Thursday, January 14, 2021

దీక్ష అంటే ఏమిటి? దీక్షలో రకాలెన్ని? దీక్ష ఎందుకు చెయ్యాలి? దీక్షలో పాటించాల్సిన నియమాలేమిటి?

దీక్ష అంటే ఏమిటి? దీక్షలో రకాలెన్ని?
దీక్ష  ఎందుకు చెయ్యాలి? దీక్షలో పాటించాల్సిన నియమాలేమిటి? 



సర్వకాల రక్ష... దీక్ష

పుట్టుకతోనే ఏ మనిషీ సర్వోన్నతుడు కాలేడు. సర్వోన్నతమైన స్థానాన్నీ అందుకోలేడు. ఇందుకోసం నిరంతర సాధన అవసరం. తనను తాను ఉద్ధరించుకోవాలన్న ఆలోచన ఏ క్షణమైతే మనిషికి కలుగుతుందో ఆ క్షణం నుంచే అతడిలో పరివర్తనకు శ్రీకారం చుట్టుకుంటుంది. లౌకిక జీవనంలో అనేక మాయల వలలో చిక్కుకున్న మనిషి క్రమంగా తెలివి తెచ్చుకుంటూ వాటి నుంచి క్రమంగా బయటపడి శాశ్వతమైన సత్యాన్ని అన్వేషించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తాడు. వీటన్నిటిలో మనిషి అన్ని రకాల లౌకిక బంధాల నుంచి విడిపడేలా చేసి, దైవత్వానికి దగ్గర చేసేందుకు మేలైన మార్గం 'దీక్ష'. 

దీక్ష అంటే నియమాల సమాహారం. పట్టుదల అనే పేరు కూడా దీనికి ఉంది. ఒక ఆచారాన్ని లేదా  నియమాన్ని పాటించాలని సంకల్పించడం, దాన్ని పట్టుదలగా కొనసాగించడం దీక్ష అని చెప్పుకోవచ్చు. ఇంద్రియాలను నిగ్రహంలో ఉంచుకొని, దైహికంగా, మానసికంగా మండలం పాటు నిష్ఠాపూరితమైన జీవనాన్ని నిరాడంబరంగా గడపడం దీక్షలోని ప్రధానమైన అంశం. దీనివల్ల భౌతికమైన క్రమశిక్షణతోపాటు మానసికమైన నిబద్ధత ఏర్పడుతుంది. అది ఆదర్శప్రాయమైన జీవనానికి మార్గదర్శకమవుతుంది.

దీక్ష అంటే...?

దీయతే జ్ఞానం విజ్ఞానం క్షీయంతే పాప నాశనం

తేన దీక్షా ఇతి ప్రోక్తా ప్రాప్తాచ్చేత్‌ సద్గురోర్ముఖః ||


దీ - అంటే జ్ఞానం, క్ష - అంటే పాపక్షయం అని అర్థం. జ్ఞానాన్ని ఇచ్చి పాపాన్ని పోగొట్టేది ఏదో అది దీక్ష అవుతుంది. దీక్షకు ఇదమిత్థంగా ఇదీ భౌతిక స్వరూపం అంటూ ఏదీ ఉండదు.  మనసులో దర్శించిన అనుభూతి, ఎంచుకున్న లక్ష్యం, కలిగిన ప్రేరణ బట్టి దీక్ష ఆచరించే విధానం మారుతుంది. బయటకు ఇదంతా విభిన్నమైన పద్ధతులు అనిపించినా అన్ని దీక్షలూ చేరే గమ్యం పరమాత్మ పాదాలు మాత్రమే.

దీక్ష అనే పదం - ద, ఇ, క, ష, అ అనే ఐదు అక్షరాల కలయికతో ఏర్పడింది. 'ద' అంటే ఇచ్చేది, 'ఇ'  అంటే  లక్ష్మి లేదా సంపద. 'క' అంటే బ్రహ్మానందం. 'ష' అంటే సమృద్ధి. 'అ' అంటే పరమాత్మ లేదా పరబ్రహ్మ. ఇలా బ్రహ్మానందం, సంపద, సమద్ధి, పరమాత్మని ఇచ్చేది దీక్ష అవుతుంది. దీక్షను ఆచరిస్తే పరమ జ్ఞానం కలుగుతుంది. పాప పరంపరలను పోగొట్టి సంసార పాశ బంధాలను ఛేదించి, తత్త్వ చింతనను కలిగిస్తుంది. దీక్ష అంటే నియమబద్ధ ప్రవత్తి. మనస్సు, శరీరం, వాక్కుతో సహా అన్ని అవయవాలు, అన్ని ఇంద్రియాలను నియంత్రణలో ఉంచుకుని పరమాత్మ ఆరాధనకు అనుగుణంగా ప్రవర్తించటాన్ని దీక్ష అంటారు. దీక్షకు మించిన పవిత్రమైన వస్తువు, జ్ఞానం, తపస్సు ప్రపంచంలో మరెక్కడా లేవు.

మరోవిధంగా చెప్పాలంటే... నిశ్చలమైన మనస్సుతో సంకల్పించడాన్ని దీక్ష అంటారు. మనస్సు, వాక్కు, శరీరము ఈ మూడింటిని త్రికరణాలు అంటారు. ఈ మూడింటిని సమన్వయం చేసి నిర్వహించే పనుల్నే 'మనోవాక్కాయకర్మలు' అంటారు. అహింస (హింస చెయ్యకుండా ఉండటం), సత్యం (దేవుని మీద నిజమైన భక్తి కలిగి ఉండటం), ఆస్తేయం (అవలంబించేందుకు తగిన విధానాన్ని ఎంచుకోవటం), బ్రహ్మచర్యం (శారీరక వ్యామోహాలు లేకపోవటం), అపరిగ్రహం (తన భోగాల కోసం ఇతరుల నుంచి ధనాన్ని స్వీకరించకపోవటం) అనే మహావ్రతాలను మనోవాక్కాయ కర్మల ద్వారా ఆచరించటాన్ని కూడా దీక్ష అంటారు.

దీక్షలో రకాలు

దీక్షల్లో ప్రధానంగా మూడు రకాలు ఉంటాయి. అవి....ఆణవీ, శాక్తేయీ, వైష్ణవి. మంత్రం, అర్చన, ఆసనం, ధ్యానం, స్థాపన, ఉపాసన అనే ఆరు అంగాలు కలిగిన దీక్ష అణవి అవుతుంది. శక్తిని ఆరాధించే దీక్ష శాక్తం లేదా శాక్తేయం అవుతుంది. చివరిది వైష్ణవీ దీక్ష. గురుశిష్యులిద్దరూ ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా ప్రవర్తించటం వైష్ణవీ దీక్ష అవుతుంది. శిష్యుడిని మంచి దారిలో ప్రవర్తింపజేయటం, తత్త్వం, హితం, పరమార్థం మొదలైన విషయాల్ని బోధించటం మొదలైనవన్నీ ఇందులోకి వస్తాయి. గురువునే పరమాత్మగా ఆరాధించటం, ధన, మాన, ప్రాణాల్ని కూడా గురువుకే అర్పించటం ఈ దీక్షలో ప్రధానమైన అంశంగా ఉంటుంది. గురువు గారిని దర్శించటం, స్పశించటం, మాట్లాడటం వల్లనే తత్త్వ జ్ఞానము కలుగుతుంది. గురువు జ్ఞాన మార్గంతో శిష్యదేహంలో ప్రవేశించి శిష్యుడి జ్ఞాన నేత్రాన్ని తెరిపించి పరమాత్మ స్వరూపాన్ని సాక్షాత్కరింపజేయటం వైష్ణవి దీక్ష అవుతుంది. దీన్నే జ్ఞానదీక్ష లేదా బ్రహ్మచర్య దీక్ష అని కూడా అంటారు

ప్రతి దీక్షలోను కలశ స్థాపన ప్రధానమైన అంశంగా ఉంటుంంది. 'క' అనగా పరబ్రహ్మ, 'ల' అంటే లక్ష్మీ, 'శ' అంటే శాంతి, శక్తి అని అర్థం. కలశం బ్రహ్మాండానికి, అందులో ఉన్న జలం సకల దేవతలకు, ఆకులు సకల ప్రాణులకు ప్రతీకలుగా ఉంటాయి. కొబ్బరికాయ మనం ఏర్పరచుకునే స్థిరమైన సంకల్పానికి, దానిపై వేసిన వస్త్త్రం మన శరీరానికి ప్రతిరూపాలుగా ఉంటాయి. ఈవిధంగా త్రికరణాలతో త్రిమూర్తుల్ని, త్రిలోకాలని, తత్త్వ త్రయాన్ని ఆరాధించటమే కలశస్థాపన అవుతుంది. మొత్తంగా దీక్షలో ప్రధానంగా స్థాపించే కలశం మనల్ని తత్త్వాతీలుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన పునాది వేస్తుందని అర్థం చేసుకోవాలి.  ఈ విధంగా కలశస్థాపనతో స్వీకరించే దీక్షను క్రియావతి అని, మంత్రములతో చేస్తే మాంత్రి అని అంటారు.

