Monday, February 1, 2021

ఆంధ్రభాషాదీప్తి.. త్యాగరాజ కృతి (పుష్య బహుళ పంచమి శ్రీ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవం సందర్భంగా ప్రత్యేక వ్యాసం)

శ్రీ త్యాగరాజ స్వామి

ఆంధ్రభాషాదీప్తి.. త్యాగరాజ కృతి

(పుష్య బహుళ పంచమి శ్రీ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవం సందర్భంగా ప్రత్యేక వ్యాసం)


నవ నాడుల్లోను నాదోపాసనే ప్రాణవాయువుగా నింపుకున్న వాగ్గేయకారుడు శ్రీ సద్గురు త్యాగరాజస్వామి. అచంచలమైన రామభక్తితో దైవప్రసాదంగా వచ్చిన అద్భుతమైన గాత్రం, కర్ణాటక సంగీత వైదుష్యం సహా తనువును, మనసునూ... ఒకటేమిటి 'తన' అనుకున్న సమస్త ప్రపంచాన్ని శ్రీరాముని చరణారవిందాలకే అర్పణం చేసిన భక్తశిఖామణి ఆయన. సంగీతం కేవలం ప్రతిభా ప్రదర్శనకో, ధన సంపాదనకో కాదు.. సంగీతం కైవల్య సోపానమని త్రికరణ శుద్ధిగా నమ్మి, ఆచరించి చూపిన వాగ్గేయకారుడాయన. అందుకనే ఆయన గతించి వందల సంవత్సరాలు దాటుతున్నా నేటికీ మనకు ఆరాధ్యుడయ్యారు.

కర్ణాటక సంగీత ప్రపంచంలో ఎందరో వాగ్గేయకారులు ఉన్నారు. త్యాగరాజు కన్నా గొప్పగా సాహిత్య, సంగీత ప్రయోగాలు చేసిన వారూ ఉన్నారు. ఇతర సంగీత విద్వాంసుల తీరులోనే ఆయనా శిష్యులకు సంగీతం నేర్పించారు. కానీ, త్యాగరాజస్వామి ప్రత్యేకత ఏమిటి? ఎందుకు మనం ఆయన్ను గుర్తుంచుకోవాలి? అని ప్రశ్నిస్తే...

  • అపారమైన తన సంగీత సాహిత్య రచనా సర్వస్వాన్నీ మాతృభాష అయిన తెలుగులోనే రచించి, ఆంధ్ర సారస్వత రంగం నేటికీ వెలుగు తగ్గకుండా ఉండటానికి చిత్తశుద్ధితో కృషి చేసిన తొలి తెలుగు భాషోద్యమ కార్యకర్తగా త్యాగరాజు కనిపిస్తారు.
  • 'సహితస్య భావం సాహిత్యం' (సమాజానికి హితం చేకూర్చేదే సాహిత్యం) అనే వైయాకరుణుల వాక్యాన్ని అక్షర సత్యం చేస్తూ తన కృతులన్నిటిలో సామాజిక ప్రయోజనాన్ని ఆకాంక్షించిన సమాజసేవకుడిగా త్యాగరాజు సాక్షాత్కరిస్తారు.
  •  భవత్ప్రసాదంగా వచ్చిన విద్యను, విజ్ఞానాన్ని తిరిగి భగవంతుడిని చేరుకోవటానికే వినియోగించిన కైవల్యపథగామిగా త్యాగరాజు దర్శనమిస్తారు.
  •  నిద్రాణమై, నిస్తేజంగా, మొక్కుబడి తీరులో సాగుతున్న కర్ణాటక సంగీత కచేరీలకు తన వినూత్న ప్రయోగాలు, ఆవిష్కరణలతో నూతన జవసత్త్వాలను కల్పించి, 'ఇదీ కర్ణాటక సంగీత వైభవం' అని ప్రపంచానికి తెలిసేలా చేసిన వాగ్గేయకారుడిగా త్యాగరాజస్వామి పురుషరూపం దాల్చిన సంగీత సరస్వతిగా సాక్షాత్కరిస్తారు. 

ఇంతటి బహుముఖ ప్రజ్ఞాశీలత వల్లనే శతాబ్దాలు గడుస్తున్నా త్యాగరాజస్వామి నేటికీ మనకు ఆరాధ్యుడయ్యారు. 

సమున్నత వ్యక్తిత్వం

సంగీత స్రష్టగా, రామభక్తుడిగా, వాగ్గేయకారుడిగా ప్రపంచానికి త్యాగయ్య సుపరిచితులే. అంతేకాదు.. తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి చివరి శ్వాస వరకు అదే లక్ష్యసాధన కోసం జీవింవించారాయన. ఎన్ని కష్టాలు వచ్చినా రాముడే చూసుకుంటారని త్రికరణశుద్ధిగా నమ్మి, ఆ స్వామినే కీర్తించేవారు.

త్యాగరాజు సుమారు ఆరు అడుగుల ఎత్తులో, కాస్త సన్నగా ఉండేవారు. పెద్ద కళ్ళు, ఆకట్టుకునే ముఖవర్చస్సు, మెడలో తులసిమాల ఉండేవి. కేవలం తెల్లటి వస్త్రాలే ధరించేవారు. నుదుట విభూది తప్పకుండా ధరించేవారు. విభూది రేఖల మధ్యలో కొద్దిగా గంధం, దాని మీద కొద్దిగా కుంకుమ బొట్టు పెట్టేవారు. గొంతు ఖంగుమని మోగేది. 

తోటివారి పట్ల దయ, ప్రేమ కలిగి ఉండేవారు. సంగీత విద్య విషయంలో మాత్రం చండశాసనుడిగా వ్యవహరించేవారు. ఎంతో క్రమశిక్షణ పాటించేవారు. ఆరోగ్యసూత్రాలు పాటిస్తూ, తన గొంతును కాపాడుకునేవారు. వారానికోసారి నువ్వులనూనెతో తలస్నానం చేసేవారు. పొట్లకాయ కూర ఇష్టంగా తినేవారు. ఈ వివరాలన్నీ ఆయన జీవితచరిత్రకారుల రచనల్లో ఉన్నాయి. 

వీటన్నిటినీ సమాజ సేవ, ఉద్ధరణ త్యాగరాజులో ఎక్కువగా కనిపిస్తాయి. బాహ్యప్రవర్తనలో నిరంతర రామచింతన తప్ప మరే చింతా లేనివాడిగా కనిపించిన త్యాగరాజు తన కృతుల్లో సమాజం ధర్మమార్గాన్ని వీడకుండా ఎలా స్వధర్మాచరణ చేయాలో స్పష్టంగా చెప్పారు. 

త్యాగరాజ పంచరత్న కృతుల్లో ఒకచోట 'పరనారీ సోదరా!' అని రామచంద్రమూర్తిని సంబోధిస్తారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు.. త్యాగయ్య నిద్రాణమైన తన సమాజాన్ని ఎంత జాగృతం చేశారో తెలుస్తుంది. రాముడు పరనారీ సోదరుడట. అంటే తన భార్యను తప్ప ఇతర స్త్రీలందరినీ సోదరీ భావంతో చూసేవారు. రాముడిలోని ఈ ఒక్క లక్షణాన్నైనా సమాజ సభ్యులందరూ అలవర్చుకుంటే చాలని త్యాగయ్య కోరిక. అదే జరిగితే, సమాజ పౌరులందరూ పరస్త్రీలను సోదరీ భావంతో చూస్తే.. పేరు చెప్పుకోవటానికి ఇబ్బందిపడే వ్యాధులు రావు. అందుకోసం ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరమూ ఉండదు. లక్షలాది కుటుంబాలు రోడ్డు పడే దుస్థితీ ఉండదు. ఇదీ త్యాగయ్య వైభవం. ఇదీ బాధ్యతాయుతమైన రచయితకు  ఉండాల్సిన లక్షణం. 

ఈ రోజున ఎందుకు త్యాగరాజ కీర్తనలు పాడాలి? త్యాగరాజ కీర్తనల అవసరం సమాజానికి ఏముంది? అని  ప్రశ్నించే వారికి ఇదే సూటి సమాధానం. త్యాగరాజ కీర్తనలు మత మూఢత్వాన్ని పెంచే 'స్తోత్రాలు' కావు. కర్తవ్య నిష్టవైపు సమాజాన్ని ఉద్దీపనం చేసే చైతన్య దీపాలు. మనిషిని మనీషిగా తీర్చిదిద్దే ఉపనిషద్వాక్యాలు. 

తరగని మాతృభాషాభిమానం

సంగీతానికి, సాహిత్యానికి అవినాభావ సంబంధం ఉందని త్యాగరాజు ప్రగాఢంగా నమ్మేవారు. భావావేశంతో పాడితేనే ఏ కచేరీ అయినా రక్తి కడుతుంది. శ్రోతల మనసుల్ని తాకుతుంది. ఇది జరగాలంటే కళాకారుడికి తాను పాడుతున్న కృతి ఏ భాషలో ఉందో ఆ భాష తప్పనిసరిగా రావాలి. సాహిత్యం అర్థం కాకపోతే ఆత్మానందం కలుగదు. ఇది లేకపోతే కచేరీలో తాదాత్మ్యత రాదు. తాదాత్మ్యత లేని కచేరీ రాణించదు. అందుకే సాహిత్యం అర్థం కాని సంగీతానికి విలువలేదని త్యాగరాజు అంటుండేవారు. అందుకే తన వద్దకు సంగీతం నేర్చుకోవటానికి వచ్చిన ప్రతివారికీ ముందుగా భాష నేర్పించేవారు. ఈ విషయాన్ని త్యాగరాజ స్వామి ముఖ్యశిష్యుడైన తంజావూరు రామారావు స్వయంగా చెప్పారు.

త్యాగరాజ స్వామి వద్ద సంగీత శిష్యరికం చేసినవాళ్ళు సుమారు 200 మందికి పైనే ఉన్నారు. వీరందరిలో తంజావూరు రామారావు, మానాంబుచావడి వెంకట సుబ్బయ్యర్‌ - వీరిద్దరే తెలుగు వాళ్ళు. మిగిలిన వాళ్ళందరూ తమిళులే. ఇన్ని వందల మందికి స్వయంగా తెలుగు నేర్పించిన భాషోపాధ్యాయుడుగానూ త్యాగయ్య తనలోని మాతృభాషా పరిరక్షణ దీక్షను ప్రకటించారు. 

సాధారణంగా సంగీత శిక్షణలో గీతమైనా, వర్ణమైనా.. మరేదైనా ముందుగా స్వరాలతో నేర్పిస్తారు. స్వరస్థానాలు చక్కగా వచ్చిన తర్వాత సాహిత్యంతో నేర్పిస్తారు. త్యాగరాజు ఇందుకు భిన్నంగా ఏ కృతినైనా ముందుగా సాహిత్యంతో నేర్పించేవారు. శిష్యుడు భావయుక్తంగా పాడుతున్నాడని అనిపిస్తే, అప్పుడు స్వరాలతో నేర్పించేవారు. ఇంతటి ప్రాధానత్య ఇచ్చారు కాబట్టే త్యాగరాజస్వామి పుణ్యమా అని నేటికీ కర్ణాటక సంగీతంలో భాషకు ప్రాధాన్యత దక్కుతోంది.

