Thursday, August 29, 2019

గణనాధుడి తత్వ విశేషాలు వివరిస్తూ డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr Kappagantu Ramakrishna) ఈనాడు దినపత్రికలో రాసిన వ్యాసం


ఘన యోగపతి
మహా గణపతి ఆయన వదనం ఓంకారం...ఆయన మాట శ్రీకారం...ఆయన పూర్ణసృష్టికి సంకేతం. అతి గొప్ప ఆధ్యాత్మికతత్త్వం ఆయనదేనంటూ శాస్త్రాలు, ఉపనిషత్తులు వివరిస్తున్నాయి. యోగ గణపతిగా ఆయన ప్రాధాన్యాన్ని యాజ్ఞవల్క్యస్మృతి చెబుతోంది.
‘త్వం మూలాధారే స్థితోస్మి నిత్యమ్‌...
త్వం యోగినో ధ్యాయంతి నిత్యమ్‌’.
మానవ శరీరంలోని మూలాధార స్థానంలో ఉండే దైవానివి నీవే... యోగులందరూ ఎప్పుడూ నిన్నే ధ్యానిస్తూ ఉంటారని గణపతి అధర్వశీర్షం చెబుతోంది. యోగశాస్త్రంలో వినాయకుడిని మూలాధారచక్రానికి అధిష్ఠాన దేవతగా భావిస్తారు. మూలాధారం వద్ద సుషుమ్న నాడి మూడు చుట్టలు చుట్టుకుని, పైన పడగ కప్పుకొని ఉన్న పాములా ఉంటుందని పతంజలి వెల్లడించారు. యోగి తన సాధన ద్వారా సుషుమ్నను మేల్కొలుపుతాడు. దీంతో మిగిలిన అయిదు చక్రాలూ ఉత్తేజితం అవుతాయి. ఈ క్రియవల్ల హంసలా మనిషిలో సంచరించే ప్రాణవాయువు సహస్రార కమలాన్ని చేరుకుంటుంది. అప్పుడు ఆత్మ పరమాత్మ ఏకమవుతాయి. ఈ యోగప్రక్రియ మొత్తానికి సూత్రం మూలాధారం. ఆ చక్రానికి అధిష్ఠానదేవత గణపతి.
గజవదనం ఓంకారాన్ని సూచిస్తుంది. ‘అ’కారం నుంచి ‘క్ష’కారం వరకు ఉన్న అక్షరాలను కంఠం మొదలు చరణాల వరకు వివిధ అంగాలుగా భావించిన మన మహర్షులు ‘అక్షర గణపతి’ని ఆవిష్కరించారు. అక్షర స్వరూపమైన గణపతిని ఆరాధించడం అంటే అక్షరాల్ని ఉపాసించటమే అవుతుంది. అక్షరం అంటే నాశనం కానిది అని అర్థం. నాశనం లేనిది జ్ఞానం ఒక్కటే. గణపతి ఉపాసన అంటే జ్ఞానాన్ని ఉపాసించటమే అవుతుంది.
మన శరీరంలో సుషుమ్నతో పాటు ఇడ, పింగళ అనే నాడులు ఉంటాయి. వీటిలో ‘ఇడ’ బుద్ధికి, ‘పింగళ’ సిద్ధికి సంకేతాలు. సుషుమ్న ఎప్పుడూ ఇడ, పింగళతో కలిసే ఉంటుంది. అంటే, మూలాధార అధిపతి అయిన గణపతి సిద్ధి, బుద్ధితో కలిసి ఉంటాడన్నమాట. గణపతికి సిద్ధి, బుద్ధి భార్యలు అనడంలో అంతరార్థకూడా ఇదే. మనలో ఉన్న దురాలోచనలు తొలగితే మంచి బుద్ధి కలుగుతుంది. ఎప్పుడైతే మంచి బుద్ధి కలుగుతుందో అప్పుడు మనసు శాశ్వతమైన ముక్తిస్థానాన్ని కోరుకుంటుంది. గణపతి ఆరాధన ద్వారా మంచి బుద్ధి వస్తుంది. మోక్షం వైపు మనిషి సాధన జరుగుతుంది. గణపతి ఉపాసనలోని అంతరార్థం, ఆయన తత్త్వం ఇదే.  యోగశాస్త్రం ప్రకారం మానవశరీరంలోని మూలాధారంలో త్రికోణ యంత్రం ఉంటుంది. దానికి అధిపతి గణపతి కాబట్టి యంత్ర శాస్త్రంలోనూ ఆయనదే తొలిస్థానం
వ్యాసమహర్షి మహాభారతాన్ని రాసే నేర్పు గణపతికే ఉందని భావించాడు. గణపతి కూడా సరేనన్నాడు. అయితే, వ్యాసుడు ‘నేను చెప్పే ప్రతి శ్లోకాన్నీ పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతనే రాయా’లంటూ నియమం పెట్టాడు.  వ్యాసుడు చెబుతూనే ఉన్నాడు. గణపతి రాస్తూనే ఉన్నాడు.. ప్రతి శ్లోకాన్నీ పూర్తిగా అర్థం చేసుకుంటూ. అలా పంచమ వేదమైన మహాభారతం ఆవిర్భవించింది. అద్భుతాలు జరగాలంటే ఏమరుపాటు పనికిరాదు. గొప్ప సన్నద్ధత, దృఢదీక్ష కావాలి. పనులు ప్రారంభించాక వచ్చే ఆటంకాలు చూసి బెదరిపోకూడదు. చివరదాకా పట్టుదలగా నిలవాలి. అప్పుడే విజయం వరిస్తుంది. విద్యార్థులకు ఉండాల్సిన ఈ లక్షణాలన్నిటినీ గణపతి ఆచరణాత్మకంగా అందించాడు.