దీక్షలు క్రియావతి, కళావతి, వర్ణమయి, బోధమయి అని నాలుగురకాలుగా ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి. కలశ స్థాపన చేసే విధానం క్రియావతి అవుతుంది. కలశంలో దేవతాకళలను ఆవాహన చెయ్యటం కళావతి, మంత్రాలు చదువటం, ఉపదేశించటం వర్ణమయి, తత్త్వ జ్ఞానాన్ని బోధించటం బోధమయి అవుతాయి. ఈవిధమైన దీక్షానియమాలతో దేవతల్ని ఆరాధించాలని, వారికి సంబంధించిన దీక్షావిధానాల్ని పాటించాలని వివిధ శాస్త్రాలతో పాటు ఆచార సంప్రదాయాలు కూడా చెబుతున్నాయి



దీక్ష ఎందుకు?

    పేరేదైనా సరే... దీక్ష స్వీకరించగానే ఒక పవిత్ర స్పహ మనసులోకి ప్రవేశిస్తుంది. వికత పద్ధతులు, పాశవిక స్థితులు దూరమై, ఆధ్యాత్మిక అభ్యున్నతి వైపు అడుగులు కదుపుతాం. ఆత్మవికాసాన్ని పెంచుకోగలుగుతాం. భౌతికమైన ఎదుగుదలను కట్టడి చేసి, ఎదుటివారిని మన ఇష్టదైవంగా భావించి ఆ పేరుతోనే పలుకరిస్తాం. ఇంకా మరెన్నో పద్ధతుల ద్వారా మానసిక పరిణతిని పెంపొందించుకోవడానికి కృషి చేస్తాం. ఇదంతా జరగటానికి దీక్షకు సంబంధించిన నియమాలు దోహదపడతాయి. అనవసరమైన విషయాలు మాట్లాడకుండా ప్రతి క్షణం మనల్ని మనం నియంత్రించుకోవడానికి ప్రయత్నించుకోవటం ద్వారా దీక్ష తీసుకున్న లక్ష్యాన్ని చేరుకోవటం సులభమవుతుంది.

దీక్ష అంటే కేవలం కొన్ని కఠినమైన నియమాల్ని పాటించటం మాత్రమే కాదు. అందుకు ఆంతరిక శుద్ధి తప్పనిసరి. దీక్ష ఇచ్చే వ్యక్తి, తీసుకునే వ్యక్తి ఇద్దరూ పరిశుద్ధమైన మనస్సు కలిగిఉండాలి. లేదంటా దీక్ష అనే మాటకే అర్థం మారిపోతుంది.

పాలను ఏదైనా గిన్నెలో పొయ్యాలనకున్నప్పుడు ముందుగా ఆ గిన్నె శుభ్రంగా ఉందో లేదో చూస్తాం. శుభ్రంగా ఉంటే సరి. లేదంటే గిన్నెను శుభ్రపరిచిన తర్వాతనే పాలను అందులోకి పోస్తాం. దీక్ష కూడా పాలవంటిదే. ఇక్కడ శరీరం గిన్నె వంటిది. శుభ్రమైన శరీరం (బాహ్యంగాను, మానసికంగాను) లేకపోతే అందులోకి పోసే (స్వీకరించే) దీక్ష కూడా మలినమవుతుంది. కాబట్టి, ఏవిధమైన దీక్ష చెయ్యాలని నిశ్చయించుకున్నా ముందుగా మన శరీరాన్ని మానసికంగాను, శారీరకంగాను ఎంతో శుభ్రంగా ఉంచుకోవాలి. ఆ తర్వాత సద్గురువును ఆశ్రయించి, ఆయన సూచనల ప్రకారం దీక్ష తీసుకోవాలి. అంతేకానీ ఏ వ్యక్తీ తనకు తానుగా దీక్ష తీసుకుంటున్నానని ప్రకటించకూడదు. ఆచరించకూడదు. ప్రత్యేకించి మంత్ర దీక్షల విషయంలో గురు అనుగ్రహం తప్పనిసరి.  

     కార్యసాధనకు దీక్ష తప్పనిసరి అనే అంశాన్ని శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీత ఆరో అధ్యాయంలో చెబుతాడు. 

అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్‌ |

అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గహ్యతే ||

అర్జునా! మనస్సును నిగ్రహించటం చాలా కష్టసాధ్యం. అయినప్పటికీ అభ్యాసం చేత, వైరాగ్యం చేత దాన్ని సాధించవచ్చంటాడు పరమాత్మ. ఇక్కడ అభ్యాసం అంటే దీక్ష. మనస్సును స్వాధీనం చేసుకోవాలంటే సాధారణ దీక్ష సరిపోదు. అకుంఠితమైన దీక్ష కావాలి.అకుంఠితం అంటే ఏ ఒక్కరోజూ కుంటుపడనిది అని అర్థం. దీక్ష తీసుకున్న తర్వాత మన నిర్ణయం మారకూడదు. మరో ఆలోచనకు తావు ఇవ్వకూడదు. అలాచేసినప్పుడే స్వీకరించిన దీక్ష కోరుకున్న ఫలితాన్ని ఇస్తుంది. 

'దేహో దేవాలయః ప్రోక్తో జీవోదేవస్సనాతనః'... దేహమే దేవాలయం. జీవుడే పరమేశ్వరుడని ఉపనిషత్తులు చెబుతున్నాయి. తనలో ఉన్న పరమేశ్వరతత్త్వాన్ని మనిషి గుర్తించే దీక్ష తీసుకుంటాడు కాబట్టే ఆ క్షణం నుంచి జీవుడు దేవుడుగా మారుతాడు. దేవాలయాన్ని ఎలాగైతే అత్యంత శుచిగా ఉంచుతారో దేహాన్ని కూడా అలాగే ఉంచుకుంటారు. భూశయనం ఆత్మ నిగ్రహాన్ని, శీతలస్నానం శారీరక శక్తిని ఇస్తాయి. కఠిన నియమాలు దీక్షాధారులు పాటించడం వెనుక ఉన్న ఆధ్మాత్మిక సందేశం ఇది. 

పాటించాల్సిన నియమాలు

- సూర్యోదయ పూర్వ, సూర్యాస్తమయాలకు పూర్వమే చన్నీటి స్నానం ఆచరించాలి.

- పదేళ్లలోపు స్త్రీలు, రుతుక్రమం లేనివారు, 60 ఏళ్ళ వయస్సు వారు దీక్షను ఆచరించవచ్చు.

- నిర్మలమైన మనసుతో పూజను ఆచరించాలి. విభూతి, కుంకుమ, చందనం ధరించాలి.

- దీక్షను స్వీకరించిన వారు స్వయంగా దైవ భావన కలిగి నిరాడంబరులై దీక్షకు అధిష్ఠాన దేవత ఎవరో ఆ దేవతకు ప్రీతిపాత్రమైన రంగులో ఉండే వస్త్రాలను ధరించాలి.

- అరుణోదయ, తపనోదయ, సంగమ, మధ్యాహ్న, సాయం, అర్థనిశా సమయాల్లో పూజలు ఆచరించాలి.వీటినే షట్కాలార్చన అంటారు. (ఆరు కాలాల్లో అర్చన చేయలేని వారు కనీసం ఉదయం, సాయంత్రం వేళల్లో తప్పనిసరిగా అర్చన చెయ్యాలి)

- దీక్ష పూర్తయ్యేవరకు సాధ్యమైనంత సేపు మౌనం వహించాలి.

- మంత్రాలతో పూజలు చెయ్యటం కుదరివారు దేవతకు సంబంధించిన నామాలతో అర్చన చేయవచ్చు.

- ఒక్కపూట భోజనమే చేయాలి. నేలపై పడుకోవాలి.

దీక్షలో చేయకూడనవి

- క్షౌరం చేయించుకోకూడదు.

- గోళ్లు తీయకూడదు.

- ధూమపానం, మద్యపానం చేయకూడదు.

- మాంస భోజనం తినరాదు.

- కామక్రోధాలు, వినోద కార్యక్రమలకు దూరంగా ఉండాలి.

- అనవసరంగా మాట్లాడకూడడదు.

- దీక్ష పూర్తయ్యేంత వరకు పాదరక్షలు ధరించకూడదు.

అచ్చంగా అమ్మలా...

