Sunday, January 31, 2021

శుచి శుభ్రత అంటే ఏమిటి? శుచిగా ఎందుకు ఉండాలి? మడి అంటే ఏమిటి?







శుచి - శుభ్రత 

పరమాత్మ పాదసన్నిధి చేరుకోవటానికి మంత్ర తంత్ర సాధనలు, అర్చనలతో పాటు శుచిత్వం కూడా ఎంతో అవసరం. శుచి శుభ్రత లేని చోట దేవుడు ఉండడు. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవటం మాత్రమే శుచిత్వం కాదు. అదొక భాగం మాత్రమే. శరీరంతో పాటు మనస్సు కూడా ఎంతో శుచిగా ఉండాలి. అప్పుడు మాత్రమే పూర్తి శుచిత్యాన్ని సాధించినట్లవుతుంది. శుచిగా ఉండటం గొప్ప అలంకారం కాదు.  ఆడంబరం కాదు. ఆచారం అంతకన్నా కాదు. శుభ్రత మనిషి నడతను, నడవడికను తీర్చిదిద్దుతుంది.  అదొక సంస్కారం.
 అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతోపి వా |
యస్మరేత్పుండరీకాక్షం సబాహ్యాభ్యంత శ్శుచిః ||
 రోజూ వారీ పూజా కార్యక్రమాలన్నీ ఈ శ్లోకంతోనే ప్రారంభమవుతాయి. భగవంతుడిని ఆరాధించటానికి ముందు మనిషి పవిత్రుడు కావాలి. అంటే పూర్తి శుచిత్వాన్ని సాధించాలి. అలా శుచిగా ఉన్న వ్యక్తి చేసే ఆరాధనను మాత్రమే పరమాత్మ స్వీకరిస్తాడు. భౌతిక శరీరంతో పాటు మానసికంగా కూడా మనిషి శుచిగా ఉండి భగవంతుడి అనుగ్రహానికి సాధన ప్రారంభించాలి.

 భగవద్గీతలోనూ 'శుచి' ప్రస్తావన

 శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో అనేక చోట్ల శుచిగా ఉండాల్సిన అవసరం గురించి చెబుతాడు. శుచిత్వం తనకు ఇష్టమైన భక్తుల్లో ఒకటని భగవానుడే స్వయంగా చెబుతాడు. శారీరక తపస్సే శుచిత్వం అవుతుందని మరొకచోట వివరిస్తాడు. మనిషి తాను చేసే పనులన్నిటిలో ధర్మమార్గాన్నిపాటించటం శుచిత్వం అవుతుందని ఇంకోచోట చెబుతాడు.

తేజః క్షమా ధృతిశ్శాచమ్ అద్రోహో నాతిమానితా

భవన్తి సంపదం దైవీమ్ అభిజాతస్యభారత ||

 దేవతల లక్షణాలు చెబుతూ శుచిత్వాన్ని కూడా ఆ లక్షణాల్లో ఒకటిగా చెప్పాడు కృష్ణపరమాత్మ. అలాగే, దైవాసుర సంపద్విభాగయోగంలో 

ప్రవృత్తించ నివృత్తించ జనా నవిదురా సురాః |

న శౌచం నాపిచాచారో న సత్యం తేషు విద్యతే ||

 రాక్షస ప్రవృత్తి కలిగిన వారికి శుచిత్వం ఉండదని చెబుతాడు. అంటే, శుచిగా ఉండటం మనిషికి దైవత్వాన్ని కలిగిస్తుంది. శుచిగా ఉన్న శరీరం శుచిగా ఉండే (ఉత్తమమైన) ఆలోచనలు కలిగిస్తుంది ఎప్పుడైతే మనస్సు మంచి ఆలోచనలు చేస్తుందో, ఆప్పుడు ఆ మనసు ధర్మాన్ని విడిచి పెట్టదు. అంతిమంగా మనిషి భగవంతుడి అనుగ్రహాన్ని పొందుతాడు

 * ఆదిశంకరాచార్యులు భక్తి మార్గాన్ని బోధిస్తూనే భక్తికి, తపస్సుకు, ఆధ్యాత్మిక సాధనకు తప్పనిసరిగా శుచిగా ఉండాలని చెప్పారు.

 బాహ్యమాభ్యస్తరం చేతి ద్వివిధం శౌచముచ్యతే

మజ్జలాభ్యాంకృతం శౌచం బాహ్యం శారీరికం స్మృతమ్

అజ్ఞాన దూరీకరణం మానసం శౌచమాన్తరమ్

అన్తస్థితో భవేత్సమ్యక్ బాహ్యంనావశ్యకం నృజామ్ ||

 శుచిత్వం బాహ్యం, అంతరికం అని రెండు రకాలుగా ఉంటుంది. నిత్యం చేసే స్నానం బాహ్యశౌచాన్ని కలిగిస్తుంది. మనసులో ఉండే అజ్ఞానాన్ని సాధన ద్వారా దూరం చేసుకోవటం ఆంతరిక శౌచం అవుతుంది. బాహ్యశౌచం కన్నా ఆంతరిక శౌచం చాలా అవసరం. మనస్సు స్వచ్చంగా (శుచిగా) లేకపోతే, బాహ్యశౌచం ఏవిధమైన ఫలితాన్ని ఇవ్వదు.

