Tuesday, July 2, 2019

హనుమజ్జయంతి సందర్భంగా డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr Kappagantu Ramakrishna) ఈనాడు దినపత్రిక మకరందం పేజిలో రాసిన వ్యాసం

వినయ విధేయ హనుమ!
ఈ నెల 29న హనుమజ్జయంతి
రాముడిది ఒకటే మాట, ఒకటే బాణం... రామబంటు హనుమదీ ఇదే బాట. ఆయనకు రాముడొకడే దైవం... రామనామం ఒకటే మంత్రం... రామకార్యాలపై తరగని భక్తే అతని శక్తి... ఆ భక్తితోనే అంత సముద్రాన్ని అవలీలగా దాటాడు. ఆ శక్తితోనే అంత మంది రాక్షసుల్ని ఒంటిచేత్తో తుదముట్టించాడు. మహాకార్యాలన్నీ చిత్తంలో భక్తితోనే సాధ్యమవుతాయని నిరూపించిన  హనుమ జ్ఞానగుణ సాగరుడు...
హనుమ ఒక రోజున సీతమ్మ తల్లిని మసటన సిందూరం ధరించటానికి కారణం అడుగుతాడు. సిందూరం ధరించటం వల్ల తన భర్తకు సౌభాగ్యం కలుగుతుందని చెబుతుందామె. మరుక్షణం ఇప్పుడే వస్తానంటూ వెళ్లి, ఒళ్లంతా సిందూరం పూసుకుని వస్తాడు హనుమ. ఏమిటీ చోద్యం అంటుంది సీతమ్మ. పాపిట్లో కాస్తంత సిందూరం ధరిస్తేనే స్వామికి సౌభాగ్యం కలుగుతుందన్నావు కదమ్మా... నా స్వామికి అనుక్షణం, జీవితాంతం సౌభాగ్యం కలగాలి. అందుకే ఒళ్లంతా సిందూరం పూసుకున్నానంటాడు. హనుమ స్వామిభక్తి ముందు జానకీదేవి పతిభక్తి చిన్నబోయింది.
అణువణువూ ఆయనే...
హనుమకు ఏం తక్కువ?
సాక్షాత్తు రుద్రాంశసంభూతుడు, అనంత బలశాలి, అపార విజ్ఞానఖని, సుగ్రీవుడికి సచివుడు... కానీ తాను రామబంటునంటూ ప్రకటించుకున్నాడు.
దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః
హనుమాన్‌ శత్రుసైన్యానాం నిహన్తా మారుతాత్మజః
న రావణ సహస్రం మే యుద్ధేప్రతిబలం భవేత్‌
శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః
అంటూ కోసల దేశపు ప్రభువైన రాముడికి నేను దాసుడిని అని ఎలుగెత్తి చాటాడు. అంతేకాదు... నా గుండెల నిండా రామభక్తి ఉంది. నా అణువణువులో రామనామం నింపిన శక్తి ఉంది. ఇవి చాలు... వెయ్యిమంది రావణులు ఒక్కసారిగా వచ్చినా అందరినీ మట్టి కరిపిస్తానంటాడు హనుమ. రామభక్తి ఇచ్చిన ఆత్మబలం అది. ఎంచుకున్న దైవంపై శిలలాంటి దృఢమైన విశ్వాసం హనుమలో ఉంది. ఆ విశ్వాసమే, ఆ విధేయతే హనుమను చిరకీర్తిమంతుణ్ణి చేసింది. రాముడంటే హనుమ, హనుమ అంటే రాముడు అన్నంతగా తనకు, రాముడికి అభేదాన్ని సాధించిన భక్తశిఖామణి ఆంజనేయుడు. తన శరీరంలోని ప్రతి అణువులో రామ నామాన్ని నింపుకోవటమే కాదు... ప్రకృతిలోని ప్రతి అణువులోనూ తన స్వామిని దర్శించిన పుణ్యమూర్తి ఆయన. అందుకే వాల్మీకి మహర్షి హనుమను ‘రామాయణ మహామాలా రత్నం’ అని సంబోధించాడు. ఎప్పుడైతే రామచంద్రమూర్తిని తొలిగా దర్శించి, ఆయనతో మాట్లాడి, రామదాసుడిగా మారాడో ఆ క్షణం నుంచే హనుమకు రాముడితోడిదే లోకంగా మారింది. సీతాన్వేషణ కోసం బయల్దేరుతూ రాముడు విడిచిపెట్టిన బాణంలా లంకవైపునకు దూసుకుపోతాను అన్నాడు ఆంజనేయుడు. వాయుపుత్రుడు, అమేయ బలసంపన్నుడై ఉండి కూడా సీతమ్మను వెతికేందుకు వెళ్లే శక్తి నాది కాదు. రాముడిది అన్న మాటలు రాముడిపై, రామనామంపై హనుమకు ఉన్న చెక్కుచెదరని లక్ష్యశుద్ధిని ప్రకటిస్తాయి.
శిరసా నమామి...
నీవు తప్ప వేరొకరు లేరంటూ రాముడికి మనసా, వాచా, కర్మణా దాసోహమన్నాడు హనుమంతుడు. ఆ భక్తికి, శరణాగతికి భగవంతుడు ఎప్పుడూ బందీనే. తన వీరత్వంతో కాకుండా, తన వినయంతో రామబాణాన్నే శక్తిహీనం చేశాడు హనుమ. ఓ సందర్భంలో హనుమ ధ్యానంలో ఉండగా విశ్వామిత్రుడు వచ్చాడు. అక్కడున్న వారంతా మహర్షికి నమస్కారం చేశారు. కానీ ధ్యానంలో ఉండటం వల్ల హనుమ మహర్షిని గమనించలేదు. హనుమ తనపై తృణీకారభావం వహించాడంటూ విశ్వామిత్రుడు ఆగ్రహించి, తన శిష్యుడైన రాముడికి ఫిర్యాదుచేశాడు. అప్పటికీ అవేశం చల్లారక ఏకంగా హనుమకు మరణదండన విధించాలని ఆదేశించాడు. గురువు ఆజ్ఞను శిరసావహించిన రామచంద్రమూర్తి అయిష్టంగానే బాణప్రయోగం చేశాడు. తన విద్యనంతా ప్రయోగించి బాణవర్షం కురిపించాడు. ఆశ్చర్యం... ఒక్క బాణమూ హనుమను తాకలేదు. అన్ని వేల బాణాలూ మధ్యలోనే కిందపడిపోయాయి. ఈలోగా నారదుడితో పాటు చాలామంది అక్కడకు చేరుకున్నారు. ఇంతలో హనుమ ధ్యానం నుంచి లేచి, జరిగిన విషయం తెలుసుకుని, రాముడి కాళ్ల మీద పడి వేడుకున్నాడు. మహర్షి విషయంలో తాను కావాలని అపచారం  చెయ్యలేదని వివరించాడు. విశ్వామిత్రుడు కూడా చల్లబడి హనుమలోని రామభక్తికి ముగ్ధుడయ్యాడు. రాముడి మీద తనకున్నది అధికారం. అదే హనుమకు ఉన్నది మమకారమని తెలుసుకున్నాడు. హనుమ విధేయత రాముడినే నిలువరించే మహత్తరమైన శక్తి కలిగిందని గ్రహించాడు.అందుకనే రామభక్తికి హనుమంతుడు కీర్తిపతాకంగా నిలుస్తాడు.
- కప్పగంతు రామకృష్ణ

