Thursday, February 3, 2022

భీష్మసందేశం

 

భీష్మసందేశం




          భీష్ముడు - ఈ మాట వినగానే మహత్తరమైన ఆవేశం మనల్ని అవహిస్తుంది. రోమాలు నిక్కబొడుచుకుంటాయి. నరాలు బిగుసుకుంటాయి. శరీరం చైతన్యవంతమవుతుంది. అనంతమైన ధైర్యం మనల్ని ఆవహిస్తుంది. భీషణమైన ప్రతిజ్ఞ చేసి, ఆ ప్రతిజ్ఞ కోసం జీవిత సర్వస్వాన్ని అంకితం చేసిన త్యాగమూర్తి ఆదర్శ జీవితం మనోఫలకంపై కదలాడుతుంది. ఒక్క మాటకే... అదీ ఒక్క పేరుకే ఇంతటి ఘనత ఉందా? అంటే ఉందని రొమ్మువిరుచుకుని సగర్వంగా చెప్పవచ్చు. శీలం, నీతి, నిష్ఠ, ధర్మం, ఆచారం... ఒకటేమిటి అనంతమైన సగుణ సంపదలో భీష్ముడికి సాటి భీష్ముడే. తర్రడి కోసం రాజ్యాన్ని, రాజ్యసుఖాన్ని మాత్రమే కాదు... చివరకు తనకంటూ సొంత జీవితాన్ని కూడా లేకుండా త్యాగం చేసిన త్యాగమూర్తి ఆయన. ఇరవైఒక్క సార్లు యావద్భూమండలం పర్యటించి క్షత్రియుడనే పేరు వినపడకుండా రాజలోకాన్ని జయించిన పరశురాముడిని నిలువరించిన ఘనత కూడా భీష్ముడికి మాత్రమే దక్కింది. ఇటువంటి పాత్ర మరొకటి భారతంలో కనిపించదు. కనీసం ఆ ఛాయల్లోకి కూడా మరొకరు రారు.

            తిక్కన సోమయాజి కూడా మహోగ్రశిఖర ఘన తాళ తరువగు సిడము వాడు’ ` అంటూ బృహన్నల (శాపం అనుభవిస్తున్న అర్జునుడిచేత ఉత్తర గోగ్రహణ సందర్భంలో) చేత భీష్ముని ఔన్యత్యాన్ని ప్రశంసింపజేస్తాడు. భీష్ముని రథ పతాకం మీద తాళ (తాటి) వృక్షం చిత్రించబడి ఉంటుంది. రథపతాకం రథి హృదయానికి ప్రతీక. నిటారుగా నిలబడి సర్వోన్నతంగా కనిపించే తాళవృక్షంలా వందలాది పాత్రలున్న మహాభారతంలో ఎవరికీ అందనంత సమున్నత గుణశ్రేణితో అందరిచేతా తాతా! అంటూ గౌరవాన్ని అందుకున్న ఒకే ఒక వ్యక్తి భీష్ముడు.

భీష్ముడు కాదు... భీష్మాచార్యుడు

            మహాభారతంలోనే యయాతి ఉపాఖ్యానంలో భీష్ముని మాదిరిగా తండ్రి కోసం వృద్ధాప్యాన్ని అనుభవించిన పూరుని ప్రస్తావన ఉంది. అయితే పూరుడు తండ్రి అడిగాడు కాబట్టే.... అదికూడా కొంతకాలమే వృద్ధాప్యాన్ని అనుభవించాడు. కానీ, భీష్ముడు అలాకాదు. తండ్రి అయిన శంతనమహారాజు అతడిని మాట మాత్రం కూడా అడగలేదు. కనీసం ప్రస్తావన కూడా తీసుకురాలేదు. అలాగని, భీష్ముడు వదిలిపెట్టలేదు. తండ్రి చింతకు కారణం ఏమిటో కనుక్కున్నాడు. దాసరాజు దగ్గరకు వెళ్ళాడు. అతడి సందేహాలన్నీ తీర్చాడు. తండ్రి కోసం రాజ్యాన్నే కాదు.. చివరకు తన సంసార సుఖాన్ని కూడా త్యాగం చేశాడు. తనకు వారసులు లేకుండా చేసుకున్నాడు. యావత్ప్రపంచంలో ఇంతటి భీషణమైన ప్రతిజ్ఞ చేసిన వ్యక్తి, చేసిన ప్రతిజ్ఞను చివరి ఊపిరి వదిలే వరకు ఆచరించిన వ్యక్తి మరొకరు లేరు. తన తమ్ములు చనిపోయిన తర్వాత, తాను భీషణమైన ప్రతిజ్ఞ చేయటానికి కారణమైన సత్యవతీదేవి స్వయంగా ఆజ్ఞాపించినా ప్రతిజ్ఞాభంగం చెయ్యటానికి ఏమాత్రం అంగీకరించలేదు. అందుకనే దేవవ్రతుడు భీష్ముడు అయ్యాడు. కాదు...కాదు... భీష్మాచార్యుడు (ఆచరించి చూపించే వారిని ఆచార్యులు అంటారు) అయ్యాడు.

            ఆచార సంప్రదాయాలు పాటించటంలో, ధర్మాచరణలో భీష్మునికి సాటి రాగల పాత్ర కూడా మరొకటి కనిపించదు. భీష్ముడు ధర్మాన్ని ఎంతటి కఠినమైన పరిస్థితుల్లో ఆచరించేవాడనటానికి ఉదాహరణ భారతయుద్ధ సందర్భంలో కనిపిస్తుంది. శాస్త్రవిహితమైన సంధ్యావందనం, సూర్యునికి అర్ఘ్యప్రదానం ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టేవాడు కాదు భీష్ముడు. యుద్ధం చేస్తున్నా కూడా సంధ్యాసమయంలో ఆగి, సూర్యోపాసన చేసి, నీరు దొరకకపోతే యుద్ధభూమిలోని ఇసుకతోనే అర్ఘ్యప్రదానం (ఇదేవిధంగా కృష్ణుడు కూడా యుద్ధరంగంలో ఇసుకతోనే అర్ఘ్యప్రదానం చేశాడు. కానీ, ఆయన పరమాత్మ. జీవాత్మలను ఉద్ధరించటానికే తప్ప ఆయనకు కర్మాచరణ చెయ్యాల్సిన అవసరం లేదు) చేసిన ఒకే ఒక వ్యక్తి భీష్ముడు. అదీ ధర్మం పట్ల, ధర్మాచరణ పట్ల  ఆయన ఆచరించిన చూపించిన అంకితభావం. అందుకే కేవలం భీష్ముడిగా మిగిలిపోలేదు. భీష్మాచార్యుడయ్యాడు.

