Tuesday, July 2, 2019

చదువుకు వేళాయే.... (డాక్టర్ కప్పగంతు రామకృష్ణ రచన)

చదువుకు వేళాయే...

మీ పిల్లలకు చెప్పండి!
 
  


    చదువు అంటే కేవలం అక్షరాల జ్ఞానం మాత్రమే కాదని... అదో అంతులేని విజ్ఞానసాగర మథనమని... దానికోసం  కష్టాలు పడాలి.. కన్నీళ్లకు ఎదురీదాలి... పరీక్షలకు నిగ్గుతేలాలి... అవాంతరాలను అధిగమించాలి... అయినా ఇష్టంతో సాధన చేస్తే సిసలైన సంపద మీ సొంతమవుతుందని... మీ పిల్లలకు చెప్పండి... జ్ఞానార్జన కోసం తపించిన ఈ విద్యార్థుల గురించి వివరించండి!

శివుడూ చదువుకున్నాడు!

ఎవరైనా, ఎంతటివారైనా నేర్చుకునే సమయంలో  విద్యార్థిగా ఉండాల్సిందే. ఈ విషయంలో అభ్యంతరాలు పనికిరావు.
కైలాస పర్వతంపై తన శిలాపీఠం మీద పరమేశ్వరుడు పార్వతీదేవితో సహా కొలువై ఉన్నాడు. అంతా తానై, అన్నీ తానే అయిన శివుడికి సైతం ఆ రోజు పెద్ద సందేహం వచ్చింది. ప్రణవం అంటే ఏమిటి? ప్రణవతత్త్వం ఏమిటి? ఎంతగా ఆలోచించినా తనకు బోధపడటం లేదు. బ్రహ్మ, విష్ణువులను అడిగినా తమకు సాధ్యం కాదన్నారు. నీ బిడ్డ షణ్ముఖుడే ఇందుకు సమర్థుడని చెప్పారు. దాంతో శివుడు నేరుగా కుమారస్వామినే తన సందేహం తీర్చమని అడిగాడు. ‘చెప్పేది నేను. వినేది నువ్వు. నీ సందేహం తీర్చే నాది గురుస్థానం. వినే నీది శిష్యస్థానం. కాబట్టి, నువ్వు కింద కూర్చుంటే నేను పీఠం మీద కూర్చుని బోధ చేస్తానన్నాడు కుమారుడు. సరేనన్నాడు శివుడు. బిడ్డే స్వయంగా తండ్రికి ప్రణవ తత్త్వాన్ని ఉపదేశించాడు. పరమేశ్వరుడు విద్యార్థిగా మారి మానవ జాతికి మహోపకారం చేశాడు. ప్రణవ తత్త్వం లోకానికి అందింది. ఇక్కడ  స్కందుడు గొప్ప గురువు. పరమేశ్వరుడు ఉత్తమ విద్యార్థి.

తలకెక్కితే తిప్పలే!

ఎంత నేర్చుకున్నా విద్యార్థికి గర్వం ఉండకూడదు ఈ ఒక్క దుర్లక్షణం వల్ల నేర్చుకున్నదంతా నిరుపయోగమైపోతుంది.
యాజ్ఞవల్క్యుడు బాష్కలమహర్షి దగ్గర రుగ్వేదం, జైమిని వద్ద సామవేదం, అరుణి మహర్షి వద్ద అధర్వణవేదం అధ్యయనం చేశాడు. ఆ తర్వాత వైశంపాయనుడి వద్దకు యజుర్వేదం నేర్చుకోడానికి వెళ్లాడు. ఆ రుషి వద్ద వేదంతో పాటు మరెన్నో విషయాలు నేర్చుకున్నాడు. తనను మించిన విద్యావంతుడు లేడనే అహంకారం అతడిలో ఏర్పడింది. ఓసారి వైశంపాయనుడికి బ్రాహ్మణుని కాలితో తన్నిన దోషం తగిలింది. అతడి పాపాన్ని పోగొట్టే శక్తి తనవద్ద మాత్రమే ఉందంటూ గురువుతో గర్వంగా పలికాడు యాజ్ఞవల్క్యుడు. దీంతో ఆగ్రహించిన గురువు తాను నేర్పిన విద్యను పూర్తిగా వదలి వెళ్లిపొమ్మని అతడిని శపించాడు. దీంతో నేర్చుకున్న విద్యను రక్తపు ముద్దల రూపంలో అక్కడే వదలివెళ్లాడు. వాటిని స్వీకరించిన తిత్తిరి పక్షులు వేదాల్ని పలికాయి. అవే కృష్ణ యజుర్వేదంగా ఆవిర్భవించాయి. ఆ తర్వాత యాజ్ఞవల్క్యుడు సూర్యుడిని ఉపాసన చేసి, ఆయన ద్వారా శుక్ల యజుర్వేదం నేర్చుకోవాల్సి వచ్చింది.

దేవతలే దిగిరారా!

ఆటంకాలకు లొంగితే జ్ఞానశూన్యుడిగానే మిగిలిపోవాల్సి వస్తుంది. కష్టాన్ని తట్టుకుంటేనే విజ్ఞానపు లోకానికి దారి తెలుస్తుంది. జాబాలికి తండ్రి ఎవరో తెలియదు. తల్లి జాబాల అతడికి ఉపనయన సంస్కారం చేసి, గురువు హరిద్రుమతుడి వద్దకు విద్యాభ్యాసానికి పంపింది. తండ్రి ఎవరో తెలియకపోవడంతో అవమానాల పాలయ్యాడు. విద్య నేర్చుకునే సమయం వచ్చే వరకు గోవుల్ని మేపుతూ అడవిలోనే ఉండమని ఆదేశించాడు గురువు. మరోమాట మాట్లాడకుండా అడవికి చేరుకున్నాడు జాబాలి. కానీ, మనస్సు మాత్రం నిత్యం జ్ఞానాన్వేషణ కోసం పరితపిస్తూనే ఉంది. అతడి సత్యనిష్ఠకు మెచ్చుకున్న దేవతలే స్వయంగా అతడు మేపుతున్న గోవుల్లో చేరి, బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశం చేస్తారు. ఆశ్రమానికి చేరుకున్న జాబాలి ముఖంలోని దివ్యతేజస్సు చూసి గురువు ఆశ్చర్యపోతాడు. అప్పటినుంచి సత్యకామ జాబాలిగా జాబాలి లోక ప్రసిద్ధి పొందాడు. విద్యార్థికి నేర్చుకోవాలన్న తపన, స్థిరచిత్తం ఉంటే దైవమే దిగి వస్తుందనటానికి ఇతని కథ చక్కటి ఉదాహరణ.

ప్రలోభాలకు లొంగకుండా...

తాను నేర్చుకోదలచిన విషయం మీద విద్యార్థికి పట్టుసడలని శ్రద్ధ ఉండాలి. ఎన్ని ఆకర్షణలు వచ్చినా వాటికి బందీ కాకూడదు. తండ్రి వాజశ్రవుడు కోపంతో ‘నిన్ను యముడికి దానం చేస్తా’నని అనటంతో అతని మాట నిలబెట్టడం కోసం నచికేతుడు నేరుగా యమలోకానికి వెళ్లాడు. యమదర్శనం కోసం ద్వారం వద్ద మూడురోజులు నిరీక్షించాల్సి వచ్చింది. దివ్యతేజస్సుతో ఉన్న బాలుడు తన కోసం నిరీక్షించిన విషయం తెలుసుక్ను యమధర్మరాజు దర్శనమిచ్చి, ముచ్చటపడి వరాలు కోరుకోమన్నాడు అప్పుడు నచికేతుడు వరాలుగా తన ప్రశ్నలకు సమాధానం ఇమ్మని అడిగాడు. మరణం తర్వాత మనిషి ఏమవుతాడు? జనన మరణ చక్రాల సంచారం ఎందుకు?... అనేవి ఆ ప్రశ్నలు. అప్పుడు యముడు ఇదంతా బ్రహ్మజ్ఞానం. నీ వయస్సు చిన్నది. నీకు అర్థం కాదు. నీకు మణులు, బంగారం, ఇంకా చాలా ఇస్తానని ప్రలోభపెట్డాడు. నాకివేమీ వద్దు. ఆత్మజ్ఞానమే ముద్దు అంటూ పట్టుబట్టాడు నచికేతుడు. బాలుడి శ్రద్ధకు అబ్బురపడిన యముడు అతడికి ఆత్మజ్ఞానాన్ని బోధిస్తాడు. ఇదే కఠోపనిషత్‌గా అవతరించింది.

