Tuesday, July 2, 2019

వ్యాసపూర్ణిమ సందర్భంగా డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr Kappagantu Ramakrishna) ఈనాడు దినపత్రిక మకరందం పేజిలో రాసిన వ్యాసం

గురువు ఎందుకు?
రేపు గురుపౌర్ణమి
గురువు ఎందుకు?
చాణక్యుడు చేతిలో రూపుదిద్దుకున్న శిల్పం చంద్రగుప్తమౌర్యుడు సమర్థరామదాసు తయారుచేసిన వీరఖడ్గం శివాజీ!  రామకృష్ణపరమహంస అందించిన ఆధ్యాత్మిక శిఖరం వివేకానందుడు భారతీయ గురుశిష్య శక్తికి వీళ్లు ఉదాహరణలు మాత్రమే! ఆదిదేవుడితో మొదలైన గురుపరంపర వేదవ్యాసుడితో సుసంపన్నమైంది.. నేటికీ కొనసాగుతూనే ఉంది. సనాతన ధర్మాన్ని పరంపరాగతంగా పరిరక్షిస్తున్న ఆ గురుదేవులను స్మరించుకుందాం..
జ్ఞానపొరలు తొలగించి.. జ్ఞానదీప్తిని వెలిగించేవాడు గురువు. ‘గు’ అంటే చీకటి, ‘రు’ అంటే పోగొట్టేది అని అర్థం. అలాంటి గురువును దైవం కన్నా ఎక్కువగా ఆరాధించే సంస్కృతి మనది. అధర్వణ వేద సంప్రదాయం ప్రకారం చదువు ప్రారంభించే ముందు శిష్యుడు మొదటగా ఇష్టదేవతా ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత ‘స్వస్తినో బృహస్పతిర్దదాతు’ అని గురువును స్మరిస్తాడు. మహాభారతం అరణ్యపర్వంలోని యక్షప్రశ్నల ఇతివృత్తంలో యక్షుడు ‘మనిషి మనీషి ఎలా అవుతాడు?’ అని ధర్మరాజును ప్రశ్నిస్తాడు. ‘అధ్యయనం వల్ల, గురువు ద్వారా’ అని సమాధానం చెబుతాడు ధర్మరాజు. గురువుకు ఉన్న శక్తి అంతటి గొప్పది.
శాంతమూర్తి సదాచారదీప్తి
ఒక గురువు ఎలా ఉండాలో సనాతన ధర్మం సూచించింది. గురువుకు ఉండాల్సిన లక్షణాలు, గురువు గొప్పదనం గురించి స్కాంద పురాణంలో చక్కటి వివరణ ఉంది. ఈ పురాణంలోని ఉమామహేశ్వర సంవాదం ‘గురుగీత’గా ప్రసిద్ధి పొందింది. ఇందులో గురువు అని ఎవరిని పిలవాలి? ఆయన అవసరం ఏమిటి? శిష్యుడు ఎలా ఉండాలి? మొదలైన ఎన్నో విషయాల్ని పరమేశ్వరుడు పార్వతీదేవికి స్వయంగా వివరిస్తాడు.
శాంతో దాన్తో కులీనశ్చ,
వినీత శ్శుద్ధవేషవాన్‌
సదాచార స్సుప్రసిద్ధః
శుచిర్దక్ష స్సుబుద్ధిమాన్‌
ఆశ్రయే ధ్యాననిష్ఠశ్చ
మంత్ర తంత్ర విచక్షణః
నిగ్రహానుగ్రహే శక్తో గురురిత్యభిధీయతే ।।
గురువు శాంతంగా ఉండాలి. మంచి వేషం ధరించాలి. సదాచారం పాటించాలి. మంచి బుద్ధి, మంత్ర, తంత్రాలపై చక్కని అభినివేశం, నిగ్రహ, అనుగ్రహ సామర్థ్యాలు కలిగి ఉండాలి. ఈ లక్షణాలన్నీ గురువుకు ఉండాలని పరమేశ్వరుడు చెబుతాడు. యోగశిఖోపనిషత్‌, ముక్తికోపనిషత్‌, బ్రహ్మవిద్యోపనిషత్‌... ఇంకా ఎన్నో ఉపనిషత్తుల్లో గురువు గొప్పదనం, గురువును ఎలా సేవించాలి, గురువు అవసరం ఏమిటనే విషయాలు ఉన్నాయి.
అందరూ గురువులే..