అఖండమైన కృష్ణభక్తి

            భీష్ముడు అనగానే ఇతరులకు ఊహించటానికి అవకాశం లేనంత గొప్ప రాజనీతి, చాకచక్యం, ధర్మనిష్ఠ, రాజభక్తి గుర్తుకువస్తాయి. వీటన్నిటితో పాటు మరొక కోణం కూడా భీష్మునిలో ఉంది. అదే... అచంచలమైన కృష్ణభక్తి. కేవలం కారణమాత్రంగానే పరమాత్మ భౌతికరూపంలో కృష్ణుడుగా అవతరించాడని ఎరిగిన అతి కొద్దిమంది భక్తాగ్రేసరుల్లో భీష్ముడు ఒకడు. అయితే, ఇతరుల మాదిరిగా భీష్ముడు ఎక్కడా బాహాటంగా తన కృష్ణభక్తిని ప్రకటించలేదు. కేవలం ఒకే ఒక సందర్బంలో... అదీ యుద్ధభూమిలో ఉండగా, తాను నమ్మినదైవమైన పరమాత్మే స్వయంగా తనను చంపుతానని చక్రం చేపట్టినప్పుడు అంతకంటే తనకు కావలసింది ఏమున్నదంటూ పరమాత్మకు సాగిలపడతాడు.

సీ॥               కుప్పించి యెగసిన కుండలంబుల కాంతి

                                                గగన భాగంబెల్ల గప్పికొనగ

                        నుఱికిన నోర్వక యుదరంబులోనున్న

                                                జగముల ప్రేగున జగతి కదల

                        జక్రంబు జేపట్టి చనుదెంచు రయమున

                                                బైనున్న పచ్చని పటము జాఱ

                        నమ్మితి నాలావు నగుబాటు సేయక

                                                మన్నింపుమని క్రీడి మఱల దిగువ

తే॥                         గరికి లంఘించు సింహంబు కరణి మెఱసి

                                    నేడు భీష్ముని జంపుదు నిన్ను గాతు

                                    విడుమర్జున యనుచు మద్విశిఖ వృష్టి

                                    దెరలి చనుదెంచు దేవుండు దిక్కునాకు

            శ్రీకృష్ణుని విశ్వవ్యాపకునిగా, అణువణువులో నిండిన పరమాత్మగా దర్శించాడు భీష్ముడు. నన్ను చంపుతానని స్వయంగా చక్రం చేపట్టిన పరమాత్మే నాకు దిక్కు అంటూ మొక్కుతాడు. అదీ భీష్ముని కృష్ణభక్తి. భీష్ముని పాత్ర ద్వారా లోకానికి అందిన నీతి.

అంపశయ్యపై ధర్మబోధ

            భారతయుద్ధంలో మొదటి అంకం పూర్తయింది. భీష్ముడు అంపశయ్యపైకి చేరాడు. ఎంతటి ప్రజ్ఞ, ధర్మచింతన కలిగిన వాడైనా కొన్ని సందర్భాల్లో నోరు మెదపకుండా, ధర్మానికి గ్లాని జరుగుతున్నా చూసి ఊరుకున్న కారణంగా వచ్చిన దోషాన్ని పోగొట్టుకోవటానికే అంపశయ్యపై పడుకున్నాడు. నిజానికి స్వచ్ఛంద మరణశక్తి ఉన్నా పునరావృత్తి రహితమైన మోక్షాన్ని అందుకోవాలంటే చేసుకున్న పాపం పూర్తిగా నశించాలి. అందుకే అంపశయ్యపైకి చేరాడు. తన బాణాల ధాటికి కృష్ణుడు కూడా తట్టుకోలేకపోయాడని యుద్ధభూమిలోనే అన్న అహంకారం భీష్మునిలో ఉంది. అంపశయ్యపైకి చేరటం ద్వారా ఆ అహంకారం నశించింది. దైవబలం ముందు భుజబలం అణిగి ఉండాలని అర్థమైంది.

            ఇప్పుడతడు పూర్తిగా దైవచింతనలో, అహంకార మమకారాలకు, అరిషడ్వార్గాలకు, లౌకికబంధాలకు అతీతుడయ్యాడు. అందుకే కృష్ణపరమాత్మ నీ బిడ్డలకు ధర్మబోధ చెయ్యవయ్యా అని అంపశయ్య మీద ఉన్న భీష్మునికి చెప్పాడు. స్వామీ! నువ్వే చెప్పవచ్చు కదా! అంటాడు భీష్ముడు. ఆచరించిన అనుభవజ్ఞుడు చెబితేనే ధర్మానికి విలువ. అందుకే నీ చేత చెప్పిస్తున్నాను అన్నాడు పరమాత్మ. సరే!నన్నాడు భీష్ముడు.

            అదొక దివ్యముహూర్తం. తరతరాల పాపాలను క్షయం చేసే విష్ణుసహస్రనామ స్తోత్రం లోకానికి అందింది. వెయ్యి నామాల్లో అనంతుని అనంతశక్తిని వివరించాడు భీష్ముడు. ఎన్ని యుగాల నాటి మాట ఇది. కాలప్రమాణాలకు అందని చిరపురాతనమైనా అధునాతన ప్రపంచంలోనూ భీష్మకృతమైన విష్ణుసహస్ర నామ స్తోత్రానికి వెలుగు తగ్గలేదు. సకల పాపహారిణిగా ఇప్పటికీ మానవుల్ని తరింపజేస్తోంది. ఈవిధంగా విష్ణు సహస్రనామాలను అందించి, తాను తరించటం మాత్రమే కాదు... తనతోటి వారిని, తన సమాజాన్ని ... చివరకు తన లోకాన్నే పావనం చేయించిన అగణిత పుణ్యశీలి భీష్మపితామహుడు.

