Thursday, February 3, 2022

దాసశిఖామణి పురందరదాసు

దాస శిఖామణి పురందరదాసు
ఫిబ్రవరి 1, 2022 పురందరదాసు ఆరాధన సందర్భంగా ప్రత్యేక వ్యాసం



దాస శిఖామణి పురందరదాసు

          భక్తి ఉద్యమంలో దాస సాహిత్యాన్ని పతాకస్థాయికి తీసుకువెళ్ళిన వాగ్గేయకార శిఖామణి పురందరదాసు. భావ, రాగ, లయల ఉత్తమ సమ్మేళనంగా స్వరావళి, జంటస్వరాలు, అలంకారాలు, లక్షణగీతాలు, ప్రబంధాలు, దాటువరుసలు మొదలైనవెన్నో రచించి మొత్తం కర్ణాటక సంగీత రంగంలోనే నూతన శకానికి ఊపిరిపోసాడు. సనాతన సంగీత సంప్రదాయ పునాదుల అధునాతన స్వర సౌధాలు నిర్మించి ‘కర్ణాటక సంగీత పితామహుడు’గా చిరకీర్తిని పొందాడు.

          పురందరుడి అసలు పేరు శ్రీనివాస నాయక్. మహారాష్ట్ర సమీపంలోని పురందరగడ్ అనే గ్రామంలో జన్మించాడు. పుట్టుకతోనే అత్యంత ధనవంతుడు. పరమ పిసినారి కూడా. విజయనగర సామాజ్ర పరిధిలో ఈ గ్రామం ఉండేది. పూర్వికుల నుంచి వచ్చిన వజ్రాలు, వడ్డీ వ్యాపారాల్లో ఆరితేరి నవకోటి నారాయణుడు అనే పేరుతో ప్రసిద్ధి పొందాడు. పురందరుడి భార్య సరస్వతీబాయి. పరమ భక్తురాలు.  గొప్ప దయాగుణం కలిగిన మనిషి అయినప్పటికీ భర్త కారణంగా ఏ దానం చెయ్యలేకపోయేది. ఇంతటి పరమలోభి సర్వసంగ పరిత్యాగి కావటం వెనుక పరమాత్మ సంకల్పం ఉండనే ఉంది.

          ఓ ముసలి బ్రాహ్మణుడు తన కుమారుడి ఉపనయనం కోసం ధన సహాయం చెయ్యమంటూ శ్రీనివాసుడి దగ్గరకు వస్తాడు. ఇవాళ, రేపు అంటూ నెలల తరబడి తిప్పుతాడు కానీ అతడు చిల్లిగవ్వ కూడా ఇవ్వడు. విసిగిపోయిన ఆ బ్రాహ్మణుడు సరస్వతీ బాయిని కలిసి వివరాలు చెబుతాడు. ఆమె తన నిస్సహాయ స్థితిని అతడికి చెప్పి, తన ముక్కెర ఇచ్చి పంపిస్తుంది. బ్రాహ్మణుడు ఆ ముక్కెరను శ్రీనివాస నాయక్ దగ్గర తాకట్టు పెట్టడానికి వెళ్తాడు. అనుమానం వచ్చిన అతడు భార్యను నిలదీస్తాడు. విఠలుడి మాయతో ముక్కెర భార్య దగ్గరే ఉంటుంది. జరిగినదంతా తెలుసుకున్న శ్రీనివాసుడికి జ్ఞానోదయం అవుతుంది. తనలో మార్పు తీసుకురావటానికే విఠలుడు ముసలి బ్రాహ్మణుడి రూపంలో నాటకం ఆడాడని తెలుసుకుంటాడు.

          అప్పట్నుంచీ శ్రీహరికి పరమ భక్తుడయ్యాడు. నవకోటి నారాయణుడు నారాయణ భక్తుడయ్యాడు. బంగారువజ్రాల నగల అలంకరణతో మెరిసిపోయిన చేతులు తంబురాను పట్టుకున్నాయి. మేలిమి బంగారు హారాలతో నిండిపోయిన మెడలో ఇప్పుడు తులసి మాలలు దర్శనమిస్తున్నాయి. దేహీ అంటూ వచ్చిన యాచకులను తిప్పి పంపిన తాను ఇప్పుడు ఉదర పోషణార్థం భిక్షమెత్తుతున్నాడు. నలుగురితో పాటు జన్మించి నలుగురితో పాటు మట్టిలో కలిసిపోవాల్సిన శ్రీనివాస నాయక్ పురందరదాసు అయ్యాడు. పుట్టిన కొన్ని శతాబ్దాల తర్వాత కూడా తన కీర్తనల ద్వారా ప్రజల నాలుకలపై నాట్యమాడుతూ ఉన్నాడు. పరసవేది స్పర్శతో రాయి కూడా బంగారమైనట్లు పరమ లోభి కూడా ఆ భగవంతుని కృపతో హరిదాసులకు ఆది గురువయ్యాడు.

          శ్రీ కృష్ణదేవరాయల గురువైన వ్యాసరాయల్ని ఆశ్రయించి పురందరదాసు అనే దీక్షానామంతో ప్రసిద్ధి పొందాడు శ్రీనివాసుడు. అప్పట్నించీ హరినామం తప్ప మరొక ధ్యాస, శ్వాస ఆయనకు లేవు. శ్రీహరి నామాలు పాడుకుంటూ సంచార జీవితం గడపసాగాడు. వేద, శాస్త్ర, పురాణ, కావ్య, ప్రబంధ విజ్ఞానం మొత్తాన్ని తన పదాల్లో నిక్షిప్తం చేసేవాడు. సామాన్యులే లక్ష్యంగా చేసుకుని వారికి అర్థమయ్యేలా తేలికైన పదాలతో రచనలు చేసాడు. దీంతో అతి స్వల్పకాలంలోనే పురందరుడి పేరు మార్మోగిపోయింది. ఎవరి నోట విన్నా పురందరుడి గీతమే వినిపించింది. ఈ పదాలన్నీ కలిసి ‘పురందరోపనిషత్’ గా మారాయి. గురువు వ్యాసరాయలు కూడా ‘దాసరందరే పురందరదాసరయ్య’ – దాసుడంటే పురందర దాసేనయ్యా... అంటూ శిష్యభక్తికి ఉప్పొంగిపోయాడు.

          పురందరుడి పదాల్లో నవవిధ భక్తులు, ఐదు పరమభావాలు ఉన్నాయి. రాధాకృష్ణుల భాగవతభక్తి ఇతడి పదాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. బాలకృష్ణుడు వెన్నను దొంగిలించటం, గోపికలు యశోదతో మొరపెట్టుకోవటం, కన్నయ్య గోపికలతో విహరించటం వంటి లీలల్ని పురందరుడు తన పదాల్లో చక్కగా వర్ణించాడు. భక్తి, జ్ఞాన, వైరాగ్య మార్గాల్లోనూ అతడి రచనలు సాగాయి.

          భక్తికి ఆడంబరాలు అవసరం లేదంటాడు పురందరుడు. స్నాన, జప, తపాలు దృఢమైన విశ్వాసం కలిగిన భక్తులకు అవసరం లేదంటాడు. అప్పట్లో ఆచారాల పేరుతో జరిగే అనాచారాల్ని నిర్మొహమాటంగా ఖండించాడు. వైరాగ్యానికి మార్గం చూపాడు. ఇవన్నీ అతడి రచనల్లో స్పష్టంగా కనిపిస్తాయి.

          పురందరుడు కర్ణాటక సంగీతంలో లెక్కలేనన్ని ప్రయోగాలు, పరిశోధనలు చేసాడు. మాయామాళవ గౌళ రాగాన్ని సృష్టించాడు. నూతన సంగీత అభ్యాసకులకు ఈ రాగం ఒక వరంగా మారింది. అన్నిరకాల గాత్రభేదాలు కలిగినవారూ తేలికగా పాడుకోగలిగిన రాగం ఇది. సాధారణంగా సంగీత గురువులు శిష్యులకు మొదటగా ఈ రాగమే నేర్పుతారు. దీంతో సాధకుడికి తానూ కీర్తన పాడగలనన్న ఆత్మవిశ్వాసం కలుగుతుంది. ప్రారంభదశ అభ్యాసకులకు వీలుగా ఉండటానికి సరళి, జంట స్వరాల వరుసలూ, అలంకారాలు, విళ్ళారి గీతాలు, ఘనరాగ గీతాలు, ప్రబంధాలూ రచించాడు. ఎన్నో వేల సంవత్సరాల తర్వాత కర్ణాటక సంగీతం అప్రహతిహతంగా వెలుగుతుండటానికి పురందరాసు మాత్రమే కారణం అని విమర్శకులు కూడా అంగీకరిస్తారు.

