Wednesday, November 4, 2020

మనిషి మాట తీరు ఎలా ఉండాలనే అంశాన్ని వివరిస్తూ రాసిన వ్యాసం

మనిషి మాట తీరు ఎలా ఉండాలి? 
అవతలి వ్యక్తి నొచ్చుకోకుండా మాట్లాడటం ఎలా? 
మన మాటలతో అవతలి వ్యక్తి అభిమానాన్ని పొందటం ఎలా?  


మాట మంచిదైతే...


మాట మనిషిని మహనీయుడిని చేస్తుంది. అదే మాట మనిషి పతనావస్థకు దారితీస్తుంది. వాక్కుకు అంతటి అమోఘమైన శక్తి ఉంది. అవతలి వ్యక్తితో స్నేహం చెయ్యాలన్నా, మిత్రుడు శత్రువుగా మారాలన్నా ఒక్క మాట సరిపోతుంది. అందుకే శాస్త్రాలు వాక్కును దైవంగా ప్రకటిస్తాయి. మంత్రభాగంలో కూడా వాక్కుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. మాట్లాడే మాటలో ఒక శబ్దం ఎక్కువ  లేదా తక్కువ అయినా అందుకు విపరీత ఫలితాలు ఏర్పడతాయి. అందుకే ఎల్లప్పుడూ మంచి మాటలనే మాట్లాడాలి. 

సీతాదేవిని రావణుడు అపహరించిన తర్వాత ఆమెను వెదుకుతూ రామలక్ష్మణులు రుష్యమూక పర్వత ప్రాంతానికి చేరుకుంటారు. సుగ్రీవుడి నివాస ప్రాంతం అది. తనను చంపడానికి తన అన్న వాలి వీరిని పంపించారా అని అనుమానించి, విషయం తెలుసుకునేందుకు తన మంత్రి అయిన హనుమంతుడిని పంపుతాడు. మారుతి మారు వేషంలో రామలక్ష్మణుల దగ్గరకు వచ్చి అనేక విధాలుగా ప్రశ్నిస్తాడు. 'రాజర్షి దేవ ప్రతిమౌ తాపసౌ సంశితవ్రతౌ! దేశం కథమిమం ప్రాప్తౌ భవంతౌ వరవర్ణినౌ!!' మీరిద్దరూ మంచి తేజోవంతుల్లా, తీవ్రమైన తపోదీక్ష పట్టిన వారిలా ఉన్నారు. మీ రూపం తాపసుల్లా ఉన్నా మీ తేజం క్షత్రియత్వాన్ని సూచిస్తోంది. గొప్ప పని ఉంటే తప్ప మీవంటి యోధులు క్రూరమగాలు సంచరించే ఇలాంటి చోటుకు రారు' అని ప్రశ్నిస్తాడు హనుమ.

మాట అంటే ఇలా ఉండాలి. ఒక్క అక్షరం  ఎక్కువ తక్కువ కాకుండా ప్రశ్నలు వేశాడు హనుమ. ఇంత కాలం తాను ఎవరి గురించి ఎదురు చూస్తున్నాడో ఆ దైవం ఎదుట నిలబడినప్పుడు హనుమ తొందరపడలేదు. వచ్చింది ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఎంత గొప్పగా ప్రశ్నించాడంటే రాముడే ముచ్చటపడ్డాడు. వ్యాకరణ పండితుడు తప్ప మరొకరు ఇలా మాట్లాడలేడన్నాడు. హనుమ ప్రశ్న స్వీకరించిన వ్యక్తి కూడా ఆనందపడేలా అడిగాడు. హనుమంతుడి మాటల ఔచిత్యానికి ముచ్చటపడతాడు రాముడు.

నా నృగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణ: 

నా సామవేద విదుష: శక్యమేవ విభాషితుం ||

రుక్‌, యజు, సామవేదాల్లో పండితుడైనవాడు తప్ప మరొకరు ఇలా మాట్లాడలేరంటూ లక్ష్మణుడితో హనుమంతుడి మాటలతీరులోని గొప్పతనాన్ని వివరిస్తాడు రాముడు. ఒక్క మాట ఎక్కువ తక్కువ కాకుండా కొత్తవారితో కూడా ఎంతో నేర్పుగా మాట్లాడటమే కాకుండా రామసుగ్రీవుల మైత్రికి బీజం వేసింది హనుమ వాక్చాతుర్యం. మంచి మాటకు ఉండే శక్తి అంతటి గొప్పది. 

బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేస్తుంటాడు కుంభకర్ణుడు. అసలే అతడు చెప్పలేనంత బలశాలి. ఆ బలానికి వరబలం కూడా తోడైతే ఇక అతడిని ఆపటం ఎవరితరం కాదని ఆలోచించిన దేవతలు సరస్వతీ దేవిని ప్రార్థిస్తారు. దేవతల కోరిక మన్నించిన సరస్వతి కుంభకర్ణుడి నోటి నుంచి అపశబ్దం పలికేలా చేస్తుంది. 'నిర్దయ' అని వరం కోరుకోవాలనుకున్న 'నిద్రయ' అడిగాడు. తథాస్తు అన్నాడు బ్రహ్మ. అంతే... నిద్రకు ప్రతిరూపంగా మారిపోయాడు కుంభకర్ణుడు. తనకున్న దయాగుణం కారణంగా ఎవరినీ చంపలేకపోతున్నానననే బాధతో నిర్దయ కావాలని అనుకున్నాడు. కానీ అక్షరం మారే సరికి అర్థం మారి, ఫలితం తలకిందులైంది. అందుకే మాట మాట్లాడేటప్పుడు వెనకాముందూ ఆలోచించమంటారు పెద్దలు. 

చంటి బిడ్డ భరతుడిని వెంట తీసుకుని దుష్యంతుడి సభకు చేరుకుంటుంది శకుంతల. నీవెవరో నాకు తెలియదు. నీ బిడ్దకు తండ్రిని నేను కాదంటాడు దుష్యంతుడు. అకస్మాత్తుగా తన భర్త ఇలా మాట్లాడేసరికి ఖిన్నురాలవుతుంది శకుంతల. భర్తను ఎన్నో విధాలుగా ప్రాథేయపడుతుంది. నా గురించి కాకపోయినా నీ బిడ్డను చూసైనా సరే నిజం ఒప్పుకోమంటుంది.

నుతజల పూరితంబులగు నూతులు నూఱిటికంటె సూనృత

వ్రత యొక బావి మేలు మఱి బావులు నూఱిటికంటె నొక్క స

 త్క్రతు వది మేలు తత్క్రతుశతంబునకంటె సుతుండు మేలు త

త్సుత శతకంబుకంటె నొక సూనతవాక్యము మేలు సూడగన్‌

తియ్యటి నీటితో నిండివున్న వంద నూతులకంటె ఒక దిగుడుబావి మేలు. అలాంటి వంద బావుల కన్నా ఒక మంచి క్రతువు మేలు. అలాంటి వంద క్రతువుల కన్నా ఒక కుమారుడు మేలు. అలాంటి వంద మంది కుమారుల కన్నా ఒక మంచిమాట మేలు. కాబట్టి రాజా! ఒక సత్యమైన మాట పలకవయ్యా అంటుంది శకుంతల. మంచి మాటకు ఎంత విలువ ఉంటుందో చెప్పటానికి ఈ ఒక్క ఉదాహరణ సరిపోతుంది. 

వాక్కు అనేది అగ్ని. ఆ వాగ్బాణాలు మన నోటి నుండి వెలువడినప్పుడు అవి ఎదుటివారికి వెచ్చదనాన్ని ఇవ్వాలి గానీ..! ఎదుటివారి మనసును నొప్పించకూడదు. ఆ వెచ్చదనాన్ని అందించే శక్తి మన వాక్కుకు లేనప్పుడు దానిని ఎదుటివారిపై ప్రయోగించకపోవడమే ఉత్తమం. ''తనకోపమె తన శత్రువు తనశాంతమె తనకు రక్ష'' అన్నట్టు మనకి కోపం అనిపిస్తే మనము మౌనంగా ఉండటమే మంచిది. వాక్కు పరా, పశ్యన్తి, మధ్యమ, వైఖరి అని నాలుగు విధాలుగా ఉంటుంది. ఈ వాక్కు ఎలా పుడుతుందో వ్యాకరణం చెబుతుంది. ఈ వాక్కు వెలువడిన తర్వాత అది 'శబ్దం'గా మారుతుంది. ప్రతి శబ్దానికి నిర్దుష్టంగా ఒక అర్థం ఉంటుంది. అలా నిర్దుష్టమైన అర్థం కలిగిన శబ్దాన్ని 'వాచకం'లేదా 'అభిద' అంటారు. ఆ శబ్దం తాలూకు అర్థాన్ని 'వాచ్యం' అంటారు.