త్యాగరాజస్వామి కాలంలో తంజావూరు ప్రాంతంలో ఎన్నో భాషలు వాడుకలో ఉండేవి. తమిళ దేశం కావటం వల్ల ప్రధానంగా తమిళం వాడుకలో ఉండేది. పండిత భాషగా, రాజభాషగా సంస్కృతం ఉండేది. అక్కడక్కడా తెలుగు ఉండేది. వ్యావహారికంగా చాలాచోట్ల తెలుగు వాడుకలో ఉండేది. బ్రిటీషు పాలన కావటంతో ఆంగ్ల ప్రాబల్యమూ ఎక్కువగానే ఉండేది. మరోపక్క ముస్లిం పాలకుల దండయాత్రలు, దురాక్రమణల ఫలితంగా ఉర్దూ, పార్శీ భాషలూ తమ ఉనికిని చాటుకునేవి.

ఇన్ని భాషలు, సంస్కృతీ వైవిధ్యాల మధ్య తన మాతృభాష అయిన తెలుగును, తెలుగు సంస్కృతిని, సాహిత్యాన్ని కాపాడుకోవటం కోసం త్యాగరాజు అజరామరమైన ప్రయత్నం చేశారు. వేల కొద్దీ కృతులను తెలుగులోనే రచించి, తన అపారమైన తపశ్శక్తిని వాటికి ధారాదత్తం చేసి, తెలుగు భాష నేటికీ వెలుగులీనటానికి మూలకారణంగా నిలిచారు.

పుట్టిందీ, పెరిగిందీ తమిళప్రాంతంలో అయినా, త్యాగరాజస్వామి ఒక్క కృతిని కూడా తమిళంలో రాయలేదు సరికదా కనీసం ఒక్క తమిళపదానికి కూడా తన కృతుల్లో చోటివ్వలేదు. ఈ ఒక్క నిరూణ చాలు.. తెలుగు భాషా పరిరక్షణకు త్యాగరాజు చేసిన కృషి ఏమిటో చెప్పటానికి.

మొత్తం త్యాగరాజ సారస్వతాన్ని పరిశీలిస్తే తెలుగుతో పాటు కొన్ని సంస్కృత రచనలూ కనిపిస్తాయి. తెలుగు, సంస్కృత మిశ్రమంలో కొన్ని రచనలు కనిపిస్తాయి. వీటన్నిటిలోనూ రెండు, మూడు ఉర్దూ పదాలు, ఒకే ఒక్క ఆంగ్ల పదాన్ని సాహితీ పరిశీలకులు కనుగొన్నారు. ఉపన్యాసాలు, నినాదాలతో కాకుండా వాస్తవ ఆచరణతో తన మాతృభాషను కాపాడుకోవటం కోసం కృషి చేసిన భాషోద్యమ కార్యకర్తగా తన కర్తవ్యాన్ని నిర్వహించారు త్యాగరాజస్వామి. 


ప|| ఎదుట నిలిచితే నీదు సొమ్ము - లేమి బోవురా

అ|| నుదుటి వ్రాత గని మట్టు మీరను నా

తరము దెలిసి మోసపోదునా ||


చ|| సరాసరిగా జూతురా నా ఆవ - సరాల దెలియుము వరాలడుగుజా

లరా సకల దేవరాయ! మనవి వి - నరా ఘహర! సుందరా కార నా ||

----------------------------------------

----------------------------------------

తరాన దొరకని పరాకు నాయెడ - ను రామ చేసితె సురాసురులు మె

త్తురా ఇపుడు ఈ హరామి తనమే - లరా భక్త త్యాగరాజ నుత!


శంకరాభరణ రాగంలో స్వరపరచిన ఈ కృతిలోని చివరి చరణంలో 'హరామి' అనే ఉర్దూపదాన్ని త్యాగయ్య ఉపయోగించారు.

'కారు బారు సేయు వారలు గలరే - నీ వలె సాకేత నగరిని' అంటూ ముఖారి రాగంలో త్యాగయ్య స్వరపరచిన కృతిలో కారుబారు అనే పదం కూడా ఉర్దూ పదమే. కార్‌ - ఓ - బార్‌ అనే పదం వాడుకలో కారుబారుగా మారిందని భాషా పరిశోధకుల పరిశీలనలో తేలింది.

'దయలేని బ్రతుకేమి - దాశరథీ రామ...... ' అంటూ నాయకి రాగంలో స్వరపరచిన కృతి చివరి చరణం చివరి పాదంలో 'రాజి సేయని త్యాగ - రాజాది వినుత' అనే చోట రాజీ అనే ఉర్దూ పదం కనిపిస్తుంది. అంగీకరించుట లేదా ఒప్పుకొనుట అనే అర్థంలో ఈ ఉర్దూ పదం తెలుగులో వాడుకలోకి వచ్చింది. పంతువరాళిరాగంలో 'నిన్నే నెర నిమ్మనానురా' అనే కృతిలోను 'రాజి' పదాన్ని త్యాగరాజు ఉపయోగించారు. 

అలాగే, మొత్తం తన కృతుల్లో ఒకే ఒక్క చోట ముస్లిం మతానికి చెందిన పదాన్ని త్యాగరాజు ఉపయోగించారు. 'సమయము తెలిసి పుణ్యములార్జించని' అంటూ అసావేరి రాగంలో సాగే ఈ కృతి చివరి చరణంలో 'తురక వీధిలో విప్రునికి పానక పూజ' అనే చోట మాత్రమే 'తురక' అనే పద ప్రయోగం కనిపిస్తుంది.

తోడి రాగంలో 'ఏమి జేసితే నేమి శ్రీరామ - స్వామి కరుణలేని వారిలలో' అనే కృతి రెండో చరణంలో 'మేడ గట్టితే ఏమి అందున లాంతర్‌ - జోడు గట్టితే ఏమీ' అన్న చోట లాంతర్‌ అనే ఒకే ఒక ఆంగ్ల పదం కనిపిస్తుంది. త్యాగరాజు ఆంగ్ల పదాన్ని ఎందుకు ఉపయోగించారని పరిశీలిస్తే - సరిగ్గా ఆ సమయంలో కిరసనాయిలుతో వెలిగే దీపాలు వాడుకలోకి వచ్చాయి. ఇంగ్లీషు వాళ్ళు ఈ దీపాన్ని 'లాంటెరన్‌' అనే వాళ్ళు. ఈ లాంటెరన్‌ పదం వాడుకలో 'లాంతరు'గా మారింది. ఈవిధంగా వాడుకలో ఉన్న భాషా రూపాన్నే త్యాగరాజ స్వామి తన కృతుల్లో ఉపయోగించారని స్పష్టమవుతోంది. 

రూపక రాగంలో 'సొగసుగా మృదంగ తాళము జతగూర్చి నిను' అనే కృతిలో 'సొగసు' అనే పదం తమిళ పదం అని కొందరు భాషావేత్తలు చెబుతున్నా ఈ పదం తెలుగులోనూ వాడుకలో ఉంది. 

భాషా ప్రయోగాల పరంగా చూస్తే త్యాగరాజుకు ఛందస్సు మీద సాధికారత ఉన్నట్లు ఆయన రచనలు పరిశీలిస్త స్పష్టమవుతుంది. యమకాలు, ప్రాసలు, శబ్దాలంకారాలు, వృత్తాలు... ఒకటేమిటి త్యాగయ్య ప్రయోగాలు అపూర్వం.. అనితరసాధ్యం.

విశేష సంగీత ప్రజ్ఞ

కర్ణాటక సంగీతంలో రాగలక్షణాలు, రాగ స్వరూపాల విషయంలో త్యాగరాజుకు ఎంతో పట్టు ఉంది. సుమారు 215 రాగాల్లో ఆయన రచనలు ఉన్నాయి. తన కృతుల ద్వారా మరుగున పడిన ఎన్నో రాగాలను వెలికి తీశారు. కొన్ని కొత్త రాగాలను సృష్టించారు. ఒకే రాగంలో అనేక కృతులు స్వరపరచినా, ఏ ఒక్కటీ మరో దానితో పోలి ఉండదు. 

సంఖ్యాపరంగాను, సృజన పరంగాను త్యాగరాజ స్వామి స్వరపరచినన్ని రాగాలు ఏ వాగ్గేయకారుడూ ముట్టుకోలేదు. రాగ లక్షణాన్నీ, వైశాల్యాన్నీ త్యాగరాజుతో సమానంగా తన రచనల్లో ప్రకటించిన వాగ్గేయకారుడూ ఇంతవరకూ లేడు. త్యాగరాజ కృతుల్లో రాగ విస్తృతి విశాలంగా ఉంటుంది. గొంతుకలో శ్రావ్యత తక్కువగా ఉన్నవారు కూడా చక్కగా పాడుకునేలా త్యాగయ్య కీర్తనలు సాగుతాయి. 

ఎంతో సరళంగా, సుందరంగా పదిమందికీ అర్థమయ్యేలా తన రచనల ద్వారా అందరికీ సంగీతాన్ని చేరువ చేశారు త్యాగయ్య. కర్ణాటక సంగీతానికి, కళాకారులకు... కాదు..కాదు... యావత్‌ తెలుగుజాతికి ఆయన చేసిన మ¬పకారాన్ని వర్ణించటానికి మాటలు లేవు. ఆయన భిక్ష వల్లే లక్షలాది కుటుంబాలు ఈనాటికీ లోటులేకుండా గడుస్తున్నాయి. 

త్యాగయ్య కీర్తనలు పాడితే కళాకారులుగా మాత్రమే మిగులుతాం. కానీ, త్యాగయ్య తన కృతుల ద్వారా కోరుకున్న ఆశయాలు సిద్ధించాలంటే అందుకు ఆచరణాత్మక ప్రయత్నం కావాలి. ప్రతి హృదయం త్యాగరాజ హృదయం కావాలి. అప్పుడే త్యాగబ్రహ్మ కోరుకున్న 'రామభక్తి సామ్రాజ్యం' ఏర్పడుతుంది. 

                                        -------------------------

గానకళ పత్రికలో ప్రచురితమైన వ్యాసం

-------------------------

రచన :  

డాక్టర్‌ కప్పగంతు రామకృష్ణ, ఆంధ్రోపన్యాసకులు, 
ఎస్‌.ఆర్‌.ఎస్‌.వి.కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, గాంధీనగర్‌, విజయవాడ - 3
సెల్‌: 90320 44115 / 8897 547 548





Sunday, January 31, 2021

శుచి శుభ్రత అంటే ఏమిటి? శుచిగా ఎందుకు ఉండాలి? మడి అంటే ఏమిటి?