కూర్మజయంతి సందర్భంగా డాక్టర్ కప్పగంతు రామకృష్ణ (Dr Kappagantu Ramakrishna) ఈనాడు దినపత్రిక మకరందం పేజిలో రాసిన వ్యాసం

నీటిలోని తాబేలు నిగూఢ నిజాలు!
కూర్మావతారం ఏం చెబుతుందంటే... 

విష్ణువు కూర్మరూపంలో అవతరించిన తిథి జ్యేష్ఠ బహుళ ద్వాదశి. ఆ రోజును కూర్మజయంతిగా వ్యవహరిస్తారు.

ఓ వైపు హాలాహల జ్వాలలు...
మరోవైపు కొండంత భారం...
కానీ
ఎక్కడా తొణకలేదు...
ఇసుమంతైనా బెణకలేదు...
ఆ నిశ్చలత్వం,
ఆ నిశ్చయతత్త్వం,
ఆ త్యాగం నిరుపమానం...
అందుకే ఆ అవతారం మహోన్నతం...
పరమాత్మ శిష్టరక్షణ కోసం ఎత్తిన ఈ ద్వితీయ అవతారం అతి ప్రాచీనం, నిగూఢమైన భావాల సమాహారం.
తాబేటి రూపంలో భగవంతుడు బోధించిన అద్భుత సందేశాల పరంపర నిత్యస్మరణీయం...