సత్యం బ్రూయాత్‌ ప్రియం బ్రూయాత్‌

        న బ్రూయాత్‌ సత్య మప్రియం

        ప్రియం చ నానతం బ్రూయాత్‌

        ఏష ధర్మ స్సనాతన: || (మనుస్మృతి )

సత్యాన్నే పలుకు. ప్రియాన్నే మాట్లాడు. సత్యమైనా అప్రియాన్ని పలకవద్దు. ఇదే సనాతన ధర్మం అంటుంది మనుస్మ ృతి. సత్యాన్నే విను. ప్రియమైన దాన్నే విను.సత్యమైనా అప్రియంగా ఉంటే వినకు. అలాగే ప్రియంగా ఉందని అసత్యాన్ని వినకు.అలాంటి లక్షణాలతో చెప్పేవాడు, వినేవాడూ ఉన్నప్పుడు ఆ చెప్పిన విషయం హదయానికి హత్తుకుని ఎల్ల కాలం గుర్తుంటుంది. అంటే ఇతరులకు ప్రియం కానిది అది సత్యమైనా మనం చెప్పకూడదు. అందులో కాఠిన్యం ఉండటమే ఇందుకు కారణం. అలాగే జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడకపోతే అది సత్యమైనా తగవులాటకు కారణమవుతుంది. అందుకే నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నారు.
----------------------------------------------------------------------------
మనిషి మాట తీరు ఎలా ఉండాలనే విషయాన్ని వివరిస్తూ 
ఈనాడు దినపత్రిక మకరందం పేజీలో 05.11.2020 తేదీన రాసిన వ్యాసం ఇది.


Dr Kappagantu Ramakrishna - డాక్టర్ కప్పగంతు రామకృష్ణ

 

Dr Kappagantu Ramakrishna
డాక్టర్ కప్పగంతు రామకృష్ణ 


Dr Kappagantu Ramakrishna - డాక్టర్ కప్పగంతు రామకృష్ణ 


Thursday, October 22, 2020

Thursday, October 1, 2020

గంధర్వులంటే ఎవరు? వారెలా ఉంటారు? ఎక్కడ ఉంటారు? వారి ప్రత్యేకత ఏమిటి?


గంధర్వులంటే ఎవరు? వారెలా ఉంటారు? ఎక్కడ ఉంటారు? వారి ప్రత్యేకత ఏమిటి... తదితర విశేషాలతో 

ఈనాడు దినపత్రిక మకరందం పేజీలో రాసిన వ్యాసం

=======================

అందమైన పర్వం... గాంధర్వం

 మనోహరమైన గానానికి గంధర్వులు ప్రతీకలు. అందచందాలు, రూపలావణ్యాల్లోనూ వారికి వారే సాటి. మంత్ర తంత్ర శాస్త్ర విషయాల్లో వారి వైదుష్యాన్ని మాటల్లో వర్ణించలేం. పురాణ, ఇతిహాసాలు మొదలు ప్రబంధాలు, కావ్యాల వరకు గంధర్వుల ప్రస్తావన లేని రచన లేదు. ముఖ్యమైన పురాణ ఘట్టాలన్నీ గంధర్వుల ఇతివృత్తాలతో ముడివేసుకున్నవే కావటం విశేషం. ఎన్నో పుణ్యక్షేత్రాలు అవతరణకు కూడా వీరే ప్రధాన భూమిక పోషించారు.

