Saturday, January 11, 2025

కోనసీమలో సంక్రాంతి సంబరాలు

 

 

 

సంక్రాంతి జిలుగులు... ప్రభల తీర్థాలు

 

తెలుగువారికి అతి పెద్ద పండుగ, అతి ముఖ్యమైన పండుగ సంక్రాంతి. మూడురోజుల పాటు జరిగే ఈ పండుగలో ప్రతి రోజుకూ ఓ ప్రత్యేకత ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూడు రోజుల పండుగను ఎంతో వైవిధ్యంగా జరుపుకుంటారు. స్థానిక ఆచారాలు, సంప్రదాయాలు కలగలిసిన ఈ వేడుకలు చూడముచ్చటగా ఉంటాయి. అంతేకాదు... తరతరాల తెలుగు వారి చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమ ప్రాంతంలో జరిగే సంక్రాంతి పండుగకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో ప్రభల తీర్థం ఒకటి. ఎటు చూసినా పచ్చదనం పరుచుకున్న కోనసీమకు సంక్రాంతి తెచ్చే సందడే వేరు. సంక్రాంతికి కోనసీమ పచ్చ పట్టుపరికిణీ కట్టుకున్న పల్లెపడుచులా ముస్తాబవుతుంది. ముత్యాల ముగ్గుల నడుమ సంబరంగా నర్తిస్తుంది. ప్రతి ఇంటా సంతోషం మంచులా కురుస్తుంది. అదొక అక్షరానికందని వర్ణనాతీత అనుభూతి.

కోనసీమలో సంక్రాంతి నాడు కొన్ని చోట్ల, కనుమ నాడు మరికొన్ని చోట్ల ఈ తీర్థాలు నిర్వహిస్తారు. వీటన్నింటిలోనూ ప్రఖ్యాతి పొందింది జగ్గన్నతోటలో జరిగే ప్రభల తీర్థం. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని అంబాజీపేట మండలం, మొసలపల్లి శివారు జగ్గన్నతోట కొబ్బరితోటలో మకర సంక్రమణ ఉత్తరాయణ పుణ్యకాలంలో కనుమనాడు ఈ ప్రభల తీర్థం నిర్వహిస్తారు.అత్యంత ప్రాచీనమైనది. కోనసీమ చుట్టుపక్కనున్న గ్రామాల ప్రభలు ఈ తీర్థంలో పాలుపంచుకుంటారు. ఈ తోటని జగ్గన్న తోటగా పిలుస్తారు. జగ్గన్నతోటలో గుడి గానీ, గోపురం గానీ ఉండదు. దేవునికి సంబంధించిన చిహ్నాలూ కనిపించవు. కేవలం దుక్కి దున్నిన కొబ్బరితోట. రైతులు నమ్మే భూ మండపంలో జరిగే ప్రకృతి వేడుక ఈ ప్రభల తీర్థం. నాటి స్థానిక సంస్థానదీశులైన రాజావత్సవాయి జగన్నాధ మహారాజుకు చెందిన ఈ తోట, కాలక్రమంలో ‘జగ్గన్న తోట’ అనే పేరుతో స్థిరపడింది.

లోక కల్యాణార్థం ప్రతీ సంవత్సరం కనుమ రోజున ఏకాదశ రుద్రులు జగ్గన్న తోటలో సమావేశం అవుతారని ప్రతీతి. సుమారు 400 సంవత్సరాల క్రితం 17వ శతాబ్దంలో కనుమ రోజున ఏకాదశ రుద్రులు లోక కల్యాణం కోసం జగ్గన్నతోటలో సమావేశమై లోక పరిస్థితుల గురించి చర్చించారనీ, అప్పటినుండి కనుమ రోజున జగ్గన్నతోటలో ప్రభల తీర్థం నిర్వహించబడుతున్నదని చారిత్రాత్మక కథనం.

ప్రభల తయారీ

తాటి దూలాలకు టేకు చెక్కలు అమర్చి, వెదురు బొంగుల్ని ఒక క్రమపద్ధతిలో గోపురం ఆకారంలో వంచి కడతారు. ఆ మధ్య ఖాళీలను రంగురంగుల నూతన వస్త్రాలతో అల్లికలా తీర్చిదిద్దుతారు. ఎర్రని గుడ్డను వెనక వైపు తెరలా కట్టి ఉంచుతారు. ముందు, వెనక భాగాల్ని జీవాత్మ పరమాత్మల ప్రతీకలుగా పరిగణిస్తారు. పైభాగంలో ఆలయాల్లోని ఇత్తడి కలశాలను బోర్లించి కట్టి ఆ పైన వరి కంకులు, నెమలి పింఛాలు, పూల దండలు, ఇతర సామగ్రితో అలంకరిస్తారు. వాటి మధ్యలో ఉత్సవ విగ్రహాలు ఉంచడానికి వీలుగా గద్దెలు ఏర్పాటు చేస్తారు. వాటి మీద ఆయా గ్రామాల్లోని శివుడి ఉత్సవ విగ్రహాలు ఉంచడం ఒక సంప్రదాయం.

అనంతరం మేళతాళాలు, మంగళ వాద్యాలు, వేదమంత్రాల మధ్య వూరేగింపుగా బయలుదేరతారు. ప్రభలను మామూలు రహదారుల వెంటగాని, వాహనాల మీదగాని తీసుకు వెళ్లరు. ఎంత దూరమైనా భక్తులు భుజాల మీద మోస్తూ, పంట చేలు, కాలువల మధ్య నుంచి ఊరేగింపుగా వెళతారు. కొన్ని చోట్ల ఆరడుగుల నీటిలో నుంచి గోదావరి కాలువల్లోకి దిగి ప్రభల్ని నేర్పుగా ఒడ్డుకు చేరుస్తారు.

ఈ ప్రభల్ని పరమశివుడి వెంట ఉండే వీరభద్రుడి ప్రతీకలుగా భావించి ‘వీరభద్ర ప్రభలు’గా పిలుస్తారు. పగలంతా పూజలు చేసి మొక్కుబడులు తీర్చుకుంటారు. రాత్రి సంప్రదాయ నృత్యాలు, కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. కోనసీమలో జరిగే ఈ ప్రభల తీర్థాన్ని తిలకించడానికి, ఇందులో పాలుపంచుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. భక్తి భావాన్ని చాటుకుంటూ, ఆనందాన్ని మూటకట్టుకుని తిరిగి వెళతారు. కనుమ రోజున ప్రభల తీర్థంతో ఆధ్మాత్మిక క్షేత్రంగా భాసిల్లే జగ్గన్నతోట ప్రాంతం మిగిలిన రోజుల్లో నిర్మానుష్యంగా ఉంటుంది.

జగ్గన్నతోటకి వచ్చే ప్రభలు

    గంగలకుర్రు అగ్రహారం - వీరేశ్వర స్వామి

    గంగలకుర్రు – చెన్నమల్లేశ్వర స్వామి

    వ్యాఘ్రేశ్వరం – వ్యాఘ్రేశ్వర స్వామి

    ఇరుసుమండ - ఆనంద రామేశ్వరస్వామి

    వక్కలంక – కాశీ విశ్వేశ్వరస్వామి

    పెదపూడి – మేనకేశ్వరస్వామి

    ముక్కామల – రాఘవేశ్వర స్వామి

    మొసలపల్లి – మధుమానంత భోగేశ్వరస్వామి

    నేదునూరు – చెన్నమల్లేశ్వరస్వామి

    పాలగుమ్మి – చెన్నమల్లేశ్వరస్వామి

    పుల్లేటికుర్రు – అభినవ వ్యాఘ్రేశ్వరస్వామి

ప్రభల తీర్థం

ప్రభల తీర్థానికి వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. మొసలపల్లి గ్రామ సమీపంలో విఠల జగ్గన్న అనే ఏక సంథాగ్రాహి ఉండేవాడు. అతడు కౌశికీ నది ఒడ్డున ఉన్న మర్రిచెట్టుకిందే ఎప్పుడూ ఉండేవాడు. ఆ చెట్టుకింద గ్రామదేవత నెలకొని ఉండేది. విఠల జగ్గన్నపై ఈర్ష్యకలిగినవారు కొందరు నిజాం నవాబు ప్రతినిధులకి ఫిర్యాదు చేశారు. ఆ సందర్భంలో నిజాం నవాబుని కలిసినప్పుడు జగ్గన్న ప్రతిభ బయటపడింది. అతని పాండిత్యాన్ని చూసి మెచ్చుకున్న నవాబు, ఆ మర్రిచెట్టుతో పాటు చుట్టుపక్కల ఉన్న నాలుగువందల ఎకరాలు బహుమానంగా రాసిచ్చాడు. ఫిర్యాదు చేసిన ప్రజల ఆనందం కోసం జగ్గన్న మొదటిసారి ప్రభల తీర్థం జరిపాడు. దేవుడికి గుళ్లు గోపురాలు అవసరం లేదని, దైవానికి మైల అంటదని చెప్పేందుకే ప్రభల తీర్థం ప్రారంభమైంది.

ఈ ప్రభలు భక్తులు వచ్చే దారంట రావు. కౌశిక నది దాటుకుంటూ, పొలాల మధ్య నుండి ఈ ప్రభలు ఊరేగింపుగా వస్తాయి.ఈ ప్రభలను ఒక్కసారి ఎత్తేకా క్రిందకి దింపకూడదు. కౌశిక నది దాటేటప్పుడు ప్రభ ఏ మాత్రం తడవకుండా తీసుకోస్తారు.ఈ ప్రభలను మోయడానికి ఇరవై మంది వ్యక్తులు ఉంటారు. కౌశిక నది దాటించడానికి మాత్రం యాభై మంది పైగా శిక్షణ పొందిన వారు ఉంటారు. కౌశిక నది దాటించి జగ్గన తోట తీర్థ ప్రదేశానికి తీసుకోస్తారు. తీర్థ పూర్తి అయిన తరువాత వచ్చిన దారినే తిరిగి ప్రభలని ఆయా గ్రామాలకి తీసుకెళతారు. ఈ ప్రభలను చూడటానికి వేలాది మంది తరలి వస్తారు.

