శివుడికి ఏయే పూలతో పూజలు చెయ్యాలి?
శివుడికి ఇష్టమైన పువ్వులేవి?
శివపూజకు చిగురించిన...
శివా! అని ఆర్తిగా పిలిస్తే చాలు... కైలాసం దిగి వచ్చే కారుణ్యమూర్తి, హరోం హర! అంటూ కడివెడు గంగమ్మను శిరస్సున అభిషేకం చేస్తే చాలు... కోరిన వరాలనిచ్చే అభయప్రదాత, ఎంగిలి మాంసాన్ని నివేదన చేసినా పరమప్రీతితో స్వీకరించి తిన్నడికి కైవల్యాన్నిచ్చిన బోళాశంకరుడు... పరమేశ్వరుడు ఒక్కడే. అందుకే...
శివుని శిరమున కాసిన్ని నీళ్ళుజల్లి
పత్తిరిసుమంత నెవ్వాడు పారవైచు
కామధేను వతడింట గాడిపసర
మల్ల సురశాఖి వానింట మల్లెచెట్టు
అంటూ ఎంతోమంది కవులు కాలకంఠుని వేనోళ్ళా కొనియాడారు. నిర్హేతుకమైన కృపను వర్షించటంలో పరమేశ్వరుడికి సాటి రాగల దైవం పురాణేతిహాసాల్లో మరెవ్వరూ కనిపించరు. ఇంతటి దయామయుడైన శివునికి అభిషేకంతో పాటు ఎలాంటి పుష్పాలతో పూజచేయాలి? ఏయే పుష్పాలతో పూజిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? అనే ప్రశ్నలకు శాస్త్రగ్రంథాల్లో అనేక ప్రమాణాలు ఉన్నాయి. శివధర్మ సంగ్రహం, లింగపురాణం, కార్తికమాహాత్మ్యం, శివరహస్య ఖండం తదితర గ్రంథాలు కూడా అనేక పుష్పార్చన ఫలితాలు, పుష్పార్చన చెయ్యటానికి పాటించవలసిన నియమాలు చెబుతున్నాయి. ఆ విశేషాలేమిటంటే...
శివపూజకు అరణ్యంలో పూచిన పువ్వులకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. గన్నేరు, పొగడ, జిల్లేడు, ఉమ్మెత్త, కలిగొట్టు, పెద్దములక, తెల్లదింటెన, కట్లతీగ పువ్వులు, అశోకపువ్వు, మందారం, విష్ణుక్రాంత, జమ్మి, గులాబి, నెమ్మిపూలు, ఉత్తరేణి, తామర, జాజి, చెంగలువ, సంపెంగ, వట్టివేరు పూలు, నందివర్థనం, నాగకేసరం, పొన్న, పచ్చగోరింట, తుమ్మి, మేడి, జయంతి, మల్లె, మోదుగ, మారేడు దళాలు, కుసుమపూవు, కుంకుమపూవు, ఎర్రకలువలు, నీలిపూలు శివపూజకు ప్రశస్తమైనవి.
వాడిపోయిన పూలు, కీటకాల వల్ల పాడైన పూలు, ఇతరుల తోట నుంచి దొంగతనంగా తీసుకువచ్చిన పూలు శివార్చనకు అనర్హమైనవిగా శాస్త్రాలు చెబుతున్నాయి. ఏ రకం పుష్పాలతో అర్చించినప్పటికీ, శివునికి చేసే పుష్పార్చన వల్ల అశ్వమేథ యాగం చేసిన ఫలితం కలుగుతుంది. కనీసం ఎనిమిది రకాలు పుష్పాలతో శివార్చన చేసిన భక్తుడికి కైలాసవాసం ప్రాప్తిస్తుంది.
ఏయే మాసాల్లో... ఏయే పుష్పాలు
👉👉 చైత్రమాసంలో నృత్యగీతాలతో సేవిస్తూ, దర్భపూలతో పూజిస్తే సువర్ణలాభం కలుగుతుంది.
👉👉 వైశాఖమాసంలో నేతితో అభిషేకిస్తూ, తెల్లమందార పూలతో పూజ చేస్తే, అశ్వమేథయాగం చేసిన ఫలితం కలుగుతుంది.
