Friday, February 12, 2021

సూర్యుడికి ప్రీతిగా చెయ్యాల్సిన నోములు... రథసప్తమితో పాటు మరెన్నో సూర్యవ్రతాలు

 



సూర్యుడికి ప్రీతిగా చెయ్యాల్సిన నోములు... 

రథసప్తమితో పాటు మరెన్నో సూర్యవ్రతాలు


ఆరోగ్యసోపానాలు... ఆదిత్య వ్రతాలు 

               

నీ మండలం రుగ్వేదం. నీ దేహం యజుర్వేదం.నీ కిరణాలు సామవేదం అంటూ ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడిని వేదస్వరూపుడిగా వర్ణిస్తుంది మంత్ర మహార్ణవం. 

                ప్రభాతంలో బ్రహ్మ స్వరూపానివి. నడిమింటి వేళ మహేశ్వర తత్త్వానివి. సంధ్యాసమయంలో విష్ణుమూర్తివి అంటూ ఆదినారాయణ స్వరూపుడైన ఆదిత్యుడిని త్రిమూర్తి స్వరూపుడిగా పురాణాలన్నీ వివరిస్తున్నాయి. 

                మొత్తంగా పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు, ప్రబంధాలు... మొత్తం వాఙ్మయమంతా భాస్కరుడి ప్రస్తావన లేకుండా ముందుకుసాగదు. ఇది అక్షర సత్యం. కేవలం సాహిత్యమనే కాదు సమాజ జీవనం కూడా ఆదిత్యుడి అండ లేనిదే ముందుకు సాగదు. 

                ఎందుకంటే బాలభానుడు వస్తే గానీ లేత మొగ్గ విచ్చుకుని పువ్వుగా మారదు. గూళ్ళల నుంచి గువ్వపిల్లలు రెక్కలు విదిల్చి గాల్లోకి ఎగరవు. చీకటి బూచికి భయపడ్డ చిన్నారి అమ్మ ఒడి విడిచి ధైర్యంగా బయటకు రాడు. సమయం దాటిపోతోందంటూ పిల్లలూ, శ్రామికులూ, కర్షకులూ, ఉద్యోగులూ... ఒకరేమిటి... సమాజంలోని ప్రతి ఒక్కరూ సూర్యనారాయణుడి రాకతో చకచకగా తయారయిపోతుంటారు. 

                అలా అందరినీ అదిలించి కదిలించిన సూర్యుడు తీసుకువచ్చింది కేవలం వెలుతురిని మాత్రమే కాదు. అనంతమైన శక్తిని, ఉత్తేజాన్ని కూడా. ఆ కిరణాలు అమృతానికి ప్రతిరూపాలు. ప్రాణశక్తికి మరోరూపాలు. అందుకనే ప్రభాకరుడిని వేదాలు కొలిచాయి. ఉపనిషత్తులు ఉపాసించాయి. పురాణాలు ప్రస్తుతించాయి. ఆచార వ్యవహారాలు తమలో ఒకడిగా మార్చేసుకున్నాయి.

                 ఇంతగా సమాజ జీవనంతో ఒదిగిపోయిన సూర్యదేవుడిని ఆరాధిస్తూ చేసే వ్రతాలను పురాణాలు చెబుతున్నాయి. ఆయా వ్రతాల ఆరాధనలో ఆరోగ్య పరిరక్షణ బాహ్యంగా కనిపించినా మోక్షసాధన అంతర్లీనంగా సాగుతుంది. ఈ వ్రతాల్లో ముఖ్యమైన కొన్ని....

 శాకసప్తమీ వ్రతం 

కార్తిక శుద్ధ సప్తమి రోజు ఈ వ్రతాన్ని ప్రారంభించి మాఘ శుక్ల సప్తమి వరకు కొనసాగించాలి. కార్తిక, మార్గశిర, పుష్య, మాఘ మాసాల్లో శుద్ధ షష్ఠిరోజున సంకల్పం చెప్పుకుని, ఒంటిపూట భోజనం చెయ్యాలి. సప్తమి రోజున పూర్తిగా ఉపవాసం ఉండి, ఆదిత్యుడిని వివిధ రకాల ఉపచారాలతో పూజించాలి. శాక సహితంగా పాయసం నివేదన చేసి, ఆ పాయసాన్ని శాక సహితంగా ఏడుగురు బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. ఆ తర్వాత పాయసాన్ని ప్రసాదంగా తీసుకోవాలి. మర్నాడు అంటే అష్టమి రోజున పారాణ చెయ్యాలి. 

కార్తికమాసంలో పాయస ప్రాశనం, మార్గశిరంలో గోమయ ప్రాశనం, పుష్యమాసంలో గౌర - సర్షప - కల్కప్రాశనం, మాఘమాసంలో క్షీరప్రాశనం చెయ్యాలి. వ్రతం పూర్తయ్యే మాఘమాసంలో బ్రాహ్మణులకు భోజనం పెట్టి, పండిత సత్కారం చెయ్యాలి. యథాశక్తిగా దానధర్మాలు చెయ్యాలి. ఈ నాలుగు నెలల కాలంలో ఏదో ఒక రోజున సూర్యునికి ప్రీతి కలిగించేలా నూతన వస్త్రాలు, రాగి పళ్ళెం, చెంబు, నీరు తాగే పాత్ర, నెయ్యితో నింపిన పాత్ర వీటిని దక్షిణతో సహా యోగ్యుడైన బ్రాహ్మణుడికి దానం చెయ్యాలి. ఈ వ్రతం ఆచరించినవారు సకల సంపదలు పొందుతారు. ధర్మార్థకామ సిద్ధి కలుగుతుంది. ఆరోగ్యం, ఆయుష్షు కలిగి, సుఖజీవనం సాగిస్తారు. 

రథసప్తమీ వ్రతం 

రథసప్తమికే సూర్యజయంతి అనే పేరు కూడా ఉంది. సూర్యునికి సంబంధించి అనేక సప్తమీ వ్రతాలు ఉన్నాయి. కల్యాణ సప్తమి, మహాసప్తమి, కమల సప్తమి, రథాంక సప్తమి, జయా సప్తమి, మార్తాండ సప్తమి, అర్క సంపుట సప్తమి మొదలైనవి. వీటన్నిటిలో మాఘ శుద్ధ సప్తమి రోజున వచ్చే రథసప్తమికి ఎంతో ప్రాధాన్యత ఉంది.  ఈ రోజున చేసే స్నాన, ధ్యాన, నమస్కారాది క్రియలు శారీరక అనారోగ్యాలను దూరం చేయటంతో పాటు మానసిక ప్రవృత్తులను కూడా సక్రమమార్గంలోకి మళ్ళిస్తాయి. ఆనందం, ఆరోగ్యం, తేజస్సు, విజయం రథసప్తమీ ఫలితాలుగా భక్తులకు అందుతాయి.

          రథసప్తమి రోజున ఏడు జిల్లేడు ఆకులు, ఏడు రేగు కాయలను తల, భుజాలు తదితర ప్రదేశాల్లో  ఉంచుకుని, జననీత్వంహి లోకానం సప్తమీ సప్త సప్తికే | సప్తమ్యా హ్యదిత్ర దేవి నమస్తే సూర్యమాతృకే || అనే శ్లోకాన్ని పఠిస్తూ స్నానం చేయాలి. దీంతో పాటు ఈ కింది శ్లోకాన్ని చదివి శాస్త్రవిధిగా స్నానం చెయ్యాలి.