శ్రీ మహావిష్ణువు అవతారాల్లో అన్నిటికన్నా భిన్నమైంది కూర్మావతారం. మిగిలినవన్నీ రాక్షస సంహారం కోసం ఉద్దేశించినవి. కానీ ఈ అవతారం లక్ష్యం వేరు. క్షీరసాగర మథన సమయంలో సముద్రంలోకి కుంగిపోతున్న మందర పర్వతాన్ని నిలబెట్టడానికి శ్రీమహావిష్ణువు కూర్మావతారాన్ని ధరించాడన్నది అందరికీ తెలిసిన పురాణం కథనం. ఇక్కడ ఎలాంటి పోరాటం లేదు. రక్తపాతం అసలు లేదు. కానీ మంచిని రక్షించేందుకు భారం మొత్తాన్ని తన భుజస్కందాలపై మోశాడు పరమాత్మ. భాగవతంలో, బ్రహ్మపురాణంలో కూర్మావతారానికి సంబంధించిన గాథలు విస్తారంగా ఉన్నాయి. కూర్మ - అనే పదానికి వ్యుత్పత్తి ప్రకారం ‘కం జలం ఊర్వతీతి హినస్తేతి కూర్మః’ - అంటే నీటిలోని క్రిములను సంహరించేది అని అర్థం ఉంది. కూర్మానికి నీటిలోని క్రిములను, మురికిని నశింపజేసే గుణం ఉంది. అందువల్ల దానికి ఆ పేరు వచ్చింది. లౌకిక అర్థంలో సాధారణ నీటిలో ఉన్న క్రిములను నశింపజేస్తే ...ఆధ్యాత్మిక కోణంలో భవసాగరంలో మునిగిన మనిషిలో ఉండే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే క్రిములను నశింపజేసే వాడు కూర్మనాథుడనే అర్థాన్ని చెప్పుకోవచ్చు.
కూర్మం స్థిరత్వానికి ప్రతీక. జలంలో నివసించే తాబేలు తాను కదలాలనుకున్నప్పుడు మాత్రమే కాళ్లను కదిలిస్తుంది. అలా లేనప్పుడు నీటిలో స్తంభించి ఉంటుంది. ఇంద్రియాలను పూర్తిగా అదుపులో ఉంచుకుని అవసరమైనప్పుడు మాత్రమే వాటిని ఉపయోగించాలనే స్థితప్రజ్ఞతకు ఇది నిదర్శనం. అవసరమైనప్పుడు బహిర్ముఖంగా ఉన్నా నిరంతరం అంతర్ముఖంగా ఉండే చిత్తవృత్తికి కూర్మమే ప్రతీక. అది తన దేహంతో జలమంతా క్రీడిస్తున్నట్లు.. మనిషి కూడా విశ్వశక్తిలో ఓలలాడమనే సందేశమూ ఇందులో ఉంది.  ఇలాంటి మహోన్నత భావాలకు సూచిక అయిన కూర్మం భగవత్స్వరూపమని భక్తులు విశ్వసిస్తారు. 


సృష్టికర్త ఆయనా? 
బ్రహ్మ సృష్టి చేయడానికి పూనుకున్నాడు.
దేనిని ముందుగా సృష్టించాలా అని ఆలోచించటం ప్రారంభించాడు.
ఈ దశలో అన్యాపదేశంగా తన శరీరాన్ని కదిలించాడు. వెంటనే ఆయన శరీరం నుంచి కొన్ని రుషి సంఘాలు పుట్టాయి. వారే అరుణులు, కేతులు, వాతరశనులు.
ఆయన గోళ్ల నుంచి వైఖానసులు, వెంట్రుకల నుంచి వాలఖిల్యులు జన్మించారు.
అప్పుడే బ్రహ్మ శరీరంలోని సారమంతా ఒక పెద్ద కూర్మంగా రూపాంతరం చెంది నీటిలో సంచరించడం మొదలుపెట్టింది. దానిని చూసిన బ్రహ్మ నువ్వు నా శరీర మాంస సారం నుంచి పుట్టావు కదా అని ప్రశ్నించాడు. అప్పుడా కూర్మం నేను నీ కంటే ముందు నుంచే ఈ జలంలో ఉన్నానని చెప్పింది.
బ్రహ్మకన్నా ముందు ఉన్నదేంటి? అయితే అది పరబ్రహ్మే. ఆ కూర్మమే పరమాత్మ అని గ్రహించాడు. అతనిని వేయి శిరస్సులు, కళ్లు, కాళ్లు ఉన్న మహా పురుషుడిగా గ్రహించాడు బ్రహ్మ.
నీవు నా కన్నా ముందు నుంచే ఉన్నవాడవు కాబట్టి కురుష్వ (సృష్టి చెయ్యి) అన్నాడు బ్రహ్మదేవుడు. అప్పుడు కూర్మనాథుడు సూర్యుడు, ఇంద్రుడు, అగ్ని తదితరాలను సృష్టించాడు.
ఈ విధంగా జగన్నిర్మాణమనే కర్మ చేయడం వల్ల ఆయనకు కూర్మ అనే పేరు వచ్చింది. 