లోకాలనేలే చల్లనితల్లి దుర్గమ్మ ఆశీస్సులు కోరుతూ చేసే దీక్ష భవానీ దీక్ష. అచ్చం ఆ అమ్మను పోలి ఉండేలా దీక్షా ధారులు ఎర్రటి వస్త్రాలు ధరించి, కుంకుమ ధరిస్తారు. పాదాలకు పసుపు పూసుకుంటారు. భవానీ దీక్షాధారులను చూడగానే కనకదుర్గమ్మను చూస్తున్నామా అన్నంత అనుభూతి కలుగుతుంది. మనసుతో పాటు శరీర ఆకృతిలోను అమ్మ భావనను ప్రకటిస్తూ ఆ తల్లి అనుగ్రహం ఈ దీక్ష చేస్తారు. 

భవానీపూజలో ప్రధానాంశం 'శరణు ఘోష'. అనేక విధాలైన స్తోత్రాలు, నామాలతో జగన్మాతను దీక్షాధారులు ఆరాధిస్తారు. మనిషిలో ఉండే యవ్వనం, అందం, అనుభవించే భోగభాగ్యాలు ఇవేవీ శాశ్వతం కావు. అమ్మ పాదాలను శరణు వేడటమే ముక్తికి మార్గం. భవబంధాలను విడిచి అమ్మ చరణాలను పట్టుకునేందుకు మనిషి మనస్సును సన్నద్ధం చేసే ఆధ్యాత్మిక సాధన శరణుఘోష ప్రధానాశయం. 

ఇంద్రకీలాద్రికి చేరుకుని, జగన్మాతను దర్శించిన తర్వాత ఇరుముడిలోని కొబ్బరికాయను హోమగుండంలో సమర్పిస్తారు. యజ్ఞం అంటే సమర్పణ భావం. తనను తాను దైవానికి సమర్పించుకోవటం మనిషి చేసే సాధనలో తుది అంకం. ఆ తర్వాత వ్యక్తి పూర్ణత్వాన్ని సంతరించుకుంటాడు. శాస్త్రాలు కూడా 'యజ్ఞోహి శ్రేష్ఠతం కర్మా' - మనిషి ఆచరించే కర్మలన్నిటిలో యజ్ఞాలు ఉత్తమమైనవని చెబుతున్నాయి. ఉత్తమ క్రియల ద్వారా పూర్ణతాన్ని సాధించటమే కొబ్బరికాయను అగ్నికి సమర్పించటంలో భావం. ఈవిధమైన ఆధ్యాత్మిక విజ్ఞాన రహస్యాలన్నీ తనలో ఇముడ్చుకున్న కారణంగా భవానీదీక్ష అమ్మను కృపను పొందేందుకు దివ్యమైన మార్గంగా భక్తుల నీరాజనాలు అందుకుంటోంది.

------------

రచన: డాక్టర్‌ కె.రామకృష్ణ, ఆంధ్రోపన్యాసకులు,  ఎస్‌.ఆర్‌.ఎస్‌.వి.కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, గాంధీనగర్‌, విజయవాడ-3. సెల్‌ : 90320 44115 / 88975 47548. email: krkrishna2011@gmail.com


(శ్రీ కనకదుర్గ ప్రభ పత్రిక జనవరి 2020 సంచికలో రాసిన వ్యాసం)










Thursday, December 17, 2020

స్కంద షష్ఠి సందర్భంగా కుమారస్వామి అవతార విశేషాలు వివరిస్తూ రాసిన వ్యాసం


స్కంద షష్ఠి సందర్భంగా 

కుమారస్వామి అవతార విశేషాలు వివరిస్తూ రాసిన వ్యాసం



జ్ఞానస్వరూపుడు... స్కందుడు


నమస్తే నమస్తే మహాశక్తి పాణే నమస్తే నమస్తే లసద్వజ్రపాణే |

నమస్తే నమస్తే కటిన్యస్త పాణే నమస్తే నమస్తే సదాభీష్టపాణే ||

స్కందుడు రాశీభూతమైన జ్ఞానస్వరూపుడు. ఆయన చేతిలోని 'శక్తి' ఆయుధం సునిశితమైన మేథస్సుకు ప్రతీక. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులనే మూడు శక్తుల సంయోగ స్వరూపంగా నిలిచి, అజ్ఞానం అనే తారకాసురుడిని సంహరించి, జ్ఞానజ్యోతులను ప్రకాశింపజేసిన విజ్ఞానమూర్తి ఆయన. బౌద్ధికజ్ఞానంతో పాటు అపారమైన భుజశక్తికి కూడా స్కందుడు ప్రతీకగా నిలుస్తాడు. రాక్షస సంహార విషయంలో దేవతలకే సేనా నాయకుడిగా నిలిచి, వారిని ఆదుకున్న ధీశాలి సుబ్రహ్మణ్యడు. 

స్కందుడన్న పేరు సుబ్రహ్మణ్యస్వామికి ప్రసిద్ధమైంది. స్కన్నమైన (జారిన) వాడు స్కందుడు. శివుని ఆత్మజ్యోతి నుండి ఆవిర్భవించిన ఆరుజ్యోతుల స్వరూపమే సుబ్రహ్మణ్యుడు. ఆయనే స్కందుడు. శరవణభవుడు, కార్తికేయుడు. కుమారస్వామి.... ఇలా సుబ్రహ్మణ్యస్వామికి ఎన్నో పేర్లు వ్యాప్తిలో ఉన్నాయి. శివపార్వతుల తనయుడిగా స్కందుడు ఆవిర్భవించిన తిథి 'షష్ఠి'. శక్తి కారకుడిగా పేరున్న ఆ స్వామి తారకాసుర సంహార సందర్భంలో దేవతలకు సేనాధిపత్యం వహించి, రాక్షస సంహారం చేసిన రోజు మార్గశిర శుద్ధ షష్ఠి. ఈ కారణాల వల్ల మార్గశిర శుద్ధ షష్ఠి 'స్కంద షష్ఠి'గా వ్యాప్తిలోకి వచ్చింది. 

సుబ్రహ్మణ్య జన్మ వృత్తాంతం

సుబ్రహ్మణ్యస్వామి జన్మవృత్తాంతానికి సంబంధించి అనేక గాథలు వ్యాప్తిలో ఉన్నాయి. అనేక పురాణాలు, కావ్యాలు, ఇతిహాసాల్లో సుబ్రహ్మణ్యుడి జనన వృత్తాంతానికి సంబంధించిన కథనాలు వర్ణితమై ఉన్నాయి. ఈ కథల్లో కొద్దిపాటి భేదాలు ఉన్నప్పటికీ స్థూలంగా కుమారస్వామి శివపార్వతుల తనయుడనే విషయంలో ఎటువంటి అభిప్రాయభేదం వీటిల్లో లేదు. 

పూర్వం తారకుడు అనే రాక్షసుడు మదగర్వంతో ముల్లోకాలపై దండెత్తి దేవ, మానవ, రాక్షసులను ముప్పుతిప్పలు పెట్టసాగాడు. అతడి ఆగడాలు భరించలేక ఇంద్రాది దేవతలు బ్రహ్మదేవుడిని ఆశ్రయించి, ఎలాగైనా తారకాసురుడి బారినుంచి ముల్లోకాలను రక్షించమని వేడుకున్నారు. బ్రహ్మదేవుడు దివ్యదష్టితో పరీక్షించి, తారకాసురుడు శివుడి అంశతో పుట్టిన శక్తిమంతుడైన వీరుడికి తప్ప మరెవరికీ లొంగడని దేవతలతో చెప్పాడు. అప్పటికే శివుడు తన అర్ధాంగి అయిన సతీదేవిని దక్షయజ్ఞ సమయంలో కోల్పోయి బాధతో హిమాలయాల్లో తపస్సు చేసుకొంటున్నాడు.

పరమశివుడు మరొక కన్యను వివాహం చేసుకుంటే తప్ప శివాంశతో వీరుడు పుట్టడం అసంభవం. అప్పుడు ఇంద్రుడు దేవతలతో సమావేశమై కర్తవ్యాన్ని గురించి ఆలోచించాడు. ఇంతలో ఇంద్రుడికి మన్మథుడి రూపంలో సమస్యకు పరిష్కారం కనిపించింది. వెంటనే మన్మథుణ్ని తన సభకు రప్పించి, ముల్లోకాలను రక్షించటం కోసం శివుడి మనసులో వివాహేచ్ఛకు మూలమైన ప్రేమను అంకురింపజేయమని కోరాడు. మన్మథుడు లోకరక్షణార్థం ఆ పని చేయడానికి అంగీకరించి, తన బాణాలకు పదునుపెట్టాడు. నిత్యం శివుణ్ని ఆరాధించడానికి హిమవంతుడి కుమార్తె పార్వతి హిమాలయాలకు రావడం గమనించాడు. 

