Tuesday, July 2, 2019

వ్యాసపూర్ణిమ సందర్భంగా డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr Kappagantu Ramakrishna) ఈనాడు దినపత్రిక మకరందం పేజిలో రాసిన వ్యాసం

గురువు ఎందుకు?
రేపు గురుపౌర్ణమి
గురువు ఎందుకు?
చాణక్యుడు చేతిలో రూపుదిద్దుకున్న శిల్పం చంద్రగుప్తమౌర్యుడు సమర్థరామదాసు తయారుచేసిన వీరఖడ్గం శివాజీ!  రామకృష్ణపరమహంస అందించిన ఆధ్యాత్మిక శిఖరం వివేకానందుడు భారతీయ గురుశిష్య శక్తికి వీళ్లు ఉదాహరణలు మాత్రమే! ఆదిదేవుడితో మొదలైన గురుపరంపర వేదవ్యాసుడితో సుసంపన్నమైంది.. నేటికీ కొనసాగుతూనే ఉంది. సనాతన ధర్మాన్ని పరంపరాగతంగా పరిరక్షిస్తున్న ఆ గురుదేవులను స్మరించుకుందాం..
జ్ఞానపొరలు తొలగించి.. జ్ఞానదీప్తిని వెలిగించేవాడు గురువు. ‘గు’ అంటే చీకటి, ‘రు’ అంటే పోగొట్టేది అని అర్థం. అలాంటి గురువును దైవం కన్నా ఎక్కువగా ఆరాధించే సంస్కృతి మనది. అధర్వణ వేద సంప్రదాయం ప్రకారం చదువు ప్రారంభించే ముందు శిష్యుడు మొదటగా ఇష్టదేవతా ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత ‘స్వస్తినో బృహస్పతిర్దదాతు’ అని గురువును స్మరిస్తాడు. మహాభారతం అరణ్యపర్వంలోని యక్షప్రశ్నల ఇతివృత్తంలో యక్షుడు ‘మనిషి మనీషి ఎలా అవుతాడు?’ అని ధర్మరాజును ప్రశ్నిస్తాడు. ‘అధ్యయనం వల్ల, గురువు ద్వారా’ అని సమాధానం చెబుతాడు ధర్మరాజు. గురువుకు ఉన్న శక్తి అంతటి గొప్పది.
శాంతమూర్తి సదాచారదీప్తి
ఒక గురువు ఎలా ఉండాలో సనాతన ధర్మం సూచించింది. గురువుకు ఉండాల్సిన లక్షణాలు, గురువు గొప్పదనం గురించి స్కాంద పురాణంలో చక్కటి వివరణ ఉంది. ఈ పురాణంలోని ఉమామహేశ్వర సంవాదం ‘గురుగీత’గా ప్రసిద్ధి పొందింది. ఇందులో గురువు అని ఎవరిని పిలవాలి? ఆయన అవసరం ఏమిటి? శిష్యుడు ఎలా ఉండాలి? మొదలైన ఎన్నో విషయాల్ని పరమేశ్వరుడు పార్వతీదేవికి స్వయంగా వివరిస్తాడు.
శాంతో దాన్తో కులీనశ్చ,
వినీత శ్శుద్ధవేషవాన్‌
సదాచార స్సుప్రసిద్ధః
శుచిర్దక్ష స్సుబుద్ధిమాన్‌
ఆశ్రయే ధ్యాననిష్ఠశ్చ
మంత్ర తంత్ర విచక్షణః
నిగ్రహానుగ్రహే శక్తో గురురిత్యభిధీయతే ।।
గురువు శాంతంగా ఉండాలి. మంచి వేషం ధరించాలి. సదాచారం పాటించాలి. మంచి బుద్ధి, మంత్ర, తంత్రాలపై చక్కని అభినివేశం, నిగ్రహ, అనుగ్రహ సామర్థ్యాలు కలిగి ఉండాలి. ఈ లక్షణాలన్నీ గురువుకు ఉండాలని పరమేశ్వరుడు చెబుతాడు. యోగశిఖోపనిషత్‌, ముక్తికోపనిషత్‌, బ్రహ్మవిద్యోపనిషత్‌... ఇంకా ఎన్నో ఉపనిషత్తుల్లో గురువు గొప్పదనం, గురువును ఎలా సేవించాలి, గురువు అవసరం ఏమిటనే విషయాలు ఉన్నాయి.