ఆ పట్టుదల అద్భుతం... 
కూర్మావతారం మనిషికి మరో మహత్తరమైన సందేశాన్ని అందిస్తుంది. పట్టుదల, ఓర్పు, సహనం మనిషికి తప్పనిసరిగా ఉండాలని, అప్పుడే అతడి లక్ష్యం నెరవేరుతుందని ఈ అవతారం ద్వారా మహావిష్ణువు ఆచరణాత్మక సందేశం ఇచ్చాడు. మనం ఏమైనా గొప్ప కార్యాలు తలపెట్టినప్పుడు ఆ పని భారం మందర పర్వతం తీరులో చాలా బరువుగా మారుతుంది. ఒక్కోసారి వదిలేయాలని అనిపిస్తుంది. దీనికి తోడు కార్యసాధనలో మనకు కలిగే అవాంతరాలు మందర పర్వతానికి కట్టిన వాసుకి సర్పం విడిచే విషజ్వాలల్లాంటివి. అవి మన పరిస్థితుల్ని మరింతగా వేడెక్కిస్తాయి. ఇలా ఎన్ని సమస్యలు వచ్చినా పట్టువదలకుండా స్థిరంగా ఉంటేనే అమృతం పుట్టినట్లు మన కార్యం విజయవంతమై ఆశించిన లక్ష్యసాధన అనే అమృతం పుడుతుందని కూర్మం సందేశాన్నిస్తుంది. ఈ సందేశాన్ని అందిపుచ్చుకుంటే మానవ జీవితం అమృతమయం అవుతుందనటంలో సందేహం లేదు.

ఈ రెండూ...
శ్రీకూర్మం
శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మం కూర్మనాథ క్షేత్రం. స్థల పురాణాన్ని అనుసరించి శ్వేతమహీపతిని అనుగ్రహించటానికి స్వామి వెలిశాడని చెబుతారు. అలాగే, రోగి అస్తికలను ఇక్కడి శ్వేత పుష్కరిణిలో వేస్తే అందులో నీరు తాబేళ్లుగా మారాయని, అందుకనే అశుచి కలిగిన మనుషులు అక్కడి నీళ్లను తాకకూడదన్న నిబంధన ఉంది. ఈ దేవాలయాన్ని గురించి కాల వివరాలు అంత సమగ్రంగా లేవు. క్రీ.శ. రెండో శతాబ్దం నాటికే ఈ దేవాలయం ఉందని చరిత్రకారులు చెబుతారు. ఏడో శతాబ్దానికి దేవాలయ వైభవం ఉచ్ఛస్థితిలో ఉన్నట్లు తెలిపే శాసనాలు, ఆలయ మంటపంలోని స్తంభాలపై కనిపిస్తాయి. 11వ శతాబ్దంలో ఆ ఆలయాన్ని తూర్పు గంగరాజులు, ప్రాకారాన్ని మధ్వాచార్యులైన నరహరితీర్థులు నిర్మించారని చారిత్రక శాసనాలు వివరిస్తున్నాయి. స్వామికి  సింహళ దేశానికి చెందిన భాగళాదేవి అమూల్య ఆభరణాలు సమర్పించారని, చైతన్య ప్రభువు క్రీశ 1512లో ఆలయాన్ని సందర్శించారని చెబుతారు. పద్మపురాణం, పాంచరాత్రాగమసంహిత గ్రంథాలు ఆ క్షేత్ర మహిమను ప్రస్తావించాయి. చోళ చక్రవర్తి కాలంలో ఈ వైభవం తారస్థాయికి చేరినట్లుగా మరికొన్ని శాసనాలు ద్వారా తెలుస్తోంది. అనంగభీముడు నిర్మించిన ‘తిరుచుట్టుమంటపం’  స్తంభాలపై ఒరియా, తెలుగు, దేవనాగరి, ప్రాకృత భాషల్లో కనిపిస్తాయి. సింహాచలం కప్పస్తంభం మాదిరిగానే ఈ క్షేత్రంలో కూడా ఇచ్ఛాప్రాప్తి స్తంభం ఉంది. దీనికి కౌగిలించుకుంటే కోరికలు తీరుతాయని శాసనాలు తెలియజేస్తున్నాయి. 