 

యద్యజ్జన్మకృతం పాపం మయా సప్తసు జన్మసు 

తన్మే రోగం చ శోకం చ మాకరీ హంతు సప్తమీ

ఏతజ్జన్మ కృతం పాపం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పున: 

ఇతి సప్తవిధం పాపం స్నానాన్మే సప్త సప్తికే

 సప్తవ్యాధి సమాయుక్తం హర సప్తమి మే హర ||

ఏతన్మంత్రమయం జప్త్వా స్నాత్వా పాదోదకే నర:

కేశవాదిత్య మాలోక్య క్షణాన్నిష్కల్మషో భవేత్‌ ||

    ఈవిధిగా శాస్త్రప్రమాణాలను అనుసరించి స్నానం చేసిన తర్వాత, సూర్యునికి ఎదురుగా శుచిగా ఉన్న ప్రాంతాన్ని ఎంచుకుని, శుద్ధి చేసి, అక్కడ బియ్యపు పిండితో సూర్యయంత్రం నిర్మించాలి. ఆ యంత్రానికి ప్రాణ ప్రతిష్ఠ చేసి, షోడశ ఉపచారాలతో అర్చించాలి.

    పసుపు కుంకుమలతో అలంకరించిన ముగ్గుల మీద గొబ్బి పిడకలను కుంపటిగా అమర్చి, దాని మీద పసుపుతో అలంకరించిన కొత్త గిన్నె పెట్టి, అందులో ఆవుపాలతో పొంగలి వండాలి. ఈ క్రమంలో పాలను మూడుసార్లు పొంగనివ్వాలి. పొంగలి వండిన తర్వాత, చీపుర పుల్లల సహాయంతో చిక్కుడు గింజలను రథాకారంలో గుచ్చి, తులసి కోట ముందు వేసిన ముగ్గుపై ఆ రథాన్ని ఉంచి, ఆ రథం మీదకు సూర్యదేవుని ఆవాహన చేసి, రథం ముందు పదిహేను చిక్కుడు ఆకులు పరచి, వాటిలో ఇంతకుముందు వండిన పొంగలి పెట్టి, వీటిలో ఐదు ఆకులు అగ్నిదేవునికి, ఐదు ఆకులు తులసీమాతకు, ఐదు ఆకులు సూర్యభగవానునికి నివేదన పెట్టాలి.

    సూర్యమంత్రాలతో ఆ పాయసంతోనే ఆగ్నిలో ఆహుతులు ఇవ్వాలి. ఈ రోజంతా అరుణ పారాయణ, అష్టాక్షరీ జపం, ధ్యానం, సూర్యస్తోత్ర పారాయణ చెయ్యాలి. అష్టమి రోజున తిరిగి పూజచేసి, సూర్యస్తోత్రాలు పారాయణ చెయ్యాలి. అనంతరం శక్తిలోపం లేకుండా బ్రాహ్మణులకు భోజనం పెట్టి, నూతన వస్త్రాలు, తాంబూలాదులతో సత్కరించాలి. ఈవిధంగా ఏడు సంవత్సరాలు విడువకుండా చెయ్యాలి. చివరి ఏడాది వెండితో సూర్యరథం చేయించి (ఒంటి చక్రం మాత్రమే ఉండాలి), అందులో సూర్యుని స్వర్ణ ప్రతిమ ఉంచి, శాస్త్రోక్తంగా పూజలు చేసి, యోగ్యుడైన బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. ఇదే వ్రతోద్యాపన. ఈవిధంగా రథసప్తమీ వ్రతం చేసినట్లయితే సకల రోగాలు నివారణ అవుతాయి. దుష్కరమైన వ్యాధులు నశిస్తాయి. వైద్యశాస్త్రానికి అంతుబట్టని వ్యాధులు కూడా సూర్యభగవానుడి అనుగ్రహం వల్ల నయమవుతాయి. ఆరోగ్యసిద్ధి కలుగుతుంది. వంశవృద్ధి కలుగుతుంది. అంతిమంగా సూర్యలోక నివాసయోగ్యత కలుగుతుంది.

    ఈ పూజల్లో అనేక ప్రాంత, ఆచార భేదాలు కనిపిస్తాయి. కొందరు ఏడు, తొమ్మిది ఆకుల్లో నివేదన పెడతారు. కొన్ని ప్రాంతాల్లో వేకువజామునే నిద్రలేచి, దగ్గరలో ఉన్న నది లేదా చెరువుకు వెళ్ళి, చెరకుగడతో అందులోని నీటిని కదిపి, ఆ తర్వాత శాస్త్రోక్తంగా స్నానం చేస్తారు. మరికొన్ని ఆచారాల్లో, ఇంటి వద్దనే స్నానం చేసి, దీపాన్ని వెలిగించి, ఆ దీపాన్ని శక్తిని అనుసరించి వెండి, బంగారం లేదా రాగి పాత్రలో ఉంచి, ఆ పాత్రను శిరసున పెట్టుకుని నదికి వెళ్తారు. నదీమాతను ధ్యానించి, నమస్తే రుద్ర రూపాయ హరిదశ్వ నమోస్తుతే | ఆరుణార్క నమస్తేస్తు హరిదశ్వ నమోస్తుతే || అనే శ్లోకం చదివి, దీపాన్ని నీటిలో వదులుతారు. 

                వ్రతరత్నాకరం, ధర్మసింధువు, నిర్ణయామృతం మొదలైన గ్రంథాల్లో రథసప్తమికి సంబంధించి అనేక అర్చనలు, వ్రత విధానాలు విస్తారంగా వర్ణితమై ఉన్నాయి. 

                ధర్మసింధువు ప్రకారం రథసప్తమికి ముందు రోజు అంటే షష్ఠి రోజున ఉపవాసం ఉండి, మర్నాడు శాస్త్రోక్తరీతిలో స్నానం చేసి, సప్తమీ వ్రతం చేస్తే ఏడు జన్మల పాపం నశిస్తుంది. రథసప్తమీ వ్రతాన్ని చేయటం వల్ల శారీరక రోగాలతో పాటు, ప్రస్తుత జన్మలోను, గత జన్మల్లోను చేసిన పాపాలు నశిస్తాయని వ్రత చూడామణి చెబుతోంది. మనుస్మృతి ప్రకారం సూర్యారాధన వల్ల శారీరక రోగాలన్నీ నశించి, ఉత్తమమైన ఆరోగ్యం కలుగుతుంది.

           జాతకం  ప్రకారం సూర్యగ్రహదోషం ఉన్నవారు, ఉదర, నేత్ర, దంత, ఉష్ణ దోషాలు ఉన్నవారు కెంపు, మాణిక్యం వంటి ఎర్రని రత్నాలు, ఎర్రని పుష్పాలతో (కమలాలు) సూర్యదేవుని పూజించి, యథాశక్తిగా సూర్యదేవుని బంగారు / వెండి ప్రతిమను దానం చేయాలి. ఫలితంగా సకల దోష నివారణ జరుగుతుంది.

    రథసప్తమీ వ్రత ఫలితంగా శారీరక, ఆధ్యాత్మిక తేజస్సు కలుగుతుంది. శమ, దమాది సద్భావాలు పెంపొందుతాయి. మహాభారతంలో, భవిష్యోత్తర పురాణంలో రథసప్తమీ వ్రతాన్ని ఆచరించిన రాజుల కథలు ఉన్నాయి. రథసప్తమి, ఆదివారం కలసి వస్తే, అది మరింత విశేష ఫలితాలను కలిగిస్తుందని, ఆ రోజు చేసే అర్చన ఫలితంగా అపమృత్యు భయం తొలగుతుందని స్కాంద పురాణం చెబుతోంది. 

                జిల్లేడు ఆకులు, బదరీ ఫలాలు, గరికపోచలు, చందనంతో కలసిన అక్షతలు తీసుకుని, సమంత్రకంగా సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వాలని, ఆ తర్వాత నువ్వులపిండితో చేసిన అప్పాలు నివేదన చేయాలని, అనంతరం శక్తిని అనుసరించి బ్రాహ్మణులకు దానాలు ఇవ్వాలని  నిర్ణయసింధువు చెబుతోంది.

