Tuesday, August 7, 2018

చిరపురాతనం .... కావాలి నిత్యనూతనం. - డాక్టర్ కప్పగంతు రామకృష్ణ


చిరపురాతనం ....  కావాలి నిత్యనూతనం.

                మనుషుల మేధానైశిత్యాన్ని బట్టి భాష అభివృద్ధి చెందుతుంది. ఒకేరకపు భాష వ్యవమరించే వాళ్ళు ఒక్కచోట మనగలుగుతారు. భాషను ప్రేమించే వాళ్ళు ఎప్పుడు విడిపోరు. భాషా వ్యవహారాలు విడిపోవాలనుకుంటే అందుకు వేరే కారణాలు ఉండవచ్చు. భాష మాత్రం విడిపోవటానికి కారణం కాదు. భాష మనుషుల మద్య అనుబంధాల్ని పెంచుతుంది. అంతరంగాలలోని భావతరంగాలు వాగ్రూపాన్ని పొందనితే అవి అలా మనోసంద్రంలో మాసిపోవలసిందే. వేరే దేశాలలో ఉండేవారు తమ మాతృభాష వినబడగానే పొంగిపోయేది కేవలం ఈ మాతృభాషాను బంధంతోనే.

                మన మాతృభాష తెలుగు, తెనుగు, ఆంధ్రం అన్న పేర్లతో ప్రసిద్ధి చెందింది. ఈ పేర్లు ఎలా వచ్చాయి? అనే ప్రశ్నలకు సమాదానాలుగా ఎన్నో సిద్ధాంతాలు, నిరూపణలు మనకు లభిస్తున్నాయి. విటన్నింటిలో అక్కడక్కడా కొన్ని భేదాలు కనిపించినప్పటికి, అన్నింట్లో అంతస్యూత్రంగా నిలచిన సారూప్యం ఏమిటంటే - తెలుగు ఎంతో ప్రాచీన భాష. కనీసం ఏడువేల సం|| పూర్వమే ఆంధ్రజాతి ఉన్నది అని.

                తెలుగు భాష ఉనికికి, చారిత్రక నేపధ్యానికి సంబంధించి మనకు లభిస్తున్న చారిత్రక సత్యాలు, ఘటనలు, నేపద్యాలు. వివరణలు.

       దక్షారామము, శ్రీశైలము, కాళేశ్వరం, అనే త్రిలింగ క్షేత్రాల మద్య ఉన్న ప్రాంతం కనుక త్రిలింగ దేశం అన్ని, అదే క్రమేణా తెలుగుదేశం, తెలుగుదేశం అయినదని శైవసాంప్రదాయ సిద్ధాంతం.

       ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్రశబ్దం దేశపరంగా, జాతి పరంగా ఉపయోగించారు. చరిత్రకారుల నిర్ధారణను బట్టి చూస్తే ఇతరేయ బ్రాహ్మణం యొక్క కాలం క్రీ. పూ. ఐదువేల సం|| దీన్నిబట్టి చూస్తే నేటికి ఏడువేల సం|| క్రితమే ఒకదేశం ఉన్నది. అది ఆంధ్రదేశం ఆ జాతి ఆంధ్రజాతి.

       ఆష్టాదశ పురాణాలలో అతిప్రాచీనమైనదైన స్కాందపురాణంలో ఆంధ్రజాతి ప్రసక్తి ఉన్నది.

       భారతంలో కౌరవులు పక్షాన యుద్ధం చేసిన రాజులలో ఆంధ్రరాజులు ఉన్నట్లుగా వ్యాసభారతంలో కనిపిస్తుంది.

       రామాయణంలో సీతాన్వేషణ ఘట్టంలో చెప్పబడిన దేశాలలో ఆంధ్రరాజ్యం ఉన్నది.

       నేటికి స్మార్త భాగంలో ఉపయోగించే 'మహాసంకల్పం' లో ఆంధ్రదేశ ప్రస్తావన ఉన్నది.

                నన్నయ వ్రాసిన తెలుగు భారతాన్ని 'ఆదికావ్యం' గా అంగీకరించటం జరుగుతుంది. అంటే నన్నయకు పూర్వం మరే ఇతర తెలుగు కావ్యంలేదని కాదు. చరిత్రలో కాలగతి పట్టి పోయిన అతి ప్రాచీన గ్రంధాలు నేటికి అలభ్యం అవటం వల్ల తెలుగు భాష ప్రాచీనత పై ఇన్ని వాదోపవాదాలు వినిపించేందుకు ఒక కారణంగా కనిపిస్తోంది. గ్రంధాలు అలభ్యం అయినప్పటికీ, నన్నయకు పూర్వమే ద్విపదలు, రగడలు వంటి సాహిత్య ప్రక్రియలు, ఛాయలతో కూడిన ప్రయోగాలు కనిపిస్తాయి. ప్రకృతిలో మమేకమై జీవనం సాగించే పల్లెపడుచుల పదాలు. ఊడుపు పాటు, వీర గీతాలు, కుచ్చెల పాటలు... ఇలా ఎన్నో విభిన్న వృత్తుల వారు పాడుకునే గీతాలు. ఇవన్నీ తెలుగు సాహితీ ప్రక్రియలకు సుదూరాలు కావు. ఈ గేయల్లోని తెలుగు ఎంతో ప్రాచీనమైనది.
                ఆధారాలు, ఆయుః ప్రమాణాలంటూ అనవసరమైన తర్కాలు చేసి మనల్ని మనమే అపహాస్యం పాలు చేసుకుంటున్న ఈ వాదాలు వివాదాలకు ఇక స్వస్తి పలుకుదాం. చిరపురాతన తెలుగు వైభవం నిత్యనూతన శోభలతో తేజరిల్లేలా మనల్లి మనమే జాగృతపరచుకుందాం.

No comments:

పున్నమి కాంతుల కల్యాణం (ఒంటిమిట్టలో జరిగే శ్రీ సీతారామ కల్యాణం నేపథ్యంగా శ్రీకనకదుర్గ ప్రభ పత్రికలో రాసిన వ్యాసం)

  పున్నమి కాంతుల కల్యాణం                లోకంలో పెళ్ళి ముచ్చట అంటే సీతారాములదే. అందులోనూ ఒంటిమిట్ట ఆలయంలో జరిగే సీతారాముల కల్యాణం మరింత శ...