కచ్ఛపేశ్వరస్వామి
శ్రీమహావిష్ణువుకు అత్యంత బాధ కలిగిన అవతారం కూర్మావతారం. తాబేలు రూపంలో మందర పర్వతాన్ని మోస్తున్నప్పుడు మొదట హాలాహలం పుట్టింది. ఆ విషం నుంచి ఉద్భవించిన జ్వాలలకు స్వామి శరీరం తపించిపోయింది. కానీ లోకసంరక్షణ కోసం స్వామి అమృతం పుట్టేవరకు అలాగే కదలకుండా ఉన్నాడు. ఆ ఘట్టం పూర్తయింది. కానీ, స్వామికి కలిగిన తాపం మాత్రం తగ్గలేదు. ఏం చేయాలో దిక్కుతోచలేదు. చివరకు పరమేశ్వరుడిని ఆశ్రయించాడు విష్ణుమూర్తి. అప్పుడు పరమేశ్వరుడు విష్ణువుతో ‘నేను కాంచీపురంలో ఏకాంబరేశ్వరుడిగా ఉన్నాను. నేను తూర్పుదిక్కును చూస్తుంటాను. నా ఆలయానికి దగ్గరగా పశ్చిమదిక్కును చూస్తూ నీవు నిలబడు’ అన్నాడు. సరిగ్గా ఆ ప్రాంతంలో నిలబడ్డాడు విష్ణువు. అప్పుడు పరమేశ్వరుడి జటాజూటంలో ఉండే చంద్రవంక చల్లదనం తగిలి శ్రీమహావిష్ణువు శరీరం చల్లబడింది. ఇక్కడ శివుడికి చంద్రకంఠేశ్వరుడు అని పేరు. శ్రీ మహావిష్ణువుకు కచ్ఛపేశ్వరస్వామి అనిపేరు.  తిరుమంగై ఆళ్వార్లు అక్కడ శ్రీమహావిష్ణుస్వరూపం మీద స్తోత్రం చేశారు.
- కప్పగంతు రామకృష్ణ

