమ అనే దీపం వెలిగించి దానిని అనుదినం ప్రజ్వలింపజేయటానికే వచ్చాను. నేను ఏదో ఒక మతం తరఫున గానీ, ఒక సంఘం తరఫునగానీ ప్రచారానికి రాలేదు. ఒక సిద్ధాంతానికి అనుయాయులను పోగుచెయ్యటానికి రాలేదు. నా మార్గంలో కాని, మరో మార్గంలో కాని శిష్యులను, భక్తులను ఆకర్షించం నా అభిమతం కాదు. విశ్వవ్యాప్తమైన ఒకే ఒక ఆధ్యాత్మికసూత్రం ‘ప్రేమ’ అనే మార్గం, ధర్మం అనే బాధ్యత. ఈ రెండు జ్యోతుల్ని మీకు అందించటానికే వచ్చాను... అంటూ తన మార్గాన్ని విస్పష్టంగా ప్రకటించి, తన ఆశయాల్ని ఆచరణలోకి తీసుకువచ్చిన ప్రేమమూర్తి సత్యసాయిబాబా.
 
1. మానవుడే మాధవుడు
దేవుడు గుళ్లల్లో, రాళ్లల్లో ఉండడు. మనుషుల్లో ఉంటాడు. తనలో దాగిఉన్న మాధవుడిని గుర్తించటమే జీవితలక్ష్యం కావాలంటారు సాయి. ఇందుకోసం ఆయన ప్రవచించిన మార్గం ‘సేవ’. కనబడే మనిషిని ప్రేమించలేకపోతే కనిపించని దైవాన్ని ఎలా ప్రేమించగలవు? ఎలా గుర్తించగలవు? అంటూ సూటిగా ప్రశ్నించేవారు. ఈ భావాన్ని ప్రతి వ్యక్తిలో ఉద్దీపింపజేయాలన్నదే ఆయన ఆశయం. అందుకనే తన ప్రతి ఉపన్యాసాన్ని దివ్యాత్మస్వరూపులారా! అంటూ ప్రారంభించేవారు. అందరినీ ప్రేమించు... ఎవరినీ ద్వేషించకు. తోటివారి బాధ నీదిగా భావించు. మానవసేవే మాధవ సేవ అంటూ ఎంతో స్పష్టంగా మానవధర్మాన్ని మానవీయకోణంలో సాయి ఉద్బోధించారు. సత్యసాయి సంస్థలన్నిటిలో ఆచరణాత్మకంగా కనిపించేది ఈ భావమే. ఆర్తులు,  అనారోగ్యపీడితులు... అందరినీ సాయి అక్కున చేర్చుకున్నారు.  వారికి సేవ చెయ్యటాన్నే దైవారాధనగా భావించేవారు.
సాయి మాటల్లో...
హృదయం : హృదయం లేని మాటకన్నా, మాటలేని హృదయం మిన్న
విద్య : గుణార్జనే కానీ ధనార్జన కోసం కాకూడదు
త్యాగం : దేహాభిమానాన్ని వదిలేయడం
సుఖం : రెండు దుఃఖాల మధ్య విరామం
దాసులు : హరికి కావాలి కానీ సిరికి కాదు
జీవనం : ఆశయాల కోసం... ఆశల కోసం కాదు
బలం : గుణాన్ని మించిన బలం లేదు
2. ప్రేమే మార్గం
తన గుండెల్లో భగవదైశ్వర్యాన్ని నింపుకోమనీ, నీచమైన అహంకారాన్ని విడిచిపెట్టమని ప్రతి మతం బోధిస్తుంది. వైరాగ్యాన్ని, విజ్ఞతనూ పెంచుకుని మోక్షాన్ని సాధించుకోవటాన్ని నేర్పుతుంది. అన్ని హృదయాల్లో వెలిగేది ఒకే ఒక దేవుడు. అన్ని మతాలూ ఆ భగవంతుడినే కీర్తిస్తున్నాయి. అన్ని భాషలూ ఆ పేరే