ఒకనాడు పార్వతి శివుడిని అర్చిస్తుండగా, శివుడి మనసులో కోరికలు రేపే విధంగా తన పూలబాణాలను ప్రయోగించబోయాడు. తపోధ్యానంలో ఉన్న శివుడి మనసులో వికారం కలిగింది. జితేంద్రియుడైన శివుడు వెంటనే అది గ్రహించి, కోపంతో తన నొసటిపైనున్న అగ్నినేత్రాన్ని తెరిచి, మన్మథుణ్ని చూశాడు. శివుడి ఆగ్రహం ప్రళయాగ్నిగా మారి క్షణంలో మన్మథుడిని భస్మం చేసింది. ఆ సంఘటనతో కలత చెందిన పార్వతి తన ఇంటికి వెళ్ళిపోయింది. శివుడూ తన తపస్సుకు భంగం కలిగించిన ఆ చోటును వదిలి మరోచోటుకు వెళ్ళిపోయాడు. ఇంద్రాది దేవతల ఆశ నెరవేరలేదు. ఆ తరవాత సప్తర్షులు పూనుకొని పరమేశ్వరుణ్ని ఆశ్రయించి, హిమవంతుణ్ని ప్రేరేపించి పార్వతీపరమేశ్వరుల వివాహం జరిపించారు. 

వివాహానంతరం నవదంపతులు ఏకాంతంలో అన్యోన్యానురాగంతో ఉండగా, అగ్నిదేవుడు ఒక పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి వస్తాడు. అది చూసిన శివుడు తన తేజస్సును అగ్నికి ఇస్తాడు. అగ్ని దాన్ని భరించలేక గంగానదిలో జారవిడుస్తాడు. అదే సమయంలో నదిలో స్నానం చేస్తున్న ఆరుగురు కృత్తికాదేవతల గర్భంలోకి శివతేజస్సు చేరుతుంది. వారూ ఆ తేజస్సును భరించలేక తీరంలో ఉన్న రెల్లు పొదల్లో వదిలేస్తారు. కొంతకాలానికి ఆ పొదల్లోనే ఆరు ముఖాలతో బాలుడు జన్మిస్తాడు. అతడే షణ్ముఖుడైన కుమారస్వామి. 

రాక్షస సంహారం కోసమే ఆవిర్భవించిన కుమారస్వామి దేవకార్యాన్ని నెరవేర్చటానికి సన్నద్ధమయ్యాడు. తల్లి ఇచ్చిన 'శక్తి' ఆయుధాన్ని ధరించాడు. దేవతల సర్వసైన్యానికి నాయకుడిగా బాధ్యతలు స్వీకరించి, అమేయమైన పరాక్రమంతో తారకాసురుడితో పాటు అతడి సోదరులను కూడా సంహరించాడు. 

కావడి మొక్కులంటే ఇష్టం

పూర్వం అగస్త్య మహర్షి కైలాసానికి వెళ్ళి శివుడిని దర్శించి తిరిగి వెళ్ళే సమయంలో శివుడు రెండు కొండలను బహుకరించి శివశక్తి రూపంగా దక్షిణాదికి తీసుకు వెళ్ళి కొలవవలసిందిగా తెలిపారు. వాటిని స్వీకరించిన అగస్త్యుడు వాటిని ఇదంబుడు అనే శిష్యుడికిచ్చి తన వెంట వాటిని తీసుకుని రావలసిందిగా తెలిపాడు. ఇదంబుడు కావడిని కట్టుకుని రెండు పర్వతాలను అందులో ఉంచుకుని అగస్త్యుడి వెంట నడవసాగాడు. కొంత దూరం అంటే పళని వచ్చేసరికి ఆయాసం అధికమై కొంత సేపు విశ్రాంతికి ఆగాడు. కొంతసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ కావడిని ఎత్తగా ఒకవైపు పైకి లేచింది. మరోవైపు లేకపోవడంతో వెనుతిరిగి చూడగా దానిపై సుబ్రహ్మణ్యస్వామి నిలబడి ఉన్నాడు. కొండ దిగి వెళ్ళిపోమన్నాడు. పోకపోవడంలో వారిద్దరి మధ్యా యుద్ధం జరిగి చివరకు ఇదంబుడు చనిపోయాడు. ఈ విషయం తెలుసుకుని అగస్త్యుడు ప్రార్థించడంతో స్వామి తిరిగి బతికించారు. ఈ విషయం ఇదంబుడి భార్యకు తెలిసి కావడిలో పాలను తీసుకువెళ్ళి క తజ్ఞతగా స్వామివారికి సమర్పించింది. అప్పటి నుంచి కావడి మొక్కులను సమర్పించడం ఆచారమైంది. కాగా, కావడిని ఉపయోగించే బద్ద 'బ్రహ్మదండం' అనీ కర్కోటక అనే అష్టనాగులకు ప్రతీకలని చెప్పబడుతూ ఉంది.

సుబ్రహ్మణ్య వైభవం

సుబ్రహ్మణ్యుడు రూపంలో అందగాడు. శౌర్యంలో సాటిలేని వాడు. అందుకే దేవసేనాధిపతి అయ్యాడు. ఈయన వాహనం నెమలి. ఆయుధం శూలం. దీనిని విజయ శూలమనీ, జ్ఞాన శూలమనీ అంటారు. సుబ్రహ్మణ్యుడికి షణ్ముఖుడు అన్న పేరుంది. అంటే ఆరు ముఖాలు కలవాడని అర్థం. ఈ ఆరుముఖాలు జ్ఞానం, వైరాగ్యం, శక్తి, యశస్సు, ఐశ్వర్యం, దైవత్వానికి ప్రతిరూపాలు. వల్లీ, దేవసేన స్వామివారి ఉభయ దేవేరులు. 

కార్తికేయుడు మేధోమూర్తి. వేదాలు ఇతణ్ని యజ్ఞాగ్నిగా అభివర్ణించాయి. ఉపనిషత్తులు సనత్కుమారుడిగా కీర్తించాయి. శివుడికి ప్రణవనాదమైన 'ఓం'కార అర్థాన్ని వివరించిన చెప్పిన ఘనత కూడా సుబ్రహ్మణ్యుడికే దక్కుతుంది. ఈవిధంగా ఆదిదేవుడికే గురుదేవుడు అయ్యాడు కుమారస్వామి. శ్రీకష్ణుడు భగవద్గీతలో 'సేనాధిపతులలో స్కందుడిని నేను' అని ప్రకటించటం స్కందుడి ప్రాశస్త్యాన్ని తెలియజేస్తుంది.

వేదాలలో షణ్ముఖీయమైన సంవత్సర స్వరూపంగా స్వామిని వర్ణించారు. కాలాగ్ని స్వరూపమే ఇది. కాలాగ్నిరుద్రుడైన శివుని తేజమే ఈ సంవత్సరాగ్ని. ఆరు ముఖాలను ఆరు ఋతువులకు ప్రతీకగా, పన్నెండు చేతులను పన్నెండు మాసాలకు ప్రతీకలుగా చెప్పుకోవచ్చు. ఇదీ సంవత్సరాగ్ని రూపం. ఈ రూపం చిత్రాగ్ని అనే నెమలిపై ఆసీనమయ్యింది. వివిధ వర్ణాలనువెదజల్లే కాంతి పుంజమే ఈ నెమలి. ఈవిధంగా అనంతం, అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తులకు సుబ్రహ్మణ్య ఉపాస కేంద్రంగా ఉంటుంది. సుబ్రహ్మణ్య ఉపాసన ద్వారా మోక్షాన్ని అందుకున్న మహనీయులు ఎందరో ఉన్నారు. 

యోగస్వరూపుడు

'సార్ధ త్రి వలయకారిణీ సుప్త భుజంగాకార రూపా...' - మానవదేహంలో మూలాధార స్థానంలో కుండలినీ శక్తి మూడు చుట్లు చుట్టుకుని నిద్రిస్తున్న పాములా ఉంటుందని చెబుతారు. సాధకుడిలో ఆ శక్తి జాగృతమై సహస్రారం వరకు ప్రయాణిస్తుందని యోగశాస్త్రం చెబుతోంది. సుబ్రహ్మణ్యుడు జ్ఞానస్వరూపుడు. యోగ స్వరూపుడు. సాధనలో మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు ఆరుస్థానాలు క్రమంగా వికాసం పొందితే ఆ పైన ఉన్న సహస్రారంలో పరమచైతన్యం అనుభవానికి వస్తుంది. పరమాత్మ సుబ్రహ్మణ్యరూపంలో అవతరించే క్రమంలో ఆరుముఖాలతో దర్శనమిస్తాడు. ఇవి ఆరుచక్రాలకు సంకేతం. కుండలినీ శక్తి సర్పాకారంలో ఉంటుందని యోగశాస్త్రం చెబుతోంది. ఈ యోగానికి అధిపతి కుమారస్వామి. ఈ విషయాన్ని సంకేతరూపంలో చెప్పటమే సుబ్రహ్మణ్యుడు సర్పరూపంలో ఉంటాడని వర్ణించటానికి కారణం. 