హనుమ కథ వినుమా!


చదువు సుఖంగా అందదు. ఇందుకోసం తపించాలి. వేగం, పట్టుదల, ధారణ, కష్టానికి తట్టుకునే శక్తి విద్యార్థికి చాలా అవసరం. ఇవన్నీ ఉంటేనే నేర్చుకోవటం సాధ్యమవుతుంది. తల్లి ఆదేశంతో సూర్యభగవానుడి వద్ద విద్య నేర్చుకునేందుకు వెళ్లాడు హనుమ. నేను ప్రతిక్షణం సంచరిస్తూ ఉంటాను. నా దగ్గర చదువుకోవటం సాధ్యం కాదన్నాడు  సూర్యుడు. అయినా పట్టువదలకుండా తూర్పు, పశ్చిమ పర్వతాల మీద చెరో కాలు ఉంచి, సూర్యగమనానికి అనుగుణంగా ముఖం వరకు తన శరీరాన్ని తిప్పుతూ విద్యాభ్యాసం చేశాడు ఆంజనేయుడు. ఇంతటి సాధన చేశాడు కాబట్టే నవ వ్యాకరణ పండితుడయ్యాడు. ఎవరెన్ని విధాలుగా నిరుత్సాహపరిచినా, చివరకు ఎంచుకున్న గురువే వద్దని వారించినా నిరుత్సాహ పడకూడదు. విద్య నేర్చుకునే విషయంలో ఏర్పడే విఘ్నాలే ఇవన్నీ అనే స్పృహ కలిగి ఉండాలి. వాటిని తీర్చుకునేందుకు ప్రత్యామ్నాయాలు ఆలోచించాలి. అప్పుడే ఆశించిన లక్ష్యాన్ని చేరుకోవచ్చని హనుమ నిరూపించాడు.

- కప్పగంతు రామకృష్ణ

శరత్కాల వెన్నెల వైభవం గురించి డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr Kappagantu Ramakrishna) ఈనాడు దినపత్రిక మకరందం పేజిలో రాసిన వ్యాసం