శుచి - శుభ్రత 

పరమాత్మ పాదసన్నిధి చేరుకోవటానికి మంత్ర తంత్ర సాధనలు, అర్చనలతో పాటు శుచిత్వం కూడా ఎంతో అవసరం. శుచి శుభ్రత లేని చోట దేవుడు ఉండడు. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవటం మాత్రమే శుచిత్వం కాదు. అదొక భాగం మాత్రమే. శరీరంతో పాటు మనస్సు కూడా ఎంతో శుచిగా ఉండాలి. అప్పుడు మాత్రమే పూర్తి శుచిత్యాన్ని సాధించినట్లవుతుంది. శుచిగా ఉండటం గొప్ప అలంకారం కాదు.  ఆడంబరం కాదు. ఆచారం అంతకన్నా కాదు. శుభ్రత మనిషి నడతను, నడవడికను తీర్చిదిద్దుతుంది.  అదొక సంస్కారం.
 అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతోపి వా |
యస్మరేత్పుండరీకాక్షం సబాహ్యాభ్యంత శ్శుచిః ||
 రోజూ వారీ పూజా కార్యక్రమాలన్నీ ఈ శ్లోకంతోనే ప్రారంభమవుతాయి. భగవంతుడిని ఆరాధించటానికి ముందు మనిషి పవిత్రుడు కావాలి. అంటే పూర్తి శుచిత్వాన్ని సాధించాలి. అలా శుచిగా ఉన్న వ్యక్తి చేసే ఆరాధనను మాత్రమే పరమాత్మ స్వీకరిస్తాడు. భౌతిక శరీరంతో పాటు మానసికంగా కూడా మనిషి శుచిగా ఉండి భగవంతుడి అనుగ్రహానికి సాధన ప్రారంభించాలి.

 భగవద్గీతలోనూ 'శుచి' ప్రస్తావన

 శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో అనేక చోట్ల శుచిగా ఉండాల్సిన అవసరం గురించి చెబుతాడు. శుచిత్వం తనకు ఇష్టమైన భక్తుల్లో ఒకటని భగవానుడే స్వయంగా చెబుతాడు. శారీరక తపస్సే శుచిత్వం అవుతుందని మరొకచోట వివరిస్తాడు. మనిషి తాను చేసే పనులన్నిటిలో ధర్మమార్గాన్నిపాటించటం శుచిత్వం అవుతుందని ఇంకోచోట చెబుతాడు.

తేజః క్షమా ధృతిశ్శాచమ్ అద్రోహో నాతిమానితా

భవన్తి సంపదం దైవీమ్ అభిజాతస్యభారత ||

 దేవతల లక్షణాలు చెబుతూ శుచిత్వాన్ని కూడా ఆ లక్షణాల్లో ఒకటిగా చెప్పాడు కృష్ణపరమాత్మ. అలాగే, దైవాసుర సంపద్విభాగయోగంలో 

ప్రవృత్తించ నివృత్తించ జనా నవిదురా సురాః |

న శౌచం నాపిచాచారో న సత్యం తేషు విద్యతే ||

 రాక్షస ప్రవృత్తి కలిగిన వారికి శుచిత్వం ఉండదని చెబుతాడు. అంటే, శుచిగా ఉండటం మనిషికి దైవత్వాన్ని కలిగిస్తుంది. శుచిగా ఉన్న శరీరం శుచిగా ఉండే (ఉత్తమమైన) ఆలోచనలు కలిగిస్తుంది ఎప్పుడైతే మనస్సు మంచి ఆలోచనలు చేస్తుందో, ఆప్పుడు ఆ మనసు ధర్మాన్ని విడిచి పెట్టదు. అంతిమంగా మనిషి భగవంతుడి అనుగ్రహాన్ని పొందుతాడు

 * ఆదిశంకరాచార్యులు భక్తి మార్గాన్ని బోధిస్తూనే భక్తికి, తపస్సుకు, ఆధ్యాత్మిక సాధనకు తప్పనిసరిగా శుచిగా ఉండాలని చెప్పారు.

 బాహ్యమాభ్యస్తరం చేతి ద్వివిధం శౌచముచ్యతే

మజ్జలాభ్యాంకృతం శౌచం బాహ్యం శారీరికం స్మృతమ్

అజ్ఞాన దూరీకరణం మానసం శౌచమాన్తరమ్

అన్తస్థితో భవేత్సమ్యక్ బాహ్యంనావశ్యకం నృజామ్ ||

 శుచిత్వం బాహ్యం, అంతరికం అని రెండు రకాలుగా ఉంటుంది. నిత్యం చేసే స్నానం బాహ్యశౌచాన్ని కలిగిస్తుంది. మనసులో ఉండే అజ్ఞానాన్ని సాధన ద్వారా దూరం చేసుకోవటం ఆంతరిక శౌచం అవుతుంది. బాహ్యశౌచం కన్నా ఆంతరిక శౌచం చాలా అవసరం. మనస్సు స్వచ్చంగా (శుచిగా) లేకపోతే, బాహ్యశౌచం ఏవిధమైన ఫలితాన్ని ఇవ్వదు.

 బలమాయుష్యమారోగ్యం సంతోషః స్వాస్థ్యమానసం |

శుచిత్వే లభతే తస్మాత్ శుచిత్వం ఆశ్రయేత్ నరః ||

 బలం, ఆయుష్షు, ఆరోగ్యం, సంతోషం, ఆరోగ్యవంతమైన మనస్సు... ఇవన్నీ శుచిత్వం వల్లనే లభిస్తాయని శాస్త్రాలు ఘంటాపథంగా చెబుతున్నాయి.

 ఐదురకాల శౌచాలు

 కొన్ని శాస్త్ర గ్రంథాలు శౌచం (శుచి) ఐదు రకాలుగా ఉంటుందని చెబుతున్నాయి. వీటి ప్రకారం... మనశ్శాచం : మనసులో రాగద్వేషాలకు తావు లేకుండా చెయ్యటం మనశ్శెచం అవుతుంది కర్మశాచం : కపటం లేకుండా, ధర్మాన్ని పాటిస్తూ నిత్యవిధులను నిష్కామంగా చేస్తూ జీవించటం కర్మశౌచం అవుతుంది

 కులశాచం : నీచమైన పనులకు దిగజారకుండా, సదాచారాన్ని పాటిస్తూ స్థిరంగా ఉండటం కులశాచం అవుతుంది

 శరీరశౌచం : స్నానం తదితర క్రియల ద్వారా శరీరాన్ని శుభ్రంగా ఉంచటం శరీరశౌచం అవుతుంది

 వాక్ శౌచం : అనుక్షణం సత్యాన్ని మాత్రమే పలకటం వాక్శౌచం అవుతుంది

 మడి కట్టుకోవటమంటే.. 

మడికట్టుకోవటం అంటే అదేదో ఘనకార్యం అనుకోవాల్సిన పనిలేదు. మడి అంటే పరిశుభ్రమైన వస్త్రాలు ధరించటం. పూజ చేయాలనుకున్నప్పుడు ముందుగానే అందుకు తగిన పరిశుభ్రమైన వస్త్రాలు ఏర్పాటుచేసుకోవాలి. వాటిని ధరించి మాత్రమే పూజ చెయ్యాలి. ఇదే మడి అంటే.పూజలు చేసే సందర్భంలో 'మడికి ఎంతో ప్రాధాన్యత ఉంది. మడివస్త్రాలు కట్టుకున్న తర్వాత ఎవరినీ ముట్టుకోకూడదు. పూజా సంబంధం కానీ ఏ వస్తువునీ తాకకూడదు అంటూ... ఇంకా ఎన్నో నియమాలు చెబుతారు పెద్దలు. ఇదంతా చాదస్తం అనిపిస్తుంది నేటి తరానికి, కానీ, 'మడి' ఆచారం వెనుక మహత్తరమైన సందేశం దాగి ఉంది. మనం ధరించే వస్త్రాల రంగు, తీరు మన మనస్సుపై స్పష్టమైన ప్రభావాన్ని చూపిస్తాయి. నిర్మలైన వర్ణాలు మనసుకు ఆహ్లాదాన్ని చేకూరుస్తాయి. ఈ కారణంగానే మడివస్త్రాలుగా కేవలం తెల్లని వస్త్రాలు లేదా అతి తేలిక వర్గాలు కలిగిన వస్త్రాలను వినియోగిస్తారు. ఆధ్యాత్మిక సాధనలో తొలి సోపానమైన బాహ్యశుచిత్వాన్ని పొందటానికి చేసే ప్రయత్నమే ఇదంతా. ఎప్పుడైతే మనసు స్వచ్ఛంగా, హాయిగా ఉందో. అప్పుడు మనస్సు పూర్తిగా భగవంతుడి మీద కేంద్రీకృతం అవుతుంది. మనసులోని కళ్ళతో మాధవుడిని చూసేందుకు చేసే ప్రయత్నమే మడి.

 పురాణాల్లోనూ ప్రాధాన్యత

శుచిత్వానికి ఇంతటి ప్రాధాన్యత రావటానికి వెనుక పురాణగాథ ఉంది. కశ్యప ప్రజాపతికి దితి అదితి ఇద్దరు భార్యలు, దితి కుమారులు దైత్యులు - అంటే రాక్షసులు. అదితి కుమారులు ఆదిత్యులు అంటే దేవతలు, వారిద్దరి వైరం గురించి తెలిసిందే. దేవతల చేతిలో రాక్షసులు హతం కావటాన్ని చూసి తట్టుకోలేని దితి, ఇంద్రుడి సంహరించే శక్తి కలిగిన కుమారుడు తనకు జన్మించాలని భర్త అయిన కశ్యపుడిని కోరుతుంది. ఆయన 'సరే' అని వరమిస్తాడు. కానీ, ప్రసవం అయ్యేవరకు శుబిత్వాన్ని అన్నివేళలా పాటించితీరాలని, లేకపోతే గర్భం భిన్నమవుతుందని నియమం పెడతాడు. దితి అంగీకరిస్తుంది. శుభముహూర్తంలో దితి గర్భం దాలుస్తుంది. విషయం తెలుసుకున్న ఇంద్రుడు పినతల్లి అయిన దితి దగ్గరకు మంచి మాటలు చెప్పి, ఆమెకు సేవ చేసే అవకాశం ఇవ్వమని అడుగుతాడు. ఆమె అంగీకరిస్తుంది. ఇంద్రుడు అన్నిరకాలుగా సపర్యలు చేస్తుంటాడు. ఒకరోజున సాయం సంధ్యా సమయంలో పొరపాటున దితి శౌచాన్ని మరిచి, కాళ్లు చేతులు కడుక్కోకుండానే పడకగదిలోకి వెళ్లి, అలసట కారణంగా నిద్రలోకి జారుకుంటుంది. దితికి నియమభంగం కాగానే ఇంద్రుడు అణురూపంలో దితి గర్భంలోకి ప్రవేశించి, శిశువును నరకటం ప్రారంభిస్తాడు. వెంటనే దితికి మెలకువ వస్తుంది. తన బిడ్డను వధించవద్దని, తన బిడ్డ దేవతలకు అనుకూలంగా ఉంటాడని ఇంద్రుడిని వేడుకుంటుంది. అతడు అంగీకరించి, బయటకు వచ్చి, తన వల్ల ముక్కలైన శిశువు మరణించకుండా, ఎన్ని ముక్కలైందో అందరు పుత్రులు పుడతారని చెబుతాడు. అలా ఏర్పడ్డ శిశువులే దేవతాగణాల్లో ఒకటైన 'మరుద్గణం'. ఈ వృత్తాంతం జరిగనప్పటి నుంచి సంధ్యాసమయంలో తప్పనిసరిగా శుచిగా ఉండాలని, నిద్రించకూడదనే' ఆచారం వాడుకలోకి వచ్చింది. శుచిత్వానికి ఉన్న ప్రాధాన్యత ఇంత గొప్పది.