 సిద్ధార్థ సప్తమీ వ్రతం :

   సిద్ధార్థ అంటే తెల్ల ఆవగింజ అని అర్థం. తెల్ల ఆవగింజలతో చేసే వ్రతం కాబట్టి ఈ వ్రతానికి సిద్ధార్థ వ్రతం అనే పేరు వచ్చింది. ఏడు మాసాలు వరుసగా శుక్ల పక్ష సప్తమి రోజున ఈ వ్రతాన్ని ఆచరించాలి. సప్తమి రోజున నియమం ప్రకారం స్నాన, సంధ్యాదులు నిర్వహించుకుని, సూర్యారాధన చెయ్యాలి. ఆ తర్వాత సూర్యునికి ఎదురుగా పద్మాసనంలో స్థిరచిత్తంతో కూర్చుని, కుడి చేతి దోసిటితో నీరు తీసుకోవాలి. అందులో ఒక సిద్థార్థం (తెల్ల ఆవగింజ) తీసుకుని, మనసులో కోరిక తలచుకుని, సౌరమంత్రాన్ని ఉచ్చరిస్తూ, దంతాలకు తగలకుండా ఆ జలాన్ని తాగాలి. ఇది మొదటి సప్తమి రోజున చెయ్యాల్సిన విధి. ఇదేవిధానంలో రెండో సప్తమి రోజున రెండు సిద్ధార్థాలు, మూడో సప్తమి రోజున మూడు సిద్ధార్థాలు, ఇలా వరుసగా ఏడో సప్తమి రోజున ఏడు సిద్ధార్థాలు తీసుకోవాలి. మొదటి నెలలో నీరు, రెండో నెలలో నెయ్యి, మూడో నెలలో తేనె, నాలుగో నెలలో పెరుగు, ఐదో నెలలో పాయసాన్నం, ఆరో నెలలో గోమయం, ఏడో నెలలో పంచగవ్యాలతో పైన చెప్పిన విధంగా సిద్ధార్థాలు తీసుకోవాలి.

 సిద్ధార్థక స్తంహి లోకే సర్వత్ర శ్రూయతే యథా |

 తథా మామపి సిద్ధార్థం అర్థత: కురుతాం రవి: ||

ఈ మంత్రాన్ని చెబుతూ సిద్ధార్థాలు తీసుకోవాలి. ప్రతి మాసంలోను పైన చెప్పిన విధంగా జలాన్ని తీసుకున్న తర్వాత హవిస్సుతో మహాసౌరమంత్రాల ¬మం చెయ్యాలి. వ్రతం పూర్తయ్యాక బ్రాహ్మణ సంతర్పణ చెయ్యాలి. కోరిక కోర్కెలు ఈ వ్రతం వల్ల సిద్ధిస్తాయి.

 ఈ వ్రతాలతో పాటు సూర్యభగవానుడి అనుగ్రహం కోసం మరెన్నో వ్రతాలు మన పురాణాలు చెబుతున్నాయి. ప్రత్యేకించి భవిష్యపురాణ అంతర్గతమైన బ్రహ్మపర్వంలో ఈ వ్రతాల వివరాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి - త్రివర్గ సప్తమీ వ్రతం, ఉభయ సప్తమీ వ్రతం, అరుణ శాంతి వ్రతం, పక్ష సప్తమీ వ్రతం, రథ చాలన వ్రతం, అర్క సంపుటికా వ్రతం, ఇక్షుభా వ్రతం, ఇక్షుభార్క వ్రతం, సూర్య షష్ఠీ వ్రతం, పాప నాశినీ వ్రతం, కామదా సప్తమీ వ్రతం, సూర్యవ్రతం మొ||నవి.

 ఈవ్రతాలన్నీ వేటికవే పేర్లలో భిన్నంగా కనిపించినా అన్నీ ఆదిత్యుడి అనుగ్రహం కోరుతూ చేసేవే. జగమంతా నిండిన ఆదిత్యుడిని మనసంతా నింపుకుని మనమూ ఈ వ్రతాలను ఆచరించి కర్మసాక్షి అనుగ్రహ అశీస్సులు అందుకుందాం.
--------------------------
శ్రీశైలప్రభ పత్రికలో రాసిన వ్యాసం
----------------------------

 

 

 రచన 

డాక్టర్‌ కప్పగంతు రామకృష్ణఆంధ్రోపన్యాసకులు,  ఎస్‌.ఆర్‌.ఎస్‌.వి.కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌,

గాంధీనగర్‌, విజయవాడ-3. సెల్‌ : 9032044115 / 8897 547 548








 

 

 

               

Wednesday, February 3, 2021

‘సంగీతరత్న’ పెమ్మరాజు సూర్యారావు గారు

‘సంగీతరత్న’ పెమ్మరాజు సూర్యారావు గారు



సంగీతరంగంతో ఏమాత్రం సంబంధం లేనివాడిని అయినప్పటికీ ‘సంగీతరత్న’ పెమ్మరాజు సూర్యారావు గారితో నాకు ఎంతో సాన్నిహిత్యం ఉండేది. ఏ సభలో కలిసినా నన్ను ప్రత్యేకంగా పలకరించేవారు. ఒక్కోసారి పక్కకు తీసుకువెళ్ళి మరీ మాట్లాడేవారు. ఓ దినపత్రికలో నేను రాసే సాంస్కృతిక వార్తలు బాగున్నాయంటూ మెచ్చకునేవారు. ఏమాత్రం సంగీత పరిజ్ఞానం లేనివాడిని కావటంతో సంగీత కచేరీలకు సంబంధించిన వార్తలు రాసేటప్పుడు సూర్యారావుగారిని అడిగి సలహా తీసుకునేవాడిని. ఆయన కేవలం సంగీత విద్వాంసుడు మాత్రమే కాదు. చక్కటి రచయిత కూడా. హిందూ దినపత్రికలో ప్రతి శుక్రవారం వచ్చే ‘ఫ్రైడే రివ్యూ’లో ఆయన రాసిన సమీక్షలు ఎంతో గొప్పగా ఉండేవి. నిజం చెప్పొద్దూ... హిందూ పత్రిక చదివే అలవాటు నాకు లేకపోయినా విలేకరిగా చేరిన కొత్తల్లో సంగీతానికి సంబంధించిన వార్తలు ఎలా రాయాలో తెలుసుకునేందుకు ఫ్రైడే రివ్యూ... అందులోనూ సూర్యారావుగారి సమీక్షలు తప్పనిసరిగా చదివేవాడిని. నిజాన్ని నిర్భయంగా రాయటం ఆయన సమీక్షలు చదివిన తర్వాతనే నాకు అలవాటైంది. ఆయన్నుంచి నేను నేర్చకున్న పాఠం అది.
     

    వారి నుంచి నేను తెలుసుకున్న మరో అంశం అంకితభావం. చేస్తున్న పని పట్ల ఉండాల్సిన అంకితభావం... కమిట్ మెంట్ అంటామే... అది ఆయనకు ఎంతో ఉన్నతస్థాయిలో ఉండేది. విజయవాడలో సంగీత సన్మండలి నిర్వహించే త్యాగరాజ ఆరాధనోత్సవాల గురించి అందరికీ తెలిసిన విషయమే. ఆ *ఉత్సవాల్లో పూజించే సీతారాములు, ఆంజనేయస్వామి, త్యాగరాజస్వామి విగ్రహాలు కొత్తూరు తాడేపల్లిలోని మా సొంత దేవాలయం (శ్రీ పంచముఖ వీరాంజనేయస్వామి వారి దేవస్థానం)లో ఉండేవి. అక్కడే నిత్యపూజలు చేసేవాళ్ళం. ఆరాధనోత్సవాలకు ముందురోజున సూర్యారావుగారు గుడికి వచ్చేవారు. ఏదో విగ్రహాలు తీసుకువెళ్ళటానికి వచ్చినట్లు కాకుండా స్వామిని ఉత్సవాలకు ఆహ్వానిస్తున్నట్లుగా అక్కడి మంటపంలో కూర్చుని కొన్ని కృతులు పాడేవారు. అలా భక్తితో స్వామిని ఆహ్వానించి ఆ తర్వాతనే విగ్రహాలు కారులో పెట్టేవారు.* ఇక్కడ నేనెంతో అదృష్టవంతుడిగా భావిస్తాను. సభల్లో జరిగే కచేరీల్లో ఆయన పాండిత్యాన్ని అందరూ చూస్తారు. కానీ ఆయన గుండె లోతుల్లోంచి వచ్చిన భక్తితరంగాల్ని నేను చూడగలిగానని గర్వంగా చెప్పుకుంటాను. ఎన్నో ఏళ్ళు గడిచినా మా గుడిలో ఆయన పాడిన సన్నివేశం నాకు ఇప్పటికీ కళ్ళముందు కదలాడుతుంది. కొంతకాలం తర్వాత ఆ విగ్రహాల్ని విజయవాడ రామకోటి దేవాలయ ప్రాంగణంలో ఉంచటంతో సూర్యారావు గారు మా గుడికి రావటం ఆగిపోయింది. అయినా కచేరీల్లో మేం కలుసుకోవటం, ఆత్మీయంగా మాట్లాడుకోవటం మాత్రం ఎప్పటిలాగానే కొనసాగేవి.