 బలమాయుష్యమారోగ్యం సంతోషః స్వాస్థ్యమానసం |

శుచిత్వే లభతే తస్మాత్ శుచిత్వం ఆశ్రయేత్ నరః ||

 బలం, ఆయుష్షు, ఆరోగ్యం, సంతోషం, ఆరోగ్యవంతమైన మనస్సు... ఇవన్నీ శుచిత్వం వల్లనే లభిస్తాయని శాస్త్రాలు ఘంటాపథంగా చెబుతున్నాయి.

 ఐదురకాల శౌచాలు

 కొన్ని శాస్త్ర గ్రంథాలు శౌచం (శుచి) ఐదు రకాలుగా ఉంటుందని చెబుతున్నాయి. వీటి ప్రకారం... మనశ్శాచం : మనసులో రాగద్వేషాలకు తావు లేకుండా చెయ్యటం మనశ్శెచం అవుతుంది కర్మశాచం : కపటం లేకుండా, ధర్మాన్ని పాటిస్తూ నిత్యవిధులను నిష్కామంగా చేస్తూ జీవించటం కర్మశౌచం అవుతుంది

 కులశాచం : నీచమైన పనులకు దిగజారకుండా, సదాచారాన్ని పాటిస్తూ స్థిరంగా ఉండటం కులశాచం అవుతుంది

 శరీరశౌచం : స్నానం తదితర క్రియల ద్వారా శరీరాన్ని శుభ్రంగా ఉంచటం శరీరశౌచం అవుతుంది

 వాక్ శౌచం : అనుక్షణం సత్యాన్ని మాత్రమే పలకటం వాక్శౌచం అవుతుంది

 మడి కట్టుకోవటమంటే.. 

మడికట్టుకోవటం అంటే అదేదో ఘనకార్యం అనుకోవాల్సిన పనిలేదు. మడి అంటే పరిశుభ్రమైన వస్త్రాలు ధరించటం. పూజ చేయాలనుకున్నప్పుడు ముందుగానే అందుకు తగిన పరిశుభ్రమైన వస్త్రాలు ఏర్పాటుచేసుకోవాలి. వాటిని ధరించి మాత్రమే పూజ చెయ్యాలి. ఇదే మడి అంటే.పూజలు చేసే సందర్భంలో 'మడికి ఎంతో ప్రాధాన్యత ఉంది. మడివస్త్రాలు కట్టుకున్న తర్వాత ఎవరినీ ముట్టుకోకూడదు. పూజా సంబంధం కానీ ఏ వస్తువునీ తాకకూడదు అంటూ... ఇంకా ఎన్నో నియమాలు చెబుతారు పెద్దలు. ఇదంతా చాదస్తం అనిపిస్తుంది నేటి తరానికి, కానీ, 'మడి' ఆచారం వెనుక మహత్తరమైన సందేశం దాగి ఉంది. మనం ధరించే వస్త్రాల రంగు, తీరు మన మనస్సుపై స్పష్టమైన ప్రభావాన్ని చూపిస్తాయి. నిర్మలైన వర్ణాలు మనసుకు ఆహ్లాదాన్ని చేకూరుస్తాయి. ఈ కారణంగానే మడివస్త్రాలుగా కేవలం తెల్లని వస్త్రాలు లేదా అతి తేలిక వర్గాలు కలిగిన వస్త్రాలను వినియోగిస్తారు. ఆధ్యాత్మిక సాధనలో తొలి సోపానమైన బాహ్యశుచిత్వాన్ని పొందటానికి చేసే ప్రయత్నమే ఇదంతా. ఎప్పుడైతే మనసు స్వచ్ఛంగా, హాయిగా ఉందో. అప్పుడు మనస్సు పూర్తిగా భగవంతుడి మీద కేంద్రీకృతం అవుతుంది. మనసులోని కళ్ళతో మాధవుడిని చూసేందుకు చేసే ప్రయత్నమే మడి.