శరత్‌ చంద్రికలు
మనసే మందిరం 
శరత్‌ చంద్రికలు
చందమామ వెన్నెలనే కాదు శుభాలనూ వర్షిస్తాడు
కలువలనే కాదు మనసునూ వికసింపజేస్తాడు
చీకటి రాత్రులనే కాదు తమస్సు నిండిన హృదయాలనూ తేజోమయం చేస్తాడు...
అందుకే ఆయనను మనఃకారకుడంటారు...
ఆధ్యాత్మిక జగతిలో శరత్కాలానిది ప్రత్యేక పాత్ర
నిర్మలమైన శరత్‌చంద్రుడు సాధకులకు సహకరిస్తాడు,
అద్భుతమైన సందేశాలనిస్తాడు...
ఏడాదిలో వచ్చే ఆరు రుతువుల్లోనూ వసంత, శరదృతువులు చాలా ప్రధానమైనవి. ఇవి ఆయా కాలాల్లో వచ్చే ప్రాకృతిక మార్పుల్ని సూచిస్తూ, అందుకు అనుగుణంగా మనిషి తన జీవనగమనాన్ని తీర్చిదిద్దుకునేందుకు అవసరమైన సంకేతాలను ఇస్తాయి. వీటిలో వసంత రుతువు సుమ వికాసం  కలిగిస్తే, శరదృతువు సోమ వికాసం కలిగిస్తుంది. సోముడు అంటే చంద్రుడు.  సంవత్సరకాలంలోని ఆరు రుతువుల్లో మొత్తం పన్నెండు పున్నములు వస్తాయి. వీటన్నిటిలో శరత్కాలంలో (ఆశ్వయుజ, కార్తికమాసాలు) వచ్చే పున్నమి రోజుల్లో చంద్రుడు అద్భుతమైన తేజస్సుతో ప్రకాశిస్తాడని దేవీభాగవతం చెబుతోంది.  పదహారు కళలతో  ప్రకాశించటం వల్ల శరత్కాల పున్నమి నాటి చంద్రుడిని పూర్ణచంద్రుడు అంటారు. స్వచ్ఛతకు, ప్రశాంతతకు శరత్కాలం నిలయంగా ఉంటుంది. ఈ భావాన్నే ప్రకటిస్తూ ఆంగ్లేయులు కూడా ‘హార్వెస్ట్‌ మూన్‌’ అంటూ చంద్రుడిలోని స్వచ్ఛతను ఆస్వాదిస్తారు.
* శరదృతువు మనసుకు అంతులేని ఆహ్లాదాన్నిస్తుంది. అది  చంద్రుడి వల్లే సాధ్యమవుతుంది. వేదం  ‘చంద్రమా మనసో జాతః’ - విరాట్‌ పురుషుడి మనస్సు  నుంచి చంద్రుడు ఉద్భవించాడని చెబుతోంది. ఈ చంద్రుడి వల్ల సకల ప్రాణికోటికి మనస్సు ఏర్పడిందని నమ్ముతారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్సుకు అధిపతి. మనస్సును ప్రభావితం చేస్తాడు. అన్ని రుతువుల కన్నా శరదృతువులో చంద్రుడి ప్రకాశం ఎక్కువగా ఉండటం వల్ల  ఈ సమయంలో ఆ ప్రభావం మనందరి మనస్సుల మీద మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ కారణం వల్లనే జ్యోతిష విజ్ఞానవేత్తలు మనో సంబంధమైన సమస్యలు తొలగిపోవటానికి చంద్రగ్రహ ప్రీతి చెయ్యాలని చెబుతారు. చంద్రగ్రహ జపాలు, దానాలు, చంద్రగ్రహ సంబంధమైన రత్నాన్ని ధరించాలని సూచిస్తారు.
* శరత్కాలంలో ఆకాశం నిర్మలంగా ఉంటుంది. దీనివల్ల చంద్రకాంతిని పరిపూర్ణంగా ఆస్వాదించటానికి వీలుపడుతుంది. శుద్ధంగా, స్పష్టంగా, స్వచ్ఛంగా మనస్సు ఉండాలని చెప్పడమే శరత్కాల చంద్రుడు అందించే ఆధ్యాత్మిక ప్రబోధం. మనస్సు స్థిరంగా ఉండడం, ఏవిధమైన వికారాలు లేకుండా దృఢంగా ఉండటమే ఆధ్యాత్మిక సాధనకు పరమావధి. భౌతికంగా ఉండే సుఖాలు, దుఃఖాలు, మానాలు, అవమానాలు, కలిమిలేములు, కష్టాలు,  నష్టాలు, బాధలు మొదలైనవన్నీ అంటని నిర్మలమైన మనస్సును సాధించటమే సాధకుడి అంతిమ లక్ష్యం అవుతుంది. గెలిచామా... ఓడామా అనేది కాకుండా గెలుపు ఓటములను పట్టించుకోని స్థితికి ఎదగాలి. నిరంతరం కర్తవ్యదీక్షతో ఉండాలి. ఇందుకు సంకేతం శరచ్చంద్రుడు.
* ఆశ్వయుజ, కార్తీక మాసాల్లో వచ్చే రెండు పున్నములను  శరత్పూర్ణిమలంటారు. ఈ రోజుల్లో చేసే ధ్యాన, అర్చనలు విశేషఫలితాలనిస్తాయి. ఆధ్యాత్మికంగా, యోగసాధన పరంగా ఈ రెండు పున్నములకు చాలా ప్రత్యేకత ఉంది. ఈ రోజుల్లో దీపాలు వెలిగించటం ప్రధానమైన అంశంగా ఉంటుంది. దీన్నే ‘దేవ దీపావళి’ అంటారు. ఈ రోజునే రాసలీలా మహోత్సవం జరిగింది. యోగశుద్ధులైన జీవులు గోపికలు. వారిని కృష్ణపరమాత్మ అనుగ్రహించి మోక్షాన్ని అనుగ్రహించిన ఘట్టమే రాసలీలా మహోత్సవం. ఇందుకు శరత్పూర్ణిమ వేదికగా నిలిచింది. ఈ పూర్ణిమ రోజున కొన్ని ప్రాంతాల్లో దేవీ ఆరాధన కూడా చేస్తారు. అమ్మవారిని ఉపాసన చేసే శ్రీవిద్యా సంప్రదాయంలో శరత్పూర్ణిమను ‘ముఖ్యరాకా’ అని పిలుస్తారు.
* కార్తీకమాసంలో పౌర్ణమి కృత్తిక నక్షత్రం రోజున వస్తుంది. ఈ నక్షత్రం అగ్ని సంబంధమైంది. ఇందుకు ప్రతీకగానే ఆ రోజున దీపారాధన చెయ్యడం ఆచారంగా వస్తోంది. అలాగే, కృత్తిక నక్షత్రంలో జన్మించిన కుమారస్వామి ఆరాధన కూడా ఈ మాసంలో చేస్తారు.ఈ రోజునే కుమారస్వామి తారకాసురుడిని వధించాడని నమ్ముతారు. ఇందుకు సంకేతంగా కొన్ని ప్రాంతాల్లో కార్తీకపూర్ణిమను ‘కుమారదర్శనం’ పేరుతో వ్యవహరిస్తారు.  అలాగే, త్రిపురాసురులను పరమేశ్వరుడు వధించిన రోజుకు గుర్తుగా కార్తీక పూర్ణిమను ‘త్రిపుర పూర్ణిమ’గా కూడా పాటిస్తారు.
శరత్‌ చంద్రికలుఆదిశంకరాచార్యులు సౌందర్యలహరిలో అమ్మవారిని వర్ణిస్తూ
శరజ్జ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం
వరత్రాసత్రాణ స్ఫటిక ఘుటికా పుస్తక కరామ్‌
సకృన్నత్వా నత్వాకథమివ సతాం సన్నిదధతే
మధుక్షీర ద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః
శరత్కాలంలో కాసే స్వచ్ఛమైన, నిర్మలమైన పరిపూర్ణమైన వెన్నెల వలే అమ్మవారి ముఖం ఉందంటారు.
జైన సంప్రదాయం, పంజాబ్‌లలో కూడా శరత్కాలంలో వచ్చే పూర్ణిమకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ రోజుల్లో వారు గంగా మహోత్సవం నిర్వహిస్తారు. గురునానక్‌ జయంతి కార్తిక పూర్ణిమ. ఈ రోజున ‘గురుపూరబ్‌’తో ప్రత్యేక ఉత్సవం చేస్తారు. ఆదికావ్యం రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి కూడా ఆశ్వయుజ పూర్ణిమ రోజునే జన్మించారు. ఈ కారణంగా ఆశ్వయుజ పూర్ణిమను ఆంధ్రప్రాంతంలో వాల్మీకి జయంతిగా చేసుకునే ఆచారం కూడా ఉంది.
కాళిదాసుకు అక్షర లక్షలు