            కేవలం విష్ణు సహస్రనామ స్తోత్రం మాత్రమే కాదు... మహాభారతంలోని శాంతి, అనుశాసనిక పర్వాలు పూర్తిగా భీష్ముడు చేసిన బోధలతో నిండిఉంటాయి. జీవితపు చివరిక్షణంలో సమాజ ఉద్ధరణ గురించి ఆలోచించిన దార్శనికుడు భీష్మాచార్యుడు.

భీష్మాష్టమి

            మాఘ శుక్ల సప్తమి మొదలు ఏకాదశి వరకు గల ఐదు రోజులను భీష్మ పంచకాలుగా ప్రసిద్ధిపొందాయి. భారతయుద్ధం సమయంలో క్షతగాత్రుడైన భీష్ముడు దక్షిణాయనంలో ప్రాణం వదలడానికి ఇష్టపడడు. ఆయనకు స్వచ్ఛందమరణం పొందే వరం ఉంది. కాబట్టి ఉత్తరాయణం వచ్చే వరకూ అంపశయ్యపై పరుండి ఉండి మాఘ శుక్ల సప్తమి నుండి ఐదు రోజుల్లో రోజుకొక ప్రాణాన్ని విడిచిపెట్టాడు. కాలనిర్ణయ చంద్రిక, నిర్ణయసింధు, ధర్మసింధు, కాలమాధవీయం తదితర గ్రంథాలు కూడా మాఘ శుద్ధ అష్టమిని భీష్మ నిర్యాణదినంగా చెబుతున్నాయి.

            పద్మపురాణం హేమాద్రి వ్రత ఖండంలో భీష్మాష్టమి గురించి చెప్పబడిరది. భీష్మాష్టమి రోజున భీష్మునికి తిలాంజలి సమర్పించే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ రోజు భీష్మునికి తర్పణం విడవాలని స్మృతి కౌస్తుభం తెలుపుతున్నది. కృత్యసార సముచ్చయాధారంగా భీష్మాష్టమి శ్రాద్ధదినం. భీష్మ ద్వాదశి వ్రతం ప్రారంభించేది కూడా ఈ రోజే అని నిర్ణయ సింధువు స్పష్టపరుస్తున్నది. భీష్మాష్టమి భారత దేశమంతటా జరుపుకోవాల్సిన పర్వమని వ్రతోత్సవ చంద్రిక సూచిస్తున్నది. ‘’వైయాఘ్య్రసద్య గోత్రాయ సాంకృత్య ప్రవరాయచ అపుత్రాయ తదామ్యే తజ్జలం భీష్మాయవర్మణే వసూ రామావతారాయ శంతనోరాత్మజాయచ అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల బ్రాహ్మచారిణే’’. అంటూ ఈ రోజున భీష్ములకు తర్పణం విడవాలని చెబుతారు. ఈ తర్పణం, శ్రాద్ధం చేసిన వారికి సంవత్సర పాపం నశిస్తుంది.

జీవన సందేశం

            ఎప్పుడూ మారిపోతూ ఉండే మన ఆలోచనలు, ఇంద్రియాల అనుభవాలు అనే వాటి వెనుక మారకుండా ఉండే చైతన్యం తాలూకూ ఏకత్వమే అహంకారం. నేను ఆలోచిస్తున్నాను’, ‘నేను రాస్తున్నాను’, ‘నేను చూస్తున్నాను’, ‘నేను వింటున్నాను’, ‘నేను బాధపడుతున్నాను’, ‘నేను సుఖిస్తున్నానుఅనే రకరకాల మార్పుల వెనుక వాటన్నిటికి కర్తగా అహంకారం ఉంటుంది.

            ఈ ఆలోచనలన్నిటికీ యజమాని నేనుఅనే భావన. నేనువేరు, ఆలోచనలు వేరు. కళ్ళు చూడలేనప్పుడు కళ్ళను మాత్రమే గుడ్డి అనకుండా నేను గుడ్డివాడినిఅని గుడ్డి తనాన్ని తనకు ఆపాదించుకోవటం తప్పే కదా? కళ్ళు నాశనమైపోయినంత మాత్రాన మనం నాశనం కావాల్సిన అవసరం లేదు. కానీ, లౌకిక మాయ కారణంగా ప్రతి వ్యక్తీ అనుభవాన్ని, అనుభవించేవాడిని కలిపి ఒకటే భావనలో చూస్తుంటాడు. ఇదంతా అహంకారం వల్ల పుడుతుంది. ఈ అహంకారం నాశనమైపోవాలంటే కళ్ళు మూసుకుని, చూపుని లోపలికి తిప్పి, అక్కడ ఉన్న మహాచైతన్యాన్యం మీదే దృష్టి నిల్పి, తదేకంగా ధ్యానం చెయ్యాలి. అలా ధ్యానం చేస్తూ చేస్తూ చివరకు ఆ చైతన్యంలోనే లీనమవ్వాలి. భీష్ముడు చేసింది అదే. శ్రీకృష్ణపరమాత్మని ఎదురుగా చూస్తూ, ఆ మూర్తిని ధ్యానపథంలో ఉంచుకునే ప్రాణాలు వదిలిపెట్టాడు. అంటే ఆంతరిక చైతన్యంలో జీవచైతన్యాన్ని లయం చేశాడు. ఇలా జరగాలంటే అహంకారం నశించాలి. ఇందుకు ధ్యానం ఒక్కటే మార్గం. అంపశయ్యపై ఉండి కూడా నిరంతర ధ్యానంతో పరమాత్మలో లీనమైన భీష్మ నిర్యాణ ఘట్టం మానవాళికి అందించే సందేశం ఇదే. అందుకే తరాలు మారినా, యుగాలు గడిచినా భారతజాతి భీష్మపితామహునికి ఋణపడి ఉంటుంది. ఆయన్ను తమ జాతి నాయకుడిగా సగర్వంగా ప్రకటిస్తుంది.