ఈ ప్రభలని మోయడానికి కుల మత  విచక్షణ లేదు. వైభవోపేతంగా మేళతాళాలతో, అద్భుతమనే రీతిగా అలంకరించిన ప్రభలని భోగేశ్వర స్వామి ఆహ్వానం అందుకున్న గ్రామాల నుండీ ప్రజలు మోసుకువస్తారు. దారంతా ప్రభలని మోస్తూ నడుచుకొంటూ సభక్తికంగా వారు తీసుకొచ్చే ప్రభల రూపంలోకి ఆ భక్తి శ్రద్ధలకి లోబడి పరమేశ్వరుడు ఆవహించి వస్తారని నమ్మకం. నిజంగానే అటువంటి ఉదాహరణలు కూడా ఉన్నాయని స్థానికులు చెబుతారు.

ఆలస్యంగా వచ్చే వీరేశ్వరుడు

ఈ ఉత్సవం జరిగేది మొసలపల్లిలో ఉన్న తోటలో కాబట్టి ఆ ఊరి రుద్రుడైన భోగేశ్వరుడు మిగతా ఉళ్ళ నుంచి వచ్చే రుద్రులకు ఆతిథ్యం ఇస్తాడు. ఈ సమావేశానికి వ్యాఘ్రేశ్వరుడు అధ్యక్షత వహిస్తాడు, అంచేత వ్యాఘ్రేశ్వరుడి ప్రభ తోటలోకి ప్రవేశించగానే మిగతా రుద్రులందరూ గౌరవ సూచకంగా లేచి నిలబడతారట, అందుకని భక్తులు ప్రభలన్నిటినీ "హర హర" "శరభ శరభ" అంటూ ఒకేసారి పైకిలేపుతారు.

అందరికంటే ఆలస్యంగా గంగలకుర్రు అగ్రహారపు వీరేశ్వరుడు సమావేశానికి వస్తాడు. ఈయన ప్రభ వచ్చే దారిలో కౌశికీ నదిని దాటుతూ రావాల్సి ఉంటుంది, ఆ నదిని దాటించే దృశ్యం నయనానందకరంగా ఉంటుందని చెప్తారు. ఈ వీరేశ్వర రుద్రుడు వచ్చే సరికి సాయంత్రం అవుతుంది, ఈ రుద్రుడి ప్రభ తోటకు చేరిన కొద్దిసేపటి ఉత్సవం ముగుస్తుంది.

ఉత్సవం ముగిశాక, రుద్రలందరూ తిరిగి తమ ప్రభల మీద తమతమ గ్రామాలకు చేరుకుంటారు. ఈ ఉత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహిస్తారు, దీన్ని చూడటానికి వేలల్లో జనం దేశ విదేశాల నుండీ  ప్రతి ఏటా ఈ ప్రాంతానికి వస్తారు. మన ప్రధాని నరేంద్రమోదీ 2020లో ఈ ఉత్సవానికి గానూ శుభాకాకంక్షలు తెలపడంతో దేశవిదేశాల్లో సైతం ఈ జాతర మరింత ప్రాచుర్యాన్ని పొందింది. ఒక గ్రామీణ ఉత్సవం ఇంత గొప్ప ప్రాధాన్యతని పొందడం చాలా గొప్ప విషయం.

------------------------

రచన: డాక్టర్ కప్పగంతు రామకృష్ణ, కెబిఎన్ కళాశాల, విజయవాడ-1

 

 

 

 

Wednesday, August 14, 2024

వరాలనిచ్చే వరలక్ష్మి


 

వరాలనిచ్చే వరలక్ష్మి


    ప్రతి వ్యక్తికీ అనేక కోరికలు ఉంటాయి. ఇవన్నీ తీరాలన్నా లేదా కనీసం ఒక్క కోరిక తీరాలన్నా భగవంతుడి అనుగ్రహం తప్పనిసరి. అయితే కోరిక ఏదైనప్పటికీ, ఇచ్చే దైవం ఎవరైనప్పటికీ అంతిమంగా ఆ కోరికల్లో ఉండేది లేదా ఆ కోరికల ద్వారా అందుకునేది ఆనందం, తృప్తి మాత్రమే. ఈవిధమైన సంతృప్తి పొందిన వ్యక్తి మాత్రమే నిజమైన భాగ్యవంతుడు. అటువంటి భాగ్యాన్ని (లక్ష్మిని) అందించేది వరలక్ష్మీదేవి మాత్రమే.

     వరాల రూపంలో సౌభాగ్యాన్ని భక్తులకు అనుగ్రహించే మాత ‘వరలక్ష్మీదేవి’. ‘వర’ అంటే ‘కోరుకున్నది’, ‘శ్రేష్ఠమైనది’ అనే అర్థాలు ఉన్నాయి. ఈ అర్థాలను అన్వయం చేస్తే కోరిన కోర్కెలు లేదా శ్రేష్టమైన కోర్కెలు ఇచ్చే తల్లిగా వరలక్ష్మీదేవిని భావించవచ్చు. ఈదేవిని సమంత్రకంగా, భక్తిభావనతో కొలిచే వ్రతమే ‘వరలక్ష్మీవ్రతం’.

    స్కాంద పురాణంలో వరలక్ష్మీవ్రతం గురించిన వివరణ ఉంది. స్వయంగా పరమేశ్వరుడే పార్వతికి ఈ వ్రతం గురించి చెబుతాడు. అదే సందర్భంలో మహాభక్తురాలైన చారుమతీదేవి వృత్తాంతాన్ని కూడా పరమేశ్వరుడు పార్వతికి వివరిస్తాడు. భర్త పట్ల ఆదరాన్నీ, అత్తమామల పట్ల గౌరవాన్నీ ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉండేది. మహాలక్మ్షీదేవి పట్ల ఎంతో భక్తిశ్రద్ధలు కలిగిన చారుమతి అమ్మవారిని త్రికరణ శుద్ధిగా పూజిస్తుండేది. ఆ మహాపతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి, స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరిస్తుంది. శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజున తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని ఆమెకు అభయమిస్తుంది. అమ్మ ఆదేశానుసారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించిన చారుమతి సమస్త సిరి సంపదల్ని వరలక్ష్మీ వ్రతప్రసాదంగా అందుకుంటుంది.

వరలక్ష్మీ వైభవం


    అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి, ఈ వ్రతానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ వ్రతాన్ని శ్రావణమాసంలో చేస్తారు. శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రం రోజున పూర్ణిమ వస్తుంది. శ్రవణం శ్రీనివాసుడి జన్మ నక్షత్రం. పూర్ణిమ రోజున అమ్మవారు షోడశకళలతో వెలుగొందుతుంది. శుక్రవారం అమ్మకు ప్రీతిపాత్రమైన వారం. ఈవిధంగా చూస్తే లక్ష్మీశ్రీనివాసుల వైభవం అనంతంగా ప్రకాశించే పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం చెయ్యటం లక్ష్మీశ్రీనివాసుల అనుగ్రహానికి తొలిసోపానంగా చెప్పుకోవచ్చు. సకల సౌభాగ్యాలు కలగాలని, నిత్య సుమంగళిగా తాము జీవితకాలం ఉండాలని కోరుకుంటా దేశవ్యాప్తంగా మహిళలు ఈ వ్రతాన్ని చేస్తారు. దేశ, కాల, ప్రాంత, ఆచారభేదాలు ఉన్నప్పటికీ అందరి అంతరంగంలో కొలువై ఉన్న మాత ఒక్కరే. ఆమె అందరినీ అనుగ్రహించే తీరు ఒక్కటే.

    వరలక్ష్మీ వ్రతంలో భాగంగా కలశాన్ని స్థాపించి పూజించటం జరుగుతుంది. కలశం అమ్మవారికి ప్రతిరూపం. కలశపాత్రగా మట్టిపాత్రనుగాని, చేసుకునే యజమాని శక్తిని బట్టి వెండి, బంగారు, రాగి, పంచలోహపాత్రలను గాని వినియోగిస్తారు. లోహమైనా, మట్టి అయినా అది ప ృథ్వీతత్త్వానికి సంకేతం. అందులో పోసే నీరు జలతత్త్వానికి సంకేతం. అందులో కలశాన్ని పూర్తిగా నీరుతో నింపం కనుక శూన్యస్థితి ఆకాశతత్త్వానికి సంకేతం. మనం చదివే మంత్రం వాయుజనితం. కనుక అది వాయుతత్త్వానికి సంకేతంగా ఉంటుంది. కలశం ముందు ఉంచే దీపం అగ్నితత్త్వానికి సంకేతం. ఇలా పంచభూతాలను ఒకచోటికి చేర్చి పూజిస్తాం. ఈవిధంగా పంచభూతాలకు ప్రతీకగా ఆయా వస్తువులను ఉంచి పంచభూతాల్లోనూ వ్యాప్తించి ఉండే పరతత్త్వం, శక్తి స్వరూపమైన అమ్మను ఆరాధించటం కలశారాధనలోని అంతరార్థం.

వ్రతాచరణకు నియమాలు


    కలశం కోసం తెచ్చుకున్న పాత్రను శుభ్రంగా కడిగి, పసుపు, కుంకుమలతో అలంకరించాలి. వ్రతానికి ఎంపిక చేసుకున్న స్థలాన్ని శుభ్రం చేసుకుని, పీటవేసి, దానిమీద నూతన వ్రస్తం వేసి, దానిపై బియ్యంపోసి వేదికను సిద్ధం చేయాలి. వేదికను పూలు, చందనం, పరిమళ ద్రవ్యాలు చల్లి శోభాయమానంగా చేసుకోవాలి. ఆ తర్వాత కలశాన్ని దానిపై అమర్చాలి. దానికి తాంబూలం సమర్పించి ఆరాధించాలి. కలశంలో నీరుపోసి మామిడాకులు లేదా తమలపాకులు కాని అందులో వేయాలి. ఆకులు ఏవైనా అవి నిటారుగా నిలిచేటట్టు చూసుకోవాలి. దాని మీద కొబ్బరికాయ నుంచి దానికి రవికెల గుడ్డను వస్త్రంగా చుట్టాలి. కొబ్బరికి ముఖస్వరూపం వచ్చేలా కళ్ళు ముక్కు, పెదవులు, కనుబొమలు అమరేలా దిద్దవచ్చు లేదా అమ్మవారి రూపును దానికి తగిలించి ఆకారం ఏర్పరచవచ్చు. దానికి తమకు తోచిన నగలు వగైరాలు అలంకరించవచ్చు.