 చేస్తున్న పని పట్ల అంకితభావం... అంతకుమించిన భక్తి ఆయనకు ఉండేవి. ఇక ఆరాధనోత్సవాల్లో ఆయన పాటించే క్రమశిక్షణ జగమెరిగిన విషయం. వారిని చూసి నా మనసులో పడిన ముద్ర ఏమో కానీ... ఇప్పటికీ ఏదైనా పని అనుకుంటే అందులోని ప్రతి చిన్న అణువులో తప్పుజరగకూడదనుకోవటం, అందుకోసం కష్టపడటం అలవాటైంది.
 

    కాలక్రమంలో వచ్చిన మార్పులకు ఆయనెంతో బాధపడేవారు. తరాలు మారుతున్నాయి. విలువలు పోతున్నాయంటూ నాతో అనేవారు. ప్రచారం కోసం ఆరాధనోత్సవాలు చెయ్యటం లేదు. సంగీత కళాకారులుగా అది మా బాధ్యత. కర్తవ్యం అనేవారు. పత్రికల పరంగా జరిగిన కొన్ని సంఘటనలు ఆయన్నెంతో బాధ పెట్టాయి. అయినా అణువంతైనా క్రమశిక్షణ, ఎంచుకున్న నియమాల్ని విడిచిపెట్టటానికి ఆయన ఏమాత్రం ఒప్పుకోలేదు. పత్రికారంగంలో కొంతకాలం పనిచేసినవాడిగా ఈ సంఘటనల విషయంలో ఆయనకు, నాకు మాటలు జరుగుతుండేవి.


    కేవలం కళాపాండిత్యమే కాదు మంచి వ్యక్తిత్వం కలిగినవారుగా సూర్యారావు గారంటే నాకు ఎంతో గౌరవం. ఆయన కూడా నన్ను తన శిష్యుల మాదిరిగా అభిమానించేవారు.  
 

    ఇంత చనువు, ఆత్మీయత ఉన్నా వారితో కలిసి ఓ ఫొటో తీయించుకోవాలన్న ఆలోచనే రాలేదెందుకో. బహుశా ఆ రూపం నా మనసులో శాశ్వతంగా ఉండిపోవాలన్న దైవసంకల్పమేమో.


(ఈ ఫొటో మాత్రం నేను తీసినదే. పత్రిక కోసం వారితో జరిపిన ముఖాముఖి సందర్భంగా తీసాను)


 

Monday, February 1, 2021

ఆంధ్రభాషాదీప్తి.. త్యాగరాజ కృతి (పుష్య బహుళ పంచమి శ్రీ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవం సందర్భంగా ప్రత్యేక వ్యాసం)

శ్రీ త్యాగరాజ స్వామి

ఆంధ్రభాషాదీప్తి.. త్యాగరాజ కృతి

(పుష్య బహుళ పంచమి శ్రీ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవం సందర్భంగా ప్రత్యేక వ్యాసం)


నవ నాడుల్లోను నాదోపాసనే ప్రాణవాయువుగా నింపుకున్న వాగ్గేయకారుడు శ్రీ సద్గురు త్యాగరాజస్వామి. అచంచలమైన రామభక్తితో దైవప్రసాదంగా వచ్చిన అద్భుతమైన గాత్రం, కర్ణాటక సంగీత వైదుష్యం సహా తనువును, మనసునూ... ఒకటేమిటి 'తన' అనుకున్న సమస్త ప్రపంచాన్ని శ్రీరాముని చరణారవిందాలకే అర్పణం చేసిన భక్తశిఖామణి ఆయన. సంగీతం కేవలం ప్రతిభా ప్రదర్శనకో, ధన సంపాదనకో కాదు.. సంగీతం కైవల్య సోపానమని త్రికరణ శుద్ధిగా నమ్మి, ఆచరించి చూపిన వాగ్గేయకారుడాయన. అందుకనే ఆయన గతించి వందల సంవత్సరాలు దాటుతున్నా నేటికీ మనకు ఆరాధ్యుడయ్యారు.

కర్ణాటక సంగీత ప్రపంచంలో ఎందరో వాగ్గేయకారులు ఉన్నారు. త్యాగరాజు కన్నా గొప్పగా సాహిత్య, సంగీత ప్రయోగాలు చేసిన వారూ ఉన్నారు. ఇతర సంగీత విద్వాంసుల తీరులోనే ఆయనా శిష్యులకు సంగీతం నేర్పించారు. కానీ, త్యాగరాజస్వామి ప్రత్యేకత ఏమిటి? ఎందుకు మనం ఆయన్ను గుర్తుంచుకోవాలి? అని ప్రశ్నిస్తే...

  • అపారమైన తన సంగీత సాహిత్య రచనా సర్వస్వాన్నీ మాతృభాష అయిన తెలుగులోనే రచించి, ఆంధ్ర సారస్వత రంగం నేటికీ వెలుగు తగ్గకుండా ఉండటానికి చిత్తశుద్ధితో కృషి చేసిన తొలి తెలుగు భాషోద్యమ కార్యకర్తగా త్యాగరాజు కనిపిస్తారు.
  • 'సహితస్య భావం సాహిత్యం' (సమాజానికి హితం చేకూర్చేదే సాహిత్యం) అనే వైయాకరుణుల వాక్యాన్ని అక్షర సత్యం చేస్తూ తన కృతులన్నిటిలో సామాజిక ప్రయోజనాన్ని ఆకాంక్షించిన సమాజసేవకుడిగా త్యాగరాజు సాక్షాత్కరిస్తారు.
  •  భవత్ప్రసాదంగా వచ్చిన విద్యను, విజ్ఞానాన్ని తిరిగి భగవంతుడిని చేరుకోవటానికే వినియోగించిన కైవల్యపథగామిగా త్యాగరాజు దర్శనమిస్తారు.
  •  నిద్రాణమై, నిస్తేజంగా, మొక్కుబడి తీరులో సాగుతున్న కర్ణాటక సంగీత కచేరీలకు తన వినూత్న ప్రయోగాలు, ఆవిష్కరణలతో నూతన జవసత్త్వాలను కల్పించి, 'ఇదీ కర్ణాటక సంగీత వైభవం' అని ప్రపంచానికి తెలిసేలా చేసిన వాగ్గేయకారుడిగా త్యాగరాజస్వామి పురుషరూపం దాల్చిన సంగీత సరస్వతిగా సాక్షాత్కరిస్తారు. 

ఇంతటి బహుముఖ ప్రజ్ఞాశీలత వల్లనే శతాబ్దాలు గడుస్తున్నా త్యాగరాజస్వామి నేటికీ మనకు ఆరాధ్యుడయ్యారు. 

సమున్నత వ్యక్తిత్వం

సంగీత స్రష్టగా, రామభక్తుడిగా, వాగ్గేయకారుడిగా ప్రపంచానికి త్యాగయ్య సుపరిచితులే. అంతేకాదు.. తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి చివరి శ్వాస వరకు అదే లక్ష్యసాధన కోసం జీవింవించారాయన. ఎన్ని కష్టాలు వచ్చినా రాముడే చూసుకుంటారని త్రికరణశుద్ధిగా నమ్మి, ఆ స్వామినే కీర్తించేవారు.