---------------------------

రచన : డాక్టర్ కప్పగంతు రామకృష్ణ, సెల్ : 9032044115 / 8897 547 548

----------------------------------------







 

ఆరోగ్య ప్రదాత సూర్యభగవానుడు

(రథసప్తమి పర్వదినం సందర్భంగా ఆరాధన మాసపత్రిక ఫిబ్రవరి 2022 సంచికలో ప్రచురితమైన వ్యాసం)




సప్తలోక ప్రకాశాయ సప్త సప్త రథాయ చ । సప్త ద్వీప ప్రదీపాయ భాస్కరాయ నమో నమ: ॥

          సకల చరాచర జగత్తుకు వెలుగును, తేజస్సును ప్రసాదించేవాడు సూర్యభగవానుడు. ఈయన భూమి మీద తొలిగా తన వెలుగును ప్రసాదించిన రోజు సప్తమి. అందుకనే మాఘ శుద్ధ సప్తమి సూర్యజయంతిగా, రథ సప్తమిగా  లోకప్రసిద్ధి పొందింది.

          సూర్యునికి వివస్వంతుడనే పేరు ఉంది. వివస్వంతుని కుమారుడు వైవస్వతుడు. ఇతని మన్వంతరం ప్రారంభమైంది కూడా సప్తమి రోజునే. సూర్యుడు తన రథాన్ని అధిరోహించింది కూడా మాఘ శుద్ధ సప్తమి రోజునే. అందుకనే మాఘ శుద్ధ సప్తమి రథసప్తమిగా ప్రసిద్ధి పొందింది. మత్స్యపురాణంలో ఈ వివరాలు ఉన్నాయి.

          మనకు 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. వీరందరిలో మన చర్మచక్షువులకు ప్రత్యక్షంగా దర్శనమిచ్చే ఒకే ఒక దైవం సూర్యభగవానుడు. అందుకనే ఆయన కర్మసాక్షి అయ్యాడు. సకల వేద, పురాణ, ఇతిహాస, కావ్య వాజ్ఞ్మయమంతా సూర్యోపాసన వైశిష్ట్యాన్ని ప్రకటిస్తుంది.

          సమస్త లోకాలకు కర్మసాక్షి సూర్యభగవానుడు. అనంతమైన శక్తితో కూడిన కిరణాలతో లోకాలన్నిటికీ వెలుగును, తేజస్సును ప్రసాదించే జ్యోతి స్వరూపుడు. అన్ని ఐశ్వర్యాలకన్నా పరమోన్నతమైన ఆరోగ్యభాగ్యాన్ని వరప్రసాదంగా భక్తులకు అనుగ్రహించే కరుణామూర్తి. అందుకనే, ఆదిత్యోపాసన సర్వోన్నతమైందిగా, సకల పాపాలను పోగొట్టే తారకమంత్రంగా శాస్త్ర, పురాణ, ఇతిహాస గ్రంథాలు చెబుతున్నాయి.

          సూర్యోపాసన చేసి, సూర్యశతకాన్ని రచించిన పుణ్యం చేత మయూరుడనే కవి కుష్ఠువ్యాధి నుంచి విముక్తుడయ్యాడు. అగస్త్య మహర్షి చేత ఆదిత్యహృదయాన్ని ఉపదేశం పొంది, దాన్ని పారాయణ చేసిన ఫలితంగా శ్రీరామచంద్రమూర్తి రావణాసురిడిని సంహరించాడు. ఇంకా మరెందరో పుణ్యమూర్తులు సూర్యోపాసన చేసి, రథసప్తమీ వ్రతాన్ని ఆచరించిన పుణ్యప్రభావం చేత ఎన్నో బాధల నుంచి విముక్తులైన గాథలు ఉన్నాయి. మొత్తంగా సూర్యోపాసన అనంతమైన ఫలితాలను ఇస్తుంది.

          సూర్యగ్రహ గమనాన్ని బట్టే ఋతువులు, ఉత్తర, దక్షిణాయనాలు ఏర్పడతాయి. ఈవిధంగా సూర్యగమనంలో మార్పుల వల్ల ఏర్పడ్డ ఉత్తరాయణమే మకర సంక్రమణంగా, సంక్రాంతి పండుగగా లోకంలో వ్యాప్తి చెందింది. ఆధునిక విజ్ఞానశాస్త్రం కూడా సూర్యుడి నుంచి వచ్చే వేడి వల్ల సముద్రాలు, నదుల్లోని నీరు ఆవిరవుతుందని,  ఆ ఆవిరి మేఘాలుగా మారి, వర్షించటం వల్ల సకల ప్రాణికోటి తాగటానికి మంచి నీరు, పంటలు పండటానికి తగిన నీరు లభిస్తోందని చెబుతోంది. ఈవిధంగా చూసినా అఖండ భూమండలం మీద సకల ప్రాణులకు జీవనాధారుడు సూర్యుడే అని స్పష్టమవుతోంది.

 

