Tuesday, July 2, 2019

భగవాన్ సత్యసాయి బాబా బోధనల విశేషాలతో డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr Kappagantu Ramakrishna) ఈనాడు దినపత్రిక మకరందం పేజిలో రాసిన వ్యాసం

బంగారూ! ఇదే పంచశీల 
సత్యం... శివం... సుందరం
23న సత్యసాయి జయంతి
బంగారూ! ఇదే పంచశీల 
ఆయన వద్ద మంత్రాలన్నీ మామూలు మాటలయ్యాయి. ఆయన మాటలు మంత్రాలుగా మారి సమ్మోహితులను చేశాయి. అలతి అలతి పదాలతో వేదోపనిషత్తుల సారాన్ని ప్రజలకు పంచిన  ఆయన మానవాళికి ప్రేమ, సేవలను తారక మంత్రాలుగా అందించారు. అందుకే ఆయన నడిచే దేవుడయ్యారు... కదిలే బ్రహ్మమయ్యారు. ఆదర్శ పురుషులుగా ప్రపంచ ప్రఖ్యాతిపొందారు...
నేేను దేవుడిని. నీవు కూడా దేవుడివే. తేడా ఏమిటంటే ఈ సంగతి నాకు తెలుసు. నీకు తెలియదు. మీ హృదయాల్లో ప్రేమ అనే దీపం వెలిగించి దానిని అనుదినం ప్రజ్వలింపజేయటానికే వచ్చాను. నేను ఏదో ఒక మతం తరఫున గానీ, ఒక సంఘం తరఫునగానీ ప్రచారానికి రాలేదు. ఒక సిద్ధాంతానికి అనుయాయులను పోగుచెయ్యటానికి రాలేదు. నా మార్గంలో కాని, మరో మార్గంలో కాని శిష్యులను, భక్తులను ఆకర్షించం నా అభిమతం కాదు. విశ్వవ్యాప్తమైన ఒకే ఒక ఆధ్యాత్మికసూత్రం ‘ప్రేమ’ అనే మార్గం, ధర్మం అనే బాధ్యత. ఈ రెండు జ్యోతుల్ని మీకు అందించటానికే వచ్చాను... అంటూ తన మార్గాన్ని విస్పష్టంగా ప్రకటించి, తన ఆశయాల్ని ఆచరణలోకి తీసుకువచ్చిన ప్రేమమూర్తి సత్యసాయిబాబా.
 