షణ్ముఖుడు జ్యేష్ఠా నక్షత్రంలో జన్మించాడు. ఈ నక్షత్రానికి అధిపతి బుధుడు. బుధుడు జ్ఞానమిచ్చేవాడు. జ్ఞానాన్ని సంస్కతంలో సుబ్రహ్మ అంటారు. అందువలన ఈ స్వామి సుబ్రహ్మణ్యేశ్వరుడని ప్రసిద్ధి చెందాడు. ఈయన జన్మరాశి వశ్చికం నుండి జన్మలగ్నమైన మేషం వరకు ఆరు రాశులు ఉన్నాయి. ఈ ఆరురాశులు మనశరీరంలోని షట్‌ చక్రాలు. వశ్చికరాశిని తోకగా పరిగణిస్తే మేషరాశి పాము శిరస్సు అవుతుంది. ఈ పద్ధతిలో స్వామి కుండలినీ ప్రభువు అయ్యాడు. ఇవన్నీ జ్ఞాన వైరాగ్యాలకు సంబంధించిన విషయాలు. సర్పం వీటికి సంబంధించినది. అందువల్లనే సర్పాలను సదాశివుడు ధరించి పన్నగభూషణుడని ప్రసిద్ధి చెందాడు. ఈ పన్నాగాలు సుషుమ్నా నాడీరూపంలో ఉన్న షణ్ముఖుని విభూతి రూపాలు. ఆ కారణంగా సుబ్రహ్మణ్యేశ్వరుని సర్పరూపంలో పూజిస్తారు.

ఆరక్షరాల దైవం

షణ్మతాలలో కుమారోపాసన ఒకటి. కంఠంలో రత్నాలు, మేనిలో చక్కదనం, చేతిలో జ్ఞానశక్తి ఆయుధం, ముఖాన చిరునవ్వు, కటియందు (నడుముభాగం) హస్తాన్ని ఉంచి నెమలిపై ప్రకాశిస్తుండే స్వామి సుబ్రహ్మణ్యుడు. పరిపూర్ణమైన జ్ఞానస్వరూపుడు. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా అనే మూడు శక్తులమయమైన శక్తిని ధరించిన కుమారస్వామి, శరణన్నవారిని కాపాడే దేవుడు. అమోఘమైన శివతేజం పథ్వి, అగ్ని, జలం, షట్‌ కత్తికల శక్తిని (నక్షత్రశక్తి) ధరించి, చివరకు బ్రహ్మతపోనిర్మితమైన అలౌకిక మహాగ్ని శరవణంలో (అగ్నితో కూడిన రెల్లుతుప్పు)  బాలుడిగా రూపుదిద్దుకుంది. అందుకే స్వామి శరణభవుడు. శరవణభవ అనే పదంలో ఒక్కో అక్షరానికి ఒక్కో ప్రత్యేకమైన అర్థం ఉంది. శ - శమింపజేయువాడు, ర - రతిపుష్టిని ఇచ్చువాడు, వ - వంధ్యత్వం రూపుమాపువాడు, ణ - రణమున జయాన్నిచ్చేవాడు, భ - భవసాగరాన్ని దాటించేవాడు, వ - వందనీయుడు అని ఈ పదాలకు అర్థం. 

బీజాక్షర పరంగా చూస్తే, శ - లక్ష్మీబీజం. దీనికి అధిదేవత శంకరుడు. ర - అగ్నిబీజం. దీనికి అధిదేవత అగ్ని. వ - అమతబీజం. దీనికి అధిదేవత బలభద్రుడు. ణ - యక్షబీజం. దీనికి అధిదేవత బలభ్రద్రుడు. భ - అరుణ బీజం. దీనికి అధిదేవత భద్రకాళీదేవి. వ - అమతబీజం. దీనికి అధిదేవత చంద్రుడు. 

-----------------------------------------------------------------------

కుమారస్వామి అవతార విశేషాలు వివరిస్తూ రాసిన వ్యాసం

-----------------------------------------------------------------------














Saturday, December 5, 2020

ముక్కోటి ఏకాదశి విశేషాలు, నియమాలు, ఆచరించాల్సిన విధానాలు వివరిస్తూ ఆరాధన మాసపత్రిక డిసెంబరు 2020 సంచికలో రాసిన వ్యాసం

ముక్కోటి ఏకాదశి విశేషాలు, నియమాలు, ఆచరించాల్సిన విధానాలు వివరిస్తూ ఆరాధన మాసపత్రిక డిసెంబరు 2020 సంచికలో రాసిన వ్యాసం











ముక్తిదాయకం... ముక్కోటి ఏకాదశి
ప్రతి తిథీ ప్రత్యేకమే అయినప్పటికీ ఏకాదశికి మరింత ఎక్కువ ప్రత్యేకత కనిపిస్తుంది. ఏకాదశి అనే పేరు తలచుకోగానే ఓ పుణ్యభావన మన మనస్సుల్ని ఆవహిస్తుంది. ఏకాదశి రోజున పని ప్రారంభిస్తే విజయం తథ్యమనే ఆత్మవిశ్వాసం కలుగుతుంది. ఆ రోజున చేసే అర్చనలకు శ్రీ మహావిష్ణువు ప్రీతి చెందుతారని పురాణాలు, ఆచారాలు కూడా విస్పష్టంగా ప్రకటిస్తున్నాయి. అందుకే ఎంత ఒత్తిడిలో ఉన్నా, ఎంత కష్టంలో ఉన్నా ఏకాదశి రోజున సాధ్యమైనంత మేరలో విష్ణుమూర్తిని అర్చించి తరించాలని ప్రతి ఒక్కరూ తపిస్తుంటారు. ఇలా సంవత్సరానికి వచ్చే అన్ని ఏకాదశుల్లో మార్గశిర, పుష్యమాసాల్లో వచ్చే ముక్కోటి ఏకాదశి మరింత పుణ్యప్రదమైనదిగా ప్రసిద్ధి పొందింది.
ప్రతి నెలలో రెండు ఏకాదశులు చొప్పున ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. అధికమాసం ఉంటే మరో రెండు ఏకాదశులు అదనం. ప్రతి ఏకాదశికి నిర్దుష్టమైన నామధేయాలున్నాయి. ఆర్ష సంప్రదాయంలో ఏకాదశి తిథి పరమపవిత్రమైంది. శ్రావణ, కార్తిక, మార్గశిర మాసాల్లోని ఏకాదశులకు మరిన్ని ప్రత్యేకతలు  ఉన్నాయి. వీటిలో ధనుర్మాసంలో వచ్చే శుక్ల ఏకాదశి విశేషమైనది. దీన్నే ముక్కోటి ఏకాదశి పర్వదినంగా జరుపుకోవటం ఆనవాయితీగా ఏర్పడింది. 

ఏకాదశి...విశేషాల రాశి

విష్ణువు 'మురుడు' అనే రాక్షసుడితో యుద్ధం చేస్తూ అలసిపోయి, సింహవతి అనే గుహలో సేదతీరుతున్నాడు. ఆషాఢ శుక్ల ఏకాదశి నుంచి కార్తిక శుక్ల ఏకాదశి వరకు ఆ గుహలోనే యోగనిద్రలో ఉన్నాడు. ఈ విషయాన్ని గ్రహించిన మూరాసురుడు మాయోపాయంతో విష్ణువుపైకి దాడికి సిద్ధమయ్యాడు. అప్పుడు విష్ణువు శరీరం నుంచి యోగమాయ శక్తి రూపంలో వెలువడింది. ఆ మహాశక్తి మురాసురుడ్ని సంహరించింది. విష్ణుమాయా విలాసం నుంచి ఉత్పన్నమైన ఆ శక్తి స్వరూపానికి శ్రీహరి వరాన్ని అనుగ్రహించాడు. విష్ణువుకు ప్రియమైన తిథిగా ఏకాదశి పేరిట ఆ శక్తి రూపం పూజలందుకుంటుందని పేర్కొన్నాడు. ఆనాటి నుంచి ఏకాదశి తిథి పరమ పవిత్రమైనదిగా పరిగణిస్తున్నారని ఏకాదశి తిథి ఆవిర్భావ వత్తాంతాన్ని భవిష్యోత్తర పురాణం వివరించింది.

    సుకేతుడనే రాజు దేవతల ఉపదేశానుసారం ఏకాదశి వ్రతాన్ని ఆచరించి, విష్ణువు అనుగ్రహం వల్ల సంతాన సిద్ధి పొందాడని పద్మపురాణంలో ఉంది. సూర్యవంశ రాజైన రుక్మాంగదుడు ఏకాదశి వ్రతాన్ని తాను ఆచరించడమే కాక, తన రాజ్యంలో అందరిచేత నిర్వహింపజేసి, శ్రీహరికి ప్రియ భక్తుడయ్యాడని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. వైఖానసుడు అనే రాజు పితృదేవతలకు ఉత్తమగతుల్ని అందించడానికి ముక్కోటి ఏకాదశి వ్రతం చేసినట్లు విష్ణుపురాణం వివరిస్తుంది.