త్యాగరాజు సుమారు ఆరు అడుగుల ఎత్తులో, కాస్త సన్నగా ఉండేవారు. పెద్ద కళ్ళు, ఆకట్టుకునే ముఖవర్చస్సు, మెడలో తులసిమాల ఉండేవి. కేవలం తెల్లటి వస్త్రాలే ధరించేవారు. నుదుట విభూది తప్పకుండా ధరించేవారు. విభూది రేఖల మధ్యలో కొద్దిగా గంధం, దాని మీద కొద్దిగా కుంకుమ బొట్టు పెట్టేవారు. గొంతు ఖంగుమని మోగేది. 

తోటివారి పట్ల దయ, ప్రేమ కలిగి ఉండేవారు. సంగీత విద్య విషయంలో మాత్రం చండశాసనుడిగా వ్యవహరించేవారు. ఎంతో క్రమశిక్షణ పాటించేవారు. ఆరోగ్యసూత్రాలు పాటిస్తూ, తన గొంతును కాపాడుకునేవారు. వారానికోసారి నువ్వులనూనెతో తలస్నానం చేసేవారు. పొట్లకాయ కూర ఇష్టంగా తినేవారు. ఈ వివరాలన్నీ ఆయన జీవితచరిత్రకారుల రచనల్లో ఉన్నాయి. 

వీటన్నిటినీ సమాజ సేవ, ఉద్ధరణ త్యాగరాజులో ఎక్కువగా కనిపిస్తాయి. బాహ్యప్రవర్తనలో నిరంతర రామచింతన తప్ప మరే చింతా లేనివాడిగా కనిపించిన త్యాగరాజు తన కృతుల్లో సమాజం ధర్మమార్గాన్ని వీడకుండా ఎలా స్వధర్మాచరణ చేయాలో స్పష్టంగా చెప్పారు. 

త్యాగరాజ పంచరత్న కృతుల్లో ఒకచోట 'పరనారీ సోదరా!' అని రామచంద్రమూర్తిని సంబోధిస్తారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు.. త్యాగయ్య నిద్రాణమైన తన సమాజాన్ని ఎంత జాగృతం చేశారో తెలుస్తుంది. రాముడు పరనారీ సోదరుడట. అంటే తన భార్యను తప్ప ఇతర స్త్రీలందరినీ సోదరీ భావంతో చూసేవారు. రాముడిలోని ఈ ఒక్క లక్షణాన్నైనా సమాజ సభ్యులందరూ అలవర్చుకుంటే చాలని త్యాగయ్య కోరిక. అదే జరిగితే, సమాజ పౌరులందరూ పరస్త్రీలను సోదరీ భావంతో చూస్తే.. పేరు చెప్పుకోవటానికి ఇబ్బందిపడే వ్యాధులు రావు. అందుకోసం ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరమూ ఉండదు. లక్షలాది కుటుంబాలు రోడ్డు పడే దుస్థితీ ఉండదు. ఇదీ త్యాగయ్య వైభవం. ఇదీ బాధ్యతాయుతమైన రచయితకు  ఉండాల్సిన లక్షణం. 

ఈ రోజున ఎందుకు త్యాగరాజ కీర్తనలు పాడాలి? త్యాగరాజ కీర్తనల అవసరం సమాజానికి ఏముంది? అని  ప్రశ్నించే వారికి ఇదే సూటి సమాధానం. త్యాగరాజ కీర్తనలు మత మూఢత్వాన్ని పెంచే 'స్తోత్రాలు' కావు. కర్తవ్య నిష్టవైపు సమాజాన్ని ఉద్దీపనం చేసే చైతన్య దీపాలు. మనిషిని మనీషిగా తీర్చిదిద్దే ఉపనిషద్వాక్యాలు. 

తరగని మాతృభాషాభిమానం

సంగీతానికి, సాహిత్యానికి అవినాభావ సంబంధం ఉందని త్యాగరాజు ప్రగాఢంగా నమ్మేవారు. భావావేశంతో పాడితేనే ఏ కచేరీ అయినా రక్తి కడుతుంది. శ్రోతల మనసుల్ని తాకుతుంది. ఇది జరగాలంటే కళాకారుడికి తాను పాడుతున్న కృతి ఏ భాషలో ఉందో ఆ భాష తప్పనిసరిగా రావాలి. సాహిత్యం అర్థం కాకపోతే ఆత్మానందం కలుగదు. ఇది లేకపోతే కచేరీలో తాదాత్మ్యత రాదు. తాదాత్మ్యత లేని కచేరీ రాణించదు. అందుకే సాహిత్యం అర్థం కాని సంగీతానికి విలువలేదని త్యాగరాజు అంటుండేవారు. అందుకే తన వద్దకు సంగీతం నేర్చుకోవటానికి వచ్చిన ప్రతివారికీ ముందుగా భాష నేర్పించేవారు. ఈ విషయాన్ని త్యాగరాజ స్వామి ముఖ్యశిష్యుడైన తంజావూరు రామారావు స్వయంగా చెప్పారు.

త్యాగరాజ స్వామి వద్ద సంగీత శిష్యరికం చేసినవాళ్ళు సుమారు 200 మందికి పైనే ఉన్నారు. వీరందరిలో తంజావూరు రామారావు, మానాంబుచావడి వెంకట సుబ్బయ్యర్‌ - వీరిద్దరే తెలుగు వాళ్ళు. మిగిలిన వాళ్ళందరూ తమిళులే. ఇన్ని వందల మందికి స్వయంగా తెలుగు నేర్పించిన భాషోపాధ్యాయుడుగానూ త్యాగయ్య తనలోని మాతృభాషా పరిరక్షణ దీక్షను ప్రకటించారు. 

సాధారణంగా సంగీత శిక్షణలో గీతమైనా, వర్ణమైనా.. మరేదైనా ముందుగా స్వరాలతో నేర్పిస్తారు. స్వరస్థానాలు చక్కగా వచ్చిన తర్వాత సాహిత్యంతో నేర్పిస్తారు. త్యాగరాజు ఇందుకు భిన్నంగా ఏ కృతినైనా ముందుగా సాహిత్యంతో నేర్పించేవారు. శిష్యుడు భావయుక్తంగా పాడుతున్నాడని అనిపిస్తే, అప్పుడు స్వరాలతో నేర్పించేవారు. ఇంతటి ప్రాధానత్య ఇచ్చారు కాబట్టే త్యాగరాజస్వామి పుణ్యమా అని నేటికీ కర్ణాటక సంగీతంలో భాషకు ప్రాధాన్యత దక్కుతోంది.

త్యాగరాజస్వామి కాలంలో తంజావూరు ప్రాంతంలో ఎన్నో భాషలు వాడుకలో ఉండేవి. తమిళ దేశం కావటం వల్ల ప్రధానంగా తమిళం వాడుకలో ఉండేది. పండిత భాషగా, రాజభాషగా సంస్కృతం ఉండేది. అక్కడక్కడా తెలుగు ఉండేది. వ్యావహారికంగా చాలాచోట్ల తెలుగు వాడుకలో ఉండేది. బ్రిటీషు పాలన కావటంతో ఆంగ్ల ప్రాబల్యమూ ఎక్కువగానే ఉండేది. మరోపక్క ముస్లిం పాలకుల దండయాత్రలు, దురాక్రమణల ఫలితంగా ఉర్దూ, పార్శీ భాషలూ తమ ఉనికిని చాటుకునేవి.

ఇన్ని భాషలు, సంస్కృతీ వైవిధ్యాల మధ్య తన మాతృభాష అయిన తెలుగును, తెలుగు సంస్కృతిని, సాహిత్యాన్ని కాపాడుకోవటం కోసం త్యాగరాజు అజరామరమైన ప్రయత్నం చేశారు. వేల కొద్దీ కృతులను తెలుగులోనే రచించి, తన అపారమైన తపశ్శక్తిని వాటికి ధారాదత్తం చేసి, తెలుగు భాష నేటికీ వెలుగులీనటానికి మూలకారణంగా నిలిచారు.