సౌరార్చన విశేషాలు

  •         ఆదివారం నాడు తెల్లజిల్లేడు సమిధలు ఉపయోగించి మహాసౌమంత్రంతో హోమం చేసినవారికి అభీష్టసిద్ధి కలుగుతుంది.
  • ·        ఆదివారం రోజున తెలుపు, ఎరుపు, పసుపుపచ్చని మృత్తికలను ఒంటికి పూసుకుని, మృత్తాకాస్నానం చేసిన వారికి కోరికలు సిద్ధిస్తాయి.
  • ·         వివిధ రంగుల పూలతో ప్రతి ఆదివారం విడువకుండా ఆదిత్యుని పూజించి, ఆ రోజు ఉపవాసం ఉన్నట్లయితే కోరికలు అతిశీఘ్రంగా నెరవేరుతాయి
  • ·         ప్రతి ఆదివారం ఆవునెయ్యితో గాని, నువ్వుల నూనెతో గాని దీపారాధన చేసి, ఆ దీపాన్ని సూర్యస్వరూపంగా భావించి పూజించినట్లయితే నేత్రవ్యాధుల నుంచి విముక్తి లభిస్తుంది.
  • ·         రాగిపాత్రలో నువ్వులనూనెతో దీపారాధన చేసి, ఆ దీపాన్ని బ్రాహ్మణుని దానం చేసినవారికి జ్ఞానప్రాప్తి కలిగి, అంతిమంగా ముక్తి లభిస్తుంది
  • ·         చతుష్పథం (నాలుగు రోడ్లు కలిసే కూడలి)లో ప్రయత్నపూర్వకంగా ద్వాదశాదిత్యులను ఉద్దేశించి 12 దీపాలు దానం చేసిన వారు భాగ్యవంతులు అవుతారు. మరుసటి జన్మలో రూపవంతులు, భాగ్యవంతులు అవుతారు
  • ·         పచ్చకర్పూరం, కుంకుమపువ్వు, రక్తచందనం, ఎర్రని పుష్పాలు, అక్షతలు, తిలలు, గరిక ఇగుళ్ళు కలిపిన జలంతో నిత్యం ద్వాదశాదిత్యులకు 12 అర్ఘ్యాలు ఇచ్చి, ఆ ద్రవ్యాలతో ఆదిత్యుని అర్చించి, ఒక సంవత్సరం పాటు అష్టాక్షరీ మహామంత్రాన్ని దీక్షగా జపించిన వారికి సంవత్సరాంతంలో ఇష్టసిద్ధి తప్పకుండా కలుగుతుంది.
  • ·         సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సూర్యునుకి అభిముఖంగా నిలబడి, సౌరమంత్రం జపించినా, సూర్యస్తోత్రాలు పారాయణ చేసినా జన్మ ప్రారంభం నుంచి అప్పటివరకు చేసిన పాపాలు నశిస్తాయి.
  • ·         గుగ్గులు కర్ర, మారేడు చెక్క లేదా దేవదారు చెక్కతో నలుపలుకలుగా ఉండే ఆసనం తయారుచేసి, దాని మీద ప్రభాకరుని ఆవాహన చేసి, కర్పూరం, అగరు మొదలైన ద్రవ్యాలతో అర్చించిన వారికి స్వర్గలోక ప్రాప్తి స్థిరంగా కలుగుతుంది.
  • ·         విషువఅనే పుణ్యకాలంలో సూర్యార్చన చేసిన వారికి సమస్త పాపాల నుంచి ఉపశమనం కలుగుతుంది.
  • ·         పులగం, పాయసం, అప్పాలు, పండ్లు, దుంపలు, నెయ్యి తదితర ద్రవ్యాలతో సూర్యబలి ఇచ్చిన వారికి కోరికలన్నీ తీరుతాయి.
  • ·         మూలమంత్రాన్ని పారాయణ చేస్తూ, ఆవు నేతితో తప్పరణ చేసిన వారికి సర్వసిద్ధులు కలుగుతాయి. ఆవుపాలతో తర్పణ చేస్తే మనస్తాపాలు తొలగిపోయి, మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆవుపెరుగుతో తర్పణ చేస్తే కార్యసిద్ధి కలుగుతుంది.
  • ·         పవిత్ర తీర్థజలాలతో అరుణ, మహాసౌర మంత్రాలతో సూర్యునికి అభిషేకం చేస్తే పరమపదం లభిస్తుంది.
  • ·         భక్తిశ్రద్ధలతో ఆదిత్యుడిని ఒక్కరోజు పూజించిన ఫలితం వంద యాగాలు చేసిన ఫలితాన్నిస్తాయని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి.

వేదాల్లో సూర్యోపాసన

          కృష్ణయజుర్వేదంలో సూర్యవైభవం ఎన్నో చోట్ల కనిపిస్తుంది. తరణిర్విశ్వదర్‌శతో జ్యోతిష్కృదశి సూర్య...  (కృష్ణ యజుర్వేదం, సంహిత, 1 ` 4)లో అనే మంత్రం చీకటితో నిండి ఉన్న సకల జగత్తు అంతా సూర్యుని కాంతి వల్లనే దృగ్గోచరమవుతుందని చెబుతోంది.

          నారాయణోపనిషత్తు ఘృణిస్సూర్య ఆదిత్యోం న ప్రభావాత్యక్షరం మధుక్షరన్తి తద్రసం...అంటుంది. సముద్రాల్లోని ఉప్పు నీటిని తన కిరణాల ద్వారా గ్రహించి, తన ప్రభావం చేత ఆ ఉప్పు నీటిని తాగటానికి యోగ్యమైన నీరుగా, ఓషధీగుణాలు కలిగినదిగా మార్చి, మేఘాల ద్వారా వర్షింపజేస్తాడు సూర్యభగవానుడు. ఈవిధంగా సూర్యభగవానుడి అనుగ్రహ ఫలితంగా అందిన వాన నీటి ద్వారానే పంటలు పండుతాయి. పంటల వల్ల మానవాళికి అన్న సమృద్ధి కలుగుతుంది. అంటే, సకల మానవాళి మనుగడకు సూర్యుడే జీవాధారం అని వేదం స్పష్టం చేస్తోంది.

          నారాయణోపనిషత్తులో ఆదిత్యోవా ఏష ఏతన్మండలం తపతి తత్రతా ఋచ:...అని ఉంటుంది. అంటే సూర్యుని ఆవరించి ఉండే తేజస్సు ఋగ్వేద స్వరూపం. ఆయన నుంచి లోకాలకు అందే వెలుగు సామవేదం. సాక్షాత్తు సూర్యభగవానుడే యజుర్వేద స్వరూపం అని అర్థం.

          సూర్యస్యచక్షూ రజసైత్యావృతం తస్మినార్పిత భువనాని విశ్వా...’ (ఋగ్వేదం, 1`164`14) సూర్యుని పైనే సమస్త ప్రాణికోటి ఆధారపడి ఉంది. సూర్యుడు పరమాత్మ స్వరూపుడు.