చెబుతున్నాయి. ప్రేమే భగవంతుడిని ఆరాధించటానికి అత్యుత్తమమైన మార్గం. ఈ ప్రేమే నేను మీకిచ్చే సందేశం. ఈ ఐక్యభావాన్ని అవగతం చేసుకోండి అంటారు సాయి. ఆకాశం నుంచి వచ్చే వాన ఎక్కడ కురిసినా చివరకు సముద్రాన్నే చేరుతుంది. అలాగే, ఏ దేవుడిని ఆరాధించినా అది చివరకు చేరేది ఒకే పరమాత్మ దగ్గరకి అంటాయి ఉపనిషత్తులు. సాయి ఆచరించి చూపించిన మార్గం కూడా ఇదే.
3. నువ్వే... నువ్వే
మనిషి పొందే ఆనందానికి, దుఃఖానికి అతడే కారణం. ఇతరుల వల్ల నువ్వు దుఃఖపడేదీ లేదు. ఆనందం పొందేదీ లేదు. నువ్వు సంతోషంగా ఉంటే ఎవరూ పలకరించరు. అదే, బాధలో ఉంటే ఎందుకు విచారంగా ఉన్నావంటూ పలకరిస్తారు. ఆనందానికి, దుఃఖానికి ఇదే తేడా. ఆనందం మనకు సహజంగా వస్తుంది. దుఃఖం మనం తెచ్చిపెట్టుకున్నది. నువ్వు అనుభవించే బాధలకు నువ్వే కారణం. దాన్ని ఇతరుల మీద నెట్టే గుణాన్ని వదులుకోమంటూ సాయి యువతకు దిశా నిర్దేశం చేశారు. నీలో ఉన్న శక్తిని గుర్తించు. అంతులేని విజయాన్ని సాధిస్తావు అనేవారు.
4. ఉత్తిష్ఠ... జాగృతః
మీరంతా నాస్తికులుగా మారినా నాకు ఇష్టమే. కానీ, మూఢవిశ్వాసాలకు బలికాకండి. మీలో ఉన్న ప్రజ్ఞను మసిబారనివ్వకండి. మనిషికి మూఢవిశ్వాసం ప్రబల శత్రువు. దాన్ని ఆశ్రయించటాన్ని మించిన మూర్ఖత్వం ఉండదు. మీలో ఉన్న విచక్షణా జ్ఞానానికి పదును పెట్టండి. జ్యోతిష్యం, జాతకాల భ్రమలో జీవితాన్ని బలిచేసుకోకండి... అంటూ స్పష్టంగా యువతకు నిర్దేశం చేశారు సాయి.  ముక్కుమూసుకుని ‘సోహం.. సోహం’ అంటూ జపించటం, అలాచేసేవారిని ప్రోత్సహించటం సాయి సిద్ధాంతం కాదు. ‘సాధకుడా! లే ! నడుంకట్టు! సమాజ సేవలో ప్రవేశించు!’ అని ప్రోత్సహించటమే సాయి సిద్ధాంతం.
4. పరిపూర్ణంగా ఉండు
సాయిబోధనల్లో కర్మ, భక్తి మార్గాలు కనిపించినా అదంతా అద్వైతానికే దారి తీస్తుంది. సనాతన ధర్మాన్ని, విశ్వమానవ ప్రేమను ప్రబోధించిన సాయి, సమాజంలో నానాటికీ క్షీణిస్తున్న దైవవిశ్వాసాన్ని, ధర్మజిజ్ఞాసను పునరుద్ధరించారు. ఆదిశంకరాచార్యుల మార్గం కూడా ఇదే.ఆయనా పరిపూర్ణత్వాన్నే ఆకాంక్షించారు. ‘నహి నహి రక్షతి డృజ్ఞ్‌ కరణే’  ఆత్మజ్ఞానం లేని చదువు వ్యర్థమని ప్రకటించి, భజగోవింద స్తోత్రాన్ని రాశారు శంకరులు. సాయి మార్గమూ ఇదే.
-డా.కప్పగంతు రామకృష్ణ