సాధారణంగా గురువు అనగానే విద్య బోధించేవాడనే భావం కలుగుతుంది. కానీ, గురువులు ఏడు రకాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఏ గురువైనా శిష్యుడికి జ్ఞానాన్ని ప్రసాదించడమే లక్ష్యంగా కలిగి ఉంటారు.
1. సూచక గురువు - చదువు చెప్పేవాడు
2. వాచక గురువు - కుల, ఆశ్రమ ధర్మాలు బోధించేవాడు
3. బోధక గురువు - మంత్రాలు ఉపదేశించేవాడు
4. నిషిద్ధ గురువు - వశీకరణ విద్యలు బోధించేవాడు
5. విహిత గురువు - భోగాల మీద విరక్తి కలిగించేవాడు
6. కారణ గురువు - బ్రహ్మతత్త్వాన్ని ఉపదేశించేవాడు
7. పరమ గురువు - పరమాత్మ అనుభవాన్ని ప్రత్యక్షంగా కలిగించేవాడు
జాతికి అంకితం
ఆధునిక కాలంలోనూ ఎందరో గురువులు తమ అపారమైన శక్తి, మేధస్సుతో శిష్యులను తయారుచేసి, వారి ద్వారా మనదేశాన్ని కాపాడారు. ప్రగతిపథంలో నడిపించారు. చాణక్యుడు గురుస్థానంలో ఉండి చంద్రగుప్తమౌర్యుడికి ధర్మరాజ్య స్థాపన కోసం మార్గనిర్దేశం చేశాడు. పతంజలి పుష్యమిత్రుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. విద్యారణ్యుడు భారతీయ సంస్కృతీ పరిరక్షణాభిలాషను హరిహర, బుక్కరాయ సోదరుల్లో ప్రజ్జ్వలింపజేశాడు. సమర్థ రామదాసు శివాజీ వంటి చురకత్తిని మనదేశానికి అందించాడు. తన ఉపన్యాసాలతో భారతీయ హృదయాలను చైతన్యవంతం చేసిన వివేకానందుడిని రామకృష్ణ పరమహంస గురుస్థానంలో ఉండి, మనకు అందించాడు. భగవాన్‌ రమణమహర్షి, నడిచేదైవంగా ప్రసిద్ధిపొందిన కంచి కామకోటి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతీమహాస్వామి... ఇంకా ఎందరో గురువులు తమ బోధనలతో మనదేశాన్ని ధర్మమార్గంలో నడిపిస్తున్నారు.
- డాక్టర్‌ కప్పగంతు రామకృష్ణ  
ఎందరో మహానుభావులు
గురువంటే కేవలం ఆధ్యాత్మిక విద్యల్ని, లౌకిక జీవనానికి ఉపకరించే విద్యల్ని బోధించే ఆచార్యుడు కాదు. సమాజమే దేవాలయం, సమాజ హితమే భగవదనుగ్రహ కారకమని, పరోపకారమే పరమేశ్వరుడికి ప్రీతికరం అని చెప్పి, ఆచరించి సామాజిక జాగృతిని కలిగించిన గురువులు ఎందరో! వారి బోధలు, దార్శనిక సూత్రాలు చైతన్య స్ఫోరకాలు. అలాంటి ఎందరో మహానుభావుల్లో వీళ్లు కొందరు..
 సంత్‌ ఏక్‌నాథ్‌
తనను తాను అన్ని జీవరాశుల్లో దర్శించాలనే భగవతత్త్వాన్ని ఆదర్శంగా స్వీకరించిన వాడు సంత్‌ ఏక్‌నాథ్‌. పాండురంగడి భక్తుడిగా అంతటా విఠల దర్శనం చేశాడు. కులవ్యవస్థను నిరసించి, సర్వత్రా సమత్వ సాధనను ఆచరించి మహనీయుడిగా ఏక్‌నాథ్‌ చరితార్థుడయ్యాడు. పరోపకారమే పాండురంగడి పూజ అని చాటిచెప్పాడు.
 కబీర్‌ దాసు
అన్ని మతాల్లోని అంధవిశ్వాసాల్ని బహిర్గతం చేసి.. నిజభక్తి ఎలా ఉండాలో పరిచయం చేశాడు కబీర్‌. తాను రచించిన దోహాల ద్వారా సామజిక రుగ్మతలను ప్రశ్నించి.. సంఘంలో చైతన్యాన్ని కలిగించాడు. ప్రతి వ్యక్తిలో దైవత్వాన్ని దర్శించడమే మానవత్వమని చాటి చెప్పాడు కబీర్‌.