అందరూ గురువులే..
సాధారణంగా గురువు అనగానే విద్య బోధించేవాడనే భావం కలుగుతుంది. కానీ, గురువులు ఏడు రకాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఏ గురువైనా శిష్యుడికి జ్ఞానాన్ని ప్రసాదించడమే లక్ష్యంగా కలిగి ఉంటారు.
1. సూచక గురువు - చదువు చెప్పేవాడు
2. వాచక గురువు - కుల, ఆశ్రమ ధర్మాలు బోధించేవాడు
3. బోధక గురువు - మంత్రాలు ఉపదేశించేవాడు
4. నిషిద్ధ గురువు - వశీకరణ విద్యలు బోధించేవాడు
5. విహిత గురువు - భోగాల మీద విరక్తి కలిగించేవాడు
6. కారణ గురువు - బ్రహ్మతత్త్వాన్ని ఉపదేశించేవాడు
7. పరమ గురువు - పరమాత్మ అనుభవాన్ని ప్రత్యక్షంగా కలిగించేవాడు
జాతికి అంకితం
ఆధునిక కాలంలోనూ ఎందరో గురువులు తమ అపారమైన శక్తి, మేధస్సుతో శిష్యులను తయారుచేసి, వారి ద్వారా మనదేశాన్ని కాపాడారు. ప్రగతిపథంలో నడిపించారు. చాణక్యుడు గురుస్థానంలో ఉండి చంద్రగుప్తమౌర్యుడికి ధర్మరాజ్య స్థాపన కోసం మార్గనిర్దేశం చేశాడు. పతంజలి పుష్యమిత్రుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. విద్యారణ్యుడు భారతీయ సంస్కృతీ పరిరక్షణాభిలాషను హరిహర, బుక్కరాయ సోదరుల్లో ప్రజ్జ్వలింపజేశాడు. సమర్థ రామదాసు శివాజీ వంటి చురకత్తిని మనదేశానికి అందించాడు. తన ఉపన్యాసాలతో భారతీయ హృదయాలను చైతన్యవంతం చేసిన వివేకానందుడిని రామకృష్ణ పరమహంస గురుస్థానంలో ఉండి, మనకు అందించాడు. భగవాన్‌ రమణమహర్షి, నడిచేదైవంగా ప్రసిద్ధిపొందిన కంచి కామకోటి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతీమహాస్వామి... ఇంకా ఎందరో గురువులు తమ బోధనలతో మనదేశాన్ని ధర్మమార్గంలో నడిపిస్తున్నారు.
- డాక్టర్‌ కప్పగంతు రామకృష్ణ  
ఎందరో మహానుభావులు
గురువంటే కేవలం ఆధ్యాత్మిక విద్యల్ని, లౌకిక జీవనానికి ఉపకరించే విద్యల్ని బోధించే ఆచార్యుడు కాదు. సమాజమే దేవాలయం, సమాజ హితమే భగవదనుగ్రహ కారకమని, పరోపకారమే పరమేశ్వరుడికి ప్రీతికరం అని చెప్పి, ఆచరించి సామాజిక జాగృతిని కలిగించిన గురువులు ఎందరో! వారి బోధలు, దార్శనిక సూత్రాలు చైతన్య స్ఫోరకాలు. అలాంటి ఎందరో మహానుభావుల్లో వీళ్లు కొందరు..