చదువుకు వేళాయే.... (డాక్టర్ కప్పగంతు రామకృష్ణ రచన)

చదువుకు వేళాయే...

మీ పిల్లలకు చెప్పండి!
 
  


    చదువు అంటే కేవలం అక్షరాల జ్ఞానం మాత్రమే కాదని... అదో అంతులేని విజ్ఞానసాగర మథనమని... దానికోసం  కష్టాలు పడాలి.. కన్నీళ్లకు ఎదురీదాలి... పరీక్షలకు నిగ్గుతేలాలి... అవాంతరాలను అధిగమించాలి... అయినా ఇష్టంతో సాధన చేస్తే సిసలైన సంపద మీ సొంతమవుతుందని... మీ పిల్లలకు చెప్పండి... జ్ఞానార్జన కోసం తపించిన ఈ విద్యార్థుల గురించి వివరించండి!

శివుడూ చదువుకున్నాడు!

ఎవరైనా, ఎంతటివారైనా నేర్చుకునే సమయంలో  విద్యార్థిగా ఉండాల్సిందే. ఈ విషయంలో అభ్యంతరాలు పనికిరావు.
కైలాస పర్వతంపై తన శిలాపీఠం మీద పరమేశ్వరుడు పార్వతీదేవితో సహా కొలువై ఉన్నాడు. అంతా తానై, అన్నీ తానే అయిన శివుడికి సైతం ఆ రోజు పెద్ద సందేహం వచ్చింది. ప్రణవం అంటే ఏమిటి? ప్రణవతత్త్వం ఏమిటి? ఎంతగా ఆలోచించినా తనకు బోధపడటం లేదు. బ్రహ్మ, విష్ణువులను అడిగినా తమకు సాధ్యం కాదన్నారు. నీ బిడ్డ షణ్ముఖుడే ఇందుకు సమర్థుడని చెప్పారు. దాంతో శివుడు నేరుగా కుమారస్వామినే తన సందేహం తీర్చమని అడిగాడు. ‘చెప్పేది నేను. వినేది నువ్వు. నీ సందేహం తీర్చే నాది గురుస్థానం. వినే నీది శిష్యస్థానం. కాబట్టి, నువ్వు కింద కూర్చుంటే నేను పీఠం మీద కూర్చుని బోధ చేస్తానన్నాడు కుమారుడు. సరేనన్నాడు శివుడు. బిడ్డే స్వయంగా తండ్రికి ప్రణవ తత్త్వాన్ని ఉపదేశించాడు. పరమేశ్వరుడు విద్యార్థిగా మారి మానవ జాతికి మహోపకారం చేశాడు. ప్రణవ తత్త్వం లోకానికి అందింది. ఇక్కడ  స్కందుడు గొప్ప గురువు. పరమేశ్వరుడు ఉత్తమ విద్యార్థి.

తలకెక్కితే తిప్పలే!

ఎంత నేర్చుకున్నా విద్యార్థికి గర్వం ఉండకూడదు ఈ ఒక్క దుర్లక్షణం వల్ల నేర్చుకున్నదంతా నిరుపయోగమైపోతుంది.
యాజ్ఞవల్క్యుడు బాష్కలమహర్షి దగ్గర రుగ్వేదం, జైమిని వద్ద సామవేదం, అరుణి మహర్షి వద్ద అధర్వణవేదం అధ్యయనం చేశాడు. ఆ తర్వాత వైశంపాయనుడి వద్దకు యజుర్వేదం నేర్చుకోడానికి వెళ్లాడు. ఆ రుషి వద్ద వేదంతో పాటు మరెన్నో విషయాలు నేర్చుకున్నాడు. తనను మించిన విద్యావంతుడు లేడనే అహంకారం అతడిలో ఏర్పడింది. ఓసారి వైశంపాయనుడికి బ్రాహ్మణుని కాలితో తన్నిన దోషం తగిలింది. అతడి పాపాన్ని పోగొట్టే శక్తి తనవద్ద మాత్రమే ఉందంటూ గురువుతో గర్వంగా పలికాడు యాజ్ఞవల్క్యుడు. దీంతో ఆగ్రహించిన గురువు తాను నేర్పిన విద్యను పూర్తిగా వదలి వెళ్లిపొమ్మని అతడిని శపించాడు. దీంతో నేర్చుకున్న విద్యను రక్తపు ముద్దల రూపంలో అక్కడే వదలివెళ్లాడు. వాటిని స్వీకరించిన తిత్తిరి పక్షులు వేదాల్ని పలికాయి. అవే కృష్ణ యజుర్వేదంగా ఆవిర్భవించాయి. ఆ తర్వాత యాజ్ఞవల్క్యుడు సూర్యుడిని ఉపాసన చేసి, ఆయన ద్వారా శుక్ల యజుర్వేదం నేర్చుకోవాల్సి వచ్చింది.

దేవతలే దిగిరారా!

ఆటంకాలకు లొంగితే జ్ఞానశూన్యుడిగానే మిగిలిపోవాల్సి వస్తుంది. కష్టాన్ని తట్టుకుంటేనే విజ్ఞానపు లోకానికి దారి తెలుస్తుంది. జాబాలికి తండ్రి ఎవరో తెలియదు. తల్లి జాబాల అతడికి ఉపనయన సంస్కారం చేసి, గురువు హరిద్రుమతుడి వద్దకు విద్యాభ్యాసానికి పంపింది. తండ్రి ఎవరో తెలియకపోవడంతో అవమానాల పాలయ్యాడు. విద్య నేర్చుకునే సమయం వచ్చే వరకు గోవుల్ని మేపుతూ అడవిలోనే ఉండమని ఆదేశించాడు గురువు. మరోమాట మాట్లాడకుండా అడవికి చేరుకున్నాడు జాబాలి. కానీ, మనస్సు మాత్రం నిత్యం జ్ఞానాన్వేషణ కోసం పరితపిస్తూనే ఉంది. అతడి సత్యనిష్ఠకు మెచ్చుకున్న దేవతలే స్వయంగా అతడు మేపుతున్న గోవుల్లో చేరి, బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశం చేస్తారు. ఆశ్రమానికి చేరుకున్న జాబాలి ముఖంలోని దివ్యతేజస్సు చూసి గురువు ఆశ్చర్యపోతాడు. అప్పటినుంచి సత్యకామ జాబాలిగా జాబాలి లోక ప్రసిద్ధి పొందాడు. విద్యార్థికి నేర్చుకోవాలన్న తపన, స్థిరచిత్తం ఉంటే దైవమే దిగి వస్తుందనటానికి ఇతని కథ చక్కటి ఉదాహరణ.