ఓ సందర్భంలో బ్రహ్మ, వరుణ, ఇంద్ర, రుద్ర గణాలన్నీ కలిసి అసురశక్తులపై విజయాన్ని సాధించటానికి శ్రీమహావిష్ణువు అనుగ్రహాన్ని ఆకాంక్షించారు. వైకుంఠ ఉత్తరద్వారం నుంచి వైకుంఠంలోకి ముక్కోటి దేవతాసమూహం ప్రవేశించారు. శ్రీహరి దర్శనాన్ని పొంది విష్ణు కరుణకు పాత్రులయ్యారు. సమస్త దేవతలు వైకుంఠ నారాయణుడి దర్శనం పొందిన ఆ మహత్తర సందర్భమే ముక్కోటి ఏకాదశి. 

ఏకాదశి తిథికి 'హరివాసరం' అని పేరు. వైకుంఠ ఏకాదశిని హరి ఏకాదశి, మోక్ష ఏకాదశి, సౌఖ్య ఏకాదశి అని కూడా వ్యవహరిస్తారు. శ్రీమన్నారాయణునికి సూర్యుడు కుడికన్ను కాగా చంద్రుడు ఎడమకన్నుగా ప్రకాశిస్తారు. నేత్రాలు వేరైనా దృష్టి ఒక్కటే. సూర్యచంద్రులు వేర్వేరుగా గోచరమవుతున్నా సమగ్రంలో కాంతి శక్తి ఒక్కటే. విరాట్‌ స్వరూపుడైన విష్ణువు ఎన్నో రూపాల్లో వ్యక్తమవుతున్నా భగవత్‌ చైతన్యం, ఈశ్వర తత్త్వం ఒక్కటే. అసురశక్తుల బారిన పడకుండా ప్రతికూల శక్తుల్ని ధైర్యంగా ఎదుర్కొని, సానుకూల శక్తుల్ని పెంపొందింప జేసుకోవడానికే ముక్కోటి దేవతలు విష్ణువును ఆశ్రయించారు. విష్ణుకృపను సాధించి మనోభీష్టాల్ని నెరవేర్చుకున్నారు. అందుకే ఈ ఏకాదశిని భగవదవలోక దినోత్సవం అని, మోక్షోత్సవమని కూడా పేర్కొంటారు. 

సూర్యుడు ధనూరాశిలోకి ప్రవేశించిన తర్వాత మకరసంక్రమణం వరకు జరిగే 'మార్గళి' మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఉత్తరాయణ పుణ్యకాలానికి (జనవరి 14 నుండి జూలై 16 వరకు) ముందు ముక్కోటి దేవతలతో సమ్మిళితమై ఉన్న విష్ణువును ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తరద్వారం గుండా ఆలయాల్లో దర్శిస్తే సమస్త మనోభీష్టాలు నెరవేరుతాయని విశ్వాసం.

ఏకాదశి నియమావళి

ముక్కోటి ఏకాదశి పర్వదినం వైష్ణవ ఆగమ శాస్త్రప్రకారం ఎంతో విశేషమైనది. తిరుమల శ్రీవారి సన్నిధితో పాటు ప్రముఖ వైష్ణవక్షేత్రాలైన శ్రీరంగంలోని శ్రీరంగనాథ స్వామి ఆలయం, గురువాయురు, భద్రాచల దివ్యక్షేత్రాల్లో ప్రత్యేక పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తారు. భక్తుల దర్శనం కోసం ఉత్సవమూర్తుల్ని సర్వాలంకార యుక్తంగా ఉత్తరద్వారంలో కొలువుదీరుస్తారు. ముక్కోటి పర్వదిన సందర్భంగా ప్రతి వైష్ణవ సన్నిధానం వైకుంఠమై విలసిల్లుతుంది. వేద, వేదాంగ, పద, క్రమ, ఉపనిషత్తుల్ని గానం చేస్తారు. షోడశోపచారాలతో స్వామికి కైంకర్యాలు కొనసాగుతాయి. అలంకార ప్రియుడైన విష్ణుభగవానుడి అవతార స్వరూపాలైన శ్రీరామ, శ్రీకష్ణ, శ్రీవేంకటేశ్వర నసింహ ఆలయాలన్నీ నేత్రానందకరంగా భాసిల్లుతాయి. దశమి నాడు ఏక భుక్తం, ఏకాదశి నాడు ఉపవాసం, ద్వాదశి నాడు అన్నదానం అనేది సంప్రదాయరీత్యా పాటించాల్సిన నియమాలు. 

బ్రహ్మాది దేవతలు స్తుతులు చేస్తుండగా, మంగళధ్వనులు మారుమ్రోగుతుండగా, వేద పండితులు సస్వరంగా మంత్రాలు పఠిస్తుండగా పాలకడలిలో శేషతల్పంపై పవళించిన శ్రీమహావిష్ణువుకు శ్రీమహాలక్ష్మి సేవ చేస్తూ ఉంటుంది. విష్ణువు నాభి నుంచి ఉద్భవించిన పద్మంలో బ్రహ్మ కొలువై ఉండగా స్వామి అనంత పద్మనాభుడిగా తేజరిల్లుతాడు. ఈ వైకుంఠ దివ్య దర్శనాన్ని ప్రతి భక్తుడు సదా తమ హృదయ పీఠంపై నిలుపుకోవాలి, విష్ణుకృపకు పాత్రులు కావాలి. చీకటి నుంచి వెలుగువైపునకు నిత్య చైతన్యంతో పయనించాలి. 

వైష్ణవక్షేత్రాల్లో సందడి

ముక్కోటి రోజున వైష్ణవ దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతుంటాయి. ఆ రోజున ఉత్తరద్వార మార్గంలో స్వామిని దర్శించుకోవాలని భక్తులు ఎంతో ఆరాటపడతారు. ముక్కోటి ఏకాదశినాడు తెల్లవారుజామునుంచే ఆలయాల్లో భక్తులు ఉత్తరద్వార దర్శనం వేచి ఉంటారు. ఈ రోజున వైకుంఠం వాకిళ్లు తెరచుకునే పర్వదినం. ముక్కోటి ఏకాదశినాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. అందువల్లనే ముక్కోటి ఏకాదశి అని దీనికి పేరు. మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన ఈ ఏకాదశి పవిత్రత సంతరించుకున్నందు వల్ల దీనిని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు.

దేవతలు, రాక్షసులు జరిపిన క్షీరసాగర మథనంలో ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. కాలకూట విషాన్ని పరమేశ్వరుడు తన గరళాన బంధించింది ఈ రోజే. మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు భగవద్గీతను ఉపదేశించింది కూడా ముక్కోటి ఏకాదశినాడే అనేది ఒక విశ్వాసం. తిరుమల శ్రీవారి పుష్కరిణిలో ఏడాదికి నాలుగుసార్లు మాత్రమే చక్రస్నానం జరుగుతుంది. ఏడాదిలో ఈ చక్రస్నానాలు జరిగే నాలుగుసార్లు ముల్లోకాల్లో ఉన్న పుణ్యతీర్థాలు స్వామి పుష్కరిణిలో సూక్ష్మరూపంలో ప్రవేశిస్తాయని విశ్వాసం. అనంతపద్మనాభ వ్రతం రోజున, బ్రహ్మోత్సవాలలో చివరిరోజున, వైకుంఠ ఏకాదశి మరునాటి తిథి ద్వాదశి ఉన్న రోజు, రథసప్తమి రోజు స్వామివారికి చక్రస్నానాలు జరుగుతాయి. అందుకే ఈ రోజున ప్రత్యేకించి వైష్ణవ ఆలయాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు.

మనసే విష్ణు నివాసం

విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదు, దేహమే దేవాలయమని శాస్త్రనిర్ణయం. కైవల్యోపనిషత్తు తెలిపినట్లుగా ప్రతి మానవ హృదయగుహలోను పరమాత్మ ప్రకాశిస్తున్నాడు (నిహితం గుహాయాం విభ్రాజతే). అంతదగ్గరలో ఉన్న పరమాత్మను ఉద్దేశించి, ఏకాదశీవ్రతాన్ని నియమంగా ఆచరించాలి. అంటే, ఉపవాసం ద్వారా ఏకాదశ ఇంద్రియాలను నిగ్రహించి, పూజ-జపం-ధ్యానం మొదలైన సాధనల ద్వారా ఆరాధించడమని భావం. పంచజ్ఞానేంద్రియాలు (కళ్ళు, చెవులు, మొదలైనవి) పంచ కర్మేంద్రియాలు (కాళ్ళు, చేతులు మొదలైనవి), మనస్సు అనే పదకొండు ఇంద్రియాల ద్వారానే మనం పాపాలు చేస్తాం. ఆ పదకొండే అజ్ఞానానికి స్థానం. అందుకే పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుణ్ని జ్ఞానప్రదాయిని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు. అందుకే ఏకాదశీవ్రతాన్ని నిష్ఠగా ఆచరించినవారు జ్ఞానవంతులవుతారు. ముక్కోటి ఏకాదశి అందించే సందేశం ఇది.