మట్టితో ప్రాణ ప్రతిష్ఠ
ఆకాశం నుంచి వాయువు, అందులో నుంచి అగ్ని, దాని నుంచి నీరు, నీటి నుంచి భూమి ఏర్పడ్డాయి. జడ పదార్థమైన భూమి, చైతన్యం కలిగిన నీటితో కలిసి ప్రాణశక్తిని పొందుతుంది. ఆహార పదార్థాలు, ఓషధులు అందిస్తుంది. ఇలా ప్రాణ, జడశక్తుల కలయికతో సృష్టి సాగుతుందనడానికి సంకేతంగా గణపతి విగ్రహాన్ని మట్టి, నీరు కలిపి తయారుచేస్తారు. మట్టి గణపతిని పూజించడం, ఆ తర్వాత నిమజ్జనం చేయడం ఉత్తమ ఆచారంగా చెబుతారు.
ఒక్కడే... ఒక్కడే...
గణపతిని త్రిగుణాలకు అతీతుడుగా, త్రికాలాలకు (భూత, భవిష్యత్‌, వర్తమాన) అందనివాడుగా పంచభూతాలకు ఆత్మగా, సకల దేవతాస్వరూపుడిగా అధర్వణ వేదంలోని గణపతి అధర్వశీర్షం ప్రకటిస్తుంది. త్రిమూర్తులతో సహా పంచభూతాలూ ఆయన స్వరూపమే అంటోందీ స్తోత్రం. ‘ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్నవినాశినే శివసుతాయ వరదమూర్తయే నమః’ ... గణపతి అధర్వ శీర్షంలో అత్యంత ప్రసిద్ధిపొందిన మంత్రపాఠం ఇది.  స్తోత్రరూపంగా సాగే ఈ అధర్వశీర్ష పారాయణ వేగంగా ఫలితాలను ఇస్తుందని నమ్ముతారు.