ప్రలోభాలకు లొంగకుండా...

తాను నేర్చుకోదలచిన విషయం మీద విద్యార్థికి పట్టుసడలని శ్రద్ధ ఉండాలి. ఎన్ని ఆకర్షణలు వచ్చినా వాటికి బందీ కాకూడదు. తండ్రి వాజశ్రవుడు కోపంతో ‘నిన్ను యముడికి దానం చేస్తా’నని అనటంతో అతని మాట నిలబెట్టడం కోసం నచికేతుడు నేరుగా యమలోకానికి వెళ్లాడు. యమదర్శనం కోసం ద్వారం వద్ద మూడురోజులు నిరీక్షించాల్సి వచ్చింది. దివ్యతేజస్సుతో ఉన్న బాలుడు తన కోసం నిరీక్షించిన విషయం తెలుసుక్ను యమధర్మరాజు దర్శనమిచ్చి, ముచ్చటపడి వరాలు కోరుకోమన్నాడు అప్పుడు నచికేతుడు వరాలుగా తన ప్రశ్నలకు సమాధానం ఇమ్మని అడిగాడు. మరణం తర్వాత మనిషి ఏమవుతాడు? జనన మరణ చక్రాల సంచారం ఎందుకు?... అనేవి ఆ ప్రశ్నలు. అప్పుడు యముడు ఇదంతా బ్రహ్మజ్ఞానం. నీ వయస్సు చిన్నది. నీకు అర్థం కాదు. నీకు మణులు, బంగారం, ఇంకా చాలా ఇస్తానని ప్రలోభపెట్డాడు. నాకివేమీ వద్దు. ఆత్మజ్ఞానమే ముద్దు అంటూ పట్టుబట్టాడు నచికేతుడు. బాలుడి శ్రద్ధకు అబ్బురపడిన యముడు అతడికి ఆత్మజ్ఞానాన్ని బోధిస్తాడు. ఇదే కఠోపనిషత్‌గా అవతరించింది.

హనుమ కథ వినుమా!


చదువు సుఖంగా అందదు. ఇందుకోసం తపించాలి. వేగం, పట్టుదల, ధారణ, కష్టానికి తట్టుకునే శక్తి విద్యార్థికి చాలా అవసరం. ఇవన్నీ ఉంటేనే నేర్చుకోవటం సాధ్యమవుతుంది. తల్లి ఆదేశంతో సూర్యభగవానుడి వద్ద విద్య నేర్చుకునేందుకు వెళ్లాడు హనుమ. నేను ప్రతిక్షణం సంచరిస్తూ ఉంటాను. నా దగ్గర చదువుకోవటం సాధ్యం కాదన్నాడు  సూర్యుడు. అయినా పట్టువదలకుండా తూర్పు, పశ్చిమ పర్వతాల మీద చెరో కాలు ఉంచి, సూర్యగమనానికి అనుగుణంగా ముఖం వరకు తన శరీరాన్ని తిప్పుతూ విద్యాభ్యాసం చేశాడు ఆంజనేయుడు. ఇంతటి సాధన చేశాడు కాబట్టే నవ వ్యాకరణ పండితుడయ్యాడు. ఎవరెన్ని విధాలుగా నిరుత్సాహపరిచినా, చివరకు ఎంచుకున్న గురువే వద్దని వారించినా నిరుత్సాహ పడకూడదు. విద్య నేర్చుకునే విషయంలో ఏర్పడే విఘ్నాలే ఇవన్నీ అనే స్పృహ కలిగి ఉండాలి. వాటిని తీర్చుకునేందుకు ప్రత్యామ్నాయాలు ఆలోచించాలి. అప్పుడే ఆశించిన లక్ష్యాన్ని చేరుకోవచ్చని హనుమ నిరూపించాడు.