 శుచిత్వానికి ఎంత శక్తి ఉందో తెలిపే కథ భారతంలో ఉంది. ఉదంకుడు పౌష్యదేవి కుండలాలు తీసుకురావటానికి నాగలోకానికి వెళ్తాడు. కొంత కథ నడచిన తర్వాత, ఉదంకుడికి పొష్యదేవి కనిపించదు, ఎంత ఆలోచించినా కారణం తెలియటం లేదు. అప్పుడు నాగరాజు

 భూవినుత నిన్ను త్రిభువన

పావను నశుచివని యెట్లు పలుకగ నగు న

ద్దేవి పవిత్ర పతివ్రత

గావున నశుచులకు గానగాదనవద్యా

 శుచిత్వం లేని వాళ్లకి (ఆశుచిగా ఉంటే) పౌష్యదేవి కనిపించదయ్యా అంటాడు. ఉదంకుడు విషయం తెలుసుకుంటాడు. శుచిగా మారుతాడు. తర్వాత కథ నడుస్తుంది. తపశ్శక్తి సంపన్నుడైనప్పటికీ శుచిత్వం లేని కారణంగా ఉదంకుడు పౌష్యదేవిని దర్శించలేకపోతాడు. శుచిత్వానికి ఉన్న శక్తి అంత గొప్పది. అందుకే దేవాలయాలకు వెళ్లేటప్పుడు శుచిగా, పరిశుభ్రమైన వస్త్రాలు ధరించాలని, దేవుని సన్నిధిలో ఉండగా మనసులోకి ఇతర ఆలోచనలు రానివ్వకూడదని, వ్యర్ధప్రసంగాలు చెయ్యకూడదని పెద్దలు చెబుతారు.

 --------------

రచన: డాక్టర్ కప్పగంతు రామకృష్ణ, ఆంధ్రోపన్యాసకులు, విజయవాడ. 

Cell: 90320 44115 / 8897 547 548

--------------------------

భక్తి పత్రిక ఫిబ్రవరి 2021 సంచికలో రాసిన వ్యాసం





Thursday, January 14, 2021

దీక్ష అంటే ఏమిటి? దీక్షలో రకాలెన్ని? దీక్ష ఎందుకు చెయ్యాలి? దీక్షలో పాటించాల్సిన నియమాలేమిటి?

దీక్ష అంటే ఏమిటి? దీక్షలో రకాలెన్ని?
దీక్ష  ఎందుకు చెయ్యాలి? దీక్షలో పాటించాల్సిన నియమాలేమిటి? 



సర్వకాల రక్ష... దీక్ష

పుట్టుకతోనే ఏ మనిషీ సర్వోన్నతుడు కాలేడు. సర్వోన్నతమైన స్థానాన్నీ అందుకోలేడు. ఇందుకోసం నిరంతర సాధన అవసరం. తనను తాను ఉద్ధరించుకోవాలన్న ఆలోచన ఏ క్షణమైతే మనిషికి కలుగుతుందో ఆ క్షణం నుంచే అతడిలో పరివర్తనకు శ్రీకారం చుట్టుకుంటుంది. లౌకిక జీవనంలో అనేక మాయల వలలో చిక్కుకున్న మనిషి క్రమంగా తెలివి తెచ్చుకుంటూ వాటి నుంచి క్రమంగా బయటపడి శాశ్వతమైన సత్యాన్ని అన్వేషించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తాడు. వీటన్నిటిలో మనిషి అన్ని రకాల లౌకిక బంధాల నుంచి విడిపడేలా చేసి, దైవత్వానికి దగ్గర చేసేందుకు మేలైన మార్గం 'దీక్ష'. 

దీక్ష అంటే నియమాల సమాహారం. పట్టుదల అనే పేరు కూడా దీనికి ఉంది. ఒక ఆచారాన్ని లేదా  నియమాన్ని పాటించాలని సంకల్పించడం, దాన్ని పట్టుదలగా కొనసాగించడం దీక్ష అని చెప్పుకోవచ్చు. ఇంద్రియాలను నిగ్రహంలో ఉంచుకొని, దైహికంగా, మానసికంగా మండలం పాటు నిష్ఠాపూరితమైన జీవనాన్ని నిరాడంబరంగా గడపడం దీక్షలోని ప్రధానమైన అంశం. దీనివల్ల భౌతికమైన క్రమశిక్షణతోపాటు మానసికమైన నిబద్ధత ఏర్పడుతుంది. అది ఆదర్శప్రాయమైన జీవనానికి మార్గదర్శకమవుతుంది.

దీక్ష అంటే...?

దీయతే జ్ఞానం విజ్ఞానం క్షీయంతే పాప నాశనం

తేన దీక్షా ఇతి ప్రోక్తా ప్రాప్తాచ్చేత్‌ సద్గురోర్ముఖః ||


దీ - అంటే జ్ఞానం, క్ష - అంటే పాపక్షయం అని అర్థం. జ్ఞానాన్ని ఇచ్చి పాపాన్ని పోగొట్టేది ఏదో అది దీక్ష అవుతుంది. దీక్షకు ఇదమిత్థంగా ఇదీ భౌతిక స్వరూపం అంటూ ఏదీ ఉండదు.  మనసులో దర్శించిన అనుభూతి, ఎంచుకున్న లక్ష్యం, కలిగిన ప్రేరణ బట్టి దీక్ష ఆచరించే విధానం మారుతుంది. బయటకు ఇదంతా విభిన్నమైన పద్ధతులు అనిపించినా అన్ని దీక్షలూ చేరే గమ్యం పరమాత్మ పాదాలు మాత్రమే.

దీక్ష అనే పదం - ద, ఇ, క, ష, అ అనే ఐదు అక్షరాల కలయికతో ఏర్పడింది. 'ద' అంటే ఇచ్చేది, 'ఇ'  అంటే  లక్ష్మి లేదా సంపద. 'క' అంటే బ్రహ్మానందం. 'ష' అంటే సమృద్ధి. 'అ' అంటే పరమాత్మ లేదా పరబ్రహ్మ. ఇలా బ్రహ్మానందం, సంపద, సమద్ధి, పరమాత్మని ఇచ్చేది దీక్ష అవుతుంది. దీక్షను ఆచరిస్తే పరమ జ్ఞానం కలుగుతుంది. పాప పరంపరలను పోగొట్టి సంసార పాశ బంధాలను ఛేదించి, తత్త్వ చింతనను కలిగిస్తుంది. దీక్ష అంటే నియమబద్ధ ప్రవత్తి. మనస్సు, శరీరం, వాక్కుతో సహా అన్ని అవయవాలు, అన్ని ఇంద్రియాలను నియంత్రణలో ఉంచుకుని పరమాత్మ ఆరాధనకు అనుగుణంగా ప్రవర్తించటాన్ని దీక్ష అంటారు. దీక్షకు మించిన పవిత్రమైన వస్తువు, జ్ఞానం, తపస్సు ప్రపంచంలో మరెక్కడా లేవు.

మరోవిధంగా చెప్పాలంటే... నిశ్చలమైన మనస్సుతో సంకల్పించడాన్ని దీక్ష అంటారు. మనస్సు, వాక్కు, శరీరము ఈ మూడింటిని త్రికరణాలు అంటారు. ఈ మూడింటిని సమన్వయం చేసి నిర్వహించే పనుల్నే 'మనోవాక్కాయకర్మలు' అంటారు. అహింస (హింస చెయ్యకుండా ఉండటం), సత్యం (దేవుని మీద నిజమైన భక్తి కలిగి ఉండటం), ఆస్తేయం (అవలంబించేందుకు తగిన విధానాన్ని ఎంచుకోవటం), బ్రహ్మచర్యం (శారీరక వ్యామోహాలు లేకపోవటం), అపరిగ్రహం (తన భోగాల కోసం ఇతరుల నుంచి ధనాన్ని స్వీకరించకపోవటం) అనే మహావ్రతాలను మనోవాక్కాయ కర్మల ద్వారా ఆచరించటాన్ని కూడా దీక్ష అంటారు.

దీక్షలో రకాలు

దీక్షల్లో ప్రధానంగా మూడు రకాలు ఉంటాయి. అవి....ఆణవీ, శాక్తేయీ, వైష్ణవి. మంత్రం, అర్చన, ఆసనం, ధ్యానం, స్థాపన, ఉపాసన అనే ఆరు అంగాలు కలిగిన దీక్ష అణవి అవుతుంది. శక్తిని ఆరాధించే దీక్ష శాక్తం లేదా శాక్తేయం అవుతుంది. చివరిది వైష్ణవీ దీక్ష. గురుశిష్యులిద్దరూ ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా ప్రవర్తించటం వైష్ణవీ దీక్ష అవుతుంది. శిష్యుడిని మంచి దారిలో ప్రవర్తింపజేయటం, తత్త్వం, హితం, పరమార్థం మొదలైన విషయాల్ని బోధించటం మొదలైనవన్నీ ఇందులోకి వస్తాయి. గురువునే పరమాత్మగా ఆరాధించటం, ధన, మాన, ప్రాణాల్ని కూడా గురువుకే అర్పించటం ఈ దీక్షలో ప్రధానమైన అంశంగా ఉంటుంది. గురువు గారిని దర్శించటం, స్పశించటం, మాట్లాడటం వల్లనే తత్త్వ జ్ఞానము కలుగుతుంది. గురువు జ్ఞాన మార్గంతో శిష్యదేహంలో ప్రవేశించి శిష్యుడి జ్ఞాన నేత్రాన్ని తెరిపించి పరమాత్మ స్వరూపాన్ని సాక్షాత్కరింపజేయటం వైష్ణవి దీక్ష అవుతుంది. దీన్నే జ్ఞానదీక్ష లేదా బ్రహ్మచర్య దీక్ష అని కూడా అంటారు

ప్రతి దీక్షలోను కలశ స్థాపన ప్రధానమైన అంశంగా ఉంటుంంది. 'క' అనగా పరబ్రహ్మ, 'ల' అంటే లక్ష్మీ, 'శ' అంటే శాంతి, శక్తి అని అర్థం. కలశం బ్రహ్మాండానికి, అందులో ఉన్న జలం సకల దేవతలకు, ఆకులు సకల ప్రాణులకు ప్రతీకలుగా ఉంటాయి. కొబ్బరికాయ మనం ఏర్పరచుకునే స్థిరమైన సంకల్పానికి, దానిపై వేసిన వస్త్త్రం మన శరీరానికి ప్రతిరూపాలుగా ఉంటాయి. ఈవిధంగా త్రికరణాలతో త్రిమూర్తుల్ని, త్రిలోకాలని, తత్త్వ త్రయాన్ని ఆరాధించటమే కలశస్థాపన అవుతుంది. మొత్తంగా దీక్షలో ప్రధానంగా స్థాపించే కలశం మనల్ని తత్త్వాతీలుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన పునాది వేస్తుందని అర్థం చేసుకోవాలి.  ఈ విధంగా కలశస్థాపనతో స్వీకరించే దీక్షను క్రియావతి అని, మంత్రములతో చేస్తే మాంత్రి అని అంటారు.