గురునానక్‌
‘నిన్ను నువ్వు ఎలా ప్రేమిస్తావో.. ఇతరులను కూడా అలాగే ప్రేమించు’ అనే విశ్వ ప్రేమ సూత్రాన్ని గురునానక్‌ వెల్లడించాడు. ‘జాతి అభిమానం వృథా! అన్ని జీవులు ఉండేది పరమాత్ముడి నీడలోనే’ అని జాత్యహంకారాన్ని నిరసించాడు.
స్వామి నారాయణ్‌
‘ఆకలిగొన్నవారికి అన్నం పెట్టడం, దాహార్తితో ఉన్నవారికి నీళ్లివ్వడం దైవపూజ. బీదల జీవితాల్లో చిరుదివ్వెలు వెలిగించడం.. దేవుడి గుడిలో దీపారాధన చేయడం’ అంటారు స్వామి నారాయణ్‌. సత్సంగం, సమాజ హితం, సాధుజీవనం పరమాత్ముడికి చేరువ చేస్తాయని ఉపదేశించాడు.
స్వామి దయానంద సరస్వతి
ఆర్య సమాజాన్ని స్థాపించి, అంధ విశ్వాసాల్లో, అవిద్యలో కూరుకుపోయిన స్వధర్మీయులను దయానంద సరస్వతి సముద్ధరణ చేశాడు. అభ్యుదయవాదిగా, సామాజిక సంస్కర్తగా దయానందది ప్రత్యేక స్థానం. లాలా లజపతిరాయ్‌, భగత్‌ సింగ్‌, చంద్రశేఖర్‌ ఆజాద్‌ వంటి వారికి ఆయన మార్గదర్శకడు.

  
భరతజాతి గురువు
జ్ఞానాన్ని ప్రసాదించిన గురువునే దైవంగా భావిస్తూ చేసుకునే పండగ గురుపూర్ణిమ. దీన్నే వ్యాసపూర్ణిమ అంటారు. వేదవ్యాసుడు జన్మించిన ఆషాఢ శుద్ధ పూర్ణిమను ఆయన పేరు మీద గురు పూర్ణిమగా నిర్వహించుకోవడం ఆచారంగా వస్తోంది.
వాస్తవానికి ‘వ్యాసుడు’ అనేది ఒక వ్యక్తి పేరు కాదు. అదొక పదవి. ఆ పదవిలో ఉన్న వారందరూ వ్యాసులే. ప్రతి మన్వంతరంలోనూ ఒక్కో వ్యాసుడు అవతరిస్తాడు. సృష్టి ప్రారంభమై 27 మన్వంతరాలు గడిచి, ప్రస్తుతం 28వ వైవస్వత మన్వంతరం జరుగుతోంది. ఈ మన్వంతరంలో సత్యవతి, పరాశరుల కుమారుడైన కృష్ణ ద్వైపాయనుడు (ఈయనకే బాదరాయణుడు అనే పేరు కూడా ఉంది) వ్యాసుడుగా ఉన్నాడు. ఈయన జన్మించిన ఆషాఢ పూర్ణిమగురుపూర్ణిమగా వ్యాప్తిలోకి వచ్చింది
వశిష్ఠుడు, వాల్మీకి వంటి తపశ్శక్తి సంపన్నులు, వేదవేదాంగవేత్తలు ఎంతమంది ఉన్నా వేదవ్యాసుడికే మన ప్రాచీనులు అగ్రపీఠం వేశారు. ఎందుకంటే, ఒకే రాశిగా ఉన్నా వేదాల్ని రుక్‌, యజు, సామ, అధర్వణ వేదాలుగా విభజించి లోకానికి అందించినవాడు వ్యాసుడు. ఈయనే బ్రహ్మసూత్రాలకు భాష్యం రాశాడు. భారత, భాగవతాలను రచించాడు. శ్రీకృష్ణుడి రూపంలో ప్రపంచానికి భగవద్గీత బోధించాడు. అనంతమైన సాహిత్యాన్ని సృష్టించి, దాని ద్వారా భారతీయ సంస్కృతీసంప్రదాయ హర్మ్యాలకు పునాదిరాళ్లు వేసిన శిల్పి వ్యాసభగవానుడు. సార్వజనీనం, సార్వకాలికమైన సాహిత్యానికి సృష్టికర్త కూడా ఆయనే. శక్తి, భక్తి, సౌశీల్యం, సహజీవనం, సనాతన ధర్మం, పవిత్రత, దానధర్మాలు ఈ దేశ సహజ లక్షణాలుగా రూపొందటానికి మూలం వ్యాసుడి రచనలే. ఇంతటి మహోన్నతమూర్తిని భారతజాతికి గురువుగా భావించి చేసే అర్చనే ‘గురుపూర్ణిమ’. భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ ‘మునీనామప్యహం వ్యాసః’- మునుల్లో నేను వ్యాసుడిని అంటాడు. ‘కృష్ణద్వైపాయనాదయో యే రుషయః తాన్‌ రుషీగ్‌ం తర్పయామి’అంటూ ఆచారాలు కూడా వ్యాసుడికే అగ్రపీఠం వేశాయి. ఇదీ వ్యాసుడి ఘనత.