    వ్రత తోరాన్ని ఐదు పొరలుగా తీసుకుని దానికి పసుపురాయాలి. దానికి మధ్యలో మామిడి ఆకునుకాని, తమలపాకును కాని పెట్టి ముడివేయాలి. దీన్ని అమ్మవారి సమక్షంలో ఉంచి పూజించాక చేతికి మణికట్టు దగ్గర ధరించాలి. దీన్ని మొదటి శుక్రవారం కట్టుకుంటే నెలంతా ఉంచుకుని అమ్మవారి పూజ నెలరోజులూ జరుపుకోవాలి లేదా వరలక్ష్మి వ్రతం నాడు కట్టుకుని కలశానికి ఉద్వాసన పలికిన తర్వాత తీసేయొచ్చు. ఇంటి ఆచారాలను బట్టి పూజావిధానంలో మార్పులు ఉండొచ్చు.

    అమ్మవారికి పూజలో ప్రసాదంగా చక్కరపొంగలి కానీ పాయసం కాని నివేదన చెయ్యాలి. పాయసం దేనితో తయారుచేసినా దోషం కాదు. పూజలో వినియోగించిన బియ్యాన్ని మర్నాడు అన్నం వండి దేవతా మందిరంలో ఇలవేలుపుకు ప్రసాదంగా సమర్పించి స్వీకరించాలి. కలశంలో ఉంచిన కొబ్బరికాయను మరుసటి రోజున మనం రోజూ పూజించే దేవుడికి నివేదన చేసి కొట్టి ప్రసాదంగా చేసుకుని అందరూ తీసుకోవాలి. కలశంలో ఉన్న జలాన్ని కుటుంబసభ్యులందరూ తీర్థంగా తీసుకోవాలి. శిరస్సు మీద చల్లుకోవచ్చు. ఏదైనా అవాంతరం వల్ల శ్రావణ శుక్రవారం రోజున వ్రతం చేసుకోవటం సాధ్యపడకపోతే తర్వాతి వారం చేసుకోవచ్చు. ఇందులో ఎటువంటి సందేహం అవసరం లేదు.

విశ్వమంతా లక్ష్మీ స్వరూపమే


    ప్రతి స్త్రీలోనూ లక్ష్మీ కళ ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకనే స్త్రీలను లక్ష్మీస్వరూపంగా ఆరాధించటం, అర్చించటం మన సంప్రదాయంలో ఒక భాగంగా ఉంటుంది. ఏ పనికైనా మహిళే ఆదిశక్తి. ఆమెదే ఉన్నత స్థానం. అందరి మాటలు ఓర్పుగా వింటుంది. ఇతరులతో పనులు చేయిస్తుంది. తాను ్వయంగా చేస్తుంది. గుణాల చేత వ్యాపిస్తుంది. దోషాలు తొలగిస్తుంది. అందుకే స్త్రీరూపంలోని లక్ష్మికి మన సంస్కృతి సమున్నతస్థానాన్ని ఇచ్చింది.

    అనంతవిశ్వాన్ని ‘లక్షించేది’ లక్ష్మి. అందరూ లక్షించేది లక్ష్మిని. ‘లక్షించటం’ అంటే చూడటమని అర్థం. అందరినీ తన కరుణామృతపూర్ణమైన చల్లనిచూపులతో ‘కనిపెట్టుకుని’, గమనించి, పాలించే శక్తిని లక్ష్మిని చెప్పుకోవచ్చు. సర్వసాక్షిjైున ఈ భగవద్దర్శన శక్తిని లక్ష్మిగా ఉపాసించటం లక్ష్మీ ఆరాధనలోని ప్రత్యేకత. అందరూ ఆనందాన్నీ, ఐశ్వర్యాన్నీ, జ్ఞానాన్నీ, ‘లక్ష్యం’గా పెట్టుకొనే జీవిస్తారు. ఇలా అందరికీ లక్ష్యమైన జ్ఞాన, ఆనంద, ఐశ్వర్యాల సాకార రూపమే ‘లక్ష్మి’. ఈ దివ్యభావాన్ని సగుణంగా, లీలారూపంగా పురాణాలు వ్యక్తీకరించాయి.

వరలక్ష్మీ సందేశం

 

   సంప్రదాయకంగా తరతరాల నుంచి వస్తున్న ఈ వ్రతం పైకి మామూలు పురాణ కథలానే కనిపించినా ఇందులో ఒక సామాజిక చైతన్య సూత్రం ఇమిడి ఉంది. చారుమతికి వరలక్ష్మీదేవి కలలో కనిపించి తనను పూజించమని, సకల ఐశ్వర్యాలనూ ఇస్తానని చెప్పింది. చారుమతి ఆ వ్రతాన్ని స్వార్థబుద్ధితో తానొక్కతే చెయ్యలేదు. తనతోపాటు తనవారు, తన చుట్టుపక్కల ఉన్న కుటుంబాల స్త్రీలంతా వరలక్ష్మీదేవి కటాక్షానికి పాత్రులు కావాలని అందరినీ కలుపుకొని వ్రతం చేసింది. స్త్రీలు ఇలా అందరినీ కలుపుకొని సామరస్య ధోరణిలో, నిస్వార్థ బుద్ధితో మెలగాలనే ఓ సామాజిక సందేశం ఈ వ్రత కథ వెనుక ఉంది.

Saturday, August 3, 2024

తులసీదాసు

 

 


 

 

పరిపూర్ణ భక్తిమూర్తి

 

- డాక్టర్ కప్పగంతు రామకృష్ణ

 

అసోసియేట్ ప్రొఫెసర్, కె.బి.ఎన్ కళాశాల


కొత్తపేట, విజయవాడ-1

 

అనుక్షణం రామనామ గానంతో తనువును, మనసునూ కూడా పవిత్రం చేసుకున్న పుణ్యమూర్తి సంత్ తులసీదాసు. తన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు రామనామంగా జీవించిన మహనీయుడాయన. కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా సమస్త మానవాళినీ తన భక్తితత్త్వం ద్వారా ప్రభావితం చేసిన పరిపూర్ణ భక్తిమూర్తి తులసీదాసు. ఆయన కేవలం భక్తుడు మాత్రమే కాదు... గొప్ప కవి, భావుకుడు, యోగి కూడా.

 

యమునా తీరంలోని రాజాపూర్ అనే గ్రామంలో జన్మించిన తులసీదాసు జీవితపు తొలి రోజుల్లో అందరిలాంటి జీవితం గడిపాడు. యుక్తవయస్సులో రత్నావళితో వివాహం అయ్యాక ఆయన జీవితంలో ఓ అద్భుత ఘట్టం జరిగింది. పుట్టింట్లో ఉన్న భార్యను ఎట్టి పరిస్థితుల్లో చూడాలనే పట్టుదలతో విపరీతమైన తుఫాను అని కూడా చూడకుండా, అత్తగారి ఇంటికి వెళ్ళాడు తులసీదాసు. అంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ తన కోసం వచ్చిన భర్తను చూసి ఆ ఇల్లాలు ఎంతో ఆనందపడింది. అదే సమయంలో, భర్త తన కోసం చూపించిన ఈ పట్టుదల భగవంతుడి మీద కేంద్రీకరిస్తే మంచిది కదా అనిపించింది. భర్తతో ఆ మాటే అన్నది.

 

అంతే... తులసీదాసు మనసులో ఓ గాఢమైన భావన కలిగింది. తన జీవనలక్ష్యం ఏమిటో తోచింది. చిన్ననాటి నుంచి తాను చేస్తున్న రామనామమే ఇప్పుడు తనకు మార్గం అని నిశ్చయించుకున్నాడు. ఇక, చివరి శ్వాస వరకు రామోపాసన తప్ప మరొక ఆలోచనకు కూడా తన మనసులో చోటివ్వనని నిశ్చయించుకున్నాడు. మరుక్షణమే, భార్యను విడిచి తీర్థయాత్రకు బయల్దేరాడు.

 

ఎంత వరకు ఐహిక విషయ లాలస ఉంటుందో అంత వరకూ మనిషి భగవంతుడికి దూరంగానే ఉంటాడు. భగవంతుడి వైపు జీవనమార్గం మారాలంటే ఓ తెగింపు ఉండాలి. ఆ తెగింపు తులసీదాసులో వచ్చింది. అవిశ్రాంతంగా 14 సంవత్సరాల పాటు తీర్థయాత్రలు చేసాడు. అనేక క్షేత్రాలు సందర్శించాడు. పరిపూర్ణ సాధువుగా మారాడు.

 

తీర్థయాత్రలు చేస్తూ దేవభూములు, తపోభూముల్లో సంచరించడం వల్ల చేసిన పాపాలు నశిస్తాయి. మనసు నిర్మలంగా ఉంటుంది. ఆయా క్షేత్రాల్లోని మహనీయుల అనుగ్రహం కలుగుతుంది. ఫలితంగా చిత్తం దేవుడికి చేరువ అవుతుంది. ఇటువంటి భక్తుడినే భగవంతుడు కూడా అనుగ్రహిస్తాడు. అవసరమైతే తానే స్వయంగా అటువంటి భక్తుడిని వెతుక్కుంటూ వస్తాడు.