దీక్షలు క్రియావతి, కళావతి, వర్ణమయి, బోధమయి అని నాలుగురకాలుగా ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి. కలశ స్థాపన చేసే విధానం క్రియావతి అవుతుంది. కలశంలో దేవతాకళలను ఆవాహన చెయ్యటం కళావతి, మంత్రాలు చదువటం, ఉపదేశించటం వర్ణమయి, తత్త్వ జ్ఞానాన్ని బోధించటం బోధమయి అవుతాయి. ఈవిధమైన దీక్షానియమాలతో దేవతల్ని ఆరాధించాలని, వారికి సంబంధించిన దీక్షావిధానాల్ని పాటించాలని వివిధ శాస్త్రాలతో పాటు ఆచార సంప్రదాయాలు కూడా చెబుతున్నాయి



దీక్ష ఎందుకు?

    పేరేదైనా సరే... దీక్ష స్వీకరించగానే ఒక పవిత్ర స్పహ మనసులోకి ప్రవేశిస్తుంది. వికత పద్ధతులు, పాశవిక స్థితులు దూరమై, ఆధ్యాత్మిక అభ్యున్నతి వైపు అడుగులు కదుపుతాం. ఆత్మవికాసాన్ని పెంచుకోగలుగుతాం. భౌతికమైన ఎదుగుదలను కట్టడి చేసి, ఎదుటివారిని మన ఇష్టదైవంగా భావించి ఆ పేరుతోనే పలుకరిస్తాం. ఇంకా మరెన్నో పద్ధతుల ద్వారా మానసిక పరిణతిని పెంపొందించుకోవడానికి కృషి చేస్తాం. ఇదంతా జరగటానికి దీక్షకు సంబంధించిన నియమాలు దోహదపడతాయి. అనవసరమైన విషయాలు మాట్లాడకుండా ప్రతి క్షణం మనల్ని మనం నియంత్రించుకోవడానికి ప్రయత్నించుకోవటం ద్వారా దీక్ష తీసుకున్న లక్ష్యాన్ని చేరుకోవటం సులభమవుతుంది.

దీక్ష అంటే కేవలం కొన్ని కఠినమైన నియమాల్ని పాటించటం మాత్రమే కాదు. అందుకు ఆంతరిక శుద్ధి తప్పనిసరి. దీక్ష ఇచ్చే వ్యక్తి, తీసుకునే వ్యక్తి ఇద్దరూ పరిశుద్ధమైన మనస్సు కలిగిఉండాలి. లేదంటా దీక్ష అనే మాటకే అర్థం మారిపోతుంది.

పాలను ఏదైనా గిన్నెలో పొయ్యాలనకున్నప్పుడు ముందుగా ఆ గిన్నె శుభ్రంగా ఉందో లేదో చూస్తాం. శుభ్రంగా ఉంటే సరి. లేదంటే గిన్నెను శుభ్రపరిచిన తర్వాతనే పాలను అందులోకి పోస్తాం. దీక్ష కూడా పాలవంటిదే. ఇక్కడ శరీరం గిన్నె వంటిది. శుభ్రమైన శరీరం (బాహ్యంగాను, మానసికంగాను) లేకపోతే అందులోకి పోసే (స్వీకరించే) దీక్ష కూడా మలినమవుతుంది. కాబట్టి, ఏవిధమైన దీక్ష చెయ్యాలని నిశ్చయించుకున్నా ముందుగా మన శరీరాన్ని మానసికంగాను, శారీరకంగాను ఎంతో శుభ్రంగా ఉంచుకోవాలి. ఆ తర్వాత సద్గురువును ఆశ్రయించి, ఆయన సూచనల ప్రకారం దీక్ష తీసుకోవాలి. అంతేకానీ ఏ వ్యక్తీ తనకు తానుగా దీక్ష తీసుకుంటున్నానని ప్రకటించకూడదు. ఆచరించకూడదు. ప్రత్యేకించి మంత్ర దీక్షల విషయంలో గురు అనుగ్రహం తప్పనిసరి.  

     కార్యసాధనకు దీక్ష తప్పనిసరి అనే అంశాన్ని శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీత ఆరో అధ్యాయంలో చెబుతాడు. 

అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్‌ |

అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గహ్యతే ||

అర్జునా! మనస్సును నిగ్రహించటం చాలా కష్టసాధ్యం. అయినప్పటికీ అభ్యాసం చేత, వైరాగ్యం చేత దాన్ని సాధించవచ్చంటాడు పరమాత్మ. ఇక్కడ అభ్యాసం అంటే దీక్ష. మనస్సును స్వాధీనం చేసుకోవాలంటే సాధారణ దీక్ష సరిపోదు. అకుంఠితమైన దీక్ష కావాలి.అకుంఠితం అంటే ఏ ఒక్కరోజూ కుంటుపడనిది అని అర్థం. దీక్ష తీసుకున్న తర్వాత మన నిర్ణయం మారకూడదు. మరో ఆలోచనకు తావు ఇవ్వకూడదు. అలాచేసినప్పుడే స్వీకరించిన దీక్ష కోరుకున్న ఫలితాన్ని ఇస్తుంది. 

'దేహో దేవాలయః ప్రోక్తో జీవోదేవస్సనాతనః'... దేహమే దేవాలయం. జీవుడే పరమేశ్వరుడని ఉపనిషత్తులు చెబుతున్నాయి. తనలో ఉన్న పరమేశ్వరతత్త్వాన్ని మనిషి గుర్తించే దీక్ష తీసుకుంటాడు కాబట్టే ఆ క్షణం నుంచి జీవుడు దేవుడుగా మారుతాడు. దేవాలయాన్ని ఎలాగైతే అత్యంత శుచిగా ఉంచుతారో దేహాన్ని కూడా అలాగే ఉంచుకుంటారు. భూశయనం ఆత్మ నిగ్రహాన్ని, శీతలస్నానం శారీరక శక్తిని ఇస్తాయి. కఠిన నియమాలు దీక్షాధారులు పాటించడం వెనుక ఉన్న ఆధ్మాత్మిక సందేశం ఇది. 

పాటించాల్సిన నియమాలు

- సూర్యోదయ పూర్వ, సూర్యాస్తమయాలకు పూర్వమే చన్నీటి స్నానం ఆచరించాలి.

- పదేళ్లలోపు స్త్రీలు, రుతుక్రమం లేనివారు, 60 ఏళ్ళ వయస్సు వారు దీక్షను ఆచరించవచ్చు.

- నిర్మలమైన మనసుతో పూజను ఆచరించాలి. విభూతి, కుంకుమ, చందనం ధరించాలి.

- దీక్షను స్వీకరించిన వారు స్వయంగా దైవ భావన కలిగి నిరాడంబరులై దీక్షకు అధిష్ఠాన దేవత ఎవరో ఆ దేవతకు ప్రీతిపాత్రమైన రంగులో ఉండే వస్త్రాలను ధరించాలి.

- అరుణోదయ, తపనోదయ, సంగమ, మధ్యాహ్న, సాయం, అర్థనిశా సమయాల్లో పూజలు ఆచరించాలి.వీటినే షట్కాలార్చన అంటారు. (ఆరు కాలాల్లో అర్చన చేయలేని వారు కనీసం ఉదయం, సాయంత్రం వేళల్లో తప్పనిసరిగా అర్చన చెయ్యాలి)

- దీక్ష పూర్తయ్యేవరకు సాధ్యమైనంత సేపు మౌనం వహించాలి.

- మంత్రాలతో పూజలు చెయ్యటం కుదరివారు దేవతకు సంబంధించిన నామాలతో అర్చన చేయవచ్చు.

- ఒక్కపూట భోజనమే చేయాలి. నేలపై పడుకోవాలి.

దీక్షలో చేయకూడనవి

- క్షౌరం చేయించుకోకూడదు.

- గోళ్లు తీయకూడదు.

- ధూమపానం, మద్యపానం చేయకూడదు.

- మాంస భోజనం తినరాదు.

- కామక్రోధాలు, వినోద కార్యక్రమలకు దూరంగా ఉండాలి.

- అనవసరంగా మాట్లాడకూడడదు.

- దీక్ష పూర్తయ్యేంత వరకు పాదరక్షలు ధరించకూడదు.

అచ్చంగా అమ్మలా...

లోకాలనేలే చల్లనితల్లి దుర్గమ్మ ఆశీస్సులు కోరుతూ చేసే దీక్ష భవానీ దీక్ష. అచ్చం ఆ అమ్మను పోలి ఉండేలా దీక్షా ధారులు ఎర్రటి వస్త్రాలు ధరించి, కుంకుమ ధరిస్తారు. పాదాలకు పసుపు పూసుకుంటారు. భవానీ దీక్షాధారులను చూడగానే కనకదుర్గమ్మను చూస్తున్నామా అన్నంత అనుభూతి కలుగుతుంది. మనసుతో పాటు శరీర ఆకృతిలోను అమ్మ భావనను ప్రకటిస్తూ ఆ తల్లి అనుగ్రహం ఈ దీక్ష చేస్తారు. 

భవానీపూజలో ప్రధానాంశం 'శరణు ఘోష'. అనేక విధాలైన స్తోత్రాలు, నామాలతో జగన్మాతను దీక్షాధారులు ఆరాధిస్తారు. మనిషిలో ఉండే యవ్వనం, అందం, అనుభవించే భోగభాగ్యాలు ఇవేవీ శాశ్వతం కావు. అమ్మ పాదాలను శరణు వేడటమే ముక్తికి మార్గం. భవబంధాలను విడిచి అమ్మ చరణాలను పట్టుకునేందుకు మనిషి మనస్సును సన్నద్ధం చేసే ఆధ్యాత్మిక సాధన శరణుఘోష ప్రధానాశయం. 

ఇంద్రకీలాద్రికి చేరుకుని, జగన్మాతను దర్శించిన తర్వాత ఇరుముడిలోని కొబ్బరికాయను హోమగుండంలో సమర్పిస్తారు. యజ్ఞం అంటే సమర్పణ భావం. తనను తాను దైవానికి సమర్పించుకోవటం మనిషి చేసే సాధనలో తుది అంకం. ఆ తర్వాత వ్యక్తి పూర్ణత్వాన్ని సంతరించుకుంటాడు. శాస్త్రాలు కూడా 'యజ్ఞోహి శ్రేష్ఠతం కర్మా' - మనిషి ఆచరించే కర్మలన్నిటిలో యజ్ఞాలు ఉత్తమమైనవని చెబుతున్నాయి. ఉత్తమ క్రియల ద్వారా పూర్ణతాన్ని సాధించటమే కొబ్బరికాయను అగ్నికి సమర్పించటంలో భావం. ఈవిధమైన ఆధ్యాత్మిక విజ్ఞాన రహస్యాలన్నీ తనలో ఇముడ్చుకున్న కారణంగా భవానీదీక్ష అమ్మను కృపను పొందేందుకు దివ్యమైన మార్గంగా భక్తుల నీరాజనాలు అందుకుంటోంది.