--------------------
రచనః డాక్టర్‌ కప్పగంతు రామకృష్ణ, ఆంధ్రోపన్యాసకులు, ఎస్‌.ఆర్‌.ఎస్‌.వి.కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, గాంధీనగర్‌, విజయవాడ -3, సెల్‌: 90320 44115 / 8897 547 548


Wednesday, November 18, 2020

రుద్రాభిషేకం గురించిన విశేషాలతో డాక్టర్ ‌కప్పగంతు రామకృష్ణ (Dr Kappagantu Rama Krishna) రాసిన వ్యాసం

 



రుద్రాభిషేకం గురించిన విశేషాలతో 

డాక్టర్ ‌కప్పగంతు రామకృష్ణ (Dr Kappagantu Rama Krishna) 

రాసిన వ్యాసం 

రుద్రాభిషేక వైభవం

      శివునికి అభిషేకం చేయటానికి సర్వసాధారణంగా వినియోగించే మంత్రాలు నమక, చమకాలు. శ్రీకృష్ణ యజుర్వేదంలో అంతర్భాగంగా ఉండే నమక, చమకాలను కలిపి సాధారణ పరిభాషలో 'రుద్రాధ్యాయం' అనీ, 'రుద్రం' అనీ వ్యవహరిస్తుంటారు. ఈ మంత్రాలతో శివునికి చేసే అభిషేకం అనంతమైన పుణ్యఫలితాన్ని అందిస్తుంది.

 యం యం కామయతే మర్త్యో లింగార్చన పరాయణః |

తం తమాప్నోతి విప్రేంద్ర మత్ప్రసాదాన్నసంశయః ||

   లింగార్చన చేసే భక్తుడు తన మనసులో ఏయే కోరికలు తీరాలని భావిస్తున్నాడో, అవన్నీ నా అనుగ్రహం వల్ల తప్పక నెరవేరుతాయని సాక్షాత్తు పరమేశ్వరుడు చెప్పినట్లు శైవాగమాలు ప్రకటిస్తున్నాయి.

    లింగార్చన లేదా రుద్రాభిషేకం వల్ల కలిగే ఫలితం అనంతం అనీ, ఎప్పటికీ నశించదనీ శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. యజ్ఞ, యాగ, దాన, తపస్సుల వల్ల కలిగే ఫలితం కేవలం రుద్రాభిషేకం వల్ల కలుగుతుంది. అయితే, కోరికను అనుసరించి, కొన్ని ఆచారవిధానాలను శాస్త్రాలు నిర్దేశిస్తున్నాయి. వీటితోపాటు రుద్రాభిషేకం ఏయే సమయాల్లో చేయాలి? ఎలా చేయాలి? ఎటువంటి లింగాన్ని అర్చించాలి? ఇందుకు అనుసరించాల్సిన విధానాలేమిటి? మొదలైన విషయాలను కూడా ఆగమాలు విస్పష్టంగా పేర్కొంటున్నాయి.

 శివాభిషేక నియమాలు

      రుద్రాభిషేకాన్ని తప్పనిసరిగా శైవాగమాన్ని అనుసరించే చేయాలని సాక్షాత్తు ఆదిశంకరులు చెప్పారు. 'సిద్ధాంత సారావళి' కూడా ఇదే విషయాన్ని ప్రకటిస్తుంది.

 అష్టాదశాసు విద్యాసు మీమాంసాపి గరీయసి

తతోపి తర్కశాస్త్రాణి పురాణం తేభ్య ఏవ చ

తతోపి ధర్మశాస్త్రాణి తేభ్యో గుర్వీశ్రుతిర్ద్విజా

తతోప్యుషనిషచ్ఛ్రేష్ఠస్తత శ్శైవాగమోధికః ||

           అష్టాదశ విద్యల్లో మీమాంస, మీమాంస కంటే తర్కం, తర్కం కంటే పురాణాలు, పురాణాల కంటే ధర్మశాస్త్రం, ధర్మశాస్త్రాల కంటే వేదాలు, వేదాల కంటే ఉపనిషత్తులూ, ఉపనిషత్తుల కంటే శైవాగమాలు గొప్పవి. వీటినే వేదాగమాలని కూడా అంటారు. ఈశ్వరప్రోక్తం కావటం వల్ల కారణాగమం, కామికాగమం వంటి శైవాగమాలు చాలా గొప్పవి. కాబట్టి, శైవాగమాలు చెప్పిన పద్ధతుల్లో రుద్రాభిషేకం చేయాలి.

     ·   తడివస్త్రాలు ధరించి అభిషేకం చేయకూడదు. భుజం మీద కూడా తడివ్రస్తం ధరించకూడదు.

· అభిషేక సమయంలో పూర్తిగా మౌనాన్ని పాటించి, చిత్తాన్ని పరమేశ్వరుని మీదనే లగ్నం చేయాలి.

·   కాళ్ళు చాపుకుని కూర్చొనటం, ఇతరులతో సంభాషించటం, స్త్రీలతో సరస సంభాషణ, తర్కించటం, అసత్య సంభాషణ పనికిరాదు.

·      పరనింద, పరస్తుతి చేయకూడదు.

·     గట్టిగా మాట్లాడకూడదు. విచారవదనంతో ఉండకూడదు.

· అభిషేక సమయంలో యజమాని దీర్ఘరోగుల్ని, కుక్కల వంటి జంతువులను చూడకూడదు. స్పృశించకూడదు. ప్రమాదవశాత్తు చూసినట్లయితే 108 సార్లు ఓంకారాన్ని జపించి, కుడిచేతితో కుడిచెవిని స్పృశించాలి.

·   భస్మధారణ చేయకుండా అభిషేకం చేయకూడదు.

·  అభిషేకానికి ముహూర్త నిర్ణయం అవసరం లేదు. వర్జ్యదోషాలు ఉండవు.

· శివలింగ పీఠం మీద పూజాద్రవ్యాలు, గంధపాత్రలు, బెల్లం ముక్క, కొబ్బరిచెక్క మొదలైన పదార్థాలు ఉంచకూడదు.

· అభిషేక సమయంలో తుమ్మటం, దగ్గటం, ఉమ్మివేయటం, అసత్యం పలకటం చేయకూడదు. నియమభంగం జరిగితే  యజయాని ఆచమనం చేసి, కుడిచేతితో కుడిచెవిని స్పృశించాలి.

·   సంకల్పం చేయటానికి ముందు, అభిషేక సమయంలో, ఆ ధూప, దీప, నీరాజన సమయాల్లో తప్పనిసరిగా గంట మోగించాలి. ఘంటానాదం చేయకుండా చేసే అభిషేకరం ఫలితాన్ని ఇవ్వదు.

 రుద్రాభిషేక విధి

          రుద్రాభిషేకం చేయటానికి మొత్తం ఎనిమిది విధానాలు, వాటివల్ల కలిగే ఫలితాలు 'రుద్రకల్పం'లోని విష్ణ్వీశ్వర సంవాద విభాగంలో వర్ణితమై ఉన్నాయి. అవేమిటంటే... 

1. వారం : నమకంలో మొత్తం 11 అనువాకాలు ఉంటాయి. ఒకసారి నమకంలోని 11 అనువాకాలు చెప్పి, చమకంలో ఒక అనువాకం (చమకంలో కూడా 11 అనువాకాలు ఉంటాయి) చొప్పున వరుసగా చెప్పాలి. ఈవిధంగా 11 సార్లు నమకం చెబితే, చమకంలోని 11 అనువాకాలు చెప్పటం పూర్తవుతుంది. ఇలా చేసిన అభిషేకానికి 'వారం' అని పేరు.

 2. ఆవృత్తి : నమకం 121 సార్లు, చమకం 11 సార్లు. పృథివీ రూపధారి అయిన రుద్రప్రీతి కలుగుతుంది. సర్వపాపాలు తొలగుతాయి. జలరూపధారి అయిన శివప్రీతి కలుగుతుంది. ఫలితంగా సకల సుఖాలు లభిస్తాయి.

 3. రుద్రం : నమకం 1,331 సార్లు, చమకం 121 సార్లు. తేజోరూపధారి అయిన శంకరుని ప్రీతి కలుగుతుంది. ఫలితంగా సర్వ సంపదలు కలుగుతాయి. 

4. ఏకాదశ రుద్రం : నమకం 14,641 సార్లు, చమకం 1,331 సార్లు. వాయురూపధారి అయిన పరమేశ్వరునికి ప్రీతి కలిగి, తద్వారా లక్ష్మీకటాక్షం కలుగుతుంది.

