'విజయ' ఉత్సవాలు
లోకాలనేలే చల్లని తల్లి కనకదుర్గమ్మను కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా కొలుచుకునే పర్వదినం దసరా. ఆంధ్రరాష్ట్రంలో అత్యంత ప్రముఖమైన పండుగే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే పండుగ కూడా దసరా కావటం విశేషం. ఈ విశేషాలకు తోడు మరెన్నో పురాణ, ఇతిహాస విశేషాలు; స్థానిక ఆచారాలు, సంప్రదాయాలు వందల సంవత్సరాల నుంచి ఇప్పటికీ నిరాటంకంగా కొనసాగుతుండటం బెజవాడ కనకదుర్గమ్మ వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది.
కీలుడనే యక్షుడు చేసిన తపస్సుకు మెచ్చిన జగన్మాత అతడికి వరం ఇవ్వటం, ఆ వరప్రభావం కీలుడు ఇంద్రకీలాద్రి పర్వతంగా మారటం, కీలాద్రిపై అమ్మ దుర్గమ్మగా అవతరించటం, బ్రహ్మదేవుడు మల్లికాపుష్పాలతో అర్చించిన కారణంగా ఇక్కడి పరమేశ్వరుడికి మల్లికార్జునస్వామిగా పేరు రావటం, ఇంద్రకీలాద్రిపై మహాభారత కాలంలో అర్జునుడు తపస్సు చేసి, పాశుపతాస్త్రాన్ని సంపాదించటం, మ¬గ్రరూపిణిగా ఉన్న అమ్మను శాంతింప జేయటానికి ఆదిశంకరాచార్యులు ఈ ఆలయంలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించటం, ధర్మం తప్పని మహారాజు మాధవ వర్మ ఇచ్చిన వరాల ఫలితంగా కనకవర్షం కురవటంతో దుర్గాదేవి కనకదుర్గాదేవిగా మారటం, నవరాత్రి ఉత్సవాల్లో చిట్టచివరి రోజైన విజయదశమి రోజున చేసే శమీపూజకు ఇక్కడి స్థలపురాణం సంబంధించటం... ఇలా ఎన్నో ఎన్నెన్నో విశేషాలు, చారిత్రక గాథలు విజయవాడతో ముడిపడి ఉన్నాయి.
కనకదుర్గాదేవిగా ప్రసిద్ధి
పూర్వకాలంలో విజయవాడను మాధవ వర్మ అనే రాజు పాలించేవాడు. అత్యంత ధర్మమార్గ వర్తనుడిగా, ప్రజలను కన్నబిడ్డల కన్నా మిన్నగా చూసే పాలకుడిగా మాధవ వర్మ పేరుపొందాడు. ఒకరోజున అతని కుమారుడు తన రథం మీద నగరంలో పర్యటిస్తున్న సందర్భంలో, అకస్మాత్తుగా ఒక బాలుడు ఆ రథచక్రాల కింద పడి మరణిస్తాడు. ఆ బాలుడి తల్లి రాజకుమారుడి కారణంగానే తన బిడ్డ మరణించాడని రాజుకు ఫిర్యాదు చేస్తుంది. కలలో కూడా ధర్మం తప్పని మాధవ వర్మ తన రాజ్యానికి వారసుడు, తన వంశాంకురమైన యువరాజుకు మరణశిక్ష విధించి, అమలు చేస్తాడు. మాధవుడి ధర్మనిష్టకు మెచ్చిన దుర్గాదేవి, అతడి రాజ్యంలో కనకవర్షం కురిపిస్తుంది. అప్పటినుంచి ఇంద్రకీలాద్రిపై కొలువున్న దుర్గాదేవి కనకదుర్గాదేవిగా ప్రసిద్ధిపొందింది. పార్వతీపరమేశ్వరుల అనుగ్రహంతో బిడ్డలిద్దరూ పునర్జీవితులు అవుతారు.
జమ్మిదొడ్డి చారిత్రక గాథ
దుర్గామల్లేశ్వరుల భక్తుడైన పండితయ్య అనే భక్తుడు బెజవాడలో ఉండేవాడు. అతడు క్రమం తప్పకుండా ఆచార విధులు నిర్వహిస్తూ ఉండేవాడు. నిత్యాగ్ని¬త్రం, ఇతర అనుష్ఠానాలు చేసేవాడు. దేవ, ఋషి, పితృ తర్పణ కార్యక్రమాలు చేస్తూ, 'శివుడు' తప్ప మరో లోకం లేదన్నంతగా భక్తిప్రపత్తులు కలిగిఉండేవాడు. ఇంతటి సదాచారా సంపన్నుడైన పండితయ్యను చూసి, గిట్టని వాళ్ళు అతనికి ఆ ఊళ్ళో నిప్పు పుట్టకుండా చేశారు.