          శ్రౌత కర్మల్లో నిర్వహించే యజ్ఞయాగాది క్రతువుల్లో సూర్యునికే అగ్రస్థానం. చంద్రుని వెన్నెల కూడా సూర్యుని వెలుగు ద్వారా ఏర్పడిరదే. ఓషధుల్లో ఉండే ఔషధ గుణం సూర్యుని వెలుగు ద్వారా ఏర్పడిరదే. ఇంకా మరెన్నో సూర్యవైభవాలను ప్రకటించే విశేషాలను వేదాలు విస్తారంగా చెబుతున్నాయి.

          సూర్యారాధన వల్ల విజ్ఞానం, ఉత్తమ గుణాలు, వర్చస్సు, ఆయుష్షు, ధనం, సంతానభాగ్యం కలుగుతాయి. వాత, పిత్త, క్షయ, కుష్ఠు వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. మొత్తంగా ఆరోగ్య సంపద ఆదిత్యుని ఉపాసన ద్వారా వరంగా లభిస్తుంది.

          బ్రహ్మ స్వరూపముదయే మధ్యాహ్నేతు మహేశ్వరః ।

          సాయంధ్యాయేస్సదా విష్ణుం త్రయీమూర్తిర్దివాకరః॥

          సూర్యభగవానుడు త్రిమూర్తి స్వరూపుడు. జీవుల పుట్టుక, పెరుగుదల, క్షయం అన్నీ సూర్యతేజస్సు వల్లే జరుగుతున్నాయి. ఈవిధంగా సూర్యుడు త్రిమూర్తి స్వరూపుడయ్యాడు.

          ఇతిహాస, పురాణాల్లోనూ సూర్య మహిమ అనేక చోట్ల కనిపిస్తుంది. యాజ్ఞవల్క్య మహర్షి సూర్యోపాసన ద్వారా వాజసనేయ సంహిత (శుక్ల యజుర్వేదం) పొందాడు. వాయుదేవుని కుమారుడైన ఆంజనేయుడు కూడా సూర్యుని గురువుగా స్వీకరించి, ఆయన నుంచి సకల విద్యలు వరంగా అందుకున్నాడు. కుంతీదేవి సూర్య మంత్రాన్ని ఉపాసించటం ద్వారా సంతానం (కర్ణుడు) పొందింది. సత్రాజిత్తు సూర్యుని ఆరాధించటం వల్లనే శమంతకమణి సాధించాడు. అరణ్యవాస కాలంలో ధర్మరాజు సూర్యోపాసన చేసి, అక్షయ పాత్రను పొంది, తన ఆశ్రమానికి వచ్చిన వేలాది మందికి అన్నదానం చేశాడు.

          ప్రస్కణ్వుడనే మహర్షి సూర్యమంత్రాలను ఉపాసన చేయటం ద్వారా తన చర్మరోగం నుంచి విముక్తి పొందాడు. భద్రేశ్వరుడనే రాజు కూడా ఆదిత్యోపాసన ద్వారా శ్వేత కుష్ఠురోగం నుంచి ఉపశమనం పొందాడని పద్మపురాణంలో ఉంది. సూర్యగాయత్రి, అరుణం, మహాసౌరం, ఆదిత్యహృదయం, మయూర శతకం మొదలైన వాటిని పారాయణ చేయటం ద్వారా అనేక శారీరక, మానసిక రుగ్మతల నుంచి విముక్తిపొందిన భక్తుల కథలు ఎన్నో ఉన్నాయి.

          ప్రత్యేకించి, రథసప్తమి రోజున చేసే స్నానం, సూర్యారాధన అనేక విశేష ఫలితాలను అందిస్తాయి. ఈ రోజున జిల్లేడు ఆకులను శిరసు, భుజాల మీద ఉంచుకుని స్నానం చేయాలి.  గోధుమనూకతో చేసిన పొంగలిని సూర్యునికి నివేదన చేయాలి. ఇందువల్ల ఏడుజన్మల్లో చేసిన పాపం నశిస్తుందని నారద పురాణం చెబుతోంది.

          సూర్యగమనం ఆధారంగానే ఋతువులు, అయనాలు (ఉత్తరాయణం, దక్షిణాయనం) ఏర్పడతాయి. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే సందర్భం మకర సంక్రమణం. ఆ తర్వాత మాఘ శుద్ధ సప్తమి నుంచి సూర్యగమనం దక్షిణదిశకు మారుతుంది. ఈవిధంగా, రథసప్తమి ఖగోళ విజ్ఞానానికి సంకేతంగా నిలుస్తుంది.

          మాఘ మాసం, శుక్ల పక్షంలో షష్ఠి తిథితో కూడిన సప్తమి వస్తే, అది మరింత పర్వదినం. ఆ రోజు సూర్యునికి ఎంతో ప్రీతికరం. సాధారణ రథసప్తమి పర్వదినాల కన్నా షష్ఠితో కూడిన సప్తమి రోజున చేసే సూర్యారాధన మరింత ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది.

          యద్యజ్జన్మకృతం పాపం మయా సప్తసు జన్మసు

          తన్మే రోగం చ శోకం చ మాకరీ హంతు సప్తమీ

          ఏతజ్జన్మ కృతం పాపం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పున:

          ఇతి సప్తవిధం పాపం స్నానాన్మే సప్త సప్తికే

          సప్తవ్యాధి సమాయుక్తం హర సప్తమి మే హర ॥

          ఏతన్మంత్రమయం జప్త్వా స్నాత్వా పాదోదకే నర:

          కేశవాదిత్య మాలోక్య క్షణాన్నిష్కల్మషో భవేత్‌ ॥

          రథసప్తమి రోజున ఈ శ్లోకాన్ని పఠిస్తూ, శాస్త్రవిధిగా స్నానం చేయాలని, ఫలితంగా ఏడు జన్మల్లో చేసిన పాపాలు నశిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.

          జ్యోతిషశాస్త్రం ప్రకారం శారీరక రోగాలు ఉన్నవారు సూర్యారాధన చేస్తే, మంచి ఫలితాలు కలుగుతాయి. ప్రత్యేకించి నేత్రదోషాలు, చర్మవ్యాధుల నుంచి సూర్యోపాసన ద్వారా వేగంగా ఉపశమనం లభిస్తుంది.