          పురందరుడు రాసిన కీర్తనల్ని ‘దాసరపదగళు’, ‘దేవరనామ’ అనీ వ్యవహరిస్తారు. మాంజి భైరవి, ద్విజావంతి, శ్యామకల్యాణి, మారవి, మధూ, మాధవి, వసంతభైరవి వంటి అపూర్వ రాగాల్లో ఈయన చేసిన రచనలు, చేసిన ప్రయోగాలు సంగీతరంగంలో సంచలనం సృష్టించాయి.

          హంపీ చేరి ఒక మండపం లో ఉంటూ చివరి జీవితాన్ని గడిపాడు. దీన్ని ఇప్పటికీ పురందర మండపంగా పిలుస్తారు. దాదాపు 4,75,000  కీర్తనలు రాసి సంగీత ప్రపంచంలో మరెవ్వరూ సాధించలేనంత ఎత్తుకు ఎదిగాడు.  మిగిలిన 25 వేల కీర్తనలూ రాసి తాను  అనుకొన్న 5 లక్షల కీర్తనలు పూర్తి చేయమని చిన్న  కొడుకు మధ్వపతిని  కోరాడు. తాను  ఈ జన్మలో అంతటి పని చేయలేనని మరోజన్మలో రాసి తండ్రి కోరిక తీరుస్తానని అన్నాడు  మధ్వపతి. అతడే తర్వాతికాలంలో కర్ణాటక, రాయపూర్ జిల్లా చీకలపర్వి లో ‘’విజయదాసు ‘’గా జన్మించి తండ్రికి చేసిన వాగ్దానం ప్రకారం 25 వేల  కీర్తనలు శ్రీ లక్ష్మీ నారాయణస్వామిపై రచించాడు. త్యాగరాజ స్వామి తన ‘ప్రహ్లాద భక్త విజయం గేయ నాటకం లో పురందర దాసును ప్రస్తుతించారు. జీవితం చివరిదశలో సన్యాసాశ్రమం స్వీకరించి రక్తాక్షి నామ సంవత్సరం (క్రీ.శ 1564, జనవరి 2) పుష్య అమావాస్య రోజున సిద్ధిపొందారు.

---------------------------------------------------------

రచన : డాక్టర్ కప్పగంతు రామకృష్ణ, సెల్ : 9032044115 / 8897 547 548








         

 


 

Wednesday, February 2, 2022

’పౌరాణిక సార్వభౌమ‘ శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు


‘పౌరాణిక సార్వభౌమ’ శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు 



పౌరాణిక సార్వభౌమ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు

(దర్శనమ్ ఆధ్యాత్మిక మాస పత్రిక ఫిబ్రవరి 2022 సంచికలో శ్రీ శాస్త్రి గారిని స్మరిస్తూ రాసిన వ్యాసం)

అది కంచు కంఠం కాదు... సనాతన ధర్మస్థాపనకు మోగిన శంఖారావం.

అది పురాణ ప్రవచనం కాదు...  ఆర్ష విజ్ఞానానికి పట్టిన దివిటీ

పంచాంగ పఠనమైనా, పురాతన సాహిత్యమైనా... ఆ కంఠంలో వినిపిస్తేనే వాటికి సార్థకత.

ఆ మాట నుంచి వినిపిస్తేనే ధర్మసందేహం తీరినట్లవుతుంది.

ఆ గొంతు సవరిస్తేనే సీతారాముల కల్యాణం వినముచ్చట అవుతుంది.

ఆ పలుకులు పలికితేనే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శోభ మరింత రామణీయకత చేకూరుతుంది.

ఒకటా, రెండా, పదులా, వేలా.... ఆ గొంతు చెయ్యని విన్యాసం లేదు. చెప్పని ధర్మం లేదు. పలకని సాహిత్యం లేదు.

ఏడుదశాబ్దాలకు పైబడి పురాణ ప్రవచన రంగాన్ని శాసించిన ఆ రారాజు ‘పౌరాణిక సార్వభౌమ’ బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు.

----------------------------

          ఆంధ్ర (అవిభక్త) దేశంలో పురాణ ప్రవచన రంగానికి ఊపిరి పోసి, పెంచి పోషించి, శాఖోపశాఖలుగా విస్తరింపజేసి, తనదైన ముద్ర శతాబ్దాల తరబడి నిలిచేలా చేసిన ఒకే ఒక్క ప్రవచనకర్త శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు. ఇప్పటికైనా, మరెప్పటికైనా పురాణ ప్రవచనం చెప్పేవారు, చెప్పదలచుకున్న ఆ బాణీలోకి తొంగిచూడాల్సిందే. ఆ వెలుగు నీడలో తమ మార్గంలో సాగిపోవాల్సిందే. పురాణం అనగానే మల్లాది వారు అనేంతగా పురాణ ప్రవచన ధర్మాన్ని తన రక్తంలో జీర్ణింపజేసుకున్న పుణ్యపురుషుడు  శ్రీ శాస్త్రి గారు.

గుంటూరు సీమ కన్నబిడ్డ

          గుంటూరు జిల్లా, సత్తెనపల్లి తాలూకా, గోరంట్ల అగ్రహారంలో శాస్త్రి గారు 1925 ఆగస్టు 28వ తేదీన (తెల్లవారితే వినాయక చవితి) జన్మించారు. తల్లిదండ్రులు శ్రీమతి ఆదిలక్ష్మమ్మ, శ్రీ దక్షిణామూర్తి శాస్త్రి. అప్పట్లో హైదరాబాద్ సంస్థానాధీశుడైన కిషన్ ప్రసాద్ గారి వద్ద పెద్ద ఉద్యోగి అయిన మల్లాది లక్ష్మీనారాయణ, సుందరీబాయి దంపతులకు పిల్లలు లేకపోవడంతో శాస్త్రి గారి తాతగారు రామకృష్ణ చయనులవారిని దత్తత తీసుకున్నారు. చయనులు గారు పదిభాషలలో అనర్గళంగా మాట్లాడేవారు. ముహూర్తాలు పెట్టడం నుంచి శ్రౌత, స్మార్త, తర్క, మీమాంస, వేదాంతం వరకూ ప్రతి ఒక్క శాస్త్రమూ ఆయనకు కొట్టిన పిండి. పరమ నైష్ఠికుడు. ఆచార వ్యవహారాల విషయంలో చాలా నిక్కచ్చిగా ఉండేవారు.

          ఆయనకున్న ముగ్గురు మగ సంతానంలో శాస్త్రి గారి తండ్రి గారైన దక్షిణామూర్తి గారు మధ్యలోనివారు. వీరందరి సంతానంలో చంద్రశేఖర శాస్త్రిగారు పెద్దవారు. అందువల్ల పెద్దమనుమడు అనే కోణంలో రామకృష్ణ చయనులు గారికి శాస్త్రిగారంటే బాగా ప్రేమ ఉండేది. శాస్త్రిగారు నాలుగు నెలల వాడిగా ఉన్నప్పుడే తాతగారు తనవెంట పెద్ద మనుమడిని తీసుకొచ్చుకున్నారు. నాయనమ్మ కృష్ణవేణి సోమిదమ్మ గారు వారిని పెంచారు. తాతగారే శాస్త్రిగారికి ఉపనయనం చేసి, తర్క ప్రకరణాలు, శ్రౌతస్మార్తాలు నేర్పించారు.

          శాస్త్రి గారి తండ్రిగారైన దక్షిణామూర్తి శాస్త్రి పుష్పగిరి ఆస్థాన పండితులుగా ఉండేవారు. ఆయన వద్ద శాస్త్రి గారు ఆర్ష సంప్రదాయం, పెదతండ్రి వీరరాఘవశాస్త్రి గారి వద్ద తర్కవేదాంతాలు, పినతండ్రి హరి శంకరశాస్త్రిగారి వద్ద వేదాధ్యయనం చేసారు. కంభంపాటి రామ్మూర్తి శాస్త్రిగారి వద్ద పూర్వమీమాంస, వ్యాకరణం నేర్చుకున్నారు. తెలుగు మాత్రం వీధిబడిలో చదువుకున్నారు. పురాణాలతో పాటు జంధ్యాల పాపయ్యశాస్త్రి, గొట్టిముక్కల, ధూళిపాళ వంటి వారి పద్యకావ్యాలు, గుర్రం జాషువా గబ్బిలం, ఫిరదౌసి వంటి ఖండకావ్యాలు చదివారు.

          తాతగారైన రామకృష్ణ చయనులు గారికి శాస్త్రిగారు పురాణ ప్రవచనం చెప్పాలని, గొప్ప ప్రవచనకర్తగా పేరు తెచ్చుకోవాలని కోరికగా ఉండేది. ఇంగ్లిషు చదువులు చదివితే, ఉద్యోగం చేస్తారేమోనని శాస్త్రిగారు  ఏ పరీక్షలు రాయ నివ్వకుండా జాగ్రత్తపడ్డారు. అయితే  శాస్త్రిగారికి మాత్రం పురాణాలు చెప్పడం ఇష్టం ఉండేది కాదు. అది గ్రహించిన తాత గారు మనవడిని దగ్గర కూర్చోబెట్టుకుని ‘‘చూడు నాయనా, పురాణ ప్రవచనం చెప్పాలంటే సంస్కృత వాఙ్ఞ్మయం తెలిసి ఉండాలి. నిశిత పరిశీలన కావాలి. అన్వయం చెప్పగలిగి ఉండాలి. వేదాంతం, తర్కం, ఛందస్సు తెలిసుండాలి. కాబట్టి దీన్ని అంత తేలికగా తీసేయకు’’ అంటూ నచ్చజెప్పేవారు. పురాణ ప్రవచనం ఎంత గొప్పదో వివరించేవారు.