- కప్పగంతు రామకృష్ణ

శరత్కాల వెన్నెల వైభవం గురించి డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr Kappagantu Ramakrishna) ఈనాడు దినపత్రిక మకరందం పేజిలో రాసిన వ్యాసం

శరత్‌ చంద్రికలు
మనసే మందిరం 
శరత్‌ చంద్రికలు
చందమామ వెన్నెలనే కాదు శుభాలనూ వర్షిస్తాడు
కలువలనే కాదు మనసునూ వికసింపజేస్తాడు
చీకటి రాత్రులనే కాదు తమస్సు నిండిన హృదయాలనూ తేజోమయం చేస్తాడు...
అందుకే ఆయనను మనఃకారకుడంటారు...
ఆధ్యాత్మిక జగతిలో శరత్కాలానిది ప్రత్యేక పాత్ర
నిర్మలమైన శరత్‌చంద్రుడు సాధకులకు సహకరిస్తాడు,
అద్భుతమైన సందేశాలనిస్తాడు...
ఏడాదిలో వచ్చే ఆరు రుతువుల్లోనూ వసంత, శరదృతువులు చాలా ప్రధానమైనవి. ఇవి ఆయా కాలాల్లో వచ్చే ప్రాకృతిక మార్పుల్ని సూచిస్తూ, అందుకు అనుగుణంగా మనిషి తన జీవనగమనాన్ని తీర్చిదిద్దుకునేందుకు అవసరమైన సంకేతాలను ఇస్తాయి. వీటిలో వసంత రుతువు సుమ వికాసం  కలిగిస్తే, శరదృతువు సోమ వికాసం కలిగిస్తుంది. సోముడు అంటే చంద్రుడు.  సంవత్సరకాలంలోని ఆరు రుతువుల్లో మొత్తం పన్నెండు పున్నములు వస్తాయి. వీటన్నిటిలో శరత్కాలంలో (ఆశ్వయుజ, కార్తికమాసాలు) వచ్చే పున్నమి రోజుల్లో చంద్రుడు అద్భుతమైన తేజస్సుతో ప్రకాశిస్తాడని దేవీభాగవతం చెబుతోంది.  పదహారు కళలతో  ప్రకాశించటం వల్ల శరత్కాల పున్నమి నాటి చంద్రుడిని పూర్ణచంద్రుడు అంటారు. స్వచ్ఛతకు, ప్రశాంతతకు శరత్కాలం నిలయంగా ఉంటుంది. ఈ భావాన్నే ప్రకటిస్తూ ఆంగ్లేయులు కూడా ‘హార్వెస్ట్‌ మూన్‌’ అంటూ చంద్రుడిలోని స్వచ్ఛతను ఆస్వాదిస్తారు.
* శరదృతువు మనసుకు అంతులేని ఆహ్లాదాన్నిస్తుంది. అది  చంద్రుడి వల్లే సాధ్యమవుతుంది. వేదం  ‘చంద్రమా మనసో జాతః’ - విరాట్‌ పురుషుడి మనస్సు  నుంచి చంద్రుడు ఉద్భవించాడని చెబుతోంది. ఈ చంద్రుడి వల్ల సకల ప్రాణికోటికి మనస్సు ఏర్పడిందని నమ్ముతారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్సుకు అధిపతి. మనస్సును ప్రభావితం చేస్తాడు. అన్ని రుతువుల కన్నా శరదృతువులో చంద్రుడి ప్రకాశం ఎక్కువగా ఉండటం వల్ల  ఈ సమయంలో ఆ ప్రభావం మనందరి మనస్సుల మీద మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ కారణం వల్లనే జ్యోతిష విజ్ఞానవేత్తలు మనో సంబంధమైన సమస్యలు తొలగిపోవటానికి చంద్రగ్రహ ప్రీతి చెయ్యాలని చెబుతారు. చంద్రగ్రహ జపాలు, దానాలు, చంద్రగ్రహ సంబంధమైన రత్నాన్ని ధరించాలని సూచిస్తారు.
* శరత్కాలంలో ఆకాశం నిర్మలంగా ఉంటుంది. దీనివల్ల చంద్రకాంతిని పరిపూర్ణంగా ఆస్వాదించటానికి వీలుపడుతుంది. శుద్ధంగా, స్పష్టంగా, స్వచ్ఛంగా మనస్సు ఉండాలని చెప్పడమే శరత్కాల చంద్రుడు అందించే ఆధ్యాత్మిక ప్రబోధం. మనస్సు స్థిరంగా ఉండడం, ఏవిధమైన వికారాలు లేకుండా దృఢంగా ఉండటమే ఆధ్యాత్మిక సాధనకు పరమావధి. భౌతికంగా ఉండే సుఖాలు, దుఃఖాలు, మానాలు, అవమానాలు, కలిమిలేములు, కష్టాలు,  నష్టాలు, బాధలు మొదలైనవన్నీ అంటని నిర్మలమైన మనస్సును సాధించటమే సాధకుడి అంతిమ లక్ష్యం అవుతుంది. గెలిచామా... ఓడామా అనేది కాకుండా గెలుపు ఓటములను పట్టించుకోని స్థితికి ఎదగాలి. నిరంతరం కర్తవ్యదీక్షతో ఉండాలి. ఇందుకు సంకేతం శరచ్చంద్రుడు.