భోజరాజు రాజ్యంలోని ఓ నలుగురు బ్రాహ్మణులు చాలా బీదవారు.మంచి కవిత్వం చెబితే రాజు ధనాన్ని ఇస్తాడన్న ఆశతో ఓ మంటపంలో కూర్చుని శ్లోకం రాయటం ప్రారంభిస్తారు. ఒక వ్యక్తి ‘భోజనం దేహి రాజేంద్ర’ అని,. రెండో వ్యక్తి ‘ఘృతసూప సమన్వితమ్‌’ అని రెండు పాదాలు రాశారు.  ఓ రాజా! పప్పు, నెయ్యిలతో కూడిన భోజనాన్ని మాకు అనుగ్రహించు అని ఈ రెండు పాదాలకు అర్థం. మిగిలిన రెండు పాదాలను పూర్తిచెయ్యలేక వారు నానా తంటాలు పడుతుంటారు. ఇంతలో అటుగా వచ్చిన కాళిదాసు ‘మాహిషంచ శరచ్చంద్ర చంద్రికా ధవళం దధీ’ అని మూడు, నాలుగు పాదాలు పూర్తిచేస్తాడు. శరత్కాలంలో వెలిగే చంద్రుడి వంటి పరిమాణంలో ఉన్న గారెలు, ఆ శరత్కాలపు చంద్రుడు కురిపించే వెన్నెల వర్ణంతో సమానమైన స్వచ్ఛమైన పెరుగుతో కలిసిన భోజనం కావాలి ఆ బ్రాహ్మణులు రాజాస్థానానికి వెళ్లి శ్లోకం వినిపిస్తారు. భోజరాజు ఆ బ్రాహ్మణుల జీవితానికి సరిపడినంత ధనం ఇవ్వమని మంత్రిని ఆదేశించి, మూడు నాలుగు పాదాలు రాసిన కవికి అక్షరలక్షల ముత్యాలు ఇవ్వమంటాడు.  శరత్కాల చంద్రుడిని ఇంత అందంగా వర్ణించగల కవి కాళిదాసు తప్ప మరొకరు లేరంటాడు భోజరాజు.
16 కళల వెనక కథ ఇదీ...
చంద్రుడికి ఈ కళలు రావటం వెనుక పురాణగాథ ఉంది. దక్షప్రజాపతి అశ్వని, భరణి మొదలైన తన 27 మంది కుమార్తెలను చంద్రుడికిచ్చి వివాహం చేస్తాడు. అందరినీ అనురాగంగా చూసుకుంటున్నప్పటికీ రోహిణి అంటే చంద్రుడికి ఎక్కువ ఇష్టం ఉండేది. ఆమెపై ఎక్కువ అనురాగం, ఆప్యాయత కనబరచేవాడు. ఇది సహించలేని మిగిలిన అక్కాచెల్లెళ్లు తండ్రితో విషయాన్ని చెబుతారు. అతడు చంద్రుడిని పిలిచి కుమార్తెలందరినీ సమానంగా చూసుకోవాలని హితవు చెబుతాడు. అయినా, చంద్రుడు తన పద్ధతి మార్చుకోకపోవటంతో ఆగ్రహించిన  దక్షుడు అల్లుడనే ఆలోచన లేకుండా చంద్రుడికి క్షయవ్యాధి కలగాలని శపిస్తాడు. శాపం కారణంగా చంద్రుడు నానాటికీ క్షీణించసాగాడు. దీంతో అతని నుంచే వచ్చే వెన్నెల ఆగిపోయింది. లతలు, వృక్షాలు వాడిపోయాయి. కలువలు వికసించలేదు. ఓషధుల్లో గుణం నశించింది.  లోకానికి కలిగిన ఈ అకారణ దుఃఖాన్ని గమనించిన ఇంద్రాది దేవతలు చంద్రుడితో సహా బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లి, చంద్రుడికి శాపవిముక్తి కలిగించమని ప్రార్థిస్తారు. ప్రభాస క్షేత్రంలో శివుడిని గురించి తపస్సు చెయ్యమని బ్రహ్మదేవుడు చెబుతాడు. ఆవిధంగా తపస్సు చేసిన చంద్రుడికి  శివుడు ప్రత్యక్షమై రోజుకు ఒక కళ నశించేలా, తిరిగి 15 రోజుల తర్వాత రోజుకు ఒక కళ పెరుగుతూ పూర్ణచంద్రుడిగా పూర్ణిమ రోజున ప్రకాశించేలా అనుగ్రహిస్తాడు. ఇలా చంద్రుడి కళల్లో తగ్గుదల, పెరుగుదల కారణంగా ఏర్పడినవే శుక్ల, కృష్ణ పక్షాలు. ఈ విధంగా చంద్రుడికి పదహారు కళలు ఏర్పడ్డాయి. 
శరత్‌ చంద్రికలు
శరత్కాలంలో వచ్చే తొలి పూర్ణిమ ఆశ్వయుజ పూర్ణిమ. ఈ రోజుకు అనేక పేర్లు,  ఈ రోజున ‘కౌముద్యుత్సవం’, ‘కోజాగరీ’ వ్రతాలు చేస్తారు. వాలఖిల్య మహర్షి ద్వారా కోజాగరీ వ్రతం వ్యాప్తిలోకి వచ్చింది. ఆశ్వయుజ పూర్ణిమను ‘కౌమార పౌర్ణమాసి’ పేరుతో కొన్ని చోట్ల పాటిస్తారు. మరికొందరు ఈ రోజున లక్ష్మీంద్ర కుబేర పూజ చేస్తారు. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ఆశ్వయుజ పూర్ణిమ రోజున ‘గొంతెమ్మ పండుగ’ జరుపుకుంటారు. గొంతెమ్మ అంటే ‘కుంతి’ అని అర్థం. పార్వతీదేవికి ఉన్న పేర్లలో ‘కుంతిపరమేశ్వరి’ ఒకటి. అందువల్ల గొంతెమ్మ పండుగ పార్వతీదేవికి సంబంధించిందిగా తెలుస్తోంది. . శరత్పూర్ణిమ రోజున ఆరుబయట వెన్నెలో పరమాన్నం వండి, దాని మీద చంద్రకిరణాలు పడేలా ఉంచి, ఆ ప్రసాదాన్ని స్వీకరించే ఆచారం కొన్నిప్రాంతాల్లో ఉంది.
ఎన్నో నోములు 
మరెన్నో పూజలు 
శరత్పూర్ణిమ వ్రతాన్ని కొన్ని ప్రాంతాల్లో ఆచరిస్తారు. ఇందుకు సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వకాలంలో ఒక సంపన్నకుటుంబానికి చెందిన దంపతులకు కలిగిన బిడ్డ ఏమాత్రం అంగసౌష్టవం లేకుండా ఉండేది. ఓ సిద్ధ పురుషుడి సూచనతో ఆ దంపతులు అప్పటికే కన్యగా ఎదిగిన తమ బిడ్డతో ‘శరత్పూర్ణిమ’ నోము నోయించారు.. శరత్కాలం ప్రారంభమైన తొలిరోజున ఆరుబయట చంద్రకాంతిలో ఉండేలా వెండితో చేసిన అమ్మవారి ప్రతిమను అర్చించి, వెండితో చేసిన చంద్రుడి ప్రతిమను దానం చేయిస్తారు. ఇలా చంద్రుడిలో ఉండే పదహారు కళలకు ప్రతీకగా శుక్లపక్షమంతా చేయిస్తారు. తిరిగి కార్తికమాసం శుక్ల పక్షంలో కూడా ఈ విధానంలో అర్చనలు చేయిస్తారు. ఇలా మూడేళ్లు చేయగానే ఆ కన్య  సుందరిగా ప్రకాశించింది.
ఖగోళ విజ్ఞానపరంగా చూస్తే ఆశ్వయుజ మాస ప్రారంభంలో ఆకాశంలో అగస్త్య నక్షత్రం కనిపిస్తుంది. ఇది శరత్కాలానికి ప్రారంభ సూచిక. ఈ నక్షత్రం కనిపించగానే రాజులు దండయాత్రలకు బయల్దేరటానికి సిద్ధపడేవారని కాళిదాస మహాకవి రఘువంశ కావ్యంలో రాశాడు.
మనస్సును ఆహ్లాద పరిచే సౌందర్యం శరచ్చంద్రుడిలో ఉంది. ముఖచంద్రుడు అనడంలో అంతరార్థం ఇదే. తాను ప్రశాంతంగా ఉంటూ తన తోటి వారిని కూడా ప్రశాంతంగా ఉంచే వారే నిజమైన ఆధ్యాత్మిక సాధకులు అవుతారు.  మనవల్ల సమాజం ఉద్వేగం పొందని స్థితిలో ఉన్నా, సమాజం వల్ల మనం ఉద్వేగానికి లోనుకాని స్థితిలో ఉన్నా.. మానవ జీవనం ఆత్మజీవనం అవుతుంది.
కార్తీక పూర్ణిమ రోజున ఆచరించే వ్రతాల్లో భక్తేశ్వర వ్రతం స్త్రీలకు సౌభాగ్యం కలిగించే వ్రతంగా చేసుకునే ఆచారం ఉంది.
చంద్రుడు పదహారు కళలతో ఉంటాడని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఆ కళలు
1.అమృత
2.మానద
3.పూష
4.తుష్టి
5.సృష్టి
6.రతి
7.ధృతి
8.శశిని
9.చంద్రిక
10.కాంతి
11.జ్యోత్స్న
12.శ్రీ
13.ప్రీతి
14.అంగద
15.పూర్ణ
16.పూర్ణామృత
- కప్పగంతు రామకృష్ణ