 

తులసీదాసు జీవితంలోనూ సరిగ్గా ఇలాంటి సంఘటనే జరిగింది. తీర్థయాత్రల్లో ఉండగా, నరహరగిరి ఆనందుడనే యోగిని తులసీదాసు దర్శించుకున్నాడు. ఆ మహనీయుడి సందర్శనతో తులసీదాసులో గొప్ప మార్పు వచ్చింది. ఆయన కూడా తులసీదాసును చూడగానే ఇన్నాళ్ళ తన నిరీక్షణ ఫలించినందుకు ఆనందపడ్డాడు. తులసీదాసును శిష్యుడిగా స్వీకరించి, రామతారక మంత్రాన్ని ఉపదేశించాడు.

 

మనసంతా రామమయం

 

సంవత్సరాలు గడుస్తున్నాయి. ఎటువంటి అవాంతరానికీ తులసీదాసు చలించడం లేదు. రాగద్వేషాలకు దూరమయ్యాడు. అకుంఠితమైన తపస్సు కారణంగా ఆయన ముఖం దివ్యతేజస్సుతో ప్రకాశిస్తోంది. కళ్ళు మూసినా, తెరచినా; ఆహారం తీసుకుంటున్నా, నిద్రపోతున్నా... అంతటా రామభావన తప్ప మరొక ఆలోచనకు కూడా ఆయన మస్తిష్కంలో స్థానం లేకుండా పోయింది. లోకమంతా భక్తుడంటే తులసీదాసు మాత్రమే అన్నంతగా ఆ మహనీయుడు రామదాసుడిగా మారిపోయాడు.

 

తులసీదాసు తపస్సు ఫలించింది. రామభక్త శిఖామణి ఆంజనేయస్వామి దర్శనమైంది. హనుమ ఆశీర్వాద ఫలితంగా రామచంద్రమూర్తి దర్శనమూ పొందాడు. చర్మచక్షువులతో చిదానంద స్వరూపుడిని దర్శించిన పుణ్యశీలిగా చరిత్రలో నిలిచిపోయాడు తులసీదాసు. జీవితపు చివరి క్షణం వరకూ రామనామస్మరణలో, రామనామగానంలో మునిగి, బ్రహ్మానందం పొందేవాడు.

 

ఆయనే కాదు, ఆ గానామృతానికి పరవశించిపోయిన అనేకమంది, తులసీదాస్‌ దగ్గరకు వచ్చి రామనామ దీక్ష తీసుకుని, నిరంతరం శ్రీరాముని స్మరిస్తూ ఆనందంలో ఓలలాడేవారు. హిందువులతో పాటు ఇతర మతాలవారు కూడా తులసీదాస్‌ వద్ద రామనామ దీక్ష తీసుకుని,  రామ భజన చేయడం ప్రారంభించారు. ఆ రోజుల్లో ఇదొక సంచలనంగా మారింది.

 

ప్రాణం పోసిన రామభక్తి

 

ఒకరికొకరుగా జీవించే చిలకాగోరింకల్లాంటి జంట ఒకటి ఉంది. ఒక రోజున భరంత హఠాత్తుగా కన్నుమూశాడు. అతని భార్య దుఃఖం వర్ణనాతీతంగా ఉంది. శోకమూర్తిలా ఉన్న ఆమెను చూసి అందరికీ మనసు అర్ద్రమైంది. కానీ ఎవరు మాత్రం ఏం చేయగలరు. పోయిన ప్రాణం తెప్పించే శక్తి ఎవరికి ఉంది.

 

అంత్యక్రియలకు సన్నాహాలు చేశారు. భర్తశవాన్ని తీసుకుపోనీయకుండా అడ్డుకుంటున్న ఆ అమ్మాయిని బంధుమిత్రులు కలిసి బలవంతంగా ఆపగా, శవయాత్ర ముందుకు నడిచింది. కానీ, కొద్దిసేపటికే ఆ అమ్మాయి పట్టుకున్న వారిని వదిలించుకొని పరుగుపరుగున శవయాత్రసాగే ప్రదేశానికి చేరుకుంది. అప్పటికి ఆ శవయాత్ర తులసీదాస్‌ ఆశ్రమం ముందునుంచి వెళుతోంది. ఆ ఆశ్రమం చూడగానే, ఆమెకు ఏమనిపించిందో! తన భర్తని బ్రతికించగల మహానుభావుడు అక్కడ ఉన్నాడనుకుంది. హఠాత్తుగా ఆ ఆశ్రమములోనికి వెళ్ళి, తులసీదాస్‌ పాదాలమీద వాలి శోకించింది.

 

నుదుటబొట్టు, చేతులకు గాజులు మొదలైన సౌభాగ్య చిహ్నాలతో ఉన్న ఆమెను చూసిన తులసిదాస్‌, దీర్ఘసుమంగళీభవ అని దీవించాడు. ఆ దీవెనకి ఆమె మరింతగా శోకించింది. "సౌభాగ్యవతీ! ఎందుకు నువ్వు ఇంతగా బాధపడుతున్నావు. కారణం చెప్పమ్మా!" అని అనునయంగా పలికాడు తులసిదాస్‌‌. "నాబోటి నిర్భాగ్యురాలిని - దీర్ఘసుమంగళీభవ అని దీవించారు స్వామీ! మీబోటి మహానుభావుల దీవెన నిష్పలమైంది కదా!" అంటూ కుమిలి పోయింది ఆ ఇల్లాలు. "శ్రీరామచంద్రుడు నానోట అసత్యం పలికించడమ్మా! ఏం జరిగిందో చెప్పు" అని అడిగాడు తులసీదాస్‌.

 

"మా ఆయన చనిపోయారు. ఆ వెళుతున్న శవయాత్ర ఆయనదే. ఇక నా సౌభాగ్యమునకు అర్థమేముంది" అంటూ భోరుమంది ఆ అమ్మాయి. తులసిదాసు హృదయం జాలితో నిండిపోయింది. ఆయన వెంటనే ఆ శవయాత్ర దగ్గరకు వెళ్ళి, శవవాహకులను ఆగమన్నాడు. ఆ శవం కట్లు విప్పి, రామనామాన్ని జపించి, తన కమండలంలోని జలాన్ని శవం మీద జల్లాడు. అంతే! అద్భుతం జరిగింది. శవంలో జీవం వచ్చింది. అటూ ఇటూ కదిలి కళ్ళు తెరిచాడు ఆ యువకుడు. పునర్జీవితుడైన భర్తను చూసిన భార్య ఆనందబాష్పాలు రాలుస్తూ, తులసీదాసు పాదాలపై వాలిపోయింది. బంధుమిత్రులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.

 

దిల్లీ పాదుషా గర్వభంగం

 

ఈ సంఘటన తర్వాత రామనామదీక్ష తీసుకునేవారి సంఖ్య అమితంగా పెరిగిపోయింది. దీంతో ఇతర మతగురువులు ఢిల్లీ పాదుషా దగ్గరికి వెళ్ళి, తులసీదాసు మతమార్పిడికి ప్రోత్సహిస్తున్నాడని అభియోగం మోపారు. విచారించడానికై తులసీదాసుని పిలిపించాడు పాదుషా.

 

మరణించినవారిని బ్రతికించగలదా మీ రామనామం అని అడిగాడు పాదుషా. తప్పకుండా అని జవాబిచ్చాడు తులసీదాసు. మేము ఇప్పుడే ఒక శవాన్ని తెప్పిస్తాము. మీ రామనామ మహిమతో బ్రతికించగలరా అని సవాలు చేశాడు పాదుషా. రామనామం చాలా మహిమ కలది. చనిపోయిన వ్యక్తిని బతికించగలదు. కానీ జననమరణాలు వ్యక్తి కర్మలమీద, దైవనిర్ణయం మీద ఆధారపడి ఉంటాయు. వాటి విషయం మానవమాత్రులమైన మనం కలిగించుకోవడం తప్పు కదా అన్నాడు తులసీదాసు. ఇన్ని మాటలు వద్దు. రామనామానికి మహిమ లేదని చెప్పు. లేదా శవాన్ని బతికించు...అని కఠినంగా ఆజ్ఞాపించాడు పాదుషా.

 

రామచంద్రా! ఇదేమి పరీక్ష. రాజు కన్నెర్ర చేస్తున్నాడు. అంత మాత్రాన ఇతను చెప్పిన పని చేయలేను కదా. రామా! ఈ విపత్తు నుండి నీవే నన్ను రక్షించాలి...  అని మనసులోనే వేడుకుంటూ కళ్ళు మూసుకుని ధ్యానమగ్నుడైయ్యాడు తులసీదాసు. అతడిని బంధించమని ఆజ్ఞాపించాడు పాదుషా.

 

తులసీదాసు వైపు సైనికులు కదిలారు. మనసా, వాచా, కర్మణా - త్రికరణశుద్ధిగా తననే నమ్మే ఆ భక్తునికి, ప్రతిక్షణం రామనామస్మరణ చేసే తన సేవకునికి, ప్రాణపాయసమయంలో కూడా తన మీదే భారం వేసిన ఆ మహానుభావునికి అపాయం చుట్టుముడుతుంటే రామభద్రుడు ఊరుకుంటాడా. తక్షణమే తన సైన్యాన్ని పంపించాడు.

 

ఎక్కడినుండి వచ్చాయో తెలియదు గానీ, వందలు, వేలుగా కోతులు అక్కడికి వచ్చాయి. సైనికులమీద పడి, వారి దగ్గర ఆయుధాలను లాక్కుని వారి మీదకే గురిపెట్టాయి. సైనికులు, పాదుషాతో సహా ఎవ్వరూ అంగుళం కూడా కదల్లేదు. ఏ కోతి మీదపడి కరుస్తుందో అనే భయంతో అక్కడివారంతా భయాందోళనలకు గురయ్యారు. సభలో కలకలం రేగింది. ఆ సవ్వడికి కనులు తెరచిన తులసీదాసుకి సైనికులకి ఆయుధాలు గురిపెట్టిన వానరాలు కనిపించాయి.

 

అవి కోతులు కాదు, రామదండు. తులసీదాసు ఆశ్చర్యంతో, ఆనందంతో చుట్టూ పరికించాడు. ఎదురుగా సింహద్వారం మీద కూర్చని అభయహస్తాన్ని చూపుతున్న ఆంజనేయుడు దర్శనమిచ్చాడు. తులసీదాసు భక్తిభావంతో తన్మయత్వంతో, స్వామికి చేతులు జోడించి స్తుతించాడు. ఆయన నోటినుండి అప్రయత్నంగా, ఆశువుగా జయహనుమాన జ్ఞానగుణసాగర.. అంటూ హనుమాన్‌ స్తుతి ప్రవహించింది. అదే హనుమాన్‌ చాలీసా.

 

తులసీదాసు స్తుతికి హనుమంతుడు ప్రసన్నుడయి, ఆ భక్తుని అనుగ్రహించాడు. "నాయనా! నీస్తుతితో మరింత ప్రసన్నం చేసుకున్నావు. బిడ్డా! ఈ మూకని సంహరించాలా? తరిమికొట్టాలా? నీ కోరిక ఏమిటో చెప్పు తీరుస్తా''ను అని అన్నాడు స్వామి. చేతులు జోడించి భక్తిగా తలవాల్చాడు తులసీదాసు. "స్వామీ! ఇప్పటికే ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న వీరిగురించి నేనేమీ అడగను. ఇప్పటికే వీరికి అజ్ఞానం తొలగిపోయింది. కానీ, ఒక్క ప్రార్థన. ప్రభూ! ఈ స్తోత్రంతో నిన్ను ఎవరు స్తుతించినా వారికి ప్రసన్నుడవవు కావాలి. స్వామీ! నాకు ఈ వరాన్ని అనుగ్రహించు'' అని వేడుకున్నాడు. ఆ మాటలకు స్వామి మరింత ప్రసన్నుడయ్యాడు. తథాస్తు అని అనుగ్రహించాడు. నాటి నుంచి హనుమాన్‌ చాలీసా చదివిన వారికి స్వామి ప్రసన్నుడయి అనుగ్రహిస్తున్నాడు.

 

భక్తులుగా మారిన దొంగలు

 

రామభక్తుడైన తులసీదాసు ఓ రాత్రివేళ వాహ్యాళిగా నడచివెళ్తున్నాడు. కొందరు దొంగలు ఆయనను అడ్డగించి 'ఎవరు నువ్వు'' అనడిగారు. ప్రజలంతా ఆ రాముని వారే అన్న మానసిక భావనతో ‘నేను మీ వాడినే' అని జవాబిచ్చాడు తులసీదాసు. అది విన్న ఆ చోరులు అతనూ తమ లాగే దొంగే అని భ్రమపడ్డారు. దొంగతనంలో సాయపడతాడని తమతో పాటు తీసుకువెళ్లారు.

 

ఒక ఇంట్లో దొంగతనం చేయటానికి లోపలికి వెళ్తూ తులసీదాసుతో 'నువ్వు బయట నిలబడు! ఎవరైనా వస్తే వెంటనే శంఖం ఊదు. మేము బయటకు వచ్చేస్తాం' అని ఆయన చేతికి ఓ శంఖం ఇచ్చారు. దొంగలు లోపలికి వెళ్లిన కొన్ని క్షణాలకే తులసీదాసు శంఖం పూరించాడు. ఎవరో వస్తున్నారు కాబోలు అనుకుని ఆదుర్దాతో దొంగలు బయటకు పరుగెత్తుకొచ్చారు. కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు.

 

దొంగలు తులసీదాసును దూషిస్తూ 'ఇక్కడ ఎవరూ లేరు కదా! ఎందుకు శంఖం ఊదావు? అని గద్దించారు. అప్పుడు తులసీదాసు 'అయ్యా' ఇక్కడ, అక్కడ అని లేదు. అంతటా నా ప్రభువు శ్రీరామచంద్రుడే కనిపిస్తున్నాడు. ఆయన దురాగతాలు చేసేవారిని ఎంతమాత్రం ఇష్టపడడు. దొంగతనం చెడ్డపని. మీరెవరూ ఆయన ఆగ్రహానికి గురికాకూడదనే నేను శంఖం ఊదాను' అన్నాడు. ఆ మాటలు విన్న దొంగల్లో పశ్చాత్తాపం కలిగింది. తర్వాతెన్నడూ చౌర్యం చేయకపోవడమే కాదు వారి ప్రవర్తనలో గొప్ప మార్పు వచ్చింది.

 

ఇంకా మరెన్నో సంఘటనలు తులసీదాసు జీవితంలో ముడిపడి ఉన్నాయి. వాటన్నిటి సారాశం ఒక్కటే. భవ సాగరాన్ని దాటించే నావ రామనామం మాత్రమే. పునరావృత్తి రహితమైన కైవల్యసాధనకు రామనామాన్ని మించిన మార్గం లేదు.

 










 

Thursday, May 2, 2024

ధర్మమూర్తి... సమదర్శి.... జగద్గురు కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి

 


ధర్మమూర్తి... సమదర్శి


ఆయన పేరు పలికితేనే చాలు... వ్యక్తం చేయటానికి మాటలు చాలని అనుభూతి కలుగుతుంది. ఆ కళ్ళలోని వెలుగు ఏదో తెలియని కారుణ్యాన్ని ప్రసరిస్తుంటుంది. సనాతన ధర్మానికి, భారతీయ ఆధ్మాత్మిక చింతనకు ఆ మహనీయుడు ప్రతిరూపం. అధునాతన దేశంలో భౌతికరూపంలో నడయాడిన దైవం. ధర్మం అంటే ఇదీ... అని నూరుశాతం ఆచరించి చూపించిన ధర్మమూర్తి. కుల, మత, ప్రాంత, లింగ, భాషా భేదాలు లేకుండా ప్రతి ఒక్కరినీ అక్కున చేర్చుకున్న దర్శి. ఆయనే... జగద్గురు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి.


కంచి కామకోటి పీఠం 68వ పీఠాధిపతిగా సుమారు 83 సంవత్సరాల పాటు పీఠాధిపత్యం వహించి, కోట్లాది ప్రజల హృదయాల్లో ఆధ్యాత్మిక వెలుగులు నింపిన మహనీయు మూర్తి ఆయన. ఎంతమంది పీఠాధిపతులు ఉన్నా ‘మహాస్వామి’ మాత్రం శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మాత్రమే.

చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి కర్ణాటకలోని హోయసల బ్రాహ్మణ వంశానికి చెందినవారు. క్రీ.శ.13వ శతాబ్దిలో చోళ రాజులకు సహాయార్థం హోయసల రాజులు తమిళ దేశానికి వలస వచ్చారు. వీరితో బాటు వచ్చిన హోయసల బ్రాహ్మణ కుటుంబాలు అనంతర కాలంలో తమిళ దేశంలోనే స్థిరపడ్డాయి.

 విజయనగర రాజులచే సామంతునిగా ప్రతిష్ఠింపబడిన చెవ్వప్ప నాయకుని కాలంలో (క్రీ.శ.1535 ప్రాంతంలో) హోయసల కర్ణాటక కుటుంబాలు తమిళ దేశానికి రెండవసారి వలస వచ్చాయి.
 ఈవిధంగా వలస వచ్చిన హోయసల కన్నడ బ్రాహ్మణ వంశీకుడైన గణపతి శాస్త్రి కంచి కామకోటి పీఠానికి చెందిన 64వ పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి – 5 కాలంలో ముఖ్య పరిపాలనాధికారిగా ఉండేవారు.

గణపతి శాస్త్రి పెద్ద కుమారుడైన సుబ్రహ్మణ్య శాస్త్రి కుంభకోణం ప్రాంతంలో ఉపాధ్యాయునిగా పనిచేస్తుండే వారు. చెవ్వప్ప నాయకుని వద్ద మంత్రిగా ఉన్న గోవింద దీక్షితుల వంశీకుడైన నాగేశ్వర శాస్త్రి కుమార్తె మహాలక్ష్మితో సుబ్రహ్మణ్య శాస్త్రికి వివాహం జరిగింది. ఈ పుణ్యదంపతుల రెండవ కుమారుడే పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి.


 సుబ్రహ్మణ్య శాస్త్రి విల్లుపురంలో ఉపాధ్యాయునిగా పనిచేస్తుండగా 1894సంవత్సరం మే 20వ తేదీన చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి జన్మించారు. వీరి పూర్వాశ్రమ నామధేయం స్వామినాథన్. చిన్నతనం నుండే స్వామినాథన్ అనన్య ప్రతిభా సామర్థ్యాలను చూపుతుండేవారు. తండ్రి సుబ్రహ్మణ్య శాస్త్రి కుమారునికి అయిదు సంవత్సరాల వరకు తనవద్దనే చదువు చెప్పారు కానీ స్కూలుకి పంపలేదు.


తన ఎనిమిదవ ఏట స్వామినాథన్ ప్రాథమిక పాఠశాలలో చేరారు. సుబ్రహ్మణ్య శాస్త్రి దిండివనంలో పనిచేస్తుండగా అక్కడ ఉన్న ఆర్కాట్ అమెరికన్ మిషన్ స్కూలులో 7వ తరగతిలో చేర్పించారు. 1905వ సంవత్సరంలో స్వామినాథన్ కు తండ్రి ఉపనయన సంస్కారం చేశారు. స్వామినాథన్ పాఠశాలలో ప్రథముడిగా నిలుస్తూ అందరి మన్ననలు పొందుతుండేవాడు.


 ఈ సమయంలోనే కామకోటి పీఠ 66వ ఆచార్యులైన చంద్రశేఖరేంద్ర సరస్వతి తమిళనాడులో దక్షిణ ఆర్కాటు జిల్లాలో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్య శాస్త్రి కుమారుని వెంటబెట్టుకుని స్వామివారి దర్శనానికి వెళ్ళారు. చిన్నవాడైన స్వామినాథన్ యొక్క అపార ప్రజ్ఞాపాటవాలను చూసిన ఆచార్యుల వారు ఈ బాలుడు అనంతర కాలంలో కామకోటి పీఠాన్ని అధిష్ఠించి అభివృద్ధి చేయగలడని భావించి ఆయనను ఎంపిక చేయాలని మనస్సులో సంకల్పించుకున్నారు.


 తర్వాతి పరిణామల నేపథ్యంలో స్వామినాథన్ కంచికి తీసుకొని వచ్చి, సన్యాసాశ్రమ దీక్షనిచ్చి చంద్రశేఖరేంద్ర సరస్వతిగా తీర్చిదిద్దారు. తన 13వ ఏట స్వామినాథన్ చంద్రశేఖరేంద్ర సరస్వతిగా కామకోటి పీఠాన్ని అధిష్ఠించారు.

సన్యాసాశ్రమం స్వీకరించేనాటికి స్వామివారు వేదాధ్యయనం చెయ్యలేదు కాబట్టి, అందుకోసం  మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ కృష్ణశాస్త్రి గారిని మఠం అధికారులు స్వామి వారికి వేదం బోధించడం కోసం నియమించారు. కొంతకాలం తర్వాత కృష్ణశాస్త్రి గారు స్వామితో ఇలా అన్నారు. "స్వామీ! నిమిత్త మాత్రంగా మేము మిమ్ము శిష్యులుగా పాటించినా, యదార్ధంగా మీరే మా గురువులు, మేము మీకు శిష్యులం". ఇదీ మహాస్వామి ప్రతిభ. దైవీకమైన శక్తి.


1907లో స్వామి పీఠాధిపత్యం వహించిన పిమ్మట కావేరీనది ఉత్తర తీరాన మహేంద్రమంగళంలో ప్రత్యేకంగా ఒక పర్ణశాల నిర్మించుకుని. 1911 మొదలు 1914 వరకు నాలుగు సంవత్సరాలు తదేక దీక్షతో విద్యాభ్యాసం చేశారు. ఆయా శాస్త్రాలలో నిష్ణాతులైన పండితుల వద్ద తర్క, వ్యాకరణ, మీమాంస, వేదాంతాలను నేర్చుకున్నారు.


బాల్యంలో ఆంగ్ల పాఠశాలలో చదివిన ఇంగ్లీషుతో పాటు ఫ్రెంచికూడా అభ్యాసం చేశారు. మరాఠీ చదివారు. తమిళ వ్యాకరణం, తేవారం, తిరువాచికం, పెరియ పురాణం, తిరుక్కురళ్ మొదలైన గ్రంధాలు పఠించారు. తమిళ భాషలోని కావ్య ప్రబంధాలను పరిశోధనాత్మకంగా అధ్యయంన చేసారు.

గానకళకు సంబంధించిన శాస్త్రాకోశాలను తెలుసుకున్నారు. ఛాయాగ్రహణ (ఫొటోగ్రఫి) రహస్యాలను గ్రహించారు. గణితం, జ్యోతిషం, ఖగోళశాస్త్రాదుల మర్మాలను అవగాహన చేసుకున్నారు. ప్రాచీనశాసన పరిశోధనలో, స్థల పురాణ సమస్యల పరిష్కరణలో ప్రావీణ్యం గడించారు.
"చరిత్రకు సంబంధించిన శాసన పరిశోధనలో మా కేవైనా సందేహాలు కలిగిప్పుడు కామకోటి స్వామి వారి సహాయంతో మేము మా సందేహ నివారణ చేసుకుంటాము” అని అప్పటి ఆర్కియలాజికల్ డిపార్టుమెంటు ఉన్నతాధికారి టి.యన్. రామచంద్రన్ ఒక సభలో ప్రకటించారు.


అమేయమూ, విశ్వతోముఖమూ ఆయన ఈ విజ్ఞానభాండారమంతా ఒక్క వ్యక్తిలో ఇలా కేంద్రీకృతం కావడం అనితర సాధ్యం. అలౌకికమైన వర ప్రసాదమే తప్ప, ఎంతటి వారికైనా కేవలం స్వయంకృషితో ఇటువంటి అసాధారణ ప్రతిభ సాధ్యం కాదు.


సనాతన ధర్మాన్ని రక్షించడానికి మహాస్వామి వారు తమ నూరేండ్ల జీవితాన్ని ధారపోశారు. శతాబ్దిలో వారు ఉండటం కాదు, ఒక శతాబ్దమే వారిలో ఉన్నది. నీతి, నిజాయతీ, నిర్వహణకు ఆయన పెట్టింది పేరు. ఆడంబరం లేని మహనీయుడు. ఆయన సమదర్శి, వాత్సల్య మూర్తి.

వారికి అద్భుతమైన జ్ఞాపకశక్తి ఉండేది. ఒక సంఘటన జరిగి దశాబ్దాలు జరిగినా దానిని గుర్తుపెట్టుకునేవారు. ఒకసారి కలిసిన వ్యక్తి మళ్ళీ ఎప్పుడు కలిసినా గుర్తించేవారు. స్వామి కార్యంలో భారీ సేవ చేసినవారినీ, ఉడతాభక్తిగా సేవించిన వారినీ అందరినీ ఒకేతీరున గుర్తుపెట్టుకునేవారు. అందుకే ఆయన సమదర్శి అనిపించుకున్నారు.
సాధారణ భక్తులు వచ్చి వారికొచ్చే చిన్నచిన్న సందేహాలు అడిగినా, పండితులు తర్కమీమాంస శాస్ర్తాలకు సంబంధించిన ప్రశ్నలు వేసినా... అన్నిటికీ సావకాశంగా బదులిచ్చి, సందేహ నివృత్తి చేసేవారు. ఆయన ఆచారం ప్రధానంగా పెట్టుకున్నారే కానీ, ప్రచారం గురించి ఎన్నడూ ఆలోచించలేదు. ఆయన కారుణ్యమూర్తి. వారి వ్యక్తిత్వం దోష రహితం, దైవ సహితం. ఆయన చూపుల్లో దివ్య తేజస్సుతోపాటు అంతులేని వాత్సల్యం ప్రతిఫలించేది.


చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు వేద రక్షకుడు. సద్గురువు. శాస్త్ర పరిశోధకుడు. దేశకాల పరిస్థితులను బట్టి, ఆధ్యాత్మిక సంపదను రక్షించిన రాజనీతిజ్ఞుడు. అంతకుమించి బహుభాషా కోవిదుడు.

ధర్మాచరణకు శ్రద్ధ అవసరమని, సంకల్ప బలం, విశ్వాసం ఉండా లని, మనసును నియంత్రిస్తేనే కార్య సిద్ధి కలుగుతుందని చెప్పేవారు.
దేశమంతటా వేద పాఠశాలలు నెలకొల్పి వేదాధ్యయనాన్ని ప్రోత్సహించారు. ఎన్నో ఆలయాలకు మంటపాలు నిర్మించారు.

ధర్మ సంవర్ధనమే లక్ష్యంగా ఇరవై సంవత్సరాలు పాదచారం చేస్తూ యావద్భారతం పర్యటించారు. హిందూమత సంరక్షణకు, వివిధ శాఖలకు చెందిన హిందూ మతావలంబుల సమైక్యతకు అద్వితీయమైన కృషిచేశారు. వందల సంఖ్యలో ధర్మ సంస్థలు స్థాపితమయ్యేలా ప్రోత్సహించి, ధర్మప్రచారానికి బలమైన పునాదులు వేసారు.


భక్తులపై స్వామికిగల వాత్సల్యం అంతా ఇంతా కాదు. భక్తులను సంతృప్తి పరచడానికి, వారిని సంతోషపెట్టడానికి స్వామి వహించే శ్రద్ధ ఇంత అని మాటల్లో చెప్పటానికి సాధ్యం కాదు.
ఆధ్యాత్మిక విషయాలను చర్చించే వారి సంగతి అలా ఉంచి, అనేకమంది భక్తులు జీవితంలో తమ కష్టసుఖాలను గురించి, సంసారంలోని చిక్కులను గురించి స్వామితో తమ సమస్యలు చెప్పబోయే సరికి-భక్తి చేతనో, భయం చేతనో, మాటలు తడబడతాయి. ఒకటి చెప్పబోయి వేరొకటి చెబుతారు. అసలు తాము చెప్పదలచింది మరిచిపోతారు. సగం చెప్పి ఊరుకుంటారు. అలాంటి సందర్భాల్లో స్వామి అసహనం చూపేవారు కాదు. తమ సమయాన్నంతా వృధా చేస్తున్నారని ఏమాత్రం అనుకునేవారు కాదు. వారి బాధ ఏమిటో తెలుసుకోడానికి ప్రయత్నించేవారు. వారి మనస్సులోని మాట రాబట్టడానికి తామే అనేక ప్రశ్నలడిగి, తగిన ఉపాయాలను సూచించి వారి బాధలను ఉపశమింప జేసేవారు.


చూడ వచ్చినవారి పెద్దలను గురించీ, వారి బంధువర్గాన్ని గురించీ పేరు పేరునా అడిగి, వాళ్ల యోగక్షేమా లన్నిటినీ తెలుసుకునేవారు. తమ దూరపు బంధువులను, ఒకవేళ భక్తులెవరైనా మరిచిపోతారేమో కాని, స్వామికి మాత్రం జ్ఞాపకం ఉండేది. ఎన్ని సంవత్సరాలు దాటినా ఒక్కొక్క భక్తుని వంశచరిత్ర స్వామి జ్ఞాపకశక్తి అనే బీరువా అరలో ఎలా భద్రపరిచి ఉండేదో ఊహకు అందని విషయంగా ఇప్పటికీ మిగిలిపోయింది.


"శంభోర్మూర్తిః చరతి భువనే శంకరాచార్య రూపా” - సాక్షాత్తు పరమశివుని అవతారమైన ఆదిశంకరులు అనేక శతాబ్దుల కిందట కంచికామకోటి పీఠాన్ని స్వయంగా అధిష్టించి సర్వజ్ఞపీఠంగా కంచి పీఠాన్ని తీర్చిదిద్దారు. ఆ తర్వాత శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి ఆదిశంకరుల అవతారంగా తిరిగి సర్వజ్ఞ పీఠాన్ని అధిష్టించి, ఆదిశంకరుల పరంపరా వైభవాన్ని మరోసారి ప్రకటించారు.


చంద్రశేఖరేంద్ర స్వామి కేవలం పీఠాధిపతి మాత్రమే కాదు. ఆయనలో ఒక రాజకీయవేత్త, చారిత్రక పరిశోధకుడు, శాస్త్రపరిశోధకుడు, జ్యోతిశ్శాస్త్రవేత్త, ఆధ్యాత్మికవేత్త... ఇంకా ఎందరో దాగున్నారు. ఇన్ని విషయాల్లో విస్తృతమైన ప్రతిభా సామర్థ్యాలు కలిగిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి జీవితం అద్భుతం, అనితర సాధ్యం. నిండు నూరేళ్ళు విలక్షణమైన జీవితాన్ని గడిపి, పాదచారియై దేశమంతా సంచరిస్తూ ధర్మప్రభోదం చేసిన మహాపురుషులు స్వామి.

రెండువేల సంవత్సరాల కిందట దక్షిణ భారతంలో జన్మించి, అవైదిక మతాలను ఖండించి, అనేక దివ్యశక్తులను ప్రదర్శించిన ఆదిశంకరులే తిరిగి నేడు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతులుగా అవతరించారు. ఇది అతిశయోక్తి కాదు.

                                 ------xxxxx------

రచన: డాక్టర్ కప్పగంతు రామకృష్ణ, అసోసియేట్ ప్రొఫెసర్, కె.బి.ఎన్. కళాశాల (అటానమస్), కొత్తపేట, విజయవాడ-1.
సెల్: 90320 44115 / 8897 547 548

Wednesday, May 1, 2024

వాక్యకోవిదుడు హనుమంతుడు


 

వాక్యకోవిదుడు, వ్యాకరణ పండితుడు

 

 

మాట మనిషిని మహనీయుడిని చేస్తుంది. అదే మాట మనిషి పతనావస్థకు దారితీస్తుంది. వాక్కుకు అంతటి అమోఘమైన శక్తి ఉంది. అవతలి వ్యక్తితో స్నేహం చెయ్యాలన్నా, మిత్రుడు శత్రువుగా మారాలన్నా ఒక్క మాట సరిపోతుంది. అందుకే శాస్త్రాలు వాక్కును దైవంగా ప్రకటిస్తాయి. మంత్రభాగంలో కూడా వాక్కుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. మాట్లాడే మాటలో ఒక శబ్దం ఎక్కువ లేదా తక్కువ అయినా అందుకు విపరీత ఫలితాలు ఏర్పడతాయి. అందుకే ఎల్లప్పుడూ మంచి మాటలనే మాట్లాడాలి. వాక్కుకు ఇంతటి ప్రభావాన్ని పూర్తిగా తెలుసుకున్నవాడు, ఎవరితో ఎప్పుడు ఎంతవరకు ఎలా మాట్లాడాలో ఆ పరిధికి లోబడి మాట్లాడి ‘వాక్య కోవిదుడు’గా, ‘నవ వ్యాకరణ పండితుడు’గా జేజేలు అందుకుంటున్నవాడు రామదూత హనుమ మాత్రమే.

 

హనుమ నవ వ్యాకరణ పండితుడు. సూర్యుడి దగ్గర శిష్యరికం చేసినవాడు.  తపస్వి. సుగ్రీవుడి మంత్రి. భక్తుడు. సేవకుడు. రాయబారి. కార్యసాధకుడు. యోధుడు. పరాక్రమశాలి. అన్నిటికీ మించి వినయ సంపన్నుడు. గొప్ప వాక్కు అలంకారంగా కలిగినవాడు – ’వాగ్విదాం వరం‘ – అని వాల్మీకి పొంగిపోయి చెప్పాడు.

 

హనుమంతుడు అనగానే సాధారణంగా అందరికీ ఆ స్వామి భుజ బలం మాత్రమే గుర్తుకువస్తుంది. నిజానికి హనుమ గొప్ప బుద్ధి బలశాలి కూడా. అందుకే ‘బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతా / అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్స్మరణాద్భవేత్’ -  హనుమను ధ్యానిస్తే బుద్ధిబలం వస్తుంది అని చెబుతున్నాయి ఇతిహాస, పురాణ గ్రంథాలు.

 

సీతాదేవిని రావణుడు అపహరించిన తర్వాత ఆమెను వెదుకుతూ రామలక్ష్మణులు రుష్యమూక పర్వత ప్రాంతానికి చేరుకుంటారు. సుగ్రీవుడి నివాస ప్రాంతం అది. తనను చంపడానికి తన అన్న వాలి వీరిని పంపించారా అని అనుమానించి, విషయం తెలుసుకునేందుకు తన మంత్రి అయిన హనుమంతుడిని పంపుతాడు. మారుతి మారు వేషంలో రామలక్ష్మణుల దగ్గరకు వచ్చి అనేక విధాలుగా ప్రశ్నిస్తాడు.

 

రాజర్షి దేవ ప్రతిమౌ తాపసౌ సంశితవ్రతౌ ! దేశం కథమిమం ప్రాప్తౌ భవంతౌ వరవర్ణినౌ!!

 

మీరిద్దరూ మంచి తేజోవంతుల్లా, తీవ్రమైన తపోదీక్ష పట్టిన వారిలా ఉన్నారు. మీ రూపం తాపసుల్లా ఉన్నా మీ తేజం క్షత్రియత్వాన్ని సూచిస్తోంది. గొప్ప పని ఉంటే తప్ప మీవంటి యోధులు క్రూరమగాలు సంచరించే ఇలాంటి చోటుకురారు అని రామలక్ష్మణులను ప్రశ్నిస్తాడు హనుమ.

 

మాట అంటే ఇలా ఉండాలి. ఒక్క అక్షరం ఎక్కువ తక్కువ కాకుండా ప్రశ్నలు వేశాడు హనుమ. ఇంత కాలం తాను ఎవరి గురించి ఎదురు చూస్తున్నాడో ఆ దైవం ఎదుట నిలబడినప్పుడు హనుమ తొందరపడలేదు. వచ్చింది ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఎంత గొప్పగా ప్రశ్నించాడంటే రాముడే ముచ్చటపడ్డాడు. వ్యాకరణ పండితుడు తప్ప మరొకరు ఇలా మాట్లాడలేడన్నాడు. హనుమ ప్రశ్న స్వీకరించిన వ్యక్తి కూడా ఆనందపడేలా అడిగాడు. హనుమంతుడి మాటల ఔచిత్యానికి ముచ్చటపడతాడు రాముడు.

 

నా నృగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణ: ! నా సామవేద విదుష: శక్యమేవ విభాషితుం !!

 

రుక్‌, యజు, సామవేదాల్లో పండితుడైనవాడు తప్ప మరొకరు ఇలా మాట్లాడలేరంటూ లక్ష్మణుడితో హనుమంతుడి మాటలతీరులోని గొప్పతనాన్ని వివరిస్తాడు రాముడు. ఒక్క మాట ఎక్కువ తక్కువ కాకుండా కొత్తవారితో కూడా ఎంతో నేర్పుగా మాట్లాడటమే కాకుండా రామసుగ్రీవుల మైత్రికి బీజం వేసింది హనుమ వాక్చాతుర్యం. హనుమలోని వ్యాకరణ పాండితీ వైభవానికి, ఔచిత్యవంతమైన సంభాషణ చేసే నేర్పుకీ ప్రతీక ఈ ఘట్టం.

 

నవ వ్యాకరణాలు ఎలా చదివాడంటే...

 

‘హనుమంతుడు మాటతీరు తెలిసినవాడు’అని శ్రీరామచంద్రుడు అంతటివాడు ప్రశంసించాడు. నవ వ్యాకరణ పండితుడు కావటమే హనుమంతుడి ఉత్తమమైన మాటతీరుకు కారణం.

హనుమ సూర్యభగవానుడి దగ్గరకు వెళ్లి తనకు వ్యాకరణాన్ని నేర్పమన్నాడు. చిన్నప్పుడు తనను తిన దగిన ఫలమని భావించి ఎగిరి వచ్చిన హనుమను చూస్తే ముచ్చటేసింది సూర్యుడికి. ‘నేర్పుతాను. కానీ, నేను ఒకచోట స్థిరంగా ఉండటానికి కుదరదు కదా! గగన మార్గంలో నా వెంట ఎలా తిరుగ గలవు?’ అనడిగాడు భానుడు.

 

‘ఓ.. దానిదేముంది!’ అంటూ తన కాయాన్ని పెంచిన ఆంజనేయుడు ఉదయాద్రిన ఒక కాలు, అస్తాద్రిన ఒక కాలు మోపి, సూర్యగమనానికి అనువుగా నడుమును వంచుతూ, చెవి ఒగ్గి ఆదిత్యుడి దగ్గర వ్యాకరణ శాస్ర్తాన్ని కూలంకషంగా అధ్యయనం చేశాడు.

 

మనకు మొత్తం తొమ్మిది రకాల వ్యాకరణాలు ఉన్నాయి. అవి... 1.శాక్త వ్యాకరణము 2. శంభు వ్యాకరణము 3. కుమార వ్యాకరణము 4. ఇంద్ర వ్యాకరణము 5. సూర్య వ్యాకరణము 6. చంద్ర వ్యాకరణము 7. స్మర వ్యాకరణము 8. వాత్స్యాయన వ్యాకరణము 9. అగస్త్య వ్యాకరణము. – ఈ తొమ్మిది రకాల వ్యాకరణాలను హనుమంతుడు సూర్యుడి వద్ద అధ్యయనం చేసాడు.  అందుకే హనుమకు ‘నవ వ్యాకరణ పండితుడు’ అనే పేరు ఏర్పడింది.

 

హనుమ మాట్లాడిన తీరుకు ముచ్చటపడిన రామచంద్రమూర్తి స్వయంగా... నూనం వ్యాకరణం కృత్స్నమనేన బహుధా శ్రుతమ్ బహు వ్యాహరతానేన న కిఞ్చిదపశబ్దితమ్’ – ఆంజనేయుడు మాట్లాడిన మాటల్లో ఒక్క అపశబద్దం కానీ, ఒక్క మాట ఎక్కువ కానీ, తక్కువ కానీ లేదు. వ్యాకరణం మీద తిరుగులేని పట్టు ఉన్న వ్యక్తికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది అంటాడు. రామయ్యను హనుమ మెప్పించింది తన భుజబలం చూపించో, మరొక శక్తి ప్రదర్శించో కాదు... కేవలం తన భాషా పాండిత్యంతో మెప్పించాడు. అదీ హనుమ వ్యాకరణ పాండిత్యానికి ఉన్న ఔన్నత్యం.

 

దృష్టా సీతా...

 

వానర రాజు సుగ్రీవుని ఆజ్ఞ ప్రకారం భూమి నాలుగు చెరగుల నుంచి కపి సైన్యం వచ్చి చేరింది. ఓక్కొక్కరిని ఒక్కొక భాగానికి నాయకుడిని చేసి వారు ఏదిక్కుగా వెళ్ళాలో, ఎక్కడెక్కడ వెతకాలో వివరంగా ఆజ్ఞ ఇచ్చాడు సుగ్రీవుడు. చివరగా, అంగదుడిని నాయకునిగా చేసి , హనుమదాదిగా వీరులను దక్షణ దిక్కుకు వెళ్ళి వెతకమని చెబుతాడు. ఎక్కడి దాకా వెళ్ళి వెతకాలో చెబుతాడు. అందరికీ, ఎక్కడెక్కడ వెతకాలో కూడా చెబుతాడు.. సమయం ఒక నెల అని చాలా వివరంగా ఆజ్ఞ ఇచ్చాడు. అతిక్రమించిన వారికి శిరః ఛేదం శిక్ష అని ప్రకటించాడు. అందుకే దానిని సుగ్రీవాజ్ఞ అన్నారు.

 

అప్పుడు రాముడు హనుమకు అంగుళీయం తన గుర్తుగా ఇస్తాడు, సీతకు ఇవ్వడానికి. ఎవ్వరికీ ఇవ్వని ఈ గుర్తు హనుమకే ఇవ్వడం లో విశేషం, హనుమ మాత్రమే ఈ పని పూర్తి చేయగలడన్న నమ్మకం.  సీతమ్మను వెదకడానికి అందరూ అన్ని దిక్కులకూ బయలుదేరుతారు. దక్షణ దిక్కుగా వెళ్ళినవారు చాలా చిక్కులు పడి సముద్ర తీరం చేరుతారు.

 

అప్పటికే ఇచ్చిన గడువు పూర్తి అయిపోయింది. అందరూ ప్రాణభయంతో ఉన్నారు సుగ్రీవాజ్ఞ మూలంగా. ఆ సమయంలో లంకకి వెళ్ళగలవారెవరనే ప్రశ్న ఏర్పడింది. చివరికి హనుమకి శక్తి గుర్తు చేసి ఆయనను పంపుతారు. హనుమ లంకకు చేరుకుని, సీతను చూసి ఆమెతో మాటాడి ఆమెను ఆత్మహత్య నుంచి కాపాడి, అంగుళీయమిచ్చి, సీతమ్మ ఇచ్చిన చూడామణి ని తీసుకుని, అశోకవనం నాశనం చేసి, రావణుని పరివారం కొంత, అతని సుతుని పరిమార్చి, రావణుని చూచి, లంక కాల్చి, విజయంతో తిరిగి బయల్దేరతాడు.

 

ఇక్కడ సముద్రపు ఒడ్డున ఉన్న వారు ఉత్కంఠ తో ఉన్నారు. ఏమైందో తెలియదు. హనుమ సీతను చూసి వస్తే అందరి ప్రాణాలు నిలబడతాయి. లేకపోతే, సుగ్రీవాజ్ఞ ప్రకారం శిరచ్ఛేదం తప్పదు. ఇటువంటి సమయంలో హనుమ తిరిగివస్తూ సముద్రపు ఒడ్డున ఉన్న తన వారికి విజయ సందేశం క్లుప్తంగా తెలియజేయడానికి సింహనాదం చేస్తాడు. ఆ సింహనాదం విని, అక్కడ వున్న జాంబవంతుడు మొదలైన వారు హనుమ కార్య సాధనతో తిరిగి వస్తున్నాడని భాష్యం చెబుతారు.

 

ఆయినా ఉత్కంఠం పోదు. హనుమ నేల మీద కాలుమోపుతూ... “దృష్టా సీతా” అన్నాడు. సాధారణంగా క్రియాపదంతో వాక్య నిర్మాణం ఉండదు. సంస్కృత భాషలో ఉన్న గొప్పతనం కూడ తోడు కలవడం, వ్యాకరణ పండితుడవటం వల్ల, అక్కడ ఉన్నవారి ఉత్కంఠను వెంటనే చల్లార్చే ఉద్దేశంతో హనుమ ‘దృష్టా సీతా’ అన్నాడు. ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో, ఎలా, ఎందుకు, ఏం మాట్లాడాలో తెలిసినవాడు కావటం వల్లనే ఒక్కమాటతో వేలాది ప్రాణాలు నిలబెట్టాడు హనుమ. అదీ ఆ స్వామిలోని వాక్యకోవిదత్వం.

 

సీతమ్మ ప్రాణం కాచిన మాట

 

పదినెలల అశోకవనవాసం సీతమ్మను ఎంత కుంగదీసిందంటే – హనుమ రావడం రెండు నిముషాలు ఆలస్యమయితే ఆత్మహత్య చేసుకునేది.  అలాంటి సంక్షుభిత ఉద్విగ్న సమయాల్లో హనుమ మాట్లాడిన తీరు అనన్యసామాన్యం. బహుశా అలా మాట్లాడాలంటే దేవుడే దిగి రావాలి.

 

అంతకుముందు... తెల్లవారక ముందే రావణుడు వచ్చి నానా మాటలు అని వెళ్ళాడు. నరమాంస భక్షకులైన ఆడ రాక్షసుల గుండెలు గుచ్చుకునే మాటలు మరో వైపు. ఇక ఇన్ని కష్టాలు తట్టుకునే ఓపిక నశించింది సీతమ్మకు. తన కేశాలతో పాశం తయారుచేసుకుని, ఉరి వేసుకుని, ప్రాణాలు తీసుకోవాలని నిశ్చయించుకుని, అందుకు సన్నద్ధమవుతోంది. ఇదంతా గమనిస్తున్నాడు పక్కనే చెట్టుమీద ఉన్న మారుతి.

 

సీతమ్మతో మాట్లాడటానికి ఇదే సరైన సమయం. కానీ, ఏం మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? ఏ భాషలో మాట్లాడాలి...? ఆలోచించాడు హనుమ.

 

ఇంతదాకా సంస్కృతంలో రావణుడు అఘోరించి వెళ్ళాడు – కాబట్టి సంస్కృతంలో మాట్లాడితే మళ్ళీ రావణుడి మాయలే అనుకుంటుంది. అనేక భాషలు తెలిసినవాడే భాష ఎంపిక గురించి ఆలోచించగలడు. సీతమ్మ సొంత ఊరు మిథిలా నగరం. అయోధ్యలో మాట్లాడేది ప్రాకృత అవధి భాష.  కాబట్టి, అయోధ్యలో మాట్లాడే యాసతోనే మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు హనుమ. అంటే సీతమ్మ మెట్టినింటి భాష అన్నమాట. పూర్తిగా మన ఊరివారెవరో మాట్లాడుతున్నారని మొదటి మాటకే ఆమె ఉపశమనం పొందాలి. ఆ తరువాత....? ఏం చెబితే ఆమె ఇంకా నమ్ముతుంది? శాంతిస్తుంది? ఆలోచించాడు... రామకథనే ఎంచుకున్నాడు . అంతే మైథిలీ ప్రాకృత భాషలో రామగానం ప్రారంభించాడు. తన మాండలికంలో రామకథను వినగానే సీతమ్మకు పోయిన ప్రాణం తిరిగివచ్చినంత పనైంది.

 

క్షేమంగా ఉన్న రాముడు నీ క్షేమం అడగమన్నాడు – అన్నాడు హనుమ. అంటే ఆమె అడగకుండానే రాముడు క్షేమంగా ఉన్నాడని, ఆయనే తనను పంపాడని విన్నవించాడు. నువ్వెక్కడున్నావో తెలిసింది ఇక వెంటనే రాముడు వస్తాడు – అని అభయమిచ్చాడు.

 

మాటల్లో చెప్పలేనంత ఆపదలో ఉండి, ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ మనిషిని ఎలా కాపాడాలో హనుమకు తెలిసినంత ఇంకెవ్వరీ తెలియదు అని ఘంటాపథంగా చెప్పడానికి ఈ ఘట్టమే ఉదాహరణ. నవ వ్యాకరణ పండితుడు, అనేక భాషలు తెలిసినవాడు కాబట్టే, సీతమ్మకు భాష ద్వారా దగ్గరయ్యాడు, రామదూతను అనే నమ్మకం కలిగించగలిగాడు.

 

హనుమ అంటే శబ్దబ్రహ్మ. ఆ స్వామి మాటకు మహోన్నతమైన శక్తి ఉంది. హనుమను మించిన పండితుడు లేడు. భుజబలంతో పాటు బుద్ధిబలమూ ఆ స్వామి అనుగ్రహం వల్ల లభిస్తుంది.

 

రచన : డాక్టర్ కప్పగంతు రామకృష్ణ, సెల్ : 9032044115 / 8897 547 548

 

పున్నమి కాంతుల కల్యాణం (ఒంటిమిట్టలో జరిగే శ్రీ సీతారామ కల్యాణం నేపథ్యంగా శ్రీకనకదుర్గ ప్రభ పత్రికలో రాసిన వ్యాసం)

  పున్నమి కాంతుల కల్యాణం                లోకంలో పెళ్ళి ముచ్చట అంటే సీతారాములదే. అందులోనూ ఒంటిమిట్ట ఆలయంలో జరిగే సీతారాముల కల్యాణం మరింత శ...