* ఆశ్వయుజ, కార్తీక మాసాల్లో వచ్చే రెండు పున్నములను  శరత్పూర్ణిమలంటారు. ఈ రోజుల్లో చేసే ధ్యాన, అర్చనలు విశేషఫలితాలనిస్తాయి. ఆధ్యాత్మికంగా, యోగసాధన పరంగా ఈ రెండు పున్నములకు చాలా ప్రత్యేకత ఉంది. ఈ రోజుల్లో దీపాలు వెలిగించటం ప్రధానమైన అంశంగా ఉంటుంది. దీన్నే ‘దేవ దీపావళి’ అంటారు. ఈ రోజునే రాసలీలా మహోత్సవం జరిగింది. యోగశుద్ధులైన జీవులు గోపికలు. వారిని కృష్ణపరమాత్మ అనుగ్రహించి మోక్షాన్ని అనుగ్రహించిన ఘట్టమే రాసలీలా మహోత్సవం. ఇందుకు శరత్పూర్ణిమ వేదికగా నిలిచింది. ఈ పూర్ణిమ రోజున కొన్ని ప్రాంతాల్లో దేవీ ఆరాధన కూడా చేస్తారు. అమ్మవారిని ఉపాసన చేసే శ్రీవిద్యా సంప్రదాయంలో శరత్పూర్ణిమను ‘ముఖ్యరాకా’ అని పిలుస్తారు.
* కార్తీకమాసంలో పౌర్ణమి కృత్తిక నక్షత్రం రోజున వస్తుంది. ఈ నక్షత్రం అగ్ని సంబంధమైంది. ఇందుకు ప్రతీకగానే ఆ రోజున దీపారాధన చెయ్యడం ఆచారంగా వస్తోంది. అలాగే, కృత్తిక నక్షత్రంలో జన్మించిన కుమారస్వామి ఆరాధన కూడా ఈ మాసంలో చేస్తారు.ఈ రోజునే కుమారస్వామి తారకాసురుడిని వధించాడని నమ్ముతారు. ఇందుకు సంకేతంగా కొన్ని ప్రాంతాల్లో కార్తీకపూర్ణిమను ‘కుమారదర్శనం’ పేరుతో వ్యవహరిస్తారు.  అలాగే, త్రిపురాసురులను పరమేశ్వరుడు వధించిన రోజుకు గుర్తుగా కార్తీక పూర్ణిమను ‘త్రిపుర పూర్ణిమ’గా కూడా పాటిస్తారు.
శరత్‌ చంద్రికలుఆదిశంకరాచార్యులు సౌందర్యలహరిలో అమ్మవారిని వర్ణిస్తూ
శరజ్జ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం
వరత్రాసత్రాణ స్ఫటిక ఘుటికా పుస్తక కరామ్‌
సకృన్నత్వా నత్వాకథమివ సతాం సన్నిదధతే
మధుక్షీర ద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః
శరత్కాలంలో కాసే స్వచ్ఛమైన, నిర్మలమైన పరిపూర్ణమైన వెన్నెల వలే అమ్మవారి ముఖం ఉందంటారు.
జైన సంప్రదాయం, పంజాబ్‌లలో కూడా శరత్కాలంలో వచ్చే పూర్ణిమకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ రోజుల్లో వారు గంగా మహోత్సవం నిర్వహిస్తారు. గురునానక్‌ జయంతి కార్తిక పూర్ణిమ. ఈ రోజున ‘గురుపూరబ్‌’తో ప్రత్యేక ఉత్సవం చేస్తారు. ఆదికావ్యం రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి కూడా ఆశ్వయుజ పూర్ణిమ రోజునే జన్మించారు. ఈ కారణంగా ఆశ్వయుజ పూర్ణిమను ఆంధ్రప్రాంతంలో వాల్మీకి జయంతిగా చేసుకునే ఆచారం కూడా ఉంది.
కాళిదాసుకు అక్షర లక్షలు