------------

రచన: డాక్టర్‌ కె.రామకృష్ణ, ఆంధ్రోపన్యాసకులు,  ఎస్‌.ఆర్‌.ఎస్‌.వి.కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, గాంధీనగర్‌, విజయవాడ-3. సెల్‌ : 90320 44115 / 88975 47548. email: krkrishna2011@gmail.com


(శ్రీ కనకదుర్గ ప్రభ పత్రిక జనవరి 2020 సంచికలో రాసిన వ్యాసం)










Thursday, December 17, 2020

స్కంద షష్ఠి సందర్భంగా కుమారస్వామి అవతార విశేషాలు వివరిస్తూ రాసిన వ్యాసం


స్కంద షష్ఠి సందర్భంగా 

కుమారస్వామి అవతార విశేషాలు వివరిస్తూ రాసిన వ్యాసం



జ్ఞానస్వరూపుడు... స్కందుడు


నమస్తే నమస్తే మహాశక్తి పాణే నమస్తే నమస్తే లసద్వజ్రపాణే |

నమస్తే నమస్తే కటిన్యస్త పాణే నమస్తే నమస్తే సదాభీష్టపాణే ||

స్కందుడు రాశీభూతమైన జ్ఞానస్వరూపుడు. ఆయన చేతిలోని 'శక్తి' ఆయుధం సునిశితమైన మేథస్సుకు ప్రతీక. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులనే మూడు శక్తుల సంయోగ స్వరూపంగా నిలిచి, అజ్ఞానం అనే తారకాసురుడిని సంహరించి, జ్ఞానజ్యోతులను ప్రకాశింపజేసిన విజ్ఞానమూర్తి ఆయన. బౌద్ధికజ్ఞానంతో పాటు అపారమైన భుజశక్తికి కూడా స్కందుడు ప్రతీకగా నిలుస్తాడు. రాక్షస సంహార విషయంలో దేవతలకే సేనా నాయకుడిగా నిలిచి, వారిని ఆదుకున్న ధీశాలి సుబ్రహ్మణ్యడు. 

స్కందుడన్న పేరు సుబ్రహ్మణ్యస్వామికి ప్రసిద్ధమైంది. స్కన్నమైన (జారిన) వాడు స్కందుడు. శివుని ఆత్మజ్యోతి నుండి ఆవిర్భవించిన ఆరుజ్యోతుల స్వరూపమే సుబ్రహ్మణ్యుడు. ఆయనే స్కందుడు. శరవణభవుడు, కార్తికేయుడు. కుమారస్వామి.... ఇలా సుబ్రహ్మణ్యస్వామికి ఎన్నో పేర్లు వ్యాప్తిలో ఉన్నాయి. శివపార్వతుల తనయుడిగా స్కందుడు ఆవిర్భవించిన తిథి 'షష్ఠి'. శక్తి కారకుడిగా పేరున్న ఆ స్వామి తారకాసుర సంహార సందర్భంలో దేవతలకు సేనాధిపత్యం వహించి, రాక్షస సంహారం చేసిన రోజు మార్గశిర శుద్ధ షష్ఠి. ఈ కారణాల వల్ల మార్గశిర శుద్ధ షష్ఠి 'స్కంద షష్ఠి'గా వ్యాప్తిలోకి వచ్చింది. 

సుబ్రహ్మణ్య జన్మ వృత్తాంతం

సుబ్రహ్మణ్యస్వామి జన్మవృత్తాంతానికి సంబంధించి అనేక గాథలు వ్యాప్తిలో ఉన్నాయి. అనేక పురాణాలు, కావ్యాలు, ఇతిహాసాల్లో సుబ్రహ్మణ్యుడి జనన వృత్తాంతానికి సంబంధించిన కథనాలు వర్ణితమై ఉన్నాయి. ఈ కథల్లో కొద్దిపాటి భేదాలు ఉన్నప్పటికీ స్థూలంగా కుమారస్వామి శివపార్వతుల తనయుడనే విషయంలో ఎటువంటి అభిప్రాయభేదం వీటిల్లో లేదు. 

పూర్వం తారకుడు అనే రాక్షసుడు మదగర్వంతో ముల్లోకాలపై దండెత్తి దేవ, మానవ, రాక్షసులను ముప్పుతిప్పలు పెట్టసాగాడు. అతడి ఆగడాలు భరించలేక ఇంద్రాది దేవతలు బ్రహ్మదేవుడిని ఆశ్రయించి, ఎలాగైనా తారకాసురుడి బారినుంచి ముల్లోకాలను రక్షించమని వేడుకున్నారు. బ్రహ్మదేవుడు దివ్యదష్టితో పరీక్షించి, తారకాసురుడు శివుడి అంశతో పుట్టిన శక్తిమంతుడైన వీరుడికి తప్ప మరెవరికీ లొంగడని దేవతలతో చెప్పాడు. అప్పటికే శివుడు తన అర్ధాంగి అయిన సతీదేవిని దక్షయజ్ఞ సమయంలో కోల్పోయి బాధతో హిమాలయాల్లో తపస్సు చేసుకొంటున్నాడు.

పరమశివుడు మరొక కన్యను వివాహం చేసుకుంటే తప్ప శివాంశతో వీరుడు పుట్టడం అసంభవం. అప్పుడు ఇంద్రుడు దేవతలతో సమావేశమై కర్తవ్యాన్ని గురించి ఆలోచించాడు. ఇంతలో ఇంద్రుడికి మన్మథుడి రూపంలో సమస్యకు పరిష్కారం కనిపించింది. వెంటనే మన్మథుణ్ని తన సభకు రప్పించి, ముల్లోకాలను రక్షించటం కోసం శివుడి మనసులో వివాహేచ్ఛకు మూలమైన ప్రేమను అంకురింపజేయమని కోరాడు. మన్మథుడు లోకరక్షణార్థం ఆ పని చేయడానికి అంగీకరించి, తన బాణాలకు పదునుపెట్టాడు. నిత్యం శివుణ్ని ఆరాధించడానికి హిమవంతుడి కుమార్తె పార్వతి హిమాలయాలకు రావడం గమనించాడు. 

ఒకనాడు పార్వతి శివుడిని అర్చిస్తుండగా, శివుడి మనసులో కోరికలు రేపే విధంగా తన పూలబాణాలను ప్రయోగించబోయాడు. తపోధ్యానంలో ఉన్న శివుడి మనసులో వికారం కలిగింది. జితేంద్రియుడైన శివుడు వెంటనే అది గ్రహించి, కోపంతో తన నొసటిపైనున్న అగ్నినేత్రాన్ని తెరిచి, మన్మథుణ్ని చూశాడు. శివుడి ఆగ్రహం ప్రళయాగ్నిగా మారి క్షణంలో మన్మథుడిని భస్మం చేసింది. ఆ సంఘటనతో కలత చెందిన పార్వతి తన ఇంటికి వెళ్ళిపోయింది. శివుడూ తన తపస్సుకు భంగం కలిగించిన ఆ చోటును వదిలి మరోచోటుకు వెళ్ళిపోయాడు. ఇంద్రాది దేవతల ఆశ నెరవేరలేదు. ఆ తరవాత సప్తర్షులు పూనుకొని పరమేశ్వరుణ్ని ఆశ్రయించి, హిమవంతుణ్ని ప్రేరేపించి పార్వతీపరమేశ్వరుల వివాహం జరిపించారు. 

వివాహానంతరం నవదంపతులు ఏకాంతంలో అన్యోన్యానురాగంతో ఉండగా, అగ్నిదేవుడు ఒక పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి వస్తాడు. అది చూసిన శివుడు తన తేజస్సును అగ్నికి ఇస్తాడు. అగ్ని దాన్ని భరించలేక గంగానదిలో జారవిడుస్తాడు. అదే సమయంలో నదిలో స్నానం చేస్తున్న ఆరుగురు కృత్తికాదేవతల గర్భంలోకి శివతేజస్సు చేరుతుంది. వారూ ఆ తేజస్సును భరించలేక తీరంలో ఉన్న రెల్లు పొదల్లో వదిలేస్తారు. కొంతకాలానికి ఆ పొదల్లోనే ఆరు ముఖాలతో బాలుడు జన్మిస్తాడు. అతడే షణ్ముఖుడైన కుమారస్వామి. 

రాక్షస సంహారం కోసమే ఆవిర్భవించిన కుమారస్వామి దేవకార్యాన్ని నెరవేర్చటానికి సన్నద్ధమయ్యాడు. తల్లి ఇచ్చిన 'శక్తి' ఆయుధాన్ని ధరించాడు. దేవతల సర్వసైన్యానికి నాయకుడిగా బాధ్యతలు స్వీకరించి, అమేయమైన పరాక్రమంతో తారకాసురుడితో పాటు అతడి సోదరులను కూడా సంహరించాడు. 

కావడి మొక్కులంటే ఇష్టం

పూర్వం అగస్త్య మహర్షి కైలాసానికి వెళ్ళి శివుడిని దర్శించి తిరిగి వెళ్ళే సమయంలో శివుడు రెండు కొండలను బహుకరించి శివశక్తి రూపంగా దక్షిణాదికి తీసుకు వెళ్ళి కొలవవలసిందిగా తెలిపారు. వాటిని స్వీకరించిన అగస్త్యుడు వాటిని ఇదంబుడు అనే శిష్యుడికిచ్చి తన వెంట వాటిని తీసుకుని రావలసిందిగా తెలిపాడు. ఇదంబుడు కావడిని కట్టుకుని రెండు పర్వతాలను అందులో ఉంచుకుని అగస్త్యుడి వెంట నడవసాగాడు. కొంత దూరం అంటే పళని వచ్చేసరికి ఆయాసం అధికమై కొంత సేపు విశ్రాంతికి ఆగాడు. కొంతసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ కావడిని ఎత్తగా ఒకవైపు పైకి లేచింది. మరోవైపు లేకపోవడంతో వెనుతిరిగి చూడగా దానిపై సుబ్రహ్మణ్యస్వామి నిలబడి ఉన్నాడు. కొండ దిగి వెళ్ళిపోమన్నాడు. పోకపోవడంలో వారిద్దరి మధ్యా యుద్ధం జరిగి చివరకు ఇదంబుడు చనిపోయాడు. ఈ విషయం తెలుసుకుని అగస్త్యుడు ప్రార్థించడంతో స్వామి తిరిగి బతికించారు. ఈ విషయం ఇదంబుడి భార్యకు తెలిసి కావడిలో పాలను తీసుకువెళ్ళి క తజ్ఞతగా స్వామివారికి సమర్పించింది. అప్పటి నుంచి కావడి మొక్కులను సమర్పించడం ఆచారమైంది. కాగా, కావడిని ఉపయోగించే బద్ద 'బ్రహ్మదండం' అనీ కర్కోటక అనే అష్టనాగులకు ప్రతీకలని చెప్పబడుతూ ఉంది.

సుబ్రహ్మణ్య వైభవం

సుబ్రహ్మణ్యుడు రూపంలో అందగాడు. శౌర్యంలో సాటిలేని వాడు. అందుకే దేవసేనాధిపతి అయ్యాడు. ఈయన వాహనం నెమలి. ఆయుధం శూలం. దీనిని విజయ శూలమనీ, జ్ఞాన శూలమనీ అంటారు. సుబ్రహ్మణ్యుడికి షణ్ముఖుడు అన్న పేరుంది. అంటే ఆరు ముఖాలు కలవాడని అర్థం. ఈ ఆరుముఖాలు జ్ఞానం, వైరాగ్యం, శక్తి, యశస్సు, ఐశ్వర్యం, దైవత్వానికి ప్రతిరూపాలు. వల్లీ, దేవసేన స్వామివారి ఉభయ దేవేరులు. 