👉👉 జ్యేష్ఠమాసంలో పెరుగుతో అభిషేకం చేసి, తామరపూలతో పూజచేస్తే పరమపదసోపానాన్ని చేరుకుంటారు.
👉👉 ఆషాఢ కృష్ణ చతుర్దశి రోజున గుగ్గిలంతో ధూపం వేసి, తొడిమలు కలిగిన పూలతో అర్చన చేస్తే బ్రహ్మలోక నివాస యోగ్యత కలుగుతుంది.
👉👉 శ్రావణమాసంలో ఒంటిపూట భోజనం చేసి, గన్నేరు పూలతో నియమాల ప్రకారం అర్చన చేసినవారికి వెయ్యి గోదానాలు చేసిన ఫలితం లభిస్తుంది.
👉👉 భాద్రపదమాసంలో ఉత్తరేణి పూలతో పూజించిన వారు హంసధ్వజంతో కూడిన విమానంలో పుణ్యపదానికి చేరుకుంటారు.
👉👉 ఆశ్వయుజమాసంలో జిల్లేడుపూలతో పూజించినవారు మయూర ధ్వజంతో కూడిన విమానంలో దివ్యపదాన్ని చేరుకుంటారు.
👉👉 కార్తికమాసంలో ఆవుపాలతో అభిషేకించి, జాజిపూలతో పూజించినవారు శివపదాన్ని దర్శించుకుంటారు.
👉👉 మార్గశిరమాసంలో పొగడపూలతో పూజించినవారు, ముల్లోకాలను దాటి తామున్నచోటికే తిరిగిరాగలిగిన సామర్థ్యాన్ని పొందుతారు.
👉👉 పుష్యమాసంలో ఉమ్మెత్తపూలతో పూజించినవారు పరమపదాన్ని పొందగలరు.
👉👉 మాఘమాసంలో బిల్వదళాలతో అర్చించినవారు సూర్యచంద్రులున్న విమానంలో పరమపదాన్ని చేరుకునే యోగ్యత పొందుతారు.
👉👉 ఫాల్గుణమాసంలో సుగంధజలంతో అభిషేకించి తుమ్మిపూలతో పూజించినవారికి ఇంద్రుని సింహాసనంలో అర్ధభాగం దక్కుతుంది.
ఏ పుష్పాలతో పూజిస్తే ఎలాంటి ఫలితం
శివుని రోజూ జిల్లేడు పువ్వులతో అర్చించేవారు బంగారాన్ని దానం చేసిననంత ఫలితాన్ని పొందుతారు. శివపూజకు సంబంధించినంత వరకు
👉👉 వేయి జిల్లేడు పువ్వుల కంటే ఒక గన్నేరు పువ్వు ఉత్తమం.
👉👉 వేయి గన్నేరు పూల కంటే ఒక మారేడు దళం ఉత్తమం.
👉👉 వేయి మారేడు దళాలకంటే ఒక తామరపువ్వు ఉత్తమం.
👉👉 వేయి తామరపువ్వుల కంటే ఒక పొగడపువ్వు ఉత్తమం.
👉👉 వేయి పొగడపువ్వుల కంటే ఒక ఉమ్మెత్తుపువ్వు ఉత్తమం.
👉👉 వేయి ఉమ్మెత్త పువ్వుల కంటే ఒక ములక పువ్వు ఉత్తమం.
👉👉 వేయి ములక పూవుల కంటే ఒక తుమ్మిపూవు ఉత్తమం.
👉👉 వేయి తుమ్మిపూవులకంటే ఒక ఉత్తరేణు పువ్వు ఉత్తమం.
👉👉 వేయి ఉత్తరేణు పువ్వుల కంటే ఒక దర్భపువ్వు ఉత్తమం.
👉👉 వేయి దర్భపూల కంటే ఒక జమ్మిపువ్వు శ్రేష్ఠం.
👉👉 వేయి జమ్మి పువ్వుల కంటే ఒక నల్లకలువ ఉత్తమం.