జగద్గురు ఆదిశంకరాచార్య వైభవం

గోవింద గోవింద అని కొలువరే!
జగద్గురు ఆదిశంకరాచార్య వైభవం
తాను కన్నవాళ్లు, తనను కన్నవాళ్లు కళ్లముందే రాలిపోతున్నా తాను మాత్రం శాశ్వతం అనుకోవడం ఓ భ్రాంతి...తాను కట్టుకున్న కలల కోటలకు ఏదో ఒకరోజు వీడ్కోలు  చెప్పాల్సి ఉంటుందన్నది సత్యం... కానీ సంసార యాత్ర  ఆ విషయం తెలుసుకోనివ్వదు. వ్యామోహాలు సత్యంవైపు చూడనివ్వవు.
మరి మనిషికి తరుణోపాయం లేదా...
ఉంది...
అది భగవదనుగ్రహం...
దాన్ని పొందేదెలా...
అది చాలా తేలికైన పని...
తెలుసుకో...
ఏది పాపం... ఏది పావనం?
ఏది నిత్యం... ఏది అనిత్యం?
ఏది శాశ్వతం... ఏది తాత్కాలికం?
స్మరించు...
నిత్యమైన నామాన్ని... పరమ సత్యాన్ని...
పరమోన్నత గమ్యాన్ని...
అదే తారకమంత్రం...
అదే పరమానందానికి దిక్సూచి...
భజగోవిందం సూత్రీకరణ ఇదే...
జగద్గురు శంకరభగవత్పాదులు ప్రవచించింది శుష్క వేదాంతాన్ని కాదు... సిసలైన జ్ఞానాన్ని. సకలవేద సారాన్ని...
బ్రహ్మవర్చస్సుతో వెలుగుతున్న ఓ యువ సన్యాసి గంగానదిలో స్నానం ముగించుకుని, కాశీలోని ఓ వీధిలో నడిచి వెళుతున్నాడు. ఓ ఇంటి ముందుకు వచ్చేసరికి ఆ అరుగుమీద కూర్చున్న వృద్ధుడైన ఓ పండితుడు ‘డృ ఞ్‌ కరణే’ అంటూ వ్యాకరణ సూత్రాన్ని పదే పదే వల్లెవేస్తున్న దృశ్యం కనిపించింది. వడివడిగా అడుగులు వేసుకుంటూ వెళ్తున్న ఆ సన్యాసి ఓ క్షణం అక్కడే ఆగాడు. ఆ పండితుడిని చూశాడు. వయసు మీద పడుతున్నఛాయ స్పష్టంగా కనిపిస్తోంది. సన్యాసి వచ్చి తన ఇంటి ముందు ఆగిన విషయం కూడా అతడు గమనించలేదు. తనకు ప్రపంచమే పట్టనట్లు ఇంకా వ్యాకరణ సూత్రాన్ని వల్లెవేస్తూనే ఉన్నాడు. చిరునవ్వు ఆ సన్యాసి పెదవులపై తొణికిసలాడింది. క్షణం కాలం కళ్లుమూసుకున్నాడు. బహుశా తన దైవాన్ని తలచుకున్నాడేమో? పండితుడి దగ్గరకు వచ్చి
భజగోవిందం భజగోవిందం
గోవింద భజ మూఢమతే ।
సంప్రాప్తే సన్నిహితే కాలే
నహి నహి రక్షతి డృ ఞ్‌ కరణే ।।
‘ఓ మూఢమతీ! వ్యాకరణ సూత్రాలను పక్కకు పెట్టు. జీవితపు చివరిదశకు చేరుకున్నావు. గోవిందుడి నామస్మరణ ప్రారంభించు. మరణకాలంలో నిన్ను ఆదుకుని, ఉత్తమలోకాలు కల్పించే తారకమంత్రం అదే’... అంటూ జీవితానికి అసలైన అర్థాన్ని, పరమార్థాన్ని బోధించాడా సన్యాసి. అలా ఆశువుగా శ్లోకాలు చెబుతూ, ఆ శ్లోకాల్లోనే మొత్తం జీవన సారాంశాన్ని నిక్షిప్తం చేసి, మానవాళికి మహోన్నత దశ, దిశ నిర్దేశించాడు. అద్వైతమార్గ ప్రతిష్ఠాపకుడిగా, జగద్గురువుగా అవతరించిన ఆది శంకరాచార్యులే ఆ సన్యాసి. లౌకిక జీవితమంతా నాటకమే... చేయాల్సింది నారాయణ స్మరణ మాత్రమే యావత్ప్రపంచానికి కర్తవ్యబోధ చేసిన ఆ స్తోత్రమే ‘భజగోవింద స్తోత్రం’.
సకల చదువుల సారం...