 సంత్‌ ఏక్‌నాథ్‌
తనను తాను అన్ని జీవరాశుల్లో దర్శించాలనే భగవతత్త్వాన్ని ఆదర్శంగా స్వీకరించిన వాడు సంత్‌ ఏక్‌నాథ్‌. పాండురంగడి భక్తుడిగా అంతటా విఠల దర్శనం చేశాడు. కులవ్యవస్థను నిరసించి, సర్వత్రా సమత్వ సాధనను ఆచరించి మహనీయుడిగా ఏక్‌నాథ్‌ చరితార్థుడయ్యాడు. పరోపకారమే పాండురంగడి పూజ అని చాటిచెప్పాడు.
 కబీర్‌ దాసు
అన్ని మతాల్లోని అంధవిశ్వాసాల్ని బహిర్గతం చేసి.. నిజభక్తి ఎలా ఉండాలో పరిచయం చేశాడు కబీర్‌. తాను రచించిన దోహాల ద్వారా సామజిక రుగ్మతలను ప్రశ్నించి.. సంఘంలో చైతన్యాన్ని కలిగించాడు. ప్రతి వ్యక్తిలో దైవత్వాన్ని దర్శించడమే మానవత్వమని చాటి చెప్పాడు కబీర్‌.
గురునానక్‌
‘నిన్ను నువ్వు ఎలా ప్రేమిస్తావో.. ఇతరులను కూడా అలాగే ప్రేమించు’ అనే విశ్వ ప్రేమ సూత్రాన్ని గురునానక్‌ వెల్లడించాడు. ‘జాతి అభిమానం వృథా! అన్ని జీవులు ఉండేది పరమాత్ముడి నీడలోనే’ అని జాత్యహంకారాన్ని నిరసించాడు.
స్వామి నారాయణ్‌
‘ఆకలిగొన్నవారికి అన్నం పెట్టడం, దాహార్తితో ఉన్నవారికి నీళ్లివ్వడం దైవపూజ. బీదల జీవితాల్లో చిరుదివ్వెలు వెలిగించడం.. దేవుడి గుడిలో దీపారాధన చేయడం’ అంటారు స్వామి నారాయణ్‌. సత్సంగం, సమాజ హితం, సాధుజీవనం పరమాత్ముడికి చేరువ చేస్తాయని ఉపదేశించాడు.
స్వామి దయానంద సరస్వతి
ఆర్య సమాజాన్ని స్థాపించి, అంధ విశ్వాసాల్లో, అవిద్యలో కూరుకుపోయిన స్వధర్మీయులను దయానంద సరస్వతి సముద్ధరణ చేశాడు. అభ్యుదయవాదిగా, సామాజిక సంస్కర్తగా దయానందది ప్రత్యేక స్థానం. లాలా లజపతిరాయ్‌, భగత్‌ సింగ్‌, చంద్రశేఖర్‌ ఆజాద్‌ వంటి వారికి ఆయన మార్గదర్శకడు.

  
భరతజాతి గురువు
జ్ఞానాన్ని ప్రసాదించిన గురువునే దైవంగా భావిస్తూ చేసుకునే పండగ గురుపూర్ణిమ. దీన్నే వ్యాసపూర్ణిమ అంటారు. వేదవ్యాసుడు జన్మించిన ఆషాఢ శుద్ధ పూర్ణిమను ఆయన పేరు మీద గురు పూర్ణిమగా నిర్వహించుకోవడం ఆచారంగా వస్తోంది.