27 మన్వంతరాల్లో వ్యాసులు..
స్వయంభువు, ప్రజాపతి, ఉశనుడు, బృహస్పతి, సూర్యుడు, యముడు, ఇంద్రుడు, వశిష్ఠుడు, సారస్వతుడు, త్రిథాముడు, త్రివృషుడు, భరద్వాజుడు, అంతరిక్షుడు, ధర్ముడు, త్రయారుణి, ధనుంజయుడు, కృతంజయుడు, సంజయుడు, అత్రి, గౌతముడు, హార్యాత్మకుడు, వేణుడు (వాజిశ్రవుడు), సోముడు, తృణబిందు, భార్గవుడు, శక్తిమహర్షి, జాతకర్ణుడు.

శ్రీకృష్ణుడి వేణుగానం, ఆ స్వామి ధరించే నెమలిపింఛం విశేషాలతో డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr Kappagantu Ramakrishna) ఈనాడు దినపత్రిక మకరందం పేజిలో రాసిన వ్యాసం

నెమలి నుంచి భావాలు వెదురు నుంచి రాగాలు
ఇది పరమాత్మతత్త్వం 
నెమలి నుంచి భావాలు వెదురు నుంచి రాగాలు 
సెప్టెంబరు 2 శ్రీకృష్ణ జన్మాష్టమి
గోకులంలో నందకిశోరుడుగా... నవనీత చోరుడుగా ఉన్నా... కురుక్షేత్రంలో అర్జున రథసారథిగా మారి... కర్తవ్యాన్ని బోధించి మహాభారతాన్ని నడిపినా పరమాత్మది భిన్నమైన శైలి... ఆయన అడుగుజాడలే కాదు ఆహార్యం కూడా అద్భుతమే... ఆయన రూపవిలాసంలో ప్రస్ఫుటంగా కనిపించేవి... అందంగా ఇమిడిపోయినవి  నెమలి పింఛం... పిల్లన గ్రోవి... ఓ పక్షి శరీరంపై ఉన్న ఈకలు భగవానుడి అలంకారమయ్యాయన్నా, వనంలోని వెదురు ఆయన చేతిలో రాగాలు పలికించిందన్నా వాటికి ఉన్న ప్రత్యేకమైన లక్షణాలే కారణం...
నల్లనయ్య సిగలో నిగనిగలాడుతూ, ఠీవిగా నిలబడే నెమలిపింఛాన్ని చూడగానే మనసులో ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. కృష్ణుడు అనగానే నెమలిపింఛం గుర్తుకు వస్తుంది. కన్నయ్యకు అత్యంత ప్రీతిపాత్రమైన అలంకారం కూడా పింఛమే. నెమలి ఎంత పుణ్యం చేసుకుందో కదా అనిపిస్తుంది.
నెమలి పింఛంలో ఏడు రంగులు ఉంటాయి. ప్రకృతిలో కనిపించే రంగులన్నీ ఈ ఏడు వర్ణాల సమాహారమే. అంతేకాదు... లోకమంతా విస్తరించి ఉన్న ఆకాశం పగటి వేళ నీలవర్ణంతో, రాత్రివేళల్లో నల్లనివర్ణంతో ప్రకాశిస్తుంది. ఇన్ని రంగుల సమాహారమే ఆకాశం. సూర్యోదయంలో ఒక రంగు, సూర్యాస్తమయంలో మరొక రంగు కనిపిస్తుంది. ఈ రంగులన్నీ కాలానికి సంకేతం. కృష్ణపక్షం, శుక్ల పక్షం అనే విభాగాలుగా చూసినా, కాలమంతా రంగులమయంగా కనిపిస్తుంది. ఇవన్నీ నెమలి పింఛంలో కనిపిస్తాయి.