          శాస్త్రిగారి పదిహేడవ యేట తాతగారు కాలం చేశారు. ఆయన దూరమైనా ఆయన సంకల్పం మాత్రం ఎప్పుడూ శాస్త్రిగారిని విడిచిపోలేదు. అమరావతిలో వారి ఎదురింట్లో ఉండే జాగర్లమూడి రామశాస్త్రిగారికి కంటిలో శుక్లాలు వచ్చి చూపు తగ్గిపోవడంతో శాస్త్రిగారిని పిలిచి రోజూ సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు పద్యాలు చదివించుకుని వినేవారు. అదే ఊరిలో గోళ్లమూడి ప్రసాదరావుగారనే వైద్యుడు రోజూ సాయంకాలం సైకిల్ మీద రోగులను చూడటానికి వెళ్తుండేవాడు. ఆయన అలా వెళ్తూ వస్తూ ఉన్నప్పుడు శాస్త్రిగారిని పద్యాలు వినేవాడు.

          ఓరోజు ఆయన శాస్త్రిగారి దగ్గరకొచ్చి, ‘‘మీరు పద్యాలు చదువుతున్న తీరు బాగుంది. నేను ఒంటరిగా ఉన్నాను. ఏమీ తోచడం లేదు. కాబట్టి మా ఇంటికొచ్చి పద్యాలు చదివి పెట్టండి’’ అని అడిగాడు. శాస్త్రిగారు కూడా మొహమాటం కొద్దీ కాదనలేక ఆయన ఇంటికెళ్లారు. ఆయన ఎప్పటి నుంచో అటకమీద దుమ్ముపట్టి ఉన్న భాస్కర రామాయణాన్ని తీసి శాస్త్రిగారి చేతికిచ్చాడు. ఖంగుమని మోగే కంఠంతో శాస్త్రిగారు భాస్కర రామాయణం పద్యాలు చదువుతుంటే ‘‘మీరలా పద్యాలు చదివితే నాకెలా తెలుస్తుంది, వాటికి అర్థం తెలిస్తే కదా ఆనందించగలిగేది’’ అన్నాడు. దాంతో  తోచిన రీతిలో అర్థాలు చెబుతూ పద్యాలను చదివి వినిపించేవారు శాస్త్రిగారు.

          అలా సాగుతున్న పద్యశ్రవణం కాస్తా గ్రామస్థుల చెవిన పడడంతో ఊరిలోనివాళ్లు కొందరు డాక్టరు గారి దగ్గర కొచ్చి ‘‘ఇదేదో సాయంత్రం పూట పెట్టుకుంటే మేము కూడా వచ్చి వింటాం కదా’’ అన్నారు. దాంతో డాక్టరు గారు తమ ఇంటి వసారాను కడిగించి పురాణ ప్రవచనం జరిగే విధంగా పీఠం, ఫొటో, పుస్తకం పెట్టారు. శాస్త్రిగారు కూడా చొక్కావిప్పి, ఉత్తరీయం ధరించి విభూతి రేఖలు దిద్దుకుని అచ్చం పౌరాణిక ప్రవచకుడిలా తయారై ఆ సాయంత్రం భాస్కరరామాయణాన్ని గ్రామస్థుల ముందు చెప్పారు. ఈవిధంగా దాదాపు నెల రోజులకు పైగా జరిగింది. ఊరిలో శాస్త్రి గారికి మంచి పేరొచ్చింది. తాను పురాణ ప్రవచనాలు చెప్పాలని తాతగారు ఎందుకు కలలు కనేవారో శాస్త్రిగారికి అప్పుడు అర్థమైంది.

          కొన్నాళ్లు గడిచాక బెజవాడ వెళ్లి వేదాంత శాస్త్రం చదవాలనే కోరికతో అమరావతి నుంచి బయల్దేరి గుంటూరు వచ్చారు. తీరా బస్టాండుకొచ్చాక పరిచయస్థులు కొందరు కనిపించి ‘‘పుష్పగిరి పీఠాధిపతులు ఇప్పుడు నరసరావుపేటలో ఉన్నారు. త్వరలో ఆయన మకాం మార్చేస్తారట. ఈలోగా వెళ్లి ఆయన దర్శనం చేసుకోవచ్చు కదా’’ అంటూ సలహా ఇవ్వటంతో శాస్త్రిగారు వెంటనే నరసరావుపేటకు బయల్దేరారు. స్వాములవారి దర్శనం చేసుకోగానే ఆయన శాస్త్రిగారితో ‘‘నువ్వు అమరావతిలో పురాణ ప్రవచనం చక్కగా చెప్పావని తెలిసింది. నాకు కూడా వినాలని ఉంది. ఇవ్వాళ ఇక్కడ పురాణం చెప్పు’’ అన్నారు. ఆ మాటలను ఆదేశంగా తీసుకుని ఆయన ముందు వాల్మీకి రామాయణం చెప్పారు శాస్త్రిగారు. స్వామివారు చాలా సంతోషించి, ‘‘నిన్ను నెలకు 40 రూపాయల గ్రాసం మీద పుష్పగిరి ఆస్థానంలో పురాణ పండితునిగా నియమిస్తున్నాను’’ అంటూ అప్పటికప్పుడే ప్రకటించారు. దాంతో శాస్త్రిగారు స్వామివారితో పాటు ఊరూరూ తిరుగుతూ ఏడాదిన్నరపాటు పురాణ ప్రవచనం చెప్పారు. ఆ తర్వాత  పెదనాన్న మల్లాది వీరరాఘవశాస్త్రి గారు బెజవాడలో బ్రహ్మసత్త్రయాగం జరుపుతుంటే ఆయన కోరిక మేరకు అక్కడ సుమారు సంవత్సరం పాటు ప్రవచనం చేశారు. హరికథ, నాటకం, పురాణం కలిపి శ్రోతలను ఆకట్టుకునే విధంగా పురాణ ప్రవచనం చేయడంలో చంద్రశేఖరశాస్త్రి తనదైన ప్రత్యేకశైలి ఏర్పరచుకున్నారు.

          శాస్త్రిగారి 25వ ఏట సౌభాగ్యవతి ఈమని సీతారామ ప్రసన్నగారితో జరిగింది. 1951లో వారికి పుత్రుడు జన్మించాడు. తాతగారి జ్ఞాపకార్థం రామకృష్ణ శర్మ అని పేరుపెట్టారు. ఆ తర్వాత మరో ఐదుగురు మగపిల్లలు ( వీర రాఘవ శర్మ, రామచంద్ర శర్మ, రామనాథ శర్మ, దత్తాత్రేయ శర్మ, దక్షిణామూర్తి శర్మ), ఇద్దరు ఆడపిల్లలు (ఆదిలక్ష్మి, సరస్వతి) జన్మించారు.

ధర్మం తప్పని జీవనం

          తన కుటుంబ పోషణ, పిల్లల చదువులు, పెళ్లిళ్లు, పురుళ్లు, పుణ్యాలు... అన్నీ పురాణ ప్రవచనాల ద్వారా ఆర్జించిన రూపాయితో తప్ప శాస్త్రిగారు మరో విధంగా సంపాదించలేదు. ధర్మమార్గం తప్పి ఆయన ఒక్క మాట చెప్పలేదు. ఒక్క రూపాయి సంపాదించలేదు.

          తన కుటుంబం గురించి, శ్రీమతి గురించి శాస్త్రిగారి మాటల్లో.... ‘నా ప్రవచన కార్యక్రమంలో పడి ఒక్కోసారి రెండేసి నెలలు కూడా ఇంటికి దూరంగా ఉండవలసి వచ్చేది. అటువంటప్పుడు నా భార్య ఎంతో ఓపికతో ఒంటి చేతిమీద ఇంటిని సమర్థించేది. ఆమె సహకారమే లేకపోతే నేను ఏమీ చేయగలిగేవాడినే కాదు. నా ప్రవచనాలను రాష్ర్టమంతా పంచగలిగి ఉండేవాడినీ కాను. ఈ వృత్తి ద్వారా నేను లక్షలార్జించి మేడలూ మిద్దెలూ కట్టిందీ లేదు అలాగని దారిద్య్రంతో బాధపడిందీ లేదు. భగవంతుడు ఏది అనుగ్రహిస్తే అదే భాగ్యంగా భావించాను.’