శివునికి 1000 కలువలతో కట్టిన మాలను సమర్పించినవారు కొన్ని వందల సంవత్సరాల పాటు కైలాసంలో నివసించే అపూర్వమైన వరాన్ని పొందుతారు. ఇతర పుష్పాలతో పూజించే భక్తులు కూడా ఆయా పుష్పాలకు సంబంధించిన ఫలితాలను పొందుతారు.
పరమశివునికి పొగడపూలంటే అమితమైన ఇష్టం. ఆ స్వామిని ప్రతిదినం ఒక పొగడపువ్వుతో అర్చించే భక్తుడు వేయిగోవులను దానం చేసిన ఫలితాన్ని పొందుతాడు. ఒక నెలపాటు పొగడపూలతో పూజించినవారు స్వర్గ సుఖాలను పొందుతారు. రెండునెలలపాటు పూజించిన వారు యజ్ఞం చేసినంత ఫలితాన్ని పొందుతారు. మూడు నెలల పాటు పొగడపూలతో అర్చించినవారికి బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. నాలుగు నెలలు పూజించినవారికి కార్య సిద్ధి కలుగుతుంది. ఐదు నెలలు పూజించినవారికి యోగసిద్ధి. ఆరు నెలలు పూజించినవారికి రుద్రలోక ప్రాప్తి కలుగుతుంది. పది సుగంధపుష్పాలతో (ఒకవేళ పరిమళం లేకపోయినవైనప్పటికీ) శివలింగాన్ని పూజిస్తే, శతసహస్ర మాలలతో పూజించిన అనంత పుణ్యఫలం లభిస్తుందని శివధర్మ సంగ్రహం చెబుతోంది.
శివునికి బిల్వ (మారేడు) పత్రాలంటే మహాఇష్టం.ఇది అందరికీ తెలిసిన విషయమే. వీటితో పాటు మరికొన్ని పత్రాలు కూడా పరమేశ్వర పూజకు తగినవి. ఆయనకు ఎంతో ప్రీతికరమైనవి. అవేమిటంటే... జమ్మి, గుంట గలగర, అశోక, తమాలము, చీకటి చెట్టు, ఉలిమిడి, కానుగు, నేల ఉసిరి, మాచి, నల్ల ఉమ్మెత్త, తామర, నీతికలువ, మెట్టకలువ, సంపెంగ, తుమ్మి, ఉత్తరేణి పత్రాలు. ఉమ్మెత్త, కడిమిపువ్వులను శివునికి రాత్రివేళ సమర్పించాలి. మిగిలిన పూలతో పగిటిపూట. మల్లెలతో రాత్రివేళ, జాజి పూలతో మూడవజామున, గన్నేరుతో అన్నివేళలా పూజించవచ్చు.
ఏ కోరికకు ఏయే పూలు
మన కోరికలను అనుసరించి పరమేశ్వరుని సంకల్పం చెప్పుకుని పూజ చేస్తే, ఆ కోరికలు వెంటనే సిద్ధిస్తాయని శాస్త్ర ప్రమాణం. అయితే, సద్గురువును ఆశ్రయించి, విధివిధానంగా, సమంత్రకంగా మాత్రమే ఈ విధానంలో అర్చనలు చేయాలి.