నెమలి తన జీవితకాలమంతా అందరినీ ఆకర్షిస్తుంది. అందరూ నెమలిని చూసి ఎంతో ఆనందిస్తారు. జీవితం ముగిసిన తర్వాత కూడా నెమలి వదిలిన పింఛం కూడా నెమలి తీరులోనే అందరినీ ఆకర్షిస్తుంది.కొద్దికాలం జీవించిన నెమలి కన్నా జీవం లేకపోయినా నెమలి పింఛం మాత్రం తరతరాలపాటు అందరి మనసుల్నీ మురిపిస్తూనే ఉంటుంది. మానవ జీవన సత్యం ఇందులో దాగి ఉంది. బతికినన్నాళ్లూ అందరూ ఏదో ఒకరకంగా మనల్ని అంటిపెట్టుకుని ఉంటారు.  కానీ, మనం భౌతికంగా లేని రోజున కూడా ఆ జ్ఞాపకాలను అట్టిపెట్టుకునే ఆప్యాయత మనం సంపాదించుకోవాలి.
నెమలి పింఛాన్ని ఒకసారి చేతితో గట్టిగా రుద్దితే ప్రాణం ఉన్నదానిలా మరింత విశాలంగా విచ్చుకుంటుంది. భౌతికశాస్త్రపరంగా చూస్తే, ఈ ప్రక్రియ స్థిరవిద్యుత్‌ ప్రవాహానికి సంకేతం. మనిషి మనసుది కూడా ఇదే తీరు. తనకు నచ్చిన, తాను మెచ్చిన అంశంతో ఎక్కువసేపు రమిస్తే అతడి మనస్సు  అమితమైన ఆనందం పొందుతుంది.
నెమలిపింఛంలోని రంగులు, వాటిలోని వైవిధ్యం గురించి శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేశారు. ఆశ్చర్యకరమైన ఫలితాలు వెల్లడించారు. ద్విజ్యామితీయ స్ఫటిక అమరిక వల్ల పింఛంలో విభిన్నమైన రంగులు ఏర్పడుతున్నాయని కనుగొన్నారు. ఈ అమరికలో వచ్చే తేడాల వల్ల రంగులు పరావర్తనం చెంది, మెరుపుల మాదిరిగా కనిపిస్తాయి.చూడటానికి పింఛాలన్నీ ఒకేతీరులో కనిపించినా, సూక్ష్మంగా పరిశీలిస్తే ఆ అందాల వన్నెల్లో ఎన్నో వైవిధ్యాలు కనిపిస్తాయి. ఇవన్నీ సృష్టిలోని మనుషుల లక్షణాలకు సంకేతంగా నిలుస్తాయి.  ఎవరి కర్మలు భగవంతుడికి ప్రీతి కలిగిస్తాయో, అతడు నెమలిపింఛం మాదిరిగా పరమాత్మ ఆదరణకు పాత్రుడవుతాడు.
పింఛం ఎటుచూసినా ఒకేలా కనిపిస్తుంది.  మనిషి మనసు కూడా లోపల, బయటా ఒకేవిధంగా ఉండాలని పింఛం అందిస్తున్న సందేశం ఇది. చీకటిలో ఉన్నా, వెలుగులో ఉన్నా పింఛం ఏవిధమైన మార్పునకు లోనుకాదు. బాధలో ఉన్నా, సంతోషంలో ఉన్నా తన వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదనే సత్యాన్ని పింఛం మనిషికి బోధిస్తుంది.