          ప్రతిభ, పాండిత్యం ఎంత ఉన్నా తృప్తి లేకపోతే అది సంపూర్ణమైన జీవితం అనిపించుకోదని శాస్త్రిగారు భావించేవారు. అందుకే ఏనాడూ తాను నమ్మిన ధర్మాన్ని, మార్గాన్ని విడిచిపెట్టి ఒక్క అడుగువెయ్యలేదు.  అప్పట్లో చాలామంది ఆయన్ను సినిమాల్లో నటించమని అడిగేవారు. అయినా వారికి ఇష్టం లేకపోవటంతో అందరినీ తిరస్కరించారు. శాస్త్రిగారు ప్రవచనం చెబుతుండగా శ్రోతలు వింటున్నట్లుగా ఉండే దృశ్యాన్ని చిత్రీకరించాలని కొందరు దర్శకులు ప్రయత్నాలు చేశారు కానీ ఎందుకనో అది కూడా వీలు పడలేదు.

          ధర్మం గురించి కేవలం నోటి మాటగా చెప్పటం వేరు. నరనరాలా, రక్తంలోని ప్రతి పరమాణువులో ధర్మం జీర్ణింపజేసుకోవటం వేరు. ఈ రెండో కోవకు చెందిన వ్యక్తి శ్రీ శాస్త్రి గారు. వారి జీవితంలో జరిగిన ఓ సంఘటనే అందుకు ఉదాహరణ.

          ఆ వివరాలు శాస్త్రిగారి మాటల్లో...‘నాకున్న పేరు ప్రఖ్యాతుల దృష్ట్యా గుంటూరులో ఒకతను నా పేరు చెప్పుకుని నేను వస్తానని ప్రచారం చేసుకుంటూ పురాణ ప్రవచనంతో పొట్టపోసుకుంటున్నట్లు తెలిసింది. నేనతనికి బుద్ధి చెప్పాలనుకున్నాను. ఓసారి అతను నన్ను కలిసినప్పుడు నా అంతట నేనే పురాణ ప్రవచనం చెబుతానని చెప్పాను. అతనెంతో సంతోషించి భారీ ఏర్పాట్లు చేశాడు.

          నా ఉద్దేశం ఏమిటంటే నాకు తెలియకుండా నా పేరు చెప్పుకున్నందుకు పదిమంది ముందు అతని పరువు తీసేయాలని. తీరా నేనెళ్లి మైకుముందు కూర్చుంటే గొంతు పెగల్లేదు. కనీసం శుక్లాంబరధరం కూడా పలకలేక స్టేజీ దిగిపోయాను. ఆ సంఘటనతో భగవంతుడెప్పుడూ భక్తుల పక్షపాతే కాని, అహంభావుల పక్షం వహించడని తెలుసుకున్నాను. ఈనాటివరకు మళ్లీ అటువంటి ఆలోచనలు చేయలేదు. ఆ తర్వాతెప్పుడూ అటువంటి పరిస్థితీ నాకు ఎదురవలేదు.’

          తనకు జరిగిన అవమానం, పరాభవం మరేదైనా కానీ....దాన్ని బయటకు చెప్పటానికి, అందులోనూ బహిరంగంగా ప్రసారమాధ్యమాల్లో చెప్పటానికి సాధారణంగా ఎవరూ ఇష్టపడరు. పూర్తిగా పరిపక్వత చెందిన మనసున్న మనిషికి మాత్రమే సాధ్యమవుతుంది.  అటువంటి పరిణితి చెందిన సర్వోన్నతమూర్తి శ్రీ చంద్రశేఖరశాస్త్రి గారు. తనకున్న కొద్దిపాటి అహంభావాన్ని దైవానుగ్రహంతో ఎలా దూరం చేసుకున్నానో చెప్పటం ఆయన ఉత్తమ సంస్కారానికి నిదర్శనం.

          శాస్త్రిగారు శారీరకంగా కూడా మంచి దృఢంగా ఉండేవారు. అనారోగ్యం కాని, జలుబు చేయడం, గొంతు బొంగురుపోవడం వంటివి కానీ ఆయన్నెప్పుడూ బాధించనే లేదు. గంటలపాటు ప్రవచనాలు చెప్పినా, గొంతు తడారిపోవటం, కంఠశోష వంటివి ఎప్పుడూ ఎరగను అంటూ ఆయనే స్వయంగా చాలాసార్లు చెప్పారు. అంతటి శారీరక, మానసిక దృఢత్వం ఆయనకు భగవంతుడు ఇచ్చిన వరం.

          శాస్త్రిగారు 250 దాకా రామాయణ ప్రవచనాలు, 300 మహాభారత ప్రవచనాలు, 200 భాగవత ప్రవచనాలూ చెప్పారు. ఇవిగాక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే ఉగాది వేడుకల్లో రెండున్నర దశబ్దాల పాటు ఉగాది పంచాంగ పఠనం చేసారు. దూరదర్శన్ సప్తగిరి ఛానల్, శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ తదిరత మాధ్యమాల్లో వందలాది ఉపన్యాసాలు చేసారు.

ప్రవచన ప్రభంజనం

          ఒక్కొక్కటిగా మల్లాది వారి పురాణ ప్రచనాలు సాగుతున్నాయి. ఆహా... ఆహాహా... ఏమా ప్రవచనం. ధర్మం చెప్పాలంటే అలాగే చెప్పాలి. అసలది పురాణంలాగా లేదు. భారత పాత్రలు కళ్ళముందు కదులుతున్నట్లుంది. కన్నయ్య బాల్యలీలలు చెబుతుంటే మన పక్క నుంచీ రోటికి కట్టిన కన్నయ్య పాకులాడుతూ వెళ్ళినట్లే అనిపించింది....అంటూ లక్షలాది మంది శ్రోతలు పరవశులై శాస్త్రిగారి ప్రవచనాలు వింటున్నారు. కేవలం వినటం లేదు... ఆ మనసులు, శరీరాలు ధర్మమార్గంలోకి ప్రయాణం చేస్తున్నాయి. ఆంధ్రదేశంలో ధర్మపతాకం రెపరెపలాడుతోంది. ప్రతి ఇంటా శాస్త్రి గారి కంఠం వినిపిస్తోంది. ఆ ధర్మమార్గం కనిపిస్తోంది.

          గ్రామాలు, జిల్లాలు, రాష్ట్రాలు దాటి శాస్త్రిగారి ప్రతిభ  కేంద్రస్థాయికి చేరుకుంది. బూర్గుల రామకృష్ణారావు, పి.వి.నరసింహారావు వంటి రాజకీయ ప్రముఖులతోబాటు చిత్తూరు వి.నాగయ్య, ఘంటసాల, ఎస్వీరంగారావు, కన్నాంబ వంటి వెండితెర వేల్పులు శాస్త్రిగారి ప్రవచనాలను ఎంతో ఇష్టపడేవారు. ఓసారి చిత్తూరు నాగయ్యగారు శాస్త్రిగారి ఇంటికి పిలిచి భోజన వస్త్రాలతో సత్కరించి, చేతికి స్వర్ణకంకణం తొడిగారు.

          శాస్త్రిగారు పొందని సత్కారాలు, పురస్కారాలు లేవు. అందుకోని బిరుదుల్లేవు. అధిష్ఠించని పదవుల్లేవు. ప్రముఖంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు వ్యాఖ్యాతగా స్వామివారి కల్యాణాన్ని భక్తుల కన్నుల ముందు సాక్షాత్కరింపచేసి అభినవ వ్యాస బిరుదును పొందారు. శృంగేరి పీఠాధిపతి చంద్రశేఖరస్వామి శాస్త్రిగారిని ఆశీర్వదించి సవ్యసాచి బిరుదుతో ఆశీర్వదించారు. భీమునిపట్నంలో సద్గురు శివానందమూర్తి గారు నెలకొల్పిన సనాతనధర్మ ట్రస్ట్ ద్వారా ఎమినెంట్ సిటిజన్ అవార్డును అందుకున్నారు. 2005లో ప్రతిష్ఠాత్మక రాజా-లక్ష్మీ అవార్డు ద్వారా వచ్చిన లక్ష రూపాయల నగదును సనాతనధర్మ ట్రస్టుకు విరాళంగా ఇచ్చారు. అనితరసాధ్యమైన పురాణ ప్రవచన సామర్థ్యాన్ని గుర్తించి గౌరవిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ శాస్త్రి గారిని శాశ్వత ఆస్థాన విద్వాంసుడిగా నియమించింది. అత్యంత అరుదైన ఈ ఘనత ఇంకెవ్వరికీ దక్కలేదు.