          మొత్తంగా సూర్యోపాసన సకల వ్యాధులను దూరం చేసేదిగా, సకల పాపాలను పోగొట్టే ఉత్తమ వ్రతంగా లోకవ్యాప్తిలో ఉందని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.

----------------------------

రచన: డాక్టర్‌ కప్పగంతు రామకృష్ణవిజయవాడ -3, సెల్‌: 90320 44115






దాసశిఖామణి పురందరదాసు

దాస శిఖామణి పురందరదాసు
ఫిబ్రవరి 1, 2022 పురందరదాసు ఆరాధన సందర్భంగా ప్రత్యేక వ్యాసం



దాస శిఖామణి పురందరదాసు

          భక్తి ఉద్యమంలో దాస సాహిత్యాన్ని పతాకస్థాయికి తీసుకువెళ్ళిన వాగ్గేయకార శిఖామణి పురందరదాసు. భావ, రాగ, లయల ఉత్తమ సమ్మేళనంగా స్వరావళి, జంటస్వరాలు, అలంకారాలు, లక్షణగీతాలు, ప్రబంధాలు, దాటువరుసలు మొదలైనవెన్నో రచించి మొత్తం కర్ణాటక సంగీత రంగంలోనే నూతన శకానికి ఊపిరిపోసాడు. సనాతన సంగీత సంప్రదాయ పునాదుల అధునాతన స్వర సౌధాలు నిర్మించి ‘కర్ణాటక సంగీత పితామహుడు’గా చిరకీర్తిని పొందాడు.

          పురందరుడి అసలు పేరు శ్రీనివాస నాయక్. మహారాష్ట్ర సమీపంలోని పురందరగడ్ అనే గ్రామంలో జన్మించాడు. పుట్టుకతోనే అత్యంత ధనవంతుడు. పరమ పిసినారి కూడా. విజయనగర సామాజ్ర పరిధిలో ఈ గ్రామం ఉండేది. పూర్వికుల నుంచి వచ్చిన వజ్రాలు, వడ్డీ వ్యాపారాల్లో ఆరితేరి నవకోటి నారాయణుడు అనే పేరుతో ప్రసిద్ధి పొందాడు. పురందరుడి భార్య సరస్వతీబాయి. పరమ భక్తురాలు.  గొప్ప దయాగుణం కలిగిన మనిషి అయినప్పటికీ భర్త కారణంగా ఏ దానం చెయ్యలేకపోయేది. ఇంతటి పరమలోభి సర్వసంగ పరిత్యాగి కావటం వెనుక పరమాత్మ సంకల్పం ఉండనే ఉంది.

          ఓ ముసలి బ్రాహ్మణుడు తన కుమారుడి ఉపనయనం కోసం ధన సహాయం చెయ్యమంటూ శ్రీనివాసుడి దగ్గరకు వస్తాడు. ఇవాళ, రేపు అంటూ నెలల తరబడి తిప్పుతాడు కానీ అతడు చిల్లిగవ్వ కూడా ఇవ్వడు. విసిగిపోయిన ఆ బ్రాహ్మణుడు సరస్వతీ బాయిని కలిసి వివరాలు చెబుతాడు. ఆమె తన నిస్సహాయ స్థితిని అతడికి చెప్పి, తన ముక్కెర ఇచ్చి పంపిస్తుంది. బ్రాహ్మణుడు ఆ ముక్కెరను శ్రీనివాస నాయక్ దగ్గర తాకట్టు పెట్టడానికి వెళ్తాడు. అనుమానం వచ్చిన అతడు భార్యను నిలదీస్తాడు. విఠలుడి మాయతో ముక్కెర భార్య దగ్గరే ఉంటుంది. జరిగినదంతా తెలుసుకున్న శ్రీనివాసుడికి జ్ఞానోదయం అవుతుంది. తనలో మార్పు తీసుకురావటానికే విఠలుడు ముసలి బ్రాహ్మణుడి రూపంలో నాటకం ఆడాడని తెలుసుకుంటాడు.

          అప్పట్నుంచీ శ్రీహరికి పరమ భక్తుడయ్యాడు. నవకోటి నారాయణుడు నారాయణ భక్తుడయ్యాడు. బంగారువజ్రాల నగల అలంకరణతో మెరిసిపోయిన చేతులు తంబురాను పట్టుకున్నాయి. మేలిమి బంగారు హారాలతో నిండిపోయిన మెడలో ఇప్పుడు తులసి మాలలు దర్శనమిస్తున్నాయి. దేహీ అంటూ వచ్చిన యాచకులను తిప్పి పంపిన తాను ఇప్పుడు ఉదర పోషణార్థం భిక్షమెత్తుతున్నాడు. నలుగురితో పాటు జన్మించి నలుగురితో పాటు మట్టిలో కలిసిపోవాల్సిన శ్రీనివాస నాయక్ పురందరదాసు అయ్యాడు. పుట్టిన కొన్ని శతాబ్దాల తర్వాత కూడా తన కీర్తనల ద్వారా ప్రజల నాలుకలపై నాట్యమాడుతూ ఉన్నాడు. పరసవేది స్పర్శతో రాయి కూడా బంగారమైనట్లు పరమ లోభి కూడా ఆ భగవంతుని కృపతో హరిదాసులకు ఆది గురువయ్యాడు.