దీంతో పండితయ్య ఎంతో ఆవేదన చెందాడు. ఇష్టదైవమైన పరమేశ్వరుడిని ప్రార్థించి, అగ్నిని తన
ఉత్తరీయంలో మూటకట్టుకుని, గ్రామం చివర చేరుకుని, అక్కడ ఉన్న ఒక జమ్మి చెట్టుకు, తన ఉత్తరీయాన్ని వేలాడదీశాడు. తన అనుష్ఠాన బలాన్ని ఉపయోగించి ఊరిలో ఎక్కడా నిప్పు పుట్టకూడదని శపించాడు. తాను మాత్రం నిత్యాగ్ని¬త్రం చేసుకుంటూ ఉండేవాడు. ఊళ్ళో ఎక్కడా నిప్పు పుట్టకపోయేసరికి గ్రామస్తులంతా అనేక ఇబ్బందులకు గురయ్యారు. ఎందుకు ఇలా జరుగుతోందని తరచి, తరచి చూస్తే, తమ తప్పు తెలిసివచ్చింది.
ప్రజలందరూ అప్పటి విజయవాడ పాలకుడైన వేంగిరాజు అనంతపాలుడుని వెంటపెట్టుకుని, పండితయ్య దగ్గరకు వస్తారు. స్వయంగా మహారాజు కదలివచ్చి, నచ్చజెప్పటంతో పండితయ్య తన కోపాన్ని విడిచిపెట్టి, తిరిగి పరమేశ్వరుడిని ప్రార్థించి, తన శాపాన్ని ఉపసంహరించుకుంటాడు. దీంతో గ్రామంలో తిరిగి నిప్పు యథావిథిగా వెలిగింది. సంతోషించిన గ్రామస్తులు తమ తప్పుల్ని మన్నించవలసిందిగా పండితయ్యను ప్రార్థిస్తారు. సన్మార్గవర్తనుడైన పండితయ్య కూడా ఎంతో సంతోషించి, గ్రామస్తులతో కలసి, తన పూర్వ నివాసానికి చేరుకుంటాడు.
ఆవిధంగా పండితయ్య నిప్పును తన ఉత్తరీయంలో బంధించి శమీవృక్షానికి కట్టిన ప్రాంతం, ఆ వృక్షం చారిత్రక ప్రసిద్ధి పొందాయి. శమీవృక్షం ఉన్న ఆ ప్రాంతం కూడా కాలకమ్రంలో జమ్మిదొడ్డిగా వ్యవహారంలోకి వచ్చింది. శమీవృక్షానికి జమ్మిచెట్టు అనే పేరు ఉండటం, కొంతమేర ఉండే స్థలాన్ని 'దొడ్డి'గా వ్యవహరించే ప్రాచీన పద్ధతి కారణంగా ఈ ప్రాంతానికి జమ్మిదొడ్డి అనే పేరు వచ్చిఉంటుందని పరిశోధకులు అంచనావేస్తున్నారు. ఇప్పటికీ జమ్మిదొడ్డి ఉన్న ప్రాంతాన్ని స్థానికులు పవిత్రప్రాంతంగా ఆరాధనాభావంతో చూస్తారు. దసరా ఉత్సవాల్లో ఇక్కడ కూడా పూజాకార్యక్రమాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. ముఖ్యంగా ఉత్సవాల చివరి రోజున చేసే శమీపూజను ఇక్కడ దేవస్థానం అధికారికంగా నిర్వహిస్తుంది. సంప్రదాయ పద్ధతిలో శమీవృక్షానికి పూజలు జరుగుతాయి.
విజయవాడకు ప్రత్యేకం....పోలీసు ఆచారం
విజయవాడలో జరిగే దసరా ఉత్సవాల్లో అత్యంత ప్రసిద్ధి పొందిన ఆచారాల్లో పోలీసుల ఆచారం ఒకటి. విజయవాడలో ఇంద్రకీలాద్రి ఉన్న పాతబస్తీ అధికారికంగా ఒకటవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. ఈ పోలీస్ స్టేషన్కు ఇంద్రకీలాద్రికి వందల సంవత్సరాలుగా అనుబంధం కొనసాగుతోంది. ఇక్కడి పోలీసులు దుర్గమ్మను తమ ఆడపడచుగా, స్టేపన్ ప్రాంతంలో ఉన్న రావిచెట్టు, అక్కడి ప్రాంతాన్ని అమ్మ పుట్టినిల్లుగా భావిస్తారు. అంతేకాదు... రావిచెట్టును అమ్మవారి స్వరూపంగా భావించి, ఆ చెట్టుకు పోలీసులే స్వయంగా నిత్యపూజ చేస్తారు.