హనుమజ్జయంతి సందర్భంగా డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr Kappagantu Ramakrishna) ఈనాడు దినపత్రిక మకరందం పేజిలో రాసిన వ్యాసం

వినయ విధేయ హనుమ!
ఈ నెల 29న హనుమజ్జయంతి
రాముడిది ఒకటే మాట, ఒకటే బాణం... రామబంటు హనుమదీ ఇదే బాట. ఆయనకు రాముడొకడే దైవం... రామనామం ఒకటే మంత్రం... రామకార్యాలపై తరగని భక్తే అతని శక్తి... ఆ భక్తితోనే అంత సముద్రాన్ని అవలీలగా దాటాడు. ఆ శక్తితోనే అంత మంది రాక్షసుల్ని ఒంటిచేత్తో తుదముట్టించాడు. మహాకార్యాలన్నీ చిత్తంలో భక్తితోనే సాధ్యమవుతాయని నిరూపించిన  హనుమ జ్ఞానగుణ సాగరుడు...
హనుమ ఒక రోజున సీతమ్మ తల్లిని మసటన సిందూరం ధరించటానికి కారణం అడుగుతాడు. సిందూరం ధరించటం వల్ల తన భర్తకు సౌభాగ్యం కలుగుతుందని చెబుతుందామె. మరుక్షణం ఇప్పుడే వస్తానంటూ వెళ్లి, ఒళ్లంతా సిందూరం పూసుకుని వస్తాడు హనుమ. ఏమిటీ చోద్యం అంటుంది సీతమ్మ. పాపిట్లో కాస్తంత సిందూరం ధరిస్తేనే స్వామికి సౌభాగ్యం కలుగుతుందన్నావు కదమ్మా... నా స్వామికి అనుక్షణం, జీవితాంతం సౌభాగ్యం కలగాలి. అందుకే ఒళ్లంతా సిందూరం పూసుకున్నానంటాడు. హనుమ స్వామిభక్తి ముందు జానకీదేవి పతిభక్తి చిన్నబోయింది.
అణువణువూ ఆయనే...
హనుమకు ఏం తక్కువ?
సాక్షాత్తు రుద్రాంశసంభూతుడు, అనంత బలశాలి, అపార విజ్ఞానఖని, సుగ్రీవుడికి సచివుడు... కానీ తాను రామబంటునంటూ ప్రకటించుకున్నాడు.
దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః
హనుమాన్‌ శత్రుసైన్యానాం నిహన్తా మారుతాత్మజః
న రావణ సహస్రం మే యుద్ధేప్రతిబలం భవేత్‌
శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః
అంటూ కోసల దేశపు ప్రభువైన రాముడికి నేను దాసుడిని అని ఎలుగెత్తి చాటాడు. అంతేకాదు... నా గుండెల నిండా రామభక్తి ఉంది. నా అణువణువులో రామనామం నింపిన శక్తి ఉంది. ఇవి చాలు... వెయ్యిమంది రావణులు ఒక్కసారిగా వచ్చినా అందరినీ మట్టి కరిపిస్తానంటాడు హనుమ. రామభక్తి ఇచ్చిన ఆత్మబలం అది. ఎంచుకున్న దైవంపై శిలలాంటి దృఢమైన విశ్వాసం హనుమలో ఉంది. ఆ విశ్వాసమే, ఆ విధేయతే హనుమను చిరకీర్తిమంతుణ్ణి చేసింది. రాముడంటే హనుమ, హనుమ అంటే రాముడు అన్నంతగా తనకు, రాముడికి అభేదాన్ని సాధించిన భక్తశిఖామణి ఆంజనేయుడు. తన శరీరంలోని ప్రతి అణువులో రామ నామాన్ని నింపుకోవటమే కాదు... ప్రకృతిలోని ప్రతి అణువులోనూ తన స్వామిని దర్శించిన పుణ్యమూర్తి ఆయన. అందుకే వాల్మీకి మహర్షి హనుమను ‘రామాయణ మహామాలా రత్నం’ అని సంబోధించాడు. ఎప్పుడైతే రామచంద్రమూర్తిని తొలిగా దర్శించి, ఆయనతో మాట్లాడి, రామదాసుడిగా మారాడో ఆ క్షణం నుంచే హనుమకు రాముడితోడిదే లోకంగా మారింది. సీతాన్వేషణ కోసం బయల్దేరుతూ రాముడు విడిచిపెట్టిన బాణంలా లంకవైపునకు దూసుకుపోతాను అన్నాడు ఆంజనేయుడు. వాయుపుత్రుడు, అమేయ బలసంపన్నుడై ఉండి కూడా సీతమ్మను వెతికేందుకు వెళ్లే శక్తి నాది కాదు. రాముడిది అన్న మాటలు రాముడిపై, రామనామంపై హనుమకు ఉన్న చెక్కుచెదరని లక్ష్యశుద్ధిని ప్రకటిస్తాయి.
శిరసా నమామి...
నీవు తప్ప వేరొకరు లేరంటూ రాముడికి మనసా, వాచా, కర్మణా దాసోహమన్నాడు హనుమంతుడు. ఆ భక్తికి, శరణాగతికి భగవంతుడు ఎప్పుడూ బందీనే. తన వీరత్వంతో కాకుండా, తన వినయంతో రామబాణాన్నే శక్తిహీనం చేశాడు హనుమ. ఓ సందర్భంలో హనుమ ధ్యానంలో ఉండగా విశ్వామిత్రుడు వచ్చాడు. అక్కడున్న వారంతా మహర్షికి నమస్కారం చేశారు. కానీ ధ్యానంలో ఉండటం వల్ల హనుమ మహర్షిని గమనించలేదు. హనుమ తనపై తృణీకారభావం వహించాడంటూ విశ్వామిత్రుడు ఆగ్రహించి, తన శిష్యుడైన రాముడికి ఫిర్యాదుచేశాడు. అప్పటికీ అవేశం చల్లారక ఏకంగా హనుమకు మరణదండన విధించాలని ఆదేశించాడు. గురువు ఆజ్ఞను శిరసావహించిన రామచంద్రమూర్తి అయిష్టంగానే బాణప్రయోగం చేశాడు. తన విద్యనంతా ప్రయోగించి బాణవర్షం కురిపించాడు. ఆశ్చర్యం... ఒక్క బాణమూ హనుమను తాకలేదు. అన్ని వేల బాణాలూ మధ్యలోనే కిందపడిపోయాయి. ఈలోగా నారదుడితో పాటు చాలామంది అక్కడకు చేరుకున్నారు. ఇంతలో హనుమ ధ్యానం నుంచి లేచి, జరిగిన విషయం తెలుసుకుని, రాముడి కాళ్ల మీద పడి వేడుకున్నాడు. మహర్షి విషయంలో తాను కావాలని అపచారం  చెయ్యలేదని వివరించాడు. విశ్వామిత్రుడు కూడా చల్లబడి హనుమలోని రామభక్తికి ముగ్ధుడయ్యాడు. రాముడి మీద తనకున్నది అధికారం. అదే హనుమకు ఉన్నది మమకారమని తెలుసుకున్నాడు. హనుమ విధేయత రాముడినే నిలువరించే మహత్తరమైన శక్తి కలిగిందని గ్రహించాడు.అందుకనే రామభక్తికి హనుమంతుడు కీర్తిపతాకంగా నిలుస్తాడు.
- కప్పగంతు రామకృష్ణ

కూర్మజయంతి సందర్భంగా డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr Kappagantu Ramakrishna) ఈనాడు దినపత్రిక మకరందం పేజిలో రాసిన వ్యాసం

నీటిలోని తాబేలు నిగూఢ నిజాలు!
కూర్మావతారం ఏం చెబుతుందంటే... 

విష్ణువు కూర్మరూపంలో అవతరించిన తిథి జ్యేష్ఠ బహుళ ద్వాదశి. ఆ రోజును కూర్మజయంతిగా వ్యవహరిస్తారు.

ఓ వైపు హాలాహల జ్వాలలు...
మరోవైపు కొండంత భారం...
కానీ
ఎక్కడా తొణకలేదు...
ఇసుమంతైనా బెణకలేదు...
ఆ నిశ్చలత్వం,
ఆ నిశ్చయతత్త్వం,
ఆ త్యాగం నిరుపమానం...
అందుకే ఆ అవతారం మహోన్నతం...
పరమాత్మ శిష్టరక్షణ కోసం ఎత్తిన ఈ ద్వితీయ అవతారం అతి ప్రాచీనం, నిగూఢమైన భావాల సమాహారం.
తాబేటి రూపంలో భగవంతుడు బోధించిన అద్భుత సందేశాల పరంపర నిత్యస్మరణీయం...

శ్రీ మహావిష్ణువు అవతారాల్లో అన్నిటికన్నా భిన్నమైంది కూర్మావతారం. మిగిలినవన్నీ రాక్షస సంహారం కోసం ఉద్దేశించినవి. కానీ ఈ అవతారం లక్ష్యం వేరు. క్షీరసాగర మథన సమయంలో సముద్రంలోకి కుంగిపోతున్న మందర పర్వతాన్ని నిలబెట్టడానికి శ్రీమహావిష్ణువు కూర్మావతారాన్ని ధరించాడన్నది అందరికీ తెలిసిన పురాణం కథనం. ఇక్కడ ఎలాంటి పోరాటం లేదు. రక్తపాతం అసలు లేదు. కానీ మంచిని రక్షించేందుకు భారం మొత్తాన్ని తన భుజస్కందాలపై మోశాడు పరమాత్మ. భాగవతంలో, బ్రహ్మపురాణంలో కూర్మావతారానికి సంబంధించిన గాథలు విస్తారంగా ఉన్నాయి. కూర్మ - అనే పదానికి వ్యుత్పత్తి ప్రకారం ‘కం జలం ఊర్వతీతి హినస్తేతి కూర్మః’ - అంటే నీటిలోని క్రిములను సంహరించేది అని అర్థం ఉంది. కూర్మానికి నీటిలోని క్రిములను, మురికిని నశింపజేసే గుణం ఉంది. అందువల్ల దానికి ఆ పేరు వచ్చింది. లౌకిక అర్థంలో సాధారణ నీటిలో ఉన్న క్రిములను నశింపజేస్తే ...ఆధ్యాత్మిక కోణంలో భవసాగరంలో మునిగిన మనిషిలో ఉండే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే క్రిములను నశింపజేసే వాడు కూర్మనాథుడనే అర్థాన్ని చెప్పుకోవచ్చు.
కూర్మం స్థిరత్వానికి ప్రతీక. జలంలో నివసించే తాబేలు తాను కదలాలనుకున్నప్పుడు మాత్రమే కాళ్లను కదిలిస్తుంది. అలా లేనప్పుడు నీటిలో స్తంభించి ఉంటుంది. ఇంద్రియాలను పూర్తిగా అదుపులో ఉంచుకుని అవసరమైనప్పుడు మాత్రమే వాటిని ఉపయోగించాలనే స్థితప్రజ్ఞతకు ఇది నిదర్శనం. అవసరమైనప్పుడు బహిర్ముఖంగా ఉన్నా నిరంతరం అంతర్ముఖంగా ఉండే చిత్తవృత్తికి కూర్మమే ప్రతీక. అది తన దేహంతో జలమంతా క్రీడిస్తున్నట్లు.. మనిషి కూడా విశ్వశక్తిలో ఓలలాడమనే సందేశమూ ఇందులో ఉంది.  ఇలాంటి మహోన్నత భావాలకు సూచిక అయిన కూర్మం భగవత్స్వరూపమని భక్తులు విశ్వసిస్తారు. 