ఆ గణపతి వేరయా...
‘ఓం గణానాం త్వా గణపతిగ్‌ం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన సృణ్వన్నూతిభిస్సీదసాదనం’ గణపతిని పూజించే మంత్రాల్లో అత్యంత ప్రసిద్ధిపొందిన మంత్రం ఇది. రుగ్వేదం రెండో మండలంలో ఇది ఉంది. గణపతిని రాజుల్లో పెద్దవాడుగా, దేవతల్లో పూజలందుకునే మొదటివాడుగా, 33 కోట్ల దేవతాగణాలకు అధినాయకుడిగా వర్ణిస్తుంది రుగ్వేదం. గణాలకు నాయకుడిగా గణపతిని చెబుతోందే కానీ గజముఖ స్వరూపం గురించి ఈ వేదంలో కనిపించదు. మొత్తంగా గణపతి సర్వస్వతంత్ర, సర్వవ్యాపక, సర్వశక్తి సమన్వితుడైన దేవుడని సమస్త సాహిత్యం విస్పష్టంగా ప్రకటిస్తోంది. అశ్వమేధయాగంలో ఉపయోగించే ఒక మంత్రం ఉంది.
గణానాం త్వా గణపతిగ్‌ం హవామహే / ప్రియానాం త్వా ప్రియపతిగ్‌ం హవామహే / నిధినాం త్వా నిధిపతిం హవామహే వసో మమ / అహమజానీ గర్భధమా త్వమజాసి గర్భధం..’ అంటూ సాగే ఈ మంత్రం హిరణ్యగర్భుడిగా ఉన్న ప్రజాపతిని ఉద్దేశించింది. ఇందులో ఎక్కడా గజముఖుడైన గణపతి ప్రస్తావన లేదు. మైత్రాయణీ సంహితలో ‘తత్‌ కరటాయ విద్మహే హస్తిముఖాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్‌’ అనే మంత్రం ఉంది. ఈ ఒక్కచోటే గజముఖుడి గురించి వేదాల్లో కనిపిస్తుందని పరిశోధకులు వివరిస్తున్నారు.

రాజాధిరాజా...నీకే తొలిపూజ!
సోమవారం వినాయక చవితి గణనాథుడు ఎక్కడున్నాడు? రంగురంగుల బొమ్మల్లోనా..? వ్రత కథా పుస్తకాలపైనా..? కాదు ఆయన మనలోనే ఉన్నాడు. మన అంతఃచేతనలో ఉన్నాడు. బుద్ధిలో ఉన్నాడు.మనకు కలిగే సిద్ధిలో ఉన్నాడు...మంచి హృదయంతో ఉండడమే సిసలైన ఆరాధన అని ఉద్బోధిస్తున్నాడు...

స్వరూపం ఇచ్చే సందేశం

ఏనుగు తల
జ్ఞ్థానానికి, యోగానికి సంకేతం
చేతిలోఉన్న పరశువు
అజ్ఞానాన్ని ఖండించే లక్షణంవిరిగిన దంతం
త్యాగానికి చిహ్నం
మనిషి శరీరం మాయకు, ప్రకృతికి చిహ్నం
పెద్ద చెవులు
ఎక్కువగా వినటం
చేతిలో ఉన్న పాశం
విఘ్న నివారణకు ప్రతీక
తొండం
ఓంకారం
నాగబంధం
శక్తికి, కుండలినికి సంకేతం
ఎలుక వాహనం
అన్ని జీవులపై సమభావనకు చిహ్నం

రచన : - Dr కప్పగంతు రామకృష్ణ, 9032044115

Saturday, August 3, 2019

స్నేహితుల దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr Kappagantu Ramakrishna) ఈనాడులో రాసిన వ్యాసం