          శ్రీ కృష్ణదేవరాయల గురువైన వ్యాసరాయల్ని ఆశ్రయించి పురందరదాసు అనే దీక్షానామంతో ప్రసిద్ధి పొందాడు శ్రీనివాసుడు. అప్పట్నించీ హరినామం తప్ప మరొక ధ్యాస, శ్వాస ఆయనకు లేవు. శ్రీహరి నామాలు పాడుకుంటూ సంచార జీవితం గడపసాగాడు. వేద, శాస్త్ర, పురాణ, కావ్య, ప్రబంధ విజ్ఞానం మొత్తాన్ని తన పదాల్లో నిక్షిప్తం చేసేవాడు. సామాన్యులే లక్ష్యంగా చేసుకుని వారికి అర్థమయ్యేలా తేలికైన పదాలతో రచనలు చేసాడు. దీంతో అతి స్వల్పకాలంలోనే పురందరుడి పేరు మార్మోగిపోయింది. ఎవరి నోట విన్నా పురందరుడి గీతమే వినిపించింది. ఈ పదాలన్నీ కలిసి ‘పురందరోపనిషత్’ గా మారాయి. గురువు వ్యాసరాయలు కూడా ‘దాసరందరే పురందరదాసరయ్య’ – దాసుడంటే పురందర దాసేనయ్యా... అంటూ శిష్యభక్తికి ఉప్పొంగిపోయాడు.

          పురందరుడి పదాల్లో నవవిధ భక్తులు, ఐదు పరమభావాలు ఉన్నాయి. రాధాకృష్ణుల భాగవతభక్తి ఇతడి పదాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. బాలకృష్ణుడు వెన్నను దొంగిలించటం, గోపికలు యశోదతో మొరపెట్టుకోవటం, కన్నయ్య గోపికలతో విహరించటం వంటి లీలల్ని పురందరుడు తన పదాల్లో చక్కగా వర్ణించాడు. భక్తి, జ్ఞాన, వైరాగ్య మార్గాల్లోనూ అతడి రచనలు సాగాయి.

          భక్తికి ఆడంబరాలు అవసరం లేదంటాడు పురందరుడు. స్నాన, జప, తపాలు దృఢమైన విశ్వాసం కలిగిన భక్తులకు అవసరం లేదంటాడు. అప్పట్లో ఆచారాల పేరుతో జరిగే అనాచారాల్ని నిర్మొహమాటంగా ఖండించాడు. వైరాగ్యానికి మార్గం చూపాడు. ఇవన్నీ అతడి రచనల్లో స్పష్టంగా కనిపిస్తాయి.

          పురందరుడు కర్ణాటక సంగీతంలో లెక్కలేనన్ని ప్రయోగాలు, పరిశోధనలు చేసాడు. మాయామాళవ గౌళ రాగాన్ని సృష్టించాడు. నూతన సంగీత అభ్యాసకులకు ఈ రాగం ఒక వరంగా మారింది. అన్నిరకాల గాత్రభేదాలు కలిగినవారూ తేలికగా పాడుకోగలిగిన రాగం ఇది. సాధారణంగా సంగీత గురువులు శిష్యులకు మొదటగా ఈ రాగమే నేర్పుతారు. దీంతో సాధకుడికి తానూ కీర్తన పాడగలనన్న ఆత్మవిశ్వాసం కలుగుతుంది. ప్రారంభదశ అభ్యాసకులకు వీలుగా ఉండటానికి సరళి, జంట స్వరాల వరుసలూ, అలంకారాలు, విళ్ళారి గీతాలు, ఘనరాగ గీతాలు, ప్రబంధాలూ రచించాడు. ఎన్నో వేల సంవత్సరాల తర్వాత కర్ణాటక సంగీతం అప్రహతిహతంగా వెలుగుతుండటానికి పురందరాసు మాత్రమే కారణం అని విమర్శకులు కూడా అంగీకరిస్తారు.

          పురందరుడు రాసిన కీర్తనల్ని ‘దాసరపదగళు’, ‘దేవరనామ’ అనీ వ్యవహరిస్తారు. మాంజి భైరవి, ద్విజావంతి, శ్యామకల్యాణి, మారవి, మధూ, మాధవి, వసంతభైరవి వంటి అపూర్వ రాగాల్లో ఈయన చేసిన రచనలు, చేసిన ప్రయోగాలు సంగీతరంగంలో సంచలనం సృష్టించాయి.

          హంపీ చేరి ఒక మండపం లో ఉంటూ చివరి జీవితాన్ని గడిపాడు. దీన్ని ఇప్పటికీ పురందర మండపంగా పిలుస్తారు. దాదాపు 4,75,000  కీర్తనలు రాసి సంగీత ప్రపంచంలో మరెవ్వరూ సాధించలేనంత ఎత్తుకు ఎదిగాడు.  మిగిలిన 25 వేల కీర్తనలూ రాసి తాను  అనుకొన్న 5 లక్షల కీర్తనలు పూర్తి చేయమని చిన్న  కొడుకు మధ్వపతిని  కోరాడు. తాను  ఈ జన్మలో అంతటి పని చేయలేనని మరోజన్మలో రాసి తండ్రి కోరిక తీరుస్తానని అన్నాడు  మధ్వపతి. అతడే తర్వాతికాలంలో కర్ణాటక, రాయపూర్ జిల్లా చీకలపర్వి లో ‘’విజయదాసు ‘’గా జన్మించి తండ్రికి చేసిన వాగ్దానం ప్రకారం 25 వేల  కీర్తనలు శ్రీ లక్ష్మీ నారాయణస్వామిపై రచించాడు. త్యాగరాజ స్వామి తన ‘ప్రహ్లాద భక్త విజయం గేయ నాటకం లో పురందర దాసును ప్రస్తుతించారు. జీవితం చివరిదశలో సన్యాసాశ్రమం స్వీకరించి రక్తాక్షి నామ సంవత్సరం (క్రీ.శ 1564, జనవరి 2) పుష్య అమావాస్య రోజున సిద్ధిపొందారు.

---------------------------------------------------------

రచన : డాక్టర్ కప్పగంతు రామకృష్ణ, సెల్ : 9032044115 / 8897 547 548








         

 


 

పున్నమి కాంతుల కల్యాణం (ఒంటిమిట్టలో జరిగే శ్రీ సీతారామ కల్యాణం నేపథ్యంగా శ్రీకనకదుర్గ ప్రభ పత్రికలో రాసిన వ్యాసం)

  పున్నమి కాంతుల కల్యాణం                లోకంలో పెళ్ళి ముచ్చట అంటే సీతారాములదే. అందులోనూ ఒంటిమిట్ట ఆలయంలో జరిగే సీతారాముల కల్యాణం మరింత శ...