సృష్టికర్త ఆయనా? 
బ్రహ్మ సృష్టి చేయడానికి పూనుకున్నాడు.
దేనిని ముందుగా సృష్టించాలా అని ఆలోచించటం ప్రారంభించాడు.
ఈ దశలో అన్యాపదేశంగా తన శరీరాన్ని కదిలించాడు. వెంటనే ఆయన శరీరం నుంచి కొన్ని రుషి సంఘాలు పుట్టాయి. వారే అరుణులు, కేతులు, వాతరశనులు.
ఆయన గోళ్ల నుంచి వైఖానసులు, వెంట్రుకల నుంచి వాలఖిల్యులు జన్మించారు.
అప్పుడే బ్రహ్మ శరీరంలోని సారమంతా ఒక పెద్ద కూర్మంగా రూపాంతరం చెంది నీటిలో సంచరించడం మొదలుపెట్టింది. దానిని చూసిన బ్రహ్మ నువ్వు నా శరీర మాంస సారం నుంచి పుట్టావు కదా అని ప్రశ్నించాడు. అప్పుడా కూర్మం నేను నీ కంటే ముందు నుంచే ఈ జలంలో ఉన్నానని చెప్పింది.
బ్రహ్మకన్నా ముందు ఉన్నదేంటి? అయితే అది పరబ్రహ్మే. ఆ కూర్మమే పరమాత్మ అని గ్రహించాడు. అతనిని వేయి శిరస్సులు, కళ్లు, కాళ్లు ఉన్న మహా పురుషుడిగా గ్రహించాడు బ్రహ్మ.
నీవు నా కన్నా ముందు నుంచే ఉన్నవాడవు కాబట్టి కురుష్వ (సృష్టి చెయ్యి) అన్నాడు బ్రహ్మదేవుడు. అప్పుడు కూర్మనాథుడు సూర్యుడు, ఇంద్రుడు, అగ్ని తదితరాలను సృష్టించాడు.
ఈ విధంగా జగన్నిర్మాణమనే కర్మ చేయడం వల్ల ఆయనకు కూర్మ అనే పేరు వచ్చింది. 


ఆ పట్టుదల అద్భుతం... 
కూర్మావతారం మనిషికి మరో మహత్తరమైన సందేశాన్ని అందిస్తుంది. పట్టుదల, ఓర్పు, సహనం మనిషికి తప్పనిసరిగా ఉండాలని, అప్పుడే అతడి లక్ష్యం నెరవేరుతుందని ఈ అవతారం ద్వారా మహావిష్ణువు ఆచరణాత్మక సందేశం ఇచ్చాడు. మనం ఏమైనా గొప్ప కార్యాలు తలపెట్టినప్పుడు ఆ పని భారం మందర పర్వతం తీరులో చాలా బరువుగా మారుతుంది. ఒక్కోసారి వదిలేయాలని అనిపిస్తుంది. దీనికి తోడు కార్యసాధనలో మనకు కలిగే అవాంతరాలు మందర పర్వతానికి కట్టిన వాసుకి సర్పం విడిచే విషజ్వాలల్లాంటివి. అవి మన పరిస్థితుల్ని మరింతగా వేడెక్కిస్తాయి. ఇలా ఎన్ని సమస్యలు వచ్చినా పట్టువదలకుండా స్థిరంగా ఉంటేనే అమృతం పుట్టినట్లు మన కార్యం విజయవంతమై ఆశించిన లక్ష్యసాధన అనే అమృతం పుడుతుందని కూర్మం సందేశాన్నిస్తుంది. ఈ సందేశాన్ని అందిపుచ్చుకుంటే మానవ జీవితం అమృతమయం అవుతుందనటంలో సందేహం లేదు.

ఈ రెండూ...
శ్రీకూర్మం
శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మం కూర్మనాథ క్షేత్రం. స్థల పురాణాన్ని అనుసరించి శ్వేతమహీపతిని అనుగ్రహించటానికి స్వామి వెలిశాడని చెబుతారు. అలాగే, రోగి అస్తికలను ఇక్కడి శ్వేత పుష్కరిణిలో వేస్తే అందులో నీరు తాబేళ్లుగా మారాయని, అందుకనే అశుచి కలిగిన మనుషులు అక్కడి నీళ్లను తాకకూడదన్న నిబంధన ఉంది. ఈ దేవాలయాన్ని గురించి కాల వివరాలు అంత సమగ్రంగా లేవు. క్రీ.శ. రెండో శతాబ్దం నాటికే ఈ దేవాలయం ఉందని చరిత్రకారులు చెబుతారు. ఏడో శతాబ్దానికి దేవాలయ వైభవం ఉచ్ఛస్థితిలో ఉన్నట్లు తెలిపే శాసనాలు, ఆలయ మంటపంలోని స్తంభాలపై కనిపిస్తాయి. 11వ శతాబ్దంలో ఆ ఆలయాన్ని తూర్పు గంగరాజులు, ప్రాకారాన్ని మధ్వాచార్యులైన నరహరితీర్థులు నిర్మించారని చారిత్రక శాసనాలు వివరిస్తున్నాయి. స్వామికి  సింహళ దేశానికి చెందిన భాగళాదేవి అమూల్య ఆభరణాలు సమర్పించారని, చైతన్య ప్రభువు క్రీశ 1512లో ఆలయాన్ని సందర్శించారని చెబుతారు. పద్మపురాణం, పాంచరాత్రాగమసంహిత గ్రంథాలు ఆ క్షేత్ర మహిమను ప్రస్తావించాయి. చోళ చక్రవర్తి కాలంలో ఈ వైభవం తారస్థాయికి చేరినట్లుగా మరికొన్ని శాసనాలు ద్వారా తెలుస్తోంది. అనంగభీముడు నిర్మించిన ‘తిరుచుట్టుమంటపం’  స్తంభాలపై ఒరియా, తెలుగు, దేవనాగరి, ప్రాకృత భాషల్లో కనిపిస్తాయి. సింహాచలం కప్పస్తంభం మాదిరిగానే ఈ క్షేత్రంలో కూడా ఇచ్ఛాప్రాప్తి స్తంభం ఉంది. దీనికి కౌగిలించుకుంటే కోరికలు తీరుతాయని శాసనాలు తెలియజేస్తున్నాయి. 