కార్తికేయుడు మేధోమూర్తి. వేదాలు ఇతణ్ని యజ్ఞాగ్నిగా అభివర్ణించాయి. ఉపనిషత్తులు సనత్కుమారుడిగా కీర్తించాయి. శివుడికి ప్రణవనాదమైన 'ఓం'కార అర్థాన్ని వివరించిన చెప్పిన ఘనత కూడా సుబ్రహ్మణ్యుడికే దక్కుతుంది. ఈవిధంగా ఆదిదేవుడికే గురుదేవుడు అయ్యాడు కుమారస్వామి. శ్రీకష్ణుడు భగవద్గీతలో 'సేనాధిపతులలో స్కందుడిని నేను' అని ప్రకటించటం స్కందుడి ప్రాశస్త్యాన్ని తెలియజేస్తుంది.

వేదాలలో షణ్ముఖీయమైన సంవత్సర స్వరూపంగా స్వామిని వర్ణించారు. కాలాగ్ని స్వరూపమే ఇది. కాలాగ్నిరుద్రుడైన శివుని తేజమే ఈ సంవత్సరాగ్ని. ఆరు ముఖాలను ఆరు ఋతువులకు ప్రతీకగా, పన్నెండు చేతులను పన్నెండు మాసాలకు ప్రతీకలుగా చెప్పుకోవచ్చు. ఇదీ సంవత్సరాగ్ని రూపం. ఈ రూపం చిత్రాగ్ని అనే నెమలిపై ఆసీనమయ్యింది. వివిధ వర్ణాలనువెదజల్లే కాంతి పుంజమే ఈ నెమలి. ఈవిధంగా అనంతం, అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తులకు సుబ్రహ్మణ్య ఉపాస కేంద్రంగా ఉంటుంది. సుబ్రహ్మణ్య ఉపాసన ద్వారా మోక్షాన్ని అందుకున్న మహనీయులు ఎందరో ఉన్నారు. 

యోగస్వరూపుడు

'సార్ధ త్రి వలయకారిణీ సుప్త భుజంగాకార రూపా...' - మానవదేహంలో మూలాధార స్థానంలో కుండలినీ శక్తి మూడు చుట్లు చుట్టుకుని నిద్రిస్తున్న పాములా ఉంటుందని చెబుతారు. సాధకుడిలో ఆ శక్తి జాగృతమై సహస్రారం వరకు ప్రయాణిస్తుందని యోగశాస్త్రం చెబుతోంది. సుబ్రహ్మణ్యుడు జ్ఞానస్వరూపుడు. యోగ స్వరూపుడు. సాధనలో మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు ఆరుస్థానాలు క్రమంగా వికాసం పొందితే ఆ పైన ఉన్న సహస్రారంలో పరమచైతన్యం అనుభవానికి వస్తుంది. పరమాత్మ సుబ్రహ్మణ్యరూపంలో అవతరించే క్రమంలో ఆరుముఖాలతో దర్శనమిస్తాడు. ఇవి ఆరుచక్రాలకు సంకేతం. కుండలినీ శక్తి సర్పాకారంలో ఉంటుందని యోగశాస్త్రం చెబుతోంది. ఈ యోగానికి అధిపతి కుమారస్వామి. ఈ విషయాన్ని సంకేతరూపంలో చెప్పటమే సుబ్రహ్మణ్యుడు సర్పరూపంలో ఉంటాడని వర్ణించటానికి కారణం. 

షణ్ముఖుడు జ్యేష్ఠా నక్షత్రంలో జన్మించాడు. ఈ నక్షత్రానికి అధిపతి బుధుడు. బుధుడు జ్ఞానమిచ్చేవాడు. జ్ఞానాన్ని సంస్కతంలో సుబ్రహ్మ అంటారు. అందువలన ఈ స్వామి సుబ్రహ్మణ్యేశ్వరుడని ప్రసిద్ధి చెందాడు. ఈయన జన్మరాశి వశ్చికం నుండి జన్మలగ్నమైన మేషం వరకు ఆరు రాశులు ఉన్నాయి. ఈ ఆరురాశులు మనశరీరంలోని షట్‌ చక్రాలు. వశ్చికరాశిని తోకగా పరిగణిస్తే మేషరాశి పాము శిరస్సు అవుతుంది. ఈ పద్ధతిలో స్వామి కుండలినీ ప్రభువు అయ్యాడు. ఇవన్నీ జ్ఞాన వైరాగ్యాలకు సంబంధించిన విషయాలు. సర్పం వీటికి సంబంధించినది. అందువల్లనే సర్పాలను సదాశివుడు ధరించి పన్నగభూషణుడని ప్రసిద్ధి చెందాడు. ఈ పన్నాగాలు సుషుమ్నా నాడీరూపంలో ఉన్న షణ్ముఖుని విభూతి రూపాలు. ఆ కారణంగా సుబ్రహ్మణ్యేశ్వరుని సర్పరూపంలో పూజిస్తారు.

ఆరక్షరాల దైవం

షణ్మతాలలో కుమారోపాసన ఒకటి. కంఠంలో రత్నాలు, మేనిలో చక్కదనం, చేతిలో జ్ఞానశక్తి ఆయుధం, ముఖాన చిరునవ్వు, కటియందు (నడుముభాగం) హస్తాన్ని ఉంచి నెమలిపై ప్రకాశిస్తుండే స్వామి సుబ్రహ్మణ్యుడు. పరిపూర్ణమైన జ్ఞానస్వరూపుడు. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా అనే మూడు శక్తులమయమైన శక్తిని ధరించిన కుమారస్వామి, శరణన్నవారిని కాపాడే దేవుడు. అమోఘమైన శివతేజం పథ్వి, అగ్ని, జలం, షట్‌ కత్తికల శక్తిని (నక్షత్రశక్తి) ధరించి, చివరకు బ్రహ్మతపోనిర్మితమైన అలౌకిక మహాగ్ని శరవణంలో (అగ్నితో కూడిన రెల్లుతుప్పు)  బాలుడిగా రూపుదిద్దుకుంది. అందుకే స్వామి శరణభవుడు. శరవణభవ అనే పదంలో ఒక్కో అక్షరానికి ఒక్కో ప్రత్యేకమైన అర్థం ఉంది. శ - శమింపజేయువాడు, ర - రతిపుష్టిని ఇచ్చువాడు, వ - వంధ్యత్వం రూపుమాపువాడు, ణ - రణమున జయాన్నిచ్చేవాడు, భ - భవసాగరాన్ని దాటించేవాడు, వ - వందనీయుడు అని ఈ పదాలకు అర్థం. 

బీజాక్షర పరంగా చూస్తే, శ - లక్ష్మీబీజం. దీనికి అధిదేవత శంకరుడు. ర - అగ్నిబీజం. దీనికి అధిదేవత అగ్ని. వ - అమతబీజం. దీనికి అధిదేవత బలభద్రుడు. ణ - యక్షబీజం. దీనికి అధిదేవత బలభ్రద్రుడు. భ - అరుణ బీజం. దీనికి అధిదేవత భద్రకాళీదేవి. వ - అమతబీజం. దీనికి అధిదేవత చంద్రుడు. 

-----------------------------------------------------------------------

కుమారస్వామి అవతార విశేషాలు వివరిస్తూ రాసిన వ్యాసం

-----------------------------------------------------------------------














Saturday, December 5, 2020

ముక్కోటి ఏకాదశి విశేషాలు, నియమాలు, ఆచరించాల్సిన విధానాలు వివరిస్తూ ఆరాధన మాసపత్రిక డిసెంబరు 2020 సంచికలో రాసిన వ్యాసం

ముక్కోటి ఏకాదశి విశేషాలు, నియమాలు, ఆచరించాల్సిన విధానాలు వివరిస్తూ ఆరాధన మాసపత్రిక డిసెంబరు 2020 సంచికలో రాసిన వ్యాసం











ముక్తిదాయకం... ముక్కోటి ఏకాదశి
ప్రతి తిథీ ప్రత్యేకమే అయినప్పటికీ ఏకాదశికి మరింత ఎక్కువ ప్రత్యేకత కనిపిస్తుంది. ఏకాదశి అనే పేరు తలచుకోగానే ఓ పుణ్యభావన మన మనస్సుల్ని ఆవహిస్తుంది. ఏకాదశి రోజున పని ప్రారంభిస్తే విజయం తథ్యమనే ఆత్మవిశ్వాసం కలుగుతుంది. ఆ రోజున చేసే అర్చనలకు శ్రీ మహావిష్ణువు ప్రీతి చెందుతారని పురాణాలు, ఆచారాలు కూడా విస్పష్టంగా ప్రకటిస్తున్నాయి. అందుకే ఎంత ఒత్తిడిలో ఉన్నా, ఎంత కష్టంలో ఉన్నా ఏకాదశి రోజున సాధ్యమైనంత మేరలో విష్ణుమూర్తిని అర్చించి తరించాలని ప్రతి ఒక్కరూ తపిస్తుంటారు. ఇలా సంవత్సరానికి వచ్చే అన్ని ఏకాదశుల్లో మార్గశిర, పుష్యమాసాల్లో వచ్చే ముక్కోటి ఏకాదశి మరింత పుణ్యప్రదమైనదిగా ప్రసిద్ధి పొందింది.
ప్రతి నెలలో రెండు ఏకాదశులు చొప్పున ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. అధికమాసం ఉంటే మరో రెండు ఏకాదశులు అదనం. ప్రతి ఏకాదశికి నిర్దుష్టమైన నామధేయాలున్నాయి. ఆర్ష సంప్రదాయంలో ఏకాదశి తిథి పరమపవిత్రమైంది. శ్రావణ, కార్తిక, మార్గశిర మాసాల్లోని ఏకాదశులకు మరిన్ని ప్రత్యేకతలు  ఉన్నాయి. వీటిలో ధనుర్మాసంలో వచ్చే శుక్ల ఏకాదశి విశేషమైనది. దీన్నే ముక్కోటి ఏకాదశి పర్వదినంగా జరుపుకోవటం ఆనవాయితీగా ఏర్పడింది. 

ఏకాదశి...విశేషాల రాశి

విష్ణువు 'మురుడు' అనే రాక్షసుడితో యుద్ధం చేస్తూ అలసిపోయి, సింహవతి అనే గుహలో సేదతీరుతున్నాడు. ఆషాఢ శుక్ల ఏకాదశి నుంచి కార్తిక శుక్ల ఏకాదశి వరకు ఆ గుహలోనే యోగనిద్రలో ఉన్నాడు. ఈ విషయాన్ని గ్రహించిన మూరాసురుడు మాయోపాయంతో విష్ణువుపైకి దాడికి సిద్ధమయ్యాడు. అప్పుడు విష్ణువు శరీరం నుంచి యోగమాయ శక్తి రూపంలో వెలువడింది. ఆ మహాశక్తి మురాసురుడ్ని సంహరించింది. విష్ణుమాయా విలాసం నుంచి ఉత్పన్నమైన ఆ శక్తి స్వరూపానికి శ్రీహరి వరాన్ని అనుగ్రహించాడు. విష్ణువుకు ప్రియమైన తిథిగా ఏకాదశి పేరిట ఆ శక్తి రూపం పూజలందుకుంటుందని పేర్కొన్నాడు. ఆనాటి నుంచి ఏకాదశి తిథి పరమ పవిత్రమైనదిగా పరిగణిస్తున్నారని ఏకాదశి తిథి ఆవిర్భావ వత్తాంతాన్ని భవిష్యోత్తర పురాణం వివరించింది.

