గణపతి తత్త్వం
వినాయకుడు అనే పేరు పలకగానే ఏదో తెలియని శక్తి మనల్ని ఆవహిస్తుంది. అంతులేని ఆనందం కలుగుతుంది. పసి బిడ్డల నుంచి పండు ముసలి వారి వరకు గణపతి లేదా వినాయకుడు అనగానే ఓ చైతన్యం తమని ఆవహించినట్లుగా భావిస్తారు. గణపతి తనకు మాత్రమే చెందిన దేవుడు. తన గోడు వింటాడు. తనకు ఏ కష్టం రానివ్వడని ప్రతి భక్తుడూ భావిస్తాడు. భక్తుల మనసుల్లో ఇంతగా సుప్రతిష్ఠమైన గణపతి ఆరాధనలో అనంతమైన ఆధ్యాత్మిక భావాలు నిక్షిప్తమై ఉన్నాయి.
ముద్గలపురాణంలో వినాయకచవితి పూజా నియమాల గురించి విస్తారంగా వర్ణితమై ఉంది. కణ్వమహర్షి భరతుడికి గణపతి తత్త్వాన్ని, భాద్రపద శుక్ల చవితి వ్రత మహిమ గురించి వివరించినట్లు అందులో ఉంది. ప్రధానంగా మట్టిగణపతి ఎందుకు పూజించాలనే విషయాన్ని ముద్గలపురాణం స్పష్టంగా చెబుతుంది.
మట్టి గణపతే ఎందుకు?
ఆకాశం నుండి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు ఏర్పడ్డాయి. నీటి నుంచి భూమి ఏర్పడింది. భూమి జడపదార్థం. నీరు ప్రాణాధార శక్తి. ఈ రెండు పదార్థాలు కలవటం వల్ల - అంటే జడపదార్థమైన భూమి చైతన్యం కలిగిన నీళ్ళతో చేరినప్పుడు ప్రాణశక్తి కలుగుతుంది. తద్వారా ఆహారపదార్థాలు, ఓషధులను మనకు అందిస్తుంది. ఈవిధంగా ప్రాణాధార, జడశక్తుల కలయికతో సృష్టిసాగుతోందనటానికి సంకేతంగా గణపతి విగ్రహాన్ని మట్టి, నీరు కలిపి పూజించేవిధానం ఏర్పడింది.
మట్టిగణపతిని పూజించటంలో యోగశాస్త్ర రహస్యాలు కూడా ఉన్నాయి. మానవశరీరంలో ఉండే షట్చక్రాల్లో మొదటిది మూలాధార చక్రం. ఇది వెన్నుపూస ప్రారంభంలో ఉంటుంది. యోగశాస్త్రం ప్రకారం మూలాధార చక్రానికి గణపతి అధిష్ఠాన దేవత. మూలాధారం పృధ్వీతత్త్వం కలిగిఉంటుంది. పృధివి అంటే భూమి. కాబట్టి, భూమికి సంకేతంగా మట్టితో గణపతిని చేసి, మూలాధారానికి అధిదేవత అయిన గణపతిని అర్చించాలి. దీనివల్ల గణపతి అనుగ్రహం సత్వరమే కలుగుతుంది.
పంచభూతాలకు ప్రతీక
భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాల్లోని ప్రతి భూతంలోనూ, దాని తత్త్వం 1/2 వంతు, మిగిలిన నాలుగు భూతాల తత్వాలు ఒక్కొక్కటి 1/8 వంతుగా ఉంటాయి. ఉదాహరణకు భూమి- అందులో 1/2 భూతత్త్వం 1/2 భాగం అయితే, 1/8 భాగం జలం, 1/8 భాగం అగ్ని, 1/8 భాగం వాయువు, 1/8 భాగం ఆకాశం ఉంటాయి. దీన్నే 'పంచీకరణం' అంటారు.