 5. శతరుద్రం : నమకం 1,61,051 సార్లు, చమకం 14,641 సార్లు. ఆకాశరూపధారి అయిన మహేశ్వరునికి ప్రీతి కలుగుతుంది. ఫలితంగా పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుంది. 

6. లఘురుద్రం : నమకం 17,71,561 సార్లు, చమకం 1,61,051 సార్లు. సూర్యరూపధారి అయిన ఈశ్వరప్రీతి కలుగుతుంది. పునర్జన్మ నివృత్తి అవుతుంది. 

7. మహారుద్రం : నమకం 194,87,171 సార్లు, చమకం 17,71,561 సార్లు. చంద్రరూపధారి అయిన రుద్రునికి ప్రీతి కలుగుతుంది. జ్ఞానవృద్ధి కలుగుతుంది.

 8. అతిరుద్రం : నమకం 21,43,58,881 సార్లు, చమకం 194,87,171 సార్లు. సర్వరూపి అయిన పరమేశ్వరునికి ప్రీతి కలుగుతుంది. ఫలితంగా చెప్పటానికి అలవికాని మహాఫలితాన్ని యజమాని పరమేశ్వర వరప్రసాదంగా అందుకుంటాడు.

  శ్రావణ, కార్తిక మాసాల్లో, విశేషంగా మాఘమాసంలో ఏదైనా పవిత్ర పుణ్యక్షేత్రంలో, నదీతీరంలోగాని, పర్వత ఉపరిభాగంలో కానీ, పశ్చిమాభిముఖ ద్వారం ఉన్న శివాలయంలోని గానీ యజమాని 11 మంది బ్రాహ్మణులను ఏర్పాటుచేసుకుని రుద్రాభిషేకం చేస్తే తప్పకుండా ముక్తి కలుగుతుంది.  యజమాని తన అభీష్టాన్ని, శక్తిని అనుసరించి వీటిల్లో ఏదో ఒక విధానాన్ని ఎంచుకుని, రుద్రాభిషేకం చేయాలి.

 శివాభిషేక ఫలితాలు

      ·  భస్మాన్ని ధరించి, భస్మశయ్యపై పడుకుని, నిశ్చలబుద్ధితో రుద్రాన్ని పారాయణ చేస్తే పంచమహాపాతకాలు కూడా పటాపంచలు అవుతాయని పరాశరస్మృతి చెబుతోంది.

· సురాపానం, బ్రహ్మహత్య వంటి పాపాలు కూడా రుద్రాభిషేకం వల్ల తొలగటంతో పాటు సంసారబంధాల నుంచి విముక్తి కలుగుతుంది.

· రుద్రాధ్యాయాన్ని పారాయణ చేయటం వల్ల రహస్యంగా చేసిన పాపాల నుంచి కూడా విముక్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.

· ఎటువంటి మమకారం లేకుండా, ఫలాపేక్ష రహితంగా రుద్రాధ్యాయాన్ని పారాయణ చేస్తే సశరీరంగా కైలాసగమన సిద్ధి కలుగుతుందని వాయుపురాణం చెబుతోంది.

·   దుస్స్వప్నం వల్ల కలిగే దోషం, గ్రహదోషాల నివారణకు రుద్రాధ్యాయాన్ని పారాయణ చేయాలని లింగపురాణంలో ఉంది.

·   రుద్రాభిషేకంతో పాటు రుద్రపారాయణ చేయటం వల్ల సంతానహీనులకు సత్సంతానం కలుగుతుందని ఆపస్తంబ సూత్రం చెబుతోంది.

· శ్రేష్ఠమైన మృత్తిక (మట్టి), కస్తూరి రెండిటి మిశ్రమంతో నిర్మించిన లింగాన్ని అభిషేకించి, పూజించినట్లయితే సంపదలు కలుగుతాయి.

·  మృత్తికతో శ్రీగంధం కలిపి తయారుచేసిన లింగాన్ని సశాస్త్రీయంగా 20 రోజులు పూజించి, అభిషేకం చేస్తే తాపజ్వరం నుంచి ఉపశమనం కలుగుతుంది.

· కస్తూరీ మిశ్రమంతో తయారుచేసిన మృణ్మయలింగాన్ని పదిరోజుల పాటు భక్తియుక్తంగా పూజించి, అభిషేకాదులు నిర్వహిస్తే ఆత్మదోష జనితమైన సర్వరోగాలు నశిస్తాయి.

·   చక్కెర కలిపి తయారుచేసిన మృణ్మయ లింగాన్ని మూడు నెలలపాటు సశాస్త్రీయంగా పూజిస్తే, సభల్లో నేర్పుగా మాట్లాడే శక్తి, కవిత్వసిద్ధి కలుగుతాయి.

·  మృత్తికలో బియ్యపుపిండి కలిపి తయారుచేసిన లింగాన్ని మూడు నెలల పాటు శాస్త్రవిధిగా అర్చించి, అభిషేకం చేస్తే పుత్రసంతానం కలుగుతుంది.

·   మృత్తికలో పసుపు కలిగి, 108 రోజుల పాటు శాస్త్రవిధిగా అభిషేకం చేస్తే సర్వజనాకర్షకమైన రూపం, ఐశ్వర్యం కలుగుతాయి.

·  మృత్తికలో ఆవునెయ్యి కలిపి, లింగాన్ని తయారుచేసి, 50 రోజుల పాటు అభిషేకం చేస్తే పైత్యరోగం నివారణ అవుతుంది.

· ఎర్రని గంధం కలిపి తయారుచేసిన మృత్తికాలింగానికి 32 రోజులు అభిషేకం చేస్తే దగ్గు, దమ్ము రోగాలు నివారణ అవుతాయి.

· ఇనుపచూర్ణం, మృత్తిక కలిపి లింగాన్ని తయారుచేసి, 22 రాత్రులు శాస్త్రవిధిగా అభిషేకార్చన చేస్తే, శత్రునాశనం కలుగుతుంది.

· నువ్వులు కలిపి తయారుచేసిన మృత్తికాలింగానికి ఏడురోజుల పాటు నిర్మలభక్తితో అభిషేకం చేస్తే యమబాధలు నశిస్తాయి.

·  నిత్యం రుద్రాభిషేకం చేయటం వల్ల భూత, ప్రేత, పిశాచ, బ్రహ్మరాక్షస బాధలు నశిస్తాయి.

గృహేత్వేక గుణం ప్రోక్తం నదీతీరే సహస్రకం |

దేవతాయతనేలక్షం శతలక్షం హరేర్గృహే |

శివాలయే కోటి గుణం శివే స్వాయంభువే పునః |

అనంతం పూజనం శంభోః ఋతం వచ్మిద్విజోత్తమ ||

          రుద్రాభిషేకం చేసే స్థలాన్ని బట్టి కూడా ఫలితం ఉంటుంది. ఇంట్లో చేసే లింగార్చన వల్ల ఒకభాగం ఫలితం కలుగుతుంది. నదీతీరంలో చేస్తే అందుకు వేయి రెట్లు ఎక్కువ ఫలితం వస్తుంది. దేవతానివాసాల్లో చేసే అభిషేకానికి లక్ష రెట్లు ఎక్కువ ఫలితం, విష్ణ్వాలయంలో చేసే అభిషేకానికి నూరు లక్షల రెట్లు ఎక్కువ ఫలితం, శివాలయాల్లో చేసే అభిషేకానికి కోటిరెట్లు, పర్వతగుహల్లో చేసే అభిషేకానికి పదికోట్ల రెట్లు, ఆ గుహ ఋష్యాశ్రమం కూడా అయితే కోటికోట్ల రెట్లు ఎక్కువ ఫలితం కలుగుతుంది. బ్రహ్మక్షేత్రంలో (కాశీక్షేత్రం) శివాభిషేకం చేస్తే అమితమైన ఫలితం లభిస్తుందని ఆగమాలు ప్రకటిస్తున్నాయి.

 -----------------------------

రచన

డాక్టర్ ‌కప్పగంతు రామకృష్ణ, 

ఆంధ్రోపన్యాసకులు,  

ఎస్‌.ఆర్‌.ఎస్‌.వి.కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, గాంధీనగర్‌, విజయవాడ-3 

సెల్‌ : 90320 44115 / 88975 47548

 


పున్నమి కాంతుల కల్యాణం (ఒంటిమిట్టలో జరిగే శ్రీ సీతారామ కల్యాణం నేపథ్యంగా శ్రీకనకదుర్గ ప్రభ పత్రికలో రాసిన వ్యాసం)

  పున్నమి కాంతుల కల్యాణం                లోకంలో పెళ్ళి ముచ్చట అంటే సీతారాములదే. అందులోనూ ఒంటిమిట్ట ఆలయంలో జరిగే సీతారాముల కల్యాణం మరింత శ...