నేస్తామంటే .. సమస్తం!
ఇవాళ ఫ్రెండ్‌షిప్‌ డే కదా... మన నేస్తాల్ని కలిసి శుభాకాంక్షలు చెప్పేస్తాం... ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్‌ కట్టేస్తాం... రోజంతా సరదాగా గడిపేస్తాం... ఇది సరే... అసలు ఫ్రెండంటే ఎలా ఉండాలి? నిజమైన స్నేహితుడు ఎవరు? స్నేహం గొప్పదనం ఏంటి? ఆ మంచి మైత్రిని చూపిన కొన్ని స్నేహాలు మన పురాణాలు, ఇతిహాసాల్లో ఉన్నాయ్‌...  మరి వాటి గురించి తెలుసుకుందామా!
అంతస్తుల తేడాల్లేవ్‌!
నిజమైన స్నేహితుల మధ్య ధనవంతుడు, పేదవాడు అన్న తేడా ఉండదు. చదువు పూర్తయి జీవితంలో ఉన్నతస్థానాలకు చేరుకున్నా చిన్ననాటి మిత్రుల్ని జ్ఞాపకం పెట్టుకుని, వారిని ఆదరించాలి.
శ్రీకృష్ణుడు, కుచేలుడు స్నేహితులని తెలుసుగా. వీరిద్దరూ సాందీప మహర్షి దగ్గర చదువుకుంటున్నప్పుడు ఓ రోజు హోమం చెయ్యటానికి అవసరమైన సమిధలు తేెవడానికి అడవికి వెళ్లారు. ఉన్నట్టుండి పెద్ద గాలీవానా. ఇద్దరూ అడవిలో చిక్కుకుపోయారు. అక్కడే ఉన్న ఓ చెట్టు కొమ్మల మీద ఇద్దరూ కూర్చున్నారు. కుచేలుడు తన కండువాలో మూట కట్టుకువచ్చిన అటుకులు తింటాడు. ‘కుచేలా! ఏం తింటున్నావు’ అంటూ కృష్ణుడు అడుగుతాడు. ‘ఏమీ లేదు చలికి నా దవడలు వణుకుతున్నాయి’ అని అబద్ధం చెబుతాడు కుచేలుడు. అంతలోనే తప్పు తెలుసుకుని తన దగ్గర ఉన్న కొన్ని అటుకుల్ని కృష్ణుడికి ఇస్తాడు. పేదవాడైన కుచేలుడు ఇచ్చిన అటుకుల్ని యువరాజైన కృష్ణుడు ఆప్యాయంగా తీసుకుంటాడు. గాలీవానా తగ్గాక మర్నాడు గురుకులానికి చేరుకుంటారు. తర్వాతికాలంలో కృష్ణుడు ద్వారకా నగరానికి రాజు అవుతాడు. చాలా సంవత్సరాల తర్వాత పేదరికంతో ఇబ్బందిపడుతూ తనను చూడటానికి వచ్చిన బాల్యస్నేహితుడు కుచేలుడిని ప్రేమగా పలకరించి, ఎన్నో మర్యాదలు చేస్తాడు. కుచేలుడికి సంపదలిచ్చి సాయపడతాడు. స్నేహానికి పేద, గొప్ప తేడాలేమీ ఉండవని నిరూపిస్తాడు.
త్యాగానికి చిరునామా!
స్నేహం ఒక రోజుతోనో, కొన్ని సంవత్సరాలతోనో తీరిపోయేది కాదు. మన నేస్తంతోపాటు అతడి కుటుంబానికి సైతం మిత్రులుగా ఉండాలి. అదే అసలైన స్నేహం అవుతుంది. మిత్రుడిని ఎంతగా ప్రేమిస్తామో అతడి కుటుంబ సభ్యులనూ అంతే ప్రేమగా ఆదరించాలి.
శ్రీరాముడి తండ్రి అయిన దశరథమహారాజు, జటాయువు ప్రాణ స్నేహితులు. యుద్ధాల్లో ఒకరికొకరు తోడుగా నిలిచారు. దశరథుడు మరణించిన తర్వాత అతడి కుమారుడైన రాముడినీ జటాయువు స్నేహితుడిగానే చూశాడు. వనవాసానికి వచ్చిన వెంటనే రాముడికి తనను తాను పరిచయం చేసుకున్నాడు జటాయువు. నా మిత్రుడిలాగే నిన్నూ కాపాడతానని మాట ఇచ్చాడు. రావణుడు సీతమ్మను అపహరిస్తున్నప్పుడు అతడితో ప్రాణాలకు తెగించి పోరాటం చేశాడు. రెక్కలు తెగిపడిపోయినా రాముడు వచ్చేవరకు ప్రాణాలు బిగపట్టి నిలుపుకొన్నాడు. సీతమ్మ వివరాలు చెప్పి కన్నుమూశాడు. స్నేహమంటే త్యాగం. స్నేహమంటే ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి మిత్రుడిని ఆదుకోవటం అనటానికి జటాయువు ఉదాహరణగా నిలిచాడు.