వింటే మల్లాది భారతం వినాలి

          తింటే గారెలు తినాలి... వింటే భారతం వినాలి. అది కూడా మల్లాది చంద్రశేఖర శాస్త్రిగారు చెప్పిన భారతం మాత్రమే వినాలన్నంతగా శాస్త్రిగారి పురాణ వైదుష్యం అప్పట్లో ఓ ప్రభంజనం సృష్టించింది. భద్రాచలంలో శ్రీసీతారాముల కల్యాణోత్సవానికి శాస్త్రిగారు వ్యాఖ్యానం చెబుతుంటూ రేడియోలో విన్నవారు కూడా  అలనాడు జనకమహారాజు కొలువులో జరిగిన సీతారాముల కల్యాణాన్ని ప్రత్యక్షంగా చూసిన తన్మయత్వాన్ని పొందారు. అదీ శాస్త్రిగారి బాణి...వాణి. తిరుమల బ్రహ్మోత్సవాలకు శాస్త్రిగారి వ్యాఖ్యానం తోడై తిరుమల రాయడి శోభను మరింత పెంచేది. ఏ వార పత్రిక చూసినా శాస్త్రిగారి ధర్మసందేహాలు శీర్షిక ఉండాల్సిందే. చలనచిత్ర కథానాయికా నాయకులకు మించిన ప్రజాదరణ (ఫాలోయింగ్) శాస్త్రిగారికి ఉందంటే అతిశయోక్తి కాదు.  శ్రీశైల మల్లికార్జునస్వామి ఉత్సవాల్లోనూ అదే ప్రభంజనం. చంద్రశేఖర శాస్త్రి వ్యాఖ్యానం చెయ్యకపోతే దేవుళ్ళు కల్యాణోత్సవాలు చేసుకోరంటూ అప్పట్లో ఓ నానుడి ఉండేది. ఈ ఒక్కమాట చాలు... శాస్త్రిగారి అనన్యసామాన్యమైన పురాణ ప్రవచన ప్రతిభ ఎంతగా ఎల్లలు లేకుండా విస్తరించిందో తెలుసుకోవటానికి. తన అపార ప్రతిభ, పాండిత్యాలు మేళవించి భారత ధర్మసూక్ష్మసంగ్రహం, కృష్ణలహరి, రామాయణ రహస్య దర్శిని వంటి ఎన్నో గ్రంథాలు కూడా రచించారు.

ఉద్దండులైన శిష్యసమూహం

          శ్రీ శాస్త్రిగారికి శిష్యసమూహం చాలా ఎక్కువ. ప్రత్యక్షంగా ఆయన పాదాల దగ్గర కూర్చుని పురాణ ప్రవచన విద్యాభ్యాసం చేసిన విద్యార్థులతో పాటు వారినే గురువుగా భావించి, పూజించుకునే ఏకలవ్య శిష్యులు వేలాదిమంది ఉన్నారు. అందుకనే శాస్త్రిగారిని ‘అభినవ వ్యాస’ బిరుదు వరించి సార్థకత పొందింది. పెద్దల ద్వారా తాను పొందిన విద్య, అనుభవంతో తాను తీర్చిదిద్దిన పౌరాణిక కళ తనతో పాటు అంతరించకూడదని, తరతరాలపాటు తెలుగునేలపై పురాణ ప్రవచనాలు వినబడాలని తరించిన పుణ్యమూర్తి శ్రీ శాస్త్రిగారు. ఈ ఆశయంతోనే తిరుమల తిరుపతి దేవస్థానం ఆహ్వానాన్ని మన్నించి, వారు స్థాపించి పౌరాణిక కళాశాల ప్రధానాచార్యులుగా బాధ్యతలు స్వీకరించారు. పురాణ ప్రవచనాన్ని ఒక కోర్సుగా తీర్చిదిద్ది, అందుకు తగిన సిలబస్, పరీక్షలతో సహా సకల విధానాలూ రూపకల్పన చేసారు. ఈ ప్రస్తావన వచ్చినప్పుడల్లా ‘ఏనాడూ ఏ పరీక్ష ఉత్తీర్ణుడను కాని నేను కళాశాలకు ప్రధానాచార్యుడిగా పనిచేసానంటే అది కలియుగదైవం వేంకటేశ్వరుడి లీల తప్ప మరొకటి కాదంటూ’ వినయంగా చెప్పేవారు శాస్త్రిగారు. సుమారు ఐదేళ్ళు ఆ బాధ్యతలు నిర్వహించారు. ఆయన శిష్యుల్లో శ్రీ బాచంపల్లి సంతోష్ కుమార శాస్త్రి ఉద్దండులు తయారై, తమ గురువు గారి ప్రతిభకు దర్పణాలుగా నిలుస్తున్నారు.

          ‘అరవయ్యేళ్ళు గ్రామగ్రామం తిరిగి ప్రవచనాలు చెప్పాను. వార్డు మెంబర్ నుంచి ప్రధాని దాకా అందరి మెప్పు, సత్కారాలు అందుకున్నాను. ఈ తృప్తి చాలు. ఇంకా ఏదో సాధించాలనే ఆశ నాకు లేదు. ఇప్పుడు నా శిష్యులు పాతిక మందికి పైగా నాతో సమానంగా పురాణాలు చెబుతున్నారు. వారందరి ప్రవచనాలు నేను కింద కూర్చుని వింటుంటే నేను చెప్పి అందరి మెప్పు పొందిన ఆనందం కన్నా ఎక్కువ ఆనందం కలుగుతోంది. ఇదే నేను కోరుకున్న జీవితం. భగవంతుడు నేను కోరుకున్నవన్నీ ఇచ్చాడు శిష్యులతో సహా. ఇందుకు ఆయనకు అనేక  కృతజ్ఞతలు’ అంటూ శాస్త్రిగారు అనేక సందర్భాల్లో చెప్పారు. ఇంతటి విశాల హృదయం ఇప్పటితరంలో కనిపించటం అరుదు. కనీసం ఊహించలేం కూడా.

          వయోభారం కారణంగా 2011లో పురాణ ప్రవచనానికి స్వస్తి చెప్పారు. చమత్కార సంభాషణలతో, చిన్నచిన్న కథలతో ఉపన్యాసాన్ని రక్తికట్టించేవారు. ఒకే అర్థం వచ్చే తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు పదాలను అలవోకగా  ప్రయోగించేవారు. సందర్భశుద్ధి బాగా తెలిసిన వక్త. ప్రవచనంలో తాదాత్మ్యం చెందడం ఆయనలోని ప్రత్యేకత. వైదిక ధర్మ ప్రచారానికి జీవితం అంకితం చేసిన మల్లాది చంద్రశేఖరశాస్త్రిగారు నిండు జీవితం జీవించారు. ఆయన ధన్యజీవి. కాషాయ దుస్తులు ధరించని కర్మయోగి.

ఇదీ నా మార్గం

          భగవంతుడు నాకిచ్చిన దానికి నేనెప్పుడూ అసంతృప్తి పొందలేదు. వైదిక ధర్మ ప్రచారం చేయడాన్ని, భగవంతుని లీలలను గానం చేయడాన్ని బాధ్యతగా భావించాను తప్పితే బరువనుకోలేదు. ఎవరికోసమూ ప్రత్యేకంగా చెప్పలేదు. సభలో భాగ్యవంతులున్నారా, పండితులున్నారా, పామరులున్నారా అని ఎన్నడూ ఆలోచించలేదు.

          ఎవరినీ పనిగట్టుకుని పొగడలేదు. ఎప్పుడూ ఒకేలా ప్రవర్తించాను. కాకపోతే పదేళ్లకొకసారి సామాజిక పరిస్థితులలో మార్పు వస్తుంటుంది కదా, అందుకు అనుగుణంగా మారుతూ వచ్చానంతే. అదెలాగంటే అప్పట్లోలా ఇప్పుడు పద్యాలు చెబుదామన్నా వాటిని విని ఆనందించేవారు లేరు కదా, అందుకు తగ్గట్టుగానే నన్ను నేను మలచుకున్నాను. అప్పుడే కాదు, ఇప్పటికీ నేను ఏ ఘట్టం చెబుతుంటే ఆ ఘట్టంలో పూర్తిగా లీనమవుతాను.

          అది శోకరసమైతే నాకు దుఃఖమొస్తుంది. సంతోషకర సన్నివేశమైతే ఆనందంతో పరవశించి పోతాను. కాబట్టే ఇన్నేళ్లు గడిచినా, నా ప్రవచనం వినడానికొచ్చే ప్రేక్షకజనంలో తగ్గుదల లేదు. అయితే నేను మాత్రమే గొప్పగా చెప్పగలను అని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఇప్పటివాళ్లు కూడా బాగానే చెబుతున్నారు. ఆదరణ కూడా బాగానే ఉంటోంది. ఈ సంస్కృతి చిరకాలంపాటు వర్ధిల్లాలన్నదే నా ఆకాంక్ష.