    సుకేతుడనే రాజు దేవతల ఉపదేశానుసారం ఏకాదశి వ్రతాన్ని ఆచరించి, విష్ణువు అనుగ్రహం వల్ల సంతాన సిద్ధి పొందాడని పద్మపురాణంలో ఉంది. సూర్యవంశ రాజైన రుక్మాంగదుడు ఏకాదశి వ్రతాన్ని తాను ఆచరించడమే కాక, తన రాజ్యంలో అందరిచేత నిర్వహింపజేసి, శ్రీహరికి ప్రియ భక్తుడయ్యాడని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. వైఖానసుడు అనే రాజు పితృదేవతలకు ఉత్తమగతుల్ని అందించడానికి ముక్కోటి ఏకాదశి వ్రతం చేసినట్లు విష్ణుపురాణం వివరిస్తుంది.

ఓ సందర్భంలో బ్రహ్మ, వరుణ, ఇంద్ర, రుద్ర గణాలన్నీ కలిసి అసురశక్తులపై విజయాన్ని సాధించటానికి శ్రీమహావిష్ణువు అనుగ్రహాన్ని ఆకాంక్షించారు. వైకుంఠ ఉత్తరద్వారం నుంచి వైకుంఠంలోకి ముక్కోటి దేవతాసమూహం ప్రవేశించారు. శ్రీహరి దర్శనాన్ని పొంది విష్ణు కరుణకు పాత్రులయ్యారు. సమస్త దేవతలు వైకుంఠ నారాయణుడి దర్శనం పొందిన ఆ మహత్తర సందర్భమే ముక్కోటి ఏకాదశి. 

ఏకాదశి తిథికి 'హరివాసరం' అని పేరు. వైకుంఠ ఏకాదశిని హరి ఏకాదశి, మోక్ష ఏకాదశి, సౌఖ్య ఏకాదశి అని కూడా వ్యవహరిస్తారు. శ్రీమన్నారాయణునికి సూర్యుడు కుడికన్ను కాగా చంద్రుడు ఎడమకన్నుగా ప్రకాశిస్తారు. నేత్రాలు వేరైనా దృష్టి ఒక్కటే. సూర్యచంద్రులు వేర్వేరుగా గోచరమవుతున్నా సమగ్రంలో కాంతి శక్తి ఒక్కటే. విరాట్‌ స్వరూపుడైన విష్ణువు ఎన్నో రూపాల్లో వ్యక్తమవుతున్నా భగవత్‌ చైతన్యం, ఈశ్వర తత్త్వం ఒక్కటే. అసురశక్తుల బారిన పడకుండా ప్రతికూల శక్తుల్ని ధైర్యంగా ఎదుర్కొని, సానుకూల శక్తుల్ని పెంపొందింప జేసుకోవడానికే ముక్కోటి దేవతలు విష్ణువును ఆశ్రయించారు. విష్ణుకృపను సాధించి మనోభీష్టాల్ని నెరవేర్చుకున్నారు. అందుకే ఈ ఏకాదశిని భగవదవలోక దినోత్సవం అని, మోక్షోత్సవమని కూడా పేర్కొంటారు. 

సూర్యుడు ధనూరాశిలోకి ప్రవేశించిన తర్వాత మకరసంక్రమణం వరకు జరిగే 'మార్గళి' మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఉత్తరాయణ పుణ్యకాలానికి (జనవరి 14 నుండి జూలై 16 వరకు) ముందు ముక్కోటి దేవతలతో సమ్మిళితమై ఉన్న విష్ణువును ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తరద్వారం గుండా ఆలయాల్లో దర్శిస్తే సమస్త మనోభీష్టాలు నెరవేరుతాయని విశ్వాసం.

ఏకాదశి నియమావళి

ముక్కోటి ఏకాదశి పర్వదినం వైష్ణవ ఆగమ శాస్త్రప్రకారం ఎంతో విశేషమైనది. తిరుమల శ్రీవారి సన్నిధితో పాటు ప్రముఖ వైష్ణవక్షేత్రాలైన శ్రీరంగంలోని శ్రీరంగనాథ స్వామి ఆలయం, గురువాయురు, భద్రాచల దివ్యక్షేత్రాల్లో ప్రత్యేక పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తారు. భక్తుల దర్శనం కోసం ఉత్సవమూర్తుల్ని సర్వాలంకార యుక్తంగా ఉత్తరద్వారంలో కొలువుదీరుస్తారు. ముక్కోటి పర్వదిన సందర్భంగా ప్రతి వైష్ణవ సన్నిధానం వైకుంఠమై విలసిల్లుతుంది. వేద, వేదాంగ, పద, క్రమ, ఉపనిషత్తుల్ని గానం చేస్తారు. షోడశోపచారాలతో స్వామికి కైంకర్యాలు కొనసాగుతాయి. అలంకార ప్రియుడైన విష్ణుభగవానుడి అవతార స్వరూపాలైన శ్రీరామ, శ్రీకష్ణ, శ్రీవేంకటేశ్వర నసింహ ఆలయాలన్నీ నేత్రానందకరంగా భాసిల్లుతాయి. దశమి నాడు ఏక భుక్తం, ఏకాదశి నాడు ఉపవాసం, ద్వాదశి నాడు అన్నదానం అనేది సంప్రదాయరీత్యా పాటించాల్సిన నియమాలు. 

బ్రహ్మాది దేవతలు స్తుతులు చేస్తుండగా, మంగళధ్వనులు మారుమ్రోగుతుండగా, వేద పండితులు సస్వరంగా మంత్రాలు పఠిస్తుండగా పాలకడలిలో శేషతల్పంపై పవళించిన శ్రీమహావిష్ణువుకు శ్రీమహాలక్ష్మి సేవ చేస్తూ ఉంటుంది. విష్ణువు నాభి నుంచి ఉద్భవించిన పద్మంలో బ్రహ్మ కొలువై ఉండగా స్వామి అనంత పద్మనాభుడిగా తేజరిల్లుతాడు. ఈ వైకుంఠ దివ్య దర్శనాన్ని ప్రతి భక్తుడు సదా తమ హృదయ పీఠంపై నిలుపుకోవాలి, విష్ణుకృపకు పాత్రులు కావాలి. చీకటి నుంచి వెలుగువైపునకు నిత్య చైతన్యంతో పయనించాలి. 

వైష్ణవక్షేత్రాల్లో సందడి

ముక్కోటి రోజున వైష్ణవ దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతుంటాయి. ఆ రోజున ఉత్తరద్వార మార్గంలో స్వామిని దర్శించుకోవాలని భక్తులు ఎంతో ఆరాటపడతారు. ముక్కోటి ఏకాదశినాడు తెల్లవారుజామునుంచే ఆలయాల్లో భక్తులు ఉత్తరద్వార దర్శనం వేచి ఉంటారు. ఈ రోజున వైకుంఠం వాకిళ్లు తెరచుకునే పర్వదినం. ముక్కోటి ఏకాదశినాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. అందువల్లనే ముక్కోటి ఏకాదశి అని దీనికి పేరు. మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన ఈ ఏకాదశి పవిత్రత సంతరించుకున్నందు వల్ల దీనిని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు.

దేవతలు, రాక్షసులు జరిపిన క్షీరసాగర మథనంలో ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. కాలకూట విషాన్ని పరమేశ్వరుడు తన గరళాన బంధించింది ఈ రోజే. మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు భగవద్గీతను ఉపదేశించింది కూడా ముక్కోటి ఏకాదశినాడే అనేది ఒక విశ్వాసం. తిరుమల శ్రీవారి పుష్కరిణిలో ఏడాదికి నాలుగుసార్లు మాత్రమే చక్రస్నానం జరుగుతుంది. ఏడాదిలో ఈ చక్రస్నానాలు జరిగే నాలుగుసార్లు ముల్లోకాల్లో ఉన్న పుణ్యతీర్థాలు స్వామి పుష్కరిణిలో సూక్ష్మరూపంలో ప్రవేశిస్తాయని విశ్వాసం. అనంతపద్మనాభ వ్రతం రోజున, బ్రహ్మోత్సవాలలో చివరిరోజున, వైకుంఠ ఏకాదశి మరునాటి తిథి ద్వాదశి ఉన్న రోజు, రథసప్తమి రోజు స్వామివారికి చక్రస్నానాలు జరుగుతాయి. అందుకే ఈ రోజున ప్రత్యేకించి వైష్ణవ ఆలయాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు.

మనసే విష్ణు నివాసం

విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదు, దేహమే దేవాలయమని శాస్త్రనిర్ణయం. కైవల్యోపనిషత్తు తెలిపినట్లుగా ప్రతి మానవ హృదయగుహలోను పరమాత్మ ప్రకాశిస్తున్నాడు (నిహితం గుహాయాం విభ్రాజతే). అంతదగ్గరలో ఉన్న పరమాత్మను ఉద్దేశించి, ఏకాదశీవ్రతాన్ని నియమంగా ఆచరించాలి. అంటే, ఉపవాసం ద్వారా ఏకాదశ ఇంద్రియాలను నిగ్రహించి, పూజ-జపం-ధ్యానం మొదలైన సాధనల ద్వారా ఆరాధించడమని భావం. పంచజ్ఞానేంద్రియాలు (కళ్ళు, చెవులు, మొదలైనవి) పంచ కర్మేంద్రియాలు (కాళ్ళు, చేతులు మొదలైనవి), మనస్సు అనే పదకొండు ఇంద్రియాల ద్వారానే మనం పాపాలు చేస్తాం. ఆ పదకొండే అజ్ఞానానికి స్థానం. అందుకే పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుణ్ని జ్ఞానప్రదాయిని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు. అందుకే ఏకాదశీవ్రతాన్ని నిష్ఠగా ఆచరించినవారు జ్ఞానవంతులవుతారు. ముక్కోటి ఏకాదశి అందించే సందేశం ఇది.

--------------------
రచనః డాక్టర్‌ కప్పగంతు రామకృష్ణ, ఆంధ్రోపన్యాసకులు, ఎస్‌.ఆర్‌.ఎస్‌.వి.కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, గాంధీనగర్‌, విజయవాడ -3, సెల్‌: 90320 44115 / 8897 547 548


పున్నమి కాంతుల కల్యాణం (ఒంటిమిట్టలో జరిగే శ్రీ సీతారామ కల్యాణం నేపథ్యంగా శ్రీకనకదుర్గ ప్రభ పత్రికలో రాసిన వ్యాసం)

  పున్నమి కాంతుల కల్యాణం                లోకంలో పెళ్ళి ముచ్చట అంటే సీతారాములదే. అందులోనూ ఒంటిమిట్ట ఆలయంలో జరిగే సీతారాముల కల్యాణం మరింత శ...