ఆది శంకరులు మూఢమతీ! అని సంబోధించింది కేవలం ఓ పండితుడిని మాత్రమే కాదు. అతడు మొత్తం సమాజానికి ప్రతీక. పుస్తక జ్ఞానం మాత్రమే చదువు అని భావించి దానికి మాత్రమే పరిమితమవుతున్న మనిషికి చేసిన జ్ఞానబోధ అది. విజ్ఞానం అంటే కేవలం అక్షరజ్ఞానం మాత్రమే కాదు. కొన్ని గ్రంథాల్ని ఆమూలాగ్రం చదవటం అంతకన్నా కాదు. కేవలం అక్షరాల్ని చదివితే సరిపోదు... వాటి మాటున దాగున్న అనంతమైన దైవత్వాన్ని దర్శించటమే చదువులోని అంతరార్థం అనే సందేశాన్ని భజగోవింద స్తోత్ర ఆవిర్భావ ఘట్టం మనకిస్తుంది.
పుట్టడం, పెరగడం, వివాహం, సంపాదన, నిద్ర, శారీరక సుఖాలు.... ఇదేనా జీవితం. సృష్టిలో ఉన్న అన్ని జీవరాశుల్లో మనిషికి మాత్రమే మనస్సు ఉంది. కానీ, ఆ మనస్సు మోహం అనే వలలో చిక్కుకుపోతుంది. దీంతో సిసలైన జ్ఞానం దరిచేరడం లేదు. వివేకంతో ఆలోచించాలి. సత్యమైన, నిత్యమైన దానికోసం అన్వేషించాలి. దీనికి పరమేశ్వర ధ్యానం ఉపకరిస్తుంది. తన అస్తిత్వం ఏమిటో మనిషి తెలియజెప్పటమే భజగోవిందస్తోత్రం అంతరార్థం.
భజగోవింద స్తోత్రం వయసు మీద పడిన వృద్ధులు చదవాల్సిన స్తోత్రం కాదు.
క్షణికమైన విషయాల మోహంలో నిజమైన సత్యాన్ని గుర్తించకుండా ప్రవర్తించేవారికి శంకరులు చేసిన హెచ్చరికలే ఈ స్తోత్రంలోని శ్లోకాలు.
జీవిత సత్యాలు... జీవన సూత్రాలు...
ఆదిశంకరులు రాసిన ఇతర రచనలకు భిన్నంగా భజగోవింద స్తోత్రం సాగుతుంది. మిగిలినవాటిలో శంకరులు ఏదో ఒక దేవతను స్తుతి చేస్తారు. ఇందుకు భిన్నమైన ధోరణి ఇందులో కనిపిస్తుంది.
గురుచరణాంబు నిర్భర భక్తః
సంసారాదచిరాద్భవ ముక్తః ।
సేంద్రియ మానస నియమాదేవం
ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం ।।
ఈ స్తోత్రంలో మానవుడే మాధవుడు. తన హృదయంలో దాగున్న నారాయణుడిని దర్శించటమే మనిషి కర్తవ్యం కావాలి. అందుకోసమే మనిషి తనను తాను జాగృత పరచుకోవాలనే స్వీయ జాగృతీ చైతన్య మహోద్యమానికి ఆదిశంకరులు భజగోవింద స్తోత్రం ద్వారా శ్రీకారం చుట్టారు. అమ్మ లాలన కాకుండా నాన్న పాలన ధోరణి శంకరులు ఈ స్తోత్రంలో అవలంబించారు. సుతి మెత్తని హెచ్చరికల ద్వారా సమాజాన్ని జాగృత పరచే బాధ్యతను భుజాలకెత్తుకున్నారు.
యావద్విత్తోపార్జన సక్తః
తావన్నిజ పరివారో రక్తః
పశ్చాజ్జీవతి జర్జర దేహే
వార్తాం కోపి న పృచ్ఛతి గేహే ।।
ధనం ఉన్నంత వరకే బంధుమిత్రులు మన దగ్గరకు చేరతారు. ధనం లేని రోజున వాళ్లంతా దూరంగా జరుగుతారు. అంటే, మనం సంపాదించాల్సింది లౌకికమైన ధనం కాదు. మనల్ని మనల్నిగా ప్రేమించి, ఆదరించే మనుషుల్ని, మనసుల్ని సంపాదించాలి.
మా కురు ధన జన యౌవన గర్వం
హరతి నిమేషాత్కాలః స్సర్వం ।
మాయామయమిదం అఖిలంఖిత్వా
బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా ।।
శారీరక సౌందర్యం క్షణికమైంది.  కావలసింది అంతస్సౌందర్యం.ధనం, పరివారం, యవ్వనం... వీటన్నిటినీ చూసి గర్వించటం తప్పు. ఇవన్నీ మాయా కల్పితాలు. ఇవన్నీ ఏనాటికైనా నశించేవే. శాశ్వతమైన సౌందర్యం పరమాత్మది మాత్రమేనని గుర్తించాలి.
బాలస్తావత్‌ క్రీడాసక్తః