 పురాణాల్లోనూ ప్రాధాన్యత

శుచిత్వానికి ఇంతటి ప్రాధాన్యత రావటానికి వెనుక పురాణగాథ ఉంది. కశ్యప ప్రజాపతికి దితి అదితి ఇద్దరు భార్యలు, దితి కుమారులు దైత్యులు - అంటే రాక్షసులు. అదితి కుమారులు ఆదిత్యులు అంటే దేవతలు, వారిద్దరి వైరం గురించి తెలిసిందే. దేవతల చేతిలో రాక్షసులు హతం కావటాన్ని చూసి తట్టుకోలేని దితి, ఇంద్రుడి సంహరించే శక్తి కలిగిన కుమారుడు తనకు జన్మించాలని భర్త అయిన కశ్యపుడిని కోరుతుంది. ఆయన 'సరే' అని వరమిస్తాడు. కానీ, ప్రసవం అయ్యేవరకు శుబిత్వాన్ని అన్నివేళలా పాటించితీరాలని, లేకపోతే గర్భం భిన్నమవుతుందని నియమం పెడతాడు. దితి అంగీకరిస్తుంది. శుభముహూర్తంలో దితి గర్భం దాలుస్తుంది. విషయం తెలుసుకున్న ఇంద్రుడు పినతల్లి అయిన దితి దగ్గరకు మంచి మాటలు చెప్పి, ఆమెకు సేవ చేసే అవకాశం ఇవ్వమని అడుగుతాడు. ఆమె అంగీకరిస్తుంది. ఇంద్రుడు అన్నిరకాలుగా సపర్యలు చేస్తుంటాడు. ఒకరోజున సాయం సంధ్యా సమయంలో పొరపాటున దితి శౌచాన్ని మరిచి, కాళ్లు చేతులు కడుక్కోకుండానే పడకగదిలోకి వెళ్లి, అలసట కారణంగా నిద్రలోకి జారుకుంటుంది. దితికి నియమభంగం కాగానే ఇంద్రుడు అణురూపంలో దితి గర్భంలోకి ప్రవేశించి, శిశువును నరకటం ప్రారంభిస్తాడు. వెంటనే దితికి మెలకువ వస్తుంది. తన బిడ్డను వధించవద్దని, తన బిడ్డ దేవతలకు అనుకూలంగా ఉంటాడని ఇంద్రుడిని వేడుకుంటుంది. అతడు అంగీకరించి, బయటకు వచ్చి, తన వల్ల ముక్కలైన శిశువు మరణించకుండా, ఎన్ని ముక్కలైందో అందరు పుత్రులు పుడతారని చెబుతాడు. అలా ఏర్పడ్డ శిశువులే దేవతాగణాల్లో ఒకటైన 'మరుద్గణం'. ఈ వృత్తాంతం జరిగనప్పటి నుంచి సంధ్యాసమయంలో తప్పనిసరిగా శుచిగా ఉండాలని, నిద్రించకూడదనే' ఆచారం వాడుకలోకి వచ్చింది. శుచిత్వానికి ఉన్న ప్రాధాన్యత ఇంత గొప్పది.

 శుచిత్వానికి ఎంత శక్తి ఉందో తెలిపే కథ భారతంలో ఉంది. ఉదంకుడు పౌష్యదేవి కుండలాలు తీసుకురావటానికి నాగలోకానికి వెళ్తాడు. కొంత కథ నడచిన తర్వాత, ఉదంకుడికి పొష్యదేవి కనిపించదు, ఎంత ఆలోచించినా కారణం తెలియటం లేదు. అప్పుడు నాగరాజు

 భూవినుత నిన్ను త్రిభువన

పావను నశుచివని యెట్లు పలుకగ నగు న

ద్దేవి పవిత్ర పతివ్రత

గావున నశుచులకు గానగాదనవద్యా

 శుచిత్వం లేని వాళ్లకి (ఆశుచిగా ఉంటే) పౌష్యదేవి కనిపించదయ్యా అంటాడు. ఉదంకుడు విషయం తెలుసుకుంటాడు. శుచిగా మారుతాడు. తర్వాత కథ నడుస్తుంది. తపశ్శక్తి సంపన్నుడైనప్పటికీ శుచిత్వం లేని కారణంగా ఉదంకుడు పౌష్యదేవిని దర్శించలేకపోతాడు. శుచిత్వానికి ఉన్న శక్తి అంత గొప్పది. అందుకే దేవాలయాలకు వెళ్లేటప్పుడు శుచిగా, పరిశుభ్రమైన వస్త్రాలు ధరించాలని, దేవుని సన్నిధిలో ఉండగా మనసులోకి ఇతర ఆలోచనలు రానివ్వకూడదని, వ్యర్ధప్రసంగాలు చెయ్యకూడదని పెద్దలు చెబుతారు.

 --------------

రచన: డాక్టర్ కప్పగంతు రామకృష్ణ, ఆంధ్రోపన్యాసకులు, విజయవాడ. 

Cell: 90320 44115 / 8897 547 548

--------------------------

భక్తి పత్రిక ఫిబ్రవరి 2021 సంచికలో రాసిన వ్యాసం





No comments:

పున్నమి కాంతుల కల్యాణం (ఒంటిమిట్టలో జరిగే శ్రీ సీతారామ కల్యాణం నేపథ్యంగా శ్రీకనకదుర్గ ప్రభ పత్రికలో రాసిన వ్యాసం)

  పున్నమి కాంతుల కల్యాణం                లోకంలో పెళ్ళి ముచ్చట అంటే సీతారాములదే. అందులోనూ ఒంటిమిట్ట ఆలయంలో జరిగే సీతారాముల కల్యాణం మరింత శ...