వాస్తవానికి ‘వ్యాసుడు’ అనేది ఒక వ్యక్తి పేరు కాదు. అదొక పదవి. ఆ పదవిలో ఉన్న వారందరూ వ్యాసులే. ప్రతి మన్వంతరంలోనూ ఒక్కో వ్యాసుడు అవతరిస్తాడు. సృష్టి ప్రారంభమై 27 మన్వంతరాలు గడిచి, ప్రస్తుతం 28వ వైవస్వత మన్వంతరం జరుగుతోంది. ఈ మన్వంతరంలో సత్యవతి, పరాశరుల కుమారుడైన కృష్ణ ద్వైపాయనుడు (ఈయనకే బాదరాయణుడు అనే పేరు కూడా ఉంది) వ్యాసుడుగా ఉన్నాడు. ఈయన జన్మించిన ఆషాఢ పూర్ణిమగురుపూర్ణిమగా వ్యాప్తిలోకి వచ్చింది
వశిష్ఠుడు, వాల్మీకి వంటి తపశ్శక్తి సంపన్నులు, వేదవేదాంగవేత్తలు ఎంతమంది ఉన్నా వేదవ్యాసుడికే మన ప్రాచీనులు అగ్రపీఠం వేశారు. ఎందుకంటే, ఒకే రాశిగా ఉన్నా వేదాల్ని రుక్‌, యజు, సామ, అధర్వణ వేదాలుగా విభజించి లోకానికి అందించినవాడు వ్యాసుడు. ఈయనే బ్రహ్మసూత్రాలకు భాష్యం రాశాడు. భారత, భాగవతాలను రచించాడు. శ్రీకృష్ణుడి రూపంలో ప్రపంచానికి భగవద్గీత బోధించాడు. అనంతమైన సాహిత్యాన్ని సృష్టించి, దాని ద్వారా భారతీయ సంస్కృతీసంప్రదాయ హర్మ్యాలకు పునాదిరాళ్లు వేసిన శిల్పి వ్యాసభగవానుడు. సార్వజనీనం, సార్వకాలికమైన సాహిత్యానికి సృష్టికర్త కూడా ఆయనే. శక్తి, భక్తి, సౌశీల్యం, సహజీవనం, సనాతన ధర్మం, పవిత్రత, దానధర్మాలు ఈ దేశ సహజ లక్షణాలుగా రూపొందటానికి మూలం వ్యాసుడి రచనలే. ఇంతటి మహోన్నతమూర్తిని భారతజాతికి గురువుగా భావించి చేసే అర్చనే ‘గురుపూర్ణిమ’. భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ ‘మునీనామప్యహం వ్యాసః’- మునుల్లో నేను వ్యాసుడిని అంటాడు. ‘కృష్ణద్వైపాయనాదయో యే రుషయః తాన్‌ రుషీగ్‌ం తర్పయామి’అంటూ ఆచారాలు కూడా వ్యాసుడికే అగ్రపీఠం వేశాయి. ఇదీ వ్యాసుడి ఘనత.
27 మన్వంతరాల్లో వ్యాసులు..
స్వయంభువు, ప్రజాపతి, ఉశనుడు, బృహస్పతి, సూర్యుడు, యముడు, ఇంద్రుడు, వశిష్ఠుడు, సారస్వతుడు, త్రిథాముడు, త్రివృషుడు, భరద్వాజుడు, అంతరిక్షుడు, ధర్ముడు, త్రయారుణి, ధనుంజయుడు, కృతంజయుడు, సంజయుడు, అత్రి, గౌతముడు, హార్యాత్మకుడు, వేణుడు (వాజిశ్రవుడు), సోముడు, తృణబిందు, భార్గవుడు, శక్తిమహర్షి, జాతకర్ణుడు.

No comments:

పున్నమి కాంతుల కల్యాణం (ఒంటిమిట్టలో జరిగే శ్రీ సీతారామ కల్యాణం నేపథ్యంగా శ్రీకనకదుర్గ ప్రభ పత్రికలో రాసిన వ్యాసం)

  పున్నమి కాంతుల కల్యాణం                లోకంలో పెళ్ళి ముచ్చట అంటే సీతారాములదే. అందులోనూ ఒంటిమిట్ట ఆలయంలో జరిగే సీతారాముల కల్యాణం మరింత శ...