కచ్ఛపేశ్వరస్వామి
శ్రీమహావిష్ణువుకు అత్యంత బాధ కలిగిన అవతారం కూర్మావతారం. తాబేలు రూపంలో మందర పర్వతాన్ని మోస్తున్నప్పుడు మొదట హాలాహలం పుట్టింది. ఆ విషం నుంచి ఉద్భవించిన జ్వాలలకు స్వామి శరీరం తపించిపోయింది. కానీ లోకసంరక్షణ కోసం స్వామి అమృతం పుట్టేవరకు అలాగే కదలకుండా ఉన్నాడు. ఆ ఘట్టం పూర్తయింది. కానీ, స్వామికి కలిగిన తాపం మాత్రం తగ్గలేదు. ఏం చేయాలో దిక్కుతోచలేదు. చివరకు పరమేశ్వరుడిని ఆశ్రయించాడు విష్ణుమూర్తి. అప్పుడు పరమేశ్వరుడు విష్ణువుతో ‘నేను కాంచీపురంలో ఏకాంబరేశ్వరుడిగా ఉన్నాను. నేను తూర్పుదిక్కును చూస్తుంటాను. నా ఆలయానికి దగ్గరగా పశ్చిమదిక్కును చూస్తూ నీవు నిలబడు’ అన్నాడు. సరిగ్గా ఆ ప్రాంతంలో నిలబడ్డాడు విష్ణువు. అప్పుడు పరమేశ్వరుడి జటాజూటంలో ఉండే చంద్రవంక చల్లదనం తగిలి శ్రీమహావిష్ణువు శరీరం చల్లబడింది. ఇక్కడ శివుడికి చంద్రకంఠేశ్వరుడు అని పేరు. శ్రీ మహావిష్ణువుకు కచ్ఛపేశ్వరస్వామి అనిపేరు.  తిరుమంగై ఆళ్వార్లు అక్కడ శ్రీమహావిష్ణుస్వరూపం మీద స్తోత్రం చేశారు.
- కప్పగంతు రామకృష్ణ