భోజరాజు రాజ్యంలోని ఓ నలుగురు బ్రాహ్మణులు చాలా బీదవారు.మంచి కవిత్వం చెబితే రాజు ధనాన్ని ఇస్తాడన్న ఆశతో ఓ మంటపంలో కూర్చుని శ్లోకం రాయటం ప్రారంభిస్తారు. ఒక వ్యక్తి ‘భోజనం దేహి రాజేంద్ర’ అని,. రెండో వ్యక్తి ‘ఘృతసూప సమన్వితమ్‌’ అని రెండు పాదాలు రాశారు.  ఓ రాజా! పప్పు, నెయ్యిలతో కూడిన భోజనాన్ని మాకు అనుగ్రహించు అని ఈ రెండు పాదాలకు అర్థం. మిగిలిన రెండు పాదాలను పూర్తిచెయ్యలేక వారు నానా తంటాలు పడుతుంటారు. ఇంతలో అటుగా వచ్చిన కాళిదాసు ‘మాహిషంచ శరచ్చంద్ర చంద్రికా ధవళం దధీ’ అని మూడు, నాలుగు పాదాలు పూర్తిచేస్తాడు. శరత్కాలంలో వెలిగే చంద్రుడి వంటి పరిమాణంలో ఉన్న గారెలు, ఆ శరత్కాలపు చంద్రుడు కురిపించే వెన్నెల వర్ణంతో సమానమైన స్వచ్ఛమైన పెరుగుతో కలిసిన భోజనం కావాలి ఆ బ్రాహ్మణులు రాజాస్థానానికి వెళ్లి శ్లోకం వినిపిస్తారు. భోజరాజు ఆ బ్రాహ్మణుల జీవితానికి సరిపడినంత ధనం ఇవ్వమని మంత్రిని ఆదేశించి, మూడు నాలుగు పాదాలు రాసిన కవికి అక్షరలక్షల ముత్యాలు ఇవ్వమంటాడు.  శరత్కాల చంద్రుడిని ఇంత అందంగా వర్ణించగల కవి కాళిదాసు తప్ప మరొకరు లేరంటాడు భోజరాజు.
16 కళల వెనక కథ ఇదీ...
చంద్రుడికి ఈ కళలు రావటం వెనుక పురాణగాథ ఉంది. దక్షప్రజాపతి అశ్వని, భరణి మొదలైన తన 27 మంది కుమార్తెలను చంద్రుడికిచ్చి వివాహం చేస్తాడు. అందరినీ అనురాగంగా చూసుకుంటున్నప్పటికీ రోహిణి అంటే చంద్రుడికి ఎక్కువ ఇష్టం ఉండేది. ఆమెపై ఎక్కువ అనురాగం, ఆప్యాయత కనబరచేవాడు. ఇది సహించలేని మిగిలిన అక్కాచెల్లెళ్లు తండ్రితో విషయాన్ని చెబుతారు. అతడు చంద్రుడిని పిలిచి కుమార్తెలందరినీ సమానంగా చూసుకోవాలని హితవు చెబుతాడు. అయినా, చంద్రుడు తన పద్ధతి మార్చుకోకపోవటంతో ఆగ్రహించిన  దక్షుడు అల్లుడనే ఆలోచన లేకుండా చంద్రుడికి క్షయవ్యాధి కలగాలని శపిస్తాడు. శాపం కారణంగా చంద్రుడు నానాటికీ క్షీణించసాగాడు. దీంతో అతని నుంచే వచ్చే వెన్నెల ఆగిపోయింది. లతలు, వృక్షాలు వాడిపోయాయి. కలువలు వికసించలేదు. ఓషధుల్లో గుణం నశించింది.  లోకానికి కలిగిన ఈ అకారణ దుఃఖాన్ని గమనించిన ఇంద్రాది దేవతలు చంద్రుడితో సహా బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లి, చంద్రుడికి శాపవిముక్తి కలిగించమని ప్రార్థిస్తారు. ప్రభాస క్షేత్రంలో శివుడిని గురించి తపస్సు చెయ్యమని బ్రహ్మదేవుడు చెబుతాడు. ఆవిధంగా తపస్సు చేసిన చంద్రుడికి  శివుడు ప్రత్యక్షమై రోజుకు ఒక కళ నశించేలా, తిరిగి 15 రోజుల తర్వాత రోజుకు ఒక కళ పెరుగుతూ పూర్ణచంద్రుడిగా పూర్ణిమ రోజున ప్రకాశించేలా అనుగ్రహిస్తాడు. ఇలా చంద్రుడి కళల్లో తగ్గుదల, పెరుగుదల కారణంగా ఏర్పడినవే శుక్ల, కృష్ణ పక్షాలు. ఈ విధంగా చంద్రుడికి పదహారు కళలు ఏర్పడ్డాయి. 
శరత్‌ చంద్రికలు