సాహస గుణం!
నేస్తానికిచ్చిన మాట నిలబెట్టుకోవటం కోసం ప్రాణత్యాగం చెయ్యటానికైనా సిద్ధపడటం స్వచ్ఛమైన స్నేహం.
రామాయణం వినే ఉంటారుగా. అందులో రావణాసురుడు అపహరించిన సీతమ్మ జాడ తెలుసుకునేందుకు తన వానర సైన్యాన్ని పంపిస్తానని రాముడికి మాట ఇస్తాడు సుగ్రీవుడు. అప్పటిదాకా తన రాజ్యంలోనే ఉండమంటాడు. కొంతకాలానికి సీతమ్మ లంకలో ఉన్నట్లు సమాచారం వస్తుంది. ఒకరోజున రాముడికి చెప్పకుండా సుగ్రీవుడు ఆకాశమార్గాన లంకకు చేరి రావణుడితో కయ్యానికి సిద్ధపడతాడు. రావణుడి పరాక్రమానికి తట్టుకోలేక తిరిగి కిష్కింధకు చేరుకుంటాడు. విషయం తెలుసుకున్న రాముడు మిత్రుడైన సుగ్రీవుడు చేసిన సాహసానికి ఎంతో ముచ్చటపడతాడు. అయితే, ప్రాణాల మీదకు తెచ్చుకునే ఇలాంటి దుస్సాహసం ఇకమీదట ఎప్పుడూ చెయ్యవద్దంటాడు. అవసరమైతే అయోధ్యను వదులుకుంటానని, స్నేహితుడి కన్నా తనకు లోకంలో మరెవ్వరూ ఎక్కువ కాదంటాడు. ఇకమీదట ఇలాంటి పనులు చెయ్యనని సుగ్రీవుడి దగ్గర మాట తీసుకుంటాడు.
తోడూనీడా!
స్నేహం అంటే కలిసి తిరగటం, కబుర్లు చెప్పుకోవటం  కాదు. మిత్రుడికి వచ్చిన కష్టాన్ని తన కష్టంగా భావించి, దాన్నుంచి బయటపడటానికి సాయం చెయ్యాలి. నిరాశలో కూరుకుపోతే ధైర్యం చెప్పాలి. కర్తవ్యం వైపు ప్రోత్సహించాలి.
మహాభారతంలో కౌరవ పాండవుల మధ్య యుద్ధానికి అంతా సిద్ధంగా ఉంది. రెండు వైపులా వీరులంతా యుద్ధరంగానికి చేరుకున్నారు. అర్జునుడి సారథిగా ఉన్న అతడి ప్రాణమిత్రుడు కృష్ణుడు రథాన్ని నేరుగా యుద్ధరంగంలోకి తీసుకువస్తాడు. యుద్ధరంగంలో కౌరవుల పక్షంలో ఉన్న తన బంధువులు, మిత్రుల్ని చూసి అర్జునుడు కలత చెందుతాడు. యుద్ధం చెయ్యలేనంటూ రథం దిగిపోతాడు. గొప్ప పరాక్రమవంతుడైన తన మిత్రుడు అర్జునుడు పిరికివాడిలాగా యుద్ధరంగం నుంచి పారిపోవటం కృష్ణుడికి ఏమాత్రం నచ్చదు. యుద్ధం ఎందుకు చెయ్యాలో, చెయ్యకపోవటం వల్ల కలిగే ఫలితాలు ఏమిటో అన్నీ చక్కగా వివరిస్తాడు. నిరాశ వదిలిపెట్టాలని, సరైన సమయంలో ధైర్యం కోల్పోతే లక్ష్యాన్ని సాధించలేమంటూ బోధిస్తాడు. అర్జునుడిలో ఉన్న విచారం, నిరాశ అన్నీ కృష్ణుడి మాటలతో తొలగిపోతాయి. కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధిస్తాడు.
- కప్పగంతు రామకృష్ణ
04.09.2019


పున్నమి కాంతుల కల్యాణం (ఒంటిమిట్టలో జరిగే శ్రీ సీతారామ కల్యాణం నేపథ్యంగా శ్రీకనకదుర్గ ప్రభ పత్రికలో రాసిన వ్యాసం)

  పున్నమి కాంతుల కల్యాణం                లోకంలో పెళ్ళి ముచ్చట అంటే సీతారాములదే. అందులోనూ ఒంటిమిట్ట ఆలయంలో జరిగే సీతారాముల కల్యాణం మరింత శ...