ఒక్కో తత్త్వానికి ఒక్కో అధిష్ఠానదేవత ఉంటారు. భూతత్త్వానికి అధిష్ఠాన దేవత గణపతి, ఆకాశతత్త్వానికి ఈశ్వరుడు (శివుడు), జలతత్త్వానికి నారాయణుడు, అగ్నితత్త్వానికి అంబిక, వాయుతత్త్వానికి ప్రజాపతి (బ్రహ్మ) అధిదేవతలు. మనం పూజించే మట్టి విగ్రహంలో గణపతి తత్త్వం 1/2 భాగం ఉండగా, మిగిలిన దేవతల తత్త్వాలు 1/2 భాగం ఉంటాయి. 'ఆకాశాత్ పతతితం తోయం యథా గచ్ఛతి సాగరం / సర్వదేవ నమస్కార : శ్రీకేశవం ప్రతిగచ్ఛతి' అన్నట్లు ఎన్నో రూపాల్లో, ఎన్నో విధాలుగా కనిపించినా పరమాత్మ ఒక్కడే అనే సందేశం మట్టి గణపతి ఆరాధనలో వ్యక్తమవుతుంది. మనం మట్టితో చేసే గణపతి విగ్రహం పంచమహాభూతాల సమాహారం. ఆ మట్టి ప్రతిమను పూజించటం ద్వారా పంచభూతాలను, వాటి అధిష్ఠానదేవతలను పూజిస్తున్నాం. ఇది ఇతర పదార్ధాల చేత చేయబడిన గణపతి మూర్తులను ఆరాధించడం వలన కలగదు. ఏ తత్త్వాలతో ఒక వస్తువు ఏర్పడుతుందో, తన జీవితకాలం పూర్తయిన తర్వాత ఆ తత్త్వాలలోనే ఆ వస్తువు లయం అవుతుంది. ఇది సష్టి ధర్మం. వినాయక విగ్రహాన్ని నీళ్ళలో కలపడం వల్ల, ఆ విగ్రహంలో ఉన్న పంచతత్త్వాలు క్రమంగా వాటిల్లో లీనమవుతాయి.
మంత్ర, యోగ గణపతి
యోగశాస్త్రంలో వినాయకుణ్ణి మూలాధారచక్ర అధిష్ఠాన దేవతగా భావించటం జరుగుతుంది. మూలాధారంలో సుషుమ్న నాడి మూడుచుట్టలు చుట్టుకొని, పైన పడగ కప్పుకొని ఉన్న పాములాగ ఉంటుంది. సాధకుడు యోగాభ్యాసంతో సుషుమ్న నాడిని మేల్కొలపాలి. దీంతో మిగిలిన ఐదు చక్రాలు కూడా ఉత్తేజితం అవుతాయి. చివరగా, హంస రూపంలో మనిషి శరీరంలో సంచారం చేసే ప్రాణవాయువు సహస్రార కమలాన్ని చేరుకుంటుంది. కపాలమోక్షం ద్వారా అక్కడి నుంచి ఆత్మ పరమాత్మలో లీనమవుతుంది. ఇంతటి యోగప్రక్రియ జరగటానికి మూలాధారం - 'మూలాధారానికి ఆధిష్ఠాన దేవతగా ఉన్న గణపతి'.
సుషుమ్న నాడిని అనుసరించి ఇడ, పింగళ అనే నాడులు ఉంటాయి. వీటిలో 'ఇడ' జ్ఞానానికి (బుద్ధి) సంకేతం కాగా, 'పింగళ' సిద్ధికి సంకేతం. సుషుమ్మ ఎల్లప్పుడూ ఇడ, పింగళతో కలిసే ఉంటుంది. అంటే, మూలాధార స్వరూపమైన గణపతి - సిద్ధి, బుద్ధిలతో కలిసి ఉంటాడని భావం. గణపతికి సిద్ధి, బుద్ధి భార్యలు అనటంలో అంతరార్థం కూడా ఇదే.
మనలో ఉన్న పాపాలు తొలగితే మంచి బుద్ధి కలుగుతుంది. ఎప్పుడైతే మంచి బుద్ధి కలుగుతుందో అప్పుడు లౌకికమైన విషయాల నుంచి మనసు దూరమై, శాశ్వతమైన ముక్తిస్థానాన్ని కోరుకుంటుంది. గణపతి ఆరాధన ద్వారా మంచి బుద్ధి కలిగి, మోక్షం వైపు మనిషి సాధన జరుగుతుంది. ఇలా, జరిగే సాధనకు గణపతి అనుగ్రహం తోడైతే, విషయవాసనల మీద వైరాగ్యం కలుగుతుంది. అంతిమంగా మోక్షం సిద్ధిస్తుంది. ఇదే, గణపతి ఉపాసనలోని అంతరార్థం. గణపతి తత్త్వం.
ఓంకార స్వరూపుడు గణపతి
బలం, జ్ఞానం, ఐశ్వర్యం, ఆనందం- ఈ నాలుగింటి పరిపూర్ణ, దివ్యతత్వమే గణపతి స్వరూపం. 'బలవంతుల్లో అధికుడు, బలానికి అధిదేవత హేరంబుడు' అని పార్వతికి శివుడు బోధించినట్లు హేరంబోపనిషత్తు వర్ణిస్తోంది. బలానికి ఏనుగు ప్రతీక అని చెప్పడం శాస్త్రాల్లో సర్వ సాధారణం. నాగాయుత బలుడు (పదివేల ఏనుగుల బలం కలవాడు), మహా బలశాలి అని వర్ణించడం పురాణాల్లో కనిపిస్తుంది. భీముడికి ఈ బిరుదు ఉంది. గజవదనుడ్కెన గణపతి బలానికి సంకేతంగా స్వరూపం ధరించాడు.