పుట్టిందీ, పెరిగిందీ తమిళప్రాంతంలో అయినా, త్యాగరాజస్వామి ఒక్క కృతిని కూడా తమిళంలో రాయలేదు సరికదా కనీసం ఒక్క తమిళపదానికి కూడా తన కృతుల్లో చోటివ్వలేదు. ఈ ఒక్క నిరూణ చాలు.. తెలుగు భాషా పరిరక్షణకు త్యాగరాజు చేసిన కృషి ఏమిటో చెప్పటానికి.

మొత్తం త్యాగరాజ సారస్వతాన్ని పరిశీలిస్తే తెలుగుతో పాటు కొన్ని సంస్కృత రచనలూ కనిపిస్తాయి. తెలుగు, సంస్కృత మిశ్రమంలో కొన్ని రచనలు కనిపిస్తాయి. వీటన్నిటిలోనూ రెండు, మూడు ఉర్దూ పదాలు, ఒకే ఒక్క ఆంగ్ల పదాన్ని సాహితీ పరిశీలకులు కనుగొన్నారు. ఉపన్యాసాలు, నినాదాలతో కాకుండా వాస్తవ ఆచరణతో తన మాతృభాషను కాపాడుకోవటం కోసం కృషి చేసిన భాషోద్యమ కార్యకర్తగా తన కర్తవ్యాన్ని నిర్వహించారు త్యాగరాజస్వామి. 


ప|| ఎదుట నిలిచితే నీదు సొమ్ము - లేమి బోవురా

అ|| నుదుటి వ్రాత గని మట్టు మీరను నా

తరము దెలిసి మోసపోదునా ||


చ|| సరాసరిగా జూతురా నా ఆవ - సరాల దెలియుము వరాలడుగుజా

లరా సకల దేవరాయ! మనవి వి - నరా ఘహర! సుందరా కార నా ||

----------------------------------------

----------------------------------------

తరాన దొరకని పరాకు నాయెడ - ను రామ చేసితె సురాసురులు మె

త్తురా ఇపుడు ఈ హరామి తనమే - లరా భక్త త్యాగరాజ నుత!


శంకరాభరణ రాగంలో స్వరపరచిన ఈ కృతిలోని చివరి చరణంలో 'హరామి' అనే ఉర్దూపదాన్ని త్యాగయ్య ఉపయోగించారు.

'కారు బారు సేయు వారలు గలరే - నీ వలె సాకేత నగరిని' అంటూ ముఖారి రాగంలో త్యాగయ్య స్వరపరచిన కృతిలో కారుబారు అనే పదం కూడా ఉర్దూ పదమే. కార్‌ - ఓ - బార్‌ అనే పదం వాడుకలో కారుబారుగా మారిందని భాషా పరిశోధకుల పరిశీలనలో తేలింది.

'దయలేని బ్రతుకేమి - దాశరథీ రామ...... ' అంటూ నాయకి రాగంలో స్వరపరచిన కృతి చివరి చరణం చివరి పాదంలో 'రాజి సేయని త్యాగ - రాజాది వినుత' అనే చోట రాజీ అనే ఉర్దూ పదం కనిపిస్తుంది. అంగీకరించుట లేదా ఒప్పుకొనుట అనే అర్థంలో ఈ ఉర్దూ పదం తెలుగులో వాడుకలోకి వచ్చింది. పంతువరాళిరాగంలో 'నిన్నే నెర నిమ్మనానురా' అనే కృతిలోను 'రాజి' పదాన్ని త్యాగరాజు ఉపయోగించారు. 

అలాగే, మొత్తం తన కృతుల్లో ఒకే ఒక్క చోట ముస్లిం మతానికి చెందిన పదాన్ని త్యాగరాజు ఉపయోగించారు. 'సమయము తెలిసి పుణ్యములార్జించని' అంటూ అసావేరి రాగంలో సాగే ఈ కృతి చివరి చరణంలో 'తురక వీధిలో విప్రునికి పానక పూజ' అనే చోట మాత్రమే 'తురక' అనే పద ప్రయోగం కనిపిస్తుంది.

తోడి రాగంలో 'ఏమి జేసితే నేమి శ్రీరామ - స్వామి కరుణలేని వారిలలో' అనే కృతి రెండో చరణంలో 'మేడ గట్టితే ఏమి అందున లాంతర్‌ - జోడు గట్టితే ఏమీ' అన్న చోట లాంతర్‌ అనే ఒకే ఒక ఆంగ్ల పదం కనిపిస్తుంది. త్యాగరాజు ఆంగ్ల పదాన్ని ఎందుకు ఉపయోగించారని పరిశీలిస్తే - సరిగ్గా ఆ సమయంలో కిరసనాయిలుతో వెలిగే దీపాలు వాడుకలోకి వచ్చాయి. ఇంగ్లీషు వాళ్ళు ఈ దీపాన్ని 'లాంటెరన్‌' అనే వాళ్ళు. ఈ లాంటెరన్‌ పదం వాడుకలో 'లాంతరు'గా మారింది. ఈవిధంగా వాడుకలో ఉన్న భాషా రూపాన్నే త్యాగరాజ స్వామి తన కృతుల్లో ఉపయోగించారని స్పష్టమవుతోంది. 

రూపక రాగంలో 'సొగసుగా మృదంగ తాళము జతగూర్చి నిను' అనే కృతిలో 'సొగసు' అనే పదం తమిళ పదం అని కొందరు భాషావేత్తలు చెబుతున్నా ఈ పదం తెలుగులోనూ వాడుకలో ఉంది. 

భాషా ప్రయోగాల పరంగా చూస్తే త్యాగరాజుకు ఛందస్సు మీద సాధికారత ఉన్నట్లు ఆయన రచనలు పరిశీలిస్త స్పష్టమవుతుంది. యమకాలు, ప్రాసలు, శబ్దాలంకారాలు, వృత్తాలు... ఒకటేమిటి త్యాగయ్య ప్రయోగాలు అపూర్వం.. అనితరసాధ్యం.

విశేష సంగీత ప్రజ్ఞ

కర్ణాటక సంగీతంలో రాగలక్షణాలు, రాగ స్వరూపాల విషయంలో త్యాగరాజుకు ఎంతో పట్టు ఉంది. సుమారు 215 రాగాల్లో ఆయన రచనలు ఉన్నాయి. తన కృతుల ద్వారా మరుగున పడిన ఎన్నో రాగాలను వెలికి తీశారు. కొన్ని కొత్త రాగాలను సృష్టించారు. ఒకే రాగంలో అనేక కృతులు స్వరపరచినా, ఏ ఒక్కటీ మరో దానితో పోలి ఉండదు. 

సంఖ్యాపరంగాను, సృజన పరంగాను త్యాగరాజ స్వామి స్వరపరచినన్ని రాగాలు ఏ వాగ్గేయకారుడూ ముట్టుకోలేదు. రాగ లక్షణాన్నీ, వైశాల్యాన్నీ త్యాగరాజుతో సమానంగా తన రచనల్లో ప్రకటించిన వాగ్గేయకారుడూ ఇంతవరకూ లేడు. త్యాగరాజ కృతుల్లో రాగ విస్తృతి విశాలంగా ఉంటుంది. గొంతుకలో శ్రావ్యత తక్కువగా ఉన్నవారు కూడా చక్కగా పాడుకునేలా త్యాగయ్య కీర్తనలు సాగుతాయి. 

ఎంతో సరళంగా, సుందరంగా పదిమందికీ అర్థమయ్యేలా తన రచనల ద్వారా అందరికీ సంగీతాన్ని చేరువ చేశారు త్యాగయ్య. కర్ణాటక సంగీతానికి, కళాకారులకు... కాదు..కాదు... యావత్‌ తెలుగుజాతికి ఆయన చేసిన మ¬పకారాన్ని వర్ణించటానికి మాటలు లేవు. ఆయన భిక్ష వల్లే లక్షలాది కుటుంబాలు ఈనాటికీ లోటులేకుండా గడుస్తున్నాయి. 