------------------------

దొరలు మెచ్చిన పురాణం

          అది క్విట్ ఇండియా ఉద్యమం జరుగుతున్న సమయం. ఓ చోట శాస్త్రిగారు పురాణం చెబుతున్నారు. అప్పటికే సుమారు నెలకుపైగా కార్యక్రమం జరుగుతోంది. ఆ రోజెందుకో అలజడిగా ఉంది. ఎక్కడివారక్కడ పారిపోతున్నారు. పురాణం కూడా ముగించి శాస్త్రి గారు బయల్దేరారు. ఇంతలో ఓ వ్యక్తి ఆయన వెంటపడ్డాడు. మా దొరగారు మిమ్మల్ని రమ్మంటున్నారంటూ పట్టుబట్టాడు. శాస్త్రిగారికేమో భయం పట్టుకుంది. తెల్లవాడు ఏం చేస్తాడోనని.... ఎలాగో ధైర్యం తెచ్చుకుని మీ దొరగారికి తెలుగువచ్చా అని అడిగారు. రాదయ్యా అని చెప్పాడతను. మరి నాకు ఇంగ్లిషు రాదయ్యా. మీ దొరతో మాట్లాడేటంత భాష నాకు రాదు... అంటూ తప్పించుకోవాలని చూసారు శాస్త్రిగారు. అయినా పట్టువదల్లేదా ఆగంతకుడు.

          ఇంతకీ ఎందుకు రమ్మంటున్నారయ్యా మీ దొరగారు అంటూ అడిగారు శాస్త్రిగారు.  అయ్యా, మీరు చాన్నాళ్ళుగా ఇక్కడ కూర్చుని ఏదో చెబుతున్నారట. రోజూ మీరు చెప్పే సమయానికి మా దొరగారు ఈ వసారాలో వాలుకుర్చీ వేసుకుని కూర్చుని మీరు చెప్పేదంతా వింటారు. రేపు ఆయన లండన్ వెళ్ళిపోతారట. మీరు చెప్పేది ఆయనకు బాగా నచ్చిందట. అది ఏ పుస్తకమో కనుక్కుని, ఇంగ్లిషులో ఉంటే తనతో పాటు లండన్ తీసుకువెళ్దామని అనుకుంటున్నారంటూ విషయం చెప్పాడతడు. హమ్మయ్య అనుకున్నారు శాస్త్రిగారు. అది భారత పురాణం చేస్తున్న సమయం. రాజగోపాలాచారి రాసిన ఇంగ్లిషు భారతం కొనుక్కోమని సలహా ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోయారు శాస్త్రి గారు.

          శాస్త్రిగారి పురాణం వింటున్న దొరకి తెలుగు రాదు. శాస్త్రిగారికి ఇంగ్లిషు అంత పూర్తిగా రాదు. పైగా ఆయన చెప్పేది సంస్కృత శ్లోకాలతో కూడిన భారతం. చెబుతున్నది తెలుగులో. కానీ, దాన్ని బాగా ఇష్టపడ్డాడు ఇంగ్లీషు దొర. భాష తెలియని వారిని సైతం అమితంగా ఆకట్టుకోగల పురాణ ప్రవచన శైలి కేవలం పౌరాణిక సార్వభౌముడైన శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రిగారికే సాధ్యం. ఒక పౌరాణికుడు సాధించిన సర్వోన్నత విజయానికి ఇంతకుమించిన తార్కాణం మరొకటి ఉండదు.

---------------------------

          ఎంతో విద్వత్తు, మరెంతో వినయం కలిగిన పురాణ పురుషుడు, ధర్మమూర్తి శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రిగారి అంత్యక్రియలకు ప్రభుత్వ ప్రతినిధులు కానీ, రాజకీయ ప్రముఖులు కానీ హాజరుకాకపోవటం అత్యంత విచారకరమైన అంశం. ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో శాస్త్రిగారి అంత్యక్రియలు నిర్వహిస్తే  ఎంతగానో సముచితంగా ఉండేది. అలాచెయ్యటం వల్ల ప్రభుత్వానికి గౌరవం పెరుగుతుందే కానీ శాస్త్రిగారికి ఒరిగే ప్రయోజనం ఏదీ లేదు. ఆయన కన్నా ఎంతో తక్కువస్థాయి కలిగిన వారికి జరిగిన లాంఛనాలు వారికి జరపకపోవటం ప్రభుత్వానికి మచ్చ తప్ప శాస్త్రిగారికి ఏమాత్రం తక్కువ కాదు. తాను నమ్మిన ధర్మం, దైవం తప్ప మరొక ఆలోచన లేని ఆ మహానుభావుడి అంత్యక్రియలు కూడా పూర్తి శాస్త్రోక్తంగా జరగాలనే భగవంతుడి సంకల్పం కాబోలు. అలాగే జరిగింది. ప్రభుత్వ నిర్లిప్తత కూడా చివరి కట్టె కాలేవరకు వారు ధర్మాన్ని పాటించేందుకు దోహదపడింది.

--------------------------------------------------

బెదురులేని మనిషి

          సాధారణంగా పురాణ ప్రవచనాలు చెప్పేవారు తమ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసిన నిర్వాహకులను ప్రవచనంలో భాగంగా ప్రశంసిస్తారు. కానీ, శాస్త్రి గారి బాణి ఇందుకు పూర్తిగా భిన్నం. ధర్మాన్ని చెప్పే విషయంలో ఎటువంటి అదురు బెదురు ఆయనకు ఉండేది కాదు. తాను ధర్మం అని నమ్మిన విషయాన్ని, శాస్త్రాలు చెప్పిన విషయాన్ని నిర్మొహమాటంగా చెప్పేవారు. వినేస్థానంలో ఎంతటి పెద్దమనుషులు ఉన్నా లెక్కచేసేవారు కాదు.

          ఓసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (అవిభక్త) నిర్వహిస్తున్న ఉగాది వేడుకల్లో పంచాంగ పఠనం చేస్తున్నారు శాస్త్రిగారు. అందరూ శ్రద్ధగా వింటున్నారు. ‘ఈ ఏడాది గ్రహచారం బట్టి చూస్తే ప్రస్తుత ప్రభుత్వం ఈ ఏడాది మధ్యలో పడిపోతుంది అన్నారు’ పంచాంగ పఠనంలో భాగంగా. మొత్తం సభ అంతా ఒక్కసారిగా స్తంభించిపోయింది ఆ మాటలు విని. సాక్షాత్తు ముఖ్యమంత్రి సమక్షంలో ప్రభుత్వం అర్ధంతరంగా పడిపోతుందని చెప్పటమా? ఎంత ధైర్యం? అనుకున్నారంతా. ‘ఇది నా మాట కాదు. శాస్త్రం చెబుతోంది’ అంటూ అదురు బెదురు లేకుండా పంచాంగ పఠనం పూర్తి చేసారు శాస్త్రిగారు. ఇంతమాట చెప్పినా ఏ ఒక్కరూ ఒక్క మాట అనలేదు. పైపెచ్చు ముఖ్యమంత్రి స్వయంగా ఘన సన్మానం చేసి మరీ పంపించారు. అదీ... శాస్త్రిగారు నమ్మిన ధర్మం యొక్క గొప్పదనం.  అధికారుల ప్రాపకం కోసం పాకులాడే తత్త్వం ఆయనది కాదు.

          మరోసభలో సాక్షాత్తు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వేదికపై సాగిలపడి శాస్త్రిగారికి పాదనమస్కారం చేసారు. మూర్తీభవించిన ధర్మమూర్తికి ఇంతకన్నా ఘన సన్మానం అవసరమా.

------------------------

నా ధైర్యానికి మూలం శాస్త్రి గారు

బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావు గారు

          చమత్కారం, ఛలోక్తులు, పురాణ ప్రవచనాల ద్వారా దేశానికి సేవ చేసిన పుణ్యపురుషులు శ్రీ చంద్రశేఖర శాస్త్రి గారు. పురాణాలు పండితుల కోసం కాదు... అందరి కోసం అని నమ్మటంతో పాటు అందుకోసం అరవై సంవత్సరాల పాటు అఖండ పురాణ ప్రవచన యజ్ఞం చేసారాయన. వ్యక్తుల మెప్పు కోసం ఆయన ఏనాడూ తాపత్రయ పడలేదు. అవార్డులు, రివార్డుల కోసం ఎదురుచూడలేదు. పురాణం చెబితే ఎంతిస్తారని ఆలోచన చెయ్యలేదు. అంతా భగవంతుడే చూసుకుంటాడనే విశ్వాసం ఆయన రక్తంలో ఇంకిపోయింది. నేను ఎంతో ధైర్యంగా ప్రవచనాలు చెబుతానని అందరూ అంటారు. ఇందకు కారణం, స్ఫూర్తి శ్రీ చంద్రశేఖర శాస్త్రిగారే. వారిచ్చిన బలమే ఈనాటికీ నన్ను నడిపిస్తోంది. వారి భౌతికదేహం సాక్షిగా ప్రమాణం చేసి చెబుతున్నాను...ఏ ధర్మాన్ని నమ్మి శాస్త్రిగారు పురాణాలు చెప్పారో, నేను కూడా అదే మార్గంలో ప్రవచనాలు చేస్తాను. గురువు గారి మార్గమే నాకు దిశానిర్దేశం చేస్తుంది.