 ఎవరైనా బాగా పాడుతుంటే గంధర్వగానం అనటం పరిపాటి. గానంతో అంతగా గంధర్వుల పేరు పెనవేసుకుపోయింది. తమ ఉచ్వ్ఛాస నిశ్వాసాలుగా సంగీతాన్ని స్వీకరించి, అహర్నిశం సంగీతంతోనే తమ దైనందిన క్రియలను అన్వయించుకుని, సంగీతంతో తాదాత్మ్యత పొందిన ఘనత గంధర్వులకే దక్కుతుంది సంగీతాన్ని కేవలం ప్రక్రియగా కాకుండా, మోక్షాన్ని పొందటానికి సర్వోన్నతమైన మార్గంగా గుర్తించి, నాదసాధన చేశారు. అందుకే దేవతల్లో ప్రత్యేకంగా శ్రేణిగా గుర్తింపు పొందారు. తుంబురుడు వంటి గంధర్వులు దేవగాయకులుగా శాశ్వత కీర్తి పొందారు

 ·  పురాణాల ప్రకారం గంధర్వులు సప్తగణాల్లో ఒకరు. ఆ సప్తగణాలు 1.ఋషులు. 2.గంధర్వులు. 3.నాగులు అప్సరసలు. 5.యక్షులు. 6.రాక్షసులు. 7.దేవతలు

 ·  బ్రహ్మపురాణం ప్రకారం శ్రీమన్నారాయణుడి వరంతో దక్షప్రజాపతికి 60 మంది కుమార్తెలు జన్మిస్తారు. దక్షుడు వారిలో 10 మందిని యమధర్మరాజుకు, 13 మందిని కశ్యప మునికి, 27 మందిని చంద్రునికి, ఇద్దరిద్దరు చొప్పున భూతుడికి, అంగిరసుడికి, కృశాశ్వుడికి, మిగిలిన నలుగురిని తార్ష్యునికి ఇచ్చి వివాహం చేస్తాడు. కశ్యపుని భార్యలు అరిష్ట గంధర్వులు జన్మిస్తారు. ఈ విధంగా గంధర్వులు దేవతలకు సోదరులు అవుతారు. బ్రహ్మాండ పురాణం ప్రకారం గంధర్వులు, అప్సరసలు 'ముని' అనే మహానుభావుడి సంతానం. వీరిలో ఉగ్రసేనుడు, సుపర్ణుడు, వరుణుడు, గోమంతుడు, అర్కపర్ణుడు. ప్రియతముడు, చైత్రరథుడు మొదలైన 16 మంది దేవగంధర్వులని, వీరికి 24 మంది సోదరీమణులు ఉన్నారని ఇందులో ఉంది. అలాగే, గంధర్వులు దేవతల కన్నా మూడుస్థాయిలు తక్కువ వారని కూడా ఈ పురాణంలో ఉంది

 · భాగవతం ద్వితీయ స్కంధంలో గంధర్వుల జననానికి సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది. శ్రీమన్నారాయణుడి నుంచి సృష్టి ఎలా ఏర్పడిందనే విషయాన్ని చెబుతూ గంధర్వులు, సిద్ధులు, విద్యాధరులు మొదలైన వారు కూడా జన్మించారని నారదుడు బ్రహ్మకి చెబుతాడు. ఈ విధంగా గంధర్వులు నారాయణాంశతో జన్మించారని తెలుస్తోంది అశ్వత్థః సర్వవృక్షాణాం దేవర్నీణాం చ నారదఃగంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో ముని||' - గంధర్వుల్లో చిత్రరథుడను నేనే అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో. గంధర్వులు నారాయణాంశ సంభూతులు అనటానికి ఇదొక నిదర్శనం

 

·  పాల్కురికి సోమన రాసిన 'పండితారాధ్య చరిత్రలో గంధర్వుల ప్రస్తావన కనిపిస్తుంది. 'ఆది గంధర్వ యక్ష విద్యాధరులై పాడెడునాడెడువాడు' అంటూ రేఖామాత్రంగా గంధర్వుల గురించి ప్రస్తావించాడు. ఆ తర్వాత శ్రీనాథుడు భీమేశ్వర పురాణంలో 'కీర్తింతు రెద్దాని కీర్తి గంధర్వులు, గాంధర్వమున యక్షగాన సరణి' అంటూ గంధర్వగానాన్ని ప్రస్తావిస్తాడు. ఇంకా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. గంధర్వుల ప్రస్తావన చెయ్యని పురాణ ఇతిహాస, ప్రబంధ, కావ్యం ఏదీ తెలుగు సాహిత్య చరిత్రలో లేదు.