జగద్గురు ఆదిశంకరాచార్య వైభవం

గోవింద గోవింద అని కొలువరే!
జగద్గురు ఆదిశంకరాచార్య వైభవం
తాను కన్నవాళ్లు, తనను కన్నవాళ్లు కళ్లముందే రాలిపోతున్నా తాను మాత్రం శాశ్వతం అనుకోవడం ఓ భ్రాంతి...తాను కట్టుకున్న కలల కోటలకు ఏదో ఒకరోజు వీడ్కోలు  చెప్పాల్సి ఉంటుందన్నది సత్యం... కానీ సంసార యాత్ర  ఆ విషయం తెలుసుకోనివ్వదు. వ్యామోహాలు సత్యంవైపు చూడనివ్వవు.
మరి మనిషికి తరుణోపాయం లేదా...
ఉంది...
అది భగవదనుగ్రహం...
దాన్ని పొందేదెలా...
అది చాలా తేలికైన పని...
తెలుసుకో...
ఏది పాపం... ఏది పావనం?
ఏది నిత్యం... ఏది అనిత్యం?
ఏది శాశ్వతం... ఏది తాత్కాలికం?
స్మరించు...
నిత్యమైన నామాన్ని... పరమ సత్యాన్ని...
పరమోన్నత గమ్యాన్ని...
అదే తారకమంత్రం...
అదే పరమానందానికి దిక్సూచి...
భజగోవిందం సూత్రీకరణ ఇదే...
జగద్గురు శంకరభగవత్పాదులు ప్రవచించింది శుష్క వేదాంతాన్ని కాదు... సిసలైన జ్ఞానాన్ని. సకలవేద సారాన్ని...
బ్రహ్మవర్చస్సుతో వెలుగుతున్న ఓ యువ సన్యాసి గంగానదిలో స్నానం ముగించుకుని, కాశీలోని ఓ వీధిలో నడిచి వెళుతున్నాడు. ఓ ఇంటి ముందుకు వచ్చేసరికి ఆ అరుగుమీద కూర్చున్న వృద్ధుడైన ఓ పండితుడు ‘డృ ఞ్‌ కరణే’ అంటూ వ్యాకరణ సూత్రాన్ని పదే పదే వల్లెవేస్తున్న దృశ్యం కనిపించింది. వడివడిగా అడుగులు వేసుకుంటూ వెళ్తున్న ఆ సన్యాసి ఓ క్షణం అక్కడే ఆగాడు. ఆ పండితుడిని చూశాడు. వయసు మీద పడుతున్నఛాయ స్పష్టంగా కనిపిస్తోంది. సన్యాసి వచ్చి తన ఇంటి ముందు ఆగిన విషయం కూడా అతడు గమనించలేదు. తనకు ప్రపంచమే పట్టనట్లు ఇంకా వ్యాకరణ సూత్రాన్ని వల్లెవేస్తూనే ఉన్నాడు. చిరునవ్వు ఆ సన్యాసి పెదవులపై తొణికిసలాడింది. క్షణం కాలం కళ్లుమూసుకున్నాడు. బహుశా తన దైవాన్ని తలచుకున్నాడేమో? పండితుడి దగ్గరకు వచ్చి
భజగోవిందం భజగోవిందం
గోవింద భజ మూఢమతే ।
సంప్రాప్తే సన్నిహితే కాలే
నహి నహి రక్షతి డృ ఞ్‌ కరణే ।।
‘ఓ మూఢమతీ! వ్యాకరణ సూత్రాలను పక్కకు పెట్టు. జీవితపు చివరిదశకు చేరుకున్నావు. గోవిందుడి నామస్మరణ ప్రారంభించు. మరణకాలంలో నిన్ను ఆదుకుని, ఉత్తమలోకాలు కల్పించే తారకమంత్రం అదే’... అంటూ జీవితానికి అసలైన అర్థాన్ని, పరమార్థాన్ని బోధించాడా సన్యాసి. అలా ఆశువుగా శ్లోకాలు చెబుతూ, ఆ శ్లోకాల్లోనే మొత్తం జీవన సారాంశాన్ని నిక్షిప్తం చేసి, మానవాళికి మహోన్నత దశ, దిశ నిర్దేశించాడు. అద్వైతమార్గ ప్రతిష్ఠాపకుడిగా, జగద్గురువుగా అవతరించిన ఆది శంకరాచార్యులే ఆ సన్యాసి. లౌకిక జీవితమంతా నాటకమే... చేయాల్సింది నారాయణ స్మరణ మాత్రమే యావత్ప్రపంచానికి కర్తవ్యబోధ చేసిన ఆ స్తోత్రమే ‘భజగోవింద స్తోత్రం’.
సకల చదువుల సారం...
ఆది శంకరులు మూఢమతీ! అని సంబోధించింది కేవలం ఓ పండితుడిని మాత్రమే కాదు. అతడు మొత్తం సమాజానికి ప్రతీక. పుస్తక జ్ఞానం మాత్రమే చదువు అని భావించి దానికి మాత్రమే పరిమితమవుతున్న మనిషికి చేసిన జ్ఞానబోధ అది. విజ్ఞానం అంటే కేవలం అక్షరజ్ఞానం మాత్రమే కాదు. కొన్ని గ్రంథాల్ని ఆమూలాగ్రం చదవటం అంతకన్నా కాదు. కేవలం అక్షరాల్ని చదివితే సరిపోదు... వాటి మాటున దాగున్న అనంతమైన దైవత్వాన్ని దర్శించటమే చదువులోని అంతరార్థం అనే సందేశాన్ని భజగోవింద స్తోత్ర ఆవిర్భావ ఘట్టం మనకిస్తుంది.
పుట్టడం, పెరగడం, వివాహం, సంపాదన, నిద్ర, శారీరక సుఖాలు.... ఇదేనా జీవితం. సృష్టిలో ఉన్న అన్ని జీవరాశుల్లో మనిషికి మాత్రమే మనస్సు ఉంది. కానీ, ఆ మనస్సు మోహం అనే వలలో చిక్కుకుపోతుంది. దీంతో సిసలైన జ్ఞానం దరిచేరడం లేదు. వివేకంతో ఆలోచించాలి. సత్యమైన, నిత్యమైన దానికోసం అన్వేషించాలి. దీనికి పరమేశ్వర ధ్యానం ఉపకరిస్తుంది. తన అస్తిత్వం ఏమిటో మనిషి తెలియజెప్పటమే భజగోవిందస్తోత్రం అంతరార్థం.
భజగోవింద స్తోత్రం వయసు మీద పడిన వృద్ధులు చదవాల్సిన స్తోత్రం కాదు.
క్షణికమైన విషయాల మోహంలో నిజమైన సత్యాన్ని గుర్తించకుండా ప్రవర్తించేవారికి శంకరులు చేసిన హెచ్చరికలే ఈ స్తోత్రంలోని శ్లోకాలు.
జీవిత సత్యాలు... జీవన సూత్రాలు...
ఆదిశంకరులు రాసిన ఇతర రచనలకు భిన్నంగా భజగోవింద స్తోత్రం సాగుతుంది. మిగిలినవాటిలో శంకరులు ఏదో ఒక దేవతను స్తుతి చేస్తారు. ఇందుకు భిన్నమైన ధోరణి ఇందులో కనిపిస్తుంది.
గురుచరణాంబు నిర్భర భక్తః
సంసారాదచిరాద్భవ ముక్తః ।
సేంద్రియ మానస నియమాదేవం
ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం ।।
ఈ స్తోత్రంలో మానవుడే మాధవుడు. తన హృదయంలో దాగున్న నారాయణుడిని దర్శించటమే మనిషి కర్తవ్యం కావాలి. అందుకోసమే మనిషి తనను తాను జాగృత పరచుకోవాలనే స్వీయ జాగృతీ చైతన్య మహోద్యమానికి ఆదిశంకరులు భజగోవింద స్తోత్రం ద్వారా శ్రీకారం చుట్టారు. అమ్మ లాలన కాకుండా నాన్న పాలన ధోరణి శంకరులు ఈ స్తోత్రంలో అవలంబించారు. సుతి మెత్తని హెచ్చరికల ద్వారా సమాజాన్ని జాగృత పరచే బాధ్యతను భుజాలకెత్తుకున్నారు.
యావద్విత్తోపార్జన సక్తః
తావన్నిజ పరివారో రక్తః
పశ్చాజ్జీవతి జర్జర దేహే
వార్తాం కోపి న పృచ్ఛతి గేహే ।।
ధనం ఉన్నంత వరకే బంధుమిత్రులు మన దగ్గరకు చేరతారు. ధనం లేని రోజున వాళ్లంతా దూరంగా జరుగుతారు. అంటే, మనం సంపాదించాల్సింది లౌకికమైన ధనం కాదు. మనల్ని మనల్నిగా ప్రేమించి, ఆదరించే మనుషుల్ని, మనసుల్ని సంపాదించాలి.
మా కురు ధన జన యౌవన గర్వం
హరతి నిమేషాత్కాలః స్సర్వం ।
మాయామయమిదం అఖిలంఖిత్వా
బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా ।।
శారీరక సౌందర్యం క్షణికమైంది.  కావలసింది అంతస్సౌందర్యం.ధనం, పరివారం, యవ్వనం... వీటన్నిటినీ చూసి గర్వించటం తప్పు. ఇవన్నీ మాయా కల్పితాలు. ఇవన్నీ ఏనాటికైనా నశించేవే. శాశ్వతమైన సౌందర్యం పరమాత్మది మాత్రమేనని గుర్తించాలి.
బాలస్తావత్‌ క్రీడాసక్తః
తరుణస్తావత్తరుణీసక్తః
వృద్ధస్తావచ్చింతాసక్తః
పరే బ్రహ్మణి కోపినసక్తః ।।
బాల్యదశ ఆటపాటల మీద ఆసక్తితో గడిచిపోతుంది. యవ్వనమంతా స్త్రీ వ్యామోహంతో... వార్ధక్యం సంసారం మీద ఆలోచనతో గడిచిపోతుంది. మనిషి తామరాకు మీద ఉన్న నీటిబొట్టు తీరులో సంసారంలో ఉన్నా బంధాల్లో చిక్కుకోకుండా, పరబ్రహ్మాన్ని ఉపాసించాలి.
కురుతే గంగా సాగరగమనం
వ్రతపరిపాలనమథవా దానం
జ్ఞానవిహీనః సర్వమత్యేన
ముక్తిం న భజతి జన్మశతేన ।।
గంగ వంటి ఎన్ని పుణ్యనదుల్లో స్నానం చేసినా, ఎన్నెన్నో నోములు, పూజలు చేసినా ఆత్మజ్ఞానం లేకపోతే అవన్నీ వృథా అవుతాయి. కేవలం గంగా స్నానమే ముక్తిని ఇచ్చేట్లయితే అందులో మునిగే జంతుజాలానికీ మోక్షం రావాలి. కానీ, అది సాధ్యం కాదు. ఎందుకంటే..  మనిషికి కావల్సింది జ్ఞానం, విచక్షణ.
సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వం
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః ।।
జ్ఞానులు, మహానుభావుల సాంగత్యం ఎప్పుడూ కోరుకోవాలి. ఇందువల్ల మనసులో ఉన్న కల్మషాలన్నీ తొలగిపోతాయి. ఫలితంగా బుద్ధి నిశ్చలస్థితికి చేరుకుంటుంది...పరమేశ్వరుడి మీద కేంద్రీకృతమవుతుంది. అంతిమంగా జీవన్ముక్తి కలుగుతుంది.
వాస్తవానికి భజగోవింద స్తోత్రంలో శంకరాచార్యులు ఆశువుగా చెప్పింది కేవలం 12 శ్లోకాలే. వాటితో ఉత్తేజం పొందిన శిష్యగణం గురువుగారి బాణీని అనుసరిస్తూ మరో 14 శ్లోకాలు చెప్పారు. శిష్యుల ప్రతిభకు, వారిలోని ఆర్ద్రతకు ముచ్చటపడిన శంకరులు మరో ఐదు శ్లోకాలు ఆశీఃపూర్వకంగా చెప్పారు. దీంతో మొత్తం 31 శ్లోకాలు అయ్యాయి. ఇదే భజగోవిందంగా విశ్వవిఖ్యాతి పొందింది.శంకరులు చెప్పిన 12 శ్లోకాలను ‘ద్వాదశ మôజరీక స్తోత్రం’ అంటారు. శిష్యులు చెప్పిన 14 శ్లోకాలను ‘చతుర్దశ మంజరీక స్తోత్రం’ అంటారు.
భక్తుడు భగవంతుడిని చేరుకునేందుకు ప్రహ్లాదుడు నవవిధ భక్తిమార్గాలను చెప్పాడు. వీటిలో శ్రవణం మొదటిది కాగా ఆత్మనివేదనం చివరిది. ఇతర పద్ధతుల్లో ఈ మార్గాల్లో ఏదో ఒక విధానాన్ని అనుసరించటానికి మాత్రమే వీలుంటుంది. కానీ, భజగోవిందస్తోత్రంద ద్వారా శ్రవణం, కీర్తనం, స్మరణం అనే మూడు మార్గాలను ఒకే సమయంలో సాధన చేసే అవకాశం ఉంది. ఆది శంకరుల వైదుష్యానికి ఇదొక మచ్చుతునక.
భజగోవింద స్తోత్రం వయసు మీద పడిన వృద్ధులు చదవాల్సిన స్తోత్రం కాదు.  క్షణికమైన విషయాల మోహంలో నిజమైన సత్యాన్ని గుర్తించకుండా ప్రవర్తించేవారికి శంకరులు చేసిన హెచ్చరికలే ఈ స్తోత్రంలోని శ్లోకాలు.
- కప్పగంతు రామకృష్ణ

పున్నమి కాంతుల కల్యాణం (ఒంటిమిట్టలో జరిగే శ్రీ సీతారామ కల్యాణం నేపథ్యంగా శ్రీకనకదుర్గ ప్రభ పత్రికలో రాసిన వ్యాసం)

  పున్నమి కాంతుల కల్యాణం                లోకంలో పెళ్ళి ముచ్చట అంటే సీతారాములదే. అందులోనూ ఒంటిమిట్ట ఆలయంలో జరిగే సీతారాముల కల్యాణం మరింత శ...