కన్నయ్య వేణువును విడిచిపెట్టి క్షణం కూడా ఉండలేడు. వేణువు, మాధవుల అనుబంధం ఎంత గొప్పదంటే...చివరకు గోపికలు కూడా వేణువును చూసి అసూయపొందారు. కన్నయ్య తమ కన్నా వేణువునే ఎక్కువగా ఆదరిస్తున్నాడని అలిగారు. ఉండబట్టలేక, నేరుగా వేణువు దగ్గరకే వెళ్లి అడిగారు. ఏమమ్మా! ఏమిటీ నువ్వు చేసుకున్న పుణ్యం. గోపయ్యను కట్టేసుకున్నావు. ఏం మాయ చేశావు? నీకు ఇంతటి శక్తి ఎలా వచ్చిందని నేరుగా అడిగేశారు. వేణువు అందికదా... ‘నేను చేసింది ఏమీ లేదమ్మా! నన్ను నేను గోపయ్యకు అర్పించుకున్నాను. నాలో ఏమీ లేదు. అంతా డొల్ల’ అంది. తత్త్వం బోధపడింది గోపికలకు. నిజమే! వేణువు అంతా శూన్యం. అంటే, పరిపూర్ణతకు చిహ్నం. తనకంటూ ఏమీ లేదు మనసులో ఏ మాలిన్యమూ, ఏ భావమూ, వికారమూ లేదు. తన సర్వస్వాన్నీ పరమాత్మకు అర్పించుకుంది. నేను, నాది అనే భావాలు వేణువుకు లేవు. ఏది తనదో అదే పరమాత్మకు ఇచ్చేసింది. ఇప్పుడిక వేణువు, మాధవుడు ఇద్దరు కాదు... వేణుమాధవుడు మాత్రమే. మానవుడు అందుకోవాల్సిన మహత్తరమైన ఆధ్యాత్మిక సందేశాన్ని వేణువు అందిస్తుంది. నేను, నాది అనే వికారాలకు మనిషి దూరం కావాలి. తాను తానుగా మిగలాలి. తన స్వచ్ఛమైన మనస్సును మాధవుడికి అర్పించాలి. అలాంటి మనసున్న మనుషుల్ని పరమాత్మ అక్కున చేర్చుకుంటాడు.
ఇతర వాద్యాలకు భిన్నమైన సంగీత వాద్యం వేణువు. ప్రకృతిలో అత్యంత సహజంగా లభించే వెదురు పదార్థం నుంచి తయారైంది. ఏవిధమైన ఆడంబరాలు, అలంకారాలు, బిగింపులు లేవు. మనిషి కూడా వేణువు కావాలి. అత్యంత సహజమైన భక్తి భావంతో ఉండాలి. వేణువు అందిస్తున్న సందేశం ఇదే.
వేణువులో ఉండే రంధ్రాలు మానవశరీరంలో ఉండే షట్చక్రాలకు సంకేతం. వేణువులోని ప్రధానరంధ్రం ద్వారా గాలి ఊదుతూ, ఇతర రంధ్రాల మీద వేళ్లు ఉంచి, ఆ వాయువును నియంత్రిస్తే, కమ్మనైన నాదం ఆవిర్భవిస్తుంది. ఆ నాదం పరమాత్మకు పూజా పుష్పంగా మారుతుంది.  యోగశాస్త్రం ప్రకారం మానవశరీరంలో మూలాధారం నుంచి సహస్రారం వరకు ప్రాణవాయువు సంచారం చేస్తుంటుంది. దీన్నే యోగపరిభాషలో ‘హంస’ అంటారు. షట్చక్రాల్లో సాగే వాయుసంచారాన్ని నియంత్రించటమే యోగసాధన. ఎప్పుడైతే ప్రాణవాయువు మీద నియంత్రణ సాధ్యమవుతుందో, ఆ సాధకుడు యోగిగా మారుతాడు.  వేణునాదం మన జీవన నాదానికి ప్రతిరూపం.
- డాక్టర్‌ కప్పగంతు రామకృష్ణ, విజయవాడ

భగవాన్ సత్యసాయి బాబా బోధనల విశేషాలతో డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr Kappagantu Ramakrishna) ఈనాడు దినపత్రిక మకరందం పేజిలో రాసిన వ్యాసం

బంగారూ! ఇదే పంచశీల 
సత్యం... శివం... సుందరం
23న సత్యసాయి జయంతి
బంగారూ! ఇదే పంచశీల 
ఆయన వద్ద మంత్రాలన్నీ మామూలు మాటలయ్యాయి. ఆయన మాటలు మంత్రాలుగా మారి సమ్మోహితులను చేశాయి. అలతి అలతి పదాలతో వేదోపనిషత్తుల సారాన్ని ప్రజలకు పంచిన  ఆయన మానవాళికి ప్రేమ, సేవలను తారక మంత్రాలుగా అందించారు. అందుకే ఆయన నడిచే దేవుడయ్యారు... కదిలే బ్రహ్మమయ్యారు. ఆదర్శ పురుషులుగా ప్రపంచ ప్రఖ్యాతిపొందారు...