·   రామాయణంలో కబంధుడు రాక్షసుడిని రాముడు సంహరించిన కథ అందరికీ తెలిసిందే. ఆ కాలం నుంచే కబంధహస్తాలనే నానుడి కూడా వ్యాప్తిలోకి వచ్చింది. ఈ కబంధుడు పూర్వజన్మలో దనువు ఆనే గంధర్వుడు. శాపం వల్ల కబంధుడు జన్మిస్తాడు. రాముడి చేతిలో మరణించి తిరిగి గంధర్వజన్మ పొందుతాడు.

·   కాగల కార్యం గంధర్వులు తీరుస్తారనేది చాలా ప్రసిద్ధి పొందిన సామెత. మనం చెయ్యాలనుకున్న పని అనుకోకుండా ఇతరుల ద్వారా జరిగినప్పుడు ఈ సామెత ఉపయోగిస్తారు. ఈ సామెత పుట్టటానికి కారణమైన ఇతివృత్తం మహాభారతంలో ఉంది. జూదంలో ఓడిపోయిన పాండవులు అరణ్యవాసం చేస్తూ ద్వైతవనంలో నివసిస్తుంటారు. పాండవుల ముందు తన ఐశ్వర్య వైభవాన్ని ప్రదర్శించి వారిని అవమానించాలన్న ఆలోచన ధుర్యోధనుడు తన పరివారాన్ని తీసుకుని ద్వైతవనానికి చేరుకుంటాడు. అక్కడి ఓ సరస్సు ఒడ్డున శిబిరాలు వేస్తారు. ఆ సరస్సు చిత్రసేనుడనే గంధర్వరాజుది. అనుమతి లేకుండా శిబిరాలు వేయవద్దంటూ గంధర్వరాజు సైనికులు కౌరవ సైనికులను అడ్డుకుంటారు. వాదులాట పెరిగి యుద్ధానికి దారితీస్తుంది. అప్రతిహతమైన బలం కలిగిన గంధర్వరాజు కౌరవులను ఓడించి దుర్యోధనుడితో సహా అందరినీ బందీలుగా పట్టుకుంటాడు. తమ రాజుకు కలిగిన కష్టాన్ని కౌరవ సైనికులు అక్కడికి సమీపంలో ఉన్న ధర్మరాజుకు విన్నవిస్తారు. ఆ మాటలు విన్న భీమసేనుడు పకపకనవ్వుతూ 'చాలా మంచిపని జరిగింది. అహంకారికి తగిన ప్రాయశ్చిత్తం చేశాడు చిత్రసేనుడు. కాగల కార్యం గంధర్వులు తీర్చారు. అనుకోకుండా మన కోరిక తీరింది' అంటాడు. తర్వాత ధర్మరాజు నచ్చజెప్పటంతో భీమార్జునులు వెళ్ళి చిత్రసేనుడి చెర నుంచి కౌరవులు విడిపిస్తాడు. అలా భీమసేనుడి ద్వారా కాగల కార్యం గంధర్వులు తీర్చారనే నానుడి వ్యాప్తిలోకి వచ్చింది. ఇప్పటికాలంలోనూ మనం వాడుతున్న సామెతలకు గంధర్వులే మూలపురుషులు కావటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

·    తెలుగులో అత్యంత ప్రసిద్ధి పొందిన కావ్యం అల్లసాని పెద్దన రాసిన మనుచరిత్ర. దీనికే స్వారోచిష మనుసంభవం అనే పేరు కూడా ఉంది. ఈ కావ్యంలోనూ గంధర్వులదే కీలకపాత్ర. తన కోరికను ప్రవరుడు తిరస్కరించటంతో విరహవేదనకు గురవుతుంది వరూధిని. అవకాశం దొరికిందని సంతోషించిన ఓ గంధర్వుడు మాయాప్రవరుడి రూపంలో వరూధిని కోరిక తీరుస్తాడు. వారిద్దరికీ స్వరోచి జన్మిస్తాడు. స్వరోచి కుమారుడే స్వారోచిషుడనే పేరు కలిగిన మనువు. ఇలా ఎన్నో కావ్య, ప్రబంధాలు ప్రధాన ఘట్టాల్లో గంధర్వుల పాత్ర ప్రబలంగా కనిపిస్తుంది.