తరుణస్తావత్తరుణీసక్తః
వృద్ధస్తావచ్చింతాసక్తః
పరే బ్రహ్మణి కోపినసక్తః ।।
బాల్యదశ ఆటపాటల మీద ఆసక్తితో గడిచిపోతుంది. యవ్వనమంతా స్త్రీ వ్యామోహంతో... వార్ధక్యం సంసారం మీద ఆలోచనతో గడిచిపోతుంది. మనిషి తామరాకు మీద ఉన్న నీటిబొట్టు తీరులో సంసారంలో ఉన్నా బంధాల్లో చిక్కుకోకుండా, పరబ్రహ్మాన్ని ఉపాసించాలి.
కురుతే గంగా సాగరగమనం
వ్రతపరిపాలనమథవా దానం
జ్ఞానవిహీనః సర్వమత్యేన
ముక్తిం న భజతి జన్మశతేన ।।
గంగ వంటి ఎన్ని పుణ్యనదుల్లో స్నానం చేసినా, ఎన్నెన్నో నోములు, పూజలు చేసినా ఆత్మజ్ఞానం లేకపోతే అవన్నీ వృథా అవుతాయి. కేవలం గంగా స్నానమే ముక్తిని ఇచ్చేట్లయితే అందులో మునిగే జంతుజాలానికీ మోక్షం రావాలి. కానీ, అది సాధ్యం కాదు. ఎందుకంటే..  మనిషికి కావల్సింది జ్ఞానం, విచక్షణ.
సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వం
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః ।।
జ్ఞానులు, మహానుభావుల సాంగత్యం ఎప్పుడూ కోరుకోవాలి. ఇందువల్ల మనసులో ఉన్న కల్మషాలన్నీ తొలగిపోతాయి. ఫలితంగా బుద్ధి నిశ్చలస్థితికి చేరుకుంటుంది...పరమేశ్వరుడి మీద కేంద్రీకృతమవుతుంది. అంతిమంగా జీవన్ముక్తి కలుగుతుంది.
వాస్తవానికి భజగోవింద స్తోత్రంలో శంకరాచార్యులు ఆశువుగా చెప్పింది కేవలం 12 శ్లోకాలే. వాటితో ఉత్తేజం పొందిన శిష్యగణం గురువుగారి బాణీని అనుసరిస్తూ మరో 14 శ్లోకాలు చెప్పారు. శిష్యుల ప్రతిభకు, వారిలోని ఆర్ద్రతకు ముచ్చటపడిన శంకరులు మరో ఐదు శ్లోకాలు ఆశీఃపూర్వకంగా చెప్పారు. దీంతో మొత్తం 31 శ్లోకాలు అయ్యాయి. ఇదే భజగోవిందంగా విశ్వవిఖ్యాతి పొందింది.శంకరులు చెప్పిన 12 శ్లోకాలను ‘ద్వాదశ మôజరీక స్తోత్రం’ అంటారు. శిష్యులు చెప్పిన 14 శ్లోకాలను ‘చతుర్దశ మంజరీక స్తోత్రం’ అంటారు.
భక్తుడు భగవంతుడిని చేరుకునేందుకు ప్రహ్లాదుడు నవవిధ భక్తిమార్గాలను చెప్పాడు. వీటిలో శ్రవణం మొదటిది కాగా ఆత్మనివేదనం చివరిది. ఇతర పద్ధతుల్లో ఈ మార్గాల్లో ఏదో ఒక విధానాన్ని అనుసరించటానికి మాత్రమే వీలుంటుంది. కానీ, భజగోవిందస్తోత్రంద ద్వారా శ్రవణం, కీర్తనం, స్మరణం అనే మూడు మార్గాలను ఒకే సమయంలో సాధన చేసే అవకాశం ఉంది. ఆది శంకరుల వైదుష్యానికి ఇదొక మచ్చుతునక.
భజగోవింద స్తోత్రం వయసు మీద పడిన వృద్ధులు చదవాల్సిన స్తోత్రం కాదు.  క్షణికమైన విషయాల మోహంలో నిజమైన సత్యాన్ని గుర్తించకుండా ప్రవర్తించేవారికి శంకరులు చేసిన హెచ్చరికలే ఈ స్తోత్రంలోని శ్లోకాలు.
- కప్పగంతు రామకృష్ణ

పున్నమి కాంతుల కల్యాణం (ఒంటిమిట్టలో జరిగే శ్రీ సీతారామ కల్యాణం నేపథ్యంగా శ్రీకనకదుర్గ ప్రభ పత్రికలో రాసిన వ్యాసం)

  పున్నమి కాంతుల కల్యాణం                లోకంలో పెళ్ళి ముచ్చట అంటే సీతారాములదే. అందులోనూ ఒంటిమిట్ట ఆలయంలో జరిగే సీతారాముల కల్యాణం మరింత శ...