త్యాగయ్య కీర్తనలు పాడితే కళాకారులుగా మాత్రమే మిగులుతాం. కానీ, త్యాగయ్య తన కృతుల ద్వారా కోరుకున్న ఆశయాలు సిద్ధించాలంటే అందుకు ఆచరణాత్మక ప్రయత్నం కావాలి. ప్రతి హృదయం త్యాగరాజ హృదయం కావాలి. అప్పుడే త్యాగబ్రహ్మ కోరుకున్న 'రామభక్తి సామ్రాజ్యం' ఏర్పడుతుంది. 

                                        -------------------------

గానకళ పత్రికలో ప్రచురితమైన వ్యాసం

-------------------------

రచన :  

డాక్టర్‌ కప్పగంతు రామకృష్ణ, ఆంధ్రోపన్యాసకులు, 
ఎస్‌.ఆర్‌.ఎస్‌.వి.కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, గాంధీనగర్‌, విజయవాడ - 3
సెల్‌: 90320 44115 / 8897 547 548





Sunday, January 31, 2021

శుచి శుభ్రత అంటే ఏమిటి? శుచిగా ఎందుకు ఉండాలి? మడి అంటే ఏమిటి?







శుచి - శుభ్రత 

పరమాత్మ పాదసన్నిధి చేరుకోవటానికి మంత్ర తంత్ర సాధనలు, అర్చనలతో పాటు శుచిత్వం కూడా ఎంతో అవసరం. శుచి శుభ్రత లేని చోట దేవుడు ఉండడు. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవటం మాత్రమే శుచిత్వం కాదు. అదొక భాగం మాత్రమే. శరీరంతో పాటు మనస్సు కూడా ఎంతో శుచిగా ఉండాలి. అప్పుడు మాత్రమే పూర్తి శుచిత్యాన్ని సాధించినట్లవుతుంది. శుచిగా ఉండటం గొప్ప అలంకారం కాదు.  ఆడంబరం కాదు. ఆచారం అంతకన్నా కాదు. శుభ్రత మనిషి నడతను, నడవడికను తీర్చిదిద్దుతుంది.  అదొక సంస్కారం.
 అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతోపి వా |
యస్మరేత్పుండరీకాక్షం సబాహ్యాభ్యంత శ్శుచిః ||
 రోజూ వారీ పూజా కార్యక్రమాలన్నీ ఈ శ్లోకంతోనే ప్రారంభమవుతాయి. భగవంతుడిని ఆరాధించటానికి ముందు మనిషి పవిత్రుడు కావాలి. అంటే పూర్తి శుచిత్వాన్ని సాధించాలి. అలా శుచిగా ఉన్న వ్యక్తి చేసే ఆరాధనను మాత్రమే పరమాత్మ స్వీకరిస్తాడు. భౌతిక శరీరంతో పాటు మానసికంగా కూడా మనిషి శుచిగా ఉండి భగవంతుడి అనుగ్రహానికి సాధన ప్రారంభించాలి.

 భగవద్గీతలోనూ 'శుచి' ప్రస్తావన

 శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో అనేక చోట్ల శుచిగా ఉండాల్సిన అవసరం గురించి చెబుతాడు. శుచిత్వం తనకు ఇష్టమైన భక్తుల్లో ఒకటని భగవానుడే స్వయంగా చెబుతాడు. శారీరక తపస్సే శుచిత్వం అవుతుందని మరొకచోట వివరిస్తాడు. మనిషి తాను చేసే పనులన్నిటిలో ధర్మమార్గాన్నిపాటించటం శుచిత్వం అవుతుందని ఇంకోచోట చెబుతాడు.

తేజః క్షమా ధృతిశ్శాచమ్ అద్రోహో నాతిమానితా

భవన్తి సంపదం దైవీమ్ అభిజాతస్యభారత ||

 దేవతల లక్షణాలు చెబుతూ శుచిత్వాన్ని కూడా ఆ లక్షణాల్లో ఒకటిగా చెప్పాడు కృష్ణపరమాత్మ. అలాగే, దైవాసుర సంపద్విభాగయోగంలో 

ప్రవృత్తించ నివృత్తించ జనా నవిదురా సురాః |

న శౌచం నాపిచాచారో న సత్యం తేషు విద్యతే ||

 రాక్షస ప్రవృత్తి కలిగిన వారికి శుచిత్వం ఉండదని చెబుతాడు. అంటే, శుచిగా ఉండటం మనిషికి దైవత్వాన్ని కలిగిస్తుంది. శుచిగా ఉన్న శరీరం శుచిగా ఉండే (ఉత్తమమైన) ఆలోచనలు కలిగిస్తుంది ఎప్పుడైతే మనస్సు మంచి ఆలోచనలు చేస్తుందో, ఆప్పుడు ఆ మనసు ధర్మాన్ని విడిచి పెట్టదు. అంతిమంగా మనిషి భగవంతుడి అనుగ్రహాన్ని పొందుతాడు

 * ఆదిశంకరాచార్యులు భక్తి మార్గాన్ని బోధిస్తూనే భక్తికి, తపస్సుకు, ఆధ్యాత్మిక సాధనకు తప్పనిసరిగా శుచిగా ఉండాలని చెప్పారు.

 బాహ్యమాభ్యస్తరం చేతి ద్వివిధం శౌచముచ్యతే

మజ్జలాభ్యాంకృతం శౌచం బాహ్యం శారీరికం స్మృతమ్

అజ్ఞాన దూరీకరణం మానసం శౌచమాన్తరమ్

అన్తస్థితో భవేత్సమ్యక్ బాహ్యంనావశ్యకం నృజామ్ ||

 శుచిత్వం బాహ్యం, అంతరికం అని రెండు రకాలుగా ఉంటుంది. నిత్యం చేసే స్నానం బాహ్యశౌచాన్ని కలిగిస్తుంది. మనసులో ఉండే అజ్ఞానాన్ని సాధన ద్వారా దూరం చేసుకోవటం ఆంతరిక శౌచం అవుతుంది. బాహ్యశౌచం కన్నా ఆంతరిక శౌచం చాలా అవసరం. మనస్సు స్వచ్చంగా (శుచిగా) లేకపోతే, బాహ్యశౌచం ఏవిధమైన ఫలితాన్ని ఇవ్వదు.

 బలమాయుష్యమారోగ్యం సంతోషః స్వాస్థ్యమానసం |

శుచిత్వే లభతే తస్మాత్ శుచిత్వం ఆశ్రయేత్ నరః ||

 బలం, ఆయుష్షు, ఆరోగ్యం, సంతోషం, ఆరోగ్యవంతమైన మనస్సు... ఇవన్నీ శుచిత్వం వల్లనే లభిస్తాయని శాస్త్రాలు ఘంటాపథంగా చెబుతున్నాయి.

 ఐదురకాల శౌచాలు

 కొన్ని శాస్త్ర గ్రంథాలు శౌచం (శుచి) ఐదు రకాలుగా ఉంటుందని చెబుతున్నాయి. వీటి ప్రకారం... మనశ్శాచం : మనసులో రాగద్వేషాలకు తావు లేకుండా చెయ్యటం మనశ్శెచం అవుతుంది కర్మశాచం : కపటం లేకుండా, ధర్మాన్ని పాటిస్తూ నిత్యవిధులను నిష్కామంగా చేస్తూ జీవించటం కర్మశౌచం అవుతుంది

 కులశాచం : నీచమైన పనులకు దిగజారకుండా, సదాచారాన్ని పాటిస్తూ స్థిరంగా ఉండటం కులశాచం అవుతుంది

 శరీరశౌచం : స్నానం తదితర క్రియల ద్వారా శరీరాన్ని శుభ్రంగా ఉంచటం శరీరశౌచం అవుతుంది

 వాక్ శౌచం : అనుక్షణం సత్యాన్ని మాత్రమే పలకటం వాక్శౌచం అవుతుంది

 మడి కట్టుకోవటమంటే.. 