·  స్నేహం అనగానే గుర్తుకు వచ్చే పేర్లు కృష్ణార్జునుల పేర్లు కూడా ముందువరుసలో ఉంటాయి. అంతటి ప్రాణస్నేహితులకు సైతం మనస్పర్థలు కలిగించి, యుద్ధానికి దారితీసిన ఘటనకు మూలకారణం కూడా గంధర్వులే. గయుడు గంధర్వరాజు ఆకాశంలో విహరిస్తూ, దాసీజనంతో విలాసాల్లో మునిగితేలుతుంటాడు. అప్పటిదాకా నమిలిన తాంబూలపు పిప్పిని ఆకాశం నుంచి జారవిడుస్తాడు. ప్రమాదవశాత్తు అది సంధ్యావందనం చేసుకుంటూ సూర్యుడికి అర్ఘ్యం ఇస్తున్న కృష్ణుడి చేతిలో పడుతుంది. తీవ్రకోపానికి గురైన కృష్ణుడు ఈ పాపానికి కారణమైన గయుడిని సంహరిస్తానని శపథం చేస్తాడు. గయుడు కృష్ణుడి పేరు చెప్పకుండా అర్జునుడిని శరణు కోరుతాడు. జరిగిన సంగతి తెలియని అర్జునుడు గయుడికి అభయం ఇస్తాడు. గయుడిని విడిచిపెట్టమని కృష్ణుడు, వదలనని అర్జునుడు మొండిపట్టుపడతారు. చివరకు యుద్ధం జరుగుతుంది. సాక్షాత్తు పరమేశ్వరుడు దిగివచ్చి నచ్చజెప్పటంతో సమస్య పరిష్కారమై, కృష్ణార్జునుల స్నేహం ఎప్పటిలాగే కొనసాగుతుంది.

·    స్త్రీలకు సహజంగా ఉండే అందచందాలు, లావణ్యం, కమ్మని కంఠం... ఇవన్నీ గంధర్వుల ద్వారానే వచ్చాయని చెబుతుంది మంత్రశాస్త్రం. వివాహంలో వరుడు చదివేమంత్రాల్లో ఈ వివరం కనిపిస్తుంది. సోమః ప్రథమో వివిధే, గంథర్వో వివిధ ఉత్తరః తృతీయాగ్నిష్టీ పతిః తురీయ మనుష్య చౌ" - అని వివాహ సమయంలో వరుడు వధువుతో అంటాడు. నిన్ను మొదట చంద్రుడు, ఆ తర్వాత వరుసగా గంధర్వుడు, అగ్ని సంరక్షించారు. ఇప్పుడు నేను నిన్ను స్వీకరిస్తానని ఈ మంత్రానికి అర్థం. ఆడపిల్ల పుట్టగానే చంద్రుడు ఆమెకు తోడుగా నిలిచి పసిపాప ఆకర్షణీయంగా ఎదిగేలా తన కళల్ని ఆమెకు అందిస్తాడట. అమ్మాయి వయసుకు వచ్చేసరికి చంద్రుడి సాక్షిగా గంధర్వుడు బాధ్యత తీసుకుంటాడు. "లావణ్యవాన్ గంధర్వః" - గంధర్వులు లావణ్యంగా ఉంటారని ప్రతీతి. తనలోని లావణ్యాన్నంతా యువతికి అందిస్తాడు గంధర్వుడు. అలాగే, తమ జాతి ప్రత్యేకత అయిన కమ్మని కంఠాన్ని, సంగీతాన్ని కూడా యువతికి ఇస్తాడు. అలా ఎదిగిన కన్యను గంధర్వుడి సాక్షిగా అగ్నిదేవుడు స్వీకరించి, తేజస్సు కలిగించి వివాహయోగ్యత కలిగిస్తాడు. ఈ క్రమంలో అగ్నిసాక్షిగా వివాహం చేసుకోవటమనే ఆచారం ఏర్పడింది. మొత్తంగా మహిళల్లోని లావణ్యానికి గంధర్వులే ఆలంబన అంటోంది మంత్ర శాస్త్రం.