శరత్కాలంలో వచ్చే తొలి పూర్ణిమ ఆశ్వయుజ పూర్ణిమ. ఈ రోజుకు అనేక పేర్లు,  ఈ రోజున ‘కౌముద్యుత్సవం’, ‘కోజాగరీ’ వ్రతాలు చేస్తారు. వాలఖిల్య మహర్షి ద్వారా కోజాగరీ వ్రతం వ్యాప్తిలోకి వచ్చింది. ఆశ్వయుజ పూర్ణిమను ‘కౌమార పౌర్ణమాసి’ పేరుతో కొన్ని చోట్ల పాటిస్తారు. మరికొందరు ఈ రోజున లక్ష్మీంద్ర కుబేర పూజ చేస్తారు. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ఆశ్వయుజ పూర్ణిమ రోజున ‘గొంతెమ్మ పండుగ’ జరుపుకుంటారు. గొంతెమ్మ అంటే ‘కుంతి’ అని అర్థం. పార్వతీదేవికి ఉన్న పేర్లలో ‘కుంతిపరమేశ్వరి’ ఒకటి. అందువల్ల గొంతెమ్మ పండుగ పార్వతీదేవికి సంబంధించిందిగా తెలుస్తోంది. . శరత్పూర్ణిమ రోజున ఆరుబయట వెన్నెలో పరమాన్నం వండి, దాని మీద చంద్రకిరణాలు పడేలా ఉంచి, ఆ ప్రసాదాన్ని స్వీకరించే ఆచారం కొన్నిప్రాంతాల్లో ఉంది.
ఎన్నో నోములు 
మరెన్నో పూజలు 
శరత్పూర్ణిమ వ్రతాన్ని కొన్ని ప్రాంతాల్లో ఆచరిస్తారు. ఇందుకు సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వకాలంలో ఒక సంపన్నకుటుంబానికి చెందిన దంపతులకు కలిగిన బిడ్డ ఏమాత్రం అంగసౌష్టవం లేకుండా ఉండేది. ఓ సిద్ధ పురుషుడి సూచనతో ఆ దంపతులు అప్పటికే కన్యగా ఎదిగిన తమ బిడ్డతో ‘శరత్పూర్ణిమ’ నోము నోయించారు.. శరత్కాలం ప్రారంభమైన తొలిరోజున ఆరుబయట చంద్రకాంతిలో ఉండేలా వెండితో చేసిన అమ్మవారి ప్రతిమను అర్చించి, వెండితో చేసిన చంద్రుడి ప్రతిమను దానం చేయిస్తారు. ఇలా చంద్రుడిలో ఉండే పదహారు కళలకు ప్రతీకగా శుక్లపక్షమంతా చేయిస్తారు. తిరిగి కార్తికమాసం శుక్ల పక్షంలో కూడా ఈ విధానంలో అర్చనలు చేయిస్తారు. ఇలా మూడేళ్లు చేయగానే ఆ కన్య  సుందరిగా ప్రకాశించింది.
ఖగోళ విజ్ఞానపరంగా చూస్తే ఆశ్వయుజ మాస ప్రారంభంలో ఆకాశంలో అగస్త్య నక్షత్రం కనిపిస్తుంది. ఇది శరత్కాలానికి ప్రారంభ సూచిక. ఈ నక్షత్రం కనిపించగానే రాజులు దండయాత్రలకు బయల్దేరటానికి సిద్ధపడేవారని కాళిదాస మహాకవి రఘువంశ కావ్యంలో రాశాడు.
మనస్సును ఆహ్లాద పరిచే సౌందర్యం శరచ్చంద్రుడిలో ఉంది. ముఖచంద్రుడు అనడంలో అంతరార్థం ఇదే. తాను ప్రశాంతంగా ఉంటూ తన తోటి వారిని కూడా ప్రశాంతంగా ఉంచే వారే నిజమైన ఆధ్యాత్మిక సాధకులు అవుతారు.  మనవల్ల సమాజం ఉద్వేగం పొందని స్థితిలో ఉన్నా, సమాజం వల్ల మనం ఉద్వేగానికి లోనుకాని స్థితిలో ఉన్నా.. మానవ జీవనం ఆత్మజీవనం అవుతుంది.
కార్తీక పూర్ణిమ రోజున ఆచరించే వ్రతాల్లో భక్తేశ్వర వ్రతం స్త్రీలకు సౌభాగ్యం కలిగించే వ్రతంగా చేసుకునే ఆచారం ఉంది.
చంద్రుడు పదహారు కళలతో ఉంటాడని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఆ కళలు
1.అమృత
2.మానద
3.పూష
4.తుష్టి
5.సృష్టి
6.రతి
7.ధృతి
8.శశిని
9.చంద్రిక
10.కాంతి
11.జ్యోత్స్న
12.శ్రీ
13.ప్రీతి
14.అంగద
15.పూర్ణ
16.పూర్ణామృత
- కప్పగంతు రామకృష్ణ


పున్నమి కాంతుల కల్యాణం (ఒంటిమిట్టలో జరిగే శ్రీ సీతారామ కల్యాణం నేపథ్యంగా శ్రీకనకదుర్గ ప్రభ పత్రికలో రాసిన వ్యాసం)

  పున్నమి కాంతుల కల్యాణం                లోకంలో పెళ్ళి ముచ్చట అంటే సీతారాములదే. అందులోనూ ఒంటిమిట్ట ఆలయంలో జరిగే సీతారాముల కల్యాణం మరింత శ...