---------------------------------

రచన : డాక్టర్ కప్పగంతు రామకృష్ణ, సెల్ : 90320 44115 / 8897 547 548

--------------------------------





 

Friday, December 31, 2021

బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏమిటి? బ్రాహ్మీ ముహూర్తంలో ఎందుకు నిద్ర లేవాలి? సుప్రభాతం అంటే ఏమిటి?


బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏమిటి? 

బ్రాహ్మీ ముహూర్తంలో ఎందుకు నిద్ర లేవాలి? 

సుప్రభాతం అంటే ఏమిటి?

రుషిపీఠం పత్రిక జనవరి 2022 సంచికలో ప్రచురితమైన వ్యాసం 






ఆత్మచైతన్య సుప్రభాతం

కౌసల్యా సుప్రజా రామా... పూర్వా సంధ్యా ప్రవర్తతే.... 

అది ఉషోదయానికి పూర్వ వేళ. బాలభానుడు తన తొలి కిరణాలను వికసింపజేయటానికి ఉద్యుక్తుడవుతున్నాడు. జగన్మోహనాకారుడైన రామచంద్రమూర్తి సోదరుడైన లక్ష్మణస్వామితో కలిసి కఠిన నేల మీద ఆదమరచి పడుకున్నాడు. ‘పుంసాం మోహన రూపాయ’ అన్నట్లున్న స్వామి సౌందర్యాన్ని తనివి తీరా చూసుకున్నాడు మహర్షి. కానీ, అంతలోనే కర్తవ్యం స్ఫురణకు వచ్చింది. ‘ఉత్తిష్ఠ నరశార్దూలా! కర్తవ్యం దైవమాహ్నికం’ ` రామచంద్రా! నీ కర్తవ్యాన్ని నిర్వహించాల్సిన సమయం సన్నద్ధమైంది. పడుకున్నది చాలు... ఇక నిద్రలేవాలంటూ విశ్వామిత్రుడు రామలక్ష్మణులను నిద్ర నుంచి మేల్కొలిపాడు. 

ఇది రాముడికి మహర్షి పలికిన సుప్రభాతం మాత్రమే కాదు. రామచంద్రుడి పేరుతో యావజ్జాతిని ఉద్దేశించి మహర్షి పలికిన చైతన్యగీతం అది. సుప్రభాత గీతిక ఆలయాల్లో నిత్యం వినిపించే ఆధ్యాత్మిక గానలహరి అది. 

దేవాలయాల్లో వినిపించే సుప్రభాతం విని స్వామి నిద్రలేస్తాడని, భక్తుల కోర్కెలు సావధానంగా విని, వాటిని తీరుస్తాడని నమ్మకం. సుప్రభాతం కేవలం దైవానికేనా. మనిషి మాత్రం నిద్ర లేవాల్సిన పని లేదా అంటే నిజానికి నిద్ర, మెలకుల లేని దైవం మేల్కొనాల్సిన అవసరమే లేదు. దైవానికి నిద్ర ఉండదు. అదొక నిర్నిద్రమైన శక్తి. దైవానికి పాడే సుప్రభాతం పేరుతో మనలోని దైవత్వాన్ని మేల్కొలపటమే సుప్రభాతం వెనుక దాగిఉన్న ఆధ్యాత్మిక సందేశం. గుడిలోని దేవుడి పేరుతో గుండె గదుల్లో దాగున్న దైవీకమైన శక్తిని జాగృతం చేసే ప్రక్రియకు పలికే నాందీ వాచకమే సుప్రభాతం. 

సాధారణ పరిభాషలో రాత్రి వేళ నిద్రించి, ఆ నిద్ర ముగిసిన తర్వాత కళ్ళు తెరచి లోకాన్ని చూడటాన్ని నిద్రలేవటం అంటాం. నిజానికి ఇలా నిద్ర పోవటం, మేల్కోవటం అనేది ఒక క్రియ మాత్రమే. పుట్టుకతో ఈ లోకాన్ని చూడటానికి చేసే ప్రయత్నమే కన్ను తెరవటం. లోకాల వెనుక జ్యోతి స్వరూపంతో వెలిగే పరమాత్మను చేరుకోవటం చేసే ప్రయత్నమే కన్నుముయ్యటం. ఇలా కన్నుతెరచి కన్నుమూసే కాలవ్యవధిలో ఎప్పటికప్పుడు మనల్ని మనం జాగృతం చేసేందుకు చేసే స్వీయప్రబోధమే సుప్రభాతం. అదే నిద్రలేవటం. 

కర్తవ్యం దైవమాహ్నికం ` అంటే తెల్లవారిన తర్వాత నువ్వు చెయ్యాల్సిన పని అంతా నీది కాదు... దైవానిది, అటువంటి దైవ కార్యాన్ని నిర్వహించటానికి మేల్కొనాలని అర్థం. మానవత్వమనే పొర వెనుక ప్రతి ప్రాణీ దైవమే. ఆ దివ్యత్వాన్ని మేల్కొలపటమే సుప్రభాతం. 

మనకు ఇష్టమైన దైవానికి మేల్కొలుపు పాడుతున్నామంటే అర్థం ఆ దైవాన్ని త్రికరణశుద్ధిగా మనం నమ్ముతున్నామని, ఆ స్వామి బాటలో నడవటానికి అంగీకరించామని అర్థం. అలా మనం నమ్ముకున్న దైవం మేల్కొన్నాడంటే... మనలో ఆ దైవానికి సంబంధించిన ఉత్తమ భావనలు మేల్కొన్నాయని అర్థం. ఎప్పుడైతే మనలో దైవీకమైన భావనలు వృద్ధి చెందుతాయో అప్పుడు ధర్మమార్గాన్ని విడిచిపెట్టే సందర్భం ఎదురుకాదు. ఇలా ప్రతి వ్యక్తి... అంతిమంగా సమాజం ధర్మనిలయంగా మారేందుకు పలికే నాందీవాక్యమే సుప్రభాతం.

బ్రాహ్మీముహూర్తం

పూర్వం కాలాన్ని ఘడియలలో లెక్కించేవారు. ఒక ఘడియ ప్రస్తుత కాలమాన ప్రకారం 24 నిమిషాలకు సమానం. ఒక ముహూర్తం అంటే రెండు ఘడియల కాలం ` అంటే 48 నిమిషాల కాల వ్యవధి ఒక ముహూర్తం అవుతుంది. ఒక పగలు, ఒక రాత్రి కలిపిన కాలవ్యవధిని అహోరాత్రం అంటారు. ఒక అహోరాత్రంలో 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే ఒక రోజులో 30 ముహూర్తాలు ఉంటాయి. 

సూర్యోదయ సమయానికి కచ్చితంగా జరుగుతూ ఉండే ముహూర్త కాలాన్ని ఆసురీ ముహూర్తం అంటారు. ఈ ఆసురీ ముహూర్తానికి ముందు సమయం బ్రాహ్మీ ముహూర్తం అవుతుంది. అంటే సూర్యోదయమునకు ముందు వచ్చే ముహూర్తాల్లో మొదటి ముహూర్తాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు. దీని ప్రకారం రోజు మొత్తంలో వచ్చే 29వ ముహూర్తం బ్రాహ్మీముహూర్తం అవుతుంది. 

ఉదాహరణకు సూర్యోదయం ఉదయం గం. 5.28 అయితే అంతకుముందు జరిగే ముహూర్తం (48 నిమిషాల కాల వ్యవధి) గం.4.40 నుంచి గం.5.28 వరకు ఉండే సమయం ఆసురీ ముహూర్తం అవుతుంది. ఈ ఆసురీ ముహూర్తానికి ముందు అంటే గం.4.40కు ముందు ఉండే ముహూర్తం అంటే గం.3.58 నుంచి గం.4.40 వరకు ఉండే 48 నిమిషాల కాలం బ్రాహ్మీ ముహూర్తం అవుతుంది. 

బ్రాహ్మీ అనే పదానికి సరస్వతీ అని అర్థం. మనలోని బుద్ధి ప్రచోదనం చెంది సరస్వతీదేవి అనుగ్రహం జ్ఞానరూపంలో కలిగే ఉత్తమ సమయం కాబట్టి ఈ సమయానికి బ్రాహ్మీ ముహూర్తం అని పేరు వచ్చింది. బ్రాహ్మీముహూర్తంలో బ్రహ్మ, సరస్వతి ఇద్దరూ హంస వాహనంపై ఆకాశ సంచారం చేస్తుంటారని, కాబట్టి ఆ సమయంలో సరస్వతీ ఉపాసన (విద్యార్థులు చదువుకోవటం కూడా ఉపాసనే) చేసేవారిని సరస్వతీ అనుగ్రహిస్తుందని పురాణ కథనం. విద్యార్థులు తెల్లవారు జామున లేచి చదువుకోవాలని పెద్దలు చెప్పటం వెనుక ఉన్న ఆంతర్యం ఇదే. 