ఇంకొక కోణంలో, గజం ఐశ్వర్యానికి సూచన. గజలక్ష్మి రూపానికి ఇరువ్కెపులా ఏనుగులు ఉన్నట్లు ఆగమాలు వర్ణిస్తున్నాయి. గణపతిని సంపదలకు దేవతగా, ప్రదాతగా సంభావిస్తారు. లక్ష్మీ గణపతి అనే ఉపాసనలో ఈ తత్వాన్నే చెబుతారు. శివపార్వతుల తనయుడిగానే కాకుండా, శివశక్తుల ఏకరూపమైన పరబ్రహ్మగా గణపతిని ఆరాధించే ఉపాసనా సంప్రదాయాలు ఎన్నో ఉన్నాయి.
తెలివికి దేవుడిగా గణపతిని ఆరాధిస్తారు. 'కోరిన విద్యలకెల్ల ఒజ్జ (గురువు)యై' అని స్వామిని కొలుచుకోవడం పరిపాటి. అందుకే విద్యార్థులతో గణపతిని ఆరాధింపజేసే సత్సంప్రదాయం మనకు ఉంది. ఓంకారమే గజవదనంగా, 'అ'కారం నుంచి 'క్ష'కారం వరకు ఉన్న అక్షరాలను కంఠం మొదలు చరణందాకా వివిధ అంగాలుగా భావించి మహర్షులు 'అక్షర గణపతి'ని ఆవిష్కరించారు.
గణం అంటే గుంపు. సమూహాన్ని నడిపే పాలకుడు గణపతి. నాయకత్వ లక్షణాలకూ ఆయనే అధినాథుడు. శిక్షణనిచ్చి బుద్ధిని దిద్దే ప్రభువు 'వినాయకుడు'. కోరినవి సిద్ధింపజేయడం వల్ల 'వరసిద్ధి వినాయకుడు' అనే పేరు పొందాడు. దుఃఖం, అజ్ఞానం, దారిద్య్రం వంటి బాధలు ప్రగతికి, పరమార్థానికి అడ్డంకులు. వాటినే 'విఘ్నాలు' అంటారు. అలాంటి విఘ్నాలను పోగొట్టి విజయానందాలను ప్రసాదించే దైవం- విఘ్నేశ్వరుడు.
అ, ఉ, మ- అనే మూడు అక్షరాలతో త్రిగుణాలు సష్టి, స్థితి, లయ అనే క్రియలను జాగత, స్వప్న, సుషుప్తి అనే అవస్థలను తెలియజేస్తున్నాయి. ఈ మూడింటికీ పైన ఉండే అత్యంత సూక్ష్మతత్త్వం పరబ్రహ్మ! జగమంతటా వ్యాపించిన ఆయన జగత్తుకు అతీతుడు. ఈ తత్త్వమే గణపతి వదనంలో గోచరిస్తుంది. అదే సంపూర్ణ 'ఓం'కార భావం.
ప్రపంచంలో అనుభవించే జాగత, స్వప్న, సుషుప్తి అవస్థలు- మూడు. నిర్గుణమైన సమాధి స్థితి నాలుగోది. దాన్ని 'తురీయం' అని ఉపనిషత్తు చెబుతోంది. మొదటి మూడూ- సగుణ ప్రపంచం. ఇదే గణేశుని కంఠం నుంచి పాదం వరకు ఉన్న స్వరూపం. గజవదనం తురీయ తత్త్వం. 'జగన్మయం' శరీరం, 'చిన్మయం' గజవదనం. జగన్మయ చిన్మయాలు రెండూ పరమాత్మే అన్న భావమే గజాననుడి స్వరూపం బోధిస్తున్న తత్వం. జగతిలోని మూడు గుణాలు, జగతికి అతీతమైన తురీయం- ఈ 'నాలుగు' చతుర్థీ తిథిలోని భావం. ప్రపంచాన్ని పరమాత్మమయంగా చూస్తూ లోకానికి, లోకేశునికి ఉన్న ఐక్య తత్త్వాన్ని అతీతత్త్వాన్ని గ్రహించే ప్రయత్నమే గొప్ప ఆధ్యాత్మిక సాధన. 'ఓం'కార స్వరూపుడైన గణపతి ఆరాధనలోని అంతరార్థం ఇది.
======================================
రచన:
డాక్టర్ కప్పగంతు రామకృష్ణ, ఆంధ్రోపన్యాసకులు, ఎస్.ఆర్.ఎస్.వి.కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, గాంధీనగర్, విజయవాడ-3. కృష్ణాజిల్లా.
సెల్ : 90320 44 115 / 8897 547 548
No comments:
Post a Comment