ధన లాభం కోసం - గన్నేరు పూలు
మోక్ష ప్రాప్తికి - ఉమ్మెత్త పూలు
సుఖశాంతుల కోసం - నల్ల కలువ పూలు
చక్రవర్తిత్వం కోసం - తెల్ల తామర పూలు
రాజ్యప్రాప్తి కోసం - ఎర్ర తామర పూలు, నాగకేసర పుష్పాలు
మంత్రసిద్ధి కోసం - గన్నేరు, అశోక, తెల్లజిల్లేడు పూలు
కోరుకున్న కన్యతో వివాహం - సన్నజాజి పూలు
సంతానప్రాప్తి కోసం - మొల్ల పూలు
ఆరోగ్యం కోసం - దర్భ పూలు
వశీకరణం కోసం - తుమ్మి పూలు
శత్రువిజయం కోసం - కడిమి పూలు
దారిద్య్ర వినాశనం కోసం - బిల్వ దళాలు
సుఖం కోసం - మరువక పత్రాలు
గోసంపద వృద్ధి కోసం - లొద్దుగ పూలు
ఆయుష్సు కోసం - మోదుగ, బూరుగ పూలు
పరమాద్భుతం... శివలింగపుష్పం
పరమేశ్వరుడి లీలావిలాసమైన అనంత సృష్టిలో మరొక విచిత్రం... పూర్తిగా శివలింగాన్ని పోలి ఉండే పుష్పం. దీన్నే నాగలింగ పుష్పం అని కూడా అంటారు. కొన్నిచోట్ల నాగమల్లి పుష్పాలని, మల్లికార్జున పుష్పాలని కూడా పిలుస్తారు. శివుని జటాజూట ఆకృతిలో, వెంట్రుకలు విప్పారి ఉన్నట్లు ఈ వృక్షం ఉంటుంది. శివలింగ పుష్పాలు ఇతర పుష్పాలకు భిన్నంగా కొమ్మలకు పూయకుండా వెంట్రుకలాంటి జడలకు పూస్తాయి. పుష్పం పైభాగంలో నాగుపాము పడగవిప్పి ఆచ్ఛాదనగా ఉన్నట్లు చక్కటి ఆకృతి ఉంటుంది. ఆ పడగ లోపల పుష్పం ఉంటుంది. ఈ పూలతో శివునికి పూజచేస్తే జన్మరాహిత్యం కలుగుతుంది. శివునితో పాటు ఇతర దేవతలకు కూడా ఈ పుష్పాలను అర్పించవచ్చు. అయితే శిరసు నుంచి భుజాల వరకు మాత్రమే పడేట్లు (ఉండేట్లు) ఈ పుష్పాలతో అర్చన చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోను పాదాల మీద శివలింగ పుష్పాలను ఉంచకూడదు. పార్వతీదేవికి మంగళసూత్రంలో ఈ పుష్పాన్ని అలంకరించాలి.
అష్టపుష్ప మానస పూజ
శివపురాణంలోని వాయవ్యఖండంలో అష్టపుష్ప మానసపూజ గురించి చక్కగా వర్ణితమై ఉంది.
అహింసా ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహః
సర్వభూతదయా పుష్పం క్షమా పుష్పం విశేషతః
శాంతి పుష్పం తపః పుష్పం ధ్యానపుష్పం తథైవచ
సత్యమష్టవిధం పుష్పం శివప్రీతికరం భవేత్ ||
అహింస, ఇంద్రియనిగ్రహం పాటించటం, అన్ని ప్రాణుల యందు దయ కలిగిఉండటం, క్షమాగుణాన్ని కలిగిఉండటం, శాంతి కాముకులై ఉండటం, తపస్సు చేయటం, నిరంతరం ధ్యానం చేయటం, సత్య వాక్పాలన గుణాన్ని కలిగిఉండటం - ఈ ఎనిమిది మనస్సుకు సంబంధించిన పుష్పాలు. ఇతర పుష్పాల మాదిరిగా ఇవి కంటికి కనిపించవు. ఇవి మనోపుష్పాలు. అంటే, ఈ ఎనిమిది గుణాలను కలిగి ఉండి (లేదా నిత్యం వీటిని ఆచరిస్తూ, కలలో కూడా వీటి నిర్వహణను మరచిపోకుండా ఉండాలి) పరమేశ్వరుని అర్చించినట్లయితే కలిగే ఫలితాన్ని మాటల్లో వర్ణించటం ఎవరికీ సాధ్యం కాదని మహర్షులు చెప్పారు.
ఇంతటి మహోన్నతమైన ఫలితాలను కలిగించే పరమేశ్వరారాధనతో మన జీవితాలను సార్థకం చేసుకుందాం. ఇందుకు పరమేశ్వరుడు అందరినీ అనుగ్రహించుగాక.
------------🔔🔔🔔🔔🔔🔔---------
రచన
డాక్టర్ కప్పగంతు రామకృష్ణ, ఆంధ్రోపన్యాసకులు,
ఎస్.ఆర్.ఎస్.వి.కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, గాంధీనగర్, విజయవాడ-3
సెల్ : 90320 44115 / 88975 47548