మన శరీరంలో జీవ గడియారం ఉంటుంది. దీన్ని అనుసరించే మన జీవక్రియలన్నీ జరుగుతాయి. ఉషోదయ వేళ మనలో కార్టిసోల్‌ హార్మోన్‌ ఎక్కువ మోతాదులో విడుదల అవుతుంది. ఈ హార్మోన్‌ మనలోని ఒత్తిడిని తగ్గిస్తుంది. జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపుతుంది. అందుకే పిల్లలు బ్రాహ్మీ ముహూర్తంలో చదువుకుంటే చక్కగా గుర్తుంటుందని పెద్దలు చెబుతారు.

ఆధ్మాత్మిక సాధన పరంగా బ్రాహ్మీముహూర్తం చాలా విలువైన సమయం. ఈ సమయాన్ని వృథా చేసుకుంటే రోజులోనే కాదు... మొత్తం జీవితంలోనే అద్భుతమైన కాలాన్ని కోల్పోయినట్లవుతుంది. శుశ్రుత మహర్షి బ్రాహ్మీ ముహూర్తాన్ని అమృత ముహూర్తంగా పేర్కొన్నాడు. ఈ సమయంలో చేసే ఆధ్యాత్మిక సాధన ద్వారా మనలో సత్త్వగుణాలు పెరుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. సూర్యోదయం తర్వాత కూడా నిద్రిస్తే తమోగుణం (బద్ధకం, ఆలస్యం, అజాగ్రత్త) పెరుగుతుంది. అర్థరాత్రి దాటే వరకూ మెలకువగా ఉండడం వల్ల రజోగుణం (క్రోధం, దంభం, దర్పం, విపరీత ప్రతిస్పందన) పెరుగుతుంది. అందుకే తెల్లవారు జామున ఆలోచించు, పగలు కార్యోన్ముఖుడివై పని చెయ్యి. రాత్రి  సమయంలో నిద్రోన్ముఖుడివి కావాలని పెద్దలు చెబుతుంటారు. 

బ్రాహ్మీ ముహుర్తంలో చేసిన ఓంకార ధ్వని వలన సుషుమ్న నాడి తెరుచుకుంటుంది. అందుకే ఋషులు, యోగులు ఈ సమయంలో ఓంకారం జపిస్తారు. ఎపుడైతే మన నాసికా రంధ్రాల్లోకి శ్వాస ప్రవహిస్తూ ఉంటుందో వెంటనే సుషుమ్న నాడి పనిచెయ్యటం మొదలవుతుంది. అప్పుడే ధ్యానం బాగా కుదురుతుంది. తద్వారా ఆధ్యాత్మిక సాధన మరింత ఉన్నతస్థితికి చేరుకుని, అంతిమంగా మన అంతర్యామిగా ఉన్న ఆత్మ స్వరూపమైన పరమాత్మను చేరుకునే సిద్ధి కలుగుతుంది.

తెల్లవారు జామున అంతర్ముఖలమై మేథోమథనం చేస్తే మనలోనే మనకు ఎన్నో విషయాలు అవగతమవుతాయి. తెల్లవారు జామున లేచే వారికి సూర్య చంద్రులు, నక్షత్రాల నుంచి కాంతి పూర్తిగా అంది, తద్వారా వారిలో నిద్రిస్తున్న జీవశక్తి చైతన్యవంతమవుతుంది. 

భగవంతుడిచ్చిన శక్తి అందరిలోనూ ఉంది. కానీ దాన్ని జాగృతం చేయాల్సిన బాధ్యత మనదే. శరీరాన్ని, మనసును ప్రకృతిలో లీనం చేసి మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తిస్తుంటే శరీరానికి ఆరోగ్యం, మనసుకు ఆహ్లాదం మనవెంటే ఉంటాయి. ఇందుకు బ్రాహ్మీ ముహూర్తం ఎంతో అనువుగా ఉంటుంది. ఆయుర్దాయాన్ని, ఆయుర్వ ృద్ధిని కోరుకునే వారు తప్పనిసరిగా బ్రాహ్మీముహూర్తంలో నిద్రలేవాలని దేవీభాగవతం కూడా చెబుతోంది.

ఆయుర్వేద శాస్త్రం ప్రకారం అపాన వాయువు (కాలకృత్యాల నిర్వహణలో తోడ్పడే వాయువు) సూర్యోదయం ముందు మరింత ప్రభావవంతంగా పని చేస్తుంది. వ్యర్థ పదార్థాలను శరీరాన్నుంచి వదిలించి వేస్తుంది. అలాగే తెల్లవారు జామున శరీరంలోకి ప్రాణవాయువు కూడా ఎక్కువ తీసుకోగలం. సాధారణంగా తెల్లవారు జామున మాత్రమే రెండు నాసికా రంధ్రాల నుంచీ వంద శాతం గాలి పీల్చగలం. మిగతా సమయాల్లో ఒకటి 50 శాతం, ఒకటి 100 శాతం పని చేస్తాయి.

ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే

మనిషి ఏ సమయంలో నిద్రలేవాలి. నిద్రలేచిన వెంటనే ఏం చెయ్యాలి. శరీరానికి నిద్రమత్తును దూరం చేస్తూ, కళ్ళు తెరచి ఈ లోకాన్ని చూసేందుకు ముందుగా పాటించాల్సిన ఆచార క్రమం ఏమిటనే విషయాన్ని ధర్మశాస్త్ర గ్రంథాలు విస్పష్టంగా ప్రకటిస్తున్నాయి. వాటి ప్రకారం

బ్రాహ్మే ముహూర్తే ఉత్థాయ చింతయే దాత్మనో హితమ్‌ ।

స్మరణం వాసుదేవస్య కుర్యాత్‌ కలిమలాపహమ్‌ ॥

సూర్యుడు ఉదయించడానికి రెండు ముహూర్తాలు ముందుగా నిద్రలేవాలి. అంటే బ్రాహ్మీ ముహూర్తంలో తప్పనిసరిగా నిద్ర నుంచి మేల్కొనాలి. నిద్ర లేచిన తర్వాత వాసుదేవుని అంటే తనకు ఇష్టం అయిన దేవుడిని తలచుకోవాలి.

హరే రామ హరే రామ రామ రామ హరే హరే । 

         హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే ॥

విశ్వేశం కేశవం ధుంఢరి దండపాణిం చ భైరవం । 

        వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం ॥

ఇలా ఇష్టమైన దైవానికి సంబంధించిన ప్రార్థన చేసుకోవాలి . దైవస్మరణం తరువాత మెల్లగా కళ్ళు తెరిచి కుడి అరచేయిని కింది నుంచి పైకి చూస్తూ 

కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతీ । కరమూలే తు గౌరీ చ ప్రభాతే కరదర్శనమ్‌ ॥

అరచేయి కిందివైపు చివర లక్ష్మిని , మధ్యలో సరస్వతిని , మొదట్లో గౌరిని స్మరించాలి . తర్వాత శుభాశుభాలు ఏవి చూసినా ఇబ్బంది ఉండదు. ఆ తర్వాత

సముద్రవసనే దేవి పర్వతస్తనమండలే । 

       విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే ॥ 

అంటూ భూదేవిక ప్రార్థనా పూర్వక నమస్కారం చేసి, ఆ తర్వాతనే కాలు నేలపై మోపాలి.

    తెల్లవారు జాము సమయం ఎంతో శక్తివంతమైంది. పవిత్రమైంది. ఈ సమయంలో లేచి పని చేసుకుంటూ ఉంటే అసలు చెడు తలంపులు వచ్చేవి కావు. ఎప్పుడైనా అనివార్య కారణాల వల్ల తెల్లవారు జామున లేవలేకపోతే ఈ ప్రపంచం నన్ను వదిలేసి తన పనిని ప్రారంభించేసిందని నాలో నేనే సిగ్గుపడేవాడిని.  - ‘లోకమాన్య’ బాలగంగాధర తిలక్‌

--------------------------------------------------------------------

రచన
డాక్టర్ కప్పగంతు రామకృష్ణ
కొత్తూరు తాడేపల్లి, విజయవాడ రూరల్ మండలం
కృష్ణా జిల్లా - 5200012
సెల్ : 90320 44115 / 8897 547 548


 

పున్నమి కాంతుల కల్యాణం (ఒంటిమిట్టలో జరిగే శ్రీ సీతారామ కల్యాణం నేపథ్యంగా శ్రీకనకదుర్గ ప్రభ పత్రికలో రాసిన వ్యాసం)

  పున్నమి కాంతుల కల్యాణం                లోకంలో పెళ్ళి ముచ్చట అంటే సీతారాములదే. అందులోనూ ఒంటిమిట్ట ఆలయంలో జరిగే సీతారాముల కల్యాణం మరింత శ...