నేేను దేవుడిని. నీవు కూడా దేవుడివే. తేడా ఏమిటంటే ఈ సంగతి నాకు తెలుసు. నీకు తెలియదు. మీ హృదయాల్లో ప్రేమ అనే దీపం వెలిగించి దానిని అనుదినం ప్రజ్వలింపజేయటానికే వచ్చాను. నేను ఏదో ఒక మతం తరఫున గానీ, ఒక సంఘం తరఫునగానీ ప్రచారానికి రాలేదు. ఒక సిద్ధాంతానికి అనుయాయులను పోగుచెయ్యటానికి రాలేదు. నా మార్గంలో కాని, మరో మార్గంలో కాని శిష్యులను, భక్తులను ఆకర్షించం నా అభిమతం కాదు. విశ్వవ్యాప్తమైన ఒకే ఒక ఆధ్యాత్మికసూత్రం ‘ప్రేమ’ అనే మార్గం, ధర్మం అనే బాధ్యత. ఈ రెండు జ్యోతుల్ని మీకు అందించటానికే వచ్చాను... అంటూ తన మార్గాన్ని విస్పష్టంగా ప్రకటించి, తన ఆశయాల్ని ఆచరణలోకి తీసుకువచ్చిన ప్రేమమూర్తి సత్యసాయిబాబా.
 
1. మానవుడే మాధవుడు
దేవుడు గుళ్లల్లో, రాళ్లల్లో ఉండడు. మనుషుల్లో ఉంటాడు. తనలో దాగిఉన్న మాధవుడిని గుర్తించటమే జీవితలక్ష్యం కావాలంటారు సాయి. ఇందుకోసం ఆయన ప్రవచించిన మార్గం ‘సేవ’. కనబడే మనిషిని ప్రేమించలేకపోతే కనిపించని దైవాన్ని ఎలా ప్రేమించగలవు? ఎలా గుర్తించగలవు? అంటూ సూటిగా ప్రశ్నించేవారు. ఈ భావాన్ని ప్రతి వ్యక్తిలో ఉద్దీపింపజేయాలన్నదే ఆయన ఆశయం. అందుకనే తన ప్రతి ఉపన్యాసాన్ని దివ్యాత్మస్వరూపులారా! అంటూ ప్రారంభించేవారు. అందరినీ ప్రేమించు... ఎవరినీ ద్వేషించకు. తోటివారి బాధ నీదిగా భావించు. మానవసేవే మాధవ సేవ అంటూ ఎంతో స్పష్టంగా మానవధర్మాన్ని మానవీయకోణంలో సాయి ఉద్బోధించారు. సత్యసాయి సంస్థలన్నిటిలో ఆచరణాత్మకంగా కనిపించేది ఈ భావమే. ఆర్తులు,  అనారోగ్యపీడితులు... అందరినీ సాయి అక్కున చేర్చుకున్నారు.  వారికి సేవ చెయ్యటాన్నే దైవారాధనగా భావించేవారు.
సాయి మాటల్లో...
హృదయం : హృదయం లేని మాటకన్నా, మాటలేని హృదయం మిన్న
విద్య : గుణార్జనే కానీ ధనార్జన కోసం కాకూడదు
త్యాగం : దేహాభిమానాన్ని వదిలేయడం
సుఖం : రెండు దుఃఖాల మధ్య విరామం
దాసులు : హరికి కావాలి కానీ సిరికి కాదు
జీవనం : ఆశయాల కోసం... ఆశల కోసం కాదు
బలం : గుణాన్ని మించిన బలం లేదు
2. ప్రేమే మార్గం
తన గుండెల్లో భగవదైశ్వర్యాన్ని నింపుకోమనీ, నీచమైన అహంకారాన్ని విడిచిపెట్టమని ప్రతి మతం బోధిస్తుంది. వైరాగ్యాన్ని, విజ్ఞతనూ పెంచుకుని మోక్షాన్ని సాధించుకోవటాన్ని నేర్పుతుంది. అన్ని హృదయాల్లో వెలిగేది ఒకే ఒక దేవుడు. అన్ని మతాలూ ఆ భగవంతుడినే కీర్తిస్తున్నాయి. అన్ని భాషలూ ఆ పేరే చెబుతున్నాయి. ప్రేమే భగవంతుడిని ఆరాధించటానికి అత్యుత్తమమైన మార్గం. ఈ ప్రేమే నేను మీకిచ్చే సందేశం. ఈ ఐక్యభావాన్ని అవగతం చేసుకోండి అంటారు సాయి. ఆకాశం నుంచి వచ్చే వాన ఎక్కడ కురిసినా చివరకు సముద్రాన్నే చేరుతుంది. అలాగే, ఏ దేవుడిని ఆరాధించినా అది చివరకు చేరేది ఒకే పరమాత్మ దగ్గరకి అంటాయి ఉపనిషత్తులు. సాయి ఆచరించి చూపించిన మార్గం కూడా ఇదే.