మడికట్టుకోవటం అంటే అదేదో ఘనకార్యం అనుకోవాల్సిన పనిలేదు. మడి అంటే పరిశుభ్రమైన వస్త్రాలు ధరించటం. పూజ చేయాలనుకున్నప్పుడు ముందుగానే అందుకు తగిన పరిశుభ్రమైన వస్త్రాలు ఏర్పాటుచేసుకోవాలి. వాటిని ధరించి మాత్రమే పూజ చెయ్యాలి. ఇదే మడి అంటే.పూజలు చేసే సందర్భంలో 'మడికి ఎంతో ప్రాధాన్యత ఉంది. మడివస్త్రాలు కట్టుకున్న తర్వాత ఎవరినీ ముట్టుకోకూడదు. పూజా సంబంధం కానీ ఏ వస్తువునీ తాకకూడదు అంటూ... ఇంకా ఎన్నో నియమాలు చెబుతారు పెద్దలు. ఇదంతా చాదస్తం అనిపిస్తుంది నేటి తరానికి, కానీ, 'మడి' ఆచారం వెనుక మహత్తరమైన సందేశం దాగి ఉంది. మనం ధరించే వస్త్రాల రంగు, తీరు మన మనస్సుపై స్పష్టమైన ప్రభావాన్ని చూపిస్తాయి. నిర్మలైన వర్ణాలు మనసుకు ఆహ్లాదాన్ని చేకూరుస్తాయి. ఈ కారణంగానే మడివస్త్రాలుగా కేవలం తెల్లని వస్త్రాలు లేదా అతి తేలిక వర్గాలు కలిగిన వస్త్రాలను వినియోగిస్తారు. ఆధ్యాత్మిక సాధనలో తొలి సోపానమైన బాహ్యశుచిత్వాన్ని పొందటానికి చేసే ప్రయత్నమే ఇదంతా. ఎప్పుడైతే మనసు స్వచ్ఛంగా, హాయిగా ఉందో. అప్పుడు మనస్సు పూర్తిగా భగవంతుడి మీద కేంద్రీకృతం అవుతుంది. మనసులోని కళ్ళతో మాధవుడిని చూసేందుకు చేసే ప్రయత్నమే మడి.

 పురాణాల్లోనూ ప్రాధాన్యత

శుచిత్వానికి ఇంతటి ప్రాధాన్యత రావటానికి వెనుక పురాణగాథ ఉంది. కశ్యప ప్రజాపతికి దితి అదితి ఇద్దరు భార్యలు, దితి కుమారులు దైత్యులు - అంటే రాక్షసులు. అదితి కుమారులు ఆదిత్యులు అంటే దేవతలు, వారిద్దరి వైరం గురించి తెలిసిందే. దేవతల చేతిలో రాక్షసులు హతం కావటాన్ని చూసి తట్టుకోలేని దితి, ఇంద్రుడి సంహరించే శక్తి కలిగిన కుమారుడు తనకు జన్మించాలని భర్త అయిన కశ్యపుడిని కోరుతుంది. ఆయన 'సరే' అని వరమిస్తాడు. కానీ, ప్రసవం అయ్యేవరకు శుబిత్వాన్ని అన్నివేళలా పాటించితీరాలని, లేకపోతే గర్భం భిన్నమవుతుందని నియమం పెడతాడు. దితి అంగీకరిస్తుంది. శుభముహూర్తంలో దితి గర్భం దాలుస్తుంది. విషయం తెలుసుకున్న ఇంద్రుడు పినతల్లి అయిన దితి దగ్గరకు మంచి మాటలు చెప్పి, ఆమెకు సేవ చేసే అవకాశం ఇవ్వమని అడుగుతాడు. ఆమె అంగీకరిస్తుంది. ఇంద్రుడు అన్నిరకాలుగా సపర్యలు చేస్తుంటాడు. ఒకరోజున సాయం సంధ్యా సమయంలో పొరపాటున దితి శౌచాన్ని మరిచి, కాళ్లు చేతులు కడుక్కోకుండానే పడకగదిలోకి వెళ్లి, అలసట కారణంగా నిద్రలోకి జారుకుంటుంది. దితికి నియమభంగం కాగానే ఇంద్రుడు అణురూపంలో దితి గర్భంలోకి ప్రవేశించి, శిశువును నరకటం ప్రారంభిస్తాడు. వెంటనే దితికి మెలకువ వస్తుంది. తన బిడ్డను వధించవద్దని, తన బిడ్డ దేవతలకు అనుకూలంగా ఉంటాడని ఇంద్రుడిని వేడుకుంటుంది. అతడు అంగీకరించి, బయటకు వచ్చి, తన వల్ల ముక్కలైన శిశువు మరణించకుండా, ఎన్ని ముక్కలైందో అందరు పుత్రులు పుడతారని చెబుతాడు. అలా ఏర్పడ్డ శిశువులే దేవతాగణాల్లో ఒకటైన 'మరుద్గణం'. ఈ వృత్తాంతం జరిగనప్పటి నుంచి సంధ్యాసమయంలో తప్పనిసరిగా శుచిగా ఉండాలని, నిద్రించకూడదనే' ఆచారం వాడుకలోకి వచ్చింది. శుచిత్వానికి ఉన్న ప్రాధాన్యత ఇంత గొప్పది.

 శుచిత్వానికి ఎంత శక్తి ఉందో తెలిపే కథ భారతంలో ఉంది. ఉదంకుడు పౌష్యదేవి కుండలాలు తీసుకురావటానికి నాగలోకానికి వెళ్తాడు. కొంత కథ నడచిన తర్వాత, ఉదంకుడికి పొష్యదేవి కనిపించదు, ఎంత ఆలోచించినా కారణం తెలియటం లేదు. అప్పుడు నాగరాజు

 భూవినుత నిన్ను త్రిభువన

పావను నశుచివని యెట్లు పలుకగ నగు న

ద్దేవి పవిత్ర పతివ్రత

గావున నశుచులకు గానగాదనవద్యా

 శుచిత్వం లేని వాళ్లకి (ఆశుచిగా ఉంటే) పౌష్యదేవి కనిపించదయ్యా అంటాడు. ఉదంకుడు విషయం తెలుసుకుంటాడు. శుచిగా మారుతాడు. తర్వాత కథ నడుస్తుంది. తపశ్శక్తి సంపన్నుడైనప్పటికీ శుచిత్వం లేని కారణంగా ఉదంకుడు పౌష్యదేవిని దర్శించలేకపోతాడు. శుచిత్వానికి ఉన్న శక్తి అంత గొప్పది. అందుకే దేవాలయాలకు వెళ్లేటప్పుడు శుచిగా, పరిశుభ్రమైన వస్త్రాలు ధరించాలని, దేవుని సన్నిధిలో ఉండగా మనసులోకి ఇతర ఆలోచనలు రానివ్వకూడదని, వ్యర్ధప్రసంగాలు చెయ్యకూడదని పెద్దలు చెబుతారు.

 --------------

రచన: డాక్టర్ కప్పగంతు రామకృష్ణ, ఆంధ్రోపన్యాసకులు, విజయవాడ. 

Cell: 90320 44115 / 8897 547 548

--------------------------

భక్తి పత్రిక ఫిబ్రవరి 2021 సంచికలో రాసిన వ్యాసం





పున్నమి కాంతుల కల్యాణం (ఒంటిమిట్టలో జరిగే శ్రీ సీతారామ కల్యాణం నేపథ్యంగా శ్రీకనకదుర్గ ప్రభ పత్రికలో రాసిన వ్యాసం)

  పున్నమి కాంతుల కల్యాణం                లోకంలో పెళ్ళి ముచ్చట అంటే సీతారాములదే. అందులోనూ ఒంటిమిట్ట ఆలయంలో జరిగే సీతారాముల కల్యాణం మరింత శ...