1. మానవుడే మాధవుడు
దేవుడు గుళ్లల్లో, రాళ్లల్లో ఉండడు. మనుషుల్లో ఉంటాడు. తనలో దాగిఉన్న మాధవుడిని గుర్తించటమే జీవితలక్ష్యం కావాలంటారు సాయి. ఇందుకోసం ఆయన ప్రవచించిన మార్గం ‘సేవ’. కనబడే మనిషిని ప్రేమించలేకపోతే కనిపించని దైవాన్ని ఎలా ప్రేమించగలవు? ఎలా గుర్తించగలవు? అంటూ సూటిగా ప్రశ్నించేవారు. ఈ భావాన్ని ప్రతి వ్యక్తిలో ఉద్దీపింపజేయాలన్నదే ఆయన ఆశయం. అందుకనే తన ప్రతి ఉపన్యాసాన్ని దివ్యాత్మస్వరూపులారా! అంటూ ప్రారంభించేవారు. అందరినీ ప్రేమించు... ఎవరినీ ద్వేషించకు. తోటివారి బాధ నీదిగా భావించు. మానవసేవే మాధవ సేవ అంటూ ఎంతో స్పష్టంగా మానవధర్మాన్ని మానవీయకోణంలో సాయి ఉద్బోధించారు. సత్యసాయి సంస్థలన్నిటిలో ఆచరణాత్మకంగా కనిపించేది ఈ భావమే. ఆర్తులు,  అనారోగ్యపీడితులు... అందరినీ సాయి అక్కున చేర్చుకున్నారు.  వారికి సేవ చెయ్యటాన్నే దైవారాధనగా భావించేవారు.
సాయి మాటల్లో...
హృదయం : హృదయం లేని మాటకన్నా, మాటలేని హృదయం మిన్న
విద్య : గుణార్జనే కానీ ధనార్జన కోసం కాకూడదు
త్యాగం : దేహాభిమానాన్ని వదిలేయడం
సుఖం : రెండు దుఃఖాల మధ్య విరామం
దాసులు : హరికి కావాలి కానీ సిరికి కాదు
జీవనం : ఆశయాల కోసం... ఆశల కోసం కాదు
బలం : గుణాన్ని మించిన బలం లేదు
2. ప్రేమే మార్గం
తన గుండెల్లో భగవదైశ్వర్యాన్ని నింపుకోమనీ, నీచమైన అహంకారాన్ని విడిచిపెట్టమని ప్రతి మతం బోధిస్తుంది. వైరాగ్యాన్ని, విజ్ఞతనూ పెంచుకుని మోక్షాన్ని సాధించుకోవటాన్ని నేర్పుతుంది. అన్ని హృదయాల్లో వెలిగేది ఒకే ఒక దేవుడు. అన్ని మతాలూ ఆ భగవంతుడినే కీర్తిస్తున్నాయి. అన్ని భాషలూ ఆ పేరే చెబుతున్నాయి. ప్రేమే భగవంతుడిని ఆరాధించటానికి అత్యుత్తమమైన మార్గం. ఈ ప్రేమే నేను మీకిచ్చే సందేశం. ఈ ఐక్యభావాన్ని అవగతం చేసుకోండి అంటారు సాయి. ఆకాశం నుంచి వచ్చే వాన ఎక్కడ కురిసినా చివరకు సముద్రాన్నే చేరుతుంది. అలాగే, ఏ దేవుడిని ఆరాధించినా అది చివరకు చేరేది ఒకే పరమాత్మ దగ్గరకి అంటాయి ఉపనిషత్తులు. సాయి ఆచరించి చూపించిన మార్గం కూడా ఇదే.
3. నువ్వే... నువ్వే
మనిషి పొందే ఆనందానికి, దుఃఖానికి అతడే కారణం. ఇతరుల వల్ల నువ్వు దుఃఖపడేదీ లేదు. ఆనందం పొందేదీ లేదు. నువ్వు సంతోషంగా ఉంటే ఎవరూ పలకరించరు. అదే, బాధలో ఉంటే ఎందుకు విచారంగా ఉన్నావంటూ పలకరిస్తారు. ఆనందానికి, దుఃఖానికి ఇదే తేడా. ఆనందం మనకు సహజంగా వస్తుంది. దుఃఖం మనం తెచ్చిపెట్టుకున్నది. నువ్వు అనుభవించే బాధలకు నువ్వే కారణం. దాన్ని ఇతరుల మీద నెట్టే గుణాన్ని వదులుకోమంటూ సాయి యువతకు దిశా నిర్దేశం చేశారు. నీలో ఉన్న శక్తిని గుర్తించు. అంతులేని విజయాన్ని సాధిస్తావు అనేవారు.
4. ఉత్తిష్ఠ... జాగృతః
మీరంతా నాస్తికులుగా మారినా నాకు ఇష్టమే. కానీ, మూఢవిశ్వాసాలకు బలికాకండి. మీలో ఉన్న ప్రజ్ఞను మసిబారనివ్వకండి. మనిషికి మూఢవిశ్వాసం ప్రబల శత్రువు. దాన్ని ఆశ్రయించటాన్ని మించిన మూర్ఖత్వం ఉండదు. మీలో ఉన్న విచక్షణా జ్ఞానానికి పదును పెట్టండి. జ్యోతిష్యం, జాతకాల భ్రమలో జీవితాన్ని బలిచేసుకోకండి... అంటూ స్పష్టంగా యువతకు నిర్దేశం చేశారు సాయి.  ముక్కుమూసుకుని ‘సోహం.. సోహం’ అంటూ జపించటం, అలాచేసేవారిని ప్రోత్సహించటం సాయి సిద్ధాంతం కాదు. ‘సాధకుడా! లే ! నడుంకట్టు! సమాజ సేవలో ప్రవేశించు!’ అని ప్రోత్సహించటమే సాయి సిద్ధాంతం.
4. పరిపూర్ణంగా ఉండు
సాయిబోధనల్లో కర్మ, భక్తి మార్గాలు కనిపించినా అదంతా అద్వైతానికే దారి తీస్తుంది. సనాతన ధర్మాన్ని, విశ్వమానవ ప్రేమను ప్రబోధించిన సాయి, సమాజంలో నానాటికీ క్షీణిస్తున్న దైవవిశ్వాసాన్ని, ధర్మజిజ్ఞాసను పునరుద్ధరించారు. ఆదిశంకరాచార్యుల మార్గం కూడా ఇదే.ఆయనా పరిపూర్ణత్వాన్నే ఆకాంక్షించారు. ‘నహి నహి రక్షతి డృజ్ఞ్‌ కరణే’  ఆత్మజ్ఞానం లేని చదువు వ్యర్థమని ప్రకటించి, భజగోవింద స్తోత్రాన్ని రాశారు శంకరులు. సాయి మార్గమూ ఇదే.
-డా.కప్పగంతు రామకృష్ణ

No comments:

పున్నమి కాంతుల కల్యాణం (ఒంటిమిట్టలో జరిగే శ్రీ సీతారామ కల్యాణం నేపథ్యంగా శ్రీకనకదుర్గ ప్రభ పత్రికలో రాసిన వ్యాసం)

  పున్నమి కాంతుల కల్యాణం                లోకంలో పెళ్ళి ముచ్చట అంటే సీతారాములదే. అందులోనూ ఒంటిమిట్ట ఆలయంలో జరిగే సీతారాముల కల్యాణం మరింత శ...