3. నువ్వే... నువ్వే
మనిషి పొందే ఆనందానికి, దుఃఖానికి అతడే కారణం. ఇతరుల వల్ల నువ్వు దుఃఖపడేదీ లేదు. ఆనందం పొందేదీ లేదు. నువ్వు సంతోషంగా ఉంటే ఎవరూ పలకరించరు. అదే, బాధలో ఉంటే ఎందుకు విచారంగా ఉన్నావంటూ పలకరిస్తారు. ఆనందానికి, దుఃఖానికి ఇదే తేడా. ఆనందం మనకు సహజంగా వస్తుంది. దుఃఖం మనం తెచ్చిపెట్టుకున్నది. నువ్వు అనుభవించే బాధలకు నువ్వే కారణం. దాన్ని ఇతరుల మీద నెట్టే గుణాన్ని వదులుకోమంటూ సాయి యువతకు దిశా నిర్దేశం చేశారు. నీలో ఉన్న శక్తిని గుర్తించు. అంతులేని విజయాన్ని సాధిస్తావు అనేవారు.
4. ఉత్తిష్ఠ... జాగృతః
మీరంతా నాస్తికులుగా మారినా నాకు ఇష్టమే. కానీ, మూఢవిశ్వాసాలకు బలికాకండి. మీలో ఉన్న ప్రజ్ఞను మసిబారనివ్వకండి. మనిషికి మూఢవిశ్వాసం ప్రబల శత్రువు. దాన్ని ఆశ్రయించటాన్ని మించిన మూర్ఖత్వం ఉండదు. మీలో ఉన్న విచక్షణా జ్ఞానానికి పదును పెట్టండి. జ్యోతిష్యం, జాతకాల భ్రమలో జీవితాన్ని బలిచేసుకోకండి... అంటూ స్పష్టంగా యువతకు నిర్దేశం చేశారు సాయి.  ముక్కుమూసుకుని ‘సోహం.. సోహం’ అంటూ జపించటం, అలాచేసేవారిని ప్రోత్సహించటం సాయి సిద్ధాంతం కాదు. ‘సాధకుడా! లే ! నడుంకట్టు! సమాజ సేవలో ప్రవేశించు!’ అని ప్రోత్సహించటమే సాయి సిద్ధాంతం.
4. పరిపూర్ణంగా ఉండు
సాయిబోధనల్లో కర్మ, భక్తి మార్గాలు కనిపించినా అదంతా అద్వైతానికే దారి తీస్తుంది. సనాతన ధర్మాన్ని, విశ్వమానవ ప్రేమను ప్రబోధించిన సాయి, సమాజంలో నానాటికీ క్షీణిస్తున్న దైవవిశ్వాసాన్ని, ధర్మజిజ్ఞాసను పునరుద్ధరించారు. ఆదిశంకరాచార్యుల మార్గం కూడా ఇదే.ఆయనా పరిపూర్ణత్వాన్నే ఆకాంక్షించారు. ‘నహి నహి రక్షతి డృజ్ఞ్‌ కరణే’  ఆత్మజ్ఞానం లేని చదువు వ్యర్థమని ప్రకటించి, భజగోవింద స్తోత్రాన్ని రాశారు శంకరులు. సాయి మార్గమూ ఇదే.
-డా.కప్పగంతు రామకృష్ణ

పున్నమి కాంతుల కల్యాణం (ఒంటిమిట్టలో జరిగే శ్రీ సీతారామ కల్యాణం నేపథ్యంగా శ్రీకనకదుర్గ ప్రభ పత్రికలో రాసిన వ్యాసం)

  పున్నమి కాంతుల కల్యాణం                లోకంలో పెళ్ళి ముచ్చట అంటే సీతారాములదే. అందులోనూ ఒంటిమిట్ట ఆలయంలో జరిగే సీతారాముల కల్యాణం మరింత శ...