·   మహాభారతంలో ప్రసిద్ధి పొందిన కీచకవధ ఘట్టం కూడా గంధర్వుల ఇతివృత్తంతో ముడిపడి ఉంది. పాండవులు అజ్ఞాతవాసాన్ని విరాటరాజు కొలువులో గడుపుతున్న సమయమది. సైరంధ్రిగా ఉన్న ద్రౌపదిని చూసి మోహిస్తాడు కీచకుడు. 'గంధర్వాణామహం భార్య పంచాస్యాం మహిషీ ప్రియ | తే త్వాం విహన్యుః: కుపితాః శూరాః సాహస కారిణః ||' - మహాపరాక్రమవంతులైన ఐదుగురు గంధర్వులకు ఇల్లాలిని నేను. శూరులు, సాహసవంతులైన ఆ గంధర్వులు కోపిస్తే నిన్ను సంహరించకమానరు అంటుంది ద్రౌపది. గంధ్వరులంటే కేవలం గానానికి పరిమితం కాలేదని, వారు మహాపరాక్రమవంతులని కూడా ఈ ఘట్టం ద్వారా వెల్లడవుతుంది. కీచకవధ తర్వాత కూడా భీముడు గంధర్వుడి వేషంలో ఉపకీచకులను సంహరిస్తాడు.

· గంధర్వుల నివాసం గురించిన ప్రస్తావన మహాభారతం భీష్మపర్వంలో కనిపిస్తుంది. స్వర్గలోకవాసుల్లో గంధర్వులు అతిసుందరులు. రూపవంతులు. గుహ్యకలోకానికి పైభాగంలో, విద్యాధర లోకానికి కింది భాగంలో గంధర్వలోకం ఉంటుంది' అంటూ గంధర్వుల్లో ఉండే జాతులు, తెగల వివరాలు ఇక్కడ వివరంగా చెప్పబడ్డాయి.

· మహాభారతం ఆదిపర్వంలోని కథలో... అర్జునుడికి అంగారపర్ణుడు గంధర్వుడికి యుద్ధం జరుగుతుంది అర్జునుడి చేతిలో ఓడిపోయిన గంధర్వుడు అర్జునుడి పరాక్రమానికి మెచ్చి దివ్యమైన శక్తి కలిగిన గుర్రాలను బహూకరిస్తాడు.

·    గంధర్వులు కారణజన్ములు. ప్రతి కథలోనూ వారు చేసిన పని లోకోపకారానికి ఉపయోగించింది. వారు అనుభవించిన శాపాలు సమాజానికి వరాలయ్యాయి. ప్రతి ఘటనలోనూ వారు చేసిన మేలు మర్చిపోలేనిది. తమ కళను, విద్యను, ప్రతిభను లోకావసరాలకు, క్షేమానికి అందించాలని, ఎంత ప్రతిభ ఉన్నా పరిధి దాటితే ప్రమాదాలు కొనితెచ్చుకోక తప్పదనే సందేశం గంధర్వుల ద్వారా మనకు అందుతుంది.

రచన: డాక్టర్ కప్పగంతు రామకృష్ణ

 


 

పున్నమి కాంతుల కల్యాణం (ఒంటిమిట్టలో జరిగే శ్రీ సీతారామ కల్యాణం నేపథ్యంగా శ్రీకనకదుర్గ ప్రభ పత్రికలో రాసిన వ్యాసం)

  పున్నమి కాంతుల కల్యాణం                లోకంలో పెళ్ళి ముచ్చట అంటే సీతారాములదే. అందులోనూ ఒంటిమిట్ట ఆలయంలో జరిగే సీతారాముల కల్యాణం మరింత శ...