ఇంద్రకీలాద్రిపై జరిగే దసరా ఉత్సవాల్లో ఈ పోలీస్ స్టేషన్ అధికారులు అమ్మకు పుట్టింటివారి పాత్ర పోషిస్తారు. కొండమీద దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యే ముందురోజే పోలీస్ స్టేషన్లో ఉత్సవాలు మొదలవుతాయి. ఇక్కడి రావిచెట్టు ప్రాంతాన్ని సర్వాంగసుందరంగా అలంకరించి, అమ్మకు పూజలు చేస్తారు. ఇక్కడ ఉన్న అమ్మవారి మూర్తిని కొండ మీదకు తీసుకువెళ్తారు. తమ ఆడపడచుకు పసుపు కుంకుమలు, పట్టుచీర, సారె తీసుకువస్తారు. వీరు తీసుకువచ్చిన పట్టుచీర అలంకరించిన తర్వాతనే కొండపై ఉత్సవాలు మొదలవుతాయి.
ఉత్సవాల్లో అమ్మకు కట్టే తొలి పట్టుచీర పోలీసులు ఇచ్చిందే కావటం విశేషం. ఎంతటి గొప్పవారు ఇచ్చిన చీరనైనా, పోలీసులు ఇచ్చిన చీరను అమ్మవారికి అలంకరించిన తర్వాతనే అలంకరిస్తారు. ఉత్సవాల్లో జరిగే రథోత్సవంలో కూడా పోలీసుల పాత్రే ఎక్కువగా ఉంటుంది. అమ్మవారి రథాన్ని స్థానిక పోలీఉసు అధికారులే స్వయంగా లాగుతారు. ఉత్సవమూర్తులను కూడా కొండ మీద నుంచి పోలీసు వారే కిందకు తీసుకువస్తారు. తరతరాలుగా ఇందులో ఎటువంటి మార్పూ లేదు.
దసరా చివరి రోజున కృష్ణానదిలో నిర్వహించే తెప్పోత్సవంలో పోలీసు అధికారులే ముఖ్యపాత్ర పోషిస్తారు. ఊరేగింపు అనంతరం ఉత్సవమూర్తులను రావిచెట్టు ప్రాంతానికి తీసుకువస్తారు. అక్కడ అమ్మవారు కొంత సేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత, తిరిగి కొండమీదకు తీసుకువెళ్తారు. ఇలా, పోలీసు అధికారులే పుట్టింటి పాత్ర పోషించి, అమ్మవారి ఉత్సవాలు నిర్వహించంటం మరెక్కడా కనిపించదు.
ఈ ఆచారం రావటానికి వెనుక చారిత్రక గాథ ఒకటి ఉంది. కొండవీటి రెడ్డి రాజుల కాలం నుంచి ఈ ఆచారం వచ్చినట్టు పరిశోధకులు అంచనావేస్తున్నారు. రెడ్డి రాజుల కాలంలో విజయవాడ ప్రాంతంలో పనిచేస్తున్న మంగయ్య అనే సిపాయికి అమ్మవారు స్వప్నంలో కనిపించి, తాను దుర్గమ్మనని, తన విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయమని చెబుతుంది. స్వప్నంలో కనిపించిన ప్రకారం తవ్వకాలు జరిపిన మంగయ్యకు అమ్మవారి విగ్రహం లభిస్తుంంది. ఈ విగ్రహాన్ని ఇంటికి తీసుకువెళ్తాడు మంగయ్య. అక్కడ మంగయ్య కుమార్తెకు అమ్మవారి ఒంటి మీదకు వస్తుంది. ఆ కుమార్తె అమ్మలో ఐక్యం చెందుతుంది. అమ్మ మహిమ తెలుసుకున్న మంగయ్య అమ్మ చెప్పిన రీతిలో విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తాడు. ఇలా, మంగయ్య నుంచి అమ్మ ఆరాధన ఆచారంగా వస్తోంది.
కాలక్రమంలో సిపాయిలు రక్షకభటులుగా (పోలీసులుగా) మారినా, ఈ ఆచారం మాత్రం మారలేదు. పుట్టింటివారిగా సారె ఇవ్వటం నుంచి రథోత్సవం వరకు పోలీసులే ప్రధానపాత్ర పోషిస్తారు. కులమతాలతో సంబంధం లేకుండా ఈ స్టేషన్లో పనిచేసే అధికారి ఎవరైనా సరే అమ్మకు స్వయంగా సారె సమర్పిస్తారు. ఈ ఆచారాన్ని పోలీసుల నుంచి తప్పించాలని కొందరు ప్రయత్నిస్తే, వారికి ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయని కూడా ఇక్కడి వారు చెబుతారు.
కానిస్టేబుల్ నుంచి కమీషనర్ వరకు స్థాయీభేదాలు మరచి దసరా ఉత్సవాల్లో ఆనందంగా పాల్గొనటం దేశంలో మరెక్కడా కనిపించని అరుదైన ఆచారం. ఇలా, ఎన్నో మరెన్నో ప్రత్యేకతలతో విజయవాడ దసరా ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతూ, భక్తకోటిని అలరిస్తున్నాయి.
======================================